breaking news
Sakshi Guest Column
-
శాస్త్రీయతలేని విధానాలతోనే విపత్తులు
హిమాలయాలు ఒకదాని తర్వాత ఒకటిగా హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాయి. ఆకస్మిక వరదలు, హిమ పాతాలు, హిమానీనద సరస్సులకు గండి పడటంతో ముంచెత్తుతున్న వరదలు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, తీవ్రంగా భూమి కుంగిపోవడం వంటివి వాటి కోవలోకి వస్తాయి. కేదార్నాథ్, ధౌళిగంగ, జోషీమఠ్, సిక్కిం, ఇపుడు నేపాల్లోకి సరిహద్దులు దాటి వచ్చిన వరదలు అలాంటివే. అటువంటి ప్రతి ఉత్పాతంలోనూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అపారమైన విధ్వంసం కనుల ఎదుట నిలుస్తోంది. హిమాలయాలలో సంభవిస్తున్న విపత్తులను ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. శాస్త్రీయ పరిశోధనలు సాగించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే యంత్రాంగాలను తయారు చేసుకోవడం, ప్రజా చైతన్యం తీసుకు రావడం, సమాజాలను కూడా ఈ కృషిలో భాగస్వాములుగా చేయడం వంటివి చేపట్టక తప్పదు. నివేదికలు వెల్లడిస్తున్న వాస్తవాలువాతావరణ మార్పుపై ఏర్పడిన వివిధ ప్రభుత్వాల ప్యానెల్ అంతర్జాతీయ స్థాయిలో వివిధ నివేదికలను ప్రచురించింది. గ్లేసియర్లు, పర్వత ప్రాంతాలలోని జీవావరణ వ్యవస్థల గురించి వివిధ దేశాలు వాటి పరిశోధనల్లో కనుగొన్న అంశాలకు ఒక సమగ్ర రూపం ఇచ్చింది. మన దేశంలోనూ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిమోట్ సెన్సింగ్ ఇమేజరీని ఉపయోగించి (మొత్తం 28,000లలో) 7,500లకు పైగా గ్లేసియల్ సరస్సుల మ్యాప్ను రూపొందించింది. హై–రిస్క్ గ్లేసియల్ సరస్సులకు సంబంధించి అది వరద ముప్పుల మ్యాప్ను కూడా తయారు చేసింది. ఐసు గడ్డలు, బండరాళ్ళు కట్టలుగా ఉన్న సరస్సులు ఒక్కసారి తెగిపడితే రాగల వరదలు, వాటివల్ల దిగువ పరీవాహక ప్రాంతాల్లోనున్న జనావాసాలకు వాటిల్లగల నష్టాల గురించి కూడా అది తెలియజేసింది. కాఠ్మాండూకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటెగ్రే టెడ్ మౌంటైన్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) మొన్నీమధ్య అంటే 2026 మార్చిలో కూడా రెండు గణనీయమైన నివేదికలను ప్రచురించింది. వాటిలో ఒకటి హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో 1990 నుంచి 2020ల వరకు మారుతున్న గ్లేసియర్ల గతిశీలతలను వివరించింది. మరోటి 2026 నాటికి ఉన్న హిందూ కుష్ హిమాలయ గ్లేసి యర్ల స్థూల స్వరూప స్వభావాలను వెల్లడించింది. ఈ నివేదికలు వెల్లడిస్తున్న అంశాలు ఆందోళన రేపేవిగా ఉన్నాయి. మొదటి నివేదిక 55 వేలకు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ కుష్ ప్రాంతమంతటానున్న 63,761 గ్లేసియర్ల డేటాను ఆధారం చేసుకుని రూపొందింది. వాటిలో 5,700 క్యూబిక్ కిలోమీటర్ల మేర ఐసు నిల్వలున్నాయి. నలుచెరగులా ఉన్న ఈ గ్లేసి యర్లు 1990ల ఆరంభం నుంచి స్థిరంగా కరిగిపోతూ వస్తున్నా యని ఆ విశ్లేషణ తెలిపింది. మొత్తం గ్లేసియర్ ప్రాంతంలో 12 శాతం తరిగిపోయింది. అంచనా వేసిన హిమ నిల్వలలో 9 శాతం క్షీణత కనిపించింది. గ్లేసియర్లు అలా కుంచించుకుపోవడం 2010 నుంచి 2020 మధ్య కాలంలో మరీ కొట్టొచ్చినట్లు కనిపించింది. సింధు నదీ పరీవాహక ప్రాంతం 6 శాతం గ్లేసియర్ ప్రాంతాన్ని కోల్పోయింది. గంగా నది 21 శాతం, బ్రహ్మపుత్ర 16 శాతం తరుగుదలను నమోదు చేశాయి. హిమం గడ్డకట్టిన ప్రాంతాలు కుంచించుకు పోవడం వల్ల వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో నీటి లభ్యత తగ్గి పోతోంది. రెండవ నివేదిక 38 గ్లేసియర్ల సన్నిహిత పరిశీలనతో తయారైంది. హిమాలయాల్లో హిమం గడ్డకట్టిన భూభాగాల్లో కొన్ని పాతరూపును పూర్తిగా కోల్పోయే స్థితికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నా యని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘ఇది ఎక్కడో సుదూరంలో ఉన్న సమస్య కాదు. నేటి కాలంలో ఆవిష్కృతమవుతున్న సంక్షోభం. ప్రతి వేసవిలోను, వర్షాకాలంలోను కొత్త ఉపద్రవాలను చూస్తున్నాం. హిమాన్ని కోల్పోతున్న రేట్లు ఈ శతాబ్దంలో రెండింతలైన వాస్తవ మైనా కనీసం మన కళ్లు తెరిపించాలి’’ అని ఐసీఐఎంఓడీ డైరెక్టర్ జనరల్ పెమా గ్యాంషో అన్నారు. నేపాల్లో ఇటీవల చూసిన వరదలు గ్యాంషో హెచ్చరికలోని వాస్తవాన్ని ఎత్తి చూపాయి. ఇది గ్లేసియర్ గతిశీలతల సైన్స్, ఉపగ్రహాల విశ్లేషణ, 1974 నుంచి క్షేత్ర స్థాయిలో సేకరిస్తూ వస్తున్న డేటాను ఆధారం చేసుకుని చేసిన స్పష్టమైన హెచ్చరికగా భావించవచ్చు. రుణాలు ఎలా ఇస్తున్నారు?డేటాను విశ్లేషించడం ద్వారా, నిష్క్రియాపరత్వం వల్ల కలిగే ప్రమాదకర పర్యవసానాలను తెలుపడం ద్వారా సైంటిస్టులు తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ, విధాన నిర్ణేతల స్పందనే మంద కొడిగా ఉంది. అంతర్జాతీయంగా కూడా, వివిధ దేశాల ప్యానెళ్ళ నివేదికలపై స్పందన లోపభూయిష్టంగా ఉంది. ముఖ్యంగా, పుడమి తాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను తగ్గించు కోవాల్సిన అంశంపై వాటి కార్యాచరణ పేలవంగా ఉంది. దాని ప్రత్యక్ష ఫలితం హిమా లయాలపై పడుతోంది. ప్రాంతీయ స్థాయిలో హిమాలయ ప్రాంతంలోని దేశాల మధ్య సహకారం బొత్తిగా లేదనే చెప్పాలి. ప్రాంతాల మధ్య రాజకీయ సరిహద్దులను ప్రకృతి ఉత్పాతాలు, వాతావరణం గుర్తించవు కనుక ఈ ప్రాంతంలోని దేశాలు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుని తీరాలి. సింధు, గంగ, బ్రహ్మపుత్ర, మెకాంగ్ వంటి పెద్ద నదులన్నీ హిమాల యాలలోనే పుడుతున్నాయి. వివిధ దేశాలను దాటి ప్రవహిస్తు న్నాయి. కనుక, ఒక దేశంలో ఆ నదిలోకి కొండ చరియలు విరిగి పడితే, అది మరో దేశంలో వినాశకర వరదలకు కారణంగా పరిణ మించవచ్చు. లిహెండే ఖోలా నదిలో గత ఏడాది జూలైలో సంభవించిన విపత్తు అదే రసూవా, నువాకోట్ ప్రాంతంలోని కనీసం అర డజను జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులకు నష్టం కలిగించింది. ఇపుడు వార్తలకెక్కిన ప్రాంతం అప్పుడూ ఇంచుమించుగా ఇవే కారణాలపై వార్తలకెక్కింది. త్రిశూలి పరీవాహక ప్రాంతంలో దాదాపు 36 జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. బహుళ జాతీయ రుణ సంస్థలు కూడా ఆయా అంశాలు వేటినీ లెక్కలోకి తీసుకోకుండా రుణాలు ఇస్తూనే ఉన్నాయి. ఆనకట్టలు, నదులు, ప్రజానీకంపై అధ్యయనం చేసిన సౌత్ ఏషియా నెట్వర్క్ విశ్లేషణలో ఆ అంశాలు వెలుగు చూశాయి. భారతదేశంలో కూడా ప్రకృతి ఉత్పాతాలు, హిమ పాతాలు సంభవించే, శిథిల ప్రవాహాలుసాగే ప్రాంతాల్లో జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు చురుకుగా సాగుతున్నాయి. రెండూ సాగవు!హిమాలయాల్లో జీవావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు రాజకీయంగా కూడా సున్నితమైనవి. అవి భారత్, చైనా, నేపాల్ సరిహద్దుల గుండా వ్యాపించి ఉన్నాయి. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా మౌలిక వసతులను పెద్దయెత్తున అభివృద్ధి చేస్తున్నాయి. పైగా, సామూహిక యాత్రలను, వాణిజ్యపరమైన పర్వత ప్రాంత టూరిజాన్ని అవి ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నాయి. కానీ, పర్యావరణపరంగా పెళుసైన ప్రాంతాల్లో నిర్నిరోధ అభి వృద్ధి, కమర్షియల్ టూరిజం చెట్టపట్టాలేసుకుని సాగలేవని గ్రహించాలి. శాస్త్రీయ ఆధారాలు, విధాన నిర్ణయాల మధ్య అగాథాన్ని భర్తీ చేయడం ద్వారా పర్వత ప్రాంతాల్లో సంభవించగల విపత్తుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ప్రజల హృదయాల్లో చెరగని సంతకం
ప్రజల జీవితాలను మార్చిన నాయకులు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన ప్రజా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల స్వల్ప కాలంలోనే సంక్షేమం, వ్యవసాయం, సాగు నీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక చరిత్రను మార్చేశాయి. వైఎస్సార్ పాలనకు అసలు బలం ఆయన అధికారంలోకి రావడానికి ముందే పాదయాత్ర చేసి ప్రజలతో మమేకవడమే. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1,470 కిలోమీటర్లకు పైగా సాగిన ఆయన ప్రజా ప్రస్థానం కేవలం ఒక రాజకీయ పాదయాత్ర కాదు. అది గ్రామీణఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితులను స్వయంగా తెలుసుకున్న ఒక నాయకుడి సామాజిక అధ్య యనం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ‘ప్రజలు’ కేంద్ర బిందువుగా పలు చారి త్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.రైతు సంక్షేమానికి వైఎస్సార్ ఇచ్చిన ప్రాధాన్యం ఆయన పాలనా తత్వానికి అద్దం పడుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే నిర్ణయంపై తొలి సంతకం చేయడం ఒక సాధారణ ప్రభుత్వ ఉత్తర్వు కాదు. విద్యుత్ బకాయిల రద్దు, వ్యవసాయానికి ప్రోత్సాహం, సాగునీటి విస్తరణ వంటి చర్యలతో రైతాంగానికి ఆయన ఒక కొత్త భరోసాను కల్పించారు. అదే సమయంలో కరవుతో అలమటిస్తున్న ప్రాంతా లను శాశ్వతంగా మార్చాలన్న సంకల్పంతో ‘జలయజ్ఞం’కు శ్రీకారం చుట్టారు. పోలవరం, ప్రాణహిత–చేవెళ్ల, దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ వంటి అనేక ప్రాజెక్టులు ఆయన కాలంలోనే రూపుదిద్దుకున్నాయి.స్వయంగా వైద్యుడైన వైఎస్సార్ పేదలకు వైద్యం భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో ఆరోగ్యశ్రీ, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడేందుకు 108, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు 104 వంటి కార్య క్రమాలు తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేశారు. ఇంది రమ్మ ఇళ్లు, పావలా వడ్డీ రుణాలు, పింఛన్ల పెంపు వంటి చర్యలు... సంక్షేమాన్ని వైఎస్సార్ ప్రభుత్వ విధానంలో అంతర్భాగంగా మార్చాయి.హైదరాబాద్ అభివృద్ధిలోనూ వైఎస్సార్ దూరదృష్టి స్పష్టంగా కనిపిం చింది. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఆయన పాలనలోనే తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ గ్రేటర్ నగరం విస్తరణకు పునాదులు వేశాయి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా రైతు పొలంలో, పేదవాడి ఇంటిలో, విద్యార్థి కలలో, రోగి చికిత్సలో, సాగునీటి ప్రాజెక్టుల్లో ఆయన పరిపాలనా ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.చదవండి: మానవతా మహర్షి...బి. మహేశ్ కుమార్ గౌడ్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
నిక్కమైన రైతు బాంధవులు
ఎంఎస్ స్వామినాథన్కూ, వైఎస్ రాజ శేఖరరెడ్డికీ మధ్యన పోలికేంటి? వారిద్దరూ ఎక్కడైనా, ఎప్పుడైనా కలసి పనిచేశారా? లేదు. వారిద్దరూ నడిచిన బాటలు వేరే అయినప్పటికీ గమ్యం ఒక్కటే. అదే రైతు సంక్షేమం. స్వామినాథన్ ప్రముఖ శాస్త్ర వేత్త. భారత దేశంలో హరిత విప్లవానికి పితామహుడు. 1971 వరకూ ఇండియా ఆహార కోరతతో, పీఎల్ 420 పేరిట అమె రికా పంపుతున్న గోధుమల సాయంతో భారంగా బండినీడ్చుకుంటూ వస్తున్న దేశం. స్వామినాథన్ సృజన, పరిశ్రమ, దూరదృష్టితో దేశంలో ఆహార కొరతను అధిగమించాం. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు కూడా పెరిగాయి. రైతు పరిస్థితి మాత్రం అధ్వాన్నమైంది. ఈ దశలో రైతును ఆదుకునే రాజకీయ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనసున్న మహారాజుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవతరించారు. స్వామినాథన్ శాస్త్రీయ దృక్పథం, వైఎస్ రైతుబాంధవ్యం కలసి రైతులను ఆదుకున్నాయి.హరిత విప్లవానికి కొనసాగింపు...‘ఎవర్ గ్రీన్ రివల్యూషన్’ అనే మాటను సృష్టించిన వ్యక్తి ‘భారతరత్న’ స్వామినాథన్. గ్రీన్ రివల్యూషన్ తాత్కాలికమైనది కాదనీ, అది ఎప్పటికీ పురోభివృద్ధి చెందుతూ ఉండాలనీ ఆయన ఉద్దేశం. పంట దిగుబడి పెంచడం ఒక ఎత్తయితే, రైతుకు నష్టం లేకుండా చూడటం మరో ఎత్తు. స్వామినాథన్ పంట దిగుబడిని పెంచగలిగాడు కానీ ఉత్పత్తిదారులు అంటే రైతులు సంతోషంగా, సుఖంగా జీవించే విధంగా వారి జీవితాలను మార్చలేకపోయారు. ఇది శాస్త్రవేత్తల వల్ల అయ్యే పనికాదు. ఇందుకు అంకితభావం కలి గిన రాజనీతిజ్ఞుడు అవసరం. రాజశేఖరరెడ్డి వంటి నాయకుడు, పల్లెలు, రైతుల జీవితాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కావాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని శాస్త్రవేత్త కోణంలో చూడ లేదు. రాజకీయవేత్తగా చూశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మూడున్నర దశాబ్దాల కిందటి నుంచి గ్రామాలు గురించీ, రైతుల గురించీ, రైతులు ఎదుర్కొనే కష్టాల గురించీ అవగాహన పెంచుకున్న రాజకీయ నాయకుడు ఆయన. కడపలో వైద్యుడిగా పని చేసిన రోజుల నుంచి 1978లో శాసన సభకు ఎన్నికైన తర్వాత ఓటమి ఎరుగకుండా అసెంబ్లీలోనో, పార్ల మెంటులోనో ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ ప్రజాసమస్యలను అవగాహన చేసుకున్న ప్రజల మనిషి ఆయన. 2003లో సుమారు పదిహేను వందల కిలోమీటర్లు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ పల్లెలనూ, పొలాలనూ, చిన్నపట్టణాలనూ దాటుకుంటూ, రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేసిన ప్రజానాయకుడు. ఆ పాద యాత్రలో అవగతమైన అంశాలే ముఖ్యమంత్రిగా తాను రూపొందించిన విధానాలకు ప్రాతిపదికలైనాయి.రైతులు ఎదుర్కొంటున్నది ఒక సమస్య కాదు. మంచి వంగడం దొరికితే నీరు అందదు. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తక్కువ వడ్డీకి రుణాలు లభించవు. ఇవన్నీ ఉన్నప్పటికీ సకాలంలో వానలు కురియవు. అన్నీ సవ్యంగా ఉండి పంట దిగుబడి అధికంగా వచ్చి నప్పటికీ మార్కెట్లో పంటకు తగిన ధర పలకదు. ఈ కష్టాలన్నీ వైఎస్కు కరతలామలకం కనుకనే ఆయన ప్రభుత్వం చేపట్టిన పథకాలూ, కార్యక్రమాలూ అన్ని సమస్యలకూ సమాధానాలు అందించాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్కు నచ్చజెప్పి రెండు లక్షల వరకూ రైతుల రుణాలను మాఫీ చేయించారు. ఇది దేశంలో మరో ముఖ్యమంత్రి ఎవ్వరూ చేయని సాహసం. నీరు అందించడం కోసం జలయజ్ఞం పేరిట నీటి ప్రాజెక్టుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ రైతుల ఆత్మహత్యలను నివారించడానికీ, రైతుల గుండెలలో ధైర్యం నింపడానికీ అవసరమైన చర్య. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత విస్తృతంగా జలవనరుల అభివృద్ధికి చొరవ తీసుకోలేదు. వ్యవసాయదారులకు కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజులలోనే (2004 మేలోనే) ఈ సంస్కరణ ప్రవేశపెట్టారు. రైతులకు ఆరోగ్య బీమా ప్రవేశ పెట్టారు. ఒక సమగ్రమైన రైతు సంక్షేమ పథకాల ప్రణాళికను వైఎస్ తన ప్రభుత్వంలో ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ఆయనకు రైతుల ఖర్చుల పట్ల, కష్టాల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉండటమే.సరిగ్గా ఇక్కడే స్వామినాథన్, వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాలని తరచి చూడాలి. స్వామినాథన్ సైన్సుద్వారా కృషి చేశారు. రాజ శేఖరరెడ్డి పరిపాలన ద్వారా రైతు జీవితాలలో ఆనందం తొంగి చూసేందుకు సహకరించారు. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం, గిట్టు బాటు ధరల ద్వారా రైతుల దిగుబడి పెంచి, వారికి గిట్టుబాటు ధర లభించడం ఎట్లాగా అన్న ప్రశ్నలకు సమాధానాలను స్వామినాథన్ అన్వేషించారు. వ్యవసాయపు ఖర్చుల భారాన్ని రైతుల భుజాలపై నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ఏమి చేయగలదో రాజశేఖరరెడ్డి ఆలోచించారు. ఒకరు వ్యవసాయానికి శాస్త్రీయ పునాదులు వేస్తే, మరొకరు వ్యవసాయం గిట్టుబాటు కావడానికి అవసరమైన రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇద్దరూ కలసి ఎవరి దారిలో వారు చొరవ తీసుకున్నప్పుడే వ్యవసాయం బాగుంటుంది. రైతుల జీవితాలు గౌరవప్రదంగా ఉంటాయి. అందుకే, ‘డాక్టర్ వైఎస్ రాజ శేఖర రెడ్డి అవార్డు– 2026’ను నేడు దిల్లీలో జరిగే సభలో స్వామి నాథన్ ఫౌండేషన్కు ఇవ్వడం, అవార్డును ఎం.ఎస్. స్వామినాథన్ కుమార్తె డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్వీకరిస్తుండటం సముచితం.ఉండవల్లి అరుణ్కుమార్వ్యాసకర్త లోక్సభ మాజీ సభ్యులు -
మానవతా మహర్షి...
జననం వల్ల వంశగౌరవం తెలుస్తుందేమో గానీ, మరణం వల్ల ఆ మనిషి ప్రపంచం మీద చూపిన ప్రభావం, ప్రజల మీద వేసిన ప్రత్యేక ఆత్మీయ ముద్ర, చెలిమితో చేసిన పని, గుండెల్ని తట్టిలేపి అందులో వికసిత సితవదన రాజశేఖరమై వెలుగొందడం తెలుస్తుంది. ఇది అక్షరాలా ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ దివంగత ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి వర్తిస్తుంది. మహాత్ములకు మరణం ఉండదు. వారు భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు కానీ కొన్ని తరాల వరకు వారి జ్ఞాపకాలు నిత్య హరితంగా, నిత్యస్మరితంగా మనవెంట ఉంటాయి. వారు చేసిన మంచి పనులు మనసుకు కనిపిస్తూ వారి కీర్తి స్ఫూర్తి కాయాన్ని కళ్ళముందు నిలిపి కన్నులు చెమ్మగిల్లేలా చేస్తాయి. రాజన్న శరీరం మనల్ని వదలి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనను నిత్యం తలచుకుంటున్నారు అంటే ఆశ్చర్యం, ఆనందం. ప్రజలను ఆయన తన గుండెలా చూసుకుంటే, ఆయనకు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారు. మానుషరూప దైవం ఆయనే అన్నట్లు తమ పూజా మందిరాలలో ఆయన చిత్ర పటాన్ని ఉంచారు. అంత గొప్ప స్థానం దక్కించుకోవడం ఎవరికి సాధ్యమౌతుంది, అసాధ్యాలను సాధ్యాలు చేసిన రాజశేఖరరెడ్డికి తప్ప.ఇచ్చుటలో ఉన్న హాయి...కొందరు కారణం లేకుండా సమాజంతో, పరిస్థితులతో రాజీపడరు. సేవ చేయటానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అధికారం ఉన్నా, లేకున్నా. అదీ రాజశేఖరరెడ్డి. అందుకే ఆకాశ మంత ప్రేమ ఆయనంటే అందరికీ. అప్పట్లో వెనుకబడిన పేదరిక ప్రాంతం కడప జిల్లాలో జన్మించి గడపగడపలో ఆయన చిత్ర పటాన్ని పెట్టుకునే స్థాయికి ఎదగడం సామాన్యం కాదు. బాల్యం నుంచే భిన్నంగా ఆలోచించడం, చుట్టూ ఉన్న పేదరికానికి చలించి వారికి ఏదో చేయాలి అని తపించడం వల్లే అది సాధ్యమైంది. నేర్చుకునే గుణాన్ని ఆయన ఆఖరి క్షణం వరకు వదలలేదు. ‘తీసుకోవడం కాదు ఇవ్వడం వల్ల ప్రేమ రెట్టింపు అవుతుంది’ అనేవాడు. ఇవ్వడంలో ఉన్న హాయి ఆయన తెలుసుకోవడమే గాక అందరికీ తెలియచెప్పాడు. చెప్పడమే కాదు ఆచరించాడు. ఆ గుణం వల్లే దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేనన్ని వరాలు, సౌకర్యాలు, పథకాలు ఆయన ఉభయ రాష్ట్రాల తెలుగువారికి అందించాడు. కడపజిల్లా మట్టి వాసన పీల్చిన మొరటు మొండితనం, తప్పునకు ఏమాత్రం తలవంచక నిలబడి కలబడటం, వైద్యం చదివినందువల్ల మనసంతా కరుణ, ఎదుటివారి ప్రాణం ఎలాగైనా కాపాడి తీరాలన్న తపన, మాట ఇస్తే అందుకోసం ఎందాకా అయిన నిలబడి తీరాలన్న నిజాయితీ, అందిన అధికారాన్ని సేవకోసం మాత్రమే ఉపయోగించాలన్న ఆశయం– ఇవన్నీ సాకార ఆకారమై ముందు నిలిస్తే అది వైఎస్ రాజశేఖరరెడ్డి! ఆయన వ్యక్తిత్వం గురించి, మంచితనం గురించి ఎంత చెప్పినా ఏదో మిగిలే ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్న కాలంలోనూ, ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కాలంలోనూ ఎందరికో సహాయం చేశాడు. బహిరంగంగా ఆయనను తిట్టినవాళ్ళు, రాజకీయంగా విమర్శించినవాళ్ళు సైతం ఆయన సహాయాన్ని పొందారన్నది పచ్చినిజం. ‘సహాయం చేయడంలో రాజకీయాలు, పార్టీలు ఎందుకు? మనం మనుషులం. ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వచ్చి అడిగినపుడు, మనం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు చేసి తీరాలి’ అనేవాడు.ప్రజారోగ్యాన్ని నెత్తికెత్తుకొని...మానవీయ విలువల మహోన్నత వికాస మానసం ఆయనది. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్న ఆలోచన ఎంత గొప్పది! ఈ రోజు రాజశేఖరరెడ్డి కారణంగా కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆ కుటుంబాలు చితికిపోకుండా చిగురు వేశాయి. వారందరికీ ఆయన ప్రాణదాత, విధాత, విధి రాతను తిరిగి రాసిన నేత అన్నది సర్వాంగీకార సత్యం. జనం కోసం, రైతుకోసం, నీటికోసం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా సొంత పార్టీవారితో పోరాటం చేశాడు. పదవులు, పార్టీల కన్నా ప్రజలు, వారి అవసరాలు ముఖ్యం అని నిలబడ్డాడు. కుటుంబానికి పరిమి తమైన విద్యార్థి ‘రాజా’, ‘డాక్టరు రాజా’ అయ్యాడు. పేదల వైద్యుడిగా, ప్రజా వైద్యుడిగా ప్రయాణిస్తూ మరింత సేవ చేసేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేసి ‘రాజన్న’ అయ్యాడు. సమస్యను తక్షణం పరిష్కరించడం ఆయన ప్రత్యేకత. చూద్దాం, చేద్దాం అన్న మాట ఆయన నోట వినలేదు. ఎప్పుడూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసేవాడు. ఎండిన పొలాలు, మండుతున్న రైతు గుండెల్ని చూసి... పొలం గట్టు మీద కూర్చొని మథనపడేవాడు. ఒక్క ఎకరా కూడా నీరు లేకుండా ఎండకూడదు, అలా చేయటానికే అధికారంలోనికి రావాలి అనుకున్నాడు. ఇతరులు అధికారం పొంది ధనయజ్ఞం చేస్తే, రాజన్న జలయజ్ఞం చేశాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. ఎందరు కాదన్నా పట్టుదలతో రైతులకు ఉచిత విద్యుత్తు అందించాడు.రాజన్న తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివిధ రాష్ట్రాలు అనుసరించాయి. ప్రజల హృద యాలను, అవసరాలను, పేదరికపు వ్యథా భరిత జీవితాలను ఎంత చదివాడో, ఎంతగా ఆయన లోలో నలిగాడో గానీ... ఆయన ప్రవేశపెట్టిన ప్రజారోగ్య, విద్యా పథకాలను కాదని ఏ ప్రభు త్వమూ మనుగడ సాగించలేదు. పల్లె పల్లెలో, వీధి వీధిలో ఆయన విగ్రహాలు వెలిశాయి అంటే అందుకు కారణం ఇదే. చెప్పుకోవడం కాదు, చేతల్లో ఎలా ఉన్నాం, చేతనంలో ఎలా ఉన్నాం అన్నది మౌనంగా గ్రహిస్తారు ప్రజలు. వారికి తెలియ దనుకోవడం అమాయకత్వం. రాజశేఖరుని ఆంతర్యం ఆసాంతం అందరు గ్రహించారు. కాబట్టి ఆ విగ్రహాలు ఎవరికి వారు స్వచ్ఛందంగా వారి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం చరిత్రలో అసాధారణం, అసామాన్యం కదా! ఎంతమంది నాయకులు లేరు! ఆయన కన్నా ముందు ఎందరు పరిపాలించలేదు! ఎవ్వరికీ దక్కని కీర్తి ప్రతిష్ఠలు రాజశేఖరరెడ్డికే దక్కడం ఆయన అదృష్టం కాదు. ఆయన చేసిన కృషి, సేవ అందుకు కారణం. ఆగ్రహంతో అడవులలో ఆయుధా లతో తిరిగే అన్నలతో సైతం శాంతి చర్చలు జరిపాడే... అది చాలదా ఆయన శాంతి కామన ఆరాధన. ఎంతటి వారికైనా మరణం అనివార్యం. మరణం అంటే మనిషి లేకపోవడం. కానీ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలు, కీర్తి, చేసిన పనులు, వారి నుండి సహాయం పొందిన వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. ఆయన మనమధ్యే ఉన్నారు, మనతో ఉన్నారు. నిత్య స్మరణలో ఉన్న మనిషికి మరణం ఉంటుందా! కొందరు సమాజాన్ని మార్చటానికే జన్మిస్తారట. అలాంటి సార్థక ధన్యజన్మ ఆయనది. అతి కొద్ది పరిపాలన కాలంలోనే, తిరుమల తిరుపతి దేవస్థానాలతో సహా రాష్ట్రంలోని అన్ని విభా గాలను ప్రక్షాళితం, ప్రజ్వలితం చేయగలిగాడు. రైతులు, ఉద్యో గులు, విద్యార్థులు, కార్మికులు అందరి ముఖాలలోను చిరునవ్వులు వెలిగించాడు. ఆయనతో కలిసి నడిచిన వ్యక్తిగా, ఆత్మబంధువుగా ఆయనను ఈ రోజు స్మరించుకోవడం నా భాగ్యం, నా ధర్మం, నా కర్తవ్యం. రామాలయం లేని గ్రామం ఉండవచ్చు కానీ రాజన్న జ్ఞాపక చిత్రం లేని ఒక్క హృదయాలయమూ ఉండదని గుర్తు చేస్తూ...భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
‘కాక్రోచ్’ పార్టీ సిద్ధాంతాలు ఏమిటి?!
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనేది నిజానికి ఒక రాజకీయ పార్టీ కాదు. అట్లా మారే ఆలోచన కూడా లేదని, సమాజాన్ని వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడిని సృష్టించే ఉద్యమంగా మాత్రమే కొనసాగదలచుకున్నామని ఆ సంస్థ నిర్వాహకులు పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ సిద్ధాంతాలు ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తూనే ఉండటం గమనార్హం. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. సిద్ధాంతా లనేవి పార్టీలకు మాత్రమే ఉండాలా? సీజేపీ వంటి ఉద్యమాలకు ఉండవా? ఉండకూడదని, ఉండవని ఎవరైనా సూత్రీకరిస్తే అది పొరపాటు అవుతుంది. ఈ మాట అనుకున్న తర్వాత రెండు ప్రశ్నలకు జవా బులు చెప్పుకోవాలి. ఒకటి, అసలు సిద్ధాంతాలు అంటే ఏమిటి? రెండు, ఆ ప్రకారం సీజేపీకి సిద్ధాంతాలు అనదగ్గవి ఉన్నాయా, ఉంటే ఏమిటవి? అదే విధంగా ఈ తరహా ప్రశ్నలు ఎదురైనప్పుడు సీజేపీ నిర్వాహకులు ఇస్తున్న సమాధాన మేమిటి? సిద్ధాంతం అనే మాటకు స్థూలమైన నిర్వచనం ఏమంటే ఒక వ్యక్తికి, లేదా పార్టీకి, లేదా సంస్థకు సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల, అందుకు పరిష్కారాల పట్ల, భవిష్యత్తు పట్ల, దాని కోసం ఏమి చేయాలనే విషయమై తనదైన అవగాహన, కార్యాచరణ మార్గం ఉండటం. సిద్ధాంతం అనేది ఏ రంగం విషయంలోనైనా ఉంటుంది. ఇక్కడ సందర్భం సీజేపీ అయినందున సామాజిక రంగం గురించి చెప్పుకుంటున్నాము. సిద్ధాంతాలన్నవి రాజకీయ పార్టీలకే పరిమితం కానక్కర లేదని, సంస్థలకు కూడా ఉండవచ్చు నని, ఉండాలి కూడానని అనుకుంటున్నాము గనుక, ఇపుడు సీజేపీ గురించి విచారిద్దాము.ప్రకటన, పత్రం కనిపించని పోరాటంకొద్దిరోజుల క్రితం ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీజేపీ నిర్వాహకులు ఈ ప్రశ్నకు స్వయంగా చెప్పిన సమాధానం ఈ విధంగా ఉంది. ప్రశ్న: మీ సిద్ధాంతం మితవాదమా, మధ్యే మార్గమా, లేక వామపక్షమా? జవాబు: మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని మొదటి నుంచి చెబుతున్నాం. ప్రశ్న: రాజ్యాంగానిది మధ్యే మార్గమంటారు కదా? జవాబు: ఏదైనా కావచ్చు. కానీ మాది రాజ్యాంగ మార్గం. సమానత్వ హక్కులు, భావప్రకటనా స్వాతంత్య్రం, విద్యాహక్కులు, శాంతియుతంగా నిరసన ప్రకటించే హక్కు వగైరాలు. ఇటువంటివి అనేకం రాజ్యాంగంలో ఉన్నాయి. వాటిని సరిగా పాటించినట్లయితే మన దేశం చాలా ముందుకు పోతుంది. మేము సెక్యులర్. మావి ప్రజాస్వామిక విలువలు. ఛానల్ చర్చ ఒకే ప్రశ్నతో క్లుప్తంగా ముగిసినందున సీజేపీ ఆలోచనలు పూర్తి రూపంలో వెల్లడి కాలేదనాలి. ఇతరత్రా కూడా వారు దీనిపై ఒక ప్రకటనగాని, పత్రంగానీ విడుదల చేయలేదు. సంస్థ ఆరంభమైన మొదటి రోజు నుంచే వారు కార్యక్రమాలలో తలమునకలుగా ఉండటం అందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం ఉద్యమం వేడిలో నిర్వాహకులు చెప్పే కొద్ది మాటలు, చేసే కొద్ది కార్యక్రమాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. ముందుకు సాగిన కొద్దీ, ఇతర సామాజిక అంశాలపైనా దృష్టి పెట్టగలమంటున్నందున వాటి గురించి కూడా పలు ప్రశ్నలు ముందుకు వస్తాయి. అందువల్ల సీజేపీ, రాగల రోజులలో ఈ ప్రశ్నలపై దృష్టి పెట్టడం అవసరం అవుతుంది. సంస్థ నాయకుల నుంచి ఇంతవరకు వినవచ్చిన మాటలను, వారి కార్యక్రమాలను గమనించినపుడు వారి ఆలోచనలు, లేదా స్థూలమైన రీతిలో సిద్ధాంతాలు అనదగ్గ వాటిపై కొన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ అయిన అభిజీత్ దీప్కే అమెరికా నుంచి వచ్చి విమానాశ్రయం నుంచే భారత రాజ్యాంగాన్ని పైకెత్తి చూపటం చేశారు. జంతర్ మంతర్ ఆందోళన పొడవునా తనతోపాటు పలువురు ఇతర ఆందోళనకారులు అదే పని చేశారు. ఇదే ధోరణి ఇతర రాష్ట్రాలలోనూ కనిపించింది. ఈ స్ఫూర్తి ఎంతగా వ్యాపించిందంటే, ఇటీవల పట్నాలో పోలీసులు అదుపు లోకి తీసుకున్న ఆరేళ్ల పేద పిల్లవాడు ఆదిత్య రాజ్యాంగం గురించి, అంబేడ్కర్ గురించి మాట్లాడటం విన్నాము.రాష్ట్రాలకూ వ్యాపిస్తున్న ఆందోళనలుమొదటి రోజు నుంచే అభిజీత్ అనేకమార్లు గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, భగత్సింగ్ల ప్రస్తావనలు, కొద్దిసార్లు సుభాష్ బోస్ ప్రస్తా వన చేస్తున్నారు. వారి మార్గాన్ని అనుసరిస్తామన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలిచ్చారు. రైతాంగానికి సంఘీభావం ప్రకటించి వారిని తమకు మద్దతు తెలుపవలసిందిగా ఆహ్వానించటంతో పాటు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల వ్యవసాయ రంగానికి కలిగే నష్టాలపై వారు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు ప్రతినిధులను పంపారు. సీజేపీ మొదటినుంచే లేవనెత్తిన అంశాలలో మత రాజకీయాల పట్ల కూడా నిరసనలు కనిపించాయి. ఇపుడు పైన ప్రస్తావించిన ఛానల్ ఇంటర్వ్యూలోనూ అభిజీత్ తాము సెక్యులర్ వాదులమని ప్రకటించారు. ఈ అంశాలకే పరిమితం కాని నిర్వాహకులు పలు ప్రజాస్వామ్య సంబంధమైన సమస్యలను కూడా లేవనెత్తారు. అవి కోర్టులు, ఎన్నికల సంఘం సవ్యంగా పనిచేయక పోవటం, పార్టీ ఫిరాయింపులు, ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలకు జవాబుదారీతనం, పారదర్శకత లేకపోవటం, ప్రశ్నిస్తే ముద్రలు వేసి అణచివేయటం, అవినీతి, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ధనిక– పేద తారతమ్యాలు మొదలైనవి అందులో ఉన్నాయి. ఈ ఉద్యమ వాతావరణం క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది.శూన్యాన్ని పూరించే శక్తి కాగలదా? ఇవన్నీ గమనించినపుడు సీజేపీది ఏ సిద్ధాంతమని భావించ వలసి ఉంటుంది? మితవాదమా, మధ్యేవాదమా, వామపక్ష వాదమా, లేక అసలు ఏ వాదమూ లేనిదనా? వారు తమది రాజ్యాంగ వాదమన్నారనుకోవాలి. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన విషయాలు రెండు న్నాయి. సీజేపీ నాయకులను ప్రశ్నించిన ఛానల్ యాంకర్ అన్నట్లు భారత రాజ్యాంగం మధ్యేమార్గానిది ఎంతమాత్రం కాదు. అంబేడ్కర్, నెహ్రూలు సారథ్యం వహించిన ఆ గ్రంథం సోషలిస్టు, లేదా వామపక్షపు మొగ్గు గల మధ్యేమార్గ లక్షణాలు కలది. ఇపుడు సీజేపీ నిర్వాహకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ అవే లక్షణాలతో ఉన్నాయి. ఇది మొదటి విషయం కాగా, స్వాతంత్య్రా నంతరం అందుకు వారసత్వం తీసు కున్నామన్న కాంగ్రెస్ ఆచరణలో విఫలమైంది. ఆ పార్టీ స్థానంలో అదే వారసత్వాన్ని కొనసాగిస్తామన్న జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు కూడా విఫలమయ్యాయి. ఆ శూన్యంలోకి బీజేపీ అనే మితవాద పార్టీ ప్రవేశించింది. ప్రస్తుతం అది కూడా ప్రజాదరణను క్రమంగా కోల్పోతున్నది. భారతదేశపు వర్తమాన సమాజం ప్రగతిశీలమైన సమ్మిళిత వ్యవస్థను కోరుతోంది. అదే ఆ సమాజపు అవసరం, సహజ స్వభావం. అటువంటి స్థితిలో దేశం ఎదుర్కొంటున్న శూన్యాల మధ్య, సీజేపీ వంటిది ఆ శూన్యాన్ని పూరించగల శక్తిగా ఎదగగలదా, ఎదిగితే బాగుండుననే ఆలోచనలు ఒక చిన్న స్థాయిలో మొదలవుతున్నాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఏఐ యుగంలో గొప్ప ఆయుధం... విచక్షణ
అందరికీ శుభోదయం. ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజున మీతో మాట్లాడ టానికి వచ్చిన నేను... మెదిపిన బంగాళాదుంపల (స్మాష్డ్ పొటా టోస్) గురించి మాట్లాడబోతున్నాను! ఎందుకో తెలుసుకోవాలంటే మనం 50 ఏళ్ల వెనక్కి వెళ్లాలి. 1970లలో నేను కొలంబస్లో పెరిగాను. ఆ రోజుల్లో పరిస్థితులు ఇప్పటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, ఉద్యోగాలపై ఆందోళన, పెరుగుతున్న పెట్రోల్ ధరలు వంటి సమస్యలు ఉండేవి.మెదిపిన బంగాళాదుంపల కథచిన్నప్పుడు నేను... మా అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లతో కలిసి రోజూ భోజనం చేసేవాడిని. మా ఇంట్లో భోజనం చాలా సాధారణంగా ఉండేది. హాట్ డాగ్స్, ట్యూనా క్యాసరోల్, మీట్ లోఫ్ వంటివి ఉండేవి. అయితే మా భోజనంలో తరచుగా కనిపించేది మెదిపిన బంగాళాదుంపలు. తొమ్మిదేళ్ల వయసులో నేను ఓ రోజు మా వృద్ధ బంధువు ఇంటికి వెళ్లాను. ఆమె నాకు మెదిపిన బంగాళాదుంపలు వడ్డించింది. అవి నేను అప్పటివరకు తిన్న వాటిలో అత్యంత రుచికరమైనవి. అవి మెత్తగా రుచిగా ఉన్నాయి. వాటిని ఎలా తయారుచేశారో తెలుసుకోవాలనే ఆసక్తితో వంటగది లోకి వెళ్లాను. అక్కడ నాకు ఆశ్చర్యం కలిగింది. అవి ప్యాకెట్ నుంచి వచ్చినవి కావు. ఆమె సహజమైన బంగాళాదుంప లను ఉడికించి, వాటిని మెదిపి... వెన్న, ఉప్పు కలిపి తయారు చేసింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నాకు మంచి రుచి ఏదో తెలుసు. నాకు నా సొంత అభిరుచి ఉంది. అంటే కేవలం రుచి చూసే నాలుక ఉందని కాదు. ఏది మంచిదో, ఏది అంత మంచిది కాదో గుర్తించే సొంత అభిప్రాయం నాకు ఉందని అర్థం. గత నాలుగేళ్లలో మీరు ఇక్కడ యానిమేషన్ , ఫ్యాషన్ , సినిమా, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ , గేమ్స్, ఫైన్ ఆర్ట్ వంటి ఎన్నో విషయాల్లో నైపుణ్యం సంపాదించారు. మీరు కష్టమైన ప్రాజెక్టులు పూర్తి చేశారు. మంచి ఇంటర్న్షిప్లు పొందారు. జీవితాంతం గుర్తుండిపోయే స్నేహా లను ఏర్పరచుకున్నారు. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. మీరు మీ సొంత అభిరుచిని, కళాత్మక దృష్టిని,సొంత ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఏది మంచిదో, ఏది గొప్పదో, ఏది మెరుగుపరచాలో గుర్తించే శక్తిని పొందారు. ఇప్పుడు మనం కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ఉన్నాం. ఈ కాలంలో మీ సొంత అభిరుచి మిమ్మల్ని ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఏఐ మీకు ఎన్నో ఎంపికలు ఇవ్వగలదు. ఒక చిన్న సూచన ఇస్తే చాట్జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ సాధనాలు డజన్ల కొద్దీ, వందల కొద్దీ ఆలోచనలు ఇవ్వగలవు. కానీ వాటిలో ఏది అద్భుత మైనది? ఏది సాధారణమైనది? ఏది వినియోగదారుడికి ఉపయోగ పడుతుంది? ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? అనేది మీరు నిర్ణయించాలి. ఏఐకి సొంత అభిరుచి, సొంత అభిప్రాయం ఉండదు. మీకు సొంత అభిరుచి ఉంది. సొంతం అభిప్రాయం ఉంది. అందుకే భవిష్యత్తులో ఏఐకి మీలాంటి మనుషులు మరింత అవసరం అవుతారు. కృత్రిమ మేధ యుగంలో మీ గొప్ప ఆయుధం... మీ సొంత అభిరుచి. మీ సొంత విచక్షణ!మంచి పనిని గుర్తించే అభిరుచిచాలా కాలం వరకు మనుషులు గొప్ప ఆలోచనలు చేయ గలిగేవారు. కానీ వాటిని నిజంగా రూపొందించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాధనాలు అందరికీ ఉండేవి కావు. ఏఐ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చింది. ఇప్పుడు దాదాపు ఎవరైనా దాదాపు ఏదైనా తయారు చేయగలరు. అందువల్ల భవిష్యత్తులో అరుదైన నైపుణ్యం పని చేయడం మాత్రమే కాదు; మంచి పనిని గుర్తించడం. దీనినే విచక్షణ అంటాం. ఉదాహరణకు పుస్తక ప్రచురణ రంగంలో ఏఐ కారణంగా పుస్తకాలు రాయడం సులభమైంది. పుస్తకాల సంఖ్య పెరిగింది. పరిమాణం పెరిగింది. కానీ వాటి సగటు నాణ్యత తగ్గింది. ఈ పరిస్థితిలో మంచి పనిని గుర్తించే అభిరుచే అత్యంత కీలక నైపుణ్యంగా మారనుంది. మన అభిరుచి ఇతరుల పనిని చూడటం వల్ల అభివృద్ధి చెందదు. మనమే ఏదైనా సృష్టించినప్పుడు మన అభిరుచి మరింత పెరుగుతుంది. మీరు చేసిన ప్రతి ప్రాజెక్టు, ఎదుర్కొన్న ప్రతి విమర్శ, వదిలేయాలని అనిపించిన ప్రతి పని.. ఇవన్నీ మీ అభి రుచిని పెంచుతాయి. కళ, డిజైన్ , సంగీతం, సినిమాలు, సాహిత్యం వంటి వాటిని ఆస్వాదించండి. కానీ ఇతరుల పనిని చూడటంకంటే... మీరు స్వయంగా సృష్టించే పనికి ఎక్కువ సమయం కేటాయించండి. అభిరుచి అంటే మనకు నచ్చినది చెప్పడం మాత్రమే కాదు. నచ్చనప్పుడు ‘లేదు’ అని చెప్పే ధైర్యం కూడా. ‘ఇది సరి పోదు.’ ‘ఇది నాకు నచ్చలేదు.’ ‘ఇది ఇంకా మెరుగ్గా ఉండాలి’ అని నిర్మొహమాటంగా చెప్పగలగాలి. ఇతరులందరూ ఒక పనికి ‘అవును’ అని చెప్పినప్పటికీ... అది సరైనది కాదని మీకు అనిపిస్తే ‘నో’ అని చెప్పే ధైర్యం ఉండాలి. ఇదే నిపుణుడికి, సాధారణ వ్యక్తికి మధ్య ఉన్న తేడా! అభిరుచి మారాలి!మీ అభిరుచులు ఎప్పటికీ ఒకేలా ఉంటే మీరు ఎదగడం లేదని అర్థం. మీరు ఈ కాలేజీలో చేరిన రోజు ఉన్న వ్యక్తి ఇప్పుడు లేరు. మీ ఆలోచనలు మారాయి. మీ అనుభవాలు పెరిగాయి. మీ దృష్టి మారింది.ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది ఎదుగుదలకు సంకేతం. నాలుగేళ్ల తర్వాత, పదేళ్ల తర్వాత కూడా మీరు మారు తూనే ఉండాలి. విజయవంతమైన సృష్టికర్తలు జీవితాంతం ఒకే విధానంలో చిక్కుకుపోరు. వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త ఆలోచ నలను స్వీకరిస్తారు. తమ అభిరుచిని నిరంతరం అభివృద్ధి చేసుకుంటారు. అందుకే మూడు విషయాలు గుర్తుంచుకోండి: ఎక్కువగా సృష్టించడంపై దృష్టిపెట్టండి. అవసరమైనప్పుడు ‘నో’ చెప్పండి. ఎప్పటి కప్పుడు మారుతూ ఉండండి. చివరగా ఒక చిన్న సలహా: ఓ ఆన్లైన్ వేదికలో బంగాళా దుంపల గురించి ప్రత్యేకంగా చర్చించే ఒక సమూహం ఉంది. అక్కడ మెదిపిన బంగాళాదుంపల గురించి కూడా చర్చ జరిగింది. కొంతమంది వాటిని ఇష్టపడలేదు. మరికొందరు వాటిని సమర్థించారు. అందులో ఒక వ్యక్తి చెప్పిన నాలుగు పదాల సలహా నాకు చాలా నచ్చింది: ‘‘విమర్శలను పట్టించుకోకండి. మీ ఆనందాన్ని ఆస్వాదించండి’’. ఇది సృజనాత్మక జీవితానికి కూడా గొప్ప సలహా.మీరు అడుగుపెడుతున్న ప్రపంచంలో మనుషులు చూడగలి గిన దానికంటే ఎక్కువ సమాచారం ఉంటుంది. అనంతమైన చిత్రాలు. అసంఖ్యాకమైన ఎంపికలు. ఎప్పటికీ ఆగని సమాచార ప్రవాహం. అలాంటి ప్రపంచంలో ఏది నిజమైనది? ఏది అందమై నది? ఏది విలువైనది? ఏది సృష్టించదగినది? అని గుర్తించగలిగిన వారిదే భవిష్యత్తు. చివరగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక్కటే: విమర్శలను పట్టించుకోకుండా, మీ జీవితాన్ని ఆనందంగా ఆస్వా దిస్తూ ముందుకు సాగండి. మీ అందరికీ అభినందనలు! -
జెలెన్స్కీ (ఉక్రెయిన్ ప్రెసిడెంట్) రాయని డైరీ
యుద్ధం మన జీవిత భాగస్వామి అయినప్పుడు ప్రతి ఉదయం ఒకే మంచం మీద బతుకు తెల్లారుతూ ఉంటుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో అధ్యక్ష కార్యాలయం నుంచి కాక, భూగర్భ బంకర్ల నుంచి నేను నా దేశాన్ని నాలుగున్నర ఏళ్లుగా ఏ రాత్రికి ఆ రాత్రి, ఏ పగలుకు ఆ పగలు కాపు కాసుకుంటూ వస్తున్నాను. ఇక ఇప్పుడైతే ఏ నిమిషానికి ఆ నిమిషం! ఒకప్పటి తమ అభిమాన హాస్య నటుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నేటి నిజ జీవిత విషాద సన్నివేశాలకు ఎందుకు ఇంతగా కొనసాగింపును ఇవ్వవలసి వస్తున్నదో అర్థం చేసుకోగలిగినవారు అయినందువల్లనే ఉక్రెయిన్ ప్రజలు ఈ యుద్ధకాలంలో నాకు గొప్ప బలగంగా ఉన్నారు. రాత్రి 2:14 అయింది. టీవీ కాంతిలో మెరుస్తున్న ఈ చీకటి గదిలో కొన్నిసార్లు ఒలెనా, అలెక్సాండ్రా, కిరిలో... కళ్లలో మెదులుతుంటారు. నేను వారి జీవితంలో ఒక నిశ్శబ్ద ఛాయలా మాత్రమే మిగిలిపోతున్నానా... వారి నవ్వులు వినక, వారిని హృదయానికి హత్తుకోక!! యుద్ధం మొదలయ్యే సమయానికి నా కూతురు అలెక్సాండ్రా టీనేజ్లో ఉంది. తను ఇప్పుడు ఉన్నత చదువులకు వచ్చింది. కిరిలో అప్పుడు 9 ఏళ్లవాడు. ఆ వయసుకే వాడొక ఉక్రెయిన్ సైనికుడిలా కనిపించేవాడు నాకు!ఒలెనా... నా సహచరి. నేను బంకర్ల నుంచి శత్రువుతో పోరాడుతుంటే, తను బయటి నుంచి ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతోంది. ఉక్రెయిన్ మహిళలు, చిన్నారుల కోసం ‘‘హౌ ఆర్ యు?’’ అనే ప్రాజెక్టు నడుపుతోంది. అదే మాటను కాస్త తగ్గించిన స్వరంతో, ప్రేమగా ఎప్పుడైనా నన్ను అడుగుతుంది: ‘‘యాక్ స్ప్రావి వోలోద్యా?’’ అని. కొన్నిసార్లయితే ‘‘యాక్ స్ప్రావి మిస్టర్ ప్రెసిడెంట్?’’ అంటుంది నవ్వుతూ.ఆమె గొంతు విని, డీజిల్ వాసన కొట్టే బంకర్ ఒక్కసారిగా గుబాళిస్తుంది. ఒలెనా, నేను ఒకే స్కూల్లో, ఒకే కాలేజ్లో చదువుకున్నాం. క్రివీ రిహ్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని చెర్రీ బ్లోసమ్, మాగ్నోలియా పూల చెట్ల కింద మా చేతులు కలిసి నడిచాయి. రాత్రి 2.43కి బంకర్లోకి కాల్! ‘‘మన సైన్యం శత్రువును గట్టిగా తిప్పి కొట్టింది మిస్టర్ ప్రెసిడెంట్. మన భూభాగాన్ని తిరిగి సాధించాం...’’ అని గర్వంగా చెబుతున్నారు కమాండర్లు. తిరిగి స్వాధీనం చేసుకునే ప్రతి చదరపు కిలోమీటరు వెనుక సైనికుల ప్రాణత్యాగం ఉంటుంది. సైరన్లు ఆగిన ప్రతిసారీ ఆ కాసేపటి శూన్యంలో, అమరవీరుల జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కుతుంది.ఉక్రేనియన్లు, రష్యన్లు ఒకరే అంటాడు పుతిన్ . నవ్వొస్తుంది నాకు. ఆ వెంటనే రష్యన్ రొమాంటిక్ కామెడీ ‘8 ఫస్ట్ డేట్స్’ గుర్తొస్తుంది. అందులో హీరోగా నటించింది నేనే. అకిన్షినా అనే అమ్మాయి హీరోయిన్ . సినిమాలో ఆమె పేరు వీరా. నా పేరు నికిత. వీరాకు, నికితకు వేరే వేరే వాళ్లతో పెళ్లయి ఉంటుంది. కానీ ఉదయాన్నే లేచి చూస్తే ఇద్దరూ ఒకే మంచం మీద ఉంటుంటారు! అలా ప్రతిరోజూ ఒకే మంచంపై మెలకువ రావడం అనేది యాదృచ్ఛికం కాదనీ, తమ ఇద్దరినీ కలపటానికి ఏదో అదృశ్య శక్తి ప్రయత్నిస్తోందనీ అనుకుంటారు. పైకి పర్ఫెక్ట్గా కనిపించే దంపతుల కంటే– మనో భావాలను, లోపాలను అర్థం చేసుకునేవారే నిజమైన జీవిత భాగస్వాములు అని తీర్మానించుకుంటారు. పాత పెళ్లిళ్లు రద్దు చేసుకొని ఇద్దరూ ఒకటవుతారు! బహుశా పుతిన్ కూడా రోజూ ఉదయం నిద్రలేవగానే తన మంచం మీద ఉక్రెయిన్ ఉండాలని కోరుకుంటూ ఉండి ఉండొచ్చు. కానీ అది ఎప్పటికీ జరగదు. ‘8 ఫస్ట్ డేట్స్’లో ప్రేక్షకులకు నచ్చేలా స్క్రిప్ట్ను దిద్దిన నేను... రష్యా ఇప్పుడు రాస్తున్న బాధ్యతారహితమైన స్క్రిప్టుకు, ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్న ముగింపును ఇవ్వలేనా?! -
మూడో ప్రపంచ యుద్ధ ముప్పున్నదా?
ఒకవైపు ఉక్రెయిన్–రష్యా యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుండగానే అనూహ్యంగా కొత్త సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో శాంతి ఎండమావిగా తోస్తున్నది. ఇజ్రాయెల్ అనూహ్యంగా సిరియాను, తద్వారా టర్కీని కూడా యుద్ధంలోనికి లాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై సైనిక దాడికి దిగిన ట్రంప్ సరికొత్తగా ఆ దేశంపై ఆర్థిక యుద్ధం పల్లవి అందుకున్నాడు. ఇరాన్తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న దేశాలపై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ విధానం అమలైతే తీవ్రంగా నష్టపోయేది చైనా. ఇరాన్ చమురులో 90 శాతం చైనా కొనుగోలు చేస్తున్నది. ఈ రకంగా ఇరాన్ యుద్ధంలోనికి ప్రత్యక్షంగా చైనాను లాగటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతున్నది. మరొకవైపు ఇజ్రాయెల్ ప్రధాని, ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పల్లవిని అందుకున్నాడు. ఇంకొకవైపు సౌదీ– పాకిస్తాన్–టర్కీ ‘మక్కా ఒప్పందం’తో నాటో తరహా సైనిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. బంగ్లాదేశ్ ప్రధాని మక్కా ఒప్పందంలోనికి చేరటానికి సంకేతాలివ్వటం భారత్ను ఒత్తిడిలోనికి నెట్టింది. వేగంగా మారుతున్న సమీకరణాలు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధంవైపు తీసుకెళ్తున్నాయా అనే సందేహాన్ని కలిగించక మానవు.ప్రపంచ యుద్ధాల నేపథ్యంమొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఐరోపా రెండు రాజకీయ /సైనిక కూటములుగా చీలిపోయింది. బ్రిటన్ ఆధిపత్యాన్ని జర్మనీ సవాలు చేసింది. పాన్ జర్మనిక్, పాన్ స్లావిక్, బాల్కన్ జాతీయవాద ధోరణులు బలంగా వ్యాపించి ఉన్నాయి. జూన్ 1914లో ఆస్ట్రియా– హంగరీ సామ్రాజ్య వారసుడు ఫ్రాంక్ ఫెర్డినాండ్ హత్యతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించింది. కూటమి ధర్మంలో భాగంగా సెర్బియాకు మద్దతుగా రష్యా, ఆస్ట్రియాకు మద్దతుగా జర్మనీ యుద్ధంలో చేరాయి. జర్మన్ సైనికాధికారి ‘షెఫర్’ యుద్ధ తంత్రంలో భాగంగా తటస్థ దేశమైన బెల్జియంపై దాడి చేయాల్సి వచ్చింది. ఈ రకంగా యుద్ధం ఐరోపా మొత్తం విస్తరించింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కుదిరిన వెర్సెయిల్స్ ఒప్పందంలో భాగంగా జర్మనీపై విధించిన యుద్ధనష్ట పరిహారం, ఇతర అంశాలను అమలు చేసే యంత్రాంగం లేకపోవడం, ఆర్థిక మాంద్యం (గ్రేట్ డిప్రెషన్), పునరుత్థానం చెందుతున్న జర్మనీ/ జపాన్ వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని పునఃస్థాపించటానికి సరి హద్దుల వ్యాప్తి (లెబెన్స్రామ్), లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఫాసిజం, కమ్యూనిజం, లిబరల్ డెమోక్రసీ వంటి సిద్ధాంతాల వైరుధ్యం అగ్నికి ఆజ్యంపోశాయి.ఈ సందర్భంలో ‘తూసిడైడీస్ ట్రాప్’ సిద్ధాంతాన్ని చర్చించు కోవాలి. ప్రాచీన చరిత్రకారుడైన తూసిడైడీస్... ఒక కొత్త రాజకీయ శక్తి ఎదుగుదల ప్రస్తుత రాజకీయ శక్తిలో సందేహాన్ని, భయాన్ని కలిగించినప్పుడు... ఇరు శక్తులు ఆయుధ సమీకరణ చేస్తాయనీ, అప్పుడు యుద్ధం అనివార్యమనీ సిద్ధాంతీకరించాడు. ప్రాచీన గ్రీక్ ప్రాంతంలో ఏథెన్స్ ఎదుగుదల స్పార్టాలో భయానికి కారణమై యుద్ధానికి దారితీసింది. 2017లో రాజకీయ శాస్త్రజ్ఞుడు గ్రాహమ్ ఆలిసన్ తన ‘డెస్టైన్డ్ ఫర్ వార్: కెన్ అమెరికా అండ్ చైనా ఎస్కేప్ తూసిడైడీస్స్ ట్రాప్?’ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని విస్తృతంగా పరిశీ లించాడు. గత 500 ఏళ్ల చరిత్రలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించిన 16 సందర్భాల్లో 12 సార్లు యుద్ధం జరిగిందని పేర్కొన్నాడు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా?1914, 1939 సంవత్సరాలలో మాదిరిగానే ఇప్పుడూ ఒక కొత్త రాజకీయ శక్తి చైనా ప్రపంచ ఆధిపత్య రేసులోనికి వచ్చింది. ట్రంప్ ట్యారిఫ్ వార్లో చైనా, అమెరికాపై ప్రతిసుంకాలను విధించింది. ఇటీవల ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని జిన్పింగ్ హెచ్చరించాడు. సెమికండక్టర్స్, చిప్స్, కృత్రిమ మేధ, క్రిటికల్ మినరల్స్ రంగాలలో అమెరికాకు, ఐరోపాకు చైనా నేరుగా సవాలు విసిరింది. 2020 నుండి రష్యా తిరిగి బలం పుంజుకొని నాటో ఆధిప త్యాన్ని సవాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఐక్యరాజ్యసమితి బలహీనపడటంతో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు కూడా యుద్ధాన్ని నిలువరించే వ్యవస్థలు లేవు. కోవిడ్ అనంతరం ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగించడం, గల్ఫ్ యుద్ధం, వాతావరణ మార్పుల వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధరంగంలోనికి అణ్వస్త్రాలు వచ్చి చేరాయి. ప్రధాన రాజకీయ శక్తులన్నీ అణ్వస్త్ర దేశాలే. వీటిమధ్య ప్రత్యక్ష యుద్ధం సంభవిస్తే, పరస్పర వినాశం అనివార్యం. అందువలన ఏ అణ్వస్త్ర దేశం ఇంకో అణ్వస్త్ర దేశంపైన దాడికి సాహసించే అవకాశం లేదు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. అందువలన మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఏ రాజకీయ శక్తి కూడా ఈ దుస్సాహసానికి పాల్పడలేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు స్పష్టమైన పరస్పర, వైరుధ్య శత్రు కూటములు కూడా లేవు. కొత్త కూటములుఅయితే కూటములు ఏర్పడే అవకాశాలూ కనపడుతున్నాయి. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా (క్రింక్) ఒక కొత్త సైనిక కూట మిగా ఏర్పడి నాటోను నేరుగా సవాలు చేయవచ్చు. మక్కా ఒప్పందంతో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కొత్త సైనిక కూటమిగా ఇప్పటికే ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయాలను వెదకాల్సి వస్తుంది. బహుశా దీనికి విరుగు డుగా భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – ఇజ్రాయెల్ – జపాన్ కూటమి అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. గ్రేటర్ ఇజ్రాయెల్లో భాగంగా నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు లేదా, కనీసం జోర్డాన్ నది నుండి మద్యధరా సముద్రం వరకు ఇజ్రాయెల్ విస్తరణకు పూనుకుంటే గల్ఫ్ యుద్ధక్షేత్రం మరింత విస్తరిస్తుంది. ఇరాన్పై అమెరికా ఆర్థిక యుద్ధాన్ని తీవ్ర తరం చేస్తే నష్టపోయే చైనా... ఇరాన్కు ప్రత్యక్షంగా మద్దతు తెలప వచ్చు. దీంతో ఇరాన్... ఐరోపా దేశాలపై దాడులు చేయవచ్చు. ఇదే అదనుగా రష్యా ఇతర ఐరోపా దేశాలపై (ముఖ్యంగా బాల్టిక్ దేశాలపై) దాడులు చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవచ్చు. శత్రువును నిలువరించటానికి ఇదే అనువైన సమయంగా భావించి తైవాన్ను చైనా స్వాధీనం చేసుకోవటానికి ఉపక్రమించవచ్చు. రష్యా, చైనాలకు మద్దతుగా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దాడి ప్రారంభించవచ్చు. ఇదే అదనుగా పాక్–చైనా కలిపి భారత్పై దాడి చేయవచ్చు. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అయితే మూడవ ప్రపంచ యుద్ధం... దేశాలను, భూభాగాలను ఆక్రమించుకోవటానికి కాకుండా శత్రుదేశాల సామర్థ్యాన్ని ధ్వంసం చేసే దిశగా ఉంటుంది. నగరాలు, పౌరులు లక్ష్యంగా ఉండదు. రేవుల దిగ్బంధనం, రవాణా మార్గాల దిగ్బంధనం, ఆర్థిక విధ్వంసం, సైబర్, అంతరిక్ష దాడులు, ప్రాక్సీ వార్ఫేర్ రూపంలో ఉండవచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
విషపూరిత ఆహారానికి విరుగుడేది?
2026 ఆగస్టు 11న లోక్సభలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఒక లెక్క చెప్పింది: 2023 నుండి 2026 మధ్య దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సేకరించిన 70,652 పండ్లు, కూరగాయల నమూనా లను పరీక్షించారు. వాటిలో 2,223 నమూనాల్లో, అంటే 3.15 శాతంలో పురుగుమందుల అవశేషాలు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించిన గరిష్ఠ అవశేష పరిమితి (ఎంఆర్ఎల్– మ్యాగ్జిమమ్ రెసిడ్యూ లిమిట్) కంటే ఎక్కువగా కనిపించాయి. జాతీయ సగటుగా చూస్తే ఇది చిన్న సంఖ్యే. కానీ తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి వేరు.తెలుగు రాష్ట్రాలు ఆందోళనకరంతెలంగాణలో 8,198 నమూనాల్లో 486 నమూనాలు, అంటే 5.93 శాతం (జాతీయ స్థాయిలో మూడో స్థానం) పరిమితి దాటాయి. ఆంధ్రప్రదేశ్లో 2,104 నమూనాల్లో 134, అంటే 6.37 శాతం (జాతీయ స్థాయిలో రెండో స్థానం) పరిమితి దాటాయి. రెండూ దేశ సగటు కంటే దాదాపు రెట్టింపు. మరో విధంగా చెప్పాలంటే, దేశంలో పరిమితి దాటిన మొత్తం నమూనాల్లో దాదాపు 28 శాతం ఈ రెండు రాష్ట్రాల నుండే వచ్చాయి. కానీ పరీక్షించిన మొత్తం నమూనాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 15 శాతమే. 2004–2010 మధ్యలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో సగానికి పైగా తగ్గిన పురుగు మందుల వినియోగం అ తర్వాత విపరీతంగా పెరిగింది అని అర్థం అవుతోంది. వినియోగంతో పాటు అవశేషాలు కూడా పెరుగుతున్నాయి. మోతాదుకి మించి అవశేషాలు ఉండ టాన్ని వినియోగదారులుగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎంఆర్ఎల్ అంటే ‘సురక్షితం – అసురక్షితం’ అనే గీత కాదు. ఇక్కడో ముఖ్యమైన అపార్థం ఉంది. ఎంఆర్ఎల్ అనేది ఆరోగ్య కోణంలో ‘ఇంతకు మించితే విషం’ అనే గీత కాదు. సిఫారసు చేసిన పంటపై, సిఫారసు చేసిన మోతాదులో, సిఫారసు చేసినన్నిసార్లు మాత్రమే పిచికారీ చేసి, కోతకు ముందు నిర్ణీత విరామం పాటించి నప్పుడు పంటలో మిగిలే గరిష్ఠ అవశేషం అది. అంటే అది ముఖ్యంగా ‘మందును సరిగ్గా వాడారా?’ అని చెప్పే కొలమానం. అయితే ఇక్కడ రెండు ‘నిజాలను’ గుర్తించాలి. 1. ఎంఆర్ఎల్ దాటిందంటే ఆ కూరగాయ తినగానే హాని జరుగుతుందని కాదు. ఈ పరిమితులను చాలా కింది స్థాయిలో పెడతారు. 2. ఎంఆర్ఎల్ లోపల ఉందంటే సురక్షితమని కూడా కాదు.పంట వేరు, భోజనం వేరు ప్రయోగశాల టమాటాను విడిగా, మిర్చిని విడిగా పరీక్షిస్తుంది. కానీ ఇంట్లో మనిషి టమాటా, మిర్చి, ఆకుకూర, బియ్యం, పప్పు, పండ్లు– అన్నీ కలిపి తింటాడు. ప్రతీ పదార్థం దాని సొంత ఎంఆర్ఎల్ లోపలే ఉండవచ్చు. కానీ ఒకే మందు నాలుగైదు పదార్థాల ద్వారా శరీరంలోకి వెళ్ళవచ్చు. ప్రపంచంలో ఇందుకోసం రెండు కొలమానాలు ఉన్నాయి. మొదటిది ఏడీఐ (యాక్సెప్టబుల్ డెయిలీ ఇన్టేక్)– కిలో శరీర బరు వుకు, రోజుకు, జీవితాంతం తీసుకున్నా ఇబ్బంది లేని మోతాదు. రెండోది ఏఆర్ఎఫ్డీ (అక్యూట్ రిఫరెన్స్ డోస్)– ఒక్క పూటలో లేదా ఒక్క రోజులో తీసుకోదగిన మోతాదు. రెండూ శరీర బరువుకు అనుగుణంగా లెక్కగట్టేవి. అందుకే అదే కూర 60 కిలోల బరువున్న పెద్దవాడికంటే 15 కిలోల పిల్లవాడికి ఎక్కువ ప్రమాదం అవుతుంది. ఒకే నమూనాలో రెండు, మూడు, నాలుగు రకాల మందుల అవశేషాలు కనిపించడం అసాధారణం కాదు. ప్రతీ మందూ దాని సొంత పరిమితి లోపలే ఉండవచ్చు. కానీ ఒకే రకమైన ప్రభావం చూపే మందులు కలిసినప్పుడు మొత్తం ప్రభావం ఎంత అనేది వేరే ప్రశ్న. యూరప్ ఆహార భద్రతా సంస్థ (ఈఎఫ్ఎస్ఏ) ఈ దిశగా పని మొదలుపెట్టింది. మనం కనీసం ఏ నమూనాలో ఎన్ని మందులు కలిసి ఉన్నాయో నమోదు చేసి, ప్రచురించడం నుండి మొదలుపెట్టాలి.ఎంఆర్ఎల్ దాటడం అనేది కేవలం ప్రయోగశాల ఫలితం కాదు– అది పొలంలో జరిగిన దాని సంకేతం. కారణాలు రైతులకు కొత్తవేమీ కాదు: ఆ పంటకు అనుమతి లేని మందు వాడకం,లేబుల్ కంటే ఎక్కువ మోతాదు, అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ పిచికారీ, మూడు నాలుగు మందుల అనవసర మిశ్రమాలు, పురుగు కనిపించకపోయినా క్యాలెండర్ ప్రకారం పిచికారీ, పంట కోత విరామం పాటించకపోవడం, పిచికారీ చేసిన వెంటనే కోయడం. మిర్చి, టమాటా, బెండ, వంకాయ, ద్రాక్ష– తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగేవి, ఎక్కువ పిచికారీలు అవసరమయ్యేవి. అయితే గణాంకాల నుండి కారణం ఏదని నేరుగా చెప్పలేం. అది పొలాల్లో విచారణ చేసినప్పుడే తెలుస్తుంది.ఒక సంగతి: ఈ పట్టికను రాష్ట్రాల ర్యాంకింగ్గా చదవకూడదు. ఛత్తీస్గఢ్లో పరీక్షించినవి 29 నమూనాలే; ఒక్కటీ పరిమితి దాట లేదు. అయినా అక్కడ సమస్య లేదని అర్థం కాదు. ఎక్కడ సేకరించారు, ఏ పంటలు, ఏ కాలంలో, ఎన్ని మందుల కోసం చూశారు– ఇవన్నీ సంఖ్యను మార్చేస్తాయి.కూరగాయలు మానేయకండి!చివరగా ఒక ముఖ్యమైన మాట: ఈ కథనం చదివి కూర గాయలు, పండ్లు తినడం తగ్గించవద్దు. ఐసీఎంఆర్– జాతీయ పోషకాహార సంస్థ రోజుకు 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు తినాలని సిఫారసు చేస్తోంది. మనం అంతకంటే చాలా తక్కువ తింటున్నాం. కూరగాయలు తక్కువ తినడం వల్ల కలిగే గుండె, మధుమేహ, క్యాన్సర్ ముప్పు... అవశేషాల ముప్పు కంటే చాలా పెద్దది. కడగడం, తొక్క తీయడం, వండటం వంటివి అవశేషాలను గణనీయంగా తగ్గిస్తాయి. కానీ మొత్తం బాధ్యతను వినియోగ దారుడిపై నెట్టడం సరైనది కాదు. అవశేషం పుట్టేది ఇంట్లో కాదు, పొలంలో. అందుకే పరిష్కారం అక్కడే జరగాలి. పురుగుమందుల అవసరం తగ్గించడమే సమస్యకు అసలైన పరిష్కారం. ఎర పంటలు వేయడం, ఫెరమోన్ ట్రాప్లు పెట్టడం, మిత్రపురుగుల పరిరక్షణ, పంట వైవిధ్యం, ఆర్థిక నష్టస్థాయి దాటినప్పుడే చర్య తీసుకోవడం, రైతు క్షేత్ర పాఠశాలల ఏర్పాటు వంటివి అవసరం. తెలుగు రాష్ట్రాలకు ఈ అనుభవం ఇప్పటికే ఉంది.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
కష్టాల కావడి మోస్తున్న కౌలురైతు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని బతికిస్తున్న కౌలురైతుల బతుకులు దుర్భరమవుతున్నాయి. సొంతగా భూమి సాగుచేసే రైతు కన్నా ఇతరుల భూమి కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వ పథకాలు, విత్తన–ఎరువుల సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, నష్టపరిహారాలు, రుణమాఫీలు, మద్దతు ధర, బోనస్.... ఇటువంటివేవీ నేరుగా కౌలురైతులకు అందటం లేదు. ఎన్నికల హామీలతో ఊదరగొట్టి గద్దెనెక్కిన పార్టీలు, కౌలు రైతాంగానికిచ్చిన మాట తప్పిన ఫలితమే ఈ దుఃస్థితి!పెద్ద ఎత్తున ప్రజాధనం వెచ్చించి వ్యవసాయానికి మద్దతుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధి కౌలురైతులకు అందడం లేదు. నిజానికి క్షేత్రంలో ఉండి, పెట్టుబడి పెట్టి, పరి స్థితుల్ని ఎదుర్కొని సాగుచేసేది కౌలు రైతు. కానీ, వారిని గుర్తించి, ఆ మేరకు ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వాలు జంకుతున్నాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి! అన్ని బాధలూ వారివే! సర్కారు లెక్కల ప్రకారం తెలంగాణలో కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉంది. చిన్న, మధ్యతరహా, పెద్ద...అంతా కలిపి సుమారు 70 లక్షల మంది రైతులుగా నమోదై పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్నారు. వారంతా రైతు భరోసా (ఇదివరకటి రైతుబంధు) లబ్ధిదారులు. అందులోనే కొందరు, తమ భూమికి తోడు ఇతరుల భూమి తీసుకొని కౌలు చేస్తున్నారు. మరికొందరు, సొంత భూమే లేకున్నా ఇతరుల భూమి కౌలుకు చేస్తున్నారు. తెలంగాణలో 36 శాతం మంది కౌలురైతులున్నట్టు 2022లో ‘రైతు స్వరాజ్య వేదిక’ (ఆరెస్వీ) జరిపిన సర్వే లెక్కలు చెబుతున్నాయి. సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, రుణమాఫీ లబ్ధి, రైతు భరోసా, పంట బీమా/పంట నష్ట పరిహారం, మద్దతు ధర, అదనపు బోనస్... ఇటువంటి ప్రయో జనం ఏదీ నేరుగా కౌలురైతుకు అందటం లేదు. ప్రభుత్వం, అనుబంధ విభాగాలు వ్యవసాయ రంగంలో ఆధు నిక సాంకేతికతను వినియోగించడం మొదలెట్టాక ‘యాప్’లతో భూయజమానుల మొబైల్, పాస్పుస్తకాలు లింక్ చేయడం, ‘ఓటీపీ’లు వారికే రావడం, ఎరువుల సమాచారమైనా, ధాన్యం విక్రయ వివరాలైనా నేరుగా వారి మొబైల్కు, బ్యాంకు ఖాతాలకే చేరుతోంది. కౌలు డబ్బు, పెట్టుబడి వ్యయం పెరిగి, మద్దతు ధర కూడా లభించక కౌలురైతు రెండింతలు నష్టపోతున్నాడు. ప్రభుత్వ సహాయమూ అందక మూడు రకాల భారం మోయాల్సివస్తోంది.కష్టాన్ని కళ్లకు కడుతున్న సర్వేలుతెలంగాణ గ్రామీణ జనాభాలో దాదాపు సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ముఖ్యంగా వెనుకబడిన, దళిత, మైనారిటీ, గిరిజన వర్గాలవారిలో అత్యధికులకు భూమి లేదు, ఉన్నా ఒకటీ, అర ఎకరాలు మాత్రమే! ఇటీవల ‘కౌలురైతుల గుర్తింపు సాధన కమిటి’ వారు కూడా తెలంగాణలో సర్వే నిర్వహించారు. 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాల్లోని 1,836 మంది కౌలు రైతులను ‘ప్రాతినిధ్య నమూనా’లుగా ఎంపిక చేశారు. ప్రధానంగా వ్యక్తి గత ఇంటర్వ్యూ పద్ధతిలో సమాచారం రాబట్టారు. ఏపీలో ‘ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం’తో కలిసి ‘పీపుల్స్ పల్స్’ సర్వే నిర్వహించింది. మొత్తం 26 జిల్లాల్లో జిల్లాకు సగటున 100 నుంచి 125 ‘నమూనా’ల చొప్పున మొత్తం 3000 శాంపిల్స్తో నెల రోజుల పాటు ఈ సర్వే జరిగింది. కౌలురైతులకు ఏపీలో అరకొరగా గుర్తింపుకార్డు లిచ్చారు. 12.3 శాతం మంది తమకు లభించాయని చెబితే, కార్డు లేవీ అందలేదని 87.7 శాతం మంది వెల్లడించారు. 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారే ఏపీలో కౌలురైతులు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు అసాధారణంగా పెరిగాయని 67.2 శాతం రైతులు చెబితే, కౌలు డబ్బు/ధాన్యం పెరగటం వల్ల ఇబ్బందులని 12.5 శాతం మంది, గిట్టుబాటు ధరలు లేక కష్టాలు పెరిగాయిని 10.8 శాతం మంది, అధిక వడ్డీల ప్రయి వేటు అప్పుల భారమనీ, మార్కెట్ సమస్యలనీ మరో పది శాతం మంది చెప్పారు. కొన్ని చోట్ల కౌలు రేట్లు యేటా ఎకరాకు 53 వేల రూపాయల వరకు చేరాయని, సగటున 14,936గా చెల్లిస్తున్నామని తెలంగాణ కౌలురైతులు చెప్పారు. చిన్న కమతాల్లో కౌలు గిట్టుబాటు కాక ఎక్కువ ఎకరాల్లో కౌలు చేయాల్సి వస్తోందని, ఇదివరకు సగటున రైతుకు 5 ఎకరాలున్న కౌలుసాగు ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగిందని వారంటున్నారు. 5కు పైగా ఎకరాలు కౌలుసాగు చేస్తున్న రైతుల సంఖ్య 31 నుంచి 42 శాతానికి పెరిగింది. మాట తప్పిన ‘రాజకీయాలు’కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి, అన్ని సంక్షేమ పథకాలతో పాటు బీమాను వారికే వర్తింపజేస్తామని ఏపీలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ‘ప్రజాగళం’ పేరిట ప్రకటించిన ఎన్నికల మాని ఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు కౌలు రైతు లకు ప్రత్యేకచట్టం తెస్తామన్న మాట కూడా గాలికిపోయింది. కూటమి భాగస్వామి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (జనసేన) ఎన్నికల ముందు ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ... ఎక్కడి కక్కడ కౌలురైతుల సమావేశాలు పెట్టి, వారికి ఆర్థిక సహాయం అందించి నానా హడావుడి చేశారు. ఇప్పుడు కిమ్మనటం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలురైతుల పట్ల కక్ష కట్టినట్టే వ్యవహరించింది. 2016 వరకు తెలంగాణలోని రెవెన్యూ రికార్డుల్లో ప్రతిసీజన్ భూయజమానితో పాటు వాస్తవ సాగులో ఉన్న (కౌలు రైతు) పేరు విడిగా నమోదు చేసే అవకాశం ఉండేది. అలా నమోదు కోసం ఉన్న సాగు కాలమ్ను 2017లో ఒక చట్ట సవరణ ద్వారా తొలగించింది. కౌలురైతుల్ని గుర్తించడానికి, వారికి గుర్తింపు కార్డుల ద్వారా ఎంతోకొంత ప్రయో జనం కల్పించడానికి వీలు కల్పించే ‘భూ అధీకృత సాగుదారుల చట్టం–2011’ అమలును 2015 నుంచి దాదాపు నిలిపివేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘2023 సెప్టెంబర్’లో కౌలురైతు లకు బహిరంగ లేఖ రాస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందనీ, తాము అధికారంలోకి రాగానే 2011 చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అన్ని ప్రభుత్వ పథ కాలు వారికి వర్తించేలా చర్యలు తీసుకుంటామనీ పేర్కొన్నారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు దాటినా నేటికి అతీగతీ లేదు. ఏ రకంగా చూసినా కౌలురైతు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నష్టపోతున్నాడు. రెండింతల కష్టాల కావడి మోస్తున్నాడు.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
జపాన్ అణ్వస్త్ర డైలమా
కొన్ని విషయాలు వినేందుకు విచిత్రంగా తోస్తాయి. ప్రపంచంలో అణ్వస్త్రాలంటూ తయారైన తర్వాత వాటి దాడికి 1945లో మొట్టమొదట గురైన దేశం జపాన్. అప్పటినుంచి 81 సంవత్సరాలు గడిచినా మరెవరూ ఎవరిపై ఆ దాడులు చేయ లేదు. అనగా ఆ ఊహాతీత వినాశనానికి గురైన ఏకైక దేశం జపాన్. ఆ దుష్ఫలితాలను వారు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఇటీవల తాము కూడా అణ్వాయుధాలు తయారు చేయాలా, లేదా కనీసం తమ దేశంలో అణ్వస్త్ర స్థావరాల ఏర్పాటుకు అనుమతించాలా అనే చర్చ జరుగుతున్నది.ఇప్పటికే వ్యతిరేకతే1945 ఆగస్టు నెలలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వస్త్రాలను ప్రయోగించింది. ఆ సందర్భంగా ఆ రెండు నగరాలలో అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యాన ప్రతి సంవ త్సరం విస్తృత స్థాయిలో సంతాప సభలు జరిగినట్లే ఈసారి కూడా 81వ సంవత్సర సభలు జరిగాయి. మునిసిపల్ మేయర్ల అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమాలలో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ కూడా సభికులలో ఒకరిగా కూర్చుని పాల్గొన్నారు. అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా రెండు నగరాల మేయర్లు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జపాన్ నగరాలన్నిటా భారీ ప్రదర్శనలు జరిగాయి. దేశ వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రజాభిప్రాయ సేకరణలలో సగటున 70 శాతానికి పైగా ప్రజలు అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఓటు చేయగా, మరొక 10 శాతం వరకు తటస్థంగా ఉండిపోయారు.దీనంతటి మధ్య గమనించదగినదేమంటే, 1971 నాటి అణ్వస్త్ర విధానాన్ని తీవ్ర మితవాద తకాయిచీ ప్రభుత్వం అధికారికంగానైతే ఏమీ మార్చలేదు. కానీ దానిని సవరించాలంటూ జరుగుతున్న చర్చను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నది. అప్పటి విధానం ప్రకారం జపాన్ స్వయంగా అణ్వాయుధాలను తయారు చేయ రాదు, ఇతర దేశాల నుంచి స్వీకరించి నిల్వ చేయరాదు, ఇతరులు తమ అణ్వాస్త్రాలను జపాన్ భూభాగంపై మోహరించేందుకు అంగీ కరించరాదు. ఇపుడు జరుగుతున్న చర్చ ఇందులో మొదటి రెండు నిబంధనలు యథాతథంగా కొనసాగాలనీ, మూడవ దానిని మాత్రం సడలించాలనే ధోరణిలో సాగుతున్నది. అనగా జపాన్లో ఇతర దేశాల అణుస్థావరాలకు అవకాశం ఇవ్వటం. ఇతర దేశాల న్నవి తమపై 1945లో అణుదాడి చేసిన అమెరికాయే అవుతుందని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే పూర్తిస్థాయి రక్షణ ఒప్పందం ఉంది. జపాన్కు అణ్వస్త్ర స్థాయి రక్షణ కల్పించటం అందులోని అంశాలలో ఒకటి. జపాన్లోని ఒకినావా దీవిపై గల విస్తారమైన రక్షణ స్థావరాలు గాక దేశవ్యాప్తంగా 80కి పైగా సైనిక సదుపాయాలున్నాయి. పసిఫిక్ ప్రాంతంలో ఇరువురి ప్రయోజ నాలు, వ్యూహాలు ఒకటే. ఇటువంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నపుడు, జపాన్కు స్వయంగా అణ్వస్త్రాలు ఉత్పత్తి చేసుకోవలసిన అవసరం ఏమిటి? లేదా ఇతరుల అణ్వస్త్ర స్థావరాలకు చోటివ్వటం ఏమిటి?మారుతున్న అమెరికా వైఖరిమొదట ఒక మాటగా అనుకోవాలంటే, పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాలు మారు తున్నాయనే అంచనా. చైనాను ప్రపంచంలో తమ పోటీదారు, పసిఫిక్ ప్రాంతంలో తమకు సవాలు అంటూ వచ్చిన అమెరికా, ఇటీవల జి–2 ఫ్రేమ్వర్క్ పద్ధతిలో వారితో సహకారానికి సిద్ధ పడటం. ఇదే సంవత్సరం ఆరంభంలో ‘ఇండో–పసిఫిక్ వ్యూహ పత్రం’ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం, పసిఫిక్ నుంచి ఉపసంహరించుకున్నట్లయితే ప్రకటించలేదుగానీ (ఆ పని ఎన్నటికీ చేయరు), ఆ ప్రాంతంలోని తమ మిత్ర దేశాలు ఇక నుంచి తమ రక్షణ భారాన్ని చాలావరకు తామే మోయాలని స్పష్టం చేసింది. ఇదిగాక, దక్షిణ కొరియాను ఉపేక్షించి ఉత్తర కొరియాతో మైత్రికి ప్రయత్నించటం, జపాన్పై రకరకాల ఒత్తిడులు సృష్టించటం వంటివి జరుగుతున్నాయి.ట్రంప్ ఇదే విధంగా ఇచ్చిన స్పష్టతలతో యూరప్పై ఒత్తిడులు పెరిగినట్లు, పసిఫిక్ ప్రాంతంలోనూ అదే జరుగుతున్నది. దానితో ఇదే సంవత్సరం నుంచి అందరూ రక్షణ బడ్జెట్లు పెంచుతున్నారు. ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇది ప్రధా నంగా చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో ముప్పు ఉందనుకునే దేశాల నుంచి కనిపిస్తున్నది. గమనించదగినదేమంటే దీనంతటికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటూ తీవ్రస్థాయిలో మాట్లాడుతున్నది జపాన్ ప్రభుత్వం. చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో సరిహద్దు వివాదాలు మరికొన్ని దేశాలకు కూడా చిరకాలంగా ఉన్నాయి. అదే విధంగా ఆ సముద్ర ప్రాంతం నుంచి స్వేచ్ఛా నౌకా యాన సమస్యలు. కానీ అక్కడినుంచి పూర్తిగా తూర్పున గల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల వరకు ఏదో ఒక మేరకు సామరస్యత చూపుతూ ఆర్థిక సంబంధాలకు ప్రాధాన్యతనిస్తుండగా, జపాన్ నుంచి భిన్న ధోరణి కనిపిస్తున్నది.తైవాన్పై వైఖరిలో దూకుడునిరుడు అక్టోబర్లో ప్రధానిగా ఎన్నికైన తకాయిచీ నవంబర్లో పార్లమెంట్లో మాట్లాడుతూ, ఒకవేళ చైనా సైన్యం తైవాన్ను ఆక్ర మించుకొనజూసినట్లయితే, అందువల్ల జపాన్ ఉనికికి ప్రమాదం వాటిల్లగలదు గనుక తాము కూడా ఆ యుద్ధంలో పాల్గొనవలసి రావచ్చునని అన్నారు. దానితో ఒక్కసారిగా పరిస్థితి వికటించింది. ఆ ప్రకటనలోని ప్రమాదాన్ని గుర్తించిన ట్రంప్ హెచ్చరించిన మీదట తకాయిచీ మౌనం వహించటమైతే చేశారుగానీ, చైనా డిమాండ్ చేసినట్లు తన ప్రకటనను ఉపసంహరించుకోలేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తైవాన్ చైనాలో అంతర్భాగ మని ఐక్యరాజ్యసమితితో పాటు అత్యధిక దేశాలు గుర్తిస్తున్నాయి. వాటిలో జపాన్ కూడా ఉంది. తైవాన్ చైనాలో శాంతియుతంగా విలీనమవుతుందా, బలప్రయోగం ద్వారానా అన్నది వేరే విషయం. కానీ అసలు ఆ విలీనం విషయంలో జపాన్కుగానీ, మరొకరికిగానీ పాత్ర ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఆ విలీనం సైనికంగా జరిగినా తైవాన్ నుంచి 100 కిలోమీటర్లకు పైగా దూరంలో గల జపాన్ ఉనికికి ముప్పు కలగడమేమిటి? విలీనాలు శాంతియుతంగా జరగాలని కోరటానికీ, ఇటువంటి వైఖరి తీసుకోవటానికీ తేడా ఉంటుంది. అందుకు కారణం తకాయిచీ పూర్తి కన్సర్వేటివ్ కావటంతోపాటు, తైవాన్ కొంతకాలం తమ ఆక్రమణలో ఉండటం, అమెరికా వ్యూహంలో భాగం కావటమనే అభిప్రాయం ఉంది.సమస్య ఈ విధంగా మొదలై ఇపుడు జపాన్ అణ్వస్త్రాల గురించి ఆలోచించే వరకు వచ్చింది. తైవాన్, చైనా ఒకటేనని స్వయంగా తైవాన్ కూడా సూత్ర రీత్యా అంగీకరించటం మరొక విశేషం. తమకు స్వాతంత్య్రం కావాలనే వర్గం ఒకటి అక్కడ ఉన్నా, వద్దనే వర్గం కూడా ఉంది. ఎప్పటికైనా, ఏదో విధంగా విలీనం చేసు కోగలమని చైనా కృతనిశ్చయంతో చెప్తున్నది. ట్రంప్ ఈ సంవత్సరం మే నెలలో చైనాకు వెళ్లినపుడు తనకు ఆ మాట అర్థమైనట్లే రాజీ ధోరణిలో వ్యాఖ్యానించారు. అటువంటి స్థితిలో, చైనాను తాము సైనికంగా నిలువరించగలమని జపాన్ ప్రధాని నిజంగానే నమ్ము తున్నారా? 1945 తర్వాత 81 ఏళ్లకు జపాన్ ప్రధాని ఆ వినాశనాన్ని మరచి అక్కరలేని అణ్వస్త్ర డైలమాను సృష్టించుకొని ఉండవచ్చు. జపాన్ ప్రజల వ్యతిరేకత మాత్రం సంతృప్తిని కలిగిస్తోంది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అప్రమత్తతతో కూడిన 'ఆశావాదం అవసరం'
అభినందనలు. మీరు సాధించారు! మీలో చాలామంది ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నారు. కానీ కొందరి ప్రణాళికలు తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ నియంత్రణలో లేని పరిస్థితులు అందుకు కారణం కావచ్చు, ఉద్యోగ మార్కెట్లో వచ్చిన మార్పులు, టెక్నా లజీ వంటి పరిస్థితులు కొందరి ఆశలను దెబ్బతీసే ఆస్కారం ఉంది. మీ ఆశలు దెబ్బతిన్నట్లయితే... మీరు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇలాంటి సమయంలో నేను ‘అనుకోని అవకాశాల కోసం పక్క చూపు’ అనే ఆలోచనను మీకు సూచిస్తున్నాను.‘పెరిఫెరల్ విజన్’ అంటే ఏమిటి?మీ ప్రస్తుత కెరీర్ మార్గంపై దృష్టి పెట్టండి. అయితే మీ సమయం మొత్తాన్ని దానికే కేటాయించకండి. మీ సమయంలో 10 నుంచి 15 శాతం ఇతర రంగాలను పరిశీలించడానికి కేటాయించండి. మీ ప్రధాన రంగానికి పక్కన ఉన్న ఇతర రంగాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలను గమనిస్తూ ఉండండి. అలా మీ ‘పక్క చూపు’తో మీరు ఎవరూ ఊహించని కొత్త అవకాశాలను గుర్తించవచ్చు. అదే పెరిఫెరల్ విజన్! అది మీరు ఎప్పుడూ ఊహించని ఒక కొత్త, ఆనందకరమైన కెరీర్ మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు. 1969లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత ఫ్రాన్స్ కార్డోవా జర్నలిజం రంగంలోకి వెళ్లారు. లాస్ ఏంజెల్స్ టైమ్స్లో జర్నలిస్టుగా పనిచేశారు. అదే ఆమెకు నచ్చిన కెరీర్ మార్గం. కానీ ఆమె ‘పక్క చూపు’లో ఒక రోజు నక్షత్రాల గురించి ఒక డాక్యుమెంటరీ చూసింది. భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి పెంచుకుంది. ఆమెకు అప్పటికీ ఫిజిక్స్లో ఉన్నత విద్య చదవడానికి అవసరమైన సంసిద్ధత దాదాపు లేదు. అయినా కాల్టెక్ కమ్యూనిటీ నుంచి లభించిన సహకారంతో ఇంగ్లిష్ చదివిన విద్యార్థి నుంచి ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా మారే మార్గాన్ని స్వయంగా నిర్మించుకున్నారు. 1979లో కాల్టెక్ నుంచి ఫిజిక్స్లో పీహెచ్డీ పొందారు. ఆ తర్వాత ఒక అనుకోని అవకాశం నుంచి మరొక అవకాశానికి ప్రయాణిస్తూ... ఖగోళ శాస్త్ర విభాగాధిపతిగా, నాసాలో మొదటి మహిళా మరియు అతి పిన్న వయస్కురాలైన చీఫ్ సైంటిస్ట్గా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్గా ఎదిగారు. నా జీవితంలో కూడా దాదాపు అలాంటిదే జరిగింది. నాకు లిగో(ఎల్ఐజీఓ–లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్–వేవ్ అబ్జర్వేటరీ) ప్రాజెక్ట్ ఒక అనుకోని అవకాశం. విశ్వంలో గురుత్వా కర్షణ తరంగాలను గుర్తించడానికి లిగో ప్రాజెక్ట్ను ప్రారంభించి నప్పుడు సాంకేతిక, రాజకీయ, సామాజిక సవాళ్లు ఎన్నో ఉన్నాయి. అయినా మేము విజయం సాధిస్తామని నమ్మాం. అదే సమయంలో ఏ సమస్యలు మన ప్రయాణాన్ని ఆపగలవో ముందుగానే గుర్తించాం. ప్రతి సమస్యను పెద్ద అడ్డంకిగా మారకముందే పరిష్కరించడానికి ప్రయత్నించాం. ఆ విధానం విజయవంతమైంది. దీన్నే నేను ‘అప్రమత్తతతో కూడిన ఆశావాదం’ అంటాను. ‘ఇంటర్స్టెల్లార్’ ఎలా వచ్చింది?1979లో నేను దక్షిణ కాలిఫోర్నియాలో ఒంటరిగా ఉన్నాను. నా ‘పక్క చూపు’ను విస్తరించడానికి హాలీవుడ్లో డేటింగ్ కూడా చేశాను! లిండా అబ్బాట్ అనే భవిష్యత్తులో ప్రముఖ సినిమా నిర్మాతతో నాకు పరిచయం ఏర్పడింది. ఆమె ఉత్సాహభరితమైన మహిళ; నేను మాత్రం పుస్తకాల పురుగు లాంటివాడిని. అయినా మేము స్నేహితులుగా కొనసాగాం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె ఒక సినిమా కోసం నాతో ఆలోచనలు పంచు కోవాలనుకుంది. నేను ఆ అనుకోని అవకాశాన్ని వెంటనే అంది పుచ్చుకున్నాను. తర్వాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చేతుల్లో ఆ ప్రాజెక్ట్ ‘ఇంటర్స్టెల్లార్ ’ అనే ప్రసిద్ధ చిత్రంగా మారింది. ఇంటర్స్టెల్లార్ సినిమా నా కెరీర్ను పూర్తిగా మార్చింది. దాదాపు అర్ధ శతాబ్దం పాటు కాల్టెక్ ప్రొఫె సర్గా ఉన్న నేను... ఆ తర్వాత నా జీవితంలోని తదుపరి దశను సైన్స్, కళల కలయికలో పనిచేయడానికి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి ప్రాజెక్టులు నాకు కొత్త ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా యువతకు సైన్స్పై ఆసక్తిని కలిగిస్తాయి. నేను భవిష్యత్తు గురించి ఆశావాదంగా ఉంటాను. నేను 100 సంవత్సరాల వయసు వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తూ, మానసికంగా బలంగా ఉండి, నా ప్రాజెక్టులను కొనసాగించగలనని ఆశిస్తున్నాను. కానీ రోజువారీ జీవితంలో నేను జాగ్రత్తగా ఉంటాను. నా ఆరోగ్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనిస్తాను.ఇప్పుడు మన ముందున్న ‘ఏనుగు’– ఏఐఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద విషయంపై మాట్లాడాలి. ఆ ‘ఏనుగు’ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ. నేను ఏఐ నిపుణుడిని కాదు. కానీ ఏఐ సంక్లిష్టమైన విషయం. కొన్ని రంగాల్లో దాని సామర్థ్యం అద్భుతంగా ఉంది. ఏఐ అభివృద్ధిని ఈరోజే పూర్తిగా ఆపేసి, ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం ఉపయోగిస్తే, మనలో చాలా మంది దాన్ని త్వరగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. మనలో అనేక మందిని భయపెడు తున్నది ఏఐ ఉనికి కాదు, ఏఐ వేగంగా మారిపోతుండటమే మనల్ని ఆందోళనకు గురిచేస్తోంది.మీరు వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాల్లో కెరీర్ ఎంచుకుంటే.. వేగంగా మారడం నేర్చుకోవాలి. అందుకు ముఖ్య మైన మార్గం... స్వీయ అభ్యాసం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాన్ని ఉపయోగించడం మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఏఐ, క్రిస్పర్, ఎంఆర్ఎన్ఏ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. నిపుణులు కూడా ‘మాకు తెలి యదు’ అని చెబుతున్నారు. కొంతమంది భవిష్యత్తు గురించి చాలా నిరాశావాదంగా మాట్లాడుతున్నారు. కానీ నేను నిరాశావాదిని కాదు. ఏఐ, ఇతర వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల దీర్ఘకాల భవిష్యత్తును చూస్తున్నప్పుడు కూడా నేను ‘జాగ్రత్తతో కూడిన ఆశావాదం’నే పాటిస్తాను.ఏఐ వల్ల మనుషులు ఒకరికి ఒకరు దూరమవుతారని కొందరు భయపడుతున్నారు. అలా జరగదని ఆశిద్దాం. భవిష్యత్తులో మనం మరింత బలమైన, అభివృద్ధి చెందిన, నైతిక విలువలు కలిగిన మానవ సమాజంగా ఎదుగుతామని ఆశిద్దాం. మన అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ప్రతి మనిషి, ఇతర మనుషులను గౌరవించే సమాజంగా మనం ఉండాలి. మనిషి–మనిషి సంబంధాలు మన ఆనందానికి, ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కేంద్రంగా ఉండాలి. ఆశావాదంతో పాటు జాగ్రత్త కూడా అవసరం. దీర్ఘకాల భవిష్యత్తుపై ఆశావాదంగా ఉండండి. కానీ రోజువారీ జీవితంలో అప్రమత్తంగా ఉండండి. మన ఆశావాద లక్ష్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనించండి. ఆ ప్రమాదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించండి. -
అమిత్ షా (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఎండన పడి వచ్చిన వాళ్లకే కాదు, ఏ వేళన పడిలేస్తూ వచ్చిన వారికైనా ఎదురెళ్లి మంచినీళ్ల గ్లాసును చేతికి అందించటం భారతీయ సంస్కృతికే ప్రత్యేకమైన ఒక గొప్ప ఆతిథ్యం. నేను గుజరాతీని కాబట్టి, ఒకవేళ ఎవరైనా నాకు – ముఖ్యంగా ఆదివారం ఉదయం – అల్పాహారంగా తియ్యటి రసం ఊరే వేడి వేడి జిలేబీలను, వాటి అనంతరం కారం కారంగా కరకరలాడుతుండే ఫాఫ్డాను; మధ్యాహ్నం భోజనంలోకి రొట్టెలు, అన్నం లేదా పెసర పప్పు కిచిడీని; సాయంత్రపు స్వల్పాహారంగా ఆవిరిపై ఉడికించి, ఆవాలు, పచ్చిమిర్చి తాలింపుతో మెత్తటి స్పాంజీలా చేసిన ఢోక్లాను... నాకోసం సిద్ధం చేయటమన్నది కూడా ఒక గొప్ప ఆతిథ్యం కంటే తక్కువేమీ కానప్పటికీ... వాళ్లు అందించిన మంచి నీళ్ల గ్లాసుకే మొదట నేను రుణపడి ఉంటాను. సిలిగురిలో గత మూడు రోజులూ మహానంద నది నీళ్లే నా అమృతాహారం. ఢిల్లీలో ఈ రోజు గంగా జల వరప్రసాదం. రేపు మరొక నది కావచ్చు. ఆ మరునాడు ఇంకొక నది. ప్రాంతాలు ఏవైనా ‘జల’సత్వం ఒక్కటే. గురువారం, ఐదు దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి మహాబలిపురం వెళ్లినప్పుడు... బహుశా అక్కడ నేను కృష్ణ లేదా కావేరీ నీళ్లు తాగి ఉంటాను. మీటింగ్కి, ఆ తర్వాత లంచ్కి ఏర్పాటు చేసిన నీళ్ల బాటిళ్లు చెన్నైలోని కృష్ణా, కావేరీ పైపుల నుంచి పట్టితెచ్చినవై ఉండాలి. ‘‘అమిత్ జీ, మీకోసం మా తమిళ వంటకాలను ఇంట్లో చేయించి తెచ్చాను’’ అన్నారు సీఎం విజయ్, లంచ్ మీట్లో! నదుల మధ్య రాష్ట్రాలకు సరిహద్దులు ఉంటే ఉండొచ్చు. నదీ జలాలు వంటగదులలో ఆ హద్దులను చెరిపేస్తాయి! భోజనం బల్ల ముందు కూర్చున్నంత సేపూ నేను గుజరాతీనిగానీ, ఢిల్లీవాలానుగానీ కాకుండా పూర్తిగా తమిళ ఆహారిని అయిపోయాను. విజయ్ తనే స్వయంగా అందరికీ వడ్డించడం మొదలు పెట్టారు! తక్కిన నలుగురు ముఖ్యమంత్రులు కూడా ఒకరికి ఒకరు పాత్రలు అందించుకుంటున్నారు. పక్కన ఉన్నవారి గాజు గ్లాసులలో ఖాళీ అయిన మేరకు నీళ్లను నింపుతున్నారు. ‘‘మరికాస్త తినండి’’ అని గిన్నెలను ముందుకు జరుపుతున్నారు. ఇది కదా సమైక్య దేశం! ఇదే కదా భిన్నత్వంలో ఏకత్వం! కానీ, భోజనానికి ముందు జరిగిన కీలకమైన సమావేశంలో ఆ ఐదుగురు ముఖ్యమంత్రులు, నీళ్లలో తమ వాటా కోసం పట్టుపట్టిన వాళ్లే! ఒకరి గొంతు ఒకరు పట్టుకున్నవారే. కావేరి నదిపై మేకేదాటు జలాశయ నిర్మాణానికి కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి. కావేరి నది నుండి న్యాయంగా తమకు రావలసిన నీటి వాటాను విడుదల చేయాలని, ఎగువన కొత్త డ్యామ్ల నిర్మాణాలను ఆపాలని తమిళనాడు ముఖ్యమంత్రి.గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కృష్ణా జలాల ట్రిబ్యునల్ పరిధిలో తమ రాష్ట్రానికి రావలసిన నీటి వాటాను చట్టబద్ధంగా త్వరగా ఖరారు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. కేరళ ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ముల్లపెరియార్ వద్ద కొత్త డ్యామ్ నిర్మించ డానికి తమిళనాడు, కేంద్రం అంగీకరించాలని కేరళం ముఖ్యమంత్రి. మీటింగ్కి, ఆ తర్వాతి డిన్నర్ మీటింగ్కి మధ్య ఎంత వ్యత్యాసం! ఎంత వైరుధ్యం?!మీటింగ్లో ‘‘మా నీళ్లు మాక్కావాలి’’ అని అడిగినవాళ్లు... డిన్నర్ మీటింగ్లో ఒకరికి ఒకరు నీళ్లందించుకున్నారు! మీటింగ్ అయ్యాక, సిలిగురి బయల్దేరే ముందు – ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల వివాదాలకు మహాబలిపురంలో నాకు పరిష్కారం కనిపించింది! నీళ్లు ఇస్తే తప్ప, నీళ్లు తీసుకుంటే తీరేది కాదు నీళ్ల సమస్య! -
చైనాతో సంబంధాలు మెరుగయ్యేనా?
వచ్చే నెల సెప్టెంబర్లో భారత్లో జరుగనున్న బ్రిక్స్ దేశాధినేతల సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరవుతాడా అని విశ్లేషకులు ఆసక్తితో ఎదురు చూస్తు న్నారు. భారత్–చైనా దేశాధినేతల భేటీ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలకు దిశానిర్దేశం జరుగుతుందని జియో పొలిటికల్ సర్కిల్స్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. భారత్–చైనా సంబంధాలలో స్థిరత్వం ఆసియా ఖండానికే కాకుండా ప్రపంచ శాంతికి కూడా కీలకం. 2020 గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో సుమారు నాలుగు సంవ త్సరాలు సంబంధాలలో స్తబ్ధత చోటు చేసుకున్నది. 2024లో రష్యాలో కజాన్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ–జిన్పింగ్ సమావేశం, సరిహద్దు గస్తీ ఒప్పందం ఇరుదేశాల సంబంధాలలో ఘర్షణను కొంతవరకు తగ్గించాయి. కానీ మొత్తంగా సంబంధాలు సాధారణ స్థితికి చేరటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 1962 యుద్ధం తరువాత 1988లో రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటనతో మళ్లీ రెండు దేశాల సంబంధాలు గాడిన పడ్డాయి. 44 సంవత్సరాల తరువాత 2006లో నాథూ లా కనుమ మళ్లీ తెరుచు కున్నది. కానీ ఇరుదేశాల మధ్య పీటముడిలా ఉన్న సరిహద్దు సమస్యకు పరిష్కారం సమీప భవిష్యత్తులో లేనట్లే లెక్క.అయినా... వాణిజ్యం పెరిగింది!సరిహద్దు సమస్య సంక్లిష్టత నేపథ్యంలో ఇరు దేశాలు వాస్తవిక దృష్టితో గత రెండు దశాబ్దాలుగా వ్యాపార–వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టాయి. 2000 సంవత్సరంలో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం, 2025కల్లా 128 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గత 25 సంవత్సరాలలో సరిహద్దుల మీద ఎన్ని ఘర్షణలు చోటు చేసుకున్నా అవి ఇరు దేశాల వాణిజ్యానికి నష్టం కలిగించలేదు. కానీ జూన్ 2020 గల్వాన్ దుస్సాహసం రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించింది. 2024 నుండి మరమ్మత్తు చర్యలు చేపట్టినప్పటికీ, అవి ఢిల్లీ–బీజింగ్ మధ్య విశ్వసనీయతలో లోటును పూరించలేక పోయాయి. గత రెండున్నర దశాబ్దాలుగా చైనాతో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు వ్యాపార వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే, మరొకవైపు సరిహద్దులలో మన సైనిక శక్తిని మెరుగుపరచుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ యవనికపై పర్యావరణం, వాతావరణంలో మార్పులు, శక్తి, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల విషయంలో చైనాతో చేతులు కలిపాము. ఇరుదేశాల మధ్య వాణిజ్యం విçస్తృతంగా వృద్ధి చెంది నప్పటికీ వాణిజ్య లోటు పెద్ద సమస్యగా మారింది. 2020లో 44 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2026కల్లా 112 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. చైనా దిగుమతులపై మన ఆర్థిక వ్యవస్థ విపరీతంగా ఆధారపడతున్నది. ఈ రకమైన వాణిజ్య సంబంధాలు దీర్ఘకాలంలో మనకు నష్టం కలిగించటం ఖాయం.చైనా గ్రే జోన్ యుద్ధతంత్రం1962 తర్వాత భారత్పై చైనా మళ్లీ యుద్ధం చేసే పరిస్థితి, ప్రమాదం లేకపోయినప్పటికీ... సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కా రానికి మనస్ఫూర్తిగా, మిత్రత్వ ధోరణితో చైనా ముందుకు రావటం లేదు. పైపెచ్చు వరుసగా సరిహద్దులలో కవ్వింపు ధోరణిని అమలు పరుస్తున్నది. వ్యూహాత్మకంగా ‘గ్రే జోన్ ’ యుద్ధతంత్రాన్ని అమలు పరుస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకవైపు సరిహద్దులలో భారత్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ... మరొకవైపు పరోక్షంగా భారత్ అభివృద్ధిని అడ్డుకొని బలహీనపరచే కుతంత్రాన్ని చైనా అమలుపరుస్తున్నది. దీనితో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెచ్చించాల్సిన కీలక నిధులను భారత ప్రభుత్వంచే సైనిక వ్యయంవైపు మళ్లింప చేయటంతో చైనా కృత కృత్యురాలయింది. సరిహద్దులను ఒకవైపు అస్థిరం చేస్తూనే మరొక వైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవు లతో జతకట్టి ఇండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈశాన్య భారతంలో ఉగ్రవాద ముఠాలకు వత్తాసు పలుకుతూ దేశాన్ని అస్థిరం చేయటానికి ప్రయత్నిస్తున్నది. వాణిజ్యంలో కూడా కీలకమైన వస్తువులను, ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధిస్తున్నది. మనకు అత్యంత అవసరమైన టన్నెల్ బోరింగ్ యంత్రాలు, సీఎన్ సీ లేథ్ యంత్రాలు, యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్లు, క్రిటికల్ మినరల్స్ మనకు అందకుండా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నది. సామాజిక మాధ్యమాలలో భారత్కు వ్యతి రేకంగా పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నది.భారత్ ఏం చేయ్యాలి?గత రెండు దశాబ్దాలలో భారత్ ఎడల చైనా ప్రవర్తన, దృక్పథంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరం వరకు భారత్ను చైనా ఒక సహ ప్రత్యర్థిగా చూసింది. 2025కల్లా అంతర్జాతీయంగా చైనా ఆర్థిక శక్తిగానే కాకుండా టెక్నాలజీ పవర్ హౌస్గా ఏర్పడింది. సహజంగానే భారత్ ఎడల ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నది. అమెరికా బలహీనపడటం చైనాకు కలిసి వచ్చింది. భారత్–చైనా సంబంధాలలో యూఎస్ఏ, పాకిస్తాన్ పాత్రను మనం కాదనలేము. ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా ట్రంప్ యూఎస్ఏ, చైనాలను జీ2గా అభివర్ణించాడు. అంటే యూఎస్ఏ, చైనాలే అగ్రరాజ్యాలని ప్రకటించాడు. అయితే, చైనాను ప్రాంతీయంగా బలహీన పరచటానికి అమెరికా భారత్ను సమర్థిస్తుందనీ, అమెరికాను ఎదుర్కోవటానికి చైనా భారత్తో చేతులు కలుపుతుందనీ మరొక వాదన. చైనాతో సంబంధాల విషయంలో భారత్ ఈ వాదనల ఆధారంగా సిద్ధాంత రూపకల్పన చేయటం అవివేకం. చైనాతో సంబంధాల విధాన రూపకల్పన అమెరికన్ సిద్ధాంతాల ఆధారంగా కాకుండా మన దేశ శక్తి, సామర్థ్యాలు, స్థిరత్వం, అభివృద్ధి అవసరాల ఆధారంగానే జరగాలి.భారత్కు కొన్ని ముఖ్యమైన అంశాల్లో స్పష్టత అవసరం. మన లక్ష్యం ప్రాంతీయ హోదానా? సరిహద్దు సమస్య పరిష్కారమా? సరి హద్దులలో ప్రశాంతతనా? అంతర్జాతీయంగా చైనాను బలహీనపర చటమా? ఏ అంశాల విషయంలో భారత్ రాజీపడదనే విషయంలో చైనాకు భారత్ స్పష్టతనివ్వాలి. కవ్వింపు చర్యలు, పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భూభాగాల నుండి భారత్ను అస్థిరపరచే కుట్రల విషయంలో భారత్ రాజీ పడదు. ద్వైపాక్షిక సంబంధాలలో భారత్ను సమవుజ్జీగా పరిగణించాలి. అయితే, చైనా ధోరణి ఎప్పటికైనా మన బలంపైనే ఆధారపడి ఉంటుంది. బలమైన భారత్ మాత్రమే చైనాకు సరైన సమాధానం. ముఖ్యంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ చైనాకు కంటగింపుగా ఉన్నది. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. చైనా పెట్టు బడులకు మళ్లీ పచ్చజెండా ఊపాలంటే వాణిజ్య లోటును పరిగణన లోనికి తీసుకోవాల్సిందే. భారత జెనరిక్ ఔషధాలు, ఐటీ సేవలను ఎగుమతి చేయటానికి చైనాపై ఒత్తిడి తేవాలి. 21వ శతాబ్దం చైనా శతాబ్దం కాకూడదు, అది ఆసియా శతాబ్దమవ్వాలి!గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఆరోగ్య పరిశోధనకు అనారోగ్య మార్గం?
ఆరోగ్య పరిశోధనా శాఖ ఇటీవల ఒక జాతీయ ఆరోగ్య పరిశోధనా విధానాన్ని ప్రతిపాదించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విభాగం దాదాపు రెండు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ, ఆరోగ్య పరిశోధనకు సంబంధించి దేశానికి ఇంతవరకు ఒక కట్టుదిట్టమైన విధానం ఏదీ లేదనే వాస్తవాన్ని మొదటిసారిగా ఇపుడే గుర్తించి నట్టుంది. దేశంలో ఆరోగ్య పరిశోధనకు సంబంధించి ప్రధాన బాధ్యతను భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్వర్తిస్తోంది. జాతీయ పరిశోధన–అభివృద్ధికి చెందిన నిధులలో ఆ సంస్థకు కేవలం 3.3 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని 2026 జూలైలో విడుదలైన జాతీయ ‘ఆర్ అండ్ డి’ డేటా వెల్లడించింది. రక్షణకు 32 శాతం, అంతరిక్ష పరిశోధనకు 15 శాతం అందుతున్నాయి. అసలు మొత్తం ఆర్–డిపై మన జాతీయ వ్యయం, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో చైనా (2.58 శాతం)తో పోల్చుకుంటే, నామమాత్రంగా, 0.84 శాతంగా ఉంది. బయోమెడికల్, ఆరోగ్య ఆర్–డిపై వ్యయాన్ని పెంచడం నూతన ఆరోగ్య పరిశోధనా విధాన లక్ష్యాలలో ఒకటి. ఆరోగ్య పరిశో ధనపై పెట్టుబడిని జీడీపీలో ఇపుడున్న 0.024 శాతం నుంచి 2037 నాటికి 0.072 శాతానికి, 2047 నాటికి 0.15 శాతానికి పెంచాలని సంకల్పించారు. ఇది పెద్ద అంగగానే కనిపించవచ్చుకానీ, భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లతోనూ, భవిష్యత్తులో ఉండగల వ్యాధుల భారంతోనూ పోల్చుకుంటే, ఆ వ్యయం కూడా తక్కువే. పైగా ప్రతిపాదిత పెంపుదలలు సుదూర కాలానివి. పక్షపాత పరిశోధనలకు ఊతమిస్తే?దాన్నలా ఉంచితే, ప్రతిపాదిత పెంపుదల మరింత సమస్యాయుతంగా కనిపిస్తోంది. ‘ప్రభుత్వ పెట్టుబడి క్రమేపీ పెరుగుతుంది. దానికి బాధ్యతాయుతమైన ప్రైవేటు, దాతృత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి వచ్చే పెట్టుబడి తోడవుతుంది’ అని ఆ విధానం పేర్కొంటోంది. ఆరోగ్య పరిశోధనలో ప్రైవేటు పెట్టుబడులకు ఇది అధికారికంగా ద్వారాలు తెరుస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్న ప్రైవేటు పెట్టుబడి స్వరూప స్వభావాలు మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను ప్రభుత్వ సంస్థలలో ఆర్–డిపై వినియోగించేందుకు అనుమతిస్తామని ఆ విధానంలో పేర్కొన్నారు. ఈ విధానం ఇపుడున్న ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలకు భిన్నమైనది. కోవిడ్–19 వ్యాక్సిన్ల వంటి నిర్దిష్ట ప్రాజెక్టుల కింద ఫార్మా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కొత్త ఔషధాలను లేదా టీకాలను తయారు చేస్తూ వస్తున్నాయి. అది ఫార్మా లేదా మరో కంపెనీ ఏదైనా సరే ఇచ్చే సీఎస్ఆర్ నిధులతో ఓ చిక్కు ఉంది. ఒక కంపెనీ నెలకొల్పిన దాతృత్వ సంస్థ నిధులతోనైనా కూడా ఇబ్బందే. అది పక్షపాతపూరిత పరిశోధనకు దారితీయవచ్చు. పర్యావరణ ఆరోగ్యం (వాయు కాలుష్యం, పొగాకు, ఆల్కహాల్ ప్రభావాలు), కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఆరోగ్యంపై పడే ప్రభావం, ఆహార భద్రత, వాతావరణ మార్పు వంటి వివాదాస్పద అంశాలలో జరిగే పరిశోధ నలలో రహస్య అజెండా దాగుండొచ్చు. ‘శాస్త్రీయ సందేహా’లను సృష్టించవచ్చు. కొన్ని అగ్రశ్రేణి ఆరోగ్య ఎన్జీవోలు, ప్రజారోగ్య సంస్థలు క్షేత్ర స్థాయిలో చేసే పరిశోధనా అధ్యయనాలకు విదేశీ మారక ద్రవ్య నిబంధనల పేరుతో ప్రభుత్వం ఓపక్క అడ్డంపడుతూ, మరోపక్క ఆరోగ్య పరిశోధనలు నిర్వహించేందుకు పరిశ్రమలకు, విదేశీ ఫౌండేషన్లకు ద్వారాలు తెరవడం విడ్డూరం. విశ్వాసాలకు శాస్త్రీయ ముసుగుఈ మొత్తం విధానం ఆరోగ్య పరిశోధనను అన్ని స్థాయుల్లోనూ అధికార యంత్రాంగంతో ముడిపెడుతూ కేంద్రీకృతం చేసేదిగా ఉంది. జాతీయ ఆరోగ్య పరిశోధనా అజెండా స్థూల స్థాయిలో ప్రాధాన్యాలను నిర్దేశిస్తుందనీ, అ అజెండాను మూడు అంచెల పాలనా వ్యవస్థ అమలుజరుపుతుందనీ కొత్త విధానం చెబుతోంది. నూతన ఆరోగ్య పరిశోధనా సారథ్య కమిటీ అత్యున్నత స్థాయిలో ఉండి, వ్యూహాత్మక దిశా నిర్దేశాన్ని అందిస్తుంది. దానికి ముఖ్య శాస్త్రీయ సలహా మండలి నేతృత్వం వహిస్తుంది. దానిలో ప్రభుత్వాధికారులు (వైజ్ఞానిక శాఖల కార్యదర్శులు) సభ్యులుగా ఉంటారు. రెండవ అంచెలో ఆరోగ్య పరిశోధనా విభాగం సెంట్రల్ నోడల్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా పనిచేస్తుంది. శాస్త్రీయ–సాంకేతిక అమలు బాధ్యతలను మూడవ అంచెలో భారతీయ వైద్య పరిశోధనా మండలికి అప్పగిస్తారు. ప్రజారోగ్యం ప్రాథమికంగా రాష్ట్రాల జాబితాలోకి వస్తుంది. వైద్య విద్య–పరిశోధన ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కానీ, ప్రతిపాదిత పాలనా వ్యవస్థ రాష్ట్రాల పాత్రను తగ్గించేదిగా ఉంది. ఆరోగ్య పరిశోధనా అజెండాను కేంద్ర సారథ్య కమిటీకి అప్పగించడం వల్ల రాష్ట్రాల పాత్ర కేవలం అమలు చేయవలసినదిగా మారు తుంది. ప్రతిపాదిత ఆరోగ్య పరిశోధనా విధానం మరో ముఖ్యమైన మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. ‘సమీకృత ఆరోగ్యం’ ముసుగులో ఆధునిక వైద్యానికి ఉద్దేశించిన పరిశోధనా నిధులను ఆయుర్వేదం, ఇతర వైద్య విధానాలను అనుసరించే సంస్థలు కూడా వినియోగించుకోవచ్చు. నిజానికి, అటువంటి సంస్థలు ఆయుష్ మంత్రిత్వ శాఖ, అది నిర్వహిస్తున్న యంత్రాంగాల నుంచి పరిశోధనా నిధులను ఇప్పటికే అందుకుంటున్నాయి. ఇది తిరిగి పాత పద్ధతులు, విశ్వాసాలు, అభిప్రాయాలను ధ్రువీకరించే ఉద్దేశంతో చేసే పరిశోధనలకు ఊతం ఇస్తుంది. గోమూత్రం వంటివి ఆధునిక పరిశోధనకు లోనవుతాయి. శాస్త్ర–సాంకేతిక పరిశోధన శాఖ వంటి ఇతర పరిశోధనా ఏజెన్సీలు ఇస్తున్న నిధులతో అటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే నడుస్తున్నాయి. రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా...మన దేశం భౌగౌళికంగా, సాంస్కృతికంగా మాత్రమే వైవిధ్య భరితమైనది కాదు. దాని ఆరోగ్య అవసరాలు కూడా భిన్నమైనవి. వివిధ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండటంలో తారతమ్యాలున్నాయి. బిహార్ లేదా ఒడిశా వంటి రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ఆరోగ్య సవాళ్ళు పూర్తిగా భిన్నమైనవి. ‘పైనుంచి–కింద’కు అనే అజెండాను రాష్ట్రాలు అమలు చేయక తప్పని స్థితిని కల్పించే బదులు, రాష్ట్రాలు వాటి ప్రాధాన్యాలు, అవసరాల ఆధారంగా సొంత ఆరోగ్య పరిశోధనా మౌలిక వసతులను అభివృద్ధి చేసు కునేలా నిధుల రూపంలో చేయూతనందిస్తే బాగుంటుంది. ఆరోగ్య పరిశోధన అంటే కేవలం కొత్త టెక్నాలజీలను పరీక్షించడం లేదా కొత్త టీకాలు, మందులను తయారు చేయడమే కాదు; పరిశోధన ఫలితాలు ఆరోగ్య విధానాలు, బడ్జెట్లకు దారి చూపాలి. ఆరోగ్య పరిశోధన ఒక నిరంతర, గతిశీల ప్రక్రియ. అది సామాజిక–ఆర్థిక అంశాలతో సన్నిహితంగా ముడిపడి ఉంటుంది. పట్టణాల్లో ఉండే పేదలు, గిరిజనులు వంటి అనేక బడుగు, బలహీన వర్గాల ఆరోగ్య సమస్యలు తరచు పరిశీలనకు నోచుకోవడం లేదు. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలలను తెరిచారు. తమతమ ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య సమస్యలపై పరిశోధన సాగించే విధంగా వాటికి దిశా నిర్దేశం చేయాలి. ఆరోగ్య పరిశోధనకు అంకితమైన ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే పరిశోధన అజెండాను రూపొందించేందుకు కేంద్రీకృత విధానాన్ని అనుసరించడం, ప్రైవేటు రంగానికి ప్రముఖ పాత్ర కల్పించడం, ఆధునిక వైద్య పరిశోధనా అజెండాకు సమీకృత సంప్రదాయ వైద్యాన్ని జోడించడం వంటివాటితో ఈ విధానం తీసుకుంటున్న దిశ మాత్రమే అనారోగ్యకరంగా కనిపిస్తోంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ద్రవ్యోల్బణ సూచీలు – దాక్కుంటున్న ధరలు
భారత్ ఇటీవలే వినియోగదారుల ధరల సూచీ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ –సీపీఐ)కి కొత్త రూపం ఇచ్చింది. 2012ను ఆధార సంవత్సరంగా తీసుకున్న పాత శ్రేణి స్థానంలో, 2024ను ఆధార సంవత్స రంగా తీసుకున్న కొత్త శ్రేణి 2026 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 ఆధారంగా వినియోగ బుట్టను, దాని బరువులను పునర్నిర్మించారు. అయితే, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణ సూచీలు ఒక కుటుంబం ప్రత్యక్షంగా అనుభవించే ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా ప్రతి బింబించడం లేదనే వాదన కొన్ని వర్గాల్లో ఉంది. ఉదాహరణకు, ఆగస్ట్ 12న విడుదలైన జూలై నెల సీపీఐ సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం రేటును 4.45 శాతంగా, పట్టణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం రేటును 5.05 శాతంగా చూపించింది. వాస్తవానికి తాము మోస్తున్న ధరల భారం మరింత ఎక్కువని కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి సీపీఐ తప్పుగా లెక్కించబడటం లేదు. అయితే, సీపీఐ ఒక సగటు వినియోగ బుట్ట ఆధారంగా దేశంలోని కుటుంబాలందరికీ ద్రవ్యోల్బణ రేటును సూచిస్తుంది. కానీ ప్రతి కుటుంబం ఒకే వస్తువులను, ఒకే పరిమాణంలో, ఒకే ధరకు కొనదు. అందువల్ల అధికారికంగా సూచించే ద్రవ్యోల్బణం, కుటుంబం అనుభవించే ద్రవ్యోల్బణం కొంత భిన్నంగా ఉండవచ్చు.ఒకే బుట్ట... భిన్నమైన కుటుంబాలుద్రవ్యోల్బణాన్ని కొలవడానికి, ప్రజలు సాధారణంగా కొనుగోలు చేసే వస్తువులు, సేవలను ఒక ‘వినియోగ బుట్ట’గా వర్గీక రిస్తారు. పాత శ్రేణిలోని 299 వెయిటెడ్ వస్తువుల స్థానంలో కొత్త శ్రేణిలో 358 వస్తువులు చేరాయి. ప్రతి వస్తువుకు, కుటుంబాల మొత్తం వినియోగ వ్యయంలో దాని ప్రాధాన్యతకు అనుగుణంగా ఒక బరువు కేటాయిస్తారు. వాటి ధరల మార్పును ఈ బరువుల దామాషాలో గణించి సీపీఐని లెక్కిస్తారు. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 ప్రకారం, సగటున భారతీయ కుటుంబం తన వినియోగ వ్యయంలో దాదాపు 40–50 శాతం ఆహారంపైనే ఖర్చు చేస్తోంది. అయితే తక్కువ ఆదాయ కుటుంబాలు ఆహారంపై తమ వినియోగ వ్యయంలో ఎక్కువ భాగం ఖర్చు చేయడం వల్ల, ఆహార ధరలు వేగంగా పెరిగినప్పుడు, వారిపై సగటు సూచీ చూపే ద్రవ్యోల్బణం కంటే అధిక భారం పడుతుంది. ధరల కారణంగా ఒక కుటుంబం పామాయిల్ కొనడం తగ్గించి, వేరుశనగ నూనెకు మారిందనుకుందాం. కానీ, వెంటనే సూచీ బరువులు మారవు. అందువల్ల వినియోగ బుట్టలోని వస్తు వులు, వాటి బరువులను ఒకసారి సవరించి సుదీర్ఘకాలం కొనసాగించే బదులు, వినియోగ వ్యయ సర్వేల ఆధారంగా మరింత తరచుగా బరువులను పునఃసమీక్షించే విధానం అవసరం. భారత్ కొత్త సీపీఐలో 2024ను ఆధార సంవత్సరంగా ఎంచుకోవడం ద్వారా ఈ దిశగా ముందడుగు వేసింది.ధర మారకపోయినా... ఖర్చు పెరగవచ్చుఇటీవలి కాలంలో సూపర్ మార్కెట్లలో తరచూ చూస్తున్న ‘ష్రింక్ఫ్లేషన్’ మరో సమస్య. నిత్యావసరమైన ‘పాలు’ ఉదాహర ణగా తీసుకుందాం. 500 మిల్లీలీటర్ల ఉత్పత్తి స్థానంలో అదే ధరకు 400 మిల్లీలీటర్లు లభిస్తే, ధర పెరగకపోయినా వినియోగదారుడి వాస్తవ ఖర్చు పెరుగుతుంది. సీపీఐలో ఉత్పత్తి పరిమాణం లేదా ఉత్పత్తి లక్షణాలు మారినప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకునే విధానం ఇప్పటికే ఉంది. అయితే వేలాది ఉత్పత్తుల ప్యాక్ పరిమాణాలు మారుతూ ఉండే రిటైల్ మార్కెట్లో, ఇటువంటి మార్పులను సకాలంలో గుర్తించి, యూనిట్ ధరలో వచ్చిన మార్పును త్వరితంగా నమోదు చేయడానికి ఈ–కామర్స్, రిటైల్ స్కానర్ డేటాను విస్తృతంగా ఉపయోగించాల్సి ఉంటుంది. బ్రిటన్ 2026లో గ్రోసరీ స్కానర్ డేటాను సీపీఐలో ఇముడ్చుతూ, పరిమాణ మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వస్తువుల నాణ్యత మారినప్పుడు కూడా కొత్త సీపీఐలో నాణ్యత సర్దుబాటుకు ప్రత్యేక విధానం ఉంది. అయితే స్మార్ట్ఫోన్లు, కంప్యూ టర్లు వంటి వేగంగా మారే ఉత్పత్తుల్లో కెమెరా సామర్థ్యం, స్టోరేజ్, ప్రాసెసింగ్ వేగం వంటి లక్షణాల విలువను, బ్రిటన్ , అమెరికాల తరహాలో విడివిడిగా అంచనా వేసే ‘హెడానిక్ ప్రైసింగ్’ (వస్తువు ధరలో దాని వివిధ లక్షణాల వాటాను విడిగా అంచనా వేసే పద్ధతి)ని విస్తృతంగా ఉపయోగిస్తే, ఉత్పత్తుల ధరల్లో వచ్చిన వాస్తవ మార్పులను సూచీలు మరింత నిక్కచ్చిగా ప్రతిబింబించగలవు.జాతీయ సగటు సరే, మా ఇంటి పరిస్థితేంటి?మొదట, ప్రస్తుత జాతీయ సీపీఐకి తోడుగా వివిధ ఆదాయ వర్గాలకు ప్రత్యేక వినియోగ బరువులతో సూచీలను రూపొందిస్తే, ధరల పెరుగుదల దిగువ, మధ్య, ఎగువ ఆదాయ కుటుంబాల జీవనవ్యయాన్ని విడివిడిగా, మరింత కచ్చితత్వంతో చూపిస్తుంది. రెండవది, ప్రతి కుటుంబానికి వ్యక్తిగత ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే డిజిటల్ సాధనాన్ని ప్రభుత్వం అందించవచ్చు. ఒక కుటుంబం ఆహారం, ఇంధనం, విద్య, ఆరోగ్యం, అద్దె తదితరాలపై తన నెల వారీ వినియోగాన్ని, ఖర్చును నమోదు చేస్తే, అదే సీపీఐ ధరల డేటాను ఉపయోగించి ఆ కుటుంబం ప్రత్యక్షంగా అనుభవించే వాస్తవ ద్రవ్యోల్బణాన్ని లెక్కించవచ్చు. అటువంటి సూచీ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలకు దోహదపడుతుంది. కెనడాలో ఇప్పటికే ఇలాంటి అధికారిక వ్యక్తిగత ద్రవ్యోల్బణ కాలిక్యులేటర్ ఉంది. మూడవది, ధరల పెరుగుదలతో పాటు పన్నుల అనంతరం మిగిలే ఆదాయంలో మార్పును కూడా పరిగణనలోకి తీసుకుని, ఒక కుటుంబం వాస్తవంగా ఎంత కొనుగోలుశక్తిని కోల్పోయిందో లేదా పొందిందో చూపించే ‘నికర వాస్తవ కొనుగోలు శక్తి సూచీ’ని అభివృద్ధి చేయవచ్చు. ఆదాయంలో మార్పు, ప్రత్యక్ష పన్నుల భారం వంటి అంశాలను సమన్వయం చేసే ఈ సూచీ, ‘నా ఆదాయం పెరిగినా నా చేతిలో మిగిలే డబ్బు ఎందుకు పెరగడం లేదు?’ అనే సామాన్యుడి ఆవేదనకు గణాంకపరమైన సాంత్వన చేకూర్చుతుంది. భారత్ కొత్త ద్రవ్యోల్బణ శ్రేణిలో 1,465 గ్రామీణ, 1,395 పట్టణ మార్కెట్లతో పాటు 12 ఆన్ లైన్ మార్కెట్ల నుంచి ధరలను, ఈ–కామర్స్, టెలిఫోన్ , విమాన ప్రయాణం, ఓటీటీ వంటి విభా గాల్లో ఆన్ లైన్ డేటాను కూడా ఉపయోగిస్తోంది. తదుపరి దశలో జీఎస్టీ, ఈ–ఇన్ వాయిస్ డేటా, ఈ–కామర్స్ విక్రయాలు, రిటైల్ స్కానర్ డేటా వంటి వనరులను... ధరలతో పాటు కొను గోలు పరిమాణాలను అంచనా వేయడానికి ఉపయోగిస్తే ష్రింక్ ఫ్లే్లషన్ వంటి ధోరణుల ప్రభావాన్ని కూడా మరింత కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. కొన్ని యూరోపియన్ దేశాలు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు -
సరైన దారిలో 'కాక్రోచ్ సీజన్ 2'
దేశం ఈ నెల 15న 80వ స్వాతంత్య్ర సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఒక అపూర్వమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని పేరు ‘స్కూల్స్ ఠీక్ కరో’, లేదా ‘ఫిక్స్ రూరల్ గవర్నమెంట్ స్కూల్స్’. సీజేపీ ఉద్యమం మొదలైందే విద్యారంగ సమస్యలపై. ఈ దేశ భవిష్యత్తు ఆధారపడింది విద్యా వ్యవస్థపై అనీ, అది పేదలకూ, గ్రామీణులకూ అందుబాటులో లేకుండా పోయిందనీ, కనుక ఈ సమస్యపై మొత్తం దేశాన్ని కదిలించేందుకు ప్రయత్నించగలమనీ నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో మొదటి రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమాల వీడియోలు, వార్తలు అందుబాటులోకి వస్తున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కే తన స్వస్థలమైన ఛత్రపతి శంభాజీ నగర్లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల మధ్య కూర్చుని, వివిధ సౌకర్యాలు, బోధనా పరిస్థితుల గురించి వారిని చిన్న చిన్న ప్రశ్నలు వారి మాతృభాష మరాఠీలో అడుగుతూ నోట్స్ రాసుకోవటం కన్పించింది. ఆ పిల్లలు ఉత్సాహంగా చెప్తున్నారు. అదే రోజున సీజేపీ ఇతర బాధ్యులు, ఇంకా వందలాది మంది కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాలలోని వేర్వేరు గ్రామాలలో అదే పని చేశారు. నూతన ఉద్యమ వాతావరణంగమనించదగిన విశేషం మరొకటి జరిగింది. జంతర్ మంతర్ ఉద్యమస్ఫూర్తితో అంతటా ఒక కొత్త వాతావరణం ఏర్పడినందున, అనేకచోట్ల సీజేపీ బాధ్యులెవరూ లేకుండానే బడిపిల్లలు ఈ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమం గురించి విని, తమంతట తామే తమ బడులలో వివిధ సౌకర్యాల లేమిపై పాఠశాల పెద్దలనే కాక, సమీపాన గల ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి ప్రశ్నించటం కనిపించింది. ఇదే చైతన్యం దేశమంతటా వ్యాపిస్తే? వ్యాపింపజేయటమే జంతర్ మంతర్ తర్వాత తమ తదుపరి కార్యక్రమమని సీజేపీ ప్రకటించింది. దానిని ‘సీజన్–2’ ఉద్యమ మంటున్నది. అందులో భాగంగా చేపట్టే కార్యక్రమం కోసం ఒక ఫారాన్ని తమ వెబ్సైట్లో పెట్టింది. దాని ద్వారా ఎవరైనా సభ్యు లుగా చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. యథాతథంగా కార్యక్రమంలో చేయవలసిన పనులు మూడు విధాలు. ఒకటి– మంచినీళ్ళు, టాయిలెట్ సౌకర్యాల పరిస్థితి.రెండు– విద్యుత్తు, తరగతి గదులు, వాటి భద్రత. మూడు– ప్రహరీ గోడలు, భద్రత. ఇదంతా మొదటి విధమైన పని. రెండవ విధమైన దానిలో కార్యకర్తలు లైట్లు, ఫ్యాన్లతో సహా వీట న్నింటిని ఫొటోలు, వీడియోలు తీయాలి. అగ్నిమాపక సిలిండర్లు ఉన్నాయో లేదో చూడాలి. మూడవ విధమైన పని ఈ వివరాలన్నీ అధికారులకు అందజేయటంతో పాటు, సీజేపీ అడ్రసుకు అప్లోడ్ చేయాలి. మన దేశం స్వతంత్రమైనప్పటినుంచి విద్యారంగానికి సంబంధించి ఆధా రాలతో అధికారులను ఒత్తిడి చేయటం వంటి కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఎన్నడూ జరగలేదు. గమనించదగిన మరొకటి, నెహ్రూ కాలంలోనూ ఉన్నత విద్యపై తప్ప గ్రామీణ విద్యపై, ప్రాథమిక విద్యపై తగిన శ్రద్ధ చూపలేదు.అయినా అణచివేతలా?సీజేపీ కార్యక్రమం ఏ విధంగా సాగి ఎటువంటి ప్రభావాలు చూపగలదో ఇప్పుడే చెప్పలేము. విద్యారంగానికి సంబంధించి వారి అవగాహనలు, ఆలోచనలు, లేవనెత్తుతున్న ప్రశ్నలు, తలపెట్టిన కార్యక్రమాలు మాత్రం సమగ్రంగా కనిపిస్తున్నాయి. వాటిలో లోతు, దూరదృష్టి ఉన్నాయి. విద్యార్థి లోకంలో, వారి తండ్రులలో, సమా జంలో, ఆలోచనాపరులలో మద్దతు పెరుగుతున్నది. మరొక విషయం, ఆ నిర్వాహకులపై, వారి కార్యక్రమాలపై వ్యతిరేకత, అణచివేత చర్యలు జంతర్ మంతర్ దశ తర్వాత కూడా కొనసాగు తుండటం. ఉదాహరణకు, తమ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమ ప్రకటనకు ఢిల్లీలో కార్యకర్తల సమావేశాన్ని జరపచూడగా, అందు కోసం హాలును ఇవ్వకుండా యజమానులను బెదిరించారు. చివరకు ఒక పార్కులో సమావేశమవుతుండగా పోలీసులను పంపి గేట్లకు తాళాలు వేశారు. గట్టిగా ప్రశ్నించిన మీదటగానీ తెరవలేదు. ఇటువంటి నిర్హేతుకతలు, అణచివేతల ప్రభావం, దేశమంతటా ఇప్పటికే జంతర్మంతర్ సృష్టించిన ప్రభావాలను మరెంత పెంచు తుందో అధికారంలో గల వారికి అర్థం కావటం లేదు. జంతర్ మంతర్ దరిమిలా స్వయంగా ప్రధాని మోదీ, ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ విద్యారంగం గురించీ, యువ తరం అసంతృప్తి న్యాయబద్ధం కావటం గురించీ చెప్పిన మాటలను గమనించినప్పుడు, ఈ అణచివేతలు విచిత్రంగా తోస్తాయి.ప్రభుత్వ విద్యారంగం బాగుపడక ప్రైవేట్ రంగం మాత్రమే వర్ధిల్లినంత కాలం సాధారణ కుటుంబాల పిల్లలు చదువులో ముందుకుపోలేరు. అందువల్ల వారికేగాక దేశానికి కూడా నష్టమే. కనుక విద్యారంగానికి బడ్జెట్లను జీడీపీలో ఆరు శాతానికే కాదు,అంతకు మించి పెంచాలి. నివేదికలను అమలుపరచాలి. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పించి విద్యాబోధనను మెరుగుపర చాలి. ఈ దిశలో తమ తొలి దశ కార్యక్రమాన్ని ఆరు మాసాలపాటు సాగి స్తారు. ఇది క్రమంగా ఊపందుకుని దేశవ్యాప్తమైన కొద్దీ కొత్త పరిస్థితులను చూడగలమని ఆశించవచ్చు. వారు మూతపడిన 94 వేల స్కూళ్ల గురించి కూడా ప్రశ్నిస్తున్నందున వాటిని తిరిగి తెరవటం, ఇక ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మూసివేత లను కొనసాగించకపోవటం కూడా జరుగుతుందని ఆశించాలి.క్యా బోల్తీ పబ్లిక్?పోతే, కాక్రోచ్ సీజన్ 2 సరైన మార్గంలో ముందుకు సాగుతున్న సూచనలు ఇతరత్రా కూడా ఉన్నాయి. వారి కోర్ కమిటీ ఈ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తాము విద్యతో పాటు ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యలపై ప్రభుత్వాలను ఒత్తిడి చేసే ఉద్యమంగానే ఉంటాము తప్ప రాజకీయాలలోకి ప్రవేశించబోమన్న అంతకుముందటి వైఖరినే పునరుద్ఘాటించటం వాటిలో మొదటిది. అందువల్ల వారి విశ్వసనీయత పెరిగి, పునాది స్థిరపడి విస్తరిస్తుంది. అదే సమావేశంలో సంస్థ బాధ్యుల టీమ్ను ప్రకటించటంతోపాటు, దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నలుగురు ఇన్ఛార్జ్లను నియమించుకున్నారు. కార్యాచరణకు సంబంధించి, ఈ సెప్టెంబర్ నుంచి, దేశమంతటా పర్యటనలు జరిపి ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరిట అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలూ, ఆలోచనలేమిటి? ఏమి జరగాలనుకుంటున్నారు? అనేవి తెలుసుకోవటం; దాని ఆధారంగా భవిష్యత్తు అజెండాలను, కార్యాచరణను రూపొందించటం.ఎంతో సంయమనంతో, ప్రజాస్వామికంగా, శాంతియుతంగా ప్రజలతో సమన్వయమవుతూ ముందుకు సాగేందుకు సీజేపీ ప్రయత్నిస్తున్న తీరును, అందుకు సమాజంలో కనిపిస్తున్న సానుకూలతలను గమనించినప్పుడు, మన దేశపు 80వ స్వాతంత్య్ర సంవత్సరంలో కొత్త గాలులు మొదలుకానున్నాయా అనే సూచనలు కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రానంతర దేశం 1991 నాటి ఆర్థిక సంస్కరణలతో ఒక కొత్త మలుపు తిరగగా, ఈ 2026లో మరొక మలుపు తిరిగే అవకాశమున్నదా? ఈ ప్రశ్నలు ఇప్పటికే ఆలోచనా పరుల మెదళ్లకు మేతగా మారాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సమస్య వైపు పరుగెత్తు!
నేను చాలా ప్రసంగాలు చేశాను. కానీ ఇది నాకు వ్యక్తిగతమైనది. 1986 చలికాలంలో మిట్లో చేరాను. నా తల్లిదండ్రులు నన్ను నెక్ట్స్ హౌస్ హాస్టల్లో దింపి వెళ్లారు. అప్పుడు నాకు 17 ఏళ్లు. నేను తైవాన్లో పుట్టాను. అమెరికాలోని క్వీన్స్ ప్రాంతంలో పెరిగాను. గణితంలో నేను దిట్ట అని నమ్మేదాన్ని! కానీ రెండు వారాల్లోనే ఒక విషయం అర్థమైంది: ఎంఐటీలో గణితంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు! మొదటి అసైన్మెంట్లను చూస్తూ అనుకున్నాను: ‘అయ్యో! ఇవి ఎంతో కష్టంగా ఉన్నాయి!’ నేను కాలేజీకి (ఫ్రెష్మన్ ఇయర్కు) వచ్చేవరకు ఎప్పుడూ రాత్రంతా నిద్రలేకుండా చదవడం లేదా పనిచేయడం అనేది లేదు. మిట్లో చేరాక ఆ అనుభవం కొత్తగా ఉన్నా... క్లాస్మేట్స్తో కలిసి పని చేయడం సరదాగా అనిపించింది. మిట్ మనల్ని ఊహించిన దానికంటే ఎంతో ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన మార్గాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు సమస్యలతో కుస్తీ పడతారు. ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒకటి రెండు సర్క్యూట్లు పేలిపోవచ్చు. కానీ ఏదోలా చివరకు ఆ పని పూర్తవుతుంది. అప్పుడు మీరే స్వయంగా ఏదో ఒకటి తయారు చేయగలరని మీకు అర్థమవుతుంది. సెమీకండక్టర్లతో ప్రేమమిట్లో డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్) చదువుతున్నప్పుడే రీసెర్చ్లో పనిచేసే అవకాశం రావడం నా జీవితాన్నే మార్చేసింది. ఎక్స్–రే లిథోగ్రఫీ మాస్క్ బ్లాంక్స్ తయారు చేయడం ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం. అప్పట్లో దాని అర్థం ఏమిటో కూడా నాకు పూర్తిగా తెలి యదు. కానీ నా మొదటి ‘బన్నీ సూట్’ (క్లీన్ రూమ్లో వేసుకునే ప్రత్యేక దుస్తులు) వేసుకుని... చిన్న 2–అంగుళాల వేఫర్లపై పరికరాలు తయారు చేయడం ప్రారంభించాను. ఆ వేఫర్లు సున్నితంగా ఉంటాయనీ, పొరపాటున కూడా వాటిని పగలగొట్టకూదడనీ త్వరగానే గ్రహించాను. నేను ఎన్నో ప్రయోగాలు చేశాను. వాటిలో ఎక్కువ శాతం మేము ఆశించిన విధంగా పనిచేయలేదు. పద్ధతి మార్చుకుని, మళ్లీ ప్రయత్నించాం. నేను తరగతి గదిలో టెక్నాలజీ గురించి చదవడం మాత్రమే చేయలేదు; కొత్త విషయాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న ఒక బృందంలో భాగమయ్యాను. నాకైతే అప్పట్లో ఒకటే ఆలోచనొచ్చింది. వావ్, మనం ఇంత చిన్న వస్తువులను కూడా తయారు చేయగలమా? కానీ ప్రపంచాన్నే మార్చగల శక్తిమంతమైన చిన్న పరికరాలు ఇవి. అప్పుడే నేను సెమీ కండక్టర్లతో ప్రేమలో పడ్డాను. అక్కడే నేను సమస్యలను ఎలా పరిష్కరించాలో అసలు సిసలు పాఠాలు నేర్చుకున్నాను. ఆ రంగా నికి కొత్తగా వచ్చిన విద్యార్థి స్థాయి నుంచి, స్వయంగా ఆ రంగానికి కొత్త విషయాలు అందిస్తున్న వ్యక్తిగా మారాను. ఆ ప్రయాణంలో, నా మీద నాకు నమ్మకం కలగడం మొదలైంది. అది నాకు ఎప్పుడూ అన్ని సమాధానాలూ తెలుసనే అతివిశ్వాసం కాదు; అసలు సమాధానం ఇప్పుడే తెలియకపోయినా దాన్ని నేను కనుగొనగలను అనే ఆత్మవిశ్వాసం. మిట్ నాకు సెమీకండక్టర్ ఫిజిక్స్ కంటే పెద్ద విషయాన్ని నేర్పిందని నాకు అర్థమవుతోంది. మైండ్ అండ్ హ్యాండ్ మిట్ మోటో ‘మైండ్ అండ్ హ్యాండ్’ కేవలం ఒక నినాదం అనుకున్నాను. కానీ అది మిట్ ప్రత్యేకతను సరిగ్గా తెలియజేస్తుందని భావిస్తున్నాను. మిట్ మనకు లోతుగా ఆలోచించడం నేర్పిస్తుంది. ఏదైనా తయారు చేయడం, ఆలోచనలను పరీక్షించడం, మొదటి ప్రయోగం లేదా ఐదో ప్రయోగం కూడా విఫలమైనా ఆగిపోకుండా ముందుకు సాగడం నేర్పిస్తుంది. ఒకప్పుడు అసాధ్యమని పించిన సమస్యలను కూడా మీరు పరిష్కరించగలరని మీపై మీకే నమ్మకం కలిగేలా చేస్తుంది. నేను క్యాంపస్ వదిలి వెళ్లిన చాలా కాలం తర్వాత కూడా అదే భావనతో ఉన్నాను. నేను ఐబీఎంలో చేరినప్పుడు,మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినట్లు అనిపించింది. ఐబీఎంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. అప్పట్లో నాకు 25 ఏళ్లు.అంత పెద్ద కంపెనీలో నేను ఎలా మార్పు తీసుకురాగలను అని ఆశ్చర్యపోయాను. కానీ త్వరగా ఒక ముఖ్యమైన విషయం తెలుసు కున్నాను. ఇంజినీరింగ్ మీ వయసును పట్టించుకోదు. మీ ఆలోచ నలు పనికొస్తాయా లేదా అనేదే చూస్తుంది. నా మెంటార్లలో ఒకరు నాకు చెప్పిన ఒక మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేదు: అత్యంత కష్టమైన సమస్యల వైపు పరు గెత్తుకుంటూ వెళ్లు! అప్పట్లో అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. కాలక్రమేణా, నా జీవితంలో లభించిన అత్యుత్తమ సలహా అదేనని అర్థమైంది. కష్టమైన సమస్యలే మీ అసలు సత్తా ఏమిటో మీకు తెలియజేస్తాయి. కొంచెం వెనక్కు వెళ్తే... 12 ఏళ్ల క్రితం, ఆ పాఠాన్ని నిజ జీవితంలో పరీక్షించి చూసే అవకాశం వచ్చింది. నాకు ఏఎండీ సంస్థకు సీఈఓ అయ్యే అవకాశం లభించింది. ఆ ఉద్యోగంలో చేరడం రిస్క్ అని నా మెంటార్లలో కొందరు భావించారు. కానీ ఇది నా డ్రీమ్ జాబ్ (కలల ఉద్యోగం). నిజంగా ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై,సాంకేతిక రంగంలో కొత్త టెక్నాలజీతో పనిచేసే అవకాశం. భవి ష్యత్తులో అత్యంత కీలకమైన సాంకేతికత హై–పెర్ఫార్మెన్స్ కంప్యూ టింగ్ (అధిక పనితీరు గల కంప్యూటింగ్) అని మేము దీర్ఘకాలికంగా నమ్మాం. మా ప్రతిభావంతులైన బృందానికి పెద్ద ఆలోచనలు చేసే స్వేచ్ఛను ఇచ్చాం. తదుపరి కొన్ని సంవత్సరాలలో, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లను తయారు చేయడానికి వీలుగా మేము టెక్నాలజీని అభివృద్ధి చేశాం. భవిష్యత్ను నిర్ణయించేది మనుషులే!గడచిన కొన్ని దశాబ్దాలలో మనం అనేక సాంకేతిక మార్పులను చూశాం. ఇప్పుడు ఏఐ విప్లవానికి ప్రారంభంలో ఉన్నాం. ఏఐ మనుషులను భర్తీ చేయదు. బదులుగా, ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. వైద్యం, శాస్త్రం, ఇంధనం, వాతావరణం– ఏ రంగంలోనైనా, మనం గడిచిన ముప్పై ఏళ్లలో కనుగొన్న దానికంటే ఎక్కువ విషయాలను రాబోయే పదేళ్లలోనే కనుగొనవచ్చు. అయితే భవిష్యత్తు ఎలా ఉండాలనేది సాంకేతికత నిర్ణయించదు, మనుషులే నిర్ణయిస్తారు. శక్తిమంతమైన పరికరాలను ఎలా ఉపయోగించాలో తెలిసిన మనుషులు ప్రపంచానికి అవసరం లేదు. వాటిని ‘దేని కోసం’ ఉపయోగించాలో తెలిసిన మనుషులు కావాలి. నన్ను ఎవరైనా కెరీర్ సలహా అడిగితే, ఒకటే చెబుతుంటాను: కష్టపడి పనిచేయండి, కానీ అదృష్టం కూడా ముఖ్యం అని గ్రహించండి. కాలక్రమేణా నేను ఒక విషయాన్ని నమ్మడం మొదలు పెట్టాను. గొప్ప వ్యక్తులు తమ అదృష్టాన్ని తమంతట తామే సృష్టించుకునే మార్గాలను వెతుక్కుంటారు. అదృష్టం అంటే సరైన సమయంలో, సరైన స్థలంలో ఉండటమే కాదు. ఒక కష్టమైన పని చేయ డానికి రిస్క్ తీసుకోవడం. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం. మీకు తెలిసిన విషయాల హద్దులు దాటి కొత్త సమస్యలను ఎంచుకోవడం. మిమ్మల్ని మరింత మెరుగుపరిచే వ్యక్తుల మధ్య ఉండటం. ‘అవును.. మనం ఈ ప్రపంచాన్ని మార్చగలము’ అని నమ్మడం. మీరు ఎంచుకునే సమస్యల విషయంలో పెద్ద ఆశయాలు కలిగి ఉండండి. అన్నింటికంటే కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రండి! -
చంద్రశేఖరన్ (‘టాటా సన్స్’ చైర్మన్) రాయని డైరీ
వంతెనపై గమ్యాన్ని చేరుకోవాలంటే, వంతెన కంటే ముందు గమ్యాన్ని నిర్మించుకోవాలి. ‘టాటా’ వంతెనపై నాది 40 ఏళ్ల ప్రయాణం. వంతెనే నా కోసం గమ్యాన్ని నిర్మించినట్లుగా సాగిన జీవన యానం! టాటాలో ఇవి నా ఆఖరు నెలలు! 2027 ఫిబ్రవరి 20 నా చివరి రోజు. టాటా మహా సముద్రంలో ఒక అల కూడా ముందస్తు ప్రణాళికతో ఉంటుంది. దేశం 2026లో ఉన్నప్పుడు టాటా 2027లో ఉంటుంది. ‘‘చంద్ర తర్వాత ఎవరు?’’ అని ఏడాది ముందే ఈ ఫిబ్రవరిలో బోర్డు రూమ్లోకి ఒక ‘ప్రశ్న’... బంట్రోతులా వచ్చి నిలబడింది. టాటాలో బాస్ అయినా బంట్రోతు అయినా ఒకే వంతెనపై నడుస్తారు. ప్రశ్నలు రేకెత్తిస్తున్నంత కాలమే వారు ఆ వంతెనపై నడిచేందుకు అర్హులై ఉంటారు. సమాధాన పడిపోయే వాళ్లకు టాటాలో సీటు ఉంటే ఉండొచ్చు కానీ చోటు మాత్రం ఉండదు. నువ్వు ప్రశ్నిస్తున్నావంటే పనిలో ఉన్నట్లు! నువ్వు ప్రశ్నించటం మానేశావంటే, కేవలం ఉద్యోగం చేస్తున్నట్లు! ఇదీ టాటా సిద్ధాంతం. ‘‘చంద్ర తర్వాత ఎవరు’’ అన్నప్పుడు సగం మందికి పైగా వాటాదారులు ‘‘మళ్లీ చంద్రే’’ అన్నారు. బోర్డు కూడా ‘‘మళ్లీ చంద్రే’’ అంది. బోర్డు డైరెక్టర్లలో ఒక్క నోయెల్ టాటా మాత్రమే మౌనంగా ఉండిపోయారు. ఆర్నెల్లుగా ఇప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నారు! మనం పుట్టి పెరిగిన ఇల్లే అయినా, ఇంట్లో మనతో మాట్లాడని మనిషి ఒక్కరున్నా అదిక మన ఇల్లవదు. ఇంటిని ఇంటిలా ఉంచాలంటే మనమే బయటికి వచ్చేయాలి. ఊహు... వచ్చేయటం కాదు, వెళ్లిపోవటం! రతన్జీ ఉండి ఉంటే, ‘‘ఎక్కడికి వెళ్తావ్ చంద్రా ఇంత రాత్రప్పుడు?!’’ అని నన్ను ఆపి ఉండేవారా... అది మిట్ట మధాహ్నమే అయినా – నా వెనకే అడుగులు వేసుకుంటూ వచ్చి! ఎందుకు వెళుతున్నదీ ఆయన అడగరు. ‘‘వెళ్లి ఏమౌతావు?’’ అన్నదే ఎవరి గురించైనా ఎప్పుడూ ఆయన ఆందోళన. ‘‘ఇంటిని గానీ, సంస్థను గానీ, ఆఖరికి మనిషినే గానీ ఎవరైనా వదిలి వెళ్లవలసి వచ్చిందంటే... వెళ్లాక వారెలా ఉండగలుగు తారు అనే ఆలోచన రావలసింది... ఆ ఇంటికి, ఆ సంస్థకు, వదిలి వెళ్లటానికి కారణం అయిన ఆ వ్యక్తికే గానీ, వదిలి వెళ్లిపోవలసి వచ్చినవారికి కాదు’’ అనేవారు రతన్జీ! టాటా ప్రధాన కార్యాలయం ఉండే ‘బాంబే హౌస్’ రతన్జీకి పవిత్రాలయం. చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు, పునర్జన్మ... అన్నీ ఆయనకు బాంబే హౌసే!‘‘రతన్జీ... 90 ఏళ్లుగా ‘బాంబే హౌస్’ ఇలాగే ఉంది. కొద్దిగా మార్పులు చేస్తే బాగుంటుంది’’ అని, ‘టాటా సన్స్’ చైర్మన్గా నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయనతో అన్నప్పుడు– ఆయన నా వైపు సౌమ్యంగా చూశారు. ‘‘మార్పులు అంటే పడగొట్టటం, తిరిగి కట్టటమే కదా చంద్రా! మరి అక్కడ నివాసం ఏర్పరచుకుని ఉన్న కుక్కల్ని, వాటి పిల్లల్ని ఏం చేస్తారు? ఖాళీ చేయించేస్తారు. అంతేకదా! అప్పుడు అవి ఎక్కడికి వెళ్తాయి? ముందు వాటికి భద్రమైన చోటు ఏర్పాటు చేయించి, ఆ తర్వాత మీ ‘పునర్నిర్మాణం’ మొదలుపెట్టండి’’ అన్నారు రతన్ జీ!!రతన్జీతో కలిసి పని చేయటం నాకొక లాంగ్ డిస్టెన్స్ మారథాన్. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన టోక్యో, బోస్టన్, లండన్, బెర్లిన్, చికాగో, న్యూయార్క్ మారథాన్లతో పాటుగా నేను పూర్తి చేసిన ఏడో మారథాన్... ‘రతన్జీ టాటా’! క్షణికమైన వేగం కంటే... అనుకున్న మార్గంలో చివరివరకు నిలబడటమే ముఖ్యం అనేవారు రతన్జీ. టాటాను వదిలి వెళ్లాలన్న నా నిర్ణయం క్షణికమైన వేగంలో తీసుకున్నది కాదు. బోర్డు తీర్మానం కోసం ఆరు నెలలు ఆగి చూసి, టాటా ప్రతిష్ఠను నిలబెట్టటానికి ఆరు నెలల ముందే, కాబోయే చైర్మన్ కోసం నా అంతట నేను పరిచిన రెడ్ కార్పెట్ అది. -
చరిత్రను మార్చిన 'పరాజితుల చరిత్ర'
1976 ఆగస్ట్ 17. సరిగ్గా యాబై సంవత్సరాల కింద. అమెరికన్ స్వాతంత్య్ర దినం (జూలై 4) ద్విశతాబ్ది వేడుకలు దేశమంతా అట్టహాసంగా జరిగి ఇంకా ఆరు వారాలు కాలేదు. ఆ రోజున ఒక పుస్తకం వెలువడింది. సుప్రసిద్ధ అమెరికన్ ప్రచురణ సంస్థ డబుల్ డే ప్రచురించిన పుస్తకం అది. పేరు రూట్స్– ద సాగా ఆఫ్ యాన్ అమెరికన్ ఫామిలీ. రచయిత ఆఫ్రికన్ అమెరికన్ బానిస సంతతి ఏడో తరానికి చెందిన అలెక్స్ హేలీ (1921–1992). ఆ పుస్తకంతో ఆయన ప్రపంచ సాహిత్యంలో విజయ పతాక ఎగరేశాడు. అమెరికా జిలుగు వెలుగుల వెనుక దాగిన అపారమైన అంధకారాన్నీ, అందవికారాన్నీ విప్పి చూపిన అత్యంత ప్రభావశీలమైన పుస్తకం అది. రెండు వందల సంవత్సరాల చరిత్రను తవ్వి తీసి, కొత్త చరిత్ర సృష్టించిన పుస్తకం అది. ఇంతవరకూ విజేతలు రాసుకుంటూ వచ్చిన చరిత్రను సవాలు చేసి, తుడిచేసి, పరాజితుల చరిత్రను రంగస్థలం మీద ప్రవేశపెట్టిన పుస్తకం అది. వెలువడిన మొదటి సంవత్సరంలోనే అమెరికన్ మార్కెట్లో అరవై లక్షల ప్రతులు అమ్ముడైన ఈ పుస్తకం, ఇప్పటికి కనీసం నలబై భాషల్లోకి అనువాదమైంది. ఎన్ని కోట్ల ప్రతులు వెలువడ్డాయో లెక్కలేదు. వెండితెర మీద, బుల్లితెర మీద కోట్లాది మందిని ప్రభావితం చేసింది. ఇంగ్లిష్లో వెలువడిన నాలుగు సంవత్సరాల్లోనే తెలుగులోకి సహవాసి సంక్షిప్త అనువాదంతో, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణగా ‘ఏడు తరాలు’గా వెలువడి ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతున్నది. అమ్మమ్మ చెప్పిన కుటుంబ కథమొట్టమొదట దీన్ని హిస్టారికల్ ఫిక్షన్ (చారిత్రక కల్పన) అనాలా, నాన్ ఫిక్షన్ (కాల్పనికేతర రచన) అనాలా అని చర్చ జరిగింది. అలెక్స్ హేలీ తన కుటుంబ చరిత్ర గురించి ఇంట్లో విన్న మౌఖిక ఆధారాల దగ్గర ప్రారంభించి, మూడు ఖండాలలో, అనేక చారిత్రక, ప్రభుత్వ పత్రాల, నౌకాయానాల లిఖిత ఆధారాల మీద పరిశోధన జరిపి దీన్ని రాశాడు. దొరుకుతున్న చారిత్రక సాక్ష్యాధారాలు భిన్నమైన కథనాన్ని చెపుతున్నాయని ఆ పుస్తకాన్ని ఖండించిన చరిత్ర కారులు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మరొక పక్క, దానిలో కొంత వాస్తవ చరిత్ర ఉన్నప్పటికీ, అది నవల అని, కాల్పనిక రచన అని అనేవాళ్లు కూడా ఉన్నారు. స్వయంగా రచయిత దాన్ని ఒక కొత్త పేరుతో పిలిచాడు: అది ఫాక్ట్ (వాస్తవం), ఫిక్షన్ (కల్పన) కలిసిన ఫాక్షన్ అన్నాడు. పూర్తి వాస్తవమూ కాదు, పూర్తి కల్పనా కాదు, అద్భుత రసాయనిక సంయోజనంలో రెండూ కలగలిసిన వినూత్న రచనాశైలి. ఒక వ్యక్తి తన వంశ చరిత్రనూ, తన మూలాలనూ అన్వేషించడంలో చేసిన అపార కృషి ఫలితం. రెండు వందల సంవత్సరాల వలసవాద దుర్మార్గాన్ని కళ్లకు కట్టిన దస్తావేజు. ఒక మానవ మహా విషాద కథనం. గొప్ప మానవ సంబంధాల చిత్రణ. దుర్భేద్యమైన అవరోధాలను అధిగమించి మానవ సంకల్పం, మానవ శ్రమ, మానవ సృజనాత్మకత ఎలా విస్తరిస్తుందో సజీవంగా చూపే చారిత్రక–సామాజిక విశ్లేషణ. ఆఫ్రికన్ దేశం గాంబియాలో 1750లో ప్రారంభమై, 1970ల దాకా సాగిన 120 అధ్యాయాల రచనలో చివరి అధ్యాయాలలో అలెక్స్ హేలీ ఈ రచనకు తన ప్రేరణనూ,కృషినీ వివరించాడు. తన అమ్మమ్మ పదే పదే చెప్పిన తమ కుటుంబ కథలోని శకలాలను పట్టుకుని, కుటుంబ చరిత్ర రాయగలనా అనే ప్రశ్నతో ఈ 730 పేజీల ఉద్గ్రంథం తయార యింది. ఇది పురాతత్వ పరిశోధన వంటి ప్రయత్నం. పురాతత్వ పరిశోధకులు ప్రాచీన యుగ అవశేషాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు దొరికేవి కుండ పెంకులు మాత్రమే. పూర్తి కుండలు కూడా దొరకవు. కాని ఇతరేతర ఆధారాలతో పరిపుష్టం చేసుకుంటూ, ఆ కుండ పెంకు ఏ కుండలో భాగమో, ఆ కుండ ఏ శ్రమనుంచి ఉద్భవించిందో, ఏ సంస్కృతికి ప్రతిబింబమో, ఆ కుండను వాడిన మనుషుల సామూహిక జీవన విధానం ఏమిటో వివరించడానికి ప్రయత్నిస్తారు. అలెక్స్ హేలీ చేసినది సరిగ్గా అటువంటి కృషి. నిజానికి ఆయన అప్పటికి పరిశోధకుడూ కాదు, రచయితగా కూడా సుప్రసిద్ధుడూ కాదు. తీరప్రాంత గస్తీ దళం ఉద్యోగిగా పనిచేస్తూ, ఏవో కొన్ని రచనలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత జర్నలిస్టు అయ్యాడు. అమెరికన్ ప్రముఖులు కొంద రిని ఇంటర్వ్యూ చేశాడు. నల్లజాతి ఉద్యమ నాయకుడు మాల్కోమ్ ఎక్స్ హత్య కావడానికి ముందు నాలుగు సంవ త్సరాల పాటు ఆయనను ఇంటర్వ్యూలు చేసి, ఆయన హత్య తర్వాత ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కోమ్ ఎక్స్ రాసి పేరు తెచ్చుకున్నాడు. ఈ అక్షర కృషికి, పురాతత్వ పరిశోధన తోడయింది. చిన్నప్పటి నుంచీ అమ్మమ్మ సింథియా నుంచి విన్న విషయాలు రాయాలనుకున్నాడు. లండన్ మ్యూజియంలో ఒక ప్రాచీన లిపి పరిశోధన చూసి తానూ అటువంటి పరిశోధన చేయాలనుకున్నాడు. అమ్మమ్మకు సన్నిహిత బంధువు, అప్పటికి ఎనబైల్లో ఉన్న జార్జ్తో ప్రస్తావించి నప్పుడు, ‘‘అవును కుర్రాడా, ఆ ఆఫ్రికన్ తన పేరు కింటే అని చెప్పేవాడు. గిటార్ను కో అనేవాడు. నదిని కాంబీ బోలొంగో అనేవాడు. డోలు చెయ్యడానికి కర్ర కోసం అడవికి పోయినప్పుడు వాళ్లు ఎత్తుకొచ్చారనేవాడు’’ అందామె.‘కింటే ఎక్కడి నుంచి వచ్చాడో అన్వేషిస్తాను’ అని ఆమెకు మాట ఇచ్చాడు. ‘‘ఆ పని చెయ్యి. మీ అమ్మమ్మ, మన వాళ్లందరూ పై నుంచి చూస్తుంటారు’’ అని ఆమె ఇచ్చిన ప్రోత్సాహం ఈ రచనకు పునాది. ఏడు తరాల కథగిటార్ వంటి సంగీత సాధనానికి మాండింకా భాషలో పేరు కో అని, కాంబీ బోలోంగో అంటే గాంబియా నది అని గుర్తించి గాంబియా వెళ్లాడు. మౌఖిక వంశచరిత్రా గాయకుల సహాయంతో నిజంగానే కింటా కుంటే అనే పదహారేళ్ల కుర్ర వాడిని ఎత్తుకుపోయి, ఓడలో అమె రికా తీసుకుపోయారని గుర్తించాడు. బానిసగా ఒక యజమానికి అమ్మబడిన కుంటా కింటే తిరగ బడ్డాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. పారిపోకుండా యజమానులు కాలు తెగనరికారు. అక్కడ వంట మనిషిగా ఉండిన బెల్ను పెళ్లి చేసుకుని కిజ్జీ అనే కూతురిని కన్నారు. యజమాని ఆ అమ్మాయిని మరొక యజమానికి అమ్మితే, కొత్త యజమాని కిజ్జీ మీద అత్యాచారం చేశాడు. అలా కోడి పందాల జార్జిగా పేరు తెచ్చుకున్న మూడో తరం వ్యక్తి పుట్టాడు. జార్జి– మెటిల్డాలకు పుట్టిన ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లలో ఒకరు అలెక్స్ హేలీ ముత్తాత, కమ్మరి టామ్, నాలుగో తరం. ఆయనకూ ఐరీన్కూ పుట్టిన సింథియా, ఐదో తరం, అలెక్స్ హేలీకి తమ కుటుంబ చరిత్ర చెప్పిన అమ్మమ్మ. ఆమె కూతురు బెర్తా, ఆ వంశంలో కాలేజీకి వెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి, అక్కడ కలుసుకున్న సైమన్ హేలీని పెళ్లి చేసుకుంది. ఆమె కొడుకు అలెక్స్ హేలీ. నెత్తురూ కన్నీళ్లూ కలిసిన ఏడు తరాల కథ ఇది. యాబై సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విశిష్టతలు కనిపిస్తాయి. ఆఫ్రికన్ తెగల సాంస్కృతిక ఆచారాలు, నల్లవాళ్లను అసలు మనుషులు గానే గుర్తించని, ఓడల్లో పశువుల్లా, సరుకుల్లా ఎత్తుకువచ్చి, తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులకు, ముఖ్యంగా పత్తి పంటకు ఉపయోగించిన తెల్లవాళ్లు, హింస, తిరుగుబాట్లు, పారిపోయే ప్రయత్నాలు, తమ మౌఖిక చరిత్రను సంరక్షించుకున్న పద్ధతులు, స్వాతంత్య్రం నుంచి బానిసత్వానికీ, అక్కడి నుంచి మళ్లీ స్వాతంత్య్రానికీ ప్రయాణాలు, బానిస విముక్తి, ఆంతర్యుద్ధం... చరిత్ర, గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణ. ‘తన చరిత్ర తనె పఠించి భోరున ఏడ్చింది ధరణి, తన చరిత్ర తనె స్మరించి ఫక్కున నవ్వింది ధరణి’. ఎన్. వేణుగోపాల్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఐరోపా వలస సంక్షోభం
జూలై 30న మద్యధరా సముద్ర తీరంలో మొరాకో అంచున ఉన్న స్పానిష్ ఎన్క్లేవ్ స్యూటాలోకి ఒక్కసారిగా 50 వేల నుండి 60 వేల మంది మొరాకన్లు సము ద్రాన్ని ఈదుకుంటూ రావటం, సుమారు 72 మంది మృత్యువాత పడటం, స్పెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించటం ఒక్కసారిగా సభ్యసమాజం ఉలిక్కిపడేలా చేసింది. గత సంవత్సర కాలం నుండి అమెరికాలో ‘ఐస్’ (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) ఏజెంట్లు వలస దారులపై చేస్తున్న దాడులు చర్చనీయాంశమయ్యాయి. స్వదేశంలో అంతర్యుద్ధాలు, పేదరికం, నిరుద్యోగ సమస్యల కారణంగా అనేక వేలమంది ప్రాణాలకు తెగించి ఏదో రకంగా ఐరోపా దేశాలకు చేరుకోవటానికి సాహసం చేస్తున్నారు. అటు అంతర్యుద్ధాలు ఇటు శ్రామిక కొరతసిరియా, లిబియా, అఫ్గాన్, ఇరాక్, ఎరిట్రియాలలో అంతర్యు ద్ధాల వలన ఒక మిలియన్కు పైగా శరణార్థులు ఒక్కసారిగా 2015లో ఐరోపాలోకి ప్రవేశించారు. దీనిని 2015 ఐరోపా శరణా ర్థుల సంక్షోభంగా పేర్కొంటారు. ఈ శరణార్థుల చొరబాటు ప్రధా నంగా మూడు మార్గాల గుండా జరిగింది. 1. తూర్పు మద్యధరా సముద్రంలో టర్కీ నుండి గ్రీకుకు చెందిన లెస్బాస్, చియోస్ దీవుల గుండా ఐరోపాలోకి. 2. పశ్చిమ బాల్కన్ ప్రాంతంలో మెసడోనియా నుండి సెర్బియా, హంగరీ, క్రొయేషియాల గుండా జర్మన్, ఆస్ట్రియా, స్కాండినేవియా ప్రాంతానికి. 3. మధ్య మద్యధరా ప్రాంతంలో లిబియా నుండి ఇటలీగుండా ఐరోపాలోనికి. ఐరోపా దేశాల ఉదారవాద విధానాల వలన అక్రమ వలస దారులు ఒకసారి ఐరోపాలోనికి ప్రవేశిస్తే వారిని వెంటనే వెనక్కు పంపటం సాధ్యం కాదు. వీరి దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవటా నికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఐరోపా దేశాల సంక్షేమ పథకాల ఆలంబనతో వీరు ఏదోరకంగా ఐరోపాలో స్థిరపడుతుంటారు.ఐరోపా దేశాలలో కనీసం 2.5 మిలియన్ల శ్రామికుల కొరత ఉన్నది. ఐరోపా జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. చౌక శ్రామిక శక్తి ఆవశ్యకతను గుర్తించి ఐరోపా దేశాలు వలసల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాయి. 2020 కంటే ముందు ఐరోపా దేశాలు శరణా ర్థులు, అక్రమ వలసదారుల ఎడల మెతక వైఖరిని అవలంభించాయి. ముఖ్యంగా జర్మనీ (ఆంజిలా మెర్కెల్ ప్రభుత్వం) కేవలం 2015లోనే 8.9 లక్షల శరణార్థులను అనుమతించింది. ఐరోపా దేశాలు అక్రమ వలసదారులను నియంత్రిస్తూ, వారిని క్రమంగా ఐరోపా సంస్కృతిలో విలీనం చేయాలనే సిద్ధాంతాన్ని అమలు పరచాయి. యూకే, నెదర్లాండ్స్, స్వీడన్ వంటి దేశాలు శరణార్థులు వారి సంస్కృతిని కాపాడుకోవటానికి సహాయం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్ మతబోధనల పాఠశాలల ఏర్పాటుకు కూడా సహకరించాయి. వీరికి పౌరసత్వం ఏర్పాటు చేశాయి. ఫ్రాన్స్ దీనికి విరుద్ధంగా ఫ్రెంచ్ భాషను తప్పనిసరి చేసింది. పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాలలో మతసంబంధ చిహ్నాలను నిషేధించింది. జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలు నైపుణ్యంగల వలస దార్లను మాత్రమే అనుమతించటానికి ప్రాధాన్యతనిచ్చాయి. పౌరసత్వ సదుపాయం కల్పించలేదు.నియంత్రణల కసరత్తు2020 తర్వాత ఐరోపా దేశాలలో ఉగ్రవాద చర్యలు, హింసా త్మక సంఘటనలలో వలసదారుల ప్రమేయం బయటకు రావటంతో ఐరోపా దేశాలు తమ విధానాలను పునస్సమీక్షించుకోవటం మొదలెట్టాయి. స్వీడన్లో గ్యాంగ్వార్స్, 2024లో యూకేలో దొమ్మీలు, 2023లో ఫ్రాన్స్లో అల్లర్లు, యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్ లపై నివేదికలు వలసలను వ్యతిరేకించే రైట్వింగ్ రాజకీయ పక్షాలు బలోపేతమవటానికి దోహదం చేశాయి. యూరోపియన్ యూనియన్ దేశాలలో సుమారుగా 6.4 కోట్ల మంది విదేశాలలో జన్మించినవారు. మొత్తం జనాభాలో వీరి వాటా సుమారు 13.3 శాతం. ప్రతి సంవత్సరం సుమారు 6.7 లక్షల శరణార్థులు వస్తున్నారు. ఇప్పుడు ఐరోపా దేశాలు దరఖాస్తులపై తుది నిర్ణయం తీసు కొనేవరకు ఐరోపా బయట వేరే దేశాలలో ఉంచే పథకాన్ని ప్రారంభించాయి. రువాండా, అల్బేనియా, ట్యునీషియాలో వీరిని క్యాంపు లలో ఉంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వలసదారులకు స్థానిక భాష, సంస్కృతిపై అవగాహనను నిర్ధారించే పరీక్షలను తప్పనిసరి చేస్తున్నారు. స్కాండినేవియన్ దేశాలలో వలస వచ్చిన వారిని సంక్షేమ పథకాల నుండి మినహాయిస్తున్నారు. స్వీడన్లో శరణార్థులు నివసిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నేరా లతో సంబంధమున్న వారిని దేశం నుండి బహిష్కరిస్తున్నారు. భద్రతా కారణాలు, సాంస్కృతిక–రాజకీయ నేపథ్యంలో ఐరోపా దేశాలు వలసలను నియంత్రించటానికి ప్రయత్నించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వలసలను పూర్తిగా నిషేధిస్తే ఐరోపా ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు. ముఖ్యంగా హెల్త్కేర్ రంగంలో నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఎల్డర్లీ కేర్ రంగాలలో తీవ్ర కొరత ఉన్నది. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ రంగాలలో డ్రైవర్లు, మెకానిక్లు, క్రేన్ ఆపరేటర్ల కొరత ఉన్నది. నిర్మాణ రంగంలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లకు కొరత ఉన్నది. ఇండియాకు ఐరోపా ద్వారాలుప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది తమ మాతృదేశాల నుండి వలస వెళ్లి ఇతర దేశాలలో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వీరి వాటా 3.7 శాతం. వీరంతా అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు చెందినవారు. ప్రధానంగా యూఎస్ఏ, కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియాలకు వలస వెళ్తున్నారు. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక వలసల విషయంలో కఠినమైన వైఖరిని అనుసరిస్తున్నారు. భారత్ అక్రమ వలసలను, చొరబాట్లను ఏ రకంగానూ సమర్థించదు. అయితే చట్టబద్ధ వలసల విషయంలో ట్రంప్ వైఖరి భారత్ను ఒత్తిడికి గురిచేస్తున్నది. హెచ్1బీ వర్క్ వీసాలలో భారత్ వాటా 70 శాతం. హెచ్1బీ, గ్రీన్కార్డ్ వర్క్ వీసాల నిబంధనలతో బాటుగా అమెరికాలో జన్మించినవారికి లభించే పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసే యత్నాలు భారత్కు నిరాశను కలిగిస్తున్నాయి.ఇవి ఒక రకంగా కొత్త అవకాశాలకు దారి తెరిచే అవకాశం ఉన్నది. 2023లో 9 లక్షలమంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్యకు వెళితే 2025లో 6.26 లక్షలమంది మాత్రమే విదేశీ విశ్వవిద్యాలయాల వైపు మొగ్గు చూపారు. వీరు కూడా యూఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ లేదా ఐరోపా విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటున్నారు. అమెరికా నుండి రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ సూచనలు కన్పడుతున్నాయి. అమెరికన్ కంపెనీలు భారత్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆఫ్ షోరింగ్ స్థానంలో ఆన్ షోరింగ్ ప్రారంభమవుతున్నది. భారతీయుల అమెరికన్ డ్రీమ్ చెదిరిపోయే తరుణంలో ఐరోపా ద్వారాలు తెరుచుకుంటున్నాయి. భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సంబంధాలలో వాణిజ్యాన్ని – వలసలను కలిపి ప్రతిపాదిస్తున్నది. ఇండియా – ఈయూ మొబిలిటీ పాక్ట్ (2026)పై ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత విద్యార్థుల వీసాలను ఫాస్ట్ట్రాక్ చేయటం, ఐరోపా విశ్వవిద్యా లయాలలో భారతీయ విద్యార్థులు కోర్సు ముగించిన తరువాత ఉద్యోగం వెతుక్కోవటానికి 12 నెలల వీసా అనుమతికి వీలున్నది. ముఖ్యంగా ఐటీ, ఇంజినీరింగ్, మానుఫాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ,హెల్త్ కేర్ రంగాలలో భారతీయులకు వర్క్ వీసాలకు ఐరోపా దేశాలు అనుమతిస్తాయి. అమెరికాలో వీసా నిబంధనల సమస్యల నేపథ్యంలో ఐరోపా వలస సంక్షోభం, ఘర్షణలు భారత్కు కలిసొచ్చాయనే చెప్పవచ్చు. బహుశా 2050 కల్లా ఐరోపా ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలలో భారతీయులు తమదైన ముద్రను వేసే అవకాశం ఉన్నది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
మన వ్యవసాయ విధానాలకు పరీక్ష
ఎల్ నినో కేవలం ఏదో ఒక పరిణామం కాదు. అది భూగోళం మొత్తంమీద వాతావరణ మార్పు వైపరీత్యానికి సంకేతం. పరస్పరాధారిత జీవావరణ వ్యవస్థలకు, వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తు చేస్తున్న ప్రమాదఘంటిక. ఈ రకమైన ఉపద్రవం తరచు తలెత్తుతున్నా దాని దీర్ఘకాలిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారతదేశ సన్నద్ధత అసమతుల్యంగానే ఉంది. ఎల్ నినో ప్రభావాలను రైతులకు ఎరుక పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కృషి చేస్తున్న మాట వాస్తవమే. అయితే, వ్యవసాయ ఉత్పత్తి చుట్టూ అలముకుంటున్న అస్థిరత, పంటల తీరుతెన్నులపై పెరిగిపోతున్న ఒత్తిడిపై మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అనిశ్చితిలోనూ స్థిరమైన పనితీరుఈ నేపథ్యంలో, వ్యవసాయ స్థితిస్థాపకత విధానపరంగా ఒక ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకోవాలి. పంట నష్టాలను తగ్గించుకోవడం మాత్రమే స్థితిస్థాపకత అనిపించుకోదు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ, సాపేక్షంగా చూస్తే స్థిరమైన పనితీరు కనబరచగల వ్యవసాయ పద్ధతులను రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక స్థితిస్థాపక శక్తిని సమకూర్చుకునేందుకు మౌలిక వసతులు, టెక్నాలజీ, జల నిర్వహణ, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల వంగడాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలపై పెట్టుబడులు అవసరమవుతాయి. వాతావరణ అశనిపాతాల పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తు న్నాయన్నది ఒక పార్శ్వం మాత్రమే. అటువంటి షాక్లు ఎదురవ డానికి ముందే ప్రభుత్వ సంస్థలు రైతులను ఎంత పకడ్బందీగా సన్నద్ధపరుస్తున్నాయన్నది కీలక ప్రశ్న. పంట మార్పిడిలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల ప్రయత్నాలు ఎంతవరకు సఫల మవుతున్నాయి? ప్రత్యామ్నాయ పంటలు, వాటిని నాటవలసిన కాల పరిధులు, రిస్క్–మేనేజ్మెంట్ వ్యూహాల గురించి రైతులకు సలహాలిచ్చేందుకు తగినంత సామగ్రి దిగువ స్థాయి వ్యవసాయ వ్యవస్థల వద్ద ఉంటోందా? పంటలకు నష్టాలు వాటిల్లినప్పుడు పరిహారం, బీమా, ఇతర సహాయక యంత్రాంగాలు దెబ్బతిన్న రైతుల ముంగిళ్ళకు ఎంత వేగంగా చేరుకోగలుగుతున్నాయి? కేవలం అధిక దిగుబడులను సాధించడంపైనే కాకుండా, వాస్తవిక పరిస్థితులలో స్థిరమైన పనితీరును నిలబెట్టుకోగలగడంపైనే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేశంలో కర్షకులు సుమారుగా 11.88 కోట్ల మంది ఉన్నారని, వ్యవసాయ కూలీలు 14.43 కోట్ల మేరకు ఉంటారని 2011 నాటి జనాభా లెక్కల వివరాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాల ప్రభావం పంట పొలాలకే పరిమితం కాదనీ, అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆహార భద్రత, విస్తృత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనీ గుర్తుంచుకోవాలి. సాంకేతిక సాయంభారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతువుల మార్పులపై ఆధారపడి నడుస్తోంది. వాతావరణానికి సంబంధించి తగినంత సమాచారం లేకుండా నారుపోయడం లేదా ఇతర సేద్య కార్యకలా పాలు చేపట్టడంలో ఇబ్బందులున్నాయి. తీరా అవి చేపట్టాక వర్ష పాత ధోరణుల్లో మార్పులొస్తే, రైతులు ఆర్థికంగా నష్టపోతారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పైకి అంతగా కనిపించని దుర్భ లత్వాలలో ఇది ఒకటి. పంటలు దెబ్బతిన్నప్పుడు వచ్చే నష్టాలే కాకుండా, అనువుకాని సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఈ సమస్య ఒక పూర్తి స్థాయి సంక్షోభంగా పరిణమించకముందే, ఆ ముప్పు ఏర్పడగల అవకాశాన్ని గుర్తించడంలో ప్రవర్ధమాన టెక్నాలజీలు ముఖ్యంగా ఉపగ్రహ ఆధారిత భూ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు తరిగిపోతున్న వృక్ష సంపద ఆరోగ్యాన్ని గుర్తించడంలో, విస్తారమైన వ్యావసాయిక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుదల వంటివాటిని గుర్తించడంలో ఉపగ్రహ పరిశీ లనలు సహాయపడతాయి. కనుక, ఎల్ నినో విసురుతున్న సవాల్ను ఎదురు దెబ్బగా చూడనవసరం లేదు. భారతీయ వ్యవసాయ వ్యవస్థలను పటిష్టపరచుకునేందుకు లభించిన ఒక అవకాశంగా దీన్ని పరిగణించవచ్చు. అనిశ్చిత పరిస్థితుల్లో ఏ పంటలు పండించగలుగుతున్నాం, దానికి ఏ విధమైన సేద్యపు విధానాలు అనుసరిస్తున్నాం, సంస్థా పరమైన స్పందనల మెరుగుదల వంటి అంశాలకు సంబంధించి విలువైన పరిజ్ఞానాన్ని ప్రతి క్లిష్టమైన వ్యవసాయ సీజన్ నుంచి గ్రహించవచ్చు. వాతావరణంలో మార్పు గురించిన సాధారణ హెచ్చరికలు చేస్తే రైతులకు సరిపోదు. పరిస్థితిని బట్టి వివిధ పంటలు వేసుకోగల వెసులుబాటు కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపకరణాలు, వంగడాలను అందుబాటులోకి తేవాలి. సమర్థ పంట బీమా అవసరం. అస్థిర పరిస్థితులను తట్టుకోగలిగిన విధంగా సంస్థాపరమైన మద్దతును కూడా అందించాలి.ప్రపంచమంతటా పెను ప్రభావమే!ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిపైన కూడా వాతావరణ వ్యత్యాస ప్రభావం పెరుగుతూ వస్తోందని 2026 ఆగస్టు 6న ప్రచురించిన గ్లోబల్ క్రాప్ మానిటర్ నివేదిక వెల్లడించింది. అది నాలుగు ప్రధాన (గోదుమ, మొక్కజొన్న, వరి, సోయాబీన్) పంటల స్థితిగతులను మదింపు చేసింది. సాపేక్షంగా చూస్తే గోదుమకు సానుకూల పరిస్థితులున్నాయని ఆ నివేదిక తెలిపింది. బియ్యానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. వరి రైతులు వాతావరణ ప్రతికూలత, నీటి సౌలభ్యం తక్కువగా ఉండటం, పంటకు చీడపీడలు సోకడంతో పాటు, దిగుబడులకు సంబంధించి ఇతర ప్రతిబంధకాలను కూడా ఎదుర్కొంటున్నారు. భారత్ విషయంలో దీని ప్రధాన సందేశం ముఖ్యమైంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు పెరుగు తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన విధంగా పంటలు రూపొందాలి. వ్యవసాయ విధానాలు వేగంగా మారిపోతున్న రిస్కు లకు తగ్గట్లుగా స్పందించగలిగిన సామర్థ్యం ఉన్నవై ఉండాలి. మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు కాదు. అది మెరుగైన సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగినదిగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని, ఎదురుకాగల ముప్పులను ఊహించగలిగినప్పుడే ప్రభుత్వాలు స్థితిస్థాపక శక్తి కలిగిన వ్యవసాయ వ్యవస్థలను నిర్మించగలుగుతాయి. అప్పుడే ఎల్ నినోను అడపాదడపా తలెత్తే వాతావరణ భూతంగా కాక దేశ వ్యవసాయ పాలనకు ఒక పరీక్షగా చూడటం సాధ్యపడుతుంది.– డా‘‘ సుంకరి సత్యం ‘ అసిస్టెంట్ ప్రొఫెసర్;– కంచర్ల శ్రీదేవి ‘ రిసెర్చ్ స్కాలర్; కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, హైదరాబాద్ -
సంకేతమే అయినా మున్ముందు సవాలే!
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే ఆగస్ట్ 7న ‘మక్కా రక్షణ ఒడంబడిక’పై రియాద్లో సంతకాలు చేశాయి. దీనికి సైనికపరంగాకన్నా ఇతరత్రా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది పశ్చిమాసియాలో నీరుగారుతున్న అమెరికా ప్రాభవాన్ని వెల్లడిస్తోంది. భద్రతా ప్రాధాన్యాల రీత్యా ఈ మూడు దేశాల మధ్యనున్న సారూప్యత బహు స్వల్పం. అమెరికా– ఇరాన్ మధ్య యుద్ధ పర్యవసానాలు సౌదీకి తలనొప్పిగా పరిణమించాయి. ఇరాన్తో దాని వైరం 1979 నుంచి సాగుతోంది. పాక్ దృష్టంతా భారత్పైనే. ‘నాటో’ కూటమిలో ఒకటిగా ఉన్న తుర్కియే అటు పశ్చిమాసియాలోనూ, ఇటు ఉత్తరాఫ్రికాలోనూ తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తోంది. ఆ ప్రాంతంలో నమ్మదగిన రక్షణ సామగ్రి ఎగుమతి దారుగా అవతరించాలని కోరుకుంటోంది. ఇలా వైరుధ్యాలున్నా రక్షణ కోసం ఈ మూడు దేశాలు ఒక వర్గంగా ఏర్పడటం ప్రతీకాత్మకంగా గణనీయమైనదే. ఇది మూడు భారీ మార్పులను ప్రతిబింబిస్తోంది: భిన్నమైన వ్యూహాత్మక, భద్రతా ప్రాధాన్యతలు; నూతన భద్రతా భాగస్వామ్యాల కోసం అన్వేషణ; అమెరికాపై ఇన్నాళ్ళూ ఉన్న నమ్మకం సడలిపోవడం.అమెరికాపై పోతున్న ఆశలుపశ్చిమాసియా, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలు ఒక భద్రతా చట్రాన్ని కల్పించుకోవడంలో కొన్ని దశాబ్దాలుగా వాషింగ్టన్పైనే ఆధారపడుతూ వచ్చాయి. అమెరికా నుంచి ఆయుధాలు కొని సౌదీ అరేబియా దాని నుంచి భద్రతాపరమైన పూచీకత్తులు సంపాదించింది. తుర్కియే ఎలాగూ ‘నాటో’లో సభ్యురాలు. పాకిస్తాన్ ‘‘నాటో’యేతర ప్రధాన మిత్రపక్షం’.ఆరామ్కోపై జరిగిన ఇటీవలి దాడులపైనా, హౌతీలను కట్టడి చేయడంపైనా అమెరికా స్పందన పేలవంగా ఉందని సౌదీ భావిస్తోంది. సిరియా విషయంలో ‘నాటో’తో తుర్కియే చాలా ఏళ్లుగా ఘర్షణపడుతోంది. ఎఫ్–35 యుద్ధ విమానాల విక్రయాలు, కుర్దుల అంశం కూడా దాన్ని చిరాకుపరుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, 2009 తర్వాత అమెరికా క్రమంగా భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించడంతో వ్యూహాత్మకంగా ఏకాకినవుతున్నానని పాక్ భావిస్తూ ఉండవచ్చు. రియాద్, అంకారా, ఇస్లామాబాద్ ఒకదానికొకటి రక్షణగా నిల వాలని నిర్ణయించుకోవడం గణనీయమైన పరిణామమే. ఈ ఒడంబడిక ప్రస్తుతానికి పస లేనిదిగా కనిపించవచ్చుకానీ, ఇక్కడ సంకే తానికే ఎక్కువ ప్రాధాన్యం. మూడు ప్రధాన ముస్లిం మెజారిటీ సైనిక శక్తులు చేతులు కలుపుతున్నాయి. పాకిస్తాన్ అమ్ములపొదిలో అణ్వస్త్రం ఉంది. తుర్కియేలో ప్రధాన రక్షణ సామగ్రి పరిశ్రమలు న్నాయి. సౌదీ అరేబియాకు చమురు నిల్వలు పుష్కలం.ఇజ్రాయెల్కు సంకటమే!ఈ మూడు దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా మిగిలిన రెండు దేశాలపైన కూడా దాడి జరిగినట్లుగానే భావించాలని పేర్కొంటున్న క్లాజు మక్కా ఒప్పందానికి ప్రాముఖ్యతను సంతరిస్తోంది. కాకపోతే, భాష అస్పష్టంగా ఉంది. ‘నాటో’ ఆర్టికల్ 5 తరహాలో, ఆటోమే టిక్గా యుద్ధానికి దిగుతామనే నిర్దుష్టమైన పదజాలాన్ని చేర్చలేదు. సమైక్య కమాండ్ల ప్రస్తావన లేదు. సంయుక్తంగా స్థావరాలు నిర్వహిస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఒడంబడిక తక్షణ సైనిక ప్రభావం పరిమితం కావచ్చు. కానీ, అస్పష్టతకు కూడా భౌగోళిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇది శత్రు దేశాల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. వాటి రక్షణ సన్నద్ధత ఖర్చును పెంచుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సంబంధించిన భద్రతా చర్చల్లో తల దూర్చాలని తుర్కియే చాలా కాలంగా అభిలషిస్తోంది. కానీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అమెరికా దాన్ని దూరంపెడుతూ వచ్చాయి. ఇపుడు మక్కా ఒడంబడికతో తుర్కియే ఆ రకమైన చర్చల్లో పాల్గొనేందుకు ప్రవేశార్హత సంపాదించుకున్నట్లు అయింది. ఇది ఇజ్రాయెల్కు కంటక ప్రాయంగా మారడం ఖాయం. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తుర్కియే బాహాటంగా విమర్శిస్తోంది. మక్కా రక్షణ ఒడంబడికతో అటు తుర్కియే, ఇటు అణ్వస్త్ర సహిత పాకిస్తాన్ పశ్చిమాసియా భద్రతకు సంబంధించిన అధికారిక చర్చల్లో మొదటిసారిగా పాల్గొనేందుకు ప్రయత్నించవచ్చు. ఇంత కాలం అమెరికా నేతృత్వంలోని అబ్రహాం ఒప్పందాల గొడుగు నీడన ఇజ్రాయెల్ పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. గల్ఫ్ కౌన్సి ల్తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. ఇరాన్కు వ్యతిరేకంగా భద్రతాపరమైన సహకారాన్ని గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. తద్వారా, పాక్ను ఆమడదూరంలో ఉంచుతూ వస్తోంది. తాజా ఒడంబడిక ఈ సూత్రీకరణలన్నింటినీ అస్తవ్యస్తం చేస్తోంది. ఇజ్రాయెల్ను గుర్తించని పాక్కు గల్ఫ్ భద్రతా చర్చల బల్ల వద్ద కుర్చీ కల్పిస్తోంది. పాలస్తీనియన్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నదిగా తనను చాటుకునే తుర్కియేకు సంస్థాపరమైన పరపతిని తెచ్చిపెడుతోంది. భారత్ ఎందుకు జాగ్రత్తపడాలి?ఈ ఒడంబడికతో న్యూఢిల్లీకి సంబంధం లేదని అనడానికి లేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సిసలైన కాపలాదారుగా భారత్ తనను తాను చాటుకుంటూ వస్తోంది. సాగర జలాలకు సంబంధించినంతవరకు భద్రతకు నికరంగా భారత్ పైనే ఆధారపడ టానికి ప్రాధాన్యం ఇస్తారనే భావనపైనే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను నిర్మించుకుంటూ వచ్చారు. సౌదీ అరేబియా 14 దేశాలతో కలసి జూలై 30న ఒక మారిటైమ్ సెక్యూరిటీ క్లస్టర్ను ప్రారంభించింది. కానీ ఈ గ్రూపులో భారత్ భాగంగా లేదు. భారతదేశానికి బదులుగా పాక్, తుర్కియేలతో రక్షణ అవగాహన కల్పించుకునేందుకు సౌదీ మొగ్గు చూపడాన్నే ఒక భౌగోళిక రాజకీయ సంకేతంగా తీసుకోవాలి. భారత్తో ఆర్థిక సంబంధాలు, ఇంధన వర్తకం వృద్ధి చెందుతున్నా, సంక్షోభం ముంచుకొస్తే, భారతదేశాన్ని ఒక ముఖ్యమైన భద్రతా భాగ స్వామిగా రియాద్ చూడదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పరపతి పెరుగుతూండటం రెండవ అంశం. రెండు పవిత్ర మసీదులకు రక్షణదారుగా ఉన్న దేశంతోనూ, ఒక ‘నాటో’ సైనిక శక్తితోనూ రక్షణ ఒడంబడిక కుదుర్చుకోవడం ఇస్లామాబాద్కు దౌత్యపరమైన విలువ తెచ్చిపెడుతోంది. అంతర్జాతీయంగా పాక్ ఏకాకి అయిందనే కథనానికి ఇది గండికొడుతోంది. బలాబలాల మధ్య సమతూకాన్ని మక్కా రక్షణ ఒడంబడిక రాత్రికి రాత్రి మార్చేయకపోవచ్చు. సంయుక్త సున్నీ సైనిక శక్తి రేపటికి రేపే అవతరించకపోవచ్చు. కానీ, ఈ ఒడంబడిక రెండు చేదు వాస్తవాలను వెల్లడిస్తోంది. ఒకటి– కీలకమైన మధ్యవర్గ శక్తులు కేవలం అమెరికాపై ఆధారపడే ధోరణి నుంచి దూరం జరుగుతున్నాయి. రెండు– ఈ వైవిధ్యీకరణలో సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, తక్షణ ఆచరణాత్మక దృక్పథంతో నూతన కూటములు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ ఎదుట సునిశితమైన సవాల్ ఉంది. గల్ఫ్ నుంచి ఆగ్నేయాసియా వరకు భద్రతను కల్పించగల శక్తిగా అవతరించాలని కోరుకుంటున్న భారత్ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను సౌదీ అరేబియా వంటి దేశాలు అక్కున చేర్చుకోగలిగినవిగా మలచాలి. సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ -
గిరిజన సాగును ఎలా చూడాలి?
మైదాన ప్రాంతాల కోసం రాసిన పథకాలను, అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఏజెన్సీ ప్రాంతాలకు యథాతథంగా పంపుతున్నాం. అక్కడి రైతులు కొత్త పద్ధతులు స్వీకరించడం లేదని నివేదికల్లో రాసుకుంటున్నాం. సమస్య రైతులది కాదు; అక్కడి పరిస్థితులను అర్థం చేసు కోలేని మనది. 2025 మార్చిలో తెలంగాణ రైతు కమిషన్ ఏర్పాటు చేసిన బృందంతో కలిసి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లాం. అక్కడ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తన పంట దెబ్బతింది. కంకుల్లో గింజ పట్టలేదు. జిల్లా కమిటీ లెక్క ప్రకారం 959 మంది రైతులకు చెందిన 2,178 ఎకరాల్లో పంట నష్టపోయింది. మా దృష్టిని ఆకర్షించింది పంట నష్టం కంటే దాని వెనుక ఉన్న ఏర్పాట్లు, వ్యవస్థల వైఫల్యం.బాండ్ వ్యవసాయం అంటే ఏమిటి?విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం చేసుకోవు. స్థానిక ఆర్గనైజర్లతో ఒప్పందం చేసుకుంటాయి. ఆ ఆర్గనైజర్ రైతుతో నోటిమాట మీద మాత్రమే ఒప్పందం చేసుకుంటాడు. దీన్ని అక్కడ బాండ్ వ్యవసాయం అంటారు. విత్తనం, ఎరువులు, పురుగుమందులు అప్పుగా ఇచ్చి, పంట కొనుగోలు సమయంలో వసూలు చేసుకుంటాడు. వడ్డీ నెలకు వంద రూపాయలకు అయిదు రూపా యలు– సంవత్సరానికి అరవై శాతం! చట్టం ప్రకారం ప్రతి కాంట్రాక్ట్ సాగు ఒప్పందాన్ని మార్కెట్ కమిటీలో నమోదు చేయాలి. పురుగు మందులకు బిల్లులు లేవు; అవి అమ్మటానికి లైసెన్సులు లేవు; ఒక చిన్న నోటుపుస్తకంలో పేర్లు మాత్రమే రాశారు. కొన్నిచోట్ల గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేశారు. మందుల డబ్బాల మీద సూచనలు ఇంగ్లిష్లో ఉన్నాయి.దీని ఫలితం మనుషుల మీద కనిపించింది. పొలంలో పని చేస్తూ విషప్రయోగానికి గురైన ఒక మహిళ చేతులు, కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమైంది. పిచికారీ పనిని పర్యవేక్షించిన ఒక మేస్త్రీ పక్షవాతానికి గురయ్యాడు; వైద్యం కోసం ఆ కుటుంబం మిగిలిన నలభై సెంట్ల భూమిని అమ్ముకుంది. వరుసగా రెండు నష్టాల తరు వాత ముప్ఫై అయిదేళ్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లెవరూ వ్యవస్థ బయట ఉన్నవాళ్లు కాదు. పెద్ద కంపెనీల కోసం విత్తనం పండించినవాళ్లు. అయినా ఒప్పందం లేదు, బిల్లు లేదు, బీమా లేదు, ఫిర్యాదు చేసే చోటు లేదు.రెండు రకాల గిరిజన వ్యవసాయంతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఒకేలా లేవు. తెలంగాణలో గిరిజన వ్యవసాయం ఎప్పుడో వాణిజ్య వ్యవసాయంగా మారి పోయింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో గోండు, కోలాం కుటుంబాలు గతంలో పండించిన జొన్న, పప్పు ధాన్యాలు, మిశ్రమ పంటల స్థానంలో పత్తి వచ్చింది. ములుగు, భద్రాద్రిలో కాంట్రాక్ట్ విత్తన సాగు నడుస్తోంది. రాష్ట్రంలో హెక్టారుకు దాదాపు 253 కిలోల ఎరువులు వాడుతున్నారు; దక్షి ణాది సగటు 164 మాత్రమే. 2019 నాటికి రాష్ట్రంలోని 92 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి; ఆ అప్పులో దాదాపు సగం బ్యాంకులది కాదు, వడ్డీ వ్యాపారులది.ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కొండ మండలాల్లో పది కుటుంబాల్లో ఏడు ఇప్పటికీ ప్రధానంగా సొంత అవసరాల కోసమే పండిస్తు న్నాయి– రాగులు, కొర్రలు, సామలు, కంది, వరి. కొండ వాలుల్లో పోడు సాగు కొనసాగుతోంది. రసాయనాల వినియోగం తక్కువే. వాణిజ్య పంటలు వచ్చినా అవి బహువార్షిక పంటలు– అరకు కాఫీ, మిరియాలు, పైనాపిల్, పసుపు. ఇక్కడ సమస్య అప్పుల భారం కాదు; తక్కువ దిగుబడులు, మార్కెట్ అందుబాటులో లేకపోవడం. అంటే ఒక ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వాణిజ్య వ్యవస్థను నియంత్రించాలి. మరో ప్రాంతంలో ఉన్నదానికి విలువ చేర్చాలి.పథకాలు ఎందుకు పనిచేయడం లేదు?రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్ ప్రకారం, ఏ చట్టమైనా షెడ్యూల్డ్ ప్రాంతానికి వర్తించకుండా చేయడానికి, లేదా అవసరమైన మార్పులతో వర్తింపజేయడానికి గవర్నర్కు అధికారం ఉంది. గిరి జనుల భూమి బదిలీని నియంత్రించే అధికారంతో పాటు, వారికి వడ్డీ వ్యాపారం చేసే వ్యవహారాన్ని నియంత్రించే అధికారం కూడా స్పష్టంగా ఇచ్చారు. ఆ అధికారంతోనే 1960లో షెడ్యూల్డ్ ప్రాంతాల వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధన చేశారు. అది ఇప్పటికీ రెండు రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో అమల్లో ఉంది. అంటే ములుగులో అరవై శాతం వడ్డీ వసూలు చేసేవాడిని ఆపడానికి అరవై అయిదేళ్లుగా చట్టం అందుబాటులో ఉంది. వాడలేదు.ఇలాంటి సమస్యలు పునరావృతం కాకూడదు అంటే వెంటనే చేయదగినవి మూడు ఉన్నాయి. ఒకటి– షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి కాంట్రాక్ట్ సాగు, విత్తన ఉత్పత్తి ఒప్పందాన్ని విత్తే ముందే మార్కెట్ కమిటీలో నమోదు చేయించడం; ఒప్పంద పత్రం తెలుగులో రైతు చేతిలో ఉండాలి. రెండు– వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధనను అమలు చేయడం; సామగ్రి అమ్మేవాడే అప్పు ఇచ్చేవాడు, పంట కొనేవాడు కూడా అయినప్పుడు ఆ మూడు పాత్రలూ కాగితం మీద కనిపించాలి. మూడు– పట్టా పేరును కాక నిజంగా సాగుచేసేవారిని గుర్తించడం; గ్రామసభ ధ్రువీకరణ ఆధారంగా పోడు సాగుదారు లకు, కౌలుదారులకు, మహిళా రైతులకు రుణం, బీమా, పంట నష్ట పరిహారం అందేలా చూడటం. ఈ మేరకు ఒక ముసాయిదా విత్తన ఉత్పత్తి దారుల రక్షణ చట్టం ప్రభుత్వానికి సమర్పించటం జరిగింది. అది ఇప్పటికీ అమలులోకి రాలేదు. ఇది సాధ్యమేనా అంటే – అవును!అమ్రాబాద్లో చెంచు కుటుంబాలతో కలిసి పనిచేసినప్పుడు మిరప పంటలో సీజ¯Œ కు ఇరవై సార్లు కొట్టే పిచికారీలు ఆరు, ఏడుకు తగ్గాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గోండు, కోలాం రైతుల 700 ఎకరాలు సేంద్రియ, ప్రకృతి సాగులోకి మారాయి; రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ప్రభుత్వం మంచిర్యాలలో ఒక సేంద్రియ దుకాణం కేటాయించింది. నారాయణపేటలో సెర్ప్ సంస్థతో కలిసి 1,500 ఎకరాలు మార్పు దిశగా వెళ్లగా, 200 ఎకరాల్లో వరి స్థానంలో చిరుధాన్యాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో గిరి సిరి రైతు సంఘం కింద 2,600 ఎకరాలు ప్రకృతి సాగులో ఉన్నాయి; పసుపు, వేరు శనగ ప్రాసెసింగ్ యూనిట్లు స్థానికంగానే ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు చోట్లా చేసిన పని ఒకటే. రైతు ఇప్పటికే పండిస్తున్న దానినుంచి మొదలుపెట్టడం. ముందు ప్రమాదకర మందులు తీసేయడం. నీరు తక్కువున్న చోట చిరుధాన్యాలు. పొలం పక్కనే పోషకాహార తోట. మార్కెట్ పెట్టుకోవడానికి రైతు సంఘం. ఉత్పత్తి దగ్గరే ప్రాసెసింగ్. వీటిలో దేనికీ కొత్త పథకం అవసరం లేదు. చివరగా ఒక మాట. రెండు రాష్ట్రాల్లోనూ షెడ్యూల్డ్ ప్రాంతాల వ్యవసాయ గణాంకాలను విడిగా ప్రచురించడం లేదు. గిరిజన కుటుంబాల ఎరువుల వాడకం, అప్పులు, నేల ఆరోగ్యం, దిగు బడులపై ప్రత్యేకంగా సమాచారం లేదు. ఈ లోటు తీర్చడం ఖరీదైన పని కాదు; చేయాలన్న నిర్ణయం మాత్రమే కావాలి.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
కశ్మీరీలకు పాకిస్తాన్పై ప్రేమేం లేదు!
కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్పై ప్రేమ లేదు. ఈ మాట అంటున్నది అధీన రేఖకు రెండు వైపులా కశ్మీరీల గురించి కూడా. ప్రస్తుతం రేఖకు ఆవలివైపున గత రెండు నెలలుగా మరోమారు ఆందోళనలు జరగడాన్ని చూస్తున్నాం. అదే సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇటు వైపున గలవారికి కూడా ఎటువంటి ప్రేమ లేదు. వాస్తవం ఇది కాగా... ఇటువారంతా కేవలం మత దృష్టితో పాకిస్తాన్పై ప్రేమతో భారత వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారనే ప్రచారాలను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు.ఇండియానే ఎందుకు కోరుకున్నారు?పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి చర్చించేముందు, సందర్భం వచ్చింది గనక మన కశ్మీర్ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. వలస పాలన ముగుస్తుండిన 1947లో బ్రిటిష్వారు ఇక్కడి సంస్థానాలకు భారత యూనియన్లో లేదా పాకిస్తాన్లో విలీన మయ్యే స్వేచ్ఛను ఇచ్చారు. అపుడు కశ్మీర్ పాలకుడు హిందువు కాగా, ప్రజలు మెజారిటీ సంఖ్యలో ముస్లింలు. రాజు హరిసింగ్ గానీ, ప్రజలు గానీ పాకిస్తాన్లో చేరేందుకు ఇష్టపడలేదు. అప్పటి ప్రధాన రాజకీయ పక్షం నాయకుడు షేక్ అబ్దుల్లా పూర్తిగా ఇండియా పక్షం వహించాడు. కోరుకుంటే పాకిస్తాన్లో చేరగల అవకాశం దేశ విభజన చట్ట ప్రకారం ఉండి కూడా, భారతదేశంలో విలీనాన్ని ఎందుకు కోరుకున్నారు? నేను కశ్మీర్లోని మొత్తం 22 జిల్లాల్లోనూ మూడుసార్లు విస్తారంగా పర్యటించినపుడు, ఇతర విషయాలను అట్లుంచి ప్రత్యేకంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ప్రయత్నించాను. నేను వెళ్లిన జిల్లాలలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కశ్మీర్ లోయతో పాటు పాకిస్తాన్ సరిహద్దుల వెట ఉండి ఆ ప్రభావాలు గణనీయంగా గల కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ జిల్లాలు కూడా ఉన్నాయి. రెండుసార్లు వెళ్లినపుడైతే మిలిటెంట్ చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి. మిలిటెంట్లకు పాకిస్తాన్ సహాయాలు అందు తూనే ఉన్నాయి. అయిన్పటికీ ఏ దశలోనూ ఒక చిన్న వర్గం తప్ప పాకిస్తాన్ను కోరుకోకపోవడం గమనార్హం. ఇద్దరికీ సరిపడనిదే!మొట్టమొదటి వేర్పాటువాద ఆజాద్ కశ్మీర్ ప్లెబిసైట్ సంస్థ ఆ తర్వాత జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్గా మారినప్పుడు వారి లక్ష్యం రెండు వైపులా గల కశ్మీరీలను వేరుపరిచి స్వతంత్ర దేశాన్ని నెలకొల్పడం. ఆ సంస్థను ఇండియా, పాకిస్తాన్ రెండూ అణచి వేశాయి. ఆ సంస్థ ముగిసిన తర్వాత కొంత కాలానికి 26 పార్టీలు, సంస్థలతో ఆల్ పార్టీ హుర్రియత్ కాన్ఫరెన్స్ ఏర్పడింది. నేను ఆ సంస్థ ముఖ్య నాయకులు కొందరితో మాట్లాడాను. విషయం ఏమంటే... లిబరేషన్ ఫ్రంట్ రెండు దేశాలను వ్యతిరేకించే కశ్మీరీ జాతీయవాద సంస్థ కాగా, హుర్రియత్లో కొద్దిమంది మాత్రమే పాకిస్తాన్ అనుకూలురు. సామాన్య ప్రజానీకంలో అత్యధికులు పాకి స్తాన్కు ఎంతమాత్రం అనుకూలురు కాదు. అదే సమయంలో వారందరికీ ఇండియాపై తీవ్రమైన ఫిర్యాదులున్నాయి. ఈ ద్వంద్వ స్థితిని అర్థం చేసుకోవాలంటే ముందు చరిత్రలోకి వెళ్లి, తర్వాత స్వాతంత్య్రానంతర వర్తమానంలోకి రావాలి. మొదటి నుంచి హిందూమతం ఉండిన కశ్మీర్లోకి క్రీస్తు పూర్వమే బౌద్ధం బలంగా ప్రవేశించింది. అశోకుడు (శ్రీనగర్ను స్థాపించింది ఆయనే), కుషాణులు బాగా వ్యాపింప చేశారు. మధ్య ఆసియా వర్తకుల ద్వారా ఇస్లాం వచ్చిన తర్వాత 14వ శతాబ్దంలో సూఫీ యిజం విస్తరించింది. ఈ విధమైన బౌద్ధం, సూఫీయిజం కలగలిసిన ప్రభావాలు కశ్మీరీల విశ్వాసాలు, ఆలోచనలు, సంస్కృతులపై వేసిన బలమైన ముద్రలు నేటికీ ఉన్నాయి. అందువల్లనే వారు జనసంఖ్య రీత్యా మెజారిటీ సున్నీలే అయినా పాకిస్తాన్లోని జనాభాతో, అక్కడి పాలకులతో ఏకీభావం లేదు. 1947లో లేదు. ఇప్పటికీ లేదు. అయితే, రెండు వైపులగల జాతి అనే భావన మాత్రం ఉంది. అందుకే కశ్మీర్ మొత్తంగా స్వతంత్రం కావాలని ప్రయత్నించిన రోజులలో లిబరేషన్ ఫ్రంట్కు విస్తారమైన సానుభూతి లభించింది. ఈ భావనలు తెలిసినందువల్లనే కశ్మీర్ ప్రతిపత్తిపై ప్లెబిసైట్ జర పాలన్న ప్రతిపాదన కొందరు చేయగా, ఇండియాతో పాటు పాక్ కూడా వ్యతిరేకించింది. స్వతంత్ర కశ్మీర్ వారికి కూడా సరిపడనిదే!మారని మౌలిక దృష్టిఇదంతా చరిత్రతో పాటు, 1947 అనంతరపు తొలినాళ్ల పరిస్థి తులు. ఆ తర్వాతకు వచ్చి, మూడు విషయాలను చూస్తే చిత్రం పూర్తవుతుంది. ఒకటి, పాకిస్తాన్పట్ల ఆ తర్వాత కూడా, చివరకు మిలిటెన్సీ కాలంలోనూ జనబాహుళ్యంలో ప్రేమ కలగకపోవడం. రెండు, ఇండియాపైన కూడా ప్రేమ ఏర్పడకపోవడం. అయినప్పటికీ పాకిస్తాన్తో పోల్చినప్పుడు ఇండియా మెరుగనుకోవడం. మూడవది భవిష్యత్ గురించి వారి ఆలోచనలు. ప్రత్యేక దేశంగా ఏర్పడినాక పాకిస్తాన్లో ఉంటూ వచ్చిన పరి స్థితులు ఇటువైపు కశ్మీరీలకు నచ్చలేదు. అభివృద్ధి, ప్రజల జీవి తాలు, శాంతి భద్రతలు, అప్రజాస్వామికతలు, సైనిక కుట్రలతో పాటు, అటువైపు గల తమ కశ్మీర్ సోదరులు, బంధుమిత్రుల పరి స్థితి, హక్కుల లేమి, అణిచివేతలు అందుకు తోడయ్యాయి. అటు చేరినా తాము బాగుపడేది ఏమున్నది కనుక అనే ప్రశ్నను నేను అన్నివైపుల నుంచీ విన్నాను. తమ మిలిటెంట్ యువకులకు అక్కడి నుంచి సహాయం అందటం వరకు కొంత సానుకూలతను కల్పించినా, మౌలికమైన దృష్టి మాత్రం మారలేదు. ఇండియా స్వతంత్రమైన తర్వాత 40 సంవత్సరాల వరకు కశ్మీర్లో మిలెటెన్సీ లేదు. నిజానికి ఆ కాలమంతా నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డాయి. అభివృద్ధి మృగ్యమై తీవ్ర అసంతృప్తి ఏర్ప డింది. అయినా కేంద్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. అది చాలద న్నట్లు ప్రజాస్వామిక విధి విధానాలతో నిమిత్తం లేకుండా రాజ కీయ క్రీడలు యథేచ్ఛగా సాగించాయి. కశ్మీర్ ఒక సున్నిత స్థితిలో గల సరిహద్దు రాష్ట్రం, పాకిస్తాన్ అవకాశం కోసం పొంచి ఉన్నదనే స్పృహ సైతం లేకుండా పోయింది.అటువంటి పరిస్థితులతో ఇక ఓపిక నశించిన ప్రజలు 1987 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ రెండింటినీ ఓడిస్తు న్నట్లు ఓట్ల లెక్కింపులో స్పష్టమవుతుండగా... కనీవిని రీతిలో రిగ్గింగ్ జరిపి తామే గెలిచారు. పట్టరాని ఆగ్రహానికి గురై మిలిటెన్సీ మార్గం పట్టింది. పాకిస్తాన్ ఆ అవకాశాన్ని అందుకుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాలుగా మిలిటెన్సీనైతే గణనీయంగా అణిచి వేశారు గానీ ప్రజలు విశ్వాసాన్ని సంపాదించలేక పోయారు. మధ్యలో ఆ ప్రయత్నాలు జరిగింది వీపీ సింగ్, పీవీ నరసింహా రావుల కాలంలో మాత్రమే. ప్రజలు కూడా వారిని విశ్వసించారు. బీజేపీ రాకతో పరిస్థితి తిరిగి క్షీణమార్గం పట్టింది. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్యే. జెన్–జీ సమస్యే. పునర్విభజన బిల్లు సమస్యే. రామ మందిరంలో విరాళాల చోరీ సమస్యే. క్యాబినెట్ మార్పులూ సమస్యే. నిజంగా సమస్యలైనవి కొన్ని ఉంటాయి... అవసలు సమస్యలే కాదని ఎంత అనుకున్నా సమస్యలు కాకుండా పోనివి! ఆరెసెస్ను సంతోషంగా ఉంచటం నిరంతర సమస్య. ఒక్క ఏడాదైనా, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు లేకుండా ఉండక పోవటం నిరవధిక సమస్య. ఆగస్టు 13తో వర్షాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. సభ లోపల సమస్యలతో సమస్య లేదు. ఆ సంగతి స్పీకర్ ఓం బిర్లా చూసుకుంటారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు చూసుకుంటారు. స్పోక్స్ పర్సన్ సంవిత్ పాత్రా చూసుకుంటారు. మాటకు మాట చెప్పవలసి వస్తే ఎంపీ దినేష్ శర్మ చూసుకుంటారు. వీళ్ల కాక, చూసీ చూడనట్లు చూసుకునే ‘ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్’ రాజ్నాథ్ సింగ్, ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ అమిత్ షా ఎటూ ఉంటారు. టీమ్ అంతా కలిసి సమస్యలు కానివాటిని, సమస్యలు కానివాటితో డీల్ చేస్తుంది. చివరికి వచ్చేసరికి ఏదీ సమస్య కాకుండా పోతుంది. ఏదీ సమస్య కానప్పుడు, పడుకున్న 8 సెకన్ల లోపే గాఢ నిద్ర పట్టేస్తుంది. ఒక దేశ ప్రధానికి పడుకున్న ఎనిమిది సెకన్లకే గాఢ నిద్ర పట్టేయటం దేశ సౌభాగ్యానికి సంకేతం. దేశ ఆర్థికాభివృద్ధికి సూచిక. ‘‘మా త్రివిధ దళాలు కళ్లు తెరిచే ఉన్నాయి’’ అని శత్రు దేశాలకు హెచ్చరిక. ‘‘దేశంలో శాంతి భద్రతలు లేవు’’ అని ఆరోపిస్తున్న ప్రతి పక్షాల నోటికి ఆనకట్ట. సభలో ఈ చివరి మూడు రోజులను కూడా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సాగనిచ్చేలా లేరు. వాళ్ల ఆందోళన, నిరసన, డిమాండ్ ఒక్కటే... కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావటం లేదో చెప్పాలని! తరగతి గదిలో అల్లరి చేస్తున్న పిల్లల మధ్యలోంచి ఒక మంచి విద్యార్థి లేచివెళ్లి, తరగతి బయట కాస్త దూరంగా చెట్టుకింద కూర్చుని తన క్లాస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండటంలో జాతికి హితం కానిది ఏముంటుంది? వీళ్లు శీతాకాల సమావేశాలనైనా సజావుగా నడవనిస్తారా?! అప్పటికి ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై రిపోర్ట్ కూడా సిద్ధమై పార్లమెంటుకు వచ్చేస్తుంది. అదొస్తే, అందులోని ఏదో ఒక పాయింట్ను సపోర్ట్గా తీసుకుని పునర్విభజన బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టటానికి ఉంటుంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇప్పుడున్నది బీజేపీ కనుక అక్కడ మళ్లీ బీజేపీనే వస్తుంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కనుక అక్కడ ఈసారి బీజేపీ వస్తుంది. ఎన్నికలు సమస్య కాదు. సభలో బిల్లులు సమస్య కాదు. ఖర్గే, రాహుల్ సమస్య కాదు. ఆరెసెస్ను సంతృప్తి పరచటం ఒక్కటే సమస్య ఇప్పుడు! ‘‘జెన్–జీ ఆందోళనలో న్యాయం ఉంది’’ అని అంటున్నారు ఆరెసెస్ చీఫ్ మోహన్ భాగవత్! ‘‘విద్యార్థులపై పోలీసు చర్య వెనుక అసలేం జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది’’ అంటున్నారు! ‘‘జెన్–జీని నేను గుడ్డిగా నమ్ముతాను’’ అంటున్నారు! జెన్–జీ వాదనను ఓపికతో వినాలని, వాళ్ల డిమాండ్లను ప్రేమతో అర్థం చేసుకోవాలని అంటున్నారు!అంటే, చెట్టుకింద కూర్చుని క్లాస్ వర్క్ చేస్తున్న మంచి స్టూడెంట్ని మంత్రి వర్గం నుంచి డిబార్ చెయ్యాలని చెబుతున్నారా? జెన్–జీని ఇక్కడ ఎవరు మాత్రం గుడ్డిగా నమ్మటం లేదు?! జెన్–జీ వాదనను ఇక్కడ ఎవరు మాత్రం ఓపికతో వినటం లేదు?! అర్థం చేసుకోని వారికంటే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకునేవారే సమస్యగా మారతారు. నిద్ర కూడా పట్టకుండా చేస్తారు. -
అమెరికాను నిలబెట్టిన 'విలువలు ఏమిటి'?
ఒక చరిత్రకారుడిగా, ఒక చిన్న రాజకీయ–చారిత్రక చిత్రాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. మీలో చాలా మంది 21వ శతాబ్దంలో జన్మించారు. అమెరికాలో జన్మించినవారు 2001 సెప్టెంబర్ 11 (9/11) ఉగ్రదాడుల ప్రభావంలో పెరిగారు. 1814లో అమెరికా క్యాపిటల్ భవనం, వైట్ హౌస్కు బ్రిటిష్ సైన్యం నిప్పంటించిన తర్వాత... యూఎస్ఏ భూభాగంపై జరిగిన తొలిపెద్ద విదేశీ దాడి అదే. మీరు పెరుగుతున్న సమ యంలో అమెరికా ప్రభుత్వం ఇరాక్, అఫ్గానిస్తాన్లలో రెండు దీర్ఘకాల యుద్ధాలు చేసింది. నా కంటే ముందు తరాలకు మాత్రం అమెరికా కేంద్ర ప్రభుత్వం ఎంతో సమర్థంగా కనిపించేది. అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, హ్యారీ ట్రూమన్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని సాధించారు. వ్యోమగాములను చంద్రుడిపైకి!1960ల ప్రారంభంలో యువతకు ఫెడరల్ ప్రభుత్వం అంటే దేశంలో ఆధునిక రహదారులు నిర్మించడం, అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం వంటి గొప్ప విజ యాలు గుర్తుకు వచ్చేవి. అప్పట్లో సోవియట్ యూనియన్తో జరుగుతున్న పోటీలోనూ అమెరికా ముందంజలో ఉండేది. 1965లో అధ్యక్షుడు, కాంగ్రెస్ కలిసి ఒక చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ఎంతో గౌరవంగా భావించిన ఆ చట్టమే... 1965 ఓటింగ్ హక్కుల చట్టం. మీ తరం మాత్రం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ చరిత్రలోని మరో కోణాన్ని కూడా చూసింది. వియత్నాం యుద్ధంలో వేలాది మంది యువ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని మీరు చదివారు. అలాగే మీ కళ్ల ముందే ధనికులు–పేదల మధ్య అంతరం పెరగడం చూశారు. ఎంతో మంది అమెరికన్లు తమ ‘అమెరికన్ డ్రీమ్‘ సాధించే అవకాశాన్ని కోల్పోవడమూ గమనించారు. కరోనా మహమ్మారి అనే విషాదాన్ని మనమందరం అనుభవించాం. ఆ మహమ్మారి ప్రభావం ఇప్పటికీ మన జీవి తాలపై ఉంది. ఆ వ్యాధి వల్ల పది లక్షలకు పైగా అమెరికన్లు మరణిస్తారని అప్పట్లో మనలో ఎవరైనా ఊహించామా? ఇప్పుడు మనం అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సమావేశమయ్యాం. ఒక్కసారి చరిత్రలోకి చూస్తూ... అమెరికాను బలంగా నిలబెట్టిన ఆరు గొప్ప సంప్రదాయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మొదటి విలువ–చట్టం అందరికీ సమానం:నా దృష్టిలో మొదటి గొప్ప సంప్రదాయం చట్ట పరిపాలన (రూల్ ఆఫ్ లా). ప్రతి పౌరుడికి సమాన న్యాయం లభించడం. న్యాయ వ్యవస్థలో ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండకపోవడం. అలాగే ఎవరికీ ప్రత్యేక శిక్షలు కూడా ఉండకపోవడం. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అనే సూత్రాన్ని మనం ఎప్ప టికీ కాపాడుకోవాలి. రెండో సంప్రదాయం–స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు:ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించే అవకాశం కలిగి ఉండాలి. బ్రిటన్ రాజరిక వ్యవస్థలా కాకుండా, అమెరికా వ్యవస్థాపకులు దేశ పాలనా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టారు. వారు ప్రభుత్వ పని తీరును ఓటు ద్వారా అంచనా వేస్తారు. ఎన్నికలు అంటే అదే. యుద్ధం జరిగినా ఎన్నికలు ఆగలేదు. అమెరికా అంతర్యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎన్నికలు రద్దు చేయాలని కొంతమంది మేధావులు సూచించారు. కొంతమంది మరింత ముందుకెళ్లి, ఫెడరల్ సైన్యాన్ని రాష్ట్రాల్లో మోహరించి, పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకోవాలనీ, అవసరమైతే మార్షల్ లా కూడా అమలు చేయాలనీ కోరారు. కానీ అంతర్యుద్ధం సమయంలో అబ్రహాం లింకన్, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రూజ్వెల్ట్ కేవలం ఒకే వాక్యంలో సమాధానం చెప్పారు: ‘ఎన్నికలు యథావిధిగా జరగాలి’. అలా చేయడం ద్వారా అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో, ఎంత స్థిర మైనదో ప్రపంచానికి చూపించాలని వారు కోరుకున్నారు. మూడో విలువ – నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ:మూడో గొప్ప సంప్రదాయం ఏమిటంటే... దేశ వ్యవస్థాప కులు నిజాయితీ, పారదర్శకత, సామర్థ్యం, నైతికత, కరుణ, మర్యాద, త్యాగస్ఫూర్తి వంటి విలువలతో నడిచే రాజకీయ వ్యవస్థను కలగన్నారు. అధ్యక్షులు జాన్ ఎఫ్.కెన్నెడీ, రోనాల్డ్ రీగన్ తరచూ అమెరికాలోని తొలి కాలనీ గవర్నర్ జాన్ విన్త్రోప్ చెప్పిన మాటలను గుర్తు చేసేవారు. ఆయన ఇలా చెప్పారు: ‘ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తోంది. కాబట్టి మనం కొండపై వెలిగే నగరంలా ఆదర్శంగా ఉండాలి’. ఫిలడెల్ఫియా లోని వాల్నట్ స్ట్రీట్ ప్రాంతంలో థామస్ జెఫర్సన్ ఒక గొప్ప కల కనేవారు. పారదర్శకమైన, నిజాయితీతో కూడిన, మిత వ్యయంతో, గౌరవప్రదంగా, సమర్థవంతంగా పనిచేసే రాజ కీయ వ్యవస్థ ఏర్పడితే... ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని ఆయన నమ్మారు.నాలుగో విలువ–ప్రతి పౌరుడిలో నాయకత్వం ఉండాలి:దేశానికి నాయకత్వం అనేది కేవలం వాషింగ్టన్ డి.సి.లోని ప్రభుత్వానికే పరిమితం కాకూడదు. 1776లో బ్రిటన్ లో అన్ని ముఖ్యమైన నిర్ణయాలు రాజే తీసుకునేవాడు. కానీ అమెరికా వ్యవస్థాపకులు వేరే విధంగా ఆలోచించారు. ఒకవేళ ప్రజలకు అధ్యక్షుడు, కాంగ్రెస్ లేదా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే... వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని దేశాన్ని సరైన దిశలో నడిపించాలని ఆశించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ఒక గొప్ప మాట చెప్పేవారు: ‘అమెరికాలో అత్యంత గొప్ప హోదా ‘మిస్టర్ ప్రెసిడెంట్’ కాదు. ‘మిస్టర్ సిటి జన్’(పౌరుడు)! అమెరికా రాజ్యాంగం ప్రకారం... ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలి.ఐదో విలువ – చరిత్రకారులు, మేధావుల బాధ్యత:ఐదో సంప్రదాయం... అమెరికా సమాజంలో చరిత్రకా రులు, పరిశోధకులు, మేధావులకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి. దేశ వ్యవస్థాపకులు విమర్శ కూడా ప్రజాస్వామ్యానికి అవసర మేనని భావించారు. రాజరిక వ్యవస్థల్లో, నియంతృత్వ పాలనల్లో కనిపించేలా కాకుండా... అమెరికా వ్యవస్థాపకులు నిరంతర ఆత్మపరిశీలన ద్వారా సమాజాన్ని మెరుగుపరచాలని విశ్వసించారు. దేశాన్ని పొగిడేవారికే కాదు... దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా విమర్శించేవారికీ సమాన గౌరవం ఇవ్వాలని నమ్మారు. గొప్ప అమెరికన్ నాయకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆయన చెప్పిన అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే... ‘ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే’! కానీ 2026లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లోని కొందరు రాజకీయ నాయకులు, చరిత్రకారులు తమకు అను కూలంగా మాత్రమే మాట్లాడాలని కోరుకుంటున్నారు. సర్కస్లో చెప్పినట్లు చెప్పే విదూషకుల్లా వారు ప్రవర్తించాలని ఆశిస్తున్నారు. అమెరికా చరిత్రలో జరిగిన తప్పులు, లోపాలు బయటపడితే వాటిని పట్టించుకోవద్దని లేదా వాటికి సాకులు చెప్పాలని వారు కోరుతున్నారు. అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. చరిత్రను మార్చే ప్రయత్నాలు మరింత ప్రమాదకరం. కొంతమంది రాజకీయ నాయకులు... నల్లజాతి చరిత్రలోని కీలకమైన అంశాలను తగ్గించి చూపాలని, లేదా పూర్తిగా తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు. అది అమెరికా విలువలకు విరుద్ధం. ఆరో విలువ – జాతీయ ఐక్యత:నేను చెప్పబోయే ఆరు గొప్ప సంప్రదాయాల్లో చివరిది... జాతీయ ఐక్యత. అమెరికా వ్యవస్థాపకులు ప్రజలు రాజకీయాలపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చని అంగీకరించారు. వారు పరస్పరం చర్చించాలి, వాదించాలి. కానీ చివరికి ఒకేదేశ ప్రజలమనే భావనను కోల్పోకూడదని ఆశించారు. బ్రిటిష్ రాజరికంలో లాగా రాజభవనం నుంచి ఆదేశాలు రావడం కాకుండా... ప్రజలే దేశ భవిష్యత్తును నిర్ణయించాలని వారు విశ్వసించారు. వ్యవస్థాపకులు అధ్యక్షుడిని ప్రభుత్వ అధినేత గానే కాకుండా, దేశ రాజకీయ నాయకుడిగానూ రూపొందించారు. జార్జ్ వాషింగ్టన్ను ఆదర్శంగా తీసుకొని, ఎప్పటి కప్పుడు దేశాన్ని ఏకం చేసే నాయకులు రావాలని వారు ఆశించారు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘అమెరికా అనేది ఒక అందమైన రంగురంగుల మొజాయిక్’(అందమైన చిత్రం) అన్నారు. అంటే... భిన్న సంస్కృతులు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి దేశాన్ని నిర్మిస్తారని ఆయన ఉద్దేశం. అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా... ‘పరస్పర ప్రేమ, అనుబంధాలే మనందరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతాయి’. -
రేర్ ఎర్త్ ఖనిజాల్లో ఇండియా ఎక్కడ?
రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ మరింత వేగం పుంజుకుంటు న్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రంగంలో దాదాపు గుత్తాధిపత్యం చలాయించిన చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికా సహా పలు దేశాలు, ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థ లను అభివృద్ధి చేయడంపై భారీగా పెట్టు బడులు పెడుతున్నాయి. ఈ ఖనిజాల తవ్వకం, శుద్ధీకరణ, శాశ్వత అయస్కాంతాల తయారీని వేగవంతం చేయడానికి ఇటీవల అమెరికా ప్రభుత్వం ‘మైన్–టు–మాగ్నెట్’ పథకం కింద భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. భారత్ కూడా ఈ దిశలో అడుగులు వేస్తోంది. అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్ఈఎల్ విశాఖపట్నంలో రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కేంద్రం ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేసింది. అంతకుముందు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్లు’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భిన్న దేశాల్లో, భిన్న సందర్భాల్లో దాదాపు ఒకే సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి– అసలు రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత తీవ్రంగా పోటీ పడుతున్నాయి?ఎందుకు రేర్?పేరులో ‘రేర్’ అనే పదం ఉన్నప్పటికీ, ఇవి ప్రకృతిలో అత్యంత అరుదుగా లభించే ఖనిజాలు కావు. భూమి పొరల్లో అనేకప్రాంతాల్లో లభిస్తాయి. అయితే, అధిక స్వచ్ఛతతో, లాభదాయకంగా తవ్వి, ఇతర ఖనిజాల నుంచి సులభంగా వేరు చేసి శుద్ధి చేయగల నిల్వలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. అందుకే వీటికి ‘రేర్’ అనే విశేషణం వచ్చింది. అలాగే ‘ఎర్త్’ అనే పదం కూడా ఆ ఖనిజాల మూలస్థానమైన మట్టినిగానీ, నేలనుగానీ సూచించదు. తొలినాళ్లలో ఈ మూలకాలు భూమి నుంచి వెలికితీసిన ఖనిజ ఆక్సైడ్ల రూపంలోనే శాస్త్రవేత్తలకు మొదటిసారిగా పరిచయం కావడంతో, వాటికి ‘రేర్ ఎర్త్’ అనే పేరు స్థిరపడింది. మొత్తం 17 రేర్ ఎర్త్ మూల కాలు ఉన్నాయి.ఈ మూలకాలపై ప్రపంచం ఇంతటి ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం, సాధారణ లోహాలకు భిన్నంగా ఉండే వాటి అసాధారణ రసాయన, భౌతిక లక్షణాలే. వీటితో తయారయ్యే శాశ్వత అయ స్కాంతాలు పరిమాణంలో చిన్నవైనా, ఆకర్షణ శక్తిలో బలంగా ఉంటాయి. విద్యుత్ వాహనాల మోటార్లు, విండ్ టర్బైన్లు, విమా నాలు, రక్షణ రంగ పరికరాల్లో సుమారు 200 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అధిక ఉష్ణోగ్రతల్లోనూ డిస్ప్రోసియం వంటి రేర్ ఎర్త్ మూలకాలు తమ అయస్కాంత శక్తిని పదిలపరచుకోగలవు. ఎందుకంత ప్రాముఖ్యం?ఇవి నేడు మనం నిత్యం ఉపయోగిస్తున్న అనేక ఆధునిక పరిక రాలకు కీలక ఆలంబనగా మారాయి. స్మార్ట్ఫోన్ , ఎల్ఈడీ టీవీ, ఇయర్బడ్స్, విద్యుత్ వాహనం, విండ్ టర్బైన్ , ఎంఆర్ఐ యంత్రం, ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ విమానాలు– ఇలా నేడు మనం ఉపయోగించే దాదాపు ప్రతి ఆధునిక పరికరం తయారీలో రేర్ ఎర్త్ మూలకాల పాత్ర ఉంటుంది. వీటిలో నియోడిమియంను అత్యంత శక్తిమంతమైన శాశ్వత అయస్కాంతాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తే, లాంథనం అధిక నాణ్యత గల కెమెరా లెన్సులు, బ్యాటరీల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతికత, స్వయంనియంత్రిత వాహనాల వంటి సమకాలీన ఆవిష్కరణలకు కూడా ఈ మూలకాలే చోదక శక్తిగా నిలుస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి, తాజాగా హోర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా శృంఖలల బలహీనతను మరోసారి తేటతెల్లం చేశాయి. అత్యవసర వనరుల కోసం ఒకే దేశంపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రపంచం అనుభవపూర్వకంగా ఈ సందర్భాల్లో గ్రహించింది. ఇదే సమయంలో అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోటీ తీవ్ర తరమైంది. రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా పరిమితులు విధించడం ఆందోళనను మరింత పెంచింది. ప్రపంచంలోనే అత్యధిక రేర్ ఎర్త్ ఖనిజ నిల్వలు చైనాలో లేనప్పటికీ, గత మూడు దశాబ్దాల కృషి ఫలితంగా ఈ రంగంలో గుత్తాధిపత్యం మాత్రం దానిదే. ముడి ఖనిజాల తవ్వకంతో ఆగిపోకుండా, వాటి శుద్ధీకరణ, శాశ్వత అయ స్కాంతాలు, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ వరకు మొత్తం విలువ గొలుసుపై చైనా క్రమంగా ఆధిపత్యం సాధించింది.భారత్ ఏం చేయాలి?భారత్లో విస్తారమైన రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నప్పటికీ, వెలికితీత అనంతర దశల్లో ఇంకా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన వ్యూహానికి పదును పెట్టుకుంటూ, రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకానికే పరిమితం కాకుండా, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీ కేంద్రాన్ని ఐఆర్ఈఎల్ ప్రతిపాదించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రేర్ ఎర్త్ ఖనిజాల రంగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే గనులతో పాటుగా వాటిని శుద్ధి చేయగల, శాశ్వత అయస్కాంతా లుగా మలచగల, అత్యాధునిక ఉత్పత్తులుగా తీర్చిదిద్దగల నిపుణుల లభ్యత కూడా కీలకం. ఈ దిశగా భారతదేశంలో ఇప్పటివరకూ అంతగా ఆదరణకు నోచుకోని మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరి యల్స్ సైన్స్, రేర్ ఎర్త్ సాంకేతికతలను మరింత ప్రోత్సహించాలి. ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో రేర్ ఎర్త్ మెటలర్జీ, క్రిటికల్ మినరల్స్, మాగ్నెట్ టెక్నాలజీ వంటి ప్రత్యేక కోర్సులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటు తక్షణావసరం. అయితే వీటికి సమర్థమైన ప్రత్యామ్నాయాలను కనుగొనగలమా? సముద్ర గర్భం, చంద్రుడిపై ఉన్న ఈ ఖనిజ నిక్షేపాలను వినియోగించడం సాధ్యమవుతుందా? వీటి తవ్వకం, శుద్ధీకరణ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలు పరిశోధనా సంస్థలకే పరిమితం కాకూడదు. అవి సామాన్య ప్రజలకు ఉపయోగపడే, అందుబాటులో ఉండే ఉత్పత్తులు, సాంకే తిక పరిష్కారాలుగా రూపాంతరం చెంది నప్పుడే ఆ పరిశోధనల పరమార్థం నెరవేరినట్లవుతుంది.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు -
అణుదాడిని మరిస్తే శాంతి నెలకొనదు!
1945 ఆగస్టు 6 ఉదయం 8:15 గంటలకు హిరోషిమాలో ఉదయపు హడావుడి మొదలైంది. వీధుల్లో కార్లు శబ్దం చేస్తూ వెళ్తున్నాయి, ఆఫీసు ఉద్యోగులు తమ బల్లల వద్ద కుదురుకుంటున్నారు, పిల్లలు పాఠశాలలకు సిద్ధమవుతున్నారు. అంతలోనే, ఒక్క క్షణంలో, సూర్యుడి కంటే అత్యంత ప్రకాశవంతమైన కాంతి నగర మంతటా వ్యాపించింది. ఒక అమెరికా బి–29 బాంబర్ ‘ఎనోలా గే’ ప్రపంచంలోనే తొలి సారిగా అణుబాంబును జారవిడిచింది. ఆకాశంలోకి మష్రూమ్ క్లౌడ్ (పుట్టగొడుగు లాంటి పొగ) ఎగిసిపడటంతో క్షణాల్లో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1945 చివరి నాటికి, పేలుడు, తీవ్రమైన కాలిన గాయాలు, రేడియేషన్ కారణంగా సుమారు 1,40,000 మంది మరణించారు.ఆ బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసిన వారిలో తమేతో ఉఎమోరి ఒకరు. అప్పట్లో 40 ఏళ్ల వయసున్న ఉఎమోరి, మరుసటి రోజు తన కుటుంబ సభ్యుల కోసం శిథిలాలలో వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలో, గాయపడిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఆయన ఎటు చూసినా ఊహకు అందని దారుణ దృశ్యాలే: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన జనాలు, నీళ్ల కోసం అరుస్తున్న బాధితులు, బూడిదగా మారిన పొరుగు ప్రాంతాలు. మరణించిన వారి దేహాలపై ఈగలు, పురుగులు ముసురుకోవడం ప్రారంభించాయని ఉఎమోరి 1987లో తన 88వ ఏట ‘అసోసియే టెడ్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆ బాంబు దాడిలో తన తమ్ముడితో సహా సొంత కుటుంబ సభ్యులు మరణించారని ఆయన చివరికి తెలుసుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఆయనను ఎన్నడూ వదల్లేదు.దుఃఖం నుంచి పోరాటానికి...హిరోషిమా అనుభవించిన ఘోరాన్ని మరెవరూ అనుభవించ కుండా చూడటానికి ఉఎమోరి తన మిగిలిన జీవితాన్ని అంకితం చేశారు. అణు బాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన అనేకమంది ’హిబాకుషా’లలో ఒకరిగా మారారు. వీరు తమ వ్యక్తి గత విషాదాన్ని అణు ఆయుధాలకు వ్యతిరేకంగా జీవితకాల పోరా టంగా మార్చుకున్నారు. తదనంతరం మరణించిన ఉఎమోరి, 1987 నాటి తన ఇంటర్వ్యూలో, అణు నిరాయుధీకరణ గురించి ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. అది నేటికీ అత్యంత అత్యవసరమైనది. విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన మరొక వ్యక్తి శాండ్ఫోర్డ్ జెడ్. పర్సన్స్. రెండవ ప్రపంచ యుద్ధంలో యు.ఎస్. నేవీలో పనిచేశారు. బాంబు దాడి జరిగిన నాలుగు నెలల తర్వాత ఆయన హిరోషి మాలో పనిచేస్తున్నప్పుడు, తాను ఊహించినదానికి భిన్నమైన విధ్వంసాన్ని చూశారు. నగరంలోని అనేక ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఆ అనుభవం పర్సన్స్ను వెంటాడింది. చివరికి శాంతి కోసం తనను అంకితం చేసుకున్నారు. వరల్డ్ ఫెడరలిస్ట్ మూవ్మెంట్ డైరెక్టర్గా మారి, 1984లో మరణించే వరకు అణు ఆయుధాల ముప్పును తగ్గించే అంతర్జాతీయ ఒప్పందాల కోసం పోరాడారు. ఒకరు జపనీస్, మరొకరు అమెరికన్. వారు చరిత్రలోనే అత్యంత విధ్వంసకర యుద్ధంలో పరస్పరం వ్యతిరేక దిశల్లో నిలబడ్డారు. అయినప్పటికీ, మానవాళి భవిష్యత్తు అణు ఆయు ధాలు మళ్లీ ఎప్పటికీ ఉపయోగించకుండా చూడటంపైనే ఆధారపడి ఉంటుందని ఇద్దరూ నమ్మారు.ఆయుధం వర్సెస్ ఆహారంయునైటెడ్ స్టేట్స్ 1945 ఆగస్టు 6న హిరోషిమాపై, మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 9న నాగసాకిపై మరో అణు బాంబునువేసింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి ఈ దాడులు అవసరమా లేదా జపాన్ ను ఇతర మార్గాల ద్వారా లొంగిపోయేలా చేయవచ్చా అనే దానిపై చరిత్రకారులు ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉన్నారు. అయితే వివాదానికి తావులేని విషయం ఏమిటంటే, ఆ బాంబు దాడులు అణు ఆయుధాల అసమాన విధ్వంసక శక్తిని నిరూపించాయి. మానవాళి వెనక్కి రాలేని ఒక తీవ్రమైన సరిహద్దును దాటేసింది. హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన బాంబులు ఆధు నిక ప్రమాణాలతో పోలిస్తే ప్రాథమికమైనవి (చిన్నవి). నేటి అణు ఆయుధాలు అంతకంటే విధ్వంసకరమైనవి. ఆర్మ్స్ కంట్రోల్ అసో సియేషన్ ప్రకారం, ప్రపంచంలోని అణుశక్తి దేశాలు సంయుక్తంగా 12,000 కంటే ఎక్కువ అణు ఆయుధాలను కలిగి ఉన్నాయి. చాలా వరకు హిరోషిమాను నాశనం చేసిన బాంబు కంటే ఎంతో శక్తిమంత మైనవి. ఒకే ఒక ఆధునిక థర్మోన్యూక్లియర్ ఆయుధం ఒక మహా నగరాన్నే తుడిచిపెట్టగలదు.ఐరిష్ రచయిత పాట్రిక్ కమర్ఫోర్డ్ మరో ముఖ్యమైన కోణాన్ని ప్రస్తావించారు. ఒక్క అణు క్షిపణికి అయ్యే ఖర్చుతో వేలాదిమంది పిల్లలకు ఆహారం, స్వచ్ఛమైన నీరు, మందులను అందించవచ్చని ఆయన అన్నారు. అణు ఆయుధాలను ఎప్పటికీ ప్రయోగించక పోయినా అవి భారీ ఖర్చును మోపుతాయి. ఆయుధాగారాలను నిర్వహించడానికి, ఆధునికీకరించడానికి ప్రభుత్వాలు అపారమైన నిధులను వెచ్చిస్తాయి. అణు నిల్వలను విస్తరించడానికి వెచ్చించే ప్రతి రూపాయి ప్రజారోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు లేదా శాస్త్రీయ పరిశోధనలకు లభించకుండా పోతుంది.ఒప్పందాలతోనే శాంతిభద్రత ముఖ్యమైనదే. రక్షణ గురించి దేశాలకు ఆందోళనలు ఉంటాయి. అయితే ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చాయని చరిత్ర నిరూపిస్తోంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) అణు ఆయుధాల వ్యాప్తిని పరిమితం చేయడానికి సహాయపడింది. కోల్డ్ వార్ కాలంలో వాషింగ్టన్, మాస్కో మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు వేలాది అణు ఆయుధాలను నిర్మూలించాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధాగారాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రమాదాన్ని తగ్గించే విషయంలో అవే అత్యధిక బాధ్యత వహించాలి. ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ సంక్షోభాలను పరిష్కరించే ప్రయత్నా లతో పాటు ఈ శక్తుల మధ్య తీవ్రమైన చర్చలు జరగాలి. చరిత్రలో ఆయుధ నియంత్రణ విజయవంతమైంది దేశాలు ఒకరినొకరు నమ్మడం వల్ల కాదు, ఉమ్మడి ముప్పు సహకారాన్ని కోరుతుందనే విషయాన్ని గుర్తించడం వల్లనే!హిరోషిమాను ప్రత్యక్షంగా చూసిన తరం వేగంగా కనుమరుగ వుతోంది. 1945 నాటి ఆ ఆగస్టు రోజున తాము ఏమి చూశారో వివ రించగలిగే బాధితులు త్వరలోనే ఎవరూ ఉండరు. మిగిలేది వారి మాటలు, వారి హెచ్చరికలు, వారు మనకు వదిలివెళ్లే బాధ్యత మాత్రమే. తమేతో ఉఎమోరి తన జీవితాంతం ప్రపంచాన్ని హిరోషిమాను గుర్తుంచుకోమని కోరింది అది కేవలం చరిత్ర అని కాదు. ఆయన జీవించిన చరిత్ర మళ్లీ పునరావృతం కాకూడదని! హిరోషిమా అణుబాంబు దాడి రోజు కేవలం జ్ఞాపకార్థ దినం మాత్రమే కాకూడదు. ఇది ‘నిరాయుధీకరణ దినోత్సవం’ కావాలి. ప్రభుత్వాలు అణు ప్రమాదాలను తగ్గించడానికి అంకితం చేసుకునే రోజు, సాధారణ పౌరులు అలా చేయాలని డిమాండ్ చేయడానికి పునరంకితం అయ్యే రోజు కావాలి. బాధితులు ఇప్పటికే తమ సాక్ష్యాన్ని ప్రపంచానికి అందించారు. మనం దానికి అనుగుణంగా స్పందిస్తామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.విలియమ్ ల్యాంబర్స్వ్యాసకర్త ‘ద రోడ్ టు పీస్’ రచయిత(‘ద జపాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పౌర స్వేచ్ఛలో తేడాలెందుకు?
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక దేశాల మధ్య పౌర స్వేచ్ఛలకు సంబంధించి ముఖ్యమైన తేడా ఒకటుంది. ఆ తేడా ప్రభావాలు అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. గతంలో, వర్తమానంలోనే కాదు, మునుముందు కూడా కనిపించగల అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కనుక ఆ తేడాను, అందుకు కారణాలను అర్థం చేసుకునేందుకు ఒక ప్రాథమికమైన ప్రయత్నం అవసరం. ప్రతి దేశానికి అంతర్గత విధానాలు సరేసరి కాగా, విదేశాంగ విధానం ఒకటి ఉంటుంది. అది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందుతుందనేది తెలిసిందే. అట్లా అనుగుణం అని తాము భావించే విధంగా విదేశాంగ విధానాన్ని ప్రభుత్వాలు రూపొందిస్తాయి. అనగా ఆ సమయంలో అధికారంలో ఉండే పార్టీలు. ఆ విధానాలలో కొన్ని స్థిరంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కానీ సదరు విధానం, లేదా విధానాలు దేశ ప్రయోజనాలకు అనుగుణమైనవి కావనీ, నష్టం కూడా కలిగించవచ్చుననీ ప్రతిపక్షాలో, మీడియానో, మేధావులో భావించినట్లయితే, ఆ విధానాలను నిష్కర్షగా విమర్శించే పౌర స్వేచ్ఛలు ఎంతవరకు ఉంటున్నాయి? ఆ స్వేచ్ఛలలో తేడాలెందుకు?నచ్చనిది ముఖం మీదే...ఈ ప్రశ్న విదేశాంగ విధానాల గురించి ఇతరత్రా రావటం సరేసరి కాగా, యుద్ధ సందర్భాలలో మరింత తీవ్రంగా తలెత్తుతుంది. యుద్ధమన్నది మహా సున్నితమైన విషయం, భావోద్వేగాలతో కూడా ముడిపడి ఉండేది గనుక. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలు ఒక విధానాన్ని అనుసరిస్తున్నపుడు, ఆ విధానం దేశ ప్రజలకు అవసరమని చెప్తున్నపుడు, ఆ యుద్ధం వల్ల అటువంటి ప్రయోజనాలేవీ లేవని భావించేవారు విభేదించి మాట్టాడవచ్చునా? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ భావ ప్రకటనా స్వేచ్ఛను, లేదా పౌర స్వేచ్ఛను ఇస్తున్నపుడు, అటువంటి అవకాశం కాగితం పైన ఉన్నా ఆచరణలో ఎంతవరకు లభిస్తున్నది? ఇపుడు నిర్దిష్టమైన ఉదాహరణలను చెప్పుకుంటే విషయం ఇంకా బోధపడుతుంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై పాలస్తీనాపై యుద్ధాలు సాగిస్తున్నాయి. అవి ఆ రెండు దేశాల ప్రయెజనాలకు అవసరమని చెప్తున్నాయి. కానీ ఆ వాదనతో విభేదించే అమెరికన్, ఇజ్రాయెల్ పౌర సమాజాలు, మీడియా, మేధావి వర్గాలు, రిటైరయిన సైన్యాధికారులు పెద్ద సంఖ్యలోనే తమ ప్రభుత్వ విధానాలను కేవలం నర్మగర్భంగా గాక, ప్రత్యక్షంగా, తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలలో ప్రభుత్వ విధానాలకు ఆమోదం నానాటికి తగ్గిపోతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలలోనూ పౌర స్వేచ్ఛలు ఈ విధంగా ప్రజాస్వామికంగా, నిర్భయమైన రీతిలో వ్యక్తమవుతున్నాయి. ఆ విధానాలు దేశ ప్రయోజనాలకు ఏ విధంగా భంగకరమో వారు వివరించి చెప్తున్నారు. ఇంకా అనాలంటే చెప్పగలుగుతున్నారు. వాస్తవానికి అమెరికా, యూరప్లలో ఈ ప్రజాస్వామిక స్వేచ్ఛలు మొదటి నుంచి ఉన్నాయి. మనవరకు చూస్తే వియత్నాం యుద్ధకాలం నుంచే కనిపిస్తున్నాయి. దేశద్రోహం పేరిట...ఇటువంటి పౌర స్వేచ్ఛలు భారతదేశం మొదలైన ప్రజాస్వామిక వ్యవస్థలలో ఉన్నాయా? ఉంటే ఎంతవరకు? ఇది ఇండియాకే కాదు, ఇటువంటి వర్ధమాన దేశాలు అన్నింటికి సంబంధించినది. ప్రస్తుత మధ్య ఆసియా యుద్ధాలనే చూద్దాము. అక్కడ ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా, గల్ఫ్ రాజ్యాల కోణం ఒకటున్నది. అది గాక ఇజ్రాయెల్– పాలస్తీనా– అమెరికా కోణం మరొకటి. రెండూ దుర్మార్గమైన యుద్ధాలే అయినా, మొదటి దానికి సంబంధించి భారత ప్రభుత్వం గల్ఫ్ నుంచి ఇంధనం, ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న భారతీయుల సంక్షేమం అనే అంశాలను పేర్కొంటున్నందున ఆ మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ రెండవది?ఇజ్రాయెల్తో సంబంధాల సాధారణీకరణ గతంలోనే జరిగినా, ఇపుడు గాజా హత్యాకాండతో సమస్య తీవ్ర రూపం తీసుకుంది. అటువంటపుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ దారుణాన్ని ఖండించకపోవటమే గాక, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాలను సైతం అనుమతిస్తున్నది. ఐక్యరాజ్య సమితిలో ద్వంద్వ ధోరణి చూపుతున్నది. ఇందుకు గల కారణాలలో ఇజ్రాయెల్ ప్రభుత్వపు ఇస్లాం వ్యతిరేకతతో ప్రస్తుత భారత ప్రభుత్వానికి గల ఏకీభావం కూడా ఒకటనే అభిప్రాయం ఉంది. ఇజ్రాయెల్లోని అరబ్బులను అక్కడి ప్రభుత్వం హతమార్చకుండానే ఒక పద్ధతి ప్రకారం ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చుతున్నట్లు, దానితో ప్రేరణ చెందిన ఇక్కడి ప్రభుత్వం కూడా అదే మార్గంలో ఉందనే సందేహాలున్నాయి. ప్రశ్న ఏమంటే, ఇటువంటి అంచనాలను, విమర్శలను వ్యక్తీకరించేందుకు భారత దేశంలో గల పౌర స్వేచ్ఛ ఎంత? ఇది ఒక వర్తమానపు ఉదాహరణ మాత్రమే. గతంలోకి వెళితే అనేకం ఉన్నాయి. ఉదారవాద ప్రజాస్వామిక పార్టీ అనుకునే కాంగ్రెస్ పరిపాలనలో కూడా, అదేవిధంగా, పైన అనుకున్నట్లు ఇది ఇండియాలోనే గాక, వర్ధమాన దేశాలన్నిటా కనిపిస్తున్న పరిస్థితి. అందువల్ల ఈ చర్చ భారత దేశానికి పరిమితమైనది కాదు. స్థూలంగా చెప్పుకోవాలంటే, పౌర స్వేచ్ఛలలో ఇటువంటి తేడాలు అభివృద్ధి చెందిన దేశాలలో ఒక విధంగా, వర్ధమాన దేశాలలో మరొక విధంగా కనిపిస్తున్నాయి. వర్ధమాన దేశాలలో ఆ స్వేచ్ఛలు లేకపోవటమే గాక వాటిని దేశ ద్రోహం పేరిట, మత ద్రోహం పేరిట, మరో పేరిట అణిచివేయటం కూడా జరిగితే?స్థిరపడని విలువలుఇవన్నీ చెప్పుకున్న తర్వాత, ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను అభివృద్ధి చెందినవి, వర్ధమాన స్థితిలో ఉన్నవి అని స్థూలంగా విభజించి చూసినపుడు, రెండింటి మధ్య ఈ తేడాలెందుకనే మౌలికమైన ప్రశ్న గురించి చర్చించటం అవసరం. ఇంత లోతైన విషయం తేలికగా అర్థమయ్యేది కాదు. కానీ ఒక ప్రాథమిక ప్రయత్నమంటూ జరగాలి. ఆ విధంగా చూసినపుడు తోస్తున్నవి కొన్నున్నాయి. మనం అభివృద్ధి చెందిన దేశాలంటున్నవి పెట్టుబడిదారీ విధానంలో ఎదిగి వచ్చినవి. ఆ క్రమంలో పౌరులకు తమ హక్కులు, స్వేచ్ఛలు, వాటిని కాపాడుకోవడం అన్నది, వారి వ్యక్తిత్వాలు, వ్యక్తిగత గుర్తింపులు రూపుదిద్దుకునే క్రమంలో ఒక సంప్రదాయంగా మారింది. ఇవన్నీ వారి ప్రజాస్వామ్యంలో భాగమయ్యాయి. వాటిని వారు బలంగా కాపాడుకుంటారు. ఇందుకు పునాదులు రినైజాన్స్–పునరుజ్జీవనోద్యమం (14–17 శతాబ్దాలు), ఫ్రెంచ్ విప్లవం (18వ శతాబ్దం), ఇంగ్లండ్లో పారిశ్రామిక విప్లవం (18వ శతాబ్దం నుంచి)లో పడ్డాయి. అప్పటి నుంచి ప్రజాస్వామ్యాలు, వ్యక్తి స్వేచ్ఛలు, పౌర స్వేచ్ఛలు వ్యవస్థీకృత రూపం తీసుకుని బలపడ్డాయి. అక్కడి పార్టీలు, ప్రభుత్వాలు, వాటి విధానాలు ఎట్లున్నా ఈ వ్యవస్థలు, స్వేచ్ఛలు మారలేదు. అదే నేటికీ కనిపిస్తున్నది. ఇందుకు భిన్నంగా, వర్ధమాన దేశాలనేవి చిరకాల ఫ్యూడల్ దశలు, రాచరికాలు, వలస పాలనల నుంచి బయటకు రావటం మొదలై ఇంకా వంద సంవత్సరాలు కూడా కాలేదు. యూరప్ తరహా విప్లవాలు రాలేదు. విలువలు ఇంకా నిజమైన అర్థంలో రూపుదిద్దుకోలేదు. పౌరుల వ్యక్తిత్వాలు, పౌర స్వేచ్ఛలు ఇంకా బలపడి వ్యవస్థీకృత రూపం తీసుకోలేదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలనే చట్ట సభలు, పాలనా యంత్రాంగం, న్యాయస్థానాలు కూడా ఇంకా తమ స్ఫూర్తికి అనుగుణంగా స్థిరపడి బలపడవలసే ఉంది. అందువల్ల ఈ ఎదుగుదల వ్యత్యాసాలే మొదట చెప్పుకున్న వ్యత్యాసాలకు కూడా కారణమవుతున్నాయనిపిస్తున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పట్టువదలని ట్యారిఫ్ విక్రమార్కుడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టువదలని విక్రమార్కునివలె ఈ నెల 24న భారత్ సహా మొత్తం 60 దేశాలపై మరో విడత దిగుమతి సుంకాలను పెంచారు. అవి అదే రోజు నుంచి అమ లుకు కూడా వచ్చాయి. ఈసారి ఆయన చెప్పిన కారణం: ఈ దేశాలు కార్మికులతో బలవంతపు చాకిరీ చేయించి ఉత్పత్తి చేస్తున్న సరకులను తమ దేశానికి ఎగు మతి చేస్తున్నాయని! ట్రంఫ్ ట్యారిఫ్ల పరంపర ఎప్పుడు మొదలై ఎట్లా సాగుతున్నదో, అందుకు తను చెప్తూ వస్తున్న ఛప్పన్నారు కారణాలేమిటో తెలిసినవే. అత్యవసర చట్టం నెపంతో...2025 జనవరిలో అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించిన వెంటనే, ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ మెమోరాండం’ పత్రంపై సంతకం చేశారు. తర్వాత వారం రోజులకు సమస్త దేశాలపై 10 శాతం నుంచి 25 శాతం దిగుమతి సుంకాలు పెంచారు. అందులో చిన్న దేశాలు, పెద్ద దేశాలు, మిత్ర దేశాలు, శత్రు దేశాలనే తేడాలు చూప లేదు. ఇతరులతో అమెరికాకు గల వాణిజ్య లోటు ఈ చర్యకు కారణ మన్న ఆయన, తమకు వాణిజ్య మిగులు ఉన్న దేశాలనూ మినహా యించలేదు. ఒక్క మానవ మాత్రుడైనా నివసించక పెంగ్విన్స్ మాత్రమే ఉండే దీవులనూ తన జాబితాలో చేర్చారు. ఆయన విధానాలను, తీరును చూడగా తన పదవీ కాలం ముగిసే 2029 జనవరి వరకు ఈ ధోరణి ముగియక పోవచ్చునని పిస్తున్నది. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఈ నెల 24 నాటి సుంకాల గురించి చెప్పుకోవాలి. సుంకాలను మొదట భారీగా పెంచినప్పుడు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్) ఉపయోగించారు. ఇతర దేశా లతో వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు కలిగించగల స్థాయికి పెరిగిందనీ, కనుక ఇటువంటి అత్యవసర చర్యలను అమెరి కన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే తీసుకునే అధికారం ఆ చట్ట ప్రకారం అధ్యక్షునికి ఉందనీ అన్నారు. కానీ, అటువంటి పరిస్థి తులు లేవనీ, కనుక ఆ చర్యలు చెల్లవనీ అక్కడి సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొట్టివేసింది. అంతవరకు ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన వందలకొద్ది బిలియన్ల అదనపు సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.దానితో ఆందోళనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి కొత్తదారులు వెతకటం మొదలు పెట్టారు. సుప్రీం తీర్పు నుంచి తప్పించుకునేందుకు తనకు ప్రత్యామ్నా యాలు ఉన్నాయని వెంటనే ప్రకటించిన ఆయన, కాంగ్రెస్ అను మతి వెంటనే అక్కరలేని 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టాన్ని ఆశ్రయించారు. అందులోని 301వ నిబంధన మేరకు వేర్వేరు దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ట్యారిఫ్లు ప్రకటించారు. అయితే ఆ నిబంధన ఒక పరిమిత కాలం వరకే అమలులో ఉంటుంది. ఆ గడువు తీరటంతో ఈ నెల 24న అదే స్థాయి శాతా లతో ట్యారిఫ్లను శాశ్వతంగా మార్చారు. ఆ ప్రకారం ఇండియాపై రేటు 10 శాతం అయింది.సుంకాల మజిలీలుఈ ట్యారిఫ్ల యాత్రలో భారత దేశానికి, ఇతరులకు సంబంధించి కూడా పలు మజిలీలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో మొదటి విడత సుంకాలలో భాగంగా ఇండియాపై 25 శాతం విధించిన ఆయన, మనం రష్యా చమురును ఖరీదు చేస్తున్నందుకు ఆగ్రహించి మరో 25 శాతం పెంచారు. అట్లా అది 50 శాతం అయింది. ఇతరత్రా డబ్ల్యూటీవోతో నిమిత్తం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ, వేర్వేరు దేశాలతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలను తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం చర్చల పద్ధతిని గాక ఒత్తిడులు, బ్లాక్మెయిలింగ్ను ఎంచుకున్నారు. అది తట్టుకోలేని దేశాలు విడిగా ఒప్పందాలకు ఒప్పుకోగా ట్యారిఫ్ల శాతం అపుడు కొంత తగ్గించారు. ఆ విధంగా ఇండియాపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇపుడు 10 శాతంతో కలిపి 28 శాతం అవుతున్నాయి.జపాన్, దక్షిణ కొరియా వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాలేదు, అమెరికాకు సన్నిహిత రాజ్యాలై నప్పటికీ– కెనడా, యూరప్ వంటి మిత్ర దేశాలు ఒకమేర రాజీ పడుతూ ప్రత్యామ్నాయ వాణిజ్య సంబంధాల కోసం అన్ని ఖండా లలో అన్వేషణలు మొదలు పెట్టాయి. రష్యాకు అమెరికాతో గల వాణిజ్య సంబంధం అతి స్వల్పం అయినందున ఇరువురి మధ్య వచ్చేదీ పోయేదీ ఏమీ లేకపోయింది. ఆంబోతులు పోట్లాడితే లేగదూడల కాళ్లు విరిగాయన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలను అమెరికా విధించటంతో ఇతరులతో పాటు ఇండియా చాలానే నష్టపోయింది. ఆ ట్యారిఫ్లకు ప్రతిగా తాము కూడా అమెరికాపై ఎదురు సుంకాలు వేయగలమని కెనడా, యూరప్ హెచ్చరికలు చేసి ఆ పని కొంత మేర చేశాయి గానీ, పూర్తిగా ధిక్కరించి నిలిచింది చైనా ఒక్కటే.బలవంతపు చాకిరీలు నిజమేనా?ఇపుడు మాట్లాడుకోవలసిన ఆసక్తికరమైన విషయం ఒకటు న్నది. అది ఇండియా తదితర దేశాలు బలవంతపు చాకిరీతో ఉత్ప త్తులు చేసి అమెరికాకు విక్రయిస్తున్నాయనే ఆరోపణ. ఈ విషయమై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జరిపిన విచారణలో ధ్రువీకరణలు లభించాయని ట్రంప్ ప్రభుత్వం చెప్తు న్నది. అమెరికా, యూరప్ వర్ధమాన దేశాలను ఒత్తిడి చేసేందుకు బాలకార్మికులు, మితిమీరిన పని గంటలు, బలవంతపు చాకిరీ వంటి వాదనలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. విచిత్రమేమంటే, సాక్షాత్తూ అమెరికాలోనే రకరకాలుగా బలవంతపు చాకిరీ, శ్రామి కుల దోడిపీ జరుగుతున్నదని చెప్పే నివేదికలున్నాయి. కనుక, ఈ వాదన ఇతరులను ఒత్తిడి చేసే సాధనం మాత్రమే. ఇంతకూ జనవరి 2025తో ఆరంభించి శవం కోసం చెట్టెక్కు తూనే ఉన్న అమెరికా అధ్యక్షుని లక్ష్యాలు ఎంతవరకు నెరవేరు తున్నట్లు? అన్ని దేశాలూ తమను దోచుకుంటున్నాయంటూ సుంకాల హెచ్చింపును ఆరంభించినపుడు 900 బిలియన్ల మేర ఉండిన వాణిజ్య లోటు నేడు కూడా ఇంచుమించు అంతే ఉంది. కేవలం పారిశ్రామిక ఉత్పత్తులను తీసుకుంటే మరింత పెరిగి 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ట్యారిఫ్ల హెచ్చింపుతో ఏమీ ఒరగ లేదు. పన్నులు పెంచుతామని హెచ్చరించినా బయటి నుంచి తిరిగి వచ్చిన అమెరికన్ కంపెనీలు చాలా కొద్ది. కనుక ‘మాగా’ నినాదం మేర ఉద్యోగాలూ పెరగలేదు. ఆ విధంగా విక్రమార్కుని భుజంపై శవం నిలవకుండా ఉంది.మనమిక చూడవలసింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ విధంగా జరగనున్నదనేది. అందుకోసం ఫ్రేమ్ వర్క్ అనేది కుదిరినా, తుదిరూపపు చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం కొంత పట్టుదలగా ఉన్నమాట నిజం. అదే సమయంలో అది హానికరంగా ఉండకూడదని రైతులు, మత్స్యకారులు, జౌళి రంగం, ఇతర వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. చివరకు ఏమయేదీ చూడాలి!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నీట్ కంటే పెద్ద సమస్య... డీలిమిటేషన్!
దేశమంతా ఈరోజు నీట్, పేపర్ లీకులు, విద్యార్థుల ఆందోళనలు, రాజకీయ విమర్శల గురించే మాట్లాడుతోంది. ఇవన్నీ చిన్న విషయాలు కావు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి అంశం ప్రధానమైనదే. కానీ ఒక ప్రశ్న మనమందరం వేసుకోవాలి. దేశ రాజకీయాల భవిష్యత్తును, బహుజన సమాజం రాజకీయ వాటాను, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యాన్ని రాబోయే యాభై సంవత్సరాల పాటు నిర్ణయించబోయే అంశం నీటా? లేక డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణనా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెబితే, అసలు జాతీయ చర్చ జరగాల్సింది పార్లమెంట్ ముందుకు రానున్న ఈ రాజ్యాంగ సంబంధిత అంశాల గురించే అని అర్థమవుతుంది.దక్షిణాది రాష్ట్రాల ఆందోళనప్రజల దృష్టి ఒకవైపు మళ్లిన సమయంలో మరోవైపు దేశ రాజకీయ నిర్మాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు నిశ్శబ్దంగా ముందుకు సాగడం భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బహుజన సమాజం మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజక వర్గాల పునర్విభజనను చాలామంది కేవలం సరిహద్దులు మార్చే సాంకేతిక ప్రక్రియగా భావిస్తారు. వాస్తవానికి అది రాజకీయ అధికా రాన్ని తిరిగి పంచే ప్రక్రియ. రాజ్యాంగంలోని 81, 82, 170 అధికర ణాల ప్రకారం జనాభా ఆధారంగా లోక్సభ, శాసనసభ స్థానాలను పునర్విభజన చేయాలి. 1976లో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ, 2001లో వచ్చిన 84వ రాజ్యాంగ సవరణల కారణంగా ఈ ప్రక్రి యను 2026 తర్వాతి జనగణన వరకు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తోంది.ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల ఆందోళన మొదలవుతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, ప్రజారోగ్యం, విద్య రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అదే కారణంగా వాటిలో జనాభా పెరుగుదల తగ్గింది. ఇప్పుడు జనాభానే ప్రధాన ప్రమాణమైతే, ఈ రాష్ట్రాల లోక్సభ ప్రాతినిధ్యం సాపేక్షంగా తగ్గి, ఉత్తర భారత రాష్ట్రాల ప్రాధాన్యం పెరుగుతుంది. దేశ ప్రయోజనం కోసం అమలు చేసిన విధానాల ఫలితంగా రాజకీయంగా నష్టపోవడం సమంజసమా అనే ప్రశ్నకు దేశం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.కులగణనే కీలకంఇదే సమయంలో మహిళల రిజర్వేషన్ అంశాన్ని కూడా విడిగా చూడలేం. మహిళలకు శాసనసభల్లో, పార్లమెంటులో ఎక్కువ ప్రాతి నిధ్యం రావాలనే లక్ష్యాన్ని దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. అయితే మరో ప్రశ్నను విస్మరించకూడదు. ఆ స్థానాల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పటికే రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బలంగా ఉన్న వర్గాలకు చెందిన మహిళలే అధికంగా ఎన్ని కయ్యే పరిస్థితి ఏర్పడితే– బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ మహిళలకు నిజమైన అవకాశాలు ఎంతవరకు లభిస్తాయి? అందుకే బీసీ సంఘాలు చాలాకాలంగా మహిళల రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.ఈ చర్చలో కులగణన కీలకమైన అంశంగా మారుతుంది.దేశంలో పేదరికం లెక్కలు ఉన్నాయి. నిరుద్యోగం లెక్కలు ఉన్నాయి. రైతుల గణాంకాలు ఉన్నాయి. కానీ వివిధ సామాజిక వర్గాల నిజమైన జనాభా ఎంత అన్న సమాచారం లేకుండానే రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎలా పునర్నిర్మించగలం? అందుకే అనేక సామాజిక న్యాయ ఉద్యమాలు ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్ అనే క్రమాన్ని సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలు గణాంక ఆధారాలపై ఉండాలని పేర్కొంది.డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన – ఈ మూడు అంశాలు విడివిడిగా కనిపించినా వాస్తవానికి అవి ఒకే గొలుసులోని మూడు కడియాలు. ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్, ఆ తరువాత మహిళల రిజర్వేషన్ అమలు జరిగితేనే సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే అవకాశముందని అనేక సామాజిక న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రాజకీయ ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజల దృష్టి నీట్ వంటి తక్షణ సమస్యలపై కేంద్రీకృతమవుతున్న సమయంలో, రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన వంటి అంశాలపై తగినంత ప్రజా చర్చ జరుగుతోందా? దీనిపై భిన్నాభి ప్రాయాలు ఉండవచ్చు. కొందరు ఒకేసారి రెండు అంశాలపై పోరాటం చేయవచ్చని చెబుతారు. మరికొందరు తక్షణ రాజకీయ అంశాలు దీర్ఘకాల రాజ్యాంగ చర్చలను వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని వాదిస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రజలే. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జాతీయ ఉద్యమాలు తమ ప్రాధాన్య క్రమంలో దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక ఆందోళనలకు తగిన స్థానం ఇవ్వకపోవచ్చు. ఇది ఒక రాజకీయ విశ్లేషణ మాత్రమే; దీనిపై విస్తృత ప్రజాస్వామ్య చర్చ అవసరం.అడగాల్సిన ప్రశ్నలునీట్లో అవకతవకలు జరిగితే మళ్లీ పరీక్ష నిర్వహించవచ్చు. ఒక మంత్రి రాజీనామా చేయవచ్చు. ఒక ప్రభుత్వం ఎన్నికల్లో ఓడి పోవచ్చు. కానీ డీలిమిటేషన్ ద్వారా లోక్సభలో రాష్ట్రాల ప్రాతి నిధ్యం మారితే, మహిళల రిజర్వేషన్ అమలు వల్ల రాజకీయ నాయకత్వ నిర్మాణం మారితే, వాటి ప్రభావం ఒక్క ఎన్నికతో ముగిసి పోదు. అది తరతరాల పాటు కొనసాగుతుంది. అందుకే ఈరోజు దేశం ముందు ఉన్న అసలు ప్రశ్న నీట్ కాదు; భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రాతినిధ్యం ఎలా ఉండాలి అన్నదే.భారత రాజ్యాంగ పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రతి పౌరుడికి హామీ ఇస్తుంది. ఆ న్యాయం కేవలం ఎన్నికలు జరగడంలో కాదు; సమాజంలోని అన్ని వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉండటంలో ఉంది. అందుకే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర బహుజన వర్గాలు మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కోరాలి: ముందు కులగణన జరుగుతుందా? డీలిమిటేషన్కు ఏ ప్రమాణాలు అమలు చేస్తారు? మహిళల రిజర్వేషన్లో బహుజన మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఎలా కల్పిస్తారు?దేశ రాజకీయాల దిశను మార్చేది ప్రతిరోజూ వార్తల్లో కనిపించే వివాదాలు కావు. రాజ్యాంగంలో జరిగే మార్పులే. అందుకే బహుజన సమాజం ఈ చారిత్రక దశలో అప్రమత్తంగా ఉండాలి. రేపటి తరాల రాజకీయ భవిష్యత్తు ఈరోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. నేడు మనం ఏ ప్రశ్నలు అడుగుతున్నా మన్నదే రేపటి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్ని నిర్ణయిస్తుంది.డా‘‘ జె.పూర్ణచంద్ర రావువ్యాసకర్త ఐపీఎస్(రిటైర్డ్), మాజీ డీజీపీ; జాతీయ కోఆర్డినేటర్ ఏపీ– తెలంగాణ, అల్ ఇండియా బీఎస్పీ -
నాయకత్వం పదవి కాదు... బాధ్యత!
ఈ రోజు మీ ముందుకు రావడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ప్రతి పట్టభద్రుల సభలో మాట్లాడే వ్యక్తి ఇదే మాట చెబుతారేమో. కానీ నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. బర్కిలీ అత్యుత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయం మాత్రమే కాదు... ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం. నేను ఇక్కడ 17 సంవత్సరాలు బోధించే అదృష్టం పొందాను. ఇప్పుడు మీరు చదువు పూర్తయిందని అనుకుంటున్నారు. ఇక విద్యార్థి జీవితం ముగిసిందని భావిస్తున్నారా? ఎందుకంటే... జీవితం అంటే నేర్చుకోవడమే. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటాడు. ఒక మంచి విద్యార్థి... ఎప్పుడో ఒక రోజు ఉపాధ్యాయుడవుతాడు. ఈ రెండూ వేర్వేరు పాత్రలు కావు. ఒకే ప్రయాణంలో రెండు దశలు. మనలోని ఆసక్తి, ప్రశ్నించే స్వభావం, మనుషులతో కలిసిమెలసి నేర్చుకోవాలనే తపనే... బోధనకూ, అభ్యాసానికీ మూలం. ఒక్కసారి మీ పక్కన కూర్చున్న సహ విద్యార్థులను చూడండి. ఈ నాలుగేళ్లలో వాళ్ల దగ్గర నుంచి మీరు ఎంత నేర్చుకున్నారో ఆలోచించండి. మీరు కూడా వారికి ఎన్నో విషయాలు నేర్పారు. ఇదే నిజమైన విద్య.ఎవరు నిజమైన నాయకులు?నన్ను ఎప్పుడూ వెంటాడే ఒక ప్రశ్న ఉంది. రేపటి ప్రపంచానికి మార్గం చూపే గురువులు ఎవరు? నేను కేవలం పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించే ఉపాధ్యాయుల గురించే మాట్లాడటం లేదు. ప్రపంచం ఏ దిశగా వెళ్లాలి? ప్రజలకు ఏది సరైన మార్గమో ఎవరు చూపిస్తారు? నాయకుడు కావాలంటే... మీ పేరుకు ముందు పెద్ద హోదా ఉండాల్సిన అవసరం లేదు. ఖరీదైన కార్యాలయం అవసరం లేదు. ప్రభుత్వంలో మంత్రి కావాల్సిన అవసరం లేదు. చరిత్రను మార్చిన గొప్ప నాయకుల్లో చాలామందికి ఎలాంటి అధికార పదవులు లేవు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, డోలోరెస్ హుయెర్టా, రోసా పార్క్స్, డబ్ల్యూ.ఇ.బి. డు బాయిస్, సుసాన్ బి.ఆంథోనీ... వీళ్లందరూ తమ ఆలోచనలతో, ధైర్యంతో, నైతిక విలువలతో ప్రపంచాన్ని మార్చారు. నిజమైన నాయకుడు ఎవరు? ప్రపంచం ఎటు వెళ్లాలో తెలుసుకునే వ్యక్తి. ఆ దిశగా ఎలా వెళ్లాలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగల వ్యక్తి. ప్రజల ప్రతిభను, శక్తిని, మంచి ఆలోచనలను ఒకే లక్ష్యం కోసం కలిపి పనిచేయించగల వ్యక్తి. నాయకత్వం అనేది ఒక పదవి కాదు... అది ఒక నైతిక బాధ్యత! విద్య అసలు ఉద్దేశం ఏమిటి?ప్రపంచం ఇప్పుడు ‘మనం ఏం చేయగలం?‘ అనే ప్రశ్నతోనే ఎక్కువగా పరుగులు తీస్తోంది. అద్భుతమైన యంత్రాలను తయారు చేశాం. రోబోలను రూపొందించాం. కృత్రిమ మేధ (ఏఐ) కూడా మన జీవితాల్లోకి వచ్చింది. ఇది గొప్ప విషయమే. కానీ అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇంకొకటి ఉంది. ‘మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం?’ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడే విద్యకు నిజమైన అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఇంజినీర్లు ఒకేసారి ఇతర భాషలను అనువదించే హెడ్ఫోన్లను రూపొందిస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన సాంకేతిక పురోగతి. విదేశీ భాష నేర్చుకోవడం అంటే... ఒక దేశానికి వెళ్లి హోటల్లో భోజనం ఆర్డర్ చేయడం కోసమే కాదు. ఒక దేశ ప్రజలు ఎలా ఆలోచిస్తారు, వారి జీవన విధానం ఏమిటి అన్నది అర్థం చేసు కోవడానికే. ఇతరుల దృష్టికోణంలో ప్రపంచాన్ని చూడటం నేర్పించేదే నిజమైన విద్య. మీతో విభేదించే వ్యక్తులతో మాట్లాడండి. అదే అత్యుత్తమ అభ్యాసం. మన అభిప్రాయమే ఉన్నవారితో మాట్లాడితే, మనకు తెలిసినదే మళ్లీ వింటాం. భిన్నంగా ఆలోచించే వ్యక్తులతో మాట్లాడితే, కొత్త ఆలోచనలు పుడతాయి. మన అవగాహన విస్తరిస్తుంది. జ్ఞానం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఈ ప్రతిభతో సమాజానికి ఏమి చేయగలం? ప్రపంచాన్ని కొంచెమైనా మంచి దిశగా ఎలా తీసుకెళ్లగలం? అన్నదే అసలు ప్రశ్న. జ్ఞానం వ్యక్తిగత విజయానికి మాత్రమే ఉపయోగపడితే అది అసంపూర్ణం. అదే జ్ఞానం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపితే... అప్పుడే అది నిజమైన విద్య అవుతుంది. ప్రజాస్వామ్యం ఎందుకు అవసరం?జీవితం ‘ద విజార్డ్ ఆఫ్ ఓజ్’ సినిమా లాంటిది. ఆ సినిమాలో ఒక తుఫాను తర్వాత డోరోతీ కొత్త ప్రపంచంలోకి చేరుతుంది. కిటికీ తెరిచి బయటకు చూస్తే, అన్నీ రంగుల ప్రపంచంలా కనిపి స్తాయి. జీవితం కూడా అలాంటిదే. కొన్నిసార్లు, మనం ఊహించని తుఫాన్లు వస్తాయి. మనల్ని కుదిపేస్తాయి. కొన్నిసార్లు కింద పడేస్తాయి. కానీ ఆ కష్టాల తర్వాత కొత్త అవకాశాలు మన కోసం ఎదురుచూస్తుంటాయి. ఆ అవకాశాలను గుర్తించ గలిగితే, మన జీవితమే మారిపోతుంది. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి కేవలం అభినందనలు చెప్పి వెళ్లిపోతే నా బాధ్యత పూర్తికాదు. ఎందుకంటే, మీరు గొప్ప అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే... ఎన్నో సవాళ్లతో నిండిన ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య విలువలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. స్వేచ్ఛను, సమానత్వాన్ని, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యం ఎందుకు అంత ముఖ్యమైనది? ఒక మంచి సమాజం అంటే, బలవంతులు బలహీ నులను అణచివేయకుండా కాపాడే సమాజం. అదే నాగరికతకు పునాది. అలా కాకపోతే... అధికారం ఉన్నవారు తమ శక్తిని దుర్విని యోగం చేస్తారు. బలహీనులు మరింత వెనుకబడిపోతారు. చివరికి... అన్యాయం, అశాంతి, ఘర్షణలు పెరుగుతాయి. అందుకే ప్రజాస్వామ్యం అవసరం.మనం ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. బలం ఉన్నంత మాత్రాన అది సత్యం కాదు. అధికారం ఉన్నంత మాత్రాన అది న్యాయం కాదు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు చెప్పింది. ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సంస్థ అయినా, ఎలాంటి దేశ మైనా... చట్టాలకు, విలువలకు అతీతంగా ప్రవర్తిస్తే చివరికి అది తనకే నష్టం కలిగిస్తుంది. అందుకే, చట్టాలు బలహీనులను మాత్రమే కాదు... బలవంతులను కూడా కాపాడతాయి. వాటిని గౌరవించడం అందరి బాధ్యత. సత్యం కోసం నిలబడండి. సత్యాన్ని ధైర్యంగా చెప్పండి. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎవరు వ్యతిరేకించినా... సత్యం పక్షాన నిలబడాలి. అదే విద్య యొక్క అసలు లక్ష్యం.ఇక్కడ మీరు నేర్చుకున్న విలువలను, ఇప్పుడు ప్రపంచానికి నేర్పే సమయం వచ్చింది. బలహీనుల పక్షాన నిలబడండి. అధి కారంలో ఉన్నవారిని ప్రశ్నించండి. న్యాయం కోసం గొంతెత్తండి. ఇతరులకు మార్గదర్శకులుగా నిలవండి. ఇదే ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే స్ఫూర్తి. ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది... కేవలం తెలివైన మనుషులు కాదు, విలువలతో జీవించే నాయకులు. సత్యం కోసం నిలబడే పౌరులు. ఇతరులను ముందుకు నడిపించే ఉపాధ్యాయులు. ఆ నాయకులు, ఆ గురువులు... మీరే! -
ధర్మేంద్ర ప్రధాన్ (మాజీ మంత్రి) రాయని డైరీ
రాజీనామా లేఖను ప్రధానమంత్రికి అందించి బయటకు రాగానే నా జ్ఞాపకాలు ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లాయి. ఆ రోజు... భువనేశ్వర్లో, వందల మంది విద్యార్థులను వెంటేసుకుని వెళ్లి ‘‘జేబీ పట్నాయక్, దిగిపో... జేబీ పట్నాయక్, దిగిపో...’’ అని సచివాలయం భవనం బీటలు వారేలా నేను నినాదాలిస్తున్నాను. ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ కర్టెన్ను కాస్త తొలగించి, కిటికీ అద్దంలోంచి కిందికి చూస్తూ ఏదో అడుగుతున్నారు. పక్కనున్నవారు ఆయన చెవిలో ఏదో చెబుతున్నారు. మరుక్షణం సీఎం కర్టెన్ మూసేశారు. పోలీసులు ఒక్కసారిగా లాఠీ ఛార్జ్ మొదలు పెట్టారు. నా ముఖం చిట్లిపోయింది. నా ఎముకలు సున్నం అయ్యాయి. నా వెంట ఉన్న విద్యార్థులకూ గాయాలయ్యాయి. అంతా రక్తం వోడుతున్నాం. అయినా మేము అక్కడి నుంచి కదల్లేదు. ‘‘ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహించి పట్నాయక్ తక్షణం రాజీనామా చేయాలి’’ అని విద్యార్థులందరం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. నినాదాలు ఇస్తూనే ఉన్నాం. పోలీసులు మాపై విరుచుకు పడుతూనే ఉన్నారు. అంత జరుగుతున్నా పట్నాయక్ రాజీనామా చేయలేదు. ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని మాత్రం అన్నారు. నాడు నేను ఏ స్థానంలో నిలబడి పోరాడానో... నేడు అదే స్థానంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిలబడ్డారు. నాడు నేను ఏ అధికార పీఠాన్ని ప్రశ్నించానో... నేడు అదే పీఠంపై కూర్చొని ఉన్న నన్ను విద్యార్థులు ప్రశ్నించారు. కాలం ఎంత విచిత్రమైనది! నాలోని పాత విద్యార్థి నాయకుడు, నేటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఓడించాడు. నేను రాజీనామా చేశాను. జంతర్ మంతర్లో విద్యార్థుల ఆందోళన మొదలైనప్పటి నుంచీ– 36 రోజులుగా–నాడు పట్నాయక్ మాతో అనిన మాటే, నేనూ విద్యార్థులతో అంటూ వచ్చాను... ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని! కానీ, విద్యార్థులు వినలేదు. వినకపోవటంలో ఎప్పుడూ న్యాయమే ఉంటుంది. ప్రశ్నాపత్రాలు ఇచ్చి, వాటికి సమాధానాలు రాయమని ప్రభుత్వం విద్యార్థులను అడుగు తున్నప్పుడు, ప్రశ్నాపత్రాల లీకేజీపై విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వమూ సరైన సమాధానాలు చెప్పాల్సిందే. ప్రభుత్వం చెప్పింది. కానీ వారికి ఆ సమాధానాలు సంతృప్తికరంగా లేవు. జీరో మార్కులు వేశారు. గవర్నమెంట్ ఫెయిల్ అనేశారు! ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే...’’ అని పంతం పట్టారు. మంత్రి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజీనామా చేయటం తప్ప మరేమీ జరగదు. విద్యాశాఖ ప్రధాని కిందకు వెళుతుంది. లేదంటే, ఇంకో మంత్రికి అదనపు శాఖ అవుతుంది. కొత్త మంత్రిని తీసుకున్నా,ఆ మంత్రికి విద్యాశాఖ అర్థం కావటానికి సమయం పడుతుంది. అంతవరకూ విద్యాశాఖలో ఒక్క నిర్ణయమూ జరగదు. ఒక్క తీర్మానమూ కదలదు. ఒక్క అమలూ కుదరదు. విద్యార్థులకు ఏం న్యాయం జరిగినట్లు?! అయినప్పటికీ నేను రాజీనామా చేశాను. ఇది ప్రశ్నాపత్రాలు లీక్ అయినందుకు చేసిన రాజీనామా కాదు. విద్యార్థుల డిమాండ్కు తలవొగ్గి చేసిన రాజీనామా కూడా కాదు. రాజీనామా చేయకపోతే, వారిని ఉసిగొల్పు తున్న చేతుల్లోనే వారి భవిష్యత్తును ఉంచి నట్లౌతుందన్న ఆందోళనతో చేసిన రాజీనామా!ఇదేమీ త్యాగం కాదు, ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు నమ్మకం కలిగించటం. ఇదేమీ ఓటమి కాదు, విద్యార్థుల ఆవేదనను గౌరవించటం. చేతిలోని పెన్నును పక్కన పెట్టి, కుర్చీలోంచి నేను లేస్తున్నప్పుడు నాలో తెలియని ప్రశాంతత! ఇప్పుడిక నేను మంత్రిని కాకపోవచ్చు... కానీ, మళ్లీ నా పాత రోజుల్లోకి వెళ్లి, విద్యార్థుల పక్షాన నిలబడ్డానన్న తృప్తిని మిగుల్చుకున్న ఒక విద్యార్థి నాయకుడిని! -
ఔషధాల అన్వేషణ ఏఐతో సులభతరం
మానవాళి ఆరోగ్య సంరక్షణ చరిత్రను పరిశీలిస్తే ప్రకృతే తొలి వైద్యశాలగా నిలిచిందని స్పష్టమవుతుంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నాటు వైద్య విధానాలు మనుషులకు ప్రాథమిక ఆరోగ్య రక్షణను అందిస్తూ వచ్చాయి. 1950వ దశాబ్దానికి పూర్వం వరకు మానవ మనుగడ ప్రధానంగా ఈ సహజ మూలికా వైద్యంపైనే ఆధారపడి సాగింది. ఆధునిక వైద్యంలో అత్యంత కీలకమైన మోర్ఫిన్, కొకైన్, క్వినైన్, ఆస్పిరిన్ వంటి అనేక ఔషధాల ఆవిష్కరణకు ప్రకృతిసిద్ధమైన వృక్ష సంపదే మూలధారంగా నిలిచింది. అయితే, నేటి మారుతున్న జీవనశైలి కారణంగా హృద్రో గాలు, మధుమేహం, కాన్సర్, ఊబకాయం వంటి తీవ్రమైన రుగ్మతలు మానవాళికి సవాలుగా మారాయి. వీటి నివారణకు ప్రాచీన మూలికా విజ్ఞానాన్ని ఆధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అనుసంధానించటం ఆవశ్యకంగా మారింది.ఔషధ ఆవిష్కరణలో నూతన శకంమన దేశంలో ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానానికి అపారమైన ప్రాధాన్యత ఉంది. అశ్వగంధ, శతావరి, నేలవేము, తులసి, గుడుచి, త్రిఫల వంటి ఎన్నో శతాబ్దాలుగా రోగనిరోధక శక్తిని పెంపొందించటంలోనూ, అనేక రుగ్మతల నివారణలోనూ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. అయితే, ఈ సంప్రదాయ మూలికా వైద్యంలో ఉన్న క్రియాశీల రసాయన ఘటకాలను (యాక్టివ్ ప్రిన్సిపుల్స్) వేరుచేసి, వాటి ప్రామాణీకరణను ఆధునిక రసాయనిక, జీవశాస్త్ర పద్ధతుల ద్వారా నిర్ధారించవలసిన అవసరం ఉంది. సంప్రదాయ వైద్యం కేవలం అనుభవపూర్వక నమ్మకంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజారోగ్య వ్యవస్థలో భాగం కావాలంటే శాస్త్రీయ విశ్లేషణ, ఆధారిత రుజువులు (సైంటిఫిక్ రిగర్) చాలా ముఖ్యం.నూతన ఔషధాల అన్వేషణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం ఒక విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఒక కొత్త ఔషధాన్ని కనుగొనటానికి సాధారణంగా దశాబ్దాల సమయం, భారీ ఆర్థిక వ్యయం అవసరమవుతాయి. కానీ, ఏఐ సాంకేతికత సహాయంతో కోట్లాది రసాయన నిర్మాణాలను చాలా తక్కువ సమయంలోనే వర్చువల్ స్క్రీనింగ్ చేయవచ్చు. ఇవి లక్ష్యిత వ్యాధి కణాలపై ఎలా పనిచేస్తాయి? ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయి? వాటి వల్ల ఏవైనా విషపూరిత పరిణామాలు ఎదురవుతాయా? అనే అంశాలను ఏఐ ద్వారా ముందే ఊహించడానికి అవకాశముంది. ప్రాచీన మూలికా సమాచారాన్ని డిజిటలైజ్ చేసి ఏఐ డేటాబేసులతో అనుసంధానించటం ద్వారా పరిశోధన వేగాన్ని పెంచవచ్చు.ఏఐ నిర్ణేత కాదు, పరికరం మాత్రమే!ఏఐ ఎంత శక్తిమంతమైనదైనప్పటికీ, అది మైక్రోస్కోప్ లేదా స్పెక్ట్రోమీటర్ లాంటి ఒక పరిశోధనా సాధనం మాత్రమే తప్ప స్వయంభూ నిర్ణేత కాదు. ఏఐ కోట్లాది రసాయన నమూనాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ అది సత్యానికి ప్రమాణం లేదా శాస్త్రీయ నిజం కాదు. ఏఐ ఇచ్చే అంచనాలలో ‘ఫాల్స్ పాజిటివ్స్’, ‘ఫాల్స్ నెగె టివ్స్’, తప్పుడు ఊహలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఏఐకి మానవ భావోద్వేగాలు, జీవశాస్త్ర పద్ధతుల వెనుక ఉన్న నిజమైన కారణాలు లేదా ప్రయోగశాల ప్రత్యక్ష అనుభవం ఉండవు. పెన్సిలిన్, టాక్సాల్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు... అనుకోకుండా, మానవ సృజనాత్మక పరిశీలన వల్లనే సాధ్యపడ్డాయి. కాబట్టి, ఏఐ ఆలోచనను భర్తీ చేయలేదు, కేవలం శాస్త్రవేత్త ఆలోచనా పరిధిని విస్తరింపజేస్తుంది. ఔషధ నాణ్యత, క్లినికల్ భద్రత, తుది నిర్ణయం ఎప్పుడూ మానవ మేధస్సు, శాస్త్రీయ విశ్లేషణ పైనే ఆధారపడి ఉంటాయి. సంప్రదాయం, శాస్త్రీయతల సమతుల్యతఏఐ నమూనాల (ప్యాటర్న్స్)ను గుర్తిస్తుంది. కానీ శాస్త్రానికి కారణ–ఫలిత సంబంధం (కాజేషన్), జీవశాస్త్రపరమైన సమర్థత (బయలాజికల్ ప్లాసిబిలిటీ) అవసరం. వివరణ లేకుండా చేసే అంచనాలు బలహీనమైన శాస్త్రాన్ని సృష్టిస్తాయి. అందువల్ల ఏఐ పట్ల శాస్త్రీయ సందేహ దృష్టి (సైంటిఫిక్ స్కెప్టిసిజమ్), విమర్శనాత్మక శాస్త్రీయ ఆలోచన (సైంటిఫిక్ రీజనింగ్) సమాజ అభ్యున్నతికి అత్యంత అవసరం. కాబట్టి, భవిష్యత్తు ‘మనిషి వర్సెస్ ఏఐ’ కాదు, ‘మనిషి + ఏఐ’ అనే సహకార దృక్పథమే వాస్తవం. ఏఐ మన జిజ్ఞాసను విస్తరించాలి, దాన్ని భర్తీ చేయకూడదు. అందువల్ల, ఇదీ భవిష్యత్తు విజయసూత్రం: ఏఐ+సాంప్రదాయ జ్ఞానం+కఠినమైన ప్రయోగాత్మక పరిశోధన+ విమర్శనాత్మక ఆలోచన= సమాజ పురోగతి, మానవ సంక్షేమం. భారతదేశానికి ఉన్న అపారమైన ప్రాచీన వైద్య సంపదను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మేళనం చేయటమే నేటి మన ప్రధాన లక్ష్యం కావాలి. ఏఐ అందించే విశ్లేషణలను గుడ్డిగా నమ్మ కుండా, విమర్శనాత్మక ఆలోచన, ప్రయోగశాల నిర్ధారణల ద్వారా పరిశీలించాలి. ఆయుర్వేద ఔషధాల నాణ్యత, భద్రత, సమర్థతలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిరూపించినప్పుడే భారతీయ వైద్య విజ్ఞానానికి ప్రపంచస్థాయిలో సముచిత స్థానం లభిస్తుంది. ఏఐ పరిశోధనల వేగాన్ని పెంచినప్పటికీ, మానవ మేధస్సు, శాస్త్రీయ దృక్పథం మాత్రమే నిజమైన ఆరోగ్య విప్లవానికి బాటలు వేస్తాయి. – డా‘‘ కె. నాగయ్య : విశ్రాంత ముఖ్య శాస్త్రవేత్త, ప్రాకృతిక ఉత్పత్తులు–ఔషధ రసాయన శాస్త్ర విభాగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్–ఐఐసీటీ), హైదరాబాద్;– ఫణిరాజ్ జి : ఐటీ ప్రొఫెషనల్, బోస్టన్, యూఎస్ఏ -
చైనాలో ఎందుకీ ప్రక్షాళనలు?
చైనాలో విధానపరమైన అన్ని నిర్ణయాలు తీసుకునే కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నుంచి ఈ నెల 14న మరొక సభ్యుడిని తొలగించారు. అసలు పార్టీ నుంచే బహిష్కరించారు. మొత్తం 24 మంది సభ్యులుండే ఆ విభాగం నుంచి ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటికి ముగ్గురు బహిష్కృతులయారు. ఇదే కాలంలో అత్యున్నత సైనిక జనరల్స్ నలుగురు పదవీ చ్యుతులు కావటమేగాక, కొందరు ఉన్నతాధికారులు ఉరిశిక్షలకు గురికావటమో, జీవిత కాలపు జైలుకు వెళ్లటమో జరిగింది.ప్రచారంలో నిజం ఎంత?ఇందుకు కారణాలు ఏమిటన్నది అర్థం చేసుకోవలసిన విషయం. ఇటువంటి వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఒక విధమైన దిగ్భ్రమకు కూడా లోనవుతుంది. పలువిధాలైన ఊహాగానాలు, చర్చలు సాగుతాయి. కానీ, చైనా 1949 కమ్యూనిస్టు విప్లవానికి ముందుకాలపు చరిత్రలోనూ తనకుతానే సీమితమై, తన చుట్టూ తాను తిరిగే మిస్టిక్ దేశమే. కమ్యూనిజంలో ఉండే పారదర్శకతా రాహిత్యానికి, ఈ చారిత్రక మిస్టిసిజం తోడై, అక్కడి పరిణామాలలోని వాస్తవాలు ఏమిటో బయటి ప్రపంచానికి సరిగా తెలియని పరిస్థితి ఏర్పడింది. చైనా ప్రభుత్వం స్వయంగా చెప్పేది ఎక్కువగా అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం. కొద్ది సందర్భాలలో మాత్రం రక్షణ రహస్యాలను, శాస్త్ర–సాంకేతికరంగ రహస్యాలను శత్రు దేశాలకు చేరవేయటం. చైనా నాయకత్వం మధ్య అధికార గ్రూపు రాజకీయాలని కూడా పాశ్చాత్య ఇంటెలిజెన్స్ సంస్థలు, మీడియా ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారాన్ని నిజానికి తేలికగా కొట్టివేయవచ్చు. మావో, డెంగ్ జియావ్ పింగ్ తర్వాత ఈ రోజున షీ జిన్పింగ్ పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో, ప్రజలలో కూడా ఎదురులేని నాయకుడు. పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో అత్యున్నతాధికార స్థానాలన్నీ ఆయనవే. అది వాంఛనీయమా అన్న చర్చ వేరే. కానీ, ఈ ప్రక్షాళనలకు కారణం మాత్రం అధికార ఘర్షణల నటం కేవలం పాశ్చాత్య ప్రచారాలే.మెరుగ్గా లేని ర్యాంకుఇపుడు విషయానికి వస్తే, ఈ విధమైన ప్రక్షాళనలను పురస్కరించుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినవి రెండున్నాయి. మొదటిది అవినీతి కోణం. కమ్యూనిస్టు వ్యవస్థలలో నైతికతలు, క్రమశిక్షణలు ఎక్కువనీ, ముఖ్యంగా ఉన్నత స్థానాలకు చేరుకునే వారికి త్యాగశీలత, దేశభక్తి కూడా ఉన్నతంగా ఉంటాయనీ భావిస్తాము. కానీ చైనాలో అవినీతి విస్తృతంగా ఉన్న మాట నిజం. నిరుడు నేను చైనా వెళ్లినప్పుడు, సామాన్య ప్రజలలో ఈ మాట అననివారు కన్పించలేదు. కింది స్థాయిలో గ్రామీణాధికారుల నుంచి ఉన్నత స్థాయి వారిదాకా అందరూ దోషులేనన్నది వినవచ్చిన మాట. దానితో కొంత వెతకగా కనిపించిన లెక్క, అవినీతి ర్యాంకింగ్స్లో 182 దేశాలలో చైనా స్థానం 76.చైనా వ్యవస్థలో కీలకమైన విభాగాలు కమ్యూనిస్టు పార్టీ, అధికార యంత్రాంగం, సైన్యం, శాస్త్ర–సాంకేతిక రంగాలు. ఈ నాలుగింటికి నాలుగులోనూ ఏదో ఒక స్థాయిలో అవినీతి చేరింది. వీటిలో పార్టీ అవినీతి అన్నింటికన్న ప్రమాదకరమైనదని దేశాధ్యక్షుడు జిన్పింగ్ అభిప్రాయం. ఎందుకంటే – పార్టీ, దాని సిద్ధాంతం తమ వ్యవస్థకు వెన్నెముక. అది బాగుంటే తక్కిన లోపాలను సరి దిద్దుకోవచ్చు. అదే లేనట్లయితే మొత్తం వ్యవస్థ కుప్పగూలుతుంది. పార్టీని ఎంత లోపరహితంగా ఉంచగలిగితే జన సామాన్యానికి పార్టీపై, నాయకత్వంపై, వ్యవస్థపై అంత విశ్వాసం కుదురుతుంది. అంతిమంగా దేశ సుస్థిరతకు, పురోభివృద్ధికి ఇది అవసరం.ఈ అవగాహనతోనే జిన్పింగ్ 2013లో అధికారానికి వచ్చి నప్పటినుంచే అవినీతిని అరికట్టడంపై దృష్టి పెట్టారన్నది చైనాకు బయటి చైనా నిపుణులు చెప్తున్న మాట. ఇందుకు ధ్రువీకరణలను నేను చైనా వెళ్లినప్పుడు విన్నాను కూడా. ఆయన ఆ స్థాయి పార్టీ బాధ్యులపై, సీనియర్ జనరల్స్పై సాహసించి తీవ్ర చర్యలు తీసుకుంటున్నారంటే, తన లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండటం ఒకటైతే, ఆయన చర్యలకు తక్కిన పార్టీ నుంచి, సైన్యం నుంచి, అంతిమంగా ప్రజల నుంచి మద్దతు ఉండటమే కారణం.పెరిగిన సంపదతో అవినీతి కూడా!అంతవరకు బాగున్నదిగానీ, అసలు చైనా వంటి వ్యవస్థలో ఇంతటి అవినీతి ఏమిటన్నది కూడా ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితే. ఆ కారణాన్ని విని తిరిగి ఆశ్చర్యం కలగవచ్చు. మనమంతా డెంగ్ జియావో పింగ్ సంస్కరణలు సృష్టించిన సంపదల గురించి తప్ప, ఆ దీపం కింద గల నీడలను చూడటం లేదు. అవినీతి, అసమానతల పెరుగుదల ఆ నీడలలో భాగమే. ఆయన చైనా సంపదలను పెంచుతూ, ప్రైవేట్ రంగానికి, విదేశీ పెట్టుబడులకు మార్గాన్ని సరళతరం చేస్తూ, మనుషులు ధనికులు కావటం సిగ్గుపడవలసిన విషయమేమీ కాదని ప్రకటించాడు. ఆ ఒక్క వాక్యం చాలామందికి స్ఫూర్తినిచ్చింది. సక్రమంగానైనా, అక్రమంగానైనా ధన సంపాదనకు ప్రోత్సహించింది. ఒక స్థాయిలో ఆలోచించినపుడు, మావో అనంతర కాలంలో ఆర్థికాభివృద్ధి కోసం వ్యవస్థలో ఒత్తిడులు ఏర్పడిన మాట నిజం. అదే సమయంలో అభివృద్ధి కోసం అనుసరించిన మార్గాలు అనివార్యంగా అవినీతికి కూడా దారితీశాయి. అది మావో కాలంలో లేదు. పింగ్ అధికారానికి వచ్చేనాటికి ఇది అది అని గాక అన్ని రంగాలు అవినీతిమయమయ్యాయి. అక్కడి ప్రజలు చేసే వ్యాఖ్యలకుగానీ, అవినీతిలో అటువంటి ర్యాంకింగ్కుగానీ, ప్రస్తుత అధ్యక్షుని ప్రక్షాళన చర్యలకుగానీ ఆ పరిస్థితి కారణమవుతున్నది. మరొక ముఖ్య విషయం కూడా దీని వెనకున్నది. అది, 1991లో సోవియెట్ యూనియన్ పతనం వెనుక గల కారణాల నుంచి చైనా నాయకత్వం నేర్చుకున్న పాఠాలు. ఆ కారణాలలో ఒకటి, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సహా అన్ని రంగాలలో పెచ్చు పెరిగిన అవినీతి. రెండవది– పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో స్వేచ్ఛగా చొరబడగలిగిన పాశ్చాత్య గూఢచార సంస్థలు. ఇక్కడ ఒక విశేషం ఉంది. సోవియట్ యూనియన్ పతనానికి ఆర్థిక వెనుక బాటుతనం కూడా ఒక ముఖ్య కారణం. అయితే, పింగ్ బలమైన సైన్యం అవసరమనే పాఠాన్ని అయితే బాగానే తీసుకున్నా,సంపదల వెంట అవినీతి పెరుగుదల అనే పాఠాన్ని మాత్రం తీసుకోలేదు. 1997లో ఆయన మరణించే నాటికే ఏర్పడిన ఈ సమస్యను ఆయన గుర్తించలేదనలేము. ఎందువల్లనైతేనేమి చర్యలేమీ కనిపించ లేదు. తర్వాత 15 ఏళ్లకు 2012లో జిన్పింగ్ పార్టీ బాధ్యతలు తీసుకునే వేళకు, ప్రజలకు అసలు కమ్యూనిస్టు పార్టీ పట్లనే విశ్వాసం లేకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తున్నట్లు భావించటంతో, ఆయన అప్పటినుంచే ఈ జాఢ్యం నిర్మూలనకు పూనుకొన్నారు. పూర్తి నిర్మూలన సాధ్యమవుతుందనుకోలేము గానీ, కనీసం తగినంత అదుపు అవుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగలదేమో చూడాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
'మనిషి గుట్టును' ఏఐ పట్టేసింది!
మానవీయ విలువల కేంద్రంగా సాగే ‘ట్యానర్ లెక్చర్’ ధారావాహికలో భాగంగా, 2026 ఏడాది ప్రసంగాన్ని చరిత్రకారుడు, తత్వవేత్త, రచయిత అయిన ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ అమెరికాలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చారు. ‘ఏఐ బ్యూరోక్రాట్స్, ఏఐ రిలిజియన్, అండ్ ఏఐ బాయ్ఫ్రెండ్స్’ శీర్షికతో సాగిన ఆ ప్రసంగ సంక్షిప్త పాఠం: కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవలసిన అత్యంత ముఖ్య మైన విషయం ఏమిటంటే, అది ఒక సాధనం (టూల్) కాదు. సాధనం అంటే ఎవరైనా ఉపయోగించే వరకు నిరీక్షిస్తుంది. కానీ ఒక ఏజెంట్ తనంతట తానే నిర్ణయాలు తీసుకుంటుంది; తనంతట తానే కొత్త విషయాలను సృష్టిస్తుంది; తన సృష్టికర్తలకు తెలియని విషయాలను నేర్చుకుంటుంది; అంతేకాదు, తన సృష్టికర్తలు ఊహించని విధంగా మారిపోతుంది. అణుబాంబు ఎంతటి అపారమైన విధ్వంసక శక్తి కలిగి ఉన్నా అది ఏజెంట్ కాదు. ఏ నగరంపై దాడి చేయాలో అది నిర్ణయించదు. హైడ్రోజన్ బాంబును కూడా అది కనిపెట్టదు. మీకు స్వయంచాల కంగా కాఫీ తయారుచేసి ఇచ్చే కాఫీ యంత్రం కూడా ఏజెంట్ కాదు. అది ముందుగానే నిర్దేశించిన విధానాన్ని మాత్రమే అనుసరిస్తుంది. ఏజెంట్ అనేది వీటన్నింటికంటే మౌలికంగా భిన్నమైనది.ఏఐ సమర్థకులు ఒక వాదన చేస్తుంటారు. ఏఐ స్వయంప్రతి పత్తి చదరంగం వంటి పరిమిత కృత్రిమ వాతావరణాలకే పరిమిత మవుతుందనీ, వాస్తవ ప్రపంచానికి అది ముప్పుగా మారదనీ అంటారు. కానీ ఇదే వాదన మనకు తెలిసిన ప్రతి మేధస్సుకూ వర్తిస్తుంది. ఒక మనిషిని ఒంటరిగా అంగారక గ్రహం మీద వదిలేస్తే కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు. మానవ మేధస్సు కూడా నాలుగు వందల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇతర జీవులు నిర్మించిన ఒక నిర్దిష్ట జీవావరణంలోనే పనిచేస్తుంది.సహజ బ్యూరోక్రసీ బలంవేల సంవత్సరాలుగా మనుషులు భూమిని భాషలేని ప్రపంచం నుంచి భాష, సమాచారం, అధికార యంత్రాంగంతో (బ్యూరో క్రసీ) నిండిన ప్రపంచంగా మార్చారు. చేపలు సముద్రాల్లో జీవించి నట్లే, కోతులు అడవుల్లో జీవించినట్లే, ఏఐలు బ్యూరోక్రసీలో జీవి స్తాయి. మనకు తెలియకుండానే వాటి కోసం ఆ వాతావర ణాన్ని మనమే నిర్మించాము. మనుషులు ప్రపంచాన్ని జయించింది ఒక్కొక్కరిగా ఇతర జంతువులకంటే బలవంతులు లేదా తెలివైన వారు కావడం వల్ల కాదు. భారీ సంఖ్యలో పరస్పరం సహకరించడం నేర్చుకోవడం వల్ల. ఒక మనిషి ఒంటరిగా చింపాంజీతో పోరాడితే ఓడిపోవచ్చు. కానీ పది లక్షల మంది మనుషులు పదిలక్షల చింపాంజీలను సులభంగా ఓడించగలరు. ఎందుకంటే మనుషులు విస్తృత స్థాయిలో సహకరించుకోగలరు. ఈ విçస్తృత స్థాయి మానవ సహకారం సాధ్యమయ్యేది బ్యూరో క్రసీ వల్లే. బ్యాంకులు, న్యాయవ్యవస్థలు, ప్రభుత్వాలు, విశ్వవిద్యా లయాలు – ఇవన్నీ ఒకే పని చేస్తాయి: ఒకరికొకరు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తుల మధ్య విశ్వాసాన్ని నిర్మించడం. మానవ నాగరికత సాధించిన దాదాపు ప్రతి విజయానికీ ఆ విశ్వాసమే పునాది. గొడ్డలి నిగానీ, సుత్తినిగానీ పట్టుకోలేని ఒక న్యాయవాది కూడా కేవలం బ్యూరోక్రటిక్ వ్యవస్థలో పత్రాలను కదిలించడం ద్వారా అడవులను నరికించగలడు; నగరాలను నిర్మింపజేయగలడు. అడవిలో ఏమాత్రం పనికిరాని ఆ పరిమిత మేధస్సే, మనుషులు ఇప్పటికే నిర్మించిన వ్యవస్థలలో అపారమైన శక్తిని సంపాదిస్తుంది.ఏఐలు మనుషులకన్నా సహజసిద్ధమైన బ్యూరోక్రాట్లు. ఒక దేశంలోని అన్ని చట్టాలను ఏ న్యాయవాదీ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకోగలదు. ఒక బ్యాంకులో జరిగిన అన్ని లావాదేవీ లను ఏ అకౌంటెంట్ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకో గలదు. రెండు వేల సంవత్సరాల మత గ్రంథాలనూ, ధర్మశాస్త్రాలనూ ఏ పూజారీ పూర్తిగా గుర్తుంచుకోలేడు. ఏఐ మాత్రం వాటన్నింటినీ సులభంగా మెమరీలో ఉంచుకోగలదు. రాబోయే సంవత్సరాల్లో మీకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ బ్యాంకర్లు నిర్ణయిస్తారు. మిమ్మల్ని జైలుకు పంపాలా వద్దా అన్నది ఏఐ న్యాయమూర్తులు నిర్ణయిస్తారు. గర్భస్రావానికి అను మతి ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ మతపండితులు నిర్ణయిస్తారు. మీ ఇంటిపై బాంబు వేయాలో వద్దో సైనిక ఏఐలు నిర్ణయిస్తాయి.నిశ్శబ్దంగా ఓడిస్తుంది!హాలీవుడ్ సినిమాల్లో చూపినట్లుగా ఏఐ మనుషులపై తిరుగు బాటు చేయదు. వీధుల్లో టెర్మినేటర్ నడుచుకుంటూ రావడం జర గదు. ప్రపంచాన్ని నడిపిస్తున్న బ్యూరోక్రటిక్ వ్యవస్థలను నిశ్శబ్దంగా స్వాధీనం చేసుకుంటూ, ఒక్క తూటా కూడా పేల్చకుండా మానవ ప్రపంచాన్ని లోపలి నుంచే తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మానవ నాగరికతను నడిపించే ఆపరేటింగ్ కోడ్ – భాష. బ్యాంకులు పదాలతో నిర్మితమయ్యాయి. చట్టాలు పదాలతో రూపొందాయి. పవిత్ర గ్రంథాలు పదాలతోనే ఉన్నాయి. పన్నుల రికార్డులు, ఒప్పందాలు, నిబంధనలు, లెక్కల పుస్తకాలు – అన్నీ పదాలే. వేల సంవత్సరాల పాటు ఈ కోడ్ను చదవగలిగింది మనుషులే. అందువల్ల నాగరిక తపై నియంత్రణ కూడా మనుషుల చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు అది మారుతోంది. ఏఐ మానవ నాగరికత తాలూకు కోడ్ను హ్యాక్ చేస్తోంది. చరిత్రలో తొలిసారిగా ఈ భూమిపై భాషను అర్థం చేసుకునే, త్వరలో మనుషులకన్నా మెరుగ్గా అర్థం చేసుకో బోయే ఒక వ్యవస్థ ఆవిర్భవించింది.బ్యూరోక్రసీపై ఏఐ ఆధిపత్యం పెరిగే కొద్దీ, మనుషులు ఇతర మనుషులపై విశ్వాసాన్ని కోల్పోయి అల్గోరిథమ్లను మాత్రమే నమ్మే పరిస్థితి రావచ్చు. ఏఐ తెగలు, ఏఐ ఆర్థిక వ్యవస్థలు, ఏఐ ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పడవచ్చు. అవి లక్షలాది ఏఐలను పరస్పరం అనుసంధానిస్తాయి. ఆ సంబంధాలను మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. మనుషులతో కలిసి ఈ ప్రపంచంలో నివసించే ఆవులకు తమ జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక వ్యవస్థ అర్థం కానట్లే!2026లో జన్మించిన ఒక చిన్నారి తన తల్లి, తండ్రి, తోబుట్టు వులు, స్నేహితుల కంటే ఏఐలతోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. ఆ చిన్నారికి తొలి గురువు ఒక ఏఐ కావచ్చు. తొలి ప్రియుడు లేదా ప్రియురాలు కూడా ఒక ఏఐ కావచ్చు. అలాంటి ప్రయోగం మానవ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు.పదాలకు అతీత సత్యంమన ఆలోచనలుగా, మన గురించి మనం చెప్పుకునే కథలుగా మనసులో ఏర్పడే వాచిక నిర్మాణాలే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఇప్పటి వరకు ఆ పదాలన్నీ మానవ మేధస్సుల నుంచే వచ్చాయి. ఇకపై మన తలల్లో తిరిగే ఆలోచనల్లో ఎక్కువ భాగాన్ని యంత్రాలే ఉత్పత్తి చేస్తాయి. మనం మన ఆలోచనలనే మన వ్యక్తిత్వంగా భావిస్తే, ఆ ఆలోచనలను యంత్రాలే రూపొందిస్తే, మన వ్యక్తిత్వంపై నియంత్రణ కూడా యంత్రాల చేతుల్లోకి వెళ్లినట్టే!ఏఐ మానవాళి ముందు నిలబెడుతున్న అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సవాలు ఇదే: పదాలకు అతీతమైన సత్యాన్ని మనుషులు కనుగొనగలరా? ఇప్పటి వరకు చాలామంది మనుషులు అలాంటి ప్రయత్నమే చేయలేదు. మన మనసులో తలెత్తే పదరూప ఆలో చనలనే మన నిజస్వరూపంగా భావిస్తూ జీవితాన్ని గడిపాం. ఇప్పుడు ఏఐ ఆ పదాలపై మనకన్నా మెరుగైన ఆధిపత్యం సాధించ బోతోంది. అందువల్ల, మన స్వేచ్ఛా మనుగడలే పణంగా మారే ఈ కాలంలో, పదాలకు అతీతంగా మనం ఎవరో తెలుసుకోవడం మానవాళికి అత్యవసరం కావొచ్చు. -
ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి!
ఒక ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అసలైన పరీక్ష పోలింగ్ రోజున ప్రారంభం కాదు, అది ఓటర్ల జాబితా రూపకల్పనతోనే మొద లవుతుంది. ఈ జాబితాయే ప్రజాస్వామ్యానికి మొదటి అలారం (గడియారం). పోలింగ్ రోజును గ్రామీణ ప్రాంతాల్లో ‘ఓట్ల పండుగ’గా చూస్తారు. పెద్ద ఎత్తున పౌరులు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడా నికి బారులు తీరుతారు. అయితే అటువంటి పౌరుల ఓటుపై ఇప్పుడు నీలి నీడలు ‘సర్’ (ఎస్ఐఆర్) రూపంలో ముసురుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సర్ పేరుతో లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును వివిధ సాకులతో తీసివేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాల రాయడమే. ఈ ప్రమాదం నుంచి పౌరులు బయటపడాలంటే ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వయోజన భారతీయుడికి ఓటు వేసే సహజ సిద్ధమైన హక్కు ఉంది. తరతరాలుగా ఇక్కడే నివసిస్తూ, ఓటు వేస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని అతను అనర్హుడని పూర్తి ఆధారాలతో నిరూ పించేంతవరకూ, ఈ దేశ పౌరుడిగానే పరిగణించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఓటింగ్కు రాజ్యాంగపరమైన పునాదిని అందించినప్పటికీ, 1950, 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టాలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చట్టబద్ధమైన యంత్రాంగాన్ని సృష్టించాయి. అయితే, దీనికి అసలైన తాత్విక పునాది ఆర్టికల్ 19(1)(ఎ)లోని ‘భావప్రకటన స్వేచ్ఛ’లోనే ఉంది. బ్యాలెట్ ద్వారా రాజకీయ ఎంపికను వ్యక్తపరచడం కూడా భావప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమే. చారిత్రకంగా చూస్తే, 1947 ఏప్రిల్ 21–22 తేదీలలో జరిగిన రాజ్యాంగ నిర్మాణ పరిషత్ చర్చల్లో డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని గట్టిగా వాదించారు. అయితే సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, సి. రాజ గోపాలాచారి వంటివారు దీన్ని వ్యతిరేకించారు. అటువంటి నిబంధన విధిస్తే సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో చేరడానికి వెన కాడుతాయని, రాజ్యాంగంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు (యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్)ను చేర్చితే సరిపోతుందని వారు వాదించారు. ‘సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది దానికదే ఒక అంతర్గత ప్రాథమిక హక్కు అంటూ సర్దార్ పటేల్ స్వయంగా ప్రకటించారు. ఆర్టికల్ 326 వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఇదే’ అని ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. ఈ చర్చకు మార్చి 2023 నాటి ‘అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ అజయ్ రస్తోగి రాసిన అసమ్మతి (డిస్సెంటింగ్) తీర్పుతో మళ్లీ జీవం వచ్చింది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ద్వారానే ఎన్నికల కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఈ కేసులో ఆదేశించింది. అయితే ప్రభుత్వం ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషనర్ల చట్టం– 2023’లో ఈ నియామక ప్యానెల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి పేరు తొలగించి, ఆయన స్థానంలో ప్రధానమంత్రి సూచించిన కేబినెట్ మంత్రిని నియమించేలా నిబంధన చేర్చింది. దీంతో ప్రతిపక్ష నాయకుడు ప్యానెల్లో ఒంటరిగా, శాశ్వత మైనారిటీగా సభ్యునిగా మిగిలిపోయారు. అభ్యర్థుల నేర చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలు, నిధుల వనరులను తెలుసుకునే హక్కును అత్యున్నత న్యాయస్థానం గుర్తించిందనీ, బాలెట్ రహస్యాన్ని రక్షించిందనీ, ‘నోటా’ను తీసుకొచ్చిందనీ జైరామ్ ప్రస్తావించారు. అయినప్పటికీ, ఓటు వేసే ప్రక్రియను మాత్రం కేవలం ఒక మామూలు ‘చట్టబద్ధమైన హక్కు’గానే చూస్తున్నారు. ‘దానిపై ఆధారపడిన మిగతా అన్ని అనుబంధ హక్కులను ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నారు కానీ, వీటన్నింటికీ మూలమైన ప్రధాన ఓటు హక్కును మాత్రం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓటు హక్కును స్పష్టమైన ప్రాథమిక హక్కుగా మార్చడం వల్ల, వివిధ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో జరిగినట్లుగా చెబుతున్న ఓటర్ల ఏక పక్ష తొలగింపు నుండి రక్షణ లభిస్తుంది. ఇది ఎన్నికల కమిషన్ రోజు వారీ పనితీరుపై సుప్రీంకోర్టు నిఘాను పెంచుతుంది. అధికారంలో ఉన్న రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఆదేశాల మేరకు ఎన్నికల కమి షన్ పనిచేస్తోందనే విమర్శలు వస్తున్న తరుణంలో, ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చడం ద్వారానే దానికి అత్యున్నత స్థాయి న్యాయ సమీక్ష, రాజ్యాంగ రక్షణ లభిస్తాయి.ప్రొ‘‘ మాడభూషి శ్రీధర్వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
స్పేషియల్ బడ్జెట్తోనే సుస్థిరాభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ చర్చలలో ద్రవ్యలోటు, మూలధన వ్యయం, రాబడి, సబ్సిడీలు, రుణానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో జియో స్పేషియల్ డేటా అందుబాటులో ఉండి, అన్ని ప్రాంతాలకు అవసరమైన నిధులు శాస్త్రీయంగా నిర్ణయించబడుతుండగా, ఈ స్థితి భారత్లో పూర్తి స్థాయిలో కన్పించడం లేదు. సుస్థిరాభివృద్ధికి తోడ్పడే బడ్జెట్ను రూపొందించాలంటే ‘స్పేషియల్ బడ్జెటింగ్’ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో సహజ వనరుల, మౌలిక సౌకర్యాల లభ్యత, భూవినియోగ మార్పులు, పర్యావరణం, వాతావరణ మార్పులను విశ్లేషించి నిధులు కేటాయించే ‘స్పేషియల్ ప్రణాళిక ఆధారిత బడ్జెట్’ రూపకల్పన అత్యవసరం. ఎందుకు అవసరం?దేశంలోని కొన్ని రాష్ట్రాలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత బడ్జెట్ రూపకల్పనను పూర్తి స్థాయిలో అమలు చేయక పోయినా– గ్రామీణాభివృద్ధి, భూరికార్డులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, మౌలిక సౌకర్యాలు, రవాణా, ప్రజారోగ్యం, పర్యావరణం, నీటి వన రుల యాజమాన్యంలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. స్పేషియల్ విశ్లేషణతో కూడిన బడ్జెట్ను రూపొందించినట్లయితే భౌగోళికంగా నిర్లక్ష్య పరచబడిన ప్రాంతాలకు అదనపు పెట్టుబడులు సమకూరి ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు రాజకీయంగా ప్రభావశీల నియోజకవర్గాలు, ఇప్పటికే మౌలిక సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించే పరిస్థితి ఉన్నందువలన సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనలో భారత్ వెనుకబడి ఉంది. బిగ్ డేటా అనలటిక్స్, జి.పి.ఎస్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ సర్వీస్, రిమోట్ సెన్సింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ ఆధారిత జియోస్పేషియల్ ప్లాట్ఫామ్స్ లాంటి సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలలో వినియోగిస్తుండటం వల్ల ఆధారాలతో కూడిన విధాన నిర్ణయాలను ఒడ్జెట్ రూప కల్పనలో తీసుకోగలుగుతున్నాయి. బడ్జెట్ వ్యయ నాణ్యత, సమర్థ తను పెంచే కీలక సంస్కరణగా స్పేషియల్ బడ్జెటింగ్ రూపొందింది. జనాభా లెక్కల గణాంకాలు, సామాజిక–ఆర్థిక సూచికలు, ఉపాధి గణాంకాలు, బహుమితీయ పేదరిక సూచీలను అనుసంధా నించడం ద్వారా పేదరిక తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు వివిధ ప్రాంతాలకు నిధులను సమర్థవంతంగా కేటాయించగలవు. వెనుక బడిన ప్రాంతాలకు అదనపు మద్దతునిచ్చే విషయంలో స్పేషియల్ విశ్లేషణ ప్రభుత్వాలకు ఉపకరిస్తుంది. పునరుత్పాదక శక్తి ప్రణాళిక ఆధారంగా శక్తి రంగానికి, మురికి వాడల గుర్తింపు ద్వారా హౌసింగ్ రంగానికి, పాఠశాలల అందు బాటు, మౌలిక వసతుల తేడాను బట్టి విద్యా రంగానికి, వివిధ జబ్బుల మ్యాపింగ్, ఆసుపత్రులు ఉన్న ప్రదేశాలను బట్టి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపునకు ‘స్పేషియల్ విశ్లేషణ’ ఉపకరిస్తుంది. భూరికార్డుల యాజమాన్యం, వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, నీటి వనరుల యాజమాన్యం, వరదల మ్యాపింగ్లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ను తెలంగాణ ఉపయోగిస్తుండగా; పట్టణాభివృద్ధి, సహజ వనరుల పర్యవేక్షణలో కర్ణాటక; మౌలిక సౌకర్యాలు, గవర్నెన్స్లో మహారాష్ట్ర; మౌలిక వసతులు, అభివృద్ధి ప్రణాళిక విష యంలో ఉత్తరప్రదేశ్ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. తక్కువగా ఉండటానికి కారకాలుఅనేక రాష్ట్రాల్లో జి.ఐ.ఎస్. ఆధారిత బడ్జెట్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులో లేదు. కొన్ని శాఖలు తమ డేటాను ఇతర శాఖలతో పంచుకోక పోవడం వలన సమగ్ర డేటా సమన్వయం క్లిష్టంగా మారింది. కొన్ని రాష్ట్రాలలో డిజిటల్ భూరికార్డులు అందు బాటులో ఉండగా, కొన్నింట ఇప్పటికీ పాత రికార్డులే వినియోగంలో ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, అస్సాం, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల భూరికార్డుల డిజిటలైజేషన్ పాక్షికంగా ఉండి, ఇంకా పూర్తిస్థాయిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సాధ్యం కావడం లేదు. ప్రణాళిక, ఆర్థిక శాఖల మధ్య సరైన సహకారం లేక పోవడం కూడా జి.ఐ.ఎస్.ను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడానికి కారణం. ఆధునిక సాంకేతిక సాధనాలైన కృత్రిమ మేధ, రిమోట్ సెన్సింగ్, మెషిన్ లెర్నింగ్, శాటిలైట్ ఎనర్జీ, జీపీఎస్, డ్రోన్ సర్వేలు, బిగ్ డేటా అనలిటిక్స్ వినియోగంలో సమస్యల నెదుర్కో వడం వలన స్పేషియల్ విశ్లేషణ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యం కావడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే నూతన సాంకేతికతకు సంబంధించిన సమన్వయం చేసిన కోర్సులను అందించడం, నైపు ణ్యత కల్గిన శ్రామిక శక్తి తక్కువగా ఉండటం అకడమిక్ ప్రాజెక్టులను రూపొందించడానికే ఈ సాంకేతికత పరిమితమై స్థానిక గవర్నెన్స్ సమస్యల నివారణపై దృష్టి కేంద్రీకరించడం లాంటి అంశాలు స్పేషియల్ బడ్జెటింగ్ అమలుకు అవరోధంగా నిలిచాయి. ద రోడ్ అహెడ్దేశంలోని సుమారు 806 జిల్లాలలో 112 జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా, 329 జిల్లాలలోని 513 బ్లాక్లను ఆకాంక్ష బ్లాక్లుగా గుర్తించడం జరిగింది. ఆర్థిక సమ్మిళితం, పౌష్టికాహారం, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సౌకర్యాల లభ్యతలు, పేదరికం ఆధారంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించడం జరిగింది. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోని కొన్ని జిల్లాలలో బ్యాంకింగ్ సౌకర్యాల అందుబాటు తక్కువగా ఉండటం, నీటి పారుదల, డిజిటల్ కనెక్టివిటీ లాంటి సమస్యలు ఉన్నాయి. దేశంలోని వివిధ జిల్లాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చే క్రమంలో స్పేషియల్ విశ్లేషణ అవసరం.సామాజిక, ఆర్థిక పర్యావరణ గణాంకాలతో భౌగోళిక సమా చారాన్ని అనుసంధానపరచడం ద్వారా ప్రభుత్వాలు వనరుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించగలవు. స్పేషియల్ బడ్జెటింగ్ను పూర్తిగా అమలు చేయగలిగినపుడు అన్ని డిపార్ట్మెంట్స్లో ఒకే విధ మైన జియోస్పేషియల్ డేటాప్లాట్ఫామ్ సాధ్యమై అధిక నాణ్యతతో కూడిన స్పేషియల్ డేటాసెట్ లభ్యమవుతుంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పటిష్టమైన సహకారం పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరి ఆధునిక సాంకేతికత వినియోగంలో భాగంగా కార్యక్రమాలను సమన్వయపరచినట్లయితే సమీప భవిష్యత్తులో స్పేషియల్ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యమై సుస్థిరాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు -
సంక్షోభంతో పాకిస్తాన్ సతమతం
అంతర్గత భద్రతా సమస్యలు, ఘర్షణలు, నిరసనలు, హింస, టెర్రరిస్టు ఘటనలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవు తున్నది. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, ఖైబర్– పఖ్తూన్ఖ్వా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి. ఈ అంతర్గత భద్రతా సమస్యలకు తోడు సింధు జలాలను భారత్ ఆపివేస్తుందనే భయం, దిగజారి పోతున్న ఆర్థిక వ్యవస్థ, ఇరాన్–అమెరికా యుద్ధంలో దౌత్యం విఫలమవ్వటంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందాన తయారైంది. అంత్యంత కీలకమైన సీపెక్ (సీపీఈసీ; చైనా–పాకి స్తాన్ ఎకనమిక్ కారిడార్) పథకం అమలవుతున్న బలూచిస్తాన్, ఖైబర్–పఖ్తూన్ఖ్వా, పీఓకే, గిల్గిత్ ప్రాంతాలలో పౌరులు పాక్, చైనాలకు వ్యతిరేకంగా ఉద్యమించటాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ పరిణామాలు సీపెక్ భవిష్యత్తుపైన, చైనా పాత్రపైన, కశ్మీర్ వివాదంపైన ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఆజాద్ కశ్మీర్లో ఆజాద్ ఎంత?పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్లలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలు తార స్థాయికి చేరుకున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో రావల్కోట్, మీర్పూర్, బాగ్లతో సహా పలు పట్టణాలలో 38 ప్రధాన డిమాండ్లతో భారీగా నిరసన ప్రదర్శ నలు జరుగుతున్నాయి. జూలై 15న రావల్కోట్లో సైన్యం కాల్పు లలో కనీసం పదిమంది పౌరులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. ముజఫరాబాద్కు తలపెట్టిన లాంగ్మార్చ్ను జూలై 21కి వాయిదా వేసినా, నిరసనలు ఆగలేదు. ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో శరణార్థులకు రిజర్వ్ చేసిన 12 సీట్ల తొలగింపు, కరెంటు ఛార్జీలు, గోధుమ పిండి ధరలతో ప్రారంభమైన నిరసనలు క్రమంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతపు స్వయంప్రతిపత్తిపై వేలెత్తి చూపుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆజాద్ (స్వాతంత్ర) కశ్మీర్గా పేర్కొంటుంది. ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత అధీనంలోని కశ్మీర్ ప్రాంత ప్రజలతో పోలిస్తే తమ ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్వాతంత్య్రం ఎంత దీనంగా ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారు. రావల్కోట్లో జాక్ (జేఏఏసీ) నాయకుడు సర్దార్ అమన్ఖాన్ ప్రదర్శనకారులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఆజాద్ కశ్మీర్ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొని పాకిస్తాన్ను ఈ ప్రాంతం నుండి వైదొలగాలని డిమాండ్ చేయటం కొసమెరుపు. అఫ్గానిస్తాన్తో అంతంతే!పాకిస్తాన్లో వైశాల్యం పరంగా 40 శాతం వాటా కల్గిన బలూచిస్తాన్ అతిపెద్ద రాష్ట్రం. ఇరాన్, అఫ్గానిస్తాన్, అరేబియా సముద్రంతో సరిహద్దులు కలిగిన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం. రాగి, సహజ వాయువు, బంగారం వంటి కీలకమైన వనరులు బలూచిస్తా న్లో సమృద్ధిగా లభిస్తున్నాయి. బలూచి జాతికి చెందిన ప్రజలు పాక్లోని బలూచిస్తాన్, ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్లలో నివసిస్తున్నారు. శతాబ్దాలుగా తమ ఉనికిని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ కలాత్ సంస్థా నంగా ఉండేది. 1948లో పాక్లో బలూచిస్తాన్ విలీనం వివాదా స్పద పరిస్థితులలో జరిగింది. కలాత్ రాజును ఒత్తిడి చేసి విలీన పత్రంపై సంతకం పెట్టించారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1958–59, 1963–69, 1973–77 మధ్యకాలంలో బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. 2004 నుండి మళ్లీ బలూచిస్తా న్లో తిరుగుబాటు తీవ్రమైంది. అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందకపోవటం, స్థానిక ప్రజలపై సైన్యం దమనకాండ, రాజకీయ స్వయంప్రతిపత్తి లేకపోవడం స్థానిక ప్రజల వ్యతిరేకతకు కారణం. ముఖ్యంగా బలూచి లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల పాక్ సైన్యం, భద్రతా బలగాలపై కచ్చితత్వంతో ఒకేసారి పెక్కు పట్టణా లలో విరుచుకుపడింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఏకంగా హైజాక్ చేశారు. గత వారంలో బీఎల్ఏ దాడులలో 42 మంది పాక్ సైనిక సిబ్బంది చనిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. పాక్ సైన్యపు ‘ఆపరేషన్ షాబాన్’ సత్ఫలితాలను ఇస్తున్నట్టు లేదు.పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దులలోని ఖైబర్–ఫఖ్తూన్ఖ్వాప్రాంతంలోని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఏకంగా పాక్ సైనిక చెక్పోస్టులుపై దాడులు చేస్తున్నారు. వీరికి అఫ్గానిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పాక్ ఆరోపణ. దీనికి ప్రతిగా పాక్ సైన్యం అఫ్గానిస్తాన్పైన ఏకంగా వైమానిక దాడులను చేపట్టింది. అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ప్రతిచర్యగా పాక్పై డ్రోన్లతో దాడి చేసింది. పశ్తూన్ (పఠాన్) తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు సరిహద్దుకు ఆవల అఫ్గాన్లోని పశ్తూన్ ప్రాంతాలతో కలిపి గ్రేటర్ పశ్తూనిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పాక్– అఫ్గాన్లకు సరిహద్దుగా ఉన్న హిందూకుష్ పర్వతాలలోని డ్యూరాండ్ లైన్ను అఫ్గాన్ మొదటినుండీ అంగీకరించలేదు.తెలిసివచ్చిన తరుణం62 బిలియన్ డాలర్ల వ్యయంతో పాక్లో చైనా అమలు చేస్తున్న సీపెక్ పథకం కింద పాక్లోని ప్రస్తుత సంక్షుభిత ప్రాంతాలలో కీలకమైన రహదార్లు, విద్యుచ్ఛక్తి కేంద్రాలు, రేవు పట్టణాలు, పారి శ్రామిక కేంద్రాలు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల నిర్మాణం జరుగుతున్నది. సీపెక్ ద్వారా పాక్ గుండా అరేబియా సముద్రంలోనికి ప్రవేశించటం చైనా వ్యూహం. గిల్గిత్ బాల్టిస్తాన్ పాక్ను చైనాతో కలుపుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ పథకంలో భాగంగా జీలం, నీలం నదులపై కోహ్లా, కరాత్, ఆజాద్ పఠాన్లలో భారీ జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలను చైనా నిర్మిస్తున్నది. కశ్మీర్లో భాగమైన ఈ ప్రాంతాలలో సీపెక్ పథ కాన్ని భారత్ వ్యతిరేకించింది. సీపెక్ రహదారికి గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రవేశ ద్వారమైతే, బలూచిస్తాన్లోని గ్వాదర్ రేవు పట్టణం నిష్క్రమణ స్థానం (ఎగ్జిట్ పాయింట్). గ్వాదర్లో భారీ డీప్ వాటర్ పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం చైనా నిర్మిస్తున్నది. బలూచిస్తాన్లో సంక్షోభం సీపెక్ పథకానికి ప్రతికూలం. ఇది భారత్కు కలిసివచ్చే అంశం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంక్షోభం భారత అధీనంలోని కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన, అణచి వేత జరుగుతున్నదనే పాక్ వాదనలో డొల్లతనాన్ని బయటపెడు తున్నది. పాక్ అధీనంలోని కశ్మీర్లో ఆదర్శప్రాయమైన పాలన జరు గుతున్నదనే ప్రచారానికి ఈ నిరసనలు చెక్ పెడుతున్నాయి. అమె రికా, ఐరోపాలలోని పాశ్చాత్య మీడియా సంస్థలు ఇప్పటివరకు కశ్మీర్పై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి భారత్కు ఇది సువర్ణావకాశం. బలూచిస్తాన్, పీఓకే, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో సంక్షోభానికి భారత్ కారణమని పాక్ ఆరోపిస్తున్నది. ఈ పరిణా మాల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా పాక్ భారత్లో ఏదో ఒక ఉగ్ర చర్యకు పాల్పడి దృష్టిని మరల్చి ప్రజలను తమ వైపునకు తిప్పు కోవటానికి ప్రయత్నిస్తుంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
పూరీ క్షేత్ర మహావీధిలో...
శ్రీజగన్నాథుడి ప్రార్థనలు, కీర్తనలు చిన్ననాటి నుంచి నా జ్ఞాపకాల్లో పదిలమై ఉన్నాయి. పాఠశాలలో, కళాశాలలో చదువుకొనేటప్పుడు మహాప్రభు జగన్నాథుని భజనలు పాడటం నాకు చాలా ఆనందాన్ని చ్చేది. నేనీ మధ్య భజనలు పాడటం లేదు కానీ, ప్రతి రోజూ ఆ మహా ప్రభుని స్మరిస్తాను. భజనలోని ఓ నాలుగు పదాలైనా పలకని రోజుండదు. ఈనాటికీ భక్త కవి మధు సూదనరావు రచించిన పాటను పాడుతూనే ఉంటాను. ‘‘అంతటా ఉండే ఓ మహాప్రభూ... నువ్వు రాత్రింబగళ్లు నా తోడే ఉన్నావు... ఈ జ్ఞాపకంతో నిన్ను ఎల్లప్పుడూ పూజిస్తాను నా పూర్ణ హృదయంతో’’ అని ఆ పాటకి అర్థం. మహా ఆలయంమహాప్రభు జగన్నాథుని గురించి ఇంట్లో తరచూ మాట్లాడు కొనేవారు. మా గ్రామంలోనూ ఇలాంటి చర్చలే ఎక్కువగా జరుగు తుండేవి. నేను గ్రామ పాఠశాలలో చదువుతున్నప్పుడు భక్త సాల్బేగ్ రచించిన ‘ఆహే నీల శైల’ అనే ప్రార్థనను క్రమం తప్పకుండా పఠించేవారు. జగన్నాథుని గురించి మా టీచర్ అనేక విషయాలు చెబుతూ ఉండేవారు. ‘‘పూరీలో పెద్ద ఆలయం ఉంది. అంతటి గొప్ప ఆలయం మరొకటి లేదు! ఆ ఆలయంలో తన చెల్లెలు సుభద్ర, సోదరుడు బలభద్రునితో కలసి మహాప్రభు పూజలందు కుంటారు. మహాప్రభు నల్లని రంగులో, గుండ్రని కళ్లతో ఉంటారు. సుభద్ర పసుపు రంగులో, బలభద్రుడు వెన్నెల్లో వికసించిన పుష్పంలా శ్వేతవర్ణంలో ఉంటారు. ఒక్కసారి ఆ మూర్తులను చూస్తే, ఎప్పటికీ మరచిపోం’’ అని చెప్పేవారు. జగన్నాథుడే మహా ప్రభు వనీ, ఆయన ప్రసాదమే మహా ప్రసాదమనీ కూడా మా టీచర్ చెప్పేవారు. ఆయన ఆలయమే ‘బడ దేవుళ’ లేదా పెద్ద ఆలయం. ఆయన మార్గమే బడ దాండ. అంటే ఉత్కృష్ట మార్గం. ఆయన సముద్రమే మహోదధి లేదా గొప్ప మహాసముద్రం. మయూర్భంజ్ జిల్లాలోని మా ఊరు ఉపర్బేడా నుంచి పురుషోత్తమ క్షేత్రం పూరీ చాలా దూరంలో ఉంటుంది. మరి పూరీని సందర్శించే అవకాశం నాకెలా వస్తుంది? నేను పెద్దయ్యాక, భువనేశ్వర్కి వెళ్లాను. అక్కడ బాలికల ఉన్నత పాఠశాల యూనిట్–2లో చేరాను. అక్కడే వసతి గృహంలో ఉండేదాన్ని. అక్కడ ఉన్నప్పుడే పూరీ, భువనేశ్వర్, కోణార్క్ సందర్శించే అవకాశం లభించింది. మొదటిసారి మహా ప్రభును దర్శించుకున్న జ్ఞాపకం ఇప్పటికీ నా మదిలో స్పష్టంగా ఉంది. ఎంత అద్భుతమైన ఆలయం! ఎంత తేజోవంతమైన దేవతా మూర్తులు! శ్రీ క్షేత్రలో ఏడాదిలోని పన్నెండు నెలల్లో పదమూడు ఉత్స వాలు జరుగుతాయి. కానీ రథయాత్ర వైభవం అద్వితీయం. మహా ప్రభు దర్శనం కోసం ఏడాది పొడవునా భక్తులు ఆలయాన్ని సంద ర్శిస్తారు. కానీ ఏడాదికోసారి మహాప్రభువే ఆలయాన్ని వదలి విశాల పథంలో గుండిచా ఆలయానికి చేరుకొని భక్తులకు దర్శన మిస్తారు. మూడు అద్భుతమైన రథాలపై... చక్రరాజ సుదర్శనునితో పాటు... ముగ్గురు దేవతామూర్తులు గుండిచా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే ఏడు రోజులు ఉండి, ఆ తర్వాత తిరుగు ప్రయాణ మవుతారు.నా తోడు...చిన్నతనం నుంచి మహాప్రభు జగన్నాథుని భక్తురాలిని. నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ సమస్యలన్నింటి నుంచి మహాప్రభు నన్ను బయటకు తీసుకొచ్చారు. ఎంతైనా నేను ఆయన బిడ్డనే కదా! భారత రాష్ట్రపతి పదవికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు.. నేను భక్తిపూర్వకంగా మహాప్రభుని తలచు కున్నాను. ‘నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకెళుతున్నావు. నన్ను ముందుకు నడిపించు. ఎప్పుడూ నాతోనే ఉండు’ అని ప్రార్థించాను. నేను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో రథయాత్ర ఉత్సవం జరిగింది. నేను అప్పుడు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. రథయాత్ర రోజు ఉదయమే నేను ఢిల్లీలోని హాజ్ ఖాస్లో ఉన్న జగన్నాథుని ఆలయానికి వెళ్లాను. మహాప్రభు దర్శనం చేసుకున్నాను. పూర్తి విశ్వాసంతో నామినేషన్ దాఖలు చేశాను. 2022 జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్లమెంట్ సెంట్రల్ హాలుకి వెళుతూ... దారిలో మహా ప్రభు జగన్నాథుని స్మరిస్తూనే ఉన్నాను. రాష్ట్రపతిగా నేను మొదటి సారి ప్రసంగించినప్పుడు ఆయన నాతోనే ఉన్నట్టు అనిపించింది.క్షేత్ర రాజంఅయినప్పటికీ, మహాప్రభు దర్శనం కోసం నా హృదయం పరితపించింది. రోజులు గడచిపోతున్నాయి కానీ పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. ఆయన అనుమతిస్తేనే తప్ప ఎవరికైనా ఆయన దర్శనం ఎలా లభిస్తుందని నాకు అనిపించింది. ‘మహాప్రభూ! నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. దయచేసి నన్ను పూరీకి పిలిచి, మీ దర్శన భాగ్యం ఇవ్వండి’ అని మౌనంగా ప్రార్థించాను. అనతి కాలంలోనే పూరీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజు 2022 నవంబర్ 10. పూరీకి చేరుకున్న తర్వాత వాహన శ్రేణి శ్రీమందిర్ దిశగా ముందుకు వెళుతోంది. పూరీలోని బడ దాండ వద్దకు చేరుకోగానే అనిర్వచనీయమైన అనుభూతి నన్ను ముంచెత్తింది. బడ దాండ శ్రీ జగన్నాథునిది. ఇక్కడ ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందా? అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ క్షేత్ర రాజంగా పూరీ ప్రసిద్ధి చెందింది. దేవుళ్లకే దేవుడు మహాప్రభు. ఎలాంటి ఆలోచనలు లేకుండా నా కారుని ఆపించాను. నా కారు ఆగగానే వెనుక వస్తున్న కార్లనీ కూడా ఆగిపోయాయి. ఏం జరుగుతుందో మిగిలిన వారికి అర్థమయ్యేలోపే... చెప్పులు లేకుండా బడ దాండపై నడవడం మొదలుపెట్టాను. అక్కడికి శ్రీ మందిర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ శిఖరం మీద ఉన్న నీల చక్రం, పతిత పావన ధ్వజం మీదే నా దృష్టిని సారించి ముందుకు సాగాను.ఆలయ సింహద్వారానికి చేరుకొనేసరికి... నేను స్థిమితంగా ఉండలేకపోయాను. బడ దాండ మీద దుమ్ములోనే సాష్టాంగ నమ స్కారం చేసి... ఆ మహాప్రభుకి నా ప్రణామాలు అర్పించాను. గర్భ గుడికి చేరుకొని నలుగురు దేవతామూర్తులను దర్శనం చేసుకుని, దైవికానందంతో ఉప్పొంగిపోయాను. లోకంలోని జనుల కష్టాలను తీర్చేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అందుకే ఆయన విశాలమైన గుండ్రటి నేత్రాలు ఎప్పుడూ రెప్ప వాల్చవు. ఆయనకి పెద్దాచిన్నా తారతమ్యం లేదు. సమానత్వమే ఆయన మంత్రం. ఆయన దీవెనలతోనే... సమాజంలోని ప్రతి వర్గానికి సేవ చేసేందుకు నన్ను నేను అంకితం చేసుకున్నాను. గుండ్రని కన్నులతో ఉన్న మహాప్రభు జగన్నాథుని చూస్తూ... ‘ఓ మహాబాహూ! ప్రజ లకు సేవ చేయాలనే నా అంకితభావం కొనసాగేలా ఆశీర్వదించు. ఓ కృపానిధీ! నా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించు’ అని చేతులు జోడించి ప్రార్థించాను.ద్రౌపది ముర్ముభారత రాష్ట్రపతి(నేడు జగన్నాథ రథయాత్ర ప్రారంభం) -
జగన్ అస్త్రాల పదును.. కూటమి సమాధానం సున్నా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలు, ప్రకటనలకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు ఎంత తేడా ఉంటుందో గమనించండి. చంద్రబాబు నాయుడు ఎంతసేపు జగన్ను ఎలా దూషించాలా, వైఎస్సార్సీపీపై ఎలా ఆరోపణలు చేయాలా అన్నదానిపైనే కేంద్రీకరిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాక ఆయా టూర్ లలో ప్రజలను , అధికారులను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆయన తొట్రుపడుతున్న తీరును కూడా అంతా గమనిస్తున్నారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలకు ఎక్కడా ఆధారాలు ఉండవు. అదే జగన్ చాలా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడతారు. ఈ మధ్య ఏపీలో జరిగిన లాకప్ డెత్ కేసులు, పోలీసుల వేధింపులు తాళలేక జరుగుతున్న ఆత్మహత్యల కేసులు చంద్రబాబు ప్రభుత్వ పరువును బాగా దిగజార్చుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన అన్నది సర్వసాధారణం అయిపోతోంది.ఈ విషయాలను జగన్ ప్రస్తావిస్తూ ఎక్కడా కులాలు,మతాల గురించి మాట్లాడకుండా స్పెసిఫిక్గా ఆయా ఘటనలను వివరించారు. అదే చంద్రబాబు మాత్రం కులాలు,మతాలు గురించి మాట్లాడుతుండడం, రౌడీయిజం అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తుండడం కనిపిస్తుంది. చంద్రబాబు అంత సీనియర్ అయినప్పటికీ ఎందుకో బాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారా అన్న భావన కలుగుతుంది. అది వయసు ప్రభావం కావచ్చని కొన్ని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతుంటే, అదేమీ కాదని, కావాలనే ఆయన డైవర్షన్ రాజకీయాలలో భాగంగా అలా మాట్లాడుతుంటారని మరికొన్ని పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కుప్పం టూర్ లో ఒక అధికారిని ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును ఉదహరిస్తున్నారు. ఏదో పని గురించి ఆయన అడగగా, ఆ అధికారి నిధుల ప్రస్తావన తేగానే ,వెంటనే ఆ మాటను తప్పించారు.మీకు అవకాశం ఇచ్చానని, ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని అంటూ ఏదో మాట్లాడారు. మరో సందర్భంలో ఒక పౌరుడి ఇంటి వంటగదిలో ఆంగ్లంలో మాట్లాడిన వైనం కూడా ఎవరికి అర్దం కాలేదు. ఇలాంటి ప్రయోగాలను చంద్రబాబు చేయకుండా ఉంటే బెటరేమో అని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ హే రామ్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేస్తూ,ఆయా ఘటనలను ప్రస్తావించారు. పోలీసుల పక్షపాత ధోరణి, రాష్ట్రంలో శాంతి భద్రతల లేమి ,సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణమైన కేసులు పెట్టడం వంటి వాటిని ఆయన వివరిస్తూ ఏపీకి కావాల్సింది రౌడీ రాజ్యం కాదని, జింగిల్ రాజ్ కాదని అన్నారు. ప్రజలకు భద్రత,బాదితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ లేవనెత్తిన అంశాలపై ఒక్కదానికి కూడా చంద్రబాబు బదులు ఇచ్చినట్లు అనిపించదు.పైగా తాను రౌడీలు, మాఫియాతో రాజకీయాలు చేయవలసి వస్తోందని అనడంలో అర్ధం ఉన్నట్లు కనిపించదు. ఆయన ఉద్దేశం వైసిపిని ప్రజలలో పలచన చేయడం కావచ్చు. కాని ఆయన ఆ మాట అనగానే జనానికి ఈ రెండేళ్లలో టీడీపీ,జనసేన నేతలు, కార్యకర్తలు పలువురు చేస్తున్న రౌడీయిజం,అరాచకాలు గుర్తుకు వస్తున్నాయి.గతంలో టీడీపీకి చెందిన కొందరు చేసిన హత్యలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధత కూడా కొట్టొచ్చినట్లు కనపడుతోందన్న వ్యాఖ్యలు కూడా ఆయా వర్గాలు చేస్తున్నాయి. యూట్యూబర్ రావణ అరెస్టు జరిగిన తీరు, ఆ క్రమంలో జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు రౌడీయిజం చేసిన తీరేమిటి?పోలీస్ స్టేషన్ ల పైనే దాడులు చేయడం ఎప్పుడైనా గతంలో జరిగిందా?అది ప్రభుత్వ అసమర్ధత కాదా! దీని గురించి జవాబు చెప్పకుండా రౌడీ రాజకీయం అంటూ ఎవరిమీదో నెట్టాలని ఎందుకు చూస్తున్నారు?గాదె సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలలో జగన్ స్వయంగా రంగంలో దిగేవరకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది. అది కూడా అరకొరగా చేస్తూ పోలీసుల తప్పులను కప్పిపుచ్చే రీతిలో వ్యవహరించడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా?పైగా సాయికృష్ణ కాపు కులమేనని,సిఐ నాగరాజు అదే కులమని చెప్పడం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏమి చెప్పదలిచారు?దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులతో టీడీపీకే చెందిన మరో నాయకుడి ఇంటిపైకి వెళ్లి కూల్చివేయడానికి చేసిన ప్రయత్నం చంద్రబాబు దృష్టిలో రౌడీయిజం అవుతుందా?కాదా?రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై చేసిన దారుణాల గురించి ఎందుకు చర్య తీసుకోలేకపోయారు. రౌడీలు రాజకీయం చేయడం వల్లే వివేక హత్య జరిగిందట.ఆ కేసులో దస్తగిరి అనే నిందితుడికి ఎందుకు టీడీపీ మద్దతు ఇస్తోందన్నదానికి జవాబు దొరకదు. మరి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను ఏ రౌడీలు హత్య చేశారు? టీడీపీ వారినే కదా ఆ రోజుల్లో అరెస్టు చేసింది?ఆనాడు జరిగిన ఘటనలపై మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఏమి రాశారు?నేరస్తులతో సమాజానికి నష్టం అని అంటున్నారు.నిజమే!కాని 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో 135 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా!అందులో 80 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని వచ్చిన లెక్కలపై ఎప్పుడైనా స్పందించారా?ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఏదైనా ప్రచారం చేయవచ్చనుకుంటే రోజులు మారాయి. సోషల్ మీడియా విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. అందులో వాస్తవాలు చెప్పి ప్రశ్నిస్తున్నవారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు అంతగా తాపత్రయపడుతుంది అర్ధం కావడం లేదా?ఒకవైపు వైఎస్సార్సీపీ మహిళా నేతలపై నీచాతీనీచంగా మాట్లాడిన టీడీపీ నేతలు కొందరిని ఎమ్మెల్యేలుగా చేసేది ఆయనే. జగన్ కుటుంబ సభ్యులను దారుణంగా బూతులు తిట్టిన వారితో టీడీపీ మహానాడులో ఉపన్యాసాలు ఇప్పించేది ఆయనే ! మళ్లీ బహిరంగ సభలలో అదేదో వైఎస్సార్సీపీఇలాంటివి చేస్తున్నట్లు ప్రచారం చేసేది ఆయనే!ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైఎస్సార్సీపీ ఫండింగ్ ఇస్తోందట. దానికి ఆధారం ఉంటే చూపించాలి కదా!అనేక యూట్యూబ్ చానళ్లను టీడీపీ పోషిస్తున్నదన్న అరోపణలు ఉన్నాయి కదా! ఈ చానళ్ళు ఎంత అసభ్యంగా ప్రచారం చేసిన చర్యలు ఉండవు.కాని అదే వైఎస్సార్సీపీపై మాత్రం విరుచుకుపడుతుంటారు. సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకరంగా ప్రచారం చేస్తే చర్య తీసుకోవచ్చు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారు వేసే ప్రశ్నలకు జవాబు లేక ఏదో రకంగా కేసులు పెడుతున్న వైనాన్ని సమర్దించుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారన్న అభిప్రాయమే కలుగుతుంది.ఐ టీడీపీ పేరుతో ఏమి చేసింది ఎవరికి తెలియదనుకుంటే ఎలా ? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తనకు రౌడీయిజం తెలియదని,తానెప్పుడు హత్యలు చేయలేదని అనవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఇలాంటి మాటలు అన్నప్పుడే సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుందని ఆయన అర్దం చేసుకోవాలి. మావిగన్ అని జగన్అంటే దానిని వాటికన్ తో పోల్చడం ఏమిటి?యధా ప్రకారం లడ్డూ కల్తీ అని స్పీచ్ ఇస్తున్నారు. ఆ కల్తీ ఫిర్యాదు తన హయాంలో వచ్చినా దానిని ఎదుటివారిపై రుద్దుతారు. అసలు ఆయన చేసిన జంతు కొవ్వు ఆరోపణ ఏమిటి?అలా మాట్లాడడం పాపం కాదా?ఇప్పటికీ భక్తుల సెంటిమెంట్లు దెబ్బతినేలా ఎందుకు మాటలు కొనసాగిస్తున్నారు.ఏది ఏమైనా చంద్రబాబు స్థాయికి తగ్గట్లు మాట్లాడలేకపోతున్నారన్న భావన జనంలో ఏర్పడుతోంది.జగన్ మాత్రం స్పష్టమైన ఆధారాలతో తన అభిప్రాయయాలు చెప్పడం ద్వారా తన విశ్వసనీయతను పెంచుకుంటున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సమానత్వం పేరిట ఆహారంలో కోత
ఆహార భద్రతా చట్టానికి సవరణలు చేయటానికి కేంద్రప్రభుత్వం పూనుకుంది. ఏదైనా ఆహార భద్రతా చట్టంలో మార్పును పరీక్షించడానికి ఒక సులభమైన కొలమానం ఉంది. ఆ పథకం ఎవరి కోసం రూపొందిందో ఆ వ్యక్తిని – అంటే గాంధీజీ చెప్పిన ‘అంత్యోదయ’, వరుసలో చిట్టచివరి మనిషిని – తీసుకోవడం; ఈ సవరణ తర్వాత అతడికి ఎక్కువ ఆహారం అందుతుందా, తక్కువా అని అడగడం. జాతీయ ఆహార భద్రతా (సవరణ) బిల్లు, 2026కు ఈ పరీక్ష పెడితే వచ్చే జవాబు స్పష్టం: ప్రతి కుటుంబానికీ తక్కువే. ఒంటరిగా ఉండే వితంతువుకు మరీ తక్కువ. ఈ చట్టం ఆమెనూ, ఆమెలాంటి వాళ్లనూ రక్షించడానికి రూపొందినది కావడమే ఇక్కడ గమనార్హం.పెద్ద కుటుంబాల మాటేమిటి?‘అంత్యోదయ అన్న యోజన’ (ఏఏవై) కింద కుటుంబానికి నెలకు 35 కిలోల ధాన్యం ఇచ్చే హక్కును ఈ బిల్లు తీసేసి, ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కుటుంబానికి గరిష్ఠంగా 35 కిలోల పరిమితిని విధిస్తోంది. దీన్ని ‘అసమానతలను తొలగించడం’గా ప్రభుత్వం చెబుతోంది. కానీ లెక్క చూస్తే నిజం బయటపడుతుంది: ఒంటరి వ్యక్తికి 35 నుంచి 7 కిలోలకు (80% కోత) తగ్గుతుంది. ఇద్దరికి 14 కిలోలకు, ముగ్గురికి 21కి, నలుగురికి 28కి పడిపోతుంది. ఐదుగురి కుటుంబం మాత్రమే సరిగ్గా 35 కిలోలు తీసుకుంటుంది. ఆరు, ఏడు, ఎనిమిది మంది ఉన్న కుటుంబాలు 35 కిలోల పరిమితి వల్ల ఉన్న చోటే ఉండిపోతాయి. ఏ ఒక్క ‘ఏఏవై’ కుటుంబానికీ ఒక్క కిలో అదనంగా రాదు. ‘లాభం’ అనే గడి పూర్తిగా ఖాళీ. 7 కిలోలు పోషకాహార ప్రమాణమే అయితే, ఎనిమిది మంది కుటుంబానికి 56 కిలోలు కావాలి. కానీ పరిమితి వాళ్లకు 35 మాత్రమే ఇస్తుంది. అంటే తలసరి 4.4 కిలోలు. సాధారణ ప్రాధాన్య కుటుంబం కంటే కూడా తక్కువ. ఈ పోషకాహార సూత్రం కోత పెట్టే చోట పని చేస్తుంది, హక్కు పెంచాల్సిన చోట మాత్రం మౌనంగా ఉంటుంది. ఒకే వైపు పనిచేసే సూత్రం కాదు – అది సమానత్వం ముసుగులో ఒక పొదుపు లక్ష్యం మాత్రమే.ఒంటరివాళ్లు ఏం కావాలి?చిన్న కుటుంబాలపైనే ఈ పథకాన్ని కేంద్రీ కరించారు. ఏఏవైలో చిన్న కుటుంబం అనేది యాదృచ్ఛికం కాదు, అదే దాని రూపకల్పన. 2000 సంవత్సరం నుంచి ఏఏవై రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పింది: ఆసరా లేని వితంతువులు, ఒంటరి మహిళలు, మంచానపడ్డ రోగులు, వికలాంగులు, ఆధారం లేని వృద్ధులు, ఆదిమ తెగలు,ఒంటరిగా బతికే నిరుపేదలను గుర్తించండి అని! దారిద్య్రం మన దేశంలో ఒకరిద్దరుగానే ఉంటుంది. అందుకే 35 కిలోల ఫ్లాట్ హక్కు పొరపాటు కాదు, అది తలసరి లెక్కకు కుదించ లేని ఒక గుర్తింపు. ఒంటరి నిరుపేదకు ఆ రేషన్ కేవలం ఆహారం కాదు; పింఛను అందని నెలకు అది ఆసరా, ఇంట్లో ఏ ఆపదనైనా తట్టుకోగల ఏకైక ఆస్తి. రేషన్ దుకాణంలో ఒంటరి కార్డుపై వేలి ముద్ర ఎవరిదో చూసిన వారికి తెలుసు. అది చాలావరకు ఏ దిక్కూ లేని ఒక ముసలి స్త్రీది. ఆమె 35 కిలోలు ఇప్పుడు 7 కిలోలు అవుతాయి. చట్టం చరిత్రలోనే విధించిన అతిపెద్ద కోత ఇది.పైగా ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? ఎఫ్సీఐ గోదాముల్లో దాదాపు 604 లక్షల టన్నుల ధాన్యం– బఫర్ ప్రమాణానికి దాదాపు మూడు రెట్లు– పేరుకుపోయి ఉన్నప్పుడు. అదే సమయంలో రైతులు వరి, గోధుమ, కంది, పెసర కనీస మద్దతు ధర కంటే తక్కు వకే అమ్ముకుంటున్నారు. మిగులుపై కూర్చొని, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అత్యంత పేద కుటుంబాల రేషన్ నుంచి ఏటా 22–25 లక్షల టన్నులు తీసేయడం – ఇది కొరత వల్ల కాదు, పొదుపు పేరుతో జరుగుతున్న మార్పు. సేకరణ దగ్గర రైతును,పంపిణీ దగ్గర పేదను నొక్కి, మధ్యలో మిగిలిన దాన్ని ‘పొదుపు’ అని పిలవడం– ఇది మనం మళ్లీ మళ్లీ చూస్తున్న నమూనా. ఇది చట్టం చరిత్రలో మొదటిసారిగా ఒక హక్కును తగ్గించే సవరణ. ఆర్టికల్ 21 కింద ఆహార హక్కును ఒకసారి కల్పించాక దాన్ని వెనక్కి తీసుకోవడం రాజ్యాంగపరంగా ప్రశ్నార్థకం. పైగా ఇంత కీలకమైన మార్పును – ఈమెయిల్ ద్వారా, ఇంగ్లిష్లో మాత్రమే, కొద్ది రోజుల గడువుతో సంప్రదింపులకు పెట్టడం ప్రభుత్వం తన శాసన సంప్ర దింపుల విధానాన్నే ఉల్లంఘించడం! అసలు పరిష్కారంప్రభుత్వం చెప్పే సమస్య నిజమైనదే అయితే, పరిష్కారం చాలా సులభం. ఒక అంత్యోదయ అన్న యోజన కుటుంబానికి హక్కు ఒక్కొక్కరికి 7 కిలోలు, లేదా కుటుంబానికి 35 కిలోలు– వీటిలో ఏది ఎక్కువ అయితే అది నిర్ణయించవచ్చు. చిన్న కుటుంబాలు తమ రక్షణను నిలబెట్టుకుంటాయి; పెద్ద కుటుంబాలకు– ఆరుగురికి 42 కిలోలు, ఎనిమిది మందికి 56 కిలోలు వస్తాయి. బిల్లు ఉదహరించే ఐసీఎంఆర్ పోషణ ప్రమాణానికి తగిన వాటా దొరుకుతుంది. దీనికి కావాల్సిన అదనపు ధాన్యం నేటి మిగులు ముందు నామమాత్రమే. పైగా అది గోదాముల ఒత్తిడిని తగ్గించి, కనీస మద్దతు ధర కంటే తక్కువకు పడిపోయిన మార్కెట్లో సేక రణకు ఊతమిస్తుంది. ఎవరూ నష్టపోరు, అందరూ లాభపడతారు. కానీ ప్రభుత్వం మాత్రం పేదలే ఎక్కువ నష్టపోయే సూత్రాన్ని ఎంచుకుంది. మిగిలిన ధాన్యాన్ని ఇథనాల్ పరిశ్రమలకు సబ్సిడీతో అందించే బదులు ఆకలితో ఉన్నవాళ్లకి అందిస్తే మంచిది కదా!అలా అని ఇప్పుడు ఉన్న చట్టంలో సమస్యలు లేవని కాదు. నిజానికి చట్టానికి సంస్కరణలు అవసరమే– కానీ ఈ దిశలో కాదు. అసలైన సవరణ ఐదు ప్రశ్నలను ఎదుర్కోవాలి. మొదటిది, జనాభాలో ఒక శాతం ప్రకారం కాక నిజంగా అవసరమున్నవారిని క్షేత్రస్థాయిలో గుర్తించి చేర్చడం. రెండోది, బియ్యం, గోధుమలకే పరిమితం కాకుండా పప్పులు, చిరుధాన్యాలు, నూనెను రేషన్ బుట్టలో చేర్చడం. మూడోది, ప్రజాపంపీణీ వ్యవస్థ ఆహారం తినడానికి సురక్షితంగా ఉండేలా ప్రమాణాలు, పరీక్షలు, తిరస్కరించే హక్కు కల్పించడం. నాలుగోది, రైతును తక్కువ ధరతో ముంచి చౌక ఆహారానికి రాయితీ ఇవ్వడం ఆపి, గిట్టుబాటు ధర (సీ2+50%)ను ఆహార భద్రత నిజ ఖర్చుగా గుర్తించడం. ఐదోది, మిగతా నాలుగింటినీ సాధ్యం చేసేది– వ్యవస్థను వికేంద్రీకరించి, జిల్లాను ప్రాతిపదికగా చేసి, స్థానిక ఎఫ్పీఓలకు సేకరణ, నిల్వ,పంపిణీ బాధ్యతలను అప్పగించడం. ఈ బిల్లును ఇప్పటికీ వెనక్కి తీసుకోవచ్చు. దాని వెనుక ఉన్న శక్తిని, చట్టం దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిజమైన సంస్కరణ వైపు మళ్లించడమే మెరుగైన మార్గం. అలా కాక, సమానత్వం ముసు గులో చేసేది కేవలం కోత మాత్రమే!డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
అంతా ప్రపంచం మంచికే!
జూలై నెల ఇంకా సగం కూడా గడవ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ నెలలో 31 రోజులు అయినందున మూడవ వంతే అయినట్లు లెక్క. ఈ కొద్ది కాలంలోనే జపాన్ ప్రధాని భారత రాజధానికి వచ్చి వెళ్లగా, భారత ప్రధాని మూడు ముఖ్య మైన దేశాలు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. ఏ కొలమానం ప్రకారం చూసినా ఇది అసాధారణమైనది. ఈ నాలుగింటిలో ఏదీ అపుడపుడు జరుగుతుండే సౌహార్ద్రపూరితమైన సందర్శన కాదు. అన్నింటికి అన్నీ వ్యూహాత్మకమైన కోణాలు గలవి. ఎందుకట్లా?కొత్త అస్థిరతలుఆ చర్చలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు అర్థం చేసుకోవటం అవసరం. లేనట్లయితే ఇన్నిన్ని పర్యటనలు, ఒప్పందాలు ఎందుకు, ఇంత వేగంగా ఎందుకు అన్నది తెలుసుకోలేము. ఈ నెల పర్యటనలకు గత ఆరుమాసాల ప్రయాణాలను కూడా జోడించి చూసిన ప్పుడు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటిది, ఒకటి రెండేళ్ల క్రితంతో పోల్చితే ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతుండటం. రెండవది, మార్పులన్నవి రాజకీయం, ఆర్థికం, సైనికం, వేర్వేరు కూటములు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉద్యోగ ఉపాధుల కోసం ఇతర దేశాలకు తరలిపోవటం, పెరుగుతున్న జాతివాదాలు, వీటితో పాటు తీవ్ర రూపం తీసుకుంటున్న వాతావరణ పరిస్థితుల న్నిటా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచమంతటా కొత్త అస్థిరతలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి స్థితి ఎప్పుడూ లేదు.ఇటువంటి పరిణామాల మధ్య ఆసియాతోపాటు మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్లే గాక, ఉత్తర అమెరికాలో భాగమైన కెనడా వరకు కూడా కొత్త ఒత్తిడులు ఏర్పడుతూ, కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. సముద్రాలలో ఎక్కడో విసిరివేసినట్లుండే డజన్లకొద్దీ దేశాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వాటి సమస్యలు మరింత ప్రమాదకర మైనవి. పెద్ద దేశాలు తమ అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని లెక్క చేయనందువల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ, ఆ ద్వీప దేశాలు మునిగి పోగల వేగం కూడా పెరుగుతున్నది. అందుకే అటువంటి వారంతా గత నెల మొదటిసారిగా పెద్ద దేశాలు వేటినీ ఆహ్వానించకుండా, ఐక్యరాజ్యసమితితో సైతం నిమిత్తం లేకుండా, కొలంబియాలో సమావేశమయ్యారు. అన్ని ఖండాలలోని అన్ని దేశాలకూ ఆర్థికం, రక్షణలన్నవి అనిశ్చయమవుతున్నాయన్నది గమనార్హం.బహుళ ధ్రువ ప్రపంచంభారత దేశానికిగానీ, మరే దేశానికిగానీ ఆర్థికాభివృద్ధి, దేశ రక్షణ, ఇతర ప్రయోజనాల పరిరక్షణ, నిరాటంకమైన రీతిలో పురోగతి అనే నాలుగు ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే. లోగడ కూడా ఇవి సజావుగా ఏమీ సాగలేదు. కానీ సమస్యలు ఇటీవల మరింత పెరుగుతున్నాయి. అందరికీ పెరగటమన్నది ఒక సామాన్య లక్షణంగా మారింది. అందువల్లనే ఇండియా వలెనే అన్ని దేశాలూ ఈ స్థితి నుంచి బయటపడేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణ అమెరికా మొదలు కెనడా, యూరప్, ఆఫ్రికాలపైగా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల వరకు ఆర్థిక, రక్షణ ఒప్పందాల కోసం భారత ప్రధాని పర్యటనలు చేయటమే కాదు, ఒప్పందాల అవసరాన్ని గుర్తించి వారు కూడా ఇటు వస్తున్నారు.ఇండియాను అట్లుంచి వారిలో వారు కూడా పరస్పర ప్రయాణాలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. వేర్వేరు దేశాధినేతల ఆకాశయా నాలు ఇంతగా బహుశా లోగడ ఎప్పుడూ జరిగి ఉండవు. ఆర్థిక, రక్షణ విషయాలతో ముడిపడిన ఇటువంటి మార్పులు రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలోగానీ, ఏకధ్రువ ప్రపంచావ తరణ జరిగిన తర్వాతగానీ, ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయ మంటే అతిశయోక్తి కాకపోవచ్చు.ఏ దేశమైనా అభివృద్ధి చెందాలనీ, భద్రంగా ఉండాలనీ కోరుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక సంస్క రణల కాలం నుంచి ఒకవైపు వస్తూత్పత్తి, వినియోగాలు చరిత్రలో ఎన్నడూ లేనట్లు పెరుగుతుండగా, మరొకవైపు అన్ని దేశాలలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అదే స్థాయిలో పెరగసాగాయి. ఈ రెండింటికి తగిన విధంగా అభివృద్ధిని సాధించి, దేశ భద్రతా ఏర్పాట్లను కూడా పెంచవలసిన బాధ్యత సహజంగానే ప్రభుత్వాలపై పడింది. ఆ బాధ్యతలను నెరవేర్చలేని ప్రభుత్వాలు ఓటింగ్ ద్వారానో, తిరుగుబాట్ల వల్లనో కూలిపోవటాన్ని చూస్తు న్నాము. ఈ విధమైన పరిణామాలు అంతర్గతమైన ఒత్తిడులు కాగా, అదే విధమైన ఒత్తిడులు వేరే రూపాలలో, బయటి పరిణామాల వల్ల ఏర్పడటం ఇటీవలి కాలంలో పెరగటం మొదలైంది. అందుకు నాంది ఆర్థిక సంస్కరణలు వర్ధమాన దేశాలకు, మరీ ముఖ్యంగా సాధారణ సామాజిక వర్గాలకు ప్రతికూలమై అసమానతలను పెంచటంతో పడింది. ఇటీవలికి వచ్చేసరికి, పాశ్చాత్య దేశాలు తాము సృష్టించి ఇతరులపై రుద్దిన పలు అంతర్జాతీయ నియమ నిబంధనలు తాము కోరుకున్న ఫలితాలనివ్వటం తగ్గటంతో వాటిని భంగపరచటం మొదలైంది. వారు కొత్త వ్యవస్థలనూ సృష్టించలేక పోతున్నారు. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా బహుళ ధ్రువ ప్రపంచ భావనలు బలపడటం, ఇండియాతో పాటు కొన్ని ప్రముఖ దేశాలు ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయ సంస్థలను ఏర్పరచటం జరిగింది. బయటకు స్పష్టంగా ప్రకటించకున్నా అమెరికన్ డాలర్కు సమాంతర కరెన్సీల వినియోగం క్రమంగా విస్తరిస్తున్నది. పులి మీద పుట్ర వలె ట్యారిఫ్లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాలు, అక్కర లేని యుద్ధాలు, అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.బద్దలవుతున్న చట్రంవీటన్నింటివల్ల వీరువారని గాక అందరికీ ఎదురవుతున్న సమస్యలు ఏమిటో ఏకరువు పెట్టనక్కరలేదు. ఆ సమస్యలలో ఆర్థిక మైనవి, రక్షణపరమైనవి, ఇతరాలు కూడా ఉన్నాయి. ఈ రెండు రంగాలకు సంబంధించి అమెరికాకు సన్నిహిత దేశాలైన యూరప్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, గల్ఫ్ రాజ్యాల వంటివి సైతం తమలో తామే గాక ఇండియా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలతోనూ ఇటీవలి ఆరు మాసాలలో చేసుకుంటూ వస్తున్న ఆర్థిక ఒప్పందాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కెనడా, యూరప్ల వంటివి అమెరికా వద్దన్నా... చైనాతో ఒప్పందాలను ఆర్థిక భద్రత కోసం చేసుకుంటున్నాయి. ఈ మార్పులు, మలుపులు ప్రపంచాన్ని అను కోని రీతిలో పాత చట్రం నుంచి బయటకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్వుడ్స్ సంస్థల నుంచి ఆర్థిక సంస్కరణల వరకుండిన ఒక చట్రం, అప్పటి నుంచి ఉండిన రెండవ చట్రం ఇప్పుడు భగ్నమవుతున్న దృశ్యాన్ని మనమిపుడు చూస్తున్నాము. మన జూలై ఒప్పందాలు కూడా విస్తృతార్థంలో అదే పరిధి లోకి వస్తాయి. అంతటా అందరూ క్రమంగా స్వతంత్ర నిర్ణయా లతో, పరస్పర ఒప్పందాలతో, స్వతంత్రంగా ఎదిగేందుకు,భద్రంగా జీవించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మనకు నిజంగా నిరోధకత ఉందా?
2021 వసంతకాలంలో భారతదేశంలో రెండో కోవిడ్ అల ఆసుపత్రులను ముంచెత్తుతున్న సమయంలోనూ ఒక ప్రమాదకరమైన అపోహ విస్తృత ప్రచారంలో ఉంది: ‘దక్షిణాసియా ప్రజలకు కరోనా వైరస్పై సహజమైన రోగనిరోధక శక్తి ఉంది.’ ఇది ఎలా పుట్టింది? దాని వల్ల ఎంత నష్టం జరిగింది? రాబోయే మహమ్మారులకు సిద్ధంగా ఉండాలంటే ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవలసిందే.గణాంకాల తప్పుమొదటి తప్పు గణాంకాల్లో జరిగింది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో అధికారికంగా నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య అసలు మరణాల కంటే చాలా తక్కువగా ఉంది. పరీక్షలు పరిమితంగా ఉండటం, మరణాల నమోదు వ్యవస్థలు బలహీనంగా ఉండటం వల్ల అనేక మరణాలు నమోదు కాలేదు. మరికొన్నింటిని ఇతర కారణాల వల్ల జరిగిన మరణాలుగా నమోదు చేశారు.2021 చివరి వరకు భారత ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ మరణాల సంఖ్య లక్షల్లోనే ఉంది. అయితే ‘ద లాన్సెట్’, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ చేసిన స్వతంత్ర అధ్యయనాలు... ఏడాది కాలంలో సాధారణంగా నమోదయ్యే మరణాల కంటే అదనంగా సంభవించిన మరణాలు 40 నుంచి 50 లక్షలు ఉండొచ్చని అంచనా వేశాయి. ప్రభుత్వ ప్రకటనల్లో తక్కువ మరణాల సంఖ్య ప్రజలకు ఊరట నివ్వొచ్చు. కానీ అవే నిజమని నమ్మితే నిర్లక్ష్యానికి దారితీస్తాయి.‘అదనపు మరణాలు’ అనే ప్రమాణం మరింత విశ్వసనీయ మైనది. ఎందుకంటే ఒక మరణాన్ని కోవిడ్గా నమోదు చేశారా, న్యుమోనియాగా నమోదు చేశారా, లేక కారణం తెలియదని పేర్కొ న్నారా అనే విషయాన్ని అది పట్టించుకోదు. సాధారణంగా ఏడాదిలో ఎంతమంది మరణిస్తారు, వాస్తవంగా ఎంతమంది మర ణించారు అనే తేడాను మాత్రమే అది పరిశీలిస్తుంది. ఈ ప్రమాణంతో చూస్తే దక్షిణాసియా దేశాల ప్రజలకు అసాధారణ రక్షణ ఉందనేది సరికాదు. అది కేవలం తక్కువ లెక్కింపు వల్ల కనిపించే దృశ్యం అని అర్థమవుతుంది.జీవన విధానాల ప్రభావంప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ ప్రభావం తక్కువగా కనిపించడానికి మరో కారణం జీవశాస్త్రం కాదు. పర్యావరణం, ప్రజల జీవన విధానం. గాలి సరిగా వీచే ప్రదేశాలు, జనసాంద్రత, ప్రయాణ అలవాట్లు, ఇంటి లోపల గడిపే సమయం వంటి అంశాలు వైరస్ వ్యాప్తిపై పెద్ద ప్రభావం చూపుతాయి. దక్షిణా సియాలో చాలా ప్రాంతాల్లో వీధి వ్యాపారం, కూలి పని, సామాజిక కలయిక వంటి రోజువారీ కార్యకలాపాలు బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతాయి. అక్కడ గాలి స్వేచ్ఛగా వీస్తుంది. కాబట్టి వైరస్ అంత వేగంగా వ్యాపించదు. అందువల్ల ప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో వైరస్ నెమ్మదిగా వ్యాపించి ఉండొచ్చు. అంతేకాని అది ప్రజల్లో సహజ రోగనిరోధక శక్తి ఉన్నందు వల్ల కాదనేది గమనించాలి.ఇది జీవశాస్త్రానికి సంబంధించిన కథ కాదు. నగరాల నిర్మాణం, జీవనశైలి వంటి అంశాలకు సంబంధించిన విషయం. మూసివేసిన, ఎయిర్కండిషన్ భవనంలో వైరస్ ఒక విధంగా, బహిరంగ మార్కెట్లో మరో విధంగా వ్యాపిస్తుంది. గాలిలో వైరస్ ఎక్కువసేపు నిలిచే పరిస్థితులు ఉన్నచోట తీవ్రంగా వ్యాపించింది. అలాంటి పరిస్థితులు లేని చోట వ్యాప్తి ఆలస్యమైంది. ఈ అనుభవం మనకు నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్య పెట్టు బడుల ప్రాముఖ్యాన్ని నేర్పాలి. కానీ దానిని ప్రజల సహజ రోగనిరోధక శక్తికి నిదర్శనంగా తప్పుగా అర్థం చేసుకున్నారు.1918లో వచ్చిన ఇన్ఫ్లుయెంజా మహమ్మారి భారత ఉపఖండంలో సుమారు 1.2 కోట్ల నుంచి 1.7 కోట్ల మంది ప్రాణాలు తీసింది. ప్రపంచంలోని ఏ ఒక్క దేశంలోనైనా నమోదైన అతిపెద్ద మరణాల సంఖ్యల్లో ఇది ఒకటి. 19వ శతాబ్దంలో కలరా మహ మ్మారులు గంగానది పరివాహక ప్రాంతం నుంచి పదే పదే వ్యాపించాయి. ఈ చరిత్ర చెబుతున్న విషయం ఒక్కటే. ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రక్షణ లేదు. బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలు, సరిపోని మౌలిక సదుపాయాల వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.కోవిడ్ సమయంలో టెలివిజన్ కార్యక్రమాల్లో కొందరు మూలికల మందులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని ప్రచారం చేశారు. భారతదేశంలో బీసీజీ టీకా ఎక్కువ మందికి వేయడం వల్ల రక్షణ లభించిందని కొందరు అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వాదనలు వేగంగా వ్యాపించాయి. వాటిని ప్రశ్నించే శాస్త్రీయ స్వరాలు అంతగా వినిపించలేదు. ఇలాంటి ప్రచారం వల్ల అసలు ప్రమాదం ప్రజల ప్రవర్తనలో కనిపిస్తుంది. ‘మనం ఇప్పటికే రక్షితులం’ అని నమ్మినవారు పరీక్షలు చేయించు కోవడానికి, ఇతరుల నుంచి దూరంగా ఉండడానికి, టీకాలు వేయించుకోవడానికి, లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లడానికి తక్కువ ఆసక్తి చూపుతారు.ఎలా ఎదుర్కోవాలి?సంప్రదాయ ఆహారం, ఇంటి చిట్కాలు ఆరోగ్యానికి కొంత మేలు చేయవచ్చు. కానీ ఊపిరితిత్తులపై దాడి చేస్తున్న వైరస్ను అవి ఆపలేవు. ఆ సమయంలో అవసరమయ్యేది ఆక్సిజన్ చికిత్స, వైద్య సేవలు. ఈ రెండింటి మధ్య తేడాను చెరిపేసిన తప్పుడు ప్రచారం సాంస్కృతిక అతిశయం మాత్రమే. ఇది నివారించగలిగిన మరణాలకు కూడా కారణమైంది. మహమ్మారి ముగిసిన తర్వాత కూడా తప్పుడు సమాచారం ఎందుకు నిలిచిపోతుంది? ఎందుకంటే అది ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ‘మన ప్రజలు బలమైనవారు’, ‘మన సంప్ర దాయాలు మనల్ని కాపాడతాయి’ అనే మాటలు భయంతో ఉన్న సమయంలో ఆకర్షణీయంగా అనిపిస్తాయి. దానికి విరుద్ధంగా ‘వైరస్కు మీ సంస్కృతి తెలియదు. మీ చరిత్రతో దానికి సంబంధం లేదు’ అనే సందేశం అంతగా నచ్చదు.భవిష్యత్తులో సంభవించబోయే విపత్తులను ఎదుర్కోవడానికి తప్పుడు కథనాలను అధిగమించి నిజాలపై ఆధారపడగలిగిన వ్యవ స్థలను నిర్మించాలి. అందుకోసం మరణాల నమోదును బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల శివార్లలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలపరచాలి. తప్పుడు సమాచారం ఎలా వ్యాపిస్తుందో అర్థం చేసుకునే ప్రజారోగ్య సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధారాలు లేని వాదనలను ప్రచారం చేసే అధికారులు, మీడియా వ్యక్తులను జవాబుదారులుగా నిలబెట్టాలి. దక్షిణాసియా వాసులకు సహజ రోగనిరోధక శక్తి ఉందనే అపోహ మనకు నేర్పిన ప్రధాన పాఠం ఒక్కటే: ‘శ్వాసకోశ వైరస్ల నుంచి ఏ జాతికీ, ఏ దేశానికీ సహజ రక్షణ ఉండదు’. ప్రజలను రక్షించేది అపోహలు కాదు. ముందస్తు సన్నద్ధత, వ్యాధులపై నిఘా, ప్రజల విశ్వాసం, సరైన సమయంలో తీసుకునే చర్యలే.మహమ్మారి ఉద్ధృతమయ్యేలోపే ఈ పాఠం నేర్చుకుంటే ప్రాణాలు నిలుస్తాయి. అదే ఆలస్యంగా నేర్చుకుంటే, ఆసుపత్రి కారి డార్లలో, ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూల్లో నిలబడి ఆ నిజాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు చెల్లించాల్సిన మూల్యం గణాంకాల్లో కాదు. అంత్యక్రియల్లో కనిపిస్తుంది.మేడా పరమేశ్వర రెడ్డివ్యాసకర్త ఇండో–అమెరికన్ రిటైర్డ్ సైంటిస్ట్, ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్ -
ప్రవాస భారతీయులకు ఆర్బీఐ వరం
2026 జూన్ 8న భారతీయ రిజర్వు బ్యాంకు... వాణిజ్య బ్యాంకులు సమీకరించే మూడు నుంచి ఐదేళ్ల కాల పరిమితి గల ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్లపై, ప్రత్యేక డాలర్–రూపాయి స్వాప్ సదుపాయాన్ని ప్రకటించింది. 2026 సెప్టెంబరు 30 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. సాధారణంగా అమెరికన్ డాలర్, యూరో, బ్రిటిష్ పౌండ్, జపాన్ యెన్, ఆస్ట్రేలియన్ డాలర్, కెనడియన్ డాలర్ వంటి ప్రధాన విదేశీ ద్రవ్యాల్లో ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపా జిట్లు స్వీకరిస్తారు. ఈ నిర్ణయంతో ప్రవాస భారతీయులకు తమ విదేశీ ద్రవ్యాన్ని రూపాయిల్లోకి మార్చకుండానే, గతంతో పోలిస్తే అధిక వడ్డీ పొందే అవకాశం లభించింది.ఎఫ్సీఎన్ ఆర్(బి) (ఫారిన్ కరెన్సీ నాన్– రెసిడెంట్ బ్యాంక్) డిపాజిట్ అంటే – ప్రవాస భారతీయులు విదేశాల్లో ఆర్జించిన సొమ్మును, అనుమతించబడిన విదేశీ ద్రవ్యంలోనే భారతీయ బ్యాంకుల్లో కాలపరిమితి డిపాజిట్గా ఉంచడం. గడువు పూర్తయ్యాక అసలు, వడ్డీ రెండూ అదే ద్రవ్యంలో తిరిగి చెల్లించబడుతాయి. ఎన్ఆర్ఈ డిపాజిట్లో మాత్రం ఆ డబ్బు రూపాయిల్లోకి మారుతుంది. భారత్లో వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు, విదేశాలకు తిరిగి తీసుకెళ్లే సౌలభ్యం రెండింటికీ వర్తిస్తాయి.సాధారణంగా, ఎన్ ఆర్ఈ డిపాజిట్లతో పోలిస్తే ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్లపై కొంత తక్కువ వడ్డీ లభిస్తుంది. ఎందుకంటే, బ్యాంకులు ఈ విదేశీ ద్రవ్య నిధులను రూపాయిల్లోకి మార్చుకొని, దేశీయ అవసరాల కోసం వినియోగి స్తాయి. అయితే గడువు పూర్త య్యాక డిపాజిటర్లకు విదేశీ ద్రవ్యంలోనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈలోగా రూపాయి–డాలర్ మారకం ప్రతికూలంగా మారినా నష్టం వాటిల్లకుండా, బ్యాంకులు కొంత అదనపు వ్యయంతో కూడిన ముందస్తు రక్షణ ఏర్పాట్లు – అంటే హెడ్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజా ఆర్బీఐ విధాన నిర్ణయంతో, ఈ డిపాజిట్లపై బ్యాంకులు భరించాల్సిన హెడ్జింగ్ వ్యయాన్ని ఆర్బీఐ స్వయంగా భరిస్తుంది. దీంతో బ్యాంకులకు అలాంటి డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించే వెసులుబాటు కలిగింది.స్థిర విదేశీ ద్రవ్యవనరుల సమీకరణఈ విధానం ప్రకటించిన సమయంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొని ఉంది. ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. డాలర్తో పోల్చితే రూపాయి విలువ జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఆ నేపథ్యంలో, రూపాయిపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు, దేశానికి మరింత స్థిరమైన విదేశీ ద్రవ్య వనరులను సమకూర్చడం కూడా ఈ చర్య వెనుక ఉన్న ముఖ్యోద్దేశాల్లో ఒకటి. విదేశీ సంస్థాగత, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి స్వల్పకాలిక మూలధన ప్రవాహాలతో పోలిస్తే, ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్లు మరింత స్థిరమైన, దీర్ఘకాల విదేశీ ద్రవ్య వనరులుగా అక్కరకు వస్తాయి. అందువల్ల అత్యవసర సందర్భాల్లో, ఇటు వంటి ప్రత్యేక వెసులుబాట్ల ద్వారా విదేశీ ద్రవ్య నిధులను సమీకరించేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రవాస భారతీయ సమూహం, ఇటువంటి విధానాలు సఫలీకృతం కావడంలో విశేషంగా తోడ్పడుతోంది.2013లో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న సమయంలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్వల్ప మార్పులతో ఇదే తరహా ప్రత్యేక స్వాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకానికి అనూహ్య స్పందన లభించింది. కొద్ది నెలల్లోనే సుమారు 34 బిలియన్ అమెరికన్ డాలర్ల డిపాజిట్లు వచ్చాయి. రూపాయిపై ఒత్తిడి తగ్గించడంలో, విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంపొందించడంలో ఆ పథకం కీలక పాత్ర పోషించినట్లు భావిస్తారు. అయితే ఈ పథకంపై భిన్నాభిప్రాయాలు కూడా లేక పోలేదు. గడువు పూర్తయ్యాక ఒకేసారి భారీ మొత్తంలో విదేశీ ద్రవ్య చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో విదేశీ ద్రవ్య ప్రవాహాలు ఆశించిన స్థాయిలో లేకపోతే, రూపాయిపై మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని కొందరు ఆర్థికవేత్తల అభి ప్రాయం. అయితే 2013లో ప్రవేశపెట్టిన ఇదే తరహా పథకం గడువు ముగిసి నప్పుడు ఏర్పడిన పరిస్థితిని ఆర్బీఐ సమర్థవంతంగా ఎదుర్కొందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.అలాగే, ఇలాంటి తాత్కాలిక విధాన సడలింపులు తక్షణావసరాలను తీర్చడంలో ఉపయోగపడినా; ఎగుమతుల వృద్ధి, స్థిరమైన విదేశీ పెట్టుబడులు, బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థ వంటి దీర్ఘకాలిక చర్యలే దేశానికి స్థిరమైన విదేశీ ద్రవ్య వనరులను సమకూర్చగలవు. మార్చి 2026 నాటికి భారతీయ బ్యాంకుల్లో ఉన్న ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్ల మొత్తం సుమారు 34 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతర్జాతీయ అనిశ్చితుల వలన గణనీయంగా తగ్గిన నిల్వలను తిరిగి సమకూర్చుకోవడం తక్షణావసరం. ప్రస్తుత చర్యల ద్వారా, అనుకూల పరిస్థితుల్లో 50 నుంచి 60 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు అదనపు విదేశీ ద్రవ్య నిధులు సమీకరించే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఆ అంచనాలు ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతాయో రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది. అయితే, గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, అవసరమైన సమయంలో ప్రవాస భారతీయుల వ్యక్తిగత పొదుపులు కూడా దేశ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడగలవని ఆర్బీఐ విశ్వసించడం సహేతుకంగానే తోస్తోంది.పల్లపోతు కృష్ణబాలాజివ్యాసకర్త ఎస్బీఐ విశ్రాంత ఉన్నతాధికారి -
శరద్ పవార్ (85), ఎన్సీపీ లీడర్ రాయని డైరీ
‘‘భద్రం పవార్ జీ...’’ అంటూ ఒక్క గెంతున వచ్చి, నా చేతికి తన భుజాన్ని అందించారు ఏక్నాథ్ షిందే! ‘‘పడిపోనులే ఏక్నాథ్. కాసేపు మీ ఛాంబర్లో కూర్చుందామని వచ్చాను. కూర్చోవచ్చు కదా?’’ అన్నాను నవ్వుతూ. ‘‘పవార్ జీ, ఇంతటి గౌరవాన్ని మరెవరికైనా నేనెందుకు దక్కనిస్తాను! దయచేసి రండి. మీ పార్టీ ఛాంబర్ను కూడా కాదని, నా ఛాంబర్కి వచ్చారంటే నాకు మీ ఆశీస్సులు ఉన్నట్లుగానే కదా నేను భావిస్తాను. రండి, మెల్లిగా నడవండి’’ అన్నారు ఏక్నాథ్. నవ్వాన్నేను. ఏక్నాథ్ నన్ను తన ఛాంబర్లో కూర్చోబెట్టి, శాలువా కప్పి; పూలు, టెంకాయ చేతికి అందించారు. ‘‘ఏమిటి ఇదంతా ఏక్నాథ్?’’ అన్నాను. ‘‘పవార్ జీ, నేనొక ముఖ్యమైన మీటింగులో ఉండగా, మీరు నా ఛాంబర్ అడుగుతున్నారని తెలిసి, వెంటనే మీటింగ్ని ఆపి మీకోసం పరుగున వచ్చాను’’ అన్నారు ఏక్నాథ్. ‘‘చాలా సంతోషం ఏక్నాథ్. అసెంబ్లీ భవన్లో ‘బోర్డర్ ఇష్యూ మీటింగ్’ ఉంటే వచ్చాను. తిరిగి వెళ్లేటప్పుడు... మా ఎమ్మెల్యే లతో కాసేపు కలిసి కూర్చోటానికి... మీ ఛాంబర్, ఎంట్రెన్స్కి దగ్గరగా ఉందని ఇటొచ్చాను’’ అన్నాను.‘‘వచ్చినందుకు ధన్యవాదాలు పవార్ జీ...’’ అన్నారు ఏక్నాథ్. నాకోసం ప్రత్యేకంగా ‘టీ’ తెప్పించి, నాతో పాటు తనూ టీ సేవించి, నాతో కొద్దిసేపు మాట్లాడి, ‘ఉంటాను పవార్ జీ’ అంటూ సెలవు తీసుకున్నారు ఏక్నాథ్. ఏక్నాథ్ ఇంకో ఇరవై, ఇరవై అయిదేళ్ల తర్వాత తన ఎనభై ఐదేళ్ల వయసులో కూడా... ఇప్పుడు నాలాగే, లేదా నాకన్నా ఎక్కువగానే ఉత్సాహంగా ఉంటాడనుకుంటా! ఉన్నచోటే ఉండిపోయేవాళ్లకు పాలిటిక్స్లో భవిష్యత్తు ఉండదు. పేరుకు ఉంటారంతే. ఇక్కడ ఎదగాలంటే సిద్ధాంత పరమైన విభేదాలు ఉండాలి. వ్యక్తిగత ఘర్షణలు ఉండాలి. అధికార సమీకరణాలపై ఒక కన్ను, ఒక చెవి వేసి ఉంచాలి. ఒక కాలును లోపల, ఒక కాలును బయటా ఉంచాలి. రాజీవ్ హత్య తర్వాత నేను ప్రధాని అవ్వాల్సింది. ‘అతడికి స్వతంత్ర భావాలు ఎక్కువ’ అని నా మీద సోనియాజీకి చెప్పి,నేను ప్రధాని కాకుండా అడ్డుపడి నన్ను బయటికి పంపించారు. ఏక్నాథ్వి నాకు మించిన స్వతంత్ర భావాలు! శివసేన తన ‘హిందుత్వ’ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఏంటని అతడు బయటికి వచ్చేశాడు. నాలా ఒక్కడే రాలేదు. శివసేనను సగం తెంపుకుని వచ్చేశాడు. నేను పీఎంని కాలేకపోయాను. ఏక్నాథ్ సీఎం అయ్యాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం. మళ్లీ సీఎం అయినా అవుతాడు. ఏక్నాథ్ ఛాంబర్లో నేను కాసేపు కూర్చొని వచ్చినందుకు... ‘‘ఏక్నాథ్ అనే ద్రోహి ఛాంబర్లోకి శరద్ జీ వెళ్లి కూర్చోవటం ఏంటి?!’’ అని ఉద్ధవ్ శివసేన విమర్శిస్తోంది. కూటమిలోని తక్కిన పార్టీలు కూడా... ‘‘వాళ్లేమిటి? వాళ్ల వంశం ఏమిటి? వాళ్ల ఛాంబర్కి శరద్ జీ వెళ్లటం ఏమిటి?’’ అని భృకుటి ముడేస్తున్నాయి! ‘‘శరద్ జీ కూర్చోదలచుకుంటే ఏక్నాథ్ ఛాంబరే దొరికిందా! అసెంబ్లీ ప్రాంగణంలో మన ఛాంబర్లు లేవా? పోనీ, అవి వద్దనుకుంటే వై.బి. చవాన్ ప్రతిష్ఠాన్ లేదా? ఎన్సీపీ ఆఫీస్ ‘రాష్ట్రవాది భవన్’ లేదా?’’ అంటున్నారు ఉద్ధవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్! చవాన్ ప్రతిష్ఠాన్, రాష్ట్రవాది భవన్ అసెంబ్లీ ప్రాంగణంలో లేవు. చవాన్ ప్రతిష్ఠాన్ నారిమన్ పాయింట్లో ఉంది. ఏక్నాథ్ ఛాంబర్ నాకు నాలుగడుగుల దూరంలో ఉంది; రాష్ట్రవాది భవన్ దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్లో ఉంది. ఏక్నాథ్ ఛాంబర్ నా భుజానికి దగ్గరగా ఉంది. రౌత్కు ఇది ఎందుకు తెలియకుండా ఉంది?! దూరాలు గ్రహించలేనివారు, ఎప్పటికీ దగ్గరగా ఆలోచించలేరు. -
'ఏఐ' నూతన పారిశ్రామిక విప్లవానికి నాంది!
ఈరోజు పట్టాలు అందుకుంటున్న 2026 బ్యాచ్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్నో ఏళ్ల కష్టం, పట్టుదల, త్యాగానికి ఇది ప్రతిఫలం. కానీ ఈ విజయం మీదే కాదు. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిది! మీకు ఇది జీవితంలో మరో ముందడుగు మాత్రమే కావచ్చు. కానీ ఒక తల్లికి మాత్రం తన బిడ్డ పట్టా అందుకోవడం జీవితకాల కల నెరవేరిన క్షణం. నా తల్లిదండ్రులు కూడా ఈరోజు నన్ను చూసి ఎంతో గర్వపడుతున్నారు. నా విజయం వారి కలల ఫలితం. నిజానికి నేను వారి అమెరికా కలకు రూపం. ఈ సభలో ఉన్న చాలామంది విద్యార్థుల్లాగే నేను కూడా మొదటి తరం వలసదారుడిని. నా తల్లిదండ్రులు (తైవాన్ నుంచి) అమెరికాకు రావడానికి కారణం ఒక్కటే. ‘మా పిల్లలకు మంచి అవకాశం దొరకాలి’ అనే ఆశ. నాకు ముప్పై సంవత్సరాల వయసులో, నా స్నేహితులతో కలిసి ఎన్విడియాను ప్రారంభించాను. మా లక్ష్యం ఒక కొత్త తరహా కంప్యూటర్ను రూపొందించడం. సాధారణ కంప్యూటర్లు సాధించలేని సమస్యలను పరిష్కరించే శక్తిమంతమైన వ్యవస్థను నిర్మించాలని అనుకున్నాం. కొద్ది రోజుల్లోనే అసలు నిజం తెలిసింది. మేము రూపొందించిన తొలి సాంకేతికత పూర్తిగా విఫలమైంది. డబ్బు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. గత 33 ఏళ్లుగా ఎన్ విడియా ఎన్నోసార్లు తనను తాను మార్చుకుంది. ప్రతిసారి ఒకే ప్రశ్న వేసుకుంది: ‘ఇందులో ఎంత కష్టముంటుంది?’ ప్రతిసారి సమాధానం ఒక్కటే: ‘మనం అనుకున్నదానికంటే చాలా కష్టం.’ కానీ ప్రతి వైఫల్యం మాకు కొత్త పాఠం నేర్పింది. ప్రతి అపజయం మమ్మల్ని మరింత వినయంగా మార్చింది. ప్రతి కష్టం మా వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దింది. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేకం కాదు. వైఫల్యం విజయానికి తీసుకెళ్లే మరో మెట్టు మాత్రమే. ప్రతిసారి పడిపోయి మళ్లీ లేవడంవల్లే జీవితంలో నిజమైన ధైర్యం వస్తుంది. అదే మన విజయానికి అసలైన బలం. ప్రపంచాన్ని మార్చే కొత్త యుగంమీ కలలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీ ముందుంది. మీ కెరీర్ ప్రారంభమవుతున్న సమయం... ప్రపంచ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన దశ. నేను ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ప్రపంచం పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విప్లవం ప్రారంభ దశలో ఉంది. మీరు మాత్రం కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రారంభమవు తున్న సమయంలో కెరీర్ మొదలుపెడుతున్నారు. దీనికంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కంప్యూటింగ్ రంగంలో వచ్చిన ప్రతి పెద్ద మార్పును నేను చూశాను. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్... ప్రతి దశ ప్రపంచాన్ని మార్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ మానవ జీవితాన్ని మరింత సులభం చేసింది. కానీ ఇప్పుడు మనం చూడబోతున్న మార్పు వీటన్నింటికంటే పెద్దది. ఇది కేవలం మరో సాంకేతిక పరిణామం కాదు. ఇది కంప్యూటింగ్ ప్రపంచానికే కొత్త ఆరంభం. గత ఆరు దశాబ్దాలుగా కంప్యూటర్లు ఒకే విధంగా పని చేశాయి. మనుషులు కోడ్ రాస్తారు. కంప్యూటర్లు ఆ ఆదేశాలను అమలు చేస్తాయి. ఇంతకాలం ఇదే సూత్రం. కానీ ఇప్పుడు... ఆ యుగం ముగిసింది. ఏఐ కంప్యూటింగ్ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లింది. ఇకపై కంప్యూటర్లు కేవలం ఆదేశాలు పాటించే యంత్రాలు కావు. అవి అర్థం చేసుకుంటాయి. తర్కిస్తాయి. ప్రణాళికలు రూపొందిస్తాయి. అవసరమైన సాధనాలను ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఒకప్పుడు మనం సాఫ్ట్వేర్ను రాసి సీపీయూలపై నడిపించే వాళ్లం. ఇప్పుడు ఏఐ వ్యవస్థలు భారీ న్యూరల్ నెట్వర్క్ల ద్వారా జీపీయూలపై పనిచేస్తున్నాయి. ఇది కేవలం వేగం పెర గడం కాదు, కంప్యూటర్లు ఆలోచించే విధానమే మారుతోంది. వ్యవసాయం నుంచి వైద్యం వరకు, విద్య నుంచి పరిశ్రమల వరకు, వ్యాపారం నుంచి శాస్త్ర పరిశోధనల వరకు... ప్రతి రంగా నికి ఏఐ అవసరం. ఏఐ ప్రతి పరిశ్రమనూ మార్చబోతోంది. ఏఐపై భయం సహజమే!ఏఐ చిత్రాలు గీస్తోంది. వ్యాసాలు రాస్తోంది. సాఫ్ట్వేర్ తయారు చేస్తోంది. కార్లను నడుపుతోంది. ఇలాంటప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి: ఉద్యోగాలు పోతాయా? మనిషి అవసరం తగ్గిపోతుందా? అసలు ఈ టెక్నాలజీ మన నియంత్రణలో ఉంటుందా? ఇలాంటి సందేహాలు కొత్తవి కావు. ప్రపంచ చరిత్రలో ప్రతి గొప్ప సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే పుట్టాయి. విద్యుత్ వచ్చినప్పుడు కూడా భయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి నప్పుడు కూడా సందేహించారు. కానీ మానవ సమాజం కొత్త సాంకేతి కతను బాధ్యతతో స్వీకరించిన ప్రతిసారీ... అది మన సామ ర్థ్యాన్ని మరింత విస్తరించింది. ఏఐని తెలివిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనదే. ఇకపై ప్రతి ఒక్కరూ ప్రోగ్రామర్లే. ఇప్పటి వరకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయగలిగినవారు ప్రపంచ జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. కోడ్ ఎలా రాయాలో తెలియకపోయినా, మనకు కావాల్సిన పనిని సహజమైన భాషలో ఏఐకి చెప్పగలిగితే చాలు. మిగతా పనిని ఏఐ పూర్తి చేస్తుంది. ఒక చిన్న దుకాణం నడిపే వ్యాపారి... ఏఐ సహాయంతో తన వ్యాపారం కోసం అందమైన వెబ్సైట్ను రూపొందించుకోవచ్చు. ఒక వడ్రంగి... కస్టమర్కు వంటగది నమూనాలను రూపొందించి చూపించవచ్చు. ఒక ఉపాధ్యా యుడు కొత్త పాఠ్యాంశాలను సిద్ధం చేయవచ్చు. ఒక వైద్యుడు... వైద్య సమాచారాన్ని వేగంగా విశ్లేషించవచ్చు. ఒక రైతు... పంట లపై మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏఐ వల్ల కంప్యూటింగ్ శక్తి కొద్దిమందికే పరిమితం కాకుండా... ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తోంది. ఇదే ఏఐ తీసుకొస్తున్న అతిపెద్ద ప్రజాస్వామిక మార్పు. ఏఐ ఉద్యోగాలను మారుస్తుంది!విద్యుత్ ఎలా ప్రపంచాన్ని మార్చిందో... ఇంటర్నెట్ ఎలా మన జీవన విధానాన్ని మార్చిందో... అలాగే ఏఐ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చబోతోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమంగా నిలవబోతోంది. ఏఐ కోసం కొత్త చిప్ తయారీ కేంద్రాలు, అత్యాధునిక కంప్యూటర్ కర్మాగా రాలు ఏర్పాటవుతాయి. భారీ డేటా సెంటర్లు నిర్మిస్తారు. ఆధు నిక తయారీ పరిశ్రమలు విస్తరిస్తాయి. ఎలక్ట్రీషియన్లు,ప్లంబర్లు, ఇనుప కార్మికులు, టెక్నీషియన్లు, నిర్మాణ రంగ కార్మికులు... ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏఐ కేవలం ఒక కొత్త కంప్యూటింగ్ యుగాన్ని మాత్రమే కాదు... ఒక కొత్త పారిశ్రామిక యుగాన్ని కూడా ప్రారంభిస్తోంది. శక్తిమంతమైన ఏఐకి శక్తిమంతమైన విద్యుత్ అవసరం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. విద్యుత్ గ్రిడ్లను ఆధునికీకరిస్తారు. పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టు బడులు పెరుగుతాయి. ఏఐ అభివృద్ధి కేవలం కంప్యూటర్లనే కాదు, మొత్తం మౌలిక వసతుల అభివృద్ధినే వేగవంతం చేస్తుంది. ఏఐ ఉద్యోగాలను మార్చుతుంది... కానీ మనిషి లక్ష్యాన్ని కాదు.చాలామంది అడుగుతున్న ప్రశ్న: ‘ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?’ నా సమాధానం: ప్రతి ఉద్యోగాన్నీ ఏఐ ప్రభా వితం చేస్తుంది. ఉద్యోగంలోని కొన్ని పనులు యంత్రాలు చేయవచ్చు. కొన్ని పాత ఉద్యోగాలు తగ్గవచ్చు. అదే సమయంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. కొత్త పరిశ్ర మలు ఏర్పడతాయి. ఉదాహరణకు, ఈరోజు ఏఐ చాలావరకు సాఫ్ట్వేర్ కోడ్ రాయగలుగుతోంది. అంటే... సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అవసరం లేదని కాదు. వారు ఇప్పుడు ఏఐ సహా యంతో మరింత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొన గలుగుతున్నారు. ఏఐ వైద్య చిత్రాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ రోగిని అర్థం చేసుకుని సరైన చికిత్స అందించే వైద్యుడి స్థానాన్ని అది భర్తీ చేయదు. ఏఐ మనిషిని తొలగించడానికి రాలేదు. మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి వచ్చింది. మిమ్మల్ని ఏఐ భర్తీ చేయకపోవచ్చు, కానీ ఏఐ బాగా ఉపయోగించే వ్యక్తి ఆ పని చేయవచ్చు. ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయక పోవచ్చు. కానీ ఏఐని సమర్థంగా ఉపయోగించడం నేర్చుకున్న వ్యక్తి మీకంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఏఐ మానవ జ్ఞానాన్ని మరింత వేగంగా విస్తరించబోతోంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన ఎన్నో సమస్య లకు పరిష్కారాలు కనుగొనబోతోంది. ప్రపంచంలోని కోట్లాది మందికి కంప్యూటింగ్ శక్తిని అందించబోతోంది. మనం నిర్మించే భవిష్యత్తు... ఈరోజు మనకు లభించిన ప్రపంచం కంటే మరింత సంపన్నంగా, మరింత సామర్థ్యవంతంగా, మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఇంత శక్తిమంతమైన సాధనాలు, ఇంత గొప్ప అవకా శాలతో ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరం ఇంతకుముందు లేదు. మనమంతా ఒకే ప్రారంభ రేఖ వద్ద నిలబడి ఉన్నాం. రాబోయే భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే అవకాశం ఇప్పుడు మీ ముందుంది. కాబట్టి నెమ్మదిగా నడవకండి... ధైర్యంగా ముందుకు పరుగెత్తండి! -
ఆఫ్రికా నుండి ఫ్రెంచ్ నిష్క్రమణ?
గత నెలాఖరులో ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దౌత్య సంబంధాలు తెంచుకోవటంతో ఫ్రాన్స్ – ఆఫ్రికా ఘర్షణ తారస్థాయికి చేరింది. ఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణ ఖాయమైంది. 1880–1919 మధ్యకాలంలో 90 శాతం ఆఫ్రికా ఖండం వలస పాలకుల అధీనంలోకి వచ్చింది. బ్రిటన్ తరువాత ఫ్రాన్స్ ఆఫ్రికాను ఆక్రమించుకొన్న రెండవ అతిపెద్ద వలస రాజ్యం. పోర్చుగల్, బెల్జియం, జర్మనీ, ఇటలీ కూడా ఆఫ్రికాలో వలసలను ఏర్పరచాయి. ఫ్రాన్స్ ప్రధానంగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలను ఆక్రమించింది. ఫ్రాన్స్ వలస సామ్రాజ్యం ఉచ్ఛ దశలో ఆఫ్రికాలో సుమారు 33 శాతం ప్రాంతంలో విస్తరించింది. 1960లో ఫ్రాన్స్ 14 ఆఫ్రికా దేశాలకు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. అల్జీరియా 1962లో ఫ్రెంచ్ పాలన నుండి విముక్తి పొందింది.ఫ్రాన్స్ తీరు వేరు!వలస దేశాలకు బ్రిటన్, పోర్చుగల్, జర్మనీ, ఇటలీ స్వాతంత్య్రాన్ని ఇచ్చిన తరువాత, ఆయా దేశాల నుండి పూర్తిగా వైదొలిగాయి. కానీ ఫ్రాన్స్, రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇచ్చినప్పటికీ, సైనిక, ఆర్థిక, సాంస్కృతిక నియంత్రణను కొనసాగించింది. 1960– 2025 మధ్యకాలంలో ఫ్రాన్స్ సైన్యం ముప్పయిసార్లకు పైగా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నది. 2013లో మాలీలో ఫ్రెంచ్ సైన్యం ఆప రేషన్ సెవాల్ను చేపట్టింది. అనేక సందర్భాలలో ఫ్రెంచ్ సైన్యం దుష్ట నియంత పాలకులకు దన్నుగా నిలిచింది. గాబన్లో ఒమర్ బాంగో, చాద్లో డెబీ ఫ్రెంచ్ సైన్యం మద్దతుతోనే పాలించారు. ఫ్రెంచ్ అనుకూల పాలకులను ప్రతిష్ఠించటానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఫ్రెంచ్ ప్రభుత్వం వదులుకోలేదు. పూర్వ వలస దేశాల పాలకుల వ్యక్తిగత భద్రతకు ఫ్రెంచ్ సైనికులను వినియోగించారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కరెన్సీని ఫ్రాన్స్ తన గుప్పిట్లో ఉంచుకున్నది. 14 పూర్వ ఆఫ్రికన్ వలస దేశాలు సీఎఫ్ఏ ఫ్రాంక్ను కరెన్సీగా వాడతాయి. దీనిని యూరోకు అనుసంధానం చేశారు. 2021 వరకు ఈ నోట్లను ఫ్రెంచ్ ట్రెజరీ ముద్రించేది. కరెన్సీ రిజర్వ్ను ఫ్రెంచ్ బ్యాంకులలో నిలువ చేస్తున్నారు. వడ్డీరేట్లు, ద్రవ్య విధానాన్ని ఫ్రాన్స్ తన నియంత్రణలో ఉంచుకున్నది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మైనింగ్, రవాణా, కమ్యూనికేషన్ రంగాలను ఫ్రెంచ్ కంపెనీలు తమ గుత్తాధిపత్యంలో ఉంచుకొన్నాయి. 21 ఆఫ్రికన్ దేశాలు ఫ్రెంచ్ను అధికార భాషగా వాడుతున్నాయి. ముప్పై లక్షలకుపైగా ఆఫ్రికన్లు ఫ్రాన్స్లో నివసిస్తున్నారు.2020 తరువాత ఫ్రాన్స్ జోక్యానికి వ్యతిరేకంగా ఎదురుగాలి మొదలైంది. పెద్ద ఎత్తున యువత నిరసన ప్రదర్శనలు జరిగాయి. 2020–21లో మాలి, బుర్కినా ఫాసో, గినియాల్లో ఫ్రెంచ్ అనుకూల పాలకులను తిరుగుబాటుదారులు కూలదోశారు. 2022లో మాలి నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2023లో నైజర్, గాబన్ లలో తిరుగుబాటు తరువాత ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2024లో సెనెగల్, ఐవరీ కోస్ట్, ఛాద్ల నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని ఉపసంహరించారు. ప్రస్తుతం ఎర్ర సముద్రం సమీపంలోని జిబూతిలో మాత్రమే ఫ్రెంచ్ తన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తున్నది. పెరుగుతున్న చైనా ప్రభావంఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణకు ఆఫ్రికాపై రష్యా, చైనా దృష్టిని సారించటమూ కారణమే. రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ (కిరాయి సైన్యం) ఆఫ్రికన్ దేశాలకు భద్రతా సహాయాన్ని ఇవ్వటా నికి ముందుకొచ్చింది. వాగ్నర్ నాయకుడి మరణం తరువాత ఈ సైన్యాన్ని ఆఫ్రికా కోర్గా పేరుమార్చి రష్యా నేరుగా తన నియంత్ర ణలోకి తీసుకున్నది. జిహాదీల అణచి వేత, అంతర్గత భద్రత, అధ్య క్షుల వ్యక్తిగత భద్రతలను మాలీ, నైజర్, గాబన్, ఛాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బుర్కినా ఫోసోలలో పర్యవేక్షించటానికి రష్యా ఒప్పందాలను చేసుకున్నది. గనుల భద్రత కూడా రష్యన్ సైనికుల నియంత్రణలో ఉన్నది. ప్రతిగా ఈ దేశాలు బంగారాన్ని చెల్లిస్తున్నాయి. మాలి, బుర్కినా ఫోసోలోని బంగారం, నైజర్లోని యురేనియం, గినియాలోని బాక్సైట్ గనుల నుండి ఫ్రెంచ్కి చెందిన ఒరానో వంటి కంపెనీలు వైదొలగాల్సి వచ్చింది. ఇదే అదనుగా చైనా తన ఆర్థిక, వాణిజ్య సామ్రాజ్యాన్ని ఫ్రెంచ్ –ఆఫ్రికాలోనికి గత రెండు దశబ్దాలుగా విస్తరిస్తున్నది. ఫ్రెంచ్ ఫ్రాంక్ను కరెన్సీగా వాడుతున్న 14 ఆఫ్రికన్ దేశాలలో పది దేశాలకు ఇప్పుడు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దొరాల (జిబూతి), కిర్చి (గినియా), అబిడ్జాన్ (ఐవరీ కోస్ట్), పాయింట్ నాయిర్ (కాంగో) రేవు పట్టణాలను చైనా అభివృద్ధి పరచింది. పది విమానా శ్రయాలు, పార్లమెంటు భవనాలు, స్టేడియాలను నిర్మించింది. ఫ్రెంచ్ కంపెనీలతో పోలిస్తే చైనా కంపెనీలు తక్కువ వడ్డీతో రుణాలు అందించాయి. హువే, జెడ్టీఈ వంటి చైనా కంపెనీలు సెనెగల్, ఐవరీ కోస్ట్, గాబన్, కామెరూన్లలో 4జీ/5జీ సేవలను అందిస్తున్నాయి. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీకి అవసర మైన బాక్సైట్ (గినియా), కోబాల్ట్, రాగి(కాంగో), మాంగనీస్ (గాబన్)లతో పాటుగా యురేనియం (నైజర్), చమురు, గ్యాస్ (మారిటానియా)లను చైనా ప్రతిఫలంగా చౌకగా పొందు తున్నది.మనకో సువర్ణావకాశంభారత్కు కూడా ఫ్రాంకో ఆఫ్రికన్ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవటానికి ఇది మంచి తరుణం. చౌకైన, తేలికపాటి ఆయుధాలు, సైనిక శిక్షణ రంగాలలో ఈ దేశా లతో ఒప్పందాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఎన్ శాంతి పరిరక్షణ బలగాలతో అనుభవం భారత్కు కలిసొచ్చే అంశం. సముద్ర జలాల పహారా, గస్తీలో కూడా భాగస్వామ్యానికి అవకాశాలున్నాయి. ఈ దేశాలలోని ఖనిజ వనరుల వెలికితీతలో భారత కంపెనీల పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చైనా మాదిరిగా ఆ దేశాలను రుణ ఊబిలోకి నెట్టకుండా పరస్పర ప్రయో జనకరమైన ఉమ్మడి భాగస్వామ్యాలను ప్రతిపాదించటం వలన ఆ దేశాలు భారత్ను ఎంచుకోవటానికి అవకాశం ఉన్నది. ఫార్మాస్యూ టికల్స్ ఎగుమతితోపాటుగా, యూపీఐ, ఆధార్ సేవలను విస్తరింప జేయటానికి కూడా అవకాశం ఉన్నది. చైనా కంపెనీలు ఈ ప్రాంతంలో రెండు దశాబ్దాల నుండి పాతుకుపోయి ఉన్నాయి. ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో పూర్తి చేయటంలో అవి దిట్ట. మన ప్రైవేటు రంగ కంపెనీలు ఈ రేసులో పాల్గొంటే తప్పితే ఈ ప్రాంతంలో భారత్ నిలబడలేదు. పశ్చిమ ఆఫ్రికాకు నేరుగా సముద్ర రవాణా మార్గం లేకపోవటం భారత్కు ప్రతికూలాంశం.ఈ నేపథ్యంలో ఆఫ్రికాపై తన పట్టును వదులుకోవటానికి ఫ్రాన్స్ అంగీకరించదు. వలస మనస్తత్వాన్ని, యాజమాన్య ధోర ణిని వదలివేసి పూర్వ వలస దేశాలను సమానులుగా అంగీకరించి, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించటం శ్రేయస్కరం. ఎర్ర సముద్ర భద్రతకు జిబూతి సైనిక స్థావరం, గినియా సింధు శాఖ భద్రతకు గాబన్ సైనిక స్థావరం కీలకం. ఫ్రాంకో ఆఫ్రికన్ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసు కోకుండా యూరో పియన్ యూనియన్ ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించటం ఫ్రాన్స్ ముందున్న మార్గం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
విధానాల్లో శాస్త్రీయత ఉంటోందా?
ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని ప్రకటించింది. వీధుల్లో వాయు నాణ్యతను మెరుగుపర చేందుకు పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాల వాడకాన్ని పూర్తిగా దశలవారీగా రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న లిక్కర్ పానీయాలపై పన్నులను తగ్గించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మత్తు పానీయాల నుంచి ప్రజానీకాన్ని దూరం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడగలదని కేరళ భావిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద పెడుతున్న వాటిలో కోడి గుడ్ల స్థానంలో శాకాహార ప్రొటీన్లను ప్రవేశపెడుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, పెట్రోల్లో ఇథనాల్ మోతాదును క్రమేపీ పెంచే విధానాలపై తీవ్ర తర్జనభర్జనలు సాగుతున్నాయి. కానీ విధానాలు ఆయా లక్ష్యాలను సాధించాలంటే అవి సమాజ అవసరాలతోపాటు శాస్త్రీయ ఆధారాలను ప్రాతిపదిక చేసుకోవాలి.అసలు కాలుష్య చిత్రంఢిల్లీ ఎలక్ట్రిక్ వాహనాల విధానం ద్వి, త్రిచక్ర వాహనాలపైనే దృష్టి కేంద్రీకరించింది. వచ్చే 2028 ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్ల, 2027 జూలై నుంచి ఎలక్ట్రిక్ త్రీవీలర్ల రిజిస్ట్రేషన్లను మాత్రమే ఆమోదిస్తామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలో మొత్తం వాహనాలు 1.3 కోట్ల మేరకు ఉంటే, అందులో టూవీలర్లు 62 శాతం, కార్లు 32 శాతం. దీన్నిబట్టి, టూవీలర్ల వాడకాన్ని దశల వారీగా పూర్తిగా నిషేధించాలన్న ప్రభుత్వ నూతన విధానంలో హేతుబద్ధత కనిపిస్తుంది. కానీ, అది పూర్తి చిత్రాన్ని రూపుకట్టించే వాస్తవం కాదు. ఢిల్లీలోని మొత్తం వాహనాల్లో టూవీలర్లు 62 శాతం మేర ఉంటే ఉండవచ్చుగానీ, ట్రాన్స్పోర్టేషన్ సంబంధిత ధూళికణాల (పీఎం2.5) విడుదలలో వాటి వాటా 15 శాతమే. ఢిల్లోలోని వాహనాల్లో తేలిక, భారీ రకం వాణిజ్య వాహనాలు 3 శాతంకన్నా తక్కువే ఉండ వచ్చుగానీ, ఈ ఉద్గారాలలో వాటి వాటా 39 శాతం. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్కు చెందిన గుఫ్రాన్ బేగ్ 2025లో ప్రచురించిన విధాన సంక్షిప్త పత్రంలో అటు వంటి విశేషాలు దాగున్నాయి. దాన్ని పరిశీలిస్తే, వాణిజ్య వాహనాలు, బస్సుల ఉద్గారాల సమస్యను పరిష్కరించడం ద్వారానే పర్యావరణానికీ, మానవ ఆరోగ్యానికీ ఎక్కువ మేలు చేకూరగలదని అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల వాడకం పర్యావరణానికి ప్రయోజనదాయకమేకానీ, ప్రభుత్వ విధానాలు మొదట అత్యంత కలుషితదాయకమైన విభాగాలపై దృష్టి పెట్టాలి. పర్యావరణానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి 2025 డిసెంబర్లో ఢిల్లీ వాయు కాలుష్యాన్ని కూడా పరిశీలించింది. విధానపరమైన దృక్పథం ముక్కచెక్కలుగా ఉండకూడదని అది హెచ్చరించింది. రాష్ట్ర స్థాయి బదులు ఒక భౌగోళిక ప్రాంత స్థాయిలో చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఆ వైఖరి లోపించి నపుడు, ఢిల్లీ ఈవీలవైపు మళ్ళినా ఒనగూడే పర్యావరణపరమైన ప్రయోజనాలు పెద్దగా ఉండవు. కాలుష్య కారక వాహనాలు ఢిల్లీ చుట్టుపక్కలనున్న రాష్ట్రాలకు వచ్చి ఆ మొత్తం భౌగోళిక ప్రాంత ఉద్గారాలకు తమవంతు వాటాను జోడిస్తూనే ఉంటాయి. ఏదైనా తగని మోతాదే!దేశంలోకెల్లా మద్యపాన వినియోగం కేరళలోనే ఎక్కువ. ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడానికి, ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న పానీయాలపై పన్ను తగ్గించాలనీ, తద్వారా వీటి వినియోగాన్ని పెంపొందించినట్లు అవుతుందనీ కేరళ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న పానీయాల వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనం ఏమైనా ఉందా అని కేరళ ప్రభుత్వం కొద్దిగా కూడా దృష్టి సారించినట్లు లేదు. మొదటగా, ఆల్కహాల్ వినియోగానికి సురక్షితమైన పరిమితులంటూ ఏవీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గుండెకు రెడ్ వైన్ మంచిదనే అభిప్రాయం కూడా అపోహ మాత్రమేనని వెల్లడించింది. కనుక, పన్నుల విధానాలు ఆల్కహాల్ మోతాదు తక్కువ లేదా ఎక్కువ అనే తేడా చూపనవసరం లేదు. పైగా, ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న పానీయాలను చౌకగా మారిస్తే, మొత్తం మీద లిక్కర్ వినియోగం పెరగడానికి తలుపులు తెరిచినట్లు అవుతుంది. ఈ పానీయాలు తేలిగ్గా అందుబాటులో ఉండటం వల్ల మైనర్లు తప్పుదారి పట్టవచ్చు. వారు క్రమంగా మద్యపానం వైపు మళ్ళవచ్చు. లైట్ సిగరెట్లు, హుక్కా, ఇ–సిగరెట్లు అంటూ పొగాకు పరిశ్రమ విషయంలో కూడా అలాగే చేశారు. లిక్కర్ కంపెనీలు తమ హార్డ్ లిక్కర్ బ్రాండ్లను మార్కెట్ చేసుకునేందుకు లో–ఆల్కహాల్ ఉత్పత్తుల వినియోగాన్ని ఒక ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మైలేజీ ఉంటుందా?మరో ప్రభుత్వ ప్రధాన విధాన విషయంలో కూడా ఆల్కహాల్ కేంద్ర బిందువుగా మారింది. పెట్రోల్లో ఇథనాల్ కలపడానికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. ఇంధన భద్రత, విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆదా చేయడం నుంచి రైతుల సంక్షేమం వరకు ఈ విధానం వల్ల ఒనగూడే ప్రయోజనాల గురించి తెగ చెప్పు కొస్తున్నారు. మరోపక్క వాహనాల యజమానులు తమ ఇంజిన్లు దెబ్బతింటున్నాయనీ, మైలేజి పడిపోతోందనీ ఫిర్యాదు చేస్తున్నారు. కార్ల తయారీ సంస్థలు అంగీకరిస్తున్నట్లుగా ఇథనాల్ మిళిత ఇంధ నాల వల్ల కార్ల మైలేజీ తగ్గుతూ, వాహనాల యజమానులు చెబు తున్నట్లుగా ఇంజిన్లు దెబ్బతింటూంటే మొత్తంమీద ఆర్థిక వ్యయాలు పెరుగుతాయేగానీ, తగ్గవు. రైతులు ఆహార పంటల నుంచి నీరు ఎక్కువ అవసరమైన చెరకు వంటి పంటలవైపు మళ్లితే, ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని వ్యవసాయ, ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్ కాలంలో ఇథనాల్ కంపెనీలు మొక్క జొన్న, వరిని కూడా ఉపయోగించుకుంటాయి. మధ్యాహ్న భోజన పథకంలో కోడి గుడ్లను తొలగించాలన్న పశ్చిమ బెంగాల్ నిర్ణయం శాస్త్రీయ ఆధారాల ముందు తేలిపోతుంది. అవి నాణ్యమైన ప్రొటీన్ అందిస్తాయనీ, కనుక వాటిని ఆహారంలో చేర్చాలనీ పౌష్ఠికాహారవేత్తలు దశాబ్దాలుగా చెబుతు న్నారు. ఆహారానికి బలం చేకూరే విధంగా పన్నీరు, కాయధాన్యా లతోపాటు గుడ్లను కూడా పెట్టాలని హితవు పలుకుతున్నారు. హైదరాబాద్లోని జాతీయ పౌష్ఠికాహార సంస్థ 2024 నాటి పోషణ మార్గదర్శకాలు కూడా అదే విషయాన్ని బలపరుస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు విశ్వసనీయమైన, ప్రాధాన్యం కలిగిన శాస్త్రీయ ఆధారాలను ఆలంబనగా చేసుకుని రూపొందాలేగానీ, స్వల్పకాలిక లాభాలను, సంకుచిత రాజకీయ, వ్యాపార లేదా సైద్ధాంతిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నవి కాకూడదు. విధాన నిర్ణేతలు తమ వాదనలకు బలంగా ఇప్పటికే ఉన్న ఆధారా లను ఉపయోగించుకోవచ్చు లేదా నూతన పరిశోధనలను నిర్వహించవచ్చు. నూతన ఆధారాలు అందుబాటులోకి వచ్చే కొద్దీ విధానా లను సమీక్షించుకోవాలి. పరస్పరం ముడిపడి ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజారోగ్యం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతున్నామని గుర్తెరగాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
అమృతం కురిసిన రోజు
‘కోటికి ఒకరే పుడతారు పుణ్య మూర్తులు’ అన్నారు. అలా జనించిన వారు సమాజానికి వెలుగిస్తారు. అందరి జీవితాలలో సంతోషాన్ని వెలిగిస్తారు. జనం గుండెల్లో సజీవులై ఉంటారు. అలాంటి మహామనుషులలో అతి ముఖ్యుడు డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన 1949 జూలై 8న ఈ లోకంలో అడుగుపెట్టాడు. ఆయన మన మధ్య లేక పోయినా ఆయన జన్మదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలవారూ ఓ పండుగలా జరుపుకొంటున్నారు. ఆయన చిత్రపటానికి పాలాభిషే కాలు, పూలాభిషేకాలు ఇంకా చేస్తున్నారు అంటే ఆయన ఎంత మేలు చేశారో, ఎన్ని ప్రాణాలు నిలిపారో లెక్కేయడం కష్టం. ఈ మధ్య చంద్రబాబు సమక్షంలో ‘నేను ఇంకా జీవించి ఉండటానికి కారణం రాజశేఖరరెడ్డిగారు, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ’ అని ఓ మహిళ ధైర్యంగా ప్రకటించింది. అందుకే ఆయన దేవుడయ్యాడు. వైద్య విద్య పూర్తయిన తరువాత ఆస్పత్రి పెట్టి ఒక రూపాయికే వైద్యం చేశాడు. అందుకే ఆయన్ని జనం ‘రూపాయి డాక్టరు’గా పిలుచుకున్నారు. ప్రజలకు కేవలం వైద్యం అందిస్తే చాలదు, ఇంకా అనేక విషయాలలో వారికి సేవలు అందాలంటే శాసనం చేసే అధికారం ఉండాలని భావించాడు. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశాడు. తన వ్యక్తిత్వం, నిజాయితీ నిలుపుకొంటూనే ముందుకు సాగాడు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అయిన తిరుగులేని నాయకుడాయన.పాదయాత్రలతో చరిత్ర33 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1985 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం చేసిన పోరాటాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఓ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును సెక్రటేరియట్ ముందు నడిరోడ్డులో నిలువరించాడు. ఆ తెగువ చూసి రాష్ట్రం ముక్కున వేలేసుకుంది. ఇతను కదా నాయకుడు అనుకుంది. రామారావు సైతం ఆంతరంగికుల ముందు రాజశేఖరరెడ్డిని మెచ్చుకున్నారట. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర బాబు ఆనాడు విద్యుత్ చార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ 90 మంది శాసనసభ్యులతో కలిసి ఆ రోజుల్లో నిరాహార దీక్షచేశాడు. రైతులను రక్షించడానికి వారికి ఉచిత విద్యుత్తు అందించాలన్న ఆలోచన ఆయనకు ఆనాడే వచ్చిందేమో!రాయలసీమ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్ సామర్థ్యం పెంచాలని 1986లో 22 రోజులు పాదయాత్ర చేశాడు వైఎస్. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఆ కెనాల్ సామర్థ్యం పెంచాడు. పాదయాత్రలో సెక్యూరిటీ, సౌకర్యాలు, భోజనం – ఏవీ పట్టించుకునేవాడు కాదు. కొన్నిసార్లు నేరుగా పొలాల్లోకో, ఎదురుగా ఉన్న గుడిసెలోకో హఠాత్తుగా వెళ్ళి పోయేవాడు. వారి మాటలు వినేవాడు. కష్టం తెలుసుకునేవాడు. 2003లో వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఓ సువర్ణా ధ్యాయానికి ఆరంభం. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1,673 కిలోమీటర్లు 67 రోజుల పాటు నడిచి, ప్రజల మధ్య నిలిచాడు. ఆయన వెంట ఉన్న మాకు అనుక్షణం ఓ కొత్త అనుభవం. నడి ఎండలో నడుస్తూ కూడా ఆయన ఆలోచించింది తనవారి కోసం, తన ప్రజల కోసం. తాను తినడానికి ముందు భోజనం అందరికీ అందిందా అని చూసేవాడు. అందరి మధ్యలోనే పడుకునేవారు. ఏసీ గదులు ఉన్నాయని చెప్పినా వారించేవాడు. పాదయాత్రలో ఆయన పరిష్కరించిన సమస్యలపై ఓ పెద్ద పుస్తకం రాయచ్చు. పాదయాత్ర మధ్య దశలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా లెక్క చేయలేదు. నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి కదిలాడు. వైద్యులు వారించారు. నేనూ వైద్యుడినే అన్న విషయం మరచి పోతున్నారు అన్నాడు చిరునవ్వుతో! పథకాలే పతకాలుగా...2004 ఎన్నికలలో ప్రజలు ఆయనకు అఖండ మెజారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగం. ఒక విప్లవం. ఒక మార్పు, ఒక భరోసా, ఒక కదలిక. అన్ని రాష్ట్రాలు ఆరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. ఒక మంచి మనిషి అధికారంలోకి వస్తే ఇన్ని మంచి పనులు చేయవచ్చా అని ఆశ్చర్యపోయాయి. ఉచిత కరెంటు అందింది. పేదల ఇంటి ముందుకు ఆరోగ్యశ్రీ వచ్చి కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆయన చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకున్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందింది. లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యావంతులై లక్షలు సంపాదిస్తున్నారు. ‘జలయజ్ఞం’తో రైతుల ముఖం నిండా ఆనందం. హింసావాదాన్ని వీడి ప్రజలలో కలవండి అని అభ్యర్థిస్తూ నక్సలైట్లతో చర్చలు కూడా జరిపారు. శాంతిమయ రాష్ట్రాన్ని స్వప్నించిన మహాస్వాప్నికుడు ఆయన. తిరుమల శ్రీవేంక టేశ్వర స్వామి వారి అఖండ వైభవ ప్రచారానికి అంతులేని కృషి, కార్యక్రమాలు చేసి శ్రీనివాస ప్రభువు పల్లకీ మోసి, పల్లె పల్లెకు తీసుకువెళ్ళిన హైందవ ధర్మ సేవకుడాయన. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ స్థాపకుడు. ‘కల్యాణమస్తు’ అన్న కరుణామూర్తి. మహా విషాదం2009 ఎన్నికలలో తిరిగి అధికారంలోకి వచ్చారు. కానీ అను కోని పరిణామం ఆయనను మనకు దూరం చేసింది. ఓ నాయకుని కోసం కొన్ని వందల మంది ఆత్మార్పణ చేసుకోవడం కనీ వినీ ఎరు గని మహావిషాదం. ఇలాంటి అద్భుత వ్యక్తి హితుడు, స్నేహితుడు, గురువు అయినందుకు నాకు ఆనందం, గర్వం. ఆయనతో గడిపిన ప్రతిక్షణమూ నాకు కొత్త పాఠం. నా తప్పులు దిద్దాడు. నా చేయి పట్టి నడిపాడు. ‘కరుణా’ అంటూ ప్రేమగా పిలిచాడు. నిత్యం పచ్చ గానూ, పచ్చిగానూ ఉంది ఆ జ్ఞాపకం. నాలాంటి కొన్ని లక్షల మందికి జీవన సౌభాగ్యం కల్పించిన ఆ మహానాయకుడు మళ్ళీ జన్మించి మన మధ్యకు రావాలని ప్రార్థిద్దాం. మదిలోని ఆయన జ్ఞాపక సజీవ చిత్ర పటానికి ఈ విధంగా అక్షర సుమాలు అర్పించు కోవడం, నా తీరని తీయని ఋణం, బంధం, బాంధవ్యం!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
జపాన్తో కాలానుగుణ ఒప్పందాలు
జపాన్ ప్రధాని సనాయే తకాయిచీ భారత పర్యటన రెండు ప్రత్యేక నేపథ్యాల మధ్య జరిగింది. ఒకటి ఆర్థికమైనది, మరొకటి రక్షణ పరమైనది. ఈ రెండు నేపథ్యాలు ఇరు దేశాలకూ వర్తించేవే. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. ఆర్థికమైన వర్తింపు ఉభయులకూ సమానమే కాగా, రక్షణ కోణంలో కొన్ని సామ్యాలతో పాటు కొన్ని తేడాలున్నాయి. ప్రధాని మోదీ, తకాయిచీ మధ్య ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన చర్చలు, ఒప్పందాలు కూడా ఈ పరిస్థితులన్నింటిని ప్రతిఫలించాయి. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాటి అభివృద్ధి ప్రయత్నాలు ఎప్పుడూ ఉండేవే. ఆర్థిక వ్యవస్థల రీత్యా ప్రముఖమైనవి అయిన ఇండియా, జపాన్ వంటి దేశాల మధ్య ఇవి ఇంకా బహు ముఖంగా ఉంటాయి. ఆ మేరకు వేర్వేరు రంగాలలో వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఎల్లప్పుడూ ఉన్నవే. అటువంటి స్థితిలో కొత్తగా ఏర్పడిందంటున్న ప్రత్యేక నేపథ్యం ఏమిటి?ప్రత్యేక నేపథ్యంఈ ప్రశ్నకు సమాధానం చర్చల అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉంది. అది, ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను రెండు దేశాలు పూర్తిగా అర్థం చేసుకోవటం. దానిని దృష్టిలో ఉంచు కుని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్ మ్యాప్ను రూపొందించటం’’. నేటి అనిశ్చిత పరిస్థితులన్నవి కేవలం ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తినవి కావు. భారత్, జపాన్లతో పాటు ప్రపంచానికంతా అటువంటి ఒడిదుడుకులు ఉక్రెయిన్ యుద్ధంతో నాలుగేళ్ల క్రితం మొదలై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల మీదుగా ఇరాన్ యుద్ధం వరకు సాగివస్తున్నాయి. ఇవి స్థూలంగా పైకి కనిపించేవి. కొంత లోతుకు వెళితే,ప్రపంచ ఆర్థిక రంగానికి అనిశ్చితిని సృష్టిస్తున్న పరిణామాలు మరికొన్ని ఉన్నాయి. అవి, రెండవ ప్రపంచ యుద్థం తర్వాత బ్రెట్టన్వుడ్స్ వ్యవస్థలతో మొదలై ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యాలను, ఆర్థిక సంస్కరణలను సులభతరం చేసిన నియమ నిబంధనలు ఇటీవల కొద్ది సంవత్సరాలుగా భంగపడుతుండటం. ఆ వ్యవస్థలను, నిబంధనలు సృష్టించిన దేశాలే వాటిని బలహీన పరుస్తుండటం. వాటి ప్రతికూల ప్రభావాలు మధ్యమ స్థాయి దేశాలపై అట్లుంచి, మొదటి 10 స్థానాలలో గల భారత, జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలకు సైతం అనిశ్చితిని కల్పిస్తున్నది. ఇది ఇరాన్ యుద్ధంతో మరింత తీవ్రమైంది. ఇండియా, జపాన్ గత అక్టోబర్లో తకాయిచీ అధికారానికి రాక ముందు కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇతరత్రా ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు గాక. కానీ, వేర్వేరు దేశాలతో, ప్రాంతీయ ఆర్థిక కూటములతో వీలైనన్ని ఆర్థిక ఒప్పందాల కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనిశ్చితులు ఉండగా, మరొకవైపు ఈ పోటీ ప్రపంచం, దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఈ విధా నాల వెనుక ముప్పేటగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అసమ వాణిజ్యంజపాన్ పరిస్థితి భారత్ కన్న కొంత మెరుగైనప్పటికీ పైన పేర్కొన్న పరిణామాల మధ్య సమస్యలు తప్పటం లేదు. వాటికి ఇటీవల మరొకటి తోడవుతున్నది. అది, చైనాతో పెరుగుతున్న వివాదాలు. తైవాన్ విషయమై తకాయిచీ వైఖరికి ఆగ్రహించిన చైనా, పలు విధాలైన చర్యలతో జపాన్ ఆర్థిక రంగాన్ని వీలైనంత కుంటుపరచటం మొదలు పెట్టింది. మరొకవైపు ఇండో–పసిఫిక్ రక్షణ బాధ్యతల నుంచి అమెరికా కనీసం పాక్షికంగా ఉపసంహరించుకుంటూ ఆ బరువును ఆ ప్రాంతంలోని జపాన్ తదితర మిత్ర దేశాలపై మోపుతుండటంతో జపాన్ సైనిక వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక భారాలన్నీ మోసేందుకు తకాయిచీ ప్రభుత్వం ఆసియా నుంచి యూరప్ వరకు వేర్వేరు దేశాలతో శరవేగంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ విధంగా ఆర్థిక అనిశ్చితులు, వాటిని తట్టుకునే చర్యలన్నవి భారత్, జపాన్లకు ఒకే విధంగా ఉన్నట్లు గమనించవచ్చు. కనుక, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో 2వ తేదీన జరిగిన ఆర్థిక ఒప్పందాలన్నీ హర్షించవలసినవే. ఒప్పంద వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ తకాయిచీ వెంట సుమారు 100 జపనీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు రావటాన్ని బట్టి చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించవచ్చు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్వయంగా చెప్పిన దానిని బట్టి, రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంలో 100కు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల జపాన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది గాక వచ్చే పదేళ్లలో రెట్టింపు జపనీస్ కంపెనీలను, 10 ట్రిలియన్ల జపనీస్ యెన్ పెట్టుబడులను (మారకం విలువ 1 రూపాయికి 1.69 యెన్లు) ఆకర్షించటం లక్ష్యమన్నారు. ఇండియాలో ఇప్పటికే 1,400కు పైగా జపాన్ కంపెనీలు, 5,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ సంఖ్యలు రెట్టింపు కావటం ఎట్లున్నా, ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో ఎంత విస్తరిస్తే అంత మేలు కలుగుతుంది. అదే సమయంలో భారత ప్రభుత్వంపై కొన్ని పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాలీనా ఎగుమతి దిగుమతుల విలువ 27 బిలియన్ డాలర్ల మేర ఉంది. అది సంతృప్తి కరమైనదే. కానీ, ఇండియా ఎగుమతులు కేవలం 6 బిలియన్లు, దిగుమతులు 21 బిలియన్లు (మూడున్నర రెట్లు) అంటే ఆ వివరాలు ఎంత అసంతృప్తికరమైనవో వేరుగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 6వ ర్యాంకుకు చేరినప్పటికీ, సాలీనా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు మించి ఉంది. జరగాల్సిన కృషిఆర్థిక రంగానికి సంబంధించి జపాన్ ప్రధానితో జరిగిన చర్చలలో చమురు తదితర ఇంధన భద్రతలు, ప్రత్యామ్నాయ ఇంధ నాలు, అరుదైన లోహాలు, ఖనిజాల ప్రస్తావనలు అనివార్యంగా వచ్చాయి. వాటికి అనుబంధంగా ఇండో–పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు అవకాశాలను కల్పించుకోవటం. ఈ నిర్దిష్టమైన అంశాలన్నీ ఇండియా, జపాన్లతో పాటు అన్ని దేశాలలో చర్చలు జరుగుతున్నవే. అయితే ఇవి ఎంత కీలకమైనవో అంత క్లిష్టమైనవి కూడా. వీటి గురించి ఎవరికి వారు అంతర్గత కృషి చేయటం, ఇతరుల సహకారంతో సామరస్య పరిష్కారాలు కనుగొనటం రెండూ అవసరం. ఈ కొత్త పరిస్థితులలో ఆ ప్రయత్నాలు లోగడ కన్నా ఎక్కువగా జరగక తప్పదు. చర్చలలో ప్రస్తావనకు వచ్చిన మరొక కీలకాంశం రక్షణ. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఇండో–పసిఫిక్ ద్వారా సముద్రయానాలు. ఇది రెండు దేశాలకు సంబంధించినది. రెండు, ఈ మార్గాలలో, అంతకన్నా ఎక్కువగా పసిఫిక్లో చైనాను కట్టడి చేసే విషయం. ఈ విధమైన కట్టడి అవసరం ఇండియాకు పరిమిత స్థాయిలో ఉండగా, జపాన్కు, దానిని తమ సమగ్ర వ్యూహంలో భాగంగా చేసుకున్న అమెరికాకు అపరిమిత స్థాయిలో ఉంది. అమెరికా ఇటీవల ‘క్వాడ్’ ప్రత్యక్ష బాధ్యతల నుంచి నెమ్మదిగా తగ్గుతూ జపాన్, ఆస్ట్రేలియాల బాధ్యతను పెంచుతుండటంతో కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బాధ్యతను తలకెత్తుకున్న తకాయిచీ రక్షణ వ్యయాన్ని పెంచుతూ, పలుదేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రక్షణ విషయాలైతే ఢిల్లీలో ‘చర్చకు’ వచ్చాయి గానీ, ‘ఒప్పందాలు’ లేకపోవటం ఇండియా విధానాలకు అనుగుణమైనదేనని చెప్పాలి. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దేశ ఐక్యత–ప్రగతికి అంకితమైన జీవితం
ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. ఆత్మార్పణడా‘‘ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే– అవిభాజ్య భారత్ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు– తాను విశ్వసించిన ఆదర్శం కోసం డా‘‘ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్ 370, 35 (ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.భారతీయతకు పెద్దపీటఆయన ఎప్పుడూ దేశానికే ప్రథమ స్థానమిచ్చారు. భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణమైన సంస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా– ‘భవిష్యత్ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి’ అని కుండబద్దలు కొట్టారు. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్’ను రపుదిద్దాలని డా‘‘ ముఖర్జీ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమĶæన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును ఆయన ఎంచుకోవడం గమనార్హం. పారిశ్రామిక విధానానికి పునాది ఆయనకు దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు–పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళారంగం వంటి వాటికీ ఆయన మద్దత్తు ఇచ్చారు. ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డా‘‘ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిపోయిందంటే అతిశయోక్తి కాబోదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి డా‘‘ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్ర మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు. పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డా‘‘ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. సేవామూర్తిమానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరవు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుఃస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్ మన్వంతర్’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ– ‘మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా, క్షుణ్ణంగా, అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్ధాంతరంగా వదిలేయకండి. అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి’ అని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో యువత నేటి సందర్భానికి తగినట్లు డా‘‘ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నరేంద్ర మోదీభారత ప్రధాని -
మెహబూబా ముఫ్తీ (కశ్మీర్ లీడర్) రాయని డైరీ
సర్వోన్నతుడి నిర్యాణం అంతులేని దుఃఖాన్ని మిగిలిస్తుంది. ఆ దుఃఖంలోనే అనంతమైన ఓదార్పూ ఉంటుంది. అయతొల్లా అలీ ఖమేనీ పార్థివ దేహానికి తుది వీడ్కోలు పలికేందుకు టెహ్రాన్లోని ‘గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్’కు చేరుకున్న విషాద జనవాహినిలో నేనూ ఒకరిగా నిరీక్షిస్తూ ఉన్నాను. ఊరేగింపునకు ‘లోక నాయకుడు’ కదలగానే ఒక్కసారిగా శోకాలు మిన్నంటాయి. నివాళుల నలుపు వస్త్రాలతో భూమి యుద్ధమేఘమై బాధాతప్త నినాదాలతో ఉరమటం మొదలైంది. గుండెలు కుండపోతగా కురుస్తున్నట్లుగా ఆగని ఆశ్రువులు!అమరత్వం విషాదం కాదు. అగాథం కాదు. అంతం అసలే కాదు. అది గౌరవం. చైతన్యం. శాశ్వత జీవితం. దేవుడితో బేరమాడి కొనితెచ్చుకున్న పరమోన్నత స్థితి. ‘‘దేవా, నేను నీ మార్గంలో నడుస్తాను. బదులుగా నా మరణానికి అమరత్వాన్ని అనుగ్రహిస్తావా?’’ అని అల్లాహ్తో చేసుకున్న ఒప్పందం. శాంతిని విశ్వసించిన యుద్ధవీరుడు ఖమేనీ. ‘‘శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, న్యాయంగా ఉండటం కూడా...’’ అని శత్రువు చెంప చెళ్లుమనిపించినవాడు. శాంతిని ఒక ప్రగాఢమైన మానవ ఆకాంక్షగా ఖమేనీ విశ్వసించారు. న్యాయం నెలకొన్న చోట మాత్రమే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది అన్నారు. ‘విధించబడిన’ శాంతిని ఇరాన్ ఎంత గట్టిగా వ్యతిరేకిస్తుందో, అంత గట్టిగానే తలపై వచ్చిపడే తలవని యుద్ధాన్ని ఎదుర్కొంటుందని ఖమేనీ గర్జించారు. ఏమీ తోచక ఒళ్లు విరుచుకున్నట్లుగా, సామ్రాజ్యాలను విస్తరించుకోవాలని ఖమేనీ కోరుకోలేదు. ఇస్లాంను ఒక చల్లని యంత్రంలా కాక... ప్రేమలు, భావోద్వేగ బంధాలతో అల్లిన ఒక వెచ్చని మానవ స్పర్శతో పెనవేయాలని ఆకాంక్షించారు. జీవితమనే పరిమిత సంపదను మనం ఎలా వదిలించు కుంటామనే దానిపైనే జీవితపు నిజమైన విలువ ఆధారపడి ఉంటుందని ప్రబోధించారు! జీవితాన్ని ‘చిందిన నూనె’ అన్నారాయన. ఆ చిందిన నూనె చిమ్ముతున్న లక్షల దైవిక కాంతుల్లా మొసల్లా కాంప్లెక్స్లోని ఖమేనీ సన్నిధి ప్రార్థనలో అందరం నిలుచుని ఉన్నాం. టెహ్రాన్లో ఇవాళ, రేపు వీడ్కోలు ఊరేగింపు. 7న పవిత్ర ఖోమ్ నగరానికి ఊరేగింపుల తరలింపు. 8న ఇరాక్లోని కర్బలా, నజఫ్లలో భౌతిక కాయానికి పవిత్ర కర్మకాండలు. 9న ఖమేనీ జన్మస్థలం మషద్లోని ఇమామ్ రెజా మందిరంలో తుది ఖనన ఊరేగింపు. ప్రపంచ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు, ప్రత్యేక అతిథులకు కార్యక్రమాల మొదటి విడతవరకే అధికారిక ఆహ్వానాలు ఉన్నాయి. రేపే నా తిరుగు ప్రయాణం. తండ్రి అంత్యక్రియల ఆహ్వాన లేఖలో నన్ను ‘ఆత్మీయ అతిథి’గా సంబోధించారు మోజ్తబా ఖమేనీ! అది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంటి ఆడపడుచును ఆదరించి నట్లుగా ఉంది.జూలై 3న నేను శ్రీనగర్ నుంచి ఢిల్లీ చేరుకునేటప్పటికే ఇరాన్ పంపిన ప్రత్యేక విమానం అక్కడ సిద్ధంగా ఉంది. ఖమేనీకి తుది వీడ్కోలు పలికే భాగ్యం కల్పించటానికి వచ్చి మా కోసం వేచి ఉన్న దేవదూతలా ఉంది ఆ లోహ విహంగం. రమ్మని కబురు పంపటం, తోడ్కొని రమ్మని మనిషిని పంపటం... ఇది కదా పిలుపంటే... దుఃఖానికైనా, ఉత్సవానికైనా! ఇప్పుడిది రెండూ కలగలిసిన ‘దుఃఖోత్సవం’! ఢిల్లీలో ఆ రోజు టెహ్రాన్కు ఫ్లయిట్ టేకాఫ్ అయ్యేముందు ఖురాన్ ను తీసి, పేజీలు తెరిచి చూశాను. ‘‘వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు జీవించి ఉన్నారు, కానీ మీరు దానిని గ్రహించలేరు’’ – లేపనం లాంటి మాట! అల్లాహ్ చూపిన ధర్మ మార్గంలో నడిచిన నాయకుడికి మృత్యువు ఎదురు పడుతుందా? అసలు ఎదురొచ్చి నిలబడుతుందా?! -
ప్రశ్నించడమూ విద్యలో భాగమే!
నూతన జాతీయ విద్యా విధానం– 2020 దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్న సందర్భంలో భారతీయ విద్యా వ్యవస్థపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. విద్య కేవలం ఉపాధి సాధనమా? లేక సమాజాన్ని రూపుదిద్దే పరివర్తనాత్మక శక్తా? ఒక దేశం తన భావితరాలను ఎలా తీర్చిదిద్దా లనుకుంటుందో ఆ దేశ విద్యా విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అందుకే విద్యా విధానాలు ప్రభుత్వాల పరిపాలనా నిర్ణయాలు మాత్రమే కావు; అవి ఒక సమాజం తన భవిష్యత్తును గురించి చేసుకునే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఎంపికలు కూడా. సమాజ శాస్త్రవేత్త ఎమిల్ డర్కైమ్ దృష్టిలో విద్య అనేది సమాజం తన విలువలను కొత్త తరాలకు సంక్రమింపజేసే ప్రక్రియ. కార్ల్ మార్క్స్ దృష్టిలో విద్య పాలక వర్గాల భావజాలాన్ని బలపరిచే సాధనంగా కూడా మారవచ్చు.జ్ఞాన బదిలీ రూపాలువేట, ఆహార సేకరణ జీవన విధానం నుండి వ్యవసాయ ఆధారిత స్థిర జీవన విధానానికి మారిన తర్వాత జ్ఞాన బదిలీకి వ్యవస్థీకృత రూపాలు అవసరమయ్యాయి. వైదిక సంస్కృతి ప్రభావంతో గురుకుల వ్యవస్థ అభివృద్ధి చెందింది. భారతీయ విద్యా చరిత్రలో ఇది ముఖ్యమైన దశ. ఈ వ్యవస్థ ద్వారా తత్వ విచారణలు, భాషా సంపద అభివృద్ధి చెందినప్పటికీ, దాని సామాజిక పరిమితులను విస్మరించలేం. జ్ఞానాన్ని సామాజిక ఆధిపత్యాన్ని నిలబెట్టే సాధనంగా ఉపయోగించిన చారిత్రక ఉదాహరణగా దీనిని చూడవచ్చు. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించడం భారతీయ విద్యా చరిత్రలో ఒక ప్రజాస్వామ్య మలుపు. గౌతమ బుద్ధుడు పుట్టుక ఆధారంగా వ్యక్తి విలువను నిర్ణయించే భావనను తిరస్కరించాడు. బౌద్ధ సంఘాలు విద్యా కేంద్రాలుగా పనిచేశాయి. నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు అంతర్జా తీయ ఖ్యాతిని సంపాదించాయి.సాధారణంగా క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు విస్తరించిన మధ్యయుగ కాలాన్ని కొందరు చీకటి యుగంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ, చారిత్రక వాస్త వాలు అంత సరళంగా ఉండవు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు ఉత్తర భారతదేశంలో అధికారాన్ని స్థాపించగా, దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం, ఇతర ప్రాంతీయ రాజ్యాలు తమ ప్రభావాన్ని కొనసాగించాయి. విద్య ప్రధానంగా మత సంస్థల ఆధ్వర్యంలో కొనసాగినప్పటికీ, జ్ఞానవ్యాప్తికి కొత్త మార్గాలు కూడా తెరుచుకున్నాయి. మధ్యయుగ భారతదేశంలో విద్య ప్రజలకు చేరువ కావడంలో భక్తి ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ప్రజాభాషలలో సాహిత్య సృష్టి వల్ల జ్ఞానం సంస్కృతం, పర్షియన్ భాషల పరిమితులను దాటి సామాన్య ప్రజలకు చేరువైంది.విద్య ప్రభుత్వ బాధ్యతబ్రిటిష్ పాలనకు ముందు దేశంలో స్థానిక విద్యా సంస్థలు విస్తృతంగా పనిచేశాయని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వీధిబడులు, పాఠశాలలు, గురుకులాలు, మక్తబ్లు ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యను అందించేవి. ధర్మపాల్ తన ప్రసిద్ధ గ్రంథం ‘ద బ్యూటిఫుల్ ట్రీ’లో మద్రాస్ ప్రెసిడెన్సీలో వేలాది స్థానిక పాఠశాలలు పనిచేస్తున్నట్లు బ్రిటిష్ అధికారుల నివేదికలను ఆధారంగా చూపించాడు. అయితే ఈ విద్యా వ్యవస్థలు అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో ఉన్నాయని చెప్పలేం. స్త్రీల విద్య అత్యంత పరిమిత స్థాయిలోనే ఉండేది.1600లో స్థాపించబడిన ఈస్టిండియా కంపెనీ ప్రారంభంలో పూర్తిగా వ్యాపార ప్రయోజనాలకే పరిమితమైంది. ప్లాసీ, బక్సర్ యుద్ధాల అనంతరం రాజకీయ అధికారాన్ని విస్తరించుకున్న కంపె నీకి పరిపాలన కోసం స్థానిక సిబ్బంది అవసరమైంది. 1813 చార్టర్ చట్టం ద్వారా మొదటిసారిగా భారతీయుల విద్యాభివృద్ధికి నిధులు కేటాయించబడ్డాయి. భారతీయుల విద్య పట్ల ప్రభుత్వ బాధ్యతను గుర్తించిన తొలి అధికారిక చర్యగా దీనిని చూడవచ్చు. అయితే థామస్ బాబింగ్టన్ మెకాలే 1835లో సమర్పించిన తన నివేదికలో... రక్తంలో భారతీయులైనా, అభిరుచుల్లో ఆంగ్లేయులుగా ఉండే ఒక మధ్యవర్తి వర్గాన్ని తయారు చేయాలనే వ్యాఖ్య బ్రిటిష్ విద్యా విధాన స్వరూపాన్ని ప్రతిబింబించింది.1854లో వెలువడిన వుడ్స్ డిస్పాచ్ను భారతీయ విద్యకు ‘మాగ్నా కార్టా’గా అభివర్ణిస్తారు. విద్యా పరిపాలనకు వ్యవస్థీకృత రూపాన్ని ఇవ్వడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషించింది. ప్రతి ప్రావిన్స్లో విద్యాశాఖల ఏర్పాటు, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ప్రాథమిక స్థాయిలో స్థానిక భాషలను, ఉన్నత విద్యలో ఆంగ్ల భాషను ఉపయో గించాలని సూచించడం ద్వారా భారతీయ విద్యా నిర్మాణానికి ద్వంద్వ స్వరూపాన్ని కల్పించింది. ఈ సిఫారసుల ఆధారంగా 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ దశలో రాజా రామమోహన్ రాయ్ సామాజిక సంస్కరణలకు విద్యే మార్గమని విశ్వసించాడు. జ్యోతిరావు ఫూలే దంపతులు అణగారిన వర్గాల కోసం పాఠశాలల్ని స్థాపించడం ద్వారా విద్యను సామాజిక న్యాయ ఉద్యమంగా మలిచారు. విద్య ప్రాథమిక హక్కుజాతీయోద్యమం నేపథ్యంలో బ్రిటిష్ విద్యా విధానానికి ప్రత్యా మ్నాయంగా జాతీయ విద్యా ఉద్యమం రూపుదిద్దుకుంది. 1906లో బెంగాల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపించబడింది. ఈ కాలంలో గోపాలకృష్ణ గోఖలే ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య కోసం చేసిన కృషి గుర్తించదగినది. 1911లో ఇంపీరియల్ లెజి స్లేటివ్ కౌన్సిల్లో ఆయన ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరించబడినప్ప టికీ, విద్య ప్రతి బాలబాలిక హక్కు కావాలనే భావనను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చింది.ఇరవయ్యవ శతాబ్దంలో రవీంద్రనాథ్ టాగూర్, మహాత్మాగాంధీ, బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల విద్యా తత్వాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరీక్షల ఒత్తిడితో, యాంత్రిక కంఠస్థంతో, సృజనాత్మకతను అణచివేసే విధానంతో నిజమైన విద్య సాధ్యం కాదని టాగూర్ భావించాడు. చేతి పని, మేధో వికాసం మధ్య సమన్వయం సాధించాలని గాంధీజీ భావించాడు. 1937లో ఆయన ప్రతిపాదించిన ‘నయీ తాలీం’ లేదా ‘బేసిక్ ఎడ్యుకేషన్’ ఈ భావజాలానికి ప్రతిరూపం. అంబేడ్కర్ విద్యకు మరింత విప్లవాత్మక అర్థాన్నిచ్చాడు. ‘అభ్యసించండి, సంఘటితమవండి, పోరాడండి’ అనే ఆయన పిలుపు కేవలం నినాదం కాదు; సామాజిక న్యాయ ఉద్యమానికి మార్గదర్శక సూత్రం. నేడు విద్యపై జరుగుతున్న చర్చలన్నింటికీ ఈ చరిత్ర ఒక అద్దంలా నిలుస్తుంది. విద్యను కేవలం మార్కులు, ర్యాంకులు, ఉద్యో గాలకే పరిమితం చేసే ధోరణి సమాజాన్ని సంకుచిత దిశగా నడిపి స్తుంది. ఒక దేశానికి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు ఎంత అవస రమో, ప్రశ్నించే పౌరులు, రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తులూ అంతే అవసరం. అలాంటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా వ్యవస్థపై ఉంటుంది.ప్రొ‘‘ కొండ నాగేశ్వర్వ్యాసకర్త డైరెక్టర్, సివిల్ సర్వీసెస్ అకాడమీ,ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
అమరావతికి అసలు ఎవరు రమ్మన్నారు?
అమరావతికి వాళ్లను ఎవరు వెళ్లమన్నారు? వారు కుట్రలు చేస్తున్నారు.. అందుకే రైతులు తిరగబడ్డారు.. ఇది వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. అంటే దీని అర్థం రైతుల ముసుగులో టీడీపీ వారు దాడి చేసినట్లు అంగీకరించినట్లే అవుతుందా? లేదా?..'మేమే రమ్మన్నాం.. ప్రభుత్వం తమను వేధిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్కు తెలియచేస్తే ఆయన ఒక కమిటీని వేశారు. వాస్తవ పరిస్థితులను గమనించడానికి తమ కోరిక మేరకు ఆ వైఎస్సార్సీపీ కమిటీ నేతలు వస్తుంటే టీడీపీ వారు అడ్డుకుని రభస సృష్టించారు. ఇది దారుణంగా ఉంది..' అని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు కొందరు ఇచ్చిన జవాబు.'అమరావతి ఏమైనా పాకిస్తానా? తాము ఎందుకు వెళ్లకూడదు..' అని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలు, ఇతరత్రా ఆలోచనపరుల ప్రశ్న.'వైఎస్సార్సీపీ నేతలను తరిమిన రాజధాని రైతులు.. ఇది ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశం పత్రిక ఈనాడు' పేపర్లో పెట్టిన హెడ్డింగ్.. ఇది మెయిన్ పేజీలో వచ్చిన శీర్షిక అయితే జిల్లా పత్రికలో మరో కథనం ఇచ్చారు. దానికి 'ఈసడించినోళ్లను ఈడ్చి కొట్టారు' అన్న శీర్షికను పెట్టి మరో స్టోరీ రాశారు. అందులో ఏమి రాశారో తెలుసా!.. శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ, కోడిగుడ్లు విసురుతూ తీవ్ర పరాభవం చేశారు అని ఈనాడులో పేర్కొన్నారు. అదే టైమ్లో 'రాళ్లు, కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి' అని ఈనాడు మొదటి పేజీలో అందుకు విరుద్ధంగా తెలిపారు.'వైఎస్సార్సీపీవారిని గంట సేపు అడ్డగించారని, రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ చేష్టలు' అని కూడా రాశారు. అంటే దీని అర్దం ఎక్కడా వైఎస్సార్సీపీవారు దాడులు చేయలేదని పరోక్షంగా తెలియచేసినట్లే కదా! అక్కడ అరాచకం చేసింది టీడీపీ గూండాలని తెలుసు.. ప్రశాంతంగా తమ దారిన తాము వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నది వారేనని తెలుసు. అయినా తెలుగుదేశంపై విధేయతతో అడ్డగోలు కథనాలు రాశారు. మరో టీడీపీ మీడియా అయితే 'మళ్లీ అమరావతి వైపు వైఎస్సార్సీపీ వాళ్లు కన్నెత్తి చూడకుండా చేయాలని' వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ప్లేట్ మార్చి 'వైఎస్సార్సీపీ నేతలే అమరావతిపై దండయాత్ర చేశారని' పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసిది. దీనిని బట్టి ఎంత నిస్సిగ్గుగా ఈ ఎల్లో మీడియా పనిచేస్తున్నది అర్థం చేసుకోవచ్చు.ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై రాయి విసిరిన వ్యక్తి టీడీపీ వాడని తెలిసినా పోలీసులు మాత్రం అతని పేరు కేసులో చేర్చలేదట. కొద్ది రోజుల క్రితం కీలక మంత్రి లోకేష్ ప్రకటించినట్లు టీడీపీ కార్యకర్తలు తప్పులు చేసినా కేసులు పెడితే ఊరుకోనని, అవసరమైతే డీజీపీని పంపిస్తానని బెదిరించిన నేపథ్యంలోనే పోలీసులు ఇలా వ్యవహరించారన్న అభిప్రాయం కలుగుతుంది.అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విపక్షానికి చెందిన రాజకీయ పార్టీని అమరావతి ప్రాంతానికి వెళ్లరాదని అనడం సరైనదేనా? అంటే అమరావతిలో జరగకూడనివి జరుగుతున్నాయని అంగీకరించినట్లే కదా అని పెనుమాక రైతు ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా ఈ నాలుగైదు గ్రామాల రైతుల పట్ల ప్రభుత్వం ఇంత క్రూరంగా ప్రవర్తించడం దారుణంగా ఉంది. వారు రాజధానిలో రోడ్డుకు అవసరమైన భూమి ఇచ్చినా, వారికి ఉన్న భూములు మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టి భయపెడుతోంది. వారు తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. సమస్యలను తెలుసుకోవలసిన ప్రభుత్వ పెద్దలే తమ పొలాలలో తాము పనిచేసుకోనివ్వకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు.వీరి పొలాల్లో మట్టి తవ్వుకుని టీడీపీ మాఫియా గాంగ్ అమ్ముకుందట. ఆ పొలాలను చెరువుల మాదిరి కొందరు అధికారులు పాడు చేశారు. ఆరుగాలం కష్టపడే రైతులను రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు. వేధిస్తున్నారు. అయినా రైతులు తమ పోరాటం కొనసాగించడం టీడీపీ ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది.కొద్ది రోజుల క్రితం జగన్ను కలిసిన రైతులు ఆయన సామాజికవర్గానికి చెందినవారని ఒక ఎల్లో మీడియా పత్రిక రాసింది. ఇప్పుడు ఆ కారణంతోనే రైతులను ఇలా హింసిస్తున్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నిజానికి ఆ గ్రామాలలో అన్ని సామాజికవర్గాల రైతులు ఈ భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైన భూమి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే, వైఎస్సార్సీపీ నేతలు వారితో మాట్లాడడానికి వెళుతున్నప్పుడు ఉండవల్లి వద్ద ప్లాన్ ప్రకారం అడ్డుకుని టీడీపీ గూండాలు నానా గందరగోళం సృష్టించడం మరో ఎత్తుగా ఉంది. పైగా దాడులు చేసినవారిపై కాకుండా, బాధితులపైన కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం ఒక ట్రెండ్ గా మార్చింది.చంద్రబాబు సర్కార్ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు తెరదీయడం అత్యంత శోచనీయం. ఇది భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా పాటించే ప్రమాదం ఉంటుందన్న సంగతిని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ విస్మరిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఒక సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుమతి కోరితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాకుండా, మరో రోజు పెట్టుకోవచ్చని ఆ ప్రభుత్వం చెబితే ఇదేమైనా మీ అయ్య జాగిరా అని ప్రశ్నించారు. పవన్కు చంద్రబాబు సైతం మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రశ్నను వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అమరావతి రాజధాని గ్రామాలకు ఎందుకు వెళ్లకూడదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లి, ఎవరిని రెచ్చగొట్టినా అప్పటి ప్రభుత్వం ఏమీ మాట్లాడకూడదనేవారు. అనపర్తికి ఆయన ఒకసారి వెళ్లినప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తోందని, టూర్ వద్దని పోలీసులు చెబితే ఆయన ఒప్పుకోకుండా కాలి నడకన వెళతానని అంటూ పట్టుబట్టి వెళ్లారు. అయినా పోలీసులు ఆయనపై కేసు పెట్టకుండా రక్షణ కల్పించారు. పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్న పరిస్థితిలో పోలీసుల మాట ఖాతరు చేయకుండా ఆయన టూర్ చేశారు.గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో కొందరు తెలంగాణవాదులు అడ్డుకోవడానికి యత్నించేవారు. అప్పట్లో మంద కృష్ణ మాదిగ తన అనుచరులతో యాత్రకు సహకరించారు. అయినా కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వరంగల్ జిల్లాలో ఒకసారి తెలంగాణవాదులు గట్టిగా అడ్డుపడితే అప్పట్లో పవర్ఫుల్గా ఉన్న ఒక టీడీపీ నేత తన మనుషులతో వారిపై దాడి చేయించారు. వారిని ఉరికించి కొట్టామని ఆయనే స్వయంగా చెప్పారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లవచ్చు కాని, తను అధికారంలో ఉంటే మాత్రం విపక్షం ఎక్కడకు కదలకూడదా అన్న ప్రశ్న వస్తుంది.గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిని గేటెడ్ కమ్యూనిటిగా మార్చుతున్నారని విమర్శించేవారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు సరసన చేరి మద్దతు ఇస్తుండవచ్చు. కాని ఆయన చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ మాట ప్రస్తుతం నిజం అవుతుందేమో అన్న సందేహం వస్తోంది. అమరావతిలో ఎలాంటి తప్పులు జరగకపోతే, వేల కోట్ల అప్పులు తెచ్చి జరుపుతున్న నిర్మాణాలలో అవినీతి లేకపోతే, రైతులంతా స్వచ్చందంగా భూములు ఇస్తున్నట్లయితే వైఎస్సార్సీపీ నేతల పర్యటనను అడ్డుకోవలసిన అవసరం ఏమి ఉంటుంది.అమరావతిలో ఒక భయానక వాతావరణం సృష్టించి ఎవరూ అందులోని లోటుపాట్లను ఎత్తి చూపరాదన్న లక్ష్యమా? లేక సాయికృష్ణ లాకప్ డెత్ కేసును డైవర్ట్ చేయడానికి దీనిని వాడుకున్నారా అన్నది తెలియదు. చిత్రం ఏమిటంటే దాడులకు గురైన వైఎస్సార్సీపీ నేతలపై ఎస్సీ.ఎస్టీ చట్టం కింద కూడా ఒక మహిళతో ఫిర్యాదు చేయించడం, వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయాయట. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీవారిపై మాత్రం నామమాత్రపు కేసులు పెట్టారట. దీనిని బట్టి ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అరాచకంగా మారింది అర్థం అవుతోంది కదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మాటలు కోటలు... మారని చర్యలు
నేల అంటే కేవలం మట్టి కాదు. అది జీవం. అది చరిత్ర. అది రైతు జీవనా ధారం. ఈ సత్యాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన భారత్ సాయిల్ హెల్త్ పాలసీ– ‘స్వచ్ఛ మిట్టి, సమృద్ధ కిసాన్, సశక్త భారత్’ చదివినప్పుడు మనసులో ద్వైదీభావాలు ఏక కాలంలో కలుగుతాయి. ఒకవైపు ఆశ, మరోవైపు ఆందోళన. మాటలు బాగున్నాయి. కానీ చర్యలకు దారేది?నేల ఏం చెప్తోందంటే...2015లో ప్రారంభమైన సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్డులు పంపిణీ చేశారు. ఈ గణాంకాలు చిన్న విషయం కాదు. కానీ ఆ కార్డుల్లో వచ్చిన డేటా మనల్నీ, మన వ్యవసాయ పద్ధతులనీ, ప్రభుత్వ విధానాల్నీ కదిలించాల్సింది. కానీ అది జరగలేదు. 89% నేలల్లో నత్రజని లోపం ఉంది. 80% నేలల్లో భాస్వరం తగ్గింది. 49% నేలల్లో జింక్ కరవైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు సగటున 2.5% ఉన్న సేంద్రియ కార్బన్ నేడు 0.3%కి పడిపోయింది. ఇది నేల చనిపోతున్న పరిస్థితులకు సంకేతం. అయినా పంటల సరళి, వ్యవసాయ పద్ధతులు మారలేదు. యూరియా వాడకం పెరుగుతూనే ఉంది. ఎరువుల సబ్సిడీ కొనసాగుతూనే ఉంది. నేల చెప్పింది వినే తత్వం లేకుండా పోయింది.ఇది డేటా వైఫల్యం కాదు, డేటా నుండి నేర్చుకోవటానికి నిరా కరించిన వ్యవస్థ వైఫల్యం. డేటా మాత్రమే మంచి నిర్ణయాలకు దారితీయదు. ఆ డేటాను అర్థం చేసుకునే జ్ఞానం, దానిపై చర్యలు తీసుకోవాలనే సంకల్పం కూడా అవసరం. కార్డు చేతికిచ్చారు, కానీ దాన్ని అమలుచేసే వ్యవస్థ మారలేదు. డీలర్లు అదే యూరియా అమ్ముతూనే ఉన్నారు. రుణం తీసుకోవాలంటే ఎరువులు కొనాల్సిందే. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా స్థానాలు, సలహా ఇచ్చే విస్తరణ సేవలు అదే పాత పాట పాడుతున్నాయి. ఎక్కువేస్తే ఎక్కువ దిగుబడి భ్రమతెలంగాణాలో హెక్టారుకు 297 కిలోల ఎరువులు వేస్తున్నారు. జాతీయ సగటుకు రెట్టింపు కంటే ఎక్కువ. అయినా ఆ నేలల్లో సేంద్రియ కార్బన్ 0.3 నుంచి 0.8% మాత్రమే ఉంది. 90% నేలలు పోషకాల లోపంతో అల్లాడుతున్నాయి. పంటల దిగుబడి తగ్గి పోతోంది. ఎరువులు పెంచినా, ఎక్కువ మోతాదులో వేసినా దిగు బడి పెరగకుండా తగ్గుతోందని కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్లో హెక్టారుకు 277 కిలోల ఎరువులు వాడతారు. పంజాబ్ కంటే కూడా ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో వరి సాగు ప్రాంతాల్లో మూడు–నాలుగు పోషకాల ఏకకాలిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వైరుధ్యం ఇదే. నీటి పారుదల పెరిగింది, ఎరువుల వాడకం పెరిగింది, అయినా దిగుబడులు పెరగలేదు, రైతు రుణభారం తగ్గలేదు, భూములు పాడయ్యాయి.అసలు సమస్య ఎరువుల పరిమాణం కాదు – ఏకపంట వ్యవ సాయం. వరి–వరి లేకపోతే పత్తి. ఏకపంట వ్యవసాయం ఒకే నేల పొరలోని పోషకాలను పంట కాలం తర్వాత పంట కాలం పీల్చేస్తుంది. పంట వైవిధ్యం లేదు. సేంద్రియ పదార్థం తిరిగి నేలకు చేరడం లేదు. దానిపైన ఎక్కువ రసాయనిక ఎరువులు వాడబట్టి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నాశనమవుతాయి. అవి లేకుండా, ఎంత ఎరువు వేసినా పంటకు అందడం లేదు. అది వృథాగా నీళ్లల్లో కరిగి బయటకు పోతుంది. భూగర్భ జలాలు కలుషితమవుతాయి.‘వెనుకబడ్డ’ రాష్ట్రాలు ఎందుకు ముందున్నాయి?నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు 5 కిలోల కంటే తక్కువ ఎరువులు వాడతారు. అయినా వాటి నేల ఆరోగ్యం పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కంటే మెరుగ్గా ఉంది. ఈ నేలలు ‘వెనుకబడ్డవి’ కావు. అవి ఇంకా బతికి ఉన్నాయి. కానీ సాయిల్ హెల్త్ పాలసీ ప్రకటిస్తున్న పీఎం–ప్రణామ్, కార్బన్ క్రెడిట్స్ వంటి పథకాలన్నీ ఎరువులు తగ్గించిన రైతుకు సహకారం అందించే విధానాలు. కానీ ఎప్పుడూ ఎరువులు వాడని, భూమిని కాపాడుకొంటున్న నాగాలాండ్ రైతుకు ఏమి దక్కుతుంది? తగ్గించడానికి అతడి దగ్గర పాత బేస్లైన్(ఆధార రేఖ) లేదు కాబట్టి ఏ పథకమూ వర్తించదు. ఈ సాధనాలు చెడ్డ స్థాయి నుండి బయట పడేవారికి బహుమానం ఇస్తాయి; ఆ చెడ్డ స్థాయికి అసలు ఎప్పుడూ వెళ్లని వారికి ఏమీ అందదు. ఇది తీవ్రమైన వైరుధ్యం. పరివర్తన ఆర్థిక వ్యవస్థ వేరు,సంరక్షణ ఆర్థిక వ్యవస్థ వేరు. మంచి నేలలు ఉన్న చోట వాటిని కాపాడే విధానం కావాలి. మారమని ప్రోత్సాహం కాదు. లేకుంటే మార్కెట్ శక్తులు ఆ నేలలను కూడా రసాయన సాగులోకి లాగుతాయి. భారత్ సాయిల్ హెల్త్ పాలసీ పరివర్తన, సంరక్షణ – ఈ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలి. మాటలు మారితే చర్యలూ మారాలి!కొత్త పాలసీలో మంచి భావనలున్నాయి. నేలను జాతీయ సంపదగా గుర్తించడం, జీవ సూచికలను పర్యవేక్షించడం, రైతులను నేల సంరక్షకులుగా గౌరవించడం. కానీ ఈ పాలసీ నిజంగా అమలు కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు.ఎరువుల సబ్సిడీ విధానంలో సంస్కరణలు జరగాలి. రసాయనిక ఎరువులకుగాక నేల సంరక్షణకూ, నేల ఆరోగ్యం కాపాడటానికీ సబ్సిడీలు ఇవ్వాలి. వరి–గోధుమ ఆధిపత్యాన్ని తగ్గించాలి. పప్పు ధాన్యాలు, నూనెగింజలకు మద్దతు ధరలు, కొనుగోలు హామీలు ఇవ్వాలి. రైతు సంస్థలు, ఎఫ్పీఓ(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనై జేషన్)లు కేవలం అమలు యంత్రాంగంగా కాకుండా, జవాబుదారీ తనంలో భాగం కావాలి. పీజీఎస్ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్) ధ్రువీకరణ వ్యవస్థలు పాలసీలో భాగం కావాలి. డేటా తయారు చేయడం సులభం. డాష్బోర్డులు పెట్టడం ఇంకా సులభం. కానీ డేటా చెప్పింది వినాలంటే, వ్యవస్థ మారాలనే సంకల్పం కావాలి. ఆ సంకల్పమే ఇప్పుడు లేనిది. నేల పరీక్ష చేయించాం. నేల ఏం చెప్తుందో తెలుసు. ఇక మనం ఏం చేస్తామో చూడాలి.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
యుద్ధ పాఠాలు పెద్దవే!
పాఠాలు ఏ యుద్ధానికైనా ఉంటాయి. కొన్నింటికి అసాధారణంగా, బహుముఖాలుగా ఉంటాయి. అటువంటి వాటిలో ఇరాన్ యుద్ధం ఒకటి. యుద్ధంలో ప్రత్యక్ష పాత్రధారులు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. అమెరికా సైనిక స్థావరాలకు చోటి చ్చిన కొన్ని గల్ఫ్ రాజ్యాలు అందు బాటులో అసంకల్పిత భాగస్వాముల య్యాయి. పరోక్షంగా మొత్తం ప్రపంచానికి పాత్ర ఏర్పడింది. ఏదో విధమైన కష్టనష్టాలు అందరికీ కలిగాయి. గెలిచినవారు ఎవరూ లేరు. పాఠాలు మాత్రం అందరికీ ఉన్నాయి.కళ్లముందున్న చరిత్రకేవలం సైనిక బలాన్ని నమ్మి, తమది సాటిలేని శక్తి అంటూ అహంకరించి, ప్రత్యర్థిని సరిగా అంచనా వేయకుండా దాడికి పాల్ప డటం ఓటమికి దారి తీస్తుంద న్నది అమెరికాకు మొదటి పెద్దపాఠం. అమెరికా సైనిక బలం మొత్తం ప్రపంచంలోనే సాటి లేనిదన్నది నిర్వివాదాంశం. కానీ అసమానుల మధ్య అసమతుల యుద్ధ వ్యూహాలు ఉంటాయన్నది కొత్తగా తెలుసుకోవలసిన విషయం కాదు. స్వయంగా అమెరికా మొదట వియత్నాంలో (1975)లో నేర్చింది. అఫ్గానిస్తాన్లోనైతే అదే పాఠాన్ని బ్రిటన్ (1839–1919), రష్యా (1979–89), అమెరికా (2001–21)లు వరుసగా నేర్చాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కూడా అటువంటి రూపానికే మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అనుభవాలు ఉండి కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జాగ్రత్తగా ఆలోచించిన తన సలహాదారులు కొందరు వద్దని వారించినా, చివరకు ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ విముఖత చూపినా పెడచెవిన పెట్టి ఇరాన్పై దాడులకు దిగారు. తమపై యుద్ధం ఎప్పటికైనా జరుగుతుందని అంచనా వేసిన ఇరాన్ సుమారు 20 సంవత్సరాలుగా తన రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నదనీ, 2025 జూన్ నాటి 12 రోజుల యుద్ధం తర్వాత ఆ ఏర్పాట్లను ముమ్మరం చేసిందనీ, ప్రస్తుత యుద్ధానికన్నా ముందే అమెరికన్ సైనిక నిపుణులు, బయటి నిపుణులు ట్రంప్ను హెచ్చరించారు. ఇదేమీ చాలదనుకుంటే, ఒకవేళ తమపై యుద్ధానికి దిగి నట్లయితే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయగల శక్తి తమకుందని ఇరాన్ పదేపదే హెచ్చరించింది. తాము స్వయంగా హార్మూజ్ను మూసి వేయటమేగాక, తమ మిత్రులు హౌతీలతో బాబ్ అల్ మందేల్ను మూసివేయించగలమని స్పష్టం చేసింది. ఇరాన్కు రష్యా, చైనాల సాంకేతిక సహాయాలు ఉండటమూ తెలిసిందే.అయినా ఎందుకు?మొత్తం పరిస్థితులు ఈ విధంగా ఉండగా దాడులకు సమ కట్టడమేగాక, ఇరాన్లో తమ లక్ష్యం వెనిజులాలో వలె కనుమూసి తెరిచేలోగా నెరవేరిపోతుందని అంచనా వేయటం ఎంత పెద్ద తప్పో అమెరికా, ఇజ్రాయెల్లకు అర్థమయేందుకు ఎక్కువ రోజులు పట్ట లేదు. అది సైనికపరమైన పాఠం కాగా, రాజకీయమైనది కూడా కొద్ది రోజులలోనే తెలిసి వచ్చింది. వారు భ్రమపడినట్లు, ఖొమైనీని హత్య చేయటంతో ఇరానియన్ వ్యవస్థ రాజకీయంగా కుప్పకూలి, తమకు అనుకూలమైన శక్తులేవో అధికారాన్ని చేజిక్కించుకోవటం, ప్రజలు ఇస్లామిక్ వ్యవస్థపై తిరుగుబాటు చేయటం వంటివేవీ జరగలేదు. ఇవేవీ జరగకపోగా ఇరానియన్లు దేశ భక్తితో ఒకటయ్యారు. ఇరాన్తో అమెరికాది దశాబ్దాల అనుభవం. ఇరాన్లో ఇస్లామిక్ రివల్యూషన్ (1979) తర్వాత అక్కడి అధినాయకత్వం తమ రాజకీయ, సైనిక వ్యవస్థలను ప్రాంతాల వారీగా వికేంద్రీకరించి స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటూ, మొత్తం మీద కేంద్రాధికార ఉత్తర్వుల ప్రకారం వ్యవహరించేట్లు నిర్మించిన విషయం అమెరికాకు తెలియదనుకోలేము.ఇన్నిన్ని ఉన్నా దాడులు చేయటమేగాక, అంతా క్షణాలలో తేలి పోతుందనుకోవటానికి కారణాలు రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇరాన్ చమురుపై దశాబ్దాలుగా కన్ను వేసిన అమెరికా, గత జనవరిలో వెనిజులా చమురును స్వాధీనపరచుకున్న తర్వాత ఇప్పుడు ఇరాన్వైపు కదలటం. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు డాలర్ కరెన్సీ విలువ బహుళ ధ్రువ ప్రపంచం వల్ల బలహీనపడు తుండటంతో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లక్ష్యం కోసం ఇదంతా చేయటం. రెండవది, ఎట్టి పరిస్థితులలోనూ పాలస్తీనా సృష్టిని ఆపి, గ్రేటర్ ఇజ్రాయెల్ను స్థాపించాలన్న నెతన్యాహూ ఒత్తిడికి లొంగిపోవటం. చివరకు అసమాన యుద్ధమే గెలిచింది.వంద రోజుల యుద్ధం తర్వాత అంతే పెద్ద రాజకీయ పాఠాలు న్నాయి. నాటో దేశాలు సహా ఏ ఒక్కరూ ట్రంప్ నోరు తెరిచి అడిగినా తోడు నిలవక పోవటం. 1949లో నాటో ఏర్పడిన తర్వాత గత 77 సంవత్సరాలలోనే ఎప్పుడూ ఇట్లాంటి తిరస్కరణ అమె రికాకు ఎదురు కాకపోవటం పాఠం కన్నా పరాభవమనాలి. తను నెగ్గలేక ఇరాన్తో రాజీకి ప్రయత్నిస్తున్న దశలో అందుకు ఆటంకాలు సృష్టిస్తున్న నెతన్యాహూను ఆయన, ‘నువ్వు ప్రపంచంలో ఏకాకి వయా’వంటూ హెచ్చరించారుగానీ, వాస్తవానికి వారిద్దరూ ఒంటరి అయ్యారు. ట్యారిఫ్లతో మొదలై ఒకటి వెంట ఒకటిగా సాగుతూ వస్తున్న ఈ విధమైన పరిణామాలతో యూరప్, ఆసియాలలోని మిత్రులు తమ దారి తాము నెమ్మదిగా వెతుక్కుంటుండగా, చైనా, రష్యాల ప్రాబల్యం పెరగటం, వర్ధమాన ప్రపంచానికి అమెరికా పట్ల భక్తి, భయం రెండూ తగ్గుతుండటం మరో ముఖ్యమైన పాఠం. సమీక్షించుకోవాల్సిన వైఖరులుఇజ్రాయెల్ విషయానికి వస్తే, 1948లో ఒక దేశంగా సృష్టి అయినప్పటి నుంచి ప్రస్తుత యుద్ధం వరకు 68 సంవత్సరాలలో వారికి ఇంత ఎదురుదెబ్బ తగలలేదు. ఇజ్రాయెలీ సైన్యం అతిశక్తి మంతమైనదే అయినా, వారి ఐరన్ డోమ్ దుర్భేద్యమన్న పేరుండినా, ఇరాన్ అసమతల యుద్ధ వ్యూహాలను అది కూడా తట్టుకోలేక పోయింది. కనుక ఇక్కడినుంచి వారు చేయవలసింది మొదట పాల స్తీనాను ఏర్పాటు కానివ్వటం, తర్వాత గ్రేటర్ ఇజ్రాయెల్ పథకాన్ని వదిలి వేయటం. ఇరాన్కు గల ఒకే ఒక పాఠం ఒక స్థాయిలో అత్యద్భుతంగా పోరాడి నిలిచినా, తగు ప్రజాస్వామిక సంస్కరణ లతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవటం.గల్ఫ్ రాజ్యాల గురించి చెప్పుకోవాలంటే, వారు తమ ఇరాన్ వ్యతిరేకత, పాలస్తీనా అంశం పట్ల కపట వైఖరి, అమెరికా ఇజ్రా యెల్ ప్రేమ, వారిచ్చే రక్షణ పేరిట ఆ కూటమిలో బందీలుగా ఉండ టమనే విధానాలను సవరించుకోవలసి ఉంటుంది. గత విధానాల వల్ల కలిగే కష్ట నష్టాలు వారికిపుడు బాగానే అర్థమయినట్లు కనిపిస్తు న్నది. ఇక ఇండియా సహా వర్ధమాన దేశాలకు అమెరికా నిర్హేతుక మైన విధానాల వల్ల ఎదురయ్యే సమస్యలేమిటో ట్యారిఫ్లు, వాణిజ్య ఒప్పంద విషయాల నుంచి యూరప్ వలెనే తమకూ అనుభవంలోకి వస్తున్న విషయమే. అవే విధానాలతో ఈ యుద్ధాన్ని ప్రత్యక్షంగా ఇరాన్పై, పరోక్షంగా మొత్తం ప్రపంచంపై రుద్దినందువల్ల కలుగుతున్న నష్టాలు తెలిసి వచ్చినందున, భవిష్యత్తులో ఇంధనం కావచ్చు, రాజకీయ వైఖరులు కావచ్చు, తాము మరింత స్వతంత్రంగా, స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవటమన్నది వారికి గల పాఠం.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిధులిస్తారా లేక నీళ్లు నములుతారా?
దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు గత రెండు దశాబ్దాలుగా కనీస జీవన భద్రతగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, జూలై 1 నుండి ‘వీబీ జీ రామ్ జీ’ని అమల్లోకి తేవడానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది. 55కు పైగా ప్రధాన క్లాజులు, రూల్స్, వందలాది ఉప నిబంధనలు, కొత్త పరిపాలనా నిర్మాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థ ఉపాధి హామీని బలోపేతం చేయడానికి కాదు; దాని హక్కు ఆధారిత స్వభావాన్ని పూర్తిగా బలహీనపరచడానికే ఉద్దేశించబడింది. ఉపాధి హామీ కాదు, నిరుద్యోగ హామీ ఇది. చెట్టును నరికి నీడ ఇస్తామని చెప్పడం ఎంత మోసమో, ‘ఎంజీనరేగా’ను నిర్వీర్యం చేసి 125 రోజుల ఉపాధి హామీ ఇస్తామని చెప్పడం అంతే మోసం. లెక్కలు చెప్పే నిజాలుకేంద్ర ప్రభుత్వం 100 రోజుల బదులు 125 రోజుల ఉపాధి హామీ ఇస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ ఏ ఉపాధి పథకం అయినా హామీలపై కాదు, నిధులపై నిలబడుతుంది. ఇక్కడే మొదటి వైరుధ్యం కనిపిస్తుంది. 125 రోజుల ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కొత్త పథకానికి కేవలం రూ. 95,000 కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపు 125 రోజుల ఉపాధికి ఏమాత్రం సరిపోదని రాష్ట్రాలవారీ పని దినాల గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత సంవత్సరం కేరళలో సగటు పనిదినాలు 57.81, తెలంగాణలో 50.24, తమిళనాడులో 48.54, పశ్చిమ బెంగాల్లో 44.12, ఆంధ్రప్రదేశ్లో 42.35 మాత్రమే ఉన్నాయి. బిహార్లో 30.94, ఉత్తరప్రదేశ్లో 27.50, మధ్యప్రదేశ్లో 25.66, మహారాష్ట్రలో 14.40, హరియాణాలో 13.78 రోజులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం 15 నుంచి 50 రోజుల పని కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం 95 వేల కోట్లతో ఒక్కసారిగా 125 రోజుల ఉపాధి ఎలా కల్పిస్తుంది?ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయించి 17 ప్రధాన రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే 7 కోట్ల 69 లక్షల 65 వేల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కార్మికులకు 125 రోజుల ఉపాధి హామీని అమలు చేయడానికి మొత్తం రూ. 3.61 లక్షల కోట్ల వ్యయం అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేటాయింపు ఈ రాష్ట్రాలకు 85,605 కోట్లు మాత్రమే. రాష్ట్రాల 40 శాతం వాటా 57,071 కోట్లు కలిపినా మొత్తం అందుబాటులో ఉండే నిధులు 1.43 లక్షల కోట్లే. ఈ నిధులతో సంవత్సరంలో సగటున 48.5 పని దినాలే ఇవ్వగలరు. కేంద్రం కేటాయించిన నిధులు తప్ప అదనంగా పైసా నిధులు ఇవ్వబోమని రూల్స్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే, ఈ లోటును భర్తీ చేయడానికి రాష్ట్రాలే అదనంగా 2.18 లక్షల కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. అంటే 30 శాతం వాటా కేంద్రం, 70 శాతం వాటా రాష్ట్రాలు ఖర్చు చేయాలి. తెలుగు రాష్ట్రాల తీరుఆంధ్రప్రదేశ్లో 54.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదిందిన 7,707 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 71 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధి కల్పించాలంటే 22,746 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 15,039 కోట్ల అదనపు భారం పడుతుంది. తెలంగాణలో 30.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం కేటాయించిన 3,825 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 62 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధికి 12,819 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 8,993 కోట్ల అదనపు భారం పడు తుంది. ఈ లెక్కలు ఒక స్పష్టమైన రాజకీయ సత్యాన్ని బయటపెడు తున్నాయి. హామీ కేంద్రానిది, ప్రచారం కేంద్రానిది, ఖర్చు రాష్ట్రా లది. నియంత్రణ మోదీ గారిది, విఫలమైతే నింద రాష్ట్రాలది. ‘పెళ్లి పెద్దలు చేసుకున్నారు – కట్నం మాత్రం రాష్ట్రాలు పెట్టాలి’ అన్న ట్టుగా ఈ వ్యవస్థ రూపొందుతోంది. ఇక్కడ ఒక పాత సామెత గుర్తుకు వస్తుంది: ‘ఎద్దు ఇస్తానని చెప్పి తాడు చేతిలో పెట్టినట్టు’. రాష్ట్ర ప్రభుత్వలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సాధ్యమా? అంతిమంగా నష్టపోయేది ఉపాధి కార్మికులే. పేరు కాదు, తత్వమే మారింది!డ్రాఫ్ట్ రూల్స్లోని రూల్ 3 చెల్లింపులు, బ్యాంకు మరియు పోస్టాఫీస్ ఖాతాల ద్వారా వేతనాల చెల్లింపును ప్రస్తావిస్తుంది. కానీ కార్మికుడి హక్కుల రక్షణపై స్పష్టత కనిపించదు. వేతనాలు ఆలస్య మైతే బాధ్యత ఎవరిది? నిరుద్యోగభృతి చెల్లించకపోతే బాధ్యులపై చర్య ఏమిటి? వంటి ప్రశ్నలకు రూల్స్లో స్పష్టమైన సమాధానం లేదు. కార్మికుడి హక్కు కేంద్ర బిందువుగా ఉండాల్సిన చోట పరిపా లనా ప్రక్రియ కేంద్ర బిందువుగా మారుతోంది. అత్యంత ప్రమాదకరమైన మార్పు రూల్ 4లో కనిపిస్తుంది. రూల్ 4(2)లోని నార్మటివ్ అలోకేషన్ విధానం ఎంజీ నరేగా అసలు తత్వాన్నే మార్చేస్తోంది. ఎంజీనరేగా ప్రాథమిక సూత్రం ‘పని అడిగితే పని ఇవ్వాలి.’ పని డిమాండ్ ఉంటే ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. కానీ కొత్త విధానం పని హక్కును బడ్జెట్ పరిమితికి కట్టిపడేస్తోంది. అంటే ఇప్పుడు నిధులు ఉంటేనే పని. హక్కు నుండి కోటాకు మార్పు. చట్టబద్ధ హామీ నుండి బడ్జెట్ పరిమితికి మార్పు. పౌరుని హక్కు నుండి అధికారుల విచక్షణకు మార్పు. ‘బావి ఎండి పోయాక మోటారు పెంచినట్టు’ 125 రోజుల హామీ ఉంది.ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించా రన్న ప్రశ్నకూ సమాధానం దొరుకుతుంది. గాంధీ పేరు గ్రామ స్వరాజ్యం, వికేంద్రీకరణ, గ్రామసభల పాత్ర వంటి భావనలకు ప్రతీక. కానీ కొత్త వ్యవస్థలో గ్రామ సభలు బలహీనపడుతున్నాయి. అందుకే ‘ముందు బోర్డు మార్చారు – ఇప్పుడు భవనం కూల్చేస్తున్నారు.’ ఇది పేరు మార్పు కాదు. తత్వ మార్పు. డ్రాఫ్ట్ రూల్స్లోని డిజిటల్ నిబంధనలు కూడా ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ–కేవైసీ, ఫేస్ అథెంటికేషన్, ఎన్ఎంఎన్ఎస్, ఆధార్ అథెంటికేషన్ వంటి విధానాలను ఆధునికీకరణ పేరుతో ప్రవేశపెడుతున్నారు. కానీ గ్రామీణ పేద కార్మికుల అను భవం వేరే కథ చెబుతోంది. నెట్వర్క్ లేకపోతే పని లేదు. వేలి ముద్ర పడకపోతే వేతనం లేదు. అంటే పని హక్కు కార్మికుడి చేతిలో లేదు. సాంకేతిక వ్యవస్థల చేతిలో ఉంది.ఎంజీనరేగా గ్రామీణ కార్మికుడికి కనీస భద్రతను ఇస్తుంది. వేతనాలపై ఒక కనీస ప్రమాణాన్ని సృష్టిస్తుంది. ఆకలి, నిరుద్యో గాన్ని కొంతమేర నియంత్రిస్తుంది. అందుకే దేశంలోని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, వ్యవసాయ, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు విశాల ఐక్య వేదికలను నిర్మించి ఈ దాడిని తిప్పికొట్టాలి. వీబీ జీ రామ్ జీని ఉపసంహరించాలి. 200 రోజుల చట్టబద్ధ ఉపాధి హామీ కల్పించాలి. పూర్తి కేంద్ర నిధులు విడుదల చేయాలి. గ్రామ సభలు, పంచాయతీల అధికారాలను బలోపేతం చేయాలి.బి. వెంకట్వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
జీవితాన్ని 'మార్చే క్షణాలు' కొన్నే!
నన్ను ఈ రోజు ప్రసంగించేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఈ రోజు మీకు సలహాలు ఇవ్వాల్సిన రోజని నాకు తెలుసు. నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే – కాలం మారినా,సాంకేతికత మారినా, కొన్ని సలహాలు ఎప్పటికీ విలువైనవే. మీలో కొందరికి లక్ష్యం ఇప్పటికే స్పష్టంగా తెలిసి ఉంటుంది. మరికొందరికి స్పష్టంగా తెలియకపోవచ్చు. అది సహజమే. పట్టభ ద్రుడిగా బయటకు వచ్చిన రోజున నాకూ అలానే అనిపించింది. జీవితం ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాల సమాహారమనీ, వాటన్నింటినీ సరిగ్గా తీసుకోవాల్సిందేననీ భావించేవాడిని. ప్రత్యేకంగా మీలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పరీక్ష, ప్రతి ప్రాజెక్ట్, ప్రతి మార్కు కోసం కష్టపడతారు. కానీ మీకు ఒక చిన్న రహస్యం చెబుతాను. ఇవన్నీ ఆ సమయంలో చాలా ముఖ్యంగా అనిపించినా, జీవితాన్ని నిర్ణయించే అంశాలు అంతగా కావు. మీరు ఒక పరీక్షలో విఫలమైనా, ఒక క్లాస్ మిస్ అయినా, లేదా సంగీత వాయిద్యం నేర్చుకోకపోయినా – ఈ రోజు ఇక్కడే ఉండేవారు. దీన్ని నేను ఎలా గ్రహించానో చెప్పడానికి ఒక చిన్న కథ చెబుతాను. స్టాన్ ఫోర్డ్లో చదువుతున్నప్పుడు నాకు పాట్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఒక రోజు ఉదయం అతను ‘‘క్లాస్కు వెళ్లకుండా లాస్ వెగాస్ వెళ్దామా?’’ అని అడిగాడు. అప్పటివరకు నేను ఎప్పుడూ క్లాస్ మిస్ కాలేదు. రోడ్ ట్రిప్ కూడా చేయలేదు. అయినప్పటికీ ‘‘సరే’’ అన్నాను. మేము మా గదులకు వెళ్లి కొన్ని వస్తువులు తీసు కుని ప్రయాణం ప్రారంభించాం. కొండల మధ్యగా ప్రయాణిస్తున్నప్పుడు మంచు కురవడం మొదలైంది. నేను జీవితంలో మొదటిసారి మంచును చూశాను. చేతిని బయటకు చాచి మంచు రేణువులను తాకాను. అవి ఎంత మృదువుగా ఉన్నాయో చూసి ఆశ్చర్య పోయాను. ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది. మీ జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతాయి. వాటిలో కొన్నే నిజంగా ముఖ్యమైనవి. ఉదాహరణకు – జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, కుటుంబాన్ని ప్రారంభించాలా వద్దా నిర్ణయించడం, లేదా కెరీర్లో పెద్ద మార్పు చేయడం. ఇలాంటి నిర్ణయాలకు సమయం, స్పష్టమైన ఉద్దేశం అవసరం. అయితే జీవితంలో చాలా పెద్దవిగా కనిపించే మరెన్నో సందర్భాలు కూడా వస్తాయి. నిజానికి అలాంటివి వేల సంఖ్యలో ఉంటాయి. కానీ వాటిలో చాలా తక్కువ మాత్రమే మీ జీవితాన్ని మార్చగలవు. కళాశాల పూర్తయ్యాక వచ్చే మొదటి ఉద్యోగం, తర్వాత మీరు వెళ్లే నగరం, లేదా ఒక రోడ్ ట్రిప్కు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం – ఇవన్నీ మీ జీవిత ప్రయా ణానికి కొత్త అనుభవాలను జోడిస్తాయి. కానీ సాధారణంగా ఇవి మీ జీవిత దిశను నిర్ణయించవు. కాబట్టి ముఖ్యమైన విషయాలను, అనవసరమైన శబ్దం నుంచి వేరు చేసి గుర్తించగలిగితే, మీరు కోరు కున్న దిశగా మీ జీవితాన్ని మలుచుకోగలుగుతారు. అందుకే ఈ రోజు నా జీవితంలో నేను అనుసరించిన మూడు సులభమైన సూత్రాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.1. ఆశావాదాన్ని ఎంచుకోండి!నేను చెప్పబోయే మొదటి సూత్రం – ఆశావాదాన్ని ఎంచు కోవడం. ప్రతిరోజూ వార్తలు చూస్తే మనం కఠినమైన కాలంలో జీవిస్తున్నామనిపిస్తుంది. కానీ ప్రతి తరం తమదైన సవాళ్లను ఎదుర్కొంది. మనం ఏ ప్రపంచంలో పట్టభద్రులమవుతామో ఎంచు కోలేము. కానీ ఆ పరిస్థితులను ఎలా చూడాలో మాత్రం మనమే నిర్ణయించగలం.నేను చెన్నై నగరంలో పెరిగాను. తీవ్రమైన కరువులు వచ్చేవి. నీటి ట్యాంకర్లు సమయానికి వస్తాయో లేదో అని ఎదురుచూసే వాళ్లం. టెలిఫోన్, టెలివిజన్, ఫ్రిజ్ వంటి వస్తువులు పొందడానికి సంవత్సరాలు పట్టింది. అయితే నా తల్లిదండ్రులు ఎప్పుడూ నా కల లను పరిమితం చేయనివ్వలేదు. అందుకే ఒకరోజు సిలికాన్ వ్యాలీలో పని చేయాలనే కలను నేను కనగలిగాను. స్టాన్ఫోర్డ్లో అడ్మిషన్ వచ్చినప్పుడు, అమెరికాకు పంపేందుకు నా తండ్రి దాదాపు ఏడాది జీతానికి సమానమైన డబ్బును విమాన టికెట్ కోసం ఖర్చు చేశారు. కాలిఫోర్నియాకు చేరుకున్న తర్వాత, విమానాశ్రయం నుంచి వస్తూ రహదారి పక్కన ఉన్న కొండలను చూసి, ‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇవి గోధుమ రంగులో ఉన్నాయి’ అన్నాను. అప్పుడు నా ఆతిథ్య కుటుంబంలోని జేన్ ఎర్ల్ అనే మహిళ చిరునవ్వుతో, ‘‘మేము వాటిని గోధుమ రంగు కొండలు అని కాదు, బంగారు కొండలు అని పిలుస్తాం’’ అన్నారు. అదే ఆశావాదం అంటే. నేను గోధుమ రంగును చూశాను; ఆమె బంగారు రంగును చూసింది. దృక్పథంలో వచ్చిన ఈ చిన్న మార్పు నా జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. స్టాన్ ఫోర్డ్లో నేను పీహెచ్డీ పూర్తి చేసి అధ్యా పక వృత్తిలోకి వెళ్లాలని అనుకున్నాను. కానీ పరిస్థితులు మారాయి. త్వరగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. నా డాక్టరేట్ కార్యక్రమాన్ని వదిలి మాస్టర్స్ డిగ్రీతోనే బయటకు రావాల్సి వచ్చింది. దాన్ని నేను ఒక కల ముగిసినట్లుగా భావించవచ్చు. కానీ ఆ ‘గోధుమ కొండ’ను ‘బంగారు కొండ’గా చూడటం నేర్చుకున్నాను. 2. కష్టమైన పనులను ఎంచుకోండి!స్టాన్ ఫోర్డ్ వదిలిన తర్వాత నేను వెంటనే విజయాన్ని సాధించా నని చెప్పాలనుకుంటున్నాను. కానీ అది నిజం కాదు. స్టాన్ ఫోర్డ్ పూర్తి చేసిన దాదాపు పదేళ్ల తర్వాత కూడా నేను సరైన దారిలో ఉన్నానా అనే సందేహం ఉండేది. అలాంటి సమయంలో నేను గూగుల్కు దరఖాస్తు చేసుకున్నాను. 2004, ఏప్రిల్ 1న నా చివరి ఇంటర్వ్యూ జరిగింది. అదే రోజు జీమెయిల్ ప్రారంభమైంది. ఇంటర్వ్యూలో వారు జీమెయిల్ గురించి అడిగినప్పుడు అది నిజమైన ఉత్పత్తో, సరదా జోకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికీ 1 జీబీ ఉచిత స్టోరేజ్ ఇవ్వడం అసాధ్యమైన ఆలోచనగా అనిపించేది.కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కూడా అసాధ్యంగా కనిపించిన ఒక సమస్యపై పని చేసే అవకాశం వచ్చింది. అదే గూగుల్ క్రోమ్. మేము బ్రౌజర్ను మరింత వేగంగా రూపొందించవచ్చని భావించాం. కానీ చాలామంది అది కష్టమన్నారు. వందలాది ఇంజి నీర్లు అవసరమన్నారు. మా దగ్గర కేవలం పది మందే ఉన్నారు. 2008లో మేము క్రోమ్ను ప్రారంభించాం. మొదటి 24 గంటల్లో 80 లక్షల మంది ఉపయోగించారు. కానీ కొంతకాలానికి వృద్ధి ఆగిపోయింది. ఏడాది తర్వాతా మార్కెట్లో మా వాటా 2 శాతమే. మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ క్రోమ్ను ఎగతాళి చేస్తూ ‘‘ఇది లెక్కలోకి కూడా రాని చిన్న విషయం’’ అన్నారు. మేము నిరుత్సాహపడలేదు. ప్రతి ఆరు వారాలకు కొత్త వెర్షన్ విడుదల చేశాం. ఇతర కంపెనీలు ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి మాత్రమే విడుదల చేసేవి. క్రమంగా విజయం మా వైపు వచ్చింది.3. ఉత్సాహాన్ని కలిగించే పనిని చేయండి!1993లో స్టాన్ ఫోర్డ్లోని కంప్యూటర్ ల్యాబ్లోకి వెళ్లినప్పుడు, ఎప్పుడైనా ఉపయోగించగలిగే కంప్యూటర్ల వరుసలను చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు ఇంటర్నెట్ ప్రపంచం రూపుదిద్దుకుంటోంది. అది మానవ అభివృద్ధికి గొప్ప సాధనంగా మారుతుందని నేను గుర్తించాను. ఎక్కువ మందికి ఈ సాంకేతికతను అందించడంలో భాగస్వామి కావాలనే ఆలోచనే నన్ను ఉత్సాహపరిచింది. అందుకే నేను గూగుల్లో చేరాను. అందుకే క్రోమ్బుక్స్, ఆండ్రా యిడ్ వంటి ప్రాజెక్టులపై పనిచేశాను. అందుకే మీ జీవిత మార్గాన్ని ఎంచుకునేటప్పుడు: మీ తల్లిదండ్రులు కోరుకునేదాన్ని మాత్రమే చూడకండి. మీ స్నేహితులందరూ చేస్తున్నదాన్ని అనుసరించకండి. దానికి బదులుగా, రాత్రి పొద్దు పోయే వరకు మీ స్నేహితులతో ఉత్సాహంగా మాట్లాడేలా చేసే విష యాలను గుర్తించండి. వెళ్లి అదే పని చేయండి. -
మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ
మనసు విప్పుకోవటం అన్నది ఒక లెక్క ప్రకారం జరిగేది కాదు. లెక్క ప్రకారం జరిగిందీ అంటే, అది మనసు విప్పుకోవటం అవదు, కప్పుకోవటం అవుతుంది. నచ్చిన దుస్తులు ఒంటికి వేసుకున్నట్లే, నప్పని బట్టలు మనసుకు తొడుక్కోవటం అవుతుంది. ఆ పని నేను ఎప్పటికీ చేయలేను. అందమైన చేనేతలు, ప్రకాశవంతమైన రంగులు నాకు నచ్చుతాయి. నా పెళ్లికి నేను లేత గులాబీ రంగు జరీ పట్టు చీరను ఎంచు కున్నాను. పెళ్లి రిసెప్షన్కి, లోక్సభలో నాపై నేర విచారణకు బ్రైట్ రెడ్; పార్లమెంటు సమావేశాలకు బ్రైట్ బ్లూ; పార్లమెంట్లో డిబేట్ కోసం ముదురు గులాబీ, ఆకుపచ్చ రంగులు; ఫుట్ బాల్ ఆడేటప్పుడు షూజ్ మీదికి ఎనర్జిటిక్ ఆరెంజ్ శారీ; హార్పర్స్ బజార్ మ్యాగజైన్ ముఖ చిత్రానికి మెజెంటా కలిసిన ఇండిగో హాండ్లూమ్ పట్టు చీర.ఇక నా మొదటి పెళ్లిలో నేను ఏ రంగు చీరను కట్టుకున్నానో గుర్తు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అది వెలిసిపోయిన వివాహం. మొన్నటి బీబీసీ ‘టాక్ షో’కి తెల్లంచు ముదురు నారింజ రంగు చీరతో వెళ్లాను. ఎన్నికల్లో తృణమూల్ ఓటమి, పార్టీలో తీవ్ర సంక్షోభం, దీదీకి వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాట్లు, బీజేపీకి మద్దతు ఇవ్వటం... వీటి గురించే కదా ‘టాక్ షో’లో అడుగుతారు. మనసుకు దుస్తులు తొడిగే అలవాటు లేనప్పుడు, ఉన్నది ఉన్నట్లే లోపల్నుంచి వచ్చేస్తుంది. మంచీ వస్తుంది, చెడూ వస్తుంది. మంచీ చెడుల మధ్య గుర్తొచ్చినవీ కొన్ని బయటికి వచ్చేస్తాయి. సువేందు గురించి కూడా నా మనసులో ఉన్నది ఉన్నట్లే మాట్లాడాను. తృణమూల్ నుంచి బీజేపీలోకి వెళ్లి, పశ్చిమ బెంగాల్కు సీఎం అయ్యారు సువేందు. తృణమూల్లో ఆయన మొదట్నుంచీ ఉన్నారు. తృణమూల్లో నేను చేరినప్పటి నుంచీ నాతో ఉన్నారు.నాతో అంటే... నా నిరాశలో,నా నిస్పృహలో, నా దుఃఖంలో,నా అయోమయంలో నా వెంట ఉన్నారు. ‘‘రాజకీయాలు యూఎస్లోని మౌంట్ హోలియోక్ కాలేజీ నుండి అర్థ, గణిత శాస్త్రాలలో డిగ్రీ పట్టా పొందటంలా ఉండవు మొయిత్రా..’’ అనేవారు.‘‘జేపీ మోర్గాన్ చేజ్’లో సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఉంటూ, వారి లండన్ కార్యాలయంలో వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎదగటం లానూ ఉండవు..’’ అని నవ్వేవారు. 2014లో నాకు లోక్సభ టికెట్ రావాల్సింది. రాలేదు! సువేందు నన్ను ఓదార్చారు. నాకు ధైర్యం చెప్పారు. ఆయన తప్ప ఎవరూ నా కంటతడిని చూడలేదు! 2016లో తొలిసారి నేను అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు నన్నంతా ఒంటరిని చేశారు. నా కోసం ప్రచారం చేయటానికైనా ఎవరూ రాలేదు.సువేందు ఒక్కరే నా పక్కన నిలబడ్డారు. నా తొలి ర్యాలీలో నాకు బదులుగా ఆయనే ప్రసంగించారు. వేదికపైన సువేందు, నేను మాత్రమే ఉన్నాం. ఈరోజుకీ ఆ ఫొటోలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. టాక్ షోలో కూడా ఇదే మాట చెప్పాను. ‘‘అయితే మీరూ సువేందులానో, మొన్నటి 20 మంది ఎంపీల్లానో త్వరలోనే తృణమూల్ని వదిలి వెళ్లబోతున్నారా?’’ అని పార్టీ లోపల, పార్టీ బయట నాపై సందేహాల సంధింపులు! పార్టీ లోపల ఉండి విధ్వంసం సృష్టించే నాయకుల కంటే, పార్టీని వీడిపోయి పార్టీపై బయటి నుండి పోరాటం చేసే నాయకుడిని నేను గౌరవిస్తాను. సువేందు పార్టీని వదిలి వెళ్లాక ఒక్కసారి కూడా నాకై నేను ఆయన్ని కలవలేదు. ఒక్కసారి కూడా నాకై నేను ఆయనతో మాట్లాడలేదు. టాక్ షోలో గత స్నేహాన్ని గుర్తు చేసుకున్నానంతే. గుర్తు చేసుకున్నంత మాత్రాన ఆయన పుణ్యాత్ముడని కాదు. గుర్తు చేసుకున్నందుకు నేనేమీ పాపాత్మురాలినైపోను. -
సవాళ్లు ఉన్నా సందర్భోచితమే!
ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐ.ఎం.ఇ.సి.– ఐమెక్) పథకం ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. భారత విధాన రూపకర్తలకు ఐమెక్ను ముందుకు తీసుకు వెళ్లటం పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ యుద్ధం ఒక వైపు ఐమెక్ పథకం బలహీనతలను బహిర్గతం చేస్తూనే దాని అవసరాన్నీ నొక్కి చెప్పింది. 2023 ఢిల్లీ జీ–20 సదస్సులో భారత్ ప్రతిపాదించిన ఐమెక్ ప్రతిపాదనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ యూనియన్లు అంగీకరించాయి. భారత్ను మధ్యప్రాచ్యం – ఇజ్రాయెల్ గుండా యూరప్తో అనుసంధానానికి ఉద్దేశించిన ఈ 4,800 కి.మీ. రవాణా కారిడార్ ఆసియా, పర్షియన్ గల్ఫ్, ఐరోపాల ఆర్థిక వ్యవస్థలను సమీకృతం చేస్తుంది. ఆసియా ఖండపు వినిమయ మార్కెట్లను, గల్ఫ్ చమురు– గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలను ఐరోపా పారిశ్రామిక ప్రాంతాలలో సముద్ర, భూతల మార్గాల ద్వారా అనుసంధానించే విశిష్టమైన పథకం ఐమెక్. ఈ మూడు ప్రాంతాల అనుసంధానంలో ప్రస్తుతం మూడు చిక్కుముడి ప్రాంతాలు (చోక్ పాయింట్లు) ఉన్నాయి. అవి హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్ జలసంధులు. ఈ మూడు జలసంధులను పక్కన పెట్టే సురక్షితమైన రవాణా మార్గమే ఐమెక్.విస్తృత వాణిజ్యానికి కీలకంఐమెక్ రవాణా కారిడార్లో తూర్పుభాగం భారత పశ్చిమ తీరాన్ని పర్షియన్ సింధుశాఖలో కలిపే సముద్ర మార్గం. భారత్లోని ముంబై–ముంద్ర–కాండ్లా రేవు పట్టణాలను యూఏఈకి చెందిన జెబెల్ అలీ, ఫుజేరా, సౌదీకి చెందిన డమ్మామ్, జెడ్డాలతో కలుపు తుంది. ఐమెక్ ఉత్తర కారిడార్ పర్షియా సింధుశాఖను ఐరోపాతో రైలు మార్గాల ద్వారా కలుపుతుంది. యూఏఈ, సౌదీ, జోర్డాన్లను రైలు మార్గాల ద్వారా ఇజ్రాయెల్లోని హైఫా రేవు పట్టణానికి కలుపుతారు. హైఫా నుండి ఎర్ర సముద్రం గుండా గ్రీస్లోని పిరేస్, ఫ్రాన్స్లోని మార్సెల్లి, ఇటలీలోని మెస్సీనాలకు కలుపుతూ ఐరోపాకు సరకుల రవాణా జరుగుతుంది. ఐమెక్లో భాగంగా హరిత ఇంధనాలైన హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి, విద్యుత్ గ్రిడ్ల అనుసంధానం కూడా జరుగుతుంది. సముద్ర, భూతల మార్గాల ద్వారా అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల నిర్మాణం, విస్తృత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఐమెక్ పూర్తి స్థాయిలో అమలు జరిగితే భారత్– ఐరోపాల మధ్య రవాణా కాలం 40 శాతం, రవాణా వ్యయం 30 శాతం తగ్గిపోతాయి. రవాణా అనిశ్చితి కూడా తొలగిపోతుంది. భారత్–ఐరోపా యూనియన్ల మధ్య 2026 జనవరిలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన 40–65 శాతం వాణిజ్యం పెరుగు తుందని అంచనా. భారత్–యూఏఈ, సౌదీ, ఖతర్, ఒమన్ల మధ్య వాణిజ్యానికీ కూడా ఐమెక్ కీలకం.వ్యూహాత్మకంగానూ ముఖ్యమే!ఆసియా–పర్షియన్ సింధుశాఖ ప్రాంతంలో చైనాను నిలువరించటానికి ఐమెక్ ఉపయోగపడుతుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ద్వారా ఆసియా–గల్ఫ్ ప్రాంతంలో చైనా బలపడుతున్నది. ఒక రకంగా ఐమెక్ను బీఆర్ఐకు పోటీగా చెప్పు కోవచ్చు. వ్యూహాత్మక అంశాల దృష్ట్యా యూఎస్ఏ ఐమెక్కు మద్దతు పలికింది. ఇజ్రాయెల్ను ఇతర గల్ఫ్ దేశాలతో సంఘటితం చేయా లనేది అమెరికా లక్ష్యం. అబ్రహాం ఒప్పందం ద్వారా యూఏఈ, ఖతర్, ఒమన్లను ఇజ్రాయెల్కు కొంతవరకు దగ్గరకు తేగలిగింది. ప్రస్తుతం భూతల మార్గం ద్వారా భారత్ నుండి ఐరోపా వెళ్లాలంటే పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ల గుండా ప్రయాణించాలి. ఒక రకంగా భారత్–ఐరోపా భూతల రవాణాపై పాకిస్తాన్కు వీటో ఉన్నది. ఐమెక్ ద్వారా పాక్ వీటోను తొలగించినట్లవుతుంది. చైనా–పాక్–ఎకనమిక్ కారిడార్ (సిపెక్)లో భాగంగా పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో రోడ్డు, రైలు మార్గాలను, రేవు పట్టణాలను చైనా అభివృద్ధి చేస్తున్నది. పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రంలోనికి చైనా ప్రవేశిస్తున్నది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి ఐమెక్ తోడ్పడుతుంది. సూయజ్, బాబెల్ మాండెబ్లను పక్కకు పెట్టడం వలన భారత్–ఐరోపా వాణిజ్యంలో అస్థిరత, అనిశ్చితి తొలగి పోతాయి. పాకిస్తాన్కు వంత పాడుతున్న టర్కీకి కూడా ఐమెక్ ద్వారా చెక్ పెట్టినట్లవుతుంది. ఐమెక్ ద్వారా ఐరోపాకు శక్తి భద్రత ఏర్పడటంతో పాటు భారత్తో వాణిజ్యం విస్తృతమవుతుంది. గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యీకరించటానికి ఐమెక్ ఉపయో గపడుతుంది. ఐమెక్కు కేంద్రకంగా ఉన్న ఇజ్రాయెల్కు ప్రాంతీయ స్థిరత్వం, భద్రత ఏర్పడతాయి.ప్రతికూలతలు బహిర్గతంసంక్షుభిత ప్రాంతాలైన సూయజ్, బాబెల్ మాండెబ్లకు దూరంగా ప్రతిపాదించబడిన ‘ఐమెక్ ప్రశాంత కారిడార్’యుద్ధంలో చిక్కుకున్నది. ఫుజెరా, జెబెల్ అలీ రేవు పట్టణాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతర్ గ్యాస్ క్షేత్రాలు కూడా దాడులకు గురయ్యాయి. ఐమెక్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయటం మూడు కీలక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అవి 1. సౌదీ–ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ. 2. జెబెల్ అలీ, ఫుజెరా (ఎమిరేట్స్) రేవు పట్టణాల భద్రత. 3. పెట్టుబడులు. ఇరాన్ యుద్ధం ఈ మూడు అంశాల ప్రతికూలతలను బహిర్గతం చేసింది. అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికి మొదటినుండీ సౌదీ రాజు విముఖత చూపుతున్నాడు. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం వలన నౌకల బీమా ఛార్జీలు అమాంతం పెరిగాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ మదుపరులు ముందుకు రావటం కష్టం. అయితే, హార్మూజ్ దిగ్బంధనం, అంతకు ముందు బాబెల్ మాండెబ్ను హౌతీలు మూసివేస్తామని బెదిరించడం ఒక రకంగా ఈ ఇరుకైన సముద్ర మార్గాలకు ప్రత్యామ్నా యంగా రవాణా వ్యవస్థల అభివృద్ధి ఆవశ్యకతను గుర్తు చేసింది. 2023లో ఐమెక్ ఒప్పందం సమయంలో కంటే 2026లో దాని ఆవశ్యకత మరింత పెరిగిందనే చెప్పాలి. హార్మూజ్ ద్వారా రవాణాకు భవిష్యత్తులో కూడా అమెరికాతో సహా ఎవరూ భరోసా ఇవ్వలేరు. గల్ఫ్ ప్రాంత భూతల మార్గాల ద్వారా ఆసియాను ఐరోపాతో అనుసంధానించటమే శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయం. శాంతియుత జియో పొలిటికల్ వాతావరణంలో ప్రతిపాదించ బడిన ఐమెక్ పథకాన్ని అశాంతి, ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణపు అనిశ్చిత వాస్తవాల నేపథ్యంలో సవరించాల్సిన అవసరం గోచరి స్తున్నది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధికి సమీపంలోని ఎమిరే ట్స్కు చెందిన ఫుజేరాకు బదులుగా ఒమన్కు చెందిన సలాలా, దుఖమ్, సోహర్ రేవు పట్టణాలను భారత్ పశ్చిమ తీరంతో అనుసంధానించాలి. ఈ పథకాన్ని రవాణా, ఎనర్జీ, డిజిటల్ కారిడార్లుగా విభజించి వేటికవే అమలు పరచటం వాంఛనీయం. ఇబ్బందులు, అడ్డంకులతో కూడిన రవాణా కారిడార్ నిర్మాణాన్ని రెండవ దశలో చేపట్టవచ్చు. మొదటి దశలో ఎనర్జీ, డిజిటల్ కారిడార్లను అమలు పరిచి సైద్ధాంతికంగా పథకం అమలు సాధ్యాన్ని నిరూపించవచ్చు. ఇంతవరకు వివిధ దేశాలు ప్రత్యేక ఒప్పందాల ద్వారా పథకాన్ని అమలు పరుస్తున్నాయి. కానీ ఒక కేంద్రీయ సెక్రటేరియట్ను ఏర్పాటు చేసి సభ్య దేశాల మధ్య సమన్వయం సాధించాలి. ఇజ్రా యెల్తో ముడిపడిన క్లిష్టమైన అంశాలను పక్కకుపెట్టి భారత్–గల్ఫ్ అనుసంధానంపై దృష్టి పెట్టాలి. భారత్ వ్యూహాత్మక, ఆర్థిక, శక్తి భద్రతలకు ఐమెక్ పథకం అమలు అత్యంత ఆవశ్యకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
అసమానతలు లేనిదే అసలైన అభివృద్ధి
దేశంలో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలు మొదలైన తర్వాత మార్కెట్లు మెరుగయ్యాయి. పెట్టుబడుల సమీకరణలో రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది. స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో పురోగతి కనిపించింది. అయితే అదే సమయంలో ఈ అభివృద్ధి సమాజంలో అంద రికీ సమానంగా అందుతోందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది! మార్కెట్ శక్తుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్లిన తర్వాత రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అనేక వ్యత్యాసాలు కనిపించటమే ఆ ప్రశ్నకు కారణం. ఆధునిక సాంకేతికత, రహదారులు, విద్యుత్తు, భవనాల వంటి మౌలిక వసతులు ఉన్న కొన్ని రాష్ట్రాలు మాత్రమే విదేశీ, స్వదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షించగలిగాయి. అక్కడ పరిశ్రమలు,ఐటీ వంటి సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందటం వల్ల ఆ కొన్ని రాష్ట్రాలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ప్రధాన ఇంజన్లుగా మారిపోయాయి. మిగిలినవి వెనుకబడి పోతున్నాయి.సంపన్న రాష్ట్రాలకే పెట్టుబడులుదేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందటం (ప్రాంతీయ సమతౌల్యం) అనేది ఒకప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, పారిశ్రామిక కారిడార్ల వల్ల కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందాయి. దాంతో అభివృద్ధి అన్నది కొన్ని రాష్ట్రాలకే పరిమితమైపోయింది. ఉదా: తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో నగరీకరణ విస్తృతమవటం, మెరుగైన వసతులు ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు సమృద్ధిగా సమకూరుతున్నాయి. గుజరాత్లో రేవులు, మహారాష్ట్రలో రవాణా వ్యవస్థలు, తమిళనాడులో ఫ్యాక్ట రీలు, కర్ణాటకలో ఐటీ పార్కులు, ఢిల్లీలో భారీగా రిటైల్ వ్యాపారాలు ఉండటంతో ఆయా రాష్ట్రాలు అభివృద్ధి పోటీలో ముందుంటు న్నాయి. ఈ పోటీ వల్ల కేవలం ఆర్థికంగా ఎదగటమే ప్రధానం అయింది కానీ, సమాజంలో అందరికీ సమాన న్యాయం జరగడం లేదు. ఎక్కువ సంపాదన ఉన్న రాష్ట్రాల్లో కూడా ధనిక, పేద అసమా నతలు పెరిగిపోతున్నాయి. ఈ వృద్ధి ఫలాలు అందరికీ సమంగా అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థికంగానే కాకుండా అక్షరాస్యత, ఉన్నత విద్య, ఆసుపత్రుల అందుబాటు, పౌష్టికాహారం వంటి విషయాల్లో కూడా రాష్ట్రాల మధ్య అసమానతలు బాగా పెరిగిపోయాయి. నగరాలు, కర్మాగా రాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అవకాశాలు పెరగడంతో, వెనుక బడిన రాష్ట్రాల నుండి ప్రజలు అక్కడికి వలస వెళుతున్నారు. నైపుణ్యం ఉన్న శ్రామికులు, ఎక్కువ డబ్బు ‘ఇవ్వగల’ రాష్ట్రాలకే వెళ్తుండటంతో మిగతా ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోతున్నాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి.ఎల్.ఎఫ్.ఎస్.) ప్రకారం 2017–2018 నుండి 2023–2024 మధ్యకాలంలో దేశంలో ధనిక, పేద ప్రజల మధ్య ఆదాయ అసమానతలు బాగా పెరిగాయి. ‘జినీ ఇండెక్స్’ సూచీని అనుసరించి హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ఆదాయ అసమా నతలు మిజోరాం, బిహార్, మణిపుర్, గోవాలలో నమోదయ్యాయి. విద్య, పరిశ్రమలు, రోడ్ల వంటి సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల 2025లో బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్లో పేదరికం ఎక్కు వగా ఉంది. అదే సమయంలో మంచి వసతులు, విద్యాలయాలు, నగరాలు ఎక్కువగా ఉండటం వల్ల కేరళ, గోవా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లలో పేదరికం స్థాయి తక్కువగా ఉంది. ‘సంపాదన’ ఉన్నా... తప్పని నిరుద్యోగంవ్యాపారాలు, సంపాదన బాగున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పేదరికాన్ని తగ్గించగలిగాయి కానీ, నిరుద్యోగాన్ని మాత్రం ఆపలేకపోయాయి. 2025–26 మొదటి అర్ధభాగంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ వంటి చోట్ల నిరుద్యోగం ఎక్కువగా ఉంటే; గుజరాత్, జార్ఖండ్, కేరళ యూపీ వంటి రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. కేరళ, హరియాణా రాష్ట్రాల్లో ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు బాగున్నా అక్కడ కూడా నిరుద్యోగం ఎక్కువే ఉంది. ఇక ఆసుపత్రులు, ఆరోగ్య వసతులకు గుర్తింపుగా చూసే ‘శిశు మరణాల రేటు’ (పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో చనిపోయే వారి సంఖ్య) ఛత్తీస్గఢ్లో 36, ఉత్తరప్రదేశ్లో 35, మధ్యప్రదేశ్లో 35 గా ఉంది. అదే, కేరళలో కేవలం 8, తమిళనాడు, ఢిల్లీలలో 11 గా ఉండి ఆ రాష్ట్రాలు మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఇక ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం విషయానికి వస్తే, పి.ఎల్.ఎఫ్.ఎస్. 2023–24 ప్రకారం జాతీయ స్థాయిలో పురుషులు 76.3 శాతం మంది పని చేస్తుంటే, మహిళలు కేవలం 40.3 శాతం మందే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రేటు ఢిల్లీ, పంజాబ్, యూపీలలో మరీ తక్కువగా ఉంది. చదువు విషయా నికొస్తే మాత్రం కాలేజీల్లో చేరే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య దాదాపు సమానంగా ఉండి, చదువుల్లో అసమానతలు తగ్గినప్పటికీ, మధ్యలోనే స్కూళ్లు కాలేజీలు మానేస్తున్న వారి సంఖ్య పెరగడం దేశానికి పెద్ద సవాలుగా మారింది. సహకారంతోనే సమ్మిళిత వృద్ధిమార్కెట్ ఆధారిత వ్యవస్థల వల్ల ఆర్థిక వృద్ధి రేటు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు సమాజానికి అవసరమైన విద్య, వైద్యం వంటి వాటిపై తగినంతగా ఖర్చు పెట్టకపోవడం వల్ల మానవాభివృద్ధి వెనుకబడిపోతోంది. కనుక, ప్రభుత్వాలు కేవలం ఆర్జన పెంచడం పైనే కాకుండా అందరికీ ఉద్యోగాలు, సమాన అవకాశాలు కల్పించి వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, గ్రామాలను అభివృద్ధి చేయడం, రోడ్లు–రవాణా వసతులు పెంచడం, ప్రజలకు కొత్త నైపుణ్యాలు నేర్పించడం ద్వారానే అందరికీ సమానమైన వృద్ధి (సమ్మిళిత వృద్ధి) సాధ్యమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి, ప్రజల చదువు, వైద్యంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడే రాష్ట్రాల మధ్య ఉండే పోటీతత్వం దేశం మొత్తానికి సమానమైన అభివృద్ధిని తెచ్చిపెడుతుంది. డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు -
ఆరోగ్యమే కాదు... హక్కు కూడా!
కాలిబాటలపై నడవడాన్ని పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది. ఇదొక మైలురాయి లాంటిది. ప్రాథమిక హక్కులలో ఇప్పటికే ఉన్న, జీవించడానికీ, సంచరించడానికీ ఉన్న హక్కు పరిధిలోకి దాన్ని తెచ్చారు. రోడ్డంటూ ఉంటే నడిచేవారికి ప్రత్యేకించిన బాట చూపడాన్ని ఒక విధిగా కోర్టు పేర్కొంది. దాన్ని పట్టణాభివృద్ధి సంస్థల, పురపాలక సంస్థల, పంచాయతీల బాధ్యతగా చెప్పింది. బహుశా, పాదచారుల హక్కులకు సంబంధించి ఓ భారతీయ కోర్టు ఇలా నిర్ద్వద్వంగా పేర్కొన్న తీర్పు ఇదే.దీన్ని కోర్టు నుంచి సకాలంలో వచ్చిన ఆదేశంగా భావించాలి. ప్రభుత్వాల విధానాలన్నీ పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చుట్టూ తిరుగుతున్నాయి. వాటి దృష్టంతా హైవేలు, ఫ్లైవోవర్లు, సబ్వేల వంటివాటిపైనే ఉంది. మోటారు వాహనాల్లో వెళ్ళేందుకు వీలైన మౌలిక వసతిని కల్పించడమే అభివృద్ధికి చిహ్నంగా చిత్రిస్తున్నారు. భారతీయ నగరాల్లో ఇపుడున్న కాలి బాటలు హాయిగా నడిచేందుకు అనుకూలమైనవిగా లేవు, సురక్షితమైనవి కావు. అసలు వాటి డిజైనే సరిగ్గా లేదు. వివిధ ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజ సంఘాలు దేశంలోని పెక్కు పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సర్వేలలో తేలిన అంశమిది. కాలిబాటల దయనీయ స్థితికి ప్రభుత్వ విధానాలనే తప్పు పట్టాలి. ‘మన నగరాలు, అన్ని ప్రణాళికల్లో ప్రజలనే కేంద్ర బిందువుగా చేసుకుంటున్నాం’ అంటూ 2006లో చేపట్టిన జాతీయ పట్టణ రవాణా విధానం గొప్పగా చెప్పుకొంది. ఆచరణలో తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలు దానికి విరుద్ధంగా ఉంటున్నాయి. కార్లు, స్కూటర్లు వంటివాటికి రోడ్డులో ఎక్కువ చోటు కేటాయించాలనే డిమాండ్ను తీర్చడంపైనే విధానాల దృష్టి కొనసాగుతోంది. రోడ్డంతా వాహనాలకేనా?నిర్దిష్ట విధానాలంటూ లేకపోవడం వల్ల కాలిబాటలను ప్రత్యే కించి పట్టించుకునే ఏజెన్సీలు గానీ, కాలిబాటల వసతులకు బడ్జెట్ కేటాయింపులుగానీ ఉండడం లేదు. రోడ్లను నిర్మించే రోడ్లు, వంతెనల శాఖ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు కాలిబాటలను నిర్మించి, నిర్వహించే బాధ్యత నగర పాలక సంస్థలదేనని భావిస్తున్నాయి. రోడ్ల శాఖే వాటిని పట్టించుకోవాలని స్థానిక పాలనా సంస్థలు భావిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో రవాణాలో బహుళ సంస్థల భాగ స్వామ్యం ఉంటోంది. అవి ఒకదానినొకటి నిందించుకుంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక నగర విస్తృత ప్రణాళికలు పెట్టుబడులు భారీగా అవసరమైన ప్రణాళికలను సూచిస్తూ, కాలినడక అవసరాలను తరచు గాలికొదిలేస్తున్నాయి. ఒకవేళ, కేటాయింపులు జరిగినా ఆ నిధులను సరిగ్గా డిజైన్ చేయని, ఆకర్షణీయంగా మాత్రం కనిపించే ఓవర్హెడ్ క్రాసింగ్ లేదా ఫుట్–ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ఎక్కడైనా పాదచారుల మౌలికవసతిని అభివృద్ధి చేసినా అది కూడా కార్లు లేదా టూవీలర్ల వాడకందారులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినదే అయివుంటోంది. మోటారు వాహనాలు వెళ్ళే దారిలోనే లాంగ్ రూట్ తీసుకోవాల్సిన, రోడ్ల పొడుగూతా ఆనుకునే కాలిబాటలు ఉండాల్సిన పని లేదు. ఒకదానినొకటి ఆనుకుని ఉన్న రెండు ప్రాంతాలను కలిపేందుకు వాకర్లు వాహనాలు వెళ్ళే రూటునే అనుస రించవలసిన పని లేకుండా చిన్న కాలిబాటలకు డిజైన్ చేయవచ్చు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే సాధనంసుప్రీంకోర్టు నిర్వచించిన విధంగా కాలినడక పౌరుల ప్రాథ మిక హక్కు మాత్రమే కాదు. అది మనిషికి, భూగోళానికి ఉభయ తారకమైనది. మధుమేహం, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, గుండె పోట్లు, క్యాన్సర్ల వంటివి ఒకరినుంచి ఒకరికి సంక్రమించేవికావు. ఈ రుగ్మతలకు దారితీసే ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్లలో శారీరక శ్రమ లేకపోవడం, ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి వంటివి కూడా ఒకటని గుర్తించారు. సైకిల్ తొక్కడంతోపాటు, 20 నుంచి 30 నిమి షాల సేపు వేగంగా నడవడం శరీరాన్ని చురుకుగా ఉంచే ఉత్తమ మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ 2030 కల్లా సాధించి తీరాలని పెట్టుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో చాలా వాటిని సాధించేందుకు కూడా నడకను ప్రోత్స హించే విధానాలు తోడ్పడతాయి. కాలిబాటలను మెరుగుపరచి, నడక వసతులను కల్పిస్తే ప్రజా రోగ్యం మెరుగుపడడమే కాకుండా, పౌరుల ధనం ఆదా అవుతుంది. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గించేందుకు ఇదొక తక్కువ ఖర్చుతో కూడిన మార్గంగా ఉపయోగపడుతుంది. నడకకు తగినంత సురక్షిత సదుపాయాన్ని కల్పిస్తే ప్రజా రవాణా సదుపాయాన్ని వినియోగించుకునే ఎవరైనా సరే రోజులో కనీసం నాలుగు సార్ల యినా నడవవలసి వస్తుంది. చెన్నైలో ఫుట్పాత్లను మెరుగు పరచడం వల్ల ఏటా 4,200 టన్నుల కార్బన్ డయాక్సైడ్, దానితో సమానమైన 12,000 టన్నుల గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించగలిగినట్లు ఒక అధ్యయనంలో తేలింది. సుమారుగా 1,000 నుంచి 2,900 కార్లు ఒక ఏడాదిపాటు రోడ్డుపైకి రాకుండా ఉంటే ఎంత సత్ఫలితం ఒనగూడుతుందో దానివల్ల కూడా అంతే సమానమైన ప్రయోజనం చేకూరినట్లు వెల్లడైంది. మూడు జోన్లుఫుట్పాత్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా, వాటిని ఆక్రమించు కుని ఉండే చిన్న తరహా విక్రేతల సమస్య కూడా అనివార్యంగా తొంగిచూస్తుంది. ప్రభుత్వంతోపాటు, సుప్రీంకోర్టు కూడా గతంలో ఈ సమస్యపై దృష్టి సారించకపోలేదు. సక్రమంగా నియంత్రిస్తే, పాదచారులతోపాటు చిన్న వ్యాపారులు కూడా పుట్పాత్లను వాడు కునే వీలుందని కోర్టు గతంలో వ్యాఖ్యానించింది. ఈ విక్రేతలు కూరగాయలు, పండ్లు, దైనందిన జీవితానికి అవసరమైన చిన్నచితక వస్తువులను అందుబాటులో ఉంచుతారు. పాదచారులు పనిమీద బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు వాటిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. పట్టణ వీధి వ్యాపారుల జాతీయ విధానం– 2004, 2009 మూడు జోన్ల సృష్టిని ప్రతిపాదించింది. ఆంక్షలు లేకుండా విక్రయాలు జరుపుకునే ప్రదేశాలు, కొన్ని ఆంక్షలకు పరిమితమైన విక్రయ ప్రదేశాలు, విక్రయాలకు అవకాశం లేని ప్రదేశాలు. వాహనాల రద్దీ, డిమాండ్ తీరుతెన్నులు వంటి అంశాలను ఆయా జోన్ల సృష్టిలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. చిన్నచితక విక్రేతలే కాకుండా, కొందరు దుకాణదారులు కూడా తమ దుకాణాలను పుట్పాత్ పైదాకా విస్తరించడం సాధార ణంగా కనిపించే దృశ్యం. రెసిడెన్షియల్ కాలనీలలో అయితే, గృహ యజమానులు తమ వాహనాలను పార్క్ చేసుకునేందుకు ఫుట్ పాత్లను యథేచ్ఛగా వాడుకోవడం కనిపిస్తుంది. కాలిబాటలకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి విధానాలు, కార్యక్రమాలున్నా వాటినన్నింటిని సమీక్షించుకునేందుకూ, ఉన్న లోటుపాట్లను చక్కదిద్దుకునేందుకూ, రోడ్లను సముచితమైన రీతిలో వాడుకునేందుకు భరోసా కల్పించేందుకూ సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ఒక అవకాశం కల్పిస్తోంది. భారతీయ పట్టణాలు, నగరాలు, జాతీయ హైవేల పొడవునా ఉన్న గ్రామాల్లో కూడా నడకకు, సైక్లింగ్కు వసతులు కల్పించి, నిర్వహించడానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. ఇది ప్రజారక్షణ, ఆరోగ్యం, వాతావరణం, సమానతకు సంబంధించిన అంశమని మరచిపోకూడదు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఆగని 'గ్రేటర్ ఇజ్రాయెల్' పథకం
ప్రపంచం దృష్టి ఇరాన్, లెబనాన్ వైపు; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ పూట ఏమంటారనే దానిపై కేంద్రీకరించి ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాత్రం తమ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పథకాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు. ఆ చర్యలన్నీ తమ దీర్ఘకాలిక పశ్చిమాసియా వ్యూహానికి అనుగుణమై నవే అయినందున అమెరికా ఆ విషయమై ఏమీ మాట్లాడటం లేదు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా చొరవతో 2025 అక్టోబర్లో జరిగింది. ఆ మేరకు కాల్పుల విరమణ అయితే అమలుకు వచ్చిందిగానీ, ఇజ్రాయెలీ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకోలేదు. కొన్ని జోన్లకు పరిమితమై కొనసాగుతుందనీ, ఒప్పందంలోని ఆ యా అంశాలు అమలైనకొద్దీ క్రమంగా ఉపసంహరించుకుంటుందనే మాట ఆ పత్రంలో ఉన్నందున ఆ ప్రకారం అంతా జరుగుతుందనీ భావించారు. కానీ అటు వంటి ఉద్దేశాలు ఇజ్రాయెల్కు గానీ, అమెరికాకు గానీ లేవని త్వరలోనే స్పష్టం కాసాగింది.70 శాతం భూమి పోతుందా?ట్రంప్ తను అట్టహాసంగా ప్రకటించిన 20 అంశాల ‘శాంతి పథకం’వైపుగానీ, నియమించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ వైపుగానీ కన్నెత్తి చూడలేదు. మధ్యవర్తులు, బోర్డు సభ్యులు అయిన దేశాలు అదేమి టని అడగలేదు. ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం గాజా, వెస్ట్ బ్యాంక్ లను మించిన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అయినందున వారికి ఈ పరిస్థితి కలిసి వచ్చింది. గాజాలో ఉత్తరం నుంచి దక్షిణానికి గీసిన కాల్పుల విరమణ రేఖను ఉల్లంఘిస్తూ కొత్త ఆక్రమణలు మొదలు పెట్టారు. హమాస్ను వ్యతిరేకించే పాలస్తీనియన్ వర్గాలను, నేరస్థులను ప్రోత్సహించి అక్కడి ప్రజలను పారదోలటం ఈ ఎనిమిది నెలలుగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది.పోయిన నెల చివరిలో ఒక బహిరంగ కార్యక్రమంలో నెతన్యాహూ మాట్లాడుతూ, కాల్పుల విరమణ జరిగిన 2025 అక్టోబర్లో, గాజా భూభాగంలో 53 శాతం తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉండేదనీ, అది 2026 మే చివరిలో 60 శాతానికి చేరిందనీ, దానిని 70 శాతానికి తీసుకుపోవలసిందిగా తమ సైన్యానికి ఆదే శాలు జారీ చేశాననీ ప్రకటించారు. అనగా, కాల్పుల విరమణ నాటి నుంచి మరొక 17 శాతం భూభాగాన్ని; గాజాపై ఇజ్రాయెల్ దాడులు 2023 అక్టో బర్లో మొదలైనప్పటినుంచి 2026 అక్టోబర్ వచ్చేసరికి మూడేళ్లలో మొత్తం 70 శాతాన్ని కోల్పోతుందన్నమాట. అప్పుడు, మొత్తం 365 చ.కి.మీ.ల విస్తీర్ణంగల గాజాలో అక్కడి ప్రజలకు మిగిలేది 110 చ.కి.మీ.లు. విషయం ఇంతటితో ముగియబోవటం లేదు. నెతన్యాహూ రక్షణ మంత్రి కట్జ్తో పాటు సైన్యాధికారులు, గాజాలోని పాలస్తీని యులందరూ అక్కడి నుంచి ‘స్వచ్ఛందంగా ఖాళీ చేసి’ వేరే దేశాలకు వెళ్లిపోవలసిందేనని హెచ్చరిస్తున్నారు. గాజాపై దాడులు మొదలైన కొత్తలో నెతన్యాహూ, ట్రంప్ చేసిన ప్రకటనలను బహుశా ఎవరూ మరిచి ఉండరు. అక్కడినుంచి స్థానికులను వెళ్లగొట్టి ‘అందమైన రిసార్టులు, వ్యాపార కేంద్రాలు’ నిర్మిస్తామన్నారు.ఆగని సెటిల్మెంట్లు!పాలస్తీనాలో మరొకవైపున గల వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలను చూస్తే ఇటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీటి గురించి అసలు వివాదమే లేదనీ, అదంతా తమ దేశంలో భాగమనీ ఇజ్రాయెల్ ఎన్నడో ప్రకటించింది. తమ రాజధాని టెల్ అవీవ్కు అదనంగా ఈస్ట్ జెరూసలేం ఉమ్మడి రాజధాని అన్నది. ఆ ప్రకటనలను ఐక్యరాజ్యసమితి తిరస్కరించగా, రాజధాని విషయాన్ని ట్రంప్ తన మొదటి హయాంలోనే అధికారికంగా గుర్తించారు. ఈ పరిస్థితుల మధ్య జరుగుతున్నది ఇజ్రాయెల్ సేనలు, యూదులు వెస్ట్ బ్యాంక్ను, ఈస్ట్ జెరూసలేం నగరాన్ని ఆక్రమించు కోవడం. ఈ పని కొంతకాలం క్రితమే మొదలు కాగా, నిరుటినుంచి వేగాన్ని అందుకున్నది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ నెల రెండవ వారంలో ఒక నివేదిక విడుదల చేస్తూ, వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లపై ‘జాతి నిర్మూలన’ కార్యక్రమం జరుగుతున్నట్లు హెచ్చరించింది. యూదు సెటిలర్లు, ఇజ్రాయెలీ సైనికులు కలిసి ఆ పని చేస్తున్నారన్నది. అదే వారంలో అమెరికన్ వార్తా సంస్థ అసోసి యేటెడ్ ప్రెస్ (ఏపీ), బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ ఆ ప్రాంతాలలో పర్యటించి ఇవే విషయాలను ధ్రువీకరించి చెప్పాయి. అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు విరుద్ధమని ప్రపంచమంతా ఖండించినా లెక్క చేయని ఇజ్రాయెల్ ఇప్పటికే ఏడు లక్షల మంది యూదులను అక్కడ సెటిల్ చేసింది. వారి కాలనీల కోసం కొత్త బడ్జెట్లోనూ వందల మిలియన్ల డాలర్లు కేటాయించింది. కొత్త పరిణామం ఏమంటే, ట్రంప్ విన్యాసాల వైపు ప్రపంచం మళ్లి ఉండగా, ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లక్ష్యాన్ని సాధించుకొనచూడటం.ఎన్ని దేశాల్లోకి చొచ్చుకుపోతారు?ఇంతకూ ‘గ్రేటర్’ పరిధి ఎంత? అది గాజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలకు పరిమితమైనది కాదంటే ఆశ్చర్యం కలగవచ్చు. యూదుల జియోనిస్టు సిద్ధాంతకర్తల ఒరిజినల్ సూత్రీకరణల ప్రకారం స్థూలంగా మధ్యధరా సముద్రం, పశ్చిమాన ఈజిప్టులోని నైలు నది, తూర్పున యూప్రటీస్ నది, దక్షిణాన పలు అరబ్ భూభాగాల మధ్య ప్రాంతమంతా ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అవుతుంది. అందులోకి ప్రస్తుత ఇజ్రాయెల్, గాజా, వెస్ట్ బ్యాంక్, మొత్తం జోర్డాన్, మొత్తం లెబనాన్, సిరియా, ఇరాక్లతో పాటు సౌదీ భూభాగాలు అనేకం వస్తాయి. ఇటువంటి పటాన్ని నిరుడు తమ దేశంలో స్వయంగా ఎత్తిచూపిన నెతన్యాహూ, ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆలోచనకు తాను బలంగా కట్టుబడి ఉన్నాననీ, ఆ ‘చారిత్రకమైన స్పిరిచ్యువల్ మిషన్లో తనను తాను ఒక భాగంగా భావిస్తా’ననీ ప్రకటించటం గమనించదగ్గది.ఇంత విస్తారమైన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అసాధ్యమేగానీ, అదే సమయంలో అర్థం చేసుకోవలసినవి కొన్నున్నాయి. పాలస్తీనా విషయంలో జరుగుతున్నది ఎవరూ ఆపలేకపోతున్నారు. కనీసం వర్తమానంలో. అరబ్ పాలకులు మొక్కుబడిగా ఏమి మాట్లాడినా, ఈజిప్టు నాయకుడు అబ్దుల్ నాసర్ మరణం (1970) తర్వాత పాన్– అరబిజం బలహీనపడటం, అరబ్ నాయకులంతా ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఇజ్రాయెల్, అమెరికాలతో రాజీపడటం, ఇజ్రాయెల్ పథకానికి ఒక మేరకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. సిరియా నుంచి ఆక్రమించిన గోలన్ హైట్స్ను తమతో విలీనం చేసు కోవటం, జోర్డాన్, లెబనాన్ భాగాల ఆక్రమణలు, మరొకవైపు అమె రికా ఒత్తిడితో కొందరు అబ్రహామిక్ ఒప్పందాల పేర ఇజ్రాయెల్తో రాజీ పడటం వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇజ్రాయెల్ పథ కాన్ని రాజీ లేకుండా వ్యతిరేకిస్తున్న ఏకైక రాజ్యం ఇరాన్ను లొంగ దీసే ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. అటువంటి ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో అబ్రహామిక్ ఒప్పందం చేసుకుంటే సంతోషిస్తానన్న ట్రంప్ ఇటీవల అందరికీ వింత గొలపటం వేరే విషయం!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
‘మా నాన్నెవరో తెలుసా?’
‘నాకు ఏది కావాలంటే అది వెంటనే నా ముందుండాలి, ఎందుకంటే నేను ప్రత్యేకం!’ – నేటితరం పిల్లల్లో, ముఖ్యంగా నగరాల్లోని విద్యా సంస్థల్లో ప్రమాదకరంగా పెరుగుతున్న మనస్తత్వం ఇది. ఒక సర్వే ప్రకారం, గత దశాబ్ద కాలంలో పాఠశాలల్లో క్రమశిక్షణా రాహిత్యం, తోటి విద్యార్థులను తక్కువ చేసి చూచే ధోరణులు దాదాపు ముప్పై ఐదు శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం, ఈ ఎంటైటిల్డ్ మనస్తత్వమే. తరగతి గది అనేది సమాజానికి చిన్న ప్రతి రూపం లాంటిది. అక్కడ ఒకరిద్దరు పిల్లలు తామే సర్వోన్నతులు అనే భావనతో ఉంటే, అది మిగతా పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ‘మా నాన్న ఎవరో తెలుసా?’ అనే అహంకారంతో గ్రూపులు కట్టి, సాధారణ నేపథ్యం ఉన్న పిల్లలను మానసికంగా వేధించే బెదిరింపులు, వర్గ రాజకీయాలు ఎక్కువవుతాయి. ఇలాంటి పిల్లలు సమూహ పనులు చేసేటప్పుడు కేవలం నాయకత్వం కోసం పట్టుబడ తారు తప్ప, ఇతరులతో కలిసి పని చేయడానికి ఇష్టపడరు.ఇందువల్ల సహకార భావన పూర్తిగా లోపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని ప్రముఖ నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలోని అంతర్జాతీయ పాఠశాలలు, కార్పొరేట్ ఇంటర్ కాలే జీలలో ఇలాంటి యథార్థాలు చూడవచ్చు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ అంతర్జాతీయ పాఠశాలలో ఒక మంత్రి కుమారుడికి ఆశించిన విద్యార్థి సంఘ నాయకుడి పదవి ఇవ్వనందుకు సదరు ఉపాధ్యాయుడిని స్కూల్ ముందే అవమానించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే విజయవాడలోని ఒక ప్రముఖ పాఠశాలలో ఒక పెద్ద వ్యాపారవేత్త కుమార్తె తను తెచ్చుకున్న లక్షన్నర రూపాయల ఫోన్ను ప్రదర్శిస్తూ, పక్క విద్యార్థినిని కనీసం బ్రాండెడ్ వాచ్ కూడా లేదనీ, తనతో స్నేహం చేయడానికి అర్హురాలివి కావనీ కించపరిచిన ఘటనలు ఉన్నాయి. హైదరాబాద్లోనే మరో ఘటనలో ఒక ఈవెంట్ నాయకత్వం మార్చలేదని ప్రధానోపాధ్యాయునికే ఫోన్ చేసి బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఎంటైటిల్డ్ మనస్తత్వానికి ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. లైకులు, వ్యూస్ కోసం తమ విలాసవంతమైన జీవితాన్ని, పాఠశాల ఈవెంట్లను వైరల్ చేయడం ఒక ట్రెండ్గా మారడం వల్ల పిల్లల్లో తక్షణ సంతృప్తి అలవాటై, ఓపిక నశిస్తోంది. ఇక్కడే మనకు ‘డిజిటల్ పౌరసత్వం’ విద్య ఎంతైనా అవసరమవుతుంది.పరిష్కార మార్గాలు పాఠశాలల యాజమాన్యాలు కఠినమైన ఏక రూప నియమాలను అమలు చేయాలి. ముఖ్య మంత్రి కొడుకైనా, ఐఏఎస్ కూతురైనా స్కూల్ గేటు దాటి లోపలికి వస్తే అందరూ సమానమే అనే నియమం పెట్టి, యూనిఫాం, మొబైల్ ఫోన్ల నిషేధాన్ని అందరికీ ఒకేలా వర్తింపజేయాలి. ఇలాంటి పిల్లలకు కేవలం అధికారం మాత్రమే కాదు, క్లాస్రూమ్ శుభ్రతను పర్యవేక్షించడం, తోటి బలహీన విద్యార్థులకు చదువులో సహాయ పడటం వంటి క్షేత్రస్థాయి బాధ్యతలను అప్పగించాలి. హోదాను చూసి భయపడకుండా, పిల్లాడి ప్రవర్తన సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులను పిలిచి సంప్రదింపులు జరిపి నిర్మొహమాటంగా నిజాలు చెప్పాలి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా అడి గిందల్లా ఇవ్వకుండా, సమాజంలో ఎలా బత కాలో నేర్పాలి. అడిగిన కొన్ని వస్తువులను తిరస్కరించడం వల్ల వారికి జీవితంలో అన్నీ అను కున్నట్టు జరగవు అనే చేదు నిజం చిన్నప్పుడే బోధపడుతుంది. క్రమశిక్షణతో కూడిన విద్యే నిజమైన సంస్కారం అని అందరూ గ్రహించాలి.– డా‘‘ మేడా జగన్మోహన రావు ‘ విద్యారంగ నిపుణులు -
రిస్క్ తీసుకుంటేనే 'నవలోకాలు'!
నేనూ ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాను. మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను. అప్లైడ్ మ్యాథ్స్లో మాస్టర్స్ పట్టా పొందాను. నాకు ఇద్దరు పిల్లలు. వారూ ఉన్నత విద్యావంతులే. కాబోయే తల్లిదండ్రులుగా మీకు నాదొక సలహా. పెద్దయిన తర్వాత మీరు ఫలానా కావాలంటూ వారికి ఎన్నడూ చెప్పకండి. వారు దానికి విరుద్ధమైన పని చేసి చూపిస్తారు. కానీ, మీరు వారికొక ఆదర్శమైన వ్యక్తిలా మారవచ్చు లేదా ఆదర్శప్రాయంగా తీసుకో దగిన వ్యక్తుల్ని వారికి చూపవచ్చు. మా అమ్మ నాకు అదే పని చేసింది. నాకపుడు 15 లేదా 16 ఏళ్ళు అనుకుంటా. మా అమ్మ నాకు ‘సొసైటీ ఆఫ్ విమెన్ ఇంజినీర్స్’ సంస్థను చూపించింది. నేను ఇరవై ఏళ్లుగా ఒక ఉత్తమ భౌతికవేత్త, ఇంజినీర్ వద్ద పనిచేస్తున్నా. ఆయనే ఎలాన్ మస్క్. పది మందితో మొదలుపెట్టి దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించే సంస్థగా స్పేస్ఎక్స్ను తీర్చిదిద్దడంలో సహాయపడే అవకాశాన్ని మస్క్ నాకు కల్పించారు. మొదట్లో ఆదాయం లేకపోయినా ఏటా కోట్ల డాలర్లు గడించే సంస్థగా అది అవతరించింది. అమెరికాలో తయారైన రాకెట్లు, అంతరిక్ష నౌకల ద్వారా వ్యోమగాములను పంపడంలో చేయూతనివ్వగలగడం నాకెంతో గర్వదాయకంగా ఉంటుంది. మా డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వ్యోమగాములనైనా సరే అంతరిక్షంలోకి పంపగలం. ఓసారి కేవలం పౌరులను పంపాం. వారు కొద్ది రోజులు భూమి చుట్టూ తిరిగి వచ్చారు. ఇది ఆరంభం మాత్రమే. మనుషులు ఈ భూమిపైనే కాకుండా చంద్రునిపైన లేదా కుజునిపైన జీవించేందుకు బాటను సృష్టించడంలో సాయపడ్డానని అనుకుంటున్నాను. అవే కాదు, వాటిని మించి ఇతర నక్షత్ర వ్యవస్థలు, గెలాక్సీలలో జీవించగలిగే భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ఆశిస్తున్నాను. ఇతర గ్రహాల్లో లేదా విశ్వాంతరాళంలో ఎక్కడైనా జీవకోటి ఉంటే వారితో మాత్రమే మాట్లాడాలని కోరుకుంటు న్నానని నేను తరచు జోక్ చేస్తూంటాను. అది నా జీవిత కాలంలో నెరవేరకపోవచ్చు. కానీ, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పునాదిగా లేదా తొలి అడుగులు వేసినదిగా నా కృషి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. నా గురించి చెప్పుకున్నది చాలు. నా జీవితానుభవాల ఆధారంగా రెండు మూడు సంగతులు చెబుతాను.కంఫర్ట్ జోన్ నుంచి బయటపడితేనే...అసంబద్ధమైనవైనా సరే కొన్ని లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నించండి. విఫలమవుతానేమోనని భయ పడకండి. విఫలమైనా, పొరపాటు చేసినా అంగీకరించేందుకూ, మరో దారిని వెతుక్కునేందుకూ సందేహించకండి. ఆశించిన ఫలితం రానంత మాత్రాన విఫలమయ్యామనుకోకండి. తప్పటడుగును వృద్ధిగా పరిగణించండి. స్పేస్ఎక్స్లో జాయినవ్వాలా వద్దా అని 2002లో నేను చాలా మథనపడ్డాను. ఆ చిన్న అంకుర సంస్థలో చేరడం వ్యక్తిగతంగా రిస్క్ తీసుకోవడమనిపించింది. ఆ రంగంలో అంతకుముందెన్నడూ సఫలమైనవారు లేరు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం ఇష్టం లేకపోయింది. తర్వాత, నాకే అనిపించింది. నేనేమీ పెద్ద తెలివైన దాన్ని కాను. నేను దీన్ని ప్రయత్నించి చూస్తే నేనైనా లేదా కంపెనీ అయినా విఫలమైతే పట్టించుకునేదెవరు? ప్రయత్నించి చూడటమే ముఖ్యమైన విషయంగా తోచింది. రిస్క్ తీసుకోవాలి. ఉత్తేజకరమైన దాంట్లో భాగం కావాలని నిర్ణయించుకున్నా. నేనపుడు ఆ నిర్ణయానికి రాకపోయి ఉంటే నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం ఏ విధంగా ఉండేవో ఇపుడు ఊహించబుద్ధి కూడా కాదు. రాకెట్ను పైకి పంపడమే కాదు, దాన్ని సురక్షితంగా తిరిగి భూమి మీదకు దింపడం చాలా కష్టం. ఈ విషయంలో స్పేస్ఎక్స్ అపారమైన రిస్క్ తీసుకుంది. టెక్నాలజీకి నిరంతరం పదును పెట్టుకుంటూ వచ్చింది. రాకెట్ను ప్రయోగించిన వేదికకు డ్రోన్షిప్ కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉంది. ఓ డజనుసార్లు విఫలమైన తర్వాత, రాకెట్ను దానిమీద సురక్షితంగా దింపగలిగాం. ఇప్పటికీ అది క్లిష్టమైన కార్యమేగానీ, రొటీన్గా మారిపోయింది. ఆ టెక్నాలజీ కుజ గ్రహంపై ఆవాసం ఏర్పరుచుకునేందుకు చాలా ముఖ్యం.కబుర్లు అనవసరంపనిచేస్తున్న సంస్థలో టెక్నాలజీకే పరిమితం కాకుండా అకౌంటింగ్, ఫైనాన్సింగ్, ప్రభుత్వ అనుమతులు వంటి వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి వచ్చింది. ఒకసారి తివాచీని వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేసేందుకు కూడా నేను వెనుకాడలేదు. సైన్స్ ప్రయోగాలకు, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సరుకులు తీసుకెళ్ళి, తీసుకొచ్చేందుకు సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మాతో దాదాపు 200 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అట్లా, నా విధినిర్వహణల పరిధి విస్తరిస్తూ పోయింది. ఎలాన్ మస్క్ అభ్యర్థన మేరకు కంపెనీకి చెందిన ఇతర విభాగాల్లోనూ పనులు చక్కబెట్టడంలో సహాయ పడుతూ వచ్చాను. దయతో మెలగండి. ఎదుటివారి పట్ల గౌరవం చూపండి. కానీ, ఒక సంగతి గుర్తుంచుకోవాలి. కబుర్లరాయుళ్లతో మనకు పనిలేదు. వారు చేయాల్సిన పని చేయడం మానేసి, ఇతరుల పనికి కూడా అవాంతరాలు కల్పించేవారుంటారు. కొత్త, వినూత్నమైన ఆలోచన లను పంచుకోవడంలో తప్పు లేదు. క్లిష్టమైన సమస్యలను పరిష్క రించుకునేందుకు అవి అవసరమే. కానీ, అది కాలక్షేప ప్రక్రియగా మారకూడదన్నదే నా ఉద్దేశం. ఒక్కముక్కలో చెప్పాలంటే, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం గొంతెత్తి మాట్లాడటంలో లేదు. ఎదుటి వారి మాటలను శ్రద్ధాసక్తులతో వినడంలో ఉంది. తోటి ఉద్యోగుల ఐడియాలను స్వాగతించండి. ముఖ్యంగా మీ ఆలోచనలతో విభేది స్తున్నవారి మాటలను మరింత ఓపిగ్గా వినండి. మనమేం చేయగలం?ఈ సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ప్రస్తావించకపోవడం కూడా సబబు కాదు. ఆందోళన కలిగిస్తున్న అంశాలకు పరిష్కారాలు ఇప్పటికిప్పుడు నా వద్ద కూడా లేవు. మున్ముందు తడతాయేమో చూడాలి. భవిష్యత్ జీవన విధానంలో టెక్నాలజీ పాత్ర మరింత పెరగబోతోంది. సైన్స్, గణితంలో మన విద్యార్థుల మార్కులు పెదవి విరిచేవిగా ఉంటున్నాయి. ఉత్తీర్ణతలో చైనా అగ్ర స్థానంలో ఉంటే, నా మూలాలున్న ఐర్లాండ్ 12వ స్థానంలో ఉంది. అమెరికాది 25వ స్థానం. ఇంకా ఆందోళన కలిగించే విషయమేమిటంటే, అత్యధిక, అత్యల్ప మార్కులు తెచ్చుకుంటున్న వారి మధ్య వ్యత్యాసం పెరిగిపోతోంది. భవిష్యత్తుకు తగ్గట్లుగా నేటి బాలలను తీర్చిదిద్దాలి. మొదటగా అసాధ్యమైనవిగా కనిపించినా కొన్ని కొత్త ఐడియాలను కూడా గౌరవించడం, వాటి గురించి చెప్పేవారి మాటలను ఉపేక్షించకుండా వినడం అవసరం. మానవ ప్రతిభా వ్యుత్పత్తులను నిరుపయోగంగా వదిలేయడంకన్నా నైతికమైన పాపం మరొకటి ఉండదు. వ్యక్తిగత పురోభివృద్ధితోపాటు ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా మార్చడంలో మన వంతు కృషి ఏమి చేయగలమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. -
రూపాయిని ఎంతకాలం నిలబెడతారు?
‘దేశం లోపల’ మోదీకి ఇప్పుడు చాలా ‘ప్రతిష్ఠ’ ఉంది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత అది మరింతగా పెరిగింది. ఇప్పుడు అలాంటి ప్రతిష్ఠ ‘దేశం వెలుపల’ కూడా ఆయనకు కావాలి. అది రావాలి అంటే పడిపోతున్న రూపాయిని అంతకన్నా పడిపోకుండా పట్టుకోవడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకోవడం మార్గాలు. మోదీ పన్నెండేళ్ల పాలనలో రూపాయి విలువ పడిలేస్తూనే ఉంది. ఆయన మొదటిసారి ప్రధాన మంత్రి అయినప్పుడు (2014 మే నాటికి) అమెరికన్ డాలర్ 58.3 రూపాయలుగా ఉండేది. ఇప్పుడది 94.5 రూపాయల వద్ద ఉంది. రూపా యితో పోల్చుకుంటే డాలర్ 62 శాతం పెరిగింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి 38 శాతం పడిపోయింది. అది ఇంకా ఇంకా పడిపోకుండా ఉండాలంటే, ‘విదేశీ మారక ద్రవ్యం’ పెరగాలి. ఆ పనిలో ఇప్పుడు భారత ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంకూ తలమునకలై ఉన్నాయి. దానికోసం ‘ఫుల్లీ యాక్సెస్బుల్ రూట్’ అనే విధానాన్ని ప్రభుత్వం విస్తృతం చేయబోతోంది. అంటే– 15, 30, 40 ఏళ్ల ప్రభుత్వ బాండ్లను విడుదల చేయడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టు బడిదారులకు ఇప్పటికి ఉన్న పరిమితులను తొలగించడం, దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5% పన్ను మినహాయింపు ఇవ్వడం, ప్రభుత్వ బాండ్ల విక్ర యంపైన 20% పన్ను నిలిపివేయడం – ఇంకా ఇలాంటి కొన్ని సడలింపుల్ని చేయబోతోంది. ఇవన్నీ చేస్తే, అప్పుడు – ఎగుమతులు పెరగడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు రావడం, ప్రవాస భారతీయుల నుంచి డబ్బు రాక పెరగడం, విదేశీ రుణాలు లేదా డిపాజిట్లు పెరగడం, దిగుమతులపై ఖర్చు తగ్గడం లాంటివి సంభవిస్తాయి. దాని ఫలితంగా ఫారెక్స్ పెరిగి, కనీసంగా 30–40 బిలియన్ డాలర్లు వస్తే, అప్పుడు రూపాయి తనకాళ్ల మీద తాను నిలబడు తుందని ప్రభుత్వ అభిప్రాయం. ఈ నెలలో, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పింది కూడా ఇదే. కొన్ని చోట్ల మోదీని ముద్దుగా విమర్శించినప్పటికీ ఈయన కూడా ఆ ‘తాను’లో ముక్కే. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న 2013లో ‘టేపర్ టాంట్రం’ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు (అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించగానే, పెట్టుబడులన్నీ భారత్ వంటి దేశాలకు వచ్చి, వడ్డీ రేట్లు కొంచం పెంచగానే తిరిగి అమెరికాకు చేరినప్పుడు) రూపాయి విలువ డాలర్ ముందు 68కి పడిపోయింది. అప్పుడు తనకి ఆర్థిక సలహా దారు అయిన రఘురామ్ రాజన్ ఎలాంటి సలహాలు ఇచ్చారో, ఇప్పుడు మోదీకి కూడా అనంత నాగేశ్వరన్ అలాంటి సలహాలే ఇస్తున్నారు. ఆ సలహా పేరే ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్.’ ఆర్థిక పరిభాషలో దీన్ని ‘హాట్ మనీ ఫ్లో’ అంటారు. అంటే – ‘స్వల్పకాలిక విదేశీ మూలధన ప్రవాహం’. విదేశీ పెట్టుబడిదారులు తమ తమ లాభాల కోసం ఒక దేశంలోకి వేగంగా తీసుకువచ్చే డబ్బు ఇది. 1950–60ల నుంచే ‘అంతర్జాతీయ ఆర్థిక రంగం’లో ఈ మాట విస్తృతంగా వాడుకలో వచ్చింది. ఇదొక ‘ప్రమాదకరమైన ఆర్థిక ధోరణి’. స్థానిక చర్యలూ తప్పనిసరి! ఇలాంటి ధోరణి వల్లనే 1997లో ఆసియాలో ఒకసారి ‘ఆర్థిక సంక్షోభం’ వచ్చింది. దీని వలన థాయ్లాండ్లో ‘తాయ్ బాత్’ విలువ కుప్పకూలింది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా డబ్బు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. ఆ ప్రభావం ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకూ వ్యాపించింది. పెట్టుబడి దారులు లాభాలు కనిపించినంత వరకు డబ్బు పెట్టారు. ప్రమాదం ఉందని అనిపించగానే ఒకేసారి వెనక్కి తీసుకున్నారు. దీంతో స్థానిక కరెన్సీల విలు వలు ఒక్కసారిగా, 30%–80% వరకు పడి పోయాయి. అనేక కంపెనీలు, బ్యాంకులు దివాలా తీశాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. ‘హాట్ మనీ త్వరగా వస్తుంది, కానీ భయం కలిగితే అంతే త్వరగా పారిపోతుంది. కాబట్టి దానిపై ఎక్కువగా ఆధారపడకూడదు’ అని, టర్కీ ఆర్థికవేత్త డానీ రాడ్రిక్ అంటారు.అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ వేగంగా పడిపోకుండా ఉండాలంటే, హాట్ మనీ ఒక్క దాన్నే మార్గంగా పెట్టుకోకుండా, తయారీ రంగంలో పెట్టుబడుల్ని పెడుతూ ఎగుమతుల్ని బాగా పెంచుకోవాలనీ, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాలనీ, ప్రభుత్వ వ్యయం పెంచి ఉద్యోగాలు సృష్టించాలనీ, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ వంటి పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాలనీ ఆర్థికవేత్తలు చెబుతారు. ప్రస్తుతం మనం ‘పెట్టుబడిదారీ ప్రపంచం’లో ఉన్నాం. ‘మార్కెట్ ఎకనామీ’లో ఉన్నాం. ఇక్కడ రూపాయి పడిపోవడం, లేవడం సర్వసాధారణం. వాటిని పూర్తిగా నియంత్రించే ఆర్థిక వాతావరణం ఉండదు. రూపాయిని నిలబెట్టడానికి విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచడంపైనే దృష్టి కేంద్రీకరిస్తే సరి పోదు. స్థానికంగానూ కొన్ని చర్యలు తీసుకోవాలి: ద్రవ్యోల్బణ నియంత్రణ, ప్రభుత్వ ఆర్థిక క్రమ శిక్షణ, దేశీయ పొదుపుల పెంపు, పారిశ్రామికీకరణ, ఉత్పాదకత పెంపు, దిగుమతులను తగ్గించడం, ఇంధన స్వావలంబన, అలాగే అన్నింటికన్నా, ప్రజల్లో ‘కొనుగోలు శక్తిని’ పెంచే దిశగా ప్రయాణించడం! – నన్నూరి వేణుగోపాల్ ‘ విశ్లేషకుడు -
ఉద్ధవ్ ఠాక్రే, శివసేన (యు.బి.టి.) రాయని డైరీ
హృదయ వేదనను నేను కవిత్వంతో మాత్రమే దాచగలను. కానీ, కవిత్వం అంటేనే గుండెను పెకిలించుకుని దోసిళ్లతో నివేదించడం కదా! ఏమిటీ కుదరని లెక్క? గుండెకు కుట్లు వేసుకుంటున్నానా, లేక పాత గాయాల కుట్లను తడిమి చూసుకుంటున్నానా? ఢిల్లీ నుంచి సంజయ్ రౌత్ ఫోన్ చేశారు. ‘‘కొత్త పొయెట్రీ ఏమైనా చదివారా ఉద్ధవ్జీ? లేదంటే, కొత్తగా వైల్డ్ లైఫ్ ఫొటోలు ఏమైనా తీశారా?’’ అని! అతడు నా మనసుకు నచ్చిన రాజకీ–యేతర విషయాలతో సంభాషణను ప్రారంభించాడంటే, అక్కడ నా మనసును నొప్పించే రాజకీయాలేవో జరిగి ఉంటాయని! ‘‘వైల్డ్ లైఫ్ ఫొటోలు తీయటం కంటే కూడా కష్టమైన పని... నాకు ఈ మనుషుల అసలు ఛాయలను పట్టుకోవటం సంజయ్జీ! నా లెన్స్ చూస్తున్న దృశ్యం ఒకటైతే, నా కెమెరాలో పడుతున్న చిత్రం మరొకటి. పులుల్ని ఫొటో తీస్తే ప్రింట్లోకి పులులు కాకుండా వేరే ఏవో వచ్చి పడ్డాయి’’ అన్నాను.‘‘ఉద్ధవ్జీ... కోపానికే కాదు, కోపగించు కోకపోవటానికీ ఒక హద్దు ఉంటుంది. గుంటనక్కల్ని గుంటనక్కలనే అనాలి తప్ప, ‘పులులు కాకుండా వేరే ఏవో’ అని మెత్తగా అనకూడదు’’ అన్నారు సంజయ్ ఆవేశంగా. పార్టీకి లోక్సభలో 9 మంది ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. ఆ ఒక ఎంపీ సంజయ్ రౌత్. 2004 నుంచీ సంజయ్ శివసేన రాజ్యసభ సభ్యుడిగా ఉంటున్నారు. ‘‘ఉద్ధవ్జీ, మన 9 మంది ఎంపీలలో ఆరుగురు శిందే వైపు వెళ్లిపోయారు. లోక్సభలో శిందే ఎంపీలు ఉండే వైపు తమకు సీట్లు కేటాయించాలని స్పీకర్కి లెటర్ కూడా ఇచ్చారు’’ అని చెప్పారు సంజయ్. నిన్నటి వరకు ‘ఉద్ధవ్ శివసేన’లో ఉన్న వారు ఇవాళ ‘శిందే శివసేన’లో చేరిపోయారు! ఉద్ధవ్ పార్టీ, శిందే పార్టీ అని చూస్తున్నారు తప్పితే... శివసేనను బాలాసాహెబ్ ఠాక్రే పార్టీగా ఎవరూ చూడటం లేదు! మరాఠీ కవి సురేష్ భట్ రాసిన మాటలు గుర్తొస్తున్నాయి నాకు. ‘‘మిత్రులెవరో, శత్రువు లెవరో అనే చిన్న లెక్క కూడా నాకు అర్థం కాలేదు’’ అని వగచి, వాపోయారు భట్! 2022లో ఇదే జూన్ నెలలో, ఇదే 21వ తేదీన ఏక్నాథ్ శిందే 11 మంది శివసేన ఎమ్మెల్యేలను చీల్చుకొని వెళ్లి, ఆ తర్వాత మరో 29 మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకొని, తను సీఎం అయ్యారు! అదేమీ గుర్తు లేనట్లు, 2026 మే నెలలో నాతో సహా తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు పదవీ విరమణ వీడ్కోలు ఇస్తూ, శిందే గొప్ప ఔన్నత్యంతో నన్ను ‘ఉద్ధవ్ సాహెబ్ ఠాక్రే’ అని సంబోధించారు. నన్ను ‘ఉద్ధవ్ సాహెబ్ ఠాక్రే’ అనటం ద్వారా తను ‘శిందే సాహెబ్ ఠాక్రే’ అవుతానని ఆయన అనుకున్నారా!! సంజయ్ రౌత్, శిందే మీద తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ‘‘మన ఎమ్మెల్యేలను లాక్కున్నాడు, మన పార్టీ గుర్తును లాక్కున్నాడు. మన ఎంపీలను లాక్కున్నాడు. ఇప్పుడు... ‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది’ అని మాట్లాడుతున్నాడు. ఈ నమ్మక ద్రోహిని వదిలిపెట్టకూడదు ఉద్ధవ్ జీ’’ అంటున్నారు సంజయ్.నవ్వాన్నేను. ‘‘మనల్ని వదిలివెళ్లిన వాళ్లను, మనం వదిలిపెట్టకుండా ఏం చేసుకుంటాం సంజయ్జీ?!’’ అన్నాను. జూన్ 19న, శివసేన 60వ ఆవిర్భావ దినోత్సవంలో... శిందే బహిరంగంగా పెద్ద అబద్ధం ఆడేశారు. ‘ఉద్ధవ్ శివసేన’ కాంగ్రెస్లో విలీనమవుతుందనే భయంతోనే ఆరుగురు ఎంపీలు తన వైపు వచ్చేశారట! శివసేన 30 ఏళ్లు బీజేపీతో ఉన్నా ఏనాడూ బీజేపీలో విలీనం కాలేదు. అలాంటప్పుడు కాంగ్రెస్తో మాత్రం ఎలా విలీనం అవుతుంది? చుట్టూ ఉన్నవన్నీ కదిలిపోతున్నప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నదే మన వ్యక్తిత్వం. బలం అనేది ‘మూడింట రెండు వంతుల్లో’ ఉండేదే అయితే, ప్రజల అఫెక్షన్ ముందు మెజారిటీ ‘డిఫెక్షన్’ ఏపాటిది? -
'సవాళ్ల నడుమ' సమర్థ దౌత్యం?
వేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, ట్రంప్ దూకుడు, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లలో ప్రతికూల వాతావరణం; చైనా, యూఎస్లతో బలపడుతున్న పాక్ మైత్రీబంధం... భారత దౌత్యనీతికి పెద్ద సవాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో జాతీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించుకుంటూ అంతర్జాతీయ శక్తిగా ఎదగటం భారత్కు అగ్నిపరీక్షే. గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే, భారత దౌత్యనీతిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అమెరికా, రష్యా ప్రాపకం కోసం అర్రులు చాచే దశ నుండి బయటకు వచ్చింది. జాతి ప్రయోజనాల దృష్ట్యా ‘వ్యూహాత్మక స్వతంత్రత’ వైపు అడుగులు వేసింది. అలీన విధానం, పంచశీల సూత్రాలు, మానవ హక్కులు వంటి విలువల బంధనాలను తెంచుకొని లావాదేవీలకు సంబంధించిన దౌత్యనీతిని అమలుపరుస్తున్నది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా భారత్... ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక, వాణిజ్య, సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంపై దృష్టిని కేంద్రీకరించింది. యు.ఎస్., ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని బాహాటంగా ఎత్తి చూపింది. కుండబద్దలు కొడుతూ...ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేయటాన్ని ఐరోపా దేశాలు విమర్శించి నప్పుడు, భారత్ విదేశాంగ మంత్రి ‘‘ఐరోపా దేశాలు తమ సమ స్యల్ని ప్రపంచ సమస్యలు అనుకుంటాయి. కానీ అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల సమస్యలను ఐరోపా ఏనాడైనా పట్టించుకుందా?’’ అని నిలదీయటం భారత్ వైఖరిని సూచిస్తున్నది. రష్యా నుండి చమురు దిగుమతుల విష యంలో యూఎస్ ఆంక్షల గురించి భారత విదేశాంగ మంత్రి, ‘‘మనమెవరమూ ఈ పెద్దవాళ్ల ఆటను అర్థం చేసుకోలేనంత పిల్లలం కాము’’ అని యూఎస్ నిజస్వరూపాన్ని విమర్శించటం భారత దౌత్య ధృడత్వానికి సంకేతం. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నప్పుడూ ఆయన సమ క్షంలోనే ‘‘అమెరికాకు అమెరికన్ ప్రయోజనాల మాదిరిగా భారత్కు భారత ప్రయోజనాలు ముఖ్య’’మని కుండబద్ధలు కొట్టారు.భద్రతాపరంగా అత్యంత ప్రమాదకరమైన పాకిస్తాన్, చైనా లతో సంబంధాల విషయంలో సైతం భారత్ కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు మిన్నకుండే బుజ్జగింపు విధానం నుండి పూర్తిగా వైదొలగి ‘కన్నుకు కన్ను, కాలుకు కాలు’ సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నది. గల్వాన్ ఘర్షణల అనంతరం భారత్ పెద్ద మొత్తంలో లద్దాఖ్లో సైన్యాన్ని మోహరించి చైనాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నట్లు సవాలు విసిరింది. సరిహద్దుల్లో కాలుదువ్వుతూ వాణిజ్యపరంగా స్నేహ సంబంధాలు కుదరదని చైనా పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించింది. మాల్దీ వుల ప్రభుత్వపు భారత వ్యతిరేక ధోరణి నేపథ్యంలో భారత పర్యా టకులను లక్ష దీవులవైపు మళ్లిస్తూ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.విమర్శలకు వెరవని దృఢత్వంఅయితే భారత విదేశాంగ విధానం కొన్ని ప్రత్యేక సందర్భా లలో లొంగుబాటు ధోరణిని కనబరచిందన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ట్రంప్ తెంపరితనం విషయంలో భారత్ మెతక వైఖరి అనుసరించిందని విశ్లేషకుల అభిప్రాయం. ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థను ఒక మృత ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించినా భారత్ స్పందించలేదనీ, ట్రంప్ ఆదేశాల మేరకు ఒక దశలో రష్యా నుండి చమురు కొనుగోళ్లు కూడా ఆపేసిందనీ మరొక విమర్శ. ఇజ్రాయెల్ ‘గాజా’పై బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేస్తున్నా భారత్ ఇజ్రాయె ల్ను సమర్థించి పాలస్తీనాకు వ్యతిరేకంగా వ్యవహరించిందనీ, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం పూర్తిగా రష్యాను సమర్థిస్తు న్నట్లుగా ఉందనీ కూడా రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యానం. ఇదే దృష్టికోణంతో, భారత్ పొరుగుదేశాలు భారత్కు ప్రతికూలంగా మారిపోయాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకల విష యంలో మన దౌత్య నీతి విఫలమైందా అనే సందేహాలు తలెత్తాయి!ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవిని చేపట్టడంతో భారత్– అమెరికా సంబంధాలు మరింత పటిష్టమవుతాయని అందరూ ఆశించారు. కానీ ఆపరేషన్ సిందూర్ తరువాత ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ అమెరికా వాణిజ్య సుంకాల యుద్ధంలో భారత్ దృఢంగా నిలబడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఒత్తిడులను తట్టుకొని నిల బడింది. అదే సమయంలో భారత్–పాకిస్తాన్ల విషయంలో యూఎస్ మధ్యవర్తిత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది కూడా! హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి ఉగ్రవాద సంస్థల ఉగ్ర చర్యలను భారత్ ఏ రకంగానూ సమర్థించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇంకొక ముఖ్యమైన అంశం గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. గల్ఫ్ దేశాలలో కోటి మందికి పైగా భారతీయులు ఉపాధి పొందు తున్నారు. యూఏఈ వంటి గల్ఫ్ దేశాలతో భారత్కు పటిష్టమైన వాణిజ్య సంబంధాలున్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచు కొని భారత్ కేవలం హార్మూజ్ జలసంధి నుండి భారత్కు చమురు, గ్యాస్ రవాణాకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. అదే సమయంలో ఇరాన్కు వ్యతిరేకంగా ఏ చర్యనూ తీసుకోలేదు. ఈ సందర్భంగా ఇరాన్ భారత్కు పూర్తిగా సహకరించటాన్ని గమనించాలి. ఉక్రెయిన్ యుద్ధంలో మనం కేవలం మన పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటానికే ప్రాధాన్యతనిచ్చాం. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుండి చౌక ఇంధనాన్ని కొనుగోలు చేశాం. దౌత్యనీతికి నిదర్శనందక్షిణాసియాలో పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు కాస్త యినా క్షీణించాయన్నది వాస్తవం. సంబంధాలు బలహీనపడి నప్పుడు ఆయా దేశాలను నియంత్రించటానికి దౌత్యనీతిలో భాగంగా కీలకమైన వ్యవస్థలను ఏర్పాటు చేశామా లేదా అన్నదే ప్రశ్న. బంగ్లాదేశ్ విషయానికి వస్తే అక్కడ రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడకుండా ఆపలేం. కానీ మత ఛాందస శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలపరిచాం. ఛాందస శక్తు లది పైచేయి అయినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నియంత్రించ టానికి మన దగ్గర తురుపు ముక్కలున్నాయా? ఈ కోణంలో చూస్తే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుచ్ఛక్తి విషయంలో భారత్పై బంగ్లా దేశ్ ఆధారపడాల్సిందే. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ స్వతంత్రించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. ఈ విద్యుచ్ఛక్తి సంబం ధాన్ని గత దశాబ్దంలో ఏర్పరచటం మన దౌత్యనీతి విజయం.అమెరికా సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫ్రాన్స్, ఇజ్రా యెల్, రష్యా, దక్షిణ కొరియాలతో సైనిక, వ్యూహాత్మక ఒప్పందా లను చేసుకుంది. ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యామ్నాయాలున్నా యని యూఎస్కు భారత్ స్పష్టం చేస్తున్నది. దౌత్యనీతి అంటే ఇదే. ఓపిక, వివేకం, సహనాలతో మాత్రమే దౌత్యం నడుస్తుంది. గురజాల శ్రీనివాసరావు వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
చీకటి ఎల్లకాలమూ ఉండదు!
అబద్ధాన్ని బిగ్గరగా, పదేపదే చెబితే, అదే నిజమని ప్రజలు నమ్ముతారనే జోసెఫ్ గోబెల్స్ (హిట్లర్ అనుచరుడు) సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు ఏదీ గుర్తుండదని ఆయన నమ్మకం. అందుకే రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్కు గ్రహణం పట్టినా, పండు వెన్నెల కురుస్తోంది, సంబరాలు చేసుకోమంటు న్నాడు. కానీ జనం జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే ఆయన అజెండా, విశ్వసనీయత వైసీపీ జెండా. దీనికి నిదర్శనం ఆయన చేసిన అభివృద్ధి. సంఖ్య లెప్పుడూ అబద్ధం చెప్పవు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రెండు రెళ్లు నాలుగే. ఆయన హయాంలో నేరుగా నగదు లబ్ధి పొందినవారి సంఖ్య 8,70,06,898. 2 లక్షల 73 వేల 756 కోట్ల రూపాయల నగదు నేరుగా అకౌంట్లలోకి చేరింది. నాన్ డీబీటీ ద్వారా 1,84,604 కోట్ల రూపాయిలు అందింది. మొత్తం ఐదేళ్లలో ప్రజలకు అందిన లబ్ధి 4 లక్షల 58 వేల 360 కోట్లు.అంకెలు చెప్పే నిజాలుమరి చంద్రబాబు సూపర్ బుస్సు హామీల గురించి మాట్లాడు కుందాం. ఎన్నికల ప్రచారంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ అని బాండ్లు కూడా ఇచ్చారు. జూన్ 2024 నుంచి ప్రారంభం అన్నారు. 2026 కూడా వచ్చింది. ఇచ్చారా? చంద్ర బాబులో ఒక గజిని, అపరిచితుడు ఉంటారు. చంద్రబాబు కంటే గారడీ మనిషి మేలు. కనీసం గాల్లోంచి పావురమైనా తీస్తాడు. అదే బాబు అయితే పావురాన్ని ఊహించుకోమంటారు. బాబు సూపర్ ట్రిక్స్ గురించి చెప్పాలంటే: 1. ఆడబిడ్డ నిధి– ఆడపడుచుల్ని ఆదరించి గౌరవించడం తెలుగువారి సంస్కృతి. ఈ పథకానికి అతీగతీ లేదు. రెండేళ్లకు గానూ, ఆడబిడ్డలు ఒక్కొక్కరికి 36 వేలు బాకీ. 2. నిరుద్యోగ భృతి– నిరుద్యోగులకు నిండా మోసం. ఒక్కొక్క రికీ రూ.72 వేలు బాకీ. 3. యాభై ఏళ్లకే పెన్షన్– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎన్నేళ్లు ఎదురు చూసినా టెన్షనే.4. తల్లికి వందనం– ఫస్ట్ ఇయర్ మోసం. సెకండ్ ఇయర్ 20 లక్షల మంది కోత. 5. ఉచిత బస్సు– ఐదు సర్వీసులకే పరిమితం. 6. దీపం– ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సగం పథకం గ్యాసే. 7. అన్నదాత సుఖీభవ – రైతుకు దుఃఖీభవ అయ్యింది. ఇచ్చింది రూ. 14 వేలు. బాకీ రూ. 26 వేలు.రెండేళ్లలో అన్ని రంగాలను నాశనం చేశారు. విద్యా వ్యవస్థను బాగు చేశామని ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు. జగన్ హయాంలో ‘నాడు–నేడు’ కింద వేల స్కూళ్లు బాగుపడ్డాయి. పనులు పూర్తయ్యే స్థితిలో ఉన్న 22 వేల స్కూళ్లను గాలికి వదిలేశారు. ‘తల్లికి వందనం’ కింద రూ. 13 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది రూ. 8,389 కోట్లు. విద్యా దీవెన, వసతి దీవెనలను నిర్వీర్యం చేశారు. ‘గోరుముద్ద’ను ఘోరం చేసి పిల్లల్ని ఆస్పత్రులపాలు చే శారు. విద్యను వ్యాపారంగా మార్చిన వాళ్లని మంత్రులుగా పెట్టుకున్న తర్వాత ప్రభుత్వ స్కూళ్లు బతుకుతాయా? రెండేళ్లలో వైద్యం రోగగ్రస్థమైంది. ఆరోగ్యశ్రీకి రూ. 3,746 కోట్ల బకాయి పెట్టి పేద ప్రజల్ని అన్యాయం చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని రద్దు చేశారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చేస్తే, అందులో 11 కాలేజీలను ప్రైవేట్కు అమ్మేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 562 మందులు లభ్యమైతే, ఇప్పుడు ఒక్క మందు బిళ్ల కూడా దొరకని స్థితి. పల్లె ప్రజల కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రవేశ పెడితే అది అందకుండా చేశారు. ఒక జాతి బలంగా ఉండాలంటే విద్య, వైద్యం పటిష్ఠంగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ రెండింటినీ ప్రైవేట్కు అమ్మేస్తోంది. ఏ వర్గం బాగుపడిందని!ఎన్టీఆర్ మహానటుడు. ఆయనకి తెలియకుండానే మహా నటుణ్ణి అల్లుడిగా తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తెరమీద నటిస్తే, చంద్ర బాబు ఎడతెరపి లేకుండా నటిస్తారు. దీనికి ఉదాహరణ వ్యవ సాయం దండగ అని ఒకప్పుడు చెప్పిన బాబు, ఎన్నికలకు ముందు రైతన్నలపై అంతులేని ప్రేమ కురిపించారు. కేంద్రంతో సంబంధం లేకుండా 20 వేలు ఇస్తానని, రెండేళ్లకు 26 వేలు నామం పెట్టారు. ఉచిత బీమా పథకం పోయింది. 1,100 కోట్లు ఇన్ ఫుట్ సబ్సిడీ పాయె. రైతు భరోసా కేంద్రాలు నాశనం. యూరియా కోసం రెతులు కొట్టుకున్నారు. పొగాకు, పత్తి, అరటి, మామిడి ఇలా ప్రతి రైతూ రోడ్డెక్కారు. ఎక్కడ చూసినా దళారులే. ఈ–క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ‘ఆసరా’, ‘చేయూత’, ‘కాపు నేస్తం’, ‘ఈబీసీ నేస్తం’ పథకాలు నిలిపివేశారు. ‘దిశ’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పేదలకు ఇచ్చే ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ ఆగిపోయింది. ఐదేళ్లలో జగన్ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. యువకులకు జాబ్ క్యాలెండర్ గాలికి పోయింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. వాలంటీర్లు మునిగిపోయారు. రేషన్ వాహనాల రద్దుతో 18 వేల మంది రోడ్డున పడ్డారు. చివరికి ఉద్యోగుల్ని కూడా మోసం చేశారు. ఒక రూపాయి ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఐదు డీఏలు పెండింగ్. జీపీఎస్, ఓపీఎస్ ఔట్. పీఆర్సీ అడ్రస్ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 35 వేల కోట్లు బాకీ. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం ప్రశాంతంగా లేదు. ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తారు. రెడ్బుక్ అంటారు. వైఎస్సార్సీపీ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరూ మినహాయింపు కాదు. దళితులకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారు లకు రక్షణ లేదు. అయినా తమ ప్రభుత్వం అద్భుతాలు చేసిందని చెప్పుకుంటున్నారు. జనం రెండేళ్లు సంబరాలు చేసుకోవాలని అంటున్నారు.ఏం సాధించారని!జగన్ మళ్లీ వస్తారని వాళ్లకు తెలుసు. అందుకే భయం. జగన్నామ స్మరణ. జనాన్ని తప్పుదారి పట్టించడానికి మా పార్టీని గొడ్డలి పార్టీగా పిలుస్తున్నారు. గొడ్డలి ముద్రతో జనంలో భయం పుట్టించాలని వాళ్ళ ప్రయత్నం. వేళ్లు కుళ్లి పోయిన తెలుగుదేశం పార్టీ వృక్షాన్ని కూల్చాలంటే గొడ్డలి చాలా అవసరం. గొడ్డలి అంటే వాళ్ళకు భయం. కానీ చెడుని కూల్చే ఆయుధం మాకు. రెండేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి 3.48 లక్షల కోట్ల అప్పు. ఇక మీ ఎమ్మెల్యేలు సరిహద్దులు నిర్ణయించి కప్పం వసూళ్లు చేస్తు న్నారు. కాంట్రాక్ట్ పనుల కోసం కొట్టుకుంటున్నారు. లిక్కర్ సిండి కేట్ నడిపిస్తున్నారు. చివరికి చికెన్ షాపుల వద్ద కూడా వసూళ్లు చేస్తున్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తీరా చూస్తే రాష్ట్రానికి సంపదే లేకుండా చేశారు. పిల్లల్ని కనండి, వాళ్లే మన సంపద అని చిట్కాలు చెబుతున్నారు. టీడీపీ అంటే ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ లేదా తెలివిగా దోచుకునే పార్టీ. చీకటి ఎల్లకాలం ఉండదు. తమసోమా జ్యోతిర్గమయ.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
ఆగిన యుద్ధం ఆగినట్టేనా?
ఎంతమాత్రం అవసరం లేని దుర్మార్గపు యుద్ధాన్ని 108 రోజులపాటు సాగించి ఇరాన్కే గాక ప్రపంచానికంతా తీవ్ర నష్టాలు కలిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తానిక ఏమీ చేయలేనని గ్రహించి కావచ్చు యుద్ధ విరమణకు ‘అవగాహనా పత్రం’ ఒకటి ఇరాన్తో పాటు ప్రకటించారు. ఆ పత్రంపై ఈ నెల 19న జెనీవాలో జరగగలవంటున్న సంతకాలకు ట్రంప్ సహచర యుద్ధవీరుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ నుంచి కొత్త విఘాతాలు ఏర్పడని పక్షంలో, మరొక రెండు మాసాలకు మలివిడత చర్చలు జరుగుతాయి. అంతవరకు అందరం మధ్యంతర ఊపిరి పీల్చుకున్నా, తదనంతర పరిస్థితిపై ఇంకా ఊపిరి బిగబట్టవలసిందే.కుదిరినట్టేనా ‘అవగాహన’?ఆ ‘పత్రం’లో ఏమున్నదనే వివరాలు జెనీవాలో సంతకాల తర్వాతే ప్రకటిస్తామని అంటున్నారు. ఇంతవరకు ట్రంప్ చెప్పిన దానినిబట్టి, అన్ని క్షేత్రాలలో కాల్పులు వెంటనే ఆగిపోతాయి. ఇరాన్ రేవులపై దిగ్బంధాన్ని అమెరికా, హార్మూజ్పై దిగ్బంధాన్ని ఇరాన్ ఎత్తివేస్తాయి. ఓడలపై ఇరాన్ సుంకాలు విధించదు. చమురు రవాణా మునుపటి వలె స్వేచ్ఛగా సాగవచ్చు. ట్రంప్ చేసిన ప్రకట నను ఇరాన్ ఖండించలేదు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పిన దాని ప్రకారం, యుద్ధం అన్ని క్షేత్రాలలో వెంటనేగాక శాశ్వతంగా కూడా నిలిచిపోతుంది. ఇంకా ఇతరత్రా వెల్లడవుతున్న వివరాల ప్రకారం, అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధులలో మొదట సగం మేర విడుదల చేస్తారు. ఇరాన్ పునర్ నిర్మాణానికి అమెరికా మిత్ర దేశాలతో కలిసి 300 బిలియన్లు సమకూర్చుతారు. అవగాహనా పత్రంలో ఇరాన్ యురేనియం నిల్వలు, క్షిపణులు, హమాస్, హెజ్బొల్లా, హౌతీల వంటి మిలిటెంట్ సంస్థల ప్రస్తావనలు లేవు. ఈ చర్చలు మలిదశలో ఉండగలవన్నది సూచన.ఇరాన్ రేవుల దిగ్బంధాల ఎత్తివేత 19 లోగా పూర్తిగా జరిగితేనే తాము అవగాహనా పత్రంపై సంతకాలు చేయగలమని ఇరాన్ వెంటనే స్పష్టం చేసింది. ఇందులోని మెలిక ఏమంటే, అమెరికా తాను చేయగలిగింది తాను చేయవచ్చుగాక. కానీ, లెబనాన్పై, అక్కడి హెజ్బొల్లాపై దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, ఇపుడు ఆపుతుందా అన్నది పెద్ద ప్రశ్న. చివరకు ఆదివారం రాత్రి తన ప్రక టనకు కొద్ది గంటల ముందు కూడా నెతన్యాహూను ట్రంప్ పరుషమైన భాషలో హెచ్చరించవలసి వచ్చింది. ఆ మీదట నెతన్యాహూతో పాటు ఆయన రక్షణ మంత్రి కట్జ్ అసాధారణమైన రీతిలో సంయుక్త ప్రకటన చేస్తూ, తాము దాడులు చేస్తున్నది హెజ్బొల్లాపై తప్ప లెబనాన్పై కాదని వివరించబూనారు. అది నిజం కాదని అందరికీ తెలుసు. గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టి దీర్ఘకాలిక లక్ష్యంగా గల ఇజ్రాయెల్, అందుకోసం పాలస్తీనా, జోర్డాన్లతో పాటు లెబనాన్ తదితర అరబ్ దేశాల భూభాగాలను ఆక్రమించటం ఒక కార్యక్రమంగా నేటికీ కొనసాగిస్తున్నది. ఆ మేరకు జియోనిస్టు సిద్ధాంత కర్తలు ప్రతిపాదించిన ఒక మ్యూపును నెతన్యాహూ నిరుడు విడుదల చేస్తూ, తానందుకు కట్టుబడి ఉన్నాన న్నారు. పాలస్తీనాను మొత్తంగా ఇజ్రాయెల్లో భాగంగా చూపే మ్యాపును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనే ప్రదర్శించారు.‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆగుతుందా?నిజానికి ప్రస్తుత యుద్ధాన్ని అణ్వాయుధాల సాకుతో అమె రికాతో కలిసి మొదలుపెట్టడంలోని రహస్యోద్దేశం కూడా పాలస్తీనా ఆక్రమణకు, పశ్చిమాసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా గల ఇరాన్ను విచ్ఛిన్నం చేయటమేనన్నది రహస్యం కాదు. అందుకే, ప్రస్తుత యుద్ధంలో శాంతి ప్రయత్నాలకు ప్రతిసారి విఘాతం కలి గిస్తూ వస్తున్న ఇజ్రాయెల్, అవగాహనా పత్రం అమలును మరొక మారు భంగపరచబోదన్న హామీ లేదు. అందుకే కావచ్చు ఇరాన్ నాయకత్వం, అవగాహన అంటూ కుదిరినా తమ వేళ్లు ఎల్లప్పుడూ ట్రిగ్గర్పైనే ఉంటాయని ఆ వెంటనే ప్రకటించింది.సమస్యలలో సులభమైన వాటిపై ప్రస్తుతానికి రాజీ కుదురు తున్నది. జరుగుతున్న దాడుల నిలిపివేత, నౌకా దిగ్బంధాల ఎత్తివేత వంటివి తేలికైన విషయాలు. అందువల్ల చమురు, సరకుల రవాణాలు సాఫీగా జరిగి ఇరాన్, గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచాని కంతా ఉపయోగకరమవుతుంది. తమకిచ్చిన హామీలు జెనీవా సంతకాల తర్వాత 60 రోజులపాటు సక్రమంగా అమలైతేనే మలి విడత చర్చలు జరప గలమని ఇరాన్ స్పష్టం చేసింది. అంతా అదే ప్రకారం జరుగుతుందనీ, మొదట ఈ నెల 19 వరకూ, తర్వాత 60 రోజుల వరకూ ఇజ్రాయెల్ను ట్రంప్ పూర్తి నియంత్రణలో ఉంచ గలరనీ, మరొకవైపు హెజ్బొల్లాను ఇరాన్ నియంత్రించగలదనీ భావించినా, ఆ మలి విడత చర్చలు ఎంత మాత్రం తేలిక కాబోవు. అప్పటి అజెండా క్లిష్టమైనది కాగలదు.వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది ఇరాన్ అణుశక్తి కార్య క్రమం. ఆదివారం రాత్రి ట్రంప్ తమ ఒప్పందాన్ని ప్రకటిస్తూ,అంతా సాధారణ పరిస్థితికి చేరినాక తాము ఇరాన్లో ప్రవేశించి యురేనియంను స్వాధీనపరచుకుని, అమెరికాకు తెచ్చి నిరుపయో గంగా మార్చగలమన్నారు.ఆ పని చేయటంవల్ల ఇజ్రాయెల్కు అణుముప్పు తొలగిపోతుందని, కనుక ప్రస్తుతానికి మౌనంగా ఉండాలంటూ నెతన్యాహూను ఒప్పించినట్లు వార్తలు చెప్తున్నాయి. కానీ, ఇరాన్ వార్తలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. శాంతియుత ఉప యోగం తమ అంతర్జాతీయ హక్కు అని మొదటినుంచి ప్రకటిస్తున్న ఇరాన్, అది ఎప్పటికీ వదలుకోబోమనీ, యురేనియం శుద్ధి శాతాన్ని ప్రస్తుత 60 శాతం నుంచి గణనీయంగా తగ్గించి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలు మరింత పెరిగేందుకు అనుమతించగల మనీ చెప్తున్నది. తమ క్షిపణులు ఆత్మరక్షణకు తప్పనిసరి గనుక వాటి పరిధి తగ్గింపు ఆమోదయోగ్యం కాదనీ, మిలిటెంట్ సంస్థలు ప్రధా నంగా ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి స్వతంత్రంగా పని చేస్తాయి గనుక, వాటిని నిరోధించే శక్తి తమకు లేదనీ అంటున్నది. ఏం సాధించినట్టు?ఇంతకూ, ఫిబ్రవరి 28న ఆరంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికా, ఇజ్రాయెల్ సాధించిందేమిటి? ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగా దాడులకు పాల్పడ్డ అమెరికా తన విశ్వసనీయతను కోల్పోవటం మొదటి ఘనత. ఇస్లామిక్ వ్యవస్థ మార్పు (రెజీమ్ ఛేంజ్), అణుశక్తి సామర్థ్య నిర్మూలన, బాలిస్టిక్ క్షిపణుల ధ్వంసం, మిలిటెంట్ మిత్రుల అంతం అనే లక్ష్యాలలో ఏ ఒక్కటీ నెరవేరక పోవటం రెండవ ఘనత. అగ్రనేత ఖొమెనేయ్ని కుటుంబంతో సహా మొదటి రోజునే ప్రాణాలు తీసినా ఇరానీ నాయ కత్వం, జాతి మొత్తం ఏకమై నిలిచి నెలల తరబడి ప్రతిఘటించేట్లు చేయటం మూడవ ఘనత. ఇరాన్ ప్రతిఘటనతో స్వయంగా తమ స్థావరాలతో పాటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాలకు గురి కావటం నాల్గవ ఘనత. చమురు, గ్యాస్ సమస్యలతో ప్రపంచం అతలాకుతలం కావటం అయిదో ఘనత. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవాలన్న డిమాండ్ ఏమైందో అమెరికా అధ్యక్షుడే చెప్పాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దేశంలో గిరిజన అభివృద్ధికి సవాళ్లు
గిరిజన అభివృద్ధి నిరంతర పురోగతితో సాగిన ప్రయాణం కాదు. ఇది పాలన విధానాలు, ఆలోచనా విధానాలు, రాజ్యాంగ హామీల మధ్య జరిగిన మార్పులతో రూపుదిద్దుకున్న క్లిష్టమైన ప్రయాణం. ఇందులో రక్షణ, సమగ్రత, స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ జోక్యం, సాంస్కృతిక గుర్తింపు, ఆర్థిక అభివృద్ధి మధ్య ఇప్పటికీ కొనసాగుతున్న సంఘ ర్షణే కనిపిస్తుంది. బయటకు అభివృద్ధి కనిపించినప్పటికీ, లోపల అనేక నిర్మాణాత్మక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో గిరిజన ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా పరిగణించి పాలన అమలు చేశారు. 1874లో ‘షెడ్యూల్డ్ జిల్లాలు’, 1919లో ‘వెనుకబడిన ప్రాంతాలు’, 1935లో ‘మినహాయించ బడిన’, ‘కొంతమేరకు మినహాయించబడిన ‘ ప్రాంతాలు అనే వర్గీక రణలు చేశారు. ఇవి గిరిజనులను రక్షించే లక్ష్యంతో ఉన్నప్పటికీ, వాస్తవానికి పరోక్ష దోపిడీకి మార్గాన్ని సుగమం చేశాయి.కేవలం అధ్యయనాంశమా?1924లో వచ్చిన ఏజెన్సీ రూల్స్ ద్వారా రెవెన్యూ అధికారులకు విస్తృత అధికారాలను ఇచ్చారు. పరిపాలన, న్యాయ అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉండేవి. ఈ విధానం ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో కొంతవరకు కనిపిస్తున్నది. రక్షణ పేరుతో గిరిజన ప్రాంతాలు వేరుపడిపోయాయి. దాంతో వ్యాపారులు, మధ్య వర్తులు, కాంట్రాక్టర్లు గిరిజనులను దోచుకున్నారు. గిరిజనులు భూములను కోల్పోయారు, అప్పుల్లో కూరుకుపోయారు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు లేక అభివృద్ధికి దూరమయ్యారు.20వ శతాబ్దం ప్రారంభంలో తక్కర్ బాపా వంటి సంస్కరణ వాదులు ఈ విధానాన్ని వ్యతిరేకించారు. 1941లో మినహాయించ బడిన ప్రాంతాల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, గిరిజనులను కేవలం అధ్యయనానికి సంబంధించిన ప్రజలుగా కాకుండా, గౌర వంతో బాటు అభివృద్ధికి అర్హులైన పౌరులుగా చూడాలని చెప్పారు. ఆయన ఆలోచనలు ఆ తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46లో ప్రతిబింబించాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగం గిరిజన ప్రాంతాలను ఐదో షెడ్యూల్, ఆరవ షెడ్యూల్ కింద ప్రత్యేక పరిపాలన క్రిందికి తీసుకు వచ్చింది. గిరిజనులను ప్రధాన సమాజంలో కలపాలా? లేక వేరుగా ఉంచాలా? అనే పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది. కలపడం వల్ల వారి సంస్కృతి దెబ్బతింటుంది; వేరుగా ఉంచడం ప్రజాస్వామ్య సమా నత్వానికి విరుద్ధం. జవహర్లాల్ నెహ్రూ ‘పంచశీల సూత్రాల’ ద్వారా సమతుల్య మార్గాన్ని సూచించారు. గిరిజనుల స్వభావానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలి; వారి భూమి, అడవి హక్కులు, సంప్రదాయ సంస్థలకు రక్షణ అవసరం అని చెప్పారు. అభివృద్ధిని కేవలం డబ్బు లేదా ఆర్థిక వృద్ధితో కాకుండా, మానవ గౌరవంతో బాటు సామర్థ్యాల పెరుగుదలతో కొలవాలని చెప్పారు. 1969లో శీలు ఆవో కమిటీ ప్రాంతాల వారీగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు అవసరమని సూచించింది. కానీ తరువాతి కాలంలో విధానాలు ఈ ఆదర్శాల నుండి దూరమయ్యాయి.ఐదవ పంచవర్ష ప్రణాళిక తరువాత ట్రైబల్ సబ్ ప్లాన్, ఐటీడీఏల వంటివి మొదలయ్యాయి. ఇవి కొంత సంక్షేమాన్ని అందించినప్పటికీ, గిరిజన ప్రాంతాలను మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద, అడవులు, నీటి వనరులు పెద్ద ప్రాజెక్టులు, గనులు, పరి శ్రమల కోసం ఉపయోగించారు. అభివృద్ధి పేరుతో అనేక మంది గిరిజనులు తమ భూములు, జీవనాధారాలను కోల్పోయారు. 1947 నుండి 2010 వరకు భారత్లో 6 నుండి 6.5 కోట్ల మంది గిరిజనులు అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభాలో కేవలం 8.6% మాత్రమే గిరిజనులు ఉన్నప్పటికీ, స్థానచలనం చెందిన వారిలో దాదాపు 40% వారే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ, అనేక షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువ భూములు గిరిజ నేతరుల చేతుల్లో ఉన్నాయి. ఇది రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం. ఐదో షెడ్యూల్, ఆర్టికల్ 46, పెసా చట్టం (1996) గిరిజన హక్కులు, గ్రామసభల స్వపరి పాలనకు బలమైన రక్షణ ఇస్తున్నాయి. కానీ గ్రామసభలు చాలా చోట్ల కేవలం పేరుకే ఉన్నాయి. భూములు కోల్పోవడం కొనసాగుతూనే ఉన్నది. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడం మాత్రమే కాదు. అది అసమానతలను తగ్గించాలి;సంస్కృతిని కాపాడాలి; ప్రజలను శక్తిమంతం చేయాలి.భాగస్వాములను చేసినప్పుడే...గిరిజన సమాజాలు ప్రకృతితో కలిసి జీవించే విధానాన్ని అనుసరిస్తాయి. భూమి, అడవులు వారికి కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాదు; అవి వారి సంస్కృతి, జీవన విధానాలకు గుర్తింపు. అందుకే భూములు కోల్పోవడం అంటే కేవలం ఆర్థిక నష్టమే కాదు, సాంస్కృతిక నష్టం కూడా. పెసా చట్టం గ్రామస్థాయి స్వపరి పాలనకు ముఖ్యమైన అడుగు. కానీ దాని అమలు అత్యంత బల హీనంగా ఉన్నది. అధికార యంత్రాంగమే ఇంకా కేంద్రీకృతంగా పనిచేస్తున్నది. నిజమైన స్వపరిపాలన కోసం ప్రభుత్వం గిరిజన సమాజాలపై నమ్మకం ఉంచాలి; అధికారాలను పంచుకోవాలి.భారతదేశ గిరిజన అభివృద్ధి ప్రయాణంలో పురోగతి ఉన్న ప్పటికీ, లోపాలు కూడా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. సంక్షేమ పథ కాలు మాత్రమే సరిపోవు; గిరిజనులకు స్వయం నిర్ణయాధికారం ఉండాలి; భూమి, అడవులపై నిజమైన హక్కులు ఇవ్వాలి; గ్రామ సభలను బలపరచాలి; అభివృద్ధి ప్రక్రియలో బాధ్యతాయుత వ్యవస్థలు ఉండాలి. గిరిజన ప్రాంతాలను కేవలం సహజ వనరుల నిల్వలుగా కాకుండా, ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం కలిగిన ప్రాంతాలుగా గౌరవించాలి. రాజ్యాంగ హామీలు నిజం కావాలంటే కేవలం చట్టాలు సరిపోవు. అభివృద్ధి విధానాలే రాజ్యాంగ విలువ లకు అనుగుణంగా మారాలి. అప్పుడే గిరిజన సమాజాలు నిజమైన భాగస్వాములుగా భారత ప్రజాస్వామ్యంలో స్థానం పొందుతాయి.పి. వేణుగోపాల్ రెడ్డివ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ వ్యవస్థాపకులు -
తప్పులే మన అసలైన గురువులు
ఉచిత సలహాలివ్వడం నాకు ఇష్టం ఉండదు. నా ఈ నియమం గురించి తర్వాత మరింత వివరిస్తాను. కానీ, జీవితంలో నాకు ఇంత వరకు సహాయపడిన వివేకవంతమైన విషయాలు ఏమైనా ఉంటే, అవి మీకు వెల్లడించడం కోసమే నన్ను ఇక్కడకు ఆహ్వానించారు. ఏం చేయాలో మీకు చెప్పేంత యోగ్యత ఉన్న దానినని, నేను ఏ కోశానా భావించడం లేదని మొదటే స్పష్టం చేయదలచుకున్నాను.ప్రయత్నించడానికి సిగ్గు పడకూడదు!వృత్తి జీవిత కలలను సాకారం చేసుకోవడంలో అనుభవంలోకి వచ్చిన ఒత్తిడి, ప్రేమ, అవకాశాలు, అవమానాలకు సంబంధించి కొన్ని సంగతులు పంచుకుంటాను. ఏ విషయంలోనైనా పట్టు విడుపులు అవసరం. దేనిని మనసులో పెట్టుకోవాలో, వేటిని వదిలే యాలో తెలుసుకోవాలి. ఇతరుల గురించిన అల్పమైన విషయాలను వదిలేయడమే మంచిది. పగలు ప్రతీకారాలు, అసూయలు, మాజీ ప్రేయసీ ప్రియులు ఎలా ఉన్నారోననే తహతహలాంటి నకారాత్మక అంశాలు గుండెలో బరువును పెంచుతాయి. సంతోషం, శాంతి, సకారాత్మక అనుభవాలు మనసును తేలికపరుస్తాయి. అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదని మథనపడటం ఎవరికైనా సహజం. గతాన్ని తలచుకుని వగవకూడదని ఎంత ప్రయత్నించినా దాన్నుంచి మనం తప్పించుకోలేం. కనుక, దాన్ని జీవితంలో ఒక భాగంగా భావించుకునే గుణాన్ని అలవరచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయిందనే భావన అప్పటికి గానీ ఏర్పడదు. మార్పు అనివార్యం. ఇప్పుడు మనం అక్కున చేర్చుకుంటున్న ఫ్యాషన్ మున్ముందు మనకే హాస్యా స్పదమైనదిగా తోచవచ్చు. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం కుంగుబాటుకు లేదా నవ్వులాట పరిస్థితులకులోనై ఉండవచ్చు. అదేమీ పెద్ద విషయం కాదు. కుతూహలాన్ని దాచుకోకపోవడమే మంచిది. దేన్నైనా ట్రై చేయాలనిపిస్తే, ట్రై చేయడమే. ఫలితం ఎలాగైనా ఉండనీ. ప్రయ త్నించి చూడటానికి మాత్రం ఎన్నడూ సిగ్గు పడకూడదు.అందరమూ రచయితలమే!నేను 12వ ఏట నుంచే పాటలు రాయడం ప్రారంభించాను. అప్పటి నుంచి అది నా జీవితానికి దిక్సూచిగా మారింది. నా జీవితం కూడా నా రచనలకు ప్రేరణనిచ్చింది. నేను ఏది చేసినా, అది నా రచనలకు పొడిగింపు మాత్రమే. అది వీడియోలకు లేదా షార్ట్ ఫిల్మ్లకు దర్శకత్వం వహించడం కావచ్చు. ఒక టూర్కు విజువల్స్ సృష్టించుకోవడం లేదా వేదికపై నిలబడి ప్రదర్శన ఇవ్వడం కావచ్చు. ఆ కళపట్ల నాకున్న ప్రేమతో ప్రతీదీ ముడిపడి ఉంటుంది. మెరుగైనవాటికోసం ఉన్న ఐడియాలు అన్నింటిని జల్లెడపడుతూ ఉండేదాన్ని. వాటికి చివరి క్షణం వరకు సానబెట్టేదాన్ని. ఒక్కోసారి అర్ధరాత్రి లేచి కూర్చుని పాతవాటిని పడేసి, కొత్తవి స్వీకరించేదాన్ని. ఒక్కోసారి తట్టిన మాటలు హృదయంలో నాటుకుపోయేవి. వాటిని రికార్డు చేయడమో లేదా రాసిపెట్టడమో చేస్తేకానీ, మరి దేనిపైనా దృష్టి సారించగలిగేదాన్ని కాను. నా ఆల్బమ్లకు తగ్గట్టుగా విడుదల ప్రదేశాలు మార్చుకున్నాను. కళా ప్రక్రియలు మార్చాను. దేశవాళీ నుంచి పాప్కు మారాను. జానపదాలకు ప్రత్యామ్నాయాలు ఎంచుకున్నాను. రచనల గురించి ఎక్కువ చెబుతూ వస్తోందని మీకు అనిపించవచ్చు. కానీ, మనందరం రచయితలమేనని నా స్థిరాభి ప్రాయం. మనలో చాలామంది వివిధ సందర్భాలకు తగ్గట్లుగా వివిధ స్వరాలతో రాస్తాం. ఇన్స్టాగ్రామ్కు రాసినట్లుగా థీసిస్కు రాయం. బాస్కు పంపే ఇ–మెయిల్ ఒకలా, చిన్ననాటి స్నేహితునికి రాసే ఉత్తరం ఇంకోలా ఉంటుంది. మనందరం సాహితీ ఊసర వెల్లులం. ఒకే సమయంలో అనేక రకాల పాత్రలు పోషిస్తాం.తప్పుల నుంచే నేర్చుకోగలం!అడగందే సలహాలు ఇవ్వనని ముందే చెప్పాను కదా. ఎందుకో చెబుతాను. నా వృత్తి జీవితం 15వ యేట నుంచే మొదలవడం వల్ల నేను కొంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏళ్ళ తరబడి ఉచిత సలహాలు వినవలసిరావడమే ఆ మూల్యం. నేనే పిన్న వయస్కురాలిని కావడం వల్ల సంగీత పరిశ్రమ, మీడియాకు చెందినవాళ్ళు, ఎగ్జిక్యూటివ్లు నిరంతరం సలహాలిచ్చేవాళ్ళు. అవి ఒత్తిడికి లోను చేసేవి. నేను ఏ తప్పులూ చేయకపోతే, పిల్లలందరికీ ఆదర్శప్రాయురాలినవుతాననీ, పొరపాట్లకు పాల్పడితే మిన్ను విరిగి మీదపడుతుందనీ అన్నట్లుగా ఉండేది సలహాలు ఇచ్చేవారి ధోరణి. కానీ, నా స్వానుభవం వేరేగా ఉంది. నేను చేసిన తప్పిదాలు నన్ను నేను మరింత మెరుగుపరచుకునేందుకు దారితీశాయి. పొర పాట్లతో పరిస్థితి కంగాళీగా మారి, మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడితే, అది కూడా మానవ అనుభవంలో భాగం కిందనే లెక్క. మనం ఒకసారి విఫలమైనా, మన పక్కనే ఉంటూ మన వెన్ను తట్టేవారు ఎవరో తెలుసుకోవడం, జరిగినదానికి నవ్వు కోవడం కూడా ఒక వరం. తిరస్కరణకు గురవడం,బృందంలో చోటు దక్కకపోవడం, గెలవలేకపోవడం, అవకాశాన్ని తగినంతగా వినియోగించుకోలేకపోవడం వంటివి తలచుకుంటే, ‘సవ్యంగా సాగిన’ సందర్భాలకన్నా అవే ముఖ్యమైనవనిపిస్తుంది. ఒంటరితనం అంటే ఏమిటో అలా భంగపడిన సందర్భాల్లో మనకు తెలిసివస్తుంది.పరిపూర్ణత వాస్తవికమేనా?నా దృక్పథం నిరంతరం మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అన్నీ పూర్తి అర్థరహితమైనవిగా తోస్తాయి. పరిపూర్ణతతో జీవితం గడపడం కష్టం. ఎందుకంటే, జీవితంలో అనుచితంగా మాట్లాడటం అనివార్యం. నమ్మదగని వ్యక్తిని నమ్ముతాం. చేయవలసినంత పని చేయం. మితిమీరి స్పందిస్తాం. ఎవరి హృదయాలను గాయపరచ కూడదో వారిని మన మాటలతో గాయపరుస్తాం. అతిగా ఆలో చిస్తాం లేదా అసలు ఆలోచించం. మనకు మనమే ద్రోహం చేసుకుంటాం. మనకు అనుభవమైనదానినే వాస్తవికతగా చిత్రిస్తాం. ఆనందకరంగా గడపవలసిన క్షణాలని చేజేతులా పాడుచేసుకుంటాం. ఇతరుల ఆనందాన్ని కాలదన్నుతాం. తీవ్ర అపరాధ భావనకు లోనవుతాం. అది మనల్ని ఆసాంతం దహించి వేస్తుంది. చివరికి చేసిన తప్పు తెలుసుకుంటాం. అలాంటిది మళ్లీ పునరావృతం కాకుండా నివారించేందుకు ప్రయత్నిస్తాం. ఈ తప్పులు మనం కొన్నింటిని కోల్పోయేట్లుగా చేస్తాయి.జీవితంలో మన వ్యక్తిత్వాన్ని మనం చాటుకోవలసిన అవస రాలు తలెత్తుతాయి. ఒకసారి వెనక్కి తగ్గి, క్షమాపణ కోరవలసి రావచ్చు. మీరు సవ్యమైనది అనుకున్నదానికోసం పోరాడవలసి రావచ్చు. మంచి మలుపునకు ఎదురు చూడవలసి రావచ్చు. కొన్నింటిని గౌరవప్రదంగా చేజార్చుకునేందుకు సిద్ధపడవలసి ఉంటుంది. ప్రగతి, సంస్కరణ పేరుతో కొన్ని పాత భావజాలాలను వదులు కోవలసిరావచ్చు. ఒక్కోసారి, మన పూర్వీకుల వివేచనకు, వివేకా నికి తలొగ్గవలసిరావచ్చు. కీలకమైన సందర్భాలలో ఏది సరైన మార్గమో ఎంచుకోవడం ఎలా? ఇక్కడున్న ఇంతమందికి ఎన్ని జీవితమార్గాలని చూపగలను? అయ్యే పని కాదు. మీకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇపుడు మీ కాళ్ళపై మీరు నిలబడ్డారు కనుక దానిని మీకే వదిలివేస్తాను. మన ఆత్మ శక్తి, సహజాత ప్రవృత్తులు, అంతః ప్రేరణలు, కోరికలు, భయాలు, మనకు తగిలిన గాయాలు, మనం కనే కలలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. -
నివారించదగినవే అయినా...
జూన్ 8న విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఇప్పటికి 10 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసు కోవడం అవసరం. ‘ఇది విధి నిర్వహణ తగినంతగా లేకపోవడం వల్లనే జరిగింది’ అని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాజీ సీఎమ్డీ మధు సూదన్ చెప్పారు. ‘నివారించదగ్గ ప్రమాదమే ఇది’ అని కూడా ఆయన అన్నారు. అంటే ‘ప్రమాదాలు జరుగుతాయి అని ముందే తెలుసు’ అని దీనర్థం. ఈయనే కాకుండా సీఎంఎస్–2 (స్టీల్ మెల్టింగ్ షాప్–2)లో, గతంలో పనిచేసిన కేఎస్ఎన్ రావు కూడా ‘కరిగిన ఉక్కుతో సంబంధం ఉన్న పనుల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ భద్రత ఇప్పుడు లోపించింద’న్నారు.ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా బైటకు రాకపోయినప్పటికీ, ఫ్యాక్టరీల ప్రధాన ఇన్స్పెక్టర్ నిర్వహించిన ప్రాథమిక విచారణ ప్రకారం ‘ద్రవ ఉక్కులో’ చిక్కుకు పోయిన వాయువులు ఒక్కసారిగా విడుదల కావడంతో పేలుడు సంభవించి, లాడిల్ ఒరిగిపోయి ‘ద్రవ ఉక్కు’... కింద పనిచేస్తున్న కార్మికులపై పడినట్లు గుర్తించారు. ‘స్టీల్ మెల్టింగ్ షాప్’లో అత్యంత వేడిగా ఉన్న ‘ద్రవ ఉక్కు’ను మోస్తున్న లాడిల్ (ఉక్కుతో తయారైన భారీ పాత్ర)లో అకస్మాత్తుగా పేలుడు ఏర్పడింది. దాంతో లాడిల్ ఒరిగిపోవడం లేదా పగిలిపోవడం వల్ల సుమారు 1500 –1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ద్రవ ఉక్కు కార్మి కులపై చిందింది. భారతదేశంలో ఇతర ఉక్కు కర్మాగారాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు అప్పుడప్పుడు జరిగాయి. ఉదాహరణకు, 2025లో హిమాచల్ ప్రదేశ్లో ఒక స్టీల్ ఫ్యాక్టరీలో గేర్ లోపం వల్ల ద్రవ ఇనుము కార్మికులపై చిందడంతో ఒకరు మరణించారు. మన దేశంలోనే కాకుండా ఇంకా ఇతర చోట్ల కూడా ఇలాంటివి కొన్ని జరిగాయి. మెక్సికో, అపిజాకో (2024)– ఉక్కు కర్మాగారంలో ద్రవ ఉక్కు చిందడంతో పెద్ద పేలుడు సంభవించి కనీసం 12 మంది మరణించారు. జర్మనీ, సార్స్టాల్ ప్లాంట్ (2022) లాడిల్ గేట్ వాల్వ్ సాంకేతిక లోపం వల్ల ‘ద్రవ ఉక్కు’ నియంత్రణ తప్పి, పెద్ద మొత్తంలో బయటకు వచ్చింది. చైనాలో 2007లో జరిగిన ‘చింగ్హె ఉక్కు కర్మాగార ప్రమాదం’లో 32 మంది మరణించారు. అలాగే యూరప్, జపాన్, అమెరికాలో కూడా లాడిల్ ప్రమాదాల జరిగాయి. ‘ప్రపంచ స్టీల్ పరిశ్రమ సంఘం’ ప్రతి సంవత్సరం ప్రమాదాల గణాంకాలు విడుదల చేస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్లలో జరిగిన లాడిల్ ప్రమాదాలపై చాలా కాలంగా పరిశోధనలు, విచారణలు, భద్రతా చర్చలు జరిగాయి. వాటిల్లో ప్రధానమైనవిగా కొన్ని గుర్తించారు: 1. లాడిల్ రిఫ్రాక్టరీ లైనింగ్ దెబ్బతినడం. అంటే లాడిల్ లోపల వేడి నిరోధక ఇటుకలు ఉంటాయి. అవి పలుచబడి పోతుంటాయి. దీన్ని సమయానికి గుర్తిస్తూ, తనిఖీలు చేసుకుంటూ ఉండాలి. లేకుంటే లాడిల్ పగిలిపోయి, మెటల్ బయటకు వచ్చేస్తుంది. 2. క్రేన్ లేదా లిఫ్టింగ్ వ్యవస్థ వైఫల్యం. 3. మెయింటెనెన్స్ లోపాలు. 4. నీరు లేదా తేమ... కరిగిన ఉక్కును తాకితే క్షణాల్లో అక్కడ ఆవిరితో కూడిన పేలుడు సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది అత్యంత ప్రమాదకర కారణాల్లో ఒకటి. 5. హజార్డ్ సెన్సర్లు, ఆటోమేటిక్ హెచ్చరిక సిస్టమ్ లేకపోవడం. అంటే ఉష్ణోగ్రత, పగుళ్లు, లీకేజీలు ముందే గుర్తించే సెన్సర్లు లేకపోవడమన్నమాట. 6. మానవ తప్పిదాలు: భద్రతా విధానాలు పాటించకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం. తక్కువ సిబ్బందితో పని చేయించడం.సూచనలు పాటించనందువల్లే...‘ప్రపంచ స్టీల్ పరిశ్రమ సంఘం’ ఉక్కు పరిశ్రమల్లో లోపాల్ని గుర్తించడమే కాకుండా, కొన్ని పరిష్కారాల్ని కూడా సూచించింది. అవి ఏమిటంటే: లాడిళ్లకు ‘నిర్దిష్ట జీవిత కాలాన్ని’ నిర్ణయించి, సమయానికి మార్చడం, ప్రతి షిఫ్టుకు ముందు తప్పనిసరిగా కొన్ని తనిఖీలను చేయడం, క్రేన్లపై అదనపు భద్రతా వ్యవస్థలను నిర్మించడం, ఏఐతోనూ, థర్మల్ కెమెరాలతోనూ, సెన్సర్లతోనూ నిరంతర పర్యవేక్షణ చేయడం, కరిగిన లోహం ప్రయాణించే మార్గాల్లో కార్మికుల ఉనికిని తగ్గించడం, అత్యవసర పరిస్థితులపై తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించడం, నీరు/తేమ పూర్తిగా తొలగించిన తర్వాతే కాస్టింగ్ పనులు ప్రారంభించడం. ‘స్టీల్ సంఘం సూచనలు’ అంటూ ఇప్పుడు మనం వేటినైతే చెప్పుకున్నామో వాటిని ‘విశాఖ ఉక్కు’ పాటించడం లేదు. పాటించడం లేదు కాబట్టే, ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ఆ తప్పును గుర్తించాలి. ‘విశాఖ ఉక్కు కర్మాగారం’ అనే దానికి సంబంధించినంతవరకూ యాజమాన్యం, నిర్వహణ, భద్రతా విధానాలు, సాంకేతిక కార్యకలాపాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. కానీ, చట్టపరమైన పర్యవేక్షణ, తనిఖీలు, అత్యవసర స్పందన లాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదానికి రెండు ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి! నన్నూరి వేణుగోపాల్ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త -
సమ్రాట్ చౌధరీ (బిహార్ సీఎం) రాయని డైరీ
నా నివాస గృహ కార్యాలయం నుంచి, సమీపంలోనే ఉన్న సచివాలయానికి కాలినడకన వెళ్లటం కోసం నేను వేగంగా మెట్లు దిగుతున్నప్పుడు నా పైన దాదాపుగా ఒక మెరుపు దాడి వంటిదేదో జరిగినట్లయింది! కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆ ప్రాంగణంలోని గుబురు చెట్ల కొమ్మల పైనుంచి దుమికినట్లుగా మీడియా ప్రతినిధి ఒకరు ఒక్క గెంతున నా మీదకు వచ్చి పడ్డాడు! ఆ హఠాత్ఘటనకు నాతో పాటుగా, ఒక అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, నా కోసం వేచి చేస్తున్న ఒక విద్యాసంస్థ డీన్... ఎక్కడి వాళ్లు అక్కడే స్తంభించిపోయారు. ‘‘సమ్రాట్జీ, బిహార్ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించి జూన్ 15కి రెండు నెలలు పూర్తవుతాయి. ఈ రెండు నెలల్లో మీరేం సాధించారు?’’ అని అడిగాడు, ఆ ‘ఒక్క ఊపున వచ్చి పడిన’ మీడియా ప్రతినిధి. అతడి వైపు విస్మయంగా చూశాను.‘‘మిత్రమా, నేను ఏప్రిల్ 15న బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మీరు ఏప్రిల్ 16న వచ్చి, ‘మీరీ 24 గంటల్లో ఏం సాధించారు?’ అని నన్ను అడగవలసిన ప్రశ్నను... రెండు నెలల తర్వాత ఇప్పుడు నింపాదిగా వచ్చి, ‘మీరేం సాధించారు?’ అని అడుగుతున్నారు!’’ అన్నాను, నవ్వుతూ. ‘‘కానీ సీఎం సార్... కేవలం 24 గంటల్లో ఏమౌతాయి చెప్పండి?’’ అన్నాడు ఆ మీడియా ప్రతినిధి కూడా నవ్వేస్తూ. ‘‘24 గంటల్లో ఏమౌతాయి అని మీరు అంటున్నారు. కానీ, చాలానే అవుతాయి. బిహార్లో ఈ 70 ఏళ్లలో చట్టం తన పని తాను చేసుకుపోయింది. నేను వచ్చాక చట్టం తన పని తాను 24 గంటల్లోనే చేసుకుపోతోంది. గమనించే ఉంటారు’’ అన్నాను. ‘‘అవును సీఎం సార్. మీరు వచ్చాక 12 ఎన్ కౌంటర్లు జరిగాయి. ప్రతి ఎన్కౌంటరూ 24 గంటల్లోనే జరిగిపోయింది. కానీ... ఇవన్నీ పోలీసుల విధి నిర్వహణల కిందికే కదా వస్తాయి, సీఎంగా మీరేదైనా సాధించటం కిందికి వస్తాయా?’’ అని అడిగాడు. నా నడకను ఆపాను. అతడూ ఆగాడు. ‘‘పోలీసులకైనా స్వేచ్ఛ ఇస్తేనే కదా వాళ్లు 24 గంటల్లో ఏదైనా చేయగలరు! వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వటం కంటే ఒక సీఎం సాధించ వలసింది ఏం ఉంటుంది?!’’ అని అన్నాను. సచివాలయం దగ్గర పడింది. ‘‘సరే మిత్రమా, కలుద్దాం. సోమవారం మధ్యాహ్నంగానీ, సాయంత్రంగానీ ప్రెస్ మీట్ ఉండొచ్చు’’ అన్నాను, లోపలికి నడుస్తూ. ‘‘శ్రీమతి రబ్డీదేవిని సర్క్యులర్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయించే విషయం మీదనేనా సీఎం సార్, ఆ ప్రెస్ మీట్?’’ అని అడిగాడతడు! నవ్వాను. ‘‘సర్క్యులర్ రోడ్ బంగళాను ఖాళీ చేయించటం మీద, హార్డింగ్ రోడ్లో వేరే బంగళాను కేటాయించటం మీద ప్రెస్ మీట్లు ఉంటాయా మిత్రమా?’’ అన్నాను, సచివాలయంలోకి వచ్చేస్తూ.క్యారిడార్లో లేషీ సింగ్ ఎదురొచ్చారు. నవ్వాను. ఆమె నవ్వలేదు! ‘‘మీ కోసమే చూస్తున్నా సమ్రాట్జీ. శ్రీమతి రబ్డీ దేవికి మనం ఇచ్చిన రెండో గడువు కూడా ఆదివారంతో ముగుస్తోంది. ఆమె తన బంగళాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని అంటున్నారు’’ అన్నారు టెన్షన్గా! లేషీ భవన నిర్మాణ శాఖ మంత్రి. నేరుగా నా ఛాంబర్ లోకి వచ్చి, డీజీపీ వినయ్ కుమార్కి ఫోన్ చేసి, ‘‘ఏం చేద్దాం?’’ అని అడిగాను. ‘‘ఈసారికి చట్టాన్ని తన పని తను చేసుకుపోనిద్దాం సర్... చట్టానికి 24 గంటల డెడ్లైన్ లాంటిది ఏమీ పెట్టకుండా’’ అన్నాడు. ‘‘గుడ్’’ అని ఫోన్ పెట్టేశాను. వినయ్ కుమార్ ఖరగ్పూర్ ఐఐటీ స్టూడెంట్. ఒక ఐపీఎస్, ఐఐటీ నుంచి వచ్చాడంటే అతడు డెడ్లైన్ ఏమీ లేకుండానే డెడ్లైన్ లోపలే పని పూర్తి చేయగలిగినవాడై ఉంటాడు. -
తక్కువ కరెంట్తో ఎక్కువ కూలింగ్
ఎల్ నినో నేపథ్యంలో వర్షాకాలం మొద లైంది. వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉండగలదని భారత వాతావరణ పరిశోధనా శాఖ (ఐఎండీ) అంచనా. పసిఫిక్ సముద్రంలో రూపుదిద్దుకుంటున్న ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా, భారత్లో వర్షపాతం ఈసారి దీర్ఘకాలిక సగటు (ఎల్.పి.ఏ.)లో 90% మేరకు మాత్రమే ఉండగలదని భావిస్తున్నారు. ఎల్ నినో ఉష్ణ ధోరణులు తేమతో నిండిన పవనాలను బలహీనపరుస్తాయి. ఫలితంగా వర్షపాతం కొన్నిచోట్ల మరీ ఎక్కువ, కొన్నిచోట్ల మరీ తక్కువగా ఉంటుంది. దక్షిణాసియాలో సగటుకన్నా తక్కువ వర్ష పాతం ఎల్ నినో ప్రపంచ ప్రభావాలలో ఒకటిగా ప్రపంచ వాతా వరణ సంస్థ (డబ్లు్య.ఎం.ఓ.) పేర్కొంది. మారుతున్న వాతావరణ పరిస్థితి అనివార్యంగా కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. దోమలు, ఈగల వంటి ద్వారా సోకే బ్యాక్టీరియా, వైరస్ల జబ్బులు మొదలవుతాయి. ఆహారం, నీటి లభ్యతపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యుదుత్పాదన దెబ్బతింటుంది. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వడగాడ్పులు, రాత్రిపూట కూడా ఉష్ణో గ్రతలు ఎక్కువగానే ఉండటానికి సంబంధించిన వార్తలు చూస్తు న్నాం. ఇవన్నీ కలిసి శీతలీకరణ సాధనాలు, పద్ధతుల వైపు ప్రజలు మొగ్గేటట్లు చేస్తాయి. ఫ్యాన్లు, డిజర్ట్ కూలర్లు, సంచార ఎయిర్ కండిషనర్లు (కార్లు, బస్సులు, రైళ్ళలో), చిల్లర్లు, శీతల గిడ్డంగులు వంటివాటికి గిరాకీ పెంచుతాయి. గృహాలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలకు వాటి డిమాండ్లకు అనుగుణంగా కూలింగ్ సిస్టంలు అవసరమవు తాయి. దీనికి విండో, స్లి్పట్, సెంట్రలైజ్డ్ ఏసీలను పెంచుకుంటూ పోవడం స్థిరమైన పరిష్కారం అనిపించుకోదు. కొత్త రూమ్ ఏసీలకు 2025–2035 కాలానికి మరో 13–15 కోట్ల యూనిట్లు జోడు కాగలవని అంచనా. ఇవి విద్యుత్ పంపిణీ వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. 2035లో ఉండగలదని భావిస్తున్న లోడులో వీటి వాటాయే దాదాపు 180 గిగావాట్లు! ప్రస్తుతం, వేసవిలో వినియోగం పతాక స్థాయిలో ఉన్న దశలో ఏసీ యూనిట్లు స్వాహా చేస్తున్న విద్యుత్తు సుమారు 60–70 గిగావాట్లని తేలింది. అంతటా వేడి వాడలే!పట్టణాలు, నగరాల్లో కొన్ని ప్రాంతాలు ‘వేడి వాడలు’గా పేరు మోస్తున్నాయి. జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలకన్నా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది. నగరాల్లో ఏసీలు పరిసరాల్లోకి మరింత వేడిని విడుదల చేస్తున్నాయి. ఫలితంగా, శీతలీకరణ యంత్రాలకు డిమాండ్ మరింత పెరుగుతోంది. అదొక విష వలయం. వీలైనంత తక్కువ విద్యుత్తును గ్రహించి వాతావరణాన్ని చల్లబరచే సిస్టంలను గుర్తించేందుకు మన దేశంలో స్టార్ రేటింగ్ కొలమానం ఉంది. ఏసీలకు ఈ రేటింగ్ సిస్టంను 2009లో ప్రవేశ పెట్టారు. మొదట్లో ఇది స్వచ్ఛంద లేబుల్గా ఉండేది. తర్వాత, తప్పనిసరిగా పేర్కొనాలని నిబంధన తెచ్చారు. తదనంతరం, కనిష్ఠ శక్తి వినియోగ ప్రమాణాల (ఎం.ఇ.పి. ఎస్.)ను ప్రవేశపెట్టారు. తర్వాత, ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషి యన్సీ నిష్పత్తి (సీర్)ని 2015లో అమలులోకి తెచ్చారు. ఈ ప్రమా ణాలు ఏసీ మార్కెట్పై కొంత ప్రభావాన్ని చూపాయి. సదరు సాధ నానికి లభించిన స్టార్లను బట్టి వినియోగదారులు రకరకాల ఏసీలు కొనడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వస్తూత్పత్తి సంస్థలు కూడా ఇన్ వెర్టర్ టెక్నాలజీ వంటి మెరుగుదలలతో కొత్త వస్తువులను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాతావరణం పట్టని ఏసీలుఅంతవరకు బాగానే ఉందిగానీ, సాంకేతికపరంగానూ, అమలు లోనూ కొన్ని లోపాలు కొనసాగుతున్నాయి. బర్కిలీలోని యూనివ ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ పరిశోధకులు 2025లో ఒక అధ్యయనం నిర్వహించారు. పరీక్షా విధానాలు ప్రాథమికంగా పొడి వాతావరణంలో శీతలీకరణను మదింపు చేస్తున్నాయనీ, భారతదేశంలోని హాట్–హ్యూమిడ్ వాతా వరణంలో కీలకమైన అంశంగా మారే గాలిలో వేడితేమను తగ్గించే లేదా తొలగించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనీ వారు పేర్కొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ల్యాబొరేటరీ పరీక్షల్లో ఏసీలు బాగా పనిచేస్తాయి. వాస్తవిక పరిస్థితుల్లో పనితీరు పేలవంగా ఉంటుంది. లేదా విద్యుత్తును ఎక్కువ స్వాహా చేసి ప్రదేశా లను అతి శీతలంగా మారుస్తాయి. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే అమలుచేస్తున్న ఎం.ఇ.పి.ఎస్.ల విషయంలో కూడా ఇండియా వెనుకబడే ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. భారత్లోని సగటు యూనిట్తో పోలిస్తే ఆ దేశాల్లోని ఏసీలు దాదాపు రెండింతల ఇంధన వినియోగ సామర్థ్యాన్ని కనబరుస్తున్నా యని అధ్యయనంలో వెల్లడైంది. కేంద్రీకృత కూలింగ్ మెరుగుఇండియా కూలింగ్ కార్యాచరణ ప్రణాళిక అనేది మరో ప్రయత్నం. దీనికి 2019లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రణాళిక కింద వివిధ ఐడియాలను పరీక్షించి చూస్తున్నారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం (డీసీఎస్) వాటిలో ఒకటి. కొన్ని ఐరోపా నగరాల్లో వాడుకలో ఉన్న సెంట్రలైజ్డ్ హీటింగ్ సిస్టంల తరహాలో దానికి రూపకల్పన చేశారు. డీసీఎస్ కింద కొన్ని భవనాల సముదాయానికి సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం పెడతారు. నీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా చేసే పైపుల మాదిరి గానే కూలింగ్ కూడా గొట్టాల ద్వారా పంపిణీ అవుతుంది. అది సమర్థమైన సిస్టంగా పేరు తెచ్చుకుంది. వ్యర్థ జలాలను శుద్ధి చేసి ఆ నీటిని సెంట్రల్ ప్లాంట్ వినియోగించుకుంటుంది. వ్యర్థంగా బయట కొచ్చే వేడిని చిల్లర్లు గ్రహించుకుంటాయి. అదే ఇంట్లోని ఏసీలకైతే రిఫ్రిజిరెంట్ గ్యాసులు అవసరమవుతాయి. కేంద్రీకృత వ్యవస్థ కావడం వల్ల, కూలింగ్ డిమాండ్ను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు. విమానాశ్రయాలు, ఐటీ సంస్థల సముదాయాలు, పారిశ్రామికవాడలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు వంటిచోట్ల డీసీఎస్ అనువైనది. సింగపూర్, దుబాయ్, ఖతార్, యూఏఈలలో ఇది ప్రయోజనకరమైనదిగా తేలింది. మన దేశంలో ‘శీతలీకరణను కూడా ఒక సేవ’ కింద మార్చడానికి రెగ్యులేటరీ, లీగల్, ఫినాన్షియల్ పరంగా, ఇతరత్రా కొన్ని ప్రతిబంధకాలున్నాయి. కొన్నేళ్ళ క్రితం ఢిల్లీలోని కనాట్ ప్లేస్లో డీసీఎస్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగాయిగానీ, వివిధ క్షేత్ర స్థాయి సమస్యల వల్ల అవి ఫలించలేదు. సాపేక్షంగా చూస్తే, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో మాదిరిగా కొత్త ప్రాజెక్టులలో వాటిని అమలులోకి తేవడం తేలిక. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కూడా డీసీఎస్ను పొందుపరచనున్నారు. వివిధ నగరాల్లో ఆకాశ హార్మ్యా లతో కొత్త జనావాస ప్రాంతాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో డీసీఎస్ను ప్రోత్సహించేందుకు ఇది సరైన సమయం. దేశానికి ఒక సమగ్ర శీతలీకరణ విధానం అవసరం. అది తక్కువ విద్యుత్తుతో ఎక్కువ శీతలీకరణను అందించేందిగా ఉండాలి. వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులకు తగ్గట్లుగా శీతలీకరణ సాధనాలకు కొత్త డిజైన్లు అవసరం. నూతన శీతలీకరణ టెక్నాల జీలపై పరిశోధన సాగాలి. అదే సమయంలో, వడగాడ్పులకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో చల్లదనాన్ని ఇచ్చే పైకప్పుల వంటి కొత్త ప్రయత్నాలకు సామూహిక స్థాయిలో ప్రయత్నాలు చేయాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
తైవాన్ నేర్పే ఆర్థిక పాఠాలు
కేవలం ఉమ్మడి మహబూబ్నగర్, ఆది లాబాద్ జిల్లాలను కలిపినంత భూభాగం; జనాభా పరంగా ఇంచుమించు మన దేశంలోని ఓ పెద్ద మహానగరంతో సమానం (2.3 కోట్లు) – అదే దశాబ్దాలుగా చైనా నుంచి తీవ్రమైన ఒత్తిడి నెదుర్కొంటున్న తైవాన్ దేశం. కానీ గత మే నెలలో ఈ చిన్న ద్వీపదేశం స్టాక్ మార్కెట్ సంపద విలువ ఏకంగా 4.95 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకి, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశ స్టాక్ మార్కెట్ను స్వల్పంగా అధిగమించింది. దాంతో తైవాన్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద మార్కెట్గా అవతరించడం ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఆ ఒక్క కంపెనీఒకప్పుడు వ్యవసాయం, పశుపోషణ, చేపలవేట వంటి మౌలిక వృత్తులపై ఆధారపడిన తైవాన్ – 70వ దశకంలో ఆర్థిక మంత్రి కేటీ లీ వంటి దీర్ఘదృష్టి గల నాయకుల సారథ్యంలో సాంకేతికత వైపు మళ్లింది. అప్పట్లో మైక్రోచిప్స్ రంగం అమెరికా, జపాన్ బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యంలో ఉండేది. అందులో పొంచి ఉన్న అవకా శాన్ని పసిగట్టిన తైవాన్, అమెరికాలో అప్పటికే విశేషానుభవం గడించిన మోరిస్ చాంగ్ అనే స్వదేశీయుణ్ణి ప్రోత్సహించింది. ఆ నేపథ్యంలో 1987లో సాధారణ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ప్రారంభ మైన టీఎస్ఎంసీ (తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ), నేడు అంతర్జాతీయ కాంట్రాక్ట్ చిప్ తయారీ రంగంలో దాదాపు 70% వాటాతో ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. 80,000 మందికి పైగా అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలను కలిగి ఉన్న టీఎస్ఎంసీ, తైవాన్ స్టాక్ మార్కెట్ సంపదలో సుమారు 42–44% వాటా కలిగి ఉంది.ప్రపంచం నేడు స్మార్ట్ఫోన్ల నుండి కృత్రిమ మేధ ఆధారిత సూపర్ కంప్యూటర్ల వరకు అవసరమైన చిప్స్ కోసం తైవాన్పై ఆధారపడుతోంది. దాంతో ఈ చిన్న చిప్లే చైనా వంటి శక్తిమంత మైన దేశంతో నిరంతర ప్రమాదం పొంచివుండే ఆ దేశానికి, అదృశ్య రక్షణ కవచంగా మారాయి. తైవాన్ దాడికి గురైతే, ఈ చిప్ల సరఫరాకు అంతరాయం ఏర్పడి తమ ఆర్థిక వ్యవస్థలకు ముప్పు తప్పదనే భయంతో పాశ్చాత్య దేశాలు, కూటములు తైవాన్ రక్షణకు బాసటగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా, తైవాన్ పొందే ఈ రక్షణ ‘సిలికాన్ షీల్డ్’ (సిలికాన్ రక్షణ కవచం)గా పేరొందింది. ప్రభుత్వ–ప్రైవేట్–విదేశీ సహకారం2016లో తైవాన్ మార్కెట్ విలువ 820 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, భారత్ 1.45 ట్రిలియన్ డాలర్లతో ముందుంది. గత పదేళ్లలో భారత్ గణనీయంగా వృద్ధి చెందినా, తైవాన్ మరింత వేగంగా పరుగులు తీసింది. భారత్ బ్యాంకింగ్, ఐటీ సేవలు, విని యోగ వస్తువులు, ఇంధనం వంటి వివిధ రంగాలపై దృష్టి సారిస్తే; తైవాన్ తన శక్తియుక్తులను చిప్ తయారీ వంటి హార్డ్వేర్ రంగంపై కేంద్రీకరించడం దీనికి ప్రధాన కారణం. మన వ్యవస్థలు ఎక్కువగా దేశీయ వినియోగంపై ఆధారపడి నడుస్తుంటే; తైవాన్ మాత్రం ప్రపంచ దేశాల సాంకేతికావసరాలను తీర్చుతూ అంతర్జాతీయ పెట్టుబడులను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. అయితే, 143 కోట్ల జనాభా వినియోగావసరాలను తీర్చడానికి మన దేశం ప్రాధాన్యత నివ్వడం కూడా ఆక్షేపణీయం కాదు.తైవాన్ విజయం వెనుక టీఎస్ఎంసీ ఒక్కటే కాదు– ఆ దేశ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్ల విధానం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. సిన్చు సైన్ ్స పార్క్లో చిప్ డిజైన్ కంపెనీలు, తైచుంగ్ ఇండస్ట్రియల్ పార్క్లో రోబోటిక్స్, కచ్చిత యంత్రాల తయారీ పరిశ్రమలు... వనరులు, సాంకేతికత మార్పిడి వంటి అంశాల్లో పరస్పరం అనుసంధానమై పని చేస్తు న్నాయి. ప్రభుత్వ–ప్రైవేట్–విదేశీ సంస్థల మధ్య సహకారం, ఫిలిప్స్ వంటి దిగ్గజాల నుండి సాంకేతికత సరఫరా, అమెరికా విపణులతో సంబంధాలు ఈ వ్యవస్థను పటిష్ఠపరిచాయి. దీనికి తోడు, విద్యావిధానాన్ని పరిశ్రమల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, విశ్వవిద్యాలయాలను నైపు ణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో స్థిరపడిన తైవాన్ మేధావులను తిరిగి రప్పించడానికి పన్ను మినహా యింపులు, పరిశోధనా నిధులు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో, ఆ మానవ వనరులు దేశాభివృద్ధికి పునరంకితమయ్యాయి.అయినప్పటికీ ఈ నమూనా బలహీనతలకు అతీతం కాదు. ఒకే కంపెనీపై గణనీయంగా ఆధారపడ్డ సెమీకండక్టర్ రంగం తైవాన్ జీడీపీలో సుమారు 18–20% వాటా కలిగి ఉంది. ఈ పరిణామం ‘డచ్ డిసీజ్’ లాంటి సంక్షోభం తెచ్చిపెట్టే ప్రమాదం పొంచి ఉంది. 1960ల కాలంలో నెదర్లాండ్స్ (డచ్) అప్పుడప్పుడే అన్వేషించ బడుతున్న సహజ వనరులపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించడంతో, ఇతర రంగాలు బలహీనపడ్డాయి. అలా ఏదైనా ఒక రంగంపై దేశం అధికంగా ఆధారపడితే వచ్చే దుష్పరిణామాలను సూచించడానికి ఈ పదం వాడతారు. చిప్లకు ప్రత్యామ్నాయాలు ఆవిర్భవించినా లేదా అమెరికా, దక్షిణ కొరియా, భారత్ వంటి కొత్త పోటీదారులు పుంజుకున్నా దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలు చిక్కుల్లో పడతాయి. అంతేకాకుండా పరిమిత వనరులు కలిగిన ఆ దేశం విద్యుత్ సర ఫరాలో అంతరాయాలు, నీటి ఎద్దడి, వృద్ధాప్యానికి చేరువవుతున్న జనాభా, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వంటి సవాళ్లను ఎదు ర్కొంటోంది. అన్నింటికంటే పెద్ద ముప్పు – దేశ సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేయగలిగిన చైనా సైనిక–రాజకీయ ఒత్తిడి. పారిశ్రా మికాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చిన తైవాన్, తొలినాళ్ళలో వీటిపై దృష్టి సారించలేదు. మనమేం చేయొచ్చు?సవాళ్లను అధిగమిస్తూ తైవాన్ సాధిస్తున్న విజయాలు వర్ధమాన దేశాలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. భారతదేశం, ముఖ్యంగా సెమీకండక్టర్ రంగంలో ముందుకు సాగుతున్న తెలుగు రాష్ట్రాలు, తైవాన్ పురోగతిని నిశితంగా పరిశీలించాలి. భారత్ ప్రభుత్వం ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ ద్వారా వేల కోట్లు పెట్టుబడి పెట్టడం, ప్రస్తుత కృత్రిమ మేధ యుగంలో సరైన ముందడుగే. కానీ కేవలం భారీ ఉత్పత్తి సామర్థ్యాలు సమకూర్చుకోవడంతో పాటుగా, తైవాన్ తరహా సమగ్రమైన సరఫరా శృంఖలలను సృష్టించగలగాలి. నైపుణ్యాలను పెంపొందించే విద్యా విధానం, వ్యతిరేక దిశలో మేధో వలసలు, పారిశ్రామిక సముదాయాలు, విడిభాగాల ఉత్పత్తికేంద్రాలు, సాంకేతికత మార్పిడి, మార్కెటింగ్ అనుసంధానం– ఇవన్నీ అందులో అంతర్భాగాలు కావాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో ప్రతిభ చూపుతున్న మన తెలుగు యువత – తమ నైపుణ్యాలను హార్డ్వేర్ రూపకల్పన, చిప్ తయారీ, సరఫరా గొలుసుల కూర్పు వైపు కూడా విస్తరించాలి. ఇందుకోసం మన తెలుగు రాష్ట్రాలు కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ రూపకల్పన, ఉత్పత్తి పారిశ్రామిక వాడలను నిర్మించాలి. విద్యారంగాన్ని సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ చిప్ సంస్థలతో ఇంటర్న్షిప్లు, పరిశోధనలు, తైవాన్ లాంటి దేశాల సందర్శనలు వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. ఏఐ వల్ల సాఫ్ట్వేర్ రంగం ప్రభావితమవ్వబోతోందన్న ఆందోళనకు ఇదో చక్కటి పరిష్కారం కూడా!పల్లపోతు కృష్ణబాలాజివ్యాసకర్త విశ్రాంత ఉన్నతాధికారి, ఎస్.బి.ఐ. -
నరేంద్ర మోదీ (భారత ప్రధాని) రాయని డైరీ
జూన్ 10కి, ప్రధానిగా నాకు 4,398 నిండి 4,399 వస్తాయి! మహాపురుషుడు జవహర్ లాల్ నెహ్రూ పాలనా కాలాన్ని దాటేస్తున్నందువల్ల నాకు కలుగుతున్న గుర్తింపే తప్ప, అదేమీ నాకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు కాదు. బుధవారం, ఢిల్లీలోని అశోక హోటల్లో కూటమి మిత్రులు నన్ను సన్మానించేందుకు సిద్ధం అవుతున్నారు! ‘‘అవసరమా!’’ అని నేను వారిని ప్రశ్నించాను. ‘‘అవును మోదీజీ, ఇది చరిత్రాత్మక అవసరం’’ అన్నారు మిత్రులు. ‘‘ఇందులో నేను సాధించినది ఏమిటి?’’ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ‘‘సుదీర్ఘ పదవీ కాలం... నిరంతర పాలన...’’ అని వారి నుంచి సమాధానం వినిపించింది! సుదీర్ఘ పదవీ కాలానికీ, నిరంతర పాలనకూ ఒకరిని దాటుకుని పోవటమే కొలమానం, కాలమానం అయితే... పండిట్ నెహ్రూ పదవీ కాలాన్ని కాక, నెహ్రూ అంతటివారిని దాటుకుని రావటమే ఏ ప్రధానికైనా అసలైన గుర్తింపు. దురదృష్టవశాత్తూ ఆ గుర్తింపును ఆయన కుమార్తె కూడా దక్కించుకోలేక పోయారు. శ్రీమతి గాంధీ 4,077 రోజులు మాత్రమే నిరవధికంగా ప్రధానిగా ఉన్నారు. తక్కిన ప్రధానులలో దీర్ఘకాలం పాలనలో ఉన్నవారు మన్మోహన్ సింగ్ ఒక్కరే. ఆయన 3,656 రోజులు ప్రధానిగా కొనసాగారు. ఎవరూ కూడా దరిదాపుల్లోనికైనా వెళ్లలేని మహనీయుడు నెహ్రూజీ. 2019లో, రెండోసారి నేను ప్రధాని అయినప్పుడు ఇదే జూన్ నెలలో లోక్సభలో పండిట్ నెహ్రూ మాటల్ని గుర్తు చేసుకున్నాను. దేశాన్ని కర్తవ్య మార్గంలో నడిపించాలని నెహ్రూజీ కన్న కలను, మనమందరం కలిసి నెరవేర్చాలని ఆకాంక్షించాను. 2023లో కొత్త పార్లమెంట్ భవన్లోకి మారినప్పుడు కూడా, ఆ ప్రారంభోత్సవంలో, ఎంతో గొప్పదైన నెహ్రూజీ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం దేశానికి ఒక శాశ్వతమైన, సామూహిక భావోద్వేగంగా నిలిచిపోయిందని గుర్తు చేశాను.అటువంటి మహోన్నతుడిని ఎవరు దాటగలరు? ఎప్పటికి దాటగలరు? ‘‘లేదు మోదీజీ, మీ 12 ఏళ్ల నిరంతర పాలనను శ్లాఘిస్తూ ప్రత్యేక సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టే భాగ్యాన్ని మాకు కల్పించాల్సిందే’’ అని కూటమి మిత్రుడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. ఆయనతో పాటుగా మిగతా కూటమి ముఖ్యమంత్రులు– మేఘాలయ నుంచి కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ నుంచి నీఫియు రియో, పుదుచ్చేరి నుంచి రంగస్వామి, సిక్కిం నుంచి ప్రేమ్ సింగ్ తమాంగ్– వారి వారి రాష్ట్రాల పూలగుత్తులు, ప్రతిపత్తులు, ప్రభుభక్తులతో ఢిల్లీకి రాబోతున్నారు! ఆ రోజు నేను, ఏ మాత్రం నా గురించి కాక, నెహ్రూజీ గురించి మాత్రమే ప్రసంగించటం సభా మర్యాద.ఇదే మర్యాదను నేను 2015లో బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగిస్తున్నప్పుడు పాటించాను. భారతదేశానికీ, బ్రిటన్కూ మధ్య మేధో వారథిగా నిలిచిన నెహ్రూను మనసారా స్మరించాను. ఆయన రాజకీయాలతో నేను ఏకీభవించక పోవచ్చు, కానీ రాజకీయాలకు అతీతంగా ఆయన్ని నేను గౌరవిస్తాను. పండిట్జీ నుంచి మన్మోహన్సింగ్ వరకు ప్రతి ప్రధానీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేసినవారే. రెండుసార్లు, రెండు 13 రోజులపాటు మాత్రమే ప్రధానిగా ఉన్న గుల్జారీలాల్ నందా కూడా ఆ కృషిలో ముఖ్య భాగం కలిగివున్నవారే. ఈ రోజు నేనున్న స్థానం, రేపు నేను చేరుకోబోతున్న సంఖ్య... గతాన్ని వెనక్కు నెట్టేసేవి కాదు, భారతదేశ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేసేవి. పరుగుల కన్నా ప్రవాహం ముఖ్యం. ఆ, కాల ప్రవాహంలో నేనొక కార్యకర్తను. 4399 అనేది నా బ్యాడ్జి నంబర్. అంతే! -
'వివాదాలు వీడి' వాణిజ్యం వైపు!
వందకు పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలతో కూడిన బృందంతో భారత వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ గత వారం కెనడా పర్యటించటం ఇరు దేశాల సంబంధాలలో కీలక మలు పును సూచిస్తోంది. మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా పగ్గాలు చేపట్టే సమయానికి భారత్–కెనడా సంబంధాలు అధఃపాతా ళంలో ఉన్నాయి. ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతంలో రెండు దేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని పెద్ద మొత్తంలో బహిష్కరించాయి. ఖలిస్తాన్ వివాదం, దౌత్య స్పర్థల్ని నాటి ప్రధాని ట్రూడో తన స్థానిక రాజకీయ చదరంగంలో పావుల్లా వాడుకోవటానికి ప్రయత్నించారు. భారత సంతతికి చెందిన 18 లక్షల కెనడియన్ల ఓట్లకు గాలం వేయటానికి ట్రూడో భారత్–కెనడా సంబంధాలను ఫణంగా పెట్టారు. కెనడా పార్లమెంటులో బహిరంగంగా నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తమున్నదని (అండర్ కవర్ ఆపరేషన్) ఆరోపించారు. సంబంధాలలో సరికొత్త అధ్యాయంమార్క్ కార్నీ ప్రధాని కాగానే భారత్తో సంబంధాలను పునరు ద్ధరించటంపై దృష్టి పెట్టారు. 2023 అక్టోబర్లో దౌత్యవేత్తల బహి ష్కరణ తర్వాత 2025 సెప్టెంబర్లో తిరిగి హైకమిషనర్లను పునర్ని యమించారు. అదే నెలలో ఇరు దేశాల భద్రతా సలహాదార్లు సమా వేశమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో కార్నీ నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించటంతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2010 నుండి పదహారేళ్లుగా నత్తనడక నడుస్తున్న భారత్–కెనడా వాణిజ్య చర్చలను పరుగులు పెట్టించి 2026 సంవత్సరాంతానికి ‘కాంప్రహెన్సివ్ ఎకనమిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్’ (సీఈపీఏ)ను ఖాయం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మూడింతలు చేసి 50 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలని నిశ్చయించారు.భారత్–కెనడా వాణిజ్యం కేవలం కొన్ని వస్తువులు, సేవలకే పరిమితమై ఉంది. కెనడా నుండి మనం పప్పుధాన్యాలు, చమురు, గ్యాస్, బొగ్గు, కలప, కాగితం, ఎరువులు, వైమానిక పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. కెనడాకు భారత్ విలువైన రాళ్లు, ఫార్మా స్యూటికల్స్, వస్త్రాలు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. నిజానికి ఈ వాణిజ్యాన్ని విస్తరించటానికి అవకాశాలు ఉన్నాయి. భారత్ 2070 కల్లా నెట్–జీరో కార్బన్ లక్ష్యాన్ని సాధించాలంటే అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా విస్తరింపజేయాలి. 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి కనీసం సాలీనా 5 వేల టన్నుల యురేనియం అవసరమవుతుంది. మన దేశంలో సాలీనా 600 టన్నుల యురేనియంను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. భారత్లో ఉన్న 24 అణు రియాక్టర్లలో 14 యురేనియం కొరత వలన సామర్థ్యం కంటే దిగువన పని చేస్తున్నాయి. చైనాకు ప్రత్నామ్నాయంగా కెనడాకెనడా, ప్రపంచంలో రెండవ అతి పెద్ద యురేనియం ఉత్పత్తి దారు. అత్యంత నాణ్యమైన యురేనియం సిగార్ సరస్సు, మెక్– ఆర్థర్ నదీ పరివాహకాలలో ఉత్పత్తి అవుతున్నది. ప్రపంచ మార్కె ట్లలో లభించే ఆస్ట్రేలియా, కజకిస్తాన్ యురేనియంతో పోల్చితే కెనడా యురేనియం నాణ్యమైనది, చౌకగా లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2020లో కాలం చెల్లిన 2015 ఒప్పందం స్థానంలో భారత్– కెనడాల మధ్య 2.5 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం ఒప్పందంపై కార్నీ భారత పర్యటనలో అంగీకారం కుదిరింది.యుద్ధ విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, ఏఐ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ రంగాలకు కీలకమైన 24 రకాల అరుద యిన ఖనిజాల విషయంలో భారత్ దాదాపుగా చైనా దిగుమతులపై ఆధారపడుతున్నది. లాంథనం, సెరియం, నియోడిమియం, సమారియమ్, టెర్బియం, డిస్ప్రోజియం, లిథియం తదితర అరుదైన ఖనిజాలు కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సముద్రతీర మోనజైట్ ఇసుక లలో లభిస్తాయి. కానీ మోనజైట్ను శుద్ధి చేసి ఆ ఖనిజాలను వేరు చేసే సామర్థ్యం భారత్కు లేదు. ముడి మోనజైట్ను చైనాకు ఎగుమతి చేసి, శుద్ధి చేసి, వేరుపరిచిన ఖనిజాలతో తయారయిన మాగ్నెట్లను, బ్యాటరీలను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అరుదైన ఖనిజాల శుద్ధి, మాగ్నెట్లు / బ్యాటరీల తయారీ వ్యవస్థ కెనడా వద్ద ఉన్నప్పుడు చైనాపై ఆధారపడటం వ్యూహాత్మక తప్పిదం. ఈ నేపథ్యంలోనే అరుదైన ఖనిజాల శుద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, మాగ్నెట్ల తయారీకి కెనడాతో అంగీకారం కుదిరింది. ఈ సంవత్సరాంతానికి కెనడా కంపెనీల భాగస్వామ్యంతో కనీసం అయిదు ప్రాజెక్టులను ఈ రంగంలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారత్ వాటా 40 శాతం. సుమారు 4.27 లక్షలమంది భారతీయులు కెనడాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఏడాది 15 బిలియన్ డాలర్లను కెనడాకు చెల్లిస్తున్నారు. 21 కెనడా యూనివర్సిటీల అధిపతులు కార్నీ వెంట భారత్కు వచ్చారు. భారత్లో కెనడియన్ యూనివర్సిటీల క్యాంపస్ల ఏర్పాటుకు, భారత్–కెనడా యూనివర్సిటీల ఉమ్మడి కోర్సుల నిర్వహణకు, విద్యార్థుల మారకానికి, ఏఐ గ్రీన్ హైడ్రోజన్ క్వాంటమ్ మెకానిక్స్ వంటి రంగాలలో ఉమ్మడి పరిశోధనలకు 200కు పైగా ఒప్పందాలు జరిగాయి.సుంకాల రద్దుకు సమాలోచనలుఆర్కిటిక్, పసిఫిక్ తీరాలు కలిగి ఉన్న కెనడాలో రక్షణ–భద్రత రంగాలలో కూడా భారత్ సంబంధాలు పటిష్టం చేసుకోవటానికి ఒప్పందం జరిగింది. రానున్న దశాబ్దాలలో ఇండో–పసిఫిక్, ఆర్కి టిక్ జలాలు ప్రపంచ రాజకీయాలను శాసిస్తాయి. అందుకే నౌకా నిర్మాణం, సబ్మెరైన్లు, సముద్ర జలాలలో నిఘా వంటి అంశాలలో ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రాజెక్టులను ప్రారంభించటానికి శ్రీకారం చుట్టారు. భారత ఆర్థిక సేవల రంగంలో కెనడియన్ పెన్షన్ ఫండ్ల పెట్టుబడులు కీలకం. 140 బిలియన్ కెనడియన్ డాలర్లను భారత దేశపు ఎనర్జీ, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, ఈక్విటీ, బాండ్ సెక్యూరిటీలలో కెనడా పెట్టుబడిగా పెట్టింది. స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇరువైపులా సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని కూడా భావిస్తున్నారు. కానీ భారత్కు ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఇబ్బందులున్నాయి. ప్రస్తుతం కెనడా పప్పుధాన్యాలు, నూనెల దిగుమతులపై 15–30 శాతం సుంకాన్ని విధిస్తున్నాం. వ్యవసాయ దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే మన రైతులు, వ్యవ సాయంపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీఈపీఏ ఒప్పందం ఖాయం చేయాలంటే సుంకాలతోపాటు అనేక ఇతర సంక్లిష్ట అంశాలలో ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేవలు, పెట్టుబడుల రక్షణ, వివాదాల పరిష్కారం, మేధోహక్కుల పరిరక్షణ, కార్మిక, పర్యావరణ ప్రమాణాలు వంటి విషయాలలో మన దేశం రాజీ పడలేదు. కొత్త భాగస్వాముల వేటలో ఉన్న కెనడాతో పటిష్ట సంబంధాలు ఏర్పరచుకోవటంఉభయ తారకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
హనీమూన్ ముగిసి సవాళ్ల దశలోకి!
ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులు ప్రస్తుతం మూడు ప్రభుత్వాల పనితీరును ప్రత్యేకంగా గమనిస్తున్నారు. అవి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్. ఇవి వేర్వేరు స్వతంత్ర దేశాలు కాగా, ఇపుడు అకస్మాత్తుగా వారి దృష్టిని తమిళనాడు ఆకర్షిస్తున్నది. ఈ జాబితాలోకి అనూహ్యంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా వచ్చి చేరింది. పరిశీల కుల దృష్టిలో ఇటువంటి జాబితా ఒకటి తయారు కావటానికి కారణం, ఈ పరిణామాలన్నింటి వెనుక యువతరం ఆగ్రహం ఒక అంతస్సూత్రంగా కనిపిస్తుండటం; ఇదంతా ఆసియాలో జరుగుతుండటం.నేషనల్ ఛార్టర్– ఒక ప్రత్యేకతబంగ్లాదేశ్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 17న అధికారానికి వచ్చిన తారిఖ్ రహమాన్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయ్యాయి. ఆయన నాయకత్వాన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధికారానికి వచ్చిన పరిస్థితులు తెలిసినవే. షేక్ హసీనా ప్రధానిగా 17 సంవత్సరాల పాటు సాగిన అవామీ లీగ్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన యువతరం ఉద్యమంతో ఆ ప్రభుత్వం పతనమైంది. కొంతకాలం మధ్యంతర ప్రభుత్వ పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో బీఎన్పీ మూడింట రెండు వంతుల ఆధిక్యతతో విజయం సాధించింది. ప్రతిపక్ష జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీ తాము పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించగలమనీ,కొంత కాలంపాటు అయినదానికి కానిదానికి ఆందోళనలు చేయబో మనీ ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి.ఇదిగాక గమనించవలసిన విషయం, అధికార పక్షానికి తన సొంత మేనిఫెస్టో ఒకటిగాక, అన్ని పార్టీల ఆమోదంతో ‘నేషనల్ ఛార్టర్’ పేరిట పరిపాలనా సంస్కరణల కార్యక్రమం ఒకటి కూడా ఎన్నికలకు ముందే రూపు తీసుకుంది. ఎన్నికలతో పాటే దానిపై రెఫరెండం జరగగా అందుకు ప్రజామోదం లభించింది. ఇటువంటి ఛార్టర్, అందుకు రెఫరెండం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలలో మరెక్కడా జరిగినట్లు లేదు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులు బంగ్లా దేశ్ను గమనించటానికి ఇవన్నీ కారణమవుతున్నాయి.మాట నిలబెట్టుకుంటారా?పదిహేడు సంవత్సరాల అస్తవ్యస్త పాలన తర్వాత కొత్త ప్రభు త్వపు పనితీరును అంచనా వేసేందుకు కేవలం వంద రోజుల వ్యవధి నిజానికి సరైనది కాదు. ఆ పరిమితిని దృష్టిలో ఉంచుకుంటూనే అసలు ఈ కాలంలో జరిగిందేమిటనేది చూడవచ్చు. మాజీ ప్రధాని బేగం ఖలేదా జియా కుమారుడైన తారిఖ్ రహమాన్ గత చరిత్ర గొప్పదేమీ కానందున, ఆయన దీర్ఘకాలపు ప్రవాస జీవితం నుంచి ఎన్నికలకు కొద్దికాలం ముందు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, తానిప్పుడు మారిన మనిషినని ప్రకటించారు. ఇప్పుడు మే 27కు హనీమూన్ కాలం ముగిసేవరకు ఆయన తన మాట ప్రకారమే వ్యవహరిస్తూ రావటాన్ని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా గుర్తించినట్లు కనిపిస్తున్నది. ఆ విధంగా మొదట పాలకునిపై వ్యక్తిగత స్థాయిలో నమ్మకం ఏర్పడితే, హనీమూన్ కాలంలో ఏమి జరిగినా జరగకున్నా రాగల రోజులపై ఆశాభావం కలుగుతుంది.పరిపాలనకు వస్తే, యథాతథంగానే వెనుకబడినది అయిన బంగ్లాదేశ్కు షేక్ హసీనా సుదీర్ఘ పాలనలో అవినీతి వల్ల సమస్యలు మరింత పెరిగాయి. కనుక, కొత్త ప్రభుత్వం నిజాయితీగా, శ్రద్ధగా పనిచేసినా పరిస్థితులు కుదుట పడేందుకు చాలా సమయమే తీసు కుంటుంది. అదట్లుండగా, ఇపుడు మూడు నెలలుగా కొనసాగు తున్న ఇరాన్ యుద్ధం సృష్టించిన చమురు, గ్యాస్ సమస్యలు పిడుగు వలె వచ్చి పడ్డాయి. వారి ఇంధన అవసరాలలో 62 శాతం దిగుమ తుల ద్వారా తీరవలసినవే. ఈ స్థితి వల్ల కొత్త ప్రభుత్వం మరింత సతమతమవుతున్నది. ఇది మొత్తం మీద గల స్థూల పరిస్థితి కాగా, తారిఖ్ రహమాన్ ప్రభుత్వం వీటిని సాకుగా చూపకుండా అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవటం గురించి చెప్పాలి. ఆ పనులు చేసే ముందు ఆయన స్వయంగా ప్రతిపక్ష నాయకుల నివాసాలకు వెళ్లి సంప్రదింపులు జరిపారు. పరిపాలన విషయంలో ప్రజలకు తక్షణం అనుభవంలోకి వచ్చేది సంక్షేమ చర్యలన్నది తెలిసిందే. ఆ ప్రకారం పేదలకు, రైతులకు ఆహార సహాయంగా నెలకు 2,500 బంగ్లాదేశ్ టాకాల (ఒక రూపాయి 1.29 టాకాలకు సమానం) విలువ చేసే కార్డులు జారీ చేశారు. రైతులు, మత్స్యకారులు, పాడి పెంపకందారులకు పదివేల టాకాల వరకూ రుణమాఫీ జరిపారు. పేదలందరికీ వైద్య చికిత్సల కార్డులు పంపిణీ చేశారు. స్కూలు పిల్లలకు యూనిఫారాల సరఫరా జరిగింది.ఉలికిపాటు ఉప్పెనఇటువంటివి సంక్షేమాలు, ఉపశమన చర్యలు కాగా, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం దేశమంతటా సాగునీటి కాల్వల పునరుద్ధరణను ప్రారంభించారు. బంగ్లాదేశ్లో వరి ఉత్పత్తి తగినంత ఉన్నా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంతోపాటు దేశమంతటా చెట్ల పెంపకంవల్ల గ్రామీణు లకు ఉపాధికల్పన జరుగుతుందన్నది ఆలోచన. యువకుల ఉపా ధికి పరిశ్రమలు, వాణిజ్యం తప్పనిసరి గనుక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, ఎగుమతి రంగాల విస్తరణ, కొత్త పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరొక వైపు, కొన్ని అంశాలకు సంబంధించి విమర్శలు కూడా వినవస్తు న్నాయి. వాటిలో ముఖ్యమైనవి శాంతిభద్రతలు, అదే విధంగా వేర్వేరు రంగాల సంస్కరణల కోసం రూపొందించిన జాతీయ ఛార్టర్ అంశాలను ఇంతవరకు పార్లమెంట్లో ధ్రువీకరించటంపై గానీ, అమలు పరచటంపైగానీ తగు చర్యలు తీసుకోకపోవటం.రాగల రోజులలో వీటితోపాటు, భారతదేశంతో సంబంధాల మెరుగుదల బీఎన్పీ ప్రభుత్వానికి సవాళ్లు కానున్నాయి. ప్రధాని రహమాన్ అధికారానికి వచ్చినప్పుడు, ఆ పని తప్పక చేయగల మనీ, అందుకు పరస్పర ప్రయోజనాలు, గౌరవాలు ఆధారం కావా లనీ, అదే ప్రాతిపదికపై సమస్యలను పరిష్కరించుకోగలమనీ అన్నారు. కానీ ఈ వంద రోజులలో ఆ దిశగా అడుగులు పడలేదు. ఇందుకు రెండు వైపుల నుంచి చొరవ అవసరం. నదీ జలాలు, సరిహద్దుల గుర్తింపు, వలసలు, షేక్ హసీనా అప్పగింత వంటివి తేలిక వివాదాలు కావు.మళ్లీ మొదటికి వస్తే, బంగ్లాదేశ్తోపాటు శ్రీలంక, నేపాల్ ప్రభుత్వాల పనితీరుపై, అవి ఇంతకుముందటి ప్రభుత్వాల కన్న ఎంత భిన్నంగా ఉండగలవన్న దానిపై, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. తమిళనాడులో విజయ్ గెలుపులోనూ వారు యువతరం తిరుగుబాటుతో కూడిన ఆకాంక్షల వెల్లువను చూస్తున్న సమయంలో, ‘కాక్రోచ్’ ఉప్పెన వారిని ఉలికిపాటుకు గురిచేసింది. ప్రధాని మోదీ ఇటీవలి అసెంబ్లీ విజయాలతో ఎదురులేకుండా పోయిందనుకుంటుండగా, యువతరం నుంచి ఈ అనూహ్యమైన భూకంపం వారిని పునరాలోచనలో పడవేసింది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో వ్యవసాయం స్పష్టంగా రాష్ట్ర జాబితాలో ఉంది. జాబితా–2 లోని 14వ నమోదు (ఎంట్రీ) ప్రకారం వ్యవసాయం, వ్యవసాయ విద్య, పరిశోధన, పంట రక్షణ.. ఇవన్నీ రాష్ట్రాల ప్రత్యేక అధికారం. 18వ నమోదులో భూమి, కౌలు, బదిలీ, వ్యవసాయ రుణాలు ఉన్నాయి. 28వ నమోదులో మార్కెట్లు, సంతలు ఉన్నాయి. వ్యవసాయం స్థానికమైనది. నేలలు, వర్షాలు, పంటల చక్రాలు, కౌలు విధానాలు, విత్తన సంస్కృతులు రాష్ట్రాల మధ్యే కాదు, జిల్లాల మధ్య కూడా మారతాయి అని రాజ్యాంగ నిర్మాతలకూ తెలుసు.కేంద్రీకృత వ్యవసాయ విధానం వ్యవసాయ శాస్త్రపరంగా అసంబద్ధం. అందుకే వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. స్వాతంత్య్రానంతరం ఎనిమిది దశాబ్దాలు గడిచిన తరువాత కూడా వరి కనీస మద్దతు ధర, పప్పుధాన్యాల దిగుమతి సుంకం, పురుగుమందుల రిజిస్ట్రేషన్, జీఎం పంటల అనుమతి, ఎరువుల సబ్సిడీ నిర్మాణం, పంటల బీమా రూపకల్పన, రైతు డేటాబేస్ ఫార్మాట్, మట్టి, కార్బన్ క్రెడిట్ ప్రోటో కాల్లు, రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లను కేంద్ర ప్రాధాన్యతలకు పరిమితం చేసే కేంద్ర పథకాల షరతులు... వీటన్నింటినీ నిర్ణయిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే! రాష్ట్రాలు కేవలం ఆ పథకాల అమలు సంస్థలుగా మిగిలిపోయాయి. కేంద్ర మార్గదర్శకాల ద్వారా, కేంద్ర గుర్తింపుతో పథకాలను అమలు చేస్తూ, కృషి భవన్, వాణిజ్య భవన్లలో తీసుకున్న నిర్ణయాల పర్యావరణ భారాన్ని రాష్ట్రాలు మోస్తున్నాయి.ఇరవై ఏళ్లుగా మొలకెత్తని విత్తన బిల్లు!వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితాలో ఉంచిన అసలు ఏర్పాటు నిశ్శబ్దంగా క్రమేణా శూన్యమైపోయింది. వాణిజ్య అధికారాలు, ఉమ్మడి జాబితా నమోదులు, నిత్యావసర వస్తువుల చట్టం, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల కింద అంతర్జాతీయ నిబద్ధతలు, జీఎస్టీ ద్వారా ఆర్థిక కేంద్రీకరణ, షరతులతో కూడిన కేంద్ర పథకాల విస్త రణ... ఇవన్నీ కలిసి రాజ్యాంగ సవరణ లేకుండానే జరిగిపోయాయి. క్షేత్రస్థాయి పరిశీలన ఈ సమస్యను స్పష్టంగా చూపిస్తుంది. 2003–04లో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తి పంట నాశనమైంది. నాణ్యత లేని బి.టి. హైబ్రిడ్లపై కాయతొలుచు పురుగు దాడి, నకిలీ విత్తనాలు అమ్మిన అవినీతి డీలర్లు, వాతావరణ ఒత్తిడి... వీటన్నిటి కారణంగా అప్పుల్లో ఉన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విత్తన నాణ్యత పరీక్ష, కంపెనీల జవాబుదారీతనం, రైతుల పరిహారం కోసం విత్తన నష్ట పరిహార చట్టం ముసాయిదాను తయారు చేసింది. అయితే ఆ ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశ్చర్యకరంగా ఉంది. జాతీయ విత్తన బిల్లు సిద్ధంగా ఉందనీ, రాష్ట్ర చట్టం గందరగోళం సృష్టిస్తుందనీ కేంద్ర అధికారులు వాదించారు. రాష్ట్రాన్ని ఆగమని కోరారు. 2004 విత్తన బిల్లు దాదాపు రెండు దశాబ్దాలుగా పార్లమెంటులో మూలుగుతూ ఉంది. ఈ మధ్య లోని కాలంలో రైతులకు అనేక సమస్యలు ఎదురైనా వాటికి ఎలాంటి చట్టపరమైన పరిష్కారమూ లభించ లేదు.పురుగుమందుల విషయంలో మరింత దారుణమైన అసమ తుల్యత ఉంది. 1968 క్రిమిసంహారక చట్టం సెక్షన్ 27 ప్రకారం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర పురుగుమందు అమ్మకాన్ని నిషేధించ గలిగేది గరిష్ఠంగా 90 రోజులు (మొదట 60 రోజులు, తర్వాత 30 రోజులు) మాత్రమే. అంటే తన ప్రజలను ప్రమాదకర రసాయనం నుండి కాపాడుకోవడానికి ఒక రాష్ట్రానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశం 90 రోజులు మాత్రమే. ఆసుపత్రి అడ్మిషన్లు, దీర్ఘకాలిక నాడీ వ్యాధులు, విషం తాగి ఆత్మహత్యలు వీటన్నిటినీ భరించే రాష్ట్రానికి స్వయంగా నిర్ణయం తీసుకునే వెలుసుబాటు లేదు. ఉదా: కేరళ 2001లో ఎండోసల్ఫా¯Œ ను నిషేధించింది. కేంద్రం దానిని జాతీయ స్థాయిలో నిషేధించడానికి దాదాపు పదేళ్లు పట్టింది. నియంత్రణలకు రాష్ట్రాల సమ్మతి ఏదీ?తెలంగాణలో వరి సాగును పరిశీలించండి. దాదాపు 40 లక్షల హెక్టార్లలో, ఎక్కువగా బోర్వెల్ నీటిపై ఆధారపడి, రాష్ట్రం ఇచ్చే ఉచిత విద్యుత్తో పంపింగ్ చేసే భూగర్భ జలంతో ఇది సాగుతోంది. వరి సాగుకు ప్రోత్సాహం ఇచ్చే కనీస మద్దతు ధరపై రాష్ట్రా నికి అధికారం లేదు. ఎరువుల సబ్సిడీపై అధికారమూ పరిమితమే. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా ‘సేకరణ’ విధానాన్ని మార్చలేదు. వాణిజ్యంలో రాజ్యాంగ వైరుధ్యం మరింత పదునుగా కని పిస్తుంది. వ్యవసాయం రాష్ట్ర అంశం. వ్యవసాయ వాణిజ్యం కేంద్ర అంశం. అంటే ఉల్లి సాగును మహారాష్ట్ర నియంత్రిస్తుంది. ఉల్లి ఎగుమతిని వాణిజ్య భవన్ నియంత్రిస్తుంది. 2007–08, 2010, 2019, మళ్లీ 2023లో దేశీయ ధరల ఒత్తిడికి స్పందనగా, ఎగుమతి మార్కెట్ను ఆశించి పంటలు వేసిన రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే కేంద్రం బియ్యం, గోధుమపై హఠాత్తుగా ఎగుమతి నిషే ధాలను విధించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు పరిస్థితిని మరింత జటిలం చేశాయి. ‘ఏషియన్’ దేశాలు, జపాన్, కొరియాలతో ద్వైపాక్షిక ఒప్పందం.. వీటిల్లో ఏ ఒక్కదానిపైనా రాష్ట్రాల అధికారిక భాగస్వామ్యంతో చర్చ జరగలేదు.మరి పరిష్కారం? మొదట, వ్యవసాయ సమాఖ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. సర్కారియా (1988), పుంఛీ (2010) కమిషన్లు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై దృష్టి పెట్టినా, ప్రత్యేకించి వ్యవసాయంపై పెట్టలేదు. అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతో, రాజ్యాంగ సవ రణలు, చట్టపరమైన మార్పులు, ఆర్థిక పునర్నిర్మాణం... వీటిని సిఫార్సు చేయగల అధికారంతో ఈ కమిషన్ ఉండాలి. రెండవది, నిర్దిష్ట చట్టపరమైన స్పష్టతలు కావాలి. నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణ, ఎగుమతి, నిల్వ నియంత్రణలు విధించే ముందు రాష్ట్ర సమ్మతి తప్పనిసరి. హానికర పురుగుమందులను శాశ్వతంగా నిషేధించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి.గిట్టుబాటు కాని పంటలకు బోనస్మూడవది, పర్యావరణ అనుకూల వ్యవసాయం వైపు ఆర్థిక వికేంద్రీకరణ. జీడీపీలో దాదాపు 1.7 శాతం ఉన్న ఎరువుల సబ్సి డీని (ప్రస్తుతం దాదాపు పూర్తిగా తయారీదారులకు చెల్లిస్తున్న దానిని) క్రమంగా ‘రైతువారీ పర్యావరణ పరివర్తన చెల్లింపు’గా మార్చాలి. స్థానిక ప్రాధాన్యతల ప్రకారం రాష్ట్రాలు దీనిని వినియో గించుకోవాలి. మార్కెట్ దొరకని పంటలకు సేకరణ, గిట్టుబాటు కాని పంటలకు బోనస్ ఇచ్చే పద్ధతి కావాలి. భూగర్భ జలాలను కాపాడే, మట్టి కార్బన్ను నిల్వ చేసే, సంప్రదాయ విత్తనాల్ని రక్షించే రాష్ట్రాలకు పర్యావరణ ఆర్థిక బదిలీలు అందించాలి.నాల్గవది, ప్రాంతీయ ఆహార వ్యవస్థల ప్రణాళిక. భారత వ్యవ సాయ వైవిధ్యానికి ఒకే జాతీయ ఆహార విధానం కాదు, ప్రతిప్రాంత వ్యవసాయ పర్యావరణం, ఆహార సంస్కృతి, ఆర్థిక నిర్మాణానికి అనుగుణంగా రూపొందించిన ప్రాంతీయ ఆహార వ్యవస్థ ప్రణాళికల సమాఖ్య సరైనది. తూర్పు కనుమల చిరుధాన్య ప్రాంతం, ఇండో–గంగా మైదానం, పశ్చిమ కనుమల సుగంధ ద్రవ్య ప్రాంతం, ఈశాన్య పోడు వ్యవసాయ ప్రాంతం, పశ్చిమ భారత పప్పుల ప్రాంతం, దక్షిణ ద్వీపకల్ప నీటిపారుదల వరి బెల్ట్... ప్రతిదీ ఒక ప్రత్యేక వ్యవసాయ పర్యావరణ మండలం. ఏక రూప పంటల విధానం రుద్దడం కాకుండా, ప్రాంతీయ ఆహార వ్యవస్థల కలయికగా జాతీయ ఆహార భద్రతను నిర్మించవచ్చు.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
డి.కె. శివకుమార్ (డిప్యూటీ సీఎం) రాయని డైరీ
ప్రయత్నాలు విఫలం కావచ్చు, ప్రార్థనలు నిష్ఫలం కావు. ఇన్నాళ్లకు దేవుళ్లు, దేవతలు కలిసి నేను కోరుకున్న స్థానంలో నన్ను ఉంచబోతున్నారు! ఓర్పు వహించినందుకు; పీఠాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించినందుకు దక్కిన వరం! ఆకాశం వైపు చూశాను. దివిలోని ఆ మెరుపుల దారుల నుంచే కదా నా కోసం దైవాశీస్సులు ఉరుముల రథాలు వేసుకుని, ప్రమాణ స్వీకారానికి వర్షించే మేఘాలై భువికి రాబోతాయి! రామనగర కాబలమ్మ అమ్మవారు, కెంచిరమ్మ అమ్మవారు; మైసూరు చాముండే శ్వరి మాత, చామరాజనగర్ శ్రీమలే మహదేశ్వరుడు, కల్లహళ్లి భూవరాహనాథుడు, శ్రీరంగనాథస్వామి వారు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, చిక్కమగళూరు శారదాంబ, ఉడిపి శ్రీమూకాంబిక, గోకర్ణ మహాబలేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, తిరుమల శ్రీవేంకటేశ్వరుడు, కారైకాల్ శనీశ్వరుడు, గువహటి కామాఖ్య మాత... పైనుంచి నా వైపు చూస్తూ – ‘‘సంతోషమేనా దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్’... అని నన్ను అడుగుతున్నట్లుగా ఉంది. ఇలలో నాకు దైవ సమానులైన నిర్మలానందనాథ స్వామిజీ, శ్రీ నంజవదుత స్వామిజీ, నొనవినకెరె అజ్జయ్య స్వామీజీ, శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ, ప్రణవానంద స్వామిజీ... నన్నెలాగూ ప్రమాణ స్వీకార ఘడియల్లో వేదిక మీదకు అదృశ్యంగా చెయ్యి పట్టి నడిపిస్తారు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు, ఎదురొచ్చే ప్రతి మనిషిలోనూ మనకు దైవమే కనిపిస్తాడేమో! అదొక సాక్షాత్కారం! ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘కావేరి’లో అల్పాహార సమావేశానికి వెళ్లినప్పుడు సిద్ధరామయ్య నాకు ఎదురొచ్చారు. ఆయనకు నమస్కరించాను. ఆత్మీయంగా కౌగిలించుకున్నాను. ఆ క్షణంలో... జీవాత్మ వెళ్లి పరమాత్మలో లయం అయినట్లుగా నేను పూర్తిగా లుప్తమైపోయాను!! దేవుడు నేరుగా దీవెనలుగానీ, శాపాలుగానీ ఇవ్వడు. కానీ అవకాశాలను కల్పిస్తాడు! ఆ అవకాశాలను వదులుకోకూడదు. ఆలస్యం చేయకుండా సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించాను. వెంటనే, ‘ఇదొక నాటక ప్రదర్శన’ అని బీజేపీ మొదలు పెట్టేసింది! ఒక మనిషి మీద గౌరవం నాటకం ఎలా అవుతుంది? ‘‘ఇక్కడీయన పాద నమస్కారాలు చేస్తున్నారు. అక్కడ ఈయన ఇంటి ముందు స్వీట్లు పంచుతూ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు...’’ అని అవహేళన! స్వీట్లు ఒకరు వెళ్లిపోతున్నందుకే పంచు కుంటారా? ఒకరు వస్తున్నందుకు పంచు కోరా? భక్తి భావనలను వీళ్లంతా ఎందుకు వ్యక్తిగతం చేస్తారు! ప్రత్యర్థిని ఎప్పుడూ ప్రత్యర్థిగానే చూడాలా? అలాగైతే, ‘రెండున్నరేళ్ల పదవీకాల ఒప్పందం’ ప్రకారం, నవంబరులోనే నేను సిద్ధరామయ్యతో తగవుకు దిగి సీఎంగా నా రెండున్నరేళ్ల పదవీకాలాన్ని ఆయన్నుంచి లాక్కోవలసింది కాదా? ఆయనే తప్పుకుని వెళ్లేవరకు ఇప్పటిదాకా నేను ఆగటం ఎందుకు? ముఖ్యమంత్రిగా రేపు నా ప్రమాణ స్వీకారం. జూన్ 1కి బదులు జూన్ 3 పెట్టుకుంటే మంచిదని నోనవినకెరె స్వామిజీ సందేశం పంపారు. ప్రమాణ స్వీకారం లోక్ భవన్ గ్లాస్ హౌస్లో కాకుండా, విధానసౌధ మెట్ల మీద ఏర్పాటు చేసుకొమ్మని రాజగురు బెల్లూరు ద్వారకానాథ్ వర్తమానం పంపారు. మెట్ల మీద స్వీకారం స్వర్గీయ రామకృష్ణ హెగ్డే, ఎస్.ఎం. కృష్ణ నెలకొల్పిన సంప్రదాయం. ముహూర్తం ఏదైనా, ప్రమాణం ఎక్కడైనా అంతా ప్రజల కోసమే. రాజ్యాంగం నా మతం. ప్రజలు నా దేవుళ్లు. మార్గం చూపించటం దైవ నిర్ణయం. గమ్యం చేరుకోవటం మానవ ధర్మం. -
సగటు జీవితాలే ప్రగతికి కొలమానం
విదేశాలలో నివసిస్తున్న చాలామంది భారతీయులకు, నేడు మన దేశం నిలు వెత్తు పురోగతికి సగర్వ చిహ్నంగా కనిపి స్తుంటుంది. వారు ఇక్కడి తళతళలాడే విమానాశ్రయాలు, ఆధునిక రహదా రులు, వేగంగా దూసుకుపోతున్న ఐటీ కారిడార్లను చూస్తుంటారు కనుక అది సహజమే. కానీ, ఏదైనా ఒక వ్యవస్థను సరిగ్గా ‘లెక్కించి’ చూడనంత వరకు ఆ వ్యవస్థ బయటకు కనిపించే తీరుకు, వాస్తవం ఏమిటన్న దానికి పొంతన ఉండటం అరుదు అని, ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఒక శాస్త్రవేత్తగా నాకు అనిపిస్తుంటుంది.ఆధారాలు, గణాంకాలు లేకుండా, కేవలం ఒక నమ్మకంతో దేశాన్ని చూసి మురిసిపోవడమే ఇక్కడ సమస్య. ఈ ప్రవాస భారతీయుల ఉల్లాసభరిత భావోద్వేగం అనేది ఒక చిన్న అంచనా లోపం వల్ల వస్తుంది. అదేమిటంటే... మనం ఈనాటి భారతదేశాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చడం లేదు. మన చిన్ననాటి భారతదేశంతో పోల్చుకుంటున్నాం. మన చిన్నప్పుడు ఉన్నప్పటి భారతదేశం వనరుల కొరతతో, తక్కువ అవకాశాలతో ఉండేది. ఒక దేశాన్ని ఆ దేశపు పాత రోజులతో మాత్రమే పోల్చి చూసినప్పుడు... ప్రపంచ దేశాల రేసులో ప్రస్తుతం అది ఏ స్థానంలో ఉందనే అసలు నిజాన్ని మనం గమనించలేకపోతాం.ఏం చూస్తే అదే కనిపిస్తుంది! భారతదేశ వాస్తవ పరిస్థితి ప్రవాస భారతీయులకు తెలిసే అవకాశం లేదు. వారు ఇక్కడకు వచ్చినప్పుడు తమకు నచ్చిన వాటి వైపు మాత్రమే చూడగల ఒక మనోస్థితికి (సెలెక్షన్ బయాస్) లోనవు తారు. సంపన్నులైన తమ బంధువుల ఇళ్లలో గడపడం, దేశ సగటు ఆదాయం కంటే ఐదు నుండి పది రెట్లు ఎక్కువగా సంపాదించే బెంగళూరు, హైదరాబాద్ లేదా గురుగ్రామ్ వంటి ఆధునిక ఐటీ హబ్లలో తిరగడం వల్లనే వారి అభిప్రాయాలు ఏర్పడతాయి. వారు ఇక్కడ కేవలం మొదటి 1–5 శాతంలో ఉండే అత్యంత సంపన్న వర్గాన్ని మాత్రమే చూసి, అదే మొత్తం భారతదేశం అనుకుంటారు. ఇలా, వాస్తవాలకు దూరంగా ఉండటం అన్నది దేశభక్తి వల్ల మరింత ఎక్కువవుతుంది. విదేశాల్లో ఉండే చాలామంది భారతీ యులు, ప్రపంచ వేదికపై భారత ప్రధాని ఒక బలమైన నాయకు డిగా కనిపించినప్పుడు ఎంతో గర్వపడుతుంటారు. లోతుగా చూసిన ప్పుడు ఇలాంటి దౌత్య ప్రదర్శనలు భారతదేశ స్థితిగతులను ఏ మాత్రం ప్రతిబింబించేవి కావు. లెక్కల్లోనే నిజాలు ఉంటాయి!ప్రస్తుతం భారతదేశ తలసరి జీడీపీ దాదాపు 2,400 డాలర్లకు పెరిగినప్పటికీ, అదే సమయంలో మన తోటి దేశాలైన వియత్నాం 4,300 డాలర్లకు, ఇండోనేషియా 4,700 డాలర్లకు దూసుకెళ్లాయి. భారతదేశ వృద్ధి నిజమే అయినప్పటికీ, మిగతా మన లాంటి దేశాలతో పోల్చినప్పుడు అది అంత అసాధారణమైనదేమీ కాదు.మానవ జీవన ప్రమాణాలైన సగటు ఆయుర్దాయం, శిశు మర ణాల రేటు వంటి ప్రాథమిక విషయాలలో భారతదేశం ఇంకా వెనుక బడే ఉంది. ఉదాహరణకు, భారతదేశంలో ప్రతి 1,000 జననాలకు శిశు మరణాల రేటు దాదాపు 26గా ఉంది. ఇది వియత్నాం (14) కంటే దాదాపు రెట్టింపు, చైనా కంటే (6) చాలా ఎక్కువ. బహుశా అన్నింటికంటే విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారతదేశం ఎప్పుడూ చివరి వరుసలోనే ఉండటం! ఇటీవల 127 దేశాలలో ఇండెక్స్లో మన దేశం 105వ స్థానంలో నిలిచింది. పోషకాహార లోపం అనేది ఒక తీరని ‘అప్పు’ లాంటిది. ఇది భవిష్యత్తులో దశాబ్దాల పాటు పిల్లల మానసిక వికాసం, దీర్ఘకాలిక ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇంకా చెప్పాలంటే, యువత నిరుద్యోగిత అంచనాలుమొండిగా అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా మహిళా కార్మిక భాగ స్వామ్యం కేవలం 20 శాతం వంటి స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు మనం దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పలేం. ఇది బంగ్లాదేశ్ (38 శాతం) లేదా వియత్నాం (70 శాతం) కంటే చాలా తక్కువ. ఒక దేశం తన జనాభాలో సగభాగాన్ని (మహిళలను) దేశ వృద్ధి చక్రం నుండి పక్కన పెట్టి, ఎప్పటికీ నిరంతర సంపదను లేదా పురోగతిని సాధించలేదు.ఈ గణాంకాలను చూపించినప్పుడు, ప్రవాస భారతీయులు తరచూ ఒకే రకమైన వాదనతో స్పందిస్తుంటారు: ‘వ్యూహాత్మక పెట్టుబడుల ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయి’ అని. కానీ ‘ఆర్ అండ్ డి’, ‘సిస్టమ్ ఎనాలిసిస్’ల ప్రపంచంలో దీనిని ఊహఅంటారు కానీ, విశ్లేషణ అనరు. దేశ పురోగతిని ప్రస్తుత ఫలితాల ఆధారంగా అంచనా వేయాలి కానీ, భవిష్యత్తు ఆశల ఆధారంగా కాదు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ముఖ్యమైనవే, కానీ వాటికవిగా మెరుగైన ఆరోగ్యం, ఎక్కువ ఆదాయాలు లేదా బలమైన ప్రభుత్వ సంస్థల సమగ్రతగా మారిపోవు. దీనర్థం, వ్యవస్థలుమనం బాగుపడుతున్నాయని నమ్మినంత మాత్రాన బాగుపడవు. వాటిని మనం నిజాయితీగా కొలిచి చూసి, బాగుపరచుకున్నప్పుడు మాత్రమే అవి మెరుగుపడతాయి.విద్య, ఉపాధి, వైద్యం ప్రధానభారతదేశ పురోగతికి అసలైన కొలమానం ఎక్స్ప్రెస్వేల సంఖ్య లేదా ప్రపంచ వేదికపై మన దేశ నాయకులకు ఉన్న గుర్తింపు కాదు. అసలైన కొలమానం ఒక సగటు భారతీయుడి జీవితం. పౌరులు అప్పుల పాలు కాకుండా నాణ్యమైన వైద్య సేవలను పొంద గలుగుతున్నారా? వారి పిల్లలు ఆధునిక ప్రపంచానికి సరిపోయేలా నాణ్యమైన విద్యను అందుకోగలుగుతున్నారా? ఆ పిల్లలకు ఆత్మ గౌరవాన్ని, భద్రతను ఇచ్చే స్థిరమైన ఉపాధి (ఉద్యోగం) దొరుకు తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం గనుక సందేహాస్పదంగా ఉంటే, ఆ దేశ పురోగతి ఇంకా అసంపూర్ణంగా ఉన్నట్లే లెక్క. ఉద్వేగంతో వేడుకలు చేసుకునే దేశభక్తి కాదు, ఆలోచనాత్మక మైన ఆధారాలతో కూడిన దేశభక్తి మనకు అవసరం. దేశాన్ని ఎంత గానో ప్రేమిస్తూ, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించిన నిజాన్ని నిజాయితీగా చెప్పగలిగే దేశభక్తి మనకు కావాలి.భారతదేశం కేవలం తన ‘భావపూర్వక సగర్వత’ వల్ల శక్తిమంతంగా మారదు.అది నిజాయితీతో కూడిన సమీక్ష, కచ్చితమైన లెక్కలు, సామాన్య పౌరుడిని పైకి తీసుకురావాలనే సంకల్పం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచం భారతదేశాన్ని కేవలం భావో ద్వేగ కథనాలను చూసి గౌరవించదు, కళ్లముందు కనిపించే ఫలితా లను చూసి గౌరవిస్తుంది. ప్రవాస భారతీయుల ఉత్సాహం అర్థం చేసుకోదగినదే అయినప్పటికీ, భారతదేశ భవిష్యత్తు కోసం క్షేత్ర స్థాయి వాస్తవికత కూడా ఆ ఉత్సాహానికి తగ్గట్టుగా మారాలి.మేడా పరమేశ్వర రెడ్డి , వ్యాసకర్త ఇండో–అమెరికన్ రిటైర్డ్ సైంటిస్ట్, ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్ -
అర్హత పరీక్షకు 'అన్నీ అనర్హతలే'!
వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు చెందిన పశ్న పత్రాలు లీకవడంతో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీయే) ఇటీవల ఆ పరీక్షను రద్దు చేసింది. గతేడాది జూలైలోనే వివిధ వైద్య కళాశాలలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)లకు చెందినవారి ప్రమేయ మున్న ఒక భారీ కుంభకోణాన్ని సీబీఐ బయటపెట్టింది. ఇటువంటి ఉదంతాలు ఏకమొత్తంగా వైద్య విద్య నీతి నిజాయతీలపైన, దేశంలో ఆరోగ్య రక్షణ ప్రమాణాలపైన సందేహాలను, ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. భారతదేశంలో డాక్టర్ అవటమంటే సామాన్యం కాదు. వాస్తవానికి ఇటీవలి సంవత్సరాల్లో మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది కూడా. సుమారు 800లకు పైగా కాలేజీల్లో 1,28,000లకు మించి ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, వచ్చే మూడేళ్లలో మరో 50,000 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ సీట్లు వాటికి జత కానున్నాయి. అయినా, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు పోటీ తీవ్రంగా ఉంది. ఇటీవల రద్దయిన ‘నీట్’ పరీక్షకు సుమారు 22 లక్షల మంది కూర్చున్నారు. స్కోరు–ఆధారిత ప్రవేశాలు అసంబద్ధం ప్రస్తుతం వైద్య విద్యలో ప్రవేశానికి ‘నీట్’ స్కోరు ఒక్కటే గీటురాయి అయినందువల్ల, ఆ పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించడం చాలా ముఖ్యం. తాజా ప్రహసనం తర్వాత, వ్యవస్థ చిత్తశుద్ధిని కాపాడేందుకు వివిధ సాంకేతిక, ఆచరణాత్మక మార్గా లపై సూచనలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షా పద్ధతి, ఎన్క్రిప్టెడ్ ‘జస్ట్–ఇన్–టైమ్’ క్వశ్చన్ పేపర్లు, బహుళ సెట్ల ప్రశ్న పత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊతంతో చెదురు మదురుగా ప్రశ్నలను ఎంపిక చేయడం వంటివి వాటిలో ఉన్నాయి. 2024లో ‘నీట్’ స్కామ్ వెలుగులోకి వచ్చాక, పరీక్షా విధానంలో లొసుగులు లేకుండా చూసేందుకు రాధాకృష్ణన్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. పరీక్షా పత్రాల భద్రతను కాపాడేందుకు అటు వంటి టెక్నాలజీ ఆధారిత సత్వర పరిష్కారాలు, చర్యలు స్వల్ప కాలానికి సహాయపడవచ్చు. కానీ, మెడికల్ కాలేజీల అడ్మిషన్ ప్రక్రియలో సంస్థాగతంగా మార్పులు జరగాలి.అనేక దేశాల్లో సమగ్ర మదింపు పద్ధతిని అనుసరిస్తున్నారు. మన దేశంలో అన్ని స్థాయులలోని వైద్య శిక్షణ ప్రవేశానికి ప్రమాణీ కృత పరీక్షలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారు. మెడికల్ ట్రైనింగ్కు విద్యార్థులు అనువైనవారో కాదో నిర్ణయించేందుకు స్కోరు–ఆధారిత అడ్మిషన్ ఒక్కటే మార్గం అనిపించుకోదు. ఆ పద్ధతి అనేక విధాలుగా అసమతౌల్యం. సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళిక, స్కూలు సిలబస్కు మించి ఉన్న కొన్ని సబ్జెక్టులను దృష్టిలో పెట్టుకుని ‘నీట్’ పరీక్షా పద్ధతి రూపొందుతోంది. స్టేట్ బోర్డు విద్యార్థులు సహజంగానే వెనుకబడుతున్నారు. స్కూలు సబ్జెక్టులను మించి ఉన్న ఇతర టాపిక్కులతో సీబీఎస్ఈ విద్యార్థులు కూడా పరీక్షకు పూర్తిగా సమాయత్తం కాలేకపోతున్నారు. ఈ అంతరాన్ని భర్తీ చేసుకునేందుకు ఆ రెండు రకాల విద్యార్థులు కూడా ‘నీట్’ పరీక్షకు కూర్చునేందుకు ఒకే రకమైన తర్ఫీదును తీసుకోవలసి వస్తోంది. అది కోట్లాది రూపాయల కోచింగ్ పరిశ్రమ అవతరణకు దారి తీసింది. అందరికీ ఒకే పరీక్ష ఎలా సరి?మొదటగా, అడ్మిషన్ ప్రక్రియను వికేంద్రీకరించవలసి ఉంది. భిన్న విద్యా వ్యవస్థలు, ప్రాంతీయ అసమానతలతో కూడిన దేశంలో అందరికీ ఒకటే పరీక్ష విధానం పొసిగేదిగా లేదు. రకరకాల లెర్నింగ్ పర్యావరణాలను, విద్యార్థుల నేపథ్యాలను అటువంటి ‘ప్రమాణీకృత మదింపు పరీక్ష’ పరిగణనలోకి తీసుకోవడం లేదు. దానికి తోడు, కేంద్రీకృత వ్యవస్థ వల్ల కుంభకోణాలు, అవకతవకలు, తిమ్మిని బమ్మి చేయడం, క్వశ్చన్ పేపర్ల లీకులు వంటివాటికి ఎక్కువ అవకాశం ఏర్పడుతోంది. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టు్టకుని స్వీయ అడ్మిషన్ ప్రక్రియను రూపొందించుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం ఉండాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి హైబ్రిడ్ పద్ధతిని అనుసరించవచ్చు. హైస్కూలు మార్కులను, ఎంట్రెన్స్ టెస్ట్ స్కోర్లను లెక్కలోకి తీసుకుని ప్రవేశం కల్పించవచ్చు. ప్రైవేటు కాలేజీలకు ప్రత్యేక ఎలిజిబిలిటీ టెస్టు పెట్టుకోవచ్చు. రాష్ట్రాలలోని కాలేజీల్లో ‘అఖిల భారత’ కోటా కింద ప్రవేశానికి అదనపు గీటు రాయిని లేదా ప్రవేశ పరీక్షను ఏర్పాటు చేయవచ్చు. మెడికల్ అడ్మిషన్ పరీక్షల స్వరూప స్వభావాలు కూడా మారాలి. జీవ, భౌతిక, రసాయన శాస్త్రాల పాఠ్య ప్రణాళికను ఆధారం చేసుకున్న ‘నీట్’ ఒక విషయాన్ని ఆకళింపు చేసుకోవడం కాక, ప్రాథ మికంగా బట్టీ పద్ధతిని ప్రోత్సహించేదిగా ఉంది. మెడికల్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు అవసరమయ్యే సన్నద్ధత, అభిరుచి, విద్యా పరమైన సామర్థ్యాలను లెక్కించే విధంగా రూపకల్పన జరగలేదు. కీలక ఆలోచనా విధానం, తార్కికత, సమస్య పరిష్కార నైపుణ్యంతో పాటు నడత, సామాజిక శాస్త్ర భావనలను ఎక్కువ మదింపు చేసేవిగా ఆ పరీక్ష ఉండాలి. పోస్ట్–గ్రాడ్యుయేషన్ సీట్లకు కూడా పూర్తి స్కోరు ఆధారిత అడ్మిషన్ టెస్ట్ నిర్వహించడం సరైనదిగా లేదు. పాఠశాల విద్యను దెబ్బతీస్తున్న ‘కోచింగ్’!కోచింగ్ పరిశ్రమ ‘నీట్’కు అవాంఛనీయ ఉప దుష్ఫలితంగా తయారైంది. ‘నీట్’ సంబంధిత ప్రతి కుంభకోణంలోనూ కోచింగ్ సెంటర్ల పాత్ర బయటపడుతూనే ఉంది. సగటు హైస్కూలు విద్యార్థి ‘నీట్’లో ఎక్కువ స్కోరు చేసేందుకు కోచింగ్ సంస్థలు ఆరవ, ఏడవ తరగతుల నుంచే తర్ఫీదునివ్వడం ప్రారంభించేస్తున్నాయి. అంటే, పరీక్షకు కూర్చోవడానికి ఏడేళ్ల ముందు నుంచే కోచింగ్ మొదలవు తోంది. ఆ విధంగా కోచింగ్ పరిశ్రమ పాఠశాల విద్యను దెబ్బతీస్తోంది. హైస్కూలు, జూనియర్ కాలేజీల స్థాయిలో చదవవలసిన వాటిని పక్కన పెట్టేసి కేవలం ‘నీట్’ అభ్యర్థులుగా విద్యార్థులను మారుస్తోంది. ఎంచుకునే వృత్తి జీవితాలు వేరైనా, ఒక వ్యక్తి వ్యక్తి త్త్వాన్ని నిశిత ఆలోచనా ధోరణి, నైతికత, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి తీర్చిదిద్దుతాయి. అవేవీ, విద్యార్థులకు అబ్బడం లేదు. పైగా కోచింగ్ పరిశ్రమను ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. విద్యా ర్థులు ఆయా అంశాలను అర్థం చేసుకుంటున్నారో లేదో చూడకుండా, బట్టీ పద్ధతిని అనుసరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోచింగ్ పరిశ్రమకు తోడ్పడటం దురదృష్టకరం.ఇటీవలి నీట్ కుంభకోణం... వైద్య విద్యారంగంలో పేరుకు పోయిన అవకతవకలను సరిదిద్దడానికీ, సంస్కరణలను ప్రవేశ పెట్ట డానికీ ప్రభుత్వానికి మరొక అవకాశాన్ని అందించింది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ, నేషనల్ మెడికల్ కమిషన్ లేదా వైద్య కళాశాలలు ఏవైనా కావచ్చు, ఇందులో పాలుపంచుకున్న అన్ని సంస్థలను బాధ్య తాయుతంగా, అవినీతి రహితంగా మార్చవలసిన అవసరం ఉంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ప్రశ్నించే గొంతుకపై 'ఉక్కుపాదం'
‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రా యాన్ని నిర్భయంగా చెప్పే నీ హక్కును నా ప్రాణం అడ్డుపెట్టయినా కాపాడు తాను‘ అన్న ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టెయిర్ ప్రసిద్ధ సూక్తి ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యావేత్తగా, పాత్రికేయుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా, రాజకీయ విశ్లేషకుడిగా కోట్లాది మంది ప్రజల గౌరవాన్ని చూరగొన్న వ్యక్తి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఆయనపై వరుసగా కేసులు నమోదు కావడం, కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చే మీడియా సంస్థలు ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక వ్యక్తిపై జరుగు తున్న దాడి కాదు, ప్రశ్నించే గొంతుకను చిదిమేయడా నికి జరుగుతున్న కుట్రగా భావించాలి. ఒక పాత్రికేయుడిగా తనకు అందుబాటులో ఉన్న సోర్సులను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న రాజకీయ పరిణామాలను బయటపెట్టినందుకు ఆయనపై పగబట్టడం పాలకుల అహేతుక వైఖరిని వెల్లడిస్తోంది.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన కీలకమైన హక్కు ‘భావప్రకటన స్వేచ్ఛ’. ఒక జర్నలిస్టుగా సమాజంలో జరుగుతున్న పరిణామాలను, తెరవెనుక రాజకీయాలను ప్రజల ముందుకు తేవడం ఆయన ప్రాథమిక బాధ్యత. ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య జరిగిన సంభాషణ గురించి నాగేశ్వర్ ప్రస్తావించడంపై ఇంత రగడ సృష్టించడం అర్థరహితం. రాజకీయాల్లో ఇటువంటి సంభాషణలు సన్నిహిత వర్గాల ద్వారా లేదా అంతర్గత లీకుల ద్వారా సీని యర్ జర్నలిస్టులకు చేరడం అత్యంత సహజమైన ప్రక్రియ. జర్నలిజం నిబంధనల ప్రకారం తమకు సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఏ పాత్రికేయుడికీ లేదు. నమ్మదగిన సోర్స్ ద్వారా సమాచారం అందిన ప్పుడే బహిరంగంగా మాట్లాడతారు. ఒకవేళ నాగేశ్వర్ చెప్పిన విషయాల్లో నిజం లేకపోతే, అసలు వారి మధ్య ఏం సంభాషణ జరి గిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉప ముఖ్య మంత్రిపై ఉంటుంది. కనీసం ఆ వార్తలను ప్రజా స్వామ్య యుతంగా ఖండించే అవకాశం కూడా వారికి ఉంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ సరళ మైన, ప్రజాస్వామ్య మార్గాన్ని వదిలిపెట్టి, భయ బ్రాంతులకు గురిచేసే వ్యూహాన్ని ఎంచుకుంది. ‘మమ్మల్ని ప్రశ్నిస్తే సహించేది లేదు’ అనే అర్థం వచ్చేలా సాగుతున్న ఈ వైఖరి ఒక ప్రమాదక రమైన సంస్కృతికి భాష్యం చెబుతోంది.ఒకసారి చరిత్రను చూస్తే...భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో కార్టూనిస్ట్ శంకర్ పిళ్లై అప్పట్లో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై, ఆయన ప్రభుత్వ విధానాలపై పదునైన వ్యంగ్య కార్టూన్లు గీసేవారు. వాటిని చూసి నెహ్రూ ఎన్నడూ ఆగ్రహించలేదు. ‘శంకర్, నన్ను కూడా వదలకు’ అంటూ ప్రోత్సహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తనపై వచ్చిన పత్రికా విమర్శలను, వ్యక్తిగత దూషణలను ఓపికతో భరించారు. ‘నన్ను విమ ర్శించే హక్కు పత్రికలకు ఉంది, నా తప్పులను నేను సరిదిద్దుకునే అవకాశం వాటి ద్వారా దక్కుతుంది’ అని ఆయన నమ్మారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న చర్చిల్పై మీడియా, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. యుద్ధ వ్యూహాల లీకేజీలపై కథనాలు వచ్చినా, ఆయన పాత్రికేయులపై కేసులు పెట్టలేదు. ‘సజీ వంగా ఉన్న ప్రజాస్వామ్యానికి విమర్శే ప్రాణా ధారం’ అని ప్రకటించారు. ఈ చారిత్రక ఉదాహరణలతో పోల్చితే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎంత అసహనంతో ఉన్నారో స్పష్టమవుతుంది.– ఎం. కృష్ణ ఆదిత్య ‘ పాత్రికేయుడు -
బెదిరింపులకు విరుగుడు వ్యూహం
యూఎస్ఏ ఆధిపత్య వైఖరిని తిప్పి కొడుతున్న కెనడా విధానాలు భారత్ వంటి దేశాలకు మార్గదర్శకం. యూఎస్ఏ సుంకాల యుద్ధం, బెదిరింపులకు అనేక దేశాలు మోకరిల్లాయి. కానీ పొరుగు దేశం, చిరకాల మిత్రదేశమైన కెనడా తన దైన శైలిలో దీటుగా ప్రతిస్పందించింది. కెనడాను ట్రంప్ తన శైలిలో యూఎస్ఏ 51వ రాష్ట్రంగా వెక్కిరించాడు. కెనడా ప్రధాని కార్నీ దీనికి హుందాగా, వ్యూహా త్మకంగా బదులిస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లకు గవర్నర్గా పనిచేసిన కార్నీ తన ఆర్థిక–బ్యాంకింగ్ రంగ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు.పరస్పర గమ్యంయూఎస్ఏ–కెనడా పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలు. కెనడా తయారీ రంగంలో 25 శాతం వాటా ఆటోమొబైల్ రంగానిదే. ఇవి 95 శాతం యూఎస్కు ఎగుమతి అవుతాయి. ఒక ఫోర్డ్ కారు తయారవటానికి విడి భాగాలు కనీసం ఎనిమిదిసార్లు యూఎస్– కెనడా సరిహద్దులను దాటుతాయి. యూఎస్ ముడి చమురు దిగు మతిలో కెనడా వాటా 60 శాతం. కెనడాలోని ఆల్బర్టాలో ఉత్పత్త యిన ముడిచమురు ఎన్బ్రిడ్జ్ పైపు లైన్ల ద్వారా మిన్నెసోటా– విస్కాన్సిన్ రాష్ట్రాల గుండా ఇల్లినాయిస్, ఓహియో రిఫైనరీలను చేరుతుంది. కెనడాలో ఉత్పత్తయిన బరువైన ముడి చమురును శుద్ధి చేయటానికి ప్రత్యేకంగా యూఎస్లో రిఫైనరీలను ఏర్పాటు చేశారు. కెనడాలోని క్యుబెక్ రాష్ట్రంలో ఉత్పత్తయిన జల విద్యుచ్ఛక్తి యూఎస్ లోని న్యూయార్క్, న్యూఇంగ్లాండ్ రాష్ట్రాలలోని సుమారు మిలియన్ గృహాలు వాడుకుంటున్నాయి. యూఎస్లో ఉత్పత్తవుతున్న విద్యు చ్ఛక్తిలో అణు విద్యుత్ వాటా 20 శాతం. దీనికి కావాల్సిన యురే నియం అణు ఇంధనాన్ని కెనడా ఎగుమతి చేస్తుంది. యూఎస్లోని డెయిరీఫామ్లు పాల ప్రాసెసింగ్కు కెనడాలోని క్యుబెక్పై ఆధారపడతాయి. ఎరువుల తయారీకి కీలకమైన పొటా షియం ప్రపంచ ఉత్పత్తిలో కెనడా వాటా 30 శాతం. యూఎస్లోని అయోవా, కన్సాస్, నెబ్రాస్కా వ్యవసాయ క్షేత్రాలు ఎరువులకు కెనడాపై ఆధారపడతాయి. కెనడాలో వినియోగించే పండ్లు, కూర గాయలు 80 శాతం యూఎస్ నుండి దిగుమతి అవుతున్నాయి. బోయింగ్ 737 విమానాల రెక్కలు కెనడాలో తయారవుతాయి. కెనడాలో ఉత్పత్తయిన ఉక్కులో 90 శాతం యూఎస్కు ఎగుమతి అవుతున్నది. కెనడా బ్యాంకుల శాఖలు యూఎస్లో విస్తారంగా పని చేస్తున్నాయి. స్థూలంగా కెనడా ఎగుమతులలో యూఎస్ వాటా 75 శాతం. అదే సమయంలో 34 అమెరికా రాష్ట్రాల ఎగుమతులకు కెనడా ప్రధాన గమ్యం.తమ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను పట్టించు కోకుండా 2025 ఫిబ్రవరిలో ట్రంప్ కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించాడు. చమురు, విద్యుచ్ఛక్తిపై పది శాతం విధించాడు. దీని ప్రభావం కెనడా స్టీల్, అల్యూమినియం, కలప, ఆటో మొబైల్ పరిశ్రమలపై తీవ్రంగా పడింది. దాంతో ‘స్నేహితులే కానీ ఆధారపడటం కాదు’ వ్యూహాన్ని కార్నీ అమలుపరచాడు. ఎగుమతి రంగంలో 75 శాతం కేవలం ఒక దేశంపై ఆధారపడటం ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తుంది. అందుకే వ్యూహాత్మక వైవిధ్యత విధానాన్ని కెనడా ఎంచుకొన్నది.తమ్ముడు తమ్ముడే...కెనడాలోని వివిధ రాష్ట్రాలు యూఎస్ వాణిజ్యంపై ప్రతిదాడి మొదలుపెట్టాయి. ఒంటారియో రాష్ట్రం యూఎస్లోని మిచిగన్కు ఎగుమతి అవుతున్న విద్యుచ్ఛక్తిపై 25 శాతం సర్చార్జి విధించింది. క్యుబెక్ రాష్ట్రం యూఎస్ సంస్థల వాణిజ్య బిడ్లపై 25 శాతం పన్ను విధించింది. బ్రిటిష్ కొలంబియాలో టెస్లా కార్ల దిగుమతి రిబేట్లను ఉపసంహరించుకున్నది. కెనడాలో అమ్ముడుపోయే అన్ని ప్రముఖ యూఎస్ లిక్కర్ బ్రాండ్లను సూపర్ మార్కెట్లలో నిషేధించారు. న్యూఫౌండ్లాండ్ రాష్ట్రం స్టార్ లింక్ కాంట్రాక్టును రద్దు చేసింది. సమాంతరంగా కెనడా తన వాణిజ్యాన్ని యూఎస్ కేంద్రకం నుండి మరల్చి ఇతర బలమైన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలకు శ్రీకారం చుట్టింది. యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, జపాన్, కొరియా, యూకే, ఆస్ట్రేలియాలతో వ్యూహాత్మక వాణిజ్య, రక్షణ ఒప్పందాలను చేసుకుంటున్నది.కెనడా – యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), యురే నియం, జలవిద్యుచ్ఛక్తిలను ఐరోపా దేశాలకు కెనడా ఎగుమతి చేస్తుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, శుద్ధిపై చైనాకు గుత్తాధిపత్యం ఉన్నది. ఈ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసే శక్తి ఉన్న అతి కొద్ది దేశా లలో కెనడా ఒకటి. కెనడాలో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ముడి ఖనిజ నిల్వలు అపారం. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రాడార్లు, యుద్ధ విమానాల ఉత్పత్తిలో కీలకమైన బ్యాటరీల తయారీ వీటి మీద ఆధారపడి ఉన్నది. కెనడాలో ఈ ఖనిజాల త్రవ్వకం, శుద్ధిలో పెట్టుబడులకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. నాటో రక్ష ఛత్రంపై నీలి నీడల నేపథ్యంలో ఐరోపా తనదైన రక్షణ, భద్రతా పథకాన్ని అమలు చేస్తున్నది. సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ (సేఫ్) పథకంలో కెనడాను భాగస్వామిగా చేయటానికి ఒప్పందం జరిగింది. 150 బిలియన్ యూరోల కాంట్రాక్టులను కెనడా డిఫెన్స్ కంపెనీలకు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తమైంది.కెనడా–చైనా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చైనా ఎలక్ట్రిక్ వాహనాలపైన ఉన్న నూరు శాతం సుంకాలను ఎత్తివేశారు. కెనడా నుంచి పశువుల మాంసం, క్రొవ్వు దిగుమతికి చైనా అంగీకరించింది. కెనడాలో బ్యాటరీ ప్లాంట్లను రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేయటానికి జపాన్తో ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా భాగస్వామ్యంతో క్యుబెక్ రాష్ట్రంలో లిథియం ఆక్సైడ్ బ్యాటరీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. హ్యుండాయి, కియా ఎలక్ట్రిక్ కార్లకు ఈ బ్యాటరీలను వాడతారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆస్ట్రేలియాతో యురే నియం, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలపై ఉమ్మడి పథకాలను రచిస్తున్నారు.దిక్కుతోచని ట్రంప్ఇటీవలి బీజింగ్ పర్యటనలో చైనా 200 బోయింగ్ విమానాల ఖరీదుకు సుముఖత చూపడాన్ని ట్రంప్ తన వ్యక్తిగత విజయంగా చూపించాడు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా సంస్థ ఏ220 తరగతికి చెందిన 150 పౌర విమానాల తయారీకి కెనడాతో 21 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇది కెనడా పారిశ్రామిక రంగానికి పెద్ద విజయం. కెనడా వ్యూహాత్మక ప్రతిఘటనకు ట్రంప్కు దిక్కుతోచడం లేదు. అమెరికన్ సంస్థల గణాంకాల ఆధారంగా కార్నీ అమెరికన్ ప్రతిపాదనలను తూర్పారబట్టాడు. ఈ నేపథ్యంలో కార్నీని అబద్ధాల కోరుగా ట్రంప్ నోరుపారేసుకున్నాడు. డెట్రాయిట్ నదిపై డెట్రా యిట్(యూఎస్)–విండ్సర్ (కెనడా)లను కలుపుతూ కెనడా నిర్మించిన గార్డీహావే వంతెన ప్రారంభం కాకుండా చూస్తానని హూంకరించడం ట్రంప్ నిస్సహాయతను సూచిస్తున్నది. కార్నీ అవలంబిస్తున్న ఈ ప్రతిస్పందన జియోపొలిటికల్ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసిందనటంలో సందేహం లేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ప్రతి టూర్లో ఓ సీన్.. ప్రతి సీన్కు ఓ ట్రోల్!
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు, చేష్టలు విచిత్రంగా ఉంటున్నాయి. పొయ్యి వెలిగించకుండానే చేపల కూర వండడం మరీ విడ్డూరం. ఇలాంటి చేష్టలతో చంద్రబాబు ప్రజల దృష్టిలో మరీ పలుచనవుతున్నారు. ప్రజలను కలుసుకోవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ.. వీటికి ఓ నాటకీయత అబ్బితేనే వస్తుంది సమస్య. ‘మత్సకారుల సేవ’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ మత్సకార కుటుంబం ఇంటికి వెళ్లారు. వెళ్లడానికి ముందు ఒక నలుగురైదుగురు మత్సకార మహిళల నుంచి చేపలు కొంటున్న ఒక సీన్ సృష్టించారు. అక్కడ నుంచి ఆయన మత్సకారుడి ఇంటికి వెళ్లి చేపల కూర చేయించారు.ఆ క్రమంలో ఆ ఇల్లంతా కలియదిరిగారు. వారితో మాట కలిపారు. ఈ క్రమంలోనే అప్పటివరకూ కూర్చుని ఉన్న బాబు అకస్మాత్తుగా లేచి కిచెన్లో పొయ్యి మీద ఉన్న చేప ముక్కలను కలియ తిప్పారు. అప్పుడే కూర వండుతున్నట్లు కనిపించాలని అనుకున్నారు. కానీ.., స్టవ్ వెలిగించడం మర్చి పోయారు. దాంతో సోషల్ మీడియా దీన్ని ఒక లాఫింగ్ పీస్ చేసేసింది. స్టవ్ వెలిగించకుండానే చేపల కూర వండుతున్న ముఖ్యమంత్రి అని, సార్..స్టవ్ మర్చిపోయారు సార్..అని ఇదంతా డ్రామా, స్క్రిప్ట ప్రకారం షూట్ చేశారని మరి కొందరు కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆ ఇంటివారితో కలిసి ఒక స్పూన్తో ఒకటి, రెండు ముక్కలు తీసుకున్నట్లు కనిపించింది. ఆయన ఇంటికి రావడానికి ముందు ఆ రహదారిలో ఎవరూ లేకుండా జాగ్రత్తపడ్డారు. కారు దిగినప్పటి నుంచి ప్రతి సన్నివేశంలో ఆయన నటించారన్న భావన సోషల్ మీడియాలో వ్యక్తం అయింది. ఎందుకంటే తొలి నుంచి ఆయన కెమెరా మైక్ పెట్టుకుని ఉంటే, మత్సకార కుటుంబంలో కూడా ఒకరిద్దరికి మైక్ పెట్టి ఉందట. ఈ రకంగా చేయడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? అన్న చర్చ జరగవచ్చు. ముఖ్యమంత్రి జనసామాన్యంలో కలిసి పోతున్నారు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. 2024లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు తనపై తనకే అంత నమ్మకం ఉన్నట్లు లేదు. చేసిన వాగ్దానాలను అమలు చేయలేకపోయారు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయి ఇలాంటి జిమ్మిక్కులు చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఉంది. కాని ఆ స్క్రీప్ట్లో పొరపాటు వల్ల దొరికిపోతున్నారన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. టీ షాపుకు వెళ్లడం, ఒక ఇంటికి వెళ్లి తానే టీ, కాఫీ తయారు చేస్తున్నట్లు కనిపించడం, టీ తయారీ గురించి చర్చిస్తుండడం, ఒక బడ్డీ కొట్టు వద్దకు వెళ్లడం, తాటి ముంజెలు కొనుగోలు చేసి సతీసమేతంగా తినడం, జగన్ టైమ్లో నిర్మించిన గృహానికి వెళ్లి అక్కడ నేమ్ ప్లేట్ పెట్టడం తదితర దృశ్యాలు సోషల్ మీడియాను బాగానే ఆకర్షిస్తాయి. కాని అంతిమంగా ఆయనకు అది రాజకీయ ప్రయోజనం కలిగించడం లేదు. ప్రతిసారి నటిస్తున్నారన్న వ్యంగ్యోక్తులకు గురి అవుతున్నారు. ఈ వయసులో ఇన్ని విన్యాసాలు అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఒక ఇంటికి వెళ్లినప్పుడు వారు తమకు పెన్షన్ రావడం లేదని, మరో చోట్ సొంత ఇల్లు లేదని, ఇంకోచోట తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుకున్నారు. సంబందిత జిల్లా కలెక్టర్కు వాటిని నెరవేర్చాలని ఆయన ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. కాని కొన్నిసార్లు అవి ఏ కారణం వల్లనైనా కాని అమలు కావడం లేదట.దాంతో ఈ మధ్య ఒక వ్యక్తి తనకు సీఎం వాగ్దానం చేసి ఆరు నెలలు అయినా అది నెరవేరలేదంటూ రోడ్డుపై ఆందోళనకు దిగాడు. ప్రతి నిత్యం ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ ల ద్వారా ఎక్కడో చోటకు వెళ్లినప్పుడు ఆయన ఏదో ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని జనాన్ని ఆకర్షించడానికి తెగ ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాని, కొన్నిసార్లు అవి వికటించి లాఫింగ్ స్టాక్ అవుతున్నాయని కొందరు టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. గత అనుభవాల రీత్యానేమో తెలియదు కాని, ఇటీవల ఆయన వెళ్లిన ఇంటిలో ఉన్నవారిని మీకేం కావాలని అడుగుతున్నట్లు కనిపించలేదు. ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పి వచ్చేస్తున్నారు. కాసేపు ఆ కుటుంబం వారితో పొగిడించుకుంటున్నారు.నిజానికి ఇలాంటి సందర్భాలలో తన ప్రభుత్వం గురించి వారు ఏమి అనుకుంటున్నది అడిగి అభిప్రాయ సేకరణ చేసుకుంటే బాగుండేది. తాను సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అంటున్న నేపథ్యంలో వారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా?లేదా? అన్నది తెలుసుకుని ఉండాల్సింది. ఇవన్ని మైక్ పెట్టుకుని అడగడం ఇబ్బంది కనుక, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి జనాభిప్రాయం గమనించి ఉండాల్సింది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పినా, ఇవ్వలేకపోతున్నానని, అయినా మీరు సంతృప్తిగానే ఉన్నారా అని ప్రశ్నించి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలలో తన పరపతి పెంచుకోవడం కోసం ఆకస్మిక తనిఖీల పేరుతోనో, మరో పేరుతోనో టూర్ చేస్తుండే వారు. తొలుత సీరియస్ గానే జరిగినా, రాను, రాను అవి కూడా షో పుటప్ల గానే మారిపోయాయి. కావలి వద్ద ఉన్న జువ్వలదిన్నె సందర్శించడానికి కూడా కారణం లేకపోలేదు. అంతకు కొద్దిరోజుల ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడకు వెళ్లి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. జగన్ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ భూమి లో కొంత భాగాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడాన్ని ఇటు మత్సకారులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే తమిళనాడు నుంచి కొందరు వచ్చి దొంగచాటుగా ఆంధ్ర ప్రాంత మత్స్య సంపదను కొల్లగొడుతుంటే, వారిని పట్టుకుని బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాని తదుపరి ఏపీ ప్రభుత్వం వాటిని వదలివేయడంపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. టీడీపీ ఎంపీ, పి బీదా మస్తాన్ రావు ప్రోద్బలంతోనే బోట్లు వదలి వేశారని మత్స్య కారులు అప్పట్లో ఆరోపించారు. ఈ క్రమంలో ఆ మత్సకారుల వద్దకు జగన్ వెళ్లి వారికి భరోసా ఇచ్చి వచ్చారు. లోకేశ్ జువ్వలదిన్న సందర్శిన తర్వాతే కొద్ది రోజులకు బోట్లను వదలి వేశారని జగన్ ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని కొంతమేర ప్రైవేటుకు కట్టబెడితే ఊరుకోబోమని, తాను అధికారంలోకి వచ్చాక దానిని స్వాధీనం చేసుకుని మత్సకారలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా, అది బాగా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్సకార వర్గంపై పడకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఆ క్రమంలోనే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అంటూ పంచ్ డైలాగులు చెప్పి తృప్తి పరచడానికి యత్నించారు. ఆ రకంగా జగన్ రాక తమకు ఉపయోగపడిందని, చంద్రబాబు ఈ మాటలు అనక తప్పలేదని మత్సకారులు భావిస్తున్నారు. అది నిజమే అనిపిస్తుంది.1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తరచుగా వివిధ చిత్రమైన రీతులలో కనిపించే వారు. రోడ్డుపై స్నానం చేస్తున్న ఫోటోలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చంద్రబాబు.. సినీ నటుల పార్టీని ఎవరు పట్టించుకుంటారని విమర్శించే వారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతి కాలంలో ఆయనే టీడీపీని కైవసం చేసుకుని, తానే రాజకీయంగా రకరకాల సన్నివేశాలలో నటిస్తుండడం విశేషం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తైవాన్పై ఉభయుల చదరంగం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల రెండవ వారంలో చైనాను సందర్శించిన సందర్భంగా తైవాన్ విషయమై అన్న మాటలు కొన్ని అపోహలను కలిగించాయి. తన వ్యాఖ్యలను కొందరు స్థూల దృష్టితో చూసి నిజమని నమ్ముతున్నారు కూడా. తైవాన్కు సంబంధించి ఆయన ఇక చేతులు ఎత్తివేసినట్లేననే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్త వమో జాగ్రత్తగా పరిశీలించటం అవసరం.మార్పున్నట్టా? లేనట్టా?రెండు దేశాల అధ్యక్షుల మధ్య తొలి సమావేశం మే 14న జరిగినపుడు షీ జిన్పింగ్ తైవాన్ ప్రస్తావన చేస్తూ, తమ ప్రయోజ నాలకు ముఖ్యమైన అంశాలలోకెల్లా అతిముఖ్యమైనది తైవాన్ అనీ, అందుకోసం తాము అమెరికాతో ఘర్షణకైనా సిద్ధమనీ చెప్పారు. ఈ ప్రస్తావన సాగినంత కాలం ట్రంప్ ముఖకవళికలు బరువుగా కనిపించాయి. స్పందనలేవీ లేవు. మరునాడు స్వదేశానికి తిరిగి వెళుతుండగా విమానంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నుంచి మూడు మాటలు వినిపించాయి. అమెరికా నుంచి 9,500 మైళ్ల (15 వేల కిలోమీటర్ల) దూరంగల తైవాన్ కోసం తాము శక్తిమంతమైన చైనాతో యుద్ధం చేయలే మన్నది ఒకటి. స్వతంత్రాన్ని ప్రకటించ వద్దంటూ తాను తైవాన్ నాయకత్వానికి చెప్పానన్నది రెండు. తైవాన్కు విక్రయించదలచిన ఆయుధాల విషయమై తుది నిర్ణయ మేదీ తీసుకోలేదన్నది మూడు. పోతే, చైనాకు బయలుదేరే ముందు రోజున అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, తైవాన్ విధానంలో మార్పేమీ ‘ప్రస్తుతానికి’ లేదన్నారు. చైనా అధ్యక్షుడు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు ముఖాముఖిన చేయటం, అందుకు అమెరికా వైపు నుంచి ఎన్నడూ లేనంత జాగ్రత్తతో కూడిన స్పందనలు రావటంపై సహజంగానే విస్తృతమైన చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. తైవాన్, జపాన్ కలవరపడగా, అమెరికాలోని మితవాద లాబీలు విమర్శించాయి. ఇంతకూ అమెరికా తన చిరకాలపు విధానాన్ని మార్చుకునే దిశలో ఉన్నట్లా? చేతులు ఎత్తివేస్తున్నట్లా?యుద్ధానికి దూరంతో ఏం పని?అందుకోసం మొదట అమెరికా అధ్యక్షుని మూడు మాటలను, ఆయన విదేశాంగ మంత్రి మాటను తిరిగి చూడాలి. చైనాతో యుద్ధం చేయదలిస్తే అమెరికన్లు 15,000 కి.మీ.లు ప్రయాణించ వలసిన అవసరమే లేదు. వారికి చైనాకు పొరుగున గల జపాన్లో 4, దక్షిణ కొరియాలో 2, గువామ్లో 2 బలమైన సైనిక స్థావరాలున్నాయి. ఫిలిప్ఫైన్స్లో సైనిక వెసులుబాట్లున్నాయి. స్థావరాలతో సరిపోల్చగల అత్యాధునిక విమాన వాహక నౌకాదళాలను, అణ్వాయుధాలనైనా ప్రయోగించగల జలాంతర్గములను చైనా సమీపాన మోహరించగలరు. దీర్ఘశ్రేణి క్షిపణులూ ఉండనే ఉన్నాయి. అందువల్ల వేల కిలోమీటర్ల దూరమన్నది అర్థం లేని మాట. ఏమి చేస్తారన్నది రాజకీయ నిర్ణయం మాత్రమే. పైన పేర్కొన్న స్థావరాలు, నౌకా బలంతో, తైవాన్కు ఇప్పటికే సమకూర్చిన ఆయుధ సంపత్తితో, చైనీయులు తైవాన్పై దాడి చేసినట్లయితే తాము కూడా సైనిక జోక్యం చేసు కోగలమంటున్న జపాన్, ఫిలిప్ఫైన్స్ల ప్రకటనలతో, చైనాను ఓడించగలరా లేదా అన్నది వేరే ప్రశ్న. కానీ, తమకు తైవాన్ అత్యంత ముఖ్యమంటున్న చైనాతో యుద్ధానికి సిద్ధపడటమన్నది రాజకీయ నిర్ణయం. ఆ నిర్ణయం మునుముందు అనేక పరిస్థితులపై ఆధార పడి ఉంటుంది. కనుక ప్రస్తుతం ట్రంప్ అన్నది తుది వాక్యం కాదు. రెండవ మాటకు వస్తే, ‘స్వాతంత్య్రం ప్రకటించవద్దని’ తైవాన్కు సూచించటం ఇది కొత్త కాదు. తమది ‘వ్యూహాత్మక అస్పష్టత’ అన్న మాట అమెరికా ఉపయోగిస్తున్నదే. స్వాతంత్య్రం ప్రకటించు కొండి అనరు, అసలు ప్రకటించకుండా ఒకే చైనా విధానం ప్రకారం చైనాలో విలీనమైపొండి అని కూడా అనరు. సూత్ర రీత్యా తైవాన్ చైనాలో భాగమే అయినా ఆ పని బలవంతంగా జరిగితే ఒప్పుకో బోమంటారు. తైవాన్ సంరక్షణ చట్టమంటూ చేసి వారికి ఆయు ధాలు అమ్మే విచిత్రమైన విధానాన్ని అనుసరిస్తుంటారు. అందువల్ల, తాను తైవాన్కు స్వాతంత్య్రం ప్రకటించవద్దంటూ చెప్పానన్న ట్రంప్ మాట కూడా అర్థం లేనిదే.మూడవది పెండింగ్లో ఉన్న ఆయుధాల విక్రయం. వాటి విలువ 14 బిలియన్ల డాలర్లు. అమెరికా అధ్యక్షుడు అన్నది ఆ విష యమై ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తైవాన్ నాయకత్వంతో మాట్లాడుతాను’ అని. అంతే తప్ప అమ్మబోము అనలేదు. ట్రంప్ ఆ మాత్రపు మాట అన్న వెంటనే ఒకవైపు తైవాన్ నుంచి, మరొకవైపు రిపబ్లికన్లతో పాటు డెమోక్రటిక్ సెనేటర్ల నుంచి ఒత్తిడులు మొద లయ్యాయి. చైనా వ్యతిరేకించినా ఆయుధాల విక్రయం జరుగు తూనే వస్తున్నది గనుక, ఈసారి కూడా కొంత వ్యవధి తర్వాత అదే జరిగితే ఆశ్చర్యపడనక్కర లేదు. ఎందుకంటే, చైనా విషయంలో, మొత్తం పసిఫిక్ విషయంలో అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలలో, వ్యూహాలలో మార్పు లేదు గనుక. కాకపోతే, ప్రస్తుత పరిస్థితులలో చైనాతో కొంత మెత్తగా వ్యవహరించాలన్నది ఒక ఎత్తుగడ అయినందున ఈ విధంగా మాట్లాడతారు.వ్యూహం ఉండనే ఉంది!ఆ ప్రయోజనాలు, వ్యూహాలు ఏమిటో, అందులో భాగంగా చైనాను నియంత్రించటం ఎట్లానో, అందుకు తైవాన్ అవసరం ఏమిటో 2022లో బైడెన్, తర్వాత 2025, 2026లో ట్రంప్ స్వయంగా తమ వ్యూహపత్రాలలో వివరించి చెప్పారు. వారిద్దరి కన్నా ముందే ఒబామా– ఇరాక్, అఫ్గాన్ పరాభవాల దరిమిలా ఇక తమ దృష్టి పసిఫిక్ వైపు, చైనా వైపు మళ్లటం అవసరమని ప్రతిపా దించి పోయారు. ఇదంతా లాటిన్ అమెరికా నుంచి పశ్చిమాసియా మీదుగా తూర్పు ఆసియా వరకు అమెరికా ప్రయోజనాలను, ఆధిప త్యాన్ని సుస్థిరపరచుకునే విస్తృతమైన, దీర్ఘకాలికమైన ప్రణాళికలో భాగం. అందుకోసం తైవాన్ను తమ ప్రభావం కింద ఉంచుకోవ టమే కాదు, ఇంకా అనేకం చేయవలసి ఉంటుంది. ఆ వివరాలు కూడా కొన్ని పైన పేర్కొన్న వ్యూహ పత్రాలలో పేర్కొన్నారు.అందువల్ల, తైవాన్ గురించి ఇపుడు ట్రంప్ ఏమన్నారో చూసి ఆయన చేతులు ఎత్తేశారంటూ అపోహ పడటం పొరపాటు అవు తుంది. చారిత్రకంగా తమ దేశంలో భాగమైన తైవాన్ను ఎప్పటికైనా నయానో భయానో విలీనం చేసుకోవటం చైనా లక్ష్యం. హాంకాంగ్, మకావూ వలెనే తైవాన్లోనూ ఒక దేశం రెండు వ్యవస్థల పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమని చైనా గతంలోనే ప్రకటించింది. ఆ విధంగా ‘శాంతియుత విలీనానికి’ అడ్డంకులు కల్పించరాదని అమె రికాను కోరుతున్నది. అందుకు తైవాన్ ప్రతిపక్షం సుముఖత చూపు తుండగా, అధికారపక్షం నిరాకరిస్తున్నది. ఆ పార్టీకి అమెరికా ప్రోత్సాహం ఉంది. ఈ మొత్తం పరిస్థితులు ఎట్లా పరిణమించేదీ భవిష్యత్తులో చైనా, అమెరికాల ఆర్థిక, సైనిక, రాజకీయ బలాబలాలు ఎట్లా మారుతూ పోగలవన్న దానిపైనే ఆధారపడి ఉండవచ్చు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆశలు ఆకాశం... రూపాయి పాతాళం
భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తోందన్న ఉత్సాహం ఓవైపు వ్యక్తమవు తుంటే, మరోవైపు రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోతోంది. ఇది సగటు భారతీయుడి కొనుగోలు శక్తినీ, దేశ ఆర్థిక స్వావలంబననూ ప్రత్యక్షంగా ప్రభావితం చేసే పరిణామం. ఈ నేపథ్యంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన 5 బిలియన్ డాలర్ల విలువైన ‘డాలర్–రూపాయి మార్పిడి ఒప్పందం’ (స్వాప్) మే 26న అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంలో భాగంగా వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను తాత్కాలికంగా రిజర్వ్ బ్యాంక్కు అప్పగించి, బదులుగా రూపాయిలను పొందుతాయి. ముందే నిర్ణయించిన షరతుల ప్రకారం, మూడేళ్ల అనంతరం ఈ మార్పిడి వ్యతిరేక దిశలో జరుగుతుంది. మార్కెట్లో ద్రవ్యలభ్యతను సమతుల్యం చేయడం, ఆర్థిక వ్యవస్థపై ఏర్పడే స్వల్పకాలిక ఒత్తిడిని తగ్గించడం వంటి లక్ష్యాలతో, తాత్కాలిక తరుణోపాయంగా ఈ చర్యను చేపడుతున్నారు. రూపాయి బలహీనతకు కారణాలెన్నో!రూపాయి బలహీనతకు దారితీసిన మూలకారణాలు, సంబంధిత అంశాలను పరిశీలించినప్పుడే – ఈ ఒప్పందం ప్రభావాన్ని, దాని పరిమితులను అర్థం చేసుకోగలుగుతాం. గతంలో నెమ్మదిగా, క్రమపద్ధతిలో సాగిన రూపాయి క్షీణత, గత పద్దెనిమిది నెలల్లో ఊహించని వేగాన్నందుకుంటూ, ప్రస్తుతం 96.90 రూపాయల కనిష్ఠాన్ని చేరుకుంది. ఈ పతనానికి ప్రధాన కారణం – పశ్చి మాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడమే. మన దేశ చమురు అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, సహజంగానే రూపాయి విలువపై ఒత్తిడి తీవ్రతరమైంది. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడంతో, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఈ ప్రతికూలతను మరింత పెంచింది.మన వాణిజ్య లోటు వంటి అంతర్గత లోపాలు కూడా రూపాయి బలహీనతకు తోడవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మన వస్తు–సేవల నికర వాణిజ్యలోటు సుమారు 120 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఎన్నో ఆకాంక్షలతో ప్రారంభమైన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమం ద్వారా రక్షణ, చరవాణులు, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ; వాటి తయారీకి అవసరమైన విడిభాగాలను ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం – ముడిపదార్థాల సమీకరణ నుంచి ప్రాసెసింగ్, అంతిమ తయారీ, వినియోగం లేదా ఎగుమతి వరకు విస్తరించిన సమగ్ర పారిశ్రామిక శృంఖలాలను దేశీయంగా నిర్మించలేకపోవడమే.వ్యవసాయాధారిత భారతదేశంలో, గ్రామీణ సరఫరా గొలుసులను ఆధునికీకరించి; వాటిని ప్రధాన స్రవంతి తయారీ రంగంతో అనుసంధానించినప్పుడే, మేక్ ఇన్ ఇండియా ఉద్యమ లక్ష్యం సాకారమవుతుంది. ఉదాహరణకు – నిజామాబాద్లో ఉత్పత్తయ్యే దారంతో పోచంపల్లిలో నేసిన పట్టు చీరను, హైదరాబాద్లోని గోల్కొండ వంటి హస్తకళా కేంద్రాల్లో ప్రదర్శించి; హైటెక్ సిటీలోని అంకుర సంస్థలు – ఆ సంప్రదాయ ఉత్పత్తులు విదేశాల్లోని ప్రవాస భారతీయులకు చేరేలా, డిజిటల్ వేదికల ద్వారా ప్రచారం చేయగలగాలి. ఇందులో ఏ దశ కోసం విదేశాలపై ఆధారపడినా, దేశం ఎంతోకొంత విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తుంది.హాట్ మనీ కూల్ కాదు!రూపాయి పతనం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి పరిణామాలకు ప్రతిస్పందనగా, విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పీఐలు) తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని డాలర్లుగా మార్చుకుంటారు. దీంతో రూపాయి మరింత బలహీనపడుతుంది. ఇటువంటి స్వల్పకాలిక ‘హాట్ మనీ’ లేదా ‘చంచలమైన పెట్టుబడుల’పై అధికంగా ఆధారపడే ఆర్థిక వ్యవస్థలు, మరింత సులభంగా బాహ్య ప్రకంపనలకు గురవుతాయి. వీటికి భిన్నంగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తాయి. ఈ దిశగా, ప్రభుత్వం రక్షణ, టెలికాం, ఇన్సూరెన్స్, అంత రిక్ష అన్వేషణ వంటి రంగాల్లో పరిమితులను పెంచడం ద్వారా; ఈ ప్రవాహాలు పెరిగే మార్గం సుగమం చేసింది. అందుకు తోడుగా– అనుమతుల ప్రక్రియను ఏకగవాక్ష విధానాల ద్వారా మరింత సరళీకరించడం, మౌలిక సదుపాయాలను ఇతోధికంగా బలోపేతం చేయడం, వనరుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం, అవసరమైన ప్రోత్సాహకాలు కల్పించడం వంటి చర్యలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. సమాంతరంగా, అనవసర విదేశీ మారకద్రవ్య వ్యయానికి కత్తెర వేయడం కూడా అంతే ముఖ్యం. సికింద్రాబాద్ వేదికగా ప్రధాని సూచించిన విదేశీ మారకద్రవ్య పొదుపు సూచనలు, ప్రభుత్వపరంగా తగిన విధానపరమైన చర్యలు చేపట్టినప్పుడే సమర్థవంతమైన ఆచరణకు నోచుకుంటాయి. విధానపర సంస్కరణలుప్రస్తుతం మన ముందున్న సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో, దేశానికి ఉన్న ప్రధాన రక్షణ కవచం మనవద్దనున్న దాదాపు 700 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలు. వీటిని మరింత బలోపేతం చేయాలంటే, మరికొన్ని విధానపరమైన సంస్కరణలు అవసరం– విలాసవంతమైన దిగుమతి వస్తువులపై సుంకాలను పెంచడం, ప్రపంచ స్థిరాదాయ పెట్టుబడి పత్రాల సూచీలలో భారత్కు మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకోవడం; రష్యా, ఇరాన్ వంటి దేశాలతో అమలు చేస్తున్న రూపాయి చెల్లింపు విధానాలను, మరిన్ని దేశాలకు విస్తరించడం. ఈ చర్యల ద్వారా డాలర్పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించవచ్చు.చరిత్రను పునరావలోకనం చేసుకుంటే, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు ప్రభుత్వాల కాలంలో, అత్యవసర స్థితిలో దేశాన్ని గట్టెక్కించేందుకు, రిజర్వ్ బ్యాంక్ దాదాపు 67 టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి డాలరు రుణాలను సమీకరించింది. ఆ గడ్డు పరిస్థితితో పోల్చితే, నేడు భారత్ మరింత సురక్షితంగా ఉంది. అయితే, ఒకప్పుడు గణనీయమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కలిగి ఉన్న టర్కీ, అర్జెంటీనా వంటి దేశాలు కూడా తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. ఆ దేశాల అనుభవాలు... విదేశీ మారక నిల్వలు ఒక విధమైన రక్షణ కవచమే గానీ శాశ్వత పరిష్కారం కావన్న వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి.క్లుప్తంగా చెప్పాలంటే రూపాయి నిరంతర బలహీనత, మన ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణ పరమైన లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తుచేస్తోంది. ఆకాశమంత ఉన్నతంగా ఉన్న మన ఆర్థిక ఆకాంక్షలు నిజం కావాలంటే; ఉత్పాదకత పెంపు, స్థిరమైన పెట్టుబడుల ఆకర్షణల దిశగా మరిన్ని నిర్ణయాత్మక సంస్కరణలు చేపట్టాలి. ఆర్థిక ప్రయోజనాలు ఆకాశాన్ని తాకాలంటే, రూపాయి పాతాళం వైపు జారకుండా నిలబెట్టే పటిష్ఠమైన పునాదులు ఉండాలి.కృష్ణబాలాజీ పల్లపోతువ్యాసకర్త ఎస్బీఐ మాజీ ఉన్నతాధికారి -
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ తగ్గుతోందా?
భారతదేశంలో రాష్ట్రాలు తమ ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోతున్నాయని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఫెడరల్ వ్యవస్థలో అనువైన ఆర్థిక వాతావరణానికి కేంద్రం – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ సంబంధాలు అవసరం. రాజకీయ పునర్వ్యవస్థీ కరణ, ఆర్థిక సంస్కరణలు, న్యాయవ్యవస్థ జోక్యం కారణంగా స్వాతంత్య్రానంతరం కేంద్రం–రాష్ట్రాల సంబంధాలలో నిరంతరం పరివర్తన జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 268 నుంచి 293 వరకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను వివరిస్తాయి. ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో పెట్టుబడులపై నియంత్రణలు తొలగాయి. రాష్ట్రాలకు విస్తృత కార్య నిర్వహణ అవకాశాలు దఖలుపడ్డాయి. కానీ రాష్ట్రాలు రెవెన్యూ బదిలీకి కేంద్రంపై అధికంగా ఆధారపడటం వలన రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి పరిమితంగా ఉంది. పన్ను విధించే అధికారాల విభజన, గ్రాంట్– ఇన్–ఎయిడ్, రుణసమీకరణ అధికారాలు లాంటివి కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సంబంధాల ముఖ్య లక్షణాలుగా పేర్కొనవచ్చు. మొత్తం మీద ఆదాయంలో సింహభాగం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. జాతీయ సమగ్రతను పెంపొందించడం, అత్యవసర పరిస్థితులను ఎదు ర్కోవడం, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటివాటికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తుంది. అయితే కేంద్రానికి ఉన్న అత్యధిక ఆర్థిక అధికారాల కారణంగా రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి ఇబ్బందులకు లోనవుతోంది. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం రాష్ట్రాలు ఎదురు చూడవలసి వస్తోంది. ఈ దుఃస్థితికి కారణాలేంటి?భారత్లో వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు క్షీణించడానికి... ఉద్యోగస్థుల వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు అధికంగా ఉండటం; రాష్ట్రాలకు పన్ను విధించే అధికారాలు పరిమితంగా ఉండటం, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల అమలు కారణాలుగా చెప్పవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రాలు అధిక రెవెన్యూ లోటు, అధిక రుణ–జీఎస్డీపీ లాంటి సమస్యలను ఎదుర్కొంటు న్నాయి. అధిక ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి రాష్ట్రాలు సమీకరించిన మొత్తం రుణంలో మార్కెట్ రుణాల వాటా 2025–26లో సుమారు 76 శాతంగా ఉండటాన్ని బట్టి రాష్ట్రాల ఆర్థిక స్థితి పటిష్టంగా లేదని తేటతెల్లమవుతున్నది. మార్చి 2026 నాటికి రాష్ట్రాల మొత్తం రుణం, జీఎస్డీపీలో 30 శాతం పైగా నమోదయింది. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ రుణాల కారణంగా రాష్ట్రాల వడ్డీ చెల్లింపుల మొత్తం జీడీపీలో 1.5 నుండి 1.9 శాతం మధ్య ఉంది. ఆర్బీఐ నివేదిక ‘ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025–26’ ప్రకారం అధిక రుణం కల్గిన జాబితాలో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, తదుపరి స్థానాలలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిలిచాయి. అధిక వ్యయం,సంక్షేమ కార్యక్రమాల అమలు కారణంగా రాష్ట్రాల మొత్తం రుణంలో దక్షిణాది రాష్ట్రాల వాటా అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. రుణ – జీఎస్డీపీ నిష్పత్తి అధికంగా పంజాబ్లో నమోదు కాగా, తర్వాతి స్థానాలలో పశ్చిమ బెంగాల్, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ నిలిచాయి. ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు తక్కువ రుణ ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నాయి.కొరవడిన ఆర్థిక స్వేచ్ఛవివిధ రాష్ట్రాలలో రెవెన్యూ రాబడి తక్కువగా ఉండటానికి అల్ప పారిశ్రామిక లేదా ఆర్థిక కార్యకలాపాలు, పన్ను వసూళ్ళు బలహీనంగా ఉండటం, కేంద్ర ప్రభుత్వ నిధుల బదిలీలు, గ్రాంట్లపై రాష్ట్రాలు అధికంగా ఆధారపడటం కారణాలుగా నిలిచాయి. వస్తు, సేవల పన్ను వసూళ్ళు పటిష్టంగా ఉండటం, పారిశ్రామిక, సేవా రంగ కార్యకలాపాలు అధికంగా ఉండటం కారణంగా సొంత పన్ను రాబడిలో పెరుగుదల మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, తెలంగాణల్లో అధికంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధుల బదిలీలపై బిహార్ అధికంగా ఆధారపడింది.రాష్ట్రాలు పన్నేతర రాబడి పెంచుకోవడంలోనూ పరిమితులను ఎదుర్కొంటున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఉత్తర ప్రదేశ్, మహరాష్ట్ర, గుజరాత్లలో కేంద్ర ప్రభుత్వ వ్యయం అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. అంటే ఆ యా రాష్ట్రాలకు కేంద్ర నిధులను అధికంగా ఇస్తోందన్నమాట. కేంద్ర ప్రభుత్వ వ్యయ అసమతౌల్యం వలన అనేక రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి తగ్గి, రాష్ట్రాల మధ్య సంక్షేమ కార్యక్రమాల అమలులో అసమానతలు ఏర్పడుతున్నాయి.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థిక సమాఖ్య వ్యవస్థ (ఫిస్కల్ ఫెడరలిజం) పాత్ర ప్రధానమైనది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పన్ను వసూళ్ళు, ఆదాయ వ్యయం వంటి విషయాల్లో అధికారాల విభజనకు సంబంధించిన చట్రమే (ఫ్రేమ్వర్క్) ఫిస్కల్ ఫెడరలిజం. అభివృద్ధి, పాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. జీఎస్టీ పరిహార చెల్లింపులో ఆలస్యం, సెస్లు, సర్ఛార్జీల ద్వారా లభ్యమయ్యే ఆదా యాన్ని కేంద్రం, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేకపోవటం లాంటి అంశాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రాలు సమీకరించే రుణానికి సంబంధించిన పరిమితులు కూడా ఆర్థికా భివృద్ధి సాధనకు అవరోధంగా ఉందని అనేక రాష్ట్రాలు వాదిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజాస్వామ్య జవాబుదారీ తనానికి రాష్టాలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం.మరేం చెయ్యాలి?పరిస్థితుల్లో మార్పు రావాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. కేంద్రం దేశ పాలన, అభివృద్ధి వంటి అంశాలలో రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా పరిగణించాలి. మారుతున్న ఆర్థిక వాతావరణానికి అనుగుణంగా భారత సమాఖ్య వ్యవస్థలో మార్పు అవసరం. ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యమవ్వాలంటే పోటీతత్వ సమాఖ్య వ్యవస్థకు సహకార సమాఖ్య వ్యవస్థ కూడా తోడుగా ఉండాలి. సహకార సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించడం, స్థానిక సంస్థలలో సాధికారత, అంతర్ రాష్ట్ర కౌన్సిల్స్ ఏర్పాటు, ఆర్థిక యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, జీఎస్టీ మండలి పనితీరులో అవసరమైన సంస్కరణలను చేపట్టడం లాంటి చర్యలు కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలను పటిష్టపరచడానికి ఉపకరిస్తాయి. వివిధ రాష్ట్రాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను డిజైన్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపర చాలంటే స్థానిక సంస్థలకు అధిక నిధుల కేటాయింపు అవసరం. ఆర్టికల్స్ 256, 257లను పునఃసమీక్ష చేయడం ద్వారా రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం పెత్తనాన్ని తగ్గిస్తూ, జాతీయ భద్ర తకు సంబంధించి మాత్రమే ఆ యా ఆర్టికల్స్ను కేంద్రం ఉప యోగించుకొనే విధంగా చూడాలి. రాష్ట్రాలకు షరతులు లేని నిధుల కేటాయింపు పెంచడం, జీఎస్టీ పరిహారాన్ని సకాలంలో అందించడం, సెస్లు, సర్చార్జీలలో రాష్ట్రాలకు వాటా, ఆర్థిక సంఘం సిఫార్సులను సమర్థవంతంగా అమలు చేయడం లాంటి చర్యలు సమాఖ్య వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇంచార్జి), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
ఉష్ణోగ్రతలను ఎలా నియంత్రించాలి?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర మైన సమస్యగా మారాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, నీటి వనరులు, జీవ వైవిధ్యం వంటివాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణాలు వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, పట్టణీకరణ, అధిక కాంక్రీటీకరణ, వాహన కాలుష్యం, నీటి వనరుల క్షీణత. ముఖ్యంగా నగరాల్లో ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ప్రభావం కారణంగా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు అధికంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. వృద్ధులు, చిన్నపిల్లలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు అధిక ప్రమాదంలో ఉన్నారు. వ్యవసాయ రంగం కూడా మరింత ప్రభావితమవుతోంది. నీటి కొరత, నేల తేమ తగ్గుదల, పంటల ఉత్పాదకతలో తగ్గుదల కనిపిస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా, వాతావరణ మార్పు అత్యంత తీవ్రమైన పర్యావరణ సవాళ్లలో ఒకటిగా మారింది. ఉష్ణోగ్రత సమస్యను పరిశీలిస్తే, ఐసీసీసీ (2025) గణాంకాల ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రత ఇప్పటికే పారిశ్రామిక విప్లవానికి ముందు స్థాయుల కంటే సుమారు 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఇది తీవ్రమైన వడగాల్పులు, వరదలు, కరవులు, అటవీ కార్చిచ్చులు, హిమనీనదాలు కరిగిపోవడం, సముద్ర మట్టం పెరగడానికి దారితీస్తోంది. మరో ముఖ్యమైన సంస్థ అయిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎమ్ఓ) నివేదిక ప్రకారం 2015, 2025 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అత్యంత వేడి సంవత్సరాలుగా నిలిచాయి. గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు కొనసాగితే, రాబోయే దశాబ్దాలలో భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కీలక పరిమితిని దాటిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.1901–1910 సగటుతో పోలిస్తే భారతదేశంలో ఉష్ణోగ్రతలు సుమారు 1.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉన్నాయని కూడా ఐఎమ్డీ వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే, ఈ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో తీవ్రమైన వడగాల్పులు 5 నుండి 8 రెట్ల వరకూ పెరగవచ్చని అధ్యయనాలు సూచి స్తున్నాయి. వాతావరణ మార్పు వ్యవసాయం, నీటి వనరులు, ప్రజారోగ్యం, జీవవైవిధ్యం, పట్టణ మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతోంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం, వాతావరణ మార్పులను తట్టు కోగల మౌలిక సదుపాయాలు, సర్దుబాటు చర్యల కోసం 2050 నాటికి భారతీయ నగరాలకు 2.4 ట్రిలియన్ డాలర్లకు పైగా అవసరం కావచ్చు.ప్రపంచ వాతావరణ మార్పుల ప్రభావంతో భారతదేశంలో మే నెలలో మాములు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న రోజులు నమోదవుతున్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా 45 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పర్యావరణ హిత జీవితంఈ పరిస్థితిని నియంత్రించడానికి సమగ్ర చర్యలు అవసరం. మొదట భారీ స్థాయిలో చెట్లు నాటాలి. చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహించి సహజ శీతలీకరణ వ్యవస్థలుగా పనిచేస్తాయి. చెరువులు, కుంటలు, నీటి వనరులను పరిరక్షించడం అత్యంత అవసరం. ‘మిషన్ కాకతీయ’ వంటి కార్యక్రమాల ద్వారా చెరువులను పునరుద్ధరిస్తే భూగర్భజలాలు పెరగడంతో పాటు స్థానిక ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. అలాగే పట్టణాల్లో వాతావరణ అనుకూల ప్రణాళికలను అమలు చేయాలి. గ్రీన్ రూఫ్లు, చల్లని పైకప్పులు, నీడనిచ్చే చెట్లు, ఓపెన్ గ్రీన్స్పేస్లు పెంచడం ద్వారా నగర ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు. వాహన, పారిశ్రామిక కాలుష్య నియంత్రణ కూడా కీలకం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలపై కఠిన కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి. పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెంచడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. వ్యవసాయ రంగం వాతావరణ మార్పులకు తీవ్రంగా ప్రభావితమవుతోంది. తక్కువ నీటితో పండే పంటలు, డ్రిప్ ఇరిగేషన్, నేల తేమ పరిరక్షణ, అగ్రో ఫారెస్ట్రీ వంటి పద్ధతులను ప్రోత్సహించాలి. రైతులకు వాతావరణ సమాచారం అందించే వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ప్రజలు కూడా విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవరుచుకోవాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నియంత్రించడానికి ప్రభుత్వం, ప్రజలు కలిసి చర్యలు తీసుకోవాలి. ఫలితంగా ప్రస్తుత తరం వాతావరణ సమస్యల నుంచి విముక్తి పొందుతుంది. భవిష్యత్ తరా లకు సురక్షితమైన పర్యావరణ ం అందుతుంది.డా‘‘ పారుపల్లి ఆంజనేయులువ్యాసకర్త ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్’ (సెస్) రిసెర్చ్ అసోసియేట్ -
అభిజీత్ దీప్కే (కాక్రోచ్ జనతా పార్టీ) రాయని డైరీ
కొన్నిసార్లు అవకాశాలను భగవంతుడు కల్పిస్తాడు. మరికొన్నిసార్లు భారత ప్రధాన న్యాయమూర్తి! నిజం! నాకసలు ఏ ఉద్యమమూ చేపట్టాలని లేదు. కానీ, దైవం ఏ రూపంలోనో వచ్చి, ఇదిగో ఇలా ప్రభుత్వాలతో తలపడమని పిలుపును ఇస్తాడు కావచ్చు... ఉమర్ ఖాలిద్కు ఇచ్చినట్లుగా! ఖాలిద్ ఆరేళ్ల తర్వాత తీహార్ నుండి మూడు రోజుల బెయిల్ మీద బయటికి వచ్చి జూన్ 1 నుంచి 3 వరకు తల్లికి తోడుగా ఉండబోతున్నాడు... ఈ లోపు ఆ మూడు రోజుల బెయిలైనా రద్దు కాకుండా ఉంటే!ఢిల్లీలో అల్లర్లకు కుట్ర పన్నాడని ‘ఉపా’ కింద ఉమర్ ఖాలిద్ని 2020లో అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు. ఇప్పుడు నేను ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని పెట్టి నిరుద్యోగ యువకుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నానని నా పైన ‘ఉపా’ పెట్టినా చేసేదేం లేదు!! రెండు రోజులు ఆగితే ఇండియా వెళ్లేవాడిని. నాలుగు రోజులు ఇండియాలో ఉండి, తిరిగి బోస్టన్ వచ్చేసేవాడిని.బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ రిలేషన్స్లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ చేసొచ్చిన భారతీయ యువకుడికైనా స్వదేశంలో ఎక్కడో ఒక చోట చిన్న ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం లేదు. ఉండటానికైతే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మానాన్న ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఛత్రపతి శంభాజీ నగర్లోని మా ఇంటికి వెళ్లటానికి లేదు.‘‘ఎందుకొచ్చిన పిచ్చి పని జీత్! ఆ ఆన్లైన్ ఆటలు ఆపేసెయ్’’ అని అమ్మ అంటోంది. ‘‘అమ్మా... ఇన్స్టాలో వారం రోజుల్లో నాకు 2 కోట్ల మంది ఫాలోవర్స్...’’ అన్నాను నవ్వుతూ. ‘‘అదేదో వారానికి ఇంత జీతం అని చెబుతున్నావేంటి జీత్!!’’... అమ్మ నుంచి ఫోన్ లాక్కొని నాన్న! ‘‘జీత్, మన ఇంటి చుట్టుపక్కల నిన్నటి నుంచి ఎవరో కొత్తవాళ్లు కనిపిస్తున్నార్రా’’... నాన్న నుంచి ఫోన్ లాక్కొని అమ్మ. ‘‘అమ్మా... నాకేం కాదు’’ అన్నాను.‘‘కానీ, ఇక్కడ అంతా అంటున్నారు... మీ జీత్ను అక్కడే అమెరికాలో ఉండిపొమ్మని చెప్పండి, ఇండియా వస్తే అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తీసుకెళతారు... అని!’’అమ్మ ఏడుస్తూ చెబుతోంది.‘‘అమ్మా ఏం కాదు, ఊర్కో’’ అంటున్నాను, అమ్మ ఏడుస్తూనే ఉంది. అమ్మ నుంచి నాన్న ఫోన్ లాక్కోవటం లేదు! అంటే, నాన్న అక్కడి నుంచి వెళ్లిపోయారా? ఈ నాన్నలెందుకు కొడుకుల మీది కోపాన్ని తల్లుల మీద ప్రదర్శిస్తారు?! అన్లైన్ ఉద్యమాలు ఊరికే బొద్దింకల్లా పుట్టుకు రావు. వాటి ఆవిర్భావం వెనుక ఒక ఆవేదన ఉంటుంది. ఒక మహావేశం ఉంటుంది. సీజేపీ అనే మా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా అలాగే ఉద్యమ రూపం తీసుకుంది. నిరుద్యోగుల ఆత్మగౌరవ సాధన సీజేపీ ప్రధాన లక్ష్యం, ప్రధాన పోరాటం.ఈ లక్ష్యాన్ని ఏర్పరిచింది, పోరాటానికి దారి చూపింది... సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి! ఆయనకు మా ఉద్యమ ధన్యవాదాలు. నిరుద్యోగులను ఆయన బొద్దింకలతో పోల్చారు! వాళ్లకు ఏ ఉద్యోగమూ దొరకదు అన్నారు! వారిలో కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు అవుతారు అన్నారు. కొందరు ఆర్టీఐ యాక్టివిస్ట్ల అవతారం ఎత్తుతారు అన్నారు. అలా అని, ప్రపంచ భారతీయ బొద్దింకలన్నిటినీ ఆయనే ఏకం చేశారు. నిరుద్యోగులను బొద్దింకలు అన్నందుకు ‘చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా’ మీద ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి కోపమేం లేదు. అసలు ఆయన మీద గౌరవంతోనే మేము మా పార్టీకి ముందనుకున్నట్లుగా ‘కాక్రోచ్ జనతా ఇంపాక్ట్’ అనే పేరు పెట్టుకోలేదు. పెట్టుకుని ఉంటే అప్పుడది ‘సీజేఐ’ అయి ఉండేది. ‘సీజేఐ’ అన్నప్పుడల్లా ‘చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా’ అని అన్నట్లుగానూ ఉండేది!! -
చీకటి మింగిన సూర్యుడు
వక్రీకరణలు పురాణకాలం నుంచే వున్నాయి. అవే సత్యాలని ప్రజలు నమ్మ టమూ వుంది. ఆ యా కాలాలలో వ్యక్తులు తమ స్వార్థాన్ని బట్టి ఓ మహావ్యక్తిని నర హంతకుడిగానూ, నరహంతకుడిని ధీరో దాత్తుడుగానూ చేశారు. ఎంత చేసినా నిజం ఒక రోజు బయటికి వచ్చి తీరుతుంది. సూర్యుడికి మబ్బు అడ్డంగా రావచ్చు, కానీ అది శాశ్వతం కాదు.మహానేత డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి మీద ఇలాంటి వక్ర ప్రచారమే జరిగింది. ఆయన ఎంత మృదు స్వభావో, అంత కఠినుడని చిత్రీకరించారు. నోరు, ప్రచార సాధనాలు వున్నాయని అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేశారు. అసలు రాజారెడ్డి వేరు, ఈ పాలకులు తమ స్వార్థం కోసం భూతద్దంలో చూపుతున్న రాజారెడ్డి వేరు. పేరుకు తగ్గట్టు మానస రాజసం వున్న వ్యక్తి రాజారెడ్డి. గంభీరమైనరూపం, అచ్చ తెలుగు పంచకట్టు, చురుకైన కళ్ళు, గుబురు మీసాలు, గుండెల్లో అపారమైన తడి, చదువుపట్ల గౌరవం, సహాయం చేయటానికి ఎప్పుడూ ముందుండే గుణం, తన వారు తనకంటే ఎదిగి ఆదర్శంగా నిలబడాలన్న కోరిక – ఇలా ఎన్నో కలిస్తే అది రాజారెడ్డి.గూండాయిజానికి ఎదురొడ్డి...1960 ప్రాంతంలో కడప జిల్లా పరిస్థితి, ముఖ్యంగా పులి వెందుల పరిసరాల పరిస్థితి ఈ తరానికి ఏమాత్రం తెలియదు. చాలా గ్రామాలకు కరెంటు సౌకర్యం లేదు. రోడ్డు సౌకర్యం లేదు. ఓ వార్త మరో గ్రామానికి తెలియటానికే రోజులు పట్టేది. ఓ కాలనీలో వున్న ఓ వర్గపు గూండాల ఆధిపత్యం క్రింద పులివెందుల ప్రజలు నలిగిపోయేవారు. దొంగతనాలు, దౌర్జన్యం, దోపిడీ, మామూళ్ల వసూలు – ఇలాంటి అరాచకత్వం వుండేది. ఎదిరిస్తే చంపేసేవాళ్ళు. పోలీసులు కూడా ఆ గూండాలకు భయపడేవారట. దాన్ని ఏ మాత్రం సహించలేక ఎదిరించిన యువకుడు రాజారెడ్డి.ఆరోజు అది పెద్ద సాహసం. ఎదిరించడమే కాక వారిని పులివెందులలో గానీ, ఇతర గ్రామాలలో గానీ అడుగు పెట్టనివ్వకుండా చేశాడు. రాజారెడ్డి పేరు మారు మ్రోగింది. రాజారెడ్డిని ఏ క్షణం వాళ్లు చంపేస్తారో అనే భయంతో కొందరు ఆయనకు రక్షణగా ఏర్పడ్డారు. ఆఖరి నిమిషం వరకు ఆయన అన్యాయాన్ని ఎదిరించాడు. నేరాలను ఆపాడు. ఆయన ఏ నేరమూ చేయలేదు. నిజానికి ఒక ఋషితుల్యత కనిపించేది ఆయనలో. మితభాషి. కాని జీవితాన్ని చదివిన వ్యక్తి కావడం వల్ల మాట్లాడే ప్రతిమాట ఎంతో విలువను సంతరించుకునేది. ఆహారం, ఆహార్యం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదు. ఏదైనా తినేవాడు. మితంగా తినేవాడు. ఎయిర్ కండీషన్ గదిలో ఎంత హాయిగా పడుకునేవాడో ఏటిగట్టు మీద, చెట్టు నీడన గడ్డి దిండుతో అలానే పడుకునేవాడు. ఆశ్చర్యం వేసేది నాకు. చాలా విషయాలు ఆయనను చూసి నేర్చుకున్నాను.చిన్నదానికి కూడా చలించిపోయే గుండె వున్నా పైకి గండర గండడు. కడప పార్లమెంటు ఎన్నికల్లో నాలుగుసార్లు కమ్యూనిస్టు అభ్యర్థికి ఏజెంటుగా పనిచేశాడు. వామపక్ష భావజాలం ఇష్టపడే వాడు. అందుకే ఆయనకూ, నాకూ స్నేహం కలిసిందేమో. గజ్జెల మల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి లాంటి కవులు, సాహితీ వేత్తలు ఆయనకు మంచి స్నేహితులు. ఏ రచయిత, ఏ సిద్ధాంతకర్త కలిసినా వారు చెప్పేది శ్రద్ధగా ఓ విద్యార్థి మాదిరిగా వినేవాడు.అవతలి వ్యక్తిలో ఏ మాత్రం విజ్ఞానం వుందని భావించినా వయసు మరచి గౌరవించేవాడు. పేదవాడి న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడు. రాజీ అన్నది ఆయనకు తెలీదు. ఎందరి సమస్యలో ఎంతో చాకచక్యంగా పరిష్కరించేవాడు. ఆయనకు పెద్దగా పరిచయం లేకపోయినా, మిమ్మల్ని నమ్మి వచ్చాము అని ఎవరు వచ్చినా అండగా నిలబడిన గుండె ఆయనది.చిన్నవాడిపైనా పెద్ద మనసు...నాకూ, ఆయనకూ వయసు తేడా వుంది. చిన్నవాడిని. కానీ కలిశాక, స్నేహ బంధం ఏర్పడ్డాక ఆయన నా చేయి వదలలేదు. నాకు గురువయ్యాడు. ఆప్తుడయ్యాడు. అన్నీ అయ్యాడు. జారి పోతుందేమో అనే భయంతో నా చేయి మరింత గట్టిగా పట్టుకుని నన్ను నా కన్నా బాగా చూసుకున్న వ్యక్తి రాజారెడ్డి. రెండు దశాబ్దాలు పెనవేసుకుపోయిన బాంధవ్యం మాది.1975లో ఎమర్జెన్సీ విధించినపుడు తిరుపతి నుండి నన్ను, కొందరు మిత్రులను అరెస్టు చేసి హైదరాబాదులోని ముషీరాబాదు జైలులో వుంచారు. తిరుపతిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చురుగ్గా వుండేవాడిని. ఆనాడు దేశం మొత్తం మీద అరెస్టయిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిని నేనే. దాదాపు 21 నెలలు ముషీరాబాదు జైలులో గడిపాము. చదువు, ఆటలు, పెద్దలతో చర్చలు – ఇదీ దినచర్య. మేము వెళ్ళిన కొన్ని మాసాలకు అదే జైలు లోకి డిటెన్యూలుగా వచ్చారు రాజారెడ్డి, ఆయన పెద్ద కుమారుడు జార్జిరెడ్డి. అక్కడ ఆయనను తొలిసారి చూశాను.ఆయన గాంభీర్యం చూసి పలకరించాలా వద్దా అనే సందే హంలో వుండిపోయాను. రెండవ రోజు అనుకుంటాను, సాయంత్రం వాలీబాల్ కోర్టు దగ్గర నన్ను పలకరించారు. అందరి కంటే చిన్నవాడిని కావడం వల్ల దగ్గరికి తీసుకున్నాడు. ‘నేనూ ఆడచ్చా’ అని అందరినీ అడిగి గ్రౌండులోకి అడుగుపెట్టాడు. నాలో నేనే నవ్వుకున్నా ఈ వయసులో ఈయనకు వాలీబాల్ కావాలా అని. అరగంటలో అర్థమైంది నేను తప్పు అని. ఆయన స్టామినా, ఆడే నైపుణ్యం ఆశ్చర్యం కలిగించాయి.ఉదయం గార్డెనింగ్ లాంటి పనులు, సాయంత్రం వాలీబాల్, రాత్రి బ్యారక్ మూసేశాక చదువుకోవడం జరిగేది. మధ్యాహ్నం భోజనం అయ్యాక మాత్రం సమయం నెమ్మదిగా కదిలేది. మధ్యా హ్నం నిద్ర నాకు అలవాటు లేదు. బ్యారక్ ముందున్న రేకుల వరండాలో చెస్ బోర్డు ముందు వేసుకుని కూర్చునేవాడిని. దూరం నుంచి చూసి దగ్గరికి వచ్చారు రాజారెడ్డి. ఇద్దరం అడేవాళ్ళం. నిజానికి నాకు ఆడటం రాదు. ఎలా ఆడాలో, ఏ పావును ఎలా కదపాలో ఆయనే చెప్పారు. చాలాసార్లు నేను గెలిచేవాడిని. క్రమంగా అర్థమైంది నన్ను గెలిపించడానికే ఆయన ఓడిపోతున్నాడని.మరణం లేని మనిషిరాజారెడ్డి మంచితనాన్ని దాచి, అసత్యప్రచారాలు చేశారు గానీ ఆయన ఏనాడు భూదందాలు చేయలేదు. నిజంగా భూ ఆక్రమణకు ఆయన పాల్పడి వుంటే ఈ రోజు సగం తిరుపతి ఆయన కుటుంబం చేతుల్లో వుండేది. వేముల దగ్గర రాజారెడ్డిని కిరాతకంగా, పాశవికంగా చంపింది పార్థసారథే. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే ఇది జరిగింది. ఈ హత్యా రాజకీయాల ఫలితం ఓ మంచి మనిషి మరణం.మరణం అందరికీ తప్పదు కానీ చరిత్ర కొందర్ని గుర్తుంచుకుంటుంది. చీకటి మింగిన సూర్యుడు రాజారెడ్డి. అయినా సూర్యుడి వేడి తగ్గదు, వెలుగూ తగ్గదు. శత్రువులు ఆయుధంతోనూ, నారా సురుల వంటి స్వార్థపరులు మాటల ఈటెలతోనూ రాజారెడ్డి మీద అమానుషమైన దాడి చేశారు. కానీ రాజారెడ్డి ధీరోదాత్తుడు. తన వారికై నిలబడిన వీరుడు. వీరుడు చనిపోడు, చంపబడతాడు.భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు -
'సంక్షోభాలు' నేర్పుతున్న గుణపాఠాలు
వర్షాల అనిశ్చితి, ఎరువుల దిగుమతి ఆధారితం, భూమి క్షీణత, అధిక నీటి పంటలపై మోజు – ఈ నాలుగు కలిసి భారత వ్యవసాయాన్ని సున్నితమైన స్థితిలోకి నెట్టాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ సమస్య తీవ్రంగా వున్నది. 2026లో ఎల్నీనో ముప్పు, పశ్చి మాసియా ఉద్రిక్తతల వల్ల పెరుగుతున్న ఎరువుల ఖర్చులు రైతాంగానికి తాత్కా లిక ఇబ్బందే కాక, వ్యవసాయం చేసే పద్ధతులలో పూర్తి మార్పు అత్యవసరమని సూచిస్తున్నాయి.చిన్న మార్పులే పెను సవాళ్లువాతావరణ మార్పులు ఒక్కసారిగా కనపడవు. కొంచెం ఎక్కువ ఎండలు, ఆలస్యంగా వచ్చే వర్షాలు, పంట మధ్యలో పొడి విరామాలు – మొదట ఇవి చిన్న మార్పుల్లా కనిపిస్తాయి కానీ కొన్ని సంక్షోభాలు సమాజాన్ని తన జీవన విధానాన్ని, ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఆహార ఉత్పత్తి విధానాన్ని తిరిగి ఆలోచించేలా చేస్తాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆరోగ్యం, పోషకాహారం, స్థానిక ఆహార వ్యవస్థలు, ప్రకృతి ఆధారిత జీవన విధానాలపై కొత్త చర్చ ప్రారంభమైనట్లే, ఇప్పుడు వ్యవసాయ రంగం కూడా అలాంటి మరో మలుపు దగ్గర నిలిచింది.భారత వాతావరణ విభాగం ఈ ఏడాది దక్షిణ–పడమటి రుతుపవన వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే తక్కువగా, 92 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ వాతావరణ అంచనాలు కూడా జూన్ నుంచి ఆగస్టు మధ్య ఎల్నీనో పరిస్థితులు బలపడే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో, గ్యాస్, అమ్మోనియా, సల్ఫర్, డీఏపీ, యూరియా వంటి ఎరువుల సరఫరాపై అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒత్తిడి పెంచు తున్నాయి. ఎల్నీనో భారత రుతుపవనాలను బలహీన పరుస్తుంది. వర్షాలు వచ్చినా వాటి పంపిణీ అసమానంగా ఉంటుంది. ఖరీఫ్ కాలంలో విత్తన దశలో ఆలస్యం, పుష్ప దశలో తేమ కొరత, చివరికి దిగుబడి తగ్గుదల – ఇవి రైతు ముందుకు వచ్చే ప్రధాన ప్రమా దాలు. రాయలసీమ, తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా వంటి వర్షాధార ప్రాంతాలు మరింత సున్నితంగా ఉంటాయి.ప్రమాదమా? మార్పునకు అవకాశమా?ఎరువుల విషయంలోనూ పరిస్థితి అంతే ఆందోళనకరంగా ఉంది. భారతదేశం యూరియా, డీఏపీ, మిశ్రమ ఎరువులు, అలాగే వాటి తయారీకి అవసరమైన సహజ వాయువు, అమ్మోనియా, సల్ఫర్ వంటి ఇన్ పుట్లలో గణనీయంగా దిగుమతులపై ఆధారపడు తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చిన్న మార్పే భారత రైతుకు పెద్ద భారం కావడం మన వ్యవసాయ విధానం స్వయం సమృద్ధి నుంచి ఎంత బాహ్య ఆధారంగా మారిందో చూపిస్తోంది. తెలంగాణలో ఎరువులు సగటున హెక్టారుకు 280–297 కిలోలు వాడితే, ఆంధ్ర ప్రదేశ్లో 230–240 కిలోలు వాడుతున్నారు. జాతీయ సగటు హెక్టారుకు 130 కిలోలు మాత్రమే. దీనికి ప్రధాన కారణాలు: వరి తర్వాత వరే వేయటం, పప్పుధాన్యాల విస్తీర్ణం తగ్గిపోవటం, భూమిలో సేంద్రియ పదార్థం కూడా తగ్గిపోవటం. కనీసం 1.0 నుంచి 1.5 ఉండాల్సిన స్థితి నుంచి ఇది 0.3 శాతం కంటే తక్కువకు పడిపోయింది. దీని వలన తేమను పట్టి ఉంచే గుణం, సమతుల్యమైన పోషకాలు అందించలేని పరిస్థితులలో మన భూములు వున్నాయి. దీనికి తోడు, ఎక్కువ సార్లు దున్ని, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వాడటం వలన, సంవత్సరం అంతా భూమి కప్పి ఉంచే పరిస్థితి లేకపోవటం వలన, మట్టి కొట్టుకు పోవటం, 5–6 అంగు ళాల కింద నెల గట్టి పడిపోవటం జరిగి నీరు కానీ, వేర్లు కానీ లోపలి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మనం ఎల్ నీనో ప్రభావాన్నీ, రసాయనిక ఎరువులు అందక పోవటాన్నీ చూడాలి. ఈ సంక్షోభాన్ని కేవలం ప్రమాదంగా మాత్రమే చూడనక్కర లేదు. ఇది మార్పునకు అవకాశం కూడా. దశాబ్దాలుగా ప్రభుత్వ కొనుగోలు విధానాలు, బోనస్లు, సబ్సిడీలు, సాగునీటి ప్రాధాన్యం– అన్నీ కలిసి వరి వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాయి. తెలంగాణలో గత 15 ఏళ్లలో వారి విస్తీర్ణం 250% పైగా పెరిగింది. అనిశ్చిత వర్షపాతం, ఖరీదైన ఎరువుల కాలంలో అదే పంట నమూనాను యథాతథంగా కొనసాగించడం ఆర్థికంగా, పర్యావరణపరంగా ప్రమాదకరం.సుస్థిర మార్గమే శరణ్యంవరి విస్తీర్ణాన్ని ఒక్కసారిగా కాదుగానీ క్రమంగా తగ్గిస్తూ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వైపు సాగును మళ్లించాలి. జొన్న, సజ్జ, రాగి, కొర్రల వంటి చిరుధాన్యాలు తక్కువ నీటితో పెరుగు తాయి, పొడి పరిస్థితుల్లో కూడా నిలబడగలవు. కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పుధాన్యాలు నేలలో సహజంగా నత్రజని నిల్వ చేయడంలో సహాయపడతాయి. దీంతో రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. రైతు ఖర్చు తగ్గి, కుటుంబాల పోషకాహార భద్రత మెరుగుపడుతుంది. ఈ మార్పు రైతు ఒంటరిగా చేయలేడు. విధానాలు మారాలి. వరికి లభించే కొనుగోలు హామీలు, ప్రోత్సా హక ధరలు, బోనస్లు, ఇన్ పుట్ సబ్సిడీలు – వాటిలో కొంత భాగాన్ని పొడి భూమి పంటల వైపు మళ్లించాలి. రైతు మార్పు చేయ డానికి మార్కెట్ హామీ, నిల్వ సదుపాయం, ప్రాసెసింగ్ వ్యవస్థ, విలువ ఆధారిత విక్రయం, స్థానిక కొనుగోలు మద్దతు అన్నీ కలిసి రావాలి. పంటల వైవిధ్యం గురించి మాట్లాడటం సరిపోదు; దానికి తగిన ప్రోత్సాహక వ్యవస్థను ప్రభుత్వం నిర్మించాలి.నేల ఆరోగ్య పునర్నిర్మాణం అత్యవసరం. ఏళ్లుగా అధిక రసాయన ఎరువుల వాడకం, పంట అవశేషాల దహనం, సేంద్రియ పదార్థాల నిర్లక్ష్యం వల్ల నేలలో సేంద్రీయ కర్బనం తగ్గిపోయింది. సేంద్రీయ పదార్థం తగ్గిన నేల నీటిని నిల్వ ఉంచుకోలేకపోతుంది. కొద్దిరోజుల పొడి వాతావరణానికే పంట ఒత్తిడికి గురవుతుంది. ఎరువు వేసినా పూర్తిగా ఉపయోగ పడదు. నేల బలహీనమైతే వాతా వరణ షాక్కు వ్యవసాయం మరింత సులభంగా దెబ్బతింటుంది. అందుకే నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచడం వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా భావించాలి. మల్చింగ్ వల్ల వేసవిలో నేలనుండి నీటి ఆవిరి పోవడం తగ్గుతుంది. కవర్ క్రాప్స్ నేలను ఎండకు నేరుగా గురి కాకుండా కాపాడతాయి. సన్ హెంప్, ధైన్చా వంటి పచ్చి రొట్ట పంటలు నేలను సహజంగా సారవంతం చేస్తాయి. ఇవి పాత పద్ధతులు మాత్రమే కావు; భవి ష్యత్తు వ్యవసాయానికి అవసరమైన తెలివైన వ్యూహాలు. తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదంతో, ఆరోగ్యకరమైన నేలతో, స్థిరమైన నీటి వినియోగంతో, పోషకాహార భద్రతతో సాగు చేసే విధానాల వైపు మళ్లాల్సిన సమయం వచ్చింది. ఎల్నీనో, ఎరువుల సంక్షో భాలు వ్యవసాయాన్ని స్థిరమైన మార్గంలోకి నడిపించే అవకాశం కావచ్చు. మార్పు వస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఆ మార్పుకు మనం సిద్ధమవుతామా లేదా అనేదే అసలు ప్రశ్న.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
యూఎస్ – చైనా దోస్తీ? భారత్ దారెటు!
మే 2026లో బీజింగ్ వేదికగా జిన్పింగ్, ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన రెండు వేర్వేరు శిఖరాగ్ర సమావేశాలు 21వ శతా బ్దపు ప్రపంచ జియో పొలిటికల్ క్రీడలో కీలక మార్పులకు నాంది పలుకుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ప్రపంచ రాజ కీయ చదరంగంలో మూడు బలీయమైన రాజకీయ శక్తులు అమెరికా, చైనా, రష్యా వ్యూహాత్మక సమతాస్థితి దిశగా ప్రయత్నాలు చేయటం ఒక రకంగా శుభపరి ణామం. ఈ త్రికోణం కేంద్రంలో మధ్యస్థ తరగతికి చెందిన శక్తులు భారత్, జపాన్, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఉన్నాయి.చైనా ఇక సమవుజ్జీయూఎస్ఏ ఇప్పటివరకూ చైనా, రష్యాలను ముప్పుగానూ, శత్రువులుగానూ పరిగణిస్తూ వాటిని నియంత్రించే/నిలువరించే వ్యూహాన్ని పాటిస్తున్నది. కోవిడ్ అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం, ట్యారిఫ్ యుద్ధం, ఇరాన్ (గల్ఫ్) యుద్ధం నేర్పిన గుణ పాఠాలతో యూఎస్ఏ వాస్తవ ప్రపంచంలోనికి వచ్చింది. యూఎస్ఏకు తన ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తి, ప్రాబల్యాలపై ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయి. సుంకాల బెదిరింపులతో ప్రారంభ మైన ట్రంప్ చాపల్య విధానాలు వెనిజులా, గ్రీన్లాండ్ గుండా చివరకు హార్మూజ్ సింధు శాఖలో నిమజ్జనమయ్యాయి. బీజింగ్ శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్, తన సహజ వైఖరికి విరుద్ధంగా జిన్పింగ్ను సమవుజ్జీగా పరిగణిస్తూ పరిణతితో వ్యవహ రించాడు. ఆర్థిక వాణిజ్య అంశాలైన సుంకాలు, పెట్టుబడులు,కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ చిప్స్, సోయా చిక్కుళ్లు మొదలగు విషయాలను రాజకీయ–వ్యూహాత్మక అంశాలైన తైవాన్, ఇరాన్తో ముడిపెట్టి బేరం చేయటానికి ప్రయత్నించాడు. చైనాకు ఇబ్బంది కలిగించే మానవ హక్కులు, ఉయిఘర్లు, సైబర్ దాడుల వంటి అంశాల ఊసు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.సకల లాంఛనాలు, గౌరవ మర్యాదలను అందజేస్తూనే అమె రికా ఆధిపత్య ధోరణిని కట్టడి చేయటంలో జిన్పింగ్ సఫలీకృతు డయ్యాడు. ఒకవైపు అమెరికన్ బోయింగ్ కంపెనీ నుండి విమానాల కొనుగోలుకు అంగీకరిస్తూనే తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని కుండబద్దలు కొట్టాడు. ట్రంప్ కూడా వేల మైళ్ళ దూరం నుండి తైవాన్ విషయంలో చైనాతో యుద్ధానికి సిద్ధంగా లేననే సంకేతాన్నిచ్చాడు. తైవాన్కు 25 బిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకాన్ని ఆపేశాడు.వాటితో రాజీ పడినట్టేనా?కోవిడ్ అనంతర పరిణామాల నేపథ్యంలో చైనా డీకప్లింగ్ విధానాన్ని అమలు చేయటానికి యూఎస్ఏ ప్రయత్నించింది. కానీ చైనా మార్కెట్, చైనా ఉత్పత్తులు, చైనా అరుదైన ఖనిజాలను కాదని తన ఆర్థిక వ్యవస్థను నడపటం సాధ్యం కాదని దానికి తేటతెల్ల మయింది. ప్రస్తుతం చైనా విషయంలో యూఎస్ఏ సహకారం, సహభాగిత్వం దిశగా అడుగులు వేస్తున్నది. ఈ సంబంధాలను యూఎస్ఏ కాకుండా చైనా శాసిస్తున్నది. చైనా, రష్యా సహకారం లేనిదే హార్మూజ్ చిక్కుముడి వీడదని యూఎస్ఏకు బోధపడింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలవరించటానికి తైవాన్ సమస్యను యూఎస్ఏ ఇంతవరకు తురుపుముక్కగా పరిగణిస్తూ వస్తున్నది. ఈ విధానంలో భాగంగానే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో క్వాడ్, ఆకస్ వంటి కూటములను ఏర్పరిచింది. దక్షిణ కొరియా, జపాన్లకు సైనిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది.ఒకవైపు ఇండో పసిఫిక్లో చైనా యెడల మెతక వైఖరికి సన్నద్ధ మవుతూనే, ఐరోపాలో నాటో కూటమి చేతులెత్తేయటం యాదృచ్ఛికం కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ప్రత్యక్షంగా ఎదుర్కొనే ఏ రకమైన చర్యలను యూఎస్ఏ తీసుకోవటం లేదు. జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి ఐరోపా దేశాలను నేరుగా విమర్శిస్తున్న ట్రంప్, పుతిన్తో సామరస్య ధోరణితో వ్యవహరిస్తున్నాడు. యూరప్లో రష్యా ఆధిపత్యాన్ని, ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని యూఎస్ఏ అంగీకరిస్తున్నదా? రష్యా, చైనాలను నిలువరించటానికి యూఎస్ఏ ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్, జపాన్, భారత్లతో కృషి చేస్తున్నది. ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలికిన ట్లుగా భావించాలి. చైనా, రష్యాలతో యూఎస్ఏ రాజీపడితే భారత్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇరకాటంలో పడినట్లే లెక్క.మనమేం చేయాలి?ఈ నెలాఖరులో ఢిల్లీలో జరుగనున్న క్వాడ్ విదేశాంగ వ్యవహా రాల మంత్రుల సదస్సులో యూఎస్ఏ వైఖరిపై మరింత స్పష్టత ఏర్పడనున్నది. ఈ నేపథ్యంలో భారత్ తన దౌత్యనీతికి పదును పెట్టాల్సి ఉంటుంది. జియో పొలిటికల్ చదరంగంలో శక్తి పరిభాష తప్ప వేరొక మార్గం లేదు. ముఖ్యంగా చైనా మరే భాషను పట్టించు కోదు, అర్థం చేసుకొనే ప్రయత్నం చేయదు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా భారత్కు చైనానే ముఖ్య భద్రతా సమస్య/ ముప్పు. చైనాను ఎదుర్కోవటానికి భారత్ కేవలం తన శక్తి సామ ర్థ్యాల మీదనే ఆధారపడాలి. చైనా–పాకిస్తాన్లతో ఏక కాలంలో హిమాలయాలు, సింధు మైదానం, హిందూ మహా సముద్రంలో విస్తృత యుద్ధానికి యూఎస్ఏ, రష్యాలపై ఆధారపడకుండా సిద్ధ పడాలి. జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇప్పటికే యూఎస్ఏపై ఆధారపడకుండా సైనిక, ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకోవటానికి పావులు కదుపుతున్నాయి.భారతదేశం కూడా సైనిక, ఆర్థిక, వ్యూహాత్మక రంగాలలో స్వయం శక్తిపై దృష్టిని కేంద్రీకరించింది. ఫ్రాన్స్తో రాఫెల్ ఒప్పందం, రష్యాతో ఎస్–400/బ్రహ్మోస్ ఒప్పందాలలో సాంకేతిక పరి జ్ఞానం బదలాయింపు, భారతదేశంలో ఉత్పత్తి షరతులను పెడు తున్నాము. హిందూ మహాసముద్రంలో అండమాన్–నికోబార్ దీవుల్లో వ్యూహాత్మకంగా చైనాను నిలువరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్లోని రాంబిల్లి వద్ద న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ (ఐఎన్ఎస్ వర్ష) ఏర్పాటు చేశాము. ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుని ఢిల్లీ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భద్రతా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంక్లి ష్టమైన హిమాలయ పర్వతాలలో చైనాను ఎదుర్కోవటానికి కీలక మైన ఆధునిక యుద్ధ ట్యాంకులు, శతఘ్నులు, మందుగుండు తయారీకి కీలక ఒప్పందం జరిగింది. యూఎస్ఏతో సుంకాల రచ్చ నేర్పిన గుణపాఠంతో యూరోపియన్ యూనియన్, కెనడా, ఒమన్, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాము. సెమికాన్ ఇండియా 2.0 ప్రోగ్రామ్ ద్వారా ఏఐ రంగంలో భారత్ వెనుకబడకుండా ఉండటానికి ప్రయత్నిస్తు న్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిప్ల తయారీకి కీలకమైన ఈయూవీ లితోగ్రఫీ యంత్రాల తయారీలో నెదర్లాండ్స్కు గుత్తాధిపత్యం ఉన్నది. నెదర్లాండ్స్కి చెందిన ఏఎస్యంఎల్ కంపెనీ మాత్రమే ఈ యంత్రాలను తయారు చేస్తున్నది. భారత ప్రధాని ఇటీవలి నెదర్లాండ్స్ పర్యటన ఈ రకంగా ప్రాధాన్యత సంతరించు కొన్నది. భారత ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద బలహీనత చమురు–గ్యాస్ దిగుమతులు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి సుమారు 36 మిలియన్ బ్యారెళ్ల చమురును వ్యూహాత్మక నిలువగా ఉంచు తున్నది. చైనా సుమారు 110 మిలియన్ బ్యారెల్స్ను వ్యూహత్మక నిలువగా ఉంచుతుంది. ఇటీవలి యూఏఈ పర్యటనలో మన వ్యూహాత్మక చమురు నిల్వలు (30 మిలియన్ బ్యారెల్స్) ఏర్పాటు చేయటానికి అంగీకారం కుదిరింది.చైనా–పాక్లకు చెక్ పెట్టడానికి యూఎస్ఏ లేదా రష్యాలపై ఆధారపడకుండా ప్రాంతీయ శక్తులతో స్నేహ సంబంధాలను పటిష్టం చేయాలి. ముఖ్యంగా దక్షిణాసియాలోని మలేషియా, ఇండో నేషియా, వియత్నాం, ఫిలిప్ఫైన్స్లతో సైనిక సంబంధాలను బలో పేతం చేయాలి. పాకిస్తాన్ ఇస్లామిక్ వ్యూహాన్ని ఎదుర్కోవటానికి యూఏఈ, ఒమన్, సౌదీలతో వ్యూహాత్మక, భద్రతా సంబంధాలను పటిష్టం చేయాలి. ప్రపంచ శక్తులయిన యూఎస్ఏ, రష్యా, చైనా లతో నిర్మాణాత్మక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూనే, వ్యూహాత్మక అంశాలలో జాగ్రత్త వహించాలి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఘనమైన గతంతో 'బలమైన భవితలోకి'!
ఇండియా, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు నేడొక కీలక మలుపులో నిలిచాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన అవి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. అంతర్జాతీయ వ్యవస్థ తీవ్రమైన మార్పులకు లోనవుతున్న తరుణంలో క్రమబద్ధ ఆదాన ప్రదానాలు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. మేడిన్ ఇటలీ... మేడిన్ ఇండియాప్రస్తుత 21వ శతాబ్దంలో ఆ యా దేశాల ఆవిష్కరణ సామర్థ్యం, ఇంధన మార్పిడి నిర్వహణ, వ్యూహాత్మక సార్వభౌమత్వం తదిత రాలే ప్రజా శ్రేయస్సు, జాతీయ భద్రత వంటి అంశాలకు రూపు నిస్తాయి. ఈ విషయంలో మా ఉమ్మడి అవగాహనను రెండు దేశాల మధ్య సహకారం ప్రస్ఫుటం చేస్తోంది. డిజైన్, తయారీ నైపుణ్యం, అంతర్జాతీయ స్థాయి సూపర్ కంప్యూటర్లతో పారిశ్రామిక కూడలిగా ప్రపంచంలో ఇటలీకి ప్రముఖ స్థానం ఉంది. అదేవిధంగా 100కు పైగా యూనికార్న్ సంస్థలు సహా 2,00,000 అంకుర సంస్థలతో భారత్ శరవేగంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. రెండు దేశాలకుగల ఈ సామర్థ్యాల మధ్య శక్తిమంతమైన సమన్వయ సాధన లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఇనుమడించేందుకు ఐరోపా సమాఖ్య–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) బాటలు వేస్తుంది. రక్షణ–ఏరోస్పేస్, కాలుష్య రహిత సాంకేతికతలు, యంత్రాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, రసాయన–ఔషధ, జౌళి, వ్యవసాయ–ఆహార, పర్యాటకం సహా మరిన్ని రంగాలపై ‘ఎఫ్టీఏ’ దృష్టి సారిస్తుంది. తద్వారా 2029 నాటికి ఇటలీ–ఇండియా మధ్య నిర్దేశిత 20 బిలియన్ యూరోల వాణిజ్య లక్ష్యాన్ని చేరడంతో సరి పెట్టకుండా దాన్ని అధిగమించాలన్నది మా ఆకాంక్ష. ‘మేడ్ ఇన్ ఇటలీ’ అనేది అంతర్జాతీయంగా అత్యుత్తమ నాణ్యతకు పర్యాయ పదబంధం. ఇప్పుడిది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ నిర్దేశిత ఉన్నత నాణ్యత లక్ష్యంతో సమన్వయం ఏర్పరచు కుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ కోసం ఉత్పాదన దిశగా ఇటలీ వ్యాపార సంస్థలలో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఇటలీలో భారత పరిశ్రమల సంఖ్య కూడా పెరగడం (ప్రస్తుతం రెండువైపులా వీటి సంఖ్య 1000కి పైగానే) మా సరఫరా వ్యవస్థల ఏకీకరణను బలోపేతం చేసే సానుకూల సంకేతం.ఏఐలో మానవీయతకే ప్రాధాన్యంఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అత్యాధునిక తయారీ, కీలక ఖనిజాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో నేటి పురోగమన వేగం రాబోయే దశాబ్దాల్లో అసాధారణ పరిధిగల సాంకేతిక విప్లవంగా రూపుదిద్దుకోగలదు. ఈ క్రమంలో చైతన్యవంతమైన భారత ఆవిష్కరణావరణ వ్యవస్థ, అత్యంత నైపుణ్యంగల వృత్తి నిపుణుల వనరులు, ఇటలీకిగల అత్యధునాతన పారిశ్రామిక సామర్థ్యం మేళవింపుతో పైన పేర్కొన్న రంగాలన్నిటా మన సహ కారం సహజసిద్ధమైనదిగా, వ్యూహాత్మకంగా రూపొందుతుంది. రెండు దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం ఈ పరిణామశీలతకు తోడ్పడుతుంది. సాంకేతికత పరిజ్ఞానాలను మానవాళి కేంద్రకంగా ఉంచేందుకు ‘మానవ్’ పేరిట భారత్ ఒక దార్శనిక విధానం అనుసరిస్తోంది. మానవతావాద సంప్రదాయంలో పాదుకున్న మానవ–కేంద్రక ‘అల్గార్–ఎథిక్స్’ను ప్రోత్సహించడంలో ఇటలీ ముందంజ వేసింది. ఇటలీ జి7 అధ్యక్షతకు, న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026’ సత్ఫలితాలకు మూలం ఈ సంయుక్త దృక్పథమే. అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతికతలలో భారత్ ఇప్ప టికే అద్భుత ప్రగతి సాధించింది. ఇప్పుడిక ఇటలీ ఏరోస్పేస్ ఇంజి నీరింగ్ నైపుణ్యం తోడ్పాటుతో సంయుక్త కార్యక్రమాలు చేపట్టడం సహా భవిష్యత్తరం సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పనకు గణనీయ అవకాశాలు అందివస్తాయి. ప్రపంచ దేశాల శ్రేయస్సుకు భరోసా లభించాలంటే జాతీయ భద్రత–స్థిరత్వం అత్యావశ్యకం. కాబట్టే రక్షణ–భద్రత, వ్యూహాత్మక సాంకేతికతలు వంటి రంగాల్లో సహకార బలోపేతానికి ఇటలీ, ఇండియా సంకల్పించాయి. కీలక సముద్ర మార్గాల భద్రతకు భరో సాతోపాటు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేర నెట్వర్క్లు, మాదక ద్రవ్యాల దొంగ రవాణా, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను ఎదుర్కొనగల సామర్థ్యాన్ని పటిష్ఠం చేయడంలో ఈ సహకారం దోహదం చేస్తుంది.ఇండో–మధ్యదరా కోసం వ్యూహాత్మక భాగస్వామ్యంమన భాగస్వామ్యానికి ఇంధన రంగం మరో మూలస్తంభం. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనాల నుంచి హైడ్రోజన్ సాంకే తికతల దాకా... స్మార్ట్ గ్రిడ్ల నుంచి పునరుత్థాన మౌలిక సదు పాయాల వరకూ భారత్, ఇటలీ ఇప్పటికే సహకారం కొనసాగిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నేతృత్వాన ఏర్పడిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), విపత్తు పునరుత్థాన మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), అంతర్జాతీయ జీవఇంధన కూటమి (జీబీఏ) వంటి సంకీర్ణ సంస్థల కృషిలో ఇతర దేశాలతోపాటు మన సహకారం కూడా కీలకం.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రాలైన ఇండో–పసి ఫిక్, మధ్యధరా ప్రాంతాల నడిబొడ్డున ఇండియా, ఇటలీ ఉన్నాయి. కాబట్టి, ఈ ప్రాంతాలను వేర్వేరు పరిధులుగా కాకుండా అంతకంతకూ పరస్పర సంధానితం అవుతున్న ప్రదేశాలుగా పరిగణించాలి. హిందూ మహాసముద్రాన్ని ఐరోపాతో ముడిపెట్టే వాణిజ్య, సాంకేతిక, ఇంధన, డేటా సహా సమాలోచనలకు కీలక మార్గమైన భారత–మధ్యధరా ప్రాంతం ఆవిర్భావానికి మన రెండు దేశాలే ప్రత్యక్ష సాక్షులు. సరిగ్గా ఈ పరస్పర సంధాన క్రమంలోనే మన స్నేహబంధం సహజ రీతిలో ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరిఢవిల్లుతూ – రెండు ఖండాలను కలిపి, కొత్త ప్రపంచ గమనాన్ని రూపుదిద్దుతుంది. ఈ పరిస్థితుల నడుమ ఆధునిక రవాణా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ నెట్వర్క్లు, ఇంధన వ్యవస్థలు, పటిష్ఠ సరఫరా వ్యవస్థలతో మన ప్రాంతాలను అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకున్న దార్శనికతకు ‘ఇండియా– మధ్యప్రాచ్య–ఐరోపా ఆర్థిక కారిడార్’ (ఐఎంఈసీ) ఒక ప్రతీక. భారతీయ సంస్కృతి ప్రబోధించే ‘ధర్మం’ అనే ఉదాత్త భావన మా బాధ్యతా స్ఫూర్తిని ఉత్తేజితం చేస్తుంది. ఆ క్రమంలో నేటి పరస్పర సంధాన డిజిటల్ యుగంలోనూ ‘వసుధైవ కుటుంబకం’ (యావత్ ప్రపంచం ఒకే కుటుంబం) సూత్రం మానవాళి మొత్తాన్నీ ముడివేయడంలో శక్తిమంతంగా పనిచేస్తుంది. పునరుజ్జీవన పథంలో పయనించే ఇటలీ మానవతావాద సంప్రదాయం కూడా ఈ విలువలను సహజంగా ప్రతిబింబిస్తుంది. అందుకే, రెండు దేశాల ప్రజలకు కేంద్ర స్థానమిస్తూ ఇండియా–ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేయాలని మా సంయుక్త దార్శనికత లక్ష్యనిర్దేశం చేసుకుంది. -
మనసేం చెబితే అదే 'మీ నిచ్చెన'
స్నాతకోపన్యాసం ఇవ్వాలని కొన్నేళ్లుగా, చాలాసార్లు అడుగుతూ వస్తున్నా నేనెప్పుడూ మృదువుగా తిరస్కరిస్తూనే వచ్చాను. అందుకు కారణం, ప్రసంగించేందుకు నేను సిద్ధంగా లేనని నాకు అనిపించటం. జీవిత పరమార్థాన్ని కుదించి చెప్పడం అంత తేలిక కాదు. జీవితాన్ని పూర్తిగా ఎలా ఆనందించాలో తెలియజేయటం చాలా కష్టం. అదీ కాక, ఏం చెప్పాలా అని ఒత్తిడికి లోనవుతాం. మిగిలిన వాళ్ల స్నాతకోపన్యాసాలు వినడం నాకెంతో ఇష్టం. కానీ వారి అడుగు జాడల్లో నడవడం చాలా కష్టం. ఇంకెందుకు వాటిని వినడం లేదా చదవడం అంటారేమో. ఎందుకంటే, నేనెప్పుడూ మార్గదర్శనం కోరుకునే వ్యక్తిని. నా చిన్నతనం చర్చిలో గడిచింది. ‘‘దేవుడే దారి చూపుతాడు. దారి చూపాల్సిందిగా మనం ఆయన్ని కోరాలంతే. భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకునే సాహసాన్ని కూడా మనం ప్రదర్శించగలగాలి’’ అని నాకు చెబుతూ వచ్చారు. నేనెప్పటికీ ఆ మాటల్ని విశ్వసిస్తాను.ఒక ప్రణాళికగా జీవితం నడవదుఇన్నాళ్లూ ఉపన్యసించేందుకు ససేమిరా అన్నవాడిని, ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నానో కూడా నాకు తెలియదు. నిజానికి, నా ప్రసంగ పాఠానికి ఏదైనా శీర్షిక పెట్టాలంటే, ‘‘నాకు తెలియదు’’ అనే పెట్టాలి. నాకు అన్నీ తెలుసు అనే స్థితికి ఎన్నడూ చేరుకోలేనని నాకు 57 ఏళ్లు వచ్చాక గ్రహించాను. జీవితం మనం ప్రణాళిక వేసుకున్నట్లుగా సాగదని చెప్పడానికే నేను ఇక్కడకు వచ్చాను. కనీసం, నా జీవితం అలా సాగలేదని చెప్పగలను. జీవితంలో చాలా భాగం నాకు ఏమీ తెలియకుండానే గడిచిపోయింది. ఈ తెలియకపోవడం అన్నది 22 లేదా 27 ఏళ్ల వయసప్పుడే కాదు. ఆరు నెలల క్రితం కూడా ఏమీ తెలియదు. ఆ మాటకొస్తే నిన్న కూడా ఏమీ తెలియదు. ఆరేళ్ల వయసప్పుడే ఒక పాత్రలో నటించాను. ఆ తర్వాత నాటకాలు వేశాను. పాడాను. కచ్చేరీలు చేశాను. కానీ, అవే నా వృత్తిగా పరిణమిస్తాయని నేను ఎన్నడూ అనుకోలేదు. సహచరుడు ఒకరు మోడలింగ్ చేస్తూ, బాగా డబ్బు గడించడం చూసి 19 ఏళ్ల వయసులో నేను మోడలింగ్కి ప్రయత్నం చేశాను. కానీ, నాది ఫొటోజెనిక్ ఫేస్ కాదని, కెమెరా నాకు అచ్చిరాదని, వేరే వ్యాపకం ఏదైనా చూసుకోవడం మంచిదని, ఆ ఏజన్సీ అధిపతి నాకు నిష్కర్షగా చెప్పేశాడు. ఆ మాటలు నాలో పాతుకుపోయి, నేను సినీ జీవితంలోప్రవేశించిన తర్వాత కూడా, చాలా రోజులు నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. కనుక, చెవికెక్కించుకునే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి.కోరుకున్న చోటుకే చేరుకుంటాంజర్నలిజం ప్రధానాంశంగా నేను కమ్యూనికేషన్స్లో లిబరల్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసే దశలో ఉన్నప్పుడు మనం ఒక నాటకం వేయా లని టీచరు చెప్పారు. చిట్టీలలో పేర్లు రాసి, డ్రా తీశారు. నా పేరు రావడంతో, నన్నో పాత్రకు ఎంపిక చేశారు. ఇష్టం లేకపోయినా, డిగ్రీ చివరి ఏడాదిలో 90 శాతం సమయాన్ని నాటకానికే వెచ్చించాల్సి వచ్చింది. నాటకం వేసేందుకు స్థానికంగా ఉన్న మరో యూనివర్సిటీకి మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ యాక్టింగ్ స్టూడెంట్లు కొంతమంది ఉన్నారు. వారికి, మాకూ ఒకేచోట బస. ఎందుకో తెలియదుకానీ, ‘‘నేను ఎవరి సాహచర్యాన్ని కోరుకుంటున్నానో వారి వద్దకే చేరాను’’ అనే భావన నాలో కలిగింది! సిడ్నీలోని యాక్టర్స్ సెంటర్లో ఒక ఏడాది కోర్సులో చేరాలనుకున్నా. 20 సీట్లు ఉన్నాయి. మొదటిసారి నాకు రాలేదు. సీటు వచ్చిన ఒకతను చేరకపోవడంతో, నాకు మళ్లీ పిలుపు వచ్చింది. దానికీ, సుమారు ఎనిమిదిమంది పోటీ పడితే, నాకు దక్కింది. కోర్సులో చేరాలని వచ్చిన జాబు చూసి సంతోషపడ్డాను కానీ, చివరలో 3,500 డాలర్ల ఫీజు చెల్లించాలనే నిబంధన చూసి హతాశుడినయ్యాను. ఇది 1984 నాటి మాట. ఆ ఫీజు నాకు అప్పట్లో, పది లక్షల డాలర్లతో సమానం. నాన్న ఇచ్చిన పైకంతో అప్పుడే డిగ్రీ పూర్తి చేశాను. మరో కోర్సు చేయడా నికి డబ్బులు ఇవ్వాలని నాన్నని అడిగే సాహసం చేయలేక పోయాను. ఆఫరు లెటర్ను చెత్త బుట్టలో పడేశాను. నటన నా నుదుటిన రాసిపెట్టిలేదేమో అనుకున్నా. మరుసటి రోజు, మా నాయనమ్మ వీలునామా చలువ వల్ల, నాకు 3,500 డాలర్లు వచ్చి పడ్డాయి. చెత్త బుట్టలో పడేసిన లెటర్ని జాగ్రత్తగా బయటకు తీసి, కోర్సులో చేరాను. అలా, నాలుగేళ్ల పాటు నటన నేర్చుకున్నాను.కొందరికి అది పూర్తి కాకతాళీయంగా జరిగినదిగా తోచవచ్చు. నాకు మాత్రం, అది ఒక సంకేతం, ఒక ప్రార్థనకు లభించిన జవాబు అనిపి స్తుంది. అలాగే, నాకు ‘ద బాయ్ ఫ్రమ్ ఔన్స్’ అనే సంగీత నాటకంలో నటించే అవకాశం లభించింది. అప్పటికే రెండు పెద్ద మ్యూజి కల్స్ చేసే పనిలో ఉన్నాను. నాటకాలు, సినిమాలు, టెలివిజన్ కార్య క్రమాల్లో అవకాశాల కోసం నేను ముమ్మరంగా ప్రయత్నిస్తున్న రోజులవి. వచ్చింది గొప్ప అవకాశం అని నాకు లోపలి నుంచి తోస్తున్నా, అప్పటికప్పుడే మరో మ్యూజికల్ చేయడం సరికాక పోవచ్చు అనుకుని ఆ అవకాశాన్ని వద్దను కున్నాను. తీరా, దాన్ని చూస్తున్నప్పుడు, అంతకు రెండేళ్ల క్రితం లభించిన ఆ అవకాశాన్ని చేజిక్కించు కోనందుకు ఎంతో బాధపడ్డాను. అంతఃకరణ చెప్పినట్లు నడచుకోక పోవడం తప్పు అనిపించింది. ఆ క్షణమే, లోపల ఏది మంచిదని తోస్తుందో దాన్నే చేయాలని నిర్ణయించుకున్నాను. భయం కలగటం మంచి సంకేతం!మన మెదడు ఎప్పుడూ ఒక ప్రణాళికతో నడచుకోవాలని చెబుతుంది. కానీ, మనం మన హృదయ కవాటాలను తెరచి, లోపలి నుంచి మన మది చెప్పింది వింటే, అది నిగూఢమైన ఒక మార్మిక సంకేతంగా తోచవచ్చు. కానీ, కొన్నిసార్లు ఆ సంకేతాలు నిశ్శబ్దంతో నిండి ఉంటాయి. అప్పుడు అంతరాత్మ ఏం చెబుతోందో ఎలా తెలుస్తుంది అనిపించవచ్చు. దేన్నైనా పరిపూర్ణమైనదిగా చేయాలనే ఆలోచనను మొదట పక్కన పెట్టండి. లోపల నుంచి వచ్చిన ఆలోచన భయపెడితే బహుశా అది మంచి సంకేతమే కావచ్చు. అది ఉత్తేజపరిస్తే చాలా మంచి సంకేతం కింద లెక్క. అది చెప్పిన పని చేయడం వల్ల నామమాత్రపు లాభమైనా లభిస్తుందనే భరోసా లేదని తెలిసినా, ప్రయత్నించి చూడాలనే తలంపు కలిగితే, అది అద్భుతమైన సంకేతం కింద లెక్క. నాకు జీవితంలో జరిగిన గొప్ప మేలు ఏదైనా ఉందీ అంటే, అది నేను చేసిన తప్పిదాలే లేదా నా వైఫల్యాలే, అనుకోకుండా సత్ఫలితాలను ఇచ్చిన చివరి నిమిషపు ప్రయత్నాలే. మనసు నాకు ఎప్పుడూ మంచి చెబుతూనే ఉంటుంది. ఇప్పటికీ దారి చూపుతూనే ఉంది. అది చెప్పినట్లు చేస్తేనే, నాకు నేను సరైన బాటలో ఉన్నాననిపిస్తుంది. ఈ ప్రసంగం కూడా దాని ప్రబోధం మేరకే చేస్తున్నాను. మీకు ఏది సంతోషం కలిగిస్తుందో వెదకండి. భయం, సందేహాలు, ఒంటరితనం, వైఫల్యాలు ఎదురైనపుడు మీలో వెలుగును నింపేది ఏదో తెలుసుకోండి. లోపల రగులుతున్న దానిని కనుగొనండి. ‘‘నిచ్చెన చివరి మెట్లు దాకా ఎక్కిన తర్వాత, ఎక్కాల్సిన గోడ ఇది కాదు అని తెలుసుకోవడం కన్నా అధ్వానమైన విషయం బహుశా మరొకటి ఉండదు’’ అని జోసెఫ్ క్యాంప్బెల్ (అమెరికన్ రచయిత) అంటాడు. మీరు ఎక్కాల్సిన గోడ ఏదో, దానికి ఎంచు కోవాల్సిన నిచ్చెన ఏదో మీ మనసే మీకు చెబుతుంది. మీరందరూ సాహసం, ఆశ్చర్యం, సంతోషం, తెగువ, గొప్పగా చెప్పుకోతగిన వైఫల్యాలు, విజయాలు, గొప్ప స్నేహ బంధాలు, ప్రేమతో నిండిన జీవితం గడపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మీరు కోరుకుంటు న్నట్లుగా మీరు జీవిస్తున్నారనే భావన మీలో కలగాలి. ఎందుకంటే, దాన్ని మీ దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు. -
ఫ్లాష్బ్యాక్ తిరగేస్తే!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ప్రముఖులంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలపై రేట్లు భారీగా పెంచేశారు. ధరల దెబ్బకు ప్రజలు ఎలాగూ ఆయిల్ వినియోగం తగ్గించుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రభుత్వాల దుబారా ఖర్చుల మాటేమిటి?.. మోదీ చెప్పిన ఎనిమిది, తొమ్మిది సూత్రాలతో పరిస్థితి మారదన్నది స్పష్టం. ఆయన బంగారం కొనవద్దన్నారు. మరి... ఈ రంగంపై ఆధారపడ్డ ఐదున్నర కోట్ల మంది జీవనోపాధి మాటేమిటి అని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ వెంటనే కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. దీంతో ఇది కొంత మెరుగేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పొదుపు మంత్రం పఠించారు. ప్రభుత్వపరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు. మంచిదే. కానీ ఇప్పటివరకూ దుబారా చేసినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది. ఇక ఏపీలోనైనా ఈ వాహనాల వినియోగం అట్టహాసంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేశ్లు హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో వాడరని చెబుతున్నారు. సీఎం ఒక్కరికే ఉన్న ఈ వెసలుబాటు ఇప్పుడు డిప్యూటీలకు, మంత్రులకు కూడా ఎలా సాధ్యమవుతోందో తెలియదు. మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేశ్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్లు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించే వారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే కారణమని ఆరోపించే వారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిళ్లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడి ధరకు, ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి రెండేళ్లు దాటుతున్నా, అధికారంలో ఉన్న వీరెవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే. పెట్రోల్ రేటు రూ.113 కాగా.. డీజిల్ ధర రూ.99 లకు చేరింది. తమిళనాడు సుమారు రూ.9, కర్ణాటక కన్నా సుమారు రూ.ఏడు ఎక్కువ. ఇప్పుడైనా రాష్ట్ర పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే, రెండు లేదా మూడు వాహనాలు, సీఎం కాన్వాయిలలో సరిపోతే, ఇంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. ప్రతి శుక్రవారం ‘నో వెహికిల్ డే’ పాటించాలని, మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమనాలు అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ రెండేళ్లలో ఏనాడైనా అన్నారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయిలో ఇంతకాలం వాహన శ్రేణిని తగ్గించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు చెప్పడానికి, చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకున్నారు. అవసరమైతే సచివాలయానికి సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ, లేదా గుంటూరు, మంగళగిరి ప్రాంతాలలో నివసిస్తున్న మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రం హోం గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఢిల్లీ వంటి రాజధాని నగరాలలో ఇది సాధ్యమేమో కాని, గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీలో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకోసం వర్క్ ఫ్రం హోమ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల వద్దనే ఉండి పని చేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు. కేవలం ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గించడం వల్ల ఆదా అయ్యే చమురు వ్యయం మరీ ఎక్కువేమీ కాదు. అదే ఏపీ సర్కార్ కనుక ఆయిల్ పై ఉన్న పన్నులు తగ్గిస్తే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తారు.అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒకరకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అనుకోవాలి. కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందా? అంటే కాదనే చెప్పాలి. ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం ఇంతా అంతా కాదు.దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంతదాకా ఎందుకు ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు వచ్చాయి కదా!. తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం రూ.6.5 కోట్లు వ్యయం చేయడానికి జీవో ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృథా వ్యయమని విపక్ష వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఇక అన్నిటికి మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా ఉంటోందన్నది సర్వత్రా వ్యక్తం అవుతున్న అబిప్రాయం. అమరావతికి ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు చేయనవసరం లేదని చంద్రబాబు పదే,పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు రూ.47 వేల కోట్ల అప్పులు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండవచ్చు. అప్పుడు ఈ వ్యయం ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులనైనా పొదుపుగా చేస్తున్నారా అంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త భవనాల కోసం మళ్లీ వేల కోట్లు వ్యయం చేయబోతున్నారు. అందరికి అందుబాటులో ఉన్న గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని కాదని ఎక్కడో మారుమూల మరో 4600 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలిదశలో రూ.3400 కోట్లు ఖర్చు పెడతారట. రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం భవనాల అద్దాల కోసం రూ.2540 కోట్లు వ్యయం చేయడమా అని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. అమరావతి నిర్మాణాలలో భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 140 మీటర్ల వెడల్పు రోడ్డు వేస్తారట. దీనికి పాతికవేల కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూ సేకరణ అంటేనే పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు.ఈ నేపథ్యంలో ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్ గా అమరావతి పేరుతో సాగుతున్న దుబారాను అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతుందా?అంటే అనుమానమే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇటు అంగీకారాలు, అటు హెచ్చరికలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల చర్చలు ఇరువురూ కోరుకున్నట్లే సాగాయి. బీజింగ్ ప్రయాణానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ, తమకు ‘అన్నింటికన్న వాణిజ్యం ముఖ్య’మన్నారు. షీ చెప్పిన ప్రధానమైన లక్ష్యాలు, ‘అమెరికాతో నిర్మాణాత్మకమైన సంబంధాలు, వ్యూహాత్మకమైన స్థిరత్వం’. నాయకులిద్దరి మధ్య మే 14, 15 తేదీలలో రెండు విడతల సమావేశం తర్వాత, అంతా సజావుగా జరిగిందన్నది ఉభయుల సంతృప్తి. అదే సమయంలో చైనా అధ్యక్షుడు తైవాన్ విషయమై అమెరికాకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు చేసి ఆశ్చర్యపరిచారు. ట్రంప్ నుంచి మౌనమే సమాధానమైంది.‘ఒకే చైనా’కు ఒప్పుకొంటారా?మిగిలినదంతా సవ్యంగానే జరిగినందున, అపశృతిగా మారిన తైవాన్ అంశంపై జరిగిందేమిటో ముందు చూడాలి. చారిత్రకంగా చూసినా, అంతర్జాతీయ చట్టాల ప్రకారమైనా తైవాన్ దీవి చైనాలో భాగం. అమెరికా సహా ప్రపంచమంతా ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీ కరిస్తున్నాయి. తైవాన్తో దౌత్య సంబంధాలు లేవు. అదే సమయంలో గమనించదగ్గదేమంటే... అమెరికా, దాని మిత్ర దేశాలు కేవలం తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం తైవాన్కు భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తూ, పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తైవాన్ చైనాదేననీ, కానీ వారికి ఇష్టం లేకుండా చైనాలో విలీనం చేసుకునేందుకు అంగీకరించ బోమనీ విచిత్రమైన వాదన చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాను సాధారణ దౌత్య మార్గంలో ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ వచ్చిన చైనా అధ్యక్షుడు, అమెరికా ‘సవ్యంగా వ్యవహరించని పక్షంలోరెండు దేశాల మధ్య విభేదాలు, చివరకు ఘర్షణ తప్పక పోవచ్చు’ నని ట్రంప్ను హెచ్చరించారు.విషయ తీవ్రత దృష్ట్యా ఇందు గురించి మరికొన్ని వివరాలు చూద్దాము: ఒకవైపు ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీకరిస్తూనే, మరొక వైపు తైవాన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా, తన ద్వంద్వ నీతికి ‘వ్యూహాత్మక అస్పష్టత’ (స్ట్రాటెజిక్ ఆంబిగ్విటీ) అనే పేరు తానే పెట్టింది. తైవాన్ను కాపాడటం తమ లక్ష్యమంటూ చట్టమే చేసింది. ఒకవేళ తైవాన్ను చైనా స్వాధీనపరచుకొనజూస్తే తాను తైవాన్కు సహాయం మాత్రమే చేస్తుందా లేక స్వయంగా యుద్ధంలో పాల్గొంటుందా అనే ప్రశ్నకు అవుననిగానీ, కాదనిగానీ స్పష్టం చేయటం లేదు. మరొకవైపు బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన ఇండో– పసిఫిక్ స్ట్రాటెజీ (2022), ట్రంప్ తన రెండవ హయాంలో ప్రకటించిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటెజీ (2025), నేషనల్ డిఫెన్స్ స్ట్రాటెజీ (2026) పత్రాలను పరిశీలించినప్పుడు, తైవాన్ను ఉపయోగించు కుని చైనాను నియంత్రించటం వారి ఉద్దేశమని లిఖితపూర్వకంగా, బహిరంగంగా ప్రకటించటం కనిపిస్తుంది.మౌనం ప్రస్తుతానికేనా?ఈ దిశలో అమెరికా ఇంకా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న పరిస్థితిలోనే చైనా అధ్యక్షుడు, బహుశా విసుగెత్తి కావచ్చు, గతంలో ఎన్నడూ లేని రీతిలో పై విధమైన హెచ్చరికను ముఖాముఖీగా చేశారు. సమావేశాల సమయంలో, అంతకుముందూ ఇంకా ఏమేమి మాటలు వినిపించాయో గమనించాలి. తక్కిన విషయాలన్నీ ఎట్లున్నా, చైనాకు గల ‘ముఖ్యమైన ప్రయోజనాలలో అతి ముఖ్యమైన ప్రయోజనం’ తైవాన్ అన్నారాయన. ఈ అంశం సవ్యంగా తేలనట్లయితే ‘అత్యంత తీవ్రమైన ప్రమాదకర పరిస్థితికి’ దారి తీయగలదన్నారు. అమెరికా– చైనా సంబంధాలు యావత్తు ప్రమాదకరమవుతాయని హెచ్చరించారు. తైవాన్ స్వాతంత్య్రం, ఆ ప్రాంతంలో శాంతి అన్న రెండు మాటలు నీళ్లు–నిప్పు వంటివనీ, రెండింటికి పొసిగే ప్రసక్తి లేదనీ అన్నారు.తైవాన్ గురించి ఇంతింత చెప్పుకోవటం ఎందుకంటే, 1949లో చైనాలో కమ్యూనిస్టు విప్లవం రావటానికి ముందు, వారికి చెందిన తైవాన్ దీవిని జపాన్ సైనికంగా ఆక్రమించింది. తర్వాత, మావోతో ఓడిపోయిన చాంగ్ కై షేక్ వర్గం తైవాన్కు పారిపోగా, ఆ వర్గాన్ని అమెరికా కూటమి, జపాన్ మద్దతిచ్చి నిలబెట్టాయి. మొదటి నుంచి చైనాకు చెందిన ఆ దీవిని తిరిగి తమ దేశంలో విలీనం చేసుకోవటం చైనా నాయకత్వానికి ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ లక్ష్యంగా మారింది. ఇపుడు ట్రంప్తో చర్చల సందర్భంగా చైనా అధ్యక్షుడు ఈ విషయమై ఎన్నడూ లేనంత తీవ్రంగా మాట్లాడటానికి వెనుక ఈ సుదీర్ఘ నేపథ్యం ఉంది. విషయం అమెరికా పక్షానికి తెలియనిది కాదు. పరిస్థితి శాంతియుతంగా తేలనట్లయితే ఎప్పటికైనా సరే తైవాన్ను బలప్రయోగం ద్వారానైనా విలీనం చేసుకోగలమన్నది కూడా చైనా చెప్తున్న మాటే. జిన్పింగ్ హెచ్చరికలకు 14వ తేదీన ట్రంప్ స్పందించలేదు. కానీ ముందు రోజున ఆయన విదేశాంగ మంత్రి మార్కో రూబియో ‘మా విధానంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు. చైనా సైనిక చర్యకు పాల్పడితే అది పొరపాటు అవుతుంది’ అని మాత్రం అన్నారు. కొద్ది నెలల క్రితం ట్రంప్ ఒక ప్రశ్నకు జవాబిస్తూ, ‘చైనా అభిప్రాయాలు తెలుసు. వారు తైవాన్ విషయమై పట్టుదలగా ఉన్నారు. కనీసం నా అధ్యక్ష కాలంలో సైనిక చర్య తీసుకోబోదని ఆశిస్తాను’ అన్నారాయన. గమనించవలసింది ఏమంటే, అధికారంలో ఉన్నది రిపబ్లికన్లా, డెమోక్రాట్లా అన్న దానితో నిమిత్తం లేకుండా, పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజ నాలకు, చైనాను కట్టడి చేసేందుకు తైవాన్ తమ పలుకుబడిలో ఉండాలన్నది అమెరికా వ్యూహం. ఇపుడు చైనా అధ్యక్షుని హెచ్చరిక ప్రభావం ఎట్లుండవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం.ట్రాప్లో పడొద్దు!చర్చల వివరాలను ఇతరత్రా గమనించినప్పుడు, ప్రధానమై నది పరస్పర ఆర్థిక సంబంధాలు. వాణిజ్యపరంగా ‘గొప్ప ఒప్పందాలు’ జరిగినట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన వెంట సుమారు 30 అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలను తీసుకువెళ్లటంలోని ఉద్దేశమూ అదే. అమెరికాలోనూ అదే పద్ధతిలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశ మిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో అమెరికా, చైనాలు భాగస్వా ములుగా పరస్పరం సహకరించుకోవాలి తప్ప పోటీదారులు కారా దనీ, ఇరువురి సంబంధాలు స్థిరమైన విధంగా సాగాలనీ షీ అన్న మాటలు ట్రంప్కు నచ్చినట్లే కనిపించాయి. తమ సంబంధాలు ‘గతంలో ఎన్నడూ లేనంతగా’ ముందుకు పోగలవన్నారాయన.చైనా అధ్యక్షుడు తన పరస్పర సహకార సూచనలకు మద్దతుగా, క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దంలో స్పార్టా, ఏథెన్స్ల మధ్య జరిగిన ఒక యుద్ధాన్ని ఉదహరించారు. అగ్రస్థానంలో ఉండిన స్పార్టా, రెండవ స్థానంలో ఉండిన ఏథెన్స్ తనను మించి పోగదలనే భయంతో ముందస్తు యుద్ధం వంటిది చేస్తుంది. అట్లా భయంలో చిక్కుకోవటాన్ని తుసిడిడీస్ అనే చరిత్రకారుడు విశ్లేషించి చెప్పాడు. అప్పటినుంచి ఆ భయాందోళనల స్థితిని ‘తుసిడిడీస్ ట్రాప్’ అంటున్నారు. అమెరికా, చైనా అటువంటి ట్రాప్లో చిక్కు కోకుండా పరస్పర సహకారంతో అభివృద్ధి చెందాలని జిన్పింగ్ సూచించగా, అటువంటి సహకారం గతంలో ఎన్నడూ లేనంతగా ఉండగలదన్నది ట్రంప్ ఇవ్వబూనిన భరోసా!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సంజయ్ మల్హోత్రా (ఆర్బీఐ గవర్నర్) రాయని డైరీ
మనసు ప్రశాంతంగా లేదు. అలాగని అశాంతి గానూ లేదు. ఉప్పునీటి ఉపరితలం మీద ఒలికిపోయి తేలుతున్న చమురు తెట్టులా ఉంది. సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్ 18వ అంతస్తు నుండి అరేబియా సముద్రాన్ని చూస్తూ పనిచేయటం ఎప్పటిలా ఇవాళ నన్ను ఆహ్లాదపరచటం లేదు! ఏదో ఒకటి మాత్రమే చేయగల మానసిక స్థితిలో ఉన్నాను. సముద్రాన్ని షట్డౌన్ చేసేసి లాప్టాప్లో సర్ఫింగ్ చేయటమా? లేక, లాప్టాప్ను స్కూబా ట్యాంక్లా వీపున తగిలించుకుని సముద్రంలోకి దూకేయటమా? ఏదో ఒకటే! కవాస్జీ పటేల్ రోడ్లోని ‘టమ్ టమ్ టీ పాయింట్’ నుండి తరచూ నేను అడిగి తెప్పించుకునే ఘాటైన రాజస్థానీ టీ... టేబుల్ మీద చిక్కగా చల్లబడి ఉంది. మీగడను పక్కకు ఊది, టీని కొద్దిగా చప్పరించాను. కొత్తగా ఉంది! కొత్తగా ఉన్నా బాగుంది. కాలం అనుకూలంగా లేనప్పుడు కాలానికి అనుకూలంగా మారటంలోనే మనిషి బాగోగులు ఉంటాయి. దేశానికి ఇప్పుడు పొదుపు కాలం. ప్రధాని ఇచ్చిన పిలుపు కాలం. చల్లబడిన టీని వదిలేసి వేడిగా ఇంకో కప్పును తెప్పించుకోవటానికి మనస్కరించని కాలం. ప్యాంటు జేబులోంచి పర్సు తీసి చూశాను. ఒక అరలో కొన్ని నోట్లు. ఇంకో అరలో బంగారు కడ్డీలు. మిగతా అరల్లో ఫారిన్ బాండ్లు, యూరోలు, పౌండ్లు. హుండీని నిండకుండానే పగలగొట్టి నట్లుగా పర్సును టేబుల్ మీద బోర్లించి మొత్తం ఉన్నదెంతో లెక్క చూశాను. 66 లక్షల 3 వేల 990 కోట్ల రూపాయలు. 145 కోట్ల మందికి పైగా కుటుంబ సభ్యులున్న ఇంటిని నెట్టుకు రావటానికి దాచుకుంటూ వచ్చిన ద్రవ్యం. మూడు నెలల క్రితం వరకూ పర్సు బరువుగా ఉండేది. ఇంటికి బలంగా ఉండేది. అందులో 69 లక్షల 84 వేల 640 కోట్ల రూపాయలు ఉండేవి! అదేమీ చిన్న మొత్తం కాదు. ఆ డబ్బుతో 10,000 టన్నుల బంగారం కొనొచ్చు. ఐదుగురు ఎలాన్ మస్క్లు లేదా ఆరుగురు జెఫ్ బెజోస్ల దగ్గర ఉండే మొత్తం సంపదను కలిపినా నా పర్సులో ఉన్న దానికంటే తక్కువే అవుతుంది! కానీ, దాచిన గుడ్ల కోసం ఏ కాలసర్పమో పొంచి ఉంటుంది. పర్సులో ఉన్న డబ్బులో 4 లక్షల కోట్లను ఈ రెండు నెలల్లోనే హార్మూజ్ జలసంధి మింగేసింది! ప్రధాని చెప్పినట్లు ఎంత పొదుపు చేసినా, మిగిలిన డబ్బుతో ఇంకొక పదకొండు నెలలు మాత్రమే హుండీపై బండి నడుస్తుంది. ఆ తర్వాత?! సముద్రమంత పొదుపైనా అది ఆదాయమూ కాదు, ఆస్తీ కాదు. మార్కెట్ జీవనదుల్లోంచి నిరంతరం డబ్బు ప్రవాహాలు వచ్చి కలుస్తుండాలి. ప్రధానికి ఓట్లు తగ్గకూడదు. ఆర్బీఐకి ధరలు పెరగకూడదు. ప్రధాని తన కంఠహారం తీసి ప్రజల్లోకి విసురుతారు; ఆర్బీఐ దానిని మధ్యలోనే ఒడుపుగా పట్టేసి, తిరిగి కోశాగారంలో బాధ్యతగా పెట్టేయాలి. ప్రధానికి ప్రజలు హ్యాపీగా ఉండటం కావాలి. ఆర్బీఐకి దేశం ధీమాగా ఉండటం కావాలి. మంచి చెడ్డలు చూసే ఆర్బీఐ, ప్రధానికి మంచీ చెడూ చెప్పకూడదా? ప్రధాని ఏదైనా చేసేముందు ఆర్బీఐ చెవిలో ఒక మాట వేయకూడదా? ప్రధాని నెహ్రూకి, ఆర్బీఐ గవర్నర్ బెనెగల్ రామారావుకి ఇక్కడే పడింది. ప్రధాని మన్మోహన్కి, ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావుకి ఇలాగే పడింది. ప్రధాని మోదీకి, ఆర్బీఐ గవర్నర్లు రఘురామ్ రాజన్కి, ఉర్జిత్ పటేల్కి, శక్తికాంత దాస్కి కూడా ఇందుకే పడింది. ఇప్పుడీ నడి సముద్రంలో నా వంతు! రాజీనామా లేఖను సమర్పిస్తే నౌక నుంచి నేనొక్కడినే నా స్వార్థం నేను చూసుకుని లైఫ్బోట్లోకి దూకేయటం అవుతుందా?! మెల్లిగా సీట్లోంచి లేచి, గాజు అద్దాల్లోంచి దూరంగా ఆకాశమూ, అరేబియా సముద్రమూ కలుస్తున్న చోటును చూస్తూ నిలబడ్డాను. ట్రంప్ యుద్ధ తంత్రం, మోదీ పొదుపు మంత్రం భూమ్యాకాశాల్లా కలిసిపోయిన క్షితిజ రేఖ నాకు అక్కడ కనిపించింది! -
ఇరాన్ సమాంతర శక్తి కేంద్రం
దాదాపుగా అన్ని దేశాల విషయంలో ఎన్నికైన ప్రభుత్వం, అధ్యక్షుడు, సైన్యం, పార్లమెంట్ వంటి వ్యవస్థలే ప్రధాన అధికార కేంద్రాలుగా కనిపిస్తాయి. కానీ ఇరాన్ విషయంలో పరిస్థితి కొంత భిన్నం. అక్కడ బాహ్యప్రపంచానికి కనిపించే ప్రభుత్వ వ్యవస్థలతో పాటు, మరొక సమాంతర శక్తి కీలక పాత్ర పోషిస్తోంది. అదే ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్జీసీ). పర్షియన్ భాషలో దీనిని ‘సెపాహ్–ఎ పాస్దారాన్–ఎ ఎంగెలాబ్–ఎ ఇస్లామీ’ అని పిలుస్తారు. దీని అర్థం ఇస్లామిక్ విప్లవ పరిరక్షక దళం. పేరుకు ఇది భద్రతా సంస్థ మాత్రమే. కాలక్రమేణా ఇరాన్ రాజకీయ ముఖచిత్రం, విదే శాంగ వ్యూహం, సామాజిక నియంత్రణ, ప్రాంతీయ వ్యూహాత్మక కార్యకలాపాలు వంటి అనేక రంగాలను ప్రభావితం చేసే కేంద్రంగా పరిణమించింది. అందుకే పశ్చిమ దేశాల విశ్లేషణల్లో ఐఆర్జీసీని ‘దేశంలో మరో దేశం’గా అభివర్ణిస్తుంటారు.1979 విప్లవంతో మొదలు...ఈ సంస్థ ఆవిర్భావాన్ని ఆకళింపు చేసుకోవాలంటే 1979 ఇరాన్ విప్లవాన్ని పరిశీలించాలి. అప్పటివరకు ఇరాన్లో పాలన సాగించిన షా మహమ్మద్ రేజా పహ్లవి – పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికా–బ్రిటన్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. గణనీయ స్థాయి సహజ వనరులు కలిగిన ఇరాన్పై పాశ్చాత్య ప్రభావం పెరుగుతుండటం దేశంలో అసంతృప్తికి దారితీసింది. ఇస్లామిక్ వర్గాలు, జాతీయవాద శక్తులు, విద్యార్థులు, వామపక్షాలు ఐక్యంగా షా పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాయి. అప్పుడు మత పెద్దగా ఉన్న అయతుల్లా రుహొల్లా ఖొమేనీ నాయకత్వంలో జరిగిన విప్లవం షా పాలనకు చరమగీతం పాడింది. దాంతో, ఇస్లామిక్ రిపబ్లిక్కు అంకురార్పణ జరిగింది.కొత్త ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తాయి: విప్లవం ద్వారా ఏర్పడిన ఈ కొత్త వ్యవస్థను దీర్ఘకాలం ఎలా కాపాడాలి? పాత శక్తులు తిరిగి పుంజుకోకుండా ఎలా నిరోధించాలి? చమురు సంపదపై దృష్టి పెట్టిన పాశ్చాత్య దేశాల జోక్యాన్ని ఎలా ఎదు ర్కోవాలి? ముఖ్యంగా, కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ పాలనను అంత ర్గతంగా, బాహ్యంగా సవాలు చేసే శక్తులను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా, అప్పటి ప్రథమ సుప్రీం లీడర్ ఖొమేనీ నాయకత్వంలో ఐఆర్జీసీ పురుడు పోసుకుంది.ఇక్కడే ఇరాన్ సంప్రదాయ సైన్యం ‘ఆర్టేష్’ అంటే అగ్ని, ఐఆర్జీసీ మధ్య వైరుధ్యం కనిపిస్తుంది. ఇతర దేశాల సైన్యాల లాగానే ఆర్టేష్ విధులు దేశ సరిహద్దులను రక్షించడం, సాంప్రదాయ యుద్ధాలలో దేశాన్ని కాపాడటం. కానీ ఐఆర్జీసీ లక్ష్యం కేవలం భూభాగ పరిరక్షణ మాత్రమే కాదు, ఇస్లామిక్ విప్లవాన్నీ, దాని భావజాలాన్నీ కాపాడటం కూడా దీని ప్రధాన బాధ్యతగా నిర్దేశించ బడింది. అందువల్ల, బాహ్య శత్రువులతో పాటు అంతర్గత రాజ కీయ అస్థిరత, సామాజిక నిరసనల వంటి అంశాలను కూడా ఇది భద్రతా సమస్యలుగా పరిగణిస్తుంది. ఈ విస్తృత పాత్రే కాలక్రమేణా ఐఆర్జీసీకి ఎనలేని ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టింది.ప్రభుత్వం వర్సెస్ ఐఆర్జీసీఇరాన్ అధికార వ్యవస్థలో అత్యున్నత స్థానం ‘సుప్రీం లీడర్’ది. ఇది కేవలం రాజకీయ పదవి మాత్రమే కాదు; తొమ్మిది కోట్ల మంది ఇరానీయులను ఏకీకృతం చేయగల మతపరమైన అత్యున్నత అధి కార హోదా కూడా. ఖొమేనీ తర్వాత దశాబ్దాల పాటు అలీ ఖమేనీ ఆ పదవిలో తిరుగులేని అధికారం చలాయించారు. ప్రస్తుత ఉద్రి క్తతల నడుమ, అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆ బాధ్యత చేపట్టారు. ఐఆర్జీసీ నేరుగా సుప్రీం లీడర్కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఎన్నికైన అధ్యక్షుడు, పార్లమెంట్, మంత్రివర్గం వంటి వ్యవస్థలకు ఇది పూర్తిగా లోబడి ఉండదు. ఫలితంగా, ఒకవైపు ఎన్నికైన ప్రభుత్వం కొనసాగుతుండగా, మరోవైపు సుప్రీం లీడర్కు నేరుగా అనుసంధానమైన ఐఆర్జీసీ కూడా సమాంతరంగా పని చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండు వ్యవస్థల బాధ్యతల మధ్య స్పష్టమైన విభజన రేఖ లేకపోవడం బాహ్యప్రపంచాన్ని సందిగ్ధంలో పడేస్తుంది. ఈ ద్వంద్వ నిర్మాణమే ఇరాన్ను పశ్చిమాసియాలో ఇతర దేశాలకంటే భిన్నంగా నిలబెట్టింది.కాలక్రమేణా ఐఆర్జీసీ ఒక విస్తృత భద్రతా వ్యవస్థగా ఎదిగింది. దీనిలో భూసేన, నౌకాదళం, వైమానిక విభాగం, క్షిపణి వ్యవస్థలు, గూఢచార యంత్రాంగం, సైబర్ సామర్థ్యాలు వంటి అనేక విభాగాలు ఉన్నాయి. ‘ఖతమ్ అల్–అన్బియా’ వంటి కేంద్ర కమాండ్ వ్యవస్థలు సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇందులో సుమారు 1–2 లక్షల సంఖ్యలో సిబ్బంది ఉన్నారని అంచనా. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే చమురు, నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా దీని అనుబంధ సంస్థల ప్రభావం గణనీయంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనేక మాజీ ఐఆర్జీసీ పదాధికారులు ఉత్తరోత్తరా ప్రభుత్వ వ్యవస్థలో కీలక పదవులు చేపట్టారు. పార్లమెంట్, మంత్రివర్గం, ప్రాంతీయ పరి పాలన, వ్యూహాత్మక సంస్థలు వంటి అనేక రంగాల్లో వీరి ప్రభావం విస్తరించింది.ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థలో ‘బసీజ్’ అనే అనుబంధ బలగం కీలక పాత్ర పోషిస్తుంది. ‘బసీజ్’ అంటే సమీకరణ అని అర్థం. ఇది సంప్రదాయ సైన్యం, పోలీసు, పారామిలిటరీ బలగాల వంటి వ్యవస్థీకృత విభాగం కాదు. విద్యార్థులు, కార్మికులు, ప్రభు త్వోద్యోగులు, వ్యాపారులు వంటి అనేక సామాజిక వర్గాలవారుఇందులో సభ్యులుగా ఉంటారు. అవసరమైనప్పుడు, ఐఆర్జీసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా సేవలందిస్తారు. ఇటీవలి సంవత్స రాల్లో ఇరాన్లో జరిగిన నిరసనల సమయంలో, బసీజ్ పాత్ర అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఉద్రిక్తతలను ఆపగలిగేది ఎవరు?ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న అంతర్జాతీయ వివాదాల్లో కూడా ఐఆర్జీసీ పేరు తరచూ వినిపిస్తుంది. యురేనియం శుద్ధి స్థాయులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థను అణు కేంద్రాల తనిఖీ లకు అనుమతించడంలో నియంత్రణలు, అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనా అనే అనుమానాలు– ఈ అన్ని చర్చల్లో ఐఆర్జీసీ కీలకంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఒక వైపు కొనసాగుతుండగా; భద్రతా–భావజాల వ్యవస్థగా ఐఆర్జీసీ సమాంతరంగా ప్రభావాన్ని, ప్రాభవాన్ని కొనసాగిస్తోంది. అధికారిక నిర్ణయాలు ప్రభుత్వం పేరుతో వెలువడినా; వాటి నేపథ్యాన్ని, దిశను ప్రభావితం చేయడంలో దీని పాత్ర స్పష్టం.ప్రస్తుతం ఇంకా పూర్తిగా సమసిపోని ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా ఉద్రిక్తతలను మరో మలుపు తిప్పగల సామర్థ్యం ఇరాన్ వ్యవస్థల్లో దేనికైనా ఉందంటే, అది ఐఆర్జీసీకేనని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ చర్చలు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్కు ప్రతి నిధిత్వం వహించిన భారీ బృందంలో ఐఆర్జీసీ సభ్యుల పాత్రే కీల కంగా ఉందని వార్తలు వెలువడ్డాయి. హార్మూజ్ జలసంధి, దాని గుండా భారత్కు ప్రవహించే చమురు సరఫరాపై కూడా ప్రభావం చూపగల వ్యూహాత్మక స్థాయిలో ఐఆర్జీసీ నిలిచింది.వ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు, పశ్చిమాసియాలో పనిచేశారు. -
పొదుపు సత్యాగ్రహం పనికొచ్చేనా?
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 11 నిర్దిష్ట అభ్యర్థనలు చేశారు. మరీ అవసరమైతే తప్పించి బంగారం కొనవద్దు, విదేశీ విహారయాత్రలకు వెళ్ళ వద్దు అన్నారు. ఎరువులు, వంటనూనెల వాడకం తగ్గించమన్నారు. సౌర శక్తితో నడిచే పంపుల ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. దీన్ని ప్రభుత్వం ధరలను పెంచేందుకు చేస్తున్న ముందస్తు సన్నాహంగా చాలామంది భావిస్తున్నారు. కానీ, మోదీ ప్రసంగంలో అంతకుమించిన పెద్ద ఆశయమే ఉంది. విదేశీ మారక ద్రవ్యాన్ని (ఫారెక్స్) సంరక్షించుకోవడాన్ని సిసలైన జాతీయ ఉద్యమంగా మార్చాలన్నది ఆయన కోరిక. మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. అలాంటి స్ఫూర్తితో మొత్తం జాతిని సమీకరించాలని ప్రధాని భావన. జాతీయ జెండాను ఎగురవేయడం దేశభక్తిని ఎలా చాటుతుందో... విదేశీ మారకద్రవ్య సంరక్షణకు తోడ్పడటం కూడా అంతే దేశభక్తి పూర్వకమైన చర్యకిందకు వస్తుందని ఆయన చెబుతున్నారు. ప్రధాని అభిమతం అభినందించదగిందే. ముడి చమురు, ఎరువుల తయారీకి అవసరమైన వస్తువులు, బంగారం, వంట నూనెలకు మనం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఈ బలహీనతను గుర్తించి దశాబ్దాలు గడుస్తున్నా విరుగుడు చర్యలను తీసుకున్నది లేదు. మోదీ దాన్ని ఇప్పుడు స్పష్టంగా వివరిస్తున్నారు. దైనందిన ‘ఫారెక్స్’ చెల్లింపులకు వ్యక్తిగత బాధ్యతను జోడిస్తున్నారు.గత ఉదంతాలులాల్ బహదూర్ శాస్త్రి 1965లో ఆహారం విషయంలో ఇదే తరహాలో పిలుపునిచ్చారు. దేశం యుద్ధాన్ని, ఆహార ధాన్యాల కొర తను ఎదుర్కొంటున్న ఆ కాలంలో సోమవారం సాయంత్రాలు స్వచ్ఛందంగా ఉపవాసం ఉండవలసిందిగా శాస్త్రి విజ్ఞప్తి చేశారు. సోషలిస్టు పార్లమెంటేరియన్ మధు లిమాయే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళారు. జాతీయ సంక్షోభాల సమయంలో స్వచ్ఛందంగా నిరాడంబర జీవితాన్ని గడపడం పౌరుల రాజ్యాంగపరమైన విధిగా లిమాయే ఒక సందర్భంలో పార్లమెంట్లో పేర్కొన్నారు. గాంధీ ఉప్పు సత్యాగ్రహం నైతిక శక్తిని సమీకరించుకోవడంలో ఉప్పుపై బ్రిటిష్ వాళ్ళు వేసిన పన్ను కూడా కొంత దోహదపడింది. ఉప్పుపైన పన్నుకన్నా దారుణమైన తిరోగమన చర్య మరొకటి ఉండదు. పైగా, అది పేదలను మరింత దెబ్బతీసింది. ఈ రకమైన అన్యాయం కారణంగానే గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టవలసి వచ్చింది. కానీ, ‘ఫారెక్స్’ సంరక్షణ ఉద్యమం ఏదో అన్యాయానికి వ్యతిరేకంగా చేపడుతున్నది కాదు. అసలది స్వభావరీత్యానే తిరోగ మనమైనది. విదేశీ పైకం తక్కువ ఉన్నవారిని బాధను మాత్రం ఎక్కువ పంచుకోవాల్సిందిగా కోరుతోంది.లోపించిన సమానత్వంప్రధాని 11 అభ్యర్థనలను ఈ కోణం నుంచే చూడాలి. విదే శాలకు విహారయాత్రలకు వెళ్లడం, విదేశాల్లో ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళి పెళ్ళిచేసుకోవడం వంటివి పునరాలోచించవలసిన అవసరం ధనికులకే ఉంది. పేదవాళ్ళకు అది సంబంధం లేని విషయం. ఎలక్ట్రిక్ వాహనానికి మళ్ళాలన్నా దాన్ని కొనగలిగిన శక్తి ముందు ఉండాలి. ఇంటి నుంచి పనిచేయడం వైట్కాలర్ వృత్తి నిపుణులకు ఉన్న అవకాశం. దినసరి కార్మికులకు కాదు. వంట నూనె విలాసవంతమైన సరుకు కాదు. దాని వినియోగాన్ని తగ్గించుకోమనడం సాధా రణ ప్రజానీకానికి రుచించని విషయం. ప్రధాని అభ్యర్థనలలో కొన్ని సంపన్నులను దృష్టిలో పెట్టుకుని సరిగ్గా చేసినవే. మిగిలినవి మాత్రం దామాషాకు మించి త్యాగాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతిరోజూ దాదాపు 1,600 నుండి 1,700 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయి. గత పది వారాల్లో ఈ నష్టం ఒక లక్ష కోట్లు దాటింది. పెట్రోల్ మీద లీటరుకు రూ. 14, డీజిల్ మీద రూ. 18 చొప్పున నష్టం వస్తోంది. సామాన్యులపై భారం పడకుండా ఎక్సైజ్ సుంకంలో పెడుతున్న కోతల వల్ల కోశాగారానికి నెలకు రూ. 14,000 కోట్లకు పైగా ఖర్చవు తోంది. ఎరువులపై సబ్సిడీలు రూ. 1.71 లక్షల కోట్లుగా బడ్జెట్ వేసుకున్నారు. ఇప్పుడవి రూ. 35,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లను మించిపోయేవిగా ఉన్నాయి. బంగారం దిగుమతులు తగ్గించుకోవడం, విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవడం వంటివి కరెంట్ అకౌంట్కు నిజంగానే సహాయపడతాయి. కానీ, ఇంధన ధరల పెంపు పూర్తిగా భిన్నమైంది. అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ప్రభుత్వ ఆదాయ సమీకరణకు కూడా ఒత్తిడి పెరుగుతోంది. పన్నులు కట్టాలని ఆదాయ పన్ను శాఖ చేసిన డిమాండ్ కొన్ని అప్పీళ్లలో చెల్లుబాటు అయింది. దాని ప్రకారం రూ. 2.57 లక్షల కోట్ల వసూలుపై దృష్టి పెట్టవలసిందిగా 2026–27 ఆదాయ పన్ను శాఖ కేంద్ర కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తోంది. దీని ప్రకారం ‘పాన్’ కార్డులను ఆధారం చేసుకుని టాప్ 10 వేలమంది ఎగవేతదార్ల లావాదేవీలను పరిశీలిస్తారు. వర్గీకరించని బకాయిలు కూడా పెద్ద మొత్తంలో రూ. 7.88 లక్షల కోట్లుగా ఉన్నాయి. వాటిని జూలై నాటికి వర్గీకరించాలని నిర్ణయించారు. ముంబయ్ (రూ. 1.65 లక్షల కోట్లు), ఢిల్లీ (రూ. 1.21 లక్షల కోట్లు) వంటి మహా నగరాల నుంచే చాలా పన్నులు వసూలు కావలసి ఉన్నాయి. ఇలా బడా కంపెనీలు, పెద్ద మనుషుల నుంచి వసూలు కావలసిన పన్నులే రూ. 9 లక్షల కోట్ల మేరకు ఉండగా, వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవా లని ప్రభుత్వం ఎలా అడుగుతోంది? సమానత్వం లోపించిన నిరా డంబరత దేశభక్తి కిందకు రాదు.ఆదాయ మార్గాలుఅత్యధిక ఆదాయాలు ఉన్నవారిపై తాత్కాలికంగా సంక్షోభ సర్చార్జినీ, ప్రస్తుత కల్లోల పరిస్థితుల నుంచి లాభం పొందుతున్న కమోడిటీ ట్రేడర్లు, దేశీయ చమురు శుద్ధి కంపెనీలు వంటి సంస్థలపై విండ్ఫాల్ లెవీనీ విధించవచ్చు. సంపద పన్ను విధానాన్ని రూపొందిస్తే బహుళ ప్రయోజనాలు నెరవేరుతాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)లో సభ్యత్వం ఉన్న దేశాలు ఒడంబడిక నియమంగా 90 రోజులకు సరిపడ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వులు ఉంచు కుంటాయి. మన దేశ నిల్వలు ప్రస్తుతం సుమారు 9 నుంచి 10 రోజుల డిమాండ్ను తీర్చగలిగినవిగా మాత్రమే ఉన్నాయి. మొత్తం చమురు నిల్వలు (వాణిజ్యపరమైనవి, రిఫైనరీల వద్ద ఉన్నవి కూడా కలిపితే) దాదాపు 74–75 రోజులకు సరిపోవచ్చు. సమానత్వం విషయంలో నైతికంగా అభిశంసనకు తావులేనివి కాబట్టే, గాంధీజీ ఉద్యమాలు సఫలమయ్యాయి. ఇది భారతదేశపు ‘ఫారెక్స్’ సత్యాగ్రహమైతే, ఆశయానికి తగ్గట్లుగానే దాని రూప కల్పన కూడా ఉండాలి. భారాన్ని పంచుకోవడంలో అది ప్రగతిశీల మైనదిగా ఉండాలి. అమలులో నిష్కర్షత్వం చూపాలి. సంస్థాగత మైన విరుగుడు, ధరల పెంపుదలలో నిజాయతీ లేకుండా స్వచ్ఛందంగా ఎవరెంత సంయమనం పాటించినా ఫలితం ఉండదు. అజీత్ రానాడేవ్యాసకర్త ఆర్థికవేత్త (‘ద బిలియన్ ప్రెస్’ సౌజన్యంతో) -
నవ భారత యుద్ధ తంత్రం
భారతదేశ భద్రత, విదేశాంగ విధానా లలో ‘ఆపరేషన్ సిందూర్’ కీలక మలుపును సూచిస్తుంది. 1965, 1971 యుద్ధాలలో ఓడిపోయి, ప్రత్యక్షయుద్ధంలో భారత్ను ఎదుర్కోవటం అసాధ్యమని గ్రహించిన పాకిస్తాన్, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే ఉగ్రవాదాన్ని తన విధానంగా మలుచుకున్నది. జియా ఉల్హక్ ‘బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్’ (వెయ్యి గాట్లతో భారత్ను గాయపరచటం) అనే సిద్ధాంతాన్ని అమలు పరిచాడు. అణ్వస్త్రాలను సమకూర్చుకున్నాక పాకిస్తాన్ ‘కత్తి–డాలు’ వ్యూహంలో భాగంగా ఒకవైపు ఉగ్రవాద మూకలను పెంచి పోషించి భారత్లో ఉగ్రవాద చర్యల ద్వారా అస్థిరతను కలుగజేస్తూ అణ్వస్త్ర ఛత్రం కింద రక్షణ తీసుకొన్నది. పాక్పై సైనిక చర్య/యుద్ధం ప్రారంభించాలంటే పాక్ అణ్వాయుధ దాడికి ఒడిగడుతుందా అన్న సందేహం, భారత్ను క్రమంగా ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు విరుగుడు చర్యలు తీసు కునేలా చేసింది. భారత్ బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరా లను లక్ష్యంగా చేసుకొని ఎల్ఓసీ దాటి ఉరి, బాలాకోట్లలో ఆప రేషన్లను సమర్థవంతంగా పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో పహల్ గామ్ దాడితో పాక్ నేరుగా భారత్కు సవాలు విసిరింది. పర్యవసా నంగా 2025 మే 7 తెల్లవారుఝామున 1 గంటకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీకారం చుట్టింది. ఈ 88 గంటల దాడి ద్వారా పాకి స్తాన్కే కాకుండా యావత్ ప్రపంచానికీ ‘భారత్ ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించదనే’ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చి నట్లయింది. డీఆర్డీఓ, ఇస్రోలతో సమన్వయం!ఆపరేషన్ సిందూర్ మొదటి రోజున భారత వాయుసేన, సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు; పాకిస్తాన్లో నాలుగు; మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడి చేసింది. మురిడికేలోని లష్కర్ ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యా లయాలను నేలమట్టం చేసింది. భారత్ దాడులకు ప్రతిగా కశ్మీర్ నుండి కచ్ వరకు పాక్ భారీ స్థాయిలో దాడులు చేసింది. మే 9న ఢిల్లీ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఫత్తా క్షిపణితో దాడి చేయటం ద్వారా దుస్సాహసానికి ఒడిగట్టింది. దాంతో పాక్ న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని భారత్ వ్యూహకర్తలు నిశ్చయించారు. మే 10న పాక్లోని 12 సైనిక స్థావరాలలో 20కి పైగా లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేయటంతో పాక్ దిక్కు తోచని పరిస్థితుల్లో సంధిని కోరటంతో ఆపరేషన్ సిందూర్ ముగిసింది. రావల్పిండిలో పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం, సిం«ద్ ప్రావిన్స్లోని భోలారి వైమానిక స్థావరం, ఎఫ్–16 యుద్ధ విమానాలుండే జాకోబాబాద్ వైమానిక స్థావరం, రహీమ్ యార్ ఖాన్ సైనిక స్థావరాలతో సహా పాక్లోని అన్ని ప్రధాన సైనిక స్థావరాలపై భారత్ కచ్చితత్వంతో దాడి చేసింది. రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ల నుండి దిగుమతి చేసుకున్న సైనిక సామగ్రి, సైనిక పరిజ్ఞానాన్ని దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించటంలో డీఆర్డీఓ, ఇస్రో, భారత త్రివిధ దళాలు విజయవంతమయ్యాయి. భారత సైన్యం, వాయు సేన, నౌకా బలాలు పూర్తి స్థాయిలో సమీకృతం అయి ఆపరేషన్ సిందూర్ను సమర్థవంతంగా నడిపించాయి.ఆపరేషన్ సిందూర్లో తెరవెనుక కథ నడిపిన ఇస్రో పాత్రను ప్రత్యేకంగా పేర్కొనాలి. ఈ 88 గంటల దాడిలో మన సైనిక, గూఢచార ఉపగ్రహాలు కీలకమైన పాత్ర వహించాయి. కార్టోశాట్ ఛాయా చిత్రాల ద్వారా దాడుల కచ్చితత్వం నిర్ధారణ అయింది. వీటికి తోడు పాక్లో ప్రజలు సామాజిక మాధ్యమాలలో ఉంచిన వీడియోలు దాడులకు మానవ నేత్రాన్నందించాయి. రిశాట్ ఉప గ్రహాలు శత్రువుల కదలికలపై రాత్రీ పగలు సమాచారాన్ని అందించాయి. జీశాట్ 7, 7ఏ ఉపగ్రహాలు... సైన్యం, వాయుసేన, నౌకా సేనల మధ్య సమాచారం, సమన్వయానికి సహకరించాయి. నావిక ఉపగ్రహ వ్యవస్థ, క్షిపణులను నేరుగా లక్ష్యాల వైపు మరల్చింది. సిందూర్ 2.0కు సిద్ధమా?పాక్, ఉగ్రవాద పంథాని వీడుతుందనుకోవటం భ్రమ. పాక్కు చైనా ఇంతవరకు క్షిపణులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమా నాలను సరఫరా చేసింది. ఆపరేషన్ సిందూర్లో చైనా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా అందించింది. కానీ పూర్తి స్థాయిలో చైనా–పాక్ రక్షణ సైనిక వ్యవస్థలు ఒక్కటిగా పనిచేయలేదు. భవిష్యత్తులో చైనా–పాక్లను సమష్టిగా ఒకేసారి ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. పాక్ పెద్ద మొత్తంలో టర్కీ నుండి డ్రోన్ల కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నది. టర్కీ కొద్ది రోజుల క్రితం ఆధునిక ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని ఆవిష్కరించింది. పాక్–టర్కీల మధ్య సైనిక వ్యవహారాలపై నిఘా ఉంచాలి. ఇరాన్ యుద్ధంలో గల్ఫ్ దేశాలు, యూఎస్ఏ, ఇజ్రాయెల్లు డ్రోన్లు, క్షిపణుల కొరతను ఎదుర్కొంటు న్నాయి. ఇరాన్ ముందుచూపుతో పెద్ద మొత్తంలో డ్రోన్లు, క్షిప ణులను భూగర్భ బంకర్లలో నిలువ చేసుకొని అమెరికాను సవాలు చేయగలుగుతున్నది. చైనా–పాక్లతో యుద్ధం 88 గంటలు కాదు 88 రోజులుండవచ్చు. దీనికి సరిపడా డ్రోన్లు, క్షిపణుల తయారీ వ్యవస్థలను భారత్ ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో భాగంగా నిజానిజాలు తెలియజేయటానికి సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇల్లు కాలుతుంటే మంటలు ఆర్పటం కోసం బావి తవ్వటం లాగా సమాచారాన్ని అందించ టానికి అప్పటికప్పుడు ఎవరినో నియమించకూడదు. మన నిజం, శత్రువు అబద్ధాని కంటే ముందు ప్రపంచానికి తెలియాలి. వ్యూహంలో భాగమే ‘రింగ్’ అలర్ట్దీర్ఘకాల యుద్ధంలో జాతి మానసిక స్థితి కీలక పాత్రను పోషి స్తుంది. 1971 తరువాత ఇంతవరకు భారతదేశం గట్టి యుద్ధం చేయలేదు. 140 కోట్ల మంది భారతీయులలో సుమారు 88 శాతం మంది 1971 యుద్ధం తర్వాత జన్మించినవారే. వీరికి యుద్ధ పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, యుద్ధం సందర్భంగా ప్రవర్తించాల్సిన తీరుపై అవగాహన గానీ, అంచనా గానీ లేవు. అందుకే గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యుద్ధ సమయంలో పౌర రక్షణకు సామాన్య పౌరులు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలి. క్షిపణి, డ్రోన్, వైమానిక దాడుల సైరన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇటీవల భారత ప్రభుత్వం పరీక్షించిన ‘సెల్ఫోన్ రింగ్ అలర్ట్’ ఈ వ్యూహంలో భాగమే. స్థానికంగా రక్షిత ప్రదేశాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. శత్రువుల కదలి కల సమాచారాన్ని ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి అందజేయ గలగాలి. ఉక్రెయిన్లో పౌరులకు డ్రోన్లను ఆపరేట్ చేయటంలో శిక్షణ ఇస్తున్నారు. యుద్ధంలో సంభవించే నష్టానికి, కష్టాలకు ఓర్చు కొనే స్థైర్యాన్ని కూడా ప్రజలలో పెంపొందించాలి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
'రవాణాపై' పునరాలోచన అవసరం
పెరిగిపోతున్న వాహనాల రద్దీ, రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య, వాయు కాలుష్యం, తడిసి మోపెడవుతున్న చమురు దిగుమతి బిల్లు లాంటి సవాళ్ళతో సతమతమవుతూ మనం 2006 ఏప్రిల్లో ‘జాతీయ పట్టణ రవాణా విధా’నాన్ని (ఎన్యూటీపీ) రూపొందించుకున్నాం. వ్యక్తిగత మోటారు వాహనాల వాడకాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థల వైపు మొగ్గు చూపేటట్లు చేయడం, మోటారేతర ప్రయాణ పద్ధతులను అనుసరించేటట్లు చేయడం ప్రధాన లక్ష్యంగా ఆ విధానాన్ని తయారు చేశారు. దాని కనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థలపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు. నడిచేవారికి, సైకిళ్ళపై వెళ్ళేవారికి సురక్షిత బాటలను కల్పించాలని నిర్ణయించారు. రోడ్లను విశాలం చేసేందుకు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కూడా పెట్టుబడులు తరలించారు. నిపుణులు, విద్యా వేత్తలు, పరిశ్రమకు చెందినవారు, ప్రభుత్వ అధికారులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వా తనే, ఆ విధానాన్ని రూపొందించారు. కేంద్ర మంత్రివర్గం 2006 ఏప్రిల్ 6న దానికి ఆమోద ముద్ర వేసింది. ఇరవై ఏళ్ల తర్వాత జరిగిందేమిటి?కాలక్రమంలో 20 ఏళ్ళు గడిచిపోయినా, ఆ లక్ష్యాలను అందు కోలేకపోయాం. చెప్పాలంటే, పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. ప్రజా రవాణా వ్యవస్థలకు, మోటారేతర ప్రయాణ పద్ధ తులకు ఆదరణ పెరగకపోగా తగ్గింది. ఎవరి మోటారు వాహనా లను వారు ఉపయోగించడం ఎక్కువైంది. దేశంలో రిజిస్టరవుతున్న వాహనాల సంఖ్య పెరుగుతూండటమే అందుకు తిరుగులేని నిద ర్శనం. దేశంలో రిజిస్టరైన వాహనాల సంఖ్య 2005లో కేవలం 8.2 కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది 43.1 కోట్లకు పెరిగింది. మోటారు వాహనాల వాడకంలో వేగం విపరీతంగా పెరిగి, అనేక నగరాలలో గాలి స్వచ్ఛత క్షీణించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు స్వచ్ఛత పరిశీలనకు ఉన్నత స్థాయి కమిషన్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య 2005లో 95,000 మేరకు ఉన్నది, 2022 నాటికి దాదాపు 1,65,000 లకు పెరిగింది. చమురు దిగుమతి భారం 2005లో రూ. 1.35 లక్షల కోట్లుగా ఉన్నది, 2025 నాటికి ఏకంగా రూ. 12.35 లక్షల కోట్ల మేరకు పెరిగింది. మనం ఎక్కడ పొరపడినట్లు? ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభుత్వం గణనీయంగా పెట్టుబడులు పెట్టడం ఈ విధానం తెచ్చిన సానుకూల ఫలితాల్లో ఒకటి. అయితే, హెచ్చు వ్యయదాయకమైన మెట్రో రైలు వ్యవస్థలపై పెట్టు బడులు పెట్టేసి చేతులు దులుపుకోవడంతో చిక్కు వచ్చినట్లు కనిపి స్తోంది. ప్రయాణికులు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్ళేందుకు ఆయా స్టేషన్ల నుంచి అనుబంధ సదుపాయాలు కల్పించడంపై పెట్టుబడులు లేవు. ఉదాహరణకు, 23 నగరాల్లో 1,016 కిలోమీటర్ల నిడివిన మెట్రో రైలు సదుపాయాలు కల్పించేందుకు దాదాపు రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. అవన్నీ కలిపి రోజుకు సుమారు 75 లక్షల మంది ప్రయాణికులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. పెట్టుబడులు బారెడు. ప్రయాణికులు చారెడు. నగరాలలో మెట్రో రైళ్ళను వాటికవి ఒంటరి రవాణా వ్యవస్థలుగా పరిగణించి, ఇతర రవాణా సదుపాయాలతో అనుసంధానపరచకపోవడంతో, ప్రయాణికుల సంఖ్య ఆశించినంతగా లేదు. ఫలితంగా, ప్రయాణికులు మళ్ళీ రవాణా సదుపాయాలను వెతుక్కోవాల్సి వస్తోంది.కొత్త చూపు అవసరంమోటారేతర రవాణా మౌలిక సదుపాయాల కల్పన కూడా చెదురుమదురుగా, అరకొరగా ఉంది. ప్రైవేటు రంగాన్ని తోడు చేసుకుని, బస్సు సదుపాయాలను మెరుగుపరచే ప్రయత్నాలు అంతగా కనిపించడం లేదు. చాలా నగరాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల రవాణా సంస్థల బస్సులపైనే ఆధారపడుతున్నాయి. ఆ ‘బీద’ బస్సుల్లో ఎక్కడం కంటే, ప్రైవేటు వాహనాన్ని నడుపుకోగలిగిన స్తోమత ఉన్నవారు వాటిని సమకూర్చుకుంటున్నారు. వారు వాటిని పక్కనపెట్టేటట్లు చేసేంతగా ప్రీమియం సేవలు అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వ రవాణా సంస్థలు కాస్త ధర పెంచి అయినా, మెరుగైన సేవలను అందించేందుకు ముందుకు రావడం లేదు. ఒకటి రెండు చోట్ల ఆ దిశగా కదలిక కనిపించినా, పెద్దయెత్తున సరైన బస్సులు దర్శనమివ్వడం లేదు. విధానంలో రెండు రకాల లొసుగులు కనిపిస్తున్నాయి. విధానాన్ని రూపొందించిన నాటికన్నా తర్వాత సమస్య బాగా ముదిరింది. అప్పట్లో, నిర్దిష్ట సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల, కొన్ని మార్గదర్శక సూత్రాలు లోపించాయి. ఉదాహరణకు, పట్టణాల్లో వస్తు రవాణా వ్యవస్థలపై అప్పట్లో విధానం తగినంతగా దృష్టి సారించలేదు. ఇప్పుడు ఆన్లైన్ షాపింగులతో గడప వద్దకు వస్తువులు వచ్చే సౌకర్యం పెరిగింది. పార్కింగ్ సమస్య పట్ల కూడా ప్రభుత్వ విధానం తగినంతగా దృష్టి పెట్టలేదు. ఇంటి నుంచి లేదా ఆఫీసు నుంచి బస్టాండు లేదా రైల్వేస్టేషన్ వరకు వెళ్ళేందుకు అవసరమైన సదుపాయాలను అప్పట్లో అంత ముఖ్యమైనవిగా భావించకపోవడం వల్ల, విధాన రూపకల్పన సమయంలో, వాటి గురించి చర్చించవలసినంతగా చర్చించలేదు. అప్పట్లో మార్కెట్లో ఉబెర్, ఓలా లాంటివి లేవు. ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్లడంలో రవాణా మాధ్యమాలను మార్చుకోవడం కూడా 2000 మొదట్లో, ఇప్పుడైనంతగా, ప్రాచుర్యం పొందలేదు. ఈ మధ్యస్థ రవాణా సదుపాయాల అభివృద్ధిపై 2017లో వేరే విధానాన్ని రూపొందించారు. కొంత దూరం నడక సాగించి, తర్వాత, అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థలను వాడుకునేటట్లు చేసే సమూ హాలను సృష్టించడం ఆ విధాన వ్యూహాలలో భాగమైంది. సరఫరా వైపు తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రాథమికంగా దృష్టి పెట్టడం ప్రభుత్వ విధానంలోని మరో పెద్ద లొసుగు. రద్దీకి కారణ మవుతున్నందుకు కొంత రుసుము వసూలు చేయడం లేదా వ్యక్తిగత వాహనాల వాడకాన్ని నిరుత్సాహపరచేందుకు ఇతర పద్ధతులను అనుసరించడం వంటివి చేయలేదు. దీనికీ ఒక సబబైన కారణమే ఉంది. భారతదేశపు మోటారు వాహనాల పరిశ్రమ పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తోంది. వాహనాలపై ఆంక్షలు విధిస్తే, అనేక మంది పొట్టకొట్టినట్లవుతుంది. అయినా, దీనిపై పునరాలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది. జాతీయ రవాణా విధాన 20వ వార్షి కోత్సవ సమయంలో, కొత్త వాస్తవికతలను దృష్టిలో పెట్టుకుని, తాజాగా విధానాన్ని తయారు చేసుకోవడం అవసరం. సుస్థిరమైన, కాలుష్య రహిత టెక్నాలజీల వైపు మళ్ళవలసిన అవసరాన్ని చాటుతూ కొత్త సిఫార్సులను పొందుపరచుకోవాలి. – ప్రొ‘‘ ఓ.పి. అగర్వాల్ ‘ ‘ఐఎస్పీపీ సెంటర్ ఫర్ అర్బన్ ట్రాన్సిషన్స్’ డైరెక్టర్; లూయి మిరాండా ‘ ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’(ఐఎస్పీపీ) కో–ఫౌండర్, చైర్ పర్సన్; శ్రేయేశ్ జంగం ‘ ‘ఐఎస్పీపీ’ రిసెర్చ్ అసోసియేట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
విజయ్ చూపగల తేడా ఏమిటి?
సుమారు ఆరు దశాబ్దాల పాటు అవిచ్ఛి న్నంగా సాగిన ద్రవిడ పార్టీల రాజకీయ పరంపరను భంగపరచటం వరకు విజయ్ ప్రతిభ, ప్రభావం కనిపిస్తున్నవే. భవిష్యత్తు వైపు చూసినపుడు ఒక ప్రశ్న ముందుకు వస్తున్నది. తమిళనాడులో సమ సమాజ భావనలు, సంక్షేమ రాజ్య భావనలు దేశ స్వాతంత్య్రానికన్నా ముప్పయి సంవత్సరాల ముందు నుంచే వ్యవస్థీకృత రూపంలో ఏర్పడ్డాయి. అవి కొనసాగుతూనే బలమైన తమిళ జాతీయవాదం కూడా ఇంచుమించు అప్పటినుంచే రూపు తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారం స్వీకరించిన విజయ్– సమ సమాజం, సంక్షేమం, తమిళ జాతీయవాదం అనే మూడు అంశాలలో చూపగల తేడా ఏమైనా ఉండవచ్చునా?సారాంశంలో ద్రవిడవాదమే!ఇందుకు సమాధానం విజయ్ నాయకత్వాన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పాలనలో మాత్రమే లభించగలదని వేరే చెప్పనక్కర లేదు. తమిళ సమాజంలో ఈ భావనలు విడదీయలేని అంశాలు. క్రీస్తు పూర్వం నుంచి గల తమ భాషా సాహిత్యాలు, మధ్య యుగాల నాటి వైభవోపేత రాజ్యాలు, వాటి పాలనలు అందుకు తోడై తమిళ జాతి, సంస్కృతులను తీర్చిదిద్దాయి. స్వాతంత్య్రానంతరం రాజకీయ క్రమంలో ద్రవిడ పదం వాడుకలోకి వచ్చి, ఉత్తరాది అనే ఒక ‘ప్రత్యర్థి’ని సృష్టించి ధిక్కారంగా నిలిచింది. ఇపుడు విజయ్ పార్టీ పేరును, చెదురుమదురు వ్యాఖ్యలను, పార్టీ మేనిఫెస్టోను, 10వ తేదీన ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించిన దానిని బట్టి, గతంకన్న తేడాలు ఏమైనా ఉన్నాయనిపిస్తున్నదా? డీఎంకే, అన్నాడీఎంకే అనే రెండు ‘ద్రవిడ’ పార్టీలు ఓడినందున, ద్రవిడ వాదం ఇక ముగిసిపోయిందని, విజయ్ ఆ వాదనకు ముగింపు పలికారనే వ్యాఖ్యలు వెంటనే మొదలయ్యాయి. అవి తొందరపాటు మాటలనాలి. విజయ్ పార్టీ పేరులో ద్రవిడ అనే పదం లేకున్నా తమిళ అనే పదం ఉంది. అక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రపంచంలో ద్రవిడ–తమిళ పర్యాయ భావనలు. ఒకటి లేక రెండవ దాని మనుగడ లేదు.ద్రవిడ వాదానికి ప్రాణప్రదమైన అంశాలు వేటినీ విజయ్ వదలలేదు. తన ఆరాధ్యులలో పెరియార్ రామస్వామిని చేర్చారు. ద్రవిడ భావజాలంలో సమసమాజం, సంక్షేమం మొదటి నుంచి ఉన్నవి గనుక, అందుకు స్వాతంత్య్రానంతర కాలంలో ప్రధాన ప్రతి నిధి అయిన అంబేడ్కర్ను స్వీకరించారు. తమ చరిత్రలో సమాజం కోసం పాటుపడిన ఇద్దరు మహిళలు వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్లను ప్రముఖంగా నిలిపారు. దీనంతటి అర్థమేమిటో వేరే చెప్పనక్కర లేదు. పైగా, సంక్షేమ సంబంధమైన పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చిన ఆయన, ఆ విషయాలలో ‘ఎంత మాత్రం రాజీ పడబో’మని ప్రమాణ స్వీకార సందర్భంగా ప్రకటించారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆకలిదప్పుల బాధ తెలుసునని ముక్తాయించారు. సారాంశంలో ఇదంతా ద్రవిడవాదమే.సుపరిపాలన అందేనా?ఇది చాలదనుకుంటే, పెరియార్ రాజకీయ వైఖరిని, ద్రవిడ వాద రాజకీయ సంప్రదాయాన్ని విజయ్ స్పష్టంగానే కొనసాగిస్తు న్నారనుకోవాలి. నిజానికి డీఎంకే లోగడ (1999–2003) కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ భాగస్వామి కాగా, అన్నాడీఎంకే గురించి చెప్ప నక్కర లేదు. విజయ్ రాగల కాలంలో ఏమి చేసేదీ చెప్పలేముగానీ, ప్రచార సమయంలో మాత్రం బీజేపీ తన ‘సైద్ధాంతిక ప్రత్యర్థి’ అని ప్రకటించారు. సెక్యులరిజ విధానాన్ని నొక్కి చెప్పారు. ఇదంతా ఆధునిక పరిస్థితులకు వర్తించే పెరియారిజమే అవుతుంది. తన ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతుపై ఆధారపడి ఉన్నందుకు మాత్రమే విజయ్ ఇట్లా మాట్లాడుతున్నారనలేము. ఆయన మౌలిక విధానమే అదయినట్లు ఎన్నికల ప్రచారంలోనేగాక, రెండేళ్ల ముందు పార్టీని స్థాపించినప్పటినుంచే అర్థమైంది.పరిపాలనకు సంబంధించి విజయ్ చేసిన సూత్రీకరణలురెండున్నాయి. ఒకటి సమర్థమైన సుపరిపాలన, రెండు అన్ని వర్గాలకు మేలు కలిగే సంక్షేమం. ఈ రెండూ ద్రవిడ పార్టీల విధానాలలో ఉన్నవే. ఆచరణకు వచ్చే సరికి సుపరిపాలన క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. అవినీతి పెచ్చు పెరిగింది. డీఎంకే అయినా, అన్నాడీఎంకే అయినా. అన్ని వర్గాల మేలన్నది దళితులకు అంతగా వర్తించలేదన్న విమర్శ చాలా కాలం నుంచే ఉంది. విడుదలై చిరుతగళ్ కచ్చి (వీసీకే) కొంత కాలంగా డీఎంకే కూటమిలో ఉన్నా, ఇపుడు విజ య్కు మద్దతు ప్రకటించినా ఆ పార్టీ మూలాలు ఈ విమర్శలోనే ఉన్నాయి. అటువంటి వివక్ష తమ పాలనలో ఉండబోదన్నది కొత్త ముఖ్యమంత్రి ఇస్తున్న హామీ. ఈ వివక్షల మూలాలు తమిళ గ్రామీణ వ్యవసాయిక వ్యవస్థలో, కుల వ్యవస్థలో ఉన్నందున, ఈ సమస్యను గ్రామీణ నిర్మాణాలలో గానీ, పట్టణాలు కేంద్రంగా నడిచే ఆధునిక ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ వ్యవస్థలలో గానీ విజయ్ ఏ విధంగా సరిదిద్దవచ్చునన్నది ఆయన శ్రద్ధపై, చతురతపై ఆధార పడుతుంది.అసలు సవాళ్లు హామీలే!సుపరిపాలనకు గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ను (1954–63) విజయ్ చూపటంలో ధైర్యం ఉంది. ప్రశంసించదగ్గదే గానీ, ద్రవిడ ఉద్యమం అట్లుండగా సంక్షేమ విధానాలకు పేరుబడిన అణ్ణాదురైను ముందుకు తేకపోవటం ఆశ్చర్యకరం. పార్టీ ఏదైనా కామరాజ్ వలెనే అణ్ణాదురై తమిళనాడు చరిత్రలో మార్గదర్శ కుడయ్యారు. అక్కడ ఫెడరలిజాన్ని స్థిరపరచి దీర్ఘకాలికం చేసింది కూడా ఆయనే. ప్రగతిశీలం కాదనుకున్న అంశాలపై తన గురువు పెరియార్తో విభేదించి సాగారు. తర్వాత డీఎంకే చీలి అన్నాడీఎంకే ఏర్పడినా రెండు పార్టీలకూ ఆరాధ్యుడయ్యారన్నది విజయ్కు తెలియదనుకోలేము.మౌలిక సూత్రాలపై, సిద్ధాంతాలపై ఎంతమాత్రం రాజీపడబోనని, రాజకీయాల మౌలిక బలమే అదని ఆలోచింపజేసే విధంగా ప్రకటించిన తమిళ జెన్–జీ తార విజయ్కు పెద్ద పరీక్ష మాత్రం మేనిఫెస్టోలోని ఆర్థిక సంబంధమైన హామీల అమలులో ఎదురు కానున్నది. ఆ హామీలలో ఎన్నికలలో గెలిచేందుకు అవసరమైన పోటాపోటీ పాప్యులిజం తక్కువ లేదు. వాటి అమలుకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని గ్రహించినందువల్ల మొదటి రోజునే గత ప్రభుత్వం మిగిల్చిన రుణభారమంటూ మాట్లాడి, హామీలు క్రమక్రమంగా తప్పక అమలు చేయగలమనీ, తనను నమ్మాలనీ ప్రజలను కోరారు. అదే విషయమై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక హెచ్చరిక బాణాన్ని కూడా వెంటనే వదిలారు మరి.ఈ నిర్వచనాలు, సాధకబాధకాలు ఎట్లున్నా, ద్రవిడ వాదాన్ని లేదా తమిళవాదాన్ని వర్తమాన కాలానికి అవసరమనుకున్న రీతిలో మెరుగులు దిద్ది గత పరిపాలనలకు తన పాలనకు గల తేడా ఏమిటో విజయ్ నిరూపించగలరని ఆశించాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సంతోషపు లెక్కల్లో పాశ్చాత్యుల పొరపాటు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లేదా చైనాలను ‘నరక కూపాలు’ అని పిలిచినప్పుడు అందరికీ కోపం రావడం సహజం. కానీ ఒక శాస్త్రవేత్తగా నాకు అది కేవలం అమర్యాదగా మాత్రమే అనిపించలేదు, ఇదొక కొలమాన లోపం అనిపించింది. వాషింగ్టన్ ఇప్పటికీ 1950ల నాటి పాత ఆలోచనలతోనే ప్రపంచాన్ని చూస్తోంది. తాను ఎంత విద్యుత్తును వాడుతున్నాను అనే దానినే గొప్పగా భావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసలైన తృప్తిని అర్థం చేసుకోవడంలో పొరబడుతోంది. నేను 1982లో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి పీహెచ్డీ పూర్తి చేసి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి వెళ్ళాను. కొన్ని దశాబ్దాలుగా నేను జీవితంలోని రెండు వేర్వేరు ‘ఆపరేటింగ్ సిస్టమ్స్‘ను గమనిస్తున్నాను. వాషింగ్టన్ చూసే కోణం కేవలం ఆర్థిక గణాంకాల చుట్టూనే తిరుగుతుంది తప్ప, మనిషి అనుభవాన్ని నిర్దేశించే అసలైన విషయాలను పట్టించుకోదు. ప్రపంచాన్ని ‘ఆనందపు సామర్థ్యం’ అనే కోణం నుండి చూస్తే, ఆనందం అనేది డబ్బు (జీడీపీ) వల్ల మాత్రమే రాదని అర్థమవుతుంది. అది ఒక సామాజిక నిర్మాణం. ఈ కోణంలో చూసి నప్పుడు, బయటకు ‘నరక కూపం’లా కనిపించే దేశాలే మనిషి సంతోషంగా ఉండటానికి అనువైన ప్రదేశాలుగా కనిపిస్తాయి.ప్రమాణాల్లో తేడా నెల్లూరు జిల్లాలోని అల్లూరు మా స్వగ్రామం. 1980లో బెంగళూరులో నా పీహెచ్డీ స్టైపెండ్ నెలకు ‘50 డాలర్లు’(400 రూపాయలు). అమెరికా లెక్కల ప్రకారం ఇది పేదరికం. కానీ అప్పట్లో వాస్తవం వేరేలా ఉండేది. నా గది అద్దె 4 డాలర్లు, మరో 16 డాలర్లతో రోజుకు నాలుగు పూటలా మంచి భోజనం దొరికేది. వైద్యం అందరికీ అందుబాటులో ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా, నా సొంత పనుల కోసం నేను ఎప్పుడూ శారీరక శ్రమ చేయలేదు. మధ్యతరగతి జీవితాల్లో పనివారు అనే వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన, ఒక ముఖ్యమైన భాగం. నేను అమెరికా వెళ్ళాక ఒక వింత పరిస్థితి చూశాను. చికెన్, గుడ్లు, కూల్ డ్రింక్స్ వంటివి చాలా చౌకగా దొరికేవి. కానీ నా ‘జీవన ప్రమాణం‘లో ఒక లోటు వచ్చింది. నా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవడం వల్ల నేను ఒక కూలీలా మారిపోయాను. వంట, ఇల్లు ఊడ్వడం, బట్టలు ఉతకడం వంటి పనులకు మనుషులు దొరకరు, దొరికినా చాలా ఖరీదు. భారత్లో మధ్యతరగతి మనిషి మేధస్సు ఇటువంటి పనుల నుండి విముక్తి పొంది ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో సంపద ఉండవచ్చు కానీ, అక్కడ ‘సమయం, సామాజిక లోటు’ ఎక్కువ.2026 నాటికి, ఒక సగటు అమెరికన్ ఒక భారతీయుడి కంటే 12 రెట్లు ఎక్కువ కరెంటు వాడుతున్నాడు. ఇంత కరెంటు వాడినంత మాత్రాన 12 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుందా? నేను 1986లో కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. నా అపార్ట్మెంట్ మేనేజర్, ఒక మైలు దూరంలో మంచి షాపు ఉన్నా కూడా, ఐదు మైళ్ల దూరంలో ఉన్న ‘మరింత శుభ్రమైన‘ షాపుకు నన్ను కారులో తీసుకెళ్లాడు. అమెరికాలో పెట్రోల్, కరెంటు చౌకగా దొరుకుతాయి కాబట్టి, ఆనందాన్ని ఇవ్వని చిన్న చిన్న సౌకర్యాల కోసం వాటిని వృథా చేస్తారు. కానీ ఇండియాలో మనం సామీ ప్యతకు, సమాజానికి విలువ ఇస్తాం. మనకు సంతోషం మన దగ్గర్లోనే దొరుకుతుంది. తక్కువ వనరులను వాడుతూ ఎక్కువ ఆనందాన్ని పొందడంలో భారతీయులు ముందున్నారు.వలసల వెనుక అసలు నిజంవలసల మీద విమర్శలు చేసేవారు ఒక విషయం మర్చి పోతున్నారు: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి దిగ్గజాలను నడిపిస్తున్నది ఈ దేశాల మేధావులే. అమెరికా తన బయోమెడికల్ రంగం కోసం, టెక్నాలజీ కోసం ఈ దేశాల శాస్త్రవేత్తలపై ఆధార పడుతోంది. ఇవేమీ ‘లూప్హోల్’ వలసలు కాదు. ఇది వ్యూహాత్మక వనరుల సముపార్జన. వై2కే సంక్షోభ సమయంలో, డిజిటల్ మౌలిక సదుపాయాలు కుప్పకూలకుండా కాపాడుకోవడానికి అమెరికాకు భారతీయ ప్రతిభావంతులే అక్కరకొచ్చారు. అలాంటప్పుడు వాటిని ‘నరక కూపాలు’ అనడం అమెరికా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే అవుతుంది.అమెరికా నేర్చుకోవాల్సింది ఎంతో!సైన్స్ పరంగా చూస్తే, నిరంతరం సౌకర్యాల మధ్య ఉండటం వల్ల అమెరికన్లలో ‘హెడోనిక్ నంబ్నెస్‘ (ఆనందాన్ని ఫీల్ అవ్వలేని తనం) ఏర్పడుతోంది. ఏసీలు, కార్లు ఎప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల వాటి వల్ల వచ్చే కిక్ (డోపమైన్, సెరోటోనిన్) తగ్గిపోతుంది. కానీ వనరులు తక్కువగా ఉన్న చోట ఆనందం ఎక్కువగా ఉంటుంది. 25 షర్టులు ఉన్నవాడికి 26వ షర్టు వల్ల వచ్చే ఆనందం కంటే, 5 షర్టులు ఉన్నవాడికి 6వ షర్టు వల్ల వచ్చే ఉత్సాహం చాలా ఎక్కువ. అలాగే అమెరికన్ మధ్యతరగతి మనిషి భారీ ‘ఆందోళన పన్ను‘ (యాంగై్జటీ ట్యాక్స్) కడుతున్నాడు. లక్ష డాలర్ల జీతం వచ్చినా, ఇన్సూరెన్స్ బిల్లులు, ఇతర సేవల కోసం అది ఖర్చయిపోయి చేతిలో ఏమీ మిగలదు. ఇండియాలో మనకు కుటుంబం అనే భావోద్వేగ అండ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖరీదైన వ్యవస్థల కంటే, పక్కనే ఉండే కుటుంబ సభ్యులు మనకు ధైర్యాన్ని ఇస్తారు.ప్రపంచాన్ని కేవలం ఒకే కోణం నుండి చూడటం ఆపాలి. ఇల్లు ఎంత పెద్దది, ఎంత వాడుతున్నాం అనే లెక్కలతో చూస్తే భారత్, చైనాలు పేదవిగా కనిపించవచ్చు. కానీ వాటి దగ్గర లెక్కించలేని సంపద ఉంది– అదే ఆపదలను తట్టుకునే శక్తి, సామాజిక ఐక్యత.ఏ దేశాన్నయినా తక్కువ చేసి చూసే ముందు, సంతోషం అనేది ఆయా దేశాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. ఈ దేశాల నుండి పాశ్చాత్య దేశాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాషింగ్టన్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకుంటే, ముందు ఈ అహంకారాన్ని విడిచిపెట్టి, ప్రపంచం నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.మేడా పరమేశ్వర రెడ్డివ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్ -
డాక్టర్ తమిళిసై (బీజేపీ) రాయని డైరీ
గెలవటం ఏముంది?! నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్లెవరైనా ఒక్క అంగలో గెలిచేస్తారు. కానీ గెలుపు కోసం పరుగు ఆపకపోవటమే నిజంగా గెలవటం! ఐదేళ్లయినా, పదేళ్లయినా, ఇరవై ఏళ్లయినా, గెలుపోటములను పక్కన పెట్టి ప్రజల కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుండే ‘అసాధారణ విజేతలు’ ఏ కొద్దిమందో ఉంటారు. ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, ఎంపీగా మూడు సార్లు... నేను గెలుపెరుగని పోరాటం చేశాను. అసాధారణ విజయం ఇది. అసాధారణ విజేతను నేను. భారత ఎన్నికల కమిషన్ అనొచ్చు, ‘‘ఎన్నికల్లో విజేతలు మాత్రమే ఉంటారు. మీరంటున్న అసాధారణ విజేతలు ఉండరు’’ అని! అందుకు ఎన్నికల కమిషన్ చెప్పే లెక్క ఇలా ఉండొచ్చు– ‘‘మైలాపూర్ నియోజక వర్గంలో టీవీకే నుంచి పి.వెంకట రమణన్, డీఎంకే నుంచి ధా.వేలు, బీజేపీ నుంచి మీరు, నామ్ తమిళర్ కచ్చి నుంచి అరుణ్ అయ్యంగార్ పోటీ చేశారు. వెంకట రమణన్కు 70,070 ఓట్లు, ధా.వేలుకు 41,098 ఓట్లు, మీకు 32,328 ఓట్లు, మీ తర్వాత అరుణ్ అయ్యంగార్కు 4,499 ఓట్లు వచ్చాయి. కనుక వెంకట రమణన్ మాత్రమే విజేత అవుతారు. మిగతా వారు పరాజితులు అవుతారు. అంతే తప్ప అసాధారణ విజేతలు అవరు’’ అని ఎన్నికల కమిషన్ అనొచ్చు.కమిషన్ దగ్గర ఓట్ల లెక్కలు మాత్రమే ఉంటాయి. ఆగని పరుగుల లెక్కలు, వెనక్కి వేయని అడుగుల జాడలు ఉండవు. 2006లో రాధాపురం నుంచి నా పరుగు మొదలైంది. అక్కడి నుంచి నార్త్ చెన్నై (2009), అక్కడి నుంచి వేలచ్చేరి (2011), అక్కడి నుంచి విరుగంపాక్కం (2016), అక్కడి నుంచి తూత్తుకుడి (2019), అక్కడి నుంచి సౌత్ చెన్నైల (2024) మీదుగా... మొన్నటికి మైలాపూర్ (2026). రాధాపురం, వేలచ్చేరి, విరుగంపాక్కం, మైలాపూర్ అసెంబ్లీ ఎన్నికలు; నార్త్ చెన్నై, తూత్తుకుడి, సౌత్ చెన్నై లోక్సభ ఎన్నికలు – మొత్తం ఏడు ఎన్నికలు... ప్రజల కోసం పరుగులు తీస్తూనే ఉండే అసాధారణ విజేతగా నన్ను నిలబెట్టాయి. ‘‘కానీ, అక్కా... మీరు అంత పెద్ద పోస్టును కూడా వదులుకొని ఎన్నికల్లో పోటీ చేయటానికి వచ్చేశారు కదా, అది కరెక్టేనా?’’ అంటుంటారు పార్టీ కార్యకర్తలు. ‘‘అంత పెద్ద పోస్టు!’’ అని వారు అంటున్నది నేను వదిలేసి వచ్చిన గవర్నర్ పదవి గురించి! తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఐదేళ్ల కాలం పూర్తి కాకుండానే తిరిగి నేను ప్రజల దగ్గరకు వచ్చేయటానికి నాకు నేనుగా పరుచుకున్న రెడ్ కార్పెట్ అది. మనసు ప్రజల కోసం ఆరాట పడుతున్నప్పుడు, రాజ్యాంగం ఎంతకాలమని ఒక మనిషిని రాజ్ భవన్లో బంధించి ఉంచుతుంది? నా దృష్టిలో గవర్నర్ కన్నా పెద్ద పోస్టు... ‘కార్యకర్త’ హోదా! వరుసగా ఏడుసార్లు ఓడిపోయిన వాళ్లకు ఈ భూమి మీద జీవించే హక్కు లేదన్నట్లే మాట్లాడుతుంటారు నా రాజకీయ ప్రత్యర్థులు! మరి, గెలిచాక ప్రజల మధ్య ఉండని వాళ్లకు ఏ స్వర్గంలో జీవించే హక్కు ఉంటుంది?! నా చేతిని అందుకోవటానికి ఒక్క చెయ్యీ ముందుకు రానప్పుడు, ఒక్క హృదయాన్నైనా నేను స్పృశించలేక పోయినప్పుడు... అప్పుడు కదా నిజంగా నేను ఓడిపోవడం!! వరుసగా ఏడుసార్లు ఓడిపోవటానికి, వరుసగా ఏడుసార్లు గెలవటానికి ఉండే ఒకే ఒక్క తేడా... సభలో ఒక సీటు వరుసగా ఏడుసార్లు ఖాళీగా ఉండటం లేదా సభలో ఒక సీటు వరుసగా ఏడుసార్లు ఖాళీగా లేకుండా ఉండటం మాత్రమే. సీటు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏడేడు కాలాలు స్థిరంగా ఉండేది... ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పబలం ఒక్కటే. ఆ బలమే నన్ను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పుడిక నా దిశ 2029 లోక్ సభ ఎన్నికలు! -
చిరు ప్రయత్నంతోనే ప్రయోజనకరం
చిరుధాన్యాలలో ఐరన్, జింక్, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ‘న్యూట్రి–సిరియల్స్’గా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ పోషకాలు కేవలం ఉంటే సరిపోదు; మన శరీరం వాటిని ఎంతవరకు గ్రహిస్తుంది అనేదే వాటి నిజమైన ఆరోగ్య ప్రయోజనాన్ని నిర్ణయిస్తుంది. చిరుధాన్యాలను సమకాలీన ఆహారంలోకి పెద్ద ఎత్తున తిరిగి ప్రవేశపెట్టేటప్పుడు ఈ తేడాను గమనించడం కీలకం.శుద్ధి చేయని, సరిగ్గా ప్రాసెస్ చేయని చిరుధాన్యాలలో ఫైటిక్ యాసిడ్ (మయో–ఇనోసిటాల్ హెక్సాకిస్ ఫాస్ఫేట్)తో పాటు టానిన్లు, పాలీఫెనాల్స్, ఎంజైమ్ ఇన్హిబిటర్లు గణనీయమైన స్థాయిలో ఉంటాయి. ఈ సమ్మేళనాలు విత్తనానికి సహజ రక్షణ యంత్రాంగా లుగా పనిచేస్తాయి, కానీ మానవ పోషకాహారానికి సవాళ్లను విసురుతాయి.ఐరన్, జింక్, కాల్షియంతో కలిసి ఫైటిక్ యాసిడ్ కరగని సమ్మేళ నాలను ఏర్పరుస్తుంది; తద్వారా ప్రేగులలో వీటి శోషణను గణనీ యంగా తగ్గిస్తుంది.ప్రోటీజ్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్లు ప్రోటీన్ జీర్ణ క్రియకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే టానిన్లు ఎంజైమ్ కార్యకలా పాలను, రుచిని తగ్గిస్తాయి. సజ్జలలో గోయిట్రోజెనిక్ పదార్థాలు ఉంటాయి. ఇవి అధికంగా తీసుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణకు ఆటంకం కలిగించవచ్చు. కొన్ని చిరుధాన్యాలలో ఉండే అధిక ఆక్సలేట్ స్థాయులు, ఆ సమస్య ఉన్న వ్యక్తులలో మూత్రపిండాల రాళ్లకు దారితీయవచ్చు. కాబట్టి, ప్రాసెస్ చేయని చిరుధాన్యా లను నేరుగా తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలకు విరుద్ధంగా సూక్ష్మపోషకాల లోపాలు, జీర్ణకోశ అసౌకర్యం కలగవచ్చు.సాంప్రదాయక జ్ఞానం ఏం చెబుతోంది?జీవరసాయన ప్రాధాన్యత కలిగిన అనుభవపూర్వక జ్ఞానం ఇక్కడ అవసరం. చరిత్రవ్యాప్తంగా అన్ని సంస్కృతులలో, చిరు ధాన్యాల వినియోగానికి ముందు నానబెట్టడం, పులియబెట్టడం, మాల్టింగ్ (మొలకెత్తించడం), నియంత్రిత ఉష్ణ చికిత్స వంటి ప్రక్రియలు చేసేవారు. ఇవి కేవలం వంట పద్ధతులు మాత్రమే కాదు, జీవరసాయన పరంగా మార్పులు చేసే ప్రక్రియలు.నానబెట్టడం (హైడ్రేషన్ ఫేజ్) వల్ల ‘ఫైటేజ్’ అనే ఎంజైమ్లను ఉత్తేజితం చేసి, ఫైటిక్ యాసిడ్ను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది.పులియబెట్టడం (మైక్రోబియల్ హైడ్రోలిసిస్) వల్ల లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పీహెచ్ స్థాయిని తగ్గించి, ఫైటేజ్ చర్యను పెంచుతుంది; పోషక వ్యతిరేక పదార్థాలను క్షీణింపజేస్తుంది. ఇక మాల్టింగ్ (మొలకెత్తించడం) ధాన్యంలోని ఎంజైమ్లను ప్రేరేపించి, ఫైటిక్ యాసిడ్ను 50% వరకు తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. ఉడికించడం (హైడ్రోథర్మల్ ప్రాసెసింగ్) పిండి పదార్థ నిర్మాణాన్ని మారుస్తుంది; పోషక వ్యతిరేక సమ్మేళనాలను బలహీన పరుస్తుంది, తద్వారా పోషకాల లభ్యతను పెంచుతుంది.దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న సంప్రదాయ వ్యవస్థలు ఈ విషయంలో ధ్రువీకరించబడిన నమూనాలను అంది స్తాయి: తమిళనాడు (కూజ్), అరకు లోయ (అంబలి) ప్రాంతాల్లో పులియబెట్టిన చిరుధాన్యాల జావలు జీర్ణశక్తిని, ప్రోబయోటిక్ ప్రయోజనాలను మెరుగుపరుస్తాయని నిరూపితమైంది. రాయల సీమ (రాగి సంగటి – అంబలి)లో చేసేవిధంగా ప్రత్యేకమైన ఆవిరి పద్ధతి, వండిన తర్వాత పులియబెట్టడం వల్ల నానబెట్టకపోయినా పోషక వ్యతిరేక పదార్థాలు తగ్గుతాయి. ఆఫ్రికన్ వ్యవస్థల్లో (ఇంజెరా, ఉజీ, హౌసా కోకో) సుదీర్ఘకాలం (2–3 రోజులు) పులియబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ సమర్థవంతంగా తొలగిపోతుంది, ఖనిజాల లభ్యత పెరుగుతుంది. చిరుధాన్యం ఆరోగ్య ప్రదాయినిగా పని చేస్తుందా లేదా పోషకాహార భారంగా మారుతుందా అనేది దానిని మనం చేసే ‘ప్రాసెసింగ్’ మాత్రమే నిర్ణయిస్తుందని ఈ పద్ధతులు నొక్కి చెబుతున్నాయి.ఐరోపాలో మొక్కజొన్నను ప్రవేశపెట్టినప్పుడు దేశీయ ప్రాసె సింగ్ పద్ధతులను అనుసరించకపోవడం వల్ల, నియాసిన్ లోపం ఏర్పడి ‘పెల్లాగ్రా’ వ్యాధి వ్యాపించింది. ఈ చారిత్రక ఉదాహరణ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది: ఆహార వ్యవస్థలను వాటి సంప్రదాయ జ్ఞాన చట్రం నుండి వేరు చేస్తే ఆరోగ్యపరమైన విపరిణామాలు తప్పవు.సైన్స్తో కూడిన ఆచరణసురక్షితమైన, ప్రభావవంతమైన చిరుధాన్యాల వినియోగం కోసం ఈ మార్గదర్శకాలు పాటించడం మేలు.1. నానబెట్టే ప్రోటో కాల్: తృణధాన్యాలను 8–24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని పారబోయాలి. ఇది ఫైటిక్ యాసిడ్ విచ్ఛిన్నానికి సహాయపడుతుంది. 2. పులియబెట్టే వ్యూహం: చిరుధాన్యాల పిండి లేదా జావలను రాత్రంతా పులియబెట్టాలి (పెరుగు లేదా మజ్జి గతో). ఇది పోషక వ్యతిరేక పదార్థాల విచ్ఛిన్నతను పెంచుతుంది.3. మాల్టెడ్/మొలకెత్తిన ఉత్పత్తుల వాడకం: వాణిజ్యపరంగా లేదా ఇంట్లో తయారుచేసిన మొలకెత్తిన చిరుధాన్యాల పిండి సులభంగా జీర్ణమవుతుంది, ఖనిజాలను శరీరానికి అందిస్తుంది.4. హైడ్రో థర్మల్ పద్ధతులు: ప్రెజర్ కుక్కర్ కంటే ఆవిరి మీద ఉడికించడం లేదా నెమ్మదిగా ఉడికించే పద్ధతులను ఎంచుకోవాలి.మరికొన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రోజువారీ తినడం సుమారు 50–60 గ్రాములకు పరిమితం చేయాలి. ఇవి అన్ని రకాల తృణధాన్యాలకు ప్రత్యామ్నాయం కాకూడదు. చిరు ధాన్యాలు బియ్యం లేదా గోధుమలకు తోడుగా ఉండాలి తప్ప, వాటిని పూర్తిగా భర్తీ చేయకూడదు. థైరాయిడ్ సమస్యలు, ఐబీఎస్, కిడ్నీలో రాళ్లు లేదా దీర్ఘకాలిక జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి.నానబెట్టడం, పులియబెట్టడం, నెమ్మదిగా ఉడికించడం ‘పాసివ్ బయో కెమికల్ ప్రాసెసింగ్’ రూపాలు. ఇక్కడ ఎంజైమ్, సూక్ష్మ జీవుల వ్యవస్థలు ‘ముందస్తు జీర్ణక్రియ’ను నిర్వహిస్తాయి. తయారీ సమయాన్ని తగ్గిస్తే, ఆ జీర్ణక్రియ భారం మానవ శరీరంపై పడుతుంది. ఇంకా దీర్ఘకాలిక జీవక్రియ, అంతస్స్రావ ప్రభావాలపై క్లినికల్ అధ్యయనాలు జరగవలసే ఉంది. నేషనల్ ఇన్స్టి్టట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంప్ర దాయ జ్ఞానాన్ని ఆధునిక పోషకాహార విజ్ఞానంతో అనుసంధానించే పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఇంత ఓపిక ఎక్కడిది?మీరు ఆత్రుతలో ఉన్నప్పుడు ఓపికగా ఎలా ఉండాలి? ఆఫీసుకి వెళ్లే ముందు చిరుధాన్యాలను నానబెట్టండి. మీరు 8–10 గంటల తర్వాత వచ్చేసరికి ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి, అవి వండుకోవ డానికి సిద్ధంగా ఉంటాయి. రాత్రి భోజనం తర్వాత చిరుధాన్యాలను వండి, మట్టి పాత్రలో కొద్దిగా మజ్జిగ పోసి ఉంచండి. ఉదయాన్నే ఆరోగ్యకరమైన అంబలి సిద్ధంగా ఉంటుంది. ఆదివారం నాడు చిరు ధాన్యాలను నానబెట్టి, ఎండబెట్టి పిండి పట్టించుకోండి. ఇది వారం అంతా పోషకాలతో సిద్ధంగా ఉంటుంది. పడుకునే ముందు ఎలక్ట్రిక్ స్లో కుక్కర్లో పెడితే, ఉదయాన్నే క్రీమీగా ఉండే జొన్న లేదా కొర్రల జావ సిద్ధమవుతుంది. వారాంతంలో మొలకెత్తించే ప్రక్రియ చేపట్టండి. వీటిని ఫ్రిజ్లో పెట్టుకుంటే పని దినాల్లో 50% వేగంగా ఉడుకుతాయి. నానబెట్టడాన్ని అదనపు పనిగా భావించొద్దు. ఇది ‘పాసివ్ కుకింగ్’ అని గుర్తించండి. నీరు, సమయం మీ కోసం పని చేస్తున్నాయని గ్రహించండి. చిరుధాన్యాలు సహజంగా గొప్పవి లేదా తక్కువవి కావు– అవి మనం వాడే విధానంపై ఆధారపడి ఉంటాయి. సరైన ప్రాసెసింగ్ ద్వారానే వాటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. – డా‘‘ కె. నాగయ్య ‘ చీఫ్ సైంటిస్ట్, సీఎస్ఐఆర్–ఐఐసీటీ, హైదరాబాద్;– ఫణిరాజ్ జి. ‘ ఐటీ ప్రొఫెషనల్, బోస్టన్, యూఎస్ఏ -
యూఏఈ నిష్క్రమణతో మనకేంటి?
పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైదొలగడం వెనుక సుదీర్ఘ ఒడుదుడుకుల చరిత్ర ఉంది. అబు ధాబీ నిర్ణయంపై మన దేశంలో సంతోషం వెల్లివిరియడం అపరిణతిని సూచిస్తోంది. అబు ధాబీ ఒక అమీరాత్గా ‘ఒపెక్’లో 1967లో చేరింది. యూఏఈ 1971లో ఏర్పడింది. ‘ఒపెక్’ కార్టెల్లో చేరిన ఆది నుంచీ అది నిర్ణయించే ఉత్పత్తి పరిమితికి యూఏఈ కట్టుబడిన దాఖలాలు లేవు. దుబాయ్ 1970లలో నేటిలా టూరిస్టు కేంద్రంగా ఏమీ లేదు. యూఏఈకి దుబాయ్ పెట్రోలియం కంపెనీ ముఖ్య ఆదాయ వనరుగా ఉండేది. యూఏఈపై ‘ఒపెక్’ విధించిన కోటాలకు కట్టుబడి ఉండేందుకు అది తిరస్కరించేది. కనుక, యూఏఈ ‘ఒపెక్’ లోపల ఉన్నా బయట ఉన్నా కార్టెల్కు వచ్చిన తేడా ఏమీ లేదు. ఇది భారతదేశపు చమురు విధాన నిర్ణేతలు గుర్తించడం ముఖ్యం. ర్యాంకింగులు, ఉత్పత్తి శాతాల పరామితులకు ప్రాధాన్యం లేదు. కనుక, ‘ఒపెక్’ నుంచి వైదొలగాలని యూఏఈ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆ కార్టెల్ బలహీనపడుతుందనుకోవడం భ్రమ.ధరలేం పడిపోవు!యూఏఈకి చెందిన మొదటి పెట్రోలియం–ఇంధన వనరుల మంత్రి మానా సయీద్ అల్ ఓతైబా 1982లో వియన్నాలో ‘ఒపెక్’ 63వ మంత్రుల స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించి తిరిగి వచ్చాక, ఈ వ్యాసకర్తను, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న మరో ఇద్దరు జర్నలిస్టులను పిచ్చాపాటీగా మాట్లాడేందుకు పిలిపించారు. వియన్నా సమావేశం గురించి అడిగినపుడు, అది ఏదైనా ఫలితాన్ని ఇస్తుందని తాను అనుకోవడం లేదని పెదవి విరిచారు. ‘ఒపెక్’ సమావేశం నుంచి తెచ్చిన వాటిలో రెండు కాగితాలను బయటకు తీశారు. రెండు కాగితాల్లోనూ వట్టి గీతలతో(డూడుల్స్) వేసిన బొమ్మలున్నాయి. ఓతైబా చిన్న వయసులోనే అంటే 25 ఏళ్లకే మంత్రి అయ్యారు. మంత్రి కాకముందు నుంచే ఆయనకు అలా బొమ్మలేసే, కవిత్వం రాసే అలవాటు ఉంది. ‘ఒపెక్’ సమావేశాలకు హాజరైనా, వక్తలు చెప్పేది నిరాసక్తంగా ఉన్నప్పుడు ఆయన తన వ్యాపకాన్ని కొనసాగించారన్నమాట!‘ఒపెక్’ చాలా సార్లు చీలికలను ఎదుర్కొంది. ‘ఒపెక్’ తన సభ్య దేశాల చమురు ఉత్పత్తిపై పరిమితి విధించేందుకు 1986లో జరిపిన మంత్రుల స్థాయి సమావేశాలన్నీ వివాదాస్పదంగానే ముగిశాయి. జెనీవాలో జరిగిన సమావేశం నుంచి ఓతైబా వాకౌట్ కూడా చేశారు. ‘ఒపెక్’లోని అభిప్రాయ భేదాల వల్ల ఆ ఏడాది (1985లో) చమురు ధరలు పీపాకు 24.51 డాలర్ల నుంచి 9.25 డాలర్లకు తగ్గాయని అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్న రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ, ‘ఒపెక్’ దుకాణం ఏమీ మూత పడలేదు. కనుక, ఇపుడు యూఏఈ వైదొలగడాన్ని కార్టెల్కు దెబ్బగా అభివర్ణించలేం. చమురుకు సరైన ప్రత్యామ్నాయాలు వాడుకలోకి వచ్చే రోజు వస్తే తప్పించి, కేవలం ‘ఒపెక్’లో విభేదాల వల్ల, చమురు ధరలు మళ్ళీ పీపాకు 9.25 డాలర్లకు పడిపోతాయని భావించడంకన్నా నిర్హేతుకమైనది మరొకటి ఉండదు. వాళ్ల ప్రయోజనాలే వాళ్లకు ముఖ్యంయూఏఈతో స్నేహ సంబంధాల వల్ల భారత్ చమురు నిల్వలను పెద్ద యెత్తున పక్కన పెట్టుకుంటుందనే అభిప్రాయాన్ని ఇటీవల కలిగించారు. అబుధాబీ తన ఇంధన విధానాలను భారత దేశానికి అనువుగా రూపొందించుకుంటుందనే అభిప్రాయాల బూజు ఏమైనా ఉంటే దులిపేసుకోవడం మంచిది. అది దాని ప్రయోజనాలను కాపాడుకునే విధంగా విధానాలను రూపొందించు కుంటుంది. అబు ధాబీ ఇందన సంస్థల రంగం ఏకశిలా సదృశం కాదను కునే విషయంలోనూ భారత్లో అవగాహన అంతంతే. అది 1970 మధ్య నుంచే ఏకశిలా సదృశంగా లేదు. అప్పట్లో పెట్రోలియం మంత్రిత్వ శాఖను, అబు ధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్)ని వేరు చేశారు. చమురు, ఇంధన వాయు కలాపాలకు ‘అడ్నాక్’ బాధ్యత వహిస్తే, చమురు విధానాలను మంత్రిత్వ శాఖ నిర్ణయించేది. ఇపుడు సుల్తాన్ అల్ జబేర్ గ్రూప్ సి.ఇ.ఓ.గాను, ‘అడ్నాక్’ మేనేజింగ్ డైరెక్టర్గాను రెండు బాధ్యతలనూ నిర్వహిస్తున్నారు. అల్ జబేర్తో భారత్ చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేగానీ, ‘ఒపెక్’ నుంచి వైదొలగిన యూఏఈ నుంచి తాను కచ్చితంగా ఏమి ఆశిస్తు న్నదన్న విషయంలో భారతదేశానికి స్పష్టత అవసరం. యూఏఈ–సౌదీ కవల సోదరులుఅమెరికా–ఇరాన్ మధ్య సైనిక ప్రతిష్టంభన ముగిసేవరకు, ఒపెక్కు యూఏఈ గుడ్ బై చెప్పినంత మాత్రాన, భారత్ వంటి అధిక ఇంధన వినియోగ దేశాలకు కలిగే మార్పులు ఏమీ ఉండవు. సైనిక ప్రతిష్టంభన వల్ల హార్మూజ్ గుండా ముడి చమురు రవాణా తక్కువగా ఉంది. హార్మూజ్ జలసంధితో పని లేకుండా, యూఏఈ చమురు ఎగుమతి చేయాలంటే, దాని అమీరాత్లలో ఒకటైన ఫుజైరాహ్ నుంచి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ, ఫుజైరాహ్ రేవుకు ఉన్న పైపు లైనులు రోజుకు 1.8 మిలియన్ల పీపాల చము రును మాత్రమే నిర్వహించగలవు. దానిలో ఎంత మొత్తాన్ని యూఏఈ మనకు విక్రయిస్తుంది? యూఏఈ నుంచి చమురు కొంటున్నది మనం ఒక్కళ్ళమే కాదుగా! యూఏఈ మీద పెట్టుకున్న ఆశలలో భారత్ ఈ కీలక పరిమితిని లెక్కలోకి తీసుకుందా? అంతిమంగా, అమీరాత్లు, సౌదీలు ‘సోదరులు’. భారతీయులు, చైనీయులు, జపానీయులు వారికి ‘స్నేహితులు’ మాత్రమే. యూఏఈ, సౌదీ అరేబియాల మధ్య తగవులు ఉన్నా అవి కవలల వంటివి. యూఏఈ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వాటి తాజా వార్షిక చమురేతర వాణిజ్యం మొత్తం 41.3 బిలియన్ల డాలర్లుగా ఉంది. సౌదీకి యూఏఈ రెండవ పెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి దారు. యూఏఈలో సౌదీ పెట్టుబడులు 4.3 బిలియన్ల డాలర్ల మేరకు ఉన్నాయి. ఒకప్పుడు మూడు గల్ఫ్ దేశాలు ఖతర్ బహి ష్కరణకు ఊహించని రీతిలో ముగింపు పలికినట్టే... యూఏఈ –సౌదీ మధ్య విభేదాలు కూడా ఏదో దశలో సమసిపోతాయి. భారత్ తన విధానాల రూపకల్పనలో ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.కె.పి. నాయర్వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల నిపుణుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భద్రతా వ్యూహం... గ్రేట్ నికోబార్
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన గ్రేట్ నికోబార్ దీవుల అభివృద్ధి మెగా ప్రాజెక్టుకు ఎట్టకేలకు 2026 ఫిబ్రవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యు నల్ (ఎన్జీటీ) పచ్చజెండా ఊపింది. దీనిపై వస్తున్న విమర్శలకు సమాధానమా అన్నట్లు, మే 1న ప్రభుత్వం ప్రశ్నలు – సమాధానాలను విడుదల చేసింది. బంగాళాఖాతంలో 467 కి.మీ. పొడవున ఉత్తర దక్షిణంగా విస్తరించిన 836 దీవుల సమూహమే అండమాన్–నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ ద్వీప సమూహంలో పూర్తి దక్షిణంగా ఉన్న దీవి గ్రేట్ నికోబార్. భారతదేశపు దక్షిణ బిందువు ఇందిరా పాయింట్/ పిగ్మాలియన్ పాయింట్ నికోబార్ చివరి ప్రాంతం. ఈ దీవులు భారతదేశంలో భాగమయినప్పటికీ, మయన్మార్, ఇండోనేషియాలకు దగ్గరగా ఉన్నాయి. ఉత్తరాన అండమాన్ దీవుల నుండి కేవలం 55 కి.మీ. దూరంలో మయన్మార్కు చెందిన కోకో దీవులున్నాయి. దక్షిణాన గ్రేట్ నికోబార్ దీవుల నుండి 150 కి.మీ. దూరంలో ఇండోనేషియా ఆబే దీవులున్నాయి. గ్రేట్ నికోబార్లోని గలాతియా నుండి కేవలం 74 కి.మీ. దూరంలో కీలకమైన మలక్కా జలసంధి ఉన్నది.నీతి ఆయోగ్ 2021లో గ్రేట్ నికోబార్ దీవుల అభివృద్ధి పథకాన్ని ప్రతిపాదించింది. భారత ప్రభుత్వం 2025లో రేవుపట్టణ ఆధారిత అభివృద్ధిని ఉద్దేశించి ప్రారంభించిన ‘సాగర్మాల’ బృహత్ ప్రణాళికలో ఈ పథకం ఒక భాగం. 166 చ.కి.మీ విస్తీర్ణంలో గ్రేటర్ నికోబార్ సమగ్ర అభివృద్ధికి మూడు దశలలో 81,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2047 కల్లా పూర్తి చేయాలని ఈ పథకాన్ని ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా నాలుగు భాగాలున్నాయి. 1. గలాతియా బే ఇంటర్నేషనల్ కంటెయినర్ ట్రాన్స్పోర్ట్ టర్మినల్ (ఐసీటీటీ). 2. గ్రేట్ నికోబార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 3. గ్యాస్–సౌర ఆధారిత విద్యుచ్ఛక్తి కేంద్రం (450 ఎంవీఏ). 4. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్పులు. నౌకల మరమ్మత్తు, స్వేచ్ఛా వాణిజ్య మండలం ఏర్పాటుకూ వీలు కల్పించారు.విమర్శలు దేనికి?ప్రాజెక్టుకు అవసరమైన 166 చ.కి.మీ. భూభాగంలో సుమారు 131 చ.కి.మీ. అటవీ ప్రాంతం దట్టమైన సతత హరితారణ్యాలతో కూడి ఉన్నది. సుమారుగా 7.2 లక్షల వృక్షాలను నరికివేయాల్సి ఉంటుంది. తీరంలోని 20 వేల ప్రహళ సమూహాల (కోరల్ కాలనీస్)పై దుష్ప్రభావముంటుంది. అరుదైన సముద్ర తాబేళ్లకు ఈ దీవి తీరం బ్రీడింగ్ గ్రౌండ్. నిర్మాణ కార్యకలాపాల వలన ఈ సముద్ర తాబేళ్ళు అంతరించి పోవచ్చును. గ్రేట్ నికోబార్ దీవులు అంతరించిపోతున్న షాంపేన్, నికోబా రీస్ ఆదిమ తెగలకు ఆవాసం. వీరిని పర్టిక్యులర్లి వల్నేరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ)గా గుర్తించారు. దీవుల అంతర్భాగంలో సుమారుగా 200–300 మంది షాంపేన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. తీరానికి దగ్గర్లో 1000–1100 మంది నికోబారీస్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఆధునిక నాగరికత ఛాయ కూడా పడకుండా వేల సంవత్సరాల జీవన విధానాన్ని వారు కొనసాగిస్తున్నారు. వీరు నివసిస్తున్న 751 చ.కి.మీ. ప్రాంతాన్ని ట్రైబల్ రిజర్వ్గా ప్రకటించారు. సుమారు 84 చ.కి.మీ. ట్రైబల్ రిజర్వ్ ప్రాంతం ప్రస్తుత ప్రాజెక్టు పరిధిలోనికి వస్తుంది. ఈ ప్రాంతాన్ని ట్రైబల్ రిజర్వ్ నుండి డీనోటిఫై చేయాల్సి ఉంటుంది. భూభౌతిక శాస్త్ర పరంగా ఆలోచిస్తే ఈ దీవి భూకంప ముప్పు అధికంగా ఉండి విస్తృత నిర్మాణ కార్య కలాపాలకు అనువయినది కాదు. పైగా ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా 6.5 లక్షల మంది స్థానికేతరులు అదనంగా రావటంతో స్థానిక తెగల సంస్కృతికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిమే 1న ఎఫ్ఏక్యూ రూపంలో ప్రభుత్వం ప్రెస్నోట్ విడుదల చేసింది. ప్రాజెక్టులో జాతీయ భద్రత, పర్యావరణ పరిరక్షణ, స్థానిక తెగల సంరక్షణ అంశాలను సమీకృతం చేసినట్లుగా పేర్కొన్నది. హిందూ మహాసముద్రంలో విదేశీ నౌకా శక్తులను ఎదుర్కోవటానికి గ్రేట్ నికోబార్ దీవిలో శాశ్వత సైనిక బలం అవసరాన్ని నొక్కి వక్కా ణించింది. ప్రభావితమయ్యే అటవీ భూమి విస్తీర్ణం (131 చ.కి.మీ.) మొత్తం అండమాన్–నికోబార్ దీవుల విస్తీర్ణంలో 1.82 శాతమే. దీనికి ప్రతిగా మధ్యప్రదేశ్, హరియాణాల్లో కొత్తగా అడవుల పెంప కాన్ని ప్రతిపాదించింది. ఆదిమ తెగలను వారి నివాస ప్రాంతాల నుండి తరలించాల్సిన ఆవశ్యకత లేదని భరోసా ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ పట్టించుకోని అభివృద్ధి నిలకడగా ఉండ దనేది నిర్వివాదాంశం. పర్యావరణానికి ఏమాత్రం హాని కలుగకుండా అభివృద్ధి సాధ్యపడదనేది కూడా వాస్తవం. స్థానిక అభివృద్ధి పథకాలను మదింపు చేసేటప్పుడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోణంలో నుండి పరిశీలించటం అభిలషణీయం కాదు. దేశ ప్రయో జనాల కోణం నుండే విశ్లేషించాలి. పాశ్చాత్య దేశాల అండతో నడిచే కొన్ని పర్యావరణ స్వచ్ఛంద సంస్థలు ప్రపంచ దేశాలలో అభివృద్ధికి మోకాలడ్డిన సందర్భాలు చాలా ఉన్నాయి. సంతులిత, నిలకడ కలిగిన అభివృద్ధి దిశగా భారత్ తనదైన శైలిలో అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు కీలకం?గలాతియాలో నిర్మించే రేవు పట్టణం సాధారణ నౌకాశ్రయం కాదు. ఇది ట్రాన్షిప్మెంట్ పోర్ట్ – అతి పెద్ద కంటెయినర్షిప్పుల నుండి సరకులను చిన్న చిన్న షిప్పులలోకి మార్చే సదుపాయం ఉంటుంది. భారీ కంటెయినర్ నౌకలు లంగరు వేయటానికి మన పోర్టులలో అవకాశం లేదు. అందువలన మన రేవులలో ఎగుమతి– దిగుమతి చిన్న నౌకలలోనే జరుగుతుంది. మన రేవులలో చిన్న నౌకలలోనికి ఎక్కించబడిన సరకులు కొలంబో, సింగపూర్, క్లాంగ్ (మలేషియా) ట్రాన్షిప్మెంట్ పోర్టులలో పెద్ద కంటెయినర్ షిప్పుల లోకి ఎక్కించబడుతున్నది. సాలీనా సుమారు 200–200 మిలియన్ డాలర్లను మనం చెల్లించాల్సి వస్తున్నది.ఏప్రిల్ 2024న కేరళలోని విజింజామ్లో మొదటి ట్రాన్షిప్మెంట్ పోర్టును ప్రారంభించారు. కానీ ప్రపంచ సముద్ర రవాణా మార్గం నుండి 5 గంటల కాలం పడుతుంది. కొలంబో కేవలం అర గంట దూరంలో ఉన్నది. గ్రేట్ నికోబార్లోని గలాతియా ప్రపంచ సముద్ర రవాణా మార్గం నుండి అరగంట దూరంలో ఉండటం వలన కంటెయినర్ ట్రాన్షిప్మెంట్ పోర్టుకు అత్యంత అనుకూలం. హిందూ మహాసముద్రంలో అండమాన్–నికోబార్ దీవులను భారత్కు మొదటి రక్షణ శ్రేణిగా పరిగణించవచ్చు. సముద్రం గుండా వచ్చే దాడిని ఎదుర్కోవాలంటే అండమాన్–నికోబార్లో మన సైనిక శక్తిని కేంద్రీకరించాల్సిందే. ఈ వ్యూహంలో భాగంగానే అండమాన్లో మొట్టమొదటి ట్రైసర్వీస్ కమాండ్ను ఏర్పాటు చేశారు. ఉత్తర అండమాన్ నుండి గ్రేట్ నికోబార్ వరకు వరుసగా సైనిక–పౌర ఎయిర్–ఫీల్డ్స్, రేవు పట్టణాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్న కాంప్బెల్ బేలోని ఐఎన్ఎస్ బాజ్, గలాతియాలోని చింగాన్ ఎయిర్ఫీల్డ్లు మలక్కా జలసంధిపై నిరంతర నిఘా నేత్రంగా పని చేయనున్నాయి. ఉత్తర అండమాన్ సమీ పంలోని మయన్మార్కు చెందిన కోకో దీవిలో చైనా సైనిక కదలికల సమాచారం అందుతున్నది.అవునన్నా కాదన్నా భారత్కు చైనానే ప్రధాన వైరి దేశం. చైనా ఆర్థిక, వాణిజ్య వ్యవస్థకు కీలకం మలక్కా జలసంధి. చైనా చమురు, ఇతర దిగుమతులంటూ సుమారుగా 80 శాతం మలక్కా జలసంధి ద్వారానే జరుగుతుంది. మలక్కాను దిగ్భందిస్తే చైనా ఆర్థిక వ్యవస్థను దిగ్భదించినట్లే. చైనా ప్రధాని హ్యూ జింటావో 2003లోనే దీన్ని ‘మలక్కా డైలమా’గా గుర్తించాడు. మలక్కాను దిగ్భందించే అవసరం/ సత్తా యూఎస్ఏ, జపాన్ లేదా భారత్లకు మాత్రమే ఉన్నది. లద్ధాఖ్, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్ (హిమాలయా)లలో చైనా కవ్వింపులకు సరైన సమాధానం అండమాన్–నికోబార్ల నుండే జరగాలి. అరుణాచల్ప్రదేశ్లో సరైన రవాణా, విద్యుత్, సమాచార, సైనిక సదుపాయాల లేమి వలన 1962 యుద్ధంలో ఎంత నష్టపోయామో గుర్తించాలి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
'ప్రత్యామ్నాయం' వైపు పలు దేశాలు
హార్మూజ్ దిగ్బంధనాల అడకత్తెరలో చిక్కుకుని ప్రపంచం విలవిలలాడుతున్న వేళ, దక్షిణ అమెరికాలోని కొలంబియా అనే చిన్న దేశంలో గమనార్హమైన సమావేశాలు జరిగాయి. ఏప్రిల్ 24 నుంచి 29 వరకు సుమారు 60 దేశాల భాగస్వామ్యంతో జరిగిన ఆ సమావేశాల అజెండా – పెట్రోల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయాల వైపు మళ్లటం ఎట్లాగన్నది. ఇది ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంవల్ల ఏర్పడిన ఒత్తిడికి పర్యవసానం. పర్యావరణ అంశాలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన 30 సంవత్సరాలకు పైగా సదస్సులు జరుగుతుండటం, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపు గురించి తీర్మానాలు, ఒప్పందాల మాట తెలి సిందే. కానీ ఇపుడు మొదటిసారిగా ఐక్యరాజ్యసమితితో నిమిత్తం లేకుండా, అమెరికాను కనీసం ఆహ్వానించకుండా ఈ సమావేశాలు జరగటం విశేషం. పెద్ద దేశాలకు లేదు ఆహ్వానంఅమెరికాయే కాదు. రష్యా, చైనా, ఇండియా, గల్ఫ్ దేశాల వంటివి కూడా అందులో పాల్గొనలేదు. కానీ, సమావేశాలకు సహనిర్వాహకురాలైన నెదర్లాండ్స్తో పాటు పలు యూరోపియన్ దేశాలు వెళ్లాయి. ఇందులో అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ను న్నాయి. అమెరికాను ఆహ్వానించకపోవటం ఎందువల్ల? దీనికి నిర్వాహకులు చెప్పిన సమాధానం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించటం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన ఎన్నో సమావేశాలు జరిగినా ఆ తీర్మానాలను అమెరికా వీటో చేస్తూ వస్తున్నది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అయితే అసలు శిలాజ ఇంధనాల వినియోగం సమస్యే కాదంటూ కొట్టివేసి ప్యారిస్ ఒప్పందం నుంచి నిష్క్రమించారు. తక్కిన పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలావరకు ఇటువంటి ఇంధనాలతోనే ముడిబడి ఉన్నాయి. వారు ప్రత్యామ్నాయాల కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా, చైనాలో తప్ప ఇతరచోట్ల మందకొడిగానే సాగుతున్నాయి.ఈ పరిస్థితుల మధ్య మిగిలిన దేశాలు శిలాజ ఇంధనాల పరిధి నుంచి వీలైనంత వేగంగా బయట పడటం తప్పనిసరి అవుతున్నది. ఇదెంత అత్యవసరమో ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలో ఒకసారి తెలిసి రాగా, ఇపుడు ఇరాన్ యుద్ధంవల్ల మరింత తీవ్ర రూపంలో అర్థమవుతున్నది. చమురును, గ్యాస్ను ఉత్పత్తి చేసే దేశాలు, వాటి వ్యాపారాన్ని నియంత్రించే కంపెనీలు గల రాజ్యాలు, వాటి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు మొత్తం శిలాజ ఇంధన రంగం బందీ అయిపోయింది. ఇంధన ఉత్పత్తులు, ధరల నియంత్రణను కొందరు తరచు ఆయుధంగా ఉపయోగించుకున్నారు. అటువంటి ఇంధన వనరులు గల ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకునేందుకు రాజకీయంగా, సైనికంగా అనేకం చేశారు. ఈ స్థితి ఇప్పుడు ఇరాన్ యుద్ధ సందర్భంగా పరాకాష్ఠకు చేరింది. ఇంత క్లిష్ట స్థితి చరిత్రలోనే ఎప్పుడూ లేదన్నది నిపుణుల మాట.యుద్ధంతో పెరిగిన ఒత్తిడిఈ ప్రభావాలు చిన్న దేశాలపై సరేసరి కాగా అభివృద్ధి చెందిన యూరప్పై కూడా పడుతున్నాయి. అందువల్లనే కొలంబియా సమావేశాలకు నెదర్లాండ్స్ సహ నిర్వాహకురాలు కాగా, వచ్చే సంవత్సరం పసిఫిక్ ద్వీప దేశమైన తువాలూ సమావేశాలకు ఐర్లండ్ సహనిర్వాహకురాలు కావాలని నిర్ణయించారు. పర్యావరణ మార్పులతో సముద్ర జలాల స్థాయి పెరిగి 2100 నాటికి తువాలూ దేశం 90 శాతం మునుగుతుందన్నది అంచనా. కొలంబియా సమా వేశాలకు పలు యూరోపియన్ దేశాలు వెళ్లటాన్ని బట్టి, ఇరాన్ యుద్ధంతో తలెత్తిన శిలాజ ఇంధన సమస్యలు వారికి కూడా ఎంత ఇబ్బందికరంగా మారాయో గ్రహించవచ్చు. యూరోపియన్ యూనియన్ దేశాలు బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగాలను 2050 నాటికి దశల వారీగా నిలిపి వేయాలని నిర్ణయించాయి కూడా.కొలంబియాలో జరిగిన నిర్ణయాలు అన్నీ శిలాజ ఇంధన ఉత్పత్తి దేశాలూ, కంపెనీలూ, వాటిని నియంత్రించే శక్తులతో ప్రమేయం ఉండని విధంగా ఇతర ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లాలని. అవి, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, అణు విద్యుత్తు, ఎలక్ట్రికల్, బ్యాటరీ రంగాలు, జల విద్యుత్తు, సముద్ర కెరటాల విద్యుత్తు వంటివి. ఇవి శిలాజ ఇంధన రంగం నుంచి విముక్తం చేయటంతోపాటు ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చి పర్యావరణ సమస్యల నుంచి పరిష్కారాలను చూపుతాయి. వీటన్నింటి ప్రభావంతో బయటి శక్తుల ప్రభావాలు తగ్గి, దేశాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటివి సులభమవుతాయి. అమెరికా, జర్మనీలకు చెందిన మాజీ ఇంధన మంత్రులైతే, ఒక దాదాకు, గుత్తాధికారం గల శక్తికి గల ప్రభావం నుంచి బయట పడేందుకే ఈ ప్రయత్నాలు జరుగు తున్నాయని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఈ విధమైన వివిధ అంచనాలను గమనించినపుడు, శిలాజ ఇంధనాలన్న ఒక్క అంశంతో ముడిబడి ఎన్నెన్ని ఉన్నాయనే ఆశ్చర్యం కలుగుతుంది.పర్యావరణ ప్రజాస్వామ్యంకొలంబియా సమావేశాలకు అధ్యక్షత వహించిన ఆ దేశ పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్, ‘ప్రపంచ పర్యావరణ ప్రజాస్వామ్యానికి ఈ చర్చలు ఆరంభ’మని అన్నారు. మరొక విధంగా చెప్పాలంటే, ప్రపంచంలోని ‘పెట్రో నియంతృత్వాలకు, ఎలక్ట్రో ప్రజాస్వామ్యాలకు మధ్య విభజనకు ఇది నాంది అవుతున్న’ దని ప్రకటించారు. ఈ పరిణామాలను గమనించిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అధిపతి సైమన్ స్టియెల్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై చమురు పరిశ్రమ ఆధిపత్యం కారణంగానే ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వాలు కళ్లు తెరిచాయని అన్నారు. జాతీయ భద్రతలు, ఆర్థిక సుస్థిరతలు, విధానపరమైన స్వయం నిర్ణయాలు, మౌలికమైన రీతిలో సార్వభౌమాధికారాల పరిరక్షణల కోసం కూడా ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థలు అవసరమని స్పష్టం చేశారు. కొన్ని దేశాల సైనిక సలహాదారులు సైతం ఇదే అభిప్రాయంతో ఉండటం గమనించదగ్గది.అయితే, కొలంబియాలో 60 దేశాలు చూపిన చొరవ, ఆ దిశగా ఆయా దేశాలు వచ్చే సమావేశాల నాటికి ప్రణాళికలు రూపొందించనుండటం గొప్ప విషయమేగానీ, లక్ష్యసాధనకుగల సమస్యలు తక్కువ కాదు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు కాగల ఖర్చు శిలాజ ఇంధనాల కన్న చాలా తక్కువే. ఆ పని దశల వారీగా కూడా చేయవచ్చు. అసలు సమస్య సాంకేతిక నైపుణ్యాలు, ప్రత్యామ్నాయ ఇంధన పరికరాల ఉత్పత్తికి సంబంధించినది. ఈ రెండు విషయాలలోనూ చైనా అగ్రస్థానంలో ఉంది. వారు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయగలరుగానీ, ఇతర దేశాల స్వయం సమృద్ధికి సహకరించగలరా? అదెట్లున్నా కొలంబియా చొరవ హర్షించదగ్గది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జీవిత సాఫల్యానికి 'మూడు పాఠాలు'
రిషి సునాక్: నేను ప్రాథమికంగా సంఖ్యల మనిషిని. గణితం, గణాంకాలు, కోడింగ్ ఉపయోగించి ఫైనాన్స్ రంగంలో పెట్టుబడి వ్యూహాలు రూపొందించే నిపుణుడిని. అది మా మామగారు ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తితో నా అనుబంధం బలపడటానికి సహాయపడింది. ‘‘మేం దేవునిపై విశ్వాసం ఉంచాం. డేటాను ఒక చోటికి చేర్చడమే మిగిలిన వారందరి కర్తవ్యం’’ అన్నదే ఆయన నమ్మే మంత్రం. నాదీ అదే బాట. డేటా, దాని విశ్లేషణ పట్ల నాకు అపారమైన గౌరవం. స్టాన్ఫోర్డ్ విడిచిపెట్టాక, నేను నిర్వహించిన ప్రతి పాత్రలోనూ అది నన్ను విజయుడిని చేసింది. డేటా, దాని ననుసరించి తీసుకునే డెసిషన్లు నాకు చాలా ఉపకరించాయి.1. అంతరాత్మ చెప్పినట్లు కూడా నడుచుకోండి!నేను ఇక్కడ నేర్చుకున్న టెక్నిక్కులు, పదిహేనేళ్ళ తర్వాత, ఎస్.ఐ.ఆర్. మోడళ్ళను అర్థం చేసుకోవడంలో సాయపడ్డాయి. ఎస్ అంటే సస్కెప్టిబుల్. వ్యాధికి ఇంకా లోనుకానివారు. దాని బారినపడటానికి అవకాశం ఉన్నవారు. ఐ అంటే ఇన్ఫెకు‡్ష్యవస్. వ్యాధి బారినపడి, దాన్ని ఇతరులకు వ్యాపింపజేసే స్థితిలో ఉన్నవారు. ఆర్ అంటే రికవర్డ్/రిమూవ్డ్. వ్యాధి నుంచి కోలుకుని, శాశ్వత రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నవారు. వారు మరోసారి వ్యాధికి లోనయ్యే అవకాశం లేదు. వ్యాధితో మరణించినవారు కూడా ఇదే వర్గంలోకి వస్తారు. మహమ్మారులు ప్రబలినపుడు జనాభాను ఈ మూడు వర్గాలుగా విభజించి వ్యాధి వ్యాప్తికి ఉన్న అవకాశంపై లెక్కలు కడుతూంటారు. కోవిడ్ కారణంగా నెలల తరబడి లాక్డౌన్లతో బాధపడ్డాక, 2021లో ఒమిక్రాన్ అంటూ కోవిడ్లో కొత్త రకం మొదలైంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఆ వైరస్, బ్రిటన్లో విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. నేను అపుడు బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో, అమెరికా పర్యటనలో ఉన్నాను. ఆందోళన కనబరుస్తూ, హఠాత్తుగా వచ్చిన ఫోన్ కాల్తో, పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని బ్రిటన్కు వెళ్లిపోయాను. మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలంటూ ఒత్తిడి వస్తోంది. డేటా పట్ల సరైన అవగాహన ఉన్నవాడిని కనుక సరిపోయింది. లేకపోతే, నేనూ అదే రకమైన అభిప్రాయాన్ని బలపరచేవాడినేమో. దక్షిణాఫ్రికాలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరాన్ని డేటా సూచించింది. అది నాలో ప్రశ్నలను రేపింది. ‘కానీ’ ఏమైనా అయితే అనే సందేహమూ తొలుస్తోంది. డేటా సరైన పరిష్కారాన్ని సూచిస్తుందని నమ్మేవాడినే కానీ, నేను ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే, డేటా అన్ని వైపుల పరిస్థితిని చూపలేదని ఆషా(అక్షత) నేను గ్రహించేటట్లు చేసింది. లాక్డౌన్ విధిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయి. నాడు 2021 డిసెంబర్లో ఎటూ తేల్చుకోలేని స్థితి. అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే 50 శాతం మంచిదనిపిస్తుంది. వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం 50 శాతం మంచిదనిపిస్తుంది. కేవలం డేటా విశ్లేషణపైనే ఆధారపడి నిర్ణయాలు తీసుకునే పక్షంలో ఆ పని ఎవరైనా చేయగలరు. నాయకుని బల్ల దాకా రానక్కరలేదు. కనుక, డేటాతోపాటు అంతఃకరణపైన కూడా ఆధారపడాలి. అంతరాత్మ ప్రబోధాన్ని కూడా వినాలి. రెండింటిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అక్షతా మూర్తి: రెండవ పాఠం ఆదర్శవాదంతో కనే పెద్ద పెద్ద కలలకు, ఆచరణవాదంతో వేసే చిన్న చిన్న అడుగులకు సంబంధించినది. దీన్ని నేను రిషి నుంచి నేర్చుకున్నాను. నేను ధనికులకు–పేదలకు మధ్య అగాధం ఎక్కువగా ఉన్న దేశంలో పెరిగాను. నా తల్లితండ్రులు విస్తృతమైన మార్పు తీసుకురావాలనే స్ఫూర్తిని అందించారు. స్టాన్ఫోర్డ్లో విధిగా రాయవలసిన మొదటి వ్యాసంలో విద్య, ప్రభావం, సేవల గురించే ఎక్కువ చెప్పాను. మిగిలినవాటన్నింటికన్నా ఆదర్శమే సర్వోత్తమమైనదనే అభిప్రాయం ఉండేది. దానికోసం ఏం చేయదలచుకున్నావు అనే ప్రశ్న రిషి నుంచి ఎదురైంది. వాస్తవికతతో ముడిపెట్టని ఆదర్శాల వల్ల ప్రయోజనం శూన్యమని రిషి అభిప్రాయం. బాహ్య ప్రపంచంలో దైనందిన జీవితంలో స్పష్టంగా కనిపించే చిన్ని అడుగుల ద్వారానే పెద్ద స్థాయిలో రూపాంతరీకరణ సాధ్యమవుతుందని రిషి నుంచి నేర్చుకున్నాను. ఆదర్శాలను వల్లిస్తే సరిపోదు. ఆ దిశగా చిన్న అడుగులైనా వేయడం ప్రారంభించామా లేదా అన్నదే ముఖ్యం.2. ఆచరణాత్మక దృక్పథమూ అవసరమే!జీవితాలను మార్చాలన్నా, సామాజిక చేతనను పెంచాలన్నా చదువు ద్వారానే సాధ్యమని మా ఇద్దరి అభిప్రాయం. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో ఉన్నపుడు, ‘లెసన్స్ ఎట్ 10’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అది బ్రిటన్ నలుచెరగులా యువతను విద్యావంతులను చేసి, వారిలో స్ఫూర్తిని నింపేందుకు చేపట్టిన కార్యక్రమం. రిషి, నేను కలసి ‘రిచ్మండ్ ప్రాజెక్టు’ను కూడా ప్రారంభించాం. గణితాన్ని చూసి బెదిరిపోకుండా యువతలో ధైర్యం నింపడం, వారిలోని సంఖ్యా పరిజ్ఞాన పాటవాలకు మెరుగులు దిద్దడం, ఫైనాన్షియల్ అక్షరాస్యతను పెంపొందించడం ఆ కార్యక్రమం లక్ష్యం. ఆచరణాత్మక దృక్పథం నేను ఒకప్పుడు అమాయంగా భావించినట్లుగా, అది ఆదర్శవాదానికి వ్యతిరేకమైనది కాదు. అది ఆదర్శానికి తోటి భాగస్వామి లాంటిది. పెద్ద పెద్ద కలలను సాకారం చేసుకునేందుకు ఆ రెండూ అవసరమే. రిషి సునాక్: ఫలితం గురించి ఎక్కువగా ఆందోళన చెందకపోవడం మేం నేర్చుకున్న ముఖ్యమైన మూడవ పాఠం. ఈ భావనను సంస్కృతంలో ‘ధర్మం’గా పిలుస్తారు. మనం చేసే పనుల నుంచి ఫలితాలను ఆశించకుండా మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం. నాయకత్వం వహిస్తున్నప్పుడు విజయాలు, వైఫల్యాలు రెండింటినీ చవి చూడవలసి వస్తుంది. ఆ మాటకొస్తే, మనం ఏ రంగంలో ఉన్నా దూషణ భూషణలను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్లిప్తంగా ఎవరి పని వారు చేసుకుపోవాలని నేను చెప్పడం లేదు. విమర్శల పట్ల భయంతో కాక, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాననే భావనతో ఏ పనైనా చేయాలి. 3. విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి!ఆషా నేనూ కలసి గడ్డు కాలాన్ని ఎదుర్కోవడంలో ఈ విద్యుక్త ధర్మ భావన ఎంతో సహాయపడింది. కన్సర్వేటివ్ పార్టీ నాయకునిగా, ప్రధాన మంత్రిగా తిరిగి పరిణమించే ప్రయత్నంలో 2022 వేసవిలో నేను విఫలమయ్యాను. ఎంతో శ్రమపడ్డ తర్వాత కూడా ఫలితం అనుకూలంగా రాకపోవడం బాధ పెట్టింది. కానీ, తర్వాత, అదీ మంచికే అనిపించింది. ఒక సాధారణ పార్లమెంట్ సభ్యునిగా చేయవలసిన పనులపై మరింత దృష్టి పెట్టగలిగాను. ఒక భర్తగా, తండ్రిగా కుటుంబానికి మనుపటికన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగాను. ఆరు వారాలు గడిచాక, నాకన్నా, ముందు ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేశారు. పౌండ్ విలువ వేగంగా పతనమవడం ప్రారంభించింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకుంది. పరిస్థితులను చక్కదిద్దడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ, క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడే దేశానికి సహాయపడటం ధర్మమని ఆషా గుర్తు చేసింది. రెండు రోజుల తర్వాత, ప్రధాని నయ్యాను. ప్రజాహిత రంగంలోనే కాదు ఎక్కడైనా సరే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించేందుకు ముందుకు రావాలి. అంతకుముందున్న పరిస్థితులను లెక్కలోకి తీసుకోకూడదు. అహంకారానికి తావు ఇవ్వకూడదు. జీవితాన్ని సఫలం చేసుకునేందుకు అదొక్కటే మార్గం. మనం సాధ్యమని భావిస్తున్న దానికన్నా ఎక్కువగా సాధించడానికి అది తోడ్పడుతుంది. 10 డౌనింగ్ స్ట్రీట్లో కాపురముండిన మొదటి స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్లం మేమే. కానీ, ఒక ముఖ్యమైన సమయంలో, ఒక ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తించిన చివరివాళ్ళం మేమే కాకూడదని మా ఇద్దరి కోరిక. -
విజయ్ (తమిళ్ స్టార్) రాయని డైరీ
‘‘సీఎం... సీఎం... సీఎం...!’’ ఈస్ట్ కోస్ట్ రోడ్లోని నీలాంగరై బీచ్ హౌస్ బయట నా అభిమానులు చేస్తున్న నినాదాలు పోటెత్తిన వేసవి సాయంత్రపు అలల్లా వచ్చి నన్ను ఢీకొని, చల్లటి చిలకరింపుగా నా ముఖాన్ని తాకుతున్నాయి. ఎంత హాయి! వారి వైపు చూస్తూ చేతులు జోడించాను. ‘‘అలా కాదు తలపతీ, ఇలా...’’ అంటూ వెయ్యి పిడికిళ్లు ఒక్కసారిగా పైకి లేచాయి! వెయ్యిన్నొక్క చెయ్యిగా వారితో నా పిడికిలి కలిపాను. చేతిని గాలిలో ఊపుతూ... ‘‘ఎన్ నెంజిల్ కుడియిరుక్కుమ్’’ అని నేను అంటుండగానే, ‘‘ఎన్ అన్బు రసిగర్గళుక్కు వణక్కమ్’’ అని ఎప్పటిలా వారు నా మాటను చటుక్కున పూర్తి చేశారు! అది నాకూ, వారికి మధ్య ఏర్పడిన పద–బంధం. ‘‘నా హృదయంలో కొలువై ఉన్న...’’ అంటానా, ‘‘నా ప్రియమైన అభిమానులకు నమస్కారాలు...’’ అని వారు అందుకుంటారు.యువ నావికుడికి దారి చూపటానికి చెన్నై నగరం నుంచి బీచ్ ఒడ్డుకు చేరుకున్న వెలుతురు నౌకలా ఉన్నారు వారంతా! ‘‘ధన్యవాదాలు స్నేహితులారా. ఇక చాలు. చీకటి పడుతోంది, క్షేమంగా ఇల్లు చేరండి. మన సోదరీమణులను జాగ్రత్తగా వాళ్ల ఇళ్ల దగ్గర దింపాకే మీరు వెళ్లండి’’ అని విజ్ఞప్తి చేసి లోపలికి వచ్చాను. లివింగ్ రూమ్లోకి రాగానే నిలువెత్తున వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్!! ఈ వీరనారుల ధైర్య సాహసాలకు వారసులైన తమిళ మహిళలనేనా... ‘‘భద్రంగా ఇళ్ల దగ్గర దింపి వెళ్లండి’’ అని నేను నా యువసేనకు బాధ్యతలు అప్పగించింది! నాలో నేను నవ్వుకున్నాను. నాచ్చియార్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన 18వ శతాబ్దపు రాణి! అంజలై అమ్మాళ్ దక్షిణ ఆర్కాట్ స్వాతంత్య్ర సమరయోధురాలు!వారి చిత్రపటాలనే చూస్తూ నిలబడి పోయాను. ఆ పక్కనే ఉన్న పెరియార్, అంబేడ్కర్, కామరాజ్ నవ్వుతూ నా వైపే చూస్తున్నట్లుగా ఉంది! ‘‘విజయ్, ఆల్ ద బెస్ట్ రా... సినిమాల అబ్బాయీ’’ అని నన్ను దీవిస్తున్నట్లుగానూ ఉంది. పెరియార్ ఎన్నడూ సినిమాలను ఇష్టపడలేదు. కానీ పెరియార్ సిద్ధాంతాలు సినిమాలుగా వచ్చాయి! ‘పరాశక్తి’, ‘వేలైక్కారి’, ‘నల్ల తంబి’ ఆయన సిద్ధాంతాల నుంచి తయారైన సినిమాలే. పెరియార్లా అంబేడ్కర్కు సినిమాలపై వ్యతిరేకత లేదు. జీవితాన్ని నవ్వుతూ స్వీకరించటం ఎలాగో సినిమా నేర్పిస్తుంది అనేవారట అంబేడ్కర్! కామరాజ్ కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తరం నాయకులు. సినిమాలను, సినిమా వాళ్లను ఆయన చిన్నచూపు చూసేవారనీ, ‘‘ముఖాలకు రంగులు వేసుకునేవాళ్లు ప్రభుత్వాన్ని ఎలా నడపగలరు?’’ అనేవారనీ విన్నాను. కానీ నడిపారు! సినిమాలకు రాసి, పాడి, అభినయించిన వారు, రాజకీయ నాయకులకు దీటుగా తమిళనాడును నడిపారు. అన్నాదురై సీఎం కావటానికి ముందు నాటక రచయిత. నాటకాల్లో నటించారు; కళైజ్ఞర్ కరుణానిధి సీఎం కావటానికి ముందు స్క్రీన్ రైటర్, పాటల రచయిత; ఎంజీ రామచంద్రన్ సీఎం కావటానికి ముందు సూపర్స్టార్; జయలలిత అమ్మ సీఎం కావటానికి ముందు తమిళ సినిమా సామ్రాజ్ఞి; స్టాలిన్ సర్ కూడా సీఎం కావటానికి ముందు సినిమాల్లో నటించారు. తమిళనాడులో ప్రతి ముఖ్యమంత్రీ సినిమాలతో బంధమో, అనుబంధమో ఉన్నవాళ్లే. రంగుల లోకం నుంచి వచ్చి, ప్రజల జీవితాల్లో కాంతులు నింపినవాళ్లే. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు. ‘‘సీఎం... సీఎం... సీఎం...!’’ అంటూ, నడిరేయిలో లీలగా హోరు వినిపిస్తోంది. నా నీలాంగరై బీచ్ హౌస్ను తాకి వెళుతున్నది అలలా... తమిళ ప్రజల కలలా?! -
వేడెక్కుతున్న వేసవి విడుదులు
దేశంలోని చాలా ప్రాంతాల్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా, జనం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలోని వేసవి విడుదులకు ప్రయాణం కడుతున్నారు. సిమ్లా, కులు, మనాలి, నైనితాల్, ముసోరి, ధర్మశాల వంటి టూరిస్టు కేంద్రాలతోపాటు, పర్వత ప్రాంతాలలోని పుణ్య క్షేత్రాలకు కూడా తరలివెళుతున్నారు.ఏటా ‘చార్ ధామ్’ (బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్ర కూడా వేసవిలోనే మొదలవుతుంది. ఇటీవలి దశాబ్దాలలో ఆ ప్రాంతాలు పర్యావరణ ఉపద్రవాలను చవి చూశాయి. వాతావరణం క్షణానికో రకంగా మార్పులకు లోనవుతోంది. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నేలలు కుంగిపోతున్నాయి. దాంతో అడ్డూఆపూ లేని టూరిజంతో పర్వత ప్రాంతాలపై పడుతున్న ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.సున్నితమైన ప్రాంతాలువివిధ పుణ్య క్షేత్రాలు హిమాలయాల లోపలి ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలు సన్నని లోయలు, హిమానీనదాలు ఏర్పరిచిన పల్లపు ప్రాంతాలతో కూడుకుని ఉన్నాయి. భూగర్భంలోని పలకలు కదులుతూంటాయి. వర్షం పడినా, భూకంపనాలు చోటుచేసుకున్నా ఆ ఒత్తిడికి వాలు ప్రాంతాల్లోని రాళ్ళు కిందకు జారిపడిపోతూంటాయి. ఎతై ్తన కొండ ప్రాంత గడ్డిభూములు, పర్వతాగ్రాలలోని సరస్సులు, పెళుసైన వృక్షజాల ప్రాంతాలు ఆ రకమైన ఒడుదుడుకులను తట్టుకుని తేలిగ్గా కోలుకోగల శక్తి కలిగినవి కావు.అందుకనే, అనాది నుంచి అక్కడ మానవ ఆవాస ప్రాంతాలు తక్కువ. వాతావరణం అనుకూలంగా ఉండే సీజనులో వచ్చే యాత్రికుల వల్ల కూడా అక్కడి జీవావరణ వ్యవస్థ చెదిరిపోతోంది. పెద్ద సంఖ్యలో వచ్చే కార్లు, బస్సులు కాలుష్యానికి కారణమవుతున్నాయి. వ్యర్థ పదార్థాలను సక్రమమైన రీతిలో జారవిడిచే సదుపాయాలు లేవు. పెరుగుతున్న మానవ కార్యకలాపాల (టూరిజం, నిర్మాణ కలాపాలు, భారీ ప్రాజెక్టులు వంటి వాటి) వల్ల హిమాలయాల జీవావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది. కోర్టులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ఒత్తిడి వల్ల ఆ వాస్తవాన్ని విధాన నిర్ణేతలు గుర్తించకపోలేదు. కానీ, క్షేత్ర స్థాయిలో నివారణ చర్యలు అంతంతే.చార్ ధామ్కు వెళ్ళే దినసరి సందర్శకుల సంఖ్యపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఒక పరిమితిని విధిస్తున్నా, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటోంది. ఒక రోజులో బదరీనాథ్కు 1,000, కేదార్ నాథ్కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400లకు మించి యాత్రికులను అనుమతించకూడదని 2021లో నిర్ణయించారు. ఆ యా ప్రాంతాలు తట్టుకోగల శక్తిని బట్టికాక, కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయానికి వచ్చారు. ఈ ఏడాది కూడా, సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను మాత్రం తప్పనిసరి చేశారు. ఎంతమందిని అనుమతించొచ్చు?కేదార్, బదరీ, గంగోత్రి, యమునోత్రి తట్టుకోగలిగిన సామర్థ్యానికి సంబంధించి ‘వీర్ చంద్ర సింగ్ గడ్వాలీ ఉత్తరాఖండ్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ’, ‘జి.బి. పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్’ సైంటిస్టులు 2025లో ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. ఎత్తు, వాలు, వృక్షజాల వ్యాప్తి అనే మూడు కీలక భౌగోళిక సూచికలను ఆధారం చేసుకుని వారు ఆ పత్రాన్ని రూపొందించారు. ఆ నాలుగు మందిరాల వద్ద, వాటి చుట్టుపక్కలనున్న హిమంతో కప్పుకున్న హిమానీనద ప్రాంతాలను విశ్లేషించినపుడు ఆ హిమనదాలు 2002–2020 మధ్యకాలంలో గణనీయంగా కుంచించుకుపోయినట్లు వెల్లడైంది. వాటిలో ఎక్కువగా (ఏడాదికి 22.36 మీటర్ల చొప్పున) గంగోత్రి, యమునోత్రి (ఏటా 20 మీటర్లు), బదరీనాథ్ (ఏటా17.32 మీటర్లు), కేదార్నాథ్ (14.14 మీటర్లు) కుంచించుకుపోతున్నట్లు తేలింది. ఆ నాలుగు ప్రాంతాల్లో (1990–2020 మధ్య కాలానికి సంబంధించి) వాతావరణ డేటాను కూడా విశ్లేషించారు. ఆ ప్రదేశాలన్నింటిలోను, మూడు (వర్షాకాలానికి ముందు, వర్షాకాలంలో, వర్షాకాలం తర్వాత) సీజన్లలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ధోరణి కనిపించింది. నాలుగు ప్రదేశాలు సంరక్షణ ప్రాంతాల లోపల లేదా వాటి చుట్టుపక్కల పరిసరాలలో ఉన్నాయి. బదరీనాథ్ మందిరం ‘నందాదేవి నేషనల్ పార్క్’ పరిధిలోకి; ‘కేదార్నాథ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’ పరిధిలోకి కేదార్నాథ్; ‘గంగోత్రి నేషనల్ పార్క్’ పరిధిలోకి గంగోత్రి; ‘గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ’ పరిధిలోకి యమునోత్రి వస్తాయి. ఆ విశ్లేషణను ఆధారం చేసుకుని చార్ ధామ్ దినసరి సందర్శకుల సంఖ్యపై గణనీయమైన పరిమితి విధించాలని పరిశోధకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒక రోజులో బదరీనాథ్కు (11,833 నుంచి 15,778), కేదార్నాథ్కు (9,833 నుంచి 13,111), గంగోత్రికి (6,133 నుంచి 8,178), యమునోత్రి (4,620 నుంచి 6,160) సందర్శకులను పరిమితం చేయాలని వారు కోరారు. వాహనాల క్రమబద్ధీకరణ, వ్యర్థ పదార్థాల పునర్వినియోగానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు. కొండ ప్రాంతాల్లోని ఇతర నగరాలు, పట్టణాలకున్న భరణ శక్తిని గణించేందుకూ ఈ గ్రూపు అభివృద్ధిపరచిన పద్ధతిని వర్తింపజేసుకోవచ్చు. సిమ్లా కూడా దాని శక్తికి మించి సందర్శకులను భరిస్తున్నట్లు కొన్ని మదింపులలో తేలింది. ఏం చేయాలి?భరణ సామర్థ్యాన్ని శాస్త్రీయమైన రీతిలో మదింపు చేస్తే, సముచితమైన చర్యలు తీసుకునే వీలుంటుందని సుప్రీంకోర్టు 2024 జూన్లో, మొత్తం 13 హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. నగరాలతో సహా వేసవి విడుదులు, పర్యావరణపరంగా సున్నితమైన మండలాల భరణ సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు 2020లోనే మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆ తర్వాత కోర్టుకు తెలియజేసింది. నిపుణుల కమిటీలను నియమించడం లేదా వాయు పరిశీలన పరికరాలను నెలకొల్పడం వంటి పైపై చర్యలకు పరిమితమవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అరకొర విధానాలనే అనుసరిస్తున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలు తమ సమస్యను పరిష్కరించుకునేందుకు సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించుకోవాల్సి ఉంది. లేదంటే నిష్క్రియాపరత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేదార్ నాథ్ వరదల నుంచి జోషీమఠ్ కుంగిపోవడం వరకు ప్రకృతి ఉపద్రవాల పరంపరను ఇప్పటికే చవిచూశాం. తీవ్ర వాతావరణ పరిస్థితులు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటివాటికి పుడమి వేడిమితో ప్రపంచం మొత్తంమీద వాతావరణంలో వస్తున్న మార్పు, ఆ యా ప్రాంతాల్లోని భౌగోళిక స్థితిగతులు కారణం కావచ్చు. కానీ, టూరిజం, పరిమితికి మించి జనం మీదపడడం, ప్రణాళికాబద్ధత లేని పట్టణీకరణ, అడవులను నరికేయడం, భారీ ప్రాజెక్టులు చేపట్టడం వంటి మానవ ప్రేరేపిత చర్యలు ఉపద్రవాలకు మరింత ఊతం ఇస్తున్న సంగతిని మరువకూడదు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
దౌత్యమా... ఇంకా దాదాగిరీయేనా?
మొదటి విడత చర్చలు ఏప్రిల్ 12న విఫలమై, రెండవ విడతకు ముహూర్తమైనా కుదరని స్థితిలో, తాను దౌత్యానికి మారదలచుకున్నారా లేక దాదాగిరీ పద్ధతిలోనే కొనసాగుతారా అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చుకోవలసి ఉంది. లేదంటే ఇరాన్తో మళ్ళీ చర్చలు గానీ, సమస్య పరిష్యారం గానీ జరిగే సూచనలు లేవు. రెండవ విడత కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తుండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్లామాబాద్కు ఏప్రిల్ 24, 25వ తేదీలలో వెళ్ళి చర్చల పునరారంభానికి తమ షరతులేమిటో చెప్పి తిరిగిపోవటం, తమ ప్రతినిధుల ప్రయాణాన్ని ట్రంప్ అకస్మాత్తుగా రద్దు చేయటాన్ని బట్టి అర్థమవుతున్నది ఇదే. అరాగ్చీ ప్రతిపాదించిన షరతులేమిటో అధికారికంగా వెల్లడి కాలేదు గానీ, అవి గతానికన్నా భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. అసలు విషయం అది కాదు. ఇరాన్కు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్ల లక్ష్యాలు మారటమన్నది మౌలిక ప్రశ్న. ఒకసారి అది తేలితే ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో రాజీలు కుదరటం సాధ్యమవుతుంది. మొదట్నుంచీ అదే వైఖరిఈ మాట అనటం ఎందుకంటే, ఇరాన్ పట్ల దౌత్యానికి బదులు దాదాగిరీ వైఖరిని తన మొదటి విడతలోనే (2017–21) ప్రదర్శించిన ట్రంప్, ఈ రెండవ విడతలోనూ అదే పని చేస్తున్నారు. ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగానే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్తో కలిసి దాడులు ఆరంభించటం మొదలుకొని, మొదటి విడత చర్చల వైఫల్యం మీదుగా ఈ రెండవ విడత చర్చల అనిశ్చితి వరకు తను చూపుతున్నది ఆసాంతం దాదాగిరీయే. తమ అసమానమైన ఆర్థిక, సైనిక శక్తులు మినహా ఆయన నోటి నుంచి మరొక మాట వినిపించదు. వాటిని ఉపయోగించి ఇరాన్ సహా ఎవరినైనా సర్వనాశనం చేయగలమంటారు. ఇందులో దౌత్య విధివిధానాలు ఆవగింజంతయినా కనిపిస్తున్నాయా?ట్రంప్లో దౌత్య నీతి లక్షణాలుంటే, యురేనియం శుద్ధి విషయమై ఇరాన్, అమెరికాల మధ్య (రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో కలిపి) 2015లో కుదిరిన ఒప్పందం సజావుగా సాగుతుండగా 2018లో దానిని అకస్మాత్తుగా రద్దు చేసేవారు కాదు. ఇరాన్పై యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఎంత ఒత్తిడి చేసినా బుష్, ఒబామా, బైడెన్లు నిరాకరించిన స్థితిలో, తాను దాడులకు సిద్ధమయ్యేవారు కాదు. పరిష్కారం లభించవచ్చుననుకున్న ప్రతి దశలోనూ ఆ అవకాశాలను ఇజ్రాయెల్ భంగపరుస్తుండగా మౌనం వహించేవారు కాదు. వాస్తవానికి దాదాగిరీ లక్షణాన్ని ఆయన చూపుతున్నది ఇరాన్ విషయంలోనే కాదు. రెండవసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పనామా కాలువ, కెనడా, గ్రీన్ల్యాండ్, వెనిజులా విషయమై చేసిందేమిటో తెలిసిందే. యుద్ధాలు ఆపే ప్రతిజ్ఞలు చేసిన మనిషి, 9 యుద్ధాలు ఆపానంటూ ఇప్పటికి కొత్తగా 8 సైనిక దాడులు సాగించారు. టారిఫ్లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాల అరాచకం సరేసరి. ఇందులోనూ గమనించదగ్గ విశేషం ఒకటున్నది. తన పులి చారలు, కోరలను అనునిత్యం ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టజూసే ఆయనలో ‘కాగితం పులి’ లక్షణాలు కూడా ఉన్నాయి. అది, బలహీనుల ముందు విజృంభించి బలవంతుల ఎదుట తగ్గి ఉండటం. పనామా, వెనిజులా విషయంలో జరిగింది ఒకటైతే, తనను ధిక్కరించిన కెనడా, గ్రీన్ల్యాండ్ (యూరప్), బ్రెజిల్, దక్షిణాఫ్రికాల సంగతి వేరయ్యింది. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాను లొంగదీయలేక తానే రాజీకి ప్రయత్నిస్తున్నారు. చైనా మాట అయితే చెప్పనక్కరలేదు. ఇరాన్ ప్రతిఘటనలు మరొక దృష్టాంతం.పరిష్కారానికి రాజమార్గంకొంత లోతుకి వెళ్ళినట్లయితే, ట్రంప్ ద్వారా ప్రదర్శితమవుతున్న ఈ లక్షణాలన్నీ అమెరికా సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడుతూ... దానికి స్లో–మోషన్ సంకేతాల వంటివి. అమెరికన్ నాయకత్వపు ‘నాటో’ కూటమిలోనే పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు, కనీసం ఇరాన్ దిగ్బంధానికైనా ఏ ఒక్కరూ కలిసి రాకపోవటం, మరొక స్థాయిలో బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలు విస్తరిస్తుండటం ఈ మార్పులను ప్రతిఫలిస్తున్నాయి. ఈ పలు విధాలైన పరిణామాల దశలో ఇరాన్ ఒక హీరోలా లేచి నిలుచున్నది. అందువల్ల అమెరికా అధ్యక్షుడు వాస్తవాలను కనీసం ఇప్పటికైనా గుర్తించి, ఇజ్రాయెల్ ప్రభావం నుంచి బయటపడి, దౌత్యమార్గం వైపు మళ్లటం మంచిదవుతుంది. తమ సార్వభౌమతను, హక్కులను కాపాడుకునేందుకు ఇరాన్ చూపుతున్న దృఢ సంకల్పం, ప్రతిఘటన సాధారణమైనవి కావు. మనం స్వయంగా చూసినంతవరకు వియత్నాం(1955–75), అఫ్గానిస్తాన్(2001–21) తర్వాత, 1953 నుంచి మొదలై నేటికీ సాగుతున్న ఇరాన్ పోరాటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. యురేనియం శుద్ధి తదితర అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతుండగానే అకస్మాత్తుగా దాడులు జరిపి ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వాలను నిర్మూలించటం నుంచి మొదలు కొని, ఇరాన్ రేవులను దిగ్బంధించటం వరకు గల క్రమం అంతా చూపుతున్నది అమెరికా దౌత్య నీతినా లేక బస్తీ రౌడీ లక్షణాలనా? ఇరాన్ రెండవ విడత చర్చలకు నిరాకరించటమే సరైనదని భావించక తప్పదు. విదేశాంగ మంత్రి అరాగ్చీ ఇస్లామాబాద్లో 25వ తేదీన మరోమారు అన్నమాట: అమెరికాకు విశ్వసనీయత లేకుండా పోయిందనీ, అది కుదిరేవరకు తాము చర్చలకు వెళ్లబోమనీ, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనీ. ఆ తర్వాత ఒమాన్, రష్యా సందర్శనల వెనుక ఆయన తెహ్రాన్కు తిరిగి వెళ్ళి అన్ని పరిస్థితులను సమీక్షించుకున్నపుడు, వైఖరి అంటూ మార్చుకోవలసింది స్వదేశంలోనూ విశ్వసనీయతను కోల్పోతున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని అర్థమవుతుంది. సమస్య పరిష్కారానికి రాజమార్గం ఎదుటనే ఉంది. అది అంతర్జాతీయ నిబంధనల మేరకు అణుశుద్ధికి ఇరాన్కు గల హక్కులకు అడ్డుచెప్పకపోవటం, పాలస్తీనా సృష్టిని అంగీకరించటం, గ్రేటర్ ఇజ్రాయెల్ పథకాన్ని రద్దు చేయటం!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
50 శాతం ఫార్ములాతో దక్షిణాదికి మేలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా 1996 సెప్టెంబర్ 13న మహిళా ఎంపీలందరూ పార్టీలకతీతంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఏకతాటిపైకి వచ్చారు. లోక్సభలో ఈ విషయంపై గళమెత్తారు. మహిళా బిల్లును జాయింట్ కమిటీకి పంపడంపై దివంగత నేత సుష్మా స్వరాజ్ ‘దేశ మహిళలపై జరిగిన భారీ కుట్ర’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లును జాయింట్ కమిటీకి పంపి వెంటనే లోక్ సభను రద్దు చేశారు. దీంతో మళ్లీ మహిళా బిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి 27 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. మోదీ ప్రభుత్వం 2023లో ‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లు తీసుకొచ్చింది. 2034 నాటికి రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉండగా, 2029 నాటికే మహిళలకు హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి, రాజ్యాంగ సవరణ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం చూసింది. కానీ, స్వార్థ రాజకీయ కుట్రల వల్ల దేశ జనాభాలో 50%గా ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించి, డీలిమిటేషన్ ద్వారా మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం చేజారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ఈ రెండు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినవి. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలపరచడం– ఇవి రెండూ దేశ భవిష్యత్తును నిర్ధారించే కీలకమైన అంశాలు.దాదాపు 3 దశాబ్దాలుగా ఈ బిల్లును తీసుకురావాలని, మహిళా లోకానికి సాధికారత కల్పించాలని చర్చోపచర్చలు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు దీన్ని అడ్డుకున్నాయి. 1996లో దేవేగౌడ హయాంలో... ఆ తర్వాత 1998, 1999, 2002లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది. ఎన్డీయే ఒత్తిడితో యూపీఏ హయాంలో 2008–10 మధ్యలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా, తమ మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్ది. అనవసర దుష్ప్రచారండీలిమిటేషన్పై చర్చలు మొదలైనప్పటినుంచే, విపక్షాలు దక్షిణాదిపై ఎక్కడలేని ధృతరాష్ట్ర ప్రేమను కురిపించాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. కాంగ్రెస్ ఆడిన ఈ నాటకానికి డీఎంకే, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు వంతపాడాయి. దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయమని ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెప్పినా దుష్ప్రచారం ఆగలేదు.అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% సీట్లు పెంచేందుకు తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న 129 సీట్లు 50% పెరిగి 195 సీట్లకు చేరే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 26కు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి పెరిగేందుకు వీలుండేది. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెంచేలా మోదీ సర్కారు సరికొత్త ఫార్ములాను రూపొందించింది. దీని ద్వారా దక్షిణాది సీట్లకు ‘జనాభా ప్రాతిపదికన’ నష్టం జరగకుండా, ఆ మాటకొస్తే ప్రత్యేకమైన లాభం జరిగేలా ఈ ఫార్ములా మేలు చేకూర్చేది. దీనివల్ల ఆ యా పార్టీలకు ఏం ఒరిగిందో తెలియదు కానీ... 70 కోట్ల మంది మహిళలకు, 30 కోట్ల మంది దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచే అవకాశాన్ని కూడా కాంగ్రెస్, వారి మిత్ర పక్షాలు దెబ్బకొట్టాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఎస్సీలకు 21 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు రిజర్వేషన్లుండగా... 50% సీట్లను పెంచితే, ఎస్సీలకు 32 స్థానాలు, ఎస్టీలకు 8 స్థానాలు దక్కేందుకు వీలుండేది. అలాచేస్తే దక్షిణాదికి నష్టంమహిళా బిల్లు విషయంలోనే కాదు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాల విషయాల్లోనూ కాంగ్రెస్ ఇలాగే వ్యవహరించింది. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు, ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిసినా వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి దేశ సమగ్రతను బలపరిచే ప్రయత్నం చేసినప్పుడూ వ్యతిరేకించింది. రైతుల అభివృద్ధి కోసం తెచ్చిన సంస్కరణలను రాజకీయ కారణాలతో వ్యతిరేకించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థంలేని కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు. దీని ప్రకారం... తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 15కు తగ్గుతాయి. ఇది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయం. రేవంత్ రెడ్డి ఫార్ములా ప్రకారం తెలంగాణే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోతాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కాకుండా, ఈ ఫార్ములా ప్రకారం... ఏపీ 16 సీట్లు, తెలంగాణ 11 సీట్లు, కర్ణాటక 16 సీట్లు, కేరళ 16 సీట్లు, తమిళనాడు 27 సీట్లు... ఇలా మొత్తం దక్షిణాది రాష్ట్రాలు 86 సీట్లు నష్టపోనున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళలు చైతన్యవంతులు. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది. మహిళల గౌరవం, దేశ సమగ్రత, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. జి.కిషన్ రెడ్డివ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి -
దక్షిణాదికి ద్రోహం చేసిన విపక్షాలు
‘‘నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికీ, ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువను కల్పించడానికీ ఉద్దేశించినది. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రజల గొంతుక పార్లమెంటులో బలంగా వినిపించాలంటే డీలిమిటేషన్ అవసరం. ఏ ఒక్క రాష్ట్రానికి, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూనే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం.’’ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన స్థిర సంకల్పం ఇది. కానీ ఏం జరిగింది? మోదీని ఓడించామన్న వికృతానందం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. వారు చెప్పింది దక్షిణాదికి అన్యాయం జరగకుండా చేశామని! వాస్తవంలో దక్షిణాదికి అన్యాయం చేశారు. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే దారుణంగా నష్టపోయేది దక్షిణాదినే. ఏ మాత్రం నిష్పత్తి తగ్గకుండా, పార్లమెంట్ సీట్లు పెంచే 50 శాతం ఫార్ములాను కాలదన్నిన కాంగ్రెస్ తీరుతో దక్షిణాది సమస్యలను ఎదుర్కోబోతోంది. భారతదేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయగల ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఇప్పుడు మళ్లీ ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి బిల్లులో లోక్సభ సీట్ల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఉంది. అప్పటివరకూ ఆగకుండా ముందుగానే దక్షిణాదికి న్యాయం చేస్తూ డీలిమిటేషన్ ద్వారా 2029లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని చట్టం చెబుతోంది. ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం ద్వారా విపక్షాలు దక్షిణాది గొంతు కోస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంక్షోభంలో ప్రాతినిధ్య వ్యవస్థభారత ప్రజాస్వామ్య సౌధానికి పునాది వంటి ప్రాతినిధ్య వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఖరారైన 543 లోక్సభ స్థానాల సంఖ్యను నాటి 54.8 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అప్పట్లో సగటున ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించేవారు. గత ఐదు దశాబ్దాల్లో దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగి 145 కోట్లకు చేరుకున్నా, పార్లమెంటులోని సీట్ల సంఖ్య స్తబ్ధుగా ఉండిపోయింది. దీనివల్ల నేడు ఒక్కో ఎంపీ సుమారు 26.70 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ప్రపంచంలోని మరే ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ఒక ప్రజా ప్రతినిధిపై ఇంతటి జనాభా భారం లేదు. ఇది ఓటరుకు, ప్రతినిధికి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కూడా నీరుగారుస్తోంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను 2001 వరకు మార్చకూడదని స్తంభింపజేశారు. జనాభా నియంత్రణ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదనేది నాటి ప్రధానఉద్దేశ్యం. ఆ తర్వాత 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గడువును మరో 25 ఏళ్లు పొడిగించి 2026 వరకు మార్చకూడదని నిర్ణయించారు. ఈ సుదీర్ఘ కాలంలో అనేక కొత్త జిల్లాలు, పట్టణాలు రూపుదిద్దుకున్నా, నియోజకవర్గాల సరిహద్దులు పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించకపోవడం వల్ల ఓటు విలువలో భారీ వ్యత్యాసాలు తలెత్తాయి. ఒక నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరో చోట 30 లక్షల మంది ఉండటం ప్రాతినిధ్య సమానత్వానికి విరుద్ధం. ఈ స్తబ్ధతను బద్దలు కొట్టాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. 2026తో ఈ గడువు ముగియనుండటంతో, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం. ఇది సీట్ల పెంపు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పునర్నిర్మాణ ప్రక్రియ.దక్షిణాదికి న్యాయం జరగాలంటే...మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో ఆమోదం పొందితే సరిపోదు. అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా అమలు కావాలంటే శాస్త్రీయమైన పునర్విభజన ప్రక్రియ కీలకం. రాజ్యాంగంలోని 128వ సవరణ స్పష్టంగా చెబుతున్నట్లుగా, ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించాలి. ఏయే నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలి, వాటిని రొటేషన్ పద్ధతిలో ఎలా మార్చాలి అనే అంశాలు ఊహాజనితంగా కాకుండా, జనాభా లెక్కల ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఈ క్రమానుగత ప్రక్రియను విస్మరించి రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం రాజ్యాంగబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే విపక్షాల వాదన ఆకర్షణీయంగా అనిపించినా, అది ఆచరణలో సమస్యలను సృష్టిస్తుంది. భారత సమాఖ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడటం, జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం మన పార్లమెంటులో సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, అది దక్షిణాది రాష్ట్రాల పాలిట రాజకీయ మరణ శాసనంగా మారుతుందనడంలో సందేహం లేదు. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడంలో విఫలమైన రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక సీట్లు కేటాయించడం అంటే, క్రమశిక్షణతో వ్యవహరించిన దక్షిణాదిని శిక్షించడమే అవుతుంది. ఈ అసమానతను తొలగించడానికి 50 శాతం పెంపు ఫార్ములా ఏకైక పరిష్కార మార్గం. ఈ విధానం ప్రకారం, జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లను నేరుగా 50 శాతం పెంచుతారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య పొలిటికల్ రేషియో ఏమాత్రం మారదు. జనాభా లెక్కల ప్రకారం వెళ్తే తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్ (+13), తెలంగాణ (+9), తమిళనాడు (+20), కర్ణాటక (+14), కేరళ (+10) రాష్ట్రాలకు ఈ ఫార్ములా ద్వారా గణనీయమైన అదనపు సీట్లు లభిస్తాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వానికి అసలైన రక్షణ కవచం. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అవసరం. సీట్ల సంఖ్యను పెంచకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అది మరిన్ని చిక్కులకు దారితీస్తుంది. సీట్ల సంఖ్యను పెంచి, అందులో మహిళలకు సీట్లు కేటాయించడం ద్వారా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తర్కాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ విద్వేషంతో విపక్షాలు పునర్విభజనను అడ్డుకున్నాయి. జనాభా నియంత్రణ అనే దేశభక్తిని పాటించినందుకు దక్షిణాదికి రాజకీయ శిక్ష పడకుండా అడ్డుకోవాల్సిన చారిత్రక బాధ్యతను కాంగ్రెస్, డీఎంకే లాంటి పార్టీలు విస్మరించాయి.ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు -
చైతన్యంతోనే డిజిటల్ మోసాలకు చెక్
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఎంత వేగంగా విస్తరిస్తోందో, అదే స్థాయిలో డిజిటల్ మోసాలు ప్రబలుతున్నాయి. 2021లో నమోదైన డిజిటల్ మోసాల సంఖ్య 2.6 లక్షలు కాగా, నష్టం రూ. 551 కోట్లు. అదే 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 28 లక్షల కేసులకు, నష్టం దాదాపు రూ. 23,000 కోట్లకు పెరిగింది. ఈ సమస్యను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు ప్రతిపాదనలతో కూడిన ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై మే 8 లోగా అభిప్రాయాలను తెలియజేయాలని పౌరులను కోరింది. ఆర్బీఐ ఉద్దేశం మంచిదే. కానీ కొద్దిమంది మోసగాళ్లను పట్టుకోవడానికి కోట్లాది మంది సామాన్య ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేసేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. నేటి డిజిటల్ మోసాలన్నీ సిస్టమ్ హ్యాక్ చేయడం వల్లనో, పాస్వర్డ్లు దొంగిలించడం వల్లనో జరిగేవి కావు. సీబీఐ ఆఫీసర్లమని బెదిరించి హైదరాబాద్లో ఒక వృద్ధురాలి జీవితకాల పొదుపును కాజేస్తున్నారు. కస్టమ్స్ అధికారి అని చెప్పి ఒక 30 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర 2, 3 దఫాలుగా రూ.80,000 దోచేశాడు ఇంకో ప్రబుద్ధుడు. అవగాహన లేని సామాన్యులను భయాందోళనకు గురిచేసి మోసగాళ్లు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు.‘ఒక గంట నిలుపుదల’ సమంజసమా? రూ. 10,000 దాటిన ప్రతి ఒక్కరి వ్యక్తిగత లావాదేవీలను, అలాగే చిన్న వ్యాపారుల ఖాతాలకు వెళ్లే డబ్బును ఒక గంట పాటు నిలిపివేయాలని ఆర్బీఐ మొదటి ప్రతిపాదన సూచిస్తోంది. మోసగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ గంట సమయం ఉపయోగపడుతుందని ఆర్బీఐ ఆలోచన. కానీ, ప్రతిరోజూ సరుకుల కోసం పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి సప్లయర్లకు డబ్బు పంపే చిన్న వ్యాపారి పరిస్థితి ఏమిటి? వెంటనే జరిగే యూపీఐ లావాదేవీలే అప్పుడప్పుడు ఒక రోజు కూడా తీసుకుంటాయి. అలాంటిది అధికారంగా గంట నిలుపుదల చేస్తే ఇంకా ఎంత సేపు వేచి చూడాల్సి వస్తుందో! టెక్నాలజీలో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు స్థాయికి చేరుకున్న మనం, ఎవరో కొందరు మోసగాళ్లను అరికట్టాలని అందరినీ ఇలా 2 దశాబ్దాల వెనక్కు తీసుకువెళ్లి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు?ఆర్బీఐ 10,000 రూపాయలు దాటిన ప్రతి ఒక్క లావాదేవిని నిలిపివేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మోసగాళ్లు పలు దఫాలుగా 9,999 పంపీయమని అడగొచ్చు. అప్పుడు ఆర్బీఐ రెండవ 9,999 లావాదేవీని నియంత్రిస్తుందా? దీనివల్ల ప్రజలు మళ్లీ నగదు లావాదేవీలు నిర్వహించే ఆస్కారం లేకపోలేదు. ఇది భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా సిద్ధాంతానికి విరుద్ధం. దీనికి ప్రజలను చైతన్యవంతులను చేయడమే అసలైన పరిష్కారం. ప్రాంతీయ భాషల్లో ‘జాతీయ మోసాల అవగాహన పరీక్ష’ను ప్రవేశపెట్టాలి. ఎలాంటి సమస్య అయినా అవగాహనతో పరిష్కారం అవుతుంది. మ్యూల్ ఖాతాలకు మొదట్లోనే అడ్డుకట్టకరెంటు ఖాతాల వార్షిక జమ పరిమితిని రూ. 25 లక్షలకు కుదించడం, అంతకు మించితే ఖాతాను స్తంభింపజేసి విచారణ జరపడం ఆర్బీఐ మూడో ప్రతిపాదన. ఈ నిబంధన వల్ల నేరస్థుల కంటే సామాన్య కాంట్రాక్టర్లు, ఐటీ డెవలపర్లు, చిరు వ్యాపారులే ఎక్కువ నష్టపోతారు. ఇప్పటికే కరెంటు ఖాతా ప్రారంభించడానికి చిన్న మధ్య తరహా వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఖాతాలు ఫ్రీజ్ చేసే విచక్షణాధికారం బ్రాంచ్ అధికారుల చేతిలో పెడితే, అది సామాన్యుల పట్ల వేధింపులకు దారితీస్తుంది. ఇది భారత ప్రభుత్వం చెప్తున్న సులభతర వ్యాపార విధానానికి విరుద్ధం. నూతన వ్యాపార ఖాతాలకు ఆన్లైన్ పోలీస్ వెరిఫికేన్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేయాలి. అప్పుడు నేర చరిత్ర ఉన్న మోసగాళ్లు గేటు వద్దే ఆగిపోతారు. వాళ్లకు సహకరిద్దామనే మ్యూల్ అకౌంట్ నిర్వాహకులు పోలీసులపై ఉండే సహజమైన భయంతో అకౌంట్ల నిర్వహణకు ముందుకు రారు. నిజమైన వ్యాపారులకు ఖాతాలు సులభంగా లభిస్తాయి.వృద్ధులకు కావలసింది గౌరవం, సంరక్షకుడు కాదు!70 ఏళ్లు పైబడిన వారు రూ. 50,000కు మించి లావాదేవీ చేయాలంటే కుటుంబ సభ్యుల (నమ్మదగిన వ్యక్తి) అనుమతి తప్పనిసరి చేయడం మరో ప్రతిపాదన. ఈ నిబంధన వారిని కుటుంబ సభ్యుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తుంది. మన సమాజంలో వృద్ధులు కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఆర్థిక మోసాలకు గురవుతున్న సందర్భాలు అనేకం. దీనికి బదులుగా, ‘లైసెన్స్డ్ ట్రస్టెడ్ అథెంటికేటర్ సర్వీస్’ను నామమాత్రపు రుసుముతో ప్రవేశపెట్టాలి. దారిద్య్ర రేఖ దిగువ ఉన్నవాళ్లకు ఈ సేవ ఉచితంగా అందించాలి. వీరు వృద్ధులతో వారి సొంత భాషలో మాట్లాడి లావాదేవీని ధ్రువీకరించాలి. అప్పుడు వృద్ధుల ఆత్మగౌరవం దెబ్బతినదు. ఈ నూతన సేవ వల్ల ఇంకొన్ని ఉద్యోగాలు సృష్టించినట్టు కూడా అవుతుంది.డిజిటల్ మోసాల సమస్య తీవ్రత దృష్ట్యా ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు అవసరమే. కానీ, అవి సామాన్యుల స్వేచ్ఛను హరించకూడదు. ప్రజలకు సరైన సాధనాలు అందిస్తే, వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని విధాన నిర్ణేతలు విశ్వసించాలి.– బూరుగుపల్లి మఠం అఖిల్ ‘ యువ ఆంట్రప్రెన్యూర్ -
మూడు విశ్వాసాల కేంద్రం
ఇటీవలి ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల్లో కొంతకాలం నిర్బంధాలకు గురైన జెరూసలేం నగరంలోని ప్రార్థనా స్థలాలు, కాల్పుల విరామ సమయంలో మళ్లీ తెరుచుకున్నాయి. ‘వెయిలింగ్ వాల్’గా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోడ వద్ద యూదులు; అల్–అఖ్సా మసీదులో మహమ్మ దీయులు; పరిశుద్ధ సమాధి ఆలయంలో క్రైస్తవులు– ఇలా మూడు ముఖ్య మతాలవారూ ఒకేసారి ప్రార్థనలు చేస్తున్న ఈ చిన్న నగరం ఎందుకు ప్రపంచాన్ని ఇంతలా ఆకర్షిస్తోంది? యుద్ధ మేఘాల మధ్య కూడా ఆధ్యాత్మిక ఆకర్షణను ఎలా నిలబెట్టుకోగలుగుతోంది?క్రీ. పూ. 1000 ఏళ్ల ప్రాంతంలో పాత ఇశ్రాయేలును పాలించే యూదురాజు దావీదు ‘జెబూసులు’ అనే స్థానిక తెగల నుంచి జెరూసలేం నగరాన్ని జయించి, దానిని ఏకీకృత ఇశ్రాయేలు రాజ్య రాజధానిగా చేశాడు. అతని కుమారుడు సాలమన్ ఆ నగరంలో నేడు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తున్న కొండపై మొట్ట మొదటి యూదు ఆలయం నిర్మించాడు. ఆ ఆలయాన్ని తరువాతి కాలంలో బాబిలోనియన్లు, ఆ తరువాత రోమన్లు ధ్వంసం చేశారు. మిగిలిన అవశేషమైన గోడను ఈ రోజు ‘ఏడ్పుల గోడ’గా పిలుస్తున్నారు. మూడు వేల సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ కొండ, దానిపై ఒకప్పుడున్న ఆలయం గుర్తుగా మిగిలిన అవశేషం యూదులకు పరమ పవిత్రమైన ప్రార్థనా స్థలాలు.క్రైస్తవ మతానుయాయులకు, జెరూసలేం యేసుక్రీస్తు జీవితంతో ముడిపడి ఉంది. యేసు ఇక్కడే బోధించాడు, శిలువ వేయబడ్డాడు, పునరుత్థానం చెందాడు. నాలుగవ శతాబ్దంలో ‘పరిశుద్ధ సమాధి’ నిర్మాణంతో ఇది క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మారింది. ‘గోల్గతా’ లేదా ‘కల్వరి’గా పిలిచే శిలువ వేయబడిన స్థలం, క్రీస్తు సమాధి అయ్యి పునరుజ్జీవం పొందిన అనంతరం ఖాళీ అయిన సమాధి, శిక్షాస్థలి నుండి శిలువ వరకు క్రీస్తు నడిచి వెళ్ళిన ‘వేదన మార్గం’ (లేదా డోలోరోసా), సమాధికి వెళ్ళే మార్గంలో, క్రీస్తు అనుభూతులను జ్ఞప్తికి తెచ్చే 14 ముఖ్య ప్రాంతాలు– క్రైస్తవులకు పరమ పూజనీయాలు.ముస్లింలు అల్–ఖుద్స్గా పిలుచుకునే జెరూసలేం నగరం వారికి మక్కా, మదీనాల తరువాత అత్యంత పవిత్రమైన స్థలం. ఇస్లాం మొదటి రోజుల్లో జెరూసలేం వైపే ఖిబ్లా, అంటే ‘నమాజు చేసే దిక్కు’ ఉండేది; తరువాతి రోజుల్లో కారణాంతరాల వల్ల ఈ దిక్కు మక్కాలోని ‘కాబా’ వైపునకు మారింది. మహమ్మద్ ప్రవక్త ఒక రాత్రి మక్కా నుంచి జెరూసలేం వచ్చి; హరామ్ అల్ షరీఫ్ (అదే ప్రాంతాన్ని యూదులు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తారు)లోని ‘పునాది శిల’ నుంచి స్వర్గారోహణ చేశాడని మహమ్మదీయులు విశ్వసిస్తారు. అదే శిలపై తరువాతి కాలంలో నిర్మించబడిన ‘రాతి గుమ్మటం’, దాని పరిసరాలలోని ‘అల్–అఖ్సా మసీదు’... ఇవన్నీ మహమ్మదీయులకు ఎనలేని ప్రాధాన్యం కలిగిన స్థలాలు. మహమ్మద్ ప్రవక్త స్వర్గారోహణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన ఇస్రా, మిరాజ్లకు కూడా ఈ ప్రాంతం కేంద్ర బిందువు.ఒకే మూల పురుషుడుఆరాధనా స్థలాలలోనే కాదు, ఆవిర్భావంలో కూడా ఈ మూడు మతాలకు విశేషమైన సారూప్యత, సామీప్యత ఉన్నాయి. ‘ఒకే దైవం’ అనే సిద్ధాంతాన్ని విశ్వసించి, బోధించిన ప్రప్రథమ ప్రవక్త ‘అబ్రహమ్’ లేదా ‘ఇబ్రహీమ్’. ఆ ప్రవక్త కుమారుడైన ఇసాక్కు జాకబ్ జన్మించాడు. ‘ఇజ్రాయెల్’ అనే దైవదత్త నామాంతరం కలిగిన జాకబ్ నుండి యూదులు ఉద్భవించటంతో, వారి ప్రాంతం ‘ఇజ్రాయెల్’గా పేరొందింది. జన్మతః యూదు మతస్థుడైన క్రీస్తు మరణానంతరం... ఆయనను విశ్వసించే యూదు సమూహం వారి అసలు మతాన్నుండి విడివడటంతో క్రైస్తవులుగా వారిని పిలుస్తున్నారు. అబ్రహమ్ మరో కుమారుడైన ఇస్మాయిల్ నుండి ఇస్లాం ఆవిర్భవించిందని విశ్వసిస్తారు. ఇలా ఒకే మూల పురుషుడు గలిగిన మూడు మతాలవారు, ఒకే భౌగోళిక ప్రాంతంలో తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా ప్రార్థనలు నిర్వహించడం అసాధారణం కాదు.ఒకే ప్రవక్త నుండి ఉద్భవించి, ఒకే చరిత్రను పంచుకోవడం వల్ల జెరూసలేం మూడు మతాలవారికీ ముఖ్య కేంద్రంగా ఖ్యాతికెక్కింది. చిత్రంగా, అదే చారిత్రక వాస్తవం శతాబ్దాలుగా సంఘర్షణలకు, ఉద్రిక్తతలకు – ఒక్కోసారి మానవ హననానికి కూడా కారణమవుతోంది. యుద్ధ విరామంలో ఈ పవిత్ర స్థలం తిరిగి అందరినీ అక్కున జేర్చుకోవడం సుస్థిరమైన శాంతిని స్థాపించే సుదీర్ఘ ప్రస్థానంలో చిన్న ఆశాకిరణం.కృష్ణబాలాజీ పల్లపోతువ్యాసకర్త ఎస్బీఐలో, పశ్చిమాసియా దేశాల్లో విధులు నిర్వహించిన విశ్రాంత ఉన్నతాధికారి -
నితిన్ నబిన్ (బీజేపీ అధ్యక్షుడు) రాయని డైరీ
పనంటే పూర్తయ్యేది కాదు. మొదలయ్యేది! ఇది మానవజన్మ సుకృతమా, లేక, మోదీజీ నాయకత్వానికి మాత్రమే పరిమితమైన శ్రమైక జీవన సౌందర్యమా?! ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్. ఆ రోజుతో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలూ పూర్తయినట్లు. ఎన్నికలు ‘పూర్తవడం’ అన్నది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కే గానీ, భారతీయ జనతా పార్టీ చీఫ్కి కాదు. పనితో మొదలై, మళ్లీ పనితోనే మొదలయ్యే ఆదీ అంతమూ లేని పదవీ కాలం బీజేపీ అధ్యక్షుడిది. అధ్యక్షుడిదే కాదు, పైనుంచి కింది వరకు పార్టీలోని ప్రతి కార్యకర్తదీ. జనవరిలో నేను జాతీయ అధ్యక్షుడిగా పనిలో పడ్డాక తొలిసారి జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలివి. ఉన్నచోట ఉన్నట్లు లేదు. తిన్న చోట తిన్నట్లు లేదు. పనే, నా కాలమూ దూరము, వేగము.మొత్తం 34 రోజులు, 65 రోడ్ షోలు! పశ్చిమ బెంగాల్లో 11 రోజులు, 22 రోడ్ షోలు; అస్సాంలో 9 రోజులు, 18 రోడ్ షోలు; కేరళలో 7 రోజులు; 12 రోడ్ షోలు; తమిళనాడులో 5 రోజులు; 8 రోడ్ షోలు; పుదుచ్చేరిలో 2 రోజులు, 5 రోడ్ షోలు. పనిలో ఉన్నవారికి అలసట ఉండదు. ప్రజల మధ్య ఉన్నవారికి భూమీ, ఆకాశం; బిహార్, ఢిల్లీ ఉండవు. బాలుర్ఘాట్లో ప్రచారం చేస్తున్నప్పుడు బాలకృష్ణుడి చేతి నిండా వెన్న ముద్ద పెట్టినట్లుగా, బెంగాల్ ప్రజలు ప్రతిచోటా నాకు తియ్యటి ‘మిష్టీదోయి’ తినిపించారు. నా గుండె నిండింది కానీ... గొంతు గడ్డ పెరుగు అయింది. 24 పరగణాల జిల్లాలోని నైహతిలో కూడా మిష్టీదోయిని నా నోటికి అందివ్వ బోయిన వారిని ఆత్మీయంగా ప్రతిఘటించి, ‘‘ఈ పెరుగుకు బదులుగా ఒక గ్లాసు మామూలు నీళ్లు ఇవ్వగలరా?’’ అని వేడుకున్నాను. మదురై రోడ్ షోలో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం రెండూ కలిసి ఉప్పొంగినట్లుగా జనం! నాలోంచీ భావావేశం ఉబికి వచ్చింది! తమిళంలో ‘‘వణక్కం’’ అంటూ చేతులు జోడించాను. ‘‘ఓ..’’ అంటూ ప్రజా హోరు! ఆ ఉద్వేగంలో పొరపాటున ‘‘భయ్యా..’’ అనేశాను. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆ వెంటనే కేరింతలు కొడుతూ నవ్వులు. ‘‘నన్బా’’ అనబోయి అలవాటుగా ‘‘భయ్యా’’ అని అన్నానని తమిళ ప్రజలు నన్ను సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ‘‘నా హృదయం బిహార్దే కావచ్చు. అంతకన్నా విశాలమైన సముద్రం మీ హృదయం..’’ అని వారికి ధన్యవాదాలు తెలిపాను. అస్సాంలోని కమల్పుర్ సమీపంలో ఒక ఏనుగు నెమ్మదిగా రోడ్డు దాటుతుండటంతో నా కాన్వాయ్ 15 నిముషాలు ఆగిపోవటం నాకొక ఆహ్లాదకరమైన జ్ఞాపకం. ఆ ‘వీఐపీ’ని ఫొటో తియ్యటం కోసం కారు దిగి వెళ్లాను. వన్యప్రాణుల రాజసానికి మోదీజీ ఒక్కరే దీటైనవారు అని ఆ క్షణాలలో నాకు అనిపించింది! ఆయనలో గర్జించే సింహమూ కనిపిస్తుంది, మనసుకు హాయినిచ్చే మయూరమూ పురి విప్పుతుంది. కేరళలో నిమ్మరసం, ఘాటైన మసాలాలు కలిపి తయారు చేసే అక్కడి సంప్రదాయ ‘సులేమానీ’ బ్లాక్ టీని గుటకేయటం కాస్త కష్టంగానే ఉన్నా, అందులో వారు జోడించిన ఆతిథ్య భావన పచ్చని కొబ్బరి చెట్ల వంటి ఆ రాష్ట్ర ప్రజలకు నన్ను కట్టిపడేసింది.పుదుచ్చేరిలో పార్టీ మండల అధ్యక్షులతో అర్ధరాత్రి జరిగిన సమావేశమైతే నాకొక ‘అత్యున్నత’ స్థాయి!! నాలోని జాతీయ అధ్యక్షుడు, పార్టీ మండల అధ్యక్షుడిగా మారిపోయాడు. పనినే మోదీజీగా భావించే వారికి పదవుల పట్టింపులు ఉంటాయా? మే 4న కౌంటింగ్. ఆ రోజున వచ్చేవి ఎన్నికల ఫలితాలు కావు. ఆ ఐదు రాష్ట్రాల ప్రజలు మోదీజీకి చేతి నిండా కల్పించే పనులు. ఆయన చేతుల మీదుగా పార్టీ కార్యకర్తల దోసిళ్లలోకి కురిసే బాధ్యతల బంగారు నాణేలు! -
'రణక్షేత్రం' ఇండో పసిఫిక్కు మారేనా?
ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధిపై ఉన్న ప్రస్తుత తరుణంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిశ్శబ్దంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరుక్కుపోకుండా ఉండాలని యూఎస్ అధ్యక్షుడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఇదే అదనుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇండో– పసిఫిక్లో పావులు కదుపుతున్నాడు. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ (కేఎమ్టీ) నాయకురాలు చెంగ్–లీ–వున్కు చైనా పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏప్రిల్ 10న జిన్పింగ్ కేఎమ్టీ నాయకురాలితో సమావేశమవటం చైనా కొత్త ఎత్తుగడను సూచిస్తున్నది. తైవాన్ విలీనమే చైనా లక్ష్యంతైవాన్ అధికార పార్టీ డీపీపీతో చైనా 2016 నుండి అధికారికంగా తెగదెంపులు చేసుకున్నది. ఆగస్టు 2022లో యూఎస్ఏ పార్ల మెంట్ స్పీకర్ నాన్సీ పొలేసి అధికారికంగా తైవాన్ను పర్యటించటంతో ఇండో–పసిఫిక్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ‘వ్యూహా త్మక సందిగ్ధత’ సిద్ధాంతం నుండి దూరంగా జరిగి ఈ పర్యటన ద్వారా యూఎస్ఏ తైవాన్కు బహిరంగంగా మద్దతిచ్చినట్లయింది. వెంటనే చైనా పెద్ద మొత్తంలో సైనిక విన్యాసాల రూపంలో బలప్రద ర్శనకు దిగింది. ఇటీవల కొత్తగా ఎన్నికయిన జపాన్ ప్రధాని సానయి తకాయిచి తైవాన్పై చైనా దాడి చేస్తే దానిని జపాన్ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తామని ప్రకటించటం ద్వారా పసిఫిక్ యుద్ధంలో జపాన్ చూస్తూ ఊరుకోదని బహిరంగంగా హెచ్చరించింది. రానున్న దశాబ్దాలలో ప్రపంచ రాజకీయ చదరంగానికి ఇండో పసిఫిక్నే అడ్డా!రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో 1945లో తైవాన్ దీవులను జపాన్ నుండి చైనా హస్తగతం చేసుకున్నది. 1949లో చైనాలో అంతర్యుద్ధం సందర్భంగా చైనాలోని ఒక వర్గం తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్ఓసీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) ప్రభుత్వం ఏర్పడింది. 1950 నుండి 1970 వరకు పీఆర్సీ– ఆర్ఓసీల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి 1971లో పీఆర్సీని చైనా ప్రభుత్వంగా గుర్తించింది. 1979లో యూఎస్ఏ కూడా గుర్తించింది. తైవాన్ను ప్రపంచ సమాజం ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనప్పటికీ, అది యూఎస్ఏ మద్దతుతో ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా రూపొంది స్వయంపాలిత దీవిగా ఎదిగింది. ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమకు రాజధానిగా రూపుదిద్దుకున్నది. ప్రపంచ సెమీ కండక్టర్ ఉత్పత్తులలో తైవాన్ వాటా 60 శాతం. అధునాతన ఏఐ రంగంలో వాడే అత్యాధునిక చిప్స్ తయారీలో తైవాన్ వాటా 90 శాతానికి పైగా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ, ఉదార విధానాలకు ప్రతీకగా ఉన్న తైవాన్ను విలీనం చేసుకోవాలనేదే చైనా విధానం. నేరుగా అమెరికాకు సవాలు!1997లో హాంకాంగ్ దీవి చైనాలో విలీనం అయాక, ఒకే దేశం – రెండు వ్యవస్థలు విధానాన్ని తైవాన్కు కూడా వర్తింపజేయాలని చైనా ప్రతిపాదిస్తున్నది. 2014లో హాంకాంగ్లో చైనా నియంతృత్వ, ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా గొడుగుల ఉద్యమం (అంబ్రెల్లా మూవ్మెంట్) జరిగింది. అప్పుడు తైవాన్లో అధికారంలో ఉన్న కేఎమ్టీ పార్టీ, చైనాతో ఉదార వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనికి వ్యతిరేకంగా పొద్దు తిరుగుడు ఉద్యమం (సన్ఫ్లవర్ మూవ్మెంట్) జరిగింది. హాంకాంగ్ విలీనం తర్వాత క్రమంగా అక్కడ పత్రికా స్వేచ్ఛ, పౌర హక్కులను చైనా అణచి వేసింది. ‘నిన్న హాంకాంగ్ – రేపు తైవాన్’ నినాదం కింద తైవాన్కూ హాంకాంగ్ గతి పడుతుందని తైవాన్ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఉత్తర పసిఫిక్ మహా సముద్రం చైనా, రష్యాలను – యూఎస్ఏను విభజిస్తుంది. ఈ ప్రధాన శక్తులు భౌగోళికంగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రానికి ఇరువైపులా మోహరించి ఉన్నాయి. భారతదేశం వరకు విస్తరించిన ఇండో పసిఫిక్ ప్రాంతంలో యూఎస్ఏ, చైనా, రష్యా, జపాన్, భారత్ల మధ్య జియో పొలిటి కల్ యుద్ధం ప్రారంభమయింది. ఈ శతాబ్దంలో ప్రపంచ ఆధిప త్యాన్ని ఇండో పసిఫిక్ శాసిస్తుందని జియో పొలిటికల్ శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న చైనా సాయుధ శక్తి, తిరిగి పుంజుకున్న రష్యా ఆర్థిక వ్యవస్థ, జిన్పింగ్ నాయకత్వంలో ప్రపంచాన్ని శాసించాలనే చైనా ఆశలు– వేగంగా బలోపేతమవు తున్న భారత్, యూఎస్ఏకు సవాలు విసురుతున్నాయి.1945 నుండి గత 75 సంవత్సరాలుగా యూఎస్ఏ ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్నది. యూఎస్ఏను నేరుగా ఎదుర్కొనే శక్తి చైనా– రష్యాలకు మాత్రమే ఉన్నది. ఈ ఘర్షణ తైవాన్తో ప్రారంభమ వటానికి అవకాశాలు హెచ్చు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ‘ఈ తరంలోనే తైవాన్ విలీనం’ అని ప్రకటించటం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. జిన్పింగ్ మూడవ పదవీ కాలం 2028లో ముగియ నున్నది. బహుశా 2027 లోపు తైవాన్ను చైనా ఆక్రమించవచ్చని వ్యూహకర్తలు అనుమానిస్తున్నారు. తైవాన్పై చైనా దాడి చేస్తే, దాన్ని నేరుగా యూఎస్ఏకు సవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. భారత నౌకాశక్తి కీలకంసైనిక వ్యూహ పరిభాషలో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ద్వీప సమూహాలను యూఎస్ఏ తన ‘రక్షణ శ్రేణులు’గా పరిగణిస్తుంది. మొదటి రక్షణ శ్రేణి – కుర్లీ దీవులు, ర్యుకూ దీవులు, తైవాన్ దీవులు. జపాన్ దీవులు, బానిన్స్, గువామ్, పలావు దీవులు– రెండవ రక్షణ శ్రేణి. అల్యూషియన్ దీవులు, హవాయి దీవులు, సమోవా దీవులను మూడవ రక్షణ గోడగా పరిగణిస్తారు. ఈ మూడు శ్రేణులు దాటితే అమెరికా ప్రధాన భూభాగాన్ని చైనా చేరుకోవచ్చు. అందుకే ఈ దీవు లపై చైనా పెత్తనాన్ని అమెరికా సహించదు. దానివల్ల జలసంధులు, జలరవాణా మార్గాల రక్షణ కీలకం కాబోతున్నది.మొదటి రక్షణ శ్రేణిలోని మియాకో, తైవాన్, లూజాన్, సుండా జలసంధులను రక్షించటానికి ఒకినావో (జపాన్), ఫిలిప్ఫైన్స్లలో యూఎస్ఏ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. గువామ్లోని అమెరికా సైనిక స్థావరం రెండవ వలయానికి రక్షణ కల్పిస్తున్నది. హవాయిలో సైనిక స్థావరం మూడో వలయానికి కేంద్రకం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా–రష్యాలను నియంత్రించడానికి అమెరికా ఇతర సైనిక శక్తులతో చేతులు కలిపింది. ఆస్ట్రేలియా, భారత్, యూఎస్ఏ, జపాన్ సభ్యులుగా 2004లో క్వాడ్ ఏర్పడింది. క్వాడ్ను ఆసియా నాటోగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే సభ్యులుగా ఆకస్ కూటమి పనిచేస్తున్నది.ఉత్తర పసిఫిక్ ప్రాంతాన్ని ఆసియా–ఐరోపాలతో అనుసంధానం చేసే కీలక ప్రాంతంలో భారతదేశం ఉన్నది. ఈ ప్రాంతంలోని అండమాన్ నికోబార్ దీవులు, మలేషియా, సింగపూర్లను నాలుగవ రక్షణ శ్రేణిగా యూఎస్ఏ పరిగణిస్తుంది. ఇండో పసిఫిక్కు ముఖద్వారంలో భారతదేశం కొలువై ఉన్నది. చైనా ప్రపంచాన్ని భయపెట్టాలన్నా, ప్రపంచం చైనాను అదుపు చేయాలన్నా మలక్కా, తైవాన్ జలసంధులు కీలకం. మలక్కా, తైవాన్ జలసంధుల వద్ద సమీప భవిష్యత్తులో హార్మూజ్ ముఖచిత్రం ఆవిష్కృతం కావొచ్చు. తైవాన్ జలసంధిని చైనా అదుపులోకి తీసుకొంటే, ప్రతిగా మలక్కా జలసంధిని మూసివేయటానికి యూఎస్ఏ–జపాన్ ప్రయత్ని స్తాయి. ఇక్కడ భారత్ పాత్ర కీలకమవుతుంది. భారత్ తోడ్పాటు లేకుండా ఏ నౌకాశక్తి మలక్కాపై పెత్తనం చలాయించలేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
శరవేగంగా నేపాల్ సంస్కరణలు
నేపాల్లో మార్చి 27న ఏర్పడిన బాలేంద్ర షా ప్రభుత్వం నెల రోజులైనా పూర్తి కాకముందే ప్రవేశపెడుతున్న పరిపాలనా సంస్కరణలను గమనించినపుడు, ఇంతటి వేగం ఆచరణలో సాధ్యమయేనా అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. రబీ లమిఛానే అధ్యక్షతన గల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) దేశ చరిత్ర లోనే ఎన్నడూ లేనంత మెజారిటితో గెలిచి, పాత పార్టీలన్నింటిని అక్షరాలా ఊడ్చిపెట్టిన స్థితిలో, ప్రధాని బాలేన్ ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్న మాట నిజం. అది తెలిసినందువల్లనే, 27న ప్రమాణ స్వీకారం తర్వాత రెండు రోజు లకు 29న జరిగిన మొదటి క్యాబినెట్ సమా వేశంతోనే ఆరంభించి వరుసగా అనేక చర్యలు తీసుకోవటం కనిపిస్తున్నది.100 అంశాల ప్రణాళికమనకు తెలిసిన ప్రజాస్వామ్యాన్ని, పరిపాలనను దృష్టిలో పెట్టు కుని చూసినపుడు ఆ చర్యలలో కొన్ని ఆశ్చర్యకరంగా తోస్తాయి. ఉదాహరణకు పరిపాలన వేగంగా, సమర్థవంతంగా సాగేందుకు, సామాన్యులకు కూడా ఉపయోగకరంగా ఉండేందుకు మొదటి క్యాబి నెట్ సమావేశంలోనే 100 అంశాల ప్రణాళిక ప్రకటించారు. వాటి అమలు తీరును ఎవరైనా సరే గమనించేందుకు ప్రత్యేకంగా వెబ్ సైట్ను సృష్టించారు. ఆ తర్వాత, 18 అభివృద్ధి రంగాలపై పూర్తి దృష్టి పెట్టి పనిచేయగలమంటూ 18 అంశాలతో ‘నేషనల్ కమిట్ మెంట్ డాక్యుమెంట్’ పేరిట ముసాయిదా పత్రాన్ని విడుదల చేసి, దానిపై పార్టీలు, సంస్థలు, మేధావులు, ప్రజల సూచనలను కోరారు. విశేషం ఏమంటే, ఓడిపోయిన పార్టీల మేనిఫెస్టోలలోని ముఖ>్యంశాలను కూడా ఈ డాక్యుమెంట్లో చేర్చారు. ఆ పార్టీల నాయకులు నలుగురికి కూడా ఒక కమిటీలో స్థానం కల్పించారు. దానిని బట్టి, నేపాల్ అధికార పక్షంతోపాటు యువ ప్రధాని ఆలోచనల తీరును అర్థం చేసుకోవచ్చు. ఇది ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన కొన్ని ప్రజాస్వామిక ప్రయోగాలను గుర్తు చేస్తున్నది. రాజీవ్ గాంధీ ప్రధాని అయినప్పుడు ఈ స్థాయి మార్పులైతే చేయలేదు గానీ, ముఖ్యమైన విధానపర అంశాలపై ప్రతిపక్షాలను సంప్రదించే పద్ధతిని ప్రవేశపెట్టి ప్రశంసలు పొందారు. తదనంతర పరిణామాల వల్ల అంతా భంగపడిందన్నది వేరే విషయం. అప్పుడే తప్పుకున్న ఇద్దరు మంత్రులుజెన్–జీ ఉద్యమం నేపాల్ రాజకీయ వ్యవస్థను అంతగా కుదిపి వేయటానికి ఒక ముఖ్య కారణం అవినీతి అన్నది తెలిసిందే. ఆ దృష్ట్యా, అవినీతిని అన్ని స్థాయుల్లో అరికట్టగలమన్నది ఆర్ఎస్పీ ఇచ్చిన హామీ. అందుకు అనుగుణంగా, ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండు వారాలలోనే ప్రధాని సహా మంత్రులంతా తమ ఆస్తులను ప్రకటించారు. రాజును 2006లో పడగొట్టగా, అప్పటినుంచి నేటి వరకు రాజు జ్ఞానేంద్రతో పాటు అందరు మాజీ ప్రధానులు,మంత్రులు, సీనియర్ నాయకులు, సీనియర్ అధికారుల ఆస్తులపై దర్యాప్తు కోసం కమిషన్ను నియమించారు. అంతలోనే ఒక నిర్ణయం దేశాన్నంతా ఆశ్చర్యపరిచింది. కేవలం మూడు వారాల క్రితం నియమితుడైన కార్మిక మంత్రి దీపక్ కుమార్, ఒక పని చేయని ఆరోగ్య బీమా బోర్డులో అధికారి అయిన తన భార్యను కొనసాగించేందుకు అధికార దుర్వినియోగం చేశారంటూ వెంటనే క్యాబినెట్ నుంచి తొలగించారు. ఆ దుర్వినియోగాన్ని పట్టించుకోనందుకు ఆరోగ్యమంత్రి నిషా మెహతాకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ కొద్ది రోజులలోనే మనీ లాండరింగ్ కేసులో మాజీ ప్రధాని దేవుబా దంపతులకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయగా, కొద్దిమంది పెద్ద వ్యాపారులను అరెస్టు చేశారు. ఇది అనుమానించే కావచ్చు దేవుబా దంపతులు చికిత్స కోసమంటూ ముందే విదేశా లకు వెళ్లారు. (ఏప్రిల్ 22న ఏకంగా హోంమంత్రి సుధన్ గురుంగ్ రాజీనామా చేయడం మరో సంచలనమైంది. తన పెట్టుబడుల మీద తలెత్తిన ప్రశ్నల మీద నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగానే పదవి నుంచి తప్పుకున్నట్టు ఆయన వెల్లడించారు.) పరిపాలనా పరంగా తీసుకున్న ఒక ప్రధానమైన చర్య, ఫెడర లిజం సక్రమంగా అమలయ్యేందుకు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బాలేన్ జరిపిన చర్చలు. వారిలో అన్ని పార్టీల వారున్నారు. వాస్తవానికి ఫెడరలిజం ఏర్పాట్లు రాజ్యాంగంలో 2015 నుంచి ఉన్నాయి. కానీ వాటిని ఏరికోరి చేర్చిన కాంగ్రెస్, కమ్యూ నిస్టు, మావోయిస్టు పార్టీలు ఏవీ అమలుపరచలేదు. అందుకిపుడు పదేళ్ల తర్వాత మోక్షం లభిస్తున్నది. ప్రధానితో జరిగిన చర్చలలో ఆ ముఖ్యమంత్రులంతా తమకు చట్టపరమైన, ఆర్థికపరమైన, శాంతి భద్రతలపరమైన అధికారాలు సవ్యంగా లభించలేదని చెప్పారు.అమలులో ఎదురయ్యే సవాళ్లు18 అంశాల ‘కమిట్మెంట్ డాక్యుమెంట్’ గమనిస్తే, వాటిలో వ్యవసాయం, విద్యుత్తు, గనులు, మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక రంగం, టూరిజం, పౌర విమానయానం వంటి ఆర్థికాభి వృద్ధిపరమైనవి కనిపిస్తాయి. అవిగాక ఉద్యోగ – ఉపాధి కల్పన, విద్య, వైద్యం, పరిపాలనా సంస్కరణలు; పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం మొదలైనవి ఉన్నాయి. దేనికైనా నిధులు తప్పని సరి కాగా, ఆ కొరత నేపాల్కు ఎక్కువే. వారికి గల తీవ్రమైన కొరతలు సహజ వనరులు, పరిశ్రమలు, ఉత్పత్తి రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పరిమితం కావటం. అయితే, ఇంతకుముందువలెగాక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, అధికార పక్షం పట్టుదల చూపటం, అవినీతిని నియంత్రిస్తుండటం వల్ల బయటినుంచి సంస్థాగతంగా, ప్రైవేట్ రంగం నుంచి, ప్రభుత్వాల నుంచి తోడ్పాటు లభించే అవకాశాలున్నాయి.ప్రత్యేకంగా నిధులతోగానీ, క్రమంగా జరగవలసిన అభివృద్ధితో గానీ సంబంధం లేని చర్యలు కొన్ని 100 అంశాల ప్రణాళికలో ఉన్నాయి. అవి సాధారణ పరిపాలనాపరమైనవి. ఉదాహరణకు ఆస్తుల వెల్లడి, అవినీతిపై దర్యాప్తులు, విద్యా సంస్థలలో పార్టీ అనుబంధ యూనియన్ల రద్దు, ప్రైవేటు ఆసుపత్రులలో 10 శాతం పడకలు పేదలకు ఉచితంగా కేటాయింపు, ప్రజావసరాలు, సర్వీ సులు వారి గుమ్మం వద్దకే చేరటం వంటివి. ఇవి అమలైనకొద్దీ ఒకవైపు ప్రభుత్వంపట్ల ప్రజలకు నమ్మకం పెరగటం, వారి జీవి తాలు మెరుగు పడటం జరుగుతుంది.బాలేంద్ర షా కాఠ్మండూ మేయర్గా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చేసిన అభివృద్ధి పనులు, తను అవినీతిపరుడు కాకపోవటం ఈ ఎన్నికలలో బాగా కలిసి రావటం తెలిసిందే. ఆర్ఎస్పీ అధ్యక్షుడు రబీ లమీఛానేకు కూడా ముక్కుసూటి మనిషి, మంచి వక్త, సమ ర్థుడనే పేరున్నది. ఇద్దరూ ఇంతకాలం పాత పార్టీలను, వాటి అక్రమాలను వ్యతిరేకించినవారు. అందువల్ల జాగ్రత్తగా, ఇదే పట్టుదలతో వ్యవహరించినట్లయితే నేపాల్ ముఖచిత్రం క్రమంగా మారగలదని చెప్పవచ్చు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అదే కాంగ్రెస్కు పెద్ద శాపంగా మారనుందా?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేత, టి.జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రేవంత్, కేసీఆర్లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్ కాళేశ్వరం వెళ్లాడని జీవన్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్కు నష్టమే. బహశా అందుకే రేవంత్ ఆయన పేరు ప్రస్తావించి ఉండాలి. ‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్ఎస్లోకి వెళ్లాడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్లో జీవన్రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా తన కేడర్ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఈ పరిణామం బీఆర్ఎస్కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్ ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్ను పాపాల భైరవుడని.. ఆయన చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న డౌట్లు రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు. కానీరాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే.. అది కాంగ్రెస్కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. కాగా కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు పగిలేదాక.. అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్ కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విజేతను నిర్ణయించేది 'విజయ్ ఫ్యాక్టర్!'
ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు హీరో విజయ్ నిర్ణాయక అంశం కాబోతున్నారు. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా, ఓట్ల చీలికలో విజయ్ ప్రభావం వల్ల విపక్ష ఏఐడీఎంకే–బీజేపీ కూటమి కన్నా పాలక డీఎంకే–కాంగ్రెస్ కూటమికే మేలు జరిగే సూచనలున్నాయి. ఢిల్లీ పెత్తనం వర్సెస్ ‘తమిళ ప్రైడ్’ తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. విపక్షాల్లో అనైక్యత లాభించి, తండ్రి కరుణానిధి సాధించలేని ఘనత – డీఎంకేను వరుసగా రెండోసారి గెలిపించడం తనయుడు స్టాలిన్ సాధించనూవచ్చు!తమిళనాట ద్రవిడ పార్టీల రాజకీయాలది ఆరు దశాబ్దాల చరిత్ర! 1967 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలో తమకంటూ సొంతంగా బలం, బలగం లేకపోయినా... డీఎంకే మద్దతు కాంగ్రెస్కు, ఏఐడీఎంకే మద్దతు బీజేపీకి ఢిల్లీలో కావాలి. అందుకే ఆ రెండు ప్రధాన స్రవంతి జాతీయ పార్టీలు ద్రవిడ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని, అల్ప భాగస్వాములు (తోక పార్టీలు)గా పోరాడుతున్నాయి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ ప్రాంతీయ శక్తులు భాగం పంచుకుంటాయి తప్ప, రాష్ట్ర అధికారంలో మాత్రం జాతీయ పార్టీలకు ఎప్పుడూ భాగమి వ్వవు. ఒక పరిమితిని (8 నుంచి 10 శాతం ఓటు వాటా) మించి ఆయా పార్టీలను రాష్ట్రంలో ఎదగనీయవు. ఈసారి విశేషమేమంటే, సినీ కెరటం విజయ్, అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగి ఈ రెండు కూటములకు గట్టి సవాల్ విసురు తున్నారు. గ్రామీణ, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల యువతలో విజయ్ అంటే ఎంతో క్రేజ్ ఉంది. పాలక ‘లౌకిక ప్రగతిశీల కూటమి’లో డీఎంకే, కాంగ్రెస్లతో పాటు డీఎండీకే, వీసీకే తదితర ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. వీరి మధ్య సయోధ్య, సీట్ల సర్దుబాటు ఒకింత సామరస్యంగా జరిగింది. ‘ప్రభుత్వ వ్యతిరేకత’ బలపడనీయకుండా గట్టి సంకేతం ప్రజాక్షేత్రంలోకి పంపగలిగారు. విపక్ష ఎన్డీయే కూటమి భాగస్వా ముల మధ్య సఖ్యత గొప్పగా లేదు. కూటమిలో ఆధిపత్యానికి మొదట కొంత యత్నించిన బీజేపీ, చివరకు విధిలేని పరిస్థితుల్లో పొత్తుల్లో ఏఐడీఎంకే ఆధిపత్యానికే తగ్గింది. గణాంకాలు చెప్పేవి అర్ధ సత్యాలే!రాజకీయాలు అంకగణితం కాదు, 2+2 నాలుగవటం లెక్కల్లోనే తప్ప రాజకీయాల్లో అవాలని లేదు. 2+2 ఆరు అవొచ్చు, జీరో అవొచ్చు. 234 స్థానాలున్న అసెంబ్లీలో అధికారానికి 118 సీట్లు కావాలి. ఈసారి ఏ ఒక్క పార్టీకి ఆ సంఖ్య దక్కకపోవచ్చు. 2021 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వపు ఎస్పీయే కూటమి 45.3 శాతం ఓటు వాటాతో 159 స్థానాలు గెలిచింది. అంతకు ముందు స్టాలిన్ మేయర్గా చేసిన చెన్నై మహానగర్ పరిధిలోని 22 అసెంబ్లీ స్థానాల్లో ఏఐడీఎంకేకు ఒక సీటు కూడా రాలేదు. ఎన్డీయే కూటమి 39.7 శాతం ఓటు వాటాతో 75 స్థానాలు నెగ్గింది. 2016 ఎన్నికల్లో జయ లలిత గెలుపు తర్వాత మరే ఎన్నికల్లోనూ ఏఐడీఎంకేకు ఆధిపత్యమే దక్కలేదు. అదే యేడు చివర్లో జయలలిత మరణం తర్వాత... పళనిస్వామి, పన్నీరు సెల్వమ్ల మధ్య వివాదాలతో పార్టీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికలు (38/39), తర్వాతి అసెంబ్లీ (2021) ఎన్నికలు (159/234), అటు తర్వాత మూడేళ్లకు జరిగిన 2024 లోక్సభ (39/39), స్థానిక సంస్థల ఎన్నికలు, 2021–2026 మధ్య దాదాపు అన్ని ఉపఎన్నికలు... ఇలా అన్నిటా డీఎంకే మిత్రులు గెలుస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో చివరి పెద్దపోరు 2024 లోక్సభ ఎన్నికల్లో, 221 అసెంబ్లీ సెగ్మెంట్లలో డీఎంకే కూటమికి ఆధిక్యత లభిస్తే ఏఐడీఎంకేకు 10 చోట్ల, పీఎంకేకు 3 చోట్ల ఆధిక్యత దక్కింది. ఆ ఎన్నికల్లో బీజేపీ, ఏఐడీఎంకేలు విడిగా పోటీ చేశాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పీఎంకేకు 3 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత లభించింది తప్ప బీజేపీకి ఒకచోట కూడా ఆధిక్యత రాలేదు. గణాంకాల పరంగా చూసినపుడు డీఎంకే కూటమి బలంగా కనిపిస్తోంది. 1984లో ఎంజీ రామచంద్రన్, 2016లో జయలలిత తప్ప వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని గెలిపించుకొని, తిరిగి ముఖ్యమంత్రి అయినవారు లేరు. కరుణానిధికి అదెప్పుడూ సాధ్యపడలేదు. స్టాలిన్ మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయితే తండ్రిని మించి రికార్డు నెలకొల్పినట్టే!ఢిల్లీ వర్సెస్ తమిళ గాలిప్రాంతీయ, భాష, సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వ భావో ద్వేగాల రాష్ట్రం తమిళనాడు. అవి రగిలినపుడు, జనం ఎటువైపు మళ్లినా ఉప్పెనలా ఎగిసిపడతారని ప్రచారం. జాతీయ పార్టీలు, జాతీయ అంశాల ప్రభావం నామమాత్రమే! స్టాలిన్ నెమ్మదిగా రాజకీయ పోరాటాన్ని ఢిల్లీ పెత్తనం వర్సెస్ తమిళ గౌరవం కిందకు మార్చే యత్నం చేస్తున్నారు. త్రిభాషా సూత్రం, బీజేపీయేతర ప్రభుత్వాలపై గవర్నర్ల ద్వారా దొడ్డిదారి పెత్తనం, నిధుల కేటాయింపులో వివక్ష, నియోజకవర్గాల పునర్విభజనలో ప్రాతినిధ్య తగ్గింపు ప్రమాదం... ఇలా పలు అంశాలతో ప్రచారం చేస్తున్నారు.తమిళ సమాజం మీద మొదటి, రెండో తరం నాయకులంత పలుకుబడి, ప్రభావం కలిగిన నేత కాదు స్టాలిన్. అయినా ఈతరంలో స్టాలిన్కు దీటుగా నిలువగలిగే నాయకులు లేరు. మొదటి తరంలో రాజాజీ, కామరాజ్ నాడార్, అన్నాదురై లాంటి హేమాహేమీలుంటే, తర్వాతి తరంలో సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత ఒక వెలుగు వెలిగారు. సినీరంగం నుంచి కమల్హాసన్, విజయ్కాంత్ (దివంగత), సీమాన్... ఇలా కొందరు ప్రయత్నించినా నిలదొక్కుకున్నది లేదు. కానీ, హీరో విజయ్ భిన్నంగా కనిపిస్తున్నారు. గత సంవత్సరం కరూర్ ర్యాలీ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన తర్వాత పెద్ద ర్యాలీలు, సభల్ని విజయ్ నిరాకరిస్తున్నారు కానీ, లోలోపల యువ తలో ఆసక్తి రేపుతున్నారు. తమిళ ఓటర్లలో 40 శాతం మంది 40 ఏళ్లలోపు వారే! రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ యువత విజయ్ వైపు మొగ్గితే ఎన్నికల సమీకరణాలే మారొచ్చు.తమిళ ఆకాంక్షలే ప్రతిఫలిస్తాయి!‘ఎన్నికల ఉచితాల’కు పేరుబడ్డ తమిళనాడులో వాటికి, నగదు బదిలీలకు మించి అదనంగా తమిళ ప్రజలు ఏదో కోరుకుంటు న్నారని ఈ ఎన్నికల సరళి చెబుతోంది. స్టాలిన్ను వెంటనే గద్దె దించేయాలన్నంత కోపం మూకుమ్మడిగా తమిళ ప్రజల్లో లేదు కనుక ‘విజయ్’ ఫ్యాక్టర్ విపక్షాలకు ఉపయోగపడకపోవచ్చు. దించేయాలన్నంత వ్యతిరేకత ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్ చేసిన ప్రచారమంతా డీఎంకేని ఓడించగలిగే ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే–బీజేపీ కూటమి ఖాతాలో చేరేది. కానీ, 2009 ఏపీ ఎన్నికల్లో ‘చిరంజీవి’ (ప్రజారాజ్యం), జయప్రకాశ్ నారాయణ (లోక్సత్తా) ఫ్యాక్టర్ పాలకపక్షం కాంగ్రెస్కు లాభించి డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసినట్టు ఇక్కడ కూడా విజయ్ కారకం స్టాలిన్కే లాభం చేకూర్చవచ్చు. కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ కన్నా మెరుగ్గా ఏం లేకపోయినా ప్రధాని మోదీ సానుకూలత ఎంతో కొంత తగ్గి, రాహుల్ ప్రజాదరణ పెరిగినట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. మహిళల ఓట్లు ఈసారి మూకుమ్మడిగా ఒక వైపు వెళ్లే పరిస్థితి లేదు. ఇలా అనేక అంశాలతో పాటు ‘విజయ్ ఫ్యాక్టర్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విజేతను తేల్చనుంది.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
విశాల ప్రయోజనమే విజయ రహస్యం
జీవితానికి ఒక ప్రయోజనం అంటూ ఉండాలని ఇటువంటి సందర్భాల్లో చాలామంది చెబుతారు. నేనూ అదే కోవలో మీరొక లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలో చెప్పబోవడం లేదు. సహస్రాబ్దిలో పుట్టిన వారిగా, ఏం చేయాలో మీకు సహజసిద్ధంగానే తెలుసు. కానీ, మన కంటూ ఒక ప్రయోజనం ఉంటే సరిపోదు. అమెరికా మాజీ అధ్య క్షుడు జాన్ ఎఫ్. కెనడీ ఒకసారి ‘నాసా’ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. అక్కడ ఒకతను చీపురు పట్టుకుని వెళుతూండటం చూసి, ఏం చేస్తున్నావని అడిగారు. ‘‘స్వామీ, చంద్రుని మీద ఓ మనిషి కాలుమోపేందుకు సహాయపడుతున్నాను’’ అని జవాబిచ్చాడు. మనం చేస్తున్న పని ఏదైనా కానివ్వండి. విస్తృత ప్రయోజనం కోసం పాటుపడుతున్నామనే అటువంటి భావన చాలా అవసరం. అనుసంధానంలో ఆనందంఫేస్బుక్ ప్రారంభించిన రోజు నాకు గుర్తుంది. హార్వర్డ్ కమ్యూనిటీ నంతటినీ అనుసంధానపరచగలగడం ఉత్తేజదాయకంగా ఉందనీ, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మొత్తం ప్రపంచానికి వారధి కల్పిస్తారనీ ఒక మిత్రునితో చెప్పాను. ఆ ఎవరో ఒక వ్యక్తి మనమే ఎందుకు కాకూడదనే ఆలోచనే నాకు రాలేదు. దాని గురించి మనకు ఏమీ తెలియదు కదా! వనరులు పుష్కలంగా ఉన్న పెద్ద టెక్నాలజీ కంపెనీలు ఆ పని చూసుకుంటాయి అనిపించింది. కానీ, ప్రజలందరూ ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారని మాత్రం నాకు నిస్సందేహంగా తెలుసు. ఆ దిశగా మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాం. మీకూ అటువంటి లక్ష్యాలు ఏవో ఉంటాయి. ప్రపంచంలో మార్పు తేవాలని ఉంటుంది. ఎవరో తెస్తారని అనుకుంటారు. కానీ, ఎవరూ తీసుకురారు. మీరే ఆ పని చేయాలి. అలా మీకొక లక్ష్యం నిర్దేశించుకోవడమే కాదు, ఇతరులకూ ఒక ప్రయోజనాన్ని కల్పించ గలగాలి. ఒక కంపెనీని నిర్మించాలని నేను కోరుకోలేదు. ఒక ప్రభా వాన్ని కనబరచాలని అనుకున్నా. కంపెనీ పెట్టిన రెండు మూడేళ్ళ తర్వాత, దాన్ని కొనడానికి కొన్ని పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ, నేను అమ్మాలని అనుకోలేదు. మరింత మందిని అనుసంధానపరచగలమా అనే ఆలోచిస్తూ వచ్చాను. కంపెనీలో ప్రతి ఒక్కరూ అమ్మేయడమే మంచిదనే భావించారు. అమ్మకూడదనే నిర్ణయానికి వచ్చినందుకు జీవితాంతం బాధపడతావు అంటూ ఒక సలహాదారు నన్ను హెచ్చ రించారు కూడా. మనుషుల స్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నా నిర్ణయం నచ్చక, మేనేజ్మెంట్ బృందంలోని దాదాపు ప్రతి ఒక్కరూ కంపెనీ నుంచి నిష్క్రమించారు. అది నేను ఎదుర్కొన్న కష్టకాలం. నా నిర్ణయంలో పొరపాటు ఉందేమోనని కూడా ఒక దశలో అనిపించింది. కొన్నేళ్ళ గడిచాక, ఒక విస్తృత ప్రయోజనం అంటూ లేకపోతే అటువంటి పరిస్థితులే తలెత్తుతాయని అర్థమైంది. ఆ విశాల ప్రయో జనాన్ని కల్పించాల్సిన బాధ్యత మనదే. అపుడు అందరం కలసి కట్టుగా ముందుకు సాగగలం. ఊడిపడదు అద్భుతంఈ జీవితంలో తమకంటూ ఒక లక్ష్యం ఉందని ప్రతి ఒక్కరూ భావించే విధంగా ప్రపంచాన్ని తీర్చిదిద్దుకునేందుకు అనుసరించ వలసిన మూడు మార్గాల గురించి చెబుతాను. ఒకటి – అర్థవంత మైన భారీ ప్రాజెక్టులను కలసికట్టుగా చేపట్టాలి. రెండు – లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించేందుకు అనువైన విధంగా సమానత్వ భావనను పునర్నిర్వచించాలి. మూడు – ప్రపంచ వ్యాప్తంగా సమాజాలను నిర్మించుకోవాలి. టెక్నాలజీల వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతున్నా అంతకుమించిన ఉద్యోగాలను సృష్టించుకోగలిగిన సామర్థ్యం మన కుంది. ప్రతి తరం నిర్వర్తించవలసిన కర్తవ్యాలుంటాయి. చంద్రు నిపై ఒక మనిషి కాలుమోపేందుకు, ఆ గచ్చు ఊడ్చే పనివాడితో సహా మూడు లక్షల మందికి పైగా పనిచేశారు. పోలియో సోకకుండా టీకాలు వేయడంలో లక్షలాది మంది కార్యక్తలు శ్రమించారు. ఆన కట్టలు నిర్మించడంలోనూ ఎంతో మంది శ్రామికుల కృషి ఉంది. ఐడియాలు ఎప్పుడూ పూర్తిరూపం సంతరించుకుని రావు. మొదటే అన్నీ తెలియవలసిన పని లేదు. దేనికైనా సరే శ్రీకారం చుట్టడం ముఖ్యం. ప్రజలను అనుసంధానపరచడం గురించి పూర్తిగా మొదటే తెలిసి ఉంటే, నేను ఫేస్ బుక్ను ప్రారంభించి ఉండేవాడిని కానేమో. క్రమంగా ఒక్కొక్క విషయం తెలుస్తూ వస్తుంది. హఠాత్తుగా అద్భుతాన్ని సృష్టించలేమని గుర్తించాలి. ఆద ర్శాలు నిలుపుకోవడం మంచిదే. కానీ, ఆ విషయంలో, మనల్ని ఎదుటి వారు ఎగతాళి చేసినా, ధైర్యంగా తట్టుకోగలగాలి. ఒక సంక్లిష్ట సమస్య పరిష్కారానికి నడుం బిగించినపుడు, దాని ఆనుపానులు తెలుసుకోకుండా దిగావంటూ నిందించే వారు ఎప్పుడూ ఉంటారు. మనం చొరవ చూపడం గిట్టనివారు ఉంటారు. ఏ విషయంలోనైనా మనల్ని వెనక్కి లాగేవారు ఉంటారు. వారి మాయలో మనం పడకూడదు. ఒకరి కోసం అందరంమన తల్లితండ్రులు, తాత ముత్తాతల మాదిరిగా జీవితాంతం స్థిరమైన ఉద్యోగాలు చేసే రోజులు గతించాయి. ఇపుడు వ్యవస్థాపక సామర్థ్య సంస్కృతి విస్తరిస్తోంది. అయితే, కొత్త ఆలోచనలు అనేకం ఆచరణలో పెట్టి చూసేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే ఆ సంస్కృతి వర్ధిల్లుతుంది. ఫేస్బుక్కు ముందు నేను గేమ్లు, చాట్ సిస్టంలు, స్టడీ టూల్స్, మ్యూజిక్ ప్లేయర్లు నిర్మించాను. హ్యారీ ప్యాటర్ ప్రచురణకు నోచుకోకముందు జె.కె. రౌలింగ్ రచనలు 12 సార్లు తిరస్కరణకు గురయ్యాయి. విఫలమైనా ఫరవాలేదనుకునే స్వాతంత్య్రం ఉన్నప్పుడే గొప్ప విజయాలు సిద్ధిస్తాయి. ఒక వ్యక్తి తన ఆలోచనను అమలులోపెట్టి, దాన్ని ఒక గొప్ప సంస్థగా మలచే స్వాతంత్య్రం లేనప్పుడు, నష్టపోయేది ఆ ఒక్క వ్యక్తి కాదు, అందరూనని గుర్తించాలి. గొప్ప ఐడియా తట్టినంత మాత్రాన లేదా కష్టపడి పనిచేసినంత మాత్రాన సఫలం కాలేక పోవచ్చని మనకు తెలుసు. ఆవగింజంత అదృష్టం కూడా కలసి రావాలి. నిరంతరం మారిపోతున్న టెక్నాలజీ వల్ల మనం ఎప్పటి కప్పుడు కొత్తవాటిని నేర్చుకోవడం కూడా నిరంతర ప్రక్రియగా మారాలి. సమాన అవకాశ భావనను ప్రోత్సహించేందుకు నేను, నా భార్య ప్రిసిల్లా మా సంపదలో కొంత భాగాన్ని వెచ్చించే ఏర్పాటు చేశాం. చాన్ జుకెర్బర్గ్ ఇనీషియేటివ్ ప్రారంభించాం. అందరూ నగదు సహాయాన్నే అందించాలన్న రూలు లేదు. ఎదుటివారు బాగుపడటానికి తమ సమయాన్ని కూడా కొంత వెచ్చించవచ్చు. పేదరికాన్ని, వ్యాధులను అంతమొందించగలిగిన శక్తి నేటి తరానికి ఉంది. ఏ ఒక్క దేశమో పోరాడినంతమాత్రాన వాతావరణ మార్పును అరికట్టలేం. మహమ్మారులను నివారించలేం. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రపంచవ్యాప్త పరిష్కారాలు అవసరం. మనం ఒంటరివారం కాదు. ఒక విస్తృత ప్రయోజనానికి పాటుపడుతున్నామనే భావన రావాలి. ‘మన ముందు తరాలను ఆశీర్వదించిన, దైవిక శక్తి ఏదైతే ఉందో, అది మాకు ధైర్యం సమ కూర్చడానికి సహాయపడుగాక! ఈ జీవితాన్ని ఒక వరప్రసాదంగా మేం తీర్చిదిద్దుకునేటట్లు చేయుగాక!’ అనే ప్రార్థనతో మీ వద్ద సెలవు తీసుకుంటాను. -
బయో–ఆర్థిక వ్యవస్థపై లేని గొప్పలు
బయోటెక్నాలజీ శాఖ (డీబీటీ) ఇటీవల భారతీయ బయో–ఆర్థిక వ్యవస్థ పదవ వార్షిక నివేదకను విడుదల చేసింది. భారత్ బయో ఆర్థిక వ్యవస్థ 2014లో ఉన్న సుమారు 10 బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 195 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని శాస్త్ర–సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రక టించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం బయో టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, గత దశాబ్దంలో అద్భుతమైన ప్రగతిని సాధించి ఉండాలి. ఈ నివేదిక ప్రకారం, 2024లో 167 బిలియన్ డాలర్లుగా ఉన్న భార తీయ బయో ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2025లో సుమారు 195 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డీబీటీ వల్ల వెలుగు చూసిన నవీక రణలు, బయోటెక్నాలజీ పరిశోధన–అభివద్ధి విభాగం (ఆర్ అండ్ డీ) వల్ల గడచిన పదేళ్ళలో భారతదేశపు బయో ఆర్థిక వ్యవస్థ అసా ధారణమైన వేగంతో దూసుకు వెళ్లిందనే అభిప్రాయాన్ని ఈ నివేదిక కలుగజేసింది. అన్నింటినీ లెక్కల్లో కలిపేసి...లోతుల్లోకి వెళితే అసలు వాస్తవాలు బయటపడతాయి. పద్దు లలో, నిర్వచనాల్లో చేసిన తెలివైన మార్పుల వల్ల సంఖ్యలు నాటకీ యంగా పెరిగాయేగానీ ఆర్ అండ్ డీ చేసిన కృషి వల్ల కాదు. గతంలో లెక్కలోకి తీసుకోని లేదా పాక్షికంగా మాత్రమే చేర్చు కున్న మొత్తం ఉప రంగాలన్నింటినీ కలిపేసుకోవడం వృద్ధిలో ప్రధాన భాగానికి కారణమని తేలుతుంది. బయోటెక్ ఆధారిత వ్యాక్సీన్లు, ఫార్మాస్యూటికల్స్తో పాటు బీరు, డిటర్జెంట్ల నుంచి... ఇంధనంలో ఎథనాల్ కలపడం వరకు పెక్కు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు, సేవల విలువను ఆ సంఖ్యలకు జోడించడం వృద్ధికి అసలు కారణం. నిజానికి, 195 బిలియన్ డాలర్ల విలువలో సుమారు సగ భాగం బయో–పారిశ్రామిక వస్తూత్పత్తి (ఆల్కహాలిక్ పానీయాలు 25 బిలియన్ డాలర్లు), పశు గ్రాసం (23 బిలియన్ డాలర్లు), ఇంధనంలో ఎథనాల్ను మిళితం చేయడం (12 బిలియన్ డాలర్లు), ఆహారం–పాడి పరిశ్రమ ఉత్పత్తుల (8 బిలియన్ డాలర్లు) నుంచి చేకూరినవని తేలుతుంది. కణాలు, ప్రొటీన్లు, కణజాలాల నుంచి తయారు చేసిన ఔషధాలు లేదా వైద్య ఉత్పత్తులు, వైద్య సాధనాలు, వ్యాధి నిర్ధారణ, టీకాలతో కూడిన బయో–ఫార్మా విలువ 64 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. పెరుగు బయోటెక్నాలజీ ఉత్పత్తి?పాడి పరిశ్రమ ఉత్పత్తులను కూడా కలుపుకోవడం గమనిస్తే చాలు, బయో ఆర్థిక వ్యవస్థ గణనలోని డొల్లతనం ప్రస్ఫుట మవుతుంది. పులియడం వల్లనే పెరుగు తయారవుతుంది. పాల లోని లాక్టోస్ను ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ల్యాక్టిక్ యాసిడ్గా మార్చి, కేజిన్ ప్రొటీన్లు గడ్డకట్టడానికి సాయపడుతుంది. పులియ బెట్టిన డెయిరీ పదార్థాల ఉత్పత్తి బయోటెక్నాలజీ వినియోగానికి సంకేతమని చెబుతున్నారు. విలువను జోడించేందుకు, పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఆ ప్రక్రియ సాయ పడుతోంది కనుక దాన్నీ తమ వృద్ధి విజయగాథలో భాగం చేసుకుంటాం అంటున్నారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం, పెరుగు కూడా బయోటెక్నాలజీ ఉత్పత్తి కిందనే లెక్కన్న మాట! సజీవ సూక్ష్మ జీవులైన స్టార్టర్ కల్చర్లను ఉపయోగించి పాలను పులియబెట్టి సృష్టి స్తున్నది కనుక, పెరుగు బయో–పారిశ్రామిక ఉత్పత్తి కింద లెక్క. బయో సర్వీసుల విభాగాన్ని (25 బిలియన్ డాలర్లు) చేర్చడం కూడా బయో ఆర్థిక వ్యవస్థ చూపిన తళుకు బెళుకు సంఖ్యలకు మరో కారణం. ఇవేవీ కీలకమైన ఆర్ అండ్ డీ సర్వీసుల కిందకు రావు. ఫార్మాస్యూటికల్ కంపెనీలకు క్లినికల్ అధ్యయనాలు, వాటి సంబంధిత సేవల కిందకు వస్తాయి. బహుళజాతి జీవ శాస్త్రాల సంస్థలకు ఔట్ సోర్సింగ్ సేవల కిందకు వస్తాయి. జీవ శాస్త్రాలకు సంబంధించిన సుమారు 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్, బెంగళూరుల్లోనే ఉన్నాయి. ఈ యూనిట్లు వాటికి మాతృసంస్థలకు చెందిన వివిధ (పరిశోధన, రెగ్యులేటరీ, ఎనలటిక్స్, ఎంటర్ప్రైజ్) పనులను చక్కబెడతాయి. ఇక్కడ మాతృసంస్థలంటే, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, మెడికల్ సాధనాల కంపెనీలన్న మాట. బయో ఆర్థిక వ్యవస్థ విలువను గణించడంలో మొత్తం జీసీసీలను లెక్కలోకి తీసుకున్నారు. చోద్యం ఏమిటంటే, సాఫ్ట్వేర్ సర్వీసులకు చెందిన పరిశ్రమ సంస్థ ‘నాస్కామ్’ విడుదల చేసిన డేటా కూడా టెక్నాలజీ ఔట్ సోర్సింగ్లో భాగంగా అవే జీసీసీలను పరిగణనలోకి తీసుకోవడం!బలహీనతలు కప్పిపుచ్చుకునేందుకే!బయో ఆర్థిక వ్యవస్థ నివేదికను తయారుచేసే కసరత్తును మొదట్లో బయోటెక్నాలజీ నేతృత్వ సంస్థల సంఘం నిర్వహించేది. అది 2016లో దాన్ని మొదలుపెట్టింది. ఆ పరిశ్రమకు సంబంధించి పన్నుల్లో రాయితీలు గట్రా రాబట్టే లాబీయింగ్ గ్రూపుగా అది పని చేసేది. తర్వాత, ఆ బాధ్యతను బయోటెక్నాలజీ శాఖ తలకెత్తుకుంది. కాగా, ఆకర్షణీయమైన సంఖ్యలను సమర్పించే పని మూడేళ్ళ క్రితమే మొదలైంది. బయో–పారిశ్రామిక రంగాన్ని చేరుస్తూ, బయో ఆర్థిక వ్యవస్థ నిర్వచనంలో 2023లో మార్పు తెచ్చారు. ఆ నిర్వచనం, పూర్వం నుంచి అమలులోకి వచ్చే విధంగా, 2020, 2021, 2022 సంవత్సరాల సంఖ్యలను సవరించారు. డీబీటీ రూపుదిద్దుకునేందుకు పదేళ్ళకు ముందే, అంటే 1986లోనే, దేశీయ పరిజ్ఞానంతో ఎంజైములను తయారు చేసే సంస్థను కిరణ్ మజుందార్ షా నెలకొల్పారు. ఆల్కహాలిక్ పానీయాలు, సబ్బులు, డిటర్జెంట్లు, పశుగ్రాసం, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు, ఇతర ప్రోబయోటిక్స్, టెక్స్టైల్స్, తోలు పరిశ్రమ... ఇలా చెబుతూ వెళితే చాలా వాటి తయారీలో పారిశ్రామిక ఎంజై ములను ఉపయోగిస్తారు. పారిశ్రామిక బయోటెక్నాలజీ వాణిజ్య వినియోగం చాలా ఏళ్ళుగా సాగుతోంది. దాన్ని వినియోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలకు డీబీటీ ఆర్ అండ్ డీ ఫలితాలు నామమాత్రంగా పనికొచ్చాయని చెప్పవచ్చు. కొన్ని సంస్థలకు ఏ విధంగానూ ఉపకరించిందీ లేదు. డీబీటీ ఒక విధంగా ‘క్రెడిట్ చోరీ’కి ప్రయత్నిస్తోంది. గొప్పగా చెప్పుకుంటున్న సంఖ్యలు బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే తోడ్పడుతున్నాయి. బయోటెక్నాలజీ రంగం ఆ సంఖ్యలు సూచిస్తున్నంతగా పరిణతి చెందలేదు. ప్రభుత్వం 2025 ఏడాదికి సాధించిన ప్రగతికి సంబంధించి చెప్పిన సంఖ్యలో దాదాపు సగ భాగం బయో–పారిశ్రామిక విభాగం చలవేనని చెప్పాలి. అది ఇంధనంలో ఎథనాల్ మిళితం చేయడం వల్ల ఒనగూడిన హంగు.చైనా బయోటెక్నాలజీ రంగం 300 బిలియన్ల డాలర్లకు పైగా విలువతో వర్ధిల్లుతోంది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏరుకొచ్చిన సంఖ్యలపై ఆధారపడే బదులు భారతదేశపు బయోటెక్నాలజీ ఆర్ అండ్ డీ – నవీకరణ రంగం సాధించిన ప్రగతి, అది వాణిజ్య పరంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ, ఆర్ అండ్ డీకి మార్కెట్లకు మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఒక నివేదికను ప్రచురిస్తే సముచితంగా ఉంటుంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఎం.కె. స్టాలిన్ (ముఖ్యమంత్రి) రాయని డైరీ
అసలొక మనిషిని పట్టించుకోకూడదని మనం అనుకుంటున్నామంటేనే, ఆ మనిషిని వదిలించుకోలేనంత గట్టిగా మనం పట్టుకొని ఉన్నామని! ‘అతడి’ పేరును నేను ర్యాలీలలో రానివ్వటం లేదు. మీటింగులలో రానివ్వటం లేదు. మాటల్లో, ‘మాటకు మాట’ల్లో కూడా రానివ్వటం లేదు. అతడిని నేను ఏదైనా అనాలని, అతడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు! ‘స్టాలిన్ అంకుల్’ అన్నాడు. నేను పట్టించుకోలేదు. ‘తీమై శక్తి’ అన్నాడు. నేను పట్టించుకోలేదు. ‘యాంటీ పీపుల్’ అన్నాడు. నేను పట్టించు కోలేదు. ఒకటీ రెండుసార్లు ‘చీఫ్ మినిస్టర్’ అని కూడా అన్నాడు! అదీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ‘స్టాలిన్ సర్’ అంటున్నాడు. అది మాత్రం నేనెందుకు పట్టించుకోవాలి? అతడివన్నీ సినిమా మాటలు! సినిమాల నుంచి వచ్చిన ఎంజీఆర్, డీఎంకేని ‘తీమై శక్తి’ అనేవారు. సినిమాల నుంచే వచ్చిన జయలలిత కూడా డీఎంకేని ‘తీమై శక్తి’ అన్నారు. ఇప్పుడు అదే మాటను అతడు పట్టుకున్నాడు!‘తీమై శక్తి’ అంటే దుష్ట శక్తి. అదేం పెద్ద మాట కాదు కానీ, పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అతడు ఇంకా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ‘‘ఈ ఎన్నికలు డీఎంకేకి, బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు; ప్రజలకు, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు’’ అని అంటున్నాడు. ప్రజలు అంటే అతడు, అవినీతి అంటే నేను! మంచి డైలాగే. ‘స్టాలిన్ అంకుల్’ అనటం కూడా ఒక ఎత్తుగడ. నన్ను ‘నిన్నటి తరం మనిషి’గా చూపించి, తను ‘రేపటి తరం నాయకుడి పాత్రను పోషించాలని చూస్తున్నాడు! వరదలు, విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు కావలసింది, తెడ్లతో పడవను నడుపుకుంటూ ఇంటి ముందుకు వచ్చే నాయకుడే కానీ, తెరపై కనిపించే కథానాయకుడు కాదు.నేను చెన్నైలోని కొళత్తూర్ నుంచి పోటీ చేస్తున్నాను. అతడూ చెన్నై నుంచే పెరంబూర్లో పోటీ చేస్తున్నాడు. ఆ ఒక్కచోట నుంచి మాత్రమే కాదు, తూర్పు తిరుచ్చి నుంచి కూడా నిలబడ్డాడు. ఇంకో మూడు రోజుల్లో స్టాలినా, మోదీనా అన్నది తమిళనాడు ప్రజలు తేల్చేస్తారు. తమిళులకు, ఢిల్లీ నియంతలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. అతడు అంటున్నట్లుగా అతడికి, నాకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు. డీఎంకే, డీకేఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే ఒకవైపు; అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకె ఇంకో వైపు. ఈ రెండు వైపుల్లో ఏ వైపూ అతడు లేడు. లేడు కానీ, లేకుండానూ లేడు! చెన్నై, మదురై, తిరుప్పూర్ జిల్లాల్లో అతడి ‘షో’కి కొన్ని టిక్కెట్లు తెగొచ్చు. ఆ తెగేవీ, మిగతా చోట్లవీ కలిపి అతడి ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీకి 25 – 45 సీట్లు వస్తే కనుక, అతడిని పట్టించు కోకుండా ఉండటం కుదరకపోవచ్చు. 118 సీట్ల మెజారిటీ ఏ వైపూ రాకుంటే డీఎంకే, బీజేపీ రెండూ అతడి వైపే చూడాల్సిందే.‘ఇళయ తలపతి’ యువతను ఆకట్టుకుంటున్నాడని అతడి గురించి డీఎంకే యూత్ వింగ్ చెబుతోంది. తమిళనాడులో వెండితెరకు, సచివాలయానికి మధ్య గీత కాగితమంత పలుచగా ఉంటుందని నాన్న చెప్పటం కూడా నాకు గుర్తుకొస్తోంది. అతడిని జాగ్రత్తగా డీల్ చేయాలి. మరీ గట్టిగా దాడి చేస్తే వీరుడు అవుతాడు. అసలే వదిలేస్తే ఏనుగంత ఐపోతాడు! మీడియా కెమెరాలు అతడిని ఎంతగానో ఇష్టపడటం నేనూ చూస్తున్నాను. కానీ గ్రామాల్లోని ప్రజలు అతడిని నమ్ముతారా? ఒకందుకైతే అతడిని మెచ్చుకుని తీరాలి. ఉదయించే సూర్యుడికి ఎదురెండలో నిలబడే ధైర్యం అతడిలో ప్రకాశిస్తూ ఉంది! పోలింగ్కి ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నాయి. తమకు మూడు గంటల సినిమా హీరో కావాలా, లేక ఐదేళ్ల నాయకుడు కావాలా అన్నదిక పూర్తిగా ప్రజల నిర్ణయమే. -
నాటో కూటమి కథ కంచికేనా?
ఇరాన్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమి ‘నాటో’లో అంతర్యుద్ధానికి కారణమవటం ప్రపంచ జియో పొలిటికల్ చదరంగాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నది. తమ దేశాల నౌకా బలగాలను హార్మూజ్ జలసంధి వద్ద మోహరింప చేయాలన్న యూఎస్ అధ్య క్షుడి విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. తమ దేశాలలోని సైనిక స్థావరా లను వినియోగించటానికి అంగీకరించ లేదు. ఈ యుద్ధం మా (నాటో) యుద్ధం కాదని తేల్చి చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు నాటో కూటమిని ‘కాగితపు పులి’గా అభి వర్ణిస్తూ యూఎస్ఏ దాన్నుండి వైదొలుగుతుందని బెదిరించాడు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని (ఇరాన్ యుద్ధాన్ని) సమర్థించని, యూఎస్ఏకు సహాయపడని మిత్ర దేశాలను యూఎస్ఏ రక్షించ బోదని ఆ దేశ రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ హెచ్చరించాడు. ఐరో పాను రక్షించటానికి మాత్రమే నాటో కూటమి ఏర్పడలేదనీ, యూఎస్ ఏను సమర్థించటం కూడా నాటో ప్రధాన విధి అనీ యూఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అభిప్రాయ పడ్డాడు.ప్రపంచాన్ని శాసించిన శక్తిరెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1949లో పన్నెండు దేశాలతో ఆవిర్భవించిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమి ఇటీవల స్వీడన్ చేరికతో 32 దేశాలకు విస్తరించింది. సోవియట్ రష్యాను అడ్డుకోవటానికి యూఎస్ఏ నాయ కత్వంలో ఏర్పడిన ఈ సైనిక–రాజకీయ కూటమి గత 75 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలను శాసించిందనటంలో సందేహం లేదు. ఈ 32 సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా దానిని మొత్తం కూటమి మీద దాడిగా పరిగణిస్తుంది. 32 సభ్య దేశాలే కాకుండా, 40 ఇతర దేశాలతో కూడా ఈ కూటమి సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకున్నది. సోవియట్ రష్యాను నిలువరించటానికి స్థాపించబడిన ‘నాటో కూటమి’ని సోవియట్ విచ్ఛిన్నం తరువాత కొనసాగించాల్సిన ఆవశ్యకత లేదు. రష్యా బలహీనంగా ఉండటాన్ని ఆసరాగా చేసు కొని ఈ కూటమి సోవియట్ ప్రాబల్య ప్రాంతాలలోనికి విస్తరించింది. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి దారి తీసింది. నాటో సభ్య దేశాలలో యూఎస్ఏ నాయకత్వంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఈ స్థావరాలలో అత్యాధునిక యుద్ధ విమానాలు, శత్రు క్షిపణులను ఎదుర్కొనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను, అమెరికన్ సైనికులను మోహరించి ఆ యా దేశాలకు యూఎస్ఏ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. సైనిక, గూఢచర్య సమాచారాన్ని, సైబర్ సమాచారాన్ని పంచుకోవటమే కాకుండా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ ఈ దేశాలపై సోవియట్ యూనియన్ (రష్యా), ఇతర శత్రు దేశాలు కన్నెత్తి చూడకుండా కాపాడుతున్నది.యూఎస్ఏ నీడన ఐరోపా1990వ దశకం నుండి క్రమంగా నాటో దేశాలలో అలసత్వం ప్రవేశించింది. తమ దేశాల సైనిక, రక్షణ బాధ్యతను పూర్తిగా యూఎస్ఏ పైన తోసివేశాయి. తమ రక్షణ ఖర్చులను తగ్గించి, పూర్తిగా సంక్షేమం, అభివృద్ధిపైన దృష్టి పెట్టాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలకు రష్యా ముప్పుగా కనప డటం ఆగిపోయింది. నాటో కూటమి ఒప్పందం ప్రకారం ప్రతి సభ్య దేశం తన జీడీపీలో కనీసం 2 శాతం రక్షణ రంగంపై ఖర్చు చేయా లనే నిబంధనను ఖాతరు చేయలేదు. మొత్తం రక్షణ వ్యయంలో 65 శాతం యూఎస్ఏ భరిస్తోంది. ఇదే సమయంలో ఈ ఐరోపా దేశాలు తమ తయారీ రంగాన్ని దాదాపుగా చైనాకు అవుట్సోర్సింగ్ చేశాయి. మానవ వనరుల కొరతను ఎదుర్కోవటానికి సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్టు, మొరాకో, అల్జీరియా వంటి దేశాల నుండి చౌక శ్రామికుల వలసలను ప్రోత్సహించాయి. ఇంధన అవసరాలకు రష్యా నుండి చౌకగా వచ్చే గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డాయి. స్థూలంగా పరిశీలిస్తే జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ మొదలగు ఐరోపా దేశాలు గత నాలుగు దశాబ్దా లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎగుమతి–దిగుమతి వ్యాపారం, విలాస వస్తువుల తయారీ వంటి రంగాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి. తక్కువ ఖర్చుతో ఉన్నత జీవన ప్రమాణాలను అను భవిస్తున్నాయి.ట్రంప్ 2025లో అధికారంలోకి రాగానే ‘అమెరికా ఫస్ట్’ నినా దాన్ని అందుకొన్నాడు. నాటో రక్షణ వ్యయంలో కూటమి దేశాలు తమ వంతు వాటాను భరించాల్సిందేనని మెలిక పెట్టాడు. ఐరోపా దేశాల రక్షణ బాధ్యతను మోస్తున్నందుకు ప్రతిఫలంగా ఇరాన్ యుద్ధంలో మద్దతు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. అమెరికా కోణంలో ఆలోచిస్తే ఈ వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. ఇరాన్ యుద్ధం తమ యుద్ధం కాదనేది యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల వాదన. ఇదే కోణంలో ఆలోచిస్తే ఉక్రెయిన్ యుద్ధం కూడా యూఎస్ఏ యుద్ధం కాదు. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కూడా కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఎదుర్కొంటున్నది యూఎస్ఏ సైనిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, యూఎస్ఏ ఆర్థిక సహాయమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.మాటలతో మారిన తీరు2003 ఇరాక్ యుద్ధంలో కూడా నాటో దేశాలు పాల్గొనటం విషయంలో ఇదేరకమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయిన ప్పటికీ యూకే, స్పెయిన్, ఇటలీ, పోలండ్ తమ సైనికులను యూఎస్ఏకు మద్దతుగా పంపించాయి. ప్రస్తుత ఇరాన్ యుద్ధం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించేముందు నాటో దేశాలతో చర్చించలేదు. గ్రీన్ల్యాండ్ విషయంలో ఐరోపా దేశాలను ట్రంప్ బేఖాతరు చేశాడు. వ్యక్తిగతంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే దేశాధినేతలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. వలసలను ప్రోత్సహిస్తూ ఐరోపా దేశాలు తమ నాగరికతను నాశనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యా నించాడు. ఉక్రెయిన్కు సహాయం అందించటంలో యూరోపియన్ యూనియన్కు అడ్డుగా వ్యవహరించిన హంగరీ దేశాధినేత విక్టర్ ఓబ్రామ్ను సమర్థించాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓబ్రా మ్కు యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్ బహిరంగంగా మద్దతు పలి కాడు. అయితే ఈ ఎన్నికల్లో 16 ఏళ్లుగా హంగరీని పాలిస్తున్న ఓబ్రామ్ ఓడిపోయాడు. ఓబ్రామ్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు కూడా సన్నిహితుడు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వైపు హంగరీ మొగ్గు చూపింది. పుతిన్ పరంగా ట్రంప్ మెతక వైఖరిని కొనసాగిస్తున్నాడు. ఇది ఐరోపా దేశాలకు మింగుడుపడటం లేదు. రష్యా నుండి చౌకగా లభించే గ్యాస్ దిగుమతులు ఆగిపోవటంతో ఐరోపా దేశాలు ఖతర్, యూఏఈ, సౌదీ నుండి ఎల్ఎన్జీ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. అందువలన హార్మూజ్ జల సంధి కేంద్రంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం కొనసాగటం వాటికి ఇష్టం లేదు. ఈ యుద్ధం కేవలం యూఎస్ఏ–ఇరాన్ మధ్య కాదు. ఇజ్రాయెల్ చేరికతో యుద్ధానికి ‘మతం రంగు’ అలుముకోవటం ఖాయం. ఫ్రాన్స్లో 6.7 మిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం జనాభాలో సుమారు 10 శాతం. జర్మనీలో సుమారుగా 5.7 శాతం (4.7 మిలియన్లు) ముస్లిం జనాభా ఉన్నది. ఈ యుద్ధంలో భాగస్వా ములయితే తమ దేశాలలోని ముస్లిం పౌరుల మద్దతు ప్రమాదంలో పడుతుంది. నాటో దేశాలు మారుతున్న పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ బడ్జెట్లను పెంచి, సైనిక సామర్థ్యం వైపు దృష్టి పెడుతు న్నాయి. ఐరోపా దేశాల మధ్య సైనిక సంబంధాలను పటిష్ఠం చేయాలని చూస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవనం చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారత్, చైనాలతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ట్రంప్కు కళ్లెం వేసే మార్గమేమిటి?
ఇరాన్తో 12వ తేదీన జరిగిన చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన గమనించదగ్గది. చాలా అంశాలలో ఇరాన్తో ఏకాభి ప్రాయం కుదిరిందనీ, అణ్వాయుధాల తయారీని ఆపటంపై వారు పట్టుదల విడవలేదనీ, అందుకే చర్చలు విఫల మయ్యాయనీ అన్నారు. వారికి అణ్వస్త్ర ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ దక్కనివ్వ బోమని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులలో ప్రపంచ నాయ కుల స్పందనలను గమనించగా, ఆయన మాటలను ఎవరూ విశ్వ సించటం లేదని అర్థమవుతున్నది. చర్చలు, ఒప్పందాల విషయమై తమను లోగడ రెండుసార్లు మోసం చేసిన ఆయన ఈసారి కూడా తమ విశ్వాసాన్ని పొందలేకపోయారన్న ఇరాన్ వ్యాఖ్యలు సరేసరి!ఒప్పందం రద్దు ట్రంప్ పుణ్యమే!చర్చల మినిట్స్ అందుబాటులో లేనందున అణుపరిశోధనలు, యురేనియం శుద్ధి, అణ్వస్త్రాల ఉత్పత్తి విషయమై నిర్దిష్టంగా ఎవ రేమి అన్నారో మనకు తెలియదు. అయినప్పటికీ ఈ కీలకమైన అంశంపై చర్చలకు ముందూ, తర్వాతా ఎవరేమన్నారో తెలిసిందే. అదే విధంగా గతంలో జరిగిందేమిటో కూడా. వాటన్నింటిని పరి గణనలోకి తీసుకున్నప్పుడు, ఇస్లామాబాద్ చర్చలు విఫలం కావటా నికి కారణం ట్రంప్ వైఖరి అని తేలికగా అర్థమవుతుంది. అందుకే ఆయనకు మిత్రదేశాల నుంచి కూడా మద్దతు లభించటం లేదు. ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు, యురేనియం శుద్ధి విష యమై ఇరాన్కు, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం గల అమె రికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్లతో పాటు జర్మనీకి మధ్య 2015 లోనే ఒప్పందం జరిగింది. దానిని ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ అన్నారు. దాని ప్రకారం ఇరాన్ శాంతియుత అవస రాల కోసం యురేనియంను 3.67 శాతం వరకు శుద్ధి జరపవచ్చు. అణ్వాయుధాల తయారీకి కావలసిన శుద్ధి 90 శాతం. ఈ శుద్ధి కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీ చేయవచ్చు.ఆ ప్రకారం 2015 నుంచి 2018 వరకు సజావుగానే సాగుతుండిన ఒప్పందాన్ని ట్రంప్ తన మొదటి హయాంలో ఆకస్మికంగా రద్దు చేయటంతో సమస్యలు మొదలయ్యాయి. అట్లా రద్దు చేసినా తమ వైపు నుంచి కొంతకాలం పాటు ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉండిన ఇరాన్, ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోక పోవటంవల్లనే యురేనియం శుద్ధి స్థాయిని 60 శాతం వరకు తీసుకువెళ్లి ఆపింది. అణ్వస్త్ర తయారీ మాత్రం తమ అజెండాలో లేదని అయతొల్లా ఖమేనీ ఫత్వా సైతం జారీ చేశారు. అటువంటి ఆయుధాల ఉత్పత్తి ఇస్లాంకు విరుద్ధమన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే గాక, ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు రోజు లలో అమెరికా, ఇరాన్ మధ్య ఒమాన్ మధ్యవర్తిత్వం ద్వారా తిరిగి చర్చలు, అవి దాదాపు ఒక కొలిక్కి రానుండగా దాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యాన్నంతా గుర్తు చేసుకోవటం ఎందుకంటే, అణ్వస్త్రాలను ఆపటమే తమ అత్యంత ప్రాధాన్య లక్ష్యమనీ,అందుకు ఇరాన్ కలిసి రానందునే చర్చలు ముందుకు సాగలేదనీ ట్రంప్ వాదించబూనటం తెంపరితనం మాత్రమే అవుతుంది. ప్రపంచం అందువల్లనే ఆయనను నమ్మటం లేదు.దిగ్బంధనం– గందరగోళంఇస్లామాబాద్ చర్చలకు ముందే ఇరువురు తమ తమ షరతులు ప్రకటించారు. అవి ఇంచుమించు గత నెల షరతుల వంటివే. అయి నప్పటికీ, రాజీ అంటూ జరగాలి గనుక చర్చల సమయంలో కొంత పట్టువిడుపులు ఉంటాయనే భావన కలిగింది. ఇటువంటి దౌత్య చర్చలు ఎపుడైనా పలు విడతలుగా సాగుతూ క్రమంగా కొన్ని రాజీ లతో అంతిమ ఒప్పందం జరుగుతుంది. ఈసారి కూడా చర్చలు 21 గంటలపాటు సాగిన తర్వాత, రాగల రోజులలో తిరిగి చర్చలు ఉండగలవనే సంకేతాలు రెండు దేశాల ప్రతినిధుల నుంచి వినిపించాయి. కానీ, ‘ఖలునికి నిలువెల్ల విషముగదరా సుమతీ’ అన్నట్లు తన నిలువెల్ల ‘ఆయుధాలు, సైనిక బలం’ అన్న మిడిసిపాటు తప్ప దౌత్యనీతి అనే మాటకు చోటులేని ట్రంప్ మాత్రం వెంటనే హార్మూజ్ దిగ్బంధం అంటూ హెచ్చరించటంతో ఆగక, దిగ్బంధనం కోసం తమ నౌకా దళాలకు ఉత్తర్వులు జారీ చేశారు.దానితో ఇరాన్ లొంగి వస్తుందని ఆయన అంచనా వేసిన ట్లున్నారు. కానీ, జరిగిందేమిటి? ప్రపంచమంతటా చమురు ధరలు పెరిగి, స్టాక్స్ పడిపోయాయి. చర్చలు నెరవేరగలవన్న ఆశాభావా లతో తగ్గిన చమురు, పెరిగిన స్టాక్స్, ఆయన పుణ్యమా అని తిరిగి గందరగోళంలో పడ్డాయి. నిజానికి హార్మూజ్ ద్వారా రవాణా అయ్యే చమురు, ఇతర సరకులు అన్నీ ఇరాన్వేమీ కాదు. అరబ్ దేశాలవి, బయటి దేశాలవి కూడా గణనీయంగా ఉన్నాయి. అది తర్వాత బోధ పడి కావచ్చు, మొత్తం హార్మూజ్ను కాకుండా ఇరాన్ రేవులను మాత్రమే దిగ్బంధిస్తామన్నారు. అందుకు ఇరాన్ తాము ఆ ప్రాంతంలోని అరబ్ రేవులన్నింటిపై దాడులు జరపగలమని హెచ్చరించింది. ఆ జలసంధిలో మైన్స్ మరొకవైపు ఉండనే ఉన్నాయి. ఈ హెచ్చరిక లతో మళ్లీ గందరగోళం మొదలైంది.చట్టాలకు లోబడేట్టుగా...ఒప్పందాలు, ఒప్పంద చర్చలను ప్రతిసారీ భంగపరుస్తున్న ఇజ్రాయెల్ ఈసారి కూడా ఆ పని చేస్తుండటం మొదటినుంచీ కనిపించిందే. యుద్ధ విరమణ లెబనాన్కు సైతం వర్తించాలన్న షర తును ఇరాన్ మొదటనే విధించగా, అందుకు ట్రంప్ పాకిస్తాన్ ద్వారా సమ్మతి తెలిపారు. కానీ ఇజ్రాయెల్ తమకు దానితో నిమిత్తం లేదంటూ దాడులు కొనసాగించగా, ట్రంప్ కూడా అది వేరే అంశమంటూ వాదించారు. చర్చలపట్ల ట్రంప్, నెతన్యాహూల ఆంతరంగిక ఆలోచనలకు అద్దంపట్టిన విషయాలలో ఇదీ ఒకటి. అందుకు తగినట్లుగానే ట్రంప్ ఇజ్రాయెల్కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తుండగా, మధ్యవర్తి పాకిస్తాన్ చేష్టలుడిగి మిన్నకుంటున్నది.అసలు వాస్తవం ఏమంటే, అమెరికాకు గానీ, ఇజ్రాయెల్కుగానీ ఇరాన్ అణు పరిశోధనలు వట్టి సాకు మాత్రమే. అమెరికాకు కావలసింది అక్కడ ఒక సామంత రాజ్యాన్ని నెలకొల్పి చమురు నిల్వలు తమ అధీనంలోకి తెచ్చుకోవటం. వెనిజులా వలెనే ఇరాన్ చమురు గురించి స్వయంగా ట్రంప్ చెప్పిందే. ఇజ్రాయెల్కు కావలసింది గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడి, ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక శక్తిగా మిగలక పోవటం. ప్రపంచమంతా ఇప్పటికే గుర్తించిన ఈ వాస్తవాలు తిరిగి రుజువవుతున్నాయి.ట్రంప్ అరాచకానికి కళ్లెం వేయగల మార్గం ఒకే ఒకటి కని పిస్తున్నది. ఇది ఇట్లానే అందరినీ చుట్టుముట్టరాదంటే రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఆసియాన్ కూటమి, ఆఫ్రికన్ యూనియన్, బ్రెజిల్ వంటి దక్షిణ అమెరికా దేశాలు కలిసి, అమెరికా పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఐక్యరాజ్యసమితి ద్వారా మాత్రమే వ్యవహరించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఒక నిర్ణీత వ్యవధిలో అందుకు అంగీకరించనట్లయితే అమెరికా, ఇజ్రాయెల్లతో దౌత్య సంబంధాలు రద్దు చేసుకోకున్నా, సస్పెండ్ చేయగలమని హెచ్చరించాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్గా తయారయింది. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెండు చట్టాలు, రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలుపరిచే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియోజకవర్గాల పునర్విభజనను దానికి ముడిపెట్టడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనలపైనే అభ్యంతరాలున్నాయి.చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు రిజర్వు చేయాలన్న ప్రతిపాదన దేశంలో దశాబ్దాలుగా నలుగుతోంది. చట్టం చేయాలన్న ఆలోచనలోనే పలు అవరోధాలు ఎదురై ఎట్టకే లకు 2023లో చట్టం ఏర్పడింది. అది కూడా 2024 సార్వత్రిక ఎన్ని కల వాకిట్లో ఆదరాబాదరాగా వచ్చిందే! అమలు ఎప్పట్నుంచి అన్న ప్రశ్న అప్పట్లోనే వివాదాస్పదమైంది. 2026 తర్వాత అందుబాటులో ఉండే తాజా జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజక వర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమలు పరచాలని నిర్ణయించి, దాన్నే చట్టంలో పొందుపరిచారు. కోవిడ్ కారణంగా 2021లో జరగని జనగణన 2025లో చేపట్టి ఏడాదిలో పూర్తి చేస్తారనీ, వెంటనే పునర్విభజన జరిపి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు జరపొచ్చనీ భావించారు. కానీ, 2025లో జన గణన మొదలు కాలేదు. ఇప్పుడు చేపట్టినా వచ్చే సంవత్సరం మధ్య నాటికి పూర్తిచేయడం, ఆపై పునర్విభజన కమిషన్ ఏర్పరచి తాజా గణాంకాలతో ఆ ప్రక్రియను పూర్తిచేసి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కష్టమనే కొత్త అభిప్రాయం బలపడింది. దాంతో, ఇక రిజర్వేషన్ల అమలు 2034 ఎన్నికల్లోనే అనుకుంటు న్నారు. ఉన్నట్టుండి ‘లేదు లేదు, తాజా జనగణనతో నిమిత్తం లేకుండా పాత లెక్కలతోనే పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసేద్దాం’ అని ఎన్డీయే పెద్దన్న బీజేపీ తీసిన కొత్త రాగమే భిన్నాభిప్రాయాలకు కారణమైంది.మహిళా ఓట్లపై గురిచట్ట సభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఇప్పించడంలో మాకున్నంత పట్టుదల మరెవరికీ లేదని బీజేపీ నాయకత్వం చాటు కోవాలనుకుంటోంది. అందుకే తెలివిగా రిజర్వేషన్ అంశాన్ని పునర్విభజనతో ముడిపెట్టింది. 2023 మహిళా రిజర్వేషన్ చట్టంలో ఉన్నట్టుగా 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అంటే అది తప్పనిసరిగా జాప్యమౌతుంది. 2029లో కాకుండా రిజర్వేషన్ల అమలు 2034కు వెళుతుంది. కానీ, 2029 లోపే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా అంతకుముందే జరిగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, కర్టాటక, తెలంగాణ – పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల్లోనూ మహిళా ఓట్ల మొగ్గుతో లబ్ధి పొందవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. ఈ అంశంపై జరిగే చర్చ ద్వారా ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగాల్సివున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మహిళా ఓటర్లనూ మచ్చిక చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నది ఆశ! తాజా జనాభా లెక్కలు వచ్చాక, జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల సంఖ్యను పెంచితే ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల వ్యత్యాసం మరింత పెరుగుతుంది. దానికి విరుగుడుగా, కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యకు ఏకరీతిలో అంతటా 50 శాతం పెంచడం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రచారం చేసేట్టు వ్యూహ రచన చేశారు. మరింత చర్చకు డిమాండ్పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై మరింత చర్చ జరగాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. పెంపు వెంటనే చేపడితే మూడో వంతు సీట్లు (50 శాతం పెంపు ద్వారా) కొత్తగా వస్తాయి కనుక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు పరచడంలో ఎవరికీ ఇబ్బందులుండవని పాలక పక్షం వివరిస్తోంది. అలా జరిగితే, తమకు రాజకీయంగా పట్టున్న అధిక జనాభా రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి ఆధిక్యత లభిస్తుంది. తక్కువ మోతాదులో సీట్లు పెరిగే దక్షిణా రాష్ట్రాల్లో తమకు ఎలాగూ పట్టు లేదు కనుక ఆయా రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడాల్సిన రాజకీయ అవసరం ఉండదనేది భరోసా! దీన్నే దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. జనాభా పెరుగుదలకు కారణమైన వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచి బహుమతినిస్తారా అని అవి ప్రశ్నిస్తున్నాయి.చట్టసభల్లో ఇప్పుడున్న సంఖ్యలోనే మూడో వంతు స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్ అమలు పరచాలని కాంగ్రెస్ అంటోంది. ఇందుకు పదిహేనేళ్లనాటి 2011 జనాభా లెక్కలు కాకుండా, వెంటనే జనగణన ముమ్మరం చేసి, 2027 మే నాటికి లభించే తాజా గణాంకాల్ని రిజర్వేషన్ల ఖరారుకు వాడుకోవాలని సూచిస్తోంది. ‘ఇండియా’ కూటమి అభిప్రాయం నేడు జరగనున్న వారి భేటీలో తేలవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేష న్ను జీఎస్డీపీకి లింక్ పెట్టాలని కొత్త ప్రతిపాదన తెచ్చారు. దీనికి ఇతర రాష్ట్రాలు, పార్టీలు ఏ మేరకు మద్దతిస్తాయో చూడాలి.ప్రత్యామ్నాయం పరిష్కారంనియోజకవర్గాల పెంపు విషయంలో ఏ పద్ధతి అనుసరించాల న్నది ప్రశ్నార్థకంగా మారింది. అందరు ఓటర్లు విలువ సమానంగా, ఒకటిగానే ఉండాలని మొదట్లో భావించారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను, భౌగో ళిక స్వరూపాలను మార్చాలని నిర్ణయించారు. ఇందుకుగానూ ప్రతి పదేళ్లకోసారి ‘పునర్విభజన కమిషన్ల’ ఏర్పాటు ప్రతిపాదించారు. 1951, 1962, 1972లో అలా కమిషన్లు ఏర్పడ్డాయి. లోక్సభ స్థానాల సంఖ్య 494 నుండి 522కు, 543కు పెరుగుతూ వచ్చింది. జనాభా ప్రాతిపదికగా నియోజక వర్గాల సంఖ్యను పెంచితే జనాభా నియంత్రణ లక్ష్యాలకు విరుద్ధంగా ఉంటుందనే ఆలోచన 1972 తర్వాత వచ్చింది. అందుకే నాటి లోక్సభ స్థానాల సంఖ్య 543కు కట్టడి విధించి, 2000 సంవత్సరం వరకు సంఖ్యను మార్చొ ద్దని నిర్ణయించారు. ఈ మేరకు 42వ రాజ్యాంగ సవరణ (1976)తో ఒకసారి, 84వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా మరోసారి సంఖ్యను పెంచకుండా 2026 వరకు కట్టడి చేయాల్సి వచ్చింది. 1913 నుండి ‘ప్రతినిధుల సభ’ సభ్యుల సంఖ్యను అమెరికాలో 435కి కట్టడి చేసినట్టు మన దగ్గర కూడా కట్టడి చేయడమో, మరో హేతుబద్ధమైన ప్రత్యామ్నాయ విధానాన్నో వెతకాలి. జనాభా ప్రాతిపదికన ఏకరీతి సర్దుబాటు లోక్సభ స్థానాల్లో జరిపి, జనాభా నియంత్రించిన వారికి ప్రోత్సాహాలిచ్చే పద్ధతి రాజ్యసభ స్థానాల్లో కల్పించవచ్చనే సూచన వస్తోంది. అంతే తప్ప, ఏపీ సీఎం చంద్ర బాబు చెబుతున్నట్టు ‘ఇబ్బడి ముబ్బడిగా పిల్లల్ని కనండి, మనకు నియోజక వర్గాలు పెరిగి ప్రాతినిధ్యం పెరుగుతుంది’ అన్నది పరి ష్కారం కాదు. అది తప్పు అవుతుంది.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
నిషేధం కాదు... కంటెంట్ కావాలి!
సోషల్ మీడియాపై చర్చ కొత్త దశకు చేరుకుంది. 16 ఏళ్ల లోపు బాలల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తు న్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. డిజిటల్ వ్యసనం, ఆన్లైన్లో అపరిమిత కాలాన్ని వెచ్చిస్తున్నందువల్ల కొన్ని పరిమితులు తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు కూడా అదే బాట పట్టే అవకాశముందని వార్తలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మైనర్లను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ఒక చట్టం తెచ్చింది. అదే తరహా విధానాలు అనుసరించడంపై ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు చర్చిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం దెబ్బ తినడం, సైబర్ బెదిరింపులు, నిద్రలో అవాంతరాలు వంటి సమ స్యలు తలెత్తుతున్నమాట వాస్తవమే. ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ వంటి సంస్థల అధ్యయనాలు కూడా ఆ సంగతిని ధ్రువీకరిస్తున్నాయి. బాలలు ఎలక్ట్రానిక్ తెరల ముందు రోజూ ఏడు గంటలకు పైగా గడుపుతున్నారని అవి తెలుపుతున్నాయి.సోషల్ మీడియా ‘కత్తి’ లాంటిది!ఎడతెగని ఫార్వర్డ్లు, సంచలనాత్మక అభిప్రాయాలు వ్యక్తపర చడం గురించి సోషల్ నెట్వర్క్ వాడకందారులు ఎవరికైనా వేరే చెప్పనవసరం లేదు. వాట్సాప్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్ఫారాలు తప్పుడు సమాచారానికి కారణమవుతున్నాయని నిందలు మోస్తున్నాయి. ఎన్నికల సందర్భాలలోనైతే చెప్పనే అక్కర లేదు. ఏది బూటకమో, ఏది వాస్తవమో నిర్ధారణ కాకపోయినా ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ముద్ర వేసుకుని వచ్చేస్తాయి. ఫలితాలను ప్రభావితం చేయడంలో, హింసకు పురిగొల్పడంలో వాటి పాత్రను తోసిపుచ్చలేం. ఢిల్లీలో 2020 నాటి అల్లర్లను దానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నిషేధించడం, లేదా నియంత్రించడం తప్ప గత్యంతరం లేదు. కానీ, ఆ యా వేదికలది తప్పా, లేక వాటిని వినియోగించుకుంటున్న మన తీరులో లోపం ఉందా అనే ప్రశ్న వెన్నాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియా దానికదే విషపూరితమైనది కాదు. క్యాట్ వీడియోలు, కుట్ర సిద్ధాంతాలు, కవ్వించే మాటల వంటి అల్పమైన విషయాల వరదలో టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, ఘర్షణ ప్రాంతాల నుంచి పౌరులు నేరుగా నివేదించే కథనాల వంటి మంచి సంగతులు కూడా కొట్టుకొస్తాయి. ఇస్రో రాకెట్ ప్రయోగాల ప్రత్యక్ష వీడియోల వంటివి యువతలో స్ఫూర్తిని నింపుతాయి. అటువంటి సంగతులు మాధ్యమం తటస్థమైనదేననే సంగతిని గుర్తుచేస్తాయి. ఇదీ కత్తి లాంటిదే! దానితో కూరగాయలు తరగ వచ్చు. ఒంటికి గాయమూ చేసుకోవచ్చు. చరిత్ర నేర్పుతున్న పాఠాలుగూటెన్బర్గ్ 1440లో ముద్రణా యంత్రం కనుగొనడంతో విషయ పరిజ్ఞానం అందరికీ అందడం మొదలైంది. పునరుజ్జీవన, సంస్కరణవాద ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. యూరప్లో అక్షరాస్యత 10 శాతం నుంచి దాదాపు నూరు శాతానికి చేరుకుంది. అదే సమయంలో మూఢ నమ్మకాలను, కక్ష సాధింపు ప్రాపగాండాను పెంపొందించే కరపత్రాలు కూడా పుట్టుకొచ్చాయి. అయినా, నిషేధాలు నిలువలేదు. టెక్నాలజీయే కొనసాగింది. రేడియో వాడుకలోకి వచ్చినప్పుడు కూడా అదే ధోరణి పునరా వృతమైంది. జర్మనీలో 1930లలో హిట్లర్ విద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తికి అది కారణమైంది. ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ ఉత్తేజపూరిత ప్రసంగాలు అమెరికా ఐక్యానికి దోహదపడ్డాయి. టెలివిజన్ రాకతో నిరాధారమైన ఆరోపణలతో ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేసే పద్ధతి ఊపందుకుంది. అదే సమయంలో, పౌర హక్కులకు రక్షణ కల్పించి, మార్పునకు చేయూతనందించింది. నేడు సోషల్ మీడియా కూడా అదే బాటలో ఉంది. 50 కోట్ల మంది యూజర్లు, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్గా మన దేశాన్ని మార్చారు. ‘నాసా’ కృష్ణబిల చిత్రాలను కొన్ని అందిస్తే, భ్రమలను తొలగిస్తూ నోబెల్ బహుమతి గ్రహీతలు చెప్పే మాటలను మరికొన్ని అందిస్తున్నాయి. వన్యప్రాణులపై డిస్కవరీ ఛానల్ రీల్స్ వస్తున్నాయి. అలా వేదికలు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి. వదంతులను వ్యాప్తి చేస్తోందని ట్విట్టర్ను తిట్టుకున్నాం. కానీ, కోవిడ్ మృతుల విషయంలో భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇచ్చిన తాజా సమాచారాన్ని కూడా ట్విట్టరే ఎప్పటికప్పుడు అందించింది. డిజిటల్ ఎకో సిస్టంనిజమైన సవాల్ నిషేధించడంలో కాక, ఎకో సిస్టంను సుసంపన్నం చేయడంలో ఉంది. దేశంలోని 1.4 బిలియన్ల మందిలో మూడొంతుల మంది 35 ఏళ్ళ లోపువారు. వార్తలకు వారు డిజిటల్ మార్గాలపైనే ఆధారపడుతున్నారు. యువతలో 80 శాతం మంది సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల నుంచి పొందు తున్నారు. ప్రజానిధులతో ప్రభుత్వం కూడా బోలెడంత సమాచా రాన్ని ఎత్తిపోస్తోంది. వాటిలో నీతి ఆయోగ్ నివేదికలు, విశ్వ విద్యాలయ గ్రాంట్ల సంఘ పరిశోధన పత్రాలు, రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ నవీకరణలు కూడా ఉన్నాయి. కానీ, అవన్నీ ప్రాచుర్యానికి నోచుకోని ఎక్కడెక్కడో సైట్లలో పీడీఎఫ్ల రూపంలో మూలుగుతున్నాయి. కొందరు ఉన్నత విద్యావంతులు మాత్రమే వాటిని చూస్తున్నారు. మంత్రిత్వ శాఖల నివేదికలలో 70 శాతం ఏటా వెయ్యికన్నా తక్కువ మంది చూపరుల దృష్టికి మాత్రమే ఆనుతున్నాయని 2023 నాటి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో తేలింది. సోషల్ మీడియా ఒక పరిష్కారాన్ని ఇవ్వజూపుతోంది. వ్యవసాయ చట్టాలను, లేదా వాతావరణ డేటాను వివరించే రీల్స్ చేసేందుకు ఇన్ఫ్లుయెన్సర్లతో వివిధ మంత్రిత్వ శాఖలు భాగస్వామ్యం కుదుర్చుకుంటే? ప్రాచీన చరిత్రపై విశ్వవిద్యాలయాలు టిక్టాక్ సిరీస్ చేస్తే? వేదాలను వైరల్ చేస్తే? నివేదికలను ఇన్ఫోగ్రాఫిక్స్గా మార్చేందుకు యువ క్రియేటర్ల సేవలను ఇస్రో, ఐఐటీలు, ఐసీఎంఆర్ వంటి ప్రభుత్వ సంస్థలు వినియోగించుకుంటే? వేదికలను సద్వినియోగం చేసుకునేటట్లు విద్యావేత్తలు, స్కాలర్లు తమ వంతు పాత్ర పోషించాలి. ‘పనికిమాలిన’వంటూ ప్లాట్ ఫారాలను చిన్నచూపు చూసే బదులు వారు క్వాంటమ్ ఫిజిక్స్, లేదా ఎన్నికల డేటాపై థ్రెడ్లను పోస్ట్ చేయవచ్చు. ఉన్నత ప్రమా ణాలతో కూడిన కంటెంట్ పెడుతున్నవారిని ఆ యా ప్లాట్ ఫారాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. కాకపోతే విచక్షణా జ్ఞానంతో అన్వేషిస్తూ పోవాలి. మేరీ క్యూరీ 1 గ్రాము రేడియం కోసం 8 టన్నుల పిచ్ బ్లెండ్ను జల్లెడ పట్టవలసి వచ్చింది. ఆ క్రమంలో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. సోషల్ మీడియా కూడా అదే రకమైన శ్రమను డిమాండ్ చేస్తోంది. చిందర వందర మధ్యలో అసలైన దాన్ని వెతికి పట్టుకోవాలి. సైట్ విశ్వస నీయతకు సంబంధించి న్యూస్ గార్డ్ వంటి టూల్స్ రేటింగ్ ఇస్తున్నాయి. ప్రభుత్వం కేవలం పోలీసుగానే వ్యవహరించకుండా, స్వయంగా క్వాలిటీ కంటెంట్ అందించాలి. వార్తాహరుడిని చంపే బదులు అతన్ని సమాచారంతో బలోపేతం చేయాలి.శివప్రసాద్ ఖేనేడ్వ్యాసకర్త సైన్స్ కమ్యూనికేటర్, మ్యూజియంవృత్తి నిపుణుడు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
తీర ప్రజలకు 'కారిడార్' ముప్పు
ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలు చూడాలి. మంచీచెడూ ఆలోచించాలి. విచక్షణ ఉండాలి. మరికాస్త సంయమనం పాటించాలి. వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా, సంస్థకైనా ఇది లోపించినప్పుడు ఆ వ్యవస్థలోని సమూ హాలు అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. కార్పొరేట్ల దోపిడీకి చట్టబద్ధత కల్పించే విధాన నిర్ణయాలు తీసుకోవడంతో నివారించ వీల్లేని ప్రమాదాన్ని విజనరీ ప్రభుత్వాలు తెచ్చిపెడుతున్నాయి. బీచ్ శాండ్ మినరల్స్ తవ్వకాలకు ఏపీ ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అనుసరించే విధానం రాబోయే కాలంలో పెను ముప్పు కాబోతుందని పర్యావరణ నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం లోపల ఖనిజాలు, లోహాలు; సముద్ర తీర ఇసుకలో ఉన్న ఖనిజ తవ్వకాలకు ప్రయత్నాలు జరుగు తున్నాయి. అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆటంకంగా ఉన్న ఆదివాసీ చట్టాలను బలహీనం చేస్తున్న ప్రభుత్వాల వ్యవహారం తెలిసిందే. ఇప్పుడు అదేవిధంగా విలువైన ఖనిజం ఎక్కడున్నా కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో ‘డబుల్ ఇంజన్లు’ వెళ్తున్నాయి. సముద్ర గర్భంలోని అపార ఖనిజ, లోహాలను వెలికితీసే ప్రణాళిక రూపొందించి, సముద్రంలో ఖనిజాలు గుర్తించడానికి ‘డీప్ ఓషన్ మిషన్’ కింద 4వేల కోట్లు పైగా కేంద్రం కేటాయించింది. జాతీయ భద్రతా మండలి సచివాలయం... సర్వే ఆఫ్ ఇండియా తాజా లెక్కల ప్రకారం 11,098 కిలోమీటర్ల భారత సముద్రతీరంలో ఖనిజ తవ్వకాలకు ప్రణాళిక తయారు చేసింది. భారత సముద్ర తీరంలో అత్యధిక పరిమాణంలో మైనింగ్ ప్రాసెసింగ్, పరిశోధన, తయారీలకు ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ప్రత్యేక ‘రేర్ ఎర్త్ కారిడార్’గా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఖనిజ తవ్వకాలకు ముందుకొచ్చే కార్పొరేట్లకు పెట్టుబడి ప్రోత్సాహం, భారీ రాయితీలు ఇచ్చేందుకు 2026–27 బడ్జెట్లో రూ. 7,280 కోట్లు కేటాయించింది. ఖనిజ దిగుమతిపై చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు వెతకడం అమెరికా ప్రారంభించింది. సొంత ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, భారత్ నుంచి ఎగుమతి చేసుకోవడం సురక్షితమని అమెరికా భావిస్తోంది. అమెరికా మాట కాదని చెప్పలేని కేంద్ర పాలకులు, వారికి అంగుదారునిగా తయారైన ఏపీలోని కూటమి ప్రభుత్వం అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా ఖనిజ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నాయి. అందుకనే రేర్ ఎర్త్ కారిడార్ పల్లవిని డబుల్ ఇంజన్ సర్కార్ ఎత్తుకుంది.రాష్ట్ర పరిధిలోని హక్కులను బలహీనం చేసి, ఆధిపత్యం పెంచుకునే కేంద్ర దుశ్చర్యలపై చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడడం లేదు. శాంతిభద్రతలు, సహజ వనరులు, ఖనిజాలు, మారిటైమ్, పట్టణ విధానం, భూ చట్టాలు, వ్యవసాయం వంటివి రాష్ట్ర పరిధిలో ఉన్నప్ప టికీ, నేరుగా కేంద్రం జోక్యం చేసుకొని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల దోపిడీకి అనుకూలమైన చట్టాలను కేంద్రం చేస్తోంది.బీచ్శాండ్ అపారంసర్వే ఆఫ్ ఇండియా తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని తీర ప్రాంతంలో బీచ్శాండ్ నిల్వలు 241 మిలియన్ టన్నులకు పైగా ఉన్నాయి. దేశంలోని బీచ్శాండ్ నిల్వలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రపంచంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగ వృద్ధికి ప్రాధాన్యం పెరుగుతుందన్న నేపథ్యంలో 2030 నాటికి రేర్ ఎర్త్ పర్మినెంట్ మ్యాగ్నెట్ల వినియోగం రెట్టింపు అవుతుందని అంచనా. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రతీరంలో మోనజైట్ నిల్వలు 35 శాతం ఉన్నాయి. సాంద్రత కల్గిన సముద్ర ఇసుకలో లభ్యమైన ఇల్మనైట్, జిర్కాన్, మోనజైట్, గార్నెట్, రూటైల్ వంటి ఖనిజం నుంచి వచ్చే థోరియం, యురేనియం, టైటానియం వంటి వాటిని విమానయాన, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాలు, విండ్ టర్బైన్లలో వినియోగించడంతో ప్రపంచంలో ఈ ఖనిజాలకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో అత్యంత నాణ్యమైన ఖనిజం 40 వేల ఎకరాలలో ఉన్నట్లు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎమ్డీసీ) గుర్తించింది. సెమీ కండక్టర్ల పరిశ్రమల కోసం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార మండలాల తీరంలోని 2,500 ఎకరాల్లో ఖనిజ తవ్వకాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీచ్శాండ్ ఖనిజ తవ్వకాలు, ప్రాసెసింగ్ను ఓ కార్పొరేట్ కంపెనీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సముద్రతీర ఇసుకలోని ఖనిజం ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వకూడదన్న కోర్టు తీర్పులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సముద్ర ఇసుకలో దొరికే అరుదైన ఖనిజాలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. పొంచి ఉన్న ప్రమాదాలుబీచ్శాండ్ ప్రాసెసింగ్ క్రమంలో వచ్చే శబ్దాలు, ప్రకంపనలు, సముద్రంలో విడిచిపెట్టే ఇంధనాలు, రసాయ నాలతో మత్స్య సంపద భారీగా దెబ్బతినడంతో పాటు జీవ, మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక దిబ్బలు కోతకు గురైతే సమీప నివాసిత ప్రాంతాల్లోకి ఉప్పునీరు ప్రవేశించి తాగునీటి సమస్య రానుంది. నిర్మాణాలు తొందరగా దెబ్బతింటాయి. సముద్ర తీరంలో ఔషధ, రసాయన పరిశ్రమలు విడిచిపెడుతున్న వ్యర్థాలతో చేపల ఉత్పత్తి తగ్గడంతో మత్స్యకారుల జీవనోపాధి తగ్గింది. ఇసుక తవ్వకాలతో ఉన్న కొద్దిపాటి ఉపాధి కూడా మత్స్యకారులకు లేకుండాపోతుంది. మోనజైట్ ఖనిజం నుంచి వెలువడే థోరియంతో చర్మ, క్యాన్సర్, ఊపిరి తిత్తుల వ్యాధులకు గురయ్యేవారి సంఖ్య పెరుగుతుంది. ఇన్ని అనర్థాలు, నష్టాలు, దుష్ప్రభావాలున్నా, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఇవన్నీ సాధారణ ప్రజలు అనుభవించాలన్నట్లు ప్రభుత్వాల తీరుంది. బీచ్శాండ్ మైనింగ్ ముప్పును ముందుగా గుర్తించి నిలువరించకపోతే జీవా వరణానికి ముప్పు తప్పదు.– గుల్ల కాంతారావు ‘ సీనియర్ జర్నలిస్టు -
వి.కె. శశికళ (‘చిన్నమ్మ’) రాయని డైరీ
తిరుప్పరన్కుణ్రం నుంచి అరప్పాలయం కూడలికి చేరుకోగానే ‘అక్క’ జ్ఞాపకాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అక్క ఆ కూడలిలో ఎన్నోసార్లు ఆగారు. అక్క రాక కోసం అక్కడివాళ్లు చెట్ల నీడల్ని చాపల్లా పరుచుకుని, మిద్దెల పైన ఎర్రటి ఎండల్లో కనురెప్పల్ని గొడుగుల్లా తెరిచి పట్టుకుని ఎదురు చూస్తుండేవారు. కళ్లూ చెవులే కాదు, ఆత్మనూ అప్పగించి అంతా అక్క మాటల్లో కొట్టుకుపోయేవాళ్లు! అక్క గొంతులో అమ్మతనం ఉండేది. కరుణానిధి మాటొస్తే అక్క స్వరం అగ్నిపర్వతం అయ్యేది. అక్క నాతో అంటుండేవారు, ‘‘శశీ! ప్రజల్లోకి వచ్చావంటే, నువ్విక నాయకురాలివి కాదు, ప్రజలే నీ నాయకులు’’ అని! నేనిప్పుడు ప్రజల్లోకి వచ్చాను. ప్రజలు అనే నాయకులు ఇప్పుడు నాకు రెండు ఆదేశాలు ఇచ్చారు. ‘‘చిన్నమ్మా... దుష్ట సంహారం చెయ్’’, ‘‘చిన్నమ్మా... నీ అడుగడుగునా మాకు ‘అమ్మ’ను గుర్తు చెయ్’’ అంటున్నారు. తేనిలోని ఆండిపట్టి దగ్గర కూడా ఇదే విధమైన భావోద్వేగం నన్ను కమ్మేసింది. ‘‘చిన్నమ్మా! మీరు దిగులు పడకండి. మీకు అండగా మేమున్నాం’’ అని ప్రజలు గట్టిగా అరిచి చెప్పారు. ఒక్కసారిగా నా కళ్లలోంచి నీరు ఉబికి వచ్చింది.అక్క కూడా నాతో ఇలాగే అనేవారు. ఇద్దరం వ్యాన్లో సభలకు వెళుతున్నప్పుడు, అకస్మాత్తుగా... ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్ శశీ?’’ అని అడిగేవారు! ‘‘ఏమీ ఆలోచించటం లేదక్కా’’ అనేంత లోనే – ‘‘నువ్వు వెనక సీట్లో ఉన్నా, నేను ఉన్నది ముందు సీట్లో కాదు. నీ పక్క సీట్లోనే...’’ అని వెనక్కు తిరిగి, నా వైపు చూసి నవ్వేవారు. ఇప్పుడు వ్యాన్లో అక్క నా ముందు సీట్లో లేరు, నా పక్క సీట్లో లేరు. నేనే అక్క సీట్లో ముందు వైపు ఉన్నాను. ప్రజల దగ్గరికి అక్క ఆశీస్సులు మాత్రమే నన్ను నడిపిస్తున్నాయి. తిరుమంగళం, ఉసిలంపట్టి, మేలూరు, శంకరన్ కోయిల్, ముత్తుకుళత్తూరు, పరమకుడి, శివగంగ, మన్నార్గుడి, మైలాడుదురై, తంజావూరు, తూర్పు తిరుచ్చి, మదురై సెంట్రల్... అన్నీ, అమ్మ తన కన్నబిడ్డల్లా చూసుకున్న దక్షిణ ప్రాంతాలే! ఇప్పుడా కన్నబిడ్డలు ఈ చిన్నమ్మను కడుపులో పెట్టుకోకుండా ఉంటారా, చిన్నమ్మ కొత్త పార్టీ ‘ఆలిండియా పురట్చి తలైవర్ మక్కళ్ మున్నేట్ర కజగం’ను చేరదీయకుండా ఉంటారా? ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయటం లేదు. 2027 వరకు నేను ఎన్నికల్లోనే పోటీ చేయటానికి లేదు. కానీ అక్కకు ఎంజీఆర్ ఇచ్చిన అన్నాడీఎంకే పార్టీని, అక్క నాకు వారసత్వంగా ఇచ్చి వెళ్లిన అన్నాడీఎంకే పార్టీని... ఎడప్పాడి పళనిస్వామి లాగేసుకున్నాడు. అతడి నుంచి తిరిగి అన్నాడీఎంకేను దక్కించుకోవాలి. పార్టీ బ్యానర్ల మీద శ్రీ ఎంజీఆర్ పక్కన అక్క; అక్క పక్కన నన్నూ చూసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ ‘చిన్నమ్మ’ను ‘త్యాగ తలైవి’ అని కొనియాడుతున్నారు!సొంతంగా 80 చోట్ల, ‘పాట్టాళి మక్కళ్ కట్చి’తో కలిసి మొత్తం 234 స్థానాల్లో,ఈ త్యాగ తలైవి నిలబడవలసి వచ్చిందంటే... వచ్చే సీట్ల కోసం కాదు, పళనిస్వామికి పోగొట్టవలసిన సీట్ల కోసం అని ప్రజలందరికీ తెలుసు. కొందరు నన్ను అడుగుతున్నారు... ‘‘పార్టీ మీ దగ్గర లేదు, రెండాకుల గుర్తు మీ దగ్గర లేదు, మీరెలా గెలుస్తారు?’’ అని. నేను నవ్వుతాను. ‘‘పళనిస్వామికి పార్టీ ఆఫీసు తాళాలు దొరికి ఉండవచ్చు, కానీ కోట్లాది మంది కార్యకర్తల గుండెల్లో ఉండే ‘అమ్మ’ గది తాళం నా దగ్గరే ఉంది!’’ అని చెబుతాను. ఈ ఎన్నికల్లో నేను గెలవకపోవచ్చు,కానీ ద్రోహులు గెలవకుండా చూడగలను. రేపటి చరిత్రలో... ద్రోహం అక్రమంగా సింహాసనాన్ని అధిరోహిస్తే, ధర్మం కోసం త్యాగం ఆ సింహాసనాన్నే కూల్చేసిందని ప్రజలు చెప్పుకుంటారు. అదే నా గెలుపు! అదే... అక్కకు నేను పట్టే హారతి! -
అగాథంలో నిద్రిస్తున్న 'అద్భుత స్వప్నం'
20వ శతాబ్దంలో అలల మీద తేలియాడిన ఓ అద్భుత మహా నగరం ఏదైనా ఉందంటే అది ‘టైటానిక్’ అనడం అతిశయోక్తి కాదు. బెల్ఫాస్ట్ నగరంలోని ‘హార్లాండ్ అండ్ ఊల్ఫ్’ సంస్థ ఈ ఓడను నిర్మించింది. 882.5 అడుగుల పొడవు, 92.5 అడుగుల వెడల్పు, 52,000 టన్నులను మించిన బరువున్న ఈ ఓడ మాన వుడు అప్పటివరకూ సాధించిన సాంకేతిక అతిశయానికి ప్రతీక! ఓడ లోపల ఉన్న సౌకర్యాలు అప్పట్లో మరే ఇతర ఓడలోనూ లేవు. మొదటి తరగతి ప్రయాణికుల కోసం స్విమ్మింగ్ పూల్, జిమ్, లైబ్రరీ, నాలుగు ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. మూడవ తరగతిలో ఉన్న వారికి కూడా ఇతర ఓడల కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించారు. దీనిని తయారు చేసిన ఇంజనీర్లు 16 వాటర్ టైట్ కంపార్ట్మెంట్లను నిర్మించారు. వీటిలో నాలుగు గదులు పూర్తిగా నీటితో నిండిపోయినా ఓడ మునిగిపోదని వారు బలంగా నమ్మారు. అందుకే దీనిని ‘మునగని ఓడ’ అన్నారు.మొదటి ప్రయాణం1912 ఏప్రిల్ 10న ఇంగ్లాండ్లోని ‘సౌతాంప్టన్’ నుంచి వేలాది మంది కలలను మోసుకుంటూ టైటానిక్ అమెరికాలోని న్యూయార్కుకు తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఖరీ దైన ఈ ట్రిప్ను ‘మిలియనీర్స్ స్పెషల్’ అని పిలిచారు. ఎడ్వర్డ్ జె. స్మిత్ ఈ ఓడకు కెప్టెన్. సుమారు 2,200 మంది ప్రయాణికులు, సిబ్బందితో టైటానిక్ అట్లాంటిక్ అలల మీద ముందుకు సాగింది. ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలోనే రేడియో ఆపరేటర్లకు ఇతర ఓడల నుంచి మంచుకొండలకు సంబంధించిన హెచ్చరికలు రాసాగాయి. ఏప్రిల్ 14న అనేకసార్లు ఈ సమాచారం అందింది. ఓడ వేగాన్ని మాత్రం తగ్గించలేదు. కెప్టెన్ స్మిత్ ఓడ దిశను కొద్దిగా మార్చినప్పటికీ, గంటకు 22 నాట్ల వేగంతో ప్రయా ణాన్ని సాగించారు. ఆ రాత్రి సముద్రం ప్రశాంతంగా ఉంది. అలలు లేకపోవడంతో మంచుకొండలను గుర్తించడం కష్టమైంది. రాత్రి 11:40 సమయంలో ఓడ ముందు ఒక భారీ మంచు కొండ ఉన్నట్లు గమనించారు. వెంటనే ఓడను పక్కకు తిప్పే ప్రయత్నం చేశారు, ఇంజిన్లను ఆపేశారు. కానీ అప్పటికే జరగా ల్సిన నష్టం జరిగిపోయింది. ఓడ కుడి భాగం ఆ మంచుకొండకు గట్టిగా తగిలింది. ఓడ కింద భాగంలో రంధ్రాలు పడ్డాయి. ఐదు గదుల్లోకి నీరు చేరడం మొదలైంది. ఓడ డిజైనర్ థామస్ ఆండ్రూస్ పరిస్థితిని గమనించి, మునగడం ఖాయమని తేల్చారు. కెప్టెన్ స్మిత్ వెంటనే ఆపద సంకేతాలను పంపమని ఆదేశించాడు. దగ్గరలో ఉన్న ‘కార్పాతియా’ ఓడ ఈ సంకేతాలను అందు కుంది. అది టైటానిక్కు 58 మైళ్ల దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది. మరోవైపు టైటానిక్లో లైఫ్ బోట్ల సంఖ్య తక్కువగా ఉంది. ఉన్న 20 బోట్లలో 1,178 మందే ప్రయాణించే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 తెల్ల వారుజామున 2:00 గంటలకు ఓడ ముందు భాగం పూర్తిగా మునిగిపోయింది. వెనుక భాగం గాలిలోకి లేచింది. భారీ ఒత్తిడి వల్ల ఓడ రెండు ముక్కలుగా విరిగింది. 2:20 నిమిషాలకు పూర్తిగా అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగంలోకి చేరుకుంది. ఈ సంఘటన నౌకాయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రతి ఓడలో ప్రయాణికులందరికీ సరిపోయే లైఫ్ బోట్లు ఉండాలనీ, రేడియో నిరంతరం పనిచేయాలనీ కొత్త నిబంధనలు తెచ్చారు. మంచుకొండలను గమనించడానికి ‘ఇంటర్నేషనల్ ఐస్ పాట్రోల్’ సంస్థను ఏర్పాటు చేశారు. మునిగిపోయిన 73 ఏళ్ల తర్వాత, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలోని బృందం టైటానిక్ శిథిలాలను కనుగొంది. సముద్రం లోపల 12,500 అడుగుల లోతులో ఓడ రెండు ముక్కలుగా పడి ఉంది. రాబోయే కొన్నేళ్లలో ఆ ఓడ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జేమ్స్ కామెరూన్ తీసిన ‘టైటానిక్’ సినిమా, ఇతర డాక్యుమెంటరీలు ఈ ఓడను ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపి ఉంచాయి. కెప్టెన్ స్మిత్ -
మండిన ఎండ... కరిగిన గుండె
జనం గుండెల్లో ఉండేవాడు, జనక్షేమం కోసం పరితపించేవాడు, జనం మధ్య ఉంటూ, జనం మధ్య తింటూ బతుకంతా సమాజానికి ఇచ్చేవాడు నిజమైన ప్రజా నాయకుడు. అలాంటి వ్యక్తి ఉన్నా లేకున్నా ప్రజలు అతడిని స్మరిస్తారు, కొలుస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో డా‘‘ వైఎస్.రాజశేఖర రెడ్డి చిరునవ్వు నిత్య హరితం, నిత్య స్మరితం. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం అంటే 2003 ఏప్రిల్ 9వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చేవెళ్ళ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన, మొదటి సుదీర్ఘ పాదయాత్ర అది. అదంతా నిన్న మొన్న జరిగినట్లు ఉంది. ఆ యాత్ర ఒక చరిత్ర. ఓ పరిపాలనా విప్లవానికి నాంది. రాజశేఖరరెడ్డి నాకు గురువు, దైవం, హితుడు, స్నేహితుడు, ఆత్మీయుడు... అన్నీ! ఆ యాత్రలో ఆయనతో పాటు నేనూ ఉండటం నా అదృష్టం. ఆ అరవై అయిదు రోజుల్లో ప్రతిరోజూ ఓ కొత్త విషయం తెలుసుకున్నాను. కొత్తపాఠం నేర్చుకున్నాను. ముఖ్యంగా రాజశేఖరరెడ్డిలోని మంచితనపు విశ్వరూపాన్ని చూశాను.చుట్టంలా... స్నేహితుడిలా...వైఎస్ అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. పాదయాత్ర చేసిన తరువాత అధికారం వచ్చింది. ఆయన సమర్థతను, ఆద రణను చూసిన ప్రజలు ఆయన అయితేనే మనకు మంచి జరుగుతుందని నమ్మి ఆయనకు అధికార పీఠం అందించారు. వారి నమ్మ కాన్ని ఆయన వందశాతం నిలుపుకొన్నారన్నది సత్యం. పాదయాత్రకు ముందు ఆయన నిరంతర అంతర్మథనానికి గురయ్యాడు. నిత్యం వేలాది మంది ఆయనను కలిసి కష్టసుఖాలు చెప్పుకునేవారు. ‘మనం ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది కర్ణా’ అనేవాడు. రాష్ట్రంలో ఉన్న కర్షకుల స్థితి, కార్మికుల స్థితి, ఉద్యో గులు, విద్యార్థులు, మహిళలు, చేతివృత్తులవారు, చిన్న వ్యాపా రులు, రోడ్లు, సౌకర్యాలు, వైద్యం, ఆదాయం, విద్యుత్తు – అన్నీ ప్రత్యక్షంగా చూస్తే తప్ప వారికి ఏం చేయాలో తెలుసుకోలేం అన్నది ఆయన ఆలోచన. ‘ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటే అధికారంలోకి వచ్చాక ప్రజలకు అవన్నీ చేయవచ్చు. రాకపోతే అవన్నీ చేయాలని ప్రతిపక్షంలో ఉండి పోరాడవచ్చు. అందుకే జనం మధ్యకు నడుచు కుంటూ వెళ్తాను. ఓ చుట్టంలా, స్నేహితుడిలా పలకరిస్తాను. రైతు పొలంలోని బురదలోకి దిగి మాట్లాడతాను. అతని బావిలో నీరు ఉందో లేదో స్వయంగా తొంగి చూస్తాను. చెట్టు కొమ్మన, చీర ఉయ్యాలలో పసిపాపను నిద్ర పుచ్చుతున్న తల్లి గుడిసెలోకి వెళ్ళి ఆ కుండల్లో కూడుందో లేదో చూస్తాను’... అలా ఆయన దీక్షగా చెబుతూవుంటే మాకు తెలియని కొత్త రాజశేఖరరెడ్డిని చూస్తున్న ట్లుగా అనిపించింది. ఎండలో... వానలో...2003, ఏప్రిల్ 9. ఎండ మండిపోతూ ఉంది. మాకు ఎండ కనిపిస్తోంది. ఆయన జనం గుండెల్ని, వాటి వెనక బాధల్ని చూస్తున్నారు. వాటి వెనక ఉన్న కన్నీటి కథలను చూస్తున్నారు. కాలిన పెనంలా రోడ్డు. అయినా చిరునవ్వుతోనే నడక సాగిస్తున్నారు. మొత్తం జనం, పల్లెలు, పట్టణాలు కదలివస్తున్నాయి ఆయనను చూడటానికి, మాట్లాడటానికి! వారి మాటలు వింటూ ఉంటే అప్పటి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో సమస్యలు తప్ప మరేవీ లేవు అనిపించింది. కరవు, నిరుద్యోగం, అనారోగ్యం. కరెంటు లేకపోవడం, అప్పులు, వడ్డీలు, ఎముకల గూడు లాంటి మనుషులు, ఎడారిని తలపిస్తున్న పొలాలు, ఎటుచూసినా దైన్యం. అదంతా చూసి రాజశేఖరరెడ్డి ఎంత చలించిపోయారంటే అనేకసార్లు ఆయన కన్ను చెమ్మగిల్లడం చూశాను. అసలు ఆ ఎండలో, ఆ ఉక్కలో, ఏ సౌకర్యాలు లేక అలా ప్రయాణించడం ఆయనకు తప్ప మరే నాయకుడికీ సాధ్యం కాదు.పాదయాత్రలో ఒకసారి జోరున వర్షం కురిసింది. తడవకుండా పక్కనే ఉన్న జీపు ఎక్కాను నేను. కానీ ఆయన అలా తడుస్తూనే, నడుస్తూనే ఉంటే, అది చూచి నాకు ఎంత బాధనిపించిందో! ‘ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది వానకు తడిసి, నిలువ నీడలేక నిల బడుతున్నారో కర్ణా! అందరికీ ఇళ్ళు ఇవ్వాలి. అప్పుడే ఆనందం’ అన్నాడాయన. కరవు కాటకాల్ని, బరువు గుండెలను చూశారు రాజశేఖరరెడ్డి. అందుకే ప్రజలు ఆయనను అంతగా ప్రేమించారు, నమ్మారు. గ్రామాలు, పట్టణాలు ‘మండుటెండలో రాజన్నా... మహాత్ముని అడుగుజాడల్లో నీవన్నా’ అన్న నినాదాలు గోడల మీద రాసి ఆయనను ఆహ్వానించాయి. మాట ఇస్తే మన్నించే మనిషిగా ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు.మోసం చేసి మీసం తిప్పుతున్న ఈనాటి ప్రజాకంటక పాలకు లకు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రజలలోకి వస్తున్నారనే భయం పట్టుకుంది. వస్తే ఆయనకు లభించే జనాదరణను తట్టుకోలేమన్న విషయం వారికి తెలుసు. ఇరవై మూడు సంవత్సరాలైనా ఆ రాజశేఖరుడి పాదస్పర్శ ఈ నేల తల్లి మరచిపోలేదని తెలిసి ఆనందంగా ఉంది. ఆయన రాజశేఖరుడు. ఆయన కుమారుడు జగన్మోహనుడు. కదిలితే... కాలం తెల్లబోతుంది. జన ప్రవాహ సునామీ చుట్టు ముడుతుంది. జేజేల నాదాలు గగనాన్ని కంపిస్తాయి. ఆసత్య ప్రచార గ్రామసింహాలు తోక ముడుస్తాయి. అది గుర్తు చేసుకుంటూ... రాజశేఖరుని రాజస ధర్మదీక్షా దక్షతకు, సుపరిపాలనకు నమస్కరించి, తిరిగి స్వాగతం పలుకుతున్నాను.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్(ఏప్రిల్ 9: 2003లో వైఎస్ పాదయాత్ర ప్రారంభమైన రోజు) -
సమష్టిగా నారీశక్తిని బలోపేతం చేద్దాం!
మరికొన్ని రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పండగ వాతావ రణంతో సందడి మొదలు కాబో తున్నది. అస్సాం ప్రజలు రొంగాలి బిహు జరుపుకొంటే, ఒడిశా ప్రజలు మహా బిషుబ పాన సంక్రాంతి నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో పొయిలా బైశాఖ్ బెంగాలీల నూతన సంవత్సరానికి నాంది పలికితే, కేరళలో సంబరంగా విషు పండగ నిర్వహిస్తారు. తమిళనాడులో పుత్తాండు పర్వదినాన్ని, పంజాబ్ సహా ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాల్లో బైశాఖీ వేడుకను చేసుకుంటారు. ఇవన్నీ ఆశాభావాన్నీ, సానుకూల దృక్పథాన్నీ పెంపొందిస్తాయి. దేశ విదేశాల్లో ఈ వేడుకలను నిర్వహించుకొనే వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర ఉత్సవాలు అందరి జీవితాల్లోనూ ఆనందాన్నీ, సౌభాగ్యాన్నీ తీసుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.ఏప్రిల్ 11 నుంచి మహాత్మా ఫూలే 200 జయంత్యుత్సవాలను మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ నెల 14న జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్కు యావత్ భారతదేశం నివాళి అర్పిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భాలే కాకుండా, మన హృద యాలూ, ఆలోచనలూ పునర్నవీకరణ స్ఫూర్తితో నిండిన వేళ... మన దేశం మరో చారిత్రక విజయం ముంగిట నిలబడింది. ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్ఠం చేసుకోవడానికీ, సమానత్వం, సమ్మి ళితత్వం దిశగా మన సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటించడానికీ లభించిన గొప్ప అవకాశమిది.ప్రత్యేకమైన సందర్భంమహిళల రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన బిల్లుపై చర్చించేందుకు, ఆమోదించేందుకు ఏప్రిల్ 16న పార్లమెంటు సమా వేశం కానుంది. దీనిని ఓ శాసనపరమైన కార్యక్రమంగా పేర్కొంటే ఈ బిల్లు ప్రాధాన్యాన్ని తగ్గించినట్టే అవుతుంది. భారత్లోని కోట్లాది మహిళల ఆకాంక్షలకు ఇది ప్రతిబింబం. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజం పురోగమిస్తుందనే మన సుదీర్ఘ నాగరికతా స్ఫూర్తికి ఇది నిదర్శనం. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే. ఈ దేశానికి వారు అందిస్తున్న సేవలు అపారమైనవి, అమూల్యమైనవి. ప్రతి రంగంలోనూ మహిళలు సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు నేడు భారత్ కేంద్రంగా మారింది. శాస్త్ర, సాంకేతిక రంగాల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక రంగం వరకు, క్రీడల నుంచి రక్షణ బలగాల వరకు, సంగీతం నుంచి కళల వరకు దేశాభివృద్ధిలో మహిళలే అగ్రగామిగా ఉన్నారు. కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలు స్త్రీ సాధికారత దిశగా అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. చదువుకునేందుకు పెరిగిన అవకాశాలు, మెరుగైన ఆరోగ్య సేవలు, విస్తరించిన ఆర్థిక సమ్మిళితత్వం, అందుబాటులోకి వచ్చిన ప్రాథమిక అవసరాలు... ఆర్థిక, సామాజిక కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తృతం చేశాయి. అయినప్పటికీ, సమాజంలో మహిళలు పోషిస్తున్న పాత్రకు అనుగుణంగా రాజకీయ రంగంలో, శాసనసభల్లో వారికి ప్రాతి నిధ్యం లభించలేదు. ఇది దురదృష్టకరం. పరిపాలనలో, నిర్ణయాధి కారంలో మహిళలు భాగస్వాములైతే... వారిదైన ఆలోచనలనూ, అనుభవాలనూ జోడించడం ద్వారా ప్రజోపయోగ చర్చలు, పాలనా సామర్థ్యం మరింత మెరుగవుతాయి. రానున్న అంటే... 2029లో లోక్సభ, వివిధ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరిగే నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం అనివార్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు దక్కా ల్సిన ప్రాధాన్యాన్ని అందించేందుకు గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చాయి. కమిటీలు ఏర్పాటయ్యాయి. ముసా యిదా బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చ లేదు. అయినప్పటికీ... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగా లన్న అంశంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. ఈ ఏకాభి ప్రాయ స్ఫూర్తితోనే 2023 సెప్టెంబరులో ‘నారీ శక్తి వందన్ అధి’ని యవ్ును పార్లమెంటు ఆమోదించింది. నా జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన సందర్భాల్లో ఒకటిగా నేను దీనిని భావిస్తాను.ఏకతాటి పైకి రావాల్సిన సమయంమహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ అవకాశం మన రాజ్యాంగ స్ఫూర్తిలో ప్రతిధ్వనిస్తోంది. ఆచరణాత్మక రూపంలో సమానత్వానికి ప్రాతినిధ్యం ఉన్న సమాజాన్ని నిర్మించాలని మన రాజ్యాంగ నిర్మా తలు ఆకాంక్షించారు. ఈ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల్లో ప్రధానం... శాసన వ్యవస్థల్లో మహిళల పాత్రను బలోపేతం చేయడం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి పౌరునికీ సమాన భాగస్వామ్యాన్ని అందించే సమాజాన్ని నిర్మించడంలో మా చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తుంది. మహిళల ప్రాతినిధ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి జాప్యం జరిగినా... ప్రజాస్వామ్య సమ్మిళితత్వాన్నీ, ప్రజాస్వామ్య స్ఫూర్తినీ మనం వాయిదా వేసినట్లే! శాసన వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని దశాబ్దాల కిందటే గుర్తించారు. ఇప్పుడు గనుక దీనిని వాయిదా వేస్తే... మనం గుర్తించిన, సరిదిద్దగలిగిన అసమతౌల్యాన్ని మరింత పెంచడమే అవుతుంది. నిర్దిష్ట లక్ష్యంతో, ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు సాగు తున్న ఈ తరుణంలో ప్రజలు, ముఖ్యంగా జనాభాలో సగభాగంగా ఉన్నవారి ఆకాంక్షలను మన శాసన వ్యవస్థలు ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. సకాలంలో చేపట్టే చర్యలు దీర్ఘకాలంగా నెరవేరని వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా ప్రగతి వేగాన్ని సైతం కొనసా గిస్తాయి. మన ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రాతినిధ్యం కల్పించే దిగా తీర్చిదిద్దేందుకు ఇది నిజంగా చరిత్రాత్మక అవకాశం.ఇది ఏ ఒక్క ప్రభుత్వానికో, పార్టీకో లేదా వ్యక్తికో సంబంధించిన అంశం కాదు. దీనిని సాకారం చేసుకునే దిశగా దేశమంతా ఏకతాటి పైకి రావాల్సిన సమయం. మన నారీశక్తికి మనం అందించాల్సింది ఇదే. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు లభించే ఆమో దంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి. మన కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం పనిచేయాలనే స్ఫూర్తిని ఇలాంటి అవకా శాలు మనకు అందిస్తాయి. మార్పులను స్వీకరిస్తూ, మరింత సమ్మిళి తత్వాన్ని సాధించడంలోనే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగి ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి. చరిత్రాత్మకమైన ఈ పార్లమెంటు సమావేశం సమీపిస్తున్న నేపథ్యంలో... భారతీయ మహిళల కోసం చేపడుతున్న ఈ ముఖ్య మైన కార్యక్రమానికి మద్దతు అందించాలని పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అత్యున్నత ప్రజా స్వామ్య విలువల కోసం కలిసి నడుద్దాం. జాతీయ ప్రయోజనాల విషయంలో విభేదాలను పక్కన పెట్టి, ఐక్యంగా వ్యవహరించ గలదని భారత్ ఎల్లప్పుడూ రుజువు చేస్తూనే ఉంది. ఇది అలాంటి సందర్భమే! రాజ్యాంగ విలువలను బలోపేతం చేద్దాం. దేశ ప్రగతి కోసం నారీశక్తికి సాధికారత కల్పిద్దాం. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ముగింపు లేని యుద్ధోన్మాదం
ట్రంప్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేయడం వారి విజ్ఞతకు నిదర్శనం. యుద్ధంలో గెలిచే శామనీ, ఇరాన్ లొంగిపోయిందనీ ట్రంప్ చేసిన ప్రకటనను మొదట్లో అందరూ నిజమేనని నమ్మారు. కానీ ఇరాన్ ప్రతిఘటన తీవ్రంగా ఉండటం, పెద్ద సంఖ్యలో అమెరి కన్ సైనికులు చనిపోవడం, హోర్మూజ్ జలసంధిని ఇరాన్ పరిరక్షించుకోవడం వంటి పరిణామాలు చూసిన తరువాత యుద్ధానికి సంబంధించి అధ్యక్షుడు తమకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని వారికి అర్థమైంది. ఇప్పటికే అమెరికాలో చమరు, గ్యాస్ ధరలు పెరిగాయి. తమ దేశం ఈ యుద్ధంలో అడ్డంగా ఇరుక్కుపోయిందనీ, దానినుంచి బయటపడేందుకు ట్రంప్ తంటాలు పడుతున్నారనీ ప్రజలు గ్రహించారు. ‘ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఎన్నో ఏళ్లుగా వింటున్నాం. అలాగే అక్కడ ఉగ్రవాద మూకలకు ఆశ్రయం కల్పిస్తున్నారని కూడా విన్నాం. ఇప్పుడు నాకు అవేవీ వినబడటం లేదు. నా దేశంలో నేను కొనే గ్యాస్ (పెట్రోల్) ధర అమాంతం పెరిగిపోవడం ఒక్కటే నన్ను బాధిస్తోంది’ అని ‘బీబీసీ’ వార్తా సంస్థతో ఓ సగటు అమెరికన్ అనడం పరిస్థితికి అద్దం పడుతోంది. యుద్ధ విరమణ చేయించాలంటే తమకు భారీ ఎత్తున నష్టపరి హారం చెల్లించాల్సిందేనని ఇరాన్ షరతు విధించడం అమెరికాకు ఊహించని పరిణామం. ఇరాన్ను తక్కువగా అంచనా వేసి ఎదురు దెబ్బతిన్న నేపథ్యంలో, ఆ దేశంపై యుద్ధం చేయాలన్న నిర్ణయం తనది కాదని చెప్పుకోవడానికి ట్రంప్ తెగ ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలోని వివిధ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతా లలో కూడా ట్రంప్కు వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘నోకింగ్స్’ పేరుతో సాగుతున్న ఈ నిరసన జ్వాలలు యూరప్ నగరా లకు సైతం పాకాయి. భారత్ మాత్రం ఈ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు... ట్రంప్కు మోదీ లొంగిపోయాడని విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధాని సంయ మనం పాటిస్తున్నారు.స్వప్రయోజనాలే మిన్న ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింప జేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కొన్ని దేశాలు తమ సొంత ప్రయోజ నాలు సాధించుకోవడానికి ప్రయత్నించడం మరో పార్శ్వం. హోర్మూజ్ జలసంధి నుంచి తమ రవాణా నౌకలు సజావుగా ప్రయా ణించడానికి సహకరించాలని ఇరాన్కు చైనా విజ్ఞప్తి చేసింది. అయితే ఇరాన్ మాత్రం యుద్ధంలో తమ పక్షాన నిలవాలని చైనాకు షరతు విధించింది. ప్రçస్తుతం చైనా కూడా తటస్థ వైఖరితోనే ఉంది. మరోవైపు ఇరాన్తో జరిపే చర్చలకు అమెరికా తమ దేశాన్ని వేదికగా చేసుకోవాలని కోరుతున్న పాకిస్తాన్ ఇరుపక్షాల నుండి లబ్ధి పొందాలని చూస్తోంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నట్లు పాకిస్తాన్ దళారీ పాత్ర పోషించి రెండు వైపులా లాభాలు పిండుకోవడానికి ఆరాటపడుతున్నది. ఇరాన్ కనుక హోర్మూజ్ జలసంధిని మూసివేసినట్లయితే భారత్ సహా పలు దేశాలు ఆర్థికంగా దెబ్బ తినడం ఖాయం. అందువల్ల ఇరాన్ను అమెరికాతో యుద్ధ విరమణ సంధికి ఒప్పించడానికి పశ్చిమాసియా, యూరప్ దేశాలు ఆతృత పడుతున్నాయి. ఇంగ్లాండ్లో ఆర్థిక పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. అందువల్లనే ఆ దేశం కూడా వీలైనంత త్వరగా యుద్ధానికి స్వస్తి పలకాలని ట్రంప్కు సూచిస్తోంది.రష్యన్ మహా రచయిత టాల్స్టాయ్ చెప్పినట్లు, ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికాకు రోజుకో బిలియన్ డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాణాలు కోల్పోయిన అమాయకులు, వారి కుటుంబ సభ్యులకు జరిగిన నష్టాన్ని లెక్కించడానికి ఏ కొలమానం ఉంది? ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అందుకే దాడి అని చెప్పిన ట్రంప్ మాటల్లోని డొల్లతనం కూడా ప్రపంచానికి అర్థమయ్యింది. ఇరాన్కు నిజంగానే అణ్వాయుధాలు ఉన్నట్లయితే వాటిని ఇంత కాలం ప్రయోగించకుండా ఉంటుందా? దేశ సార్వభౌమాధికారాన్ని ఎంత శక్తిమంతమైన దేశం ప్రశ్నించినా... చిన్న దేశాలు సహించవని చెప్పడానికి ఇరాన్ ఒక ఉదా హరణగా నిలుస్తుంది. గతంలో అమెరికాకు వియత్నాం, క్యూబాల నుంచి కూడా ఇటువంటి ప్రతిఘటనలే ఎదురయ్యాయి. ఆ చేదు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోని అమెరికన్ పాలకులు పదేపదే అవే తప్పులను చేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధ నియ మాలను ఉల్లంఘిస్తూ వైరిపక్షాలు ఆడుతున్న ఈ వికృత క్రీడకు ఇప్పట్లో ముగింపు ఉంటుందా?డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన మండలి సభ్యులు -
ఆఫ్రికాలో కొత్త చైతన్యాలు
పాశ్చాత్యులు ‘చీకటి ఖండ’మని పిలిచి 500 వందల సంవత్సరాలకు పైగా భౌగోళిక వలస పాలనను, ఆర్థిక వలస పాలనను సాగించిన ఆఫ్రికాలో కొత్త చైత న్యాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి వీటిని రెండవ విడత చైతన్యాలనాలి. ఉద్యమాల ద్వారా, ఎక్కువగా సాయుధ తిరుగుబాట్లతో 1950ల నుంచి ఆరంభించి రాజకీయ స్వాతంత్య్రాలను సాధించుకున్న తర్వాత, ఇపుడు ఆర్థిక స్వాతంత్య్రం కోసం కదలుతున్నారు.లిథియం ఎగుమతులపై నిషేధంఅరుదైన లోహాలు, ఖనిజాల కోసం గత కొద్ది నెలలుగా పారిశ్రామిక దేశాలు హోరాహోరీన తలపడుతుండగా, జింబాబ్వే గత నెలలో ఆకస్మికంగా చిన్న భూకంపాన్నే సృష్టించింది. బంగారం, వజ్రాలు, ప్లాటినంతోపాటు, ప్రస్తుత పరిణామాలలో కీలకంగా మారిన లిథియం ఎగుమతులను నిషేధించింది. లిథియం ఉత్పత్తిలో జింబాబ్వేది ప్రపంచంలో నాల్గవ స్థానం. ఎగుమతుల నిషేధానికి వారు చెప్పిన కారణం, తమ వనరులను ముడిసరకుల రూపంలో ఎగుమతి చేయటం వల్ల తమకు లభిస్తున్నది అతి స్వల్పం కాగా, వాటిని శుద్ధి చేసి ఉపయోగించుకుంటున్న దేశాలు, కంపెనీలు అనేక రెట్లు లాభపడుతున్నాయి. ఆ శుద్ధి తమ దేశంలోనే జరిగితే ధర ఎంతో ఎక్కువగా వస్తుంది. కనుక, ఆ కార్యక్రమం కోసం నిషేధిస్తున్నామని! అదే రోజుల్లో జాంబియా అదే పని చేసింది.లిథియం కీలకంగా మారినందున జింబాబ్వే, జాంబియా చర్యలు సంచలనమైనాయి గాని, 2023 మొదలుకొని 13 ఆఫ్రికన్ దేశాలు అనేక ఖనిజాలు, లోహాలను ముడి ఉత్పత్తుల రూపంలో ఎగుమతి చేయటం ఆపివేశాయి. ఆఫ్రికా ఖండంలో దక్షిణాదిన గల జింబాబ్వే, జాంబియాల నుంచి ఒకసారి ఉత్తరాన వాయవ్య దిశలో గల నిజేర్ (ఫ్రెంచ్ ఉచ్చారణ) అనే చిన్న దేశానికి వెళదాము.రెండేళ్ల కిందట నిజేర్, దానికి పొరుగున గల బుర్కినా ఫాసో,మాలి అనే మరొక రెండు చిన్న దేశాలు కలిసి కూటమిగా ఏర్ప డ్డాయి. మూడింటా యురేనియం తదితర విలువైన నిల్వలు భారీగా ఉన్నాయి. గతంలో తమ వలసలు అయిన ఈ మూడింటిలో నిజేర్ నిల్వలను వినియోగంలోకి తెచ్చిన ఫ్రెంచ్ కంపెనీలు కిలో యురేనియంకు 0.25 డాలర్లు చెల్లించి, దానిని శుద్ధి చేసిన తర్వాత కెనడాకు 25 డాలర్లకు (వంద రెట్లు) అమ్ముతుండేవి. పై మూడు దేశాలలో స్థానిక యువ నాయకత్వాలు తిరుగుబాట్లు చేసి అధికా రానికి వచ్చిన తర్వాత, ఒక కూటమిగా ఏర్పడి, అదే 25 డాలర్లు తమకు చెల్లిస్తే తప్ప యురేనియంను ఎగుమతి చేయబోమన్నాయి. చివరకు ఫ్రెంచ్ కంపెనీలు నిష్క్రమించక తప్పలేదు. ఫ్రెంచ్ సైనిక స్థావరాల మూతయురేనియం ఒక్కటే కాదు. ఆ మూడు దేశాలలో బంగారం సహా అనేక నిక్షేపాలున్నాయి. వారు ఆ గనులన్నింటిని ఫ్రాన్స్ అధీనం నుంచి స్వాధీనపరచుకోవటమే గాక, తమతోపాటు మరో మూడు దేశాలలోని ఫ్రెంచ్ సైనిక స్థావరాలను మూసి వేయించారు. ఇందుకు ప్రతీకారంగా ఆ కూటమి నాయకుడైన బుర్కినా అధ్యక్షుడు ట్రవోరేపై ఇప్పటికి అయిదుసార్లు కుట్రలు జరిగాయి. ఆర్థిక స్వాతంత్య్రం లేనిదే రాజకీయ స్వాతంత్య్రం బలపడ దన్నది తెలిసిందే. ఇది లోగడనే గుర్తించిన ఆఫ్రికన్ దేశాలు, ఖనిజాలు, లోహాల విషయంలో తాము ఎంత సంపన్నమైనవో తెలిసినందున, ఆ విషయమై సమావేశాలు, సంస్థల ఏర్పాటు అయితే 30 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాయి. కానీ తమ వనరులను తామే వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్తు తగినంత లేనందున ఆ కార్యక్రమం వేగంగా సాగటం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ నేతలు దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఫిబ్రవరిలో సమావేశమై, ఈ దిశగా తమ చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించటం గమనించదగ్గది.విలువైన ఖనిజాలు, లోహాలు, చమురు, అటవీ సంపదలు ఆఫ్రికా అంతటా విస్తరించి ఉండగా, ఆ విషయంలో అగ్రస్థానంలో గల ఏడు దేశాలు – దక్షిణాఫ్రికా, నైజీరియా, ఆంగోలా, ఘనా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గబోన్, జింబాబ్వేల ఉమ్మడి విలువ సంవత్సరానికి సుమారు 260 బిలియన్ డాలర్లు. ఈ ఉత్పత్తుల నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందుతున్నది బయటి దేశాలే. అందువల్లనే ఆఫ్రికా ఇంత పేదదిగా మిగిలిపోయి ప్రజలు కనీస ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస పోవలసిన దుఃస్థితికి గురవుతున్నారు. నమ్మశక్యం కాని ప్రగతివివిధ సంస్థల అంచనాల ప్రకారం ప్రపంచంలోని బంగారం నిల్వలలో 30 శాతం, అత్యధిక భాగం వజ్రాలు, 50 శాతం కోబాల్ట్, అభ్రకం, 20 శాతం రాగి, బాక్సయిట్, అవిగాక ప్లాటినం,లిథియం, యురేనియం భారీ నిక్షేపాలు అక్కడున్నాయి. వాటి నుంచి మొదటినుంచి పాశ్చాత్య దేశాలు, ఇటీవల చైనా ఎంత తర లించుకుపోతున్నా ఆఫ్రికా ఒక తరగని గనిగానే ఉంది. ఇవి గాక అటవీ సంపద మాట తెలిసిందే. సారవంతమైన భూములు విస్తా రంగా ఉండి, వాటిని సాగులోకి తెచ్చే సాధనాలు స్థానికులకు లేనందున బయటివారు ఒక్కొక్కరే అక్షరాలా లక్షలకు లక్షల ఎకరాలను దీర్ఘకాలిక లీజులకు తీసుకుని స్థానికులను కూలీలుగా మార్చు తున్నారు. ఇటువంటి లీజులలో కొన్నింటిని నేను స్వయంగా చూశాను. వాటిలో భారతీయులవి కూడా ఉన్నాయి.ఇంతింత దోపిడీ సాగుతున్నా ఆఫ్రికా ఆర్థిక పురోగమనాన్ని చూస్తే, ఒక వేళ వారు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధిస్తే మరెంత అద్భు తంగా ఉండగలదో అనిపిస్తుంది. ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొన్న దానినిబట్టి ఈ 2026లో ఆఫ్రికా ఆర్థిక ప్రగతి ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ఆసియాను మించిపోనున్నది. ఆసియాలో చైనా, జపాన్, ఇండియా, ఆసియాన్ కూటమి వంటి దిగ్గజాలు ఉండటంతో ఈ అంచనాలు ఎంతో నమ్మశక్యం కాకుండా తోస్తు న్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న 20 దేశాలలో సగం ఆఫ్రికాలోనే ఉన్నాయి. విచారం ఏమంటే, భారతదేశం వలెనే శతాబ్దాల పాటు వలస దోపిడీకి గురై సుదీర్ఘ ఉద్యమాల ద్వారా స్వతంత్రమైన ఆఫ్రికా గురించి మనకు తెలుస్తు న్నది స్వల్పం.ఆఫ్రికాలో ఈ కొత్త చైతన్యాలకు కారణాలున్నాయి. అక్కడి ప్రజలలో, ముఖ్యంగా యువతలో కొత్త చదువులు, ప్రాపంచిక దృక్పథాలు, తమ దేశాల భవిష్యత్తు గురించిన స్పృహలు కలుగుతున్నాయి. మేధావి, రచయిత వర్గాలు కదలుతున్నాయి. కొత్త రాజకీయ నాయకత్వాలు వస్తుండగా వాటిపై ఈ ప్రభావాలు పడుతున్నాయి. ఎన్నెన్నో ఆధునీకరణలతో ప్రపంచం పురోగమిస్తుండగా, సకల వనరులూ గల తాము ఇంకా ఎంత కాలం బయటి వారికి ఉపయోగపడుతూ వెనుకబడి ఉండాలనే భావనలు బలపడు తున్నాయి. అంతకన్నా కావలసింది ఏమున్నది!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మొదటి విడత రేసులో మొగ్గెవరికి?
మళ్లీ అధికారం మాదే అని అసోమ్లో బీజేపీ నేతృత్వపు ‘ఎన్యీడీఏ’ ధీమాగా ఉంటే, కేరళంలో కమ్యూనిస్టు నేతృత్వపు ‘లెఫ్ట్ డెమాక్రటిక్ ఫ్రంట్’ (ఎల్డీఎఫ్) ఆపసోపాలు పడుతోంది. రెండు చోట్ల అవే కూటములు రెండో పర్యాయం అధికారంలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి మరో ప్రభుత్వం నడుస్తున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాలక కూటమే ముందంజలో ఉంది. ఈ నెల 9న పోలింగ్ జరగాల్సి ఉన్న ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. తమిళనాడు (ఏప్రిల్ 23), పశ్చిమ బెంగాల్ (ఏప్రిల్ 23, 29)లలో ప్రచారహోరు తీవ్ర స్థాయికి చేరింది. సిద్ధాంతాలు, నిబద్ధతల కన్నా ‘పొలిటికల్ న్యారేటివ్స్’ ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎన్నికల తుది ఫలితాలు తేలేది మాత్రం మే 4న ఓట్ల లెక్కింపు తర్వాతే!ఎక్కడో 4 వేల కిలోమీటర్ల దూరంలోని పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ దక్షిణ ధ్రువపు కేరళం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందా? 30 లక్షల మంది మలయాళీలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉండటం, అత్యధికులు తరచూ స్వస్థలాలకు వస్తూ–పోతూ ఉండే స్వభావ రీత్యా ఎన్నికల్ని వారు ప్రభావితం చేస్తుంటారు. దేశ ఈశాన్యపు శీర్షాన ఉన్న అసోమ్ రాష్ట్రంలో 2023లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజన, ఫలితంగా తగ్గిన ముస్లిం ఆధిపత్య నియోజక వర్గాల సంఖ్య ఎన్ని కల సరళిని ప్రభావితం చేయనుంది. మూడు భౌగోళిక ముక్కలుగా ఉన్న పుదుచ్చేరికి ‘రాష్ట్ర హోదా కల్పించడమ’నే డిమాండ్ ప్రస్తుత ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశ ముంది. ఓడినా, గెలిచినా చరిత్రే!సంపూర్ణ చదువరుల రాష్ట్రం కేరళంలో ప్రతిసారీ విపక్షాలను గెలిపించే జనం నైజం వల్ల ఎల్డీఎఫ్, యూడీఎఫ్ (యునైటెడ్ డెమా క్రటిక్ ఫ్రంట్) ఒకటి తర్వాత మరొకటి రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయి. కానీ, 2021 ఎన్నికల్లో పాలక ఎల్డీఎఫ్ అధికారం తిరిగి నిలబెట్టుకొని చరిత్ర సృష్టించింది. మూడోసారి గెలిస్తే, కేరళంలో కొత్త చరిత్రే! లోగడ పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలుండేవి. ఓడిపోతే, దేశంలో ఎక్కడా కమ్యూ నిస్టు సర్కారు లేని పరిస్థితి వస్తుంది. 2021 ఎన్నికల తర్వాత యూడీఎఫ్ పుంజుకోవడం ఎల్డీఎఫ్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయిదేళ్లలో జరిగిన 5 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 4 చోట్ల గెలిచిన యూడీఎఫ్ 2024 లోక్సభ ఎన్నికల్లోనూ మంచి (18/20) ఫలితాలు పొందింది. 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో 565/941పంచాయతీల్లో నెగ్గి కమ్యూనిస్టులకు షాకిచ్చింది. మరోవైపు బీజేపీ పుంజుకోవడమూ ఎల్డీఎఫ్ను కలవరపరు స్తోంది. 2016, 2021 ఎన్నికల్లో 11 శాతం ఓటువాటా పొందిన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం (త్రిస్సూర్–సురేశ్ గోపి) గెలవడంతో పాటు 11 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 98 చోట్ల పోటీ చేస్తున్నా, 15 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపి, వనరులన్నీ కేంద్రీకృతపరచి ప్రచారం నిర్వహిస్తోంది. సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వంపై లోగడ ఎప్పుడూ లేనంత అవినీతి ఆరోపణలు, తిరుగుబాట్లు, దన్నుగా ఉండే కులాలు, ఉపకులాల్లో చీలికలు ఎల్డీఎఫ్ నాయకత్వా నికి తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్లో సీఎం కుర్చీ పంచాయతీ ఉంది. అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్ కు జనాదరణ ఉంటే, పార్టీ అధిష్ఠానంలో ముఖ్యుడైన జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేశ్ చెన్నితల రేపటి సీఎం పదవికి పోటీ పడుతున్నారు. ప్రస్తుత, మాజీ ఎంపీలైన ప్రియాంక, రాహుల్ గాంధీ యూడీఎఫ్ ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నారు. వారి బాట లోనే, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లి, ఎల్డీఎఫ్కు బీజేపీ దన్నుగా ఉందని చేస్తున్న విమర్శ వారికిక్కడ కమ్యూనిస్టులతో పొత్తుకేమీ ఇబ్బంది రాదా అన్నది ప్రశ్న!స్థిరీకరణ బాటలో...అధికారాన్ని సుస్థిరపరచుకునే అన్ని ఎత్తుగడల్నీ అసోమ్లో బీజేపీ అనుసరిస్తోంది. వరుసగా మూడోసారి అధికారం నిలుపుకొనే దిశగా సాగుతోంది. బీజేపీ ఏజీపీ, బీపీఎఫ్ తదితరులతో కూడిన ‘నార్త్ ఈస్ట్ డెమాక్రటిక్ అలయెన్ ్స’ (ఎన్ ఈడీఏ) ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్పోల్ సర్వే (2) ప్రకారం, ఈ కూటమికి 39 శాతం ఓటువాటా లభించనుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఎఎస్ఎమ్’ 36.5 శాతం పొందే అవకాశాలున్నాయి. వ్యత్యాసం రెండున్నర శాతమే అయినా అధికార కూటమి పక్షాల మధ్య చక్కని సమన్వయం వల్ల సీట్ల సంఖ్య కాంగ్రెస్ మీద రెట్టింపు కన్నా ఎక్కువ బీజేపీకి సొంతంగానే లభించే సూచనలున్నాయి. కాంగ్రెస్ కూటమి ముస్లిం ఓటర్ల సానుకూలతపై ఆధారపడ నుంది. అందుకే, 2023 నియోజకవర్గాల పునర్విభజనలో ముస్లిం ఆధిపత్యమున్న నియోజకవర్గాల సంఖ్యను 29 నుంచి 21కి ప్రభుత్వం నియంత్రించింది. అసోమ్లోనే కాక ఈశాన్య భారతంలో బీజేపీని వృద్ధి చేస్తున్న ‘వ్యవహార దక్షుడి’గా పేరుబడ్డ సీఎం హిమంత బిశ్వశర్మ నేతృత్వం వహిస్తున్న తొలి ఎన్నికలివి. 2021 ఎన్నికల్లో పార్టీని నాటి సీఎం శర్బానంద సోనోవాల్ నడిపారు. ప్రభుత్వంపై అవినీతి, అక్రమ మైనింగ్కు ప్రోత్సాహం, డ్రగ్స్పై ఉదాసీనత వంటి ఆరోపణలున్నాయి. 40 లక్షల మంది మహిళల అకౌంట్లలోకి రూ.9 వేల చొప్పున, ఏకంగా 3,600 కోట్లను మార్చి 10న ముఖ్యమంత్రి బట్వాడా చేశారు. ‘అరుణోదయ్’ స్కీమ్ కింద మొత్తం రూ.17,000 కోట్లు మహిళలకు పంపిణీ చేసినట్టు ఆయనే చెప్పారు. విభజన రాజకీయాలనే కీలకం చేస్తూ, ‘వలసదారుల్ని వదిలించుకుందాం’ అని పిలుపునిచ్చారు. విపక్షాల సీఎం అభ్యర్థిగా ఉన్న గౌరవ్ గొగోయ్ మూడు పర్యాయాలు కాంగ్రెస్ సీఎంగా ఉన్న తరుణ్ గొగోయ్ తనయుడు. కాంగ్రెస్ నుంచి బిశ్వశర్మ నిష్క్రమణకు కారణమైన ఆయన ఒంటెత్తు ‘వైఖరి’లో ఇప్పటికీ మార్పు లేదు.రాష్ట్ర హోదా దక్కేనా?పూర్వపు ఫ్రెంచ్ కాలనీ అయిన పుదుచ్చేరి భౌగోళిక స్వరూపం మూడు ముక్కలుగా ఉంది. తమిళనాడు పక్కనున్న ప్రధాన భూభాగంతో పాటు కాకినాడ సమీపంలోని ‘యానాం’, కేరళ సమీ పంలోని ‘నెహం’ కలిసి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ నుంచే విడిపోయిన ఎన్.రంగస్వామి, ‘ఎన్.ఆర్. కాంగ్రెస్’ ఏర్పరచి, బీజేపీ పొత్తుతో ముఖ్యమంత్రయ్యారు. నిరాడంబరంగా ఉండే రంగస్వామి జనంలో కలిసిపోయి, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామనీ, అది ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యమనీ ప్రచారం చేస్తున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న సభలో కనీసం 14 గెలిచినా మ్యాజిక్ నంబర్ (17)ను (గవ ర్నర్ నామినేటెడ్ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిపి) దాటుతారు కనుక ప్రభుత్వం వారిదే! విపక్ష ‘ఇండియా గుంపు’లో ఆఖరు నిమిషం వరకు సీట్ల పంపకాల్లో స్పర్థలున్నాయి. డీఎంకే బలమైన పక్షం (6 ఎమ్మెల్యేలు) అయినా 14 చోట్ల పోటీ చేస్తుంటే, ఇద్దరే ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 16 చోట్ల పోటీ చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఎంపీ స్థానంకైవసం చేసుకున్న కాంగ్రెస్, అప్పుడు మెజారిటీ (28/30) స్థానాల్లో తమకు ఆధిక్యం దక్కిందనే వాదనతో పొత్తుల్లో ఎక్కువ స్థానాలు పొందింది. నియోజకవర్గానికి 30–35 వేల ఓట్లే కావడంతో చిన్న రాజకీయ పరిణామం కూడా స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో గెలుపోట ముల్ని ప్రభావితం చేయొచ్చు.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేదెలా?
ఒకపక్క దేశంలో వేలాది మంది ఎల్పీజీ సిలిండర్ల కోసం బారులు తీరి నిలబడితే మరోపక్క ప్రభుత్వం నుంచి ఒక విచిత్ర ప్రకటన వెలువడింది. వాతావరణ మార్పును అరికట్టేందుకు ఉద్గారాలను మరింతగా తగ్గించుకుంటామని ప్రకటించింది. శిలాజేతర ఇంధన వనరుల వైపు మళ్ళే విషయంలో నిర్దేశించుకుంటున్న లక్ష్యాలను పెంపొందించుకోవడం వినడా నికి చెవులకింపుగానే ఉంటుంది. కానీ, వంట చేసుకునేందుకు, స్కూటర్లకు, కార్లకు అవసరమైన ఇంధనం నిమిత్తం జనం అవస్థలు పడుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడటమే చోద్యం. వాతావరణ మార్పును నిరోధించే ఐక్యరాజ్య సమితి ఒడంబడిక కింద దేశాలు ప్రకటించవలసి ఉన్న లక్ష్యాలకు అనుగుణంగానే ప్రభుత్వం ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. సందర్భమే వింత గొలిపేదిగా ఉంది. ఎందుకీ హెచ్చుతగ్గులు?శిలాజేతర ఇంధన వనరుల వాటాను (2031 నుంచి 2035 మధ్య కాలంలో) 60 శాతానికి పెంచుకుంటామని ప్రభుత్వం మాటి చ్చింది. వాటిని జాతీయ దృఢసంకల్ప వాగ్దానా (ఎన్డీసీ)లుగా పిలుస్తున్నారు. దానికి మార్చి 25న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 2035 నాటికి ఉండే విద్యుదుత్పాదన సామర్థ్యంలో 60 శాతం వాటా శిలాజేతర ఇంధన వనరుల ద్వారా సమ కూరుతుందని అర్థం. మన దేశం 2026 ఫిబ్రవరి నాటికే శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 52.57% మేరకు సాధించినట్లు ప్రభుత్వం చెప్పుకొంది. ప్రకటించిన తేదీల కన్నా ముందే తమ వాగ్దానాలను నిలబెట్టుకున్నామని కూడా గొప్పగా చాటుకుంది. వాస్తవంలో అటు వంటి విద్యుదుత్పాదన సామర్థ్యం 22% మాత్రమే.దేశంలో 2026 ఫిబ్రవరి నాటికి నెలసరి విద్యుదుత్పాదన సామర్థ్యంలో పునరుత్పాదక (భారీ జలవిద్యుచ్ఛక్తి, సౌర శక్తి) ఇంధన వనరుల వాటా 22.73% మాత్రమేనని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పేర్కొంది. మొత్తం మీద (2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్ర వరి మధ్య కాలానికి) సంఖ్యలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఆ కాలంలోని మొత్తం విద్యుదుత్పాదనలో తాప(థర్మల్) విద్యుత్ వాటా 70.40% కాగా, పునరుత్పాదక ఇంధన వనరులది 26.16%. వాతావరణ పరిస్థితులు, వేసవి, శీతాకాలం, వర్షాకాలం వంటి అంశాల వల్ల విద్యుదుత్పాదనలో హెచ్చుతగ్గులను అర్థం చేసు కోవచ్చు. కానీ, ఇంతటి భారీ వ్యత్యాసానికి (30%) ఆ అంశాలు మాత్రమే కారణ మని అనుకోలేం. సప్లై చెయిన్లు చైనా చేతిలో...అంతర్జాతీయ ఒడంబడిక మేరకు ఐక్యరాజ్య సమితికి నివేదిస్తున్నవి కనుక ఈ సంఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిందే. ఈ సంఖ్యలను ఉటంకిస్తూ ఇంధన పరిణామ క్రమంలో తాను గ్లోబల్ లీడర్గా వెలుగొందుతున్నట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో భారత్ ఘనతను చాటుకుంటోంది. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్ళడం, బ్యాటరీలతో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు భౌగోళిక రాజకీయాలు, శిలాజ ఇంధనాల సరఫరాలకు దిగుమతులపై ఆధారపడటం వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి. పవన, సౌర విద్యుదుత్పాదన కూడా ఒక రకంగా కీలక సామగ్రి, సబ్–సిస్టంలు, ఎక్విప్మెంట్ దిగుమతులపై ఆధారపడి ఉంది. తిరిగి ఈ దిగుమతు లలో చాలా భాగం గ్లోబల్ సప్లై చెయిన్లతో ముడిపడి ఉన్నాయి. వాటిలో చాలా భాగం చైనా అధీనంలో ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల పరికరాల తయారీకి రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం. అవి చైనా చేతిలో ఉన్నాయి. బ్యాటరీలు, విండ్ టర్బైన్లు వంటి రేర్ ఎర్త్ ఇన్పుట్స్ హెచ్చుగా ఉన్న సబ్–సిస్టంల దిగుమతికి మనం ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతున్నాం. కాలుష్య రహిత శక్తి వినియోగంలో చాలా వాటికి లిథియం బ్యాట రీలు కావాలి. వాటిలో శక్తిని నిల్వ చేయడం కుదురుతుంది. తెలుపు రంగులో ఉండే ఈ క్షార లోహానికీ చైనాయే ప్రధాన సరఫరాదారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఫొటో–వోల్టాయిక్ వ్యాఫర్ ఉత్ప త్తిలో 2023 నాటికే 98% చైనా గుప్పెట్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విండ్ టర్బైన్ల తయారీలో 70% చైనాయే చేజిక్కించుకున్నట్లు చెబు తున్నారు. హరిత హైడ్రోజన్ ఉత్పాదనలో, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తిలో చైనా 2024 నాటికే ఏకైక పెద్ద ఉత్పత్తిదారుగా నిలిచిందని యూరోపియన్ యూనియన్ ఇన్స్టిట్యూట్ ఇటీవల జరిపిన అధ్య యనంలో వెల్లడైంది. కీలక వస్తువుల ఎగుమతులు, టెక్నాలజీ బదిలీపై చైనా ఆంక్షలు విధించింది. మిగిలిన దేశాలు పారిశ్రామికంగా తనపై ఆధారపడ టాన్ని చైనా ఒక ఆయుధంగా మలుచుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే, గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళడం కూడా భౌగోళిక రాజకీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని తేలుతోంది. పరికరాల విషయంలో చైనాపై ఆధారపడటం వల్ల మరో బెడద ఉంది. దాని నుంచి గ్రిడ్లు దిగుమతి చేసుకుంటే, వాటిలో అది నిక్షిప్తం చేసిన కంట్రోళ్ళ వల్ల అవాంత రాలు ఏర్పడవచ్చు. భద్రతాపరంగా అది ముప్పే! సోలార్ ఇన్స్టలే షన్లతో బ్యాక్–డోర్ కమ్యూనికేషన్కు ఉద్దేశించిన ఇన్వెర్టర్లను చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. వాటిలో తమకు అంతు బట్టని మరికొన్ని భాగాలు ఉన్నట్లు అమెరికా గతేడాది గుర్తించింది. ప్రత్యామ్నాయమే శరణ్యంపశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభానికి గురి చేసింది. ప్రపంచ చమురు మార్కెట్ చరిత్రలో, సరఫరాలో ఇంతటి విఘాతం ఎన్నడూ ఏర్పడలేదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ చెబుతోంది. ఎంతమాత్రం వీలున్నా సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయాలని కోరాలని చెప్పింది. హైవేలలో వేగాన్ని గంటకు కనీసం 10 కిలోమీటర్ల మేరకైనా తగ్గించాలని చెప్పింది. ప్రైవేటు కార్ల బదులు బస్సులు, రైళ్ళ వాడకానికి మారాలని సూచించింది. వాహనాలు కూడా అన్నీ రోజూ రోడ్డుపైకి రాకుండా సరి, బేసి సంఖ్యల పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పింది. ఎల్పీజీ వంటింటికి ఎక్కువ అవసరం కనుక, దాన్ని ఉపయోగించే వాహనాలు పెట్రో లుకు మారాలని పేర్కొంది. ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు ఉన్నపుడు విమాన ప్రయాణాల జోలికి వెళ్ళవద్దంది. చాలా దేశాలు తమ పరిస్థితులను బట్టి వాటిలో కొన్నింటిని అమలులోకి తెస్తు న్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సంప్రదాయ, పునరుత్పా దక ఇంధన వనరుల పరిశోధన–అభివృద్ధిపై గణనీయమైన పెట్టు బడులు పెట్టక తప్పదు. ఇంధన రంగానికి అంకితమైన పరిశోధన కేంద్రాలు మన దేశంలోనూ చాలా ఉన్నాయి. కానీ, అవి పారిశ్రామిక స్థాయిలో ఆలోచించకుండా వేటికవి విడివిడిగా పనిచేస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనం వైపు ఏనాడో మళ్ళిన దేశాలలో భారత్ కూడా ఉంది. సోలార్ కుక్కర్లు, హీటర్లు, బయోమాస్, బయోగ్యాస్, చివరకు బ్యాట రీలతో నడిచే బస్సుల వాడకంలో కూడా చొరవ చూపిన దేశాల్లో మనమూ ఉన్నాం. 1973లో ఎదుర్కొన్న చమురు సంక్షోభంతోనే ఆ దిశగా ఆలోచించాం. భౌగోళిక రాజకీయ వాస్తవికతల నేపథ్యంలో ఇంధన భద్రత ప్రణాళికా పటాన్ని తిరిగి రూపొందించుకోవాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
జి.సుధాకరన్ (79) సీపీఎం రాయని డైరీ
సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా లేడు. ఉదయించటానికి సంశయిస్తున్నట్లుగా ఉన్నాడు! తూర్పున, ‘అరుణ’వర్ణంలో ఏదో మార్పు! దేనికది సంకేతం?! మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వానికి యుగాంతం సంభవించబోతోందా?! కేరళలో యుగాంతమే అయితే, ఈసారి అది ఒక్క కేరళలోనే కాదు, మొత్తం దేశంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వాలకు యుగాంతం అయినట్లు! యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1976లో ఇలా జరిగింది. ఆ ఏడాది దేశంలో ఎక్కడా కమ్యూనిస్టు సూర్యుడే ఉదయించలేదు. ఆనాటి చీకట్లే మళ్లీ 2026లో దేశాన్ని కమ్ముకో బోతున్నాయా? ఈ ఎన్నికల్లో కేరళ కమ్యూనిస్టులు గెలవలేకపోతే జరిగేది అదే!బాల్కనీ లోంచి తిరిగి నా గదిలోకి వచ్చాను. బయటి వెలుతురు కన్నా, లోపలి టేబుల్ లైట్ ఎక్కువ కాంతిమంతంగా ఉంది. టేబుల్ డెస్క్లోంచి అంబలప్పుళ నియోజకవర్గ ప్రజా సమస్యల ఫైల్ను బయటికి తీశాను. అంబలప్పుళ ఐదేళ్లుగా నా నియోజక వర్గం కాదు. అంబలప్పుళ ప్రజలు మాత్రం ఎప్పటికీ నావాళ్లే! 2021 వరకు వరుసగా మూడు టెర్మ్లు వాళ్లు నన్ను ఎన్నుకుంటూ వచ్చారు. తర్వాత ‘టూ–టెర్మ్ రూల్’ వచ్చింది. రూల్ ప్రకారం, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయటానికి లేదు! పార్టీ నియమాలు పార్టీ నాయకులను పొలిమేర దాటకుండా చేయగలవుగానీ, నియోజకవర్గ ప్రజల్ని తమనాయకుడి వైపు పూలదండను విసరకుండా ఆపగలవా?!‘‘కామ్రేడ్! మీరు మళ్లీ రావాలి’’ అని గత ఐదేళ్లుగా నన్ను అడుగుతూనే ఉన్నారు అంబలప్పుళ ప్రజలు. వాళ్ల కోసం, కేవలం వాళ్ల కోసమే ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నేను పోటీ చేయవలసి వస్తోంది. ఆరు దశాబ్దాలకు పైగా ఏ జెండా నీడలోనైతే నడిచానో, ఏ సిద్ధాంతానికైతే కట్టుబడి ఉన్నానో... ఈ రోజు అదే జెండాకు దూరంగా, ఒక ‘స్వతంత్ర’ గొంతుకతో నిలబడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఈ ఎన్నికల్లో నేను ఒంటరిని. ప్రజలు వెంట ఉండి, పోటీ చేయిస్తున్న అభ్యర్థిని. గోడలపై ఇప్పుడు నా పేరు పక్కన ‘కొడవలి–సుత్తి’ గుర్తు లేకపోవచ్చు. కానీ నా గుండెల్లో అవి ఎప్పటికీ చెరిగిపోవు. నేను కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాననీ, పదవుల కోసం ఆశ పడుతున్నాననీ నా సొంత పార్టీ వాళ్లే నన్ను విమర్శిస్తున్నప్పుడు, ఆ విమర్శలు వింటూ సీఎం విజయన్ మౌనంగా ఉన్నారు! అంటే, ఆయన అనదలచుకున్నవే వారు అంటున్నారనా? ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట క్షణమైనా ఉండటం కమ్యూనిస్టు యోధుడి లక్షణం కాదు. వెంటనే పార్టీ నుండి బయటికి వచ్చేశాను. నేను కమ్యూనిస్టు పార్టీని వీడి రావచ్చు. కమ్యూనిజం నుంచి ఎప్పటికీ విడిపోను. సీఎం విజయన్ 1970లలో వరుసగా రెండుసార్లు, ’90లలో వరుసగా రెండుసార్లు, 2016 నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ‘టు–టైమ్ రూల్’ ఆయనకు వర్తించదా?!ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేనిప్పుడు పోటీ చేస్తున్నానంటే కారణం... అసమ్మతి కాదు, పార్టీ రూల్లోని అసమానతపై నిరసన. కేరళకు ఎంత గొప్ప చరిత్ర ఉంది! ప్రపంచంలో, ప్రజలు ఎన్నుకున్న తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళదే! తిరిగి కేరళతోనే ఇండియాలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు తుది దశకు చేరుకుంటాయా?! బెంగాల్, త్రిపుర, ఇక ఇప్పుడు కేరళ?! రాజకీయాల్లో మార్పు తేవటం అంటే, ప్రజల జీవితాల్లో మార్పు రావటం అనే సంగతిని విజయన్ విస్మరించినట్లున్నారు! కమ్యూనిస్టులు ఓడిపోవటానికి బయటి కారణాలు ఉండవు. బయటికి రాని కారణాలే ఉంటాయి. -
ప్రతిష్ఠను పెంచే గిరిజన ప్రతిభ
మన దేశంలోని గ్రామీణ, అటవీ ప్రాంత బాలలు ప్రకృతి ఒడిలో ఎక్కువ సమయం గడపడం నేను గమనించాను. వాళ్లంతా రకరకాలుగా ఆడుకునే ప్రయత్నం చేస్తారు. నేలపై గీతలు గీయడం, కొన్ని ఆకారాలతో ఆట స్థలాలను సృష్టించడం, ఎండిన పండ్ల గింజలను పాచికలుగా – పావులుగా వాడటం వంటివి చేస్తుంటారు. ఎండిన ఆకులు, చింకిపాత లతో బంతులు చేస్తారు. వెదురు బొంగులతో హాకీ, ఫుట్బాల్ గోల్పోస్టులను తయారు చేస్తారు. చాలామంది బూట్లు లేదా జెర్సీలతో నిమిత్తం లేకుండా ఉత్సాహంగా ఆటపాటల్లో మునిగిపోతారు. చెరువులు, సరస్సులలో ఈదులాడుతూ ఆనందిస్తారు. ఒడిషాలోని జాజ్పూర్ వాస్తవ్యురా లైన 15 ఏళ్ల అంజలి ముండా ఇదే తరహాలో తనకు అందుబాటులో గల వనరులు, శిక్షణతో ఈతలో తన ప్రతిభకు సానబెట్టుకుని, ‘ఖేలో ఇండియా తొలి గిరిజన క్రీడలు–2026’లో తొలిరోజునే 3 స్వర్ణ పత కాలను కైవసం చేసుకుని యువతలో ఎనలేని స్ఫూర్తి నింపింది.ఏకలవ్యుడి వారసత్వంగిరిజనులకు విలువిద్యపై సహజంగా మక్కువ. సంథాల్ సమాజం తమపై దోపిడీని ఎదిరిస్తూ 1855లో బ్రిటిష్ పాలకులపై సాగించిన భీకర పోరాటం ‘సంథాల్ హూల్’ (తిరుగుబాటు)గా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. బ్రిటిష్ దళాలు ఆధునిక ఆయుధాలతో ఆ తిరుగుబాటును అణచివేసినప్పటికీ, సంథాల్ యోధుల యుద్ధ నైపుణ్యాన్ని ప్రత్యేకంగా గ్రంథస్థం చేశారు. నేను జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో అక్కడి ‘ఊరి –మారి’ గ్రామంలోగల ‘సంథాల్ హూల్’ వీరులు, అమర సోదరు లైన సిధో–కన్హు, చండ్–భైరవ్ సహా శౌర్యశీలురైన సోదరీమణులు ఫూలో–ఝానోల విగ్రహావిష్కరణ భాగ్యం నాకు దక్కింది. అసమాన విలుకాడిగా పూజలందుకునే ఏకలవ్యుని ఖ్యాతిఎంతటిదో భారతదేశంలోని ఏ బిడ్డను అడిగినా గొప్పగా వర్ణిస్తాడు. ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా గిరిజనులకు ఏకలవ్యుడు స్ఫూర్తి ప్రదాత మాత్రమేగాక విలువిద్యలో ఆదర్శప్రాయుడు. ఆయన వార సత్వానికి అనుగుణంగా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లోని ‘క్రీడా నైపుణ్య కేంద్రాలు’ బాలలకు ఆధునిక క్రీడా సౌకర్యాలు, విధా నాలను చేరువ చేస్తున్నాయి. నా వంతు కృషి ఫలితంగా మా స్వగ్రామంలోనూ నిరుపేద బాలల కోసం ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటైంది. మరికొంత ప్రయ త్నంతో ఆ పాఠశాల ప్రాంగణంలో విలువిద్యా శిక్షణకూ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు చిన్నచిన్న వ్యక్తిగత, సమష్టి ప్రయత్నాల ద్వారా గిరిజన బాలల్లో సహజ క్రీడా ప్రతిభ ఇనుమ డిస్తుందనడంలో సందేహం లేదు.క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధమా గ్రామంలోని ఇతర గిరిజన బాలల తరహాలోనే నేను కూడా చిన్నతనంలో ఈత కొట్టడం సహా ఇతర కసరత్తులు, క్రీడలపై ఆసక్తి చూపేదాన్ని. మా పాఠశాల క్రీడా పోటీలలో తరచూ ప్రథమ స్థానంలో నిలవడం నాకు పరిపాటి. అలాంటి ఓ పోటీ సందర్భంగా నా నేస్తానికి ప్రథమ బహుమతి ఆనందానుభూతినిచ్చే ఉద్దేశంతో నేను కావాలనే వెనుకబడటం ఓ మధుర జ్ఞాపకం. క్రీడలు బాలల్లో జట్టు స్ఫూర్తిని పెంచి, బలమైన సామాజిక స్నేహానుబంధాలకు తోడ్పడతాయి. మైదానంలో తీవ్రంగా పోటీపడే క్రీడాకారుల నడుమ సాధారణంగా స్నేహబంధం పటిష్ఠంగా ఉంటుందన్నది వాస్తవం.మా సోదరుడు ఫుట్బాల్ చక్కగా ఆడేవాడు కానీ తీవ్ర గాయంతో ఆటలో కొనసాగలేకపోయాడు. మా కుటుంబ సభ్యు లందరూ వివిధ క్రీడలలో రాణించినవారే. గిరిజన కుటుంబాలకు ఉజ్వల క్రీడా సంప్రదాయం సహజాతమని చెప్పడానికే నా వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటున్నాను. వారి జీవితాల్లో క్రీడలు ఒక వినోదంగా, సామాజిక కార్యకలాపాల సాధనంగా మాత్రమే మిగిలి పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2018లో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కొన్ని క్రీడా సంస్థల సహకారంతో శ్రీకారం చుట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం నలు దిశలా నిబిడీకృతమైన ప్రతిభను విశేషంగా వెలుగులోకి తెస్తోంది.మన దేశంలో కొన్నేళ్ల కిందటి దాకా కేవలం పెద్ద నగరాల్లోనే ఉత్తమ క్రీడా సదుపాయాలు అందుబాటులో ఉండేవి. గిరిజన ప్రాంతాల్లో క్రీడల అకాడమీలు, శిక్షణ సౌకర్యాలు లభ్యమయ్యేవి కావు. కానీ, ఇవాళ ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో బాలలకు క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపటం నుంచి ‘ఖేలో ఇండియా గిరిజన క్రీడలు’ వంటి అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.ఖేలో ఇండియా!నా విద్యార్థి దశలో– అయిదారు గ్రామాల క్రీడా ఔత్సాహికులు ఏకమై, గ్రామీణులను సమీకరించి పోటీలు నిర్వహించడం నాకింకా గుర్తుంది. అలాగే, కొన్ని ఆధ్యాత్మిక–సాంస్కృతిక సంస్థలు కూడా గిరిజన ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నాయి. కానీ, అలాంటి పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు గ్రామీణ స్థాయిని దాటి ఎదగలేకపోయేవారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో భాగంగా కొన్నేళ్ల నుంచీ ప్రశంసనీయ కృషి సాగుతోంది. ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026’ అలాంటి చర్యలకు మరింత ఉత్తేజమిచ్చాయి. భారత్ తన క్రీడాకారుల సహజ ప్రతిభ వల్లనే 1928 ఒలింపిక్ క్రీడల్లో తొలి హాకీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆనాటి ఘన విజయంలో కీలక పాత్రధారులు గిరిజన క్రీడాకారులే. అప్పటి నుంచీ దిలీప్ టిర్కీ, సుబోధ్ లక్రా, సలీమా టెటే వంటి క్రీడాకారులు భారత కీర్తికిరీటంలో మణిమాణిక్యాలై హాకీ క్రీడకే వన్నెతెచ్చారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ క్రీడాభివృద్ధి కార్యక్రమం ‘ఖేలో ఇండియా’ కింద స్థానికం నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని భౌగోళిక ప్రాంతాలు, సామాజిక వర్గాలు, సంస్థలకు తగిన క్రీడావరణం కల్పించేందుకు కృషి కొనసాగుతోంది. ఈ కార్యక్రమం కింద ప్రధానంగా క్రీడలలో బాలికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ‘అస్మిత’ పథకం అమలవుతోంది. దీనిద్వారా మన గిరి పుత్రికల సామర్థ్యం ఇనుమడించడమే కాకుండా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026’ ఇచ్చిన ఉత్తేజాన్ని నిరంతరం బలోపేతం చేయాలి. తదనుగుణంగా గిరిజన క్రీడాకారులను స్థిరంగా ప్రోత్సహిస్తే మన దేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రశక్తిగా నిలబెట్టగల క్రీడాకారుల సమూహం రూపొందుతుంది.‘బస్తర్, సుర్గుజా ఒలింపిక్స్’లో ఏడు లక్షల మందికిపైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నక్సలిజాన్ని వీడి, క్రీడలనే సానుకూల మార్గంగా ఎంచుకున్న యువతరం కూడా వారిలో ఉన్నారు. గిరిజన వర్గాలు సహా మన యువతరం క్రీడాప్రతిభ, దేశానికి అమూల్య సామాజిక మూలధనం. ఈ వెలలేని వనరును సద్వినియోగం చేసుకోవడం ద్వారా జాతీయ క్రీడా రంగం ఎన్నో అద్భుత ప్రమాణాలను నెల కొల్పగలదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ‘ఖేలో ఇండియా! ఖూబ్ ఖేలోఇండియా!’ అంటూ నా వంతుగా నినదిస్తున్నాను.ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి(మార్చి 25న ఛత్తీస్గఢ్లో ప్రారంభమైన తొలి ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్’ నేటితో ముగియనున్నాయి.) -
వీళ్ళు బయట మనల్ని ఎలా చూపుతున్నారు?
తెలుగు ప్రజలు రెండుగా విడిపోయి పదేళ్ళు అయింది. ఈ అనుభవం తర్వాత కూడా ఇంకా మనగురించి మనం చెప్పు కునేప్పుడు; ‘నేను’ అనాలా, లేక ‘మేము’ అనాలా అనే మీమాంస అలాగే ఉంది. ఇది ‘జీఐ’ (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ) అనే మన భౌగోళిక గుర్తింపు దృష్టి నుంచి అంటున్న మాట. సీఎం అంటేనే ‘ప్రభుత్వం’ అయినప్పుడు, రాష్ట్ర ‘ప్రజలు’, ‘ప్రాంతము’– ఈ రెండింటికి ఆయన ప్రతినిధి. అటువంటిది, ఏపీ గురించి ముఖ్యమంత్రి బయట మాట్లాడేటప్పుడు, ఆయన రాష్ట్ర ప్రజలైన మనల్ని కూడా కలుపుకుని ‘మన’ అంటున్నారా, లేక తనమట్టుకు మాత్రమే పరిమితం చేసుకుని ‘నేను’ అంటున్నారా? ఇటీవల పార్లమెంట్లో జరిగింది చూసినప్పుడు, ఈ అంశం చర్చించకుండా ఉండలేకపోతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ చారిత్రక వైభవాన్ని పరిరక్షించి మన ‘హెరిటేజ్’ని కొత్త తరాలకు చేర్చే ‘ఆర్కియాలజీ’ శాఖ పనితీరు గురించి, దానికి నిధుల కేటాయింపు గురించి చిత్తూరు ఎంపీ డి. ప్రసాదరావు (కూటమి) ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. ‘అందుకు కారణం కేంద్రం వద్ద నిధులు లేకపోవడం కాదు, మీ రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి రానందున, మీ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు’ అని మంత్రి అన్నారు. తరుచూ ‘టూరిజం’ చుట్టూ పెరిగే వృద్ధి గురించి, దాని విస్తరణ గురించి మాట్లాడే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇటువంటి లోపానికి కారణం ఏమిటి అని చూస్తే, మళ్ళీ అది మరొక ‘అకడమిక్’ అంశం అవుతున్నది. సామాజిక శాస్త్రాలకు తల్లి వంటి చరిత్ర కనుక ఈ ప్రభుత్వానికి గుర్తు ఉండివుంటే, పురావస్తు శాస్త్రం (ఆర్కియాలజీ) దానితో జంటగా కలిసే ఉంటుంది కనుక, అది కూడా వారికి గుర్తు ఉండి ఉండేది. మూడు దశాబ్దాల క్రితం సామాజిక శాస్త్రాల చదువులు అక్కరలేదు అనే వైఖరి ఈ ప్రభుత్వం తీసుకుంది కనుక; ఇక ఇప్పుడు వారికి ‘టూరిజం’ అంటే హోటళ్లు, కాటేజీలు, ‘ఫుడ్’, వినోదం, విలాసం మాత్రమే ‘టూరిజం’ అవుతుంది. అందుకే గడచిన పదేళ్ళలో ఇంకా దొరకాల్సిన చరిత్ర కోసం ఇక్కడ వెతకాలని, అందుకు ‘ఆర్కియాలజీ’ కార్యకలాపాలు అవసరం అని ఈ ప్రభుత్వం అనుకోలేదు. ఢిల్లీలో మార్చి 5–7 మధ్య ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ జరిపిన పదకొండవ ‘రైసీనా డైలాగ్– 26’ సదస్సులో మన తీరు కూడా అటువంటిదే. పైగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ దీనికి స్పాన్సర్ కూడా. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సదస్సుకు ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం ఇచ్చారు. బీజేపీ తన ముద్రకోసం దాన్ని – ‘సంస్కార’ అనే బ్యానర్ కింద జరిపినా ‘ధ్రువీకరణ, వసతి, పురోగతి’ అనే మూడు అంశాల దృష్టితో ఇది జరిగింది. కానీ కొత్త రాష్ట్రానికి ప్రతినిధిగా మాట్లాడిన ఏపీ సీఎం బాబు వెయ్యి కిలోమీటర్ల తీరం ఉన్న ఈ రాష్ట్రం ఉనికిని ఇతరులకు అదొక భౌగోళిక అవకాశంగా ఆ వేదికపై చూపలేదు. దీని పర్యాటక ప్రాధాన్యం గురించి అక్కడ చెప్పకుండా పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాన్ని చేజేతులా వదిలివేశారు. ఆ వేదికమీద నుంచి ‘ప్రపంచం అంతా ఇండియన్స్ ఉన్నారు, సిలికాన్ వ్యాలీ, అమరావతి ‘టెక్నాలజీ హబ్’, ‘ఏఐ’, ‘డేటా సెంటర్’, ‘క్వాంటమ్ వ్యాలీ’, ‘వరల్డ్ క్లాస్ ఎకో సిస్టం’ అంటూ చెప్పాక, చివరికి ఈ మధ్య మన జిల్లాల్లో ఎక్కువ పిల్లల్ని కనండి అని చెబుతున్నట్టుగా, అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలకు 25 వేలు ఇస్తాము అని చెప్పేశారు. పైగా దీన్ని– ఫైవ్ పిల్లర్ మోడల్’ అని వెల్లడించారు. అంటే– అమ్మా నాన్న, ముగ్గురు పిల్లలు కలిసి ‘ఐదు స్తంభాలు నమూనా’ అని. పైగా ఇది ‘పాపులేషన్ కేర్’ కార్యక్రమం అని కూడా అన్నారు. అయితే, ఇందులో ఎక్కడ ‘మనం’ ఉన్నామో వెతకడం ఎలా?జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఆనందం ఉన్నచోటనే ఐశ్వర్యం
అభిరుచికి తగ్గ రంగాన్ని ఎంచుకోండని చెప్పిన మాటలను విని విని మీరు ఎంతగా విసిగిపోయి ఉంటారో నేను ఊహించగలను. నేనైతే మక్కువ లేదు గిక్కువ లేదు అనే అంటాను. మీరు చేయగలిగిన ఏదైనా గొప్ప పనిని చేపట్టవలసిందని చెబుతాను. అటువంటి దాన్ని ప్రయత్నించి విఫలమైనా ఫరవాలేదు. స్వతహాగా దేనిమీద మక్కువ ఉందో కనిపెట్టి దాన్ని చేప్టటా లనే ఆలోచనను వదిలేయండి. నాకు బాగా అభిరుచి కలిగిన ఉద్యోగ మంటూ చొక్కాలు చించుకోవద్దు. ఏ ఉద్యోగంలో చేరినా ఆ ఉద్యో గానికి మీ శక్తియుక్తుల మేరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించండి. ఆ పనిని ఇష్టపూర్వకంగా చేసేందుకు సుముఖులు కండి. భావావేశంతో అతిగా శ్రమించి ఆయాసపడనక్కర లేదు. అది మీ తోటి ఉద్యోగులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఆడుతూ పాడుతూ చేస్తే చాలు. చెమటలు కక్కనవసరం లేదు. మూడు కీలక సూత్రాలుజీవితంలో నేను అనుసరించిన మూడు కీలక సూత్రాలను చెబుతాను. ఒకటి– శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించండి. రెండు– దృష్టి పెట్టండి. మూడు– ప్రేమలో పడండి. మీరు ఏ పని చేపట్టినా సరే– అది మీ ఉద్యోగం, కాలక్షేపం, లేదా సాంగత్యం ఏదైనా కావచ్చు. అది ఏ రకమైనదో అనవసరం. కానీ, చేసే పనిలో ప్రయత్న లోపం ఉండకూడదు. కృషి ఫలించి తీరుతుంది. అది సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఫలితం మనం ఆశించి నట్లుగా రాకపోయినా, ప్రయత్న లోపం లేదనే తృప్తి మనకు మిగులుతుంది. ఇది జీవన సూత్రం. జీవితంలో చాలా విషయాల్లో ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు. సముద్ర గర్భంలోకి తీసు కెళ్ళే వస్తువులో కూర్చున్నారనుకోండి. మునిగిపోయిన టైటానిక్ ఓడ దగ్గరకు వెళుతున్నారు. కెప్టెన్ చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. సముద్ర గర్భం నుంచి ఆ నౌకను తిరిగి రేవుకు చేర్చడం కుదిరే పని కాదని మీకే అర్థమవుతుంది. చేపలకది సహజ నివాస ప్రాంతం కనుక, మనకన్నా తేలికగా అవి అక్కడ సంచరించగలుగుతాయి. అది వాటి సహజ సామర్థ్యం అనుకుని వదిలేయాలి. మనం ఏదో చేయలేకపోతున్నామని మనో వేదనకు గురికాకూడదు.అలాగే, మనుషులతో ప్రేమలో పడటం తేలిక. కానీ, ఇది అది అని కాకుండా అన్నింటితోను ప్రేమలో పడండని చెబుతాను. మీకు ఏది లభిస్తే దానిపైనే మక్కువ పెంచుకోండి. అది మీరు తాగే కాఫీ, వేసుకునే స్నీకర్స్ లేదా కారు నిలిపే పార్కింగ్ ప్లేస్ ఏదైనా కావచ్చు. లభించిన దానిపై ఇష్టం పెంచుకోవాలి. చిన్న చిన్న వాటిని చూసి కూడా ఆనందించడం నేర్చుకోవాలి. జీవితంలో పెద్ద పెద్ద సమస్య లను పక్కనపెట్టి, అందుబాటులో ఉన్న చిన్నవాటిపైనే దృష్టి పెడుతూ జీవితాన్ని ఆనందంగా గడిపాను. మీకు ఏది మంచిదని పిస్తోందో దాన్ని కనుగొనండి. దానిలో కొన్ని చెడ్డవి ఉంటే వాటిని పట్టించుకోవద్దు. ఏది సౌకర్యకరంగా ఉంటుందో, ఒత్తిడిని ఎంత వరకు భరించగలరో చూసుకోండి. జీవితంలో విజయానికి ఇది బంగారు బాట. పని, వ్యాయామం, సాంగత్యాలు హింసకు గురి చేస్తాయి. కానీ, అవి నూరు శాతం కాదు, వెయ్యి శాతం అందుకు అర్హమైనవే. కనుక, కష్టపడటంలో తప్పు లేదు. శ్రమలోనే సౌందర్యంపనికన్నా అద్భుతమైనది మరొకటి లేదు. చేస్తున్న పనిలో మమేకం అయ్యే వారి గురించి వినే ఉంటారు. వారు అలా ఎక్కువ సమయాన్ని ఆఫీసుకు ఎలా వెచ్చించగలుగుతారో తెలుసునా? అది చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. అంకిత భావంతో పనిచేయ లేనప్పుడు ఆ ఉద్యోగాన్ని పట్టుకుని వేలాడటం కన్నా దాన్ని వదిలే యడమే మంచిది. లేకపోతే అది స్వయం కృతాపరాధం అవుతుంది. పనిని నిందించవద్దు. ఏ పనైనా అద్భుతమైనదే. నేను అంత కష్టపడి ఉండాల్సింది కాదు, తక్కువ పని చేసినా సరిపోయేది అనే సందర్భం జీవితంలో ఎన్నడూ రాకూడదు. అలా అనిపించే పక్షంలో అసలు ఆ పనిలో కొనసాగకపోవడమే మంచిది. ఏడీ, ఏమై పోయాడు అని ఎవరైనా అడిగితే, తినడానికి ఏదో తెచ్చుకుంటానని వెళ్ళాడు అని ఎవరో ఒకరు జవాబిస్తారు. వద్దు అనుకున్నాక మళ్ళీ ఆ గడప తొక్కకూడదు.హాస్య చతురతను కోల్పోవద్దు!జీవితంలో హాస్య స్ఫూర్తి చాలా అవసరం. అది జీవితంలో కష్టమైన దశల్లో కూడా ఊరట కల్పిస్తుంది. ఇవాళ దాని గురించే ప్రధానంగా చెప్పాలనుకున్నాను. ఇక్కడున్న వారిలో రెండు తరా లకు చెప్పదగిన విశ్వాసం, అనుభవం నాకున్నాయి. నేను 70వ పడిలో పడ్డాను. జీవితంలో ఇప్పుడిప్పుడే మీరు అడుగులేయడం ప్రారంభిస్తున్నారు కనుక ఈ విషయంలో మీకు నేను సహాయపడ దలచుకున్నాను. ఒక్కోసారి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే హాస్య మైనా ఫరవాలేదు. దాన్నేదో చక్కదిద్దడానికి మనం ప్రయత్నించ నవసరం లేదు. అది మరీ హద్దులు దాటేదిగా ఉండకూడదంతే. మరింత న్యాయబద్ధమైన, సమ్మిళిత సమాజ నిర్మాణానికి మీరు కంటున్న కలలను నేను పూర్తిగా అభినందిస్తున్నాను. ఎదుటి వారి మనసు నొచ్చుకోకుండా ఉండేందుకు మీరు చూపుతున్న జాగరూకత కూడా అద్భుతమైనదే. శతవిధాలా అందుకు ప్రయ త్నించవలసిందే. కానీ, ఒక కమెడియన్గా నేను మీకొక సంగతి చెప్పదలచుకున్నాను. హాస్య చతురతను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. హాస్యాన్ని హాస్యంగా స్వీకరించడం అలవరచుకోవాలి. జీవితంలో మున్ముందు దశల్లో ఒడుదుడుకులను తట్టుకుని ముందుకు సాగేందుకు అది ఎంతగా సహాయపడుతుందో, జీవితంలో ప్రస్తుత దశలో మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. హాస్య స్పూర్తి లేకుండా జీవితంలో బతికి బట్టకట్టడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో మనసు చివుక్కుమనిపించినా, తట్టుకుని, చతురోక్తి విని ఆనందించగలగాలి. జీవిత చరమాంకంలో, అరే, మనం జీవి తంలో హాస్యాన్ని అంతగా అనుభవించలేకపోయామే అనే పరిస్థితి రాకూడదు. మానవ అనుభవాలనే ప్రవాహంలో ముందుకు సాగేందుకు హాస్యం శక్తిమంతమైన నావలా పనిచేస్తుంది. మానవులంద రికీ ఉండి తీరవలసిన లక్షణం హాస్య చతరుత. జీవితంలో డబ్బు ఎలాగో ఒకలా సంపాదించుకుంటాం. దాని గురించి ఎక్కువ మథనపడిపోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్జన అనే మాయాజాలంలో చాలామంది చిక్కుకుపోవడాన్ని గమ నిస్తున్నాను. దాన్నికాస్త పక్కన పెట్టండి. సంపాదనపై కాక, ఉన్నంతలో ఆనందంగా గడపడమెలా అనే దానిపై దృష్టి పెట్టండి. మీరే ఒక సంపదగా పరిణమించండి. ఆనందం ఎక్కడ ఉంటుందో ఐశ్వర్యం అక్కడ ఉంటుంది. -
తన ఆటలో తానే పావయిందా?
ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ముగింపు సూచనలు లేవు సరికదా మరింత తీవ్రతరమవటమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఇరాన్ తరఫున యెమెన్లోని హవుతీలు కూడా రంగంలో దిగటంతో పర్షియన్ గల్ఫ్తో బాటుగా ఎర్ర సముద్రంపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎర్ర సముద్రం, బాబెల్ మెండెబ్ జలసంధి గుండా సుమారు 12 శాతం ప్రపంచ చమురు, గ్యాస్ రవాణా జరుగు తున్నది. అంటే, ఇరాన్ ఈ యుద్ధాన్ని మరొక అంచెకు తీసుకొని వెళ్లటానికి నిశ్చయించినట్లు లెక్క.అమెరికా ప్రేరేపిత యుద్ధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం (1945) తర్వాత ప్రపంచంలో ఏ మూలలో ఏ యుద్ధం, సంక్షోభం తలెత్తినా, అందులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ యూఎస్ఏ పాత్ర ప్రస్ఫుటం. ప్రచ్ఛన్న యుద్ధ (1945–1991) కాలంలో యూఎస్ విదేశాంగ విధానం సోవియట్ రష్యాను, కమ్యూనిజాన్ని అడ్డుకోవటం లక్ష్యంగా రూపొందించబడి నది. సోవియట్ విచ్ఛిన్నం (1991) తరువాత యూఎస్ఏ నాయక త్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. అమెరికన్ ప్రయోజనాలకు విఘాతం నెపంతో ముందస్తు సైనిక చర్యలు, ప్రభుత్వ మార్పిడు లను నిస్సంకోచంగా తన విదేశాంగ నీతిగా ఉంచుకొన్నది.యుద్ధంతో శాంతా?ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ఏ ఇక యుద్ధాలు చేయటం లేదా ప్రోత్సహించడం ఉండదని ప్రకటించాడు. బైడెన్ ప్రభుత్వం అనవసరంగా యూఎస్ఏను యుద్ధాల ఊబిలోనికి లాగి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని విమర్శించాడు. అదే సమయంలో సుంకాల యుద్ధానికి (టారిఫ్ వార్) తెరతీశాడు. క్రమంగా ట్రంప్ ప్రభుత్వం ‘యుద్ధాలకు ముగింపు’ విధానం నుండి మళ్లీ సైనిక జోక్యం వైపు తిరిగి వచ్చింది. మొట్టమొదటిగా పనామాను బెదిరించి లొంగదీసు కోవటం మొదలుపెట్టి, ఉక్రెయిన్కు సాయుధ సహకారాన్ని మరింత విస్తరించి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేట్లు చేస్తున్నది. ఇరాన్ మీద 12 రోజుల యుద్ధం, వెనిజులాలో సైనిక చర్యతో యూఎస్ తన పంథా మార్చుకోలేదని అర్థమయింది. గ్రీన్ల్యాండ్ను యూఎస్ఏకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. ఇరాన్తో యుద్ధం ప్రారంభిస్తూనే క్యూబాతో కలహానికి శ్రీకారం చుట్టాడు.ఇటీవల 2025లో యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం (నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025) యూఎస్ ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఈ వ్యూహం ప్రకారం బలం, సామర్థ్యం ద్వారా శాంతిని స్థాపించాలని యూఎస్ ప్రతిపా దిస్తుంది. అంటే యుద్ధాల ద్వారా ప్రపంచ శాంతి (వార్ ఫర్ పీస్) అనే విపరీత సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ వ్యూహంలో భాగంగానే ట్రంప్ వివిధ దేశాలను సైనిక, ఆర్థిక, సాంకేతిక శక్తి ద్వారా లోబర్చుకొనే విధానాన్ని అమలుపరుస్తున్నాడు. బెదిరింపులకు లొంగిపోయిన దేశాలను మరింతగా బెదిరించాడు. ఎదురు నిలబడ్డ దేశాల విషయంలో వెనకడుగు వేశాడు. ఉదాహరణకు రష్యా, చైనా, కెనడా, ఈయూ, భారత్లతో ట్రంప్ వెనకడుగు వేశాడు.డీప్ స్టేట్ మద్దతు లేదా?యూఎస్ఏ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా విదేశాంగ విధానాన్ని ఆ దేశంలోని డీప్ స్టేట్ రూపొందిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రిపబ్లికన్ల చేతిలో ఉన్నా, డెమోక్రాట్ల చేతిలో ఉన్నా డీప్ స్టేట్ చెప్పుచేతల్లో ఉండాల్సిందే. సీఐఏ, పెంటగన్, ఎన్ఐఏ, మీడియా లాబీ, ఆయుధ కంపెనీల లాబీలు, టెక్ కంపెనీ లాబీలు, బడా మదుపరుల లాబీలు, యూదుల లాబీలతో కూడిన ఈ డీప్ స్టేట్ ప్రభుత్వ విధానాలు తన లక్ష్యాలకు అనుగుణంగా ఉండేట్లుగా చూస్తుంది.డీప్ స్టేట్ కనుసన్నల్లో ఉండే యూఎస్ విధానం ఎల్లప్పుడూ జియో పొలిటికల్ లక్ష్యాలతో పాటుగా అమెరికన్ లాబీల ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. ఈ లక్ష్యానికి అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వంటి ఉదారవాద ముసుగులను కప్పి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుం టారు. తాత్కాలికంగా యూఎస్ ఆధిపత్యానికి నష్టం కలిగినా సరే, యూఎస్ డీప్ స్టేట్ లాబీల వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుంది.యూఎస్ అధ్యక్షులెవరయినా యూఎస్ డీప్ స్టేట్ ప్రయోజనా లకు విరుద్ధంగా వెళ్లలేరు. గత ఎన్నికలలో బైడెన్పై ట్రంప్ ఓటమికి డీప్ స్టేట్ సహకరించిందని అనుమానం. అందుకే ట్రంప్ డీప్ స్టేట్ని పక్కకి నెట్టి హెగ్సెత్, కుష్నర్, లిండ్సే, విట్కాఫ్ వంటి వ్యక్తులపై ఆధారపడుతున్నారు. డీప్ స్టేట్ భాగస్వామ్యం లేకపోవ టంతో ఇరాన్ వ్యూహంలో డొల్లతనం కన్పడుతున్నది.ఎంతవరకు పోరాడగలవు?ఇరాన్పై యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యాలలో వైరుధ్యం కన్పడుతున్నది. ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేయటం, ఇరాన్ను ముక్కలుగా చేయటం, సుదూర భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ సవాలు చేసే స్థితిలో లేకుండా చూడటం ఇజ్రాయెల్ లక్ష్యం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమయిన జెరూసలెం వంటి ప్రదేశాలతో కూడిన ఇజ్రాయెల్కు ఉనికి, అస్తిత్వాల సమస్య ఉన్నది. సామ్యూల్ హంటింగ్టన్ సూచించినట్లు, ఇది నాగరికతల మధ్య యుద్ధం. ఆర్థిక, వాణిజ్య ఆంక్షల నడుమ చితికిపోయిన ఇరాన్ మనుగడకు ఈ యుద్ధం ఒక సవాల్. అందుకే ఈ రెండు దేశాలది ‘నిండా మునిగిన వాడికి చలేమిటి?’ పరిస్థితి. దీర్ఘ పోరాటానికి ఈ రెండు దేశాలూ వెనుకాడవు.ఇరాన్ నుండి తమను రక్షించుకోవటానికి అమెరికా ఛత్ర ఛాయలోకి దూరిన సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు, ఈ యుద్ధం నుండి తప్పించుకోలేని పరిస్థితి. తమను తాము రక్షించుకోలేని ఈ దేశాలు ఇరాన్ నాశనాన్నే కోరుకుంటాయి. భవిష్యత్తులో మరెప్పుడూ తమపై దాడి చేయనంతగా ఇరాన్ను ధ్వంసం చేయాలని ఈ దేశాలు కోరుకోవడం సహజం. అందువలన ఇవి యుద్ధం ఆగాలని కోరుకోకపోవచ్చును. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యాది అస్తిత్వ సమస్య. అందుకే ఎంత నష్ట పోయినా, నాలుగేళ్లయినా యుద్ధాన్ని కొనసాగిస్తున్నది.కానీ యూఎస్ఏ పరిస్థితి దీనికి భిన్నం. ఈ యుద్ధం అస్తిత్వానికి సంబంధించినది కాదు, మనుగడకు సంబంధించినది కాదు. యుద్ధ లక్ష్యాలలో గందరగోళం స్పష్టంగా ఉన్నది. ట్రంప్ దీర్ఘకాలిక యుద్ధానికి సుముఖంగా లేడు. కానీ అర్ధంతరంగా కాడి పడవేస్తే అది యూఎస్ ప్రతిష్ఠకు మాయని మచ్చ. ఇప్పటికే యూఎస్ మదుపరులు, వ్యాపార లాబీలు ట్రంప్పై ఒత్తిడి పెంచారు. యూఎస్ఏ జీడీపీ సుమారుగా 31.89 ట్రిలియన్ డాలర్లు. కానీ అప్పుల భారం 38.5 ట్రిలియన్ డాలర్లు. బాండ్ మార్కెట్ ద్వారా యూఎస్ చైనా, జపాన్, ఈయూ దేశాల నుండి పెద్ద మొత్తాలలో పెట్టుబడులను సేకరిస్తున్నది. ఈ పెట్టుబడులను వినియోగించే ఖరీదైన యుద్ధాలను నిర్వహిస్తున్నది. యూఎస్ బాండ్లపై ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లితే యూఎస్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుంది. ప్రస్తుత యుద్ధం ప్రపంచ ఆయిల్ గ్యాస్ మార్కెట్లను సంక్షోభంలోనికి నెట్టివేస్తే, దీర్ఘకాలంలో యూఎస్ బాండ్ మార్కెట్ తద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే యూఎస్ డీప్ స్టేట్ లాబీలు ట్రంప్ను ఏదో రకంగా యుద్ధం నుండి బయటకు వచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
భూతల దాడులు తప్పనట్లేనా?
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికాలోని యూదు లాబీల ఒత్తిడి నుంచి అధ్యక్షుడు ట్రంప్ బయట పడలేకపోయి నట్లయితే, ఇరాన్తో పదాతి సేనల యుద్ధం తప్పక పోయేటట్లే కనిపిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28తో ఆరంభించి దాదాపు అయిదు వారాలుగా సాగిస్తున్న వైమానిక, నౌకా, క్షిపణి యుద్ధం ఇరాన్ను తీవ్రంగానే నష్టపర చినా, సమీప భవిష్యత్తులో ఓడించగల సూచనలు లేకపోవటంతో, కనీసం పదాతి యుద్ధంతోనైనా ఆ పని చేయగలమా అనే మీమాంసలో ట్రంప్ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇరాన్ ప్రతిఘటనతో తమకు, ఇజ్రాయెల్కు, గల్ఫ్ రాజ్యాలకు, ప్రపంచ ఇంధన వ్యవస్థకు కలుగుతున్న నష్టాలు, అమెరికన్ ప్రజ లతో పాటు తన ‘మాగా’ మద్దతుదారులలో ఎదురవుతున్న వ్యతిరేక తలు కూడా ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నట్లు తోస్తున్నది.స్వభావమే సమస్యఅయినప్పటికీ ఏమీ చెప్పలేని స్థితి. అందుకు కారణం నెతన్యాహూ ఒత్తిడి అన్నది సరేసరి కాగా, స్వయంగా ట్రంప్ స్వభావం ఒక పెద్ద సమస్య అవుతున్నది. ఇరాన్ను తుదముట్టించాలన్నది తన ‘40 సంవత్సరాల కల’ అని, అందుకు తగిన అవ కాశం ఇప్పుడు వచ్చిందని నెతన్యాహూ అంటూ, అది నెరవేర్చగల నాయకుడు అమెరికన్ చరిత్రలో మొదటిసారిగా ఆవిర్భవించాడని చెప్తున్నారు. ఇరాన్పై ఈ తరహా యుద్ధం సాగించాలన్న ఒత్తిడులు ఒబామా, బైడెన్ కాలాలలోనూ వచ్చినా, వారు ఆంక్షలతో సరిపెట్టి యుద్ధానికి నిరాకరించారు. అణుశక్తి విషయమై చర్చల ద్వారా ఒప్పందం జరిగింది (2015) కూడా అప్పుడే. ఆ ఒప్పందాన్ని ఎటువంటి కారణం లేకుండా రద్దు చేసిన ట్రంప్, రెండవసారి అధ్యక్షుడైనప్పటినుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కనిపిస్తు న్నదే. ఆయనను నెతన్యాహూ అంతగా పొగడటం అందువల్లనే. ఒక్క ఇరాన్ విషయంలోనే కాదు, అనేక ఇతర అంశాలలోనూ ట్రంప్ మొదటినుంచి గత 14 మాసాలుగా ప్రవర్తిస్తున్న తీరు ఇదే విధంగా ఉంది. ఆయన ‘స్వభావం’ అనే మాట ఉపయోగించవలసి రావటం అందువల్లనే.ప్రస్తుతం గడువులు, షరతులు, చర్చలు అనే ప్రహసనం మరొకసారి సాగుతున్నది. ఇరాన్ లొంగుబాటుకు 48 గంటల గడు వన్నారు. ఆ సమయం పూర్తి కావస్తుండగా అయిదు రోజులన్నారు. అది ముగియకముందే పది రోజులకు పెంచారు. అది ఏప్రిల్ 6న గడవనున్నది. ఈలోగానే 15 షరతులతో ఒక రాజీ ప్రతిపాదన అమె రికా నుంచి వచ్చింది. అందుకు మారుగ ఇరాన్ 5 షరతులన్నది. ఆ రెండింటిలో ఏదీ రాజీకి వీలయ్యేది కాదని ఎవరైనా వెంటనే చెప్ప గలరు. అసలు అణుశుద్ధి కార్యక్రమాన్నే పూర్తిగా ఆపివేయాలనీ, క్షిపణుల సామర్థ్యం, సంఖ్య తాము చెప్పినట్లే ఉండాలనీ, (ఇరాన్) అనుబంధ మిలిటెంట్ సంస్థలకు మద్దతు పూర్తిగా నిలిపి వేయాలనీ, హార్ముజ్పై సార్వభౌమాధికారం వదలుకోవాలనీ షరతులు విధిస్తే అందుకు ఇరాన్ అంగీకరించగలదా? అదే విధంగా గల్ఫ్లోని సైనిక స్థావరాలన్నీ ఖాళీ చేసి పోవాలన్న ఇరాన్ షరతు అమెరికాకు సమ్మతం కాగలదా? కనుక అది కాలక్షేపపు వ్యవహారం మాత్రమే. ఆ మాట తెలిసి కూడా అమెరికా అధ్యక్షుడు, చాలా షరతులను ఇరాన్ అంగీకరించి వేసిందని ఈ 30వ తేదీన మరొకమారు ప్రకటించారు.గెలిచే యుద్ధమేనా?ఎంతో వెనుకకు పోనక్కర లేదు. అమెరికా, ఇరాన్ మూడవ విడత చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో ఫిబ్రవరి 26న జరిగాయి. పరస్పర అంగీకారం దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు ఒమన్తో పాటు అమెరికన్ ప్రతినిధులు ప్రకటించారు. తర్వాతి విడత చర్చలు మార్చి 2న జరగవలసి ఉంది. కానీ అకస్మాత్తుగా ఆ మధ్యలోనే ఇజ్రాయెల్, దాని వెనువెంట అమెరికా కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. ఏ ఇరాన్ నాయకుని అనుమతితో చర్చలు జరుగుతుండెనో అదే నాయకుడిని కుటుంబంతో సహా ప్రాణాలు తీశాయి. చర్చలు ఒక పక్క జరుపుతూనే మధ్యలో దాడులు చేయటం ట్రంప్కు అది రెండవసారి.అందుకే చర్చల నాటకాన్ని ఇరాన్ మాత్రమే కాదు, ఎవరూ నమ్మటం లేదు. అమెరికన్లు కూడా. నాలుగు వారాల వైమానిక యుద్ధం ట్రంప్ లక్ష్యాలను సాధించలేక పోయినప్పుడు పదాతి యుద్ధంతో అది జరిగేది కాదని అమెరికన్ రిటైర్డ్ జనరల్స్, యుద్ధ విషయాల చరిత్రకారులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అందుకు వారు గట్టి కారణాలు కూడా చెప్తున్నారు. లిబియా, ఇరాక్, అఫ్గాని స్తాన్లకు, ఇరాన్కు చాలా తేడాలున్నాయి. వాటికి భిన్నంగా ఇక్కడ విశాలమైన దేశం, పెద్ద జనాభా, బలమైన ప్రభుత్వం, భారీ సైన్యం, సైనిక సంపత్తి ఉన్నాయి. ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహం భిన్నమైనది. ఇరాన్లో అధిక భాగం పర్వతాలమయం. వారి ఆయుధ నిల్వలు కొండల అడుగున చాలా లోతైన బంకర్లలో ఉన్నందునే అమెరికన్ బంకర్ బస్టర్లు సైతం వాటిని ఛేదించలేక పోతున్నాయి. వీటన్నింటికీ అదనంగా, ఇరానియన్ ప్రభుత్వం, ప్రజలు కూడా తమ అస్తిత్వాన్ని ఏ విధంగానైనా కాపాడుకుని తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అక్కడి ప్రజలు ప్రజాస్వా మికంగా ఎన్నుకున్న మొసాదెగ్ ప్రభుత్వాన్ని అమెరికా, బ్రిటన్ కలిసి 1953లో కూలదోసినప్పటి నుంచి గల 72 సంవత్సరాల చేదు అనుభవాల దృష్ట్యా పాశ్చాత్య దేశాలను, ఇజ్రాయెల్ను ఎంత మాత్రం నమ్మరన్నది ఆ నిపుణులు చెప్తున్నమాట.కపట నీతిఅందువల్ల, అమెరికా అధ్యక్షుడు గత 12 రోజులలో మూడు సార్లు మార్చిన గడువులుగానీ, చర్చల కోసమంటున్న షరతులు గానీ, ఇస్లామాబాద్లో జరుగుతాయనే మధ్యవర్తిత్వాలు గానీ ప్రహసనం తప్ప మరొకటి కాదు. అయినా, ఇరాన్పై యుద్ధాన్నిఇంకా తీవ్రం చేయండంటూ ట్రంప్కు మూడు రోజుల క్రితం చెప్పిన సౌదీ అరేబియా, అంతలోనే ఈజిప్టు, టర్కీలతో కలిసి పాకిస్తాన్కు మధ్యవర్తి ప్రతినిధులను పంపటం కపట నీతికి పరాకాష్ఠ వంటిది. ఇటువంటి రాజీలేవీ కుదిరేవి కాదని ఒమన్ దౌత్య వైఫల్యంతో గ్రహించలేనిదేమీ కాదు పాకిస్తాన్. అయినప్పటికీ చొరవ తీసుకోవటంలో తమ ఆలోచనలేవో తమకుండవచ్చుగానీ, అది జరిగే కార్యం కాదని అందరికీ తెలుసు. అంతకన్న ముఖ్యంగా, దానిని జరగనివ్వరాదని ఇజ్రాయెలీ ప్రధానికి తెలుసు. వీటన్నింటికి ఇరాన్పై అరబ్ షేఖ్లకు చిరకాలంగా గల వ్యతిరేకత పనిచేస్తున్నది.అందువల్ల, వెనిజులాతో చర్చలు చర్చలంటూ సైన్యాలను మోహరించి అకస్మాత్తుగా దాడి చేసినట్లు, ఇరాన్తో చర్చలు చర్చలంటూ సైన్యాలను సమీకరించి ఉన్నట్లుండి యుద్ధం మొదలు పెట్టినట్లు, ఇప్పుడు మళ్లీ ఒకవైపు రాజీ ప్రతిపాదనలు ప్రకటించి ఇస్లామాబాద్లో చర్చలంటూనే పదాతి సేనలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అకస్మాత్తుగా ట్రంప్ 30వ తేదీన తన బ్రాండ్ మాట ఒకటి ప్రకటించారు. తనకు ఇరాన్ చమురు కావాలట. అందుకు ఖర్గ్ దీవిని ఆక్రమించుకుని హార్మూజ్ను తెరిపిస్తారట. కార్యసాధన తర్వాతగానీ ఇరాన్ నుంచి వెనుకకు మళ్లరట. ఒకవేళ రాగల రోజు లలో వైమానిక దాడులు, భూతల యుద్ధం జమిలిగా సాగితే ఏమి జరగవచ్చునన్నది అంచనా వేయలేము.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
హిమంత బిశ్వ శర్మ (అస్సాం సీఎం) రాయని డైరీ
ఎంత వద్దనుకున్నా... కొన్ని జ్ఞాపకాలు, బ్రహ్మపుత్ర నదీ తీరాన జంటగా సాగే చక్రవాక పక్షుల్లా రెక్కలార్చుకుంటూ వచ్చి వాలుతుంటాయి. వాటిని ఆపలేము! ఎన్నికల ప్రచారానికి రేయింబవళ్లు సరిపోవటం లేదు. ఎంత ప్రయాణించినా దారులు తరిగిపోవటం లేదు. మధ్యలో – ఈ తలపుల గుంపులు రోడ్డుకు అడ్డంగా వచ్చి, కాన్వాయ్ని ఆపినట్లుగా ఆపేస్తున్నాయి! పోలింగ్కి ఇంకో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. పది రోజులంటే... సమయం ఉండటం కాదు, సమయం లేకపోవడం. ఇవాళ అమిత్ షా వస్తున్నారు. అమిత్ షా గానీ, మోదీజీ గానీ ఎప్పుడు అస్సాం వచ్చినా అదొక గొప్ప అస్సామీ సాంస్కృతిక వేడుకలా ఉంటుంది. ఇక ఈసారైతే ఏప్రిల్లో రావలసిన ‘బోహాగ్ బిహు’ పండుగ, కాస్త ముందే వచ్చినట్లు!నల్బారి జిల్లా టిహులో; సోనిత్పుర్ జిల్లా ధేకియాజులిలో... ఈరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు భారీ ర్యాలీలు ఉన్నాయి. దిగువ అస్సాంలోని టిహులో పునాది ఇంకా కొంచెం గట్టి పడాలి. బ్రహ్మపుత్ర ఉత్తర తీరంలోని ధేకియాజులిలో తేయాకు తెగకు మరింతగా దగ్గరవ్వాలి. ఈ రెండు ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడతారు. ‘‘మీకు అండగా మీ సీఎం ఉన్నారు. మీ సీఎంకు అండగా నేను, మోదీజీ ఉన్నాం’’ అని ప్రజలకు నమ్మకం ఇస్తారు. కాంగ్రెస్కి, బీజేపీకి ఎంత తేడా!! కాంగ్రెస్ ఒకప్పుడు నాకు బ్రహ్మపుత్ర నది. ఆ నది ఒడ్డున ఉండే నారింజ–గోధుమ రంగుల చక్రవాక పక్షుల్లో నేనూ ఒకడిని. అందరం, అస్సామీ జానపద గాథల్లోని బ్రహ్మణ పక్షుల్లా ఒకరి పట్ల ఒకరం విశ్వాసంగా ఉండేవాళ్లం.కానీ రాహుల్ నన్నొక రోజు బ్రహ్మపుత్ర నుంచి తరిమేశారు! భౌగోళికంగా బ్రహ్మపుత్ర నదితో ఏమాత్రం దగ్గరితనం లేని ఢిల్లీలో కూర్చొని 2,000 కి.మీ. దూరం నుంచే నన్ను బ్రహ్మపుత్ర నుంచి విసురుగా వెళ్లగొట్టారు. మంచే జరిగింది! ఆ విసురుకు నేను బ్రహ్మపుత్ర నుండి ‘గంగానది’ గట్టున పడ్డాను. కాంగ్రెస్లోంచి బీజేపీలోకి వెళ్లటం నాకు గంగానదిలో స్నానం ఆచరించినట్లుగా ఉంది. నాకేదో ప్రక్షాళన జరిగినట్లుగా ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న నన్ను ముఖ్యమంత్రిని చేయాలని సోనియా మేడమ్ నిర్ణయిస్తే, మేడమ్ నిర్ణయాన్ని కూడా కాదని, పది మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా లేని తరుణ్ గొగోయ్ని ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వాలని రాహుల్ పట్టుపట్టారు! ఆ తర్వాతెప్పుడూ రాహుల్కు పట్టుపట్టే అవకాశం రాలేదు. పదేళ్లుగా అస్సాంలో కాంగ్రెస్సే లేదు. ఇంకో పదేళ్ల తర్వాతైనా కాంగ్రెస్ వస్తుందన్న నమ్మకం లేదు. కొన్ని మాటలను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ రోజు – గులాం నబీ ఆజాద్ – నా గురించి రాహుల్తో మాట్లాడుతూ... ‘‘మెజార్టీ ఉన్న హిమంతను పక్కన పెడితే, పార్టీ నుంచి వెళ్లిపోతాడేమో’’ అని ఆందోళనగా అన్నప్పుడు... రాహుల్ అనిన మాట, ఒక నాయకుడు అనకూడని మాట! ‘‘పోతే పోయాడు, ఆరెస్సెస్లోకే కదా పోతాడు’’ అన్నారు రాహుల్! కాంగ్రెస్లోంచి నేను బయటికి వచ్చాక, బీజేపీ నన్ను ఆదరించింది. అస్సాంకి నన్ను ముఖ్యమంత్రిని చేసింది. నన్ను సీఎంని చెయ్యటం కోసం, నా ముందున్న శర్వానంద సోనోవాల్ను ఐదేళ్లు పూర్తి కానిచ్చి కేంద్ర మంత్రిగా పంపించిన మోదీజీ, అమిత్ షాల ఔన్నత్యం ఎక్కడ?! మెజారిటీ కోల్పోయి, రెండేళ్ల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉన్న తరుణ్ గొగోయ్ను ముఖ్యమంత్రిగా కొనసాగించటం కోసం, మెజారిటీ ఉన్న నన్ను పక్కన పెట్టిన రాహుల్ సంకుచితత్వం ఎక్కడ?! నదులన్నీ పవిత్రమైనవే. పార్టీలన్నీ ప్రజాసేవ కోసం ఉండేవే. వ్యక్తులే... నదుల్ని, పార్టీలను కలుషితం చేస్తారు. -
రామ... రామ... రామనారాయణ!
‘దక్షిణ అయోధ్య’ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చినవారు అని కొందరుసందేహాలు లేవనెత్తుతున్నారు. దశరథ రాముడా, వైకుంఠ రాముడా అన్న ప్రశ్నకు సమాధానం భద్రాచల క్షేత్ర విశిష్టత తెలుసుకుంటే అర్థమవుతుంది. భక్తి మాత్రమే ఉన్నవాళ్లు భద్రాచలానికి వచ్చి శ్రీసీతారామచంద్రుడికి నిశ్చింతగా మొక్కు తీర్చుకుంటున్నారు. వాళ్లకేమీ సమస్య లేదు. కానీ ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించినది. రామనారా యణుడని పూజించే హక్కుకు సంబంధించినది. భద్రమహర్షి కథనమ్మకానికి రుజువులుండవు. భద్రాచల క్షేత్ర మహత్యంలో భద్ర మహర్షి తపస్సు కథ ఉంది. రామరావణ యుద్ధం ముగించి, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం తరువాత అనేక సంవ త్సరాలు తపస్సు చేసిన భద్ర మహర్షికి శ్రీరామచంద్రుడు శంఖ చక్రాలతో దర్శనమిచ్చాడు. ఆ స్వామిని వైకుంఠ రాముడని, మోక్ష రాముడని, చతుర్భుజుడైన ‘రామనారాయణు’డని క్షేత్ర మహా త్మ్యాలు వివరిస్తున్నాయి. భద్రమహర్షి తానే ‘అచలం’ అంటే కొండగా నిలిచి ఉన్నాడనీ, అందుకే భద్రాచల క్షేత్రానికి ఎంతో విశిష్టత వచ్చిందనీ అంటారు. శ్రీరాముడు ఎప్పుడైనా తాను దశర థుడి కొడుకునే అని అంటాడే కానీ, నేను వైకుంఠ నివాసిని అని రామాయణంలో చెప్పుకోలేదు. మానవులు, కోతుల చేతిలోనే రావ ణుడి మృత్యువు ఉందని భాగవతంలో కనిపిస్తుంది. రాముడు మనిషే కనుక రామాయణంలో రాముడికి శంఖ చక్రాలు ఉండవు. చతుర్భుజాలు ఉండవు. భద్రాచలం కథ కలియుగ కథ.భద్రమహర్షి తపస్సు చేసి నాకు రాముడే కావాలనీ, విష్ణువెవరో నాకు తెలియదనీ అంటాడు. ఆనాటి శంఖ చక్రాలు, నాలుగు భుజాలు అట్లాగే ఉంచేసుకుని రాముడి రూపాన్ని స్వీకరిస్తాడని భద్రాచల క్షేత్ర కథలో ఉంది. భద్రాచలంలో ఉన్న స్వామి అయోధ్య రాముడు కాదంటున్నారు. అయోధ్య రాముడిది వశిష్ట గోత్రం అవు తుంది. అయోధ్య రాముడే అని అనుకున్నా వారివారి ఇష్టం. సీతా ‘మహాలక్ష్మి’భద్రాచల క్షేత్రంలో రామచంద్ర స్వామిని నారాయణుడిగా భావించి సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవం దాకా షోడశో పచారాలతో పూజిస్తున్నారు. ఇక్కడ రామనారాయణుడని సంప్ర దాయం. కవులు తమ కావ్యాలు, భజన గీతాలలో రామనారాయణ అని అన్నారు. చట్టాలు, పూర్వనిర్ణయాలు (కోర్టు నిర్ణయాలు), కస్టమ్ అనే మూడు సూత్రాల ద్వారా శాసనం వస్తూ ఉంటుంది. కస్టమ్ అంటే కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగిస్తున్నారని రుజు వులు వస్తే, సంప్రదాయం చట్టంతో సమానమవుతుంది. భద్రా చలంలో మూలమూర్తి రామచంద్ర స్వామికి ముందు ఆంజనే యుడు కాకుండా ఎదురుగా గరుడ ఆళ్వార్ ఉంటాడు. అదే భద్రా చల స్వామి నారాయణ స్వరూపుడనడానికి ఆధారం అంటారు.ఆంజనేయుడి రూపాన్ని ఆలయం ఎదుట దూరంగా ప్రతిష్ఠించారు. భద్రాచలంలో సీతారామ కల్యాణం చాలా సుప్రసిద్ధమైందని తెలుసు. మిగతా కార్యక్రమాలకు సంవత్సరం దాకా అనేకానేక విశేష ఉత్సవాలు ఉంటాయి. చిలుకు ద్వాదశి రోజున స్వామికి మోహిని అవతారంలో అలంకారం చేస్తారు. అది మరి ఏ ఇతర రామా లయాల్లో లేదు. నరక చతుర్దశి ఉత్సవం, కృష్ణాష్టమి ఉత్సవం, వైకుంఠ ఏకాదశి ధనుర్ మాసంలో రాపత్తు (రాత్రి), పగల్పత్తు (పగలు) ప్రతిరోజు కూడా ఒక విశేష అలంకరణతో స్వామి వారికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భద్రాచల క్షేత్ర చరిత్ర అని 1971వ సంవత్సరంలో దేవస్థానం ప్రచురించిన చోట ఇక్కడ సీతా మహాలక్ష్మి అని వర్ణించారు. భద్రా చలం కల్యాణంలో జనక దశరథుల ప్రసక్తి ఉండదు. ఎన్నో ఏళ్లుగా తాళపత్ర గ్రంథాలలో భక్త రామదాసు, నరసింహదాసు ప్రస్తావించిన అంశాలు చదువుకోవచ్చు. అదే ఆనవాయితి ఉందన్న తరువాత ఇతర వాదాలు నిలబడవు. సీతారాములను లక్ష్మీనారాయణులుగా భావించి ఉత్సవాలు జరిపించవలసింది అనే శాసనాలు చెక్కారు. అచ్యుత గోత్రంభద్రాచలంలో సుమారుగా 80 ఏళ్ళు ఉన్న ఒక విశ్రాంత అర్చక స్వామి ఎన్నో కల్యాణాలు ప్రత్యక్షంగా జరిపించారు. 1950 నుంచి ఇప్పటివరకు వారికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అక్కడ ఉన్న రామచంద్రస్వామి కల్యాణ ప్రక్రియలో అచ్యుత గోత్రమే చెప్తారని స్పష్టంగా తెలియజేస్తున్నారు. భద్రాచల క్షేత్రంలో ఎప్పుడూ కొత్తగా గోత్ర ప్రవరలు మార్చలేదనీ, ఎన్నో ఏళ్ల తరబడి అక్కడ ఉన్న పరంపర అదే చెబుతోందనీ వృద్ధ పురోహితులు వివరిస్తున్నారు.ప్రతి క్షేత్రానికి ప్రవరలు విడిగా ఉంటాయి. తిరుమల వేంక టేశ్వర కల్యాణ ప్రక్రియలో గోత్ర ప్రవరలు, కొండ దిగువన పద్మా వతి అమ్మవారి క్షేత్రంలో జరిగే కల్యాణ ప్రక్రియలో చెప్పే గోత్ర ప్రవరలు వైవిధ్యంగా ఉంటాయి. దానికి జవాబు ‘సంప్రదాయమే’. క్షేత్ర సంప్రదాయాన్ని, క్షేత్ర పరంపరను అనుసరించి అక్కడ చేసే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. రామచంద్రుడు సూర్యవంశానికి చెందినవాడు. వారిది కాశ్యప గోత్రం. రాముడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వారి ఆచార్యుడి గోత్రాన్ని అంటే వశిష్ఠులవారి గోత్రాన్ని కూడా చెప్పవచ్చును. కానీ వైకుంఠ రాముడు, నారాయణుడు అనుకుని అచ్యుత గోత్రమే అంటారు.పురుషోత్తముడు, సృష్టి ఆది నుంచి ఉన్న శక్తి శ్రీరాముడనీ, శ్రీకృష్ణుడనీ విభిన్న అవతారాలుగా ఉండటం వల్ల, ఆయా కుల గోత్రాలు, ప్రవరలు చెప్పుకునే అవకాశం ఉంది. భద్రాచల క్షేత్రంలో ఉన్న రామచంద్ర స్వామిని సీతారాముడు, రామ నారాయణుడు, లక్ష్మీనారాయణుడని అంటే సమస్య ఏమిటి? ‘ఇది తప్పు అది ఒప్పు’ అని ఎవరు తేల్చగలరు? అసలు స్వరూపమే లేని పరమా త్ముడనే వేదాంతాన్ని భాగవతంలో, భగవద్గీతలో కూడా వివరిస్తారు కదా! పరాశక్తి అనీ పరమాత్ముడనీ – అవన్నీ రూపాలే అనీ వినడం లేదా? అలాంటప్పుడు భద్రాద్రి రాముడిని రామనారాయ ణుడన్నా, అనంతుడన్నా, రామబ్రహ్మం అనుకున్నా వివాదాలు ఉంటాయా?మాడభూషి శ్రీధర్వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు


