breaking news
Sakshi Guest Column
-
సుదీర్ఘ యుద్ధానికి సన్నద్ధం!
అవసరం కొద్దీ చేసే యుద్ధాలుంటాయి. కావాలని చేసే యుద్ధాలుంటాయి. ఇరాన్పై అమెరికా – ఇజ్రాయెల్ సైనిక దాడులు రెండవ కేటగిరీలోకి వస్తాయి. దీనికి పూర్తి బాధ్యత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజ మిన్ నెతన్యాహూలే వహించాలి. అమెరికా–ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ప్రతిస్పందనగా ఇరానియన్ల ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్–4’ మొద లైంది. గత జూన్ నాటి ‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్’కు ఇరాన్ నిర్ఘాంత పోయింది. కానీ, ఈసారి అది ఎదురు దెబ్బ తీసేందుకు పూర్తి సన్నద్ధమై ఉండటం అమెరికా–ఇజ్రాయెల్లను ఆశ్చర్యపరచింది.గగనతలం నుంచి వచ్చి పడుతున్న బాంబులను ఇరాన్ గట్టి గానే తట్టుకుని నిలబడింది. గల్ఫ్ దేశాలపైన, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు మొదలెట్టింది. బహ్రెయిన్ ప్రధాన కేంద్రంగా ఉన్న అమెరికా నౌకాదళ 5వ యుద్ధ నావల సమూహాన్ని విస్తృతంగా నష్టపరచింది. కువైట్ గగనతలంలో నాలుగు అమెరికా యుద్ధ విమానాలను కూల్చి వేసింది.ఇరాన్... వెనెజులా కాదు!ప్రస్తుతానికి యుద్ధం సద్దుమణగే అవకాశం లేకపోగా ప్రాంతీయ యుద్ధంగా పరిణమించగల పెను ప్రమాదంలో ఉంది. గల్ఫ్ దేశాలు ఎప్పుడు ఎక్కడ రణరంగంలోకి దిగుతాయన్నదే ప్రశ్న. సౌదీ ఆర్మకో రిఫైనరీపై ఇరాన్ దాడితో గల్ఫ్ దేశాలు ఉలిక్కి పడ్డాయి. ‘‘అమెరికా సైనిక స్థావరాలకు చోటు కల్పించిన గల్ఫ్ దేశా లను (అమెరికా) గాలికొదిలేసింది. అవి ఇరాన్ దాడులకు సులభమైన లక్ష్యంగా మారాయి’’ అని సౌదీ అధికారి ఒకరు వాపోయారు. అమెరికా స్థావరాలకు తమ భూభాగాల్లో చోటిచ్చామనీ, కానీ దాని చర్యలకు తమకు సంబంధం లేదనీ నటించడం మానుకోవాలనీ గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్ సభ్య దేశాలను ఇరాన్ గట్టిగానే హెచ్చరించినట్లయింది. వెనిజులాకూ, ఇరాన్లో పరిస్థితికీ పోలిక లేదు. ఇరాన్లో పాలనా వ్యవస్థ కుప్పకూలిపోతుందని అమెరికా వేసుకున్న అంచనాలు ఘోరంగా తప్పినట్లు కనిపిస్తోంది. అసలు యుద్ధ ఆశయాల పైన, ఆశిస్తున్న అంతిమ ఫలితంపైన అమెరికా–ఇజ్రాయెల్ల మధ్య తేడాలున్నాయి. వాటి మధ్య స్పష్టత కొరవడటం మరింత గందర గోళానికి కారణమవుతోంది. ఇరాన్ ఎన్నడూ లేనంత బలహీనమైన స్థితిలో పడిపోతుందని చాలా మంది అంచనా వేశారు. గత ఏడాది జూన్లో అమెరికా వైమానిక దాడులతో ఇరాన్ అణ్వస్త్ర నిర్మాణ కార్యక్రమం దెబ్బతిన్న మాట వాస్తవమే. అలాగే, ఇరాన్ ప్రాంతీయ మిత్రపక్షాలను ఇజ్రాయెల్ చావుదెబ్బ తీయడంతో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఆశించిన వ్యూహ పరిమితులు బహిర్గతమయ్యాయి. ఆ దేశాలు మొదటి రక్షణ కవచంగా ఉపయోగపడతాయనీ, ప్రతిఘటన ఇరుసు ఫలితమిస్తుందనీ కోర్ ఆశలు పెట్టుకుంది. తీరా అంచనాలు తలకిందులయ్యాయి. దేశవ్యాప్తంగా సామాజికంగా హాహాకారాలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. అవి పాలక మత వ్యవస్థను కుదిపేశాయి. చర్చలు సఫలమయ్యే దశలో...ఇరాన్–అమెరికాల మధ్య ఓ పక్క చర్చలు కొనసాగుతూండ గానే అమెరికా–ఇజ్రాయెల్లు దాడులను తీవ్రతరం చేశాయి. గత ఏడాది ఇరాన్పై సాగించిన 12 రోజుల యుద్ధంలో అనుసరించిన కుటిల నీతినే అమెరికా ఈసారి కూడా ప్రదర్శించింది. ఇప్పటి మాదిరిగానే అప్పుడు కూడా ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమంపై రెండు దేశాలూ సవివరంగానే చర్చించుకున్నాయి. తాజా చర్చలకు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ మధ్యవర్తిత్వం వహించారు. ఇరాన్ తమ అణు కార్యక్రమంపై ఎంతో దిగివచ్చిందని ఇటీవలి జెనీవా సమావేశం తర్వాత ఆయన వెల్లడించారు. ‘‘ఇరాన్ ఎన్నటికీ అణుబాంబు తయారు చేయకపోవడమే అంతిమ లక్ష్యం అనుకుంటే, ఆ సమస్యను మేం పరిష్కరించగలిగామనే భావిస్తున్నా’’ అని ఆయన అన్నారు. తీరా, అమెరికా సైనిక దాడులకు దిగడం చూసి ఆయన ‘‘విస్మయం’’ వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (86) మృతికి దారితీసే విధంగా అమెరికా–ఇజ్రాయెల్ల వైమానిక దాడులకు దిగ కుండా ఉంటే, పరిస్థితులు ఇంత వేగంగా క్షీణించి ఉండేవి కావని పిస్తోంది. షియా వర్గీయులకు ప్రాణత్యాగం (షహదత్) కన్నా మించింది లేదు. మతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మృత్యువు కౌగిట జేరడాన్ని వారు గర్వకారణంగా భావిస్తారు. లెబనాన్, ఇరాక్ నుంచి పాకిస్తాన్ వరకు పలు దేశాల్లోని షియా వర్గీయులు ఆవేశంతో ఊగిపోతున్నారు. లెబనాన్ నుంచి ఇజ్రా యెల్పై దాడికి హెజ్బొల్లా కొత్త ద్వారాలు తెరచింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ సమయంలో కూడా మౌనంగా ఉన్న లెబనీస్ హెజ్బొల్లా ఈసారి కత్తులు నూరుతోంది. ఇరాన్ అనుకూల మిలీ షియా గ్రూప్ ఖతైబ్ హెజ్బొల్లా ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి దిగింది. వినాశకర పర్యవసానాలుఈ పరిణామాలన్నీ భారతదేశాన్ని తీవ్రంగా కలవరపరుస్తు న్నాయి. ఎందుకంటే, చమురు దిగుమతులకు మనం గల్ఫ్ పైనే ఆధారపడుతున్నాం. తొంభై లక్షలకు పైగా భారతీయులు గల్ఫ్లో వృత్తి వ్యాపారాల్లో ఉన్నారు. ఇరాన్ వెలుపల అత్యధిక షియా జనాభా భారతదేశంలోనే ఉన్నారు. లక్నో, హైదరాబాద్, కార్గిల్ లాంటిచోట్ల షియా అనుయాయులు ఎక్కువ. ఖమేనీ హత్య వారిలో ఆవేశకావేషాలను పెంచింది. ఇరాన్ కూడా సభ్యురాలుగా ఉన్న ‘బ్రిక్స్’కు భారత్ అధ్యక్షురాలిగా ఉంది. మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తన ఇరాన్ సహచరునితో మాట్లాడారు. సౌదీ ఆర్మకో రిఫైనరీపై ఇరాన్ క్షిపణి దాడి తర్వాత, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ప్రాంతీయ శాంతి–సుస్థిరతలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరారు. దానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కి చెప్పారు.అమెరికా–ఇజ్రాయెల్ దుందుడుకు చర్యల వినాశకర పర్యవ సానాలు బహు విధాలుగా, బహుముఖంగా అనుభవానికి వస్తు న్నాయి. అంతర్జాతీయ నౌకల రాకపోకలపై ప్రభావం పడింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచంలోని అతి పెద్ద రిఫైనరీలలో సౌదీ ఆర్మకోకు చెందిన రాస్ తనూరా చమురు శుద్ధి కర్మాగారం ఒకటి. పెద్ద ఎగుమతి టెర్మినళ్లలో కూడా ఒకటిగా అది లెక్కకు వస్తుంది. దాని మూసి వేతతో అంతర్జాతీయ చమురు ధరలు అమాంతం ఆకాశానికంటే అవకాశం ఉంది. ఈ యుద్ధం మరికొన్ని వారాలపాటు సాగుతుందని ట్రంప్ య«థాలాపంగా చెబుతున్నారు. అది ఇరాన్కున్న స్థితిస్థాపక శక్తిని, పునర్ దాడి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయడమే అవుతుంది. బహుశా, ఇంతగా పర్యవసానాలున్న ఘర్షణల్లోకి కొన్ని దశాబ్దాలుగా అమెరికా తలదూర్చింది లేదు.ఇతర దేశాల్లో మాదిరిగా చాలా తేలిగ్గా పాలక అధినేతను మార్చి వేయగలమని అమెరికా పెట్టుకున్న ఆశలు ఈ క్రమంలో అడియాసలే అవుతాయి. ఇరాన్లో మత పాలనా వ్యవస్థ ఒక్క సారిగా కుప్పకూలిపోతుందని అమెరికా పెట్టుకున్న అంచనాలు... బాంబులు, క్షిపణులు సృష్టిస్తున్న ఉష్ణోగ్రతలకు ఈపాటికే ఆవిరై పోయాయి. గడ్డం ధర్మేంద్రవ్యాసకర్త ఇరాన్లో భారత మాజీ రాయబారి -
కూటమి మోసంపై నిరుద్యోగుల కన్నెర్ర!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి సర్కారు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోగా... ఉద్యోగాలను పెద్ద ఎత్తున కల్పించినట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటోంది. ఏపీ శాసన సభలో ఫిబ్రవరి 25న విద్యాశాఖ మంత్రి లోకేష్ తప్పుడు ఉద్యోగ కల్పన గణాంకాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,587 జాబ్ మేళాలు జరిపి, 1,08,747 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, సీడాప్ ద్వారా 74 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అందులో 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను గుర్తించినట్లు సభలో ప్రకటించారు. అనేక సదస్సులు జరిపి 770 ప్రాజెక్టులతో ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగినట్లు గొప్పగా తెలిపారు. ఐదు లక్షల మంది నిరుద్యోగులకు పారా మెడికల్ శిక్షణ ఇచ్చి వారందర్నీ విదేశా లకు పంపాలని ప్రభుత్వం భావిస్తుందని అసెంబ్లీలో చెప్పు కొచ్చారు. నిజానికి లోకేష్ ప్రకటించిన గణాంకాలన్నీ వాస్తవ విరుద్ధ మైనవే! 1,587 జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 ఉద్యోగాలు కల్పిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను, బహిర్గతం చేయాలి కదా! ఆ పని చేయలేదు. నిరుద్యోగుల్ని వంచించే కుట్ర ఇది. అధికారం చేపట్టక ముందు రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లోకేష్ నెత్తీ, నోరు బాదుకున్నారు. అధికారం చేపట్టగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనీ ‘యువగళం’ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది జరగకుంటే తన చొక్కా కాలర్ పట్టుకుని నిలదీసి అడగండని నిరుద్యోగ యువతకి మాటిచ్చారు. అధికారం చేపట్టి ఇరవై నెలల సమయం అవుతున్నా ఈ హామీ ఏమయ్యింది?ఉద్యోగాలిచ్చేంత వరకూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతి చెల్లిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ప్రతీ నెల మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారు. కానీ చిల్లిగవ్వ కుడా చెల్లించలేదు. రాష్ట్రంలో 1.75 లక్షల కుటుంబాలున్నాయి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు దాదాపు రెండేళ్లకి కలిపి రూ. 14,400 కోట్లు నిరుద్యోగ భృతికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. 2026 బడ్జెట్ కూడా కలుపుకొంటే మొత్తం రూ. 21,600 కోట్లు చెల్లించాలి. అంటే రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ప్రభుత్వం డెబ్భై రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి బాకీ ఉందన్నమాట.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పించారు. సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఒకేసారి 1.30 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. 2.66 లక్షల వాలంటీర్ల నియామకాలు చేపట్టారు. ఆప్కాస్ ద్వారా 96 వేల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగుల్ని జగన్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. భారీ పరిశ్రమలలో లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రంగంలో 32 లక్షల 79 వేల 970 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 40 లక్షల 13 వేల 552 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది. ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగ భృతి చెల్లించాలి. లేకపోతే యువత ఉద్యమిస్తుంది.– ఎ. రవిచంద్ర ‘ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగంరాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ -
ఆత్మగౌరవాన్ని ఆలంబన చేసుకోండి!
అమెరికన్ గాయని, గీత రచయిత, నటి బియాన్స్ నౌల్స్ జాతి వివక్షను ఎదుర్కొంటూ పైకెదిగిన మహిళామణి. పురుషాధిపత్య వినోద ప్రపంచంలో తన ప్రతిభా పాటవాలు నిరూపించుకున్న వ్యాపారవేత్త. గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ఆమె చేసిన వర్చువల్ ప్రసంగ సంక్షిప్త పాఠం. ప్రియతమ పట్టభద్రులారా! మీ తరంతో సిసలైన మార్పు మొదలైంది. మునుపటి తరం కలలకు మీరు ప్రతిరూపాలు. మీలా విద్యావంతులు కావాలని వారు చేసిన ప్రార్థనలు మీ రూపంలో ఫలించాయి. విద్యాలయాన్ని వీడిన తర్వాత మనలోని అసలైన సామర్థ్యం బయట పడుతుంది. ఆ ప్రక్రియ అంత తేలికైనదేమీ కాదు. అది నాకూ తెలుసు. సినీ వ్యాపారంలో పురుషాధిపత్యం ఎక్కువ. ఫలితంగా, నాకు మహిళా ‘స్ఫూర్తి దాతలు’ ఎవరూ లేకపోయారు. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఎంటర్టైన్మెంట్ వ్యాపారంలో పైకొచ్చాను. సొంత కంపెనీ ఏర్పాటు చేసుకోగలిగాను. తర్వాత, నా లాంటి మహిళలతో పాటు ఇతరులకూ అవకాశం ఇచ్చే భాగ్యం నాకు లభించింది. మహిళలు కావడం వల్ల, లేదా జాతి వివక్ష కారణంగా అనేక మంది ప్రతిభా సంపత్తులుండి కూడా అవకాశాలకు నోచుకోని సంగతులు నాకు తెలుసు.విమర్శలే ప్రేరణ!ప్రతిభను కనబరచండి. మీ బలహీనతను చూసి భయపడకండి. శక్తి సామర్థ్యాలను పునర్నిర్వచించండి. హృదయం చెప్పినట్లుగా నడుచుకోండి. మన ప్రతిభను చాటేందుకు అనేక మార్గాలు న్నాయి. ప్రతి ఒక్కరికీ భగవంతుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చి ఉంటాడు. రూపలావణ్యాల విషయంలో జనాభిప్రాయాన్ని పట్టించుకోకండి. ఫలానా విధంగా మాట్లాడితేనే తెలివైనవారం అనిపించు కుంటామని అనుకోకండి. మీ స్వీయ ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని మిగిలిన ప్రపంచానికి చాటండి. అవకాశాలు లభించని వర్గంలో ఉన్నవారు విచారిస్తూ కూర్చో కండి. మీకు మీరే ఒక వేదికను నిర్మించుకోండి. మిగిలినవారు మిమ్మల్ని చూసేటట్లు చేసుకోండి. విభిన్నంగా ఉండటం కూడా అందమేనని గ్రహించండి. తోటివారిని అర్థం చేసుకోవడం, వారి పట్ల దయతో వ్యవహరించడం, వారి తరఫున పోరాడటం కూడా సౌంద ర్యమే. గొంతు పెగలనివారు, అనాకారులు, స్థూలకాయులు, పనికి మాలినవారు, ప్రతిభా సంపత్తులేమీ లేనివారుగా ఎవరైనా ఎప్పుడైనా మీ గురించి మాట్లాడినా నీరుగారిపోవద్దు. అంటే అననివ్వండి. వచ్చే నష్టం ఏమీ లేదనే ధీమా కనబరచండి. అంతేగానీ ఎదుటివారి ప్రతికూలతలు, సంశయాలు మీపై రుద్దడానికి ప్రయత్నిస్తే అందుకు వీలు కల్పించకండి. మీరు నిర్దేశించుకున్న లక్ష్యం నుంచి చెదిరిపోకండి. మనల్ని ఎవరైనా మాటలంటే మనకు కష్టంగా ఉంటుంది. అది నాకూ తెలుసు. కానీ, అటువంటి విమర్శలనే ప్రేరణగా చేసుకుని ముందుకు సాగండి. గౌరవం... ప్రాథమిక సూత్రంగౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోని చోట బాంధవ్యాలు నిలబడవు. మిమ్మల్ని మీరు ఎంత గౌరవించుకుంటారో ప్రపంచం మిమ్మల్ని అంత గౌరవప్రదంగా చూస్తుంది. ఉద్యమాలు కూడా గౌరవం ప్రాథ మిక సూత్రంగా ఉన్నప్పుడే విజయవంతమవుతాయి. విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఉంటే ఉండనివ్వండి. నేను 24 గ్రామీ అవార్డులు సొంతం చేసుకున్న అదృష్టవంతురాలిని. నాకు అవి 46 సార్లు దక్కకుండా పోయిన సందర్భాలూ ఉన్నాయి. విజయం దక్కి తీరాలని ఎన్నడూ అనుకోకండి. కానీ, విజయ సాధనకు మరింత శ్రమించండి. చేతిలో ఉన్న పేకముక్కలతోనే ఆడగలం. ఉన్న శక్తియుక్తులతోనే సాధిద్దామని భావించాలి. అదే ఏనుగంత బలాన్ని ఇస్తుంది. మిమ్మల్ని మరెవరితోనూ పోల్చుకోకండి. జీవితంలో లాభాలు, నష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అలాగే, విజయం తనతోపాటు సవాళ్లనూ మోసుకొస్తుంది. మీ విజయాలు చూశాక ఓర్వలేక మిమ్మల్ని ఎలా పడ గొట్టాలా అని కొందరు వారి సమయాన్ని, శక్తిని వెచ్చిస్తూపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. పరిస్థితులు మీ నియంత్రణలో లేవని లేదా ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉందని ఎన్నడైనా అనిపిస్తే, ఆ బలహీనతను ప్రేరణగా తీసుకుని ఉన్నతిని సాధించేందుకు ప్రయత్నించండి. నాలోని సిస లైన శక్తిని నేను అలాగే కనుగొన్నాను. నేను ఎప్పుడూ ‘పనిలో పురోగతి’గానే ఉండేదాన్ని. అదే, వృద్ధి చెందడంలో ఉండే అందం.బాధ్యతలో భాగం తీసుకోవాలి!జీవితాన్ని దాని గతిన అది సాగనిచ్చి తదుపరి అడుగు ఎటు వెయ్యాలో సూచించే పనిని దానికే వదిలేసినపుడు నాకు జీవితం చాలా సంతోషంగా గడిచింది. ప్రతికూలతల గురించే ఆలోచిస్తూ, మాట్లాడుతూ, వాటినే మననం చేసుకోవడంలో విలువైన కాలాన్ని వెళ్ళబుచ్చితే నిష్ప్రయోజనం తప్ప వచ్చేది ఏమీ ఉండదు. ఒక నల్ల జాతి వ్యక్తికి(జార్జ్ ఫ్లాయిడ్) జరిగిన అన్యాయంపై సమష్టిగా పోరాడటం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో మీరు గమనించారు. ఒక లక్ష్యం నిమిత్తం అందరూ చేతులు కలిపితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. కానీ, మార్పు తీసుకురావలసిన బాధ్యత మనపైనే ఉంది. మనకు మనమే జవాబుదారీ వహించాలి. మరో పదేళ్ళలో లేదా ఇరవై ఏళ్లలో ప్రఫంచం ఏ రూపం తీసుకున్నా దానిలో భాగమయ్యేదీ, లేనిదీ మన చేతుల్లోనే ఉంది. ఇంట్లో, ఆఫీసులో, ఉద్యమంలో, ఆధ్యాత్మికతలో ఎక్కడ ఆశా కిరణాలు కని పించినా వాటిని అనుసరించాలి. ఈ విషయంలో మీరు ఎన్నడూ ఒంటరివారు కారని తెలుసుకోండి. మీరు చేయదలచుకున్నవాటిపై ఉత్తినే కలలుకంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇతరుల నుంచి తోడ్పాటు లేదని వారిని విమర్శించను కూడా వద్దు. మీ కృషిని మీరు కొనసాగించండి. కోరుకుంటున్న మార్పు మీరే అయి చూపించండి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు కూడా కొంత సమ యాన్ని, ధనాన్ని వెచ్చించుకోవాలి. అదే సమయంలో, సమాజానికి తిరిగి కొంత అందించడంలోని విలువను గ్రహించాలి. మీకు చేత నైనంతగా మీ సమాజాన్ని మీరు నిర్మించుకోవాలి. ఇతర వర్గాలకు చెందినవారి జీవితాలకూ విలువ నివ్వాలి. భయాలను పక్కనపెట్టి, ముందుకు సాగండి. నిరంతరం మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూనే ఉండండి. సాధించి తీరగలనని మీపై మీరే పందెం కాసుకోండి. అభినందనలు. -
సమాచార హక్కుకు సమాధి?
పనిగట్టుకొని ప్రజల సమాచార హక్కును కాలరాస్తున్నారు. ‘పొమ్మనకుండా పొగబెట్టిన’ చందంగా హక్కును తొలగించకుండానే అది అమలు కాని వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. పాలనలో పారదర్శకతకు తిలోదకాలిచ్చి గోప్యతను మళ్లీ అందలాలెక్కిస్తున్నారు. ఒకవైపు స్వచ్ఛంద సమాచార వెల్లడిని ప్రభుత్వ విభాగాలు నిర్లక్ష్యం చేస్తుంటే మరోవైపు ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించాల్సిన అధికారుల జవాబుదారీతనం మంద గిస్తోంది. స్పందన లభించని దరఖాస్తులతో పాటు అప్పీళ్లు పెద్ద సంఖ్యలో పెండింగ్ పడుతున్నాయి. రెండో అప్పీళ్లూ సకాలంలో పరిష్కార మవట్లేదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన ‘తెలుసుకునే ప్రజల హక్కు’ మసకబారే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్లకు కడుతోంది.దేశ పౌరులు పోరాడి సాధించుకున్న సమాచార హక్కు చట్టం అమలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీరుగారుతోంది. భయమో, భక్తో... అంతకు ముందు అడగ్గానే సమాచారం ఇచ్చిన అధికారులు కూడా ఇప్పుడు నిరాకరించడం లేదా నిర్లక్ష్యం చేయడం రివాజయింది. ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించకపోయినా, సమా చారం ఇవ్వకపోయినా తమకు ఏమీ కాదనే ఓ గిడసబారుతనం అధికార యంత్రాంగంలో పెరిగింది. పారదర్శకతను భంగం చేసే కొత్త చట్టాలు– ఉన్న చట్టంలో మార్పులు, వివిధ స్థాయుల్లో తీసు కునే సర్కారు నిర్ణయాలు, పలు పరిణామాలు... పౌరులు తెలుసు కునే హక్కును పలుచన చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి తోడు సమాచార కమిషన్లు, న్యాయస్థానాల పనితీరు కూడా కొంత మేర కారణమవుతోంది.వ్యక్తిగత గోప్యత ముసుగులో....కేంద్రం ‘డిజిటల్ వ్యక్తిగత సమాచార భద్రత– డీపీడీపీ చట్టం’ తీసుకువస్తూ సమాచార హక్కు చట్టం నడ్డి విరిచింది. వ్యక్తిగత గోప్యతా భద్రతకు సమాచార హక్కు చట్టం అవరోధమవుతోందంటూ, సదరు చట్టంలో ఇప్పటికే పొందుపరచిన ‘జాగ్రత్త’ను విస్మరించి, పారదర్శకత స్ఫూర్తినే భంగపరుస్తూ నిర్ణయం తీసుకుంది. డీపీడీపీ చట్టంలోని కొన్ని అంశాలు సమాచార హక్కు చట్టం మౌలిక పారదర్శక విధానానికే విరుద్ధం. 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడ్డ తర్వాత తొలిసారి, 2019లో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలతోనే చట్టం బిగువును సడలించారు. కమిషన్ పదవీ కాలాన్ని, కమిషనర్ల హోదాని తగ్గించడమే కాకుండా పలు కీలక అంశాలను కేంద్రం పరిధిలోకి తెచ్చు కున్నారు. దాంతో ఆ చట్టానికీ, స్వతంత్ర ప్రతిపత్తికీ కొంతమేర కోరలు పీకినట్టయింది. డీపీడీపీ చట్టంలో పొందుపరచిన అంశాల వల్ల ఆర్టీఐలో వచ్చిన మార్పులు సదరు చట్టం అమలును మరింత నీరుగార్చాయి. పాలనా ప్రక్రియలో అధికారులకు ఏదో రూపంలో వ్యక్తిగత సంబంధం కలదిగా పరిగణించే ఏ సమాచారాన్ని డీపీడీపీ చట్టప్రకారం పౌరులకు ఇవ్వనవసరం లేదనే నిబంధనను కొత్తగా తీసుకువచ్చారు. ‘పర్సన్ ’ అనే పదానికి ఇప్పటికే ఉన్న విస్తృతార్థం దృష్ట్యా ఇది వ్యక్తులకే కాకుండా సంస్థలకు, విభాగాలకూ వర్తించి, అలా చాలా చోట్ల సమాచార నిరాకరణకు తాజా నిబంధన ఓ ఆయుధంగా మారుతోంది.జస్టిస్ పుట్టుస్వామి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (2017) కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వ్యక్తిగత గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కులో భాగంగా స్పష్టం చేసింది. దరిమిలా పలు స్థాయి చర్చల తర్వాత డిజిటల్ వ్యక్తిగత గోప్య సమాచార భద్ర తకు ప్రత్యేక చట్టం తెచ్చే ప్రక్రియ మొదలైంది. చివరకు 2025 నవంబరు 13న డాటా ప్రొటెక్షన్ బోర్డు అమలులోకి వచ్చింది. డీపీడీపీ చట్టం దశల వారీ అమలు ప్రక్రియను ప్రారంభించి, 2025 నవంబరు 14న ఈ చట్ట నిబంధనల్ని (రూల్స్) అమలులోకి తెచ్చారు.ఇదివరకే ఆ భద్రత ఉంది!పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చడానికి చాలా ముందే ‘సమాచార హక్కు చట్టం’ పౌరుల గోప్యత హక్కును గుర్తించింది. వ్యక్తిగత గోప్యత పౌరుల తెలుసుకునే సమాచార హక్కుకు ప్రతిబంధకం కావొద్దనీ, అదే సమయంలో సమాచారం తెలుసుకునే హక్కు పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగకరం కాకూడదనీ ఎంతో జాగ్రత్త వహించిన తీరు మనకు ‘సమాచార హక్కు చట్టం–2005’లో స్పష్టంగా కనిపిస్తుంది. పౌరులు కోరినప్పటికీ ఏయే సందర్భాల్లో సమాచారం ఇవ్వన వసరం లేదో సమాచార హక్కు చట్టం సెక్షన్ 8(1)లో పలు సంద ర్భాలను పేర్కొన్నారు. అందులో, సబ్ సెక్షన్ 8 (1) జె ఒకటి.‘ప్రజావ్యవహారాలతో ఏ నిమిత్తం లేని, పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వనవసరం లేదు’ అని అందులో పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాల్లో ప్రజా సమాచార అధికారి (పీఐవో) నేరుగా నిరాకరించవచ్చు. కానీ, ‘అలా సమాచారం కోరటం ఒకరి వ్యక్తిగత గోప్యతలోకి అనుచితంగా చొరబడటం కాకుండా నిజంగా సదరు సమాచారానికి– ప్రజా వ్యవహారాలకు ప్రత్యక్ష సంబంధం ఉంటే, నిబంధనతో నిమిత్తం లేకుండా పీఐవో సమాచారం ఇచ్చి తీరాల్సిందే’ అన్న వివరణ ఆర్టీఐ చట్టంలో ఉంది. దీన్ని, ప్రస్తుత డీపీడీపీ చట్టం ద్వారా తొలగించారు. ఫలితంగా ప్రజా వ్యవహారాలతో సంబంధం ఉండే బోలెడు సమాచారాన్ని ‘వ్యక్తిగత గోప్యత’ కారణం చూపి డీపీడీపీ సెక్షన్ 44 (3) ప్రకారం నిరాకరించే ఆస్కారం ఏర్పడు తోంది. దీంతో నియామకాల ఫైళ్లు, ప్రొక్యూర్మెంట్ రికార్డులు, ఆడిట్ నివేదికలు, ప్రజానిధుల వ్యయ నివేదికలు... ఇలాంటివేవీ ప్రజలకు అందుబాటులో ఉండవు, ఆర్టీఐ చట్టం ఇప్పించదు. ఇది పాలనలో పారదర్శకతకు భంగకరం.కోర్టుల మాట పెడచెవిని పెట్టడమే!కమిషన్లు క్రియాశీలంగా ఉండటం సర్కార్లకు ఇష్టమున్నట్టు లేదు. అందుకే, కమిషనర్ల నియామకం కూడా తరచూ వివాదా స్పదం అవుతోంది. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే కమిషన్లను ఖాళీ ఉంచుతున్నారు. అందరూ రిటైరయి, కనీసం ఒక్క కమిషనర్ కూడా విధుల్లో లేని పరిస్థితి తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో దాదాపు రెండేళ్లపాటు సాగింది. ‘ఫలానా తేదీ లోపు చర్యలు తీసుకోండి’అంటూ అప్పటికే హైకోర్టు పలుమార్లు హెచ్చరించింది. 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కమిషనర్ల నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేసింది. జార్ఖండ్ ఆర్టీఐ కమిషన్ కు సంబంధించిన ఓ కేసు విచారిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. దేశ వ్యాప్తంగా సమాచార కమిషన్లలో ఉన్న ఖాళీలను సత్వరం భర్తీ చేయడమే కాకుండా, అప్పీళ్ల పెండింగ్ పరిస్థితిని బట్టి అవసరమైతే తగు సంఖ్యలో కొత్తగా అదనపు కమిషనర్లను నియమించుకోవాలని ఇదే నెలలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు, పూర్తిస్థాయి ‘అన్ లైన్ ఆర్టీఐ దరఖాస్తు’ విధానాన్ని ఏపీలో అందుబాటులోకి తెస్తున్నారు. ఎప్పుడో ప్రారంభించిన తెలంగాణలో ఇప్పుడిది అంత ఆశావహమైన స్థితిలో లేదు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో 98 శాతం పరిష్కారానికి నోచుకోకుండా పడి ఉన్నట్టు సమాచారం! ఇదీ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సేకరించిన అధికారిక సమాచారమే! పరిస్థితి ఇలా ఉంటే... ఇక పౌరులకు సమాచారానికి దిక్కేది? ఆర్టీఐ చట్టం అమలుకు దారేది?దిలీప్ రెడ్డివ్యాసకర్త ఉమ్మడి ఏపీలో సమాచార కమిషనర్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
అగ్రరాజ్యం అనుకున్నట్లే అవుతుందా?
అమెరికా, ఇజ్రాయెల్లు శనివారం వేకువ జామున ఇరాన్పై పరస్పర సమన్వయంతో దాడులు నిర్వహించాయి. గత వేసవిలో 12 రోజులపాటు సాగిన యుద్ధం తర్వాత ఈ మూడు దేశాలు కుతకుతలాడుతూనే ఉన్నాయి. శనివారంనాటి దాడులు ఆ ఘర్షణను తిరిగి రగుల్కొలిపాయి. అమెరికా–ఇజ్రాయెల్ల సంయుక్త దాడులు ఇరాన్లోని కీలకమైన అధికార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సీనియర్ నాయకులను హతమార్చాయి. ముఖ్యంగా 1989 నుంచి ఇరాన్ను పాలిస్తూ వస్తున్న సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నేలకొరిగారు. ‘‘చరిత్రలోని అత్యంత దుష్టమైన వ్యక్తులలో ఒకరు’’ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనను అభివర్ణించారు. ఖమేనీని మట్టుబెట్టిన సంగతిని ట్రంప్ ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ ఘటనతో ఇరాన్ ప్రజానీకానికే కాదు, గొప్ప అమెరికన్లు అందరికీ న్యాయం చేకూరినట్లు అయింది’’ అని కూడా ట్రంప్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. నిర్ణయాత్మక సైనిక చర్య!ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) కమాండర్ మహమ్మద్ పాక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదె, డిఫెన్స్ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షంఖానీ, ఆఖరికి ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదినెజాద్ సైతం దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్ వార్తలు ప్రచురించింది. ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగింది. ఇరాక్, జోర్డాన్లతో సహా గల్ఫ్లో పలు ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన కూడా ఇరాన్ విరుచుకుపడింది. త్వరితగతిన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. క్షణక్షణానికీ మారిపోతున్న పరిస్థితులు ఊహకు అందడం లేదు. సహజంగానే సంతోషాతిరేకంతో ఉన్న ట్రంప్ దీన్ని పరిమిత చర్యగా భావించడం లేదు. అమెరికాకు దీర్ఘకాలికంగా ఉన్న ముప్పును తుదముట్టించే నిర్ణయాత్మక సైనికచర్యగా చెబుతున్నారు. గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు ఈ బెడదను నేరుగా ఎదుర్కొనేందుకు విముఖత చూపారనీ, తాను దాడికి సాహసించగలిగాననీ ఆయన చెబుతున్నారు. దాడులకు దిగడానికి ముందు ఇరాన్కు చుట్టుపక్కలనున్న దేశాల మద్దతుతో అమెరికా దౌత్యపరమైన యత్నాలు సాగించింది. కానీ, అవి ఇరాన్ అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్య శక్తిని కట్టడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవి. ఆ యత్నాలు ఫలవంతమయ్యే స్థాయి వరకు ట్రంప్ ఓపికపట్టి ఉండాల్సింది. కానీ, ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికాలోని కన్జర్వేటివ్ పిడివాదుల ప్రభావానికి లోనై, ఇరాన్ బలహీనంగా ఉందని భావిస్తున్న ప్రస్తుత సమయంలో దానిపై దాడి చేయడానికే మొగ్గు చూపారు. ఇరాన్ ప్రజానీకం తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. ఇరాన్ ప్రభుత్వ మార్పునకు వాషింగ్టన్ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ‘‘తమ దేశాన్ని తిరిగి తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఇది ఇరాన్ ప్రజానీకానికి లభిస్తున్న ఏకైక మహత్తర అవకాశం’’ అంటూ ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. రెండేళ్ళ పైగా... రగులుతున్నదే!ఇరాన్పై ఇప్పుడే ఎందుకు దాడికి దిగారో మనం తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఈ వారాంతపు దాడులు హఠాత్తుగా పుట్టుకొచ్చినవేమీ కావు. గత రెండేళ్లుగా ఇరాన్తో ఘర్షణ విస్తృత రూపం దాలుస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ 7 నుంచి గాజాలోని హమాస్పైనే కాకుండా, తమ ఉత్తర సరిహద్దు పొడవునా హిజ్బుల్లా పైన, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులకు దిగుతున్న హూతీలపైన నిలకడగా సైనిక చర్యలను నిర్వహిస్తూ వచ్చింది. అది పరోక్షంగా ఇరాన్ను కూడా లక్ష్యంగా చేసుకుందని వేరే చెప్పనక్కర లేదు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఇరాన్ ఫార్వర్డ్ రక్షణ వ్యూహానికి కోత పెడుతూ వచ్చాయి. దాని కేంద్ర సైనిక సామర్థ్యాలను బలహీనపరచాయి. సాపేక్షంగా చూస్తే, ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉన్నది ఇరాన్ భూభాగం, చెదిరిపోకుండా ఉన్నది క్షిపణి కార్యక్రమం, అన్నింటికన్నా ముఖ్యంగా నాయకత్వ వ్యవస్థ అని చెప్పాలి. అమెరికా–ఇజ్రాయెల్ల దాడులు తక్షణ ఫలితాలనైతే ఇచ్చాయి. కానీ, యుద్ధాలు చాలా అరుదుగా మాత్రమే తొలుత రూపొందించుకున్న గతిన సాగుతాయి. అమెరికాకు సైనికపరంగా ఇరాన్ సమ ఉజ్జీ కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ, దాని వద్ద సాధనాలున్నాయి. రణరంగాన్ని విస్తరించడం అన్నది దానికి వాటమైన వ్యవహారం. యుద్ధ నష్టాలను ఇరుగు పొరుగు దేశాలు కూడా పంచుకోక తప్పని స్థితిని అది సృష్టించగలదు. ఆ విధంగా ప్రాంతీయ ప్రమాదాలను పెంచగలదు. ఇరాన్ ప్రతిదాడులు సరిగ్గా ఈ వ్యూహాన్నే సూచిస్తున్నాయి. గల్ఫ్లోని పొరుగు దేశాలతో టెహరాన్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ, అంతిమ కాల్పుల విరమణను సాధించేందుకు ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని నిలకడగా కొనసాగించడమే తనకున్న ఏకైక మార్గమని అది భావిస్తోంది. ఎవరి లక్ష్యం వారిది!కీలక పాత్రధారులైన మూడు దేశాలూ రణరంగంలోకి దిగడానికి, ఎవరికి వారికి ప్రత్యేక లక్ష్యాలున్నాయని గమనించాలి. ఇస్లామిక్ రిపబ్లిక్కేమో తన అస్తిత్త్వాన్ని కాపాడుకోవడం మొదటి లక్ష్యం. దాడులను తట్టుకుని నిలబడి, తగినంత సైనిక, రాజకీయ పొందికను తమ వైపు నుంచి కనబరచడం, సైనిక ప్రతిస్పందనను కొనసాగించడం ఇరాన్ ముందున్న పని. సంప్రదాయ ధోరణిలో యుద్ధంలో గెలిచేందుకు ఇరాన్ పోరాడడం లేదు. పాలనా వ్యవస్థను కొనసాగించుకునేందుకు శక్తియుక్తులను ఒడ్డుతోంది. దానికి విరుద్ధంగా, ట్రంప్ ఒక నిర్ణయాత్మక ఫలితాన్ని కోరుకుంటున్నారు. అమెరికాకున్న దీర్ఘకాలిక ప్రత్యర్థి మెడలు వంచినట్లు చాటుకోవాలని ఆయన తాపత్రయం. ‘‘ఈ వారం పొడుగూతా బాంబులు కురిపిస్తూనే ఉంటాం. మా లక్ష్యాన్ని సాధించే వరకు అవసరమైనంత కాలం పోరు సల్పుతాం’’ అని ఆయన చెప్పారు. ఇబ్బడిముబ్బడి శక్తితో ఇరాన్ మౌలిక వసతులను, వ్యూహాత్మక ఆస్తులను ధ్వంసం చేస్తూ, సీనియర్ నాయకత్వాన్ని మట్టుబెడుతూ పోతే, ఇరాన్ వ్యూహాత్మక వైఖరి సడలిపోతుందనీ, అది లొంగివస్తుందనీ, లేదా దేశం లోపల అస్తవ్యస్త పరిస్థితులు పాలనా వ్యవస్థ మార్పునకు దారితీసి తీరుతాయనీ ట్రంప్ నమ్మకంతో ఉన్నారు. ఇజ్రాయెల్ లక్ష్యాలు కూడా స్థూలంగా వాషింగ్టన్ వైఖరితో సరిపడినవే. కాకపోతే అది కొన్నింటిపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇరానియన్లు తిరగబడాలనీ, పాలనా వ్యవస్థ మార్పునకు లభించిన చారిత్రక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ నెతన్యాహు పిలుపు నిస్తున్నారు. ఇరాన్ ఆంతరంగిక సమస్యలలో మునిగిపోతే చాలుననీ, శాశ్వతంగా కాకపోయినా... కనీసం ప్రస్తుతానికి వ్యూహపరంగా బలహీనపడాలనీ ఆయన కోరిక. ఇరాన్లో ఏం జరగవచ్చు?బాంబు దాడులు, ఖమేనీ అస్తమయం తర్వాత ఒకదానితో ఒకటి ముడిపడిన పలు మార్గాలు కళ్ళెదుట నిలువనున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో, అమెరికా తన చర్యలను నిలుపు చేయవచ్చు. ఇరాన్ గణనీయంగా దెబ్బతిని ఉంది కనుక, ఒత్తిడి చేస్తే దారికి రావచ్చని వైట్హౌస్ భావన. దయనీయ స్థితి ఉద్రిక్తతల సడలింపునకు దారితీయవచ్చని దాని అభిప్రాయం. ప్రస్తుత పాలనా వ్యవస్థలో మిగిలిన నాయకత్వం, వాషింగ్టన్ డిమాండ్లకు అంగీకరించడం ద్వారా తమ పట్టును కొంతవరకైనా కాపాడుకున్నట్లు అవుతుందని భావించవచ్చు.ఖమేనీ రంగంలో లేకపోయినంత మాత్రాన, వ్యవస్థ దానికంతట అది కుప్పకూలదు. అధికార బదలీకి రాజ్యాంగ యంత్రాంగం ఏదో ఒక ఏర్పాటు చేస్తుంది. నిపుణులు నూతన అధినాయకుడిని అధికారికంగా నియమించవచ్చు. అయితే, ఆచరణలో మాత్రం, నిర్ణయాత్మక శక్తి రివల్యూషనరీ గార్డ్, భద్రతా వ్యవస్థ చేతుల్లోనే కొనసాగవచ్చు. అధికార బదలీ పకడ్బందీగా సాగేట్లు, ఉన్నత స్థాయి నాయకత్వం చెదిరిపోకుండా నివారించేటట్లు... ఆ రెండు వ్యవస్థలు ప్రయత్నించి తీరుతాయి. పాలన కొనసాగేందుకు, తాత్కాలికంగానైనా ఉమ్మడి నాయకత్వ ఏర్పాటు జరగవచ్చు. అది అమెరికా–ఇజ్రాయెల్ల ఒత్తిడికి మరింత లొంగకపోవచ్చు కానీ, దేశంలోని సైనిక ఒత్తిడికి అది లొంగిపోయేదిగానే ఉంటుంది. సైనిక ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే ఇరాన్లోని ఉన్నతస్థాయి రాజకీయ వర్గాలలో ఉన్న విభేదాలు బయటపడనూవచ్చు. ఆర్థిక ఒడుదొడుకులు, సైనిక నష్టాలు, ఆంతరంగిక శత్రుత్వాలు కేంద్ర అధికారాన్ని బలహీనపరచి దేశీయంగా ఇతర వర్గాల నుంచి పోటీ ఎదురవడానికి పరిస్థితులు అనువుగా మారవచ్చు. ప్రతిపక్షాలు కూడా ఆ వర్గాలకు మద్దతు పలుకవచ్చు. అడ్డూ ఆపూ లేకుండా పాలక వర్గాలు చీలిపోతే మాత్రం అత్యంత అస్థిర పరిస్థితులు దాపురిస్తాయి. లిబియాయే అందుకు తిరుగులేని తార్కాణం. అక్కడ గడాఫీ పతనం క్రమబద్ధమైన అధికార బదలీ పరిణామక్రమానికి ఏమీ దారితీయలేదు. వ్యవస్థలు కుప్పకూలాయి. మిలీషియాల మధ్య పోటీ, బాహ్య జోక్యాలు దేశంలో ప్రత్యర్థి వర్గాల మధ్య ఆజ్యం పోశాయి. లిబియా కన్నా సంక్లిష్టమైన దేశమైన ఇరాన్లో వ్యవస్థలు బలంగా ఉన్నాయి. అధికార యంత్రాంగాలు వేళ్ళూనుకుని ఉన్నాయి. రాజకీయ అధికార బదలీని నిర్వహించకుండా పెద్ద తలకాయను తీసేసినంత మాత్రాన పరిస్థితులు చక్కబడవు. సాయుధ వర్గాలు అధికారాన్ని చెలాయిస్తూనే ఉంటాయి. ప్రచ్ఛన పోటీకి తెరతీసినట్లు అవుతుంది. ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో తాజా యుద్ధానికి ముందటి సమతుల్యత మాత్రం ఇక కచ్చితంగా ఉండదు. ఉద్రిక్తతలను సడలించేందుకు చొరవ చూపిన గల్ఫ్ దేశాలు ప్రతి దాడులను రుచి చూసి ఇపుడు మరింతగా బహిర్గతమయ్యాయి. ఇంధన మార్కెట్లు, ముఖ్యంగా కీలకమైన పాయింట్ల వద్ద సాగర భద్రత సున్నితమైన అంశాలుగా కొనసాగుతాయి. ఘర్షణలు మరింత ప్రబలడానికి కూడా అవి కారణాలుగా నిలువవచ్చు. అమెరికా – ఇజ్రాయెల్ల ప్రత్యక్ష చర్యను చూసిన ప్రాంతీయ దేశాలు తమ పొత్తులను, రక్షణ వైఖరులను పునః సమీక్షించుకుని తీరుతాయి. ఇరాన్ ఈ యుద్ధాన్ని భరించి నిలువవచ్చు. కానీ, ఇంతకాలం ఇస్లామిక్ రిపబ్లిక్గా మనుగడ సాగించిన ఆ దేశం మార్పు చెందకుండా మునుపటిలా తన అస్తిత్వాన్ని మాత్రం కొనసాగించలేదు. ఈ ఘర్షణలోని నిర్ణయాత్మక దశ మొదటగా దాడులకు దిగడంలో లేదు. స్థిరమైన సైనిక ఒత్తిడితో క్రమబద్ధ రాజకీయ వ్యవస్థ ఆవిర్భవించడంలో ఉంది. అమెరికా తన తక్షణ లక్ష్యాలను సాధించుకుని ఉండవచ్చు. అయితే, తదనంతరం రూపుదిద్దుకునే ఇరాన్, దాని ఇరుగు పొరుగు దేశాల యవనికకు అది సిద్ధంగా ఉందా అన్నదే ప్రశ్న!డాక్టర్ సనమ్ వకీల్వ్యాసకర్త ప్రతిష్ఠాత్మక రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్లో మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా ప్రోగ్రామ్ డైరెక్టర్ -
మోహన్లాల్ (అగ్ర నటుడు) రాయని డైరీ
ముఖ్యమంత్రి అధికార నివాసం ‘క్లిఫ్ హౌస్’లోని పచ్చికలో పినరయి విజయన్, నేను పక్కపక్కన నడుస్తున్నాం. ఇంటర్వ్యూ ఇంకా మొదలు కాలేదు. ‘‘ఒకటి చెప్పండి సీఎం గారూ! మీరెందుకు ఎక్కడా కూడా నవ్వుతూ కనిపించరు?! మోదీజీని చూడండి, నిరంతరం నవ్వుకు అందుబాటులో ఉంటారు. రాహుల్ గాంధీ అయితే, ‘నవ్వు పిట్ట’లా ఎప్పుడూ ఎవరో ఒకరి భుజం మీద వాలుతూనే ఉంటారు. మీరెందుకు అలా ఉండరు?’’ అని అడిగాన్నేను. ‘‘చూడండి మిస్టర్ లాల్... ‘నవ్వని మనిషి’ అని నా మీద ఈ పదేళ్లలో చాలానే దుష్ప్రచారం జరిగింది! నిజానికి, నేనూ నవ్వగలను’’ అన్నారు విజయన్ , సీరియస్గా.‘‘కానీ, సీఎం గారూ... నవ్వటం, నవ్వగలగటం రెండూ ఒకటేనంటారా?! నవ్వగలిగి ఉండీ, నవ్వక పోవటం అంటే నవ్వును ఆచరణలో పెట్టకపోవటమే కదా?’’ అన్నాను. ఆ మాటకు ఆయన నవ్వే ప్రయత్నం చేశారు కానీ, నవ్వటం ఆయన వల్ల కాలేదు. ‘‘ఆచరణలో పెట్టటానికి ‘నవ్వు’ అనేది పార్టీ సిద్ధాంతం కాదు మిస్టర్ లాల్! సహజసిద్ధమైన ఒక మెరుపు. నాలో మెరుపు కనిపించకుండానే నేను ఉరుమునై పోతానా! ముందు మెరుపు కనిపిస్తేనే కదా, తర్వాత ఉరుము వినిపిస్తుంది. నాలో మెరుపే లేకుంటే వీళ్లంతా అంటున్నట్లు ఉరుము ఎక్కడి నుంచి వస్తుంది! అది చెప్పండి’’ అన్నారు విజయన్ .మెల్లిగా ఆయన ఇంటర్వ్యూ మోడ్లోకి వస్తున్నట్లు నేను గ్రహించాను. ఇంటర్వ్యూ పేరు ‘ఇరువర్’. ‘విజయన్ సీరియస్ మనిషి’ అనే ఇమేజ్ని పోగొట్టి, విజయన్ కూడా మామూలు మనిషే! ఆయనా సినిమాలు చూస్తారు, ఆయనా పూల మొక్కల్ని చూసి ఆహ్లాదపడతారు అనే కొత్త ఇమేజ్ను తీసుకురావడమే ‘ఇరువర్’ ఉద్దేశం. 2019లో ప్రధాని మోదీజీని అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేస్తూ, ‘‘మోదీజీ! మీరు మామిడి పండ్లను ఎలా తింటారు? కోసుకుని తింటారా? లేక, కొరుక్కుని తింటారా?’ అని అడిగిన అత్యద్భుతమైన ప్రశ్న ఆనాడు దేశ ప్రజల్ని ఉర్రూతలూగించింది. ఆ ఒక్క ప్రశ్నతో మోదీజీని దేశానికి ప్రియతమ నాయకుడిని చేసేశారు అక్షయ్.‘‘మోహన్ లాల్ గారూ! మీరు కూడా అక్షయ్ లానే, విజయన్ సార్ని మన రాష్ట్రానికి మూడోసారి ప్రియతమ నాయకుడిని చేయాలి’’ అని ముందే నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇంటర్వ్యూ దర్శకుడు టీకే రాజీవ్. నిజానికి మోదీజీని అక్షయ్ ఇంటర్వ్యూ చేయటానికి ఎనిమిదేళ్ల ముందే, కేరళ కాంగ్రెస్ లీడర్ ఊమెన్ చాందీని నేను ఇదే ‘ఇరువర్’ పేరుతో ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది. అప్పుడు కూడా అన్నీ మామిడి పండ్ల ప్రశ్నలే! ఇప్పుడు విజయన్ ఇంటర్వ్యూలోనూ అవే పండ్లు! ఉదయం మీరు ఎన్ని గంటలకు లేస్తారు? తిరిగి రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు? మీ హాబీస్ ఏంటి? మీకు ఎవరి సినిమాలంటే ఇష్టం?... ఇలాంటివి!ఇంటర్వ్యూ మొదలవటానికి ముందు విజయన్ను నేను స్క్రిప్ట్లో లేని ప్రశ్నొకటి అడిగాను. ‘‘కేరళ ప్రజల కోసం మీరెంతో చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ‘నవ్వని మనిషి’ అయితే మాత్రం ఏమిటి?! అసలీ ఇంటర్వ్యూ అవసరం ఉందా?’’ అని అడిగాను. అప్పుడు నవ్వారు విజయన్ ! ఆ నవ్వు మెరుపులా ఉంది!! ‘‘మిస్టర్ లాల్! నవంబర్ 1న ‘కేరళ కంప్లీట్ డిజిటల్ లిటరసీ’ ప్రోగ్రాంకి మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినా మీరు రాలేదు. ‘దృశ్యం–3’ షూటింగ్లో ఉన్నానని చెప్పి తప్పించుకున్నారు! ఇప్పుడు వరుసగా మూడోసారీ కేరళలో మా పార్టీనే రావాలని నేను ఊహిస్తున్న దృశ్యం–3 నిజం కావాలంటే మీలా ఏ పార్టీకీ చెందని స్టార్లను, వారి ఫ్యాన్స్ని దగ్గర చేసుకోవాలి కదా! అందుకే ఈ ఇంటర్వ్యూ’’ అని మెరుపు ఉరిమినట్లుగా చెప్పారు విజయన్ ! ఆ ఉరుములో... నాకు ‘దృశ్యం–4’ కనిపించింది! -
ప్రజల ఒత్తిడే యుద్ధాల్ని ఆపగలదు!
నేటితో ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసి, నాలుగేళ్లు పూర్తవుతున్నాయి. ఉక్రెయిన్ వరకూ చూస్తే – లక్ష మందికి పైగా సైనికులు చనిపోయారు. మూడు లక్షల మందికి పైగా గాయపడ్డారు. 15 వేల మందికి పైగా పౌరుల ప్రాణాలు పోయాయి. 40 వేల మందికి పైగా గాయపడ్డారు. రష్యా సైన్యంలో లక్షకు పైగా మరణాలు జరిగి ఉండవచ్చనీ, గాయపడిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆ యా ప్రభుత్వాలు చెప్పవు. ఐక్యరాజ్య సమితి, ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్, బ్రోకింగ్స్ ఇనిస్టిట్యూషన్ వంటి పరిశోధనా సంస్థల ద్వారా బైటకొచ్చిన సమాచారం ఇది. ‘ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకోకూడదు! క్రిమియా, డొనెత్స్క్, లుహాన్స్క్, జపోర్జియా, ఖెర్సాన్ వంటి ప్రాంతాలను రష్యాకి చెందినవిగా ఉక్రెయిన్ అంగీకరించాలి! పెద్ద పెద్ద ఆయుధాల్ని, అలాగే పాశ్చాత్య దేశాల మద్దతుని తగ్గించాలి’ లాంటి రష్యా పెట్టే షరతులకు తలొగ్గడానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదు. ఆ షరతులకు తలొగ్గనిదే దిగిరావడానికి రష్యా సిద్ధంగా లేదు.అమెరికా ఒక పక్కన ఇరాక్, సిరియా, యెమెన్ లాంటి మధ్య ప్రాచ్య దేశాల పైన దాడులు చేస్తూ... ‘రష్యా దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన’ అనడమూ; ‘ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతను కాపాడాలి’ అనడమూ హాస్యాస్పదం. ఉక్రెయిన్కు ఇప్పటివరకు అమెరికా నుంచి సైనిక, ఆర్థిక సహాయం 100 బిలియన్ డాలర్లు పొందింది. 500 బిలియన్ డాలర్ల (దాదాపు 45 లక్షల కోట్లు) దాకా అమెరికాలో ఆయుధ వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా. ఇవి ‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, డిఫెన్స్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఏజెన్సీ, యూ.ఎస్. డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ లాంటి సంస్థలు ప్రకటించిన సంగతులే! ఇంక భారత దేశానికి వస్తే, ‘సమతుల్య తటస్థత’ అనే ఎత్తుగడని పాటిస్తూ, చాలా సందర్భాల్లో ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన వోటింగ్లో పాల్గొనకుండా, రష్యాను ఖండించే తీర్మానాలపైన కూడా ఓటు వేయలేదు. భారత ప్రధాని మోదీ 2022లో రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసినప్పుడు ‘ఇది యుద్ధ కాలం కాదు’ అని ఒక వ్యాఖ్యానం చేసి మౌన వ్రతాన్ని పాటించారు. ఇండియాకు రష్యా నుండి చౌకగా క్రూడ్ ఆయిల్ కావాలి. అలాగే రక్షణ రంగంలో సహకారం కావాలి. అందుకోసం దానితో స్నేహం తప్పదు. అలాగే పాశ్చాత్య దేశాలతో కూడా దానికి కొన్ని అవసరాలు ఉన్నాయి అంటే; ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, చైనా ప్రభావాన్ని పరోక్షంగా సమతుల్యం చేయడం, టెక్నాలజీ, వ్యాక్సిన్లు, సరఫరా వంటి అంశాల్లో సహకారం కావాలి. దానికోసమే క్వాడ్ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి) వంటి వేదికల్లో పాల్గొనడం. వీటన్నిటికీ మించి చైనాతో ఇండియాకు 76 ఏళ్ళ పోరు ఉంది. అంతర్జాతీయ సంస్థలు కూడా యుద్ధాన్ని ఆపడానికి నిజాయితీగా ఏ ప్రయత్నాలూ చేయడం లేదు. పౌర ప్రాణాలకన్నా ఏదీ ముఖ్యం కాదు కాబట్టి, ముందైతే ‘కాల్పుల విరమణ’ జరగాలి. అది జరగాలి అంటే ఆయా దేశాల ప్రభుత్వాల మీద ప్రజల ఒత్తిడి పెరగాలి. అది మాత్రమే యుద్ధాన్ని ఆపగలదు. – నన్నూరి వేణుగోపాల్ ‘ మానవ హక్కుల కార్యకర్త (రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో నాలుగేళ్లు) -
సీమకు తలమానికం తిరునగరి
చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్తును నిర్ణయించు కోవడం. గతం లేనిదే వర్తమానం ఉండదు, వర్తమానం లేని భవిష్యత్తును ఊహించుకోలేము. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి నగరానికి ఘనమైన నేపథ్యం ఉన్నది. అలాంటి తిరుపతికి అంకురార్పణ జరిగి నేటికి 896 సంవత్సరాలు. తిరుపతి నగరానికి అనుకుని ఉన్న ప్రస్తుత తిరుచానూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, పార్థసారథి ఆలయం చోళుల కాలంలో రూపొందితే, అటుపిమ్మట పద్మావతి అమ్మవారి ఆలయం వెలసింది. శ్రీ శుకమహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకుని తపస్సు చేసిన కారణంగా తిరుశుకనూరుగా పిలిచే వారనీ, అటుపిమ్మట కాలక్రమంలో తిరుచానూరుగా మారిందనీ అంటారు. నారాయణవనం కేంద్రంగా పాలన సాగించిన ఆకాశ రాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం 6 నెలల దీక్షా కాలాన్ని శ్రీనివాస మంగాపురంలో గడిపారు. దీక్షా కాలం తర్వాత శ్రీనివాసుడు తిరుమల వెళ్ళారు. ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి కాలంలో శ్రీనివాస మంగాపురం ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక అనుబంధమే పునాదిచారిత్రక ఆధారాల ప్రకారం, 1130 ఫిబ్రవరి 24న రామా నుజాచార్యుల నిర్ణయం మేరకు గోవింద రాజపురం ఆగ్రహారం నిర్మాణానికి పునాది వేశారు. అంటే నేటి తిరుపతి... గోవింద రాజపురంగా పునాది వేసుకుంది. అటు పిమ్మట గోవిందరాజ ఆలయం, దాని చుట్టూ అగ్రహారం నిర్మాణం నారాయణవనం రాజ్య పాలకుడు గట్టురాజు చేపట్టారు. తర్వాత 100 సంవత్సరాలకు ఇది తిరుపతిగా రూపాంతరం చెందింది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురం, శ్రీనివాస మంగాపురంతో సహా అనేక ఆలయాలకు గోపురాలు, అభివృద్ధి పనులు యాదవ రాజుల కాలంలో జరిగాయి. అందుకే టీటీడీ ఆలయాలలో యాదవులకు తొలి దర్శన అవకాశం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.తిరుపతి రూపుదిద్దుకుంటున్న ప్రారంభంలో తాళ్ళపాక వాసుల కృషి మరువలేనిది. శ్రీవారి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో అన్నమయ్య కీర్తనలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే తాళ్ళపాకకు చెందిన తాతయ్య తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలిసిన గంగమ్మ ఆలయానికి ఆద్యులు. అందుకే ఈ ఆలయాన్ని తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయం అని అంటారు. తాళ్ళపాక వాసులు శ్రీనివాస మంగాపురం ఆలయ అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నట్లు చెపుతారు. తాతాచార్య వంశస్థులు తాతయ్య గుంట గంగమ్మ ఆల యానికి ఆద్యులు. వీరికి తొలి తీర్థం ఇస్తారు. తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు ఏడుసార్లు తిరుపతి పర్యటన చేశారు. తిరుపతి, తిరుమల, తాను పర్యటించిన నాగలాపురం, నారాయణవనంలో ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం ఆలయాన్ని నిర్మించారు.మహానగరంగా మార్చే అవకాశంతిరుపతి, తిరుమల అంటూ ప్రస్తుతం పిలుచుకుంటున్నాం. కానీ చరిత్రను పరిశీలిస్తే రెండూ వేరు వేరు కాదని అర్థం చేసు కోవచ్చు. తిరుపతి నగరం స్వతంత్రం వచ్చే వరకు నార్త్ ఆర్కాట్ జిల్లా పరిధిలో ఉన్నది. నేటి కొండను పురాణాలలో వెంగడం అని పిలిచేవారు. పులికాట్ పరిసరాలను పాలించిన ప్రాంతానికి వెంగో రాష్ట్రం అన్న పేరు కూడా ఉంది. తిరుపతి, తిరుమలపై తమిళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తిరుపతి గానే పిలిచేవారు. తిరు అంటే శ్రీ అని అర్థం. పతి అంటే శ్రీనివాసుడు యజమాని అని. ఆ రకంగా శ్రీనివాసుడి అజమాయిషీలో తిరుపతి ఉంటుంది. ఎంత బాగుంది ఈ పిలుపు! చాలా కాలం వరకు తమిళంలో మేల్ తిరుపతి, కీల్ తిరుపతి (కింద తిరుపతి, పైన తిరుపతి) అని పిలిచే వారు. క్రమేణా కొండ అర్థం వచ్చేలా తిరుమలగా మారింది. తిరుపతిని అభివృద్ధి చేయడం అంటే శ్రీనివాసుడి అజమాయిషీలో ఉన్న ఆధ్యాత్మిక నగరాన్ని అభివృద్ధి చేయడమే. చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం తెలియనివారు తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వెచ్చిస్తే అనవసర వివాదం చేస్తుంటారు. ఏపీ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన పరిశీలనలో రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు, ఉన్నవన్నీ గ్రామీణ పరిధి దాటని పట్టణాలు అని పేర్కొంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతోంది అనడానికి మంచి నగరాలుండటం ఒక కొలమానం. వెనుకబడిన రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం కూడా లేకపోతే ఇక అభివృద్ధికి ఆస్కారం ఎక్కడిది? ఈ వెలితిని తీర్చి మహానగరంగా మార్చగలిగే అవకాశం తిరుపతికి ఉన్నది. తిరుపతి నగరానికి అనుకుని చెన్నై, బెంగళూరు మహా నగరాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, భూమి సమస్య ఆ రెండు నగరాలకు ప్రతిబంధకంగా మారింది. ఆ ప్రతిబంధకమే తిరుపతి నగర అభివృద్ధికి అవకాశంగా మారుతుంది. తిరుపతి చుట్టూ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పాటు... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు ఉన్నాయి. చెన్నై నగరానికి సమీపంలో మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీసిటీ ప్రత్యేక అర్థిక మండలి ఆసియా ఖండంలోనే అత్యంత విజయవంతం అయిన సెజ్గా మారింది. వాతావరణ సమతుల్యత అదనపు అనుకూలత. అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తిరుపతిని అత్యంత సౌకర్యవంతమైన నివాస యోగ్య నగరంగా గుర్తించాయి. తిరుపతి నగర పాలక సంస్థ తీర్మానం చేసినట్లు... చంద్రగిరి, కళ్యాణి డ్యామ్, వడమాల పేట, రాయలచెరువు, ఐఐటీ వరకు తిరుపతిని గ్రేటర్గా మార్చి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే అనతి కాలంలోనే మరో హైదరాబాద్గా మారుతుంది.తొలి దర్శనం నుంచి ప్రథమ పౌరురాలి వరకు...వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను ప్రస్తావించడానికి ఇది సరైన సమయం. విజయనగర రాజుల తర్వాత యాదవ రాయలు తిరుపతి ఆలయాల అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించారు. శ్రీవారి ఆలయం ముందు భాగాన గొల్లమండపం నిర్మించి, గోవుల పెంప కంతో శ్రీవారి నైవేద్యానికి ఆ పాలను వినియోగించే వారని అంటారు. వివిధ కొలనులను వారి హయాంలోనే నిర్మించినట్లు ఆధారాలు కనిపిస్తాయి. దైవ దర్శనంలో కోనేటి స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. అందుకే శ్రీవారి ఆలయాలలో తొలి దర్శనం యాదవ వంశస్థులకు ఇస్తారు. అయితే ఈ సంప్ర దాయానికి సాధికారత ఇచ్చింది మాత్రం జగన్ గారే. అదే సామాజిక వర్గానికి చెందిన శిరీష యాదవ్ను తిరుపతి నగరానికి తొలి మేయర్గా చేసిన ఘనత కూడా జగన్కే దక్కుతుంది. అది కూడా జనరల్ మేయర్ స్థానంలో బీసీలకు ఇవ్వాలనే నిర్ణయమూ, తిరు పతి అంకురార్పణలో కీలక భూమిక పోషించిన యాదవ సామాజిక వర్గానికి రాజకీయ గుర్తింపు ఇవ్వడమూ సముచిత నిర్ణయం. ఎంతో స్ఫూర్తినిచ్చే తిరుపతి నగర ఆవిర్భావ చారిత్రక సత్యాన్ని తన అధ్యయనం ద్వారా అందించిన చరిత్రకారుడు దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించి ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించిన నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అభినందనీయులు. మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
రాత్రి నిద్రలో కూడా ఆఫీస్ ఆలోచనలేనా?
పగలు ఆఫీసులో ఎనిమిది గంటలు పని చేస్తే.. రాత్రి నిద్రలో మరో ఎనిమిది గంటలు మెదడు అదే పనిని చేస్తూనే ఉందా?. బెడ్ మీద పడుకున్నాక కూడా రేపటి మీటింగ్, బాస్ అడిగే ప్రశ్నలు, పూర్తికాని రిపోర్టులు కళ్ళ ముందు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయా? అయితే మీరు 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా నిద్రలేమి, ఉదయాన్నే విపరీతమైన నీరసం మీ జీవితంలో భాగమైపోతున్నాయి.ఆలోచనలు ఎందుకు వస్తాయి? (The Zeigarnik Effect)మానసిక శాస్త్రంలో 'జైగార్నిక్ ఎఫెక్ట్' అనే ఒక సిద్ధాంతం ఉంది. మన మెదడు పూర్తి చేసిన పనుల కంటే, అసంపూర్తిగా వదిలేసిన పనులను (Unfinished Tasks) పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే శుక్రవారం వదిలేసిన ఫైలు ఆదివారం రాత్రి వరకు మిమ్మల్ని వెంటాడుతుంది. దీనివల్ల శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడు మాత్రం 'ఓవర్ టైమ్' పని చేస్తూనే ఉంటుంది.నా వద్దకు వచ్చిన రాకేష్ అనే టీమ్ లీడర్ అనుభవమే అందుకు ఉదాహరణ. అతను రాత్రి 2 గంటలకు కూడా మేలుకుని ఈమెయిల్స్ చెక్ చేసేవాడు. "మెయిల్ చెక్ చేయకపోతే ఏదో అపరాధం చేస్తున్నట్టు అనిపిస్తుంది" అని చెప్పేవాడు. ఫలితంగా అతనికి 'క్రానిక్ ఇన్సోమ్నియా' (దీర్ఘకాలిక నిద్రలేమి) మొదలైంది. మేము అతనికి 'డిజిటల్ కర్ఫ్యూ' మరియు 'బ్రెయిన్ డంప్' టెక్నిక్స్ నేర్పించాం. పక్షం రోజుల్లోనే అతని నిద్ర నాణ్యత పెరిగింది, ఆఫీసులో పనితీరు కూడా మెరుగైంది.ఆఫీస్ ఆలోచనల నుండి విముక్తి పొందే 5 మార్గాలుబ్రెయిన్ డంప్ (Brain Dump): ఆఫీసు వదిలే ముందే లేదా పడుకోవడానికి గంట ముందు, మీ మెదడులో ఉన్న పనులన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి. "ఇదిగో, ఈ పనులన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి, రేపు చూసుకోవచ్చు" అని మీ మెదడుకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వండి. అప్పుడు అది పదే పదే గుర్తు చేయడం ఆపుతుంది.వర్క్-హోమ్ రిచ్యువల్ (Work-Home Ritual): ఆఫీసు నుండి ఇంటికి వచ్చే దారిలో ఒక నిర్దిష్టమైన పనిని అలవాటు చేసుకోండి. ఉదాహరణకు, ఆఫీసు ఐడి కార్డు తీసి బ్యాగులో పెట్టడం లేదా ఆఫీసు బట్టలు మార్చుకుని స్నానం చేయడం. ఇది మీ మెదడుకు "ఆఫీసు పని అయిపోయింది, ఇప్పుడు వ్యక్తిగత సమయం మొదలైంది" అని చెప్పే ఒక 'సైకలాజికల్ స్విచ్'.డిజిటల్ బౌండరీస్: పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్ను పక్కన పెట్టండి. ఆఫీసు వాట్సాప్ గ్రూపులను 'మ్యూట్' చేయండి. ఆ నీలి రంగు వెలుతురు (Blue light) మీ నిద్రకు అవసరమైన 'మెలటోనిన్' హార్మోన్ను దెబ్బతీస్తుంది.వర్రీ టైమ్ (Worry Time): మీకు ఆందోళన కలిగించే విషయాల గురించి ఆలోచించడానికి సాయంత్రం ఒక 15 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో మాత్రమే వాటి గురించి ఆలోచించండి. బెడ్ మీదకు వెళ్ళాక ఆలోచనలు వస్తే, "దీని గురించి ఆలోచించడానికి రేపు సాయంత్రం టైమ్ ఉంది కదా" అని వాయిదా వేయండి.మైండ్ఫుల్ బ్రీతింగ్: నిద్రపోయే ముందు 4-7-8 టెక్నిక్ (4 సెకన్లు శ్వాస తీసుకోవడం, 7 సెకన్లు ఆపడం, 8 సెకన్లు వదలడం) పాటించండి. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతపరిచి, ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది.Today's Taskఈ రాత్రి పడుకునే ముందు, రేపు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులను ఒక డైరీలో రాసి, ఆ డైరీని మూసి పక్కన పెట్టండి. మీ మెదడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో గమనించండి.మీరు నిద్రపోవడం అంటే పనిని నిర్లక్ష్యం చేయడం కాదు.. రేపటి పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. గుర్రానికి విశ్రాంతి ఇస్తేనే అది రేపటి రేసులో పరిగెత్తగలదు. మీ మెదడు కూడా అంతే!- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
మణి శంకర్ అయ్యర్ (84) రాయని డైరీ
‘‘మౌనం రాజ్యం ఏలుతోంది...’’ అని కవులు, రచయితలు అభివర్ణిస్తుంటారు. నిజానికి, మౌనం రాజ్యం ఏలదు. మౌనం వెనుక నక్కి ఉండే మనుషులే రాజ్యం ఏలుతుంటారు. ఆ రాజ్యంలో మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, మరో 81 మంది మాత్రమే ఉండరు. ఏదో ఒక మూల డబడబమని చప్పుడు చేస్తూ మణి శంకర్ అయ్యర్లు అనే నా వంటి గొడవ మనుషులూ ఉంటారు. గొడవ మనుషులు మౌనాన్ని – దాని పాటికి దాన్ని – ప్రశాంతంగా రాజ్యం ఏలనివ్వరు. ‘‘రాజ్యంలో మౌనానికి ఏం పని?!’’ అని మౌనాన్ని తరిమికొట్టటానికి వస్తారు.కనీసం అప్పుడైనా ఖర్గే, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ఆ మరో 81 మంది మౌనం వీడరు. పవన్ ఖేరా వైపు మౌనంగా చూస్తారు. పవన్ ఖేరా బయటికి వచ్చి, ‘‘గౌరవనీయులు శ్రీ మణిశంకర్ అయ్యర్కూ, ఈ రాజ్యానికీ ఏ విధమైన సంబంధమూ లేదు...’’ అని ఒక ప్రకటన విడుదల చేసి, తిరిగి లోపలికి వెళ్లిపోతారు. వీళ్లంతా సీడబ్ల్యూసీ అనే రాజ్యంలోని మౌనవర్గ సభ్యులు. వాళ్లు మాట్లాడరు, ఎవరినీ మాట్లాడనివ్వరు.విమర్శలకు సమాధానం చెప్పలేని అసమర్థులే మౌనం అనే పూలచొక్కాను ధరిస్తారు. అసమ్మతిని సహించలేని వాళ్లే, గొంతు విప్పేవాడిని తీసుకెళ్లి ఊరి చివర చెట్టుకు కట్టేసి వస్తారు. ఆ చెట్టు పైన అప్పటికే ఉన్న ఒక పిట్ట ఏదైనా, ఆ సమయానికి ఏమీ తోచక కూసినా, ఆ కూయించింది ఈ మాట్లాడే మనిషే అయుంటాడని అనుమానపడతారు. మౌనానికి ఉండే దుర్లక్షణమే ‘అనుమానం’. మౌనంగా ఉండలేని వాడు చెట్టుకు కట్టేస్తే మాత్రం నోరు కట్టేసుకుంటాడా?! ‘‘కేరళలో ఈసారి కూడా కమ్యూనిస్టులదే అధికారం’’ అన్నాన్నేను. అంతేకాదు, కేసీ వేణుగోపాల్ని ‘‘రౌడీ’’ అన్నాను. పవన్ ఖేరాను ‘‘పలుకుల చిలక’’ అన్నాను. ఖేరా బయటికి వచ్చి మణి శంకర్ అయ్యర్కూ, మాకూ సంబంధం లేదు అని లోకానికి చాటి చెప్పింది ఇందుకే.మౌనం రాజ్యమేలే చోట, మనిషిని తప్పించటం కూడా చప్పుడు లేకుండానే జరిగి పోతుంది. ‘‘ఇక్కడ ఒక మనిషి ఉండాలే...’’ అనే సందేహం కూడా అక్కడెవరికీ రాదు! నాకు బాగా గుర్తు. 2023 ఆగస్టు 20. ఖర్గేజీ పార్టీ అధ్యక్షుడు అయిన పది నెలలకు తొలిసారి ఆ రోజు ప్రకటించిన కొత్త సీడబ్ల్యూసీలో నా పేరు లేదు! రెగ్యులర్ మెంబర్స్ లిస్ట్లో లేదు. పర్మినెంట్ ఇన్వైటీస్ లిస్ట్లో లేదు. స్టేట్ ఇన్ఛార్జిల లిస్ట్లో లేదు. కనీసం, అప్పటివరకు నేనున్న స్పెషల్ ఇన్వైటీస్ లిస్ట్లో కూడా లేదు.మాట్లాడే మనిషిని గొప్ప రాజనీతిజ్ఞతతో ఏమీ కాంగ్రెస్ తప్పించదు. నీతి లేనితనంగా తప్పిస్తుంది. ‘‘సీడబ్ల్యూసీలో ఉండే 25 మంది సభ్యుల సంఖ్యను 84కు పెంచి మరీ నిన్ను తొలగించామంటే, చోటు సరిపోక నిన్ను తీసేయటం కాదు, ఈ చోటుకు నువ్వు సరిపడవని తీసేయటమే...’’ అని చెప్పటమది!నాటి గాంధీజీ సీడబ్ల్యూసీ, ఈనాటి గాంధీల సీడబ్ల్యూసీ ఒకటి కాదు. ఎదురు మాట్లాడేవాళ్లు విరగబూసిన సీడబ్ల్యూసీ అది. నెహ్రూ, సుభాస్ చంద్రబోస్ నేరుగానే గాంధీజీతో వాదించారు, నేరుగానే గాంధీజీని విమర్శించారు. వారి మాటలకు గాంధీజీ విలువ ఇచ్చారు. ‘‘ఈ పార్టీని తండ్రి, కుమారుడు, సీడబ్ల్యూసీ అనే ఒక పవిత్రాత్మ కలిసి నడిపిస్తున్నారు’’ అని సుభాస్ చంద్రబోస్ గాంధీనీ, నెహ్రూనూ ఇద్దర్నీ కలిపి అన్నారు. దైవదూషణ వంటి అంత పెద్ద మాటకు కూడా బోస్ను ఆనాడు బహిష్కరించలేదు.వాదించేవాళ్ల వల్లే ఆవిర్భవించి, విభేదించే వాళ్ల వల్లే మనుగడ సాగించిన కాంగ్రెస్ పార్టీ... మాట్లాడక, మాట్లాడనివ్వక మౌనంతో రాజ్యం ఏలుతూ క్షీణదశకు చేరుకున్నట్లే ఉంది ఈనాటికి!! మాట ఈదురుగాలి. గట్టిగా లేని ఆకుల్ని రాల్చేస్తుంది. మౌనం వేరుకు పట్టిన చీడ. చెట్టునే కూల్చేస్తుంది. -
బహుళత్వ భావనకే గొడ్డలి పెట్టు
మన రాజ్యాంగ నిర్మాతలు జాతీయ గీతానికి ఏదో లాంఛనంగా ప్రాధాన్యం ఇవ్వలేదు. భిన్నత్వాన్ని కనుమరుగు కానివ్వకుండానే ఏకత్వాన్ని చాటడానికి మన గణతంత్ర రాజ్యం ఉద్దేశపూర్వకంగానే ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎంచుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వు ఆ గీతానికి సంబంధించి ఇంతకాలం ఉన్న ప్రాధాన్యతా క్రమాన్ని మార్చేసింది. అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతానికి ముందు జాతీయ గేయమైన వందేమాతరాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ఆ ఆదేశం సారాంశం. పైగా ఆరు చరణాలను పూర్తిగా ఆలపించాలని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వులో ఆదేశించింది. అధికారిక కార్యక్రమాలలో మొదటి రెండు చరణాలను ఆలపిస్తే చాలునని రాజ్యాంగ పరిషత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆ విధంగా పక్కనపెట్టినట్లయింది. ఈ వైఖరి జాతీయ గీతానికి అగ్ర ప్రాధాన్యం కట్టబెట్టిన రాజ్యాంగ అధికరణం 51(ఎ)ని అగౌరవపరచడమే!రాజ్యాంగ హోదాల్లో తేడాజాతీయ చిహ్నాల వరుస క్రమాన్ని నిర్వచించడానికీ, జాతీయ గీతం స్థానాన్ని తెలుపడానికీ రాజ్యాంగ పరిషత్ ఎంతో యోచించి నిర్ణయం తీసుకుంది. దాన్ని 1950లో ఉద్దేశపూర్వకంగానే సుస్థిర పరచారు. స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో జాతి జనులను ఉత్తేజపరచిన మూడు గీతాలను పరిశీలించి, రెండింటిని ఎంపిక చేసుకున్నారు: అవి: జనగణమన, వందేమాతరం, సారే జహా సే అచ్ఛా!‘వందేమాతరం’ గేయం బంకించంద్ర ఛటోపాధ్యాయ 1882లో రాసిన ‘ఆనందమఠ్’ నవలలోనిది. దాన్ని రవీంద్రనాథ్ టాగోర్ స్వర పరిచారు. అది స్వాతంత్య్ర సమరాన్ని ప్రస్తుతించే శక్తిమంతమైన గేయం. అయితే, లౌకికవాదం, సమాన పౌరసత్వం పట్ల గణతంత్ర రాజ్యానికి ఉన్న రాజ్యాంగపరమైన నిబద్ధతను దృష్టిలో పెట్టుకున్న రాజ్యాంగ పరిషత్, దానిలో ఉన్న ప్రాథమిక ఆందోళనను గుర్తించింది. ప్రారంభంలోని చరణాలు మాతృభూమిని స్థూలంగా పౌర పదాలతో ప్రార్థిస్తే, తరువాతి చరణాలు భరతమాతను హిందూ దేవతగా అభివర్ణించాయి. అన్ని మతాలకు చెందిన పౌరులూ సమాన మేనని ప్రతిన బూనిన దేశంలో, దేశ మాతను ఆ రకంగా రూపుకట్టించడం చాలా మందికి రాజీపడటం కష్టమైన అంశంగా తోచింది. దానికనుగుణంగా, రాజ్యాంగ పరిషత్ కూడా జాతీయ గీతానికీ, జాతీయ గేయానికీ మధ్యనున్న తేడాను గుర్తించింది. రెండింటికీ రాజ్యాంగపరంగా వేర్వేరు హోదాలు కల్పించింది. ఆ తేడాను సాక్షాత్తూ రవీంద్రనాథ్ టాగోర్ కూడా గుర్తించారు. దాంతో రాజ్యాంగ పరిషత్ నూతన గణతంత్ర రాజ్య సమ్మిళిత భావనా పూర్ణతనూ, బహుళత్వాన్నీ పూర్తిగా నింపుకొన్న గీతా నికి ప్రత్యేక స్థానాన్ని పదిలపరుస్తూ, స్వాతంత్య్రోద్యమంలో భావో ద్రేక పాత్ర వహించిన వందేమాతరాన్ని తగు రీతిలో గౌరవించింది.సమైక్యపరిచే ‘గీతం’భారతదేశ సార్వభౌమాధికారాన్ని, బహుళత్వాన్ని పంచుకుంటున్న రాజ్యాంగ భవిష్యత్తును అనునిత్యం గుర్తు చేసేదిగా ఉన్నందున రాజ్యాంగ పరిషత్ 1950 జనవరి 24న ‘జనగణమన’ను జాతీయ గీతంగా అధికారికంగా స్వీకరించింది. దానికి 52 సెకన్ల ఆలాపనను నిర్దేశించింది. భారత భాగ్యవిధాత అంటూ 1911లో స్వరపరచిన ఈ గీతాన్ని మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో కోల్కతాలో ఆలపించారు. ఒక్క చరణంలోనే భారత దేశాన్ని పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ,వంగ ప్రాంతాల సమ్మిశ్రితంగా పేర్కొంది. ఏక జాతీయతను డిమాండ్ చేయకుండానే అందరినీ ఆ తాను ముక్కలుగా పేర్కొంది. భారతీయ పాలితుడు ఆ విధంగా ఏకరూపతలో మిళితం అయి పోకుండానే, రాజకీయ భవితవ్యాన్ని పంచుకునేవాడు, బహుళ అస్తిత్వాలతో నివసించగల సామర్థ్యం ఉన్నవాడు. దేశ విభజన, మతపరమైన హింసాకాండ వేదనల నీడలో రాజ్యాంగ పరిషత్ చర్చలు జరుపవలసి వచ్చింది. భారత్ అధికా రికంగా లౌకిక పంథాను అనుసరించాలా లేక మెజారిటేరియన్ అస్తిత్వాన్ని సంతరించుకోవాలా అనే మీమాంస ఏర్పడింది. ఈ నేపథ్యంలో, జాతీయ గీతం ఎంపిక మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ విషయంలో రాజ్యాంగ నిర్ణేతల నిర్ణయం తాత్విక మైనదని కూడా చెప్పాలి. వారు సాంస్కృతిక మెజారిటేరియనిజం కన్నా పౌర జాతీయతనే ఎంచుకున్నారు. జాతీయ చిహ్నాలు సమైక్య పరచనూగలవు, మినహాయించనూగలవని వారికి తెలుసు. జాతీయ గీతానికీ, జాతీయ గేయానికీ మధ్యనున్న ఈ తేడా అలంకారప్రాయమైనది కాదు. సారభూతమైనది. మెజారిటేరియన్ ప్రేరణలు లేదా సాంస్కృతిక ఏకరూపత కన్నా సమాన పౌరసత్వ భావననే రాజ్యాంగ చట్రం ప్రతిబింబించింది. రాజ్యాంగ దృక్పథమే ఆదర్శంఅనేక దేశాల జాతీయ గీతాలకూ, భారతదేశ జాతీయ గీతానికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. చాలా జాతీయ గీతాలు సైనిక సమ రాన్ని లేదా విప్లవ హింసను ముందుంచుతాయి. కానీ ‘జనగణమన’ అలాంటిది కాదు. వివిధ ప్రాంతాలు, భాషా సమూహాల మధ్య ఐక్యతను ప్రబోధించేదిగా అది రూపొందింది. వైవిధ్య సహనశీలత రూపుదాల్చిన సమాఖ్య ప్రజాస్వామ్యానికి జాతీయ గీత నిర్మాణ రీతి అత్యంత అనువైనది. జాతీయ గీతంలోని పంక్తులు భారత రాజ్యాంగ సారాంశానికి అద్దం పడతాయి. ప్రస్తుత పాలనా యంత్రాంగం ఈ రాజ్యాంగ దృక్పథంతో తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు రాజ్యాంగపరమైన చిహ్నాలపై ప్రభావం చూపేవిగా ఉన్నాయి. వందేమాతరం గేయాన్ని మొదట ఆలపించాలనడం అలాంటిదే. జాతీయ గేయాన్ని కొన్ని పంక్తులకే పరిమితం చేయడానికీ, ఆ రెండింటి మధ్య వరుస క్రమాన్ని మొదట్లోనే నిర్ణయించడానికీ రాజ్యాంగ పరిషత్ను పురిగొల్పిన ఆందోళనను ఇది మళ్ళీ ముందుకు తెస్తోంది.చర్చ, అసమ్మతి, ఆలోచనల తర్వాతనే 1950లో రాజీ సూత్రం ఏర్పడింది. ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఆ సమతూకాన్ని అస్థిరపరచడం ప్రభుత్వ ధోరణిని, ఎన్నికల రాజకీయాల సమీక రణల కసరత్తును మాత్రమే వెల్లడిస్తుంది. ‘జనగణమన’ ఆలాపన సమయంలో మనం నిల్చుంటున్నామంటే దాని శ్రావ్యతకు ముగ్ధులై మాత్రమే కాదు; ఇండియా పట్ల రాజ్యాంగానికి ఉన్న ఆలోచన, ఈ దేశంలో నివసిస్తున్న అందరికీ రిపబ్లిక్ సమానంగా చెందుతుందనే భావనను గౌరవిస్తూ, దానితో ఏకీభవిస్తూ నిలుచుంటున్నాం. ప్రతీకాత్మకంగానైనా లేదా సారభూతంగానైనా ఆ భావనకు కోత పెట్టడం జాతీయ గీత విస్తృత దార్శనికతను భంగపరచడమే అవు తుంది. ... జయ జయ జయ జయహే!జోయా హసన్వ్యాసకర్త జేఎన్యూలో ‘సెంటర్ ఫర్ పొలిటకల్ స్టడీస్’ ప్రొఫెసర్ ఎమిరిటా (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వారి త్యాగాలకు ఇదా విలువ?
ఏ వ్యవస్థను ఎక్కువ విశ్వసిస్తారని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే... సాయుధ దళాలు అగ్ర భాగాన నిలుస్తాయి. వరద జలాలలో వంతెనలు నిర్మించడం, మైనస్ ఉష్ణోగ్రతలలో సరిహద్దులను కాపలా కాయడం నుంచి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ సిందూర్ వరకు సైన్యం అందించే సేవలు వెల కట్టలేనివి. వారు విధి నిర్వహణలో రక్తాన్ని, చెమటను, కన్నీటిని చిందించవలసి ఉంటుంది. మనం మన సైనికుల గౌరవాన్ని ఎంతగానో కాపాడు తున్నట్లు చెప్పుకుంటాం. నిజంగా వారిని అంత నెత్తిన పెట్టుకుంటున్నామా? అదే నిజమైతే, 2026 బడ్జెట్ ప్రతిపాదనలలో కొన్నింటిపై మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సర్వీసు కాలం పూర్తయ్యేంత వరకు సేవలందించిన, అవయవాలను కోల్పోయిన సైనికులకు ఇచ్చే పెన్షన్పై పన్ను విధించే ప్రతిపాదన సబబేనా? సైనిక వికలాంగులపై పన్నా?సాయుధ దళాలకు ఇస్తున్న అంగవైకల్య పింఛను మొత్తాలు 1922 నుంచి పన్ను మినహాయింపు పొందుతున్నాయి. ఈ మినహా యింపును పరిమితం చేసే విధంగా ఆదాయ పన్ను చట్టాలకు సవరణ తీసుకురానున్నట్లు 2026 ఫైనాన్స్ బిల్లు పేర్కొంది. అవయవాలు కోల్పోయిన కారణంగా విధుల నుంచి పూర్తిగా వైదొలగవలసి వచ్చిన సైనికులకు మాత్రమే ఆ మినహాయింపును వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శరీరంలో ఏ అవయ వాన్ని అయినా కోల్పోయినా, విధులలో కొనసాగగల శక్తి సామర్థ్యా లున్నాయని మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ తెచ్చుకుని సర్వీసులో కొనసాగి రిటైరైనవారికి ఇచ్చే పెన్షనుకు ఆ మినహాయింపు వర్తించదు. వారు ఒక చెయ్యి లేదా కన్ను లేదా కాలు కోల్పోయినా పన్ను పడుతుంది. సర్వీసులో కొనసాగగల అర్హత లేనంతగా గాయపడిన వారు మాత్రం మినహాయింపు పొందగలుగుతారు. క్షతగాత్రులైన సైనికులను దయాదాక్షిణ్యాలపైన బతుకుతున్న వారిగా చూడకూడదు. వారు కూడా ఇంచుమించుగా అనన్య సామాన్యమైన శౌర్యవంతులే. తమకు కలిగిన గాయానికి భయపడ కుండా, దాని నుంచి మరింత శక్తిని, స్ఫూర్తిని కూడదీసుకుని తమకు అప్పగించిన విధులకు అంకితమవడం నిజానికి ప్రశంసించవలసిన విషయం.ముగ్గురు వీరుల ముచ్చటఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా 1971 యుద్ధంలో మనకు విజయాన్ని అందించారు. పాకిస్తాన్ సైన్యం లొంగుబాటు బాట పట్టేటట్లు చేసి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి తోడ్పడ్డారు. ఇంతవరకు మనకున్న ఇద్దరు ఫీల్డ్ మార్షళ్ళలో ఆయనొకరు. వృత్తి జీవితం ఆరంభంలోనే గాయపడిన చరిత్ర సామ్కు ఉంది. 1942 సిట్టాంగ్ యుద్ధంలో తన పటాలాన్ని జపాన్ సేనలకు వ్యతిరేకంగా నడిపిస్తూ బులెట్ల బారినపడ్డారు. ఆయన కడుపు, పేగులలోకి తొమ్మిది బుల్లెట్లు దూసుకుపోయాయి. ఎంత తీవ్రంగా గాయపడ్డారంటే, శస్త్ర చికిత్స చేసేందుకు సర్జన్ కూడా సంశయించారు. పైగా ‘ఒక కంచర గాడిద తన్నింది’ అంటూ సామ్ దాని గురించి హాస్యస్ఫోరకంగా చెప్పుకున్నారు. మేజర్ జనరల్ ఇయాన్ కార్డొజో అనుభవం కూడా తక్కువ దేమీ కాదు. సామ్ నేతృత్వం వహించిన 1971 యుద్ధంలో కార్డొజో కూడా పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్ అధికారి అయిన కార్డొజో అప్పటి తూర్పు పాకిస్తాన్లో భాగమైన సిల్హెట్లో మందుపాతర పేలుడులో తన కుడి కాలును కోల్పోయారు. ఆయన ఆ సంఘటనను ఎలా ఎదుర్కొన్నారో రోమాంచితమైన రీతిలో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎముకలు కనిపించే విధంగా మాంసం ముక్కలు కాలు నుంచి కిందపడితే ఆయన తన పిడిబాకును బయటకు తీయించి ఛిద్రమైన ఆ భాగాన్ని తెగ్గొట్టవలసిందిగా కింది సిబ్బందిని ఆదేశించారు. ఆ అసాధారణ సైనికుడు మొదట ఒక బెటాలియన్కి, ఆ తర్వాత బ్రిగేడ్కి నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఒక అవయవాన్ని కోల్పోయిన అధికారి ఆ స్థాయిని అందుకోవడం అదే మొదటిసారి. ఒక కాలు లేకపోయినా, మంచులో నడుస్తూ కొండలపైకి ఎక్క గలననీ, చెప్పిన పనులు చేయగలననీ ఆయన పై అధికారులను ఒప్పించి చేసి చూపించగలిగారు. గాయం వల్ల డెస్కు పనులకే పరిమితమయ్యేందుకు తిరస్కరించారు. చివరగా, లెఫ్టినెంట్ జనరల్ విజయ్ ఒబెరాయ్ గురించి చెప్పు కుందాం. దేశంలో అత్యధిక పతకాలను అందుకున్న అధికారులలో ఆయనొకరు. భారత్–పాకిస్తాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో ఆయన కూడా కుడి కాలు కోల్పోయారు. అయినా, మరో నాలుగు దశాబ్దాలపాటు సైన్యానికి సేవలందించగలిగారు. కృత్రిమ కాలుతో మారథాన్లలో కూడా పాల్గొన్నారు. అవయవాలు కోల్పోయిన సైనికులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టే విధంగా ‘వార్ ఊండెడ్ ఫౌండేషన్’ను నెలకొల్పారు. ఆయన భారత సైన్య ఉప ప్రధానాధికారి స్థాయి వరకు ఎదిగారు. జీవన సంధ్యలో ఏదీ భరోసా?ఆదర్శంగా తీసుకోవలసిన జాతీయ హీరోల గాథలవి. అలాంటివారు చాలామంది ఉన్నారు. అటువంటి వీరుల డిజెబిలిటీ పెన్షన్పై పన్ను విధించడం సమంజసమా? అదీ వారి జీవన సంధ్యలో, ఆర్థిక భద్రత అత్యంత అవసరమైన కాలంలో పన్ను ప్రతిపాదన తీసుకురావడం ఎంతవరకు సముచితం? ధైర్య సాహసాలకుగానూ ఇటీవల వాయు సేనా మెడల్ అందుకున్న కార్పొరల్ వరుణ్ కుమార్ను దేశం కొనియాడింది. ఆపరేషన్ సిందూర్లో శత్రు క్షిపణి దాడిలో ఆయన తన కుడి చేతిని కోల్పోయారు. ఆయన చెరగని చిరునవ్వుతో తన ఎడమ చేయితోనే వైమానిక దళ ప్రధానాధికారికి శాల్యూట్ చేసిన ఫొటో ఎవరి హృదయాలనైనా కదిలిస్తుంది.నౌకా, వైమానిక, సైనిక దళాలకు చెందిన 10,000–12,000 మంది డిజెబిలిటీ పెన్షన్లు అందుకుంటున్నారని డేటా సూచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై పడిపోయే ఖర్చు కూడా పెద్దగా ఏమీ లేదు. జనరల్ మాలిక్ చెప్పినట్లుగా పెద్ద మొత్తాల ఖర్చులను గాలి కొదిలేసి, చిన్న మొత్తాల ఖర్చులను లెక్కలోకి తీసుకోవడం వివేకం అనిపించుకోదు. అసలిది ఖర్చుల కోణం నుంచి చూడవలసిన అంశం కాదు. ఒక సైనికుడి గౌరవ పరిరక్షణకు సంబంధించినది. దీని కోసం చర్చలు జరుపవలసిన లేదా పోరాడవలసిన అవసం ఏ సైనికుడికీ రాకూడదు. ఈ పన్ను ప్రతిపాదనను కేంద్రం పునః పరిశీలించి తీరాలి. బర్ఖా దత్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎదగడానికి నాలుగు ట్రిక్కులు!
వృత్తిపరమైన ఐంద్రజాలికులు వాస్తవంగా ఉన్నవి నాలుగు రకాల ట్రిక్కులేనని చెబుతారు. అవి: ఒక రూపాన్ని మన కళ్ళకు కట్టించడం; దేన్నయినా అదృశ్యం చేయడం; రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం; చివరగా ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం. ఈ నాలుగింటినీ జీవితానికి అన్వయించుకుంటే మనమూ ఎదుటివారిని ఆశ్చర్యచకితులను చేయగలం. ఎలాగంటారా... మొదటి ట్రిక్కు: మన ఉనికిని చాటుకోవడమంటే, భౌతికంగా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు; మనల్ని మనం అత్యుత్తమమైన రీతిలో ప్రదర్శించుకోవడం! మనం ఊసరవెల్లి లాంటివాళ్ళం. తల్లితండ్రుల ముందు ఒకలా, స్నేహితుల వద్ద మరోలా ప్రవర్తిస్తాం. కానీ, ఈ బాహ్యమైన నేను కాకుండా ‘లోపల మరో నేను’ ఉంటాడు. మన అసలు స్వరూపం అదే! మనకు ఇష్టమైన వ్యాపకంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరింపజేసేది వాడే! మనం అరమరికలు లేకుండా ఎవరి వద్ద వ్యవహరించగలమో, ఎవరు మన ‘లోపలి మనిషి’ని అభినందించగలుగుతారో అలాంటి వాళ్ళ వద్దనే ఆ ‘లోపలి మనిషి’ బయటపడతాడు. మిషిగన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, బోస్టన్లో మొదటి ఉద్యోగంలో చేరాను. అక్కడి బాస్ నన్ను తీర్చిదిద్దుతానన్నాడు. నేనెంతో సంతోషపడ్డాను. తీరా, నేను ఉద్యోగంలో చేరేందుకు వెళ్ళేటప్పటికి, ఆయన కాస్తా ఉద్యోగం వదలి వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది అనుకున్నాను.తిరస్కరణతో... జీవితం తలకిందులవదు!‘‘ఈ ఏడాది ఏం చేయబోతున్నానో ‘నాకు లోపల’ తెలిసి పోతోంది. నా కష్టాలు, కన్నీళ్ళతోనే ఓ నవల రాస్తా’’నని నా స్నేహి తురాలితో చెప్పాను. అందుకామె నవ్వలేదు. ‘బ్రహ్మాండం. అదే పనిలో ఉండు’ అంది. ఆమె నా లోపలి మనిషిని గుర్తించి అతడి సత్తాపై నమ్మకం ఉంచిందన్నమాట. అలా వెన్ను తట్టేవారు మన అమ్మ, నాన్న, తాత, బామ్మ ఎవరైనా కావచ్చు. అటువంటి బేషరతు మద్దతు లభించినపుడు మనలోని నిజమైన సామర్థ్యం బయటకు వస్తుంది. అందుకని, ఇపుడు మీ స్నేహితులను అంటిపెట్టుకుని ఉండండి. వారి ప్రేమ, నమ్మకం ముందుకు నడిపిస్తాయి. నేనా పుస్తకాన్ని పూర్తి చేసి, ప్రచురణకు అభ్యర్థిస్తూ పంపిస్తే, ప్రచురించలేమంటూ 24 ఉత్తరాలొచ్చాయి. ప్రచురణకర్తలు ఉన్నది 20 మందే! అంటే, కొందరు రెండుసార్లు తిరస్కరించారన్నమాట. వాళ్లకు ఆ పుస్తకం నచ్చకపోతే మరో పుస్తకం రాస్తానని అను కున్నాను. అదీ నచ్చకపోతే ఇంకోటి రాస్తానని ధైర్యం చెప్పు కున్నాను. ఆ తదుపరి పుస్తకం ప్రచురణకు నోచుకుంది. భయాన్ని బలంగా మలచుకోండి!మనం అదృశ్యం చేయాల్సింది భయాన్ని! ఇదే రెండో ట్రిక్కు. హైస్కూలులో ఉండగా, ఓ చోట ఐస్క్రీమ్ అందించే ఉద్యోగం చేశాను. ఒకావిడ వచ్చి ఐస్క్రీమ్ ఆర్డరు చేసింది. ఒక్క క్షణంలో ఇస్తానన్నాను. ఈ క్షణంలోనే ఇవ్వాలంటూ పట్టుబట్టింది. కానీ నేను బెదిరిపోలేదు. దాంతో ఈ దిక్కుమాలిన షాపులో జీవితాంతం గడుపుతావంటూ తిట్టిపోసింది. నిజం ఒప్పుకొని తీరాలి. నేను కలవరపడిన మాట వాస్తవం. కానీ, ఆ మహిళ నాలో రేకెత్తించిన భయం నాలో కసిని పెంచింది. కనుక, భయాన్ని పారదోలండి. భయం ఏదో చెరుపు చేస్తుందని కాదు. భయాన్ని ప్రేరణగా తీసుకుని ప్రయోజనం పొందే ప్రయత్నం చేయండి. ఒకరు తక్కువ అంచనా వేసినంత మాత్రాన కుంగిపోనవసరం లేదు. నిశ్శబ్దంగానే మీ విషయంలో వారి అంచనాలు తప్పు అని నిరూపించండి. దయాగుణంతో విప్లవం తేవచ్చు!రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం ఇంద్ర జాలంలో మూడవ ట్రిక్కు అనుకున్నాం కదా! ఇక్కడ సహానుభూతి గురించి చెప్పుకోవాలి. ఇతరుల కష్టాలను వారి దృక్కోణం నుంచి చూడటం అలవరచుకోవాలి. నాకు 13 ఏళ్ళపుడు మా నాన్న ఉద్యోగం పోయింది. దాంతో మేం బ్రూక్లిన్ నుంచి మయామీకి మకాం మార్చాం. అక్కడ మా తాత, నాయనమ్మ ఉన్నారు. అమ్మ, నాన్న, చెల్లి, నేను, ఆ పెద్దవాళ్ళు కలిసి మొత్తం ఆరుగురం కొన్ని నెలలపాటు సింగిల్ బెడ్రూమ్ అపార్టుమెంట్లోనే తలదాచు కున్నాం. ఇంతమంది ఏమిటంటూ కొందరు గొడవకు దిగారు. పొరుగునే ఉన్న మరో వాటా ఆవిడ తాను అపార్టుమెంటును ఖాళీ చేస్తున్నాననీ, పెద్దవాళ్ళు ఇద్దరూ అందులో ఉండ వచ్చనీ చెప్పి అనునయించింది. కాకతాళీయంగా ఆవిడ పేరు మెర్సీ. ఔను! పేరుకు తగ్గట్లు దయచూపిన మహాత్మురాలు. ఈ నిరాశావాద ప్రపంచంలో సిసలైన దయాగుణం గాయాలను మాన్పుతుంది. క్రూరంగా వ్యవహరించడం, విషం కక్కడం, అభిప్రా యాలతో ఏకీభవించనివారి పట్ల కరకుగా ప్రవర్తించడం మన సంస్కృతిలో భాగాలైపోయాయి. కానీ, క్రూరత్వం బలానికి రుజువు కాదు. బాధపడుతున్నవారి స్థానంలోకి మనం వెళ్ళ గలిగితే అది బలం అనిపించుకుంటుంది. ఇక్కడున్నవారిలో కొందరికి రకరకాల కష్టాలు ఉండ వచ్చు. నేటి గ్రాడ్యుయేట్లలో మా అబ్బాయి కూడా ఉన్నాడు. మా అమ్మ, నాన్న ఉండి ఉంటే, ఈ కార్యక్రమాన్ని చూసి ఎంత సంతోషించేవారో అని నాకూ అనిపిస్తోంది. జీవితంలో మున్ముందు మీకెదురయ్యే ప్రతి వ్యక్తీ మీకు పైకి కనిపించని సమస్యతో సతమత మవుతూ ఉండవచ్చు. వారి స్థానంలోకి వెళ్లి వారి గురించి ఆలోచించండి. ప్రపంచానికి మరింత సహానుభూతి, మరింత వినయ విధేయతలు, ముఖ్యంగా మానవ మర్యాదలను కనబరచడం అవసరం. మీరు నిజంగా ప్రపచాన్ని నివ్వెరపరచదలచుకుంటే, మీలోని దయా గుణాన్ని బయటకు తీయండి. మార్పు చెందుతూనే ఉండాలి!ఇంద్రజాలంలో చివరి ట్రిక్కు– ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం! అన్ని ట్రిక్కుల కన్నా ఇదే కష్టమైనది. రూపాంతరం చెందడం. చిన్నప్పుడు మనం రకరకాల రూపాలను ఇష్టపడినా, పెద్ద యిన తర్వాత, ఒక మూసలో ఒదిగిపోయేందుకు మొగ్గు చూపుతాం. ప్రపంచం పట్ల, మీపట్ల మీకొక స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. కానీ, మారకపోతే మకిలిపట్టిపోతాం. ఆశలు, ఆశయాలను సమయానుకూలంగా సవరించుకోవడంలో తప్పు లేదు. మనల్ని మించినవారు లేరనుకుంటే పప్పులో కాలేసినట్లే. తమ ఆలోచనా ధోరణిని తామే ప్రశ్నించుకుని, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని భావించే లక్షణాన్ని నేను కొందరు అత్యంత ప్రజ్ఞావంతులలో గమనించాను. నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మారాలి. అన్నీ తెలిసిపోయాయని ఎన్నడూ అనుకోకండి. అవకాశాలు అనంతంగా ఉంటాయి. వాటిని అందుకునేందుకు సిద్ధ పడాలి అంతే! ఎక్కడెక్కడ మీ ప్రతిభా నైపుణ్యాలను కనబరచడానికి అవకాశం ఉందో వాటన్నింటినీ అన్వేషించండి. ఒకటే మార్గంలో పయనించాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ఒక్కొక్క నైపుణ్యాన్ని ఒక్కొక్కచోట ఉపయోగించుకోవచ్చు. -
దిద్దుబాటుకు 'ఇస్రో' ఉపక్రమించాలి!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఈ ఏడాది ఆదిలోనే హంస పాదు ఎదురైంది. శ్రీహరికోట నుంచి జనవరి 12న ప్రయోగించిన పోలార్ ఉప గ్రహ వాహక నౌక (పీఎస్ఎల్వీ) విఫలమైంది. ఈ వాహక నౌక వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలతోపాటు, మన దేశానికి చెందిన ఒక వ్యూహాత్మక ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలో ప్రవేశపెట్టవలసి ఉంది. మిగిలిన అంతరిక్ష పరిశోధనా సంస్థల మాదిరిగానే ఇస్రో కూడా గతంలో కొన్ని వైఫల్యాలను చవి చూసింది. కానీ, కొన్ని సందర్భాల్లో అంతరిక్ష ప్రయోగాలు ఆందోళనను రేకెత్తిస్తాయి. లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన, నిశితంగా సమీక్షించుకోవలసిన అవసరాన్ని చాటుతాయి. తాజా వైఫల్యం పలు కారణాల రీత్యా ఆ కోవకు చెందినదే!పరుగెత్తని పంచకల్యాణిపీఎస్ఎల్వీకి 63 సార్లు విజయం సాధించిన ఘన చరిత్ర ఉంది. చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయాలు దాని ఖాతాలోకే వస్తాయి. దాన్ని తమ పంచకల్యాణి గుర్రంగా ఇస్రో చెప్పుకొంటుంది. ఒకటి రెండు వైఫల్యాలు లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేనివిగానే కనిపించవచ్చు. కానీ, పీఎస్ఎల్వీకి ఇది వరుసగా రెండో వైఫల్యం. గతేడాది మే 18న ప్రయోగించిన దానికి కూడా ఇదే గతి పట్టింది. ఈ రెండు సందర్భాలలోనూ రాకెట్ మూడవ దశలోనే లోపం తలెత్తింది. గత (2025) ప్రహసనం ఆధారంగా ఈసారి ఏమైనా మార్పులు చేసిందీ లేనిదీ ఇస్రో వెల్లడించలేదు. వైఫల్యాలను కూలంకషంగా విశ్లేషించుకునే బలమైన వ్యవస్థ ఇస్రోకు ఉంది. దీనికి 2021లో జియో ఉపగ్రహ వాహక నౌక (జీఎస్ఎల్వీ) వైఫల్యంపై వెల్లడైన నివేదికే ఉదాహరణ. క్రయోజనిక్ దశ జ్వలన సమయంలో దిగువ లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంకులో పీడనం, ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంప్ సక్రమంగా పనిచేయక పోవడానికి కారణమైందనీ, ఫలితంగా మొత్తం మిషన్ విఫలమైందనీ ఆ ఉదంతంలో తేల్చారు. కానీ, 2025 మే నాటి వైఫల్యం గురించి ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. పారదర్శకంగా వ్యవహరించడంలో ఇస్రోకు మంచి చరిత్రే ఉంది. అది ఆ బాట నుంచి వైదొలగుతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలకమైన ఉపగ్రహాలకే ఎదురుదెబ్బవరుసగా రెండు పీఎస్ఎల్వీ వైఫల్యాలతోపాటు, గతేడాది కాలంలో, ఇస్రో మరో వైఫల్యపు అపఖ్యాతిని కూడా మూట గట్టుకుంది. కానీ, అది రాకెట్ వైఫల్యం కాదు. ఉపగ్రహ వైఫల్యం! ఇస్రో 2025 జనవరి 29న చేపట్టిన జీఎస్ఎల్వీ ప్రయోగంతో శ్రీహరికోట నుంచి వంద సార్లు ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డును సృష్టించింది. ఆ వాహక నౌక ప్రయోగానంతరం, అది ఎన్విఎస్–02 నావిగేషన్ ఉపగ్రహాన్ని దానికి ఉద్దేశించిన ట్రాన్స్ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ప్రకటించింది. అయితే, ఆన్బోర్డ్ థ్రస్టర్లను జ్వలింప జేసేందుకు ఆక్సిడైజర్కు వీలు కల్పించే కవాటాలు తెరుచుకోని కారణంగా, నిర్ణయించిన స్లాట్లో ఉపగ్రహం కుదురుకోలేక పోయిందని చెప్పింది. ఏడాది కాలంలో మూడు వైఫల్యాలు ఎదురవడం అటు ఇస్రోకు గానీ, ఇటు దాని దేశ, విదేశీ కస్టమర్లకు గానీ తీవ్ర పర్యవసానాలనే కలుగ జేస్తోంది. పైగా, ఈ వైఫల్యాల కారణంగా కోల్పోయిన మూడు భారతీయ ఉపగ్రహాలు కీలకమైన సైనిక ఉపగ్రహాలు. ఆశించిన కక్ష్యలో కుదురు కోలేకపోయిన ఎన్విఎస్–02 ఒక నేవి గేషన్ ఉపగ్రహం. అది స్టాండర్డ్ పొజి షనింగ్ సర్వీసులతో పాటు, ‘రిస్ట్రిక్ టెడ్ సర్వీసులను’ కూడా సమకూరు స్తుంది. గతేడాది వైఫల్యంతో ఇఓఎస్– 09 ఉపగ్రహాన్ని కోల్పోయాం. ఆపరేషనల్ అప్లికేషన్లలో ఉన్న ఏజన్సీలకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించేట్లుగా దాన్ని డిజైన్ చేశారు. దానిలో సింథటిక్ అపెర్చర్ రాడార్ ఉంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా ఇమేజ్లను సమకూర్చగల సామర్థ్యం ఆ పేలోడ్కు ఉంది. రక్షణ పరిశోధన ఏజన్సీలు అభివృద్ధి చేసిన ఇఓఎస్ –ఎన్1 (అన్వేషగా పిలుస్తున్నారు) భూ పరిశీలనా ఉపగ్రహాన్ని ఈ జనవరిలో ప్రయోగించిన పోలార్ వాహక నౌకలో అమర్చారు. అంతరిక్షం నుంచి సైన్యానికి ఉపయోగపడగలిగిన మూడు వ్యూహాత్మక ఆస్తులను కోల్పోవడం అంతరిక్ష, రక్షణ ఏజన్సీలకు మేలుకొలుపు కావాలి. అంతరిక్షం నుంచి సైన్యం ప్రయోజనాలను తీర్చగలిగిన దాదాపు 52 ఉపగ్రహాలను వచ్చే ఐదేళ్ళలో ప్రయోగించాలని బెంగళూరులోని డిఫెన్స్ స్పేస్ ఏజన్సీ ప్రణాళికలతో ఉంది. అంతరిక్ష ఆధారిత నిఘా (ఎస్బిఎస్) ప్రాజెక్టు 3వ దశ కింద వాటిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఉపగ్రహాలను తయారు చేసినా, ప్రైవేటు కంపెనీల ద్వారా పొందినా, వాటిని అంతరిక్షంలోకి చేర్చవలసిన బాధ్యత ఇస్రోపైనే ఉంటుంది. వాణిజ్య నష్టం అపారంఈ నెలలో వెళ్ళిన వాహక నౌక ఇఓఎస్–ఎన్1తో పాటు దేశ, విదేశీ కస్ట మర్లకు చెందిన 15 ఉపగ్రహాలను మోసు కెళ్ళింది. వాటిలో ‘ధ్రువ స్పేస్’కు చెందిన ఐదు ఉపగ్రహాలున్నాయి. ఆ ఐదింటిలో నేపాల్ది ఒకటి. బ్రెజిల్కు చెందిన ఆల్టో స్పేస్కు చెందిన మరో ఐదు ఉపగ్రహాలున్నాయి. బ్రిటన్–థాయి లాండ్ సంయుక్త ఉపగ్రహంతోపాటు, భారతీయ కస్టమర్లకు చెందిన మరో రెండు చిన్న ఇతర ఉపగ్రహాలు, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ చేయూతతో స్పెయిన్ కంపెనీ తయారు చేసిన ‘కిడ్’ ఉపగ్రహం కూడా ఉంది. ధ్రువతోపాటు ఇతర భారతీయ అంకుర సంస్థలు పీఎస్ఎల్వీ పైనే ఆశ పెట్టుకున్నాయి. అవి పెద్ద మొత్తంలో నగదుతోపాటు విలువైన కాలాన్ని, అవ కాశాన్ని కూడా కోల్పోయినట్లు లెక్క. ఉప గ్రహాల సైజును బట్టి వాటిని తయారు చేసేందుకు కంపెనీలకు కొద్ది నెలల నుంచి కొద్ది ఏళ్ళు పట్టవచ్చు. కోల్పో యినవాటి స్థానంలో అవి కొత్త వాటిని వేగంగా తయారు చేసుకున్నా, పీఎస్ ఎల్వీలో చోటు కోసం అవి చాలాకాలం ఎదురుచూడక తప్పదు. దీనికితోడు, రాకెట్ విశ్వసనీయత దెబ్బ తినడం వల్ల బీమా ఖర్చులు పెరుగుతాయి. అది తిరిగి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుంది. వరుసగా రెండు వైఫల్యాల నేపథ్యంలో, భవిష్యత్ పీఎస్ఎల్వీ ప్రయోగాలను సమీక్షించుకోవడం ఇస్రోకు తక్షణ కర్తవ్యంగా మారు తోంది. ఈ ఏడాది మరికొన్ని ఇతర ప్రయోగాలు నిర్వహించవలసి ఉంది. ముఖ్యంగా గగన్యాన్ కార్యక్రమం కింద సిబ్బంది లేకుండా ఒక అంతరిక్ష నౌకను కక్ష్యలో తిప్పనున్నారు. మానవ సహిత అంతరిక్ష నౌకను పంపడంపై జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పడంపై దృష్టి పెట్టాం. ఈ స్థితిలో ఇస్రోపై బృహత్తర బాధ్యత పడుతోంది. అది టెక్నికల్, క్వాలిటీ, మేనేజీరియల్ ప్రక్రియలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాలి. విశ్వసనీయమైనదని ఉన్న పేరును కాపాడుకునేందుకు అదొక్కటే మార్గం! దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
మీరు అలసిపోయారా? విసిగిపోయారా?
"ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా భారంగా ఉంటుంది.. ఆఫీసుకి వెళ్లాలనే ఉత్సాహం అస్సలు ఉండదు.. చేసే పని మీద ఏకాగ్రత కుదరదు.." ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? అయితే మీరు కేవలం 'అలసిపోలేదు', మీరు 'బర్న్ అవుట్' (Burnout) కి గురవుతున్నారు. సాధారణ అలసట ఒక రాత్రి నిద్రతో పోతుంది, కానీ బర్న్ అవుట్ అనేది నిద్రపోయినా తగ్గని ఒక దీర్ఘకాలిక మానసిక నిస్సత్తువ.బర్న్ అవుట్ అంటే ఏమిటి?యంత్రం అతిగా వాడితే ఎలా వేడెక్కి ఆగిపోతుందో, మనిషి కూడా తన శక్తికి మించిన మానసిక ఒత్తిడిని నిరంతరం భరిస్తే 'బర్న్ అవుట్' అవుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని ఒక 'వృత్తిపరమైన రుగ్మత'గా గుర్తించింది. ఇది పని పట్ల విరక్తిని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది.4 ముఖ్య సంకేతాలు...1. Emotional Exhaustion ( నిరంతర అలసట): రాత్రి 8 గంటలు పడుకున్నా, ఉదయం లేవగానే ఇంకా నిద్ర చాలలేదన్నట్టు, శక్తి లేనట్టు అనిపించడం. ఇది శారీరక అలసట కాదు, మానసిక శ్రమ వల్ల కలిగే నీరసం.2. Cynicism (నిరాశావాదం): ఒకప్పుడు ఇష్టంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపించడం. సహోద్యోగుల మీద, క్లయింట్స్ మీద కారణం లేకుండా కోపం రావడం. "నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల ఉపయోగం ఏంటి?" అనే నైరాశ్యం.3. Reduced Productivity (తగ్గిన పనితీరు): ఎంత ప్రయత్నించినా పాత వేగంతో పని చేయలేకపోవడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గంటల తరబడి సమయం పట్టడం.4. శారీరక సమస్యలు: కారణం లేని తలనొప్పి, కడుపులో అసౌకర్యం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం. మనసు పడే ఒత్తిడిని శరీరం ఇలా బయటపెడుతుంది.నా వద్దకు వచ్చిన ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాధ (పేరు మార్చాను) కథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె 15 ఏళ్లుగా అద్భుతంగా పని చేస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా ఆమె ఆఫీసులో అందరితో గొడవ పడుతోంది. "నాకు ఈ జాబ్ వద్దు, నేను రాజీనామా చేస్తాను" అని ఏడుస్తూ చెప్పింది. వాస్తవానికి ఆమెకు పని చేతకాక కాదు, గత మూడేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేయడం వల్ల ఆమె మెదడు 'బర్న్ అవుట్' స్టేజ్ కి చేరుకుంది. ఆమెకు కావాల్సింది రాజీనామా కాదు, ఒక సుదీర్ఘమైన 'మెంటల్ బ్రేక్'.బయటపడటం ఇలా...* మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించడం ఆపండి. ప్రయారిటీలను సెట్ చేసుకోండి. 'నో' చెప్పడం నేర్చుకోండి.* ఆఫీస్ సమయం తర్వాత ల్యాప్టాప్, ఆఫీస్ వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి. డిజిటల్ కనెక్షన్ కట్ చేయండి. మీ మెదడుకు 'ఆఫ్ టైమ్' ఇవ్వండి. * మీకు ఇష్టమైన పని (సంగీతం, పెయింటింగ్, లేదా నడక) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి. హాబీలను పునరుద్ధరించండి. ఇది మీ మెదడుకు రీఛార్జ్ లా పనిచేస్తుంది.* విశ్రాంతిని ప్లాన్ చేయండి. సెలవు తీసుకోవడం అంటే సోమరితనం కాదు. అది మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్.ఈ వారం మీ కోసం పరీక్ష...* మీకు ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఇప్పుడు ఉత్సాహం ఉండటం లేదా?* ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందిస్తున్నారా (Overreacting)?* ఒంటరిగా ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని అనిపిస్తోందా?పై మూడింటికి 'అవును' అని సమాధానం వస్తే, మీరు బర్న్ అవుట్ వైపు వెళ్తున్నారని అర్థం చేసుకోండి.గుర్తుంచుకోండి.. కాలిపోయిన కొవ్వొత్తి వెలుగునివ్వలేదు. మీరు ఇతరులకు, మీ కంపెనీకి ఉపయోగపడాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీలోని ఉత్సాహం ఆవిరి కాకముందే మేల్కొనండి. బర్న్ అవుట్ లేదా కెరీర్ ఒత్తిడి నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ లేదా కోచింగ్ తీసుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
నిందలతో సవాళ్లు సమసిపోవు!
పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ యోధులు జన వరి 31న బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో 37 మంది పౌరులతో పాటు, భద్రతా దళాలకు చెందిన 17 మంది హతులయ్యారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచ్ యోధులు కనీసం 12 చోట్ల ఒకే సమయంలో దాడులు చేశారు. పోలీసు స్టేషన్లు, సైనిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. యోధుల్లో ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరిని ఆసిఫా మెంగల్ (24)గా బీఎల్ఏ ప్రకటించింది. ప్రతి దాడుల్లో ఇంతవరకు 200 మందికి పైగానే మిలిటెంట్లు చని పోయారని సైన్యం వెల్లడించింది.‘‘వీరు మామూలు టెర్రరిస్టులు కారు’’ అని పాక్ దేశీయాంగ మంత్రి మొహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్య దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. వీటిలో ‘ఇండియా హస్తం’ ఉందని ఆయన ఆరోపించారు. ఆధారాలు చూపకుండా, గత రెండు దశాబ్దాలుగా పాక్ ఈ రకమైన ఆరోపణలు చేస్తూనే ఉంది.బుగతీ హత్యతో మరో తిరుగుబాటునఖ్వీ చెప్పినదాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వారు ‘మామూలు టెర్రరిస్టులు’ కారు. దేశ విభజన సమయంలో కలాత్ ప్రాంతం పాక్లో విలీనమైన అంశం వివాదాస్పదంగానే ఉంది. అప్పటి నుంచి అంటే 1948 నుంచి 2000 ప్రారంభం వరకు బలూచ్ తిరుగుబాటు గెరిల్లా పోరాట పంథానే అనుసరిస్తూ వచ్చింది. గ్యాస్ పైపులైన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని ధ్వంసం చేసిన మిలిటెంట్లు పర్వత ప్రాంతాల్లోకి పరారయ్యేవారు. సాధారణంగా వారు బుగతీ లేదా మర్రీ అనే రెండు పెద్ద బలూచ్ తెగలలో ఒక వర్గానికి చెందినవారై ఉండేవారు. పాక్ పాలనా వ్యవస్థలో భాగంగా ఉన్న గిరిజన సర్దార్లు వాటికి నేతృత్వం వహించేవారు. రాజకీయ నాయకుని నుంచి తిరుగుబాటుదారుగా మారిన బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ ఖాన్ బుగతీని అప్పటి పాక్ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆదేశాల మేరకు 2006లో వేటాడి చంపారు. పాక్ రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1970లలో వామపక్ష విప్లవంలో మర్రీ తెగ సర్దార్ ఖేర్ బకష్ మర్రీ నాయకత్వ పాత్ర వహించారు. పాక్ ప్రభుత్వం ముందు బుగతీ 14 డిమాండ్లు పెట్టారు. బలూచిస్తాన్కు స్వయం ప్రతిపత్తి ఇస్తూ, ఆ ప్రాంతంలోని వనరులపై అక్కడి ప్రభుత్వానికే నియంత్రణ ఉండా లన్నది వాటిలో ఒకటి. వాటిపై కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముషారఫ్ తిరస్కరించడం పెద్ద తప్పిదం. బుగతీ హత్యతో ఐదవ తిరుగుబాటు మొదలై ఈనాటికీ కొనసాగుతోంది. వనరులు బలూచిస్తాన్వి అయినా...అక్బర్ ఖాన్ బుగతీ లేవనెత్తిన డిమాండ్లు కొత్తవేమీ కావు. వాటిని కోరినవారిలో ఇతరులూ ఉన్నారు. బలూచిస్తాన్లో వన రులు పుష్కలం. అది చమురు, ఇంధన వాయువు, ఖనిజాలు, రాగి, బంగారంతోపాటు ఇతర లోహాల నిక్షేపాలకు పేరెన్నికగన్నప్రాంతం. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వాటి నమూనాలనే అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్కు చూపించారు. ఆ ప్రాంతంలో లభ్య మయ్యేవాటిని తవ్వి తీసుకుపోవడమేగానీ, బలూచీ ప్రజానీకానికి అవి అందినది స్వల్పం. సుయీ చమురు క్షేత్రాల నుంచి గ్యాస్ ఇతర రాష్ట్రాలకు పైపుల ద్వారా వెళ్ళేది. కానీ, బలూచిస్తాన్లోని చాలా ప్రాంతాలకు అది అందని మావిపండుగానే ఉండేది. పాక్ 1993 నుంచి గనుల లీజులను విదేశీ కంపెనీలకు కట్టబెడుతూ వస్తోంది. చగాయీ జిల్లాలో రేకో డిగ్ వద్ద స్వర్ణ, తామ్ర గనుల తవ్వకాలు సాగుతున్నాయి. గ్వాదర్ పోర్టును నిర్మించే కాంట్రాక్టును ప్రభుత్వం చైనాకు అప్పగించింది. చగాయీలోనే సైండక్ ప్రాంతం వద్ద తామ్ర, స్వర్ణ గనుల తవ్వకాలను కూడా చైనాకు మంజూరు చేశారు. మునీర్ ఇపుడు ట్రంప్కు వాటినే ఆశ చూపుతున్నారు. ఇటీవలి దాడులు అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చే అంతర్జాతీయ సంస్థ లను పునరాలోచనలో పడేస్తాయనడంలో సందేహం లేదు. మారిన పోరాట పంథాబలూచ్ తిరుగుబాటు తీరుతెన్నులు కూడా మారాయి. ఇప్పటి నేతలకు గిరిజన సర్దార్లకు రాజకీయంగా, లేదా సామాజికంగా ఎక్కడా పోలిక లేదు. గిరిజన నాయకులు కంటకప్రాయమైన పర్వత ప్రాంత శిబిరాల్లో రోజులు గడిపి ఉండవచ్చు. కానీ, వారి రాజకీ యాలు పాక్కు వ్యతిరేకమైనవి కావు. సమాఖ్య వ్యవస్థ లోపలే తమకు సముచిత స్థానం కల్పించాలనీ, తమను ప్రధాన లబ్ధిదా రులు కానివ్వాలనీ వారు కోరుకున్నారు.బీఎల్ఏకు 2018 నుంచి బషీర్ జెబ్ నేతృత్వం వహిస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్కు అల్లా నాజర్ నాయకత్వం వహిస్తు న్నారు. మెకానికల్ ఇంజనీరింగ్లో జెబ్ డిప్లొమా చేయగా, నాజర్ వృత్తి రీత్యా డాక్టర్. వీరి నేతృత్వంలో బలూచ్ తిరుగుబాటు మరింత హింసాయుతంగా మారింది. ఆత్మాహుతి దాడులకు శ్రీకారం చుట్టింది. చైనా వర్కర్లను, వారి ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని 2018 నుంచి వివిధ దాడులు చేసింది. సంచలనం సృష్టించిన 2025 నాటి రైలు హైజాక్ ఉదంతం కూడా తమ పనేనని బీఎల్ఏ చెప్పుకొంది. నేటి సోషల్ మీడియా యుగంలో జెబ్, నాజర్ ప్రసంగాలు విస్తృతంగా పరివ్యాప్తి చెందుతున్నాయి. తమ తల్లితండ్రుల కన్నా ఎక్కువ విద్యావంతులైన నవతరం తాము చిన్నచూపునకు గురి కావడం పట్ల ఆగ్రహంతో ఉంది. మితిమీరిన సైన్యం ఆగడాలను వ్యతిరేకిస్తోంది. భద్రతా దళాల ప్రమేయంతో తమ తండ్రులు, సోదరులు, భర్తలు, కుమారులు అదృశ్యమవుతున్న ఘటనలకు వ్యతిరేకంగా గతంలోనూ బలూచ్ మహిళలు నిరసన ప్రదర్శనలకు దిగేవారు. కానీ, తిరుగుబాటులో మహిళలు స్వయంగా పాలుపంచు కోవడం కొత్త ధోరణి.దాడులతో భంగపడిన సైన్యం బలూచ్ ప్రజానీకంపై మరింతగా విరుచుకుపడుతుంది. గత చరిత్ర దానినే సూచిస్తోంది. హింస చక్రభ్రమణంలా కొనసాగుతుంది. ఈ రక్తసిక్త ఘటనలు శ్రీలంక నుంచి భారతదేశపు కశ్మీర్, ఈశాన్య ప్రాంతం, బలూచిస్తాన్ వరకు మొత్తం ప్రాంతానికి ఒక పాఠం నేర్పుతున్నాయి. తమ దేశంలోని ఘటనలకు పొరుగు దేశాలను నిందించడం వల్ల దేశంలో కొందరిని రంజింపజేసినట్లు అవుతుందేమో; కానీ, సమస్యకు మూల కారణాలు ఆ యా దేశాలలోనే ఉన్నందు వల్ల వాటికి పరిష్కారాలు అవే కనుగొనాలి. ఇతరులను నిందించడం వల్ల సవాళ్లు సమసిపోవు. నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రైతుల పాలిట పిడుగుపాటు
షేక్స్పియర్ నాటకంలోలాగా, ఎవరి మాటలు నమ్మాలో ఎవరివి నమ్మకూడదో తెలియని సంకటం. ‘అమెరికన్ రైతులకు మేలు చేసే విధంగా’ ఇండియాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు ట్రంప్కు అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ కృతజ్ఞతలు తెలి పారు. సున్నిత అంశాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు తగు రక్షణ కల్పి స్తూనే అమెరికాతో ‘చారిత్రక’ ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు మోదీని మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఒప్పందంలోని వివరాలు పూర్తిగా వెల్లడైన తర్వాతనే, అది రెండు పెద్ద ప్రజాస్వామిక దేశాలకు ఉభయ తారకమైనదా లేక బెదిరింపు ధోరణితో మెడలు వంచి ఒప్పిస్తున్నదా అన్నది తేలుతుంది. కానీ, ఇంతవరకు బహిర్గతమైన వివరాలే రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముంచెత్తితే ప్రమాదమే!దేశంలో వ్యవసాయ రంగం ఇప్పటికే దయనీయ స్థితిలో ఉంది. ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా 30–40 శాతం తక్కువ ధరకు రైతులు తమ పంటలను అమ్ముకుంటున్నారు. ఈ స్థితిలో భారత మార్కెట్లోకి ద్వారాలు తెరిస్తే... హెచ్చు సబ్సిడీలు పొందు తున్న, చౌకైన అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తి, రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వ్యవసాయ వనరుల నిర్వహణ (2020) సర్వే ప్రకారం, అమెరికన్ రైతులు ఏటా భారీ సబ్సిడీలు పొందుతున్నారు. అక్కడి రైతుకు ఏటా సగటున 66,314 డాలర్ల సబ్సిడీ లభిస్తున్నట్లు అంచనా. ఆ సబ్సిడీలు మార్కెట్లోని హెచ్చుతగ్గుల నుంచి అక్కడి రైతులకు రక్షణ కల్పిస్తున్నాయి. రైతులకు వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ‘ఫార్మర్స్ బ్రిడ్జ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ (ఎఫ్బీయే) కింద ఎకరాకు వస్తు చెల్లింపుల కింద మొత్తం 12 బిలియన్ డాలర్లను సమకూర్చాలని అమెరికన్ ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ ఆ పథ కాన్ని ‘ఒక పెద్ద అందమైన బిల్లు’గా అభివర్ణిస్తున్నారు. అయితే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై సుంకా లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ ఎగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. నాన్–ట్యారిఫ్ ప్రతిబంధకాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. రైతుల నిరసన హెచ్చరికలురైతుల ప్రయోజనాలను జాగ్రత్తగా ‘సంరక్షించిన’ తర్వాతనే ఒప్పందం కుదిరిందని మన వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రయోజనాలకు భంగం వాటిల్లదనే హామీలు వెలువడుతున్నా ఇది రైతుల్లో సందిగ్ధాన్ని సృష్టిస్తోంది. అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నా చేస్తే, ఆహార పదార్థాలు దేశంలోకి కుప్పతెప్పలుగా వచ్చిపడతాయని 2020–21లో న్యూఢిల్లీ చుట్టుపక్కల రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన సంయుక్త్ కిసాన్ మోర్చా హెచ్చరిస్తోంది. 2020–21 తరహాలోనే కొత్తగా నిరసనలకు దిగుతామని అది బెదిరిస్తోంది. భారతీయ రైతులు 2000–01 నుంచి 2024–25 మధ్య కాలంలో సమష్టిగా రూ. 111 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారని ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ‘‘అది రైతులకు అశని పాతమే కాదు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అవుతుంది’’ అని హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పండ్ల తోటల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు హరీశ్ చౌహాన్ అంటున్నారు.యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్లతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఆపిల్ పండ్లకు మార్కెట్ అసాధారణమైన రీతిలో అందుబాటులోకొచ్చింది. ఫలితంగా, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఆపిల్ తోటల పెంపకం పరిశ్రమ క్రమంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని భయ సందేహాలు వ్యక్తమవు తున్నాయి. సుంకాలు ఏమీ లేకుండా అమెరికా ఆపిల్ పండ్లు దిగు మతి అయితే, మన దేశంలో ఆపిల్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పోతుందని హరీశ్ హెచ్చరిస్తున్నారు. సుంకాలు లేకపోతే సమస్యే!పడిపోయిన ధరలతో పత్తి, సోయా, ఉల్లిపాయల రైతులు ఇప్ప టికే బిక్కుబిక్కుమంటున్నారు. సుంకాలు ఏమీ లేకుండా అవి దిగు మతి అయి, ధరలు మరింతగా పతనమైతే, వారు ఆ పంటలను వదిలేసి చేతులెత్తేయడం మినహా చేయగలిగింది లేదు. ఏడాదికి 500 బిలియన్ల విలువైన అమెరికన్ ఎగుమతుల గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. అందులో ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయం వంటి రంగాలవి కూడా ఉన్నాయి. అయితే, అది ఏడాదికి దాదాపు 100 బిలియన్ డాలర్ల చొప్పున ఐదేళ్ళ కాలానికి లెక్క చెప్పినదై ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తు న్నారు. అమెరికన్ ఎగుమతులన్నీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వాటి అనుబంధ రంగాల ఉత్పత్తులతోనే నిండి ఉంటాయని భావించడం కూడా సబబు కాదు. పత్తి, పప్పుధాన్యాలు, ఉల్లిపాయల వంటి వస్తువుల విషయంలో ఒక కోటా మేరకు మాత్రమే మార్కెట్ అందుబాటులో ఉంటుందని వార్తలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఆహారాన్ని దిగుమతి చేసుకోవడం నిరుద్యోగాన్ని దిగుమతి చేసుకోవడం లాంటిదేనని అర్థం చేసుకోవాలి. గత ఏడాది సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలో, పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని తొలగించినపుడు చౌక ధరకు పత్తి బేళ్ళు అపారంగా వచ్చిపడ్డాయి. దేశంలో పత్తి ధరలు తగ్గాయి. అందుకు వస్త్ర పరిశ్రమవారు సంతోషించారు కానీ, రైతులు నష్ట పోయారు. మూడు నెలల్లో 30 లక్షల పత్తి బేళ్ళు దిగుమతి అయ్యాయి. పత్తి ధర క్వింటాల్కు రూ. 1,000–రూ.1,500 వరకు పడిపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై బలవంతంగా రుద్దాలని ట్రంప్ చూస్తున్న నూతన వాణిజ్య వ్యవస్థ... ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకమైనది. ట్రంప్ తన కొత్త వ్యవస్థకు ‘యూరో పియన్ యూనియన్ కూడా తలొగ్గేట్లు చేయాలని చూస్తున్నారు. వాణిజ్య సంస్థ 1995లో ఏర్పడినప్పటి నుంచి అమెరికా పప్పులు ఉడకడం లేదు. అది ఇపుడు ఎలాగైనా తన పంతం నెగ్గించు కోవాలని చూస్తోంది. ఒత్తిడికి లొంగిపోతున్న దేశాలతో, నూతన ప్రపంచ వ్యవస్థ ఆవిష్కృతమవుతోంది. ‘కండ గలవాడిదే రాజ్యం’ అన్న లోకోక్తి ఎంతకాలం కొనసాగుతుందో కాలమే చెప్పాలి. దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
అసమానతలను రాజేయనున్న ఏఐ
దావోస్లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో చర్చించిన ప్రాథమికాంశాలలో ‘కృత్రిమ మేధ (ఏఐ)– దాని ప్రభావం’ కూడా ఉంది. ఏఐని ఆశ్రయించక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అనుసరించడంలో మందగమనంతో సాగవచ్చు నేమోకానీ, ఏదో ఒకనాడు దాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. ఏఐని ఆశ్రయించడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి; అదే సమయంలో... అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలలో కొన్ని ఆందో ళనలున్నాయి. ‘ఫోరమ్’ సర్వే ఏం చెబుతోంది?ఆర్థికవేత్తలలో ఫోరమ్ ఈ అంశంపై నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొన్నింటి స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని దాదాపు 54 శాతం మంది అంగీకరించారు. కంపెనీలు ఏఐని ఎక్కువ వినియోగించు కుంటే లాభాల మార్జిన్లు పెరుగుతాయని సుమారు 45 శాతం మంది నమ్ముతున్నారు. అంటే, కంపెనీల సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. జనాభాలోని కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఇది వివక్షకు దారితీయవచ్చని 21 శాతం మంది భయాలు వ్యక్త పరిచారు. వివిధ రంగాల పరిశ్రమల సామర్థ్యం ఏఐతో మెరుగుపడుతుందని మన దేశంలోనూ దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐని ఎక్కువ వినియోగించుకోవడం వల్ల అన్ని కంపెనీల్లో కస్టమర్ సర్వీస్ విభాగం సేవలు మెరుగుపడతాయి. ఆ విభాగం చాట్ బాట్స్ను సృష్టించుకోవడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సామర్థ్యాన్ని పెంచుకునేందుకు దాదాపు అన్ని సేవా రంగాల పరిశ్రమలూ అటువంటి సాధనాలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు రిటైల్ కస్టమర్లతో ప్రమేయమున్న అన్ని వ్యాపార సంస్థలూ ఏఐని ఆశ్రయించక తప్పదు. కీలక రంగాల్లో ఏఐ వినియోగంబ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగంలో రుణ యోగ్యతను మదింపు చేసేందుకు ఏఐని వినియోగిస్తున్నారు. రుణం కోరుతున్న కంపెనీకి చెందిన మొత్తం సమాచారాన్ని ఏఐ సమీకరించి, తిరిగి చెల్లించగల సామర్థ్యంపై అంచనాలు అందివ్వగలదు. కలన గణితాలను ఆధారం చేసుకుని, ఏ మేరకు రుణం మంజూరు చేయవచ్చునో, ఎంత వడ్డీ వసూలు చేయవచ్చునో తెలుపుతుంది. ముందే నిర్ణయించిన సూచికలను ఆధారం చేసుకుని ఆ కంపెనీ ఎగవేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని కూడా చెప్పగలుగు తుంది. ఏఐ వినియోగం వల్ల మోసాన్ని కనిపెట్టడం తేలిక. ఫలితంగా, ఆ రంగానికి ఎంతో మేలు చేసినదవుతుంది. ఐటీ రంగంలో ఇప్పటికే పెక్కు మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం కోడింగ్ ప్రాసెస్, ప్రోగ్రామింగ్ పనిని ఏఐకి అప్ప గిస్తున్నారు. ఈ కంపెనీలు సూచిస్తున్న పరిష్కారాలు క్లయింట్లకు ఉపయోగపడుతున్నాయి. ఆ క్లయింట్లు ఏఐ వినియోగంతో హెచ్చు సామర్థ్య స్థాయులతో తమ ప్రాజెక్టులను వేగవంతం చేసుకుంటు న్నారు. రిటైల్ రంగంలో, కస్టమర్ సంబంధ మాడ్యూల్ మొత్తాన్ని ఏఐ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అది ఉత్పత్తులను సమర్థంగా డెలివరీ చేసేందుకు ఉపయోగపడుతోంది. స్టోరుకు వెళ్ళే వినియోగ దారుల ఇష్టాలు, అభిరుచుల సమాచారం మొత్తాన్ని ఏఐ క్రోడీక రిస్తోంది. వాటికి తగ్గట్లుగా ఆ యా ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం తేలికవుతోంది. ఆరోగ్య రక్షణ రంగంలో సప్లై చెయిన్ నిర్వహణను ఏఐ సమకూరుస్తోంది. ఏ వ్యాపార రంగానికైనా ఏఐ వినియోగం అనివార్యంగా మారుతోందనీ, దాన్ని ఉపయోగించు కోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయనీ వీటివల్ల స్పష్ట మవుతోంది. కంపెనీలు భవిష్యత్తుకు తగ్గట్లుగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకునేందుకు కూడా క్రమేపీ ఏఐని ఆసరా చేసుకుంటు న్నాయి. ఏఐ సాధనాలు అందించిన ఇన్పుట్ల ఆధారంగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడే ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురుకాగల పోటీని అంచనా వేసుకోగలుగు తున్నాయి. కాకపోతే, ఏఐని ఒక టెక్నాలజీగా వినియోగించుకోవడం చౌక కాదు. విద్యుచ్ఛక్తి ఎక్కువ అవసరమవుతుంది. గ్లోబల్ డేటా సెంటర్ విద్యుత్ వినియోగం 2035 నాటికి 1,200 టెరావాట్–గంట లను మించిపోవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అంటే, 2024 స్థాయులకన్నా దాదాపు మూడింతలు ఎక్కువ. ఏఐ వృద్ధికి సమాంతరంగా విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచు కోవాలి. అయితే, మున్ముందు ఈ వ్యయాలు తగ్గుతాయనీ, లాభాలు పెంచుకునే వీలుంటుందనీ కంపెనీలు భావిస్తున్నాయి. ఖర్చుల మాట అట్టేపెట్టినా, మన దేశంలో పరిస్థితులు ఎలా మార తాయన్నది చూసుకోవాలి.దేశ కార్మికశక్తికి సవాల్మనది మిగులు కార్మిక ఆర్థిక వ్యవస్థ. ఉద్యోగాల అవసరం ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిపుణులైనవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. నైపుణ్యం పెద్దగా అవసరం లేని లాజిస్టిక్స్, నిర్మాణ రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం ఒక సవాల్. ఏఐ వినియోగాన్ని పెంచుకుంటున్న కంపెనీలు ఇపుడున్న సిబ్బందిని తిరిగి నిపుణులుగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలి. లేదంటే వారిని గాలికి వదిలేసినట్లు అవుతుంది. అయితే, కొత్తగా నైపుణ్యాలను నేర్పించడానికి వయసు ఒక ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. కనుక, ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగి తీరుతుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో ఏఐని అంతర్భాగం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే మాట కూడా నిజం. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి మాత్రం కోతల బెడద తప్పకపోవచ్చు.సర్వేలో వెల్లడైన రెండవ పెద్ద అంశం– అసమానత. పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టి, ఏఐ నిచ్చెనమెట్లు ఎక్కేస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉంటుంది కనుక, అది వాటికి సాధ్యం కాని పని. ఇది ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మరింత పెంచుతుంది. కొన్ని సంస్థలు పోటీ పడలేక రంగం నుంచి వైదొలగక తప్పని స్థితి ఏర్పడవచ్చు. ఈ అసమానత సమస్య సిబ్బందికి కూడా వర్తిస్తుంది. అవస రమైన నైపుణ్యం ఉన్నవారికి వెంటనే ఉద్యోగాలొస్తాయి. మామూలు ఉద్యోగాలలో కంటే ఎక్కువ జీతభత్యాలు లభిస్తాయి. మిగిలిన రంగాలవారి కన్నా ఐటీ రంగం ఎక్కువ జీతభత్యాలు ఇవ్వజూప గలగడం ఇప్పటికే చూస్తున్నాం. ఏఐ విషయంలోనూ అదే జరుగు తుంది. వస్తూత్పత్తి నుంచి కస్టమర్ సర్వీస్ వరకు వివిధ సంస్థలు తమ కార్యకలాపాలకు అవసరమైన చట్రాలను డిజైన్ చేయగలిగిన ఏఐ నిపుణులకి ఎక్కువ జీతాలు ఇవ్వజూపుతాయి.మదన్ సబ్నవీస్వ్యాసకర్త ఆర్థికవేత్త, రచయిత -
రైతుకు భరోసానివ్వని బడ్జెట్
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చాలా రోజుల క్రితమే ‘వ్యవసాయం, రైతాంగ సంక్షేమ’ మంత్రిత్వ శాఖ అనే పేరు పెట్టుకొంది. కానీ సంక్షేమం అన్నది మారిన పేరులో తప్ప క్షేత్ర స్థాయిలో కనబడటం లేదు. 2026 –27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ను చూసినప్పుడు అతి కీలకమైన వ్యవ సాయ రంగం క్రమంగా తన ప్రాధా న్యాన్ని కోల్పోయిందన్న బాధ కలగక మానదు. బడ్జెట్కు ముందురోజు విడుదలైన ఆర్థిక సర్వే, వ్యవసాయ రంగ దుఃస్థితిని తేటతెల్లం చేసింది. మొత్తం జీడీపీ (దేశ స్థూలోత్పత్తి) 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ, వ్యవసాయ రంగ వృద్ధిరేటు 4.6 నుంచి 3.1 శాతానికి తగ్గుతుందని తేల్చారు. సాధారణంగా వృద్ధిరేటు మందగిస్తుందని తెలిసినప్పుడు దానిని పైకి లాగే చర్యలు తీసుకోవడం సహజం. ఆశ్చర్యంగా, తాజా బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి మొత్తం రూ. 1.62 లక్షల కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల (2025–26 ఆర్థిక సంవత్సరంలో) కంటే ఇది 5.3 శాతం మాత్రమే ఎక్కువ. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొంటే, ఈ పెరుగుదల నామమాత్రం.పరిశోధనలకు ఊతమేది?వ్యవసాయ రంగ ఉపరితల ముఖచిత్రాన్ని చూస్తే, గొప్ప గానే ఉన్నట్టు కనిపిస్తుంది. 2024–25లో 35.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పండాయి. ఈ మొత్తం 145 కోట్ల జనాభాకు సరిపోవడమే గాక, ఎగుమతులు చేయడానికి ఆస్కారం ఉంది. పాడి, పండ్లు, కూరగాయలు, మత్స్య సంప దపై రాబడి సంతృప్తిగానే ఉంది. మరి సమస్యేమిటి? ఆర్థిక సర్వే వెల్లడించిన సమాచారం ప్రకారం – తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సోయాబీన్, మొక్కజొన్న వంటి పంటల ఉత్పాదకత, ఉత్పత్తి గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ స్థాయితో పోల్చుకుంటే మనం అట్టడుగున ఉన్నాం. దానివల్ల పంటలు గిట్టుబాటు కావడం లేదు. వారసత్వంగా సంక్రమి స్తున్న మార్కెటింగ్ సౌకర్యాల లేమి, ఇన్ఫుట్స్ వ్యయం గణనీ యంగా పెరగడం, చీడపీడలు, అకాల వర్షాలు, వర్షా భావం మొదలైనవి వెంటాడుతూనే ఉన్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ‘మన కర్తవ్యం’ అని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్... ఉత్పాదకత పెంపుదలకు అవసరమైన ‘వ్యవసాయ పరిశోధన, విద్య’కు గతేడాది కేటాయించిన రూ.10,281 కోట్ల నిధులను ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.9,967 కోట్లకు తగ్గించి వేయడం ఓ వైచిత్రి. వ్యవసాయ రంగంలో పరిశోధన, విద్యకు చాలా దేశాలు తమ వ్యవసాయ బడ్జెట్లో 1 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. దీన్ని స్థిరమైన ఉత్పాదకత వృద్ధికి సంబంధించి బెంచ్మార్క్గా పేర్కొంటారు. కానీ మనం మాత్రం ఇందుకు 0.5 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నాం. వ్యవసాయ పరిశోధనలపై పెట్టే ప్రతి రూపాయీ అదనపు రాబడిని తెచ్చి పెడుతుందని శాస్త్రజ్ఞులు రుజువు చేసినా, మన ప్రభుత్వాలు ఎందుకనో వినవు, కనవు.పశు సంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమలకు మేలు చేకూర్చేందుకు ఇంతకు ముందుకంటే ఈ రంగాలకు దాదాపు 27 శాతం నిధులు కేటాయించడం ఒక్కటే సానుకూల అంశం. ఈ రంగాల ద్వారా రాబడి ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా తీరప్రాంత రాష్ట్రాలకు మత్స్య సంపదపై వచ్చే ఆదాయాన్ని వ్యవసాయంలో కలిపేసి... వ్యవసాయ రంగంలో తమ అభివృద్ధి 10 నుంచి 15 శాతంగా ఉన్నట్లు మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా చెప్పుకొంటున్నారు. దిగుమతుల బెడదదేశీయ రైతాంగానికి మరో పెను సవాలు పెరగనున్న వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు. అమెరికాకు చేసే ఎగు మతులపై తాజాగా ట్రంప్ 18 శాతం మాత్రమే సుంకాలు విధిస్తామని ఓ చల్లని కబురు చెప్పిన మాట నిజమే. కానీ, అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులతో సహా అన్నింటిపై భారత్ ఎటువంటి సుంకాలూ విధించబోదని ట్రంప్ పేర్కొనడం పిడుగులాంటి వార్తే! ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంచడం ద్వారా ఇక్కడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. నూనె గింజల దిగుమతులపై సుంకం విధించకుంటే దేశీయ నూనెగింజల రైతులు మునిగిపోతారు. కానీ, బడ్జెట్లో అటువంటి ప్రతిపాదనలేమీ చేయలేదు. దేశీయ వ్యవ సాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వకుండా దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నారు? అమెరికా ఉత్పత్తుల దిగుమతు లపై పూర్తిగా సుంకం ఎత్తివేస్తే... భారత రైతాంగం ఇకపై కొన్ని రకాల పంటల సాగును శాశ్వతంగా మానుకోవాల్సిందే. ఇక, తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదు. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్స్ గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొబ్బరి బోర్డును ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందో తెలియదు. ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని 1.7 లక్షల కోట్లకు తగ్గించారు. గతేడాది ఇది 1.86 లక్షల కోట్లు. సబ్సిడీలు అధికంగా ఇవ్వాల్సి వస్తుందని ఎరువుల లభ్యతను కావాలనే కేంద్రం తగ్గించేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఏదీ?అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించే అంశంలో చట్టబద్ధత కల్పించాలని ఎంతో కాలంగా రైతు సంఘాలు కోరుతున్నాయి. దాన్ని పెడచెవిన పెట్టారు. ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపైన కూడా స్పష్టమైన దిశానిర్దేశం కొరవడింది. వ్యవసాయ పనిముట్లపై ఇంకా అధికశాతం జీఎస్టీ కొనసాగుతూనే ఉంది. కాఫీ గింజల్ని ప్రాసెస్ చేసే పరికరాల పైన కూడా కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలన్న కాఫీ గింజల ఉత్పత్తిదారుల డిమాండ్ను పట్టించుకోలేదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని గత రెండు, మూడేళ్లుగా చెబుతూనే ఉన్నా... దానిని అమలు చేస్తున్న రైతాంగానికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. సంప్రదాయంగా వరి పండించే తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని కొబ్బరి, జీడి, చందనం వంటి పంటలకు మళ్లమని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ, ప్రభుత్వాల పరంగా ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎక్కడ? భవిష్యత్తులో వరి, గోధుమ వేసినట్లయితే నష్టపోతారని ఆర్థిక సర్వేలో చెప్పారు. వరి పండించే చిన్న సన్నకారు రైతాంగానికి తగిన అవగాహనతో పాటు నిర్దిష్టమైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఫలితం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించు కోవడానికి ‘భారత్ విస్తార్’ పథకం ద్వారా రైతులకు వారి భాష లోనే సలహాలు, సూచనలు అందించాలన్న చొరవను స్వాగతించాల్సిందే. కానీ ముందుగా మౌలికమైన మార్పులు తేవడానికీ, ముఖ్యంగా పంటల మార్పిడికి రైతాంగాన్ని సన్నద్ధం చేయడానికీ అవసరమైన నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
వర్క్-లైఫ్ బ్యాలెన్స్: సాధ్యమేనా? లేక అపోహనా?
"ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి పనులు గుర్తుకొస్తాయి.. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫైళ్లు కళ్లముందు కదులుతాయి." ఇదీ ఈ తరం ఉద్యోగి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. చాలామందికి 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' అనేది కేవలం పుస్తకాల్లో కనిపించే పదంలా, లేదా కార్పొరేట్ కంపెనీలు గోడల మీద తగిలించే పోస్టర్లా మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ బ్యాలెన్స్ సాధ్యమేనా? లేక అదో అందని ద్రాక్షా?బ్యాలెన్స్ అంటే 50-50 కాదు!చాలామంది 'బ్యాలెన్స్' అంటే 24 గంటలను సమానంగా ఆఫీసుకి, ఇంటికి పంచడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే సమయాన్ని పంచడం కాదు..'ప్రెజెన్స్' (ఉనికిని)పంచడం. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు 100శాతంఅక్కడే ఉండటం, ఇంటికి వచ్చాక ఆఫీసు ఆలోచనల నుంచి 100శాతంబయటపడటం. అది లేనప్పుడే అసలైన ఒత్తిడి మొదలవుతుంది.నా దగ్గరికి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ కిరణ్ (పేరు మార్చాను) అనుభవమే దీనికి నిదర్శనం. కిరణ్రోజూ 12 గంటలు పని చేస్తాడు. "నా భార్యాపిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నాను" అంటాడు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని చేతిలో ఫోన్, మెదడులో ప్రాజెక్ట్ డెడ్ లైన్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా అడిగితే చిరాకు పడతాడు. ఫలితంగా, అతను భౌతికంగా ఇంట్లోనే ఉన్నా, మానసికంగా ఎప్పుడో ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సమస్య 'సమయం' కాదు.. 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయలేకపోవడం.బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటోంది?• డిజిటల్ కనెక్షన్:వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ నోటిఫికేషన్లు ఆఫీసుని మన బెడ్రూమ్ దాకా తీసుకొచ్చాయి.• గిల్ట్ (అపరాధ భావం): "నేను ఆన్ లైన్ లో లేకపోతే పని ఆగిపోతుందేమో" లేదా "నా బాస్ ఏమనుకుంటారో" అన్న భయం.• ‘నో’చెప్పలేకపోవడం:మన శక్తికి మించిన బాధ్యతలను మొహమాటానికి ఒప్పుకోవడం.'బ్యాలెన్స్' సాధించడానికి 5 ప్రాక్టికల్ టిప్స్1. Mental Gateway:ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిని ఒక వంతెనలా వాడుకోండి. ఆ ప్రయాణంలో సంగీతం వినడమో, లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి ఆలోచనలను అక్కడే క్లోజ్ చేయడమో చేయండి. ఇంటి తలుపు తీసే ముందే ఆఫీసు టెన్షన్లను బయటే వదిలేయండి.2. Tech-Free Zone:రాత్రి భోజనం చేసేటప్పుడు లేదా పిల్లలతో ఆడుకునేటప్పుడు ఫోన్ ని పక్క గదిలో ఉంచండి. నోటిఫికేషన్ల శబ్దం మీ ప్రశాంతతను దోచుకోకుండా చూసుకోండి.3. Quality Vs Quantity:మీరు కుటుంబంతో ఎన్ని గంటలు ఉన్నారన్నది కాదు.. ఉన్న ఆ కాసేపు ఎంత quality time గడిపారన్నదే ముఖ్యం. రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చోవడం కంటే, ఫోన్ చూడకుండా 20 నిమిషాలు మీ భాగస్వామితో, పిల్లలతో మాట్లాడటం ఎంతో మేలు.4. Boundaries:పని వేళలు ముగిశాక, అత్యవసరమైతే తప్ప కాల్స్/మెయిల్స్ కి అటెండ్ అవ్వకూడదనే నియమాన్ని మీ బాస్ కి, కొలీగ్స్ కి సున్నితంగా చెప్పండి. మీ ప్రైవేట్ టైమ్ ని మీరు గౌరవిస్తేనే, ఇతరులు గౌరవిస్తారు.5. Self-Care:ఖాళీ గ్లాసుతో ఇతరుల దాహం తీర్చలేం. మీకు ఇష్టమైన హాబీని పాటించడం లేదా వ్యాయామం చేయడం వల్ల మీ 'ఎనర్జీ లెవల్స్' పెరుగుతాయి. అప్పుడు మీరు ఆఫీసులోనూ, ఇంట్లోనూ యాక్టివ్ గా ఉండగలరు.మీ కోసం ఒక సెల్ఫ్-చెక్గత వారం రోజుల్లో, మీరు ఏకాగ్రతతో మీ కుటుంబ సభ్యుల కళ్లలోకి చూస్తూ కనీసం 10 నిమిషాలు మాట్లాడారా? లేకపోతే, మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని అర్థం.గుర్తుంచుకోండి.. మీరు ఉద్యోగం మానేస్తే మీ సీటును భర్తీ చేయడానికి కంపెనీకి వారం రోజులు పట్టదు. కానీ మీ కుటుంబంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కెరీర్ లో ఎదగండి.. కానీ ఆ క్రమంలో మీ జీవితాన్ని కోల్పోకండి. అవసరమనిపిస్తే సైకాలజిస్ట్ లేదా కెరీర్ కోచ్ సహాయం తీసుకోండి.సైకాలజిస్ట్ విశేష్కెరీర్&మైండ్సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
సినిమా రంగం అంటే సామాన్య ప్రజలకు అదొక రంగుల ప్రపంచం, కలల సౌధం. వెండితెరపై కనిపించే తారల వెలుగుల వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని అవమానాలు దాగి ఉన్నాయో బయటి ప్రపంచానికి ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటుంది. ప్రతిభ ఉంటే చాలు, ఆకాశమే హద్దుగా ఎదగవచ్చనే ప్రచారం ఈ పరిశ్రమలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఒక అగ్ర కథానాయకుడు మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనే సంస్కృతే లేదనీ, నటీనటులు క్రమ శిక్షణతో ‘స్ట్రిక్ట్’గా ఉంటే ఎవరూ ఇబ్బంది పెట్టరనీ ఉద్బోధించారు. తన కుమార్తెను కూడా ఈ రంగంలోకి రావాలని ప్రోత్సహించానని ఆయన ఉదాహరించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళా నటీమణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమ య్యాయి. వెనుక అండదండలు ఉన్న వారసులకూ, ఏ అండా లేని సాధారణ యువతులకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని వారు ఎత్తిచూపారు. ప్రతిభ ఉన్నా ‘కమిట్మెంట్’, ‘అడ్జస్ట్మెంట్’ పేరుతో శారీరక లొంగుబాటు కోరడం ఇక్కడ నిత్యకృత్యమనీ, అది లేకుండా అవ కాశాలు రావడం దాదాపు అసాధ్యమనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్ట్రిక్ట్’గా ఉండటం అంటే వచ్చిన అవ కాశాన్ని వదులుకుని వెనక్కి వెళ్లిపోవడమే తప్ప మరో మార్గం లేదని వారు కుండబద్దలు కొట్టారు. అసలు ఈ ‘కాస్టింగ్ కౌచ్’ అనే మాటకూ అర్థం ఏమిటి? ‘కాస్టింగ్’ అంటే సినిమా నిర్మాణంలో నటీ నటులను, ఇతర సాంకేతిక నిపుణులను ఎంచుకునే ప్రక్రియ. ‘కౌచ్’ అంటే ఆ ఎంపిక సమయంలో చర్చలు జరిపే పెద్ద సోఫా. అది పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అమెరికన్ భాషా శాస్త్రవేత్త బెంజమిన్ జిమ్మెర్మ్యాన్ వివరణ ప్రకారం, సినిమాలో అవకాశం ఇవ్వాలంటే పడక సుఖం కోరడం అనే వికృత ధోరణే ఈ పేరుతో పిలవబడుతోంది. పైకి మాత్రం చాలా మర్యా దగా ‘కమిట్మెంట్’ ఉండాలనీ, కొంత ‘అడ్జస్ట్’ కావా లనీ అంటుంటారు. ఇది 1910–1920 కాలంలో హాలీవుడ్, బ్రాడ్వే నాటక రంగాల్లోనే ప్రబలంగా ఉండే దని చరిత్ర చెబుతోంది. నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే ఈ దోపిడీకి ‘కాస్టింగ్ కౌచ్’ అనే పేరు స్థిరపడిపోయింది.సినిమా రంగంలోని ఈ అనారోగ్యకర ధోరణు లను, దానిపట్ల ఉన్న ఆకర్షణ గురించి 80 ఏళ్ళనాడే చలం, తన ‘సినిమా జ్వరం’ అనే వ్యాసంలో సినిమా జాడ్యం ముసలివాళ్ళ దగ్గిర్నించీ పసిపిల్లల దాకా గట్టిగా పట్టుకుందనీ, ఇది మరింతగా విస్తరించబోతోందనీ జోస్యం చెప్పారు. పూర్వం యోగుల కటాక్షం కోసం శిష్యులు వేచి చూసినట్లు, నేటి యువతీ యువకులు ఒక్క అవకాశం కోసం దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సేవ చేస్తున్నారని ఆయన విమర్శించారు. సినిమా రంగం అత్యంత పవిత్రమైనదనీ, ఇక్కడ శీలానికి భయం లేదనీ చెప్పే దొంగ రాతలు ప్రజలను వంచించ డమేనని చలం ఘాటుగా స్పందించారు. ‘అడవిలో పాములు, పులులు ఉన్నాయని హెచ్చరించడం న్యాయం. జాగ్రత్తగా వెళ్ళు అనడం ధర్మం. కానీ పులిని బ్రహ్మస్వరూపంగా భావించమని, అడవిలో ఏమీ లేవని చెప్పి పంపడం ఘాతుకం’ అని ఆయన అభిప్రాయ పడ్డారు. వాస్తవాలను దాచిపెట్టి అబద్ధపు పేర్లతో లోకాన్ని మోసం చేయడం వల్లే సగం సమస్యలు పుడు తున్నాయని ఆయన ఆనాడే స్పష్టం చేశారు.హిందీ నుంచి తెలుగు దాకా...ఈ జబ్బు కేవలం మన ప్రాంతానికే పరిమితం కాదు. హాలీవుడ్ చరిత్రకారుడు కారీ రిక్కే రాసిన దాని ప్రకారం... ఆనాటి సుప్రసిద్ధ నటి మార్లిన్ మన్రో హాలీ వుడ్ను ఒక ‘కిక్కిరిసిన వేశ్యావాటిక’గా అభివర్ణించింది. హారీ కోహ్న్ వంటి బడా నిర్మాతలు నటీమణులను పడక గదిలో పరీక్షించకుండా అవకాశాలు ఇచ్చేవారు కాదని ప్రతీతి. హాలీవుడ్లో ఈ జాడ్యంపై 2018–2020 కాలంలో ప్రపంచవ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం పెల్లు బికింది. తెలుగు చిత్రసీమలో కూడా 2017లో ఫిలిం నగర్ సాక్షిగా ఒక నటి చేసిన అర్ధనగ్న నిరసన ప్రదర్శన పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనల తర్వాత వాస్తవాలను తేల్చడానికి, ఇటువంటి దుర్మా ర్గాలు జరగకుండా చూడటానికి కొన్ని కమిటీలు ఏర్పాటై నట్లు వార్తలు వచ్చినా, ఆశించిన మార్పు మాత్రం అగుపించలేదు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా కేవలం కమిటీలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని కాలం నిరూపించింది.సినిమా అనే విచిత్రమైన సరుకును తయారుచేసే పెట్టుబడిదారీ విధానంలోనే ఈ దోపిడీ మూలాలు ఉన్నాయి. సినిమాల ప్రారంభం నుండి స్త్రీ దేహాన్ని కేవలం ఒక భోగ వస్తువుగా, సెక్స్ సింబల్గా చూపే ధోరణి పెరిగింది. మహిళలను కేవలం లాభాలు తెచ్చి పెట్టే సరుకులుగా (‘కమోడిఫికేషన్’) మార్చే ఈ వ్యవ స్థలో మార్పు రానంత కాలం ఎన్ని నిరసనలు తెలిపినా ఫలితం శూన్యం. చలం తన వ్యాసంలో చెప్పినట్లు, స్టూడియోలు, దర్శకులు ఉన్నతమైన ఆశయాలు, ప్రజల మీద ప్రేమ గలవారైతే తప్ప పరిస్థితులు మారవు. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అదొక కళ అనీ, అందులో పనిచేసే వారు మనుషులనీ గుర్తించినప్పుడే ఈ ‘కాస్టింగ్ కౌచ్’ అనే వికృత క్రీడకు ముగింపు లభిస్తుంది.– బి.ఆర్. బాపూజీహైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ -
జనసేనలో మరింత ముదిరిన ముసలం
జనసేనలో అధినేతకు, ఆ పార్టీ కార్యకర్తలకు అంతరం పెరుగుతోందా? పార్టీని గంపగుత్తగా టీడీపీకి అనుబంధ సంస్థగా చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను కార్యకర్తలు నిరసిస్తున్నారా?. తిరుమల లడ్డూ వ్యవహారంలో పార్టీ వైఖరిని స్పష్టం చేయడంలోనూ పవన్ విఫలమయ్యారన్న అసంతృప్తి కేడర్లో కనిపిస్తోందా?. ప్రతిపక్ష పార్టీకి చెందినవాడైనప్పటికీ సాటి కాపు నేతపై టీడీపీ గూండాలు దాడి చేస్తే మాటమాత్రంగానైనా ఖండించలేకపోవడం జనసేన బలహీనతైపోయిందని వారు వాపోతున్నారా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇటీవల సమావేశమైంది. రాజకీయ పరిణామాలపై, అధికార టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేసిన దాడులపై చర్చించాలనుకున్నారు. కానీ.. ఎవరూ ఏ ప్రశ్న వేసే అవకాశమే ఇవ్వకుండా అధినేత పవన్ ఆ సమావేశం నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయారు. కొంచెం సినిమాటిక్ డ్రామాగా అనిపించవచ్చు కానీ.. పవన్ తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకే ఇలా వ్యవహరించి ఉంటారన్న విశ్లేషణ వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు పలు సందర్భాల్లో పవన్ చంద్రబాబు, లోకేష్లకు వత్తాసుగా నిలబడటం.. ఎన్ని అరాచకాలు జరిగినా.. సొంత పార్టీ కార్యకర్తలు నేతలను టీడీపీ వాళ్లు అవమానిస్తున్నా పట్టించుకోకపోవడంపై మొదటి నుంచి కూడా జనసేనలో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. తమకంటూ సొంత అస్తిత్వం, వ్యక్తిత్వం లేకుండా పోతున్నాయని ఆ పార్టీ నేతలు తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం... తదనంతరం అంబటి కుమార్తె పవన్ను ఉద్దేశించి ఓ సూటి ప్రశ్న వేయడాన్ని జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రశ్నలు పవన్ కనీస సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుశా... పార్టీ వారందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని పవన్ చెప్పినట్లే.. పవన్ సహా జనసేన వారందరి జాతకాలు చంద్రబాబు వద్ద ఉన్న కారణంగానే ప్రశ్నించలేకపోతున్నారని కొందరు చమత్కరిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని హిందువులు నమ్మే దేవదేవునికి అపచారం కలిగేలా మాట్లాడిన చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్ సనాతని వేషం కట్టి దుర్గగుడి మెట్లు కడిగి, తిరుపతి వెళ్లి ‘‘అన్ అపాలజిటిక్ హిందూ’’ అని గంభీర ప్రకటనలు చేశారు. ఇక్కడే పవన్ తప్పటడుగు వేశారు. చంద్రబాబు ఏమి చెబితే అది గుడ్డిగా చేయకుండా కొంచెం ఆలోచించి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఆయనకు, జనసేనకు అపకీర్తి వచ్చేది కాదు. కానీ చంద్రబాబుతో పోటీ పడి అయోధ్యకు కూడా లక్ష కల్తీ లడ్లు వెళ్లాయని నిరాధార ఆరోపణ చేశారు. నిబద్దత ఉన్న నేత అయితే వెంటనే పొరపాటు జరిగిందని ప్రకటించి ఉండేవారు. కాని చంద్రబాబు దారిలోనే నడుస్తూ పవన్ ఆ విషయాన్ని దాటవేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా జంతుకొవ్వు కలవలేదని స్పష్టం చేయడం, టీడీపీ హయాంలోనే బోలే బాబా కంపెనీ వచ్చిందని, 2019-24 మధ్య తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకసారి వెనక్కి పంపిన నెయ్యి టాంకర్లను తిరిగి వాడారన్న విషయం వెలుగులోకి రావడం.. చంద్రబాబు, పవన్ల పరువు తీశాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ లోనే బుకాయించసాగారు. ఈ దశలో అయినా పవన్ కళ్యాణ్ కాస్త హేతుబద్దంగా ఆలోచించి ఉంటే పార్టీ క్యాడర్కు సరైన సంకేతం వెళ్లి ఉండేది. అలా చేయకపోగా పార్టీ జనరల్ బాడీ సమావేశం పెట్టి జనసేన నేతలు, కార్యకర్తలు ఎందుకు లడ్డూ అంశంలో వైసీపీని విమర్శించడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై టీడీసీ వారు చేసిన దాడి, సృష్టించిన విధ్వంసాన్ని కూడా సమర్ధించే దశకు పవన్ వెళ్లారు. అంబటి కారుపై తొలుత కర్రలతో దాడి చేసి, నీచమైన రీతిలో బూతులు తిట్టిన టీడీపీ వారిని ఒక్క మాట అనకుండా.. అంబటినే తప్పు పట్టిన రీతిలో పవన్ మాట్లాడడం మరింత ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ తాము కూడా కాపు బిడ్డలమేనని, తమపైకి మహిళలని కూడా చూడకుండా కులం పేరు ప్రస్తావించి దాడి చేశారని, తన తండ్రిని హత్య చేయడానికి యత్నించారని, దీనిని సమర్ధిస్తారా అని పవన్ను ప్రశ్నించారు. అంతేకాక అసలు పవన్ తల్లిని దూషించింది ఎవరో ఆయనకు తెలియదా అని వ్యంగ్యంగా అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుడుతూ కాపులను వేధించడమే చంద్రబాబు లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై కూడా పవన్ స్పందించలేదు. మొత్తం ఇష్యూని చర్చించి పార్టీ పరంగా ఒక అవగాహనకు రావల్సిన పరిస్థితి కాకుండా,అసలు ప్రశ్నించడానికే వీలు లేదన్నట్లుగా పవన్ ప్రవర్తించారు. ఇక్కడే క్యాడర్కు, పవన్కు మధ్య అంతరం బాగా పెరిగినట్లు అర్థం అవుతోంది. ప్రశ్నించడానికి వచ్చిన జనసేన కేవలం టీడీపీకి భజనసేనగా మారిపోవడం ఏమిటన్న అంతర్మథనం జనసేన కార్యకర్తలలో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి భిన్నంగా కొంతమంది జనసేన కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా వాస్తవ పరిస్థితిపై ఆలోచించడం, మాట్లాడడం ఆరంభించారు. ఆ పార్టీకి చెందిన ఒక మహిళా న్యాయవాది రజని టీవీ డిబేట్లలో మాట్లాడుతూ టీడీపీ తీరును ఆక్షేపించారు. పుటుక్కున అధికారం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు టీడీపీ వారు కర్రలతో వస్తున్నారు.. రేపు వైసీపీ వారు కత్తులతో వస్తారని హెచ్చరించారు. అసలు లడ్డూపై ఫ్లెక్సీలు పెట్టడం, అంబటిపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు? రేపటి పరిణామాలను ఆలోంచుకుని వ్యవహరించాలని అంటూ ‘‘పచ్చ తమ్ముళ్లూ.. గుర్తు పెట్టుకోండి..’’ అని ఆమె స్పష్టం చేశారు. పవన్కు ఈ మాత్రం విజ్ఞత లేదా ధైర్యం లేకుండా పోయిందేమిటా అనే భావన జనసేనలో ఏర్పడింది. లాయర్ రజని చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె పార్టీకి దూరం అయ్యేలా జనసేన వ్యవహరించింది. ఈ వ్యవహారంలోనే కాకుండా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా పవన్ సరైన రీతిలో స్పందించలేకపపోయారన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఏదో కమిటీ వేసి కాలయాపన చేయడం ఏమిటన్న భావన కూడా ఉంది. మహిళలకు సంబంధించి పవన్ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలేమిటి? ఇప్పుడు స్పందిస్తున్న వైనం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. పైగా నేతలు ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ ప్రకటన చేయడంపై అంతా విస్తుపోయారు. ఇప్పటికే టీడీపీ వారు విలువ ఇవ్వడం లేదని, నామినేషన్ పదవులలో అన్యాయం జరుగుతోందని రగులుతున్న జనసేన కార్యకర్తలలో ఈ తాజా పరిణామాలు మరింత బాధ కలిగిస్తున్నాయి. అందువల్లే పవన్ కల్యాణ్ తాను ఏమి చెప్పినా పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా క్యాడర్ మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ మాట్లాడితే పదిహేనేళ్లు టీడీపీకి మద్దతు ఇస్తామని ప్రకటించడం, దానికి తగ్గట్లే టిడిపి వారు చేసే తప్పులను భుజనా వేసుకోవడం వంటివి కూడా వారికి నచ్చడం లేదు.కేవలం టిడిపిని మోయడానికే తాము ఉన్నామా అన్న ఆవేదనను పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాపు సామాజికవర్గ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన సీనియర్ నేత బొలిశెట్టి సత్య ఒక విషయం వెల్లడించారు.పార్టీకి పనిచేసే వారికి పదవులు దక్కలేదని, పదవులు వచ్చినవారికి జనసేన పేరు తగిలించారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో అధినేతకు, క్యాడర్ కు మధ్య పెరుగుతున్న అంతరం ఏ పరిణామాలకు దారి తీస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇదో గట్టి హెచ్చరిక!
మూలకు నెట్టేసి కొట్టే ప్రయత్నం చేస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందట. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఇప్పుడు పులుల్లా తిరగబడే పరిస్థితి వచ్చేసింది. అణచివేతలు, అడుగుఅడుగునా నిర్బంధాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడం తాజా తార్కాణం. టీడీపీ అరాచక శక్తుల దాడి బాధితుడైన వైసీపీ నేత అంబటి రాంబాబును పరామర్శకు ఈ స్థాయిలో జనాదరణ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఈ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని శతధా ప్రయత్నించింది. జగన్ టూర్లో పాల్గొనడానికి వెళుతున్నారనుకుంటే చాలు.. ప్రజలను స్టేషన్లకు తరలించారన్న వార్తలొస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇళ్లకే పరిమితం చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఇళ్లపై నోటీసులు అతికించడం, కొందరిని గృహ నిర్బంధంలో ఉంచడం కూడా తెలియవచ్చింది. కానీ.. ఇవన్నీ జనాదరణ ముందు వెలవెలబోయాయి. జగన్ను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు జనం ఉరకలెత్తారు. ఏడాదిన్నరగా మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నం.. రెడ్బుక్ పేరిట సాగిస్తున్న దమనకాండలకు విసుగెత్తిన ప్రజలు ఇక చాలన్నట్టుగా రోడ్లపైకి వచ్చారు. జగన్తోనే మేము అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తమ అసహనాన్ని తెలియచేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తానని మాత్రమే వైఎస్ జగన్ చెప్పారు. జనం తరలి రావాలన్న పిలుపు ఎక్కడా ఇవ్వలేదు. అయినా ఆయన పర్యటన అంటే చాలు.. రహదారులు జన సంద్రమవుతున్నాయి. జగన్ కార్యక్రమాలలో ఆయన ప్రసంగం ఒక ఎత్తయితే ఆయన కోసం తరలివచ్చే జన తరంగాలు ఇంకో ఎత్తు. ఇది కేవలం అభిమానం ఒక్కటితోనే సాధ్యమయ్యేది కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ, ఇష్టారాజ్య ధోరణలు కుదరవని ప్రజలిస్తున్న స్పష్టమైన సందేశం. జెన్-జీ నేతృత్వంలో నేపాల్లో జరిగిన తిరుగుబాటు లాంటిదన్నమాట. టీడీపీ గూండాలు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిపిన దాడి, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం వంటి ఘటనలు సామాన్యులను సైతం ఆలోచించేలా చేశాయనడంలో సందేహం లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అరాచకశక్తులకు అండగా నిలబడటమూ వారిని కలవరానికి గురి చేసింది. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం కంటే.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమాలకు పాల్పడటంపైనే ఎక్కువ దృస్టి పెట్టిందన్న సత్యం కూడా ప్రజలకు బోధపడినట్టు ఉంది. రెడ్బుక్ అమలు సంగతి సరేసరి. జగన్ గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి టీడీపీ వారి బూతులకు స్పందించారే మినహా తనంత తాను దూషించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై అంబటి వివరణ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతులు అంబటి ఇంటిపై దాడి చేయించి విధ్వంసం సృష్టించి, పార్టీ ఆఫీస్ను దగ్దం చేసిన ఘటనను విశ్లేషించి దీనంతటి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వారి రెడ్ బుక్ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విషపు విత్తనాలు నాటుతున్నారని, అవి పెరిగి చెట్లుగా మారితే టీడీపీకే నష్టమని కూడా హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసినా కులమతాలను రెచ్చగొట్టేలా కూటమి నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఏమిటని నిలదీశారు. జగన్ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు లేని ఆరోపణలు మళ్లీ, మళ్లీ చేసి తిరుమల ఆలయానికి తీరని అపచారం చేస్తున్నారని, అప్రతిష్ట తెస్తున్నారని భక్తులు బాధపడుతున్నారు. అయినా వారు ఆ దిశగా ఆలోచించకుండా ఏదో కొత్త కమిటీ అంటూ మరో డ్రామాకు తెరదీస్తున్నారు. వారికి ఎల్లో మీడియా వంతపాడుతూ ప్రజల మనసులను కలుషితం చేయడానికి విశ్వయత్నం చేస్తోంది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారన్న విషయం నిఘా నివేదికలలో బయటపడుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకాంత మంతనాలు జరిపి తర్జనభర్జన పడినట్లు కనిపిస్తుంది.ఎల్లో మీడియా ద్వారా జగన్ కుట్రలు చేస్తున్నారని, దీనిపై జనంలోకి వెళ్లాలని వారు భావించారని రాయించారు. నిజానికి జంతు కొవ్వు ఆరోపణ మొదలు, నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు పెట్డడం, వైసీపీ నేతలపై,వారి ఇళ్లపై దాడులు చేయించడం వరకు కుట్రలు చేస్తున్నది టీడీపీ వారైతే, ఎల్లో మీడియా మాత్రం వైసీపీ అంటూ చంద్రబాబు పాటను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చూస్తూ రోజురోజుకు దిగజారుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం, హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి గుణపాఠం కలగాలి. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతున్న తీరును వైసీపీ ఎంపీలు సాక్ష్యాధారాలతో చూపించగలిగారు. దాంతో ఫ్యాక్ట్ కమిటీని వేస్తామని కమిషన్ ఛైర్మన్ రామసుబ్రహ్మణ్యం చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే సాల్మన్ అనే వైసీపీ కార్యకర్త టీడీపీ వారి చేతిలో హత్యకు గురవడం, దళితులను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్న వైనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్న సమాచారం వచ్చింది. ఇక ఏపీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను రోడ్డుపై నడిపిస్తూ అవమానిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ వారు ఎంత పెద్ద నేరాలు చేసినా, పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల వారికి పోలీసులే అండగా ఉంటున్న వైనం ప్రజలందరికి తెలిసిపోయింది.కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి జనాన్ని మభ్య పెట్టడానికి పూనుకోవడం, విశాఖలో రూ.ఐదు వేల కోట్ల విలువైన భూమిని తమ బంధువైన లోక్సభ సభ్యుడు శ్రీభరత్ కాలేజీకి కట్టబెట్టడానికి సిద్దపడడం, ఇలా అనేక అంశాలలో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది.నేరుగా స్పందించలేని పరిస్థితి ఉంది కనుక, తమ వద్దకు వచ్చిన జగన్పై అభిమానం కనబరచడమే కాకుండా, తమ మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని భావించవచ్చు.ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరుస్తుందా?ఇంకా కుట్రలనే నమ్ముకుంటుందా?,, :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దారీ తెన్నూ లేని జెన్–జీ తుపాను
బంగ్లాదేశ్లో ఈ నెల 12న, నేపాల్లో వచ్చే నెల 5న పార్లమెంటు ఎన్నికలు జరగనుండగా, అక్కడ తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాలను కూలదోసిన జెన్–జీ ఉద్యమాలు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ఆ రెండు తిరుగుబాట్లు చేసిన యువతరానికి అందుకు తగిన కారణాలైతే ఉన్నాయి. కొన్ని లక్ష్యాలనూ ప్రకటించారు. కానీ, రోజులు గడిచేకొద్దీ తమ సిద్ధాంతాలు ఏమిటో తెలియక, తగిన రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేక, నాయకులను ఎంపిక చేసుకోలేక అన్ని విధాలా అయోమయాలకు గురయ్యారు. చివరకు ఎన్నికలు ప్రకటించే వేళకు అనేక గ్రూపులుగా మారి ఎవరి దారి వారిదయింది. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమాజాలు ఈ సరికే నిరాశకు గురైన స్థితిలో, ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాతి పరిపాలనలు ఏ విధంగా ఉండేదీ అర్థంకాని పరిస్థితి కనిపిస్తున్నది.స్పష్టత లేని బంగ్లా యువతబంగ్లాదేశ్ విద్యార్థి–యువజనుల తిరుగుబాటు 2024 జూన్లో మొదలైంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా సాగించిన అణచివేతను తట్టుకుని మరింత తీవ్రంగా మారింది. రెండు నెలల పాటు జరిగిన ఉద్యమాన్ని పరిష్కరించలేక షేక్ హసీనా రాజీనామా చేసి భారత దేశానికి పారిపోయి వచ్చారు. ఆ దరిమిలా, నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంట్ను రద్దు చేసి కొత్త ఎన్నికలు ప్రకటించారు.అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా, తిరుగుబాటుతరం ఏమి చేయగలదీ స్పష్టత రాలేదు. వారిలో పలు గ్రూపులు తయారు కాగా, కనీసం కొందరు ముఖ్యులతో కలిపి ఒక నాయకత్వాన్ని ఎంపిక చేసుకోలేక పోయారు. చివరకు కొద్దిమంది కలిసి ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరిట ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. కానీ అందులో ఐక్యత లేక పోయింది. అంతకన్నా ముఖ్యంగా, తమ సిద్ధాంతం ఫలానా అని నిర్ణయించుకుని దేశానికి తెలియజెప్పలేక పోయారు. నమ్మకం కోల్పోయిన తిరుగుబాటుతిరుగుబాటులో వారికి మద్దతుగా నిలిచిన ప్రజలు కోరుకున్నది నిర్దిష్టమైన నాయకత్వం, సిద్ధాంతాలు గల ఒక ప్రత్యామ్నాయ పార్టీని! విద్యార్థులు, యువకులు దేనికి నిరసనగా,ఏ లక్ష్యాలతో తిరుగుబాటు జరిపారో వాటి నుంచి, పాత పార్టీలకు భిన్నమైన ఒక కొత్త పార్టీని!! కానీ, తిరుగుబాటు రోజుల నుంచి సుమారు సంవత్సర కాలం గడిచినా ఇవేవీ జరగలేదు.షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఇక రంగంలో ఉండదని తేలిపోగా, మిగిలిన రెండు ప్రధానమైనవి ఖలీదా జియా మరణం తర్వాత ఆమె కుమారుడు తారిఖ్ రహమాన్ నాయకత్వాన గల‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’, ‘జమాతే ఇస్లామీ పార్టీ’లు. విద్యార్థుల తీరు వల్ల వారి పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లగా, ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీఎన్పీ,జమాతే అగ్రస్థానంలో నిలిచాయి. విద్యార్థుల పార్టీ ఎక్కడో వెనుకబడి పోయింది. దానితో ఆందోళన చెందిన ఆ పార్టీ నాయకత్వం జమాతేతో పొత్తు కలవగా, ఒక మతతత్వ పార్టీతో ఐక్య సంఘటనను నిరసిస్తూ పలువురు విద్యార్థి నాయకులు బయటకు పోయారు. బయటి సమాజంలోనూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికలలో విద్యార్థుల పార్టీ నుంచి గెలిచేది ఎందరనే ప్రశ్న ఎట్లున్నా, వారి ఉద్యమం ఈ రోజున ఎక్కడ మిగిలింది, తమ లక్ష్యాలను ఏ మేరకు సాధించనున్నది, తమపై ఆశలు పెట్టుకుని బలపరచిన ప్రజలకు ఏమి చెప్పగలదన్నది మౌలికమైన ప్రశ్న. అందులో విఫలమైన పక్షంలో, ఇకభవిష్యత్తులోనూ అవే పాత పార్టీలు అధికారానికి రాగల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున, ఆ నాయకత్వాలు తామేదో మారామని బయటకు చెప్తున్నా అటువంటి ఆశలు ఎవరికీ లేని స్థితిలో, ఉద్యమ ప్రభావాలు శూన్యంగా మిగల నున్నాయంటే పొరపాటు ఉండబోదు. మునుముందు మరొక మారు తిరుగుబాటు తలెత్తితే ప్రజలు విశ్వసించటం తేలిక కాబోదు.చీలిన నేపాల్ గ్రూపులునేపాల్ను గమనించినా పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. అక్కడి జెన్–జీ ఉద్యమం నిరుడు సెప్టెంబర్లో ఒకేమారు అగ్నిపర్వతం వలె పేలి కేవలం రెండు రోజులలో ప్రభుత్వాన్ని కూలదోసి, పార్లమెంటును రద్దు చేయించింది. వారి నిరసనలు కూడా బంగ్లాదేశ్లో వలె అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, బంధుప్రీతి, ఆర్థిక సమస్యలు, అసమర్థ పాలనకు సంబంధించినవే. అక్కడి ప్రజలు వారిని పూర్తిగా బలపరచి, వారి నాయకత్వాన ప్రత్యామ్నాయ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు ఏర్పడగలవని ఆశించారు. తిరుగుబాటు ఆకస్మికం అయినందున దేశమంతటా ఎక్కడికక్కడ కలిపి మొత్తం సుమారు 60 జెన్–జీ గ్రూపులు ఉనికిలోకి రాగా, వాటిలో కనీసం కొన్ని ముఖ్యమైనవి ఒక్కటై ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలవనుకున్నారు.కానీ, నెలలు గడిచిపోతున్నా అది జరగకపోగా అనేక గ్రూపులు తమ గత కాలపు సిద్ధాంతాలు, వ్యక్తిగత అనుబంధాలను బట్టి, లేదా టికెట్లు ఆశించి ప్రధానమైన అయిదు పాత పార్టీలతో చేరాయి. రెండు మూడు గ్రూపులు సొంత పార్టీలు ఏర్పాటు చేశాయి గానీ అవి బలహీనంగా మిగిలిపోయాయి. ఉద్యమకారులకు, ప్రజలకు కూడా తగినంత అభిమానం ఉన్నట్లు భావించే మాజీ ఉపప్రధాని రవి లమిఛానే, ఖాట్మండు మాజీ మేయర్ బాలేన్ షా, జాతీయ విద్యుత్ సంస్థ మాజీ ఎం.డి. ఘీషింగ్ కలిసి ఏర్పాటు చేసిన పార్టీ కొన్ని ఆశలు రేకెత్తించింది గానీ, మొదలైన వారం రోజులకే చీలిపోయింది. విచిత్రం ఏమిటంటే, ఇంతటి తిరుగుబాటు జరిగి, దాని నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధానులు ఓలీ పార్టీ, ప్రచండ పార్టీ, బాబూరాం భట్టరాయ్ పార్టీ, మాజీ ఉపప్రధాని లమిఛానే పార్టీలు ప్రకటించినా, ఆ పాఠాలు ఏమిటో, భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటో వివరిస్తూ మేనిఫెస్టోలను ఏ ఒక్కరూ ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారాలు మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు హతాశులై మిగిలారు.గత రెండేళ్ళలో బంగ్లాదేశ్, నేపాల్లోనే కాదు. మరొక డజను దేశాలలోనూ జెన్–జీ తిరుగుబాట్లు జరిగాయి. ఒకటి రెండు చోట్ల కొన్ని రాయితీలు సాధించినా ప్రత్యామ్నాయాలన్నవి ఎక్కడా ఏర్పడ లేదు. ప్రతిచోటా వెనుకటి పార్టీల రాజ్యమే కొనసాగుతున్నది. ఇందులో ఆశ్చర్యం లేదు. ఉద్యమాలు తగినంత కాలం సాగి, తమ వైన సిద్ధాంతాలు, నాయకత్వాలతో ఒక రూపానికి వచ్చి, ప్రజలను మెప్పిస్తే తప్ప, ప్రత్యామ్నాయాలు సిద్ధించవు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా?
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో టీడీసీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తూ... భౌతిక దాడులకు దిగుతూ రెడ్బుక్ అరాచకం సృష్టిస్తున్న పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... వీటన్నింటికీ కారణం వైసీపీనేనని, వారి ట్రాప్లో పడవద్దని కేడర్కు చెబుతున్నారట. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని టెలికాన్ఫరెన్స్లో ఆయనగారు వక్కాణించిన మాటలను కొన్ని విశేషణాలు చేర్చి యథాతథంగా ప్రచురించుకుని తరించింది ఎల్లో మీడియా! ప్రజలు మాత్రం ఇదేం చోద్యమన్నట్టు నోళ్లెళ్లబెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడినే ఉదాహరణగా తీసుకుందాం. పక్కా రౌడీలు మాత్రమే అలాంటి విధ్వంసం సృష్టించగలరు. లకారాలతో ఈ దాష్టీకంలో పాల్గొన్న టీడీపీ మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావులు మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ కూడా కాలేదు. తెలుగుదేశం కార్యకర్తలు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రమంతటా అనుచితమైన ఫ్లెక్సీలు కట్టడంతోనే ఈ సమస్యంతా మొదలైంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేయడంతో చంద్రబాబు బృందం,ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతుల సాయంతో ఈ ఫ్లెక్సీల డ్రామాకు తెరలేపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై నెపం నెట్టేస్తూ తప్పుడు ఆరోపణలతో కట్టిన ఈ ఫ్లెక్సీలను పోలీసులు సకాలంలో తీసివేసి ఉంటే పరిస్థితి చేయిజారేదీ కాదు. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించి.. ఆ ఫ్లెక్సీలను తామే తొలగిస్తామనడం అంబటి పాపమైంది. ఫ్లెక్సీ కట్టిన రోడ్డు ద్వారా గుడికి వెళ్లి వస్తూంటే... టీడీపీ కార్యకర్తలో లేక వారు తెచ్చుకున్న కిరాయి మూకో కర్రలతో అంబటి కారుపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో వీరు దాడులు చేస్తూంటే.. పోలీసులు వారికి రక్షణగా ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతుంది. ఇది హింస అన్న విషయం చంద్రబాబుకు తెలియదా!. అంతేకాదు. గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ అయిన టీడీపీ మహిళా నేత అకారణంగా అంబటిని బండబూతులు తిట్టడం ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆయన నిస్సహయత అనుకోవాలి. ఇంత జరిగిన తరువాత కదా అంబటి కూడా ఆవేశానికిలోనై ప్రతి దూషణకు దిగింది. అయితే ఆ వెంటనే ఆయన తన తప్పు తెలుసుకుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా... తాను ‘ఆ’ మాటలు అన్నది చంద్రబాబును ఉద్దేశించి కాదని కూడా స్పష్టం చేశారు. తనను అదే మాటలతో తిట్టిన వారినే తాను దూషించానని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ వారు వైసీపీ కార్యాలయం, అంబటి ఇంటిపై దాడులకు తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. ఇళ్లపై దాడులు చేసి కార్లు, ఫర్నీచర్ పగులగొట్టిన టీడీపీ వాళ్లు అమాయకులు, శాంతికాముకులని చెప్పడం చంద్రబాబు మాటల్లోని ఉద్దేశమా? అంబటిపై జరిగింది హత్యా యత్నం! ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్న కొన్ని గంటలకే అంబటి ఇంటిపై దాడి జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా? పైగా దీనికి నేతృత్వం వహించింది స్వయానా టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త. సిగ్గుచేటు. అంబటి దొరికి ఉంటే.. చంపేసేవారమని టీడీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఎవరు ఎవరి ట్రాప్లోపడ్డట్టు? బాధితులు ఎవరు?.. అంబటి భార్య, కుమార్తెలు ఇంటిలో ఉంటే మహిళా ఎమ్మెల్యే ఆద్వర్యంలో దాడి చేస్తారా? వారిని భయభ్రాంతులను చేస్తారా? వారు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్ల్రీల పట్ల కూడా కనికరం లేకుండా చంద్రబాబు మాట్లాడడమా! దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంత పాడడమా! ఎంత అన్యాయం. రెచ్చగొట్టేది, హింసకు తెగబడేది, బూతులు తిట్టేది, విధ్వంసం చేసేది టీడీపీ వారే. ఆఖరికి విధ్వంసకారులకు పోలీసులు తోడుగా నిలబడటం, రక్షించాలని వేడుకున్నా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి దర్పణంగా నిలిచింది. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి, చివరికి బాధితుడైన రాంబాబును అరెస్టు చేసి రిమాండ్కు పంపడం ఎంత దారుణం? ఇలాంటి ఘటనలే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువును పలుచన చేస్తున్నది? జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా ఈ ఘటనపై స్పందించిందంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత టర్మ్లోనూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో ఎలా వేధించిందీ, ఆయన కుటుంబ మహిళలను ఎంత దారుణంగా దూషించిందీ కంటతడి పెట్టుకుని ముద్రగడే ఆవేదనతో చెప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో కాపు నాయకుడు అంబటి రాంబాబు కుటుంబంపై టీడీపీ గూండాలు దాడి చేయడం సహజంగానే ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అంబటి కుమార్తె మౌనిక ఒక ప్రశ్న వేశారు. తన తండ్రి ఆ క్షణంలో ఆవేశానికిలోనై ఒక మాట అన్నా... వెంటనే సారీ చెప్పారని, చంద్రబాబు గతంలో వైసీపీ నేత జగన్ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఒక కాపు మహిళపై దాడికి తెగబడితే కనీసం ప్రశ్నించలేవా? అని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ను నిలదీశారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. టీడీపీ సోషల్ మీడియా వారు తన కుటుంబాన్ని దూషిస్తూ పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసేందుకు అంబటి సాక్షాత్తూ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో మాజీమంత్రి జోగి రమేష్ మంత్రి లోకేశ్ను రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారు. ఇలా దాడి చేసినవారి వెంట పోలీసులు ఉన్నా కనీసం ఆపే యత్నం చేయలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ బస్సులు దగ్దం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బంద్లలో హింస ఎలా చేయాలో చంద్రబాబు చెప్పేవారని తెలిపిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హింసలకు టీడీపీ తెగబడుతోందంటే అధికార అహంకారంతో కాక మరేమిటి? చంద్రబాబు, లోకేశ్ల ప్రోద్బలం కాదని ఎవరైనా అనుకుంటారా? ఇలా ఈ రెండేళ్లలో కనీసం ఇరవై మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసింది లెక్క చెప్పలేం. తిరిగి వీరిపైనే కేసులు పెట్టే ధోరణి ఇప్పడే చూస్తున్నాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది. రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినాఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనినపొగడరా నీతల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. సాగు, తాగునీటికి గేట్ వే! సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరారు.తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ను శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్ భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్ జగన్ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. అడుగడుగునా అడ్డంకులుశ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక సంజీవనిగా జగన్ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఇక ఇన్సూరెన్స్ పాలసీగా భావించి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు!రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. యావత్ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం.రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం! భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు(నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’) -
రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!
వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు.. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వం ఎత్తులు వేసే కొద్దీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది తప్ప ఇసుమంతైన తగ్గడం లేదు. కేవలం 40 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటకు పైనే సమయం.. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!తెలుగుదేశం గుండాల దాడిలో విధ్వంసానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించేందుకు తాడేపల్లిలో బయలుదేరిన వైఎస్ జగన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు చేరేందుకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. జననేతకు అడుగడుగునా వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు నీరాజనం పట్టారు. నిన్నటికి నిన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాలో మాట్లాడుతూ ఎవరికైనా దమ్ముంటే గుంటూరు రావాలని వస్తే వాళ్ళ లెక్క తేలుస్తామని హెచ్చరించారు. ఈసారి మేం చేసే విధ్వంసం చూస్తే వారి ఆస్తులు అమ్ముకున్న రికవరీ కాలేరు అంటూ గమ్మత్తైన వార్నింగులు ఇచ్చారు. అయితే ఇవేవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, బాబు జంగిల్ రాజ్ పాలనపైనా ఆగ్రహంతో ఉన్న సామాన్య ప్రజలను కానీ ఆపలేకపోయాయి. తాడేపల్లి, వడ్డేశ్వరం, నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ గేటు, మంగళగిరి మీదుగా గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్ వెంట అశేషమైన ప్రజావాహిని తరలి వెళ్లింది. పోలీసులు ఎక్కడికి అక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించాలని చూసినప్పటికీ వేలాదిగా కార్లు మోటార్ సైకిళ్లలో అభిమానులు జగన్ను అనుసరించారు. తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయం చేసి.. ప్రజల్లో వైఎస్సార్సీపీని, జగన్ను పలుచన చేయడానికి చంద్రబాబు ఆయన మీడియా ఎన్నో ఎత్తులు వేసింది. కానీ, అవేవీ ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయని జగన్ వెంట ఇవాళ నడిచిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది.కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతప్రభుత్వ ఏర్పడిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఎన్నడూ చూడలేదని జగన్ పర్యటనను దూరం నుంచి చూస్తున్న కొందరు పోలీసులే చెబుతున్నారు. జగన్ వెంట వేలాదిగా వచ్చిన వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదని, సామాన్యమైన ప్రజలు మహిళలు యువత విద్యార్థులు సైతం ఉన్నారని ఇది కచ్చితంగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూటమి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. జగన్ వెంట జనం సాధారణమైన విషయమే. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు ఆందో ళనలు ఉద్యమాలు చేపట్టింది. అంతేకాకుండా అధినేత వైఎస్ జగన్ సైతం పలు పరామర్శలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంలో కూడా ప్రజలు అభిమానులు విపరీతంగా ఆయన వెంట పరుగులు తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వైయస్ జగన్ గుంటూరు పర్యటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది అని పోలీసు వర్గాల్లోనే అంతర్గత చర్చ నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ జనాదరణను చూసి కచ్చితంగా భయపడరంటారా?. వైఎస్ జగన్ వెంట ఇసుకేస్తే రాలనంత జనం చూస్తుంటే ఇది మరో ప్రజా ఉద్యమంలా ఉందని తటస్థ ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.::సిమ్మాదిరప్పన్న -
రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా?
కృష్ణా, గోదావరి, వంశధార నదీ జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కన్నా స్వప్రయోజనాలే తనకు ప్రధానమని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనకు తానుగానే చాటుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 3న ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని చంద్రబాబు ఖండించకపోగా... రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదంటూ తెగేసి చెప్పడం ద్వారా రేవంత్ చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. రేవంత్తో కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయడంపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పూర్తయితే ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందే ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల వద్ద అమర్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. వాటికి 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆ ప్రాజెక్టుల కింద 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత డిజైన్ ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. 881 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉండే రోజులు బాగా తగ్గాయి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు... 841 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అంత కంటే నీటిమట్టం తగ్గితే... ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడానికి ఆస్కారం ఉండదు.వాటా జలాలను వాడుకోవడానికే...కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకముందే జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 777 అడుగుల నుంచి 825 అడుగుల నీటిమట్టం లోపే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 7 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. అంటే... జూరాల, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగం తొలి ప్రాధాన్యం తాగునీటికే! ఆ తర్వాత సాగునీరు!! శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు... అదీ కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు నీటిని మాత్రమే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించవచ్చు. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే... దిగువన నీటి అవసరాలు లేకున్నా సరే... శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం దిగువ నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చి నట్టుగా తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వరద ప్రవాహం నిలిచిపోయాక కూడా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడగులకు దిగువకు చేరుకుంటోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాటిని వాడుకోలేని దుఃస్థితి. 2014–19 మధ్య రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగనివ్వకుండా... ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగించుకోవడానికే 2020 మే 5న రూ.3,850 కోట్ల వ్యయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఎత్తిపోతల రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ!శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసి... ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టులో పంటలను రక్షించడం... రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తి పోతలను చేపట్టి... పనులను పరుగులెత్తించారు. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు రైతులు నీరాజనాలు పలుకుతారని గ్రహించిన చంద్రబాబు... మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్కడి రైతుల ద్వారా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేయించారు. సీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆ కేసులు వేయించారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ... ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదనీ ఎన్జీటీలో వైఎస్సార్సీపీ సర్కార్ సమర్థ వంతంగా వాదనలు వినిపించింది. కానీ... పర్యావరణ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే రాయలసీమ ఎత్తిపోతల పనులను వైఎస్సార్సీపీ సర్కార్ పరుగులు పెట్టించింది. మళ్లీ దీనిపై ఎన్జీటీలో చంద్రబాబు కేసులు వేయించారు. వాటిని ఎదుర్కొంటూనే... పర్యావరణ అను మతి కోసం ప్రయత్నిస్తూనే... తాగునీటి అవసరాల కోసం 58 టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను తొలుత పూర్తి చేయాలని 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మే వరకూ పనులు జరిగాయి. వాటిని చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిన ఎం–బుక్కులే అందుకు నిదర్శనం. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని గాలేరు– నగరి, హంద్రీ–నీవాను అనుసంధానం చేయడం ద్వారా తీసుకెళ్లి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని హంద్రీ–నీవా రెండో దశ ఆయకట్టుకు అందించి... శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే 40 టీఎంసీలను కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయకట్టుకు అందించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. 2024 జూన్ 12న చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తి స్థాయిలో ఆపేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటన్నది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతమే!ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు తొలి సారిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాననీ, అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవెగౌడను తానే పీఎంను చేశాననీ చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటారు. కానీ... అదే సమయంలో ఆనకట్టగా ఉన్న ఆల్మట్టిని కర్ణాటక రిజర్వాయర్గా మార్చేసి... దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 53 నుంచి 129 టీఎంసీలకు పెంచేసినా నోరు మెదపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కర్ణాటకకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఆల్మట్టి సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలానికి జూన్ నెలా ఖరుకు రావాల్సిన వరద జూలై చివరకు... ఆగస్టు మొదటి వారానికి గానీ రావడం లేదు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కాలపరిధి 2000తో ముగు స్తుందనీ, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేస్తారనీ, ఆంధ్ర ప్రాంతంలో వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగా ణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ వంటి ప్రాజెక్టులను చేపడితే వాటికి నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ చేస్తుందనీ అప్పటి సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపు ణులు అనేక మార్లు విఙ్ఞప్తులు చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు. అప్పట్లో వాటిని చేపట్టి ఉంటే... తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయించినట్లే ఆ ప్రాజెక్టులకు కూడా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేది.పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే!గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ నీటిమట్టంతో పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 2021 జూన్ 11 నాటికే స్పిల్ వేను అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను మాత్రమే ఆంధప్రదేశ్ సర్కార్కు విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కేబినెట్ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబు సర్కార్ కూడా దానిపై అభ్యంతరం చెప్పలేదు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల ఎత్తు వరకు కేవలం 119.4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇక 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే... పోలవరం కుడి, ఎడమ కాలువ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడానికి వీలుంటుందని సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్పష్టం చేస్తోంది. పోలవరం రిజర్వా యర్ను బ్యారేజ్గా మార్చేయడం వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు మళ్లించడానికీ ఆస్కారం ఉండదు. జీవనాడి పోలవరంలో జీవం తీసేసి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇక వంశధార జలాలపై రాష్ట్ర హక్కులను వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను 2004 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి పరిరక్షించారు. ఆ ప్రాజెక్టు వల్లే వంశధారలో 75 శాతం నీటి లభ్యతగా ఉన్న 115 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ బ్యారేజీ నిర్మాణం కోసం 2021 నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతూనే... వంశధార జలాలను పూర్తి స్థాయిలో వాడుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేందుకు హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 40 శాతం పనులు పూర్తి చేశారు. కానీ... 2024 జూన్ 12 తర్వాత ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు సర్కార్ ఆపేయడం ద్వారా వంశధార ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేసింది.– ఆర్.జి.ఆర్. -
మరీ ఇంతలా దిగజారాలా?
ఏపీలో కూటమి నేతల ప్రసంగాలకు వాస్తవిక పరిస్థితులకు మధ్య అస్సలు పోలికే ఉండటం లేదు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత కూడా అబద్ధాలు వల్లెవేయించడం కూటమి నేతల దిగజారుడు తనానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్నేళ్లుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోయిందని చదివించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం క్షీణించిందని గత ప్రభుత్వంపై విమర్శలు చేయించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా ఆవిష్కరణ, సంస్కరణలు, సమీక్షలు చేస్తోందని, వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గవర్నర్తో పలికించారు. రాష్ట్రం కోలుకుంటోందని, మార్పు వైపు ప్రయాణం మొదలైందని, స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలను అమలు చేస్తున్నామని అనిపించారు. గవర్నర్ మాటలలో కొత్తదనం లేకపోవడం ఒక ఎత్తు అయితే.. గత ప్రభుత్వంపై బురదచల్లడం, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తోందన్న భ్రమ కల్పించడానికి ఈ ప్రసంగాన్ని వాడుకోవడం ఇంకో ఎత్తు. సాధారణంగా గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల వంటి జాతీయ ఉత్సవాలలో అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు చేసింది చెబుతూంటారు. గవర్నర్ ప్రసంగంలో ఆ భాగం ఉన్నట్లు మీడియాలో కనిపించలేదు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు తరచు అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. గవర్నర్తో కూడా ఆ మాట చెప్పించి ఉండకపోతే అది మంచి విషయమే.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు ఇప్పటికైతే గాలికి వదిలేసినట్టుగానే ఉంది. కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆవిష్కరణలు ఏమిటో, అభివృద్ది పునరుద్దరణ ఎక్కడ జరిగిందో ఎవరికి కనిపించదు. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పలు వ్యవస్థలను నీరు కార్చడం, వాటి పేర్లు మార్చి తామే కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఓడరేవులు, మెడికల్ కాలేజీలు నిర్మాణం నిలిపి వేయడం అభివృద్ది ఎలా అవుతుంది? గవర్నర్ తన స్పీచ్లో రాష్ట్రంలో మార్పు మొదలైందని అనడంలో కూటమి ఉద్దేశం ఏమిటో కాని ఆ మార్పు ప్రజలకు అనుకూలమైనదా? వ్యతిరేకమైనదా? అన్నది సమీక్షించుకోవాలి. విశాఖపట్నంలో తమ సమీప బంధువు, లోక్సభ సభ్యుడు శ్రీభరత్కు చెందిన గీతం కాలేజీ ఆక్రమించిన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించడానికి కార్పొరేషన్ చర్చ లేకుండా తీర్మానం చేయడం ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు కాబోలు. ఇందుకోసం ఫిరాయింపుల ద్వారా విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం మరో మార్పుగా భావించాలి. ఈ భూమి విలువ సుమారు రూ.ఐదువేల కోట్లు అంటున్నారు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అన్న చిన్నపాటి సంశయాన్ని కూడా వదిలేసి అధికారం అండగా బంధుప్రీతికి పాల్పడటం కూటమి తాలూకూ లేటెస్ట్ మార్పు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ వంటి వారి అభ్యంతరాలను పెడచెవిన పెట్టడం మరో మార్పు. విశాఖలో ఒక మీడియా సంస్థకు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కట్టబెట్టారని వార్తలు వచ్చాయి. ఇదే విశాఖలో వేలాది మంది నివసిస్తున్న దేవాలయ, ప్రభుత్వ భూములను రెగ్యులైరైజ్ చేయకపోవడం గీతం కాలేజీ యాజమాన్యంతోపాటు కొందరు నేతలు,పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేసిన భూములను గత వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, వాటిని ఆక్రమణదారులకే ధారాదత్తం చేయడానికి వెనుకాడకపోవడం ఏ రకమైన మార్పో? వైసీపీ పాలన సమయంలో విజయసాయిరెడ్డి బంధువులు భూమి కొనుగోలు చేసినా, అదంతా దందా అని ప్రచారం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు ఈ కబ్జాలకు వంత పాడుతుండడం కూడా మార్పే. గవర్నర్ ప్రసంగం ద్వారా అమరావతి రాజధానితోనే అన్ని జరిగిపోతాయన్న భ్రమ కల్పించే యత్నం చేశారు. ఆ క్రమంలో మళ్లీ సుమారు లక్షన్నర ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం తలపెట్టడంపై అక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న దానిపై మాత్రం భరోసా ఇచ్చినట్లు కనిపించలేదు. కేంద్రం ఏదో అమరావతిని అవకాశాల గని అని పేర్కొందని ఎల్లో మీడియా తెలిపింది. ఒకప్పుడు కాణి ప్రభుత్వ ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అప్పుల ఊబిలో దింపుతున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమా? కాదా? అన్న దానిపై గవర్నర్తో వివరణ ఇప్పించి ఉంటే సబబుగా ఉండేది!. పేదరికం లేని సమాజం, ఉపాధి నైపుణ్యం, జనాభా నిర్వహణ, నీటి భద్రత, రైతులకు అగ్రిటెక్, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్వచ్ఛాంధ్ర, సేఫ్ ఆంధ్ర, డీప్ టెక్ అండ్ స్మార్ట్ గవర్నెన్స్ అంటూ పడికట్టు పదాలను గవర్నర్ స్పీచ్ వాడారు. వీటితో ఏపీ స్వర్ణాంధ్రగా మారిపోతుందని ప్రజలను నమ్మమంటున్నారు. కాని ఇది నిత్యం చెప్పే అబద్దాలలో భాగమేనని ప్రజలకు తెలియదా! సమాన అవకాశాలు కల సమాజాన్ని నిర్మిస్తున్నామని గవర్నర్తో చెప్పించారంటే అంతకన్నా పెద్ద అసత్యం ఉంటుందా? ప్రభుత్వం నిర్మించవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. విశాఖలో అతి ఖరీదైన ప్రభుత్వ భూములను పెద్ద, పెద్ద కంపెనీలకు వారు అడగకపోయినా 99 పైసలకే కట్టబెడుతున్నారు. ఇది అన్నిటికంటే అతి పెద్ద మార్పుగా ఏపీ ప్రజలు చూస్తున్నారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కేవలం అమరావతిలోనే వ్యయం చేస్తున్నారు. హామీలు అమలు చేయండంటే పీపీపీ అంటున్నారు. అప్పులు, అవస్థలు ప్రజలకు, ప్రభుత్వ సంపదను కొంతమంది బడాబాబులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరుతో ఎంతటి అరాచక పరిస్థితులు నెలకొన్నాయో క్షీణించిన శాంతిభద్రతలు చెబుతాయి. చివరికి అనుచితమైన విద్వేషపూరిత రాతలన్న ఫ్లెక్సీలకు టీడీపీ గూండాలు కర్రలు పట్టుకుని కాపలా కాస్తుంటే, పోలీసులు భద్రత కల్పించడమే మహా మార్పు. పంతొమ్మిది నెలల్లో తెచ్చిన రూ.మూడు లక్షల కోట్లకుపైగా అప్పులతో రాష్ట్రం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సేఫ్ గా ఉందని అనుకోవాలా? లేక అన్సేఫ్గా మారుతోందని భయం కలుగుతుందా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆర్థిక క్రమశిక్షణ
ఇప్పటికే అమలులో ఉన్న నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగింపు, మౌలిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయడం, తయారీ రంగాన్ని పటిష్ఠపరచడం, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడం దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆర్థిక లోటు 2025–26లో జీడీపీలో 4.4 శాతం కాగా, 2026–27లో 4.3 శాతంగా ప్రతిపాదించడం, కేంద్ర ప్రభుత్వ రుణంలోనూ 2025–26తో పోల్చినప్పుడు (జీడీపీలో 56.1 శాతం), 2026–27లో జీడీపీలో 55 శాతంగా ప్రతిపాదించడం ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా పేర్కొనవచ్చు. ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారం తగ్గి ప్రాధా న్యతా రంగాలకు అధిక వనరులు సమకూరడంతోపాటు ద్రవ్యోల్బణంలో క్షీణత, స్థిర స్థూల ఆర్థిక వాతావరణం లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మరోవైపు సంక్షేమంపై వ్యయం తగ్గినట్లయితే వినియోగం, సమష్టి డిమాండ్పై ప్రతికూల ప్రభావం పడుతుంది.కనెక్టివిటీ సానుకూలంఆర్థిక వృద్ధి సాధనలో ప్రధాన అంశమైన మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఏడు కొత్త హై–స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ చర్యతో రోజువారీ ప్రయాణ సౌకర్యాల మెరుగుదల, ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాల మెరుగుదల, వివిధ ప్రాంతాల మధ్య వస్తు ప్రవాహం, ఉత్పాదకత పెరుగుదల, ప్రయాణ సమయాలలో తగ్గుదల వలన ‘ఆర్థిక హబ్’ల మధ్య కనెక్టివిటీ లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కారిడార్ల నిర్మాణం వలన తయారీ రంగం, సేవలు, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 2025–26 బడ్జెట్తో పోల్చినప్పుడు 2026–27 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయంలో పెరుగుదలను 11.5 శాతంగా ప్రతిపాదించారు. తద్వారా నిర్మాణ రంగం, సిమెంటు, స్టీల్, యంత్రాలు, సేవలకు సంబంధించి డిమాండ్లో పెరుగుదల ఏర్పడవచ్చు. నిర్మాణ రంగంలోని శ్రామికులకు ప్రత్యక్షంగా ఉపాధి పెరగడంతోపాటు, లాజిస్టిక్స్; సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సప్లయ్ గొలు సులో పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఎక్కువవు తాయి. మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వ పెట్టుబడు లలో పెరుగుదల వలన ప్రైవేటు సంస్థల వ్యయం, నష్ట భయం తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలంలో పురోగమించడం ద్వారా 5 ట్రిలియన్ డాలర్ లక్ష్య సాధనకు వీలవుతుంది. ఈక్విటీ డెరివేటివ్స్ అయిన ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీల లావాదేవీ పన్నును పెంచడం వలన నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్లో క్షీణత ఏర్పడింది. సెక్యూరిటీల లావాదేవీల పన్నును పెంచడంలో ట్రేడింగ్ కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయి. పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంపొందించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడు (ఎఫ్ఐఐ)లను ఆకర్షించడంతో పాటు, ఉన్న పెట్టుబడులను నిలుపుకొనే విధంగా చర్యలు తీసుకోవడం, రాబోయే రోజుల్లో కార్పొరేటు రాబడులు మెరుగవు తాయనే విశ్వాసం కల్పించడం లాంటి అంశాలు మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడతాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జి),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
బాబోయ్.. ఇదేం పాలన అంటున్న కూటమి అభిమానులు!
ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కూటమి పాలనపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్య అన్ని విధాలుగా తగినదే. రాజకీయాల్లో తన అనుభవం చాలా పెద్దదని తరచూ చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా, నాసిరకంగా చేయగలరని బహుశా ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రజాస్వామ్య విలువలకు కూటమి పాలనలో నిత్యం తిలోదకాలే. ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ కారణంతోనే ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ మిత్రుడు కూడా ‘‘అబ్బే ఇదేం పాలనండి.. చాలా ఘోరంగా ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’’ అని చెప్పగలుగుతున్నారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి వచ్చిన తరువాత ఆయనీ వ్యాఖ్య చేయడం గమనార్హం. అసలక్కడ ప్రభుత్వమనేది ఒకటుందా? పనిచేస్తుందా? అన్న అనుమానం వచ్చిందని, ఎటు చూసినా అధికార పార్టీ కార్యకర్తల అరాచకాలే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ అంచనా ఈయన ఒక్కరిదే కాదు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్కడి అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై సాగుతోన్న అణచివేత ధోరణి, అక్రమ కేసులు, అరెస్టులపై ప్రజల్లోనూ తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిత్యం బొంకుతూండటం, మంత్రి లోకేశ్ అహంభావ పూరిత ప్రకటనలు, జనసేన అధినేత, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఊదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూండటం ప్రజల నైరాశ్యానికి కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. హంగు, ఆర్భాటాలు, వసతులు కల్పించి విధేయుడిగా మార్చుకోవడం ద్వారా పవన్ ప్రశ్నించలేని స్థితికి చేర్చారని అంచనా. కానీ చంద్రబాబుకు తన కుమారుడిని నియంత్రించే శక్తి లేకుండా పోయిందన్నది టీడీపీలో ఒక వర్గం అభిప్రాయం. లోకేశ్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు సంబంధం లేని హోం శాఖపై లోకేశ్ పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేశ్ను పొగడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది. ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగ్లలో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. కోడిని కోశారంటూ వైపీసీ కార్యకర్తలపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రోడ్డుమీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది ఆ పార్టీ విమర్శ. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు బీభత్సంగా కోడిపందాలు ఆడించి, వందల కోట్ల రూపాయల మేర పందాలు నడిపించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు దగ్గరుండి కత్తులు కట్టించి కోడి పందాలు జరపడం, అక్కడ అన్ని రకాల జూదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్లెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి, వేలాది మంది అక్కడ జమ కూడుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడకు వెళ్లి పందాలు కాసినా, పోలీసు వ్యవస్థ కాని, ఈడి వంటి సంస్థలు కాని అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవ్వరిని పట్టుకుని రోడ్డుమీద నడిపించలేదు. రికార్డింగ్ డాన్స్ల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు ఆపలేదు.పైగా ఒక అధికారి ఎలా పాటపాడాలో, డాన్స్ చేయాలో చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ రికార్డు డాన్స్లో భాగస్వామి అవడంపై లోకేశ్ ఆగ్రహించారట. చివరికి పులివెందులలో కూడా టీడీపీ నేత మూడు కోట్లు వసూలు చేసి కోడి పందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కూన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవలే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్లు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరపెట్టుకున్నా, ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియ చేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది. మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడన్న కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్, లోకేష్.. ఈ ముగ్గురు నేతలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించబోగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగారి పీఏపై ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్తో పట్టుబడడం.. ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న అభియోగాలు రావడం, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి ఈ ప్రభుత్వం జంగిల్ రాజ్ గా మారిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా తరిమేశారట. ఇలా ఒకటి కాదు.అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్ని వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జంగిల్ రాజ్ అన్న పేరు అతికినట్టు సరిపోతుందన్నమాట!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అతి విశ్వాసంతో స్వారీ
మొత్తంగా చూస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ 2026–27... ప్రధానంగా నమ్మకం, ఆశ, దృఢ విశ్వాసం వంటి వాటిపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కూడా ఆశించిన మేర ఆదాయ అంచనాలను చేరుకోలేదు. దీనిని బట్టి ప్రభుత్వపరంగానూ ఆయా అంశాలు, రంగాల్లో ఆశించిన మేర పెట్టుబడులు, ఖర్చు పెట్టలేదు. గత బడ్జెట్లోనూ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించినా అందులో రూ. 200 కోట్లు కూడా ఖర్చుచేయలేదని ఆ రంగానికి చెందినవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ప్రైవేట్ రంగం నుంచి ఆశించిన మేర పెట్టుబడులు రాకపోతే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెట్టిన పెట్టుబడులు ఏ మేరకు ఉపయోగపడతాయనేది చర్చనీయాంశమవుతోంది. మన బడ్జెట్లన్నీ కూడా ఎక్కువ మటుకు పెట్టుబడి దారులకు అనుకూలంగానే ఉంటున్నాయి. వీటిపై సమ తూకం సాధించే క్రమంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామనీ, దీనినుంచి మంచి ఫలితాలు వస్తా యనీ చెబుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతుందనేది చూడాల్సి ఉంది. 7.5 కోట్ల యూనిట్లలో 32 కోట్ల మంది ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నందున, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలు కూడా క్రియా శీలమై కొంత శాతం ఉపాధిని కల్పిస్తే వీటి పునరుద్ధరణ జరిగే అవకాశాలున్నాయి. జాతీయస్థాయిలో 6.4 శాతం నుంచి 7.2 శాతం దాకా వృద్ధిరేటు సాధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా... ఈ వృద్ధి నుంచి ఏ వర్గానికి ఎంత పంపిణీ అవుతుందనేది ముఖ్యం. కొన్నేళు్లగా చూస్తే మన వృద్ధి ఎగుడుదిగుళ్లు గానే ఉంటోంది. ఉదాహరణకు.. తాజా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం చూస్తే... మొత్తం వంద రూపాయల జీడీపీ ఉత్పత్తిలో పై వర్గానికి 60 శాతం, మధ్య తరగతికి 25 శాతం, దిగువన ఉన్న వారికి 15 శాతం వస్తోంది. అధిక ఆదాయం పొందుతున్న వారు కొంత అధిక పన్ను కట్టాల్సి ఉండగా ఈ వర్గాన్ని ముట్టుకునే సాహసం చేయడం లేదు. అదీగాకుండా ఆరోగ్య రంగం విషయాని కొస్తే... మెడికల్ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా డబ్బు భరించగలిగిన విదేశీయులకు నాణ్యతా పరమైన వైద్యసేవలు అందించి, దేశంలోని పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేయలేని సామాన్యులకు ఆ నాణ్యమైన వైద్య సేవలు ఏవనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ పౌరు లందరికీ సమానమైన వైద్య సేవలను అందించి... అప్పుడు వ్యాపారం చేస్తే బాగుంటుంది. బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా, దానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల్లో గత కొన్నేళ్లలో ఎలాంటి వృద్ధీ లేదు. దీనికి భిన్నంగా భారత పెట్టుబడిదారులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఎక్కువైంది. దేశీయంగా తగిన డిమాండ్ లేదనీ, తమ పరి శ్రమల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం లేదనీ వారు చెబుతున్నారు. తాజాగా బడ్జెట్లో... విదేశాల్లో పెట్టుబడులపై నిబంధనలను మరింతగా సులభతరం చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం కంటే కూడా ఇక్కడి నుంచి బయటి దేశాల్లో పెట్టే పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశీయంగా కేంద్రప్రభుత్వం మాత్రమే పెట్టు బడులు పెడుతోంది. మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు గతేడాది రూ.11.20 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది రూ.12.25 లక్షల కోట్లకు పెంచుతామని బడ్జెట్లో ప్రతిపాదించారు. వృద్ధిరేటును నిలబెట్టేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వపరంగా రోడ్లు, కమ్యూ నికేషన్లు, తదితరాలన్నీ చేస్తుంటే దానిని ప్రోత్సాహకంగా తీసుకుని, ప్రైవేట్ పెట్టుబడులు రావాలి. కానీ అవి రావడం లేదు. మెరుగైన ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేటు వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం అతి విశ్వాసం, నమ్మకం పెట్టుకోవడం వల్ల మిగతా ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా దేశ రక్షణ బడ్జెట్ను ఒక్కసారిగా రూ.27 లక్షల కోట్లు (గతం కంటే 21 శాతం పెంపుదల) ప్రతిపాదించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా విజయం సాధించామనే భావనతో ఈ రంగానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, వృద్ధి రేటు 6–7 శాతం మధ్యలో ఉండటం కలిసొచ్చే అంశాలు. ప్రొఫెసర్ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్సీయూ స్కూల్ ఆఫ్ సోషల్సైన్సెస్ మాజీ డీన్ -
సాగుకు ఒరిగేది తక్కువే!
డిజిటల్ వ్యవసాయం ద్వారా అద్భుతం సాధిస్తున్నామని చెబు తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణి బడ్జెట్ కేటాయింపుల్లోనూ కనిపించింది. అయితే భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్ల పట్ల బడ్జెట్లో ప్రతి స్పందన దాదాపు శూన్యం అని చెప్పాలి. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఒత్తిడి, తగ్గుతున్న మార్కెట్ రాబడి కారణంగా రైతు ఆదాయాలు తరుగుతున్నాయి. పెరుగుతున్న వివిధ పంటల దిగుమతి, అమెరికా దేశం నుంచి ఒత్తిళ్లను ఆర్థిక సర్వే 2025–26 అంగీకరించినా బడ్జెట్లో కనీస స్పందన లేదు.పెరుగుతున్న వాతావరణ ప్రభావానికి, ప్రభుత్వ పెట్టుబడుల మధ్య పొంతన అసలు లేదు. ఆశించినట్టుగా 2026 –27 బడ్జెట్లో సహజ వ్యవసాయం వంటి పైలట్ కార్యక్రమాలకు నిధులను గణనీయంగా పెంచినట్లు కనిపించడం లేదు. డిజిటల్ వ్యవ సాయం మీద పెట్టుబడుల వల్ల ఒరిగేది చాలా తక్కువ. డిజిటల్ టెక్నాలజీ కేవలం ప్రకృతి వైపరీత్యాల గురించి హెచ్చరించడానికి మాత్రమే పనికొస్తుంది. స్థిరమైన పంటల ఉత్పత్తి ఉన్నప్పటికీ రైతు ఆదాయ సంక్షోభాన్ని పరిష్క రించడంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ–నామ్, ధరల డ్యాష్బోర్డ్లు, గిడ్డంగి రసీదు వ్యవస్థలు వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు రైతుల సమస్యలను పరిష్కరించడం లేదు.ధరల స్థిరీకరణ, వైవిధ్యభరితమైన సేకరణ, వ్యవసాయ–ప్రాసెసింగ్ సామర్థ్యం, మార్కెట్ కార్యకలాపాలలో బలమైన ప్రభుత్వ జోక్యం లేకుండా... డిజిటల్ వ్యవస్థలనేవి రైతుల ఆదాయాలను రక్షించడం కంటే ధరలను అస్థిర పరచేందుకే అవకాశం ఎక్కువ ఉంది. వ్యవసాయానికి ఇచ్చిన మొత్తం నికర కేటాయింపు రూ.1,30,561 కోట్లు (2025–26 సవరించిన బడ్జెట్ కేటాయింపు కన్నా 6% ఎక్కువ). ఇందులో ప్రధానంగా ‘పీఎమ్– కిసాన్ సమ్మాన్ నిధి’కి రూ. 63,500 కోట్లు (49%), వడ్డీ సబ్సిడీలకు రూ. 22,600 కోట్లు (17%),పంట బీమా (పీఎమ్ఎఫ్బీవై)కు రూ. 12,200 కోట్లు (9%) కేటాయింపులు జరిగాయి.‘కృషియోన్నతి యోజన’కు కేటాయింపులు 65% (రూ. 6,800 నుండి 11,200 కోట్లకు) పెరిగాయి. ఇందులో కొత్తగా ‘కూరగాయలు/ పండ్ల మిషన్ ’ ఉంది. సహజ వ్యవసాయ మిషన్కు ఇచ్చిన నిధులలో కేవలం 3% వృద్ధి (రూ.725 నుండి 750 కోట్లకు) మాత్రమే ఉంది. ఇక, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 41% కేటాయింపులు పెరిగాయి.వడ్డీ చెల్లింపుల భారంబడ్జెట్లో కొత్త కార్యక్రమాలు (2026–27) చూస్తే... ‘భారత్–విస్తార్’ అనే బహుభాషా ఏఐ సాధనం ఏర్పాటుకు రూ. 150 కోట్ల కేటాయింపు జరిగింది. ఇది రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సాయం చేస్తుందని భావిస్తు న్నారు. అధిక విలువ కలిగిన వ్యవసాయ పంటలకు మద్దతు పేరిట తీరప్రాంత/కొండ ప్రాంతాలలో కొబ్బరి, గంధపు చెట్ల పెంపకానికి రూ. 350 కోట్లు ఇచ్చారు. మఖానా అభివృద్ధికి రూ. 90 కోట్లు ఇచ్చి, పసుపుకు మాత్రం ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదు.బడ్జెట్ వ్యూహాత్మక దృష్టి కేవలం డిజిటల్ వ్యవసా యానికి పరిమితం అయ్యింది. డ్రోన్లు, ఏఐ, డిజిటల్ వ్యవస్థల వంటివి భాగంగా ఉండే సాంకే తిక పరిజ్ఞానాన్ని వాడటం; ‘పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’కి అధిక నిధులను కేటాయించడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించడం, అధిక విలువ కలిగిన పంట లను వైవిధ్యీకరించడం, సహజ వ్యవసాయ పరి వర్తనకు స్థిరమైన నిధులను అందు బాటులోకి తేవడం వంటి వాటికి బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది.మొత్తం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు కేటాయించినది 2.7% మాత్రమే! మొత్తం బడ్జెట్ ప్రాథమ్యాలతో పోలిస్తే... ప్రభుత్వం అప్పులపై వడ్డీ చెల్లింపుల (రూ. 14.4 లక్షల కోట్లు) పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. వ్యవసాయానికి రూ. 1.3 లక్షల కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వం మీద ఉన్న అప్పుల భారం అభివృద్ధి మీద వ్యయాన్ని పరి మితం చేస్తుందని స్పష్టం అవుతున్నది. వ్యవసాయ బడ్జెట్ నిరాడంబరమైన వృద్ధిని చూపుతోంది. వాస్తవ అభివృద్ధి/ వ్యవసాయ రంగ పరివర్తన వ్యయం కేవలం రూ. 33,000 కోట్లు మాత్రమే. ప్రభుత్వం ప్రతి 2 రోజులకు వడ్డీ చెల్లింపులపై చేసే ఖర్చు కన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.డా‘‘ దొంతి నరసింహారెడ్డివ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
జాబ్ స్ట్రెస్.. శత్రువే కాదు మిత్రుడు కూడా!
నేటి కార్పొరేట్ యుగంలో ’ఉద్యోగం’ అంటే కేవలం పని మాత్రమే కాదు, అదో నిరంతర యుద్ధం. ఉదయం అలారం మోగినప్పటి నుండి, ఆఫీసు డెడ్లైన్లు.. బాస్ నుంచి వచ్చే కాల్స్.. టార్గెట్లు.. పక్క సీటు సహోద్యోగితో పోటీ.. అర్ధరాత్రి బాస్ పంపే మెయిల్,,, అన్నీ కలిసి జాబ్ స్ట్రెస్. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగిని ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు వెంటాడే భూతం ఇది.అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఇది ఎప్పుడూ మనకు శత్రువేనా? అంటే కాదనే అంటాను. అది మిత్రుడిలా మనల్ని ముందుకు నడిపించగలదు, శత్రువులా మనల్ని కుంగదీయగలదు. ఆ తేడాను గుర్తించడమే ’ఉద్యోగ పర్వం’లో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం.శాస్త్రీయంగా ఒత్తిడి రెండు రకాలు.. 1. యూస్ట్రెస్ (పాజిటివ్ ఒత్తిడి): ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కలిగే చిన్నపాటి భయం, ఒక కొత్త బాధ్యత తీసుకున్నప్పుడు వచ్చే ఉత్సాహం. ఇది మనల్ని ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. ఇది మనకు ’మిత్రుడు’.2. డిస్ట్రెస్ (నెగటివ్ ఒత్తిడి): పని భారం మితిమీరినప్పుడు, భవిష్యత్తుపై అభద్రతాభావం కలిగినప్పుడు వచ్చేది. ఇది మన ఆరోగ్యాన్ని, పనితీరును దెబ్బతీస్తుంది. ఇది మన ’శత్రువు’.శత్రువుగా మారినప్పుడు సంకేతాలు..ఒత్తిడి మీ నియంత్రణ తప్పుతోందని చెప్పడానికి మీ శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది.· ఆఫీసు పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవ్వడం.· ఆకలి మందగించడం లేదా ’స్ట్రెస్ ఈటింగ్’ (ఒత్తిడిలో ఎక్కువగా తినడం).· ఏకాగ్రత కుదరకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు.· చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం· ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినా పని గురించి ఆలోచిస్తూ కుటుంబానికి దూరం కావడం.· నిద్రలేమి, తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు· పని మీద ఆసక్తి తగ్గిపోవడం.రాజేష్ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్. అద్భుతమైన పనితీరు ఉన్నప్పటికీ, గత ఆరు నెలలుగా అతను తీవ్రమైన మెడనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఆఫీసులో చిన్న విషయాలకే చిరాకు పడటం, ఇంటికి వెళ్ళాక పిల్లలతో సరిగ్గా గడపలేకపోవడం అతన్ని మానసిక వేదనకు గురిచేసింది. రాజేష్ తన టీమ్ చేసే ప్రతి చిన్న పనిని తానే పర్యవేక్షించాలనుకోవడం (Micromanagement ). ‘నేను లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది‘ అనే అపోహే అతని ఒత్తిడికి ప్రధాన కారణం. కౌన్సెలింగ్లో అతనికి ’డెలిగేషన్’ (పనిని ఇతరులకు అప్పగించడం), ’మైండ్ఫుల్నెస్’ టెక్నిక్స్ నేర్పించాం. మూడు నెలల తర్వాత, రాజేష్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అతని టీమ్ ఉత్పాదకత కూడా 30శాతం పెరిగింది.ఒత్తిడిని మిత్రుడిగా మార్చుకోవడానికి 5 సూత్రాలు..1. Circle of Control : మీరు మార్చగలిగే పనుల మీద (మీ పనితీరు, టైమ్ మేనేజ్మెంట్) దృష్టి పెట్టండి. మీరు మార్చలేని విషయాల గురించి (ఆర్థిక మాంద్యం, బాస్ మూడ్) చింతించడం మానేయండి.2. 2 మినిట్ బ్రీతింగ్: ఒత్తిడి పెరిగినప్పుడు 2 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇది మెదడులోని ’అమిగ్డాలా’ను శాంతపరిచి, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.3. డిజిటల్ డెటాక్స్: ఆఫీస్ సమయం ముగిశాక, కనీసం ఒక గంట పాటు ఫోన్ను పక్కన పెట్టండి. నోటిఫికేషన్ల మోత మీ మెదడును నిరంతరం అప్రమత్తంగా (Alert mode) ఉంచి ఒత్తిడిని పెంచుతుంది.4. శారీరక శ్రమ: కనీసం 20 నిమిషాల నడక మీ మెదడులో ’ఎండార్ఫిన్’లను విడుదల చేస్తుంది, ఇవి ఒత్తిడిని తగ్గించే సహజ సిద్ధమైన మందులు.5. Perfectionism వద్దు: అన్ని పనులూ 100శాతం పర్ఫెక్ట్గా ఉండాలనే పట్టుదల ఒత్తిడిని పెంచుతుంది. ’ఎక్సలెన్స్’ మీద దృష్టి పెట్టండి, పర్ఫెక్షన్ మీద కాదు.మీ కోసం చిన్న పరీక్ష.. ఈ క్రింది ప్రశ్నలకు ’అవును’ లేదా ’కాదు’ అని సమాధానం చెప్పుకోండి:· ఆదివారం సాయంత్రం నుంచే మీకు ఆఫీసు గురించి ఆందోళన మొదలవుతోందా?· పని ఒత్తిడి వల్ల మీ వ్యక్తిగత సంబంధాలు లేదా ఆరోగ్యం దెబ్బతింటున్నాయా?· విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీరు అపరాధ భావన (Guilt) కి గురవుతున్నారా?పై ప్రశ్నల్లో రెండింటికి ’అవును’ అనే సమాధానం వస్తే, మీరు మీ ఒత్తిడిని శత్రువుగా మార్చుకున్నారని అర్థం. ఒత్తిడిని జయించడం అంటే పనిని వదిలేయడం కాదు, పని చేసే విధానాన్ని మార్చుకోవడం. గుర్తుంచుకోండి. మీ కెరీర్ కంటే మీ ఆరోగ్యం.. మీ చిరునవ్వు చాలా విలువైంది.సైకాలజిస్ట్ విశేష్కెరీర్ – మైండ్సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి) రాయని డైరీ
మంచి టీమ్కి హెడ్గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్లోని వాళ్లు టీమ్లో ఉంటూనే హెడ్గా పని చేయాలి, హెడ్గా ఉన్నవాళ్లు హెడ్గా ఉంటూనే టీమ్లో పని చేయాలి. అప్పుడే మంచి హెడ్, మంచి టీమ్ తయారవుతారు! మునుపటి 8 బడ్జెట్లు కూడా నాకు ఇదే నేర్పించాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్సభలో నా 9వ బడ్జెట్. ఆర్థిక మంత్రిగా మాత్రమే ఇది నా బడ్జెట్. అసలు కసరత్తంతా నా టీమ్ది. కనుక, బడ్జెట్ సమర్పణ కూడా అదృశ్యంగా నా టీమ్దే అవుతుంది. సెక్రెటరీలు ఆరుగురు, అడ్వైజర్ ఒకరు... మొత్తం ఏడుగురు అపర చాణక్యులు!బడ్జెట్లో ఏముందో ఇంకొన్ని గంటల్లో దేశ ప్రజలకు తెలిసిపోతుంది. బడ్జెట్ను తయారు చేయటంలో నా టీమ్ కష్టం ఎంతుందో చెప్పాలంటే మాత్రం అది బడ్జెట్ ప్రసంగాన్ని మించిన ప్రసంగమే అవుతుంది! టీమ్లోని అనురాధా ఠాకూర్ ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ. బడ్జెట్ రూమ్లోకి ప్రవేశించిన తొలి మహిళ! నేటి బడ్జెట్కు ప్రాథమిక రూపశిల్పి. హల్వాను అడుగంటకుండా ఉడికించటంలోని వివిధ స్థాయుల సన్నని మంటల గురించి తెలిసిన నిపుణురాలు. ఇంట్లో మనుషుల్ని కదిలించకుండానే ఇంటి గదుల్ని, గోడల్ని పునర్నిర్మించగల నేర్పరి.అజయ్ సేuЇ ఫైనాన్స్ సెక్రెటరీ. గ్రాండ్ మాస్టర్! బడ్జెట్ టీమ్లోని సెక్రెటరీలందరికీ కెప్టెన్. ‘ఆర్థిక లోటు’ వార్నింగ్ సిగ్నల్ ఎర్రగా వెలిగి ఆరిపోతున్నా కూడా చలించని శాంత మనస్కుడైన పైలట్! అరవింద్ శ్రీవాత్సవ రెవిన్యూ సెక్రెటరీ. బడ్జెట్లో కొత్త ముఖం. ముక్కులుపిండకుండా, బుగ్గలు పుణికి పన్నులు వసూలు చేయగల టాక్స్ కలెక్టర్. బడ్జెట్ స్పీచ్లో పార్ట్–బి ఆయనదే. పన్నుల పెంపు, తగ్గింపు ఉండేది ఆ పార్ట్లోనే. డిన్నర్ బిల్లుని సమానంగా పంచే ధర్మరాజు. ఒకరెవరైనా అదనంగా ఆర్డర్ చేసి ఉంటే, వారికి అదనంగా ‘వడ్డించే’ నియమబద్ధుడు.ఉమ్లున్మాంగ్ ఉవల్నామ్ ‘ఎక్స్పెండిచర్’ సెక్రెటరీ. ప్రభుత్వాన్ని దేనినీ కొననివ్వరు. ఏం అడిగినా సరే, ‘ఇప్పుడు కాదు బాస్’ అనేస్తారు.అనంత నాగేశ్వరన్ ఛీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. డేటా డిటెక్టివ్. సంక్లిష్టమైన ప్రపంచ గందరగోళాన్ని ‘ఆర్థిక సర్వే’గా అనువదిస్తారు. గాలివానలు సహాయకరంగా ఉంటాయా, లేక మనం తుపానులోకి వెళ్లబోతున్నామా అన్నది ఆర్థిక శాఖకు చెబుతారు. వర్షం వచ్చే ముందు మీ గొడుగు విరిగిపోయిందన్న విషయాన్ని కూడా కచ్చితంగా మీకు గుర్తు చేస్తారు.నాగరాజు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రెటరీ. బ్యాంకుల వైద్యుడు. బ్యాంకుల ఆరోగ్యాన్ని పరిరక్షించటం కోసం, మీరు ‘టీ’ తాగి చేసిన డిజిటల్ చెల్లింపులు లోప భూయిష్ఠంగా లేకుండా చూసుకునేది ఆయనే. అరుణిష్ చావ్లా ఇన్వెస్ట్మెంట్లు, పబ్లిక్ అసెట్ల కార్యదర్శి. ప్రభుత్వ కంపెనీల వాటాల కోసం కొనుగోలుదారులను వెతికి పెడతారు. వెతికి పడతారు. ఆయనొక ఇ–బే వేలం పవర్ సెల్లర్. ప్రభుత్వానికి లాభం వస్తుందంటే ఎవరి చేతనైనా ఏదైనా కొనిపించేస్తారు.నిజంగా, ఎంత గొప్ప టీమ్! కాకపోతే, ఇలాంటి టీమ్ ఉన్న ప్రతి లీడర్కీ ఎదురయ్యే సమస్య ఒకటే. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి ఇడ్లీ, వడ మాత్రమే అయినా ఆ రెండిట్లోంచి కూడా ఒక దానిని ఎంపిక చేసుకోలేక సతమతం అవటానికి తగినంత సమయాన్నింకా చేతిలో మిగిల్చే ఉంచుతారు! నాదీ ఇప్పుడు అటువంటి సమస్యే. ఏ కలర్ శారీ బాగుంటుందా అని ఆలోచిస్తూ, తెరిచి ఉన్న అల్మరా ముందు నిలబడి పోవటం అన్నది నాకు ఏనాడూ సమయం దొరకని పని. కానీ ఇవాళ నా టీమ్ నా చేత ఆ పనిని చేయించబోతున్నట్లే ఉంది! -
అమెరికా, ఫ్రాన్స్లు కాదన్నాయి.. భారత్ మాత్రం సాధించింది!
విద్యుత్ వృథా, ఛార్జింగ్కు ఎక్కువ టైం.. బరువైన బ్యాటరీలు.. సిలికాన్ ఆధారిత ప్రాసెసర్లతో విద్యుత్ వాహనాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అయితే.. ఇకపై ఈ సమస్యలేవీ ఎదురు కాకపోవచ్చు. గాలియం-నైట్రైడ్ టెక్నాలజీతో.. గంటల తరబడి ఛార్జింగ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, తేలికైన బ్యాటరీలతో ఎక్కువ దూరం రయ్మంటూ దూసుకెళ్లే అవకాశం కలగబోతుంది. ఇంతకీ ఈవీ రంగపు భవిష్యత్తును మార్చబోయే ఈ అరుదైన టెక్నాలజీ మనకు ఎలా సొంతం అయ్యిందో తెలుసా?.. టెక్నాలజీ రంగంలో భారత్ ఓ మహత్తర ఘట్టాన్ని నమోదు చేసింది. భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో)కు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల పుణ్యమా అని ఇకపై దేశం రక్షణ రంగంలోనే కాదు... విద్యుత్తు వాహనాలు, 5జీ నెట్వర్క్ల విషయంలోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేయనుంది. గాలియం-నైట్రైడ్ విషయంలో డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయం దీనికి కారణం. ఇంతకీ ఏమా గాలియం-నైట్రైడ్? డీఆర్డీవో సైంటిస్ట్ సాధించిన విజయమేమిటి? దాంతో దేశానికి, సామాన్యుడికి వచ్చే లాభమేమిటి?మీకు సిలికాన్ గురించి తెలిసే ఉంటుంది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లోని ప్రాసెసర్లు ఈ అర్ధ వాహకంతోనే తయారవుతాయి. దశాబ్దాలుగా మన టెక్నాలజీ పురోభివృద్ధికి కేంద్రం ఈ సిలికానే. అయితే ఈ పదార్థంతో అనేక సమస్యలూ ఉన్నాయి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇప్పటివరకూ దీన్నే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్స్టు డాక్టర్ మీనా మిశ్రా. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. సిలికాన్తో వచ్చే సమస్యలను దాదాపుగా పరిష్కరించగల సరికొత్త అర్ధవాహకం గాలియం-నైట్రైడ్తో(Gallium Nitride GaN) ప్రాసెసర్ల తయారీకి మార్గం సుగగమైంది మరి. డీఆర్డీవో శాస్త్రవేత్తలు గాలియం-నైట్రైడ్ మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను విజయవంతంగా తయారు చేయగలిగారు. రక్షణ రంగానికి కీలకమైన రాడార్లు, క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల్లో ఈ సర్క్యూట్లు కీలకం కానున్నాయి. భారతదేశం ఇటీవలి కాలంలో కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోనూ ఈ గాలియం-నైట్రైడ్ ఉంటుంది కానీ.. ఆ టెక్నాలజీని మనకిచ్చేందుకు ఫ్రాన్స్ నిరాకరించింది. గతంలోనూ ఇతర అగ్రరాజ్యాలు కూడా ఈ టెక్నాలజీని భారత్తో పంచుకునేందుకు నిరాకరించాయి. డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల ఫలితంగా ఇప్పుడు భారత్ గాలియం-నైట్రైడ్ టెక్నాలజీ కలిగిన ఏడవ దేశంగా ఎదిగింది. ఇప్పటివరకూ అమెరికా, ఫ్రాన్స్, రష్యా, దక్షిణ కొరియా, చైనా, జర్మనీల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉండటం గమనార్హం.ఏమిటి దీని ప్రత్యేకతలు..ఒక్క ముక్కలో చెప్పాలంటే సిలికాన్తో పోలిస్తే గాలియం-నైట్రైడ్ ఎక్కువ వోల్టేజీలు, ఫ్రీక్వెన్సీ, ఉష్ణోగ్రతల్లోనూ సమర్థంగా పని చేయగలదు. విద్యుత్తు వాహనాల్లో బ్యాటరీల నుంచి విద్యుత్తును మోటారుకు.. మోటారు నుంచి బ్యాటరీలకు మార్చేందుకు ప్రస్తుతం సిలికాన్ను ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల విద్యుత్తు వృథా అవుతూంటుంది. గాలియం-నైట్రైడ్ ఆధారిత ప్రాసెసర్లతో ఈ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఒక అంచనా ప్రకారం సిలికాన్తో వచ్చే నష్టాలు 6 - 10 శాతం వరకూ ఉంటే.. గాలియం-నైట్రైడ్ ప్రాసెసర్లతో వచ్చే నష్టాలు 2 - 6 శాతం మాత్రమే. అంతేకాదు.. ఈ పదార్థంతో బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా వేగంగా జరిగి పోతుంది. బ్యాటరీల బరువు తగ్గడమే కాకుండా.. ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే.. విద్యుత్తు వాహనాల మైలేజీ పెరగడం, గంటలు పడుతున్న బ్యాటరీ ఛార్జింగ్ సమయం తగ్గడం జరిగిపోతుందన్నమాట. అలాగే సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే డైరెక్ట్ కరెంట్ (డీసీ)ను... మనం వాడుకునే ఆల్టర్నేట్ కరెంట్ (ఏసీ)కి మార్చే క్రమంలో అయ్యే నష్టాన్ని సగానికి సగం తగ్గిస్తుంది. అంతేకాదు.. 5జీ నెట్వర్క్ల ద్వారా డేటా ట్రాన్స్ఫర్ వేగాన్ని పెంచేందుకు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే.. ‘‘డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయం ద్వారా దేశం విదేశాల నిషేధాలను అధిగమించగలిగాము. దేశ భద్రత విషయంలో ఇదో మేలి మలుపు’’ అని వ్యాఖ్యానించారు.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ జర్నలిస్ట్. -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా?
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక స్థలం, హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల ఆంధ్రప్రదేశలో ఉండటం ఆంధ్రులందరికీ గర్వకారణం. ఉత్తరాది నుంచి కూడా ఎంతో మంది బాలాజీ దర్శనానికి విచ్చేస్తూంటారు. ఇంతటి వైశిష్ట్యమున్న క్షేత్రంపై ఎవరు అపసవ్యంగా మాట్లాడినా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా అది క్షమించరాని నేరమే అవుతుంది. దురదృష్టవశాత్తూ ఈ పాపానికి సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీలే పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ముందు వెనుక ఆలోచించకుండా.. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా వీరు.. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు, చేపనూనె మిళితమైందని బహిరంగంగా ప్రకటించడం.. రాజకీయం కోసం ఈ పాపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నం చేయడం మనం చూశాం. కానీ చివరికేమైంది? నిజం నిగ్గుతేలింది. సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులేవీ లేవని విస్పష్టమైన నివేదిక ఇచ్చింది. అయితే.. పామాయిల్ వంటికి కలిసినట్లు సిట్ తన ఛార్జ్షీట్లో తెలిపిందని ఎల్లోమీడియా ‘ఈనాడు’, ఆంధ్రజ్యోతిలు ముందస్తు కథనాలు ప్రచురించాయి. జంతు కొవ్వులు కలవలేదన్న అంశాన్ని పక్కనబెట్టి ఈ కథనాలు అల్లడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. సిట్ ఛార్జ్షీట్ వేస్తే అందులోని అంశాలపై ఎందుకు మీడియా బ్రీఫింగ్ జరగలేదు? తెలుగుదేశం మీడియాకు మాత్రమే అవసరమైనంత వరకే ఎలా లీక్ అయ్యింది? జంతు కొవ్వు కలవలేదన్న విషయం అధికారికంగా చెబితే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని దాచేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఎల్లో మీడియా కథనాల ద్వారా అర్థమవుతున్నది ఒక్కటే. ఎలాగైనా సరే.. లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానాలు వ్యాప్తి చేయించి వైసీపీకి చెడ్డపేరు తేవాలని!. సిట్ ఎంత చిత్తశుద్ధితో ఈ కేసు విచారించిందన్నది కాసేపు పక్కనబెడదాం. పామాయిల్, డాల్డా వంటివి కలిసిన నెయ్యిని 2019-2024 మధ్యలో మాత్రమే వాడారా? లేక అంతకుముందు కూడా ఇలా జరిగిందా? అని చూస్తే సమాధానం దొరకదు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో విజయవాడలో ఒక కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అక్కడ తయారైన కల్తీ నెయ్యిని తిరుమలకు కూడా పంపుతున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించినట్లు వార్తలొచ్చాయి.సుప్రీంకోర్టు సీబీఐతో మాత్రమే కాకుండా... రాష్ట్ర పోలీసు అధికారులు కూడా కలిసిన బృందంతో విచారణ జరిపించడంతో దర్యాప్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చలేక తంటాలు పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చేందుకు శతధా ప్రయత్నిస్తూన్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలోనే తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారన్న విమర్శ వస్తోంది. లడ్డూ కల్తీ వ్యవహారం మొత్తం రాజకీయమేనని దర్యాప్తులో కూడా నిగ్గుతేలింది. జంతుకొవ్వు అంటూ నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత మరింత తీవ్రంగా ఆరోపణలు చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగి, తదుపరి తిరుపతిలో ‘‘ఐ యామ్ అన్ అపాలిజిటిక్ హిందూ’’ అని అరచి గీపెట్టిన పవన్ కల్యాణ్లను సిట్ ఎందుకు ప్రశ్నించలేదు? వీరుభక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కాదా అని ఎందుకు అడగలేదు? కేంద్రంలోను, రాష్ట్రంలోను కూటమి పాలనే సాగుతుండడంతో వారి జోలికి వెళ్లలేదనుకోవాలి. జగన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు టైమ్లో కూల్చిన గుడులను జగన్ కట్టించినా, అంతర్వేదిలో కాలిన రథాన్ని పునర్మించినా, ఆయా ఘటనలలో తక్షణమే చర్యలు తీసుకున్నా ఏదో రకంగా చంద్రబాబు, పవన్ లు మతం రంగు పులిమేవారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలకు టీడీపీ కార్యకర్తలే బాధ్యులని తేలినా వైసీపీకే ఆపాదించేవారు. పైగా నిందితుడైన ఒక టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నగదు బహుమతి ఇచ్చారు. ఇప్పుడే కాదు.. గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యత్నాలు చేసేవారు. టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా ఏడు కొండలు, రెండు కొండలు అంటూ లేని వివాదాన్ని సృష్టించారు. వైఎస్సార్ తిరుమల స్వామివారి నిమిత్తం ఎస్వీబీసీ ఛానెల్ను తీసుకువస్తే అదంతా డబ్బు దండగ అంటూ అసెంబ్లీలో చంద్రబాబు వాదించారు. అయినా చంద్రబాబు హిందూ మతోద్ధారకుడు, వైఎస్ కాదన్నట్లు పిక్చర్ ఇస్తుంటారు. జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్నా.. ఏదో ఒక వదంతి సృష్టించి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పటికీ అదే పనిలో ఉంటారు. కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచంలో గోడ కూలి ఏడుగురు, కాశిబుగ్గ వద్ద తోపులాటలో మరికొందరు మరణించినా వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్ గా తీసుకోరు. లడ్డూ కల్తీ కేసుకు సంబంధించిన బోలేబాబా డెయిరీని 2018లోనే టీడీపీనే ఎంపిక చేసింది. ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంగా జగన్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిందే తడవు.. ఈ కంపెనీ ఇంకో రూపంలో తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టుదారుల్లో ఒకటిగా మారింది. ఇవన్నీ సిట్ చెప్పిన వాస్తవాలే. కానీ.. నిందలు మాత్రం వైసీపీపై మోపుతూంటారు. 2014-19 మధ్య చౌక ధరకు నెయ్యిని కొన్న టీడీపీ అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్పగలదు? టీడీపీ, వైసీపీల రెండింటి హయాంలోనూ టీటీడీ కొన్ని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపింది. కానీ.. ఒక్క వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందని ఎల్లో మీడియా పనికట్టుకుని రాస్తూంటుంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్న చిన్న అప్పన్న అనే వ్యక్తిని సుబ్బారెడ్డి కార్యదర్శిగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రభాకరరెడ్డి సతీమణి, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ప్రస్తుత మంత్రి పార్ధసారధిలు అప్పట్లో వైసీపీలో ఉండేవారు. వారిద్దరూ టీటీడీ సభ్యులుగా పర్ఛేజింగ్ కమిటీలో పని చేసినప్పుడు ఏం జరిగింది? వారికి అసలు ఏమీ పాత్ర లేదని ఎలా చెప్పగలిగారు. వారిని కేసు నుంచి ఎలా తప్పించారు. వైవీ సుబ్బారెడ్డిపై రకరకాల కథనాలు రాసి అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు భగ్నమయ్యాయి. సుబ్బారెడ్డి తప్పిదం ఉన్నట్లు సిట్ ఎక్కడా చెప్పలేదు. అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చేసిందంతా దుర్మార్గపు ప్రచారమే అవుతుంది కదా! మరో మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ఈ ఆరోపణ రాగానే తిరుమల వెళ్లి ప్రమాణం చేశారే. అలాంటి పని టీడీపీ నేతలు ఎవరూ ఎందుకు చేయలేకపోయారు? రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదిరులు తిరుమలను వాడుకున్నట్లు తేలింది కదా? ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఎల్లో మీడియా చెంపలు వేసుకుంటుందా? అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుమలలో ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని, ఆయనకు వాతలు పెట్టాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఏపీలో ఉన్న గుడుల మెట్లన్నీ కడగాలని కూడా సలహా ఇచ్చారు. వారు ఎటూ ఆ పని చేయరు. అది వేరే విషయం. కనీసం ఇకనైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వీరు వ్యవహరిస్తారా? అన్నది డౌటే. ఏదైతేనేం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం స్పష్టం కావడం మాత్రం... కోట్లాది హిందూ భక్తులకు పెద్ద రిలీఫ్!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
స్వామిద్రోహుల లడ్డూ మోసం
చంద్రబాబు దైవభక్తి ఒక నాటకంజనక్షేమం ఒక బూటకంఅధికారం అన్నదే కీలకంసంపాదనే ఆయనకు మూలకంచంద్రబాబు ఒక స్వార్థ కీటకంహైందవ ద్రోహ రూపకంఇది నా వ్యక్తిగత అభిప్రాయం కానేకాదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలవనే లేదని సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ నిర్ధా రించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనసుల్లో కలిగిన అభిప్రాయం. హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ప్రసా దాన్ని భక్తిశ్రద్ధలతో కళ్లకద్దుకుని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని చంద్రబాబు ఆరోపణల తర్వాత, స్వీకరించాలంటే ఏదో అనుమానం. మనమెంత గానో ఇష్టపడే, పూజించే స్వామి వారి ప్రసాదమేనా? లేక పంది, ఆవు, చేపల కొవ్వుతో తయారు చేసిందా? అని హిందువుల మనసులు ఆవేదనతో గింజుకున్నాయంటే అనుమానం లేదు. అందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని 2024 సెప్టెంబర్ 18న తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన తర్వాత,హిందువులంతా మనసులో పరమ శివుడు గరళాన్ని దిగ మింగినట్టు క్షోభను అనుభవిస్తూ వచ్చారు. బయటపడిన నీచత్వంసుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ ఎట్టకేలకు నివేదికను న్యాయస్థానంలో సమర్పించింది. అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించే సమాచారం. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ లేవని ‘సిట్’ నిర్ధారించింది. ఈ నివేదిక తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను పెంచేలా ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నీచత్వాన్ని బయట పెట్టిందని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కో లేక, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకుహిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవడం దిగ్భ్రమ కలిగించింది. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదంతాలున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత దుర్మార్గం ఆయనలో ఉందని కలలో కూడా ఊహించ లేదు. కనీసం ‘సిట్’ నివేదిక వెలువడిన తర్వాతైనా ఆయనలో కాసింతైనా పశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది. అలాంటిది లేకపోగా, తమ ప్రసార మాధ్యమాలు, అధికార బలంతో ఎలా పైచేయి సాధించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు చేలో మేస్తే, తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించుకుంటున్నారు. తనను తాను ‘సనాతని’గా ప్రచారం చేసుకుంటున్న పవన్ కల్యాణ్, దేవునికి అన్యాయం జరిగితే, బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాల్సింది. కానీ లడ్డూ ప్రసా దంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలు నిజమన్నట్టు దుష్ప్రచారం చేసిన ఘనతను పవన్ దక్కించుకున్నారు. చంద్రబాబు అండ్ కోకు జగన్పై దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే దాన్ని జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిట్టచివరి అస్త్రంగా లడ్డూ ప్రసాదమనే అస్త్రాన్ని ప్రయోగించారు. దేవుని భుజాల పైనుంచి జగన్ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది.స్వామివారి పుణ్యమా అని... లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిక్కచ్చిగా విచారణ జరిపించాలని వైసీపీ నాయకుడు, టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయివుంటే, స్వామి వారి ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర నెరవేరేదేమో! కానీ కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రబాబు, ఆయన తాబేదా రులైన పాలకుల కుట్రల్ని గుర్తించి, సీబీఐతో విచారణ చేపట్టేలా చేయించారు. అందుకే సీబీఐ విచారణ జరిపి, చంద్రబాబు, ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నట్టు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఇదే చంద్రబాబు నియమించిన ‘సిట్’ విచారణ జరిపి ఉంటే, తన రాజకీయ స్వార్థానికి, ఆరోపణలే నిజమని నమ్మించేందుకు నివేదిక ఇప్పించేవారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిని, నన్ను, ధర్మారెడ్డిని జైలుకు కూడా పంపి ఉండేవారు. సీబీఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు. బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా, యావత్ హిందూ సమాజం ఆయనను అసహ్యించుకుంటోంది. శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులూ నోళ్లు వెళ్లబెట్టేలా... చంద్రబాబు తన మాటలతో, చేష్టలతో, వంతపాడే ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారోపణలు చేయడాన్ని సమాజం గుర్తించింది. ఒక రాజకీయ నాయకుడికి, అతని దుశ్చర్యల్ని జనం పసిగట్టడం కంటే మరో శిక్ష అవసరం లేదు. పురాణ కాలంలో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు అందులో మద్యమాంసాలు కలిపేవారని కథలు కథలుగా విన్నాం. రాక్షసుల కంటే నీచస్థాయికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగజారారనేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన నానాయాగీని చూడాల్సి ఉంటుంది. దమ్ముంటే మొదటి నుంచీ వద్దాం!టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించిన ‘సిట్’... రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది. అధి కారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్ను నెయ్యిగా భ్రమింపచేశారనేది ‘సిట్’ నివేదిక సారాంశం. ‘సిట్‘ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడి నాలుక మడత పడింది. కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, భక్తి ఉంటే 2009 నుంచి 2019 వరకు టీటీడీలో నెయ్యి సరఫరాపై విచారణ చేయించాలి. ఇవాళ సీబీఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది. అలాగే ప్రీమియం డెయిరీకి కూడా! ఈ ప్రీమియర్, ఆల్ఫా డెయిరీలే 2013 సంవ త్సరం నుంచి 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రీమియర్ డెయిరీ కూడా ఇవాళ భోలేబాబా దగ్గరి నుంచే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. టెండర్ నిబంధనల్ని మా హయాంలో సరళతరం చేయడం వల్ల కల్తీ జరిగినట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిబంధనల్ని సరళ తరం చేయాలని అనుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనే కారణం. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొత్త కంపెనీలకు కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని 2021లో టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే పాల ఉత్పత్తులు తగిన మోతాదులో లేకపోతే వెన్న కొనుగోలు చేయొచ్చనే నిబంధన నేటికీ ఉంది. ఆ తర్వాత నిబంధనను కఠినతరం చేసింది నా హయాంలోనే! ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులపై సీబీఐ నేరారోపణ చేయలేదు. ఆ నేరంలో భాగస్వాములుగా టీటీడీ చైర్మన్లగా పని చేసిన మమ్మల్ని ఎక్కడా సీబీఐ చెప్పలేదు. నెయ్యి ప్రామాణికతల్ని మెరుగుపరచడానికి రూ.5.50 కోట్లతో మిషనరీల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది మా హయాంలోనే! ఆ మొత్తాన్ని అందించడానికి దాత వచ్చింది కూడా మా హయాంలోనే. ఆ తర్వాత మా ప్రభుత్వం దిగిపోయింది. మీ హయాంలో చేసిందేమీ లేదు. పైగా మాపై నిందారోపణలు. ఇవాళ నిందితులుగా ‘సిట్’ పేర్కొన్న జీఎం సుబ్రమణ్యం 2016 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా కొనసాగారు. అది కూడా చంద్రబాబు టైమ్ లోనే! మరో నిందితుడు జగదీష్ కూడా 2018–21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా నియమి తులయ్యారు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు 2013 నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నారు. ఇవాళ వారిని నిందితులిగా సీబీఐ తేల్చింది. దీనికి మా నాయకు డైన వైఎస్ జగన్కు ఏంటి సంబంధం బాబు? సరైన పాప పరిహారంయజ్ఞం చేస్తున్న వ్యక్తి జగన్. అందులో రక్తం పోసే వ్యక్తులు చంద్రబాబు, పవవ్ కల్యాణ్. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని పవనానంద స్వామి (పవన్ కల్యాణ్) ఆరోపించారు. అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీటీడీ సభ్యుడు సౌరబ్ బోరా... నేటికీ బోర్డు సభ్యుడే! కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి, బహిరంగ సభలో పవన్ నిస్సిగ్గుగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం అపవిత్రం అయ్యిందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. ఇప్పుడు పవన్ నోటి ద్వారా వాస్తవం ఏంటో బయటికి రావాలి. కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పారు. అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్లాయనీ, ప్రసాదంలో వినియోగించారనీ ‘సిట్’ తన నివేదికలో స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కలిపారని, పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ఇప్పుడు చెప్పు బాబు? అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, శ్రీవారి ఆలయ అర్చకులతో చంద్రబాబు సంప్రోక్షణ చేయించారు. తిరుమలలో నాలుగు అర్చక కుటుంబాలున్నాయి. స్వాములూ... మీరు మేల్కో వాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గకండి. ఇప్పటికైనా హిందువులంతా వాస్తవాలు తెలుసుకుని, చంద్రబాబు శ్రీవారి ఆలయం కేంద్రంగా ఆడే రాజకీయ వికృత క్రీడను తిప్పి కొట్టాలి. పదవి పొందడానికి పాతాళం కన్నా కిందికి దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్కే చెల్లు. పాప పరిహా రానికి అమరావతి నుంచి తిరుమల ఆలయం వరకూ రోడ్లన్నీ పవన్ కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకొని, కోట్లాదిమంది భక్తు లకు క్షమాపణ చెప్పాలి.ఓ విష్ణు పరమాత్మా! రాజకీయ స్వార్థానికి మిమ్మల్ని వాడు కున్న పాలకుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. అధికారమనే పొర కళ్లకు కప్పి, అంధత్వంతో పాలిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికే ‘సిట్’ నివేదిక రూపంలో మా ముందుకొచ్చావు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే సత్యాన్ని చెప్పి, కోట్లాది మంది హిందువుల మనసుల్ని తేలికపరిచావు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏదసత్యం తెలుసు కోలేని దురవస్థలో కూటమి పాలకులున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా... మీరు తలచుకోబట్టే లడ్డూ ప్రసాదంపై ఏడాదిగా ప్రచారమవుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
ఎల్లో మీడియా వారు సమర్పించు..
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రైవేటు వారికి రాసివ్వడానికి కూటమి ప్రభుత్వం భూమిక సిద్ధం చేస్తోంది. ఇందుకు ఎల్లోమీడియా ఈనాడు విషపూరిత కథనాల ప్రచురణతో తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలో పడింది. ‘అభివృద్ది కోసమే పీపీపీ’ అంటూ ఇటీవల ప్రచురించిన కథనం ఈ కోవలోనిదే. వీటి ప్రకారం.. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన వైద్య కళాశాలలతోపాటు పోర్టులు తదితర ప్రాజెక్టులు కూడా ప్రైవేటుపరం కానున్నాయి. ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తున్నట్లు.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధి కేటాయిస్తుందని ఈనాడు రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే ‘‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’’ అనిపించకతప్పదు. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పనంగా ప్రజల సొమ్ము అప్పగించి వారి సంపద పెంచే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తోండటం గమనార్హం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేసినప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ తరుణంలోనే ఈనాడు ఇలాంటి కథనం ప్రచురించడం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కూడా సొంతంగా వైద్యకళాశాలలను నిర్మిస్తుంటే.. చత్తీస్గఢ్లోనూ ప్రభుత్వమే కళాశాలల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం అన్ని వసతులూ సమకూర్చి సిద్ధం చేసిన కాలేజీలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తారట. దశాబ్దాల పాటు ప్రజారోగ్యాన్ని కాపాడగల వైద్యకళాశాలకు రూ.5,000 కోట్లు కేటాయించలేక... రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగిస్తారన్న మాట. అన్నీ సిద్ధంగా ఉన్న కాలేజీలకు టెండర్లు పిలిస్తే అది ప్రభుత్వ సమర్థత అని పొగిడే స్థాయికి ఈనాడు దిగజారిపోయింది. పైగా పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చే వైద్యకళాశాలలను కట్టడం వైసీపీ ప్రభుత్వ అసమర్థతని కూడా నిస్సిగ్గుగా రాసుకుంది ఈనాడు. అలాగే రాష్ట్ర వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేయగల సామర్థ్యమున్న పోర్టుల నిర్మాణంపై కూడా ఈనాడు జగన్ ప్రభుత్వంపై ఆడిపోసుకుంది. ప్రైవేటు వారికి అప్పగించడాన్ని సమర్థతగా చెబుతోంది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన తరువాత రాష్ట్రాన్ని మౌలిక వసతుల సమస్య వేధిస్తోందని ఈనాడు రాసింది. మరి... మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామ, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద బడులు, ఆస్పత్రుల బాగుచేత వంటివన్నీ మౌలిక వసుతులు ఎలా కాకుండా పోయాయో కూడా ఈనాడు వివరించి ఉండాల్సింది. రిషికొండపై జగన్ రూ.250 కోట్లతో సర్వాంగ సుందరమైన భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఒక ఆస్తిని సమకూరిస్తే దాన్ని ప్రైవేటువారికి అప్పగించడం చాలా గొప్ప విషయమని ఆత్మవంచన చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం పీపీపీ కింద ప్రాజెక్టుల చేపట్టడానికి ప్రతిపాదనలు అడిగితే ఏపీ రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కోరిందట. విచిత్రంగా ఈ జాబితాలో ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిన మూలపేట, రామాయంపేట పోర్టులు ఉన్నాయి. రామాయంపేట పోర్టులో ఒక బెర్త్ పూర్తయ్యేదశలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని నిలిపేసింది. తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలు, నాగార్జునసాగర్, కుప్పం, అమరావతి ఎయిర్ పోర్టులు పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఇప్పటికే నిర్మించిన విమానాశ్రయానికి విమానాలే రాని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఈ చిన్న పట్టణాలకు ఎవరు వస్తారు? విశాఖ, విజయవాడ విమానాశ్రయాలే నష్టాలలో ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలకు ఆశపడి మాత్రమే ఎవరైనా ఈ చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలు కట్టేందుకు వస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు రుణాలను ఎగవేసినా అడిగేవారు ఉంటారా?అన్నది సందేహం. దేశంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేసిందో అందరికి తెలిసిందే. తెలుగుదేశం, బీజేపీలకు చెందిన కొందరు ప్రముఖులు వందల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేసి హాపీగా పదవులలో ఉంటున్నారు కదా! ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అమలైతే ఆ జాబితాలోకి మరింత మంది చేరవచ్చేమో! వీటితోపాటు అప్పర్ సీలేర్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు, డొంకరాయి నీటి పరషరా పథకం ప్రైవేటువారికి అప్పగిస్తారట. వారు ఈ స్కీమ్ను అమలు చేశాక డబ్బులు తిరిగి రాబట్టడం కోసం ఎంత వసూలు చేస్తారో తెలియదు. అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణం, తిరుపతి క్రీడా ప్రాంగణం, తిరుపతి బస్టాండ్ మొదలైనవి ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉన్నట్టు ఈనాడు తన కథనంలో చెప్పింది. వీటన్నిటిలో ఒకటి అరా ఏమైనా పూర్తి అవుతాయేమో చెప్పలేం. ఏ ప్రైవేటు వ్యక్తి తన సొంత డబ్బు వినియోగించి ప్రజలకు సేవ చేయడు. లాభాలు వస్తాయనుకుంటే పెట్టుబడులు పెడతాడు. ఆ పెట్టుబడులలో అధిక శాతం బ్యాంకు రుణాల రూపంలోనే తీసుకుంటారు. ఎటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ సొమ్ము వస్తుంది. అయినా నడపలేక చేతులెత్తేస్తే చేసేదేమీ ఉండదు. బాగా నడిచేవి ఉంటే అవన్ని ప్రైవేటు వారికి సొంత ఆస్తులుగా మారతాయి. పైగా వాటిని వినియోగించేవారి నుంచి ముక్కుపిండి రుసుం వసూలు చేస్తారు. రోడ్లకు, పేదవాడికి ఉపయోగపడే వైద్యకళాశాలలకు తేడా లేకుండా ఎల్లో మీడియా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. గతంలో సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లోనే వాటిలో అధిక భాగం మూతపడడమో, లేక ప్రైవేటు వ్యక్తుల పరమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే, వాటిలో అధిక భాగం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి వారికి సంపద తెచ్చిపెట్టాయి. స్థూలంగా చూస్తే లాభాలు వస్తే ప్రైవేటుకు, నష్టాలు వస్తే ప్రభుత్వానికి అన్నమాట. ఇదే అభివృద్ది అని జనం మోసపోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ ప్రక్రియ మళ్లీ మొదలవుతోందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆర్థిక సర్వేకు కొత్త రూపునివ్వాలి!
మన దేశం స్వాతంత్య్రం సంపాదించు కున్న కొత్తలో ముఖ్యమైన విధానపరమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నాయీ అంటే అవి ప్రణాళికా సంఘం ప్రచురించిన పంచవర్ష ప్రణాళికలే! ప్రణాళికా సంఘం ప్రాధాన్యం కోల్పోయి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాభవం పెరిగిన తర్వాత, బడ్జెట్కు ముందు ఆర్థిక శాఖ సమర్పించే ఆర్థిక సర్వే క్రమేపీ ఎక్కువ మందిని ఆకర్షించడం మొదలైంది. ఈ సర్వే కొన్నేళ్ళుగా పెక్కు ఉపయోగకరమైన విధానపరమైన ఐడియాలను, ఆలోచనలను రేకెత్తించే అంశాలను మన ముందు ఉంచుతూ వస్తోంది. ఉదాహరణకు, చైనాపై వాణిజ్య, పెట్టుబడులపరమైన ఆంక్షలను విధించడంలోని ఔచిత్యాన్ని 2023–24 ఆర్థిక సర్వే ప్రశ్నించింది. అప్పటికి భారత్–చైనా సంబంధాలు కదలని స్థితిలోనే ఉన్నాయి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే బదులు భారత దేశంలో వస్తూత్పత్తి చేసేందుకు చైనా సంస్థలకు అనుమతించడం మెరుగైన ఆలోచన అనిపించుకోవచ్చని సర్వే వాదించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ మొదట్లో ఆ ఆలోచనను తోసిపుచ్చినా, అది పునః పరిశీలించదగ్గ ప్రతిపాదనేనని ఆ తర్వాత అంగీకరించింది. సంక్షేమ పథకాల ఫలాలు అందవలసిన వారికి అందడం లేదనీ, వాటిలో లొసుగులు ఉన్నాయనీ గతంలో ఆర్థిక సర్వేలు ఎత్తి చూపాయి. లబ్ధిదారులకు నేరుగా నగదు బదలీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాయి. ఈ ప్రతిపాదన 2009–10, 2010–11 సంవత్సరాల సర్వేలలో మొదట చోటుచేసుకుంది. దానిపై అప్పట్లో మొదట్లో పెద్ద దుమారమే రేగింది. కానీ, అప్పటి నుంచి రైతులు, మహిళలు, ఇతర ఉద్దేశిత లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా నగదు బదలీ చేయడం సంప్రదాయసిద్ధమైన విధాన సాధనాలలో అంత ర్భాగంగా మారింది. మరింత ఉపయోగపడేలా...ఆర్థిక సర్వే కొత్త ఆలోచనలను అందించి, ఎక్కడెక్కడ దిద్దు బాటు చర్యలు అవసరమో సూచించగలదు. కానీ, సర్వేలో పది సూచనలు ఉంటే, ఏదో ఒక దానిపై చర్చించి, అమలులోకి తెస్తు న్నారు. మిగిలిన తొమ్మిదింటిని గాలికి వదిలేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే, సర్వేలో చూపే టేబుల్స్, ఛార్టులలో గాఢత లోపిస్తోంది. మరి పౌరులు, సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రజా సేవకులకు మరింత ఉప యోగకరమైనవిగా ఆర్థిక సర్వేలు ఉండేటట్లు చేయడం ఎలా? మొదట... వాటిని ప్రాధాన్యం కలిగినవిగా మార్చాలి. తదుపరి ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలో రూపుదిద్దుకోగలిగిన వివిధ సందర్భాలను సర్వే స్థూలంగా వివరించగలగాలి. ఆ యా సందర్భా లలో వివిధ మంత్రిత్వ శాఖలు, రెగ్యులేటరీ ఏజన్సీలు విధాన పరంగా ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందో కూడా సూచించాలి. అటువంటి పరిణామాల విశ్లేషణ చిన్న వ్యాపార సంస్థలు రానున్న నెలలకు సంబంధించి అత్యవసర ప్రణాళికలు తయారు చేసుకునేందుకు సహాయపడుతుంది. బాహ్య వాతావరణం మార గానే, దానికి తగ్గట్లుగా విధానపరంగా చకచకా మార్పులతో స్పందించేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. రకరకాల ప్రత్యామ్నా యాలను లెక్కలోకి తీసుకుంటూ స్వల్ప, మధ్యకాలిక అంచనాలకు రావడంలో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్తో కలసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేయవచ్చు. ఈ అంచనాలను బట్టి ఎటువంటి పరిస్థితులు తలెత్తగలవో ప్రణాళిక వేసుకోవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో ప్రతి 3 నెలలకోసారి ఈ అంచనాలను అప్డేట్ చేయవచ్చు. ఏం చేయాలి?ఒకటి – చాలా భాగం భారతీయ వ్యాపార సంస్థలు సొంత ఆర్థిక, భౌగోళిక రాజకీయ సలహాదారులను నియమించుకోగలిగిన స్థోమత ఉన్నవి కావు. కీలక ఆర్థిక ప్రశ్నలపై మార్గదర్శనం చేయడం ద్వారా సర్వే బృందం ఆ లోటును భర్తీ చేయవచ్చు. రెండు – సర్వే చాట భారతంలా కాకుండా వీలైనంత సంక్షిప్తంగా ఉండాలి. అది భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఇయర్ బుక్లా కాకుండా ముఖ్యమైన ఆర్థిక సవాళ్ళపై దృష్టి కేంద్రీకరించిన సంగ్రహ డాక్యుమెంట్గా ఉండాలి. అప్పుడే అది నిజంగా ఉపయోగ పడుతుంది. నిర్ణయాలు తీసుకునేవారిలో చాలా మందికి సుదీర్ఘ పాఠాలను చదివేంత తీరిక ఉండదు. మూడు– ఆర్థిక సర్వే అందరి భాగస్వామ్యంతో రూపొంది నదిగా ఉండటం సముచితం. వివిధ ఆర్థిక మంత్రిత్వ శాఖలు,రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్య లపై సర్వే బృందం ఇన్పుట్స్ సేకరించాలి. ఆ యా అంశాలపై ఆలోచించదగ్గ విధాన ప్రతిపాదనలు చేసిన వారికి విధాన నోట్సును తయారు చేసేందుకు స్వల్పకాలిక గ్రాంటులు మంజూరు చేయవచ్చు. ఆ సమావేశాల్లో పాల్గొనేవారు అకడమిక్ పరిశోధకులు, పాలసీ ప్రాక్టీషనర్లు ఇద్దరి మాటలను వినేవారుగా ఉండాలి. ఎటొచ్చీ వయసు విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకోవడం వాంఛ నీయం. విధాన నిర్ణయ ప్రక్రియలో యువత పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. బహిరంగ పోటీ వల్ల తుది ఎంపిక లను సీరియస్గా తీసుకోగల అవకాశం ఉంటుంది.హ్యాకథాన్ అవసరంఎవరో తెలివైన కొద్దిమంది పురుషులు, మహిళలతో భారత దేశ ఆర్థిక వ్యవస్థ లాంటి సంక్లిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం కష్టం. చాలామంది విధాన నిర్ణేతలు తాత్కాలిక ప్రాతి పదికపై బయటవారి సలహాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతూంటారు. కానీ, దీనికి ఒక విధానపరమైన బృందం అవసరం. ఆబృందాన్ని నేటి కంప్యూటర్ పరిభాషలో హ్యాకథాన్ అందాం. విద్యా వేత్తలు, విధానపరమైన పరిశోధకుల నుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే సంస్థాగత వేదికగా అది పని చేస్తుంది. నూతన విధాన పరిష్కారాలను ప్రతిపాదించేవారు సంకుచిత ప్రయోజనాల నిమిత్తం ఆ పని చేయడం లేదనీ, వారు పోటీతో కూడిన ప్రక్రియ ద్వారా ఎంపికై వచ్చినవారనీ విధాన నిర్ణేతలకు తెలిస్తే, వారు ఆ పరిష్కారాలను సానుకూలంగా పరిశీలించే అవ కాశం ఎక్కువ. హ్యాకథాన్ సూచించిన కొన్ని పరిష్కారాలు నేడు పూర్తిగా ఆచరణ సాధ్యమైనవి కాకపోయినప్పటికీ, అవి రేపటికైనా ఉపయోగపడేవిగా ఉంటాయి. నేటి యువ హ్యాకథాన్ విజేత రేపటి సీనియర్ విధానపరమైన నిర్ణేతగా పరిణమించనూ వచ్చు.ప్రమిత్ భట్టాచార్య వ్యాసకర్త ‘డేటా ఫర్ ఇండియా’ రిసెర్చ్ హెడ్; ‘న్యూఇండియా ఫౌండేషన్’ ఫెలో (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కనబడే వృద్ధిలో కనబడనివి...
దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్టకేలకు అధిక వృద్ధి బాట పట్టిందని వ్యాఖ్యాతలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ముందస్తు అంచనాలను కూడా లెక్కలోకి తీసుకుంటే, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు 8.1 శాతం. నమోదైనవాటిలో ఇదే ఉత్తమం. కానీ, దీన్ని సందర్భానుసారంగా చూడాలి. గడచిన ఐదేళ్ళ రికార్డు, చతికిల పడిన స్థితి నుంచి చూసి చెబుతున్నది. కోవిడ్ ఏడాది 2020–21లో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోవిడ్కు ముందరి ఏడాది (2019–20)ని ప్రాతిపదికగా చేసుకుంటే, తాజాగా ఆరేళ్ళలో వృద్ధి రేటు 5.7 శాతంగా తేలుతుంది. అంతకుముందు 19 ఏళ్ళలోని వృద్ధి రికార్డు కన్నా అది మందగమనం కిందనే లెక్క. కోవిడ్కు ముందరి ఏడాది వరకు సగటున 6.5 శాతం వృద్ధి రేటు నమోదైంది.తాజా వృద్ధిరేటు 2020–21 క్షీణత నుంచి ఏ మేరకు కోలుకున్నామనేదానికి ప్రాతినిధ్యం వహిస్తోందా అనేది కీలక ప్రశ్న. నిలకడగా సాధించగలిగిన వృద్ధిరేటు ఇపుడు ఎంతని చెప్పగలం? వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6.5 శాతం వృద్ధిరేటు ఉండగలదని కొందరు అంచనాలు వెల్లడించారు. దాన్ని ప్రాతిపదికగా చేసుకుంటే, మూడేళ్ళ (2024–27) చక్రభ్రమణంలో సగటు వృద్ధి రేటు 6.8 శాతం ఉండవచ్చు. మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో కూడా అదే రేటు ఉంది. స్థిర వృద్ధి రేటులో గణనీయమైన పెరుగుదల ఇంకా ఏదీ లేదని ఇది సూచిస్తోంది. విరుద్ధ సూచికలుగతంలో చాలా సందర్భాలలో, ఏదో ఒక ఆర్థిక సూచి సరైన స్థితిలో లేనట్లుగానే కనిపించేది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండ టమో, లేదా ద్రవ్యలోటు మాదిరిగానే వాణిజ్య లోటు ఎక్కువగా ఉండటమో జరిగేది. దానికి భిన్నంగా నేటి ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగ దశలో ఉన్నట్లుగా చిత్రితమవుతోంది. అయినా, స్థూల గణాంకాలు అప్రమత్తతను సూచిస్తున్నాయి. ద్రవ్యలోటు తగ్గుతున్న బాటలోనే ఉంది. కానీ, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో అది 4.4 శాతంగా ఉంది. అంటే, మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో (3.6 శాతం) కన్నా అధికం. ప్రభుత్వం పెట్టుబడుల ప్రవాహాన్ని ఉధృతం చేయడం, మరింత నిజాయతీతో కూడిన పద్దులు... బహుశా అందుకు కారణం కావచ్చు. ప్రభుత్వ రుణం కూడా తగ్గుతున్న సరళిలోనే ఉన్నప్పటికీ, అధికంగానే కొనసాగుతోంది. జీడీపీలో 81 శాతంగా ఉన్న ప్రభుత్వ రుణం, ఒకవేళ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారితే, దాన్ని ఎదుర్కోగల ద్రవ్యాచరణకు అది వెసులుబాటు కల్పించగలిగినదిగా లేదు. కాగా, వృద్ధికి కీలకమైన పొదుపు, ఇన్వెస్ట్మెంట్ రేట్లు గతంలో కన్నా తక్కువగా ఉన్నాయి. స్థూల స్థిర మూలధన సమీకరణ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి జీడీపీలో 30 శాతంగా ఉంది. ఇది 2012–13 వరకు ఉన్న ఎనిమిదేళ్ళ సగటు 34 శాతం కన్నా తక్కువ. ఆర్థిక కలాపంలో వస్తువులు, సరుకుల ఎగుమతుల వాటా కొంత కాలంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా, దీన్ని వేగవంతమైన వృద్ధి రేటుకు విరుద్ధమైన సూచిగానే చూస్తారు. బాగుంది కానీ...వృద్ధి రేటు పెరుగుతున్న సరళికి ఆలంబనగా నిలిచే డేటా ఏదైనా కావాలనుకుంటే, ఇతరత్రా సంఖ్యలను చూడక తప్పదు. ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ అభివృద్ధి సూచిలో మన దేశం ఈ ఏడాది ‘మధ్యస్థ’ నుంచి ‘అధిక’ కేటగిరీలోకి పురోగమించవచ్చునని భావిస్తున్నారు. ఇది విద్యాస్థాయులు, ఆయుర్దాయం, ఆదాయాలలో వచ్చిన స్థిర మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. దీంతో మురిసిపోవడానికి లేదు. ఈ సూచిలో ‘అత్యధిక’ కేటగిరీ కూడా ఉంది. దానిలో 70కి పైగా దేశాలున్నాయి. ఆర్థిక నిర్వహణ విషయానికి వస్తే, పన్ను రేట్లు (కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను, జీఎస్టీ) గతంలో కన్నా హేతుబద్ధంగా ఉన్నాయి. డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులు విస్తృత వినియోగాన్ని సంతరించుకున్నాయి. భౌతిక మౌలిక వసతుల్లో భారీ పెట్టుబడులు అభినందనీయం. ఇవి రోడ్డు, రైలు మార్గాలలో సరుకుల రవాణాను వేగవంతం చేశాయి. అదే సమయంలో, వాణిజ్య వాహనాల అమ్మకాలలో అది ప్రతికూల ప్రభావం చూపడం వేరే సంగతి. సంస్కరణల వల్ల స్థిరాస్తి, వస్తూత్పత్తి వంటి రంగాలు లబ్ధి పొందాయి. ఎలక్ట్రానిక్స్ రంగ నేతృత్వంలో వస్తూత్పత్తి ఎట్టకేలకు కొంత వేగాన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా కింది స్థాయి వరకు కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. కానీ పారిశ్రామిక విభాగాల్లో మూలధన వస్తువుల ఉత్పత్తి నత్తనడకన సాగుతోంది. తీవ్ర పేదరికం నుంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరగడం శుభ సూచకం. కానీ, అది వినియోగ వస్తువుల డిమాండ్ బాగా పెరిగేటంతగా తోడ్పడకపోవచ్చు. వ్యవసాయ రంగాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నవారు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. దానిలోంచి కొందరు బయటకు రావడానికి బదులుగా కొత్తవారు కూడా ఉపాధికి అదే రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. చేయాల్సింది ఎంతో!ఆదాయ నిచ్చెనలో పై మెట్లపై ఉన్నవారి వినియోగ రుణం ఎక్కువగా ఉంది. గృహోపయోగ వస్తువులపై రుణాలు 2021–22లో ఉన్న రూ. 8.99 ట్రిలియన్ల నుంచి 2023–24లో రూ. 18.79 ట్రిలియన్లకు రెట్టింపయ్యాయి. ఇప్పటికే చేసిన అప్పులు చెల్లించ వలసి రావడం వల్ల భవిష్యత్ వినిమయంపై దాని ప్రభావం పడుతుంది. చాలా రంగాల్లో వృద్ధి ఇప్పటికే మందంగా ఉంది. ముఖ్యంగా, రైళ్ళలో ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగానే పెరుగుతూ వస్తోంది. వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్న ప్పటికీ అదీ పరిస్థితి. వినియోగదారులలో అగ్ర భాగాన ఉన్న 20 శాతం మందిపైనే దృష్టి పెడుతున్నట్లు మొన్నామధ్య ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందుకే ఆశ్చర్యం కలిగించలేదు. కానీ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 వరకు గడిచిన ఐదేళ్ళలో 11 శాతం మాత్రమే వృద్ధి చెందింది. దేశం 1991లో సంస్కరణల బాట పట్టిన తర్వాత, ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన మార్పు తగినంత చోటుచేసుకోలేదని వీటన్నింటి బట్టి తెలుస్తోంది. తలసరి ఆదాయాలు దాదాపు ఐదు రెట్లు పెరిగినప్పటికీ, జీడీపీలో పరిశ్రమ వాటా అప్పటిలానే ఇప్పుడు కూడా ఒకటో వంతుగానే ఉంది. వ్యవసాయ రంగ వాటా కూడా క్షీణించింది. పంట దిగుబడులు ప్రపంచ ప్రమాణాల కన్నా తక్కువ స్థాయులలో ఉన్నాయి. సేవల రంగమే ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగంగా పరిణమించింది. అది చాలా వరకు, ఆర్థిక వ్యవస్థలో అవ్యవస్థీకృత భాగంగానే కొనసాగుతోంది. సరైన ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా సత్వర సేవల రంగాన్ని చూపలేం. ఉత్పాదకత పెంపుదల మూడు సంస్థాగత మార్పులపై ఆధార పడి ఉంది. వస్తూత్పత్తి రంగం గణనీయమైన రీతిలో పెద్దదిగా మారాలి. ఆర్థిక వ్యవస్థ మరింత నియతమైనదిగా మారాలి. పట్టణీ కరణ వేగంగా సాగాలి. ఆర్థికవ్యవస్థ తగినంత వేగాన్ని పుంజు కోవడానికి చేయవలసింది చాలా ఉంది. టి.ఎన్. నైనన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రాజ్యాంగం ఓ ‘సోషల్ డాక్యుమెంట్’
రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26న ఆమోదించుకొని శాసనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలను అధ్యయనం చేసి రెండేళ్ల 11 నెలల 11 రోజుల సుదీర్ఘ కసరత్తు చేశాక బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలోని కమిటీ దేశానికి ఓ ఆదర్శ ప్రాయమైన రాజ్యాంగాన్ని అందించింది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వ భావనలను ఫ్రెంచ్ రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకొన్నారు. పంచవర్ష ప్రణాళికలను రష్యా నుంచి, మార్గదర్శక సూత్రాలను ఐర్లాండ్ నుంచి, సుప్రీం కోర్టు విధివిధా నాలను జపాన్ నుంచి స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగించే పరిపాలనకు రాజ్యాంగమే మార్గదర్శి. చట్టాల రూపకల్పనకు దిక్సూచి. దేశ ప్రజలకు రాజ్యాంగం అనేక హక్కుల్ని కల్పించింది. బాధ్యతలను అందించింది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు, ప్రభుత్వాలు చేసిన హామీలను, చేసిన చట్టాల అమలులో లోపాల్ని సవాలు చేసే హక్కును రాజ్యాంగం కల్పించింది. ప్రపంచంలోని అనేక దేశాలు రాజకీయ, సామాజిక అస్థిరతలతో కుప్పకూలాయి. కానీ, ఎంతో విశాలమైనదీ, అతి పెద్ద జనాభాతో కూడి అనేక భిన్న సంస్కృతులు, భాషలు, వర్గాలు,సంప్రదాయాలు కలిగి ఉన్నప్పటికీ ‘భిన్నత్వంలో ఏకత్వం’లా సుదృఢంగా భారతదేశం 8 దశాబ్దాలుగా నిలబడగలిగిందంటే నిస్సందేహంగా మనకున్న అతి గొప్పదైన రాజ్యాంగమే కారణం. రాజ్యాంగం కేవలం ఒక నియమాల సంకలనం కాదు. సమసమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు దారిచూపే ఓ ‘దీపం’. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి నడిపించాలో నిరంతరం గుర్తు చేసే ఓ దార్శనిక పత్రం.ప్రవేశిక ప్రాధాన్యంరాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా ఉండాలని నిర్దేశించింది. ప్రవేశికలో ‘భారత ప్రజలమైన మేము’ అనే వాక్యంతో మొదలుపెట్టి ‘ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకొంటున్నాము’ అని ఉంటుంది. భారత రాజ్యాంగం దేశంలో ఏ ఒక్క వర్గానిదో, మతానిదో కాదు. కులం, మతం, వర్గం, భాష, లింగ వివక్ష, విద్య... ఇంకా ఇతర ప్రమాణాలతో నిమిత్తం లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరి సమానత్వం కోసం ఏర్పరిచింది. సార్వభౌ మత్వం అంటే అర్థం ప్రజలు మాత్రమే సర్వాధికారులు. ప్రభుత్వా లన్నది ప్రజలకు సేవ చేయడానికి ఉనికిలో ఉంటాయి. ప్రభుత్వాల అధికారాలన్నీ ప్రజల చేత, ప్రజల తరఫున, ప్రజల కోసం పాలించ డానికి ఇవ్వబడేవే! రాజ్యాగం గొప్పదైనంత మాత్రాన ఆశించిన ఫలితాలు అంద వని ముసాయిదా ప్రతిని సమర్పించి 1949 నవంబర్ 26న చేసిన చరిత్రాత్మక ప్రసంగంలోనే అంబేడ్కర్ పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగం ఎలా పని చేస్తుందన్నది దాని స్వభావంపై ఆధారపడిలేదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ అనే అంగాలను మాత్రమే రాజ్యాంగం ప్రసాదించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఆకాంక్షలను, రాజకీయాలను కోరుకొంటున్నారన్న దానిపైనే వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది’’ అంటూ స్పష్టం చేశారు.మంచీ... చెడూ...రాజ్యాంగబద్ధమైన పాలనలో దేశం కొన్ని మైలురాళ్లు చేరుకున్న మాట వాస్తవం. 1947లో దేశ ప్రజల సగటు ఆయుష్షు 32 సంవత్సరాలు మాత్రమే. ఇప్పడు అది 72 సంవత్సరాలకు పెరిగింది. అక్షరాస్యత 16% నుండి 80 శాతానికి చేరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 35.773 కోట్ల టన్నులకు పెరిగింది. 1947లో కేవలం 1,500 గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరగగా ఇప్పుడు దాదాపుగా ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యాలు ఏర్పర్చు కోగలిగాము. రహదారుల నిర్మాణం కూడా 4 లక్షల కిలోమీటర్ల నుంచి నేడు 60 లక్షల కిలోమీటర్లకు చేరుకోగలిగాము. అంటరాని తనం చట్టపరంగా తొలగించబడింది. దళితులు, గిరిజనులపై జరిగే అకృత్యాల నుండి పరిరక్షించే చట్టాలు రూపొందించబడ్డాయి. వివక్షకు గురైన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆహారం, సమాచారం హక్కుగా కల్పించబడ్డాయి. నిరాదరణకు గురైన సామా జిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రు లుగా, న్యాయమూర్తులుగా నియమించబడటం చెప్పుకోదగిన మార్పు. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందినవారి సంస్కృతి, మతపర విశ్వాసాలకు చట్టపరంగా రక్షణలు కల్పించడం జరిగింది. అయితే, రాజ్యాంగం కల్పించిన మహత్తర అవకాశాలను పూర్తి స్థాయిలో ఈ 8 దశాబ్దాల రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందనడం ఓ చేదు వాస్తవం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల స్ఫూర్తి అమలు కాలేదు. ఫలితంగానే, దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల గుప్పిట్లోకి పోయింది. 90 శాతం సంపద 10 శాతం మంది వద్ద పోగుపడింది. ధనికులు మరింత ధనికులు కాగా, పేదలు మరింత పేదలు అవుతున్నారు. విధానపరమైన వైఫల్యాలే దేశాభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయి. రాజ్యాంగం ద్వారా రూపొందించే సంస్థలలో ప్రజా భాగస్వామ్యం, పాత్ర తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.అవగాహన పెరగాలి!రాజ్యాంగంలో ఏర్పర్చుకొన్న సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యాలకు దూరంగా ప్రభుత్వాలు జరగడంతోనే ఈ సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. ఏటా ప్రవేశపెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్లలో సంక్షేమానికి కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇవి ప్రాధాన్య రంగాల స్థాయి నుంచి మొక్కుబడి స్థాయికి దిగజారి పోయాయి. ప్రభుత్వాలకు ఆదాయం ప్రజల పన్నుల ద్వారా సమకూరుతున్నదే. పన్నుల్లో ఎంతమేరకు తిరిగి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారో లెక్కలు తీస్తే సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అర్థం అవుతుంది. సామాజిక న్యాయం జరగకపోతే రాజ్యాంగం ఆశించిన తీరులో అభివృద్ధి జరగదు. రాజ్యాంగ సూత్రాల స్ఫూర్తితో పని చేస్తేనే పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడతాయి. అధికార వికేంద్రీకరణ జరగాలి. అన్ని వర్గాల ప్రజలను సాధికారుల్ని చేయగలిగితేనే... భారత రాజ్యాంగం ఆశించిన మేరకు ఫలితాలు అందుతాయి. భారత రాజ్యాంగాన్ని ఓ సోషల్ డాక్యుమెంట్గా అమలు చేసినప్పుడే ప్రజల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంత రాలు తగ్గుతాయి. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పర్చుకోవాలి. రాజ్యాంగం అందించిన హక్కులను ఉపయోగించుకొని ప్రభుత్వాలను నిలదీయాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు (నేడు గణతంత్ర దినోత్సవం) -
సునీల్ మిత్తల్ (వ్యాపార కుబేరుడు) రాయని డైరీ
దావోస్ నుండి తిరిగి వచ్చేస్తుంటే దారి మధ్యలో ట్రంప్ నా మనసులోకి వచ్చారు! నిజానికి ఆయన ఎవరి మనసులోనికైనా కొత్తగా రావటం ఉండదు. వచ్చేసి, ఇక వెళ్లకపోవటమే ఉంటుంది. ఏం మనిషి!! ప్రపంచాన్ని పిచ్చిగా షేక్ చేస్తున్నారు ఆయన. షేక్ చేయటం అంటే, కదిపేయటం మాత్రమేనా, ‘కలిపేయటం’ కూడా! ట్రంప్ పిచ్చికి ఒక పద్ధతి ఉన్నట్లుగా నాకు తోస్తోంది. పెద ఉప్పెన ఒకటేదైనా వచ్చిపడాలి... మనుషులంతా ఒకరిలోకి ఒకరు మునగదీసుకోవటానికి! దేశాలైనా అంతే, ఉపద్రవం వచ్చిపడితే హద్దులు చెరిపేసుకొని భూభాగాలన్నీ ఒకచోట చేరిపోవలసిందే. మనుషులకన్నా ఏం గొప్పవని ఈ దేశాలు!ట్రంప్ ఇప్పుడొక ఉప్పెన. ఒక ఉపద్రవం. నాకనిపిస్తోందీ... యూరప్ చాలా కాలంగా సెలవుల్లో ఉన్నట్లుగా ఉండటం వల్ల ట్రంప్ను తమాయించుకోలేక పోతున్నదని! సెలవుల నుంచి తిరిగొచ్చాక, ఇంట్లో పని ఉంటుంది; ఒంట్లో బద్ధకంగా ఉంటుంది. ట్రంప్ ఆ బద్ధకాన్ని వదిలించి, మూలన ఉన్న చీపురును చేతికి అందుకునేలా చేశారు. ‘‘గ్రీన్ల్యాండ్ను కలిపేసుకుంటాం’’ అని ఆయన ఒక్కమాట అనగానే ఐరోపా దేశాలన్నీ మెలకువలోకి వచ్చేశాయి! ఆయన ఒక్కసారిగా ట్యారిఫ్లు పెంచేయగానే ఇండియా వంటి దేశాలతో ట్రేడ్ డీల్స్ కోసం పరుగులు పెడుతున్నాయి. ఈయూ లీడర్లు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు. ‘యూరోపియన్ కమిషన్’ ప్రెసిడెంట్ మిస్ ఉర్సులా వాండర్, ‘యూరోపియన్ కౌన్సిల్’ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా... రేపు జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు ప్రత్యేక అతిథులు. ఆ మర్నాడే ‘ఇండియా–ఈయూ’ సదస్సు. బహుశా, సెలవుల నుంచి ఎలా తేరుకొని ఎలా పనిలో పడిపోవాలో తెలుసుకునేందుకు ఇండియాతో ఆ సదస్సులో యూరప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవచ్చు. ఇండియాకు వర్క్ తప్ప వెకేషన్ అలవాటు లేదు కనుక ప్రతిఫలంగా యూరప్ నుంచి వర్క్ తీసుకోవచ్చు. ట్రంప్ విషయంలో ఇండియా ‘‘ఇలా ఉండాల్సింది’’, ‘‘అలా ఉండాల్సింది’’ అని ఇండియాలోనే కొందరు విమర్శిస్తున్నారు! ‘ఉండాల్సింది’ అనే మాటను ఎప్పుడైనా సరే, భుజాల మీద బరువు లేని తేలికపాటి మనుషులు మాత్రమే అనగలరు. నేను బిజినెస్మేన్నే కావచ్చు. కానీ నేను జియోపాలిటిక్స్ స్టూడెంట్ని కూడా! ట్రంప్ ట్యారిఫ్ల శబ్దానికి ప్రతీకారంగా ఇండియా మౌనం వహించటమే దీటైన జవాబు అని నేను నమ్ముతాను. శబ్దానికి శబ్దంతో సవాలు విసిరితే అది తగాదా అవుతుంది. మౌనాన్ని అస్త్రంగా సంధిస్తే అవతలి వాళ్ల శబ్దాలు తాటాకు చప్పుళ్లుగా మాత్రమే మిగులుతాయి! ఇది కదా ప్రత్యర్థి ప్రకోపాన్ని శక్తిహీనం చెయ్యటం! గాజాను గొప్ప రియల్ ఎస్టేట్గా మారుస్తానని ట్రంప్ దావోస్ ఎకనమిక్ ఫోరమ్లో అన్నారు! ఒక పిచ్చివాడు అనలేని మాట అది. పచ్చి వ్యాపారి మాత్రమే అలా అనగలడు. చందమామ కోసం గెడకర్రతో ఆకాశాన్ని కదిలిస్తే కనీసం చుక్కలైనా రాలకపోతాయా అని ఆలోచిస్తారు ట్రంప్. ట్రంప్ అనే అధ్యక్షుడిలో ట్రంప్ అనే అనేకమంది వ్యాపారులు ఉన్నారు. లేకుంటే ఆయన గాజాను, గ్రీన్ల్యాండ్ను పునర్నిర్మించాల్సిన నివాస ప్రాంతాలుగా కాకుండా, కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్సులుగా ఎందుకు చూస్తారు? ఎకనమిక్ ఫోరమ్లో ట్రంప్ 72 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ప్రతి మాటలోనూ ‘అమెరికా ఫస్ట్’ అనే క్లాసిక్ నినాదం చాలా కఠినంగా ధ్వనించింది!ఫస్ట్ అన్నప్పుడు పరుగెత్తి ఫస్ట్ రావాలి. కానీ ట్రంప్, అమెరికాను ఉన్నచోటనే ఉంచి, అమెరికా ఫస్ట్ అనిపించేలా ప్రపంచం ఉన్న ఆర్డర్ని మార్చాలని చూస్తున్నారు! ఆశ్చర్యం ఏముంది?! ఫక్తు వ్యాపారి అలాగే కదా చూస్తాడు, అలాగే కదా చేస్తాడు! -
బేఫికరుండు.. నాదీ గేరంటీ
‘ఏం తమ్మీ మంచి గున్నవా?’..‘మంచిగున్న అన్నా.. నిన్నిట్టా సీఎం పోస్టులో జూస్తాంటే బలే హేపీగా ఉన్నదన్నా’..‘మీ బాపూ చూపించిన దారే గద తమ్మీ. అందుకే గద తమ్మీ.. సార్ని నేను దేవుడంటా వుంటా’..‘నీ అసుంటి మంచోడు దునియాలోనే వుండడన్నా.. మంచి జేసినా గూడా యెనకాల గోతులు తవ్వేటోల్లే తప్ప.. ఇలా యాది పెట్టుకునేటోళ్లు యెవరుంటున్నారన్నా’..‘అరె ఛుప్. అలా గట్టిగా అనకురా తమ్మీ.. నీ బాపు గురించి నువ్వే సీక్రెట్స్ బయటపెట్టేస్తన్నావని.. అందరూ క్రిటిసైజ్ చేస్తారు మల్ల’.. ‘అర్రర్రె పాయింటు మర్చిపొయినా! అది మన హిస్టరీనే గదా.. బలే గుర్తుచేశావ్ రేవంతన్నా. మనలో మనం మురిసిపోవచ్చు గానీ.. బయటకు అనగూడదు కరక్టే.’‘నీ బాపు ఎక్కడ తమ్మీ.. కానొస్తలేడు. అందరం దావోస్ లోనే ఉన్నం. ఒకే చోట తిరుగుతున్నం. ఒకే పంచాయతీలు పెడుతున్నాం. పుటో దిగుతున్నం. డప్పు గొట్టిపిచ్చుకుంటున్నం.. అయినా మీ నాయిన కానొస్తలేడేంది తమ్మీ’.. ‘ఊకో అన్నా.. దావోస్ ల నువ్వు ఉన్నావంటేనే మా నాయినకు జొరమొచ్చేట్టుంది. దూరం నుంచి నువ్వు గనిపిస్తే చాలు.. తప్పించుకు తిరుగుతున్నాడు పాపం..’‘గదేంది తమ్మీ.. నీ బాపు గనిపిస్తే క్లోజ్డ్ రూంల సిటింగేసి ముచ్చట బెట్టాలనుకుంటి’‘ఊర్కో అన్నా. ఒక క్లోజ్డ్ రూం ముచ్చటనే బరాబర్ బజార్ల పెట్టేశావు. దునియా అంతా మా మొహాన దుమ్మెత్తి పోస్తాంటే లాక్కోలేక పీక్కోలేక నానా యాతన అవుతాంది. మా మినిస్టర్లను జూసినవా. నిన్ను ఒక్క మాటైన అననీకి, నువు జెప్పింది అబద్దం అననీకి దైర్యం లేదు. కానీ.. మా నాయిన మీద బురదని మాత్రం కడిగెయ్యాలి.. అందుకోసం ఎన్ని పాట్లు పడుతున్నారో జూసినవా..’‘మరైతే బాపును క్లోజ్డ్ రూం ల కలవడం కుదరదంటవా..’‘నువ్వింకోపాలి ఆ క్లోజ్డ్ రూం మాటెత్తితే దావోస్ నుంచే పారిపోయేట్టున్నాడన్న మా నాయిన’‘చల్ తియ్.. అయితే మాన్లె. నిన్నయినా ఇట్ట ఓపెన్ రూం కల్సులు అయ్యె ఈ తానకి’‘అయినా రేవంతన్నా.. ఏడాదికి మించి కుర్సీలో ఉండవేమో అనుకుంటినే’‘గట్లెట్ల అవుతది తమ్మీ.. నాదేమైనా గసుమంటి గిసుమంటి ట్రెయినింగనుకుంటివా? మీ బాపు దగ్గర నేర్చుకుంటినని యాద్ మరిసితివా? ఎవులైతే మన కుర్సీ మీద కన్నేసిన్రో.. ఆల్లందరూ ఇప్పుడు అవినీతి కంప్లయింట్ల బురదలో పడి కొట్టుకుంటున్నరు.. జూసినవా’‘అరె.. ఏం వుషారున్నవ్ రేవంతన్నా.. ఈ లెక్కన నీకు అయిదేళ్లూ కుర్సీ గ్యారంటీ స్కీముంటదేమో నన్నా’‘తప్పదు గద తమ్మీ.. వుషారుండాలె. దునియా అందరికీ నీ బోంట్ల కుర్సీలో కూర్సోబెట్టే బాపు వుండడు గద తమ్మీ’‘ఎక్కడన్నా.. కూర్సొనుడు కూర్సొనుడ అనుకోడమే గానీ.. ఎప్పుటికి గూర్సుంటనో ఏమో’‘నీకు మించి నీ బాపుకి మస్తు కోరికున్నది గానీ.. ఫికరు జెయ్యకు తమ్మీ.. జరూరు కుర్సీ నీదే..’‘మా సోపతోల్లు ఊకుంటరో లేదో నని చిన్న గుబులున్నది అన్నా’‘చల్ తియ్.. గింత బేకారున్నవేంది తమ్మీ. నీ సోపతుల్లో పవన్ కల్యాణు నీ కుర్సీ మోసేటందుకే ఎగబడుతోంటే నువ్వు ఫికరౌతవేంది. బేఫికరుండు.. అంతగైతే నేనున్న గద. మంత్లీ మంత్లీ డిల్లీకి జమాయిస్తన్నది కాస్తా ఓపాలి నీకు జమాయిస్త. గంతె. జబర్దస్త్ నువు కుర్సీలో కొస్తవ్.. నాదీ గేరంటీ’‘ఆ మాట అనబోకు రేవంతన్నా.. నీ ఆరు గేరంటీల్లోనే యిది గూడా కలిపేస్తావేమో’‘ఇంత పిచ్చోనివి ఎలా బతుకుతవ్ రా బై. మందికిచ్చేటిది.. నా దేముని కొడుకైన తమ్మీకిచ్చేటిది వొకటే అవుతదా’‘ఆ మాటన్నావ్.. దైర్యంగా వుందన్నా’‘చల్ పోదం పా. ఉన్నూర్లో ముచ్చట్లాడుకోవాలంటే.. గాలికి గూడా సెవులు మొలుస్తయ్.. యింటా వుంటయ్.. యింత కష్టపడి స్పెషలు గాలిమోటర్లేసుకుని దావోసు కొచ్చినం. యిక్కడైనా మన మనసులో ముచ్చట్లు పంచుకోకుంటే గెట్ల? యింక పోదాం తియ్’::రాజేశ్వరి -
'వ్యూహం' అమలు తీరు ఇదేనా?
అమెరికా గత నవంబర్లో ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ’ పత్రాన్ని చది విన వారికి, ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును గమనించి నప్పుడు, ఆ వ్యూహాన్ని అమలు పరచవలసింది ఇట్లాగేనా అనే సందేహం కలుగు తుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) అనే లక్ష్యంతో రూపొందించిన ఆ సమగ్ర వ్యూహం అమలులో చాకచక్య మైన దౌత్య నైపుణ్యాన్ని, ఓర్పును ప్రదర్శించాలి. అమెరికా ఆధిపత్యానికి 21వ శతాబ్దం ఆరంభం నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్న స్థితిలో, తమ దేశాన్ని ‘తిరిగి గొప్పదిగా’ చేయదలచుకునే నాయకత్వం అటువంటి నీతిని అనుసరించని పక్షంలో, ఉన్న సవాళ్లు పరిష్కారం కాకపోగా కొత్తవి తలెత్తక తప్పదు.ట్రంప్ చాణక్యనీతికి బదులు ధూర్తనీతికి పాల్పడుతున్నందున ప్రస్తుతం జరుగుతున్నది అదే. అందుకు వెనిజులా, గ్రీన్ల్యాండ్, యూరప్, కెనడా, ఇండియా వంటి కొన్ని ఉదాహరణలను గమనించినా, ఆయన నాయకత్వాన అమెరికా ‘తిరిగి గొప్పది’ కావటం అట్లుంచి మరింత వేగంగా తన గొప్పతనాన్ని కోల్పోక తప్పదనే అభిప్రాయం కలుగుతుంది. గ్రీన్ల్యాండ్కు సంబంధించి జరుగుతున్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటం అట్లుంచి, అమెరికా మిత్ర ప్రపంచంలోనే కల్లోలాన్ని సృష్టిస్తున్నది. చివరకు విషయం ఎటు తేలినా, ఆ మిత్ర ప్రపంచంతో పాటు తక్కిన ప్రపంచం దృష్టిలోనూ ట్రంప్ పట్ల విశ్వసనీయత మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఒక వ్యూహం విజయవంతం కావాలంటే కేవలం అమెరికాకు గల ఆర్థిక బలం, మార్కెట్ బలం, సైనిక బలం చాలవు. వాటితో పాటు శాస్త్ర, సాంకేతిక బలం ఉండి కూడా గత పాతికేళ్ళుగా సవాళ్ళు పెరగటం లేదా? కనుక కావలసింది దేశాలతో విశ్వసనీయత, సత్సంబంధాలు. కేవలం బలాలను ఉపయోగించి ఇతరులను బెదిరించే కాలం గతించి పోయిందని సాక్షాత్తూ ‘వ్యూహ’ పత్రమే అంగీకరిస్తున్నది. అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోక పోవటం ఆశ్చర్యకరం.మొత్తంగా వశమైతేనే...గ్రీన్ల్యాండ్ విషయం ముందు చూద్దాం. యూరప్లోని డెన్మార్క్కు చెందిన ఆ ద్వీపపు రక్షణ, అక్కడి వనరులు ఆ ప్రాంతాల కోసమో, యూరప్ కోసమో అవసరమనీ, వాటిని రష్యా, చైనాల బారిన పడకుండా కాపాడాలనీ ట్రంప్ భావిస్తున్నట్లయితే, ఆ ప్రకారం గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్లతో చర్చలు జరిపి తగిన ఉమ్మడి విధానాన్ని రూపొందించవచ్చు. కానీ ఆయన గ్రీన్ల్యాండ్ భూభాగం, అక్కడి వనరులు, దాని రక్షణ ‘అమెరికా ప్రయోజనాల కోసం తప్పక అవసర’మని బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకు గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరప్లలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ‘అంగీకరిస్తారా, సైన్యాన్ని పంపమంటారా’ అని భయపెట్టజూస్తున్నారు. ఒత్తిడి చేసేందుకు ఈ నెల 17న 10 శాతం సుంకాలు ప్రకటించి, వాటిని జూలై నుంచి 25 శాతానికి పెంచగలనని హెచ్చరించారు.అమెరికాను ‘తిరిగి గొప్పది’ చేయగల దౌత్యనీతి, ఆర్థిక విధానం ఇవేనా అన్నది ప్రశ్న. అది కూడా ‘నాటో’ కూటమిలో తన సహచరులై, రాగల కాలంలో తమతో తప్పక నిలవవలసిన దేశాలంటూ ‘వ్యూహ పత్రం’లో తామే ప్రకటించిన వారిపట్ల చూపవలసిన వైఖరి? వాస్తవానికి గ్రీన్ల్యాండ్లో అమెరికన్ సైనిక స్థావరాల నిర్మాణం, వాటి విస్తరణ కోసం డెన్మార్క్తో 1951లోనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపు పాఠాన్ని చూసిన వారికి, అక్కడ ఏమి చేయాలన్నా డెన్మార్క్తో ‘సంప్రదింపులు’ జరపాలనే నిబంధన తప్ప వారి ‘అంగీకారం’ కావాలనే షరతు కనిపించదు. అనగా అంతటి స్వేచ్ఛ అమెరికాకు ఉందని స్పష్టమవుతుంది. అమెరికన్లు అక్కడ గతంలోనే ఒక ఉపరితల స్థావరం, ఒక భూగర్భ అణుశక్తి స్థావరం నిర్మించారు కూడా! కానీ ఇవేవీ చాలవని, గ్రీన్ల్యాండ్ ‘పూర్తిగా స్వాధీనమైతేనే దాని రక్షణకు తగిన మానసిక స్థితి’ తనకు కలుగుతుందని ట్రంప్ ఆశ్చర్యకరంగా వాదిస్తున్నారు. ఆ ప్రాంతంలోని రష్యా, చైనా యుద్ధ నౌకలున్నాయని, వారు మైనింగ్ జరుపుతూ వనరులను కొల్లగొడుతున్నారనే మాటలు ఎంతమాత్రం నిజం కాదని గ్రీన్ల్యాండ్, డెన్మార్క్లు స్పష్టం చేస్తున్నా లెక్క చేయటం లేదాయన.మిత్రులు సైతం దూరంగ్రీన్ల్యాండ్ విషయం అట్లుంచి కూడా, ముఖ్యంగా చైనా సవాలు గురించి ‘వ్యూహపత్రం’లో సుదీర్ఘంగా చేసిన చర్చలో, యూరప్ తిరిగి శక్తిమంతం కావటం, రష్యా–యూరప్ల మధ్య రాజీ, అమెరికాతో సంబంధాల అభివృద్ధి వంటి తనదైన దార్శ నికతను చూపిన ట్రంప్, ఆచరణలో అందుకు తగిన దౌత్యపరిణతిని ప్రదర్శించటానికి బదులు, అంతకుముందు వలెనే, ఈ ‘పత్రం’ ప్రకటన తర్వాత సైతం ధూర్త దౌత్యాన్నే ప్రయోగిస్తున్నారు. ఉక్రె యిన్ యుద్ధం, సుంకాల విధింపు దరిమిలా యూరోపియన్ యూని యన్కు అమెరికాతో ఇప్పటికే పేచీలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య వివాదాల కారణంగా వారు అమెరికా నుంచి చైనా వైపు మళ్లటం మొదలైంది. చైనాను వ్యతిరేకిస్తూ వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ... అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదనీ, చైనా నమ్మదగ్గదనీ బహిరంగంగా ప్రకటిస్తూ, గత వారమే బీజింగ్కు వెళ్లి భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. చైనా ఎలక్ట్రికల్ కార్ల దిగుమతిపై సుంకా లను 100 శాతం ఎత్తివేయటం వాటిలో ఒకటి. రానున్న కొద్ది నెలల్లో మరికొందరు యూరోపియన్ ప్రభుత్వాధినేతల పర్యటనలు కూడా ఖరారయ్యాయి.అమెరికాకు అన్నివిధాలా సన్నిహితమైన యూరప్ పరిస్థితి ఇది కాగా, తక్కిన ప్రపంచ దేశాల ఆలోచనలు ఏమిటో ఊహించవచ్చు. అటు తూర్పున అమెరికాకు ఇంతే సన్నిహితమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ కూడా ఈ నెల మొదటి వారంలో చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం గమనించదగ్గది. ఇంతకూ ట్రంప్ ‘వ్యూహ పత్రం’, దాని అమలు తీరు, అమెరికా పట్ల దాని మిత్ర దేశాల విశ్వాసం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. తనకు ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’తో తప్ప అంతర్గతంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఏ నియమ నిబంధనలతో నిమిత్తం లేదని బాహాటంగా ప్రక టించిన ట్రంప్ 33 పేజీల ‘వ్యూహ పత్రాన్ని’ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, మిత్రులా, ప్రత్యర్థులా అనే దానితో నిమిత్తం లేకుండా అందరినీ అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. అందుకోసం సామ దాన భేద దండోపా యాలు అన్నింటినీ ప్రయోగించగలమనే సూచనలు కూడా ఆ పత్రంలో దండిగానే ఉన్నాయి.వాడుకొని వదిలెయ్!ఇండియా గురించి కూడా ‘వ్యూహ పత్రం’లో రాసిన మాట లన్నింటి సారాంశం ఇదే. ఒకవైపు వాణిజ్యం, మరొకవైపు ఇండో– పసిఫిక్లో సైనిక వ్యూహాల విషయంలో భారతదేశాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ట్రంప్ గత ఏడాదిగా చేస్తూ వస్తున్నదేమిటో చూస్తూనే ఉన్నాము. ఇపుడు ఈ ‘పత్రం’ మూలంగా అర్థం చేసుకోవలసిందేమంటే, ‘ఉపయోగించుకో – ఒత్తిడి చెయ్ – ఉపయోగించుకో – వదిలెయ్’ విధానం ఇండియాకు సంబంధించి రాగల కాలంలో కూడా కొనసాగుతుందన్నమాట. వ్యూహ పత్రాల రూపంలో ప్రకటించినా, లేకున్నా సామ్రాజ్యవాద విధానాలు ఎప్పుడూ ఇవే!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అది ముమ్మాటికీ ఎన్టీఆర్ను అవమానించడమే!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎన్టీఆర్ అంటే అందరికి గౌరవమే. అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదమూడేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా చేయని పనిచేసి ఎన్టీఆర్ అభిమానుల మన్ననలు పొందారు. చంద్రబాబుకు నిజంగానే ఎన్టీఆర్పై అభిమానం ఉంటే ఓకే కానీ.. ప్రజాధనాన్ని ఇలా ఖర్చుపెట్టడం ఆక్షేపణీయమే. ఒకరకంగా చంద్రబాబు నిర్ణయం ఎన్టీఆర్ను అవమానించినట్లే కూడా. ఎందుకంటే.. ప్రభుత్వ సొమ్ముకు పాలకులు ధర్మకర్తలుగా వ్యవహరించాలని రామరావు తరచూ చెప్పేవారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని అనేవారు. పైగా గుజరాత్లో రూ.3,500 కోట్లతో పటేల్ విగ్రహాన్ని, మహారాష్ట్రలో రూ.మూడు వేల కోట్లతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. విగ్రహాలకు అంత సొమ్ము ఇచ్చిన ప్రభుత్వం అమరావతికి రూ.1500 కోట్లు మాత్రమే ఇస్తుందా? అని అప్పట్లో బాబుగారు నిలదీశారు కూడా. ఇప్పుడు ఆ జోరు లేదనుకోండి.ఎన్టీఆర్ విగ్రహానికి ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేసే విషయమై జనసేనలోనూ అసమ్మతి ఉన్నట్లుగా ఉంది. ఆ పార్టీ మద్దతుదారులు కొందరు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్లో టాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ దుబారా లేకుండా పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తెగ విమర్శించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒకపక్క నిధులు లేవని నిత్యం వాపోతూ, ఇంకోపక్క ఇలా విగ్రహానికి అంత ఖర్చు పెట్టడంపై అందరి అభ్యంతరం. చిత్రమేమిటంటే ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి ఎవరు కూలదోశారో వారే ఇప్పుడు భారీ విగ్రహం పెడతామని చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్కు విలువలు లేవని, సినిమా వాళ్ల రాజకీయాలు అయిపోయాయని ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తే, తన అల్లుడైన ఆయనపై ఎన్టీఆర్ పరుష వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తిరునల్వేలిలో స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు నో చెప్పింది. పార్టీ సొమ్ముతో విగ్రహం పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే ఏపీలో బహుశా ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి దానిని ఒక సాంస్కృతిక కేంద్రంగా చూపించి, మరికొందరి విగ్రహాలు పెడతామని చెబుతారేమో తెలియదు. మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ను తన కార్టూన్ల ద్వారా అవమానించిన ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్కు చంద్రబాబు ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చిందని కొందరు విమర్శిస్తుంటారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటయ్యే ఆయన ఫోటోల ఎగ్జిబిషన్లో ఈ కార్టూన్లు కూడా పెడతారా? అని కొందరు సోషల్ మీడియాలో చమత్కరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపినప్పుడు.. దానికి ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రామోజీరావు ప్రతిపాదించిన అమరావతి అనే పేరును చంద్రబాబు ఖాయం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏడాదిన్నర కాలంలోనే రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరికి ఉపయోగపడే పనులకు నిధులు లేకపోతే, ఎన్టీఆర్ విగ్రహస్థాపనకు రూ.1750 కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం విశాఖలోని రిషికొండపై అత్యంత ఆధునిక రీతిలో సుమారు రూ.250 కోట్లతో భవనాలు నిర్మిస్తే డబ్బులు వేస్ట్ అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. నిజంగానే ఏడాదిన్నరగా నిరర్ధకంగా ఉంచారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయవద్దని కార్మికులు అడుగుతుంటే, వారిని మందలించే రీతిలో మాట్లాడుతూ ప్రజల కట్టే పన్నులను బాధ్యతగా వాడవద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్నారు. భవనాల నిర్మాణానికి, విగ్రహాల ఏర్పాటుకు ఇష్టారీతిన దుబారా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ప్రజల పన్నుల నుంచి చెల్లించవలసిందే కదా అన్న ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వడం లేదు. గత టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంత ఖర్చు చేసింది కాని, పనులు ముందుకు తీసుకువెళ్లలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల విగ్రహం పెట్టడం కన్నా, విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దితే బాగుంటుందని భావించి నిర్మాణం చేసింది. ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ ,ఇతర కూటమి నేతలు అక్కడికి వెళ్లకపోగా.. దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి అక్కడ పారిశుధ్య పనులు నిర్వహించేవారికి సైతం జీతాలు సరిగా ఇవ్వడం లేదు. అలాంటివారు ఇప్పుడు నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఫోటో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. నీరుకొండలో 1986 ప్రాంతంలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వమే ఉండేది. అలాంటి చోట ఆయన విగ్రహం ఏర్పాటు ఏమిటన్నది కొందరి ఆక్షేపణ. కాగా కొన్నివర్గాలు మరికొన్ని డిమాండ్లు తీసుకు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పాలని కొంతమంది కోరుతుంటే.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని జనసేన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలియదు కాని, ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1750 కోట్లు వ్యయం చేయడానికిపూనుకోవడంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నమాట నిజం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సంస్కరణలతోనే సత్వర వృద్ధి
ఒకపక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోపక్క అమెరికా ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. ఈ కీలక ఘట్టంలో 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి ముందస్తు అంచనాలు కొన్ని శుభ వార్తలను మోసుకొచ్చాయి. స్థూల జాతీ యోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి రిజర్వ్బ్యాంక్ తొలుత అంచనా వేసినట్లు 6.5 శాతం కాక, 7.4 శాతం ఉండగలదనే అంచనాకు రావడం పరిస్థితులలో వచ్చిన మార్పును సూచిస్తోంది. సంస్కరణలు మార్పు తెచ్చాయనీ, వృద్ధి ఇదే స్థాయిలో నిలకడగా కొనసాగేందుకు వాటిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందనీ కూడా ఇది సూచిస్తోంది. వస్తువు – సేవల పన్ను (జీఎస్టీ)లో శ్లాబులను మార్చడం, చాలా వాటిపై పన్నుల శాతాలు తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తేటపడింది. జీఎస్టీలోని నియంత్రణ సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకుని ఆ మార్పుచేర్పులు ఎప్పుడో చేసి ఉండ వలసింది.కాలం చెల్లిన చట్టాలకు గుడ్బై!అలాగే, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని చర్యలను ఇటీవలి కాలంలో తీసుకున్నారు. పార్లమెంట్ ఐదేళ్ళ క్రితమే ఆమోదించిన నాలుగు కార్మిక స్మృతులను అమలులోకి తెచ్చారు. పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన దాదాపు 29 వేర్వేరు చట్టాల స్థానంలో ఆ స్మృతులు వచ్చి చేరాయి. వలస పాలన కాలంనాటి ఆ చట్టాలను కూడా ఎన్నడో మార్చి ఉండాల్సింది. చట్టాల సంఖ్య ఎక్కువ కావడంతో కార్మిక సమస్యలు ఏళ్ళ తరబడి చిక్కుముడులకు లోనవుతూ వచ్చాయి. ఫలితంగా, వ్యాపార సంస్థలు ఆ చట్టాలను అనుసరించడంలో గందరగోళం నెలకొంటూ వచ్చింది.కొత్త లేబర్ కోడ్స్ ఆర్థిక వృద్ధికి తక్షణం తోడ్పడగల సంస్కరణ కాకపోవచ్చు. కానీ, పెట్టుబడులు పెట్టదలచుకున్నవారికి తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్న అంశాల్లో అవి స్పష్టతను, సరళతను తెచ్చాయి. ఉదాహరణకు, ఇంటి నుంచి పని చేసే విషయంలో అవి మరింత వెసులుబాటుకు అవకాశం కల్పించాయి. పర్మనెంట్ ఉద్యోగాలకు బదులు స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్సర్ ఉద్యోగాలు పెరుగుతున్న ‘గిగ్’ ఆర్థిక వ్యవస్థలో వర్కర్లకు మరింత సామాజిక భద్రతను కల్పించేందుకు తోడ్పడనున్నాయి. ఆ స్మృతుల్లో ఇప్పటికీ లోపాలు ఉంటే ఉండవచ్చు; వాటిని భవిష్యత్తులో పరిష్కరించు కోవచ్చు. మొత్తానికి, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం వల్ల దేశంలో వ్యాపార నిర్వహణ సులభతరం అయింది. వృద్ధి సానుకూలమే!ఇతర రంగాలలో కూడా సంస్కరణల అవసరం ఉంది. మొదటి ముందస్తు అంచనాలలో అన్నీ సానుకూలంగా ఏమీ లేకపోవడం ఆ వాస్తవాన్ని మరింత వెల్లడిస్తోంది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అంటే అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో వృద్ధి రేటు మందగించింది. మొదటి రెండు త్రైమాసికాలలో వరుసగా 7.8 శాతం, 8.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. తర్వాత, రెండు త్రైమాసి కాలలో ఇది 6.9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నారు. తిరిగి సానుకూలంగా ఉన్న అంశాల వైపు దృష్టి సారిద్దాం. వస్తూత్పత్తి 4.5 శాతం నుంచి 7.4 శాతానికి విజృంభించినట్లు ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది 2025–26 ఆర్థిక సంవ త్సరంలో అధిక వృద్ధి సాధించేందుకు ఊతం ఇచ్చింది. సగటున దాదాపు 8 శాతం చొప్పున, గత మూడేళ్లలో వృద్ధిలో కనిపించిన వేగం కూడా గణనీయమైన విషయమే. ఇప్పటికి కొద్ది ఏళ్ళ నుంచి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకుంటున్నప్పటికీ, మధ్య–ఆదాయ ట్రాప్ నుంచి తప్పించుకునేందుకూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకూ, ఇంకా వేగంగా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేటపుడు, ఆర్థిక మంత్రి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. దృష్టి పెట్టాల్సినవి!అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల మారిపోతున్న ప్రపంచంలో వాణిజ్యమే పెద్ద అంశంగా కనిపిస్తోంది. అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులు 50 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై మరికొంత సుంకాలు విధిస్తామని ఆయన బెదిరిస్తున్నారు. భారత –అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం అనేక కారణాల రీత్యా, ముఖ్యంగా ట్రంప్ అహంకారం వల్ల, ఇప్పటికీ తుదిరూపు దిద్దు కోలేక పోతోంది. మన దేశానికి కొత్త అమెరికా రాయబారిగా వచ్చిన సెర్జియో గోర్ కనబరుస్తున్న సానుకూలత వల్ల, ఈ ఒప్పందం కుదరవచ్చని ఆశలు పొటమరిస్తున్నాయి. దానిమాటెలా ఉన్నా... ఎగుమతులపై ఆధార పడిన, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు బడ్జెట్ కొంత ఆసరా కల్పించవలసి ఉంది. రత్నాలు, ఆభరణాలు వంటి పరిశ్రమలు, రెడీమేడ్ దుస్తుల కంపెనీలు అమెరికా సుంకాలతో బాగా దెబ్బతినిపోతాయని భయ పడిన మాట వాస్తవం. కానీ, అవి వేగంగా ఇతర మార్కెట్లకు విస్తరించడం వల్ల కనీసం తాత్కాలికంగానైనా ఆ ప్రభావాన్ని తట్టుకో గలుగుతున్నాయి. నవంబర్ (2025)కు సంబంధించిన డేటా, ఈ విభాగాల ఎగుమతుల్లో ఆశ్చర్యకరంగా పెరుగుదలను కనబరచింది. ఆ విభాగాల ఎగుమతులు 2025 నవంబర్లో దాదాపు 19 శాతం పెరిగాయి. ఎగుమతులలో వృద్ధికి ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తుల విభాగాలు ప్రధాన ఆలంబనగా నిలిచాయి. ఇంకా ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే, భారీ సుంకాల ప్రతిబంధకాలు ఉన్న ప్పటికీ, అమెరికాకు ఎగుమతులు 22 శాతం పెరిగాయి. మొబైల్ ఫోన్లు, ఎగుమతుల్లో ప్రధాన వస్తువుగా నిలుస్తున్నాయి. ఒక్క ఏడాది కాలంలోనే వాటి ఎగుమతులు మూడు రెట్ల పెరుగుదలను చవిచూశాయి. నిరుద్యోగిత రేటు మూడునెలల కాలంలో అత్యల్ప స్థాయికి అంటే 8.6 శాతానికి తగ్గిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండి యన్ ఎకానమీ’ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం దానికి కారణంగా పేర్కొంది. అయితే, వ్యవసాయమే ఇప్పటికీ 45 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న నైపుణ్యం లేని, నైపుణ్యం ఉన్న వారిని తగినంతగా ఇముడ్చుకోగలిగినంతగా వస్తూత్పత్తి రంగం వ్యాకోచించలేదు. ఈ రంగం విషయంలోనే, భారత్, ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ఇతర దేశాల్లో చిన్న, మధ్య తరహా వస్తూత్పత్తి సంస్థలు తగినంతగా విస్తరించగలిగాయి. వ్యాపార నిర్వహణ సులువుగా సాగే అవకాశాన్ని కల్పించే విధంగా బడ్జెట్ రూపొందాలి. అప్పుడే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అవసరమైన స్థాయిల్లో వృద్ధి రేటును తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్సియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకు తానే రాజకీయ బురద జల్లుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం లేదంటే మంత్రులపై పట్టు పెంచుకునే క్రమంలో ఆయన చేస్తున్న విన్యాసాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నట్లుగా ఉంది. దీనికి తోడు అనవసర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తన విశ్వసనీయతను తానే దెబ్బ తీసుకుంటున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలకు ఆజ్యం పోస్తున్నారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి రాధాకృష్ణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అధికంగా నమ్ముకుంటున్నారన్న భావన కలుగుతోంది. దానివల్ల తెలంగాణ రాజకీయాలపై ఆ పత్రికలో ఏ కథనం వచ్చినా అది ఎంత వివాదాస్పదమైనా, చెత్త పలుకైనా అదంతా రేవంత్ భ్రీఫింగ్ వల్లేనని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మీడియాను ప్రమాణాలతో నిమిత్తం లేకుండా నీచమైన రాతలు రాసేవారిని నమ్ముకుంటే.. అది ఎప్పటికైనా భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాల సారాంశంగా దీనిని తీసుకోవచ్చు. ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ఒక కథనం మహిళా ఐఏఎస్లను కించ పరిచేదిగా ఉందన్నది అభియోగం. దీనిని ఎవరూ సమర్థించరు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు ఖండన ఇవ్వడం, దానిపై ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పింది. అయినా తప్పు చేశారని అనుకుంటే కేసు పెట్టవచ్చు. చర్య తీసుకోవచ్చు. కాని ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించారు. ఆ పోలీసులు విచారణ పేరుతో చట్టబద్దమైన నిబంధనలు పాటించకుండా ఆ టీవీ ఛానల్లో సోదాలు చేయడం, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. ఆ కేసులో ఫిర్యాదుదారు ఎవరు? బాధితులు ఎవరని కోర్టు ప్రశ్నించడంతో నీళ్లు నమలడం పోలీసుల వంతైంది. అంతటితో ఆ ఉదంతానికి ఫుల్స్టాప్ పడినట్లయింది. పోలీసులు ఈ వ్యవహారంలో అతిగా చేశారన్న విమర్శలు వచ్చాయి. అది వేరే కథ. ఇంతలో ఏమి జరిగిందో కాని సడన్గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో ఆ గాయాలను మళ్లీ కెలికారు. వ్యాపార ప్రయోజనం కోసమో, లేక ముఖ్యమంత్రి రేవంత్కు ఉపయోగపడుతందని అనుకున్నారో తెలియదు కాని ఓ కథ వండి జనం మీదకు వదిలారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఈ వివాదంలోకి లాగారు. ఎన్టీవీ యజమానికి సంబంధించిన కంపెనీకి బొగ్గు టెండర్ రావడానికి మల్లు భట్టి రూల్స్ మార్చారని ఆరోపించారు. పోనీ ఈ స్కామ్ వరకు రాసి ఉంటే అది వేరే విషయం అయ్యేది. అలా కాకుండా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీకి ఆ టెండర్ దక్కకుండా ఉండడం కోసం ఎన్టీవీ ఆయనపై అనుచితమైన స్టోరీ ప్రసారం చేసిందని ఆరోపించారు. ఆ క్రమంలో ఆయనకు మహిళలపట్ల ఎంతో గౌరవం ఉన్నట్లు నటించారు. పనిలో పనిగా, ఆవు కథ మాదిరి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మీడియాకు స్వేచ్చ లేదంటూ ఒక పచ్చి అబద్దాన్ని కూడా జోడించారు. రాధాకృష్ణకు నిజంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన ఉంటే, సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగిన దారుణమైన అశ్లీల నృత్యాలపై ఎక్కడైనా సరైన రీతిలో స్పందించారా? ఎల్లోమీడియాలో వైసీపీ మహిళా నేతలపై కక్ష కట్టినట్లు ఎన్ని తప్పుడు కథనాలు వచ్చేవో కూడా తెలిసిందే. ఈ మధ్యనే మాజీ సీఎం జగన్పై నీచమైన శీర్షికలతో కథనాలు లో ప్రసారం చేశారో కూడా చూశాం. ఈయన ఒక వైపు నీచమైన రాతలు రాస్తూ, ఎదుటివారికి నీతులు చెబుతుంటారు. తన వ్యాసంలో మల్లు భట్టిపై ఆరోపణలు చేయడంతోపాటు రేవంత్ ను అమాయకుడన్నట్లు చిత్రీకరించే యత్నం చేశారు. సిట్ వేసిన సంగతి రేవంత్కు తెలియదని అందులో రాశారు. దీనివల్ల రేవంత్కు నష్టం జరిగింది. అయితే.. రేవంత్ భ్రీఫింగ్తోనే రాధాకృష్ణ ఈ వ్యాసం రాశారా అన్న సందేహాన్ని వివిధ రాజకీయ పక్షాలు కాని, చివరికి కాంగ్రెస్ లో కొన్ని వర్గాలు కాని అనుమానించాయి. దానికి తోడు టీవీ కథనం వచ్చిన రోజున కాని, కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన రోజున కాని రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, రాధాకృష్ణ వ్యాసం రాసిన తర్వాత స్పందించడం చర్చనీయాంశం అయ్యాయి. మీడియా సంస్థలు ఆంబోతుల మాదిరి తన్నుకుని తమను అందులోకి లాగవద్దని ఆయన అనడం విడ్డూరంగా అనిపించింది. ఒక వేళ నిజంగానే రాదాకృష్ణ తప్పుడు వ్యాసం రాసి ఉంటే ఆయనపై కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఉండవచ్చు! కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతోనే ఈ గొడవలన్ని బయటకు వచ్చాయన్న భావన ప్రజలలో ఏర్పడింది. దాంతో ఆ బురదను కడుక్కోవడానికి రేవంత్ స్టేట్ మెంట్ ఇచ్చి మంత్రులను బద్నాం చేయవద్దని కోరారు అంతేకాక తమ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు మల్లు భట్టి ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, రాధాకృష్ణ కథనం వెనుక ఎవరు ఉన్నారో తర్వాత చెబుతానని అన్నారు. పైగా తెలంగాణ వనరులు, సంపదను దోచుకోవడానికి వ్యవస్థీకృత నేరస్తులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మరో మాట కూడా చెప్పారు. బీఆర్ఎస్కు లబ్ది జరిగేలా కథనాలు ఉండవద్దని అన్నారు. తనకు డామేజీ అవుతోందని అర్థం చేసుకుని ఈ వ్యాఖ్య చేసి ఉండాలి. నిజంగానే బీఆర్ఎస్ ఈ ఎపిసోడ్ను తనకు అనుకూలంగా మలచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సింగరేణి టెండర్ల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేయడం, ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులలో ఉన్న ముగ్గురి మధ్య కాంట్రాక్ట్ కోసం పోటీ జరిగిందని, మంత్రివర్గంలో పలువురు మంత్రులు దోచుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఖతం చేసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలని ఆయన అన్నారు. అదే ఎన్టీఆర్కు నివాళి అని కొత్త సూత్రీకకరణ చేశారు. అదేదైనా అయితే చంద్రబాబుకు కానుక అవుతుంది కాని, ఎన్టీఆర్కు ఎలా శ్రద్దాంజలి అవుతుందో తెలియదు.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీకి ఉన్న కాస్తో, కూస్తో బలాన్ని, ఆ పార్టీకి ప్రధానంగా మద్దతు ఇచ్చే సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని రేవంత్ మాట్లాడినట్లు అనిపిస్తుంది. పైగా తెలంగాణలో టీడీపీ ఖతం అవడానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ల పాత్ర కారణమన్నది బహిరంగ రహస్యమే కదా! ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఎగబాకారు. అయినా పాత వాసన వదులుకోలేక పోతున్నట్లు ఉంది. కాంగ్రెస్ను అంతం చేయడానికి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ను రేవంత్ పొగడడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సంతోషిస్తారో చెప్పలేం.ఏది ఏమైనా ఈ మద్యకాలంలో పలు ప్రకటనలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చేస్తూ రేవంత్ రెడ్డి ఎదుటివారిపై బురద చల్లబోయి.. తనపై కూడా వేసుకుంటున్నట్లు ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీలో నాయకత్వ కోర్సులో చేరిన రేవంత్ బీఆర్ఎస్ గద్దెలు గ్రామాలలో లేకుండా చేయాలని అనడం ఏ పాటి నాయకత్వ ప్రమాణం అవుతుందో!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నవ లోకం... మన కోసం!
గతాన్ని సమీక్షించుకుంటూనే, రాబోయే కాలంలో శాస్త్ర, పరిశోధన రంగాల్లో భారత్ ఎటువంటి అద్భుతాలు సృష్టించనున్నది, ప్రపంచ యవనికపై మన దేశం ఏ ఏ మైలురాళ్లను అధిగమించబోతోంది అనే అంశాలను తరచి చూడాల్సిన సమ యమిది. శాస్త్ర – సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు ఒక్కోసారి యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఎక్స్–రే వంటివి కనిపెట్టడాలు అనుకోకుండా జరిగినవే అయినా, భారీ ప్రాజెక్టులు మాత్రం పక్కా ప్రణాళికతోనే పట్టా లెక్కుతాయి. ఏళ్ల తరబడి సాగే కఠోర శ్రమ, వ్యూహాల ఫలితంగానే ఆ యా రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.1969 తర్వాత మళ్లీ ఇప్పుడు జాబిల్లిపై మనిషిని దించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ‘నాసా’ చేపట్టిన ‘ఆర్టిమిస్’ కార్యక్రమం ద్వారా వ్యోమగాములను చంద్రుడి పైకి పంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు చైనా సైతం తన ‘ఛాంగ్ ఈ–7’ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు సిద్ధమైంది. సూర్యరశ్మి సోకని ఈ ప్రాంతంలో ఘనీభవించిన నీటి జాడలు ఉన్నట్లు తేలడంతో ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. చైనా ఈ ఏడాదే ‘జున్టియాన్’ టెలిస్కోపును, ‘మెంగ్ఝౌ–1’ వ్యోమ నౌకను పరీక్షించనుంది. 2026 నాటికి ‘లాంగ్ మార్చ్–10’ ద్వారా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలన్నది చైనా లక్ష్యం.అంతరిక్ష రక్షణ విషయానికొస్తే, నాసా ’డార్ట్’ తరహాలోనే ఒక సరికొత్త ప్లానెటరీ డిఫెన్స్ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘2015 ఎక్స్ఎఫ్261’ అనే ఖగోళ శకలాన్ని నేరుగా ఢీకొట్టి దాని మార్గాన్ని మళ్లించే ప్రయత్నం చేయనున్నారు. గతంలో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్లనే రాక్షసబల్లులు అంతరించినట్లు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. భవిష్యత్తులో అటువంటి ముప్పులు రాకుండా ఉండటంతో పాటు, ఆయా గ్రహశకలాల్లో ఉండే అరుదైన ఖనిజాలను మన అవసరాలకు వాడుకోవడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. కిలోమీటరు పొడవుండే ఉల్కా శకలాలను ఒడిసిపట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడం ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న సవాలు.గగన్ యాన్ పరీక్ష...భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత అంత రిక్ష ప్రయోగం ‘గగన్ యాన్ ’కు 2026 సంవత్సరం చాలా కీలకం కానుంది. అసలు ప్రయోగానికి ముందు సిబ్బంది లేకుండా అనేక ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. హ్యూమనాయిడ్ రోబో ‘వ్యోమమిత్ర’, అత్యవసర పరిస్థితుల్లో వ్యోమనౌక నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్, ప్యారాచ్యూట్ వ్యవస్థ పనితీరు, గగన్ యాన్ క్యాప్సూల్ను కక్ష్య వరకూ తీసుకెళ్లడం వంటివన్నీ ఉన్నాయి. ‘బ్లూ ఆరిజిన్’ తన హెవీ లాంచర్తో జాబిల్లిపైకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది అటు ప్రభుత్వ, ఇటు వ్రైవేట్ కంపెనీల అంతరిక్ష ప్రయోగాలు, జాబిల్లి యాత్రలు చాలానే ఉన్నాయన్నమాట. భారతదేశం దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన మూడంచెల అణు శక్తి కార్యక్రమం ఈ ఏడాది కీలకదశకు చేరనుంది. చెన్నై సమీపంలోని కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్బీఆర్) ఈ ఏడాది పని చేయడం మొదలుపెడు తుంది. ముందుగా ప్రయోగాత్మకంగా మొదలై... ఈ ఏడాది చివరి కల్లా పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అంచనా. దేశంలో విస్తృతంగా లభ్యమయ్యే థోరియంను ఇంధనంగా ఉపయోగిస్తుందీ రియాక్టర్. విజయవంతమైతే దేశ ఇంధన భద్రత మరింత పటిష్ఠమవుతుంది. దేశం మూడు దిక్కులా ఆవరించిన విశాల సముద్రాన్ని మానవ ప్రయోజనాలకు సద్వినియోగం చేసుకోవాలన్న భారతదేశ ఆశయం ఈ ఏడాది కార్యాచరణ దిశగా అడుగులు వేయనుంది. సముద్రయాన్లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ‘మత్స్య– 6000’ జలాంతర్గామి ముగ్గురు శాస్త్రవేత్తలను ఆరువేల మీటర్ల లోతు వరకూ తీసుకెళ్లనుంది. సముద్ర మట్టంతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతాల్లో జలాంతర్గామి తొడుగులోని ప్రతి చదరపు సెంటీమీటర్ 600 కిలోల బరువును తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత దృఢమైన ప్రత్యేకమైన టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేశారు.వాతావరణ అంచనాలు అతి సంక్లిష్టమైన భారత దేశ వాతావరణ అంచనాల కోసం ఈ ఏడాది నుంచి కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ల వినియోగం మొదలు కానుంది. ఏడాది చివరికల్లా ఇది సిద్ధమవుతుందని అంచనా. ‘మిహిర్’ వంటి సూపర్ కంప్యూటర్ల సాయంతో ఆరు కిలో మీటర్ల పరిధికి సంబంధించిన వాతావరణ అంచనాలను పది రోజుల ముందే ఇవ్వవచ్చునని భారత వాతావరణ విభాగం చెబుతోంది. వరదల్లాంటి విపత్తుల నుంచి మెరుగైన సన్నద్ధత కలిగి ఉండేందుకు, వ్యవసాయానికీ, పర్యాటక రంగానికీ ఎంతో ఉపయోగపడనుంది ఇది. శిలాజ ఇంధన వినియోగాన్ని వేగంగా తగ్గించాలన్న లక్ష్యం వైపు భారత్ అడుగులేస్తోంది. ఇందుకు తగ్గట్టే సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పవన విద్యుత్తులో నాలుగో స్థానంలో ఉంటే... సౌరశక్తి సామర్థ్యంలో మనది మూడో స్థానం. అయితే భారతదేశ స్థాపిత విద్యుదుత్పత్తి 482.82 గిగావాట్లలో ఇది సగం కంటే కొంచెం ఎక్కువ. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మనం నాలుగేళ్ల ముందుగానే ఈ స్థాయికి చేరుకున్నాం. ‘ఒన్ సన్ ఒన్ వరల్డ్, ఒన్ గ్రిడ్’ కార్యక్రమం కారణంగా సౌరశక్తి రంగంలో మన పురోగతి ఇకపై కూడా కొనసాగనుంది. కృత్రిమ మేధఏఐ వాడకంతో ఈ ఏడాది టిక్కెట్ల బుకింగ్ మొదలుకొని వాహ నాల రవాణా వరకూ అనేక విషయాలు మరింత సౌకర్యవంతం కానున్నాయి. అతి తక్కువ బడ్జెట్తో చైనా సంస్థ అభివృద్ధి చేసిన ‘డీప్సీక్’ వంటివి ఏఐని మరింత వైవిధ్యభరిత అవసరాల కోసం వాడుకునే అవకాశం కల్పించనున్నాయి. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ వినియోగం కూడా ఈ ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా... ఇంగ్లీషులో కాకుండా కొరియన్ భాషలోనూ ఏఐ అందుబాటులోకి రావచ్చు. బయో టెక్నాలజీజన్యుపరమైన తప్పులను వెతకడం కంటే... వాటిని సరిచేయ డంపై ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. మన డీఎన్ఏలో జరిగే అతి చిన్న మార్పు కూడా వ్యాధులకు కారణ మవుతుందన్నది తెలిసిందే. ఈ మార్పులను సరిచేసేందుకు ‘క్రిస్పర్–క్యాస్9’ వంటి ఆధునిక జన్యు ఎడిటింగ్ టూల్స్ అందు బాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీలు ఒకే ఒక్క జన్యువులోని మార్పులను సరి చేసేందుకు ఉపయోగించవచ్చు.అంతేకాదు క్రిస్పర్ టెక్నాలజీతో అననుకూల వాతావరణాలను కూడా తట్టుకుని పండే పంటలను అభివృద్ధి చేసేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టు కోవడంలో, ఆహార భద్రత కోసం ఇది ఎంతో కీలకం. ఇలా ఈ ఏడాది సైన్స్–టెక్సాలజీ రంగంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసు కుని మానవ చరిత్రలో మైలురాళ్లు కానున్నాయి.టి.వి.వెంకటేశ్వరన్ వ్యాసకర్త విజిటింగ్ ప్రొఫెసర్, ఐసర్ మొహాలీ -
శ్రీవారి ద్రోహికి శిక్ష తప్పదు!
ధర్మ ఏవ హతో హన్తి, ధర్మో రక్షతి రక్షితః/తస్మాద్ధర్మో న హంతవ్యో, మా నో ధర్మో హతోవధీత్!! ‘ధర్మాన్ని నాశనం చేస్తే, అది చేసిన వాడిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే, అది వారిని రక్షిస్తుంది. అలాగే ధర్మాన్ని ఎప్పుడూ నాశనం చేయకూడదు. ఒకవేళ నాశనం చేస్తే అదే దుర్గతి మనకు సంప్రా ప్తిస్తుంది’ అనేది ఈ శ్లోకం అర్థం. సనాతన ధర్మం (మనుస్మృతి)లో ధర్మ విశిష్టతను చెప్పే శ్లోకం ఇది. ధర్మానికి, న్యాయానికి సర్వలోకమూ నిలువెత్తు కొండగా తిరుమల శ్రీవారిని చూస్తుంది. కష్టమొస్తే, నష్టమొస్తే... ‘కలియుగ దైవమా, పాహిమాం’ అని వేడుకుంటే, ముల్లోకాల్లో శ్రీవారు ఎక్కడున్నా కాపాడుతారని భక్తుల అచంచల విశ్వాసం. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరగణం విషం చిమ్ముతున్నారు. పదివేల శేషుల పడగ లపై ఆసీనులైన శ్రీ మహావిష్ణువుపై తాను విషం చిమ్ముతున్నాననే స్పృహలో లేనంతగా వారికి అహంకారం తలకెక్కిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.రాజకీయ స్వార్థానికి చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సైతం వదిలి పెట్టనంతగా చంద్రబాబులో అవకాశవాదం పెరిగిపోయింది. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే ఆయన సైనికులైన మాలాంటి వాళ్లపై రాజకీయ కక్ష తీర్చుకోవ డానికి చంద్రబాబుకు వేరే మార్గాలున్నాయి. కానీ అధికారంలోకి రాక మునుపు, వచ్చిన తర్వాత కూడా తిరుమల శ్రీవారినే చంద్ర బాబు ఎంచుకోవడం తీవ్ర ఆవేదన, ఆందో ళన కలిగిస్తోంది. గత ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో తిరుమల శ్రీవారి కేంద్రంగానే దుర్మార్గ రాజకీయాలకు బరి తెగించారని చెప్పడానికి ఆవే దన చెందుతున్నా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం స్థాయిలో చంద్రబాబు నోరుజారి, స్వామి వారి దృష్టిలో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూపై నిందారోపణలు చేయడాన్ని సాక్షాత్తు సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది. ఆ విషయమై నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.కల్తీ అయ్యింది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు, చంద్రబాబు మనసు రాజకీంగా కలుషితమైంది. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనూ, అలాగే అలవికాని హామీలిచ్చి ప్రజల్నీ వెన్నుపోటు పొడిచారని మాత్రమే ఇంతకాలం చంద్రబాబును విమర్శించే వాళ్లం. కానీ కలియుగ దైవాన్ని కూడా విడిచిపెట్టలేదని లడ్డూ ప్రసాదంపై అత్యంత దుర్మార్గంగా పేద్ద బండలాంటి నింద వేశారని స్పష్టమైంది. ఆ తర్వాత పరకామణిలో చోరీ కేసును కూడా స్వార్థ రాజకీ యాలకు వాడుకుంటున్నారనేది కలియుగ దైవం ఎరిగిన సత్యం. తన అధికారం, మీడియా అండతో లోకం కళ్లు కప్పొచ్చని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కానీ సర్వాంతర్యామి అయిన శ్రీవారిని మోసగించలేమని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.తప్పు జరిగితే వదిలేవారా?వైసీపీ హయాంలో ఏ తప్పూ జరగకపోయినా, ఏదో జరిగినట్టు ప్రజల్ని మభ్యపెట్టడంలో టీడీపీ, దాని అనుబంధ మీడియా నిమగ్న మైంది. మా హయాంలో తప్పు జరిగి ఉంటే, విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్నకు... మాపై నిందలు మోపేవాళ్లు సమా ధానం చెప్పాలి. చిన్న చిన్న తప్పులకే సామాన్య ప్రజలను వీధుల్లో ఊరేగిస్తుండడాన్ని చూస్తున్నాం. అలాంటిది టీటీడీలో మేమే తప్పు చేసి ఉంటే, ఈ పాటికి రాష్ట్రమంతా ఓపెన్ టాప్ జీపుల్లో ఈ ప్రభుత్వం ఊరేగించి, అవమానించకుండా విడిచిపెట్టేదా? టీటీడీలో కొన్ని విభాగాల్లో అధికారుల తీరు వ్యవస్థీకృతమైంది. వాళ్ల తప్పుల్ని కూడా మాపై మోపి, తద్వారా వైసీపీని హిందూమత వ్యతిరేకిగా ముద్ర వేయాలనే అత్యుత్సాహంలో, కోట్లాదిమంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న సంగతిని విస్మరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తన ఇలవేల్పు అనీ, అపార భక్తిశ్రద్ధలు న్నాయనీ చంద్రబాబు తరచూ చెబుతుంటారు. కానీ మాటలకూ, చేతలకూ పొంతన ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ కేంద్రంగా టీడీపీ తన మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమంతా, అంతిమంగా హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేదే!అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే, ఆ తర్వాత మా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. అయితే మళ్లీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికా రుల్ని బెదిరించి, ప్రలోభపెట్టి తప్పుడు నివేదికలతో కేసులన్నీ కొట్టే యించుకుంటున్న చంద్రబాబు, స్వామివారి హుండీ సొమ్మును దొంగిలించడం తప్పని పశ్చాత్తాపం చెంది... కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారి పేరుతో రాయించిన రవికుమార్ తీరులో ఆలోచించాలి. కనీసం పరకామణి చోరీ నిందితుడిలో కనిపించిన పశ్చాత్తాపం కూడా, ప్రజల సొమ్మును కొల్లగొట్టిన చంద్రబాబులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ కేసులో చంద్రబాబు రాజకీయ స్వార్థానికి సతీశ్కుమార్ అనే నిజాయతీ కలిగిన సీఐ బలి అయ్యారు. ఇక్కడ బలి అయ్యింది కేవలం సీఐ మాత్రమే కాదు... ధర్మం, న్యాయం అనే సంగతిని మరిచిపోవద్దు. భార్య, ఇద్దరు చిన్నారులున్న సతీశ్కుమార్ కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు. అలాగే చాలామంది అధికారుల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తుండడం బహిరంగ రహస్యమే. అధికారులతో పాటు రాజకీయంగా మాపై వేధింపులు కాస్తా, కక్షగా మారి, సమాజ బహిష్కరణ చేయాలనే బీఆర్ నాయుడి అహంకారపూరిత పిలుపు దిగ్భ్రమ కలిగిస్తోంది. ‘ఇలాంటి వాళ్లా అత్యంత ప్రతిష్ఠాత్మక టీటీడీకి చైర్మన్?’ అనే ప్రశ్న సమాజం మనసును తొలిచేస్తోంది.గోశాల గోవుల మరణాలుటీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో వందలాది గోవుల మర ణాలకు చంద్రబాబు, ఆయన నియమించిన బీఆర్ నాయుడి నేతృత్వంలోని పాలక మండలి మూల్యం చెల్లించుకోక తప్పదు. శ్రీవారిపై భక్తిశ్రద్ధలతో గోవుల మరణాలను నేను వెలుగులోకి తీసుకొస్తే, తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు ఎదురు దాడికి దిగడం దివాళాకోరుతనాన్ని చూపుతోంది. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్పి, అంతిమంగా నేను చెప్పింది నిజమే అని నిర్ధారించడం వాస్తవం కాదా? అసలు గోవును తల్లిగా భావించి, పూజించే పుణ్య భూమి, కర్మ భూమి మనదనే వాస్తవం తెలియక పోవడం మన దురదృష్టం.ఇక టీటీడీలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారిని దర్శించుకోడానికి క్యూ కాంప్లెక్స్లలో ఉన్న భక్తులకు ఉచితంగా అందాల్సిన ప్రసాదాలను, దళారులు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? అలాగే టీటీడీలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించే దందా సాగుతోంది. ఇదే మా హయాంలో బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయానికి సంబంధించి ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాం. అలాగే కొండపై నుంచి బ్లాక్ మార్కెట్లో టికెట్ల దళారుల్ని తరిమికొట్టి, స్వామిపై మా భక్తి ఏంటో చేతల్లో చూపాం. మరి మీ హయాంలో చేస్తున్నదేంటో, కొండపై అడుగడుగునా కనిపించే దళారుల దాష్టీకాలే నిదర్శనం.తిరుమల కొండపై అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు. కొండపై అవినీతి కూడా అపచారమే! బీఆర్ నాయుడి కార్యా లయం కేంద్రంగా సాగుతున్న అవినీతి అపచారం అంతా ఇంతా కాదు. దళారులంతా సిండికేట్గా ఏర్పడి, భక్తుల్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చి, ఆనందంగా తిరుగు ప్రయాణం కావాల్సిన భక్తులు... దోపిడీకి గురయ్యామన్న ఆవేదనతో వెనుదిరగడం వాస్తవం కాదా? కంచే చేను మేసిన చందంగా, టీటీడీలో అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యతల్లో ఉంటూ, వాళ్లే దళారులుగా మారితే ఇక చెప్పడానికి ఏముంటుంది?అలాగే అలిపిరి సమీపంలో రోడ్డుపక్కన 12 అడుగుల విష్ణు మూర్తి విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో ప్రత్యక్షం కావడం కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన పాపానికి నాపై కేసు పెట్టడం, అలాగే పోలీసులు విచారించడం దేనికి సంకేతం? సత్యం చెప్పినందుకు చరిత్రలో కళ్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. అందుకే నేనెంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగితే ప్రాణాలు పోయేంత వరకూ నిజాలు మాట్లాడు తూనే ఉంటానని గతంలో చెప్పాను. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాను.కొండపై మద్య మాంసాలు యథేచ్ఛగా దొరుకుతుండడం కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? ఈ మధ్య కాలంలో తిరుమల పోలీస్ గెస్ట్హౌస్ సమీపంలో మద్యం బాటిళ్లు కనిపిస్తే, వాటిని వీడియో తీసిన వ్యక్తిని, అలాగే సాక్షి ఫొటోగ్రాఫర్ని నిందితులుగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ దురాగతానికి నిదర్శనం కాదా? ఇదే విషయమై ఆ రోజు తిరుపతి ఎస్పీ పీఆర్వో విడుదల చేసిన ప్రకటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాయంత్రానికి మాట మార్చడాన్ని ఏమనాలి? వాస్తవాలు చెప్పడం దేశద్రోహమా?అత్యంత పవిత్రమైన, హిందువుల ఆధ్మాత్మిక రాజధాని క్షేత్రమైన తిరుమలను మద్యం, మాంసప్రియులు, దళారులకు వది లేసి, వాస్తవాలను చెప్పిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గం. అయితే న్యాయదేవత కళ్లు తెరిచి, ఆగ్రహించడంతో ఆ కేసు గాలిలో కలిసిపోయింది. శ్రీవారి విషయంలో ద్రోహి ఎవరో ప్రతి హిందువుకూ తెలుసు. కేవలం తన పార్టీకి ప్రచారకర్తగా పని చేసిన టీవీ ఛానల్ అధిపతికి ప్రతిష్ఠాత్మక టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టి, స్వామివారికి చంద్రబాబు మొదటి అపచారం చేశారు. టీటీడీ చైర్మన్గా శ్రీవారికి సేవ చేయడానికి బదులు, ఇంకా తాను చంద్రబాబు భక్తి ఛానల్ చైర్మన్ అనే మాయలోనే బీఆర్ నాయుడు ఉన్నారు.అందుకే కొండపై నిత్యం స్వామి వారికి అపచారం. అంతెందుకు సీఎంవో నుంచి నిత్యం వచ్చే సిఫార్సు లేఖలెన్ని? టీటీడీ చైర్మన్ కార్యాలయం నిత్యం ఇస్తున్న వివిధ రకాల దర్శనాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తే, స్వామి వారి విషయంలో వ్యాపారం చేసుకుంటున్నదెవరో తేలి పోతుంది. వాటికి సంబంధించి గోప్యత పాటిస్తున్నారంటే, ఏదో తప్పు చేస్తున్నారనే కదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్వామి వారి చెంత దర్శ నాలకు సంబంధించి పారదర్శకత లేక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. టీటీడీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దాపరికాలు లేవు.ఏడాదిన్నర చంద్రబాబు పాలనను గమనిస్తే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. బాబు బ్రాండ్తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని... లేనివి ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని కూటమి సర్కార్ చూపుతోంది. మూడో విషయానికి వస్తే, తిరుమల కేంద్రంగా, అలాగే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు, ఆయన్ను మోసే మీడియా ఒక తప్పుడు ఎజెండాతో ముందుకెళు తోంది. ఈ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం.సంస్కరణలా? ఇబ్బందులా?సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మొట్టమొదట శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్లో సంస్కరణలకు తిరుమల నుంచే శ్రీకారం చుడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. మా హయాంలో తిరుమ లలో అన్యమత ప్రచారం జరిగిందని, ఇంకా లేనిపోని నిందలన్నీ వేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ సంస్కరణలు కాదు కదా భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైకుంఠద్వార దర్శనం రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. తిరుమల అంటే భక్తుల్లో భయాన్ని కలిగించి, ఏడుకొండలపైకి వెళ్లకుండా చేయడంలో టీటీడీ చైర్మన్, ఇతర అధికారులు విజయవంతం అయ్యారంటే అతిశయోక్తి కాదు. గత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోని కారణంగా... ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ చరిత్రలో ఇదో మాయని మచ్చ. ఇదంతా చంద్రబాబు నియమించిన టీటీడీ పాలక మండలి, అధికారుల చేతకానితనం వల్ల ఏర్ప డిన విపత్తు. అంతే కాదు, టీటీడీ చైర్మన్ చిన్నపిల్లాడిలా ఉన్నతాధి కారులతో గొడవ పడుతూ, పరిపాలన సవ్యంగా సాగనివ్వని పరిస్థితిని సృష్టించడం నిజం కాదా? ‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు’ అని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తుంటారు. బహుశా ఆయన ఈ హెచ్చరిక తనకు వర్తించదని అనుకుంటున్నారేమో! కలియుగ దైవమైన శ్రీవారికి అపచారం చేయడంలోనూ, అప్రతిష్ఠ కలిగేలా వ్యవహరించడంలోనూ చంద్రబాబు తర్వాతే ఎవరైనా, ఏమైనా! శ్రీవారి ఆది అంతాల ద్రోహి ఆయనే. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని నాలాంటి వాళ్లు వెలికితీస్తే... అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం కేసులు పెట్టడానికి అత్యుత్సాహం ప్రదర్శి స్తున్నారు.కానీ ఆ వైకుంఠవాసుడు తనను ద్రోహిగా చూస్తున్నాడని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించి, భయ భక్తులతో మెలిగితే మంచిది. శిశుపాలుడికి శిక్ష విధించడానికి వంద తప్పుల్ని శ్రీకృష్ణ భగవానుడు లెక్కించారు. టీటీడీ కేంద్రంగా చంద్రబాబు తప్పుల్ని కూడా మహావిష్ణువు లెక్కిస్తుంటారు. బాబు నేతృత్వంలో స్వామి వారికి చేస్తున్న ద్రోహానికి, శిక్షించే సమయం మరెంతో దూరం లేదు. రాజకీయాల్లో అధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబును... చివరికి అదే నాశనం చేస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
నయా వలసవాద కేంద్రం అమెరికా
అమెరికా ఇటీవల కాలంలో తాను వేసుకున్న ముసుగును పూర్తిగా తొల గించి బాహాటంగానే దురాక్రమణ కాంక్షను వ్యక్తం చేస్తోంది. వరుసగా ఒక దేశం తరువాత మరొక దేశాన్ని ఆక్రమించడానికి వేగంగా పావులు కదుపుతోంది. వెనిజులా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి పట్టుకుపోవడం, గ్రీన్ల్యాండ్ తమదేనని ప్రకటించడం, తాజాగా ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు అండగా ఉంటామని ప్రకటించడం... ఇవన్నీ అమెరికా దూకుడును సూచించే అంశాలే. ముఖ్యంగా అణు పాటవం సంతరించుకోకుండా ఇరాన్ను అడ్డుకోవడం, దాని చమురు సంపదను చేజిక్కించుకోవడంపై అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. దాని కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ సంక్షోభం.2015 అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా బయటకు రావడంతో ఇరాన్తో అమెరికా ఘర్షణ ముదిరింది. ఇరాన్కు చెందిన సుమారు 100 బిలియన్ డాలర్ల నిధులను అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపజేయడమే కాకుండా, కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. గడిచిన కొద్ది నెలలుగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో ఏడు బి–2 స్టెల్త్ బాంబర్లు, అత్యంత శక్తిమంతమైన 14 బంకర్ బస్టర్ బాంబర్లు, 30,000 పౌండ్ల మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఫోర్డో, నటాంజ్, ఇస్ప హాన్ వంటి కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ఇరా నీయులు ప్రాణాలు కోల్పోగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూల మధ్య ఇటీవల జరిగిన భేటీ పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రతను పెంచేలా ఉంది. గాజాలో ప్రతిఘటనను తుడిచిపెట్టడమే కాకుండా, ఇరాన్ పుంజుకుంటే తీవ్రంగా దెబ్బతీస్తామని వారు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ లోపల వ్యూహాత్మక అల్లర్లు ప్రారంభమయ్యాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న కరెన్సీ విలు వపై ప్రజల్లో అసహనం పెంచుతూ నిరసనలను, సమ్మెలను అమెరికా ప్రోత్సహిస్తోంది. శాంతియుత నిరసనల ముసుగులో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాదిమంది మర ణించారు. నిరసనకారులకు అమెరికా బాసటగా నిలుస్తామని ప్రకటించడం వెనుక ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే పక్కా ప్లాన్ ఉంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురి పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆర్థిక విధ్వంసం – చమురు రాజకీయం 2025 జూన్ నాటి యుద్ధ పరిస్థితులు, చమురు ధరల పతనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. నిత్యా వసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవన ప్రమా ణాలు పడిపోయాయి. విద్యుత్ కోతలు పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయగా, వాతావరణ మార్పుల వల్ల వర్షాలు లేక వ్యవసా యోత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అమెరికా చర్యలను ఇరాన్ నేత ఖమేనీ తీవ్రంగా ఖండిస్తున్నారు. పాత కాలపు షా రాజరికం లాంటి బానిసత్వాన్ని ‘నయా వలస వాదం’ రూపంలో అమెరికా మళ్లీ రుద్దాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కార్పొరేట్ శక్తులు తమ స్వార్థం కోసం అమెరికా, ఐరోపా దేశాలతో చేతులు కలుపు తున్నాయనీ, దీనివల్ల కార్మికులు, గ్రామీణ ప్రజలపై భారం పెరుగుతోందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ ముడిచమురు నిల్వల్లో ఇరాన్ వాటా 13 శాతం ఉండగా, అమెరికా అడుగులకు మడుగులొత్తే సౌదీ అరేబియా వద్ద 16 శాతం నిల్వలు ఉన్నాయి. వెనిజులా నిల్వలను కూడా కలిపితే, ప్రపంచ చమురులో 50 శాతాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. రష్యా, చైనాలు అమెరికా చర్యలను ఖండించే ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగకపోవడం గమనార్హం.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన గూఢ చారి సంస్థ ‘సీఐఏ’ ద్వారా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసింది. 1954లో గ్వాటెమాల, 1963లో ఈక్వె డార్, 1964లో బ్రెజిల్, 1973లో చిలీ... ఇలా సుమారు 20కి పైగా దేశాల్లో అమెరికా తన తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేసింది. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోను హతమార్చేందుకు 621 సార్లు విఫలయత్నం చేయడం అమెరికా దురహంకారానికి పరాకాష్ఠ. డ్రగ్స్పై పోరాటం పేరుతో మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అరాచ కాలు సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ట్యారిఫ్ యుద్ధాలు, సైనిక బెదిరింపులతో నూతన సామ్రాజ్యవాదాన్ని విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. బుడ్డిగ జమిందార్వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
బాబు నువ్ సెప్పు.. ఆయన్ని కొట్టమని డప్పు!
ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోబుల్ పర్సన్ అట! కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ మేరకు ఆయనకు కితాబిచ్చినట్లు ఈమధ్యే ఈనాడు చాలా ప్రముఖంగా ప్రచురించింది. ఏపీ భవిష్యత్తు కోసం చంద్రబాబు తన జీవితాన్నే అంకితం చేశారని కూడా ఆయన అన్నట్టు.. వీళ్లు చెప్పుకున్నారు. రాజకీయ నేతలు ఒకరినొకరు ప్రశంసించుకోవడం మామూలే కానీ.. అవి కొంచెం అతిగా అనిపిస్తే మాత్రం మెచ్చుకున్న వ్యక్తిని కూడా శంకించాల్సి వస్తుంది. ఇంతకీ నోబుల్ అన్న పదానికి అర్థం తెలుసా?.. ఉత్తమమైన, ఆదర్శవంతమైన, విశిష్టమైన రీతి అని. .. చంద్రబాబు నలభై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో పైన చెప్పుకున్నవి మచ్చుకైనా కనిపించాయా అన్నదే ప్రశ్న! అధికారం కోసం ఎంతకైనా దిగజారే అవకాశవాదం చంద్రబాబుదని ప్రత్యర్ధులు అభివర్ణిస్తారు. ముఖ్యమంత్రి పీఠమెక్కేందుకు పిల్లనిచ్చిన మామనే కూలదోసిన చరిత్ర బాబుది. ఏ ఎండకా గొడుగు అన్నట్టు ఎన్నికలొచ్చిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తులు కలుపుకున్న వైనమూ అవకాశ వాద రాజకీయాన్ని ధ్రువీకరిస్తాయి. అంతెందుకు.. ప్రస్తుత ప్రధాని.. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఉగ్రవాదని ఆరోపించింది ఈయనే. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించిందీ బాబే. వ్యక్తిగత దూషణలు బహిరంగంగా చేసిందీ ఈయనే. కానీ.. 2024 ఎన్నికల సమయం రాగానే.. అవసరాన్నిబట్టి.. అన్నీ మరచిపోయి.. బీజేపీతో పొత్తుకు వెంపర్లాడింది కూడా ఈయనే. పోనీ అధికారంలోకి వచ్చిన తరువాతైనా ఈయన తీరు ఏమైనా మారిందా? ఊహూ లేదు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలకు ఎలాంటి పనులూ చేయవద్దని అధికారులను ఆదేశించడం ఏ రకమైన ఆదర్శమవుతుందో ఈనాడుకే తెలియాలి. 2019లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీనే ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ మరో కేసులో ఆయనకు నోటీసు ఇచ్చింది. విచిత్రంగా.. కేంద్ర ప్రభుత్వం వాటి గురించి మళ్లీ అసలు ప్రస్తావించనే లేదు. నోబుల్ పర్సన్గా గుర్తించిందేమో మరి!. గడ్కరీ పొగిడిన వార్త వచ్చిన రోజునే వివిధ మీడియాలలో వచ్చిన కొన్ని వార్తలు గమనిస్తే ఇలా కూడా నోబుల్ కావచ్చా? అన్న సంశయం వస్తుంది. చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్ కేసు వచ్చింది.స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం ఇది. దీనిని తొలుత గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ, ఈడీ అధికారులే. కొంతమందిని ఈడి అరెస్టు కూడా చేసింది. వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా... చంద్రబాబు ఆదేశాల మేరకే బోగస్ కంపెనీకి రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు తేలింది. షెల్ కంపెనీల ద్వారా కొన్ని నిధులు టీడీపీ బ్యాంక్ ఖాతాలలోకి కూడా వచ్చిందని సీఐడీ కోర్టుకు నివేదించింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు 53 రోజులపాటు జైలులో ఉన్నారు. ఆరోగ్య కారణాలతో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. 2024లో అధికారంలోకి రావడంతో ఈ కేసును క్లోజ్ చేసే పనిలో కొందరు ప్రముఖ లాయర్లను నియమించారు. వారు ఇందుకు మార్గాలను అన్వేషించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ కొత్త టెక్నిక్ ను ప్రయోగించి కేసు పెట్టిన సీఐడీ ద్వారానే ఉపసంహరించేలా చేశారు. ఈ స్కామ్పై ఫిర్యాదు చేసిన అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి పిటిషన్ కూడా కోర్టు అనుమతించలేదు. చంద్రబాబు నిజంగానే నోబుల్ పర్సన్ అయిఉంటే ఆ కేసు విచారణను ఎదుర్కొని తన తప్పు ఏమీ లేదని రుజువు చేసుకుని ఉండవచ్చు!. దురదృష్టవశాత్తు అవినీతి కేసులను విచారణ చేయకుండా మూసివేతకు న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించడం ఎంతవరకు మంచి సంప్రదాయం అవుతుందన్న ప్రశ్నను పలువురు న్యాయ నిపుణులు వేస్తున్నారు. మద్యం స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్లలోనూ చంద్రబాబు కేసులు లేకుండా చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన తీర్పు సర్టిఫైడ్ కాపీలను థర్డ్ పార్టీకి ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించకపోవడంపై కూడా పలువురు అభ్యంతరం చెబుతున్నారు.. పారదర్శకంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ ఇలా వ్యవహరించరాదన్నది న్యాయ నిపుణుల భావన. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. అది ఏమవుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితమే సాంకేతిక కారణాలతో కొందరు అధికారులపై ఉన్న అవినీతి కేసులను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి తిరిగి విచారణకు ఆదేశించింది. అవినీతి కేసులను ఉపసంహరించే అధికారం కింది కోర్టులకు లేదని కూడా గతంలో పేర్కొంది. వీటితో సంబంధం లేకుండా చంద్రబాబు కేసుల నుంచి బయటపడడం విశేషం. ఇదంతా నోబుల్ పర్సన్ చంద్రబాబు చేయవచ్చని గడ్కరీ భావిస్తున్నారా?..పవన్ కళ్యాణ్తో కలిసి ప్రకటించిన ఎన్నికల మానిఫెస్టో, అందులోని అంశాలు, వాటిని అమలు చేయలేకపోయినా, అన్నీ చేసేసినట్లు కలరింగ్ ఇవ్వడం, మత రాజకీయాలు చేయడానికి వెనుకాడకపోవడం, చివరికి తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసినా, ఇంతవరకు దానిపై వివరణ ఇవ్వకపోవడం, తను చేసే తప్పులన్నిటిని ఎదుటివారిపై రుద్దడం, చివరికి ప్రజల ప్రాణాలకు హానికరమైన మద్యపానాన్ని ప్రమోట్ చేసేలా ఎన్నికలలో ప్రచారం చేయడం.. ఇలాంటి వాటన్నిటిని చేసినా నోబుల్ పర్సన్ అవుతారేమో తెలియదు! పోనీ ఇకనైనా అబద్దాలు చెప్పడం మాని చంద్రబాబు నోబుల్ పర్సన్ అనే పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తే సంతోషించవచ్చు.! ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మూల రచయితలకు ద్రోహమేనా?
‘కృత్రిమ మేధ (ఏఐ) చేసే సృజన – కాపీరైట్’పై దేశంలోని ‘పారిశ్రామిక,ఆంతరంగిక వర్తక ప్రోత్సాహక శాఖ’ 2025 చివరలో ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించింది. ఏఐ యుగంలో కాపీ రైట్ను కాపాడడమెలా అనే జటిలమైన అంశాన్ని ఒక నిపుణుల కమిటీ పరిశీలించి ఆ నివేదికను రూపొందించింది. సమీప భవిష్యత్తులో, ఈ అంశంపై భారత్ అనుస రించబోయే విధానానికి ఆ నివేదికలోని అంశాలే ప్రాతిపదికగా మారే అవకాశాలున్నాయి. ఛాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి జనరేటివ్ ఏఐ ప్రొడక్టులు భారీ లాంగ్వేజి మోడళ్ళు. యూజర్లు చేసే సూచనలను ఆధారంగా చేసుకుని అవి కంటెంట్ను సృష్టిస్తాయి. ఉదాహరణకు, మనం ఇతివృత్తాన్ని ఇచ్చి ఆర్.కె. నారాయణ్ లేదా ప్రేమ్చంద్ శైలిలో కథానికను రాసివ్వాలని ఛాట్ జీపీటీని అడిగితే అది రాసి పెడుతుంది. అలాగే డయల్–ఈ, మిడ్ జర్నీ వంటివాటికి మనం ఒక వచనాన్ని లేదా కవితను అందిస్తే, దాన్నిబట్టి అవి పెయింటింగ్ వేయడం లేదా వీడియో సృష్టించడం చేస్తాయి. జెమినీరాయ్ లేదా ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగుల మాదిరిగా ఉండాలని కూడా మనం కోరవచ్చు. అంతేకాదు, సత్యజిత్ రే తరహాలో ఒక చిన్న మూవీ క్లిప్ను రూపొందించి ఇమ్మని అడిగినా అవి ఆ పని పూర్తి చేసేస్తాయి.ఆ పని ఎలా చేయగలుగుతున్నాయంటే వాటికి ఇచ్చిన ట్రయినింగును అనుసరించి అని మనం జవాబు చెప్పు కోవాల్సి ఉంటుంది. నారాయణ్ నవలలు, హుస్సేన్ పెయింటింగులు వంటి రకరకాల వనరుల నుంచి అవి డేటాను గ్రహిస్తాయి. ఏఐ మోడళ్ళకు ట్రయినింగు ఇచ్చేటపుడు ఉపయోగించే డేటా వివిధ కేటగిరీలకు చెందినదై ఉండవచ్చు. అందులో కాపీరైట్ ఉన్నవీ, కాపీరైట్ గడువు తీరిపోయినవి కూడా ఉంటాయి. ‘సమంజస వినియోగానికి’ పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న డేటా మాదిరిగా అది వివిధ వనరుల నుంచి తెచ్చుకున్నదై ఉంటుంది. జనరేటివ్ ఏఐ మోడళ్ళ కమర్షియల్ వెర్షన్లను టెక్నాలజీ సంస్థలు ప్రారంభించినప్పటి నుంచి పుస్తకాలు, పరిశోధన పత్రాలు, ఫోటోలు, సినిమాలు, సృజనాత్మక శక్తిని వ్యక్తపరచిన ఇతర రూపాల లోని కాపీరైట్ మెటీరియల్ను వాడుకోవచ్చునా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే, ఏఐ డేటాబేస్కి అవి పునాదిగా మారాయి. ఇది సంక్లిష్టమైన లీగల్, నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ చిక్కు ముడులే ఇంకా విడలేదనుకుంటే, ఏఐ జనరేట్ చేసినవాటి కర్తృత్వం, కాపీరైట్ హక్కుల వర్తింపునకు సంబంధించిన అంశం మరో అపరిష్కృత అంశంగా తయారైంది. ఏఐ మోడళ్ళకు డేటా ట్రైనింగ్ అనే సరికొత్త సమస్యతో మనమే కాదు, చాలా దేశాలలోని ప్రభుత్వాలు, కోర్టులు సతమతమవు తున్నాయి. ఏఐ మోడళ్ళు కాపీరైట్ ఉన్న పుస్తకాలను లేదా ఫోటో లను కాపీ చేయడం లేదా చౌర్యం చేయడం లేదనీ, కనుక అవి కాపీరైట్ హక్కును ఉల్లంఘిస్తున్నట్లు కాదనీ ఇండియాలోని కంపె నీలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలు వాది స్తున్నాయి. కొత్త కంటెంట్ను జనరేట్ చేయడానికి వీలుగా సరళులు, శైలులు, నిర్మాణ రీతులకు సంబంధించి కలన గణితాలను ట్రైన్ చేసుకునేందుకు, గణాంకాలతో సరిపోల్చుకునేందుకు వాటిని విభా గిత డేటాసెట్లుగా మాత్రమే వినియోగించుకుంటున్నాయని చెబు తున్నాయి. సృజనాత్మక వర్కులను సమంజసమైన రీతిలో వినియో గించుకోవచ్చన్న సాధారణ ఆమోదిత లోకోక్తినే అవి అనుసరిస్తున్నా యని ఆ కంపెనీలు తమ వ్యాసంగాన్ని వెనకేసుకొస్తున్నాయి. కానీ, ఏఐ మోడళ్లు ఒరిజినల్ వర్కులను ‘కాపీ’ చేయడం లేదని, వాటి నుంచి ’నేర్చుకోవడం మాత్రమే చేస్తున్నాయని అనడం వాదనకు నిలిచే అంశం కాదు. ఏఐ సిస్టం ట్రైనింగ్ ప్రక్రియలో అనేక దశలుంటాయి. వాటిలో డేటా (ఒరిజినల్ వర్కుల) కాపీయింగ్, స్టోరేజి కూడా ఒకటి. అది కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది మహా అయితే ‘సాంకేతిక చొరబాటు’ కిందకు వస్తుంది కానీ, ‘లీగల్ పరమైన ఉల్లంఘన’ కిందకు రాదని ఏఐ పరిశ్రమ వాదించవచ్చు.ఏ విధమైన కాపీరైట్ లైసెన్సింగ్ అవసరం లేదనే భావనను నిపుణుల కమిటీ కూడా తిరస్కరించింది. భారత్లో అమలుకు ఒక హైబ్రిడ్ చట్రాన్ని సిఫార్సు చేసింది. కాపీరైట్ హక్కుదారులకు రాయల్టీ చెల్లించే పక్షంలో, కాపీరైట్ సంరక్షణ ఉన్న వర్కులను గ్రహించి ఏఐ డెవలపర్లు వాడుకోవచ్చని, ట్రైనింగ్ ఇచ్చేందుకు వాటిని వినియోగించుకోవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. కానీ, ఏఐ సిస్టంలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు తమ వర్కులను ఇవ్వకుండా నిలిపి ఉంచే అవకాశం కాపీరైట్ హక్కుదారులకు లేదు. ఏఐ డెవలపర్ల నుంచి ఆ (రాయల్టీ) చెల్లింపులను వసూలు చేసే బాధ్యత లాభాపేక్ష లేని ఒక కేంద్రీకృత సంస్థకు ఉండాలని కమిటీ పేర్కొంది. మొత్తానికి, అసలు సృజనశీలురకు రాయల్టీలను చేర్చ వలసిన బాధ్యతను ఆ సంస్థకు అప్పగించాలని చెప్పింది. కాపీరైట్ కంటెంట్ను వాడుకున్న ఏఐ సిస్టంలు తద్వారా గడించిన ఆదాయంలో కొంత శాతాన్ని ఆ కాపీరైట్ ఉన్నవారికి చెల్లించాలి. రేట్లను ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ సిఫార్సుల పట్ల, కమిటీలో ఉన్న పరిశ్రమ (నాస్కామ్) ప్రతినిధి తన అసమ్మతిని వ్యక్తపర చారు.ఏఐ మోడళ్ళ రాబడిలో కొంత శాతాన్ని రాయల్టీలుగా చెల్లించాలన్న సిఫార్సుతో సదరు సభ్యుడు విభేదించారు. టీడీఎంకు వీలుగా తమ వర్కు పబ్లిక్గా అందుబాటులో లేకుండా నివారించుకోవలసిన బాధ్యత కాపీరైట్ హక్కుదారులపైనే పెట్టాలని ‘నాస్కామ్’ ప్రతినిధి సూచించారు. వారి రచన బహిరంగంగా అందుబాటులో ఉందని భావించినపుడు, దాన్ని ఇతరులు వాడుకునేందుకు వీలులేకుండా, ‘ఆప్ట్ ఔట్’ అవకాశాన్ని రచయిత లకు ఇవ్వవచ్చని ఆ ప్రతినిధి సూచించారు.ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కోట్లాది పుస్తకాలలోని అంశాలను టెక్నాలజీ కంపెనీలు తవ్వి తీసేశాయి. ఏఐ మోడళ్ళ ట్రైనింగుకు వాడుకు న్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆప్ట్ ఔట్’ కూడా ఆచరణసాధ్యమైన పరి ష్కారంగా కనిపించడం లేదు. నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడేవిగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చే విగా లేవు. దేశంలో కాపీ రైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరి శ్రమకు చెందినవారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడే విగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చేవిగా లేవు. దేశంలో కాపీరైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరిశ్రమకు చెందిన వారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, పంచాయతీ కాదు..పరిష్కారం కావాలని, గొడవలతో ప్రయోజనం లేదని, సామరస్యంగా ముందుకు వెళితేనే మేలని గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు కూడ బలుక్కున్నట్లు చేసిన ప్రకటనలు ఆసక్తికరమైనవే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తాను అనుకోకుండా చేసిన తప్పును దిద్దుకునేందుకు రేవంత్ తన స్వరం మార్చారా? లేక.. ఇద్దరికి సన్నిహితులైన వారు తమకు వివాదాలు అక్కర్లేదని.. నీళ్లు కావాలని ప్రకటన చేయించినట్లుగా ఉందీ వ్యవహారం. అయితే.. తెలంగాణ ప్రాజెక్టులకు ఓకే చేయాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రేవంత్తో ఎలాంటి రహస్య ఒప్పందమూ లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోయారు. పైగా రేవంత్ కోరినట్లు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయడమే కాకుండా, చివరికి ఆ స్కీమే వృథా అన్న ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏపీకి జరిగే నష్టాన్ని పట్టించుకోలేదు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపడం తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడమేనని ఆ ప్రాంత మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమ స్కీమ్కు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ అనుకూల మేధావులతో ఆలోచనపరుల పేరుతో సదస్సు పెట్టించడంంపై కూడా సీమలో అసంతృప్తి ఏర్పడింది. ఇది చాలదన్నట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణకు కూడా నీరు ఇస్తారట. చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకుని ప్రమాదకర క్రీడ అడుతున్నారన్న అనుమానం కలుగుతుంది. తనకు తెలుగు జాతి ముఖ్యమని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అంటున్నారు. ఆయన రెండు రాష్ట్రాలకు సీఎం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అనే సంగతి మర్చిపోరాదు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని గతంలో పలుమార్లు అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా బలహీనంగా మాట్లాడుతున్నారు? రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ముందుకు తీసుకువెళితే జగన్కు పేరు వస్తుందనా? లేక రేవంత్కు ఇచ్చిన మాట తప్పితే తెలంగాణలో కాంగ్రెస్కు నష్టం కలుగుతుందనా? లేక తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనా?.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణకు దిగారు?.. విమర్శలు చేశారు?.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికే కుట్రపన్నారు?. ఓటుకు నోట కేసులో ఎలా దొరికిపోయారు? అప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి ఏమైపోయినా ఫర్వాలేదా? కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టులను ఎలా వ్యతిరేకించారని చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. మరి నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మొహరింపు మాటేమిటి? కేసీఆర్, జగన్ భేటీ అయి ఆయా ప్రాజెక్టులపై చర్చిస్తే ఎన్ని ఆరోపణలు చేశారు. అప్పుడు తెలుగుజాతి గుర్తుకు రాలేదా?.. చంద్రబాబే కాదు.. రేవంత్ కూడా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ను విమర్శిస్తూ జగన్కు పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం కూడా ఎద్దేవ చేశారే! పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు సమయంలో చంద్రబాబు అనుసరించిన విధానం ఏమిటి? తెలంగాణలో టీడీపీ నేతలతో నిరసనలు, కోస్తాలో ఆ ప్రాంత టీడీపీ నేతలతో వ్యతిరేక ప్రదర్శనలు చేయించారు కదా? అంటే రాయలసీమ ప్రజలకు, తెలంగాణ, ఏపీ ప్రజలకు మధ్య తగాదా పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? లేదా? అప్పుడు తెలుగుజాతి ఒక్కటిగా లేకపోయినా ఫర్వాలేదా! కెసిఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు కలిసి ఉండనక్కర్లేదన్నమాట. రేవంత్ తన శిష్యుడు కాబట్టి, ఆయన కాంగ్రెస్ అయినా, తాను బీజేపీ కూటమిలో ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడేమో రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని అంటున్నారు. తెలంగాణకు ఓడరేవు లేదు కనుక ఏపీతో సఖ్యంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారట. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడరాదని షరతు పెట్టారు. కేంద్రానికి తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనరు. ఒక్క నీటి విషయంలో అన్న మాటేమిటి? విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.75 వేల కోట్ల విలువైన ఆస్తి రావల్సి ఉంటుందని, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు లెక్కకట్టింది కదా! అది ఇవ్వడానికి రేవంత్ సర్కార్ ఓకే అంటుందా? అసలు చంద్రబాబు ఉమ్మడి ఆస్తుల విభజన గురించి డిమాండ్ చేస్తారా? దీనిపై అవగాహన కుదిరితే అప్పుడు నీళ్ల సంగతి ఆలోచించవచ్చు కదా!. ఇంకో సంగతి చెప్పాలి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత వ్యయం చేసి, అందులో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదన వస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని అన్నారు? జగన్ బందరు పోర్టును కేసీఆర్కు రాసిచ్చేస్తున్నారని, ఏపీకి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారా? లేదా? అది తెలుగుజాతి మధ్య గొడవలు పెట్టినట్లు కాలేదా? రాయలసీమ లిఫ్ట్ వల్ల కేవలం 22 టీఎంసీల నీరే వస్తుందని, ఆ ప్రాంతానికి ప్రయోజనం పెద్దగా ఉండదని చంద్రబాబు అంటున్నారు కదా! ఆ విషయమే రేవంత్కు వివరించి, ఈ చిన్న స్కీమ్ వల్ల తెలంగాణకు నష్టం లేదని చెప్పి ముందుకు తీసుకువెళ్లవచ్చు కదా! తెలంగాణకు పోర్టు కనెక్టివిటి కోసం ఏపీ సహకారం కావాలని, అమరావతి అభవృద్దికి హైదరాబాద్ సహకారం అవసరమని రేవంత్ చిత్రమైన వాదన తెచ్చారు. వీళ్లిద్దరు మాచ్ ఫిక్సింగ్ ప్రకటన చేస్తున్నారేమో!. కానీ అదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కమార్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ పోలవరం-నల్లమలసాగర్ స్కీమ్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. మొత్తంగా చూస్తే తను చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయంగా చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి ఏదో కంటితుడుపు ప్రకటన చేసినట్లుగా ఉంది. అలాగే చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతంతో ఇరు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చెంతన ఉన్నది చేజార్చుకుంటారా?
డిసెంబర్ 2న 'షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' కొత్తగా 200కు పైగా 'మర్చెంట్ షిప్స్' కొంటున్నట్లు ప్రకటించింది. ఉన్నట్టుండి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా మారడం 'మీడియా'ను సైతం విస్మయపర్చింది. గత వైభవం తర్వాత కనుమరుగైన ఈ 'మినీరత్న' సంస్థ గురించి ఓ ఆంగ్ల పత్రిక వెంటనే ఒక 'బైలైన్ స్టోరీ' కూడా రాసింది. నిజానికి ఈ రంగం గత ఐదేళ్లుగా ప్రైవేట్ చేతుల్లోకి మారుతుండగా, అకస్మాత్తుగా మారిన కేంద్రం వైఖరి ఇది. ఈ కొత్త నౌకల కొనుగోళ్లను ప్రభుత్వమే చేయబోతున్నది.“ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న 'జియో పాలిటిక్స్' పరిణామాలు మనకు కూడా 'నేషనల్ షిప్పింగ్ సర్వీసెస్' ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. దేశ ఆర్ధిక భద్రత కోసం 'మర్చెంట్ నేవీ' ప్రాధాన్యం ఏమిటో ఇన్నాళ్ళకు ప్రభుత్వం గుర్తించింది" అని "నేషనల్ షిప్ ఓనర్స్ అసోషియేషన్' సీఈఓ అనిల్ దేవళి అన్నట్టు ఆ వ్యాసంలో రాశారు. మారుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా ఉంటే, డిసెంబర్ 24న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- 'క్వాంటమ్ టాక్ బై సీబీన్' కార్యక్రమంలో "రెండేళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు తయారుచేసి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తాము" అన్నారు..మన పక్కన వెయ్యి కిలోమీటర్ల మేర సముద్రం ఉన్నప్పుడు, ముందు 'మెరైన్ ఎకానమీ'లో మన వృద్ధి 'రికార్డు' అయితే పెరిగే వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'క్వాంటమ్ వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? ఉపాధితో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి 'మార్కెట్'లో ఇక్కడి ఉత్పత్తుల 'డిమాండ్' పెరుగుతుంది. సముద్రం ఎండేది కాదు. కనుక పెరిగే నౌకా వాణిజ్యంతో ఏపీ 'బ్లూ ఎకానమీ' స్టేట్ అవుతుంది. ఆ తర్వాత దశలో 'క్వాంటమ్ వ్యాలీ' వంటి మొదటి శ్రేణి సాంకేతికత గురించి కూడా మాట్లాడవచ్చు.అయినా వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? భౌగోళిక శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఒక ప్రాంతం సముద్ర మట్టానికి 1,850 మీటర్ల ఎత్తున ఉంటే, దాని శీతోష్ణ స్థితుల కారణంగా 'వ్యాలీ' అంటారు. మరి సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉన్న అమరావతిలో 'క్వాంటమ్ వ్యాలీ' అంటే, అది కేవలం 'మార్కెటింగ్ వ్యూహం కావొచ్చు.మన ఆలోచనలు అక్కడ ఉంటే, విశ్వకర్మ జయంతి సంద ర్భంగా గత సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ భావ నగర్ 'సముద్ర సే సమృద్ధి' సభలో మాట్లాడుతూ "ఒకప్పుడు స్వదేశీ నిర్మిత నౌకల ద్వారా మన రవాణా 40 శాతం సాగేది. మన నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయకుండా, విదేశీ నౌకలకు అద్దె చెల్లించడం మీద మనం శ్రద్ధ పెట్టాము. దాంతో, మన నౌకా వాణిజ్యం రెవెన్యూ 40 నుంచి 5 శాతానికి పడిపోయింది. ఒక 'రీసెర్చి' ప్రకారం 'షిప్ బిల్డింగ్ రంగంపై మనం ఒక రూపాయి. ఖర్చు పెడితే, అది రెండింతలై మనకు తిరిగివస్తుంది. 'షిప్ యార్డు'లో ఒక ఉద్యోగం మనం సృష్టిస్తే, బయట 'సప్లై చైన్' మార్కెట్లో ఆరేడు కొత్త ఉద్యోగాలు పుడతాయి. అంటే, వంద ఉద్యోగాలు ఇక్కడ వస్తే, బయట ఆరు వందల మందికి వేర్వేరు రంగాల్లో పని దొరుకుతుంది" అన్నారు."నౌకా వాణిజ్యంతో నావికుల ('సీ ఫేరర్స్') అవసరం పెరుగుతుంది. పదేళ్ళ క్రితం మన దేశంలో వీళ్ళు 1 లక్ష 25 వేలు ఉంటే, ఈ రోజున అది మూడు లక్షలు దాటింది. ప్రపంచ దేశాలకు వీరిని సరఫరా చేసే మూడు దేశాల్లో మనం ఉన్నాము. రాబోయే రోజుల్లో యువతకు ఈ రంగం వల్ల విశేషమైన ఉపాధి దొరుకుతుంది..." ఇలా ప్రధాని ప్రసంగం సాగింది. ఒక వారం తర్వాత 'కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ' రీసెర్చ్ స్కాలర్ సంగమూన్ హన్సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో "ఇండియా ఎగుమతుల ఎకానమీ అంతా కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉంది.గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 70 శాతం నౌకా వాణిజ్యం చేస్తుంటే, అందులో గుజరాత్ వాటా 33 శాతంగా ఉంది. రాజకీయంగా అన్నింటా ముందుండే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్లో అది 5 శాతం మాత్రమే" అని రాశారు. ఏపీ ప్రభుత్వాలతో బీజేపీకి 'వర్కింగ్ రిలేషన్స్' ఉన్నప్పటికీ, మోదీ ప్రసంగంలో పదేళ్లనాడు ఏర్పడిన తీర ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. పోనీ ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళే బాబుకు మోదీ సలహా ఇచ్చారా? అంటే, 'ఎన్డీఏ' కూటమి 'మీకు మీరే మాకు మేమే' తీరుతో చివరికి రాష్ట్రం బలవుతున్నది. ఏపీ 'మెరైన్' రంగంలో ఈ పదేళ్ళలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మొదలైన పూనిక అంటూ ఏదైనా ఉందంటే, అది 'కోవిడ్' రోజుల్లో కూడా వైసీపీ పాలనలోనే కనిపిస్తున్నది.-జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
'బురద' రాజకీయాలు మానాలి!
‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’పై బురద చల్లే కార్యక్రమాన్ని ఆపి సీమను ఆదుకునే పనిపై సంబంధిత పక్షాలన్నీ దృష్టి పెట్టాలి. ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా తప్పు పట్టడం, ఆ పథకం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దీనికి ప్రత్యామ్నాయం అన్నట్లు మాట్లాడటం సరికాదు. కొంత మంది రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదనీ, 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటే నీళ్లు కాదు బురద వస్తుందనీ మాట్లాడటం అభ్యంతరకరం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయం కాదు. అసలు రెండు ప్రాజెక్టులకు పోటీ పెట్టి మాట్లాడటమే పొరపాటు. రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని గరిష్ఠ స్థాయిలో ఎలా తీసుకోవాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.ముచ్చుమర్రి ఎలా ప్రత్యామ్నాయం?ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడుతున్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 798 అడుగులు ఉన్నపుడు కూడా నీటిని తోడే అవకాశం ముచ్చుమర్రి ద్వారా సాధ్యం అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ముచ్చుమర్రి. 2007లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయల ఖర్చుతో పాలనాపరమైన, ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి వలన ప్రయోజనాలు, పరిమితులను నిజా యతీగా విశ్లేషించుకోవాలి.ఈ పథకం ద్వారా కేసీ కెనాల్కు 1,000 క్యూసెక్యులు,హంద్రీ–నీవా ప్రాజెక్టుకు 3,000 క్యూసెక్యుల నీటిని రెండు మార్గాల ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. మల్యాల నుంచి మరో 3,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా హంద్రీ–నీవాకు సరఫరా చేస్తున్నారు. అయితే మల్యాల నుంచి లిప్ట్ చేయాలంటే శ్రీశైలంలో 834 అడులు నీరు ఉంటేనే సాధ్యం. ముచ్చుమర్రి దగ్గర కృష్ణానది నుంచి సిద్ధేశ్వరం దాకా 7 కి.మీ. మేరకు కాలువ తవ్వడం వలన నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ– నీవా, కేసీ కెనాల్లకు పరిమిత స్థాయిలో సరఫరా చేయవచ్చు. 11,574 క్యూసెక్కులు నిరాటంకంగా తోడితే ఒక టీఎమ్సీ నీటిని తోడవచ్చు. ఒక్క హంద్రీ–నీవాకే 40 టీఎమ్సీలు అవసరం. 2017లో ప్రారంభమైన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గడిచిన 7, 8 సంవత్సరాలలో ఏడాదికి 7 నుంచి 9 టీఎమ్సీల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. హంద్రీ–నీవాకు 40 టీఎమ్సీలూ, కేసీ కెనాల్కు పూర్తి స్థాయి అవసరాలకూ అనుగుణంగా నీరు సరఫరా సాధ్యం కావడం లేదు. అలాంటి పరిస్థితిలో అదనంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయా ల్సిన ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ, నెల్లూరు జిల్లా సోమశిల వంటి వాటికి ముచ్చుమర్రి ద్వారా నీరు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది?పోతిరెడ్డిపాడు కింద ఎస్ఆర్ఎమ్సీ వద్ద రోజుకు మూడు టీఎమ్సీల నీటిని సరఫరా చేసే అవకాశం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లభిస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ముచ్చుమర్రి ద్వారా మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నట్లు మాట్లా డటం సరికాదు. ముచ్చుమర్రి ద్వారా వచ్చే పరిమిత ప్రయోజ నాలను కొనసాగిస్తూ అదనపు ప్రయోజనాలకు అనుగుణంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.అవగాహన లేని వ్యాఖ్యలుకొందరు ఏకంగా శ్రీశైలంలో 800 అడుగులు నుంచే నీరు లిఫ్ట్ చేస్తే బురద వస్తుందనడం అభ్యంతరకరం. మరి అంతకన్నా కొన్ని అడుగుల క్రింద నుంచే గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా ముచ్చుమర్రి ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల కింద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తోంది. అక్కడెక్కడా రాని బురద రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మాత్రమే వస్తుందనడం న్యాయమా? కొందరు మంత్రులు ఏకంగా ముచ్చుమర్రి నుంచే పోతిరెడ్డిపాడుకు నీరు లిఫ్ట్ చేసుకుందాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి హంద్రీ–నీవా అవస రాలకు 40 టీమ్సీల నీరు అవసరం అయితే, అందులో సగం నీరు కూడా తీసుకోలేని దుఃస్థితిలో ఉంటే... అదనంగా పోతిరెడ్డిపాడుకు కూడా ముచ్చుమర్రి నుంచే నీరు లిఫ్ట్ చేసుకుందాం అనడం దారుణం.రాయలసీమ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లతో నికర జలాలు సగం కూడా తీసుకోలేక పోతున్నాము. ఇంక వరద జలాలపై ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలుగొండ, సోమశిలలకు నీరు ఎలా తీసుకుంటాం? బాధ్యత గల ప్రభుత్వాలు శ్రీశైలం నుంచి అవకాశం ఉన్న మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని తీసుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. సింహ భాగం పూర్తి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తే నష్టపోయేది రాయలసీమ ప్రజలే!మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
కాలుష్యం తగ్గేలా... పరిశ్రమ పెరిగేలా!
విద్యుత్ చలనశక్తి వైపు పెద్ద ఎత్తున మళ్ళడం కేవలం వాంఛనీయం కాదు, తక్షణావశ్యకమని ఢిల్లీ వాయు కాలుష్యం హెచ్చరిస్తోంది. ప్రపంచ మోటారు వాహ నాల పరిశ్రమ ఇప్పటికే ఆ క్రమంలో ఉంది. ఈ శతాబ్దంలోని పరిస్థితులు దాన్ని అనివార్య పరిణామంగా మారుస్తు న్నాయి. ఇదేదో వాతావరణ మార్పునకు పరిష్కారంగా తీసుకుంటున్న చర్య కాదు. పారిశ్రామిక పోటీ సామర్థ్యానికి, సాంకే తిక నాయకత్వానికి, జాతీయ ఆర్థిక స్థితిస్థాపక శక్తికి బ్యాటరీలతో నడిచే వాహనాలు నిర్ణయాత్మక శక్తిగా మారాయి.నేటి వ్యూహాత్మక అవసరంఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో గడచిన పదేళ్లలో మనం అడుగులు వేయడం ప్రారంభించాం. ఎక్కువ శక్తిని పొందుపరచు కునే కొత్త రకం బ్యాటరీల తయారీకి నడుం బిగించాం. కానీ, ఇతర దేశాలు నాటకీయంగా వేగం పుంజుకున్నాయి. పారిశ్రామిక ఆధిప త్యాన్ని చాటుకునేందుకు చైనా వీటిని కూడా ఒక వేదికగా చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈవీల సరఫరా క్రమంలో ప్రధాన విడి భాగాలపై అది పట్టు చేజిక్కించుకుంది. ఈవీలను వాడక తప్పని మార్పు ఎంత లోతైనదో అమెరికా, యూరోపియన్ యూనియన్ గ్రహించి, అసాధారణ పారిశ్రామిక విధానాలతో దానికనుగుణంగా స్పందించడం ప్రారంభించాయి. ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, ఈయూ గ్రీన్ డీల్ ఆ కోవకు చెందినవే! ఇపుడు కనుక నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే, ప్రపంచానికే నాయకత్వం వహించగల ఈవీ ఎకోసిస్టంను మనం నిర్మించుకో గలం. దేశంలో రోడ్లపై కనిపించే వాహనాల్లో ఈ రెండు విభాగాలవే దాదాపు 80 శాతం. పెట్రోలు వాహనం కన్నా ఈవీని కొనడం, నడపడం దాదాపు 30 శాతం చౌకతో కూడిన పని. పట్టణాలు, నగరాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటిని విరివిగా వాడవచ్చు. ద్వి, త్రిచక్ర వాహనాలు విధిగా 2030 కల్లా బ్యాటరీలతో నడిచేవే ఉండాలని నిబంధన తెస్తే, పరిశ్రమకు కూడా స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లవుతుంది. కంపెనీలు పరిశోధన–అభివృద్ధి, విడి భాగాల తయారీ, బ్యాటరీల ఉత్పత్తిపై సందేహించకుండా పెట్టుబడులు పెంచుకునేందుకు వీలవుతుంది. దేశంపై చమురు దిగుమతి భారం తగ్గుతుంది. నగరాల్లో గాలి మెరుగుపడుతుంది. ఈయూ దేశాలతోపాటు, ఇండోనేషియా, థాయిలాండ్, తైవాన్ వంటి పెక్కు దేశాలు ఈవీలను ఇప్పటికే తప్పనిసరి చేశాయి. కార్ల వైపు కూడా దృష్టి!ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల వినియోగం వైపు మనం పూర్తిగా మళ్ళాలి. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న పురోగతు లకు తగ్గట్లుగా మన కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య (కఫే) నిబంధనలను మార్చుకోవాలి. కిలోమీటరుకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 93.5 గ్రాములకు మించకూడదనే నియమాన్ని ఈయూ అమలుపరుస్తోంది. మన దేశంలో ఇది ఇప్పటికీ కిలోమీటరుకు 113 గ్రాములుగా ఉంది. కర్బన ఉద్గారాలు తగ్గించుకోవలసిందేనని నిబంధన తెస్తే వాహన తయారీ సంస్థలు ఇంధన సామర్థ్య లక్ష్యాల సాధనపై శ్రద్ధ పెడతాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల (ఐసీఈ)లో క్రమానుగత మెరుగుదలకు ఉపక్రమిస్తాయి. ఆర్థికంగా ఎక్కువ భారం మోపని కార్ల తయారీ వైపు కంపెనీలను నడిపించాలి. లైట్–డ్యూటీ వాహన ‘కఫే’ ప్రమాణాల అమలుతో యూరప్లో ఈవీల వాటా ఒక్క ఏడాదిలోనే 3 నుంచి 11 శాతానికి పెరిగింది. ‘కఫే’ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల మూడు ప్రయో జనాలున్నాయి. కంపెనీలు కాలం చెల్లిన ఐసీఈ టెక్నాలజీలపై ఆధారపడే బదులు తదుపరి తరం ఈవీల తయారీలపై పెట్టు బడులు పెడతాయి. ప్రపంచ రెగ్యులేటరీ ప్రమాణాలతో భారత్ సమతూకం సాధిస్తుంది. ఫలితంగా, దేశంలోని కార్ల తయారీసంస్థలు ఎగుమతి మార్కెట్లో పోటీ పడగలుగుతాయి. మూడవది– భారతీయ వినియోగదారులకు సరసమైన ఎలక్ట్రిక్ కార్లు అందు బాటులోకి రావడం వేగం పుంజుకుంటుంది. ఛార్జింగ్ అడ్డంకులుదేశంలో ఈవీల వాడకం ఆశించినంత పెరగకపోవడానికి కారణం వాటి ధర, లేదా పనితీరు కారణం కాదు. ఆధారపడదగిన రీఛార్జి సదుపాయాలు లేకపోవడం. ఇళ్లు, ఆఫీసులు రెండింటి వద్ద ఈ సదుపాయాలు అరకొరగానే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 60 శాతం మందికి పైగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో నివసి స్తున్నారు. ఛార్జర్లను ఏర్పాటు చేసుకోవడం వారికి వ్యయ ప్రయాస లతో కూడిన పని. వాహనాలు ఛార్జి చేసుకోవడం భారతదేశంలో తక్షణం జాతీయ హక్కుగా మారాలి. వాహనాలను పార్కు చేసుకునే చోట ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోనివ్వాలి. ప్రాథమిక విద్యుత్, సురక్షితా నిబంధనలతో ఆ సదుపాయాలు అందుబాటు లోకి తేవచ్చు. లీగల్ ఫ్రేమ్ వర్కును కూడా మార్చుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తరహాలో రెసిడెంట్ల సంక్షేమ సంఘాలు లేదా బిల్డింగ్ అసోసియేషన్ల నుంచి అనుమతి తీసుకోనవసరం లేకుండా ఏ పౌరుడైనా లీగల్ పార్కింగ్ స్పాట్ వద్ద ఛార్జర్ ఏర్పాటు చేసుకునేందుకు అధికారమివ్వాలి. వోల్టేజి తగ్గని విధంగా విద్యుత్ సరఫరా ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఈవీ–రెడీవైరింగు అమర్చాలి. స్లో, ఫాస్ట్ చార్జింగ్లకు వేర్వేరు ప్రదేశాలు నిర్ణ యించాలి. రెసిడెంట్ల సంక్షేమ సంఘాలు సాముదాయిక రీఛార్జింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాన్ని ప్రభుత్వం, పురపాలక సంస్థలు వివిధ కానుకల రూపంలో ప్రోత్సహించాలి. దీన్ని కేవలం పర్యావరణపరమైన బాధ్యతగా భావించడం పొరపాటు. భారత్ బలమైన ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా అవత రించేందుకు ఇది ద్వారాలు తెరుస్తుంది. మనం శిలాజ ఇంధనాల దిగుమతిపై చాలా కాలంగా ఆధారపడుతూ వస్తున్నాం. దాన్ని తగ్గించుకోవచ్చు. ప్రజారోగ్య లక్ష్యాలను అందుకోవడంలో నగరాలకు సహాయపడినట్లు అవుతుంది. బ్యాటరీలు, పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి గ్రిడ్ల అధునికీకరణ, పునరుత్పాదక ఇంధన వనరుల దిశగా అధునా తన టెక్నాలజీలలో పెట్టుబడులను ఉద్దీపింపజేస్తుంది. ఈ రంగాన అగ్ర భాగాన నిలిచేందుకు భారత్ కృషి చేసి తీరాలి. ప్రపంచం గేరు మారుస్తున్నప్పుడు, ఇండియా కూడా యాక్సిలరేటర్ తొక్కాలి. ఎలక్ట్రిక్ వాహనాలతో నగరాల్లో గాలి మెరుగుపడుతుంది. 2030 కల్లా విధిగా ద్వి, త్రిచక్ర వాహనాలు బ్యాటరీలతో నడి చేవే ఉండాలని నిబంధన తెస్తే, పరిశ్రమకు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లవుతుంది. అలాగే విస్తృతంగా ఛార్జింగ్ సదుపాయా లను అందుబాటులోకి తేవాలి.అశోక్ ఝున్ఝున్వాలా వ్యాసకర్త ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
దాపరికం లేని సామ్రాజ్యవాదం
ఇందులో కొత్తగా అర్థం చేసుకోవలసిన విషయాలేమీ లేవు. వెనిజులాపై సైనిక దాడి, అధ్యక్షుడు నికోలస్ మదురో అపహరణలో ఉన్నది తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే వివరించి చెప్పారు. అదీగాక, లాటిన్ అమెరికాతో కూడిన పశ్చిమార్ధ భూగోళం 1823 నాటి ‘మన్రో డాక్ట్రిన్’ నిర్దేశించినట్లు ఎప్పటికీ తమదిగానే ఉంటుందనీ, అందుకు అదనంగా ఇపుడు ‘ట్రంప్ డాక్ట్రిన్’ ప్రకారం అందుకోసం సైనిక బలాన్ని వినియోగించగలమనీ బాహాటంగా ప్రకటించారు. వెనిజులా ఆపరేషన్ తర్వాత ‘అందుకు విరుద్ధంగా మాట్లాడే ధైర్యం ఇక ఎవరికీ ఉండద’ని హెచ్చరించారు. నిజానికి ఈ ఆపరేషన్కు ముందు నవంబర్లో విడుదల చేసిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో ఉన్నది కూడా ఇదే!ఏ చట్టాలూ పాటించరా?వెనిజులాలో అమెరికాది అతి నగ్నమైన సామ్రాజ్యవాద చర్యను ఇంత సూటిగా, అన్ని కోణాల నుంచి ట్రంప్ వివరించినట్లు ఆయన విమర్శకులు కూడా చెప్పలేరేమో! అమెరికా అధ్యక్షునిది అన్ని విషయాలలోనూ దాపరికం లేనితనమే. అందుకు ఆయనను అభినందించవచ్చు కూడా! ఒక్క విషయంలో మాత్రం మదురోపై అసత్య ప్రచారాలు చేశారు. ఆయన మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేసి, అందుకోసం స్వయంగా ఒక కంపెనీని నడుపుతూ, అమెరికాకు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని! ఇవి తప్పుడు ఆరోపణలని అమెరికన్ మీడియాయే పలుమార్లు రాసినందున ఆ విషయమై చర్చించటం వృథా. పైగా, డ్రగ్స్ రవాణా కేసులలో శిక్షలు సైతం పడిన హోండురాస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో తదితరులకు క్షమాభిక్ష ప్రకటించి జైలు నుంచి విడుదల చేసిన ట్రంప్, మాదక ద్రవ్యాల కారణంగా మదురోపై చర్య తీసుకుంటున్నట్లు వాదించటం హాస్యాస్పదమని అమెరికన్ మీడియా కొట్టివేస్తున్నది. మాదకద్రవ్యాల రవాణా జరుగుతున్నదంటూ ఇటీవలి వారాలలో సుమారు 30 వెనిజులా పడవలపై బాంబింగ్ చేసి, 100 మందికి పైగా ప్రాణాలు తీసినదంతా ఎటువంటి ఆధారాలు చూపకుండా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని అదే మీడియా గుర్తు చేస్తున్నది. అమెరికా ప్రజాప్రతినిధులు, నిపుణులు పలువురు కూడా అదే విమర్శలు చేస్తున్నారు. వారిలో ట్రంప్కు చెందిన రిపబ్లికన్లు సైతం ఉన్నారు. చర్చలకు సిద్ధమని మదురో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ చర్య జరగటం గమనించదగ్గది.ఈ విధమైన దాడి చేయవలసిన అగత్యం ఇపు డేమి ఏర్పడింది? చమురు నిల్వల స్వాధీనం మాత్ర మేనా, మరేమైనా ఉందా? మదురోను పదవీచ్యుతు డిని చేయటంతో వెనిజులా తమ అధీనంలోకి వచ్చి నట్లేనా? మదురో స్థానంలోకి వచ్చిన ఉపాధ్యక్షు రాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాము కోరుకున్నట్లు పాలించ గలరన్న సూచన జరిగేదేనా? అంతిమంగా అధికారం ‘భద్రంగా, సవ్యంగా, న్యాయబద్ధంగా’ మరొకరికి బదిలీ కావటం అంటే ఏమిటి? అంతవరకు వెని జులాను ‘తామే పాలించగల’మన్న ట్రంప్ ప్రకటన ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యకుగానీ, ఆయన చేసిన ప్రకటనలకు గానీ అర్థం, అమెరికా తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం తన చట్టాలకు గానీ,అంతర్జాతీయ చట్టాలకు గానీ ఎంతమాత్రం కట్టుబడి ఉండబోదని స్పష్టంగా ప్రకటించటమేనా?మేమే బాస్!దాడికి కారణం చమురు నిల్వలన్నది విస్తారంగా వినవస్తున్న మాట. కానీ అది ఒక కోణం. ‘మన్రో డాక్ట్రిన్’ ప్రకారం తమ ఇలాకాగా పరిగణించే లాటిన్ అమెరికాలో తమను ధిక్కరించే ప్రభుత్వాలు గానీ, వామపక్ష ప్రభుత్వాలు గానీ ఏర్పడితే కూలదోయటం గత 70 ఏళ్లలో కనీసం 15 సార్లు జరిగింది. వెనిజులా ప్రభుత్వం కూల్చివేతకు హ్యూగో ఛావేజ్ కాలం నుంచి 20 ఏళ్లకు పైగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇది నేపథ్యం కాగా, వెనిజులా సహా పలు లాటిన్ అమెరికన్ దేశాలలో కొంత కాలంగా రష్యా, చైనాల ప్రాబల్యం క్రమంగా పెరుగుతుండటం ట్రంప్కు అన్నింటికీ మించిన ఆందో ళనగా మారింది. ప్రస్తుత దాడి సందర్భంగా ఆయన మన్రో డాక్ట్రిన్, ట్రంప్ డాక్ట్రిన్ ప్రస్తావనలు, పశ్చిమార్ధ గోళం వైపు ఇక ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేరన్న హెచ్చరికలు, తమ సైనిక బలం గురించిన మాటలు, ఇవన్నీ అటువంటి ఆందోళన నుంచి వచ్చినవే. చమురు ఆ తర్వాతి సంగతి. అమెరికా ప్రాబల్యం ఇతరత్రా కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా బలహీనపడుతున్నందున, పశ్చిమార్ధ గోళంలో, దానితో పాటు పశ్చిమాసియాలో తమ బలాన్ని ఏ విధంగానైనా నిలుపుకొని తీరాలన్నది ట్రంప్ పట్టుదల. వెనిజులాపై దాడి, అదే పని చేయగలమంటూ ఇరాన్కు హెచ్చరికలు, ఇజ్రాయెల్ ద్వారా పాలస్తీనా ఆక్రమణ వంటి చర్యల ద్వారా ఆ లక్ష్యం దీర్ఘకాలంలో ఎంతవరకు నెరవేరగలదన్నది వేచి చూడాల్సిన విషయం.పోతే, వెనిజులాలో ఉపాధ్యక్షురాలి నాయకత్వాన కొనసాగుతున్న ప్రభుత్వం, సైన్యం కూడా ట్రంప్ దాడిని ఖండిస్తూ, ‘తమ దేశం ఎప్పటికీ అమెరికన్ వలస కాబోద’ని స్పష్టం చేశాయి. అటువంటి స్థితిలో అధి కారం ‘భద్రంగా న్యాయబద్ధంగా’ బదిలీ కావటం ఏ విధంగా ఆచరణ సాధ్యం? బలమైన సోషలిస్టు శక్తులు, ఆ ప్రాంతమంతటా గెరిల్లా గ్రూపులు, అదే మూడ్లో ఉన్న వెనిజులా సైన్యం దృష్ట్యా పరిణామాలు ఏవిధంగా ఉండవచ్చు? కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక జోక్యాలు, ఎన్నికైన ప్రభుత్వాలను ‘నియంతృత్వ’మనే ప్రచారాలతో పడగొట్టడాలతో లాటిన్ అమెరికా అంతటా ప్రజాభిప్రాయం చాలావరకు అమెరికాకు వ్యతిరేకంగా ఉంది. అమెరికాపై విమర్శలు యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం దృష్టి నుంచి అంతిమంగా తేలే ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉదారవాద వ్యవస్థలు, అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు పరస్పర సంబంధాలు, దేశాల స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం వంటివి బలహీనపడుతున్నా ఇంకా నిలిచి ఉంటాయా, లేక అమెరికా సామ్రాజ్యవాదానికి మరింత బలవుతాయా అన్నది. బలి చేయటమేనన్నది నిర్ణయమైతే ట్రంప్ గురి క్రమంగా బహుళ ధ్రువ ప్రపంచం, బ్రిక్స్, ఎస్సీఓ, డీ–డాలరైజేషన్ ప్రయత్నాల వైపు మళ్లుతుంది. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చంద్రబాబు పీడిత రాయలసీమ!
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే,ప్రాంతం పొలిమేరల వరకూ తరిమి కొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే, ప్రాంతం లోపలే పాతిపెడతాం’ అంటూ ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిదాయకమైన మాటలు... రాయలసీమ సమాజం చెవుల్లో మార్మోగుతున్నాయి. అంతేకాదు, రాయలసీమ ప్రాంతంలో పుట్టి, పెరిగి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, పాలకుడిగా ఇప్పుడా ప్రాంతానికే ద్రోహం తలపెట్టిన చంద్ర బాబును ఏం చేయాలో అనే అంతర్మథనంలోనూ రాయలసీమ ఉంది. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కరవు రక్కసిని పారదోలాలనే దివంగత ప్రియతమ నేత, తన తండ్రి వైఎస్సార్ ఆశయాన్ని, ఆకాంక్షను నెరవేర్చడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటితో పాటు కరవు ప్రాంతమైన రాయల సీమలో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం వైఎస్ జగన్ గొప్ప ఆశయానికి నిదర్శనం.అప్పుడే పూర్తయ్యేది!శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ. 3,825 కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. మొదటి దశలో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకం సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు విఘ్నాలు కలిగించిన చందంగా... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా నాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా ఎన్జీటీలో పిటిషన్ వేయించి, అడ్డు తగిలారు. అయితే మహాభారతంలో అర్జునుడి లక్ష్యం చెట్టుపై ఉన్న పక్షి కన్నుపై తప్ప, కొమ్మలపై కానట్టుగా... పార్థుడి లాంటి వైఎస్ జగన్ దృష్టి ప్రాజెక్ట్ పనులపై మాత్రమే ఉండింది. అందుకే చంద్రబాబు సృష్టించిన ఆటంకాలను లెక్క చేయకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని శరవేగంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కొనసాగి ఉంటే, ఈ పాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి, రాయలసీమంతా సస్యశ్యామలం అయ్యేది. కరవు పీడిత ప్రాంత రైతాంగం జీవన రూపురేఖలే పూర్తిగా మారిపోయేవి. కానీ రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వెలుగులు నింపే వైఎస్ జగన్ పరిపాలనా దీపాన్ని... అబద్ధాలు, విష ప్రచారం ద్వారా కూటమి కొండెక్కించేసింది. తద్వారా వైఎస్ జగన్ కంటే, ఎక్కువగా తామే నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోందన్నది ముమ్మాటికీ నిజం.మాతృగడ్డకే ద్రోహమా?ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా... మొదటి బాధిత ప్రాంతంగా రాయలసీమ రికార్డులకెక్కింది. రాయలసీమ వాసిగా, ఆ ప్రాంతా నికి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా సమాజం అతడిపై మండి పడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాలాంటి నాయకులపై ‘చంద్రబాబు అండ్ కో’కు కోపం ఉండొచ్చు. ఒకవేళ మాపై కోపాన్ని తీర్చుకోవాలంటే అధికారాన్ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి.కానీ కరవు ప్రాంతంపై చంద్రబాబు ప్రతాపం ఎందుకో అర్థం కావడం లేదు. అధికారాన్ని తాను పుట్టిన ప్రాంతానికి ద్రోహం తలపెట్టడానికి దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. బహుశా దేశ చరిత్రలో మరే నాయకుడూ తనకు రాజకీయ, అధికార భిక్షమేసిన మాతృగడ్డకు చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇంతకాలం ఆయనపై మచ్చ ఉంది. ఇప్పుడు దానికంటే మించిన మచ్చ, అప్రతిష్ఠ చంద్రబాబుకు దక్కాయి. నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం జీవితాలను మార్చేందుకు, కృష్ణా నీళ్లతో బీడు భూముల్ని తడిపేందుకు భగీ రథుడిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞం తలపెట్టగా, రాక్షసుడి మాదిరిగా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. తన రాజకీయ శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోరిన వెంటనే, తన అబ్బ సొత్తు అన్నట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అంతే తప్ప, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోరినట్టు నడుచుకోవడా నికి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాళోజీ చెప్పినట్టు...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతతో, ఇవాళ కరవు పీడిత ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. మళ్లీ వలసలు తప్పడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి కూడా కోరలు కట్ చేసిన పరిస్థితి. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? గత ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని కూటమికే కట్టబెడితే, రిటర్న్ గిఫ్ట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను లేకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఈ దుర్మార్గానికి ఏం పేరు పెడితే సరిపోతుందో విజ్ఞులైన రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. రాయలసీమ ప్రాంతం నీళ్ల కోసం అలమటిస్తోంది. అందుకే దివంగత వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు అప్పట్లో పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచి, రాయలసీమ ప్రాంత కరవు పారదోలడానికి పనుల్ని వేగవంతం చేశారు. ఇదీ రాయలసీమను కరవు రక్కసి నుంచి తరిమికొట్టడానికి జగన్ నిబద్ధత. చంద్రబాబు మాత్రం... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ రాయలసీమ కరవును పారదోలాలని ఆలోచించలేదు. కానీ వైఎస్ జగన్ తీర్చిదిద్దిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను మాత్రం తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసం లిఫ్ట్ చేయ డానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకే చంద్రబాబును రాయలసీమ పాలిట పీడకుడని చెప్పడం! తమ ప్రాంతానికి మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైంది. సొంత ప్రాంతం వాడే ద్రోహం చేస్తే, ఏం చేయాలో మహాకవి కాళోజీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయించుకోవా ల్సింది రాయలసీమ సమాజమే!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
ఒక అజేయ స్ఫూర్తి సంకేతం
సోమనాథ్... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ప్రభాస్ పటాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని ‘ద్వాదశ జ్యోతిర్లింగ’ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. ‘‘సౌరాష్ట్రే సోమనాథం చ...’’ అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం, తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తును ఇలా చాటిచెబుతుంది: ‘‘సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపైః ప్రముచ్యతే‘ లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్’’ అంటే– ‘‘సోమనాథ్ శివలింగ దర్శన మాత్రాన జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి, మరణానంతరం స్వర్గ ప్రాప్తినొందుతాడు’’ అని అర్థం. కానీ, లక్షలాది భక్తజనం భక్తిప్రపత్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్పై దురదృష్టవశాత్తూ విధ్వంసమే ఏకైక ధ్యేయంగా విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో వెయ్యేళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. అయితే, సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.అఖండ ధైర్యానికి నిర్వచనంసోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం వెయ్యేళ్లు గడిచినా మరపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి. భారత దేశంపైన, ప్రజల మనోధైర్యం మీద అది చూపిన పెను దుష్ప్రభావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలోగల సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నింటినీ మించి సోమనాథ్కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశదేశాలకు విసృతంగా మోసుకెళ్లారు. తొలి దాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవడంపై నిస్సందేహంగా నేనెంతో గర్విస్తున్నాను. ఈ ఆలయం ఈనాడు భరతమాత కోట్లాది బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది. ఎన్నడో వెయ్యేళ్ల కిందట 1026లో మొదలైన మధ్యయుగపు అనాగరిక దండయాత్ర, ఇతరులను కూడా సోమనాథ్పై పదేపదే దాడులకు ‘ప్రేరేపించింది.’ దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖలాల్లో బంధించే ప్రయత్నాలకు నాంది పలికింది. ఎందరో మహానుభావులుకానీ, ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్నాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్ను సందర్శించినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. నాటి తన అనుభవాన్ని 1897లో చెన్నయ్ నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా– ‘‘దక్షిణ భారతంలోని ప్రాచీన ఆలయాలతోపాటు గుజరాత్లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞానప్రదాతలు. ఎన్నో పుస్తకాలు వివరించలేని జాతి చరిత్రపై మనకు మరింత లోతైన అవగాహనను అందిస్తాయి. వంద దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా వంద పునరుజ్జీవన చిహ్నాలతో ఈ ఆలయాలు ఎంత వైభవంగా నిలిచాయో గమనించండి. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవనంతో మునుపటి ఠీవితో ఎంత శక్తిమంతంగా విలసిల్లుతున్నాయో చూడండి! అదే జాతీయ మనోభావనం జాతీయ జీవన స్రవంతి. అనుసరిస్తే అది అమేయ యశస్సు వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ జీవన స్రవంతిని వీడితే ఫలితం మరణమే! ఆ మార్గం వదిలిపెడితే ప్రభావం ఆత్మనాశనం, వినాశమే!’’ స్వాతంత్య్రానంతరం సమర్థుడైన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సోమనాథ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయిన సర్దార్ పటేల్... అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాథ్లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు హాజరయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలని కలలుగన్న యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ పరిణామం పట్ల అంతగా ఉత్సాహం చూపలేదు. ఎంతో విశిష్టమైన ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్పై ప్రతికూల ముద్ర వేసిందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో నిలిచే ఉన్నాయి. సర్దార్ పటేల్కు ఎంతో అండగా నిలిచిన కె.ఎం. మున్షీని స్మరించుకోకపోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతుంది. ‘సోమనాథ: నిత్య క్షేత్రం (సోమనాథ: ద ష్రైన్ ఎటర్నల్)’ గ్రంథంతోపాటు... సోమనాథ్పై ఎన్నో సమాచారభరిత, విజ్ఞానదాయకమైన రచనలు చేశారు. నిజానికి, మున్షీ తన గ్రంథ శీర్షికలో చెప్పినట్టు... ఆత్మ నిత్యత్వాన్నీ, ఉన్నత భావాల శాశ్వతత్వాన్నీ బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. ‘నైనం ఛిందన్తి శస్త్రాణి’ అని గీతలో చెప్పినట్టు – అది ధ్వంసం చేయ శక్యంగాని అజరామరత్వమని మనం బలంగా నమ్ముతాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథ్ను మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలనూ, ఆటుపోట్లనూ ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేది దీన్ని వివరించగలదు? ఒక ఆశాగీతంవందల ఏళ్ల దాడులనూ, వలసవాద దోపిడీనీ తట్టుకొని నిలబడి... నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే... మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తోంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యులు సోమనాథ్కు వచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం... ‘భవబీజాంకురజననా రాగాధ్యాః క్షయముపగతా యస్య’ అనే శ్లోకాన్ని ఆయన చెప్పాడంటారు. అంటే – ‘‘లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వాడికీ... రాగద్వేషాలనూ, సమస్త క్లేశాలనూ తుడిచిపెట్టే వాడికీ వందనాలు’’ అని అర్థం. నేడు మన మనస్సులోనూ, ఆత్మలోనూ ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్కు ఉంది. 1026లో మొదటిసారి దాడి జరిగి వెయ్యేళ్లు గడిచినా... సోమనాథ్ వద్ద సాగరం నేటికీ అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెబుతున్నాయి. ఆటంకాలెన్ని ఎదురైనా... ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ అభ్యుదయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రమూ చెక్కుచెదరని ఆ అజేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.సోమనాథ్ ఒక ఆశా గీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు. కానీ సత్యమూ, ధర్మంపై అచంచలమైన విశ్వాసమూ అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది. వెయ్యేళ్ల కిందట దాడికి గురై, తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే... మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న, వెయ్యేళ్ల కిందటి మన దేశ మహా వైభవాన్ని పునరుద్ధరించుకుని తీరుతాం. శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో, వికసిత భారత నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వ కల్యాణమే పరమావధిగా... మన నాగరికతా స్ఫూర్తి దిశానిర్దేశం చేస్తోంది. జై సోమనాథ్! నరేంద్ర మోదీభారత ప్రధాని, శ్రీ సోమనాథ్ ట్రస్టు చైర్మన్ -
జోహ్రాన్ మమ్దానీ (న్యూయార్క్ మేయర్) రాయని డైరీ
నీ పక్కన ఎవరు నిలబడి ఉన్నారన్నది నీ బలాన్ని తెలుపుతుంది. నువ్వు ఎవరి పక్కన నిలబడి ఉంటున్నావన్నది వారి పట్ల నీలోని బలమైన ఆపేక్షను చూపుతుంది.నేను, న్యూయార్క్ సిటీ... నా బాల్య మిత్రులం. ఎప్పటికీ ఒకరి పక్కన ఒకరం నిలబడి ఉండేవాళ్లం.హడ్సన్ నది ఒడ్డున , న్యూయార్క్ సిటీ నా భుజం పైన చెయ్యేసి నడుస్తుంది. నాకెంతో ఇష్టమైన గోధుమ పిండి ‘బురిటో’ను క్వీన్స్ – బ్రూక్లిన్ స్టేషన్ల మధ్య తిరుగుతుండే ‘క్యూ’ ట్రైన్లో తనతో ఇష్టంగా పంచుకోనిస్తుంది. వలస వచ్చిన వారిని కలవనివ్వటం అంటే, రమ్మని పిలిచి కలవటం కాదు. రావచ్చా అని అడిగి వెళ్లి కలవటం. న్యూయార్క్ మర్యాదగల మనిషి. మానవ మర్యాదల కోసం చూడని నగరం. ఇలాగే కదా నాగరికత ఉండాల్సింది! జనవరి 1 అర్ధరాత్రి... కొత్త ప్రయాణికుడిలా ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్లో దిగాన్నేను. లగేజ్ లేదు. లగేజ్లు మోయటానికి వచ్చినవాడి దగ్గర లగేజ్ ఎందుకు ఉంటుంది?‘‘ఎవరతను, ఈ టైమ్లో దిగాడు?’’‘‘న్యూయార్క్ సిటీ కొత్త మేయర్!’’‘‘అది తెలుసు. ఎవరతను?’’‘‘డెమోక్రాటిక్ సోషలిస్ట్!’’‘‘అదీ తెలుసు. ఎవరతను?’’‘‘ఒక యువకుడు!’’‘అది తెలుస్తూనే ఉంది. ఎవరతను?’’‘‘వలస వచ్చినవాడు’’ ‘‘అది కూడా తెలుసు. ఎవరతను?’’‘‘ఒక ముస్లిం’’ ‘‘ఓరి దేవుడా! న్యూయార్క్ సిటీ ఒక ముస్లింని, ఒక వలస మనిషిని, ఒక డెమోక్రాటిక్ సోషలిస్ట్ని, ఒక అనుభవం లేని వాడిని తన మేయర్గా ఎన్నుకుందా? ఏం కర్మ ఈ 400 ఏళ్ల మహా నగరానికి?!’’నాతో తలపడి నన్ను గెలిపించిన ఆండ్రూ క్యూమో, కర్టిస్ స్లివా, ఎరిక్ ఆడమ్స్ ఆత్మలు సబ్వేలో బాధతో మూలుగుతున్నట్లుగా అనిపించింది!ఇందులో దేనికి నేను క్షమాపణలు చెప్పి ఈ ఆత్మల ఘోషను చల్లార్చాలి? వలస వచ్చినందుకా? ముస్లింని అయినందుకా? యువకుడిని అయినందుకా? డెమోక్రాటిక్ సోషలిస్టును అయినందుకా?... లేక, ఇవన్నీ అయి కూడా, న్యూయార్క్ సిటీ మేయర్గా ఓడిపోనే పోనందుకా?!న్యూయార్క్ వలసల నగరం. వలసలు నిర్మించిన నగరం. వలసల శ్రమతో నడిచే నగరం. ఇక నుంచి ఒక వలసదారుడు నడిపే నగరం కూడా.ఈ మూడు పరాజిత ఆత్మలు నాతో పాటుగా రోజూ సిటీ హాల్లోని మేయర్ ఆఫీస్కి వచ్చి, డ్యూటీ చేసి వెళుతుంటాయా? వెంటాడే వాళ్లు, వేటాడేవాళ్లు ఎక్కడికైనా వస్తారు!ఇకపై వాషింగ్టన్ నుంచి వచ్చిన వారెవరైనా న్యూయార్క్ సిటీలోని ఒక వలసదారుడిని తాకాలంటే, ముందుగా జోహ్రాన్ మమ్దానీ అనే ఈ కొత్త న్యూయార్క్ మేయర్ను దాటే వెళ్లాలి.కర్టిస్ స్లివా వ్యథాత్మ అసహనంగా అంటోంది: ‘‘జోహ్రాన్, నువ్వు ఎవరివైనా, ఎక్కడి నుంచి వచ్చినా... ప్రమాదకారివి అవటం మాత్రం మొదట నువ్వు డెమోక్రాటిక్ సోషలిస్ట్వి అయినందువల్లనే...’’నవ్వొస్తోంది నాకు. మనిషన్న వారెవరైనా డెమోక్రాటిక్ సోషలిస్ట్ అవకుండా ఉండగలరా? కర్టిస్ రిపబ్లికన్. మేయర్ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు గెలుచుకున్న కర్టిస్ కానీ; 41 శాతం ఓట్లు సాధించిన ఆండ్రూ క్యూమో కానీ; పాయింట్ 3 శాతం ఓట్లు పొందిన ఎరిక్ ఆడమ్స్ కానీ, వ్యక్తులుగా డెమోక్రాటిక్ సోషలిస్ట్లు కాకుండా పోతారా?!డెమోక్రాటిక్ సోషలిస్ట్గానే నేను ఎన్నికయ్యాను. డెమోక్రాటిక్ సోషలిస్టుగానే న్యూయార్క్ సిటీని నడిపిస్తాను. ఆ నడక నాకు న్యూయార్క్ సిటీ నేర్పిందే! -
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎల్లో మీడియా పెను శాపమవుతోంది. కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఈ మీడియా ప్రజలపై వేల కోట్ల భారాన్ని కూడా నిస్సిగ్గుగా సమర్థించే స్థితికి చేరుకుంది. జర్నలిజం ప్రమాణాలకు ఎన్నడో తిలోదకాలు ఇచ్చిన ఈ మీడియాపై ప్రజలు మండిపడుతున్నారు. జగన్ సీఎంగా ఉండగా వదంతులతో, కల్పిత కథలతో విష ప్రచారం చేసిన మీడియా ధోరణి ఇప్పటికీ మారలేదు. ఆంధ్రజ్యోతి కొన్ని రోజులు క్రితం ‘‘బాదుడు కాదు.. బాగుకే’’ అన్న శీర్షికతో ప్రచురించిన కథనం దీనికో ఉదాహరణ. ఏపీలో వాహన కొనుగోలుదారులపై పది శాతం సెస్ వేయడాన్ని సమర్థించింది ఆంధ్రజ్యోతి తరఫున వచ్చిన ‘‘బాదుడు కాదు.. బాగుకే’’ అనే కథనం. పైగా ఇందులోనే సెస్కు సంబంధించి ‘సాక్షి’ దినపత్రికలో ఇచ్చిన కథనంపై తన అక్కసునంతా వెళ్లగక్కింది. సెస్ను ప్రభుత్వం సమర్థించుకుంటోందని రాసి ఉంటే అదో పద్ధతి అనుకునేవాళ్లు. కానీ.. పత్రిక స్వయంగా భుజానికెత్తుకోవడం సరైన నిర్ణయమంటూ రాసేయడంతోనే సమస్య. వాహనాల లైఫ్ టాక్స్పై మాత్రమే సెస్ అని, ఒక్కో వాహన కొనుగోలుదారుపై పడే భారం రూ.1200 అని ఈ కథనం చెబుతుంది. సాక్షి కూడా ఇదే కదా రాసింది. రాష్ట్రంలో సగటున నెలకు 73 వేల వాహనాలు అమ్ముడుపోతూంటే సెస్ వల్ల ఏడాదికి రూ.270 కోట్ల భారం ప్రజలపైపడుతుందని సాక్షి రాసింది. కానీ ఎల్లోమీడియా దృష్టిలో ఇది పెద్ద భారమే కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వారికి బాగా గిట్టుబాటు అవుతోంది మరి. ఇలాంటి అంశాల్లో మీడియా అనేది ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలా పన్నులు వేయడంలోని హేతుబద్దతను ప్రశ్నించాలి. అప్పులు తేకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పన్నుల బాదుడు లేకుండా ప్రభుత్వాన్ని నడిపి, సంపద సృష్టించి అన్ని హామీలను అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఎన్నికల సమయంలో పలికిన బీరాలను గుర్తు చేయాలి. అలా చేయకపోగా రోడ్లు బాగు చేయాలని, మద్యం తాగి నడిపే వారిని పట్టుకునేందుకు బ్రీత్ ఎనలైజర్లు, వేగం నియంత్రణకు స్పీడ్గన్లు ఏర్పాటు చేయాలని రాస్తోంది. ఇదే రకమైన బుద్ధో మరి? కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ బాగు చేసేశామని ఆ మధ్య ఎప్పుడో చెప్పారు కదా? అంతలోనే ఏమైంది?అవినీతి పుణ్యమా అని గోతులమయం అయ్యాయా? పైగా రహదారుల కోసం ఇప్పటికే సెస్లు ఉండగా అదనంగా ఎందుకు? పెట్రోల్, డీజిల్ ధరలపై ఇప్పుడున్న సెస్ ఎంత? ఆ మొత్తాన్ని రోడ్లకు వాడడం లేదు ఎందుకు? ఎన్నికలై 19 నెలలైనా ఇచ్చిన హామీ మేరకు పెట్రోలు, డీజిళ్ల ధరలు ఎందుకు తగ్గించలేదు? ఈ అంశాలపై ఎల్లో మీడియా ఎన్నడైనా వార్తలు ఇచ్చిందా?. జగన్ టైమ్లో చెత్త పన్ను కోట్లు వసూలు చేశారట. కాని ఎక్కడి చెత్త అక్కడ ఉందట. తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారంటే రాజకీయం అనుకోవచ్చు కానీ.. ఆంధ్రజ్యోతి ఇంత పచ్చిగా అబద్దాలను ప్రచారం చేయడం ఎంత దుర్మార్గం? ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్థానిక సంస్థలలో నెలకు రూ.50 - 100 వసూలు చేసి పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. వీటి ద్వారానే ప్రభుత్వానికి రూ.కోట్లు వచ్చాయట. ఇందులో ఇసుమంతైనా నిజం ఉందా? ప్రభుత్వం చెత్త పన్ను ఎత్తివేశామని చెప్పిన తర్వాత అనేక గ్రామాలు, పట్టణాలలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో తెలియదా? ప్రస్తుతం పిఠాపురం వంటి చోట్ల ఈ చెత్త పన్ను వసూలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. చెత్త పన్నుతో కోట్ల వచ్చాయట. ఇప్పుడేమో లైఫ్ టైమ్ టాక్స్ పై పది శాతం సెస్ వేస్తే కాని రోడ్లు బాగు చేయలేరట.అది కోట్ల మొత్తం కాదని వీరు చెబుతున్నారా? వైసీపీ హయాంలో చెత్త పన్ను వేస్తున్నారని, చెత్త ప్రభుత్వం అని తప్పుడు ప్రచారం చేశారు. పెద్ద సంస్కరణవాదిని అంటూ గతంలో ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలు వసూలు చేయించిన చంద్రబాబు అధికారంలో ఇంకో పార్టీ ఉంటే మాత్రం ఇలా చెబుతుంటారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా రోడ్డు కావాలంటే స్థానికు ప్రజలు ఏభై శాతం భరించాలని ‘జన్మభూమి’ పథకం కింద నిబంధన పెట్టిన విషయంబ మరచిపోయారా? ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక ఆ షరతు తొలగించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్లు బాగు చేయలేని ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి నిర్మాణం చేస్తుందట. ప్రైవేటు వ్యక్తులు చెత్త తొలగించడానికి ఏభయ్యో, వందో తీసుకుంటేనే తప్పు అని చెప్పిన చంద్రబాబు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా, వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అప్పనంగా ధారాదత్తం చేస్తారట. జగన్ చేస్తే బాదుడు ..చంద్రబాబు చేస్తే బాగుకే అని రాయడం అంటే పాఠకులను, ప్రజలను మోసం చేయడం కాకుండా మరొకటి అవుతుందా?.. గత నవంబర్ ఆఖరు వారంలో ఇదే పత్రిక ఒక కథనం ఇచ్చింది. సెస్సులు వేసి రోడ్లు వేయాలని రహదారుల శాఖ ప్రతిపాదన పెట్టింది. దాని ప్రకారం పెట్రోలు, డీజిల్, గనులు,రిజిస్ట్రేషన్లపైన సెస్ వేసి స్టేట్ హైవేలను అభివృద్ది చేయాలని తలపెట్టారట. దీనిని ప్రజలపై భారం మోపడం అని అంగీకరించరా? ఈ భారం సుమారు రూ.30 వేల కోట్ల వరకు ఉండవచ్చని ఇతర మీడియాలో కథనాలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉంటే ఎంత బాదుడు బాదినా ఆహా,ఓహో అని పొగుడుతారా? అదే జగన్ ప్రభుత్వం ఉంటే అడ్డగోలుగా రాస్తారా?.. ఇప్పటికే కరెంటు చార్జీల సర్దుబాటు రూపంలో సుమారు రూ.17వేల కోట్లు మళ్లీ మరో రూ.15651 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చారా?లేదా? భూముల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో అదనంగా రూ.వెయ్యి కోట్లు ఆదాయం సమకూర్చుకుంటున్నారా? లేదా? గ్రామాలలో రక్షిత నీటి సరఫరాపై యూజర్ ఛార్జీలను వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? లేదా? ఒక వైపు దాదాపు మూడు లక్షల కోట్ల అప్పుతో రికార్డు సృష్టించిన ప్రభుత్వం మళ్లీ అదనంగా ఈ బాదుడు ఏమిటి అని అడగవలసిన ఈ ఎల్లో మీడియా నిర్లజ్జగా బాజా కొడుతోంది.కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించినప్పుడు ఇదే ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేసింది? జీఎస్టీ తగ్గించడంతో అన్ని రకాల వ్యాపారాలు పెరిగిపోయాయని, ప్రబుత్వానికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తోందని కదా? ఇప్పుడేమో ప్రభుత్వం ఆదాయం తగ్గపోయిందని ఎందుకు సన్నాయిరాగం తీస్తున్నట్లు? మరో సంగతి చెప్పాలి. వైసీపీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లుల బకాయిలు ఇస్తోందట. అది తప్పట. పనులు చేయించుకున్న తర్వాత బిల్లులు చెల్లించవద్దని ఏ మీడియా అయినా రాయగలుగుతుందా? పనులలో ఏదైనా తేడా ఉంటే అది వేరే విషయం అసలు రాజకీయ కక్షలతో పాలన సాగించాలని ఒక మీడియా చెప్పడం ఉన్మాదం కాక మరేమవుతుంది. ఇక్కడ ఈనాడు మీడియా గురించి కూడా ఒక మాట చెప్పాలి. జగన్ టైమ్లో ఇండోసోల్ అనే కంపెనీకి ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తే ఈ మీడియా అది జగన్ బినామీ కంపెనీ అని ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీకి సుమారు రూ.14 వేల కోట్ల విలువైన రాయితీలు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిని ఎక్కడా తప్పుపట్టకుండా ఈనాడు మీడియా జాగ్రత్తపడింది.అంటే ఇప్పుడు చంద్రబాబు బినామీ కంపెనీ అయిందా? లేక ఇండోసోల్ తో ఏదైనా బేరం కుదిరిందా? అన్న విమర్శ చేస్తే ఆ మీడియా వద్ద సమాధానం ఉంటుందా? అందుకే ఈ ఎల్లో మీడియా ఏపీ ప్రజలపాలిట శాపంగా మారినట్లు పలువురు భావిస్తున్నారు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పేరుకు అభివృద్ధి... 'చేసేది విధ్వంసం'
బొగ్గు గనులు ‘ఇంధన భద్రత’గా మారాయి. రేవులు ‘వ్యూహాత్మక మౌలిక వసతులు’ అయ్యాయి. సఫారీ పార్కులు ‘సంరక్షణ’ ముద్ర వేసుకుంటున్నాయి. వీటిని ఒకే తాటిపైకి తెస్తున్నది జాగ్రఫీ కాదు, వాటి రాజకీయ ఆర్థిక వ్యవస్థ. హరిత ఆవరణ వ్యవస్థ అడవులు,కొండలు, దీవులను అభివృద్ధి పేరిట పెట్టుబడి ఆస్తులుగా మార్చేస్తోంది. హరియాణాలో ఆరావళి పర్వత శ్రేణిలో 3,800 ఎకరాలకు పైగా ప్రాంతాన్ని మెగా సఫారీ పార్కుగా మార్చాలన్న ప్రతిపాదన అందుకు తిరుగులేని నిదర్శనం. ఎకో టూరిజం, జీవవైవిధ్య పెంపుదల పేరు చెప్పి అది టూరిస్టులకు కన్నుల పండువను, డెవలపర్లకు లాభాలను వాగ్దానం చేస్తోంది. కానీ, అది అడవుల ఆవరణకు, జల వనరులకు, గ్రామాల ఉమ్మడి ఆస్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ఇది ఆరావళికి మాత్రమే పరిమితమైంది కాదు. హసదేవ అరండ్లో బొగ్గు బ్లాకుల నుంచి దేహింగ్ పటకాయీలో చమురు, మైనింగ్; గ్రేట్ నికోబార్లో ట్రాన్స్– షిప్మెంట్ పోర్టు వరకు, భారతదేశపు అత్యంత బలహీనమైన జీవావరణ వ్యవస్థలు, అభివృద్ధికి పొలిమేరలుగా పునర్నిర్మాణం చెందుతున్నాయి. సఫారీ అనేది మినహాయింపు కాదు. అదొక నమూనా! జీవనాధార వ్యవస్థకు ముప్పుఆరావళి పర్వతాలు గుజరాత్లో మొదలై రాజస్థాన్, హరి యాణా గుండా సాగి ఢిల్లీ వరకు 670 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థగా దీన్ని చెబుతారు. ఇది భౌగోళిక అవశేషం కాదు. జీవావరణ మౌలిక వ్యవస్థ. థార్ ఎడారి తూర్పు వైపు మరింత విస్తరించకుండా ఇవి దాన్ని కాస్త మందగింపజేస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వాయవ్య భారతాన భూగర్భ జలాల రీఛార్జీకి ఇవి ఉపయోగ పడుతున్నాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, నుహ్ వంటి జిల్లాల్లో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. ఆ జిల్లాలకు ఆరావళి పర్వతాలే జీవనాడి. అవి రుతుపవన వర్షాలను పీల్చుకుంటూ భారీ స్పాంజ్లుగా ఉపయోగపడుతున్నాయి. నీటికి ఎంతో కటకటలాడే ప్రాంతంలో జలవనరులు అంతో ఇంతో నిండటానికి తోడ్పడుతున్నాయి. పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా ఉన్న ఈ నేపథ్యంలో, పులిమీద పుట్రలా సుప్రీం కోర్టు భౌగోళిక శాస్త్ర ప్రమాణాలను ఉటంకిస్తూ, ‘సైన్స్’ పేరుతో ఆరావళి పర్వతాల రూపురేఖలకు ఆ మధ్య కొత్త నిర్వచనం ఇచ్చింది. చుట్టుపక్కల భూమి కన్నా కనీసం 100 మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలని పేర్కొంది. ఈ విషయంలో అది రెగ్యులేటరీ అస్పష్టతను తొలగించేందుకు కేంద్రం ఇచ్చిన నిర్వచనం పైనే ఆధారపడింది. కాగితాలపై ఇది సాంకేతిక సునిశితత్వంగా కనిపించవచ్చు. వాస్తవంలో, ఇది లీగల్ భూకంపం లాంటిది.ఆరావళులలో చాలా భాగాలు ముఖ్యంగా హరియాణా, రాజస్థాన్ లోనివి తక్కువ ఎత్తులోనే ఉంటాయి. అవి కోర్టు చెప్పిన ఎత్తును అందుకోలేకపోవచ్చు. కానీ, జీవావరణ పరంగా అత్యంత కీలకమైనవి. పర్వతాలను పునర్ నిర్వచించడం ద్వారా భారీ భూభాగాలను పరిరక్షణ నుంచి మినహాయిస్తే, అవి గనుల తవ్వ కాలు, రియల్ ఎస్టేట్, హైవేలు, సఫారీ లాంటి ప్రాజెక్టులకు ఆల వాలం అవుతాయి. (అయితే, సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పును పునఃపరిశీలిస్తోంది.)చెప్పేదొకటి... చేసేదొకటి!వన్య ప్రాణులను సంరక్షిస్తామని సఫారీ ప్రాజెక్టు చెబుతోంది. కానీ, పెళుసుగా ఉన్న ప్రాంతంలో రోడ్లు, లాడ్జీలు, పార్కింగ్ లాట్లు, ఇతర ఎన్క్లోజర్లు నిర్మించడం ద్వారా చేసే పనులు సంరక్షణ కిందకు రావు. అడవులకు కంచె నిర్మిస్తారు. ప్రజలను వాటిని దాటి వెళ్ళ నివ్వరు. ఉన్నత వర్గాల సరదాలకు అనుగుణంగా ప్రకృతిని తాము ఎంచుకున్న పద్ధతిలో నిర్వహిస్తారు. గురుగ్రామ్, నుహ్లలోని స్థానిక ప్రజానీకం పశుగ్రాసం, కట్టెలు, నీరు, రుతువులను బట్టి లభించే ఉపాధి మార్గాలకు ఆరా వళులపైనే ఆధారపడుతోంది. ఇది ఉన్నవి లాగేసుకోవడం ద్వారా వేరే వారికి పోగేసిపెట్టడమే! దాన్ని ‘ఎకో–టూరిజం’గా రీప్యాకేజీ చేయడమే. మధ్యభారతంలోని విస్తారమైన అడవుల్లో ఛత్తీస్గఢ్లోని హసదేవ అరండ్ ఒకటి. టేకు చెట్లకు, ఇనుమద్ది, సాళువ, గుగ్గిలం చెట్లుగా పిలిచే రకం చెట్లకు ఇది ప్రసిద్ధి. ఇంధన భద్రత పేరుతో బొగ్గుకు ఈ ప్రాంతాన్ని త్యాగం చేశారు. అధికారుల ప్రోద్బలంతో మైనింగ్ బ్లాకులు తెరిచారు. ఆరావళికి ఎకో–టూరిజం మాదిరిగానే హసదేవకు బొగ్గు ఎసరు పెట్టింది. రెండు ఉదంతాల్లో పేర్లు మారినా వాటిల్లే హాని ఒక్కటే!కాగితాలపై పచ్చదనం... ఆచరణలో అరాచకం అస్సాంలోని దేహింగ్ పటకాయీని ‘అమెజాన్ ఆఫ్ ది ఈస్ట్’గా అభివర్ణిస్తారు. జీవ వైవిధ్యానికి పేరెన్నికగన్న ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాల అన్వేషణకు, బొగ్గు గనుల తవ్వకానికి అనుమ తించారు. రెగ్యులేటరీ మినహాయింపులనిచ్చారు. అనుమతులకు ముందే పనులు చకచకా సాగిపోయాయి. మొదట తవ్వి తీయడం, తరువాతే పరిశీలనలు. టెక్నోక్రాటిక్ పరిభాషతో ఆ ప్రాజెక్టులను సమర్థిస్తున్నారు. ప్రభావం మదింపు, నిపుణుల కమిటీలు, నష్టాన్ని తగ్గించే ప్రణాళికలు అంటారు. కానీ, ఈ మంత్రాంగాలు సంరక్షణ చర్యలగా కన్నా, ముందే నిర్ణయించిన ఫలితాలను చట్టబద్ధం చేసే సాధనాలుగానే ఎక్కువ ఉపయోగపడతాయి. జాతీయ భద్రత, వ్యూహాత్మక మౌలిక వసతుల పేరుతో గ్రేట్ నికోబార్లో మెగా ట్రాన్స్–షిప్మెంట్ పోర్టును, విమానాశ్రయాన్ని, టౌన్ షిప్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్షారణ్యాలకు, కోరల్ ఎకోసిస్టవ్ులకు, స్థానిక శోంపెన్ జనజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. ఇక్కడ గ్రీన్ ఎన్క్లోజర్ భౌగోళిక రాజ కీయాల ముసుగు వేసుకుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవా వరణం సలాం చేయవలసిందే. ఈ ఉదంతాలన్నింటిలోనూ చట్టం లోపించలేదు. దాన్ని జాగ్రత్తగా వాడుకున్నారు. ఆరావళి, హసదేవ, ఇతర దుర్బల మండ లాలను కాపాడేందుకు సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అడపాదడపా జోక్యం చేసుకుంటూనే ఉన్నాయి. 1900 నాటి పంజాబ్ భూసంరక్షణ చట్టం వంటివి భూ వినియోగ మార్పుపై కొన్ని పరిమితులను విధించగలిగాయి. అయినా, కమిటీలు, పునర్ వర్గీకరణలు, నీరుగార్చిన మదింపులు, ఇప్పుడు ఏకంగా మారిన నిర్వచనాలను కవచాలుగా ధరించి మెగా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.దేవాశీస్ చక్రవర్తివ్యాసకర్త అంతర్జాతీయ మీడియా స్కాలర్,సామాజిక శాస్త్రవేత్త (‘యూరేసియా రివ్యూ’ సౌజన్యంతో) -
కేసుల మాఫీపై నయా రోల్మోడల్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో అక్రమ ట్రెండ్కు తెరతీశారు. తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునే విషయంలో ఇతర అవినీతి నేతలందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన స్కామ్లపై పెట్టిన కేసులను తానే ఎత్తేసుకుంటున్నారు మరి! రాష్ట్ర నేర విచారణ సంస్థ సీఐడీ అన్ని కోణాల్లో విచారించిన తరువాత పెట్టిన కేసులివి. ప్రభుత్వ ఉన్నతాధికారుల మేరకు నమోదైనవి. చంద్రబాబు వీటిల్లో కొన్నింటిపై ముందస్తు బెయిల్ సంపాదించుకుంటే ఒక కేసులో మాత్రం జైలుకెళ్లారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిందే తడవు చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ నెట్, మద్యం స్కామ్ కేసులను ఎత్తేయించుకున్నారు. తాజాగా స్కిల్ స్కామ్ కేసునూ లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన పథకంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్నది ఈ స్కిల్స్కామ్. అంతర్జాతీయ సంస్థ సీమెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం అంటే రూ.300 కోట్లు పెడితే.. సీమెన్స్ రూ.3000 కోట్లు పెడుతుందని ఊరించారు. పైగా సీమెన్స్ కంపెనీ పైసా చెల్లించకుండానే ప్రభుత్వం రూ.330 కోట్లు కట్టేసింది. పుణేలోని జీఎస్టీ అధికారులు ఈ తేడాను గుర్తించారు. సీమెన్స్ అసలు, జీఎస్టీ రెండూ కట్టలేదని సమాచారమిచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో అసలు విషయం బట్టబయలైంది. అసలు సీమెన్స్ కంపెనీ ఈ ఒప్పందంలో భాగమే కాదన్న బోగస్ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లావాదేవీలతో తమకు సంబంధం లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. సీమెన్స్ మాజీ అధికారి ఒకరు మొత్తం కథ నడిపినట్లు విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా ఇందులో చిక్కుకుందా? లేక కుట్రపూరితంగానే జరిగిందా అన్న అంశం పరిశీలనకు వచ్చింది. ఆ సందర్భంలోనే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా రూ.330 కోట్లు డిజిటెక్ అనే కంపెనీకి విడుదల చేసిందని వెల్లడైంది. సీఎం కోరినట్లుగా నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు ఫైళ్లలోనే రాశారు. కేబినెట్తో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం దుర్వినియోగమైందని సీఐడీ గుర్తించింది. ఈ స్కామ్లో భాగస్వాములన్న అభియోగంపై అధికారులు కొందరిని అరెస్టు చేసింది. సీఎం హోదాలో చంద్రబాబు పాత్ర సాంతం నిర్ధారణ అయ్యాక ఆయనను కూడా అరెస్టు చేసింది. దీంతో రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కేసులో పలు షెల్ కంపెనీలకు ఈ స్కామ్ డబ్బు వెళ్లిందని, అక్కడి నుంచి సుమారు రూ.70 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి చేరాయని సీఐడీ అధికారులు కనిపెట్టారు. సీఐడీ ఇంత పక్కాగా దర్యాప్తు చేసినా టీడీపీ, జనసేనలు ఇదో అక్రమ కేసు అనే ప్రచారం చేశాయి. ఎల్లో మీడియా కూడా చంద్రబాబును అరెస్టు చేస్తారా? అంటూ చిందులు తొక్కింది. చివరికి న్యాయమూర్తిపై కూడా అభ్యంతకరమైన కథనాలు ప్రచురించింది. చివరకు చంద్రబాబు కేసుతో నిమిత్తం లేకుండా..ఆనారోగ్య కారణాలు చూపి హైకోర్టులో బెయిల్ పొందాల్సి వచ్చింది. హైకోర్టు కూడా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేయడం.. విడుదలైన మరుక్షణమే చంద్రబాబు వాటిని బేఖాతరు చేయడం జరిగిపోయాయి. అది వేరే సంగతి.ఈ నేపథ్యంలో 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత తన కేసులను ఎలా తొలగించుకునే బాధ్యతను ఒక లీగల్ ప్రముఖుడికి అప్పగించారని గతంలో వార్తలు వచ్చాయి. అంతకంటే ముందు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో ఈ స్కామ్లపై విచారణ జరిపిన అధికారులపై, వైసీపీ నేతలపై రకరకాల కేసులు సృష్టించారు. పలువురిని అరెస్టు చేసి, ప్రజల దృష్టి మళ్లించారు. ఇంకో వైపు తన కేసుల మాఫీకి చర్యలు తీసుకున్నారు. అంతేకానీ... తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి సిద్దపడలేదు. వెనుకటి రోజుల్లో తాను టెక్నికల్గా, లీగల్గా దొరకనని సభలలో అంటుండే వారు. కాని గత ప్రభుత్వం సాక్ష్యాలతో సహా కేసులు పెట్టడంతో వాటి నుంచి బయట పడడానికి చంద్రబాబు కోర్టు విచారణ బదులు కొత్తమార్గం కనిపెట్టారు. మద్యం, ఫైబర్నెట్ స్కామ్లలో తనపై ఫిర్యాదు చేసిన అధికారులను భయపెట్టి ఉపసంహరణ పిటిషన్లు వేయించారు. ఇది బెయిల్ కండిషన్లు ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. స్కిల్ స్కామ్లో ‘మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్స్’ అని ఇంకో వ్యూహం ప్రయోగించారు. అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి ఒక నోటీసు పంపి, ఈ కేసు ఉపసంహరణలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ చేయాలని కోరారట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టైమ్లో ఎవరు అభ్యంతరం చెబుతారు? నిజానికి అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి స్కామ్పై ఫిర్యాదు చేశారట. కాని ఆయన అభిప్రాయం తీసుకోవడం లేదట. ఇలా అధికారంలో ఉన్నవారు తమపై వచ్చిన అవినీతి కేసులను తొలగించుకునే రీతిని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా అన్నది చర్చనీయాంశం. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం కింది కోర్టులు ఇలాంటి వాటిపై నిర్ణయాలు చేయరాదు. హైకోర్టులో జరగాలి. చిత్రమేమిటంటే ఇంతవరకు చంద్రబాబుకు చెందిన రెండు కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఆదేశాల సర్టిఫైడ్ కాపీలు న్యాయ స్థానం కూడా ఇవ్వడం లేదట. ఎందుకు కోర్టు ఇలా గోప్యత పాటిస్తుంది అనేదానిపై సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటికే స్కిల్ కేసును ఈడీ అధికారులు విచారించారు. కాని కేంద్రంలో, రాష్ట్రంలో మారిన రాజకీయాలు, రెండు చోట్ల కూటమి ప్రభుత్వాలే ఉన్న రీత్యా వారికి వ్యతిరేకంగా కేసును ముందుకు సాగనివ్వదని భావిస్తున్నారు. ఈడీతో నిమిత్తం లేకుండా సీఐడీ ఈ కేసును ఎలా నీరుకార్చుతుందన్న ప్రశ్న వస్తుంది. సీఐడీ అప్పట్లో ఎలా కేసు పెట్టి అరెస్టు చేసింది? ఇప్పుడు అదే సీఐడీలో అధికారులు మారిపోతే కేసే ఉండకుండా పోతుందా? చట్టప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా అన్న చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసులన్నీ మళ్లీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా? అనే మీమాంస కూడా ఉంది. దీనికి న్యాయ నిపుణులు అవుననే చెబుతున్నారు. ఇలా అధికారంలో ఉన్న వారు కేసు తీసివేసుకునే పద్ధతి ఉంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నేత అయినా అధికారం సాధించుకుంటే అన్నీ మాఫ్ అవుతాయన్న భావన కలగదా?. గతంలో బీహారు ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను గడ్డి స్కామ్లో సీబీఐ అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఆయన పదవికి రాజీనామా చేయగా, సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. కేసు విచారణ తర్వాత ఆయనకు శిక్ష పడింది. అలాగే హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్ చౌతాల కూడా టీచర్ల నియామక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షకు గురై జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మరికొందరు నేతలు కూడా విచారణను ఎదుర్కున్నారు. వారికి కూడా ఇలాంటి కేసు ఉపసంహరణ మార్గాలకు సంబందించిన ఐడియాలు వచ్చి ఉంటే జైలుకు వెళ్లవలసిన అవసరం ఉండేది కాదేమో!. బహుశా ఇలాంటి వాటినన్నటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు లీగల్ టీమ్ వ్యూహాత్మకంగా అసలు కేసులు విచారణకే రాకుండా చేయడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చని భావించినట్లు ఉంది. అందుకు తగ్గట్లు ఆయా కేసులలో గతంలో ఫిర్యాదు చేసిన అధికారులతోనే కేసును విరమింప చేయిస్తున్నారు. లేదంటే ఇలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కొత్త వ్యూహం అమలు చేయాలని అనుకుని ఉండవచ్చు. ఇప్పటికే రెండు కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు స్కిల్ స్కామ్ కు కూడా అదే ప్లాన్ చేసినట్లు అనుకోవాలి. ఏది ఏమైనా చంద్రబాబు టీమ్ వేసిన ఈ ప్లాన్ దేశంలోని ఇతర నేతలకు ఒక మార్గం చూపినట్లవుతుందా, న్యాయ వ్యవస్థ ఇలాంటి పెడపోకడలకు చెక్ పెడుతుందా? పెట్టదా?అనేవి ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఈ యేటి మేటి మాట... ట్రంపిజం
ఈ ఏడాది ఎక్కువసార్లు పతాక శీర్షికలకు ఎక్కిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేననడంలో సందేహం లేదు. ఐదు భిన్నమైన కారణాల రీత్యా ఆయన వార్తల్లో అగ్రభాగాన నిలిచారు. ఒకటి– అమెరికా ఫస్ట్ విధానం. రెండు– ఆయన సుంకాల యుద్ధం. మూడు– దక్షిణం, పశ్చిమం, ఆగ్నేయాసియా నుంచి యూరప్ వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ద్వైపాక్షిక ఘర్షణల్లో తల దూర్చా లని కోరుకోవడం. నాలుగు– అమెరికా, చైనా, రష్యాల మధ్య సమీక రణలను మార్చడం. చివరగా, వ్యక్తిగత లైంగిక జీవితానికి సంబంధించి వార్తల కెక్కడమే కాకుండా, దర్యాప్తునకు లోనవడం!భద్రతా వ్యూహంతో మరోసారి...తాజాగా ట్రంప్ పాలనా యంత్రాంగం రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది అమెరికా భద్రతా వ్యూహంలో పశ్చిమ అర్ధ గోళానికున్న ప్రాధాన్యాన్ని చాటడమే కాకుండా, ఆ ప్రయోజనాలను కాపాడు కునేందుకు సైనిక చర్యను ప్రతిపాదించింది. దౌత్య, సైనికపరంగా అమెరికా వాస్తవిక ప్రవర్తనను ప్రభా వితం చేయడంలో ఈ వ్యూహం ఎంత ముఖ్యమైనదిగా పరిణ మిస్తుందనేది వేచి చూడవలసి ఉంది. మన దేశంలో చాలావరకు, మనతో సంబంధాలు నెరపడంలో వ్యూహ పత్రం దృక్కోణం ఏమిటి? ట్రంప్ ప్రపంచ వీక్షణం, ‘పెద్ద వ్యూహం’లో భారత్ స్థానం ఎక్కడ? అమెరికా–భారత్ సంబంధాలు మున్నెన్నడూ ఎరుగనంతగా క్షీణించిపోయాయనే అందరూ అంటున్నమాట. ముఖ్యంగా, నాయకత్వ స్థాయి సాంగత్య స్వరూప స్వభావాలలో, ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి అపనమ్మకం తిరిగి చోటు చేసుకుంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆమె గురించి నీచంగా మాట్లా డారు. భారత్ కూడా దానికి తగ్గట్లుగానే తలుపులు బిడాయించుకుని కూర్చుంది. భారత్, దాని నాయకత్వం గురించి వాషింగ్టన్ చర్చలలో ఎంత హీనంగా ప్రస్తావనకు వచ్చిందీ, ఆ తర్వాత బహిరంగపరచిన రహస్య పత్రాలు, కొందరు రాసుకున్న జ్ఞాపకాల పుస్తకాల ద్వారా వెల్లడైంది. ఇపుడు టెలివిజన్, సోషల్ మీడియాలో క్షణాల్లో అవి వెలికి వస్తున్నాయి. కనుక, ఇది స్నేహ సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపి తీరుతుంది. మూడు ముఖ్య సంగతులువ్యూహ పత్రం విషయానికొస్తే, ఇంతవరకు మూడు సంగతులు స్పష్టమయ్యాయి. ఒకటి–దాడులు, ప్రమాదాల నుంచి సామూహిక స్వీయ రక్షణకు ‘ఒక గ్రూపు’గా ఏర్పడే ధోరణిని కొనసాగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికాలను ‘బయటి’ శక్తులకు ‘అందని దుర్గాలు’గా ప్రకటించి, పశ్చిమ అర్ధ గోళంపై పట్టు సంపాదించాలనుకుంటున్నారు. కొన్ని విధాలుగా ఇది ఆసియాలోని అభిప్రాయాలనే ప్రతిబింబిస్తోంది. ప్రపంచంలోని ఈ భాగంవారు కూడా అమెరికాను ‘బయటి’ శక్తిగానే భావిస్తారు. అయితే, ఆసియా నుంచి అమెరికా సేనలను ట్రంప్ ఉపసంహరించుకుంటారనీ, ఈ ప్రాంత భద్రతను ప్రాంతీయ శక్తుల చేతులకే విడిచిపెడతారనీ అనడానికి ఆధారాలు కనిపించడం లేదు. రెండు– మిగిలిన వాటన్నింటి కన్నా చైనాతో సంబంధాలకు ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా అటు సవాల్గానూ, ఇటు సమ వుజ్జీగా పరిగణించి వ్యవహరించవలసిన శక్తిగానూ కూడా ఉంది. ‘జి–2’ ఆలోచనతో ఆయన చేసిన ట్వీట్ ఆసియాలో కలకలం సృష్టించింది. ఇంచుమించు రష్యా కోరుకుంటున్న విధంగానే, యూరప్లో యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రపంచంలోని మూడు పెద్ద (అమెరికా, రష్యా, చైనా) శక్తులు తమ భద్రత, పరపతి ఉన్న ప్రాంతాలకు పరిమితమయ్యే హక్కు ఉందనే లోపాయకారీ అవగాహనను బలపరుస్తున్నారు. కానీ, భారత్పై దీని పర్యవసానాలుంటాయి. చివరగా, వ్యూహ పత్రాన్ని అమెరికా విరమణ ప్రకటనగా, దేశ, విదేశాలలో ముఖ్యంగా యూరప్లో చాలా మంది భాష్యం చెబుతున్నారు. కానీ, ఆ రకమైన నిర్ధారణకు రావడం ట్రంప్ ప్రపంచ వీక్షణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి దాని వ్యూహ పత్రంలో ఎక్కడా ఒక్క మాట లేదు. అమెరికా శైలి మాఫియాప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 750 సైనిక స్థావరాలలో 1,60,000కు పైగా అమెరికా సైనిక దళాలు న్నాయి. అమెరికా సాయుధ దళాలున్న అత్యంత ముఖ్యమైన కేంద్రాలు జర్మనీ, జపాన్, ఇటలీ, కొరియాలలో ఉన్నాయి. అవి రెండవ ప్రపంచ యుద్ధకాలం నుంచి అమెరికా ‘అధీనం’లో ఉన్నాయి. ‘నాటో’ కూటమి దేశాల్లోనూ, పశ్చిమాసియా ‘క్లయింట్’ దేశాల్లో ముఖ్యంగా బహరైన్, కువైట్లలోనూ అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఈ స్థావరాల నిర్వహణకు ఏటా 5,000 నుంచి 6,000 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనాలున్నాయి. సేనలు లేదా స్థావరాల సంఖ్యను తగ్గించుకోవడం గురించి వ్యూహ పత్రం ఎక్కడా మాట్లాడలేదు. మరింతగా ‘భారాన్ని పంచుకోవలసిన’ అవసరం గురించి మాత్రం అది ప్రస్తావించింది. ‘నాటో’ కూటమి దేశాలు, జపాన్, కొరియా, గల్ఫ్ దేశాలు వాటి రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని అమెరికా కోరుతోంది. ఇతర దేశాల్లో అమెరికా సేనల ఉనికి అవసరం ఏమిటో, అది ఎంతకాలమో, ట్రంప్ గానీ, రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికా అధ్యక్షులైన ఇత రులు గానీ వివరించిన పాపాన పోలేదు. భారతదేశంతో సహా ఇంకా అనేక దేశాల్లోనూ ద్వైపాక్షిక ఒప్పందాల రీత్యా మాత్రమే అమెరికా సేనలు పరిమిత సంఖ్యలో కనిపి స్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితంగానే, కొన్ని దేశాల్లో అవి పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నది వాస్తవం. ఆ యుద్ధం ముగిసేనాటికి అమెరికా ‘విముక్తి’ కల్పించిన ‘ఆక్రమించిన’ దేశాల్లో అమెరికా సేనలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వ్యూహ పత్రం, ఆ యా భూభాగాల నుంచి సేనల ఉపసంహరణ లేదా తగ్గింపునకు పిలుపు ఇవ్వలేదు. అవి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా సేనల నిర్వహణకు ఆయా దేశాలు కొంత పైకాన్ని చెల్లించాలని మాత్రమే అది అడుగుతోంది. ఇది కళాత్మక మాఫియా శైలి అవుతుంది. ఇతర పెద్ద శక్తుల నుంచి ఎదురు కాగల బెడద నుంచి ‘రక్షణ’ కల్పిస్తున్నందుకు ‘మామూలు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నమాట!ఇది చూడండి: యూరప్, ఆసియాలలో శక్తిమంతమైన సైనిక యంత్రాలుగా చైనా, రష్యా నడుచుకునేందుకు అమెరికా అనుమతి స్తుంది. చైనా, రష్యా పొరుగునున్న దేశాలు ప్రపంచ శక్తి అయిన అమెరికా పెత్తనం నుంచి తమను కాపాడుకునేందుకు ఈ ప్రాంతీయ శక్తుల పంచన చేరవచ్చు. ఇక సేనల తగ్గింపు ప్రసక్తి ఎక్కడ? ట్రంపి జంగా అభివర్ణించదగిన ఈ విధానంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉండబోతోందన్నది 2020లలో కాలగతిని నిర్వచించనుంది.సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పరిహారం ‘అణు’వంతేనా?
భారత రూపాంతరీకరణకు ఉద్దేశించిన ‘అణు శక్తి స్థిర వినియోగ–పురోగతి బిల్లు (శాంతి) 2025’కు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది అణు శక్తికి సంబంధించి మూడు కీలక అంశాలపై చిరకాలంగా ఉన్న చర్చను మళ్ళీ రేకెత్తించింది. అవి: అణుశక్తి అభివృద్ధి–నియంత్రణ; ప్రమాదాలు సంభవించినపుడు సివిల్ లయబిలిటీ; అణు శక్తి ఉత్పాదనలో ప్రైవేటు భాగస్వామ్యం. అటామిక్ ఎనర్జీ చట్టం (1962), సివిల్ లయబిలిటీ–న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం (2010) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తెచ్చారు. అణుశక్తి అభివృద్ధి –వినియోగానికి 1962 నాటి చట్టం వీలు కల్పిస్తే, అణు ప్రమాదాలు సంభవించిన పక్షంలో బాధ్యత వహించడం, పరిహారం చెల్లించడా నికి సంబంధించి ఒక చట్రాన్ని 2010 నాటి చట్టం అందించింది. స్వతంత్ర నియంత్రణకు సుముఖం కాదా?విద్యుదుత్పాదనకు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్) అందుబాటులోకి రావడం, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యు దుత్పాదన గడించాలనే ఆశావహ లక్ష్యసాధనకు ప్రైవేటు రంగ భాగస్వామ్యం అవసరమవడం అనే రెండు కారణాల రీత్యా కొత్త చట్టం అవసరమైందని ప్రభుత్వం వివరించింది. అణు విద్యుదుత్పాదనలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెర వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... నియంత్రణ, లయబిలిటీ చట్రాలు రెండూ అత్యంత ముఖ్యమైనవిగా పరిణమించాయి. అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. నియంత్రణకు సంబంధించి కొత్త చట్టం యథాతథ స్థితినే కొనసాగించింది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) గతంలో మాదిరిగానే పని చేస్తుంది. అణుశక్తి అభివృద్ధి మొగ్గ తొడుగుతున్న 1960లలో, రేడియేషన్ సదుపాయాలలో రేడియేషన్ సురక్షణను అమలుపరచేందుకు, అటా మిక్ ఎనర్జీ శాఖ (డీఏఈ)కు వెలుపల డైరెక్టరేట్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (డీఆర్పీ) ఏర్పాటు చేశారు. హోమీ భాభా తర్వాత అణుశక్తి శాఖ బాధ్యతలు చేపట్టిన విక్రమ్ సారాభాయ్, స్వతంత్ర అణుశక్తి నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారుగానీ, ఆ భావన అమలుకు నోచుకోక ముందే, ఆయన కన్నుమూశారు. ఆయన వారసుడు హోమి ఎన్.సేత్నా ఏఈఆర్ఏ ఆలోచనను పక్కనపెట్టి, డీఆర్పీని కొనసాగించాలని నిర్ణయించారు. రాజా రామన్న 1983లో నియంత్రణ సంస్థ (ఏఈఆర్బీ)కు పచ్చ జెండా ఊపారు. కానీ, అది ఇతర రంగాలలోని అదే రకమైన సంస్థలలాగా పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినది కాదు. ఈ 2025 చట్టం కూడా ప్రస్తుత ఏఈఆర్బీ చట్రాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచనకు అణుశక్తి వ్యవస్థ సానుకూలంగా లేదని స్పష్టమవుతోంది. అణుశక్తి శాఖ పరిధిలోనే ఏఈఆర్బీ పనిచేస్తున్నప్పటికీ, గతంలో అది నీళ్ళు నమలకుండా పనిచేసిన దాఖలాలు లేకపోలేదు. వివిధ సందర్భాలలో నియమాల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించినపుడు ఏఈఆర్బీ–ముఖ్యంగా ఎ. గోపాలకృష్ణన్ అధ్యక్షుడిగా ఉన్నపుడు– విద్యుదుత్పాదన కేంద్రాలు, ఇతర సంస్థలపై ఆంక్షల రూపంలో కొరడా ఝళిపించింది. పరిహారానికి పరిమితులా?ఇపుడు ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తున్నారు కనుక, నిజాయతీగా పనిచేసే, సాంకేతికంగా బలోపేతమైన స్వతంత్ర వ్యవస్థ అవసరం ఉంది. దేశ పురోగతి ముసుగులోనే అయినప్పటికీ, ఏఈఆర్బీ యథాతథ స్థితిని కొనసాగించడం శుభ సూచకం కాదు. ప్రైవేటు రంగాన్ని అనుమతించిన అంతరిక్ష రంగంలో కూడా ప్రభుత్వం స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడానికి బదులుగా ఇన్–స్పేస్ పేరుతో, ఏ ఎండకా గొడుగు పట్టే సంస్థనే సృష్టించింది. ఒక విధానాన్ని ప్రోత్సహించే, నియంత్రించే రెండూ ఒకే చూరు కింద ఉండకూడదన్నది మూలసూత్రం కావాలి. అణు దుర్ఘటనలు సంభవిస్తే కలిగే నష్టానికి లయబిలిటీ విషయంలో నియంత్రణ సంస్థ ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రశ్న. నియంత్రణ కఠినంగా లేకపోతే, ప్రమాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుంది. లయబిలిటీకి సంబంధించి అంతర్జాతీయంగా పాటించే నియమాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. జాతీయ చట్టాలు కూడా వాటికి అనుగుణంగా రూపొందాలి. అణు ప్రమాదం సంభవించిన చోట మూడవ పక్షానికి పరిహారం చెల్లించే బాధ్యత న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఆపరేటర్ పైనే ఉంటుందని అంతర్జాతీయ కట్టుబాట్లు చాలా వరకు నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ కిందనే లెక్క. కానీ, ఇతర సదుపాయాలున్న న్యూక్లియర్ సైట్ వద్ద కూడా దుర్ఘటన సంభవించవచ్చు. లయబిలిటీని అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ప్రస్తుత చట్టంలో పరిహారంపై రూ. 3,000 కోట్ల పరిమితి విధించడం, దాన్ని న్యూక్లియర్ ప్లాంట్ ప్రదేశంతో ముడిపెట్టడం అసంబద్ధం. చిన్న రియాక్టర్లకు (150 మెగావాట్ల నుంచి 750 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం ఉన్నవి) లయబిలిటీని మరీ తక్కువగా రూ. 300 కోట్లుగా నిర్ణయించారు. ఇక 150 మెగావాట్ల కన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవాటికి కేవలం రూ. 100 కోట్లనే నిర్ణయించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ప్రోత్సహిస్తున్న సంస్థలను మచ్చిక చేసుకునేందుకే అలా నిర్ణయించారని తేటతెల్లమవుతోంది. హెచ్చు సామర్థ్యమున్న భారీ అణు విద్యుదుత్పాదన కేంద్రాలను నెలకొల్పేందుకు పెద్ద మొత్తాలలో పెట్టుబడులు అవసరమవుతాయి. అవి నిర్మాణం పూర్తి చేసుకుని, ఉత్పాదన ప్రారంభించేందుకు సమయం కూడా ఎక్కువ పడుతుంది. అణు విపత్తులలో లయబిలిటీ చట్రాన్ని సడలించడం ద్వారా, మాడ్యులర్ రియాక్టర్ల వల్ల పెద్ద నష్టం ఉండ బోదని ఆ పరిశ్రమ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. లయబిలిటీలను వర్గీకరించడం ద్వారా కొత్త చట్టం ఆ పరిశ్రమను సంతృప్తి పరచింది. భోపాల్ దుర్ఘటన పాఠాలు నేర్చుకున్నామా?అణు రియాక్టర్ల వద్ద (అణు ఇంధన వలయ సదుపాయాలతో కూడుకుని) తలెత్తే ప్రమాదాలను కొత్త చట్టం నిర్వచించి, లయబిలి టీలను కూడా నిర్ణయించింది. కానీ, ‘అణు సదుపాయాలు’గా నిర్వ చించిన చోట్ల ప్రమాదాలు సంభవిస్తే, లేదా అణు ధార్మికత వెలు వడితే ఏమిటన్న దానిపై మౌనం వహించింది. అలాంటి పరిస రాలలో ఏదైనా సంభవిస్తే ఆ నష్టాలకు పరిహారం చెల్లించే బాధ్యత ఎవరిది? ‘న్యూక్లియర్ డ్యామేజీ’ అనే దానికి మాత్రం చట్టంలో విçస్తృతార్థం ఇచ్చారు. ప్రాణ నష్టం, గాయపడటం, ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం, అణు ప్రమాదం వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు అయ్యే వ్యయం అంటూ దానిలో చాలా వాటిని చేర్చారు. కానీ, లయబిలిటీ పరిమితిని మాత్రం రూ. 100 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లుగా పేర్కొన్నారు. 2010లో సంభవించిన సముద్ర ప్రమాదానికి గానూ బ్రిటిష్ పెట్రోలియం సంస్థ 65 బిలియన్ డాలర్లు చెల్లించింది. అదే భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకవడాన్ని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ఉపద్రవంగా చెబుతారు. కానీ దాని బాధితుల్లో పరిహారం కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకా ఉన్నారు. పర్యావరణ నష్టానికి ఎవరూ చెల్లించింది ఏమీ లేదు. మళ్లీ మధ్యవర్తిత్వం నెరపే ప్రయత్నమూ లేదు. అణుశక్తి విషయంలో అడుగు ముందుకేసే ముందు గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పెంపొందించే పని, నియంత్రణ ఒకే చూరు కింద సంసారం చేయకూడదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ కామెంటేటర్ -
ఉపాధి పెంపునకు అవకాశాలెన్ని?
ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి భారత్లో అభివృద్ధికి నూతన మార్గాలుగా రూపొందినప్పటికీ ఉపాధి సృష్టి, సమానత్వ సాధనలో వ్యత్యాసాలు పెరగడానికీ కారణమయ్యాయి. ఆధునిక ఆర్థిక వృద్ధి లక్ష్యసాధనలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల మధ్య వనరుల పునఃపంపిణీ ప్రక్రియను నిర్మాణాత్మక మార్పుగా భావిస్తాం. చారిత్రకంగా, వివిధ దేశాలు ఈ నిర్మాణాత్మక మార్పులో భాగంగా రెండు దశలను చవి చూశాయి. వ్యవసాయ రంగం నుండి తయారీ; తయారీ రంగం నుండి సేవా రంగానికి శ్రామికుల బదిలీ. తక్కువ ఉత్పాదకతతో కూడిన ప్రాథమిక కార్యకలాపాల నుండి ఆధునిక, అధిక ఉత్పాదకతతో కూడిన రంగాల వైపు శ్రామిక, మూలధన, సాంకేతికత లాంటి వనరుల బదిలీ; ఉపాధి పంపిణీ, విలువ జోడించిన పంపిణీ, అంతిమ వినియోగ పంపిణీలో తయారీ, సేవా రంగాల వాటా అధికంగా ఉండటం; భౌతిక, మూల ధన కల్పన; గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వల సలు; జనన, మరణ రేట్లలో తగ్గుదల లాంటి అంశాలను ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పునకు సూచికలుగా భావిస్తాం. భారత ఆర్థిక వ్యవస్థలో 2011–12 తదుపరి కాలంలో ఈ నిర్మాణాత్మక మార్పులలో తగ్గుదలను గమనించవచ్చు.ఎందుకీ మందగమనం?గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తి ఏడు రెట్లు పెరిగినప్పటికీ, ఉపాధిలో పెరుగుదల కనీసం రెట్టింపు కాలేదు. శ్రామిక మార్కెట్లో దృఢత్వం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, సమగ్ర ఆర్థిక విధానాలు అమలు చేయక పోవడం, ఆహారానికి సంబంధించి సాపేక్ష ధరలలో పెరుగుదల, పరపతి వృద్ధి తక్కువగా ఉండటం, తూర్పు ఆసియాలో మాదిరి వ్యవసాయ రంగం నుండి ఇతర రంగాల వైపు శ్రామికుల బదిలీలు తక్కువగా ఉండటం, తక్కువ వేతనంతో కూడిన నిర్మాణ రంగం, అసంఘటిత రంగంలో ఉపాధిలో తక్కువ నైపుణ్యత కల్గిన అధిక శ్రామిక శక్తి కేంద్రీకృతం కావడం లాంటి అంశాలు భారత్లో నిర్మాణాత్మక మార్పు ప్రక్రియ నెమ్మదించడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. సంస్కరణల అమలు కాలంలో నిర్మాణాత్మక మార్పు వేగంగా ఉండగలదని భావించినప్పటికీ సప్లయ్ వైపు వ్యవసాయ రంగాన్ని తయారీ రంగం అధిగమించినప్పటికీ, డిమాండ్ వైపు తయారీ రంగం వ్యవసాయ రంగాన్ని అధిగమించలేక పోయింది. తయారీ రంగ ఉత్పత్తి కార్యకలాపాలు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతున్నప్పటికీ గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ఉపాధి వృద్ధిలో ఆశించిన పెరుగుదల సంభవించలేదు.యువతలో ఉపాధిభారత్ మొత్తం జనాభాలో 15–29 వయో వర్గ జనాభా 27 శాతం కాగా, మొత్తం శ్రామిక శక్తిలో వీరి వాటా 26.9 శాతం. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, యువతలో నిరుద్యోగిత 2000 సంవత్సరంలో 5.7 శాతం నుండి 2023లో 10 శాతానికి పెరిగింది. పారిశ్రామిక, సేవా రంగాలతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడిన యువత తక్కువ. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2022లో యువతలో నిరుద్యోగిత భారత్లో 23.2 శాతం కాగా మొత్తం నిరుద్యోగం 7 శాతంగా అంచనా. అంత ర్జాతీయ శ్రామిక సంస్థ అంచనా ప్రకారం, 2023లో భారత్లోని మొత్తం గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 42.3 శాతం. నియంత్రణతో కూడిన శ్రామిక చట్టాల వల్ల సంఘటిత రంగంలో ఉపాధి తగ్గుదల, సేవారంగ ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం, ఆటోమేషన్ కారణంగా ఉపాధి క్షీణించటం; ఐటీ, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ లాంటి రంగాలలో అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్రీకృతం కావడం, వివిధ అంశాలలో లింగ సంబంధిత అసమానతలు, నాణ్యతతో కూడిన శిక్షణ కొరత, నూతన సాంకే తికతకు అనుగుణంగా తగిన నైపుణ్యత శ్రామికులలో లేకపోవడం వంటివి నిరుద్యోగం పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. వివిధ దేశాల అనుభవాలుమానవ మూల ధనం, సేవలు, నవకల్పనలపై అధిక పెట్టు బడుల ద్వారా సింగపూర్ శ్రమ సాంద్రత ఆర్థిక వ్యవస్థ నుండి నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ స్థితి అధిక వేతనాలు, ఉపాధి నాణ్యత పెరుగుదలకు దారి తీసింది. వృత్తి విద్య, శిక్షణకు జర్మనీ ప్రాధాన్యమిచ్చిన నేపథ్యంలో ఆధునిక తయారీ, అధిక నైపుణ్యత అవసరమైన సేవలలో ఉపాధి అవకాశాలు పెరి గాయి. చైనాలో నిర్మాణాత్మక మార్పులు కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి కావడానికీ, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాల పెరుగుదలకూ, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య లింకేజెస్ పెరగడానికీ దోహదపడ్డాయి. మలేషియాలో నిర్మాణాత్మక మార్పుల కారణంగా ప్రాథమిక వస్తువులపై ఆధారపడటం తగ్గి తయారీ, సేవలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో మలేషియా అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆదాయ స్థిరీకరణ సాధించింది. దక్షిణ కొరియా, తైవాన్ నిర్మాణాత్మక మార్పుల కారణంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల నుండి పారి శ్రామిక పవర్ హౌసెస్గా రూపాంతరం చెందాయి. తక్కువ ఉత్పా దకతతో కూడిన వ్యవసాయ రంగం నుండి అధిక ఉత్పాదకతతో కూడిన తయారీ రంగానికి శ్రామికుల బదిలీ ఆయా దేశాల ఆర్థిక సామర్థ్య పెరుగుదలకు దారి తీసింది.యువతలో ఉపాధి పెంపునకు చర్యలుభారత్లో ముఖ్య ఆర్థిక రంగాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం 2030 నాటికి యువతలో ఉపాధి వృద్ధి అధికంగా వ్యవ సాయం, దాని అనుబంధ రంగాలలో ఉంటుంది. ఈ రంగం నైపుణ్యత లేని, తక్కువ నైపుణ్యత కల్గిన శ్రామిక శక్తికి ఉపాధినందిస్తుంది. ప్రస్తుత ఉపాధి వృద్ధిని కొనసాగించడంతో పాటు, పెరుగు తున్న ఉపాధి డిమాండ్ను తీర్చాలంటే 2030 నాటికి ప్రతి సంవత్సరం 78.5 లక్షల మందికి వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పించాలి. యువతలో ఆర్థిక అవకాశాలు మెరుగుపర్చడానికి ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్, ఆంట్రప్రెన్యూర్షిప్పై ఆసక్తి కనబరచే విధంగా వారిని ప్రోత్సహించాలి. 2022–23లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 13.4 శాతంగా నమోదైంది. ఉపాధి సామర్థ్య రంగాలైన డిజిటల్ సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, ఈ–కామర్స్; చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలి. ఉన్నత విద్యలో పరిశ్రమల లింకేజ్ను పటిష్టపరచడం ద్వారా, ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా కరికులంలో మార్పులు చేయాలి. నియంత్రణల సడలింపు ద్వారా ప్రైవేటు రంగ అభివృద్ధికి తీసుకొనే చర్యలు యువతలో ఉపాధి అవకాశాలను విస్తృతపరచ గలవు. కృత్రిమ మేధ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి సాంకేతికమైన నవ కల్పనలు యువతలో ఉపాధి క్షీణతకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో బ్లూ కలర్ ఉపాధి సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. శ్రమ సాంద్రత పరిశ్రమలను ప్రోత్సహించే విధానాల ద్వారా తయారీ రంగాన్ని పటిష్ట పరచాలి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్చార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్.. జగన్ విజయానికి సూచిక
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని మేం సహించం... దీనివెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉన్నది. ఎంతో కష్టపడి మేం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం నడపలేక ప్రయివేటుకు ఇచ్చేస్తున్నది. దీన్ని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతును కూడా కూడగట్టాం. కోటికిపైగా సంతకాలు సేకరించాం.. .. మళ్ళీ చెబుతున్నాం.. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తె మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేం అధికారంలోకి వస్తే మళ్ళీ కాలేజీలు వెనక్కి తీసుకోవడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన ప్రకటన లాంటి హెచ్చరిక ప్రయివేటు మెడికల్ కాలేజీల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించింది. అందుకేనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు.. కార్పొరేట్ సంస్థలు ఏవీ పెద్దగా ఈ అంశంలో ముందుకు రాలేదు.వాస్తవానికి మార్కాపురం.. మదనపల్లి, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నది. అంటే మొత్తం నాలుగు కాలేజీలకు గాను ఒకటే దరఖాస్తు వచ్చింది. మిగతా మూడు కాలేజీలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.ఈ పరిణామం చూస్తుంటే వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం అయన చేసి తీరతారన్న నమ్మకం, మళ్ళీ అయన వస్తే కాలేజీలు వెనక్కి తీసుకుంటారన్న భయం కలగలిపి వారిని ఈ బిడ్డింగ్ నుంచి వెనకడుగు వేసేలా చేసిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు.. వివిధ వర్గాల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటున్న మెడికల్ వ్యాపారవేత్తలు ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ ఎప్పుడు ఏ పర్యటన చేపట్టినా వెల్లువెత్తుతున్న జనాభిమానం ఒకవైపు.. అటు రైతులు,, మహిళలు.. విద్యార్థులు.. యువత వంటి వర్గాల్లో జగన్ పట్ల పెరుగుతున్న సానుకూలత, అదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతలను క్రోడీకరించి మెడికల్ వ్యాపారులు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత వస్తే రానున్న మూడేళ్ళలో ఇది మరింత పెరగడం తధ్యమని, అది కూటమి ఓటమిని, వైఎస్ జగన్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని భావించిన బిడ్డర్లు ఇక ఈ అంశం జోలికి పోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ గెలుపు తథ్యం, అదే జరిగితే కోట్లు పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న ఈ కాలేజీలను ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటే భారీగా నష్టపోతామన్న భయంతోనే వారు వెనకడుగు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ వ్యాపారులు ముందు చూపుతో వేసిన వెనకడుగు.. వైఎస్ జగన్ విజయానికి సూచనే అని తేల్చేశారు.:::సిమ్మాదిరప్పన్న -
నేపాల్ దారి అగమ్యగోచరం
నేపాల్లో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ 1990లో ఏర్పడిన 35 సంవత్సరాల తర్వాత, రాచరిక వ్యవస్థ పూర్తిగా 2008లో రద్దయిన 17 సంవత్సరాలకు, ఆ దేశ భవిష్యత్తు ‘అగమ్యగోచరమేనా?’ అనే ప్రశ్న వేసుకోవలసి రావటం నిజంగానే విచిత్రమైన పరిస్థితి. గత సెప్టెంబర్ నాటి జెన్–జీ భూకంపం సృష్టించిన స్థితిగతులు, రేకెత్తించిన ప్రశ్నల కారణంగా దేశం ఈ దశలోకి ప్రవేశించింది.2008 వరకు ఒకవైపు రాచరికాన్ని, మరొకవైపు ప్రజాస్వామిక పార్టీల ద్వంద్వ పాలనను, 2008లో రాచరికం రద్దు తర్వాత నుంచి మధ్యేమార్గ పార్టీలు, సాధారణ కమ్యూనిస్టులు, మావోయిస్టుల పాలనను చూసిన యువతరం, దానికి మద్దతుగా నిలిచిన సమాజం కలిసి అగ్నిపర్వత విస్ఫోటనం వంటి తిరుగుబాటు చేశాయి. అనగా అది ప్రస్తుత తరపు తిరుగుబాటు. మరి ఈ తరం గడిచిపోయి మరొక 15–20 సంవత్సరాలకు కొత్త తరం ఉనికిలోకి వచ్చే సమ యానికి పరిస్థితి ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారణమైన పరి స్థితులు అప్పటికి మారుతాయా? మారగలవన్న హామీని ఇపుడున్న రాజకీయ పార్టీలు యువతరానికి, ప్రజలకు ఇవ్వగలవా?కనీసం ప్రశ్నించుకోని వైనంఈ ప్రశ్నలను ఇంతే సూటిగా అన్ని ప్రధాన పార్టీల నాయ కులను నేను అడిగాను. ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, ఏ ఒక్క పార్టీ కూడా సెప్టెంబర్ పరిణామాల అనంతర కాలంలో ఈ ప్రశ్నలను తనకు తాను వేసుకోలేదు. ప్రశ్నలు వేయగానే అందరిలో కన్పించిన మొదటి స్పందన నా వైపు శూన్యంగా చూడటం. కొద్దిసేపటికి తేరు కుని స్పష్టాస్పష్టంగా కొద్ది మాటలేవో చెప్పటం. ప్రస్తుతం మిత వాదులు, మధ్యేమార్గీయుల నుంచి మావోయిస్టుల వరకు అందరూ తమను తాము కూడదీసుకోవటం, పార్టీలలో తలెత్తిన అంతర్గత సంక్షోభాలను, చీలిక అవకాశాలను నియంత్రించటం, చీలినవారు ఇతరులతో కలిసి కొత్త పార్టీలు ఏర్పాటు చేయటం, మార్చి 5న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడటం వంటి పనులలో తలమునకలై ఉన్నారు.మరొకవైపు చూడగా, తిరిగి అధికారంలోకి రావాలనే కోరికలో నైతే ఎటువంటి మార్పు లేదు. తిరుగుబాటు తరాన్ని ఎట్లా చల్లబరచటం, వీలైనన్ని జెన్–జీ గ్రూపులను తమ వైపు ఏ విధంగా ఆకర్షించటం, ప్రజలలో తమ పార్టీలకు ఉండిన సంప్రదాయికమైన నెట్వర్క్ ఇటీవలి పరిణామాల వల్ల చెదిరి పోకుండా తిరిగి ఎట్లా కూడదీయటమన్నవి అందరి ప్రాధాన్యాలుగా మారాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా అందరి నోటినుంచి దాదాపు ప్రతిరోజూ కొన్ని మాటలు నిత్య పారాయణం వలె వినవస్తున్నాయి. అవి: జెన్–జీ ఆలోచనలూ, మావీ ఒకటే; వారి డిమాండ్లన్నీ సమంజసమైనవే; వారూ, మేమూ కలిసి పని చేయాలని భావిస్తున్నాము. అందరి మాటల సారాంశం స్థూలంగా ఇదే. ఇటువంటి మొక్కుబడి మాటలు బయటకు మాట్లాడటం తప్ప, తమవైపు నుంచి గతంలో జరిగిన తప్పులు, భవిష్యత్తులో జరగవలసిన మార్పుల గురించి అంతర్గతంగా ఏ పార్టీ కూడా ఒక పద్ధతిలో చర్చించలేదని ఆ యా పార్టీల సీనియర్ నాయకులే నాతో స్వయంగా చెప్పారు.రాజకీయ శూన్యంజెన్–జీ గ్రూపులు కొన్ని ఇటీవలి వారాలలో వేర్వేరు పార్టీలతో చేరినా, అసలు పార్టీ నాయకులు, వారి తీరు, ఒకవేళ గెలిచినట్లయితే పరిపాలన ఎంతవరకు మారవచ్చుననే ప్రశ్నపై ఆ యువకులలో పూర్తి ఆశాభావం కన్పించటం లేదు. ఏ పార్టీతో చేరని గ్రూపులే ఎక్కువ. వాటి గురించి చెప్పనక్కర లేదు. అవి తమ వాదనలు, ఒత్తిడులు యథావిధిగా కొనసాగిస్తున్నాయి. విషయం ఏమంటే, ఆ నాయకులు ఏమి చెప్తున్నా ఇప్పటికీ తిరిగి విశ్వాసం కలగటం లేదు. అందుకే ఇటీవలి ఒపీనియన్ పోల్లో ఏ నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. ఇందులోని విచారకర స్థితి ఏమంటే, స్వయంగా జెన్–జీ గ్రూపులు ఏకమై ఒక దేశవ్యాప్త పార్టీని ఏర్పాటు చేయటంగానీ, లేదా ఇపుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజల విశ్వాసాన్ని పొందగల ఒక కొత్త పార్టీగానీ ముందుకు రాకపోవటం వల్ల రాజకీయంగా అతి పెద్ద శూన్యం కనిపిస్తున్నది. మొదటినుంచి గల పార్టీలు విశ్వాసాన్ని కోల్పోయి, అటువంటి కొత్త ప్రత్యా మ్నాయాలూ ఏర్పడనపుడు, సమస్యలూ, అసంతృప్తులూ అదే విధంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, నేపాల్ దేశ భవిష్యత్తు ఏమిటి? ఆ స్థితి అగమ్యగోచరంగా తోస్తున్నదనటం అందు వల్లనే!పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానంగా కొద్దిమంది నాయకులు మాత్రం నాతో కొన్ని మాటలు అన్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి: అన్ని పార్టీల అగ్రనాయకత్వాలు కూడా జెన్–జీకి, ప్రజలకు మూర్తీభవించిన విలన్లుగా కనిపిస్తున్నందున అందరూ అధ్యక్ష పదవుల నుంచి వైదొలగి ఇతరులకు నాయకత్వం అప్పగించాలి. కొత్త కార్యవర్గాలలో యువకులకు భారీగా అవకా శాలు కల్పించాలి. నాయకులంతా అవినీతిని, బంధుప్రీతిని పూర్తిగా వదలుకోవాలి. అధికారంలోకి వచ్చినట్లయితే పారదర్శక పాలన, సమర్థవంతమైన పాలన, సమర్థులూ నిజాయితీపరులైన వారికి అధికారంలో స్థానం, వేగవంతమైన, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, యువతకు ఉపాధి అవకాశాలు అనే వాటిపై చిత్తశుద్ధి చూపగలమని ప్రకటించి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించాలి. అదే విధంగా వ్యవహరించాలి. లేని పక్షంలో ప్రస్తుత జెన్–జీ తరంగానీ, లేదా కొత్త తరం గానీ ఇంతకన్న తీవ్రమైన తిరుగుబాటు చేయగలదు. రాజకీయ పార్టీలకు ఇది చివరి అవకాశం వంటిది.కోల్పోయిన విశ్వాసంవీరు ఇట్లా అంటున్నట్లు బయట వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలతో నేను ప్రస్తావించాను. వారిలో ఒక్కరు కూడా ఆ మాటలను నమ్మలేదు. గతంలో పలుమార్లు ఈ తరహా మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. మరి భవిష్యత్తేమిటి? అది వారికీ అగమ్య గోచరంగానే ఉంది. నిజానికి రాచరిక వ్యవస్థలోనే బహుళ పార్టీల ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థ కోసం 30 ఏళ్లపాటు తీవ్రమైన ఉద్యమాలు జరిపి సాధించిన నేపాలీ కాంగ్రెస్, సాధారణ కమ్యూనిస్టులూ సక్రమంగా పాలించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత మావోయిస్టులు దశాబ్దంపాటు భీకరమైన పోరాటం సాగించి, కేవలం ప్రభుత్వానికి అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఇండియా ఆధునిక ఆయుధాలు సమకూర్చటం వల్ల, చివరి దశలో వెనుకకు తగ్గారు. అయినా ఇతరులతో కలిసి 2008 నుంచి 2025 వరకు 17 సంవత్సరాలలో 12 సంవత్సరాలు వామ పక్షాలే పాలించాయి. వీరి పాలన సవ్యంగా సాగినా ఈ విపత్తు ఎదురయేది కాదు. ఆ విధంగా మొత్తం అందరూ కలిసి 47 సంవత్సరాల పాటు విఫలమై, అందరికందరూ విశ్వాసాన్ని కోల్పోయినందునే, ప్రత్యామ్నాయ సృష్టి అయినా జరగనందునే, నేపాల్ భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వెనిజులా ముడిచమురుపై డేగకన్ను
అమెరికా చరిత్రలో అతిపెద్ద మిలిటరీ ఖర్చు బిల్లును 2026 సంవత్సరానికి గానూ 90,100 కోట్ల డాలర్లతో ప్రతినిధుల సభ ఆమో దించింది. లాటిన్ అమెరికాలో సరికొత్త యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో, ఈ వ్యయ బిల్లు ఆమోదం కోసం డెమోక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడం గమనార్హం. ఇప్పటికే జూలైలో కేటాయించిన 15,600 కోట్ల డాలర్ల అనుబంధ సైనిక వ్యయ నిధులతో కలిపితే, 2026లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహించడానికి అమెరికా మొత్తం లక్షా 5,700 కోట్ల డాలర్లను వెచ్చించనుంది. ‘ఆపరేషన్ దక్షిణ గోళం’ పేరిట కరేబి యన్ ప్రాంతానికి ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లు, యుద్ధనౌకలను తరలించడం... 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత అతిపెద్ద సైనిక మోహరింపుగా పరిగణించవచ్చు. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను అణచివేసే ఇఎ18జి వార్జెట్లు ఇప్పటికే ప్యూర్టోరికో చేరు కున్నాయి.అమెరికా చూపు ఇప్పుడు వెనిజులాలోని అపారమైన ముడి చమురు నిల్వలపై పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా 20 శాతం ముడిచమురు నిల్వలు (సుమారు 30,000 కోట్ల బారెల్స్) ఈ చిన్న దక్షిణ అమెరికా దేశంలోనే ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. గతంలో అధ్యక్షుడు ఛావెజ్ చమురు పరిశ్రమలను జాతీయం చేసి, 2005లో భూసంస్కరణల ద్వారా సామాన్య రైతాంగాన్ని భూస్వాముల నుండి విముక్తి చేశారు. అదే ఏడాది 13 లాటిన్ అమెరికా దేశాలు కలిసి వాణిజ్య సమాఖ్యగా ఏర్పడి స్వల్ప ధరలకే ముడిచమురును అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. 2008లో బ్యాంకులను జాతీయం చేయడం, రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా ఆయిల్ కంపెనీల ఆధిపత్యాన్ని వెనిజులా తగ్గించింది. ఇవన్నీ అమెరికాకు మింగుడుపడని అంశా లుగా మారాయి.ప్రస్తుతం ‘మాదక ద్రవ్యాల ఉగ్రవాదం’ ముసుగులో మదూరో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వాషింగ్టన్ కుయుక్తులు పన్నుతోంది. ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే సంస్థతో వెనిజులా నాయకత్వానికి సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపిస్తుండగా, అధ్యక్షుడు మదూరో, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ వాదనలను తిరస్క రిస్తున్నారు. వెనిజులా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగా ప్రకటించారు.యుద్ధ తంత్రాన్ని అమెరికా మరింత క్రూరంగా మార్చి, నేరుగా భూభాగంలోకి సైన్యాన్ని పంపకుండా క్షిపణులు, డ్రోన్ల సహాయంతో దాడులు చేసే వ్యూహంలో ఉంది. ఇటీవల డ్రోన్ల దాడిలో కొందరు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం దీనికి నిదర్శనం. ఆయుధ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తోంది.గత నాలుగేళ్లలో ఉక్రెయిన్కు 17,000 కోట్ల విలువైన ఆయుధాలను, ఇజ్రాయెల్కు భారీగా ఆయుధ సామగ్రిని సరఫరా చేస్తూ అమెరికా తన యుద్ధ దాహాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమా సియాలో చమురు ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్ను అంగరక్షకుడిగా వాడుకున్నట్లే, ఇప్పుడు దక్షిణ అమెరికాలోని వెనిజులాలో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. 1946 నుండి ఇప్పటివరకు ఇజ్రాయెల్కు సుమారు 35,000 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించిన అమెరికా, ఇప్పుడు సహజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వెనిజులాపై దాడికి సిద్ధమవు తోంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ సాగుతున్న ఈ యుద్ధ క్రీడలో వెనిజులా ఇప్పుడు బలిపీఠంపై ఉంది.– జమిందార్ బుడ్డిగఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
మయన్మార్లో ఎన్నికల తంతు
ఆంగ్ సాన్ సూకీ ఎన్నికల విజయాన్ని మయన్మార్ సైన్యం దుర్మార్గంగా చేజిక్కించుకుని దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడా సైనిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వ హించ తలపెట్టింది. ఇవి డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి వరకు జరుగుతాయి. ఈ ఎన్నికల ద్వారా తమ పాల నకు చట్టబద్ధత సాధించాలని సైన్యం విఫలయత్నం చేస్తోంది. కానీ దేశంలో ఇప్పటికే నెలకొని ఉన్న అరాచక పరిస్థితి ఈ ఎన్నికలతో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.ప్రధాన రాజకీయ పార్టీ ఎన్ఎల్డీ (నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ) సహా అనేక పక్షాలు సైనిక పాలకులు ప్రకటించిన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతిరూప మైన సూకీని జైల్లో పెట్టిన సైనిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది. అందుకు నిరసన ప్రకటిస్తూ, కొత్త చట్టం కింద రాజకీయ పార్టీగా నమోదయ్యేందుకు ఆమె పార్టీ ఎన్ఎల్డీ నిరాకరించింది. దీంతో సైనిక పాలకులు ఆ పార్టీని రద్దు చేశారు. 2020 ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. సైనిక ప్రభుత్వం 2008లో ప్రకటించిన రాజ్యాంగం ప్రకారం, జాతీయ పార్లమెంటు ఉభయసభల్లోని 476 స్థానాల్లో 25 శాతం సీట్లు సైన్యానికి రిజర్వు అయ్యాయి. సైన్యం అనుకూల జాతీయవాద పార్టీ యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యూఎస్డీపీ) ఆ ఎన్నికల్లో చావుదెబ్బ దెబ్బతింది. అయిదేళ్ల క్రితం ఆరంభమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తాననీ, అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సంస్క రిస్తాననీ 2020 ఎన్నికల్లో సూకీ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. కాబట్టి, పగ్గాలు చేపట్టిన వెంటనే సూకీ సైన్యం తోక కత్తిరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సమయంలో సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారం హస్తగతం చేసుకుంది.అదుపు సాధించని సైన్యంవేల మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులను సైనిక ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. సొంత పౌరుల మీద బాంబులు కురిపించింది. గ్రామాలకు గ్రామాలను తగలబెట్టింది. సూకీని ఎక్కడ నిర్బంధించారో కూడా కచ్చితంగా తెలియదు. ఇంత చేసి కూడా సైన్యం దేశం మీద పట్టు సాధించలేకపోయింది. అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య అనుకూల పౌరసేనలు, సాయుధ పోరాట సంస్థలు సైనికులతో పోరు సలుపుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యపడేది కాదు.‘స్ప్రింగ్ రివల్యూషన్’ పేరిట మయన్మార్లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం సైన్యాన్ని పూర్తిగా ధిక్కరించాలని నిర్ణయించింది. ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ (ఎన్యూజీ)కి అనుబంధంగా పనిచేసే ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ వంటి సాయుధ ప్రతిఘటన సంస్థలు ఇందులో భాగం అయ్యాయి. ఎన్యుజి తానే దేశానికి నిజమైన ప్రభుత్వం అని ప్రకటించుకుంది. అజ్ఞాతం నుంచో ప్రవాసం నుంచో పనిచేస్తున్న నాయకులు దీన్ని నడుపుతున్నారు. ఏమైనప్పటికీ, మెజారిటీ స్థానాల్లో సైన్యం అనుకూల యూఎస్డీపీ నెగ్గుతుంది. ఇది సైనిక పాలకులకు మద్దతు ఇస్తుంది.భారత్కు భద్రతా సమస్యభారత్ ఈ ఎన్నికల కోసం ఈవీఎంలు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విష యాన్ని ప్రస్తావించకుండా ఒక ప్రకటన చేసింది: ‘ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ పరివర్తనకు ఇండియా మద్దతు ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు అన్ని రాజకీయ వర్గాల భాగస్వామ్యం కీలకం. మయన్మార్లో శాంతి, చర్చలు, సాధారణ పరిస్థితుల పున రుద్ధరణకు తోడ్పడే అన్ని యత్నాలకూ ఇండియా ఇకమీదట కూడా మద్దతిస్తుంది’.చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేదనీ, ఇవి స్వేచ్ఛగా, సమ్మిళితంగా జరిగే ఎన్నికలు కావనీ ఇండియాకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించక పోయినా, కనీసం అక్కడి హింసాకాండకు ఒక రాజకీయ పరిష్కారం చూపించగలిగినా చాలు. నాలుగు ఈశాన్య రాష్ట్రాల వెంబడి మయన్మార్తో ఇండియాకు 1,643 కి.మీ. సరిహద్దు రేఖ ఉంది. ఆ దేశంలో ఏం జరిగినా దాని ప్రభావం మన మీద పడుతుంది.సైనిక తిరుగుబాటు అనంతరం వ్యతిరేక వర్గానికి చెందిన వేల మంది సైనికులు శరణార్థులుగా మిజోరం రాష్ట్రంలోకి పారిపోయి వచ్చారు. చిన్ రాష్ట్రం మీద సైనిక పాలకులు బాంబులు కురిపించి నప్పుడు మిజోరంలోని సరిహద్దు గ్రామీణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయవలసి వచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్య అను కూల గ్రూపులతో పోరాడేందుకు మయన్మార్ సైన్యం సగాయింగ్ ప్రాంతం (మయన్మార్) లోని ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటు గ్రూపులతో కలసి పనిచేస్తోంది. ఇది ఇండియాకు భద్రత సమస్య. ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు కూడా మయన్మార్ అలజడుల కారణంగా అసంపూర్తిగా మిగిలి పోయింది.పాలు పోని ఇండియాసూటిగా చెప్పాలంటే, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ కారుల్లో మన పట్ల ఉన్న గౌరవాభిమానాలను పణంగా పెట్టి క్రూరు లైన ఆ దేశ సైనిక పాలకులతో ఇండియా సంబంధాలు నెరపింది. తద్వారా ఎంత ప్రయోజనం పొందగలిగింది? మణిపూర్ అశాంతికి మయన్మార్ చొరబాటుదారులే కారణమని నిందిస్తూ కూడా ఇలాంటి విధానం ఎందుకు అనుసరిస్తోంది? తాజాగా, మయన్మార్ సరిహద్దుల వెంబడి ఇండియా దృఢమైన కంచె నిర్మిస్తోంది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్లో డ్యూరాండ్ లైన్ వెంబడి కంచె నిర్మించడం ద్వారా వేలాది కుటుంబాలను, గ్రామాలను, తెగలను వేరు చేసిన బ్రిటిష్ పాలకుల తప్పిదాన్నే ఇండియా పునరావృతం చేస్తోంది. చైనా మాత్రం తన సొంత మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజె క్టులను కాపాడుకునేందుకు తెగల ప్రజలను ఉపయోగించుకుంది. అందుకు ప్రతిగా సైనిక పాలకులకు ఆయుధాలను సమకూర్చింది. ఎట్టకేలకు, ఇండియా ఇప్పుడు మేల్కొంది. ప్రజాస్యామ్య అను కూల ఉద్యమ గ్రూపులతో మంతనాలు జరుపుతోంది. దేశం నుంచి ఆర్భాటం లేకుండా పనిచేసుకోడానికి వారికి అనుమతించింది. ఎన్ని కల ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలిసిన విషయమే. పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యేందుకు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్వహించిన రెఫరెండం లాంటిదే ఈ ఎన్నికల తంతు. ఇండియాకు ఎదురవు తున్న సవాళ్లు, ఆ దేశంలో పెరుగుతున్న చైనా ప్రభావం ఇలాగే కొన సాగుతాయి. ‘యాక్ట్ ఈస్ట్’ అనేది కలగానే మిగిలిపోనుంది.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజల సొమ్ము పంచడమే బాబు సంస్కరణలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందించింది. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షణలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ పత్రిక ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రజానీకం, ఆర్థిక నిపుణులు కొందరు అంటున్నది ఏమిటంటే.. ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెడుతున్నందుకే ఈ అవార్డు అని! పైగా మీడియా సంస్థలు అధికారంలో ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నాయంటే ప్రజలు సందేహించే పరిస్థితులున్నాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే.. సీఎం లేదా ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న నేతలకు ఇలా అవార్డులు ఇస్తూంటారన్న విమర్శ ఉండనే ఉంది. అంతేకాదు.. ఈ మీడియా సంస్థలు ప్రభుత్వాల నుంచి భారీ ఎత్తున ప్రకటనలు తీసుకుని ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతూండటం గమనార్హం. ఎకనమిక్ టైమ్స్ అలా ఇచ్చిందా? లేదా? అన్నదానికి జోలికి వెళ్లడం లేదు. కాని ఈ పత్రిక గ్రూపు నిర్వహించిన ఒక సదస్సుకు ఏపీ ప్రభుత్వం రూ.కోటిన్నరతో పాటు రూ.27 లక్షలు జీఎస్టీగా చెల్లించడం విమర్శలకు కారణమవుతోంది. ఈ అవార్డు ఎంపిక కమిటీలో చాలామంది ప్రముఖులే ఉన్నారు. ఆయా సందర్భాల్లో వీరు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన విషయం బహిరంగమే. ఓకే కానీ... ఏ కొలమానాల ప్రకారం చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఎందుకంటే.. 18 నెలల అధికార అవధిలో ఆంధ్రప్రదేశ్కు కొత్తగా వచ్చిన పరిశ్రమలేవీ లేవు. మంత్రి లోకేశ్ వంటి వారు.. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్తోనే బోలెడన్ని పరిశ్రమలు వచ్చేస్తాయని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగానే ఉంది. కూటమి సర్కారు విశాఖపట్నంతోపాటు మరికొన్ని చోట్ల కొన్ని కంపెనీలకు ఎకర భూమి రూ.99 పైసలకే లీజు లేదా గంపగుత్తగా ఇస్తున్నా అవే కంపెనీలు హైదరాబాద్లో వందల కోట్ల రూపాయలతో భూములు కొంటున్నాయి. రహేజా వంటి సంస్థలకు అంత తక్కువ ధరకు భూములిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఆశ్చర్యపోయింది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ, వేల కోట్ల లాభాలు ఆర్జించే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు.. ఊరు పేరూ లేని ఉర్సా అనే కంపెనీలు ఈ చౌక బేరంతో లబ్ధి పొందాయి. చంద్రబాబు సన్నిహితుడిగా చెప్పే లూలూ మాల్ అధిపతి అహ్మదాబాద్లో రూ.519 కోట్లు పెట్టి భూమి కొనుక్కుంటే విశాఖ, విజయవాడలలో కాణీ ఖర్చు లేకుండా పలు రాయితీలతో భూమి పొందారు. విజయవాడలో వందల కోట్ల రూపాలయ విలువైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించేశారు. గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసిన అదాని డేటా సెంటర్కు భూములు కేటాయించడమే కాకుండా ఏకంగా రూ.22 వేల కోట్ల విలువైన రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చేసింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు చూస్తే ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక చంద్రబాబు ప్రభుత్వమే ఆ సంస్థలలో ప్రజల సొమ్మును ఎదురు పెట్టుబడిగా పెడుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ కంపెనీలకు ఇస్తున్న భూములు ఏకంగా 66 ఏళ్ల వరకు వారి అధీనంలోనే ఉంటాయి. అవి కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పలేం కాని, ఆ భూములవల్ల వారికి కలిగే ప్రయోజనం మాత్రం జాక్ పాట్ వంటిదే. పరిశ్రమలకు భూమి, రాయితీలు ఇవ్వడం కొత్త కాదు.కాని ప్రభుత్వానికి బొత్తిగా ఆదాయం రాకుండా ప్రైవేటువారికే మేలు కలిగేలా ,వారికే సంపద సమకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ అవే వ్యాపార సంస్కరణలు ఈ మీడియా సంస్థలు డప్పు కొడితే ఏమి చేయగలం? ఇవే కాదు.. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చి వందల కోట్ల విలువైన భూములు కేటాయించి, నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల సంపదను సృష్టిస్తే, వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి సంపదగా మార్చేస్తున్నారు. అయితే ఇది కూడా వ్యాపార సంస్కరణ అనే ఆ అవార్డు కమిటీ భావించిందేమో.ఆంధ్రప్రదేశ్ ప్రాథమికంగా వ్యవసాయాధార రాష్ట్రం. కాని అక్కడ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఫలితంగా పలుమార్లు రైతులు తమ పంటలను పారబోస్తున్నారు. చాలా సందర్భాల్లో వ్యాపారులకు ఈ పంటలు కారుచౌకగా దొరుకుతున్నాయి.రైతులేమో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల సంక్షేమం కాంక్షించి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరు కార్చేయడంతో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. యూరియా కొరతను అదనుగా చేసుకున్న వ్యాపారులు అందినంత దండుకున్నారు. ఆ రకంగా వారికి చంద్రబాబు అంటే మక్కువ ఏర్పడిందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య, వైద్య సామాజిక రంగాలలో జగన్ సంస్కరణలు తేగా, ఇప్పుడు కూటమి సర్కార్ ప్రజలను ప్రైవేటు సంస్థల దోపిడీకి వదలి వేసే విధానాలు తీసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయకుండా మొత్తం ప్రైవేటు బీమా కంపెనీల చేతిలో పెట్టడానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, వలంటీర్లను ప్రవేశపెట్టి జగన్ పాలన సంస్కరణలు తెచ్చి ప్రజలకు పౌరసేవలను వారి ఇంటివద్దే అందిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని ఏ రకంగా చూసినా పేదల వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలుగానే కనిపిస్తాయి. జగన్ టైమ్లో సెకీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ తీసుకోవాలని ఒప్పందం చేసుకుంటే అది అధిక ధర అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదానితో భేటీ అయిన వెంటనే దానికి ఓకే చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాక సోలార్ పవర్ను యూనిట్కు రూ.మూడు కంటే ఎక్కువ ధరకు కొనడానికి సిద్దపడుతున్నారు. ఇక రెడ్ బుక్ అరాచకాలతో పరిశ్రమలను కూడా వదలి పెట్టడం లేదు. ఒక మోసకారి నటిని అడ్డం పెట్టుకుని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై కూడా కేసు పెట్టే యత్నం జరిగింది. చిత్రంగా ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి వాటా ఉన్న భారతి సిమెంట్తోసహా మరో రెండు సిమెంట్ కంపెనీల లీజును కక్షపూరితంగా రద్దు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇది ఏ రకంగా వ్యాపార సంస్కరణ అవుతుంది? ఏది ఏమైనా చంద్రబాబుకు ఎకనమిక్స్ టైమ్స్ అవార్డు ఇచ్చినందుకు ఏపీ ప్రజలు సంతోషిస్తారా? భయపడతారా? అన్నది చెప్పలేం. ఇలాంటి బిజినెస్ అవార్డుల ఉత్సాహంతో మరింతగా పెట్టుబడిదారులు, వ్యాపారులకు అణాకు, బేడాకు విలువైన రైతుల, ప్రభుత్వ భూములను కట్టబెట్టకుండా ఉంటే అదే పదివేలు అన్నది జనాభిప్రాయంగా ఉంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఐదు ముక్కల్లో జగన్ మార్కు అభివృద్ధి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులు, ఆయన హయాంలో ఏర్పాటైన పారిశ్రామిక సంస్థల గురించి జరిగిన ప్రచారం ఒకటి.. అసలు వాస్తవం ఇంకోటి. ఐదేళ్ల పదవీ కాలంలో తొలి రెండేళ్లు కోవిడ్-19తోనే సరిపోయింది. రాష్ట్ర విభజన తరువాత వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కొరత కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు అడ్డంకి కానే కాలేదు. అన్ని ఇబ్బందులను అధిగమించి కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో అందరి ప్రశంసలు అందుకుంది జగన్ ప్రభుత్వం. అదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి జగన్ ఒక్కటొక్కటిగా పునాదులు వేస్తూ పోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి స్థూలంగా ఐదు ముక్కల్లో...1. భారీ పెట్టుబడులు..ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఐదేళ్ల కాలంలో ఆమోదం తెలిపిన పెట్టుబడులు ఏకంగా రూ.1.44 లక్షల కోట్లు. అంతేకాదు.. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో 17.5 గిగావాట్ల విద్యుదుత్పత్తికి అనుమతులు ఇవ్వడం ద్వారా రికార్డు సృష్టించింది. మిగిలిన రాష్ట్రాలు సౌర, పవన విద్యుత్తులకు మాత్రమే పరిమితమైతే.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్లో పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాజెక్టు ఏర్పాటైంది. గ్రీన్కో సంస్థ సుమారు రూ.28 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు సంప్రదాయేతర ఇంధన రంగంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కోల్ ఇండియా, ఏఎం గ్రీన్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కారణంగా గ్రీన్ అల్యూమినియం, హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్తు సరఫరా సాధ్యమైంది. ఎకోరెన్ గ్రూపు రూ.11 వేల కోట్లు అకార్డ్ గ్రూపు రూ.పదివేల కోట్లు, సెంచురీ ప్లైబోర్డ్స్ రూ.2600 కోట్లతో, ఆంధ్ర పేపర్ మిల్లు రూ.3400 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ రూ.1087 కోట్లు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు, విస్తరణలకు పెట్టుబడులుగా పెట్టింది కూడా జగన్ హయాంలోనే!2. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. 2023లో విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 340 వరకూ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి మొత్తం విలువ రూ.13 లక్షల కోట్లు. సుమారు 20 రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఏర్పడింది. ఇదే సమ్మిట్లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వర్చువల్ పద్ధతిలో రూ.3841 కోట్ల విలువైన పరిశ్రమలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిద్వారా సుమారు తొమ్మిదివేల ఉపాధి అవకాశాలు దక్కాయి. దేశ వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్), కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్), జి.మోహన్ రావు (జీఎంఆర్ గ్రూపు), నవీన్ జిందల్ (జిందల్ స్టీల్ అండ్ పవర్), అదానీ గ్రూపు ప్రతినిధులు ఇతర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం గమనార్హం.3. పోర్టులు.. ఇతర మౌలిక సదుపాయాలు..సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని రాష్ట్రాభివృద్ధికి మెట్టుగా మార్చాలని వై.ఎస్.జగన్ సంకల్పించారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయన హాయంలో మచలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం పడింది. రికార్డు సమయంలో మచలీపట్నం పోర్టు పూర్తయ్యి 2023 మే నెలలో ప్రారంభమైంది కూడా. వీటితోపాటు అప్పటికే ఉన్న వైజాగ్, కృష్ణపట్నం, గంగవరం నౌకాశ్రయాల ఆధునికీకరణ, విస్తరణ కూడా చేపట్టారు. ఫలితంగా 2022లో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఉన్నత స్థానానికి చేరుకోగలిగింది. ఆ ఏడాది దేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 38 శాతం! నౌకాశ్రయాల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో పలు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి కూడా వై.ఎస్.జగన్ శ్రీకారం చుట్టారు. పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ ఎగుమతులు కేంద్రంగా విశాఖ - చెన్నై కారిడార్ ఏర్పాటైతే.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాలను బెంగళూరు- చెన్నై కారిడార్లతో కలిపే ప్రయత్నం జరిగింది.4. పారిశ్రామిక విధానం..సంక్షేమం పునాదిగా.. పారిశ్రమలే చోదక శక్తిగా జగన్ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 65 శాతానికి కారణమవుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, పెట్రోకెమికల్స్పై ప్రధానంగా దృష్టి పెట్టారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులు ఇచ్చేపద్ధతిని మొదలుపెట్టారు. వీటన్నింటి కారణంగానే ఆంధ్రప్రదేశ్ 2019-2024 మధ్యకాలంలో వరుసగా మూడేళ్లు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోగలిగింది. సంక్షేమ పథకాలకు పారిశ్రామిక ప్రగతికి ముడిపెట్టిన జగన్ రాష్ట్రానికి వస్తున్న కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసేందుకు పలు స్కిల డెవలప్మెంట్ కోర్సులను అమలు చేశారు. అపారెల్ పార్క్, ఆటో క్లస్టర్లను గ్రామీణ యువత, మహిళలకు నైపుణ్యాలను అందించే పథకాలకు జోడించారు. వీరిలో అత్యధికులు అమ్మ ఒడి, ఎస్హెచ్జీ గ్రూపు లబ్ధిదారులే.5. పండుగలా వ్యవసాయం..2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం పండుగల మారింది. రైతు భరోసా ద్వారా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఏటా రూ.13,500 పంపిణీ చేయడం మాత్రమే కాదు.. ఉచిత బోర్వెల్స్, సాగునీటి ప్రాజెక్టులు, పంట బీమా పథకాలు రైతు కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఎప్పటికప్పుడు రైతు అవసరాలను గమనించి తీర్చేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పదివేలకుపైగా రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వలసలు తగ్గాయి. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు కూడా రైతు పురోగతిలో తమ వంత పాత్ర పోషించాయి. పండ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2023-24 సంవత్సరానికి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022లో ఆంధ్రప్రదేశ్ నుంచి 774 కోట్ల డాలర్ల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
అనితర సాధ్యుడు
ధరిత్రిలో చరిత్ర సృష్టించేవాళ్ళు కొందరే ఉంటారు. వారి వల్ల కాలానికి ఓ గుర్తింపు వస్తుంది. కాలం కలకాలం వారిని గుర్తుంచుకుంటుంది. సమ కాలీన భారత రాజకీయ చరిత్రలో పదహారేళ్ల క్రితం ఓ ఉత్తుంగ తరంగం ఎగిసింది. హిమాలయ శృంగ సమా నమై నిలిచింది. ఆ తరంగం పేరే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. మన మాజీ ముఖ్యమంత్రి. ప్రజలు ముద్దుగా, గౌరవంగా, ఆత్మీయంగా పిలుచుకునేది ‘జగన్’ అని! ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక కఠోర శ్రమ, ఒక నిరంతర దీక్ష, ఒక పట్టుదల, ఒక ఆత్మీయం – జగన్. అలజడి, ఆందోళన, తిరుగుబాటు ఆయన తత్త్వం. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు జగన్. ఓ 36 ఏళ్ల యువకుడు, రాజకీయ పసిబాలుడు సమాజపు అట్టడుగు దేశ రాజకీయ చరిత్రను తిరగరాయడం ఆశ్చర్యం. అది జగన్కే చెల్లింది. 125 సంవత్స రాల కాంగ్రెస్ పార్టీని కదిపి, కుదిపి, ధిక్కరించి, ఛీత్కరించి తన అసామాన్య, అసాధారణ పోరాటంతో ఆ పార్టీ ఊపిరి తీసేసి రాష్ట్రంలో, దేశంలో లేకుండా చేయటం అన్నది మాటలు కాదు. మహామహులకు సాధ్యం కాని పని జగన్మోహన్ రెడ్డి చేయడం జగత్తు చూసి ముక్కున వేలేసుకుంది.ప్రియమైన వారసుడుమహానేత, తెలుగు రాష్ట్ర ప్రజల భాగ్యవిధాత అయిన తండ్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హఠాత్తుగా అందర్నీ వీడి పోతే... ఆ బాధ భరిస్తూ, ఆ అనంత శోకాన్ని ఎదలో మోస్తూ, తండ్రి ఆశయ సాధన కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, జనం కోసం నిలబడిన ధీరోదాత్తుడు జగన్. తండ్రి ఆశయం కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి ముందుకు వచ్చిన అసలు సిసలు యుద్ధవీరుడు. తండ్రి ఆస్తులకు కాదు, ఆశయాల కోసం నిలబడాలి అని ప్రజల పక్షం వహించి, లోకంలో ఆశయం కోసం ఎలా ఉండాలో పోరాటం చేసి చూపిన యోధుడు.పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రత్యర్థులు ప్రతి క్షణం వెనక్కి లాగుతున్నా, ప్రజల కోసం అడుగులు వేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జగన్. ఆయన పట్ల ప్రజలు అపార అభిమానం, నమ్మకం పెంచుకుంటున్న పరిస్థితిని పసిగట్టి జగన్ను అణిచివేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అందరికీ తెలిసిందే.మహానేత మరణాన్ని భరించలేక ఆంధ్ర రాష్ట్రం అల్లాడి పోయింది. దాదాపు 673 మంది ప్రజలు ఆత్మహత్య చేసు కున్నారు. తన తండ్రి కోసం తనువులు వీడిన ఆ కుటుంబాలను పలకరించాలని, పరామర్శించాలని జగన్ సంకల్పించారు. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. ఆ యువకుడు కదిలితే అతని వెంట కోట్లాది జనం నడుస్తారని వారికి తెలుసు. అది ఇష్టం లేక ఆ కుటుంబాలను ఒక చోటికి పిలిచి మాట్లాడమని ఆదేశించింది అప్పటి కాంగ్రెస్ అధిష్టానం. చెప్పుడు మాటలకు తలవొగ్గి జగన్మోహన్రెడ్డికి గిరి గీయాలి అని ప్రయత్నించింది సోనియా గాంధీ.బాధిత కుటుంబాలను తన దగ్గరకు పిలిపించుకోవడం న్యాయం కాదనీ, తానే వారి దగ్గరికి వెళ్లి పలకరించడం భార తీయ ధర్మం, సంప్రదాయం అనీ ఆయన చెప్పినా అంగీకరించ లేదు సోనియా గాంధీ. అన్యాయాన్ని, అధర్మాన్ని అంగీకరించి తలవంచడం తెలి యని జగన్, ఆమె మాట కాదన్నాడు. ఆ అభాగ్యుల చెంతకు తనే స్వయంగా వెళ్ళటానికి నిర్ణయించి అడుగు ముందుకు వేశాడు. అది అభిమాన జనప్రవాహంతో ఓదార్పు యాత్రగా మారింది. ఆ యువకుడిని, తమ ప్రియమైన డాక్టర్ వై.ఎస్. రాజ శేఖర రెడ్డి కుమారుడిని చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు, ప్రజా సముద్రం కదిలింది. జగన్ మాట్లాడుతూఉంటే, ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, ఆదరంగా భుజంమీద చేయి వేస్తూ ఉంటే, చేయి ఊపి దగ్గరికి పిలుస్తూ ఉంటే, ‘నేను ఉన్నాను’ అని నమ్మకం ఇస్తూ ఉంటే, ఆంధ్ర ప్రజలు ఆప్యాయ తతో పొంగిపోయారు. కాపాడే నేత కళ్ళ ముందు కనిపిస్తున్నా డని ఆనందపడ్డారు. అతడే తమ నాయకుడు, పరిపాలకుడు కావాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి మారుగా తనయుడు తమ కష్టాలు తీరుస్తాడని త్రికరణ శుద్ధిగా నమ్మారు.అవిశ్రాంత యోధుడుజగన్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి, ప్రత్య ర్థులకు, సోనియా గాంధీకి, చంద్రబాబుకు కన్ను కుట్టింది, వెన్ను జలదరించింది. అతని ముందు నిలబడలేమని అర్థమైంది. ఆనాడు అభిమన్యుడి మీదికి కుట్రతో ఉరికిన కురు మూకల మాదిరి ప్రత్యర్థులు సోనియాగాంధీ, చంద్రబాబు కుయుక్తులు పన్నారు, కుతంత్రాలు చేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకున్నా, పరిపాలనలో పాలుపంచు కోకున్నా సీబీఐని ఉసిగొల్పారు. దాని ఫలితం అనేకమైన అబద్ధపు కేసులు పెట్టి, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం బెయిలు కూడా రాకుండా అక్రమ నిర్బంధం చేశారు. మానసికంగా కుంగదీయాలని అనేక ప్రయత్నాలు చేశారు.అన్ని రోజుల పాటు జైలులో అనంత ఏకాంతంలో ఉన్నా జగన్ మనోబలం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలకు సేవ చేయా లన్న పట్టుదలలో వెనుకంజ వేయలేదు. తాత నుండి ఆత్మస్థైర్యం, తండ్రి నుండి మనోబలం, తల్లి నుండి సహనం సహజంగా అతనికి అబ్బిన గుణాలు. చెక్కుచెదరని అసాధారణ సాధనతో, మనో నిబ్బరం సడలని బలంతో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చాడు. మరొకరైతే చెదిరి బెదిరి విలువలకు తిలోద కాలు ఇచ్చి, కాడె పారేసి కదలి వెళ్లిపోయేవారు. ఎన్ని దాడులు, ఎన్ని విమర్శలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రచారాలు, ఎంత వైషమ్యం, ఎంత విషం తమ పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా నిత్యం ప్రత్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసత్యాన్ని సత్యం అని చెబుతూనే ఉన్నారు. జగన్మోహనుడు ఏ మాత్రం జంక లేదు. ఏ మాత్రం తొణకలేదు. ఒక్కడుగా, ఒకే ఒక్కడుగా జనాన్ని నమ్మి కదన రంగంలోకి కొదమ సింహంలా ఉరికాడు. ఆత్మీయులను ఆదరిస్తూ 2014 ఎన్నికల రంగంలోకి ఏకాకిగా అడుగుపెట్టాడు. ప్రజలలో అదే ఆదరణ, అదే నమ్మకం.అబద్ధం చెప్పలేను, మోసం చేయలేను, అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వలేను అని విలువలకై నిలబడ్డాడు. ప్రత్యర్థులు, చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. అధికారం వస్తే చాలని అబద్ధాల కుప్పలు ప్రజల ముందు పోశారు. ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని ఒకే ఒక అబద్ధం జగన్ చెప్పి ఉంటే అధికారం దక్కేది. మోసం చేయను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోలేదు, ప్రజల పక్షాన నిలబడటం మానలేదు. ఆయనకు కావాల్సింది అధి కారం కాదు, జన క్షేమం. చంద్రబాబు బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. అయినా చంద్ర బాబు ప్రభుత్వం మీద జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు. ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షం నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత యుద్ధం చేస్తూనే ఉన్నారు. తన శాసన సభ్యుల్ని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం, పేదల కోసం గళం ఎత్తుతూనే ఉన్నాడు.సహృదయ నాయకుడుజనం కోసం జగన్ జరిపిన సుదీర్ఘ పాదయాత్ర మరొక చరిత్ర. తండ్రిలాగే తాను జనం మధ్యకు వెళ్లాలనీ, కష్టజీవుల కన్నీటి కథలు తెలుసుకోవాలనీ, రైతుల గోడు వినాలనీ, నిరుద్యోగుల, ఉద్యోగుల, ఆడపడుచుల బాధలు వినాలనీ, ఓదార్చాలనీ, ధైర్యం చెప్పాలనీ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు జగన్. సెక్యూరిటీ వారు వద్దన్నా, ఆత్మీయులు ప్రేమగా వారించినా కాదని ప్రజల కోసం ఎండనకా, వాననకా అడుగులు వేశాడు. కాళ్లు బొబ్బలు ఎక్కాయి, హఠాత్తుగా ఆరోగ్యం సహకరించలేదు, హత్యా ప్రయత్నం జరిగింది, ప్రతీప శక్తులు హేళన చేశాయి. ఏవీ ఆయన లెక్కలోకి తీసుకోలేదు. దీక్ష, పట్టుదల, పేదల పట్ల ప్రేమ, సేవ చేయాలన్న ఆశయం ఆయనను నడిపించాయి. ప్రతిరోజూ ఇరవై వేల మందిని కలుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, ధైర్యం ఇస్తూ కదిలాయి ఆయన పాదాలు. ఆ పాదస్పర్శకు నేలతల్లి పులకించింది. ఆయన మాటల ఓదార్పుకు జనంలో ఆశ చిగురించింది.పేదలు, వృద్ధులు, రోగగ్రస్థులు, ఎందరో ఆయనకు గోడు వినిపించుకున్నారు. పుండ్లతో శరీరం కుళ్ళి రసి కారుతూ దగ్గరకు వెళ్ళటానికి జుగుప్స కలిగించే వారిని సైతం ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్న అమృత హృదయం జగన్ మోహన్ రెడ్డి గారిది. ముగ్గుబుట్ట వంటి తలా, ముడ తలు దేరిన దేహం, కాంతి లేని కళ్ళతో దీనంగా, హీనంగా, దైన్యాతిదైన్యంగా ఆదరణ కోసం, ఆత్మీయత కోసం, సహాయం కోసం, సానుభూతి కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్య సోదర సోదరీమణుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అత్యంత సన్నిహి తంగా దగ్గరకు తీసుకున్న మొదటి, ఆఖరి రాజకీయ నాయకుడు నిస్సందేహంగా జగనే! అంతరంగంలో అపారమైన ప్రేమ, దయ, జాలి ఉంటే తప్ప అది సాధ్యపడదు.అపూర్వమైన సంస్కారం ఆయనది. తనకన్నా చిన్నవారిని, నౌకర్లను, డ్రైవర్లను, సెక్యూరిటీ వారిని అందరినీ ‘అన్నా’ అని పిలిచే సహృదయత ఆయనది. ఎదుటివారికి ఆయన ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడూ ఇవ్వడు. పాదయాత్రతో మరింత ఎదిగాడు. ప్రజల మనసులలో నమ్మకం పెంచాడు. వారికి ఏం కావాలో, తనేం చేయాలో నిర్ణయించుకున్నాడు. పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాడు. నిర్ణయించుకుంటే అడుగు వెనక్కి వేయని తత్వం. చేయాలనుకున్నది చేసి తీరే పట్టుదల. కన్నీటి కథలకు, వెతలకు, కరిగిన ఆయన హృదయం తీసుకున్న కఠిన నిర్ణయం పేదల పక్షపాతం.ఒకే ఒక్కడు2019 ఎన్నికలు వచ్చాయి. ఒక్కడే ఒకే దీక్షతో నారాయణ ధనుర్ముక్త బాణంలా జనంలోకి వచ్చాడు. పర్జన్య గర్జన్యం వంటి ఆయన వాక్కు హామీ అందరూ ఆదరించారు. 151 సీట్లతో ఎవరి అండా లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేను అధికారిని కాను, సేవకుడిని అని ఆ క్షణమే చాటాడు. తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే తన శాసనాలనీ, తన మ్యానిఫెస్టో తన ఖురాను, బైబిలు, భగవద్గీత అనీ, కడుపు నిండని పేద తన దేవుడనీ నమ్మి పరిపాలన సాగించాడు.తను ఇచ్చిన వాగ్దానాలలో దాదాపు అన్నిటినీ నెరవేర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవాడు మూడు పూటలా భోజనం చేయడానికి ఆయన ప్రథమ ప్రాధాన్య మిచ్చాడు. వారి ఇంటి ముంగిటకే తీసుకువెళ్లి రేషన్ అందించాడు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభు త్వాన్ని వారి ఇంటి పక్కన నిలిపాడు. వాలంటీర్లుగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వారి ద్వారా వృద్ధులు, వికలాంగులు, పేదలు, విధవలకు పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశాడు. ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ కావడం మనందరి గర్వకారణం, అదృష్టం. రెండు సంవత్సరాలు కరోనాతో దేశం స్తంభించిపోయింది. ఆర్థికపరంగా అన్ని వ్యవస్థలూ అతలాకుతలమయ్యాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏ పథకమూ ఆగలేదు. ఏ నిరుపేదా ఆకలితో ఉండలేదు. అనేక పట్టణాలలో అభాగ్యు లకు రెండు పూటలా ఆహార పొట్లాలు అందించాడు. అందరికీ వైద్యం అందింది. ఈనాటి పాలకులు, సనాతన ధర్మ రక్షణ పరులు ఇళ్లల్లో ముడుచుకుని మూలన పడుకుంటే ప్రజలకు చేరువగా జగన్ ఉన్నాడు.ప్రమాదంలో మరణించిన వారికి దేశంలోనే మొదటి సారిగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి మరిన్ని రోగాలకు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకున్న ఆరోగ్యదాత జగన్. పేదల కోసం ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా, లక్షల ఇళ్లు నిర్మించాడు. పేద విద్యార్థులకు ఆర్థికసహాయం పథకం మరింత మెరుగు పరిచాడు. ప్రతి పేద పిల్లవాడూ చదువుకోవాలనీ, తద్వారా జీవన ప్రమాణం పెంచుకోవాలనీ ప్రభుత్వ పాఠశాలల్ని వేల కోట్లతో ఆధునీకరించాడు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాడు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెట్టాడు. పిల్లలను స్కూల్కు పంపితే చాలు... ఆ తల్లుల అకౌంట్లలో ఏటా రూ. 15 వేలు వేళకు ఇస్తూ, ‘అమ్మ ఒడి’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఆధునిక లాప్టాప్లు, ఆరోగ్యకరమైన ఆహారం, యూనిఫాం అందించి, పెను మార్పులు తీసుకురావడానికి కారణమయ్యాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులను చేర్చడానికి తల్లిదండ్రులు పోటీపడ్డారన్న మాట, కొన్ని పాఠశాలల్లో సీట్లు దొరకని మాట అక్షరాలా నిజం. ప్రజలు కొనియాడిన సత్యం.ధీరోదాత్తుడుదేశం మొత్తం మీద అతి తక్కువ కోవిడ్ మరణాలు జరి గింది మన రాష్ట్రంలోనే అన్నది జగమెరిగిన విషయం. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోనే ఉండాలని 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. సీట్ల సంఖ్య పెంచాడు. హైందవ ధర్మ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానాల అభివృద్ధికి అపారమైన కృషి చేసింది జగనే. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలను నేడు వారు జగన్ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతని కూటమి అనేక అబద్ధాలు ఆడాయి. జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామనీ, ఉచితాలు అందజేస్తామనీ, అసత్య ప్రచారాలు చేశాయి. ప్రజ లను ఆశపెట్టాయి, భ్రమలు కల్పించాయి. సాధ్యం కాని హామీలు అమలు పరుస్తామని అరచి, మోసం చేసి ప్రజల నోళ్లు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. నిజానికి జగన్ పథకా లకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేసుకున్నారు తప్ప మరేమీ కాదు. కొత్త పథకం ఒక్కటీ లేదు. ఇప్పుడు ఏమీ అమలపరచలేక దీనికి కారణం జగన్ అని ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రాఫిక్ మాయాజాలంతో చిటికెల పందిళ్లు వేస్తున్నాయి. మూడు నెలలకే ప్రజలు అసలు నిజం గ్రహించారు. ఓ మహా నాయకుడిని మాయ మాటల వల్ల ఓడించి ఓడిపోయామని బాధపడుతున్నారు. అన్ని వర్గాల వారూ విలపిస్తున్నారు.గతంలో ఓడిపోయిన చంద్రబాబు మూడు సంవత్సరాలు మూలన ముక్కుతూ కూర్చుంటే – ఓటమిని, ప్రజల తీర్పును, హుందాగా స్వీకరించిన జగన్ వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల కలంగా, గళంగా, బలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తున్నారు, ప్రజలను మేల్కొల్పుతున్నారు. ఐదు సంవత్సరాల పాలనలో రెండేళ్లు కరోనాకు పోయినా, అద్భుతాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజల హృదయాలలో, పేదల మనసులలో, సుస్థిర స్థానం సంపాదించుకున్న పాలకుడు. నేత అన్న పదానికి అర్థం చెప్పిన ప్రజా సేవకుడు. ఓటమికి కుంగని ధీరోదాత్తుడు. ప్రజా హృదయ గోవర్ధనమెత్తిన గోపాలుడు. వక్రబుద్ధులు, కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి జనుల కోసం స్థిరంగా నిలబడిన జననేత, అజేయుడు, అనితర సాధ్యుడు, సున్నిత మనస్కుడు, పేదల పక్షపాతి, ఆరోగ్య విద్యాదాత, ఆపన్నులకు వర ప్రదాత, సహాయానికి సహస్ర హస్తుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు, భవిష్యత్ భాగ్యప్రదాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడికి, ఆలోచనాపరుడికి అనుచరుడిగా ఉండటం, ఆయనతో కలిసి నడవడం నాకు ఇష్టం, ఆనందం, సంబరం... సమున్నత గర్వం.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
దీపం వివాదం ఓట్లు తెచ్చేనా?
2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ వ్యూహరచనలో ఇప్పటికీ హిందూత్వమే అగ్ర భాగాన ఉంది. తిరుప్పరన్ కుండ్రంలో దీపం వివాదం అంతర్లీనంగా ఈ అంశాన్నే ప్రతిబింబిస్తోంది.బిహార్లో ఇటీవల ఘన విజయం సాధించిన బీజేపీ, 2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పెను సవాళ్ళనే ఎదుర్కొంటోంది. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం వహిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల ప్రాభవం కనిపించదు. తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే), పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈసారి కూడా తమ సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. తమిళనాట డీఎంకేతో సర్దుబాటు చేసుకుని, సంతృప్తి చెందేందుకే కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ, బెంగాల్లో దానికి ఆ మాత్రం ఊతం కూడా లభించడం లేదు. అందులోనూ బిహార్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ను తోడు తీసుకెళ్ళేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. మరోపక్క బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ సమరానికి సై అంటోంది. ఒంటరిగానే సై!అయితే, బెంగాల్లో 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాలతో, ఇక ఆ తూర్పు రాష్ట్రాన్ని ‘జయించడం’ తనకు చిటికెలో పనిగా బీజేపీ భావించింది. తీరా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. మొత్తం 294 స్థానాల్లో 200 కైవసం చేసు కోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, 77 సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, పోలైన ఓట్లలో 38 శాతం గడించి, ముఖ్య ప్రతిపక్షంగా అవతరించినందుకు కొంత సంతృప్తి చెందింది. ఈ గణాంకాలు అంత ప్రోత్సాహకరంగా లేకపోయినా, బిహార్లో విజయఢంకా మోగించాక ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాల యంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘‘గంగా నది బిహార్ నుంచి బెంగాల్లోకి ప్రవహిస్తుంది’’ అని ప్రకటించారు. అది ఏదో ప్రాసంగికంగా దొర్లిన విషయంలా లేదు. బెంగాల్ విపుల ప్రణాళికపై కార్యాచరణకు హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యూహరచనలో హిందూత్వమే ఇప్పటికీ అగ్ర భాగాన ఉంది. కానీ, పశ్చిమ బెంగాల్, తమిళ నాడుల్లో అది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. దీప ప్రజ్వలన వివాదంతిరుప్పరన్ కుండ్రంలో దీపం వెలిగించడానికి సంబంధించి ఇటీవల రేగిన వివాదం అంతర్లీనంగా ఆ అంశాన్నే ప్రతిబింబించింది. తమిళులు ‘మురుగా!’ అంటూ విపరీతంగా ఆరాధించే సుబ్ర హ్మణ్య స్వామికి చెందిన ఆరు పవిత్ర క్షేత్రాలలో తిరుప్పరన్ కుండ్రం ఒకటి. అక్కడి ఆలయానికి కొద్ది మీటర్ల దూరంలోనే సుల్తాన్ సికందర్ ఔలియా దర్గా ఉంది. చెదురుమదురు ఘర్షణలను మినహా యిస్తే అక్కడ కార్తీక దీపోత్సవం శాంతియుతంగానే సాగిపోయింది. కాకపోతే, దర్గాకు కేవలం 15 మీటర్ల దూరంలో ఉన్న దీపత్తూన్గా పిలిచే ప్రాచీన స్తంభంపై దీపం వెలిగించేందుకు కోర్టు ఉత్తర్వు తెచ్చుకోవలసి వచ్చింది. దీపాన్ని వెలిగించే కార్యక్రమానికి అను మతి కోరుతూ మద్రాసు హైకోర్టులోని మదురై ధర్మాసనం ముందు ఈసారి పిటిషన్ దాఖలైంది. కోర్టు దీపారాధనకు అనుమతించడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలు సంబరం చేసుకున్నాయి. కానీ, జిల్లా పాలనా యంత్రాంగం వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయడంతో, పోలీసులు వాటిని అమలుపరచవలసి వచ్చింది. ‘‘ఆశించిన ఫలితం సాధించడానికి హిందువులలో చైతన్యాన్ని రేకెత్తిస్తే చాలు’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్య అవసరమైతే ఘర్షణకు దిగవలసిందని పరోక్షంగా సూచించి నట్లయింది. తమిళనాడు సాంస్కృతిక, మత సమ్మేళనాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీకి ‘ప్రాథమికమైన లోపం’ ఉందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. ‘‘తమిళ నాడు ప్రజానీకానికి దైవభక్తి ఎక్కువ. కానీ, మతాన్ని రాజకీయా లతో మిళితం చేసి చూడరు’’ అని ఆయన అన్నారు. చిన్నాచితక ప్రాంతాల్లో తప్పించి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు తమిళ నాడులో పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు లేవు. అయినా, అవి దీపారా ధనపై వివాదాన్ని నిలకడగా కొనసాగించగలిగితే, ఓటర్ల మనసును కొంత వరకు పట్టుకోవచ్చు. కానీ, తమిళనాడు రాజకీ యాలు చాలావరకు ద్రావిడ కళగం నాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి సిద్ధాంతాలతో ప్రభావితమైనవి. ఆయన చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమంలో ముస్లింలను కూడా దళితులుగా చిత్రించడం ఒక కీలకమైన అంశం. హిందూయిజంలో అంతర్లీనంగా ఉన్న కుల అణచివేత నుంచి తప్పించుకునేందుకు దళితులు ఇస్లాంలోకి మారారన్నది ఆయన సిద్ధాంతాలలో ఒకటి.ఓటుబ్యాంకుకు దెబ్బపశ్చిమ బెంగాల్లో టీఎంసీ వరుసగా మూడు విడతలుగా అధికారంలో ఉంది. ఆరోపణల తీవ్రతతో ఈసారి టీఎంసీ దుర్బల మైనదిగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధేయులు పాల్పడినట్లుగా చెబుతున్న అవినీతి వాటిలో ప్రధానమైనది. అలాగే, కోల్కతాలో ఒక యువ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వీధులకెక్కాయి. పాలక పార్టీకి చెందిన గూండాలు, దళారీలకు తృణమో పణమో చెల్లిస్తేనే పనులు అవుతాయనీ, రక్షణ లభిస్తుందనీ ప్రజలు చెబుతున్న దృష్టాంతాలున్నాయి. దాంతో, తాము వామపక్ష కూటమి పాలన నాటి రోజుల్లోకే తిరిగి వెళ్ళినట్లుందని వారు అంటున్నారు. అయితే, అక్రమ వలసదారుల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఒక రకంగా తానే చిక్కుల్లో పడింది. పశ్చిమ బెంగాల్లో ముస్లిం వలస దారుల కన్నా హిందూ వలసదారుల సంఖ్యే ఎక్కువగా ఉందని డేటా సూచిస్తోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాల సునిశిత సవరణ (సర్) బీజేపీ ఓటు బ్యాంకు లోపల కూడా ఆందో ళనను రేకెత్తించింది. బెంగాలీ భాషను ఢిల్లీ పోలీసులు ‘బంగ్లాదేశీ భాష’గా పేర్కొంటూ మరింత అపకీర్తిని తెచ్చిపెట్టారు. హిందూ పూజారులకు నెలసరి జీతాలు చెల్లించడం, దుర్గా ఉత్సవాలను నిర్వహించడం వంటి చర్యల ద్వారా తనను ‘హిందు వుల ఆప్తురాలు’గా చిత్రించుకునేందుకు మమత గట్టిగానే కృషి చేస్తున్నారు. కానీ, హిందూత్వపై బీజేపీతో పోటీ పడటం ప్రతి పక్షా లకు ఇప్పటికీ కష్టమవుతోందని ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు బలమైన ప్రాంతీయ గుర్తింపుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిని ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చడానికి లేదు. అక్కడి ఓటర్లు హిందూత్వతో సునాయాసంగా మమేకమవుతారు. హిందూత్వ థీమ్లోకి భాష, సంస్కృతులను కూడా బీజేపీ ఈసారి అంతర్లీనం చేయ గలుగుతుందా? అన్నదే ప్రశ్న. వ్యాసకర్త: రాధికా రామశేషన్సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దేవుడా... అలసిపోయావా?
అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారుఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా. అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.:::ఆర్ఎం -
‘‘బాబుగోరు.. మీరు గుడ్డో గుడ్డూ’’
ఏది ఏమైనా బాబుగోరు మీరన్నా...మీ పాలన అన్నా చెవి కోసుకుంటా. అసలు మీలా పాలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నాకైతే డౌటనుమానమే. గత ఎన్నికల్లో మీరు గొప్ప మనసు చేస్కొని మమ్మల్ని మీతో కలవనివ్వబట్టే కదా ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టా ...సెంటర్ లో మన సర్కారు నిలబెట్టా. మేం కూటమి అంటున్నామే కానీ అదంతా మీ చలవ కాకపోతే మరేందనుకుంటున్నారు. మీరు మాతో జట్టుకట్టబట్టే కదా ఈ పుణ్యం పురుషార్థం మాకు దక్కింది. అయినా బాబుగోరు మీ గొప్పతనం మీకు తెల్వదు... ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికక్కెడికో తీసుకెళ్లి పోతున్నారంటే నిజం నన్ను నమ్మండి..అసలు మీకున్న విజను...మీకున్న లిజను ఎవరికుంది చెప్పండి? కానీ విజన్ లేని వారికి ఏం తెలిసొస్తుంది చెప్పండి. ఒక్కోసారి వీరంతా ఎందుకొచ్చారా రాజకీయాల్లోకి అనిపించేస్తుందంటే నమ్మండి సుమండీ. అయినా కోటిజన్మల పుణ్యఫలం వల్లే కదా మీ స్నేహం మాకు దక్కింది. మీరాదరి మేమీ దరిని ఉన్నా....చెగువీరాను పూనిన ఆ అద్భుత వ్యక్తే కదా మనల్ని కలిపింది..లేదంటే మేమెంత ఒంటరి పక్షులమైపోయేవాళ్ళమో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందంటే నమ్మండి సుమండి..అయినా ఎవరెవరో ఏదో అంటుంటారు...మనం అదంతా పట్టించుకోరాదు బాబుగోరు. అలా పట్టించుకుంటే రాజకీయాల్లో ఉండగలమా? అయినా నా చాదస్తం గానీ మీకు ఇవన్నీ కొట్టినపిండేగా. నిజమే అప్పుడెప్పుడో పాత ఎన్నికలప్పుడు మమ్మల్ని మీరు మనసారా దూషించారు. కానీ మీ తిట్లే మాకు దీవెనలని అనుకోలేదూ..అయినా బాబుగోరు మమ్మల్ని మీరు అప్పుడెంత దూషించారో...ఆ క్షణాన కాస్త కోపం వచ్చినా...మళ్ళీ మాతో కలవాలని మీరు పదే పదే కలవరించారు చూడండీ...అదీ మీ గొప్పతనం. మన మధ్య స్నేహబంధం నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైంది. కాకుంటే ఇన్నిసార్లు మీరు ఇన్నేసి మాటలన్నా...మళ్ళీ లటుక్కున వచ్చి మమ్మల్ని అతుక్కుపోయారు చూడండి...అబ్బబ్బా ఏమన్నా పొలిటికల్ విజనా మీది. .ఇక మీ సైనికుని గురించి ఏం చెప్పమంటారు...ఎంతని చెప్పమంటారు? ఇపుడు వారు మాకూ ఆంతరంగికులై పోయారు. అసలు వారిని మీరు బలే తయారు చేశారు బాబుగోరు. ఏ ఇజాలు తెలీకపోయినా...నిజాలు రాకపోయినా పర్వాలేదు పైకి మాత్రం గంభీరంగా ఎస్వీరంగారావులాగా తలూపుకొంటూ తిరుగుతుండాలి. ఆయన అచ్చం అలానే చేస్తున్నారాయే. మమ్మల్ని కలవక ముందు చెగువీరా అన్నారా...ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో... అని పాటలు కూడా పాడేశారా...ఇపుడు చూడండి నుదుటిపై ఇంతేసి బొట్టు పెట్టుకుని , కాషాయం చుట్టుకుని...నా ధర్మం...నేచూస్తా...నే కాస్తా అంటూ ఎర్రజెండా పట్టుకున్నోరిలా రంకెలు వేస్తున్నారు. అసలు మీ ట్రైనింగ్ ఇక్కడే కనిపిస్తోంది. నేను మారాను అని చెప్పకుండానే చేసి చూపిస్తున్నారు. జనాలు ఎలాగూ నమ్మరనుకోండి ...అది మా సిలబస్ కాదు కదా. చూశారా ఇదీ కదా సేవ..సారీ స్నేహధర్మమంటే..గత ఎన్నికల్లో మీతో కలిసి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నానని బలే ప్రచారంలో పెట్టారు బాబుగోరు. అయినా అన్నామో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక...దాందేముంది లేండి...ఆ ప్రచారం వల్ల మీరు కుషీ అయితే అదే పదివేలు. గిట్టని వారు అది అబద్దమంటారని పీల్ కాకండి బాబుగోరు. మనం మనం బాగుంటే చాలు కదా...ఏదో మీ తృప్తి కోసం అలా అన్నారే అనుకోండి...మరీ అంత ప్రచారంలో పెడితే ఎలా? వదిలేయండి బాబుగోరు...మీ విజన్ కు అది ఆనదు గాక ఆనదు. అదేదో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మెడికల్ కళాశాలలు ప్రైవేటు వద్దంటూ కోటి సంతకాలు చేయిస్తున్నారటగా... నిరసనలు కూడా చేస్తున్నారటగా...జనాలూ వస్తున్నారటగా...ఆ మీరు బెదరుతారా ఏంది? అయినా ప్రైవేటైజేషన్ అంటే మీకు ఎంత ప్రేమో మాకు తెలీదా ఏంటి? మేం కూడా విశాఖ ఉక్కును ఎవరికైనా అప్పగిద్దామనే కదా అనుకుంటున్నది....కానీ గట్టిగా అనరాదు వేరెవరూ వినరాదు...మన సర్కారుకు ఇంకా బోల్డంత టైముంది ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది...ఇదే కదా బాబుగోరు మీ మనసులో మాట....అరే మా మనసులోనూ ఇదే. కానీయండి అలా ముందుకెళదాం..సివారఖరికి మేము చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షాలు కదా కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుంటాయి. కానీ మనం కూడా తక్కువేం కాదుగా అంతకంతకు నాటుగానే ఉంటున్నాం. మీరు మాత్రం తగ్గేదేలా అన్నట్లుండండి. విజన్ అంటూ ఊదరగొట్టండి. అసలు జనాలు మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేక బిక్కమొగం వేసుకోవాలి. వారు తేరుకునేలోగా మన పుణ్యకాలం ఎలాగూ పూర్తయిపోతుంది. మరి ఆతర్వాతో అంటారా...సినబాబు చూసుకుంటారు లెండి. మన ప్యూచరేంటి అంటారా? నందో రాజో భవిష్యతి అనుకుని గ్లాసు నీళ్లు గటగటా తాగేయడమే. సరే మరి నేనుంటా మీరలాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండేం.. పొరపాటున కూడా ఆగకండి.::ఆర్ఎం -
సంప్రదాయ ఫార్మసీలు నిలబడాలి!
ఈ–ఫార్మసీ తుపాను ఇప్పుడు సంప్రదాయ ఫార్మసీ రంగానికి ఒక ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నది. కరోనా సంక్షోభం తర్వాత వాయువేగంతో విస్తరిస్తున్న ఈ–ఫార్మసీలు, కార్పొరేట్ల భారీ పెట్టుబడులతో సంప్రదాయ ఫార్మసీల మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఔషధ మార్కెట్పై గుత్తాధిపత్యం కోసం అనేక కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఈ–ఫార్మసీ రంగంలోకి దిగుతున్నాయి. 2021 జూన్లో టాటా గ్రూప్కు చెందిన ‘టాటా డిజిటల్’ సుమారు రూ. 1,500 కోట్లతో ‘1ఎమ్జీ’ అనే ఈ–ఫార్మసీ స్టార్టప్లో 65% వాటాను కొనుగోలు చేసి, ఈ ప్రక్రియకు పునాదులు వేసింది. 2024లో సుమారు రూ. 28 వేల కోట్లుగా ఉన్న భారతదేశ ఆన్ లైన్ ఫార్మసీ మార్కెట్ విలువ 2025–2033 కాలానికి 16.65% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ను నమోదు చేస్తుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సంప్రదాయ ఫార్మసీల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలున్నాయి. ఆన్ లైన్ ఔషధాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తమిళనాడు డ్రగ్గిస్ట్స్ అండ్ కెమిస్ట్స్ అసోసియేషన్ 2018లో దాఖలు చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు తొలుత అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, తరువాత ఆన్లైన్ విక్రయాలకు లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ‘ఈ–ఫార్మసీ డ్రాఫ్ట్ రూల్స్–2018’ని రూపొందించింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో నమోదైన కేసులోనూ ఇదే డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం కార్యకలాపాలను నిర్వహిస్తామని ఈ–ఫార్మసీలు హామీ ఇవ్వడంతో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు వివిధ హైకోర్టుల్లో ఇచ్చిన తీర్పులను సమర్థిస్తూ ఆన్లైన్ విక్రయాలకు అనుమతించింది. రాబోయే ఈ–ఫార్మసీల నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి చాలా ఈ–ఫార్మసీ సంస్థలు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన షెడ్యూల్–ఎక్స్ (నార్కోటిక్, సైకోట్రోపిక్, ట్రాంక్విలైజర్లు, ఔషధాలు) మాత్రం అమ్మడం లేదు. షెడ్యూల్–హెచ్ మందులను కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతున్నాయి. ముసాయిదాలో చెప్పినట్టు ఎలక్ట్రానిక్ కాపీని నిల్వ చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రేపు రాబోయే చట్టం ఈ–ఫార్మసీలకు మరింత సాధికారతను ప్రసాదించబోతుందన్నది సుస్పష్టం. ప్రజలు కూడా ఆన్లైన్ మందుల కొనుగోలుకు మద్దతునిస్తున్నారన్న విషయం అనేక పరిశోధన పత్రాలు రూఢి చేస్తున్నాయి.కరోనా మహమ్మారి తదనంతర కాలంలో ప్రజలకు విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగంలోకి రావడం, 30 నిమిషాల్లో హోం డెలివరీ వంటి సేవలు, ఈ–ఫార్మసీలోకి పెద్ద కార్పొరేట్లు ప్రవేశించడం, సంప్రదాయ ఫార్మసీల కన్నా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం వంటి అంశాలు అటు మిలీనియల్స్నూ, ఇటు జెనరేషన్ జెడ్నూ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సంప్రదాయ ఫార్మసీలు ఆన్లైన్ బాట పట్టకపోతే వాటి మనుగడకు తీవ్రమైన ముప్పు తప్పదని అనేక నివేదికలు చెబుతున్నాయి. రిటైల్ ఫార్మసీలు–కస్టమర్లకు అనుసంధానంగా నడుస్తున్న ఈ–ఫార్మా మార్కెట్ ప్లేస్ కంపెనీలకు ప్రభుత్వాలు మద్దతుగా నిలిస్తే మళ్లీ రిటైల్ ఫార్మసీ రంగం భద్రంగా ఉంటుంది. లేదంటే దేశంలో ఉన్న దాదాపు 10 లక్షల ఫార్మసీలలో పనిచేస్తున్న కోటిమందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది.– శ్రీపాద రమణ ‘ ఔషధ రంగ నిపుణులు -
క్రైస్తవానికి పునాది లౌకికవాదం!
సమాజం లార్వా నుండి ప్యూపా రూపంలోకి, అటునుండి సీతాకోక చిలుకలా మారే ఒక నిరంతర ప్రక్రియలో ఉంటుంది. సమాజ గతి చలనం ఎన్ని సంస్కృతులు, ఎన్ని జాతులు, మతాలు, ఖండాలు ఏర్పడినా... అది ఒక సమూహంగా మనడానికి గతి మార్గాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇందులో కొన్ని ప్రయోగాలు ఉంటాయి. కొన్ని అనుభవ రీత్యా నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. కొన్ని శాస్త్రీయ పరిణామాలు ఉంటాయి. వీటన్నిటికీ కావాల్సిన ఫౌండేషన్ – ఒక బేసిక్ సోషల్ ఫ్యాబ్రిక్. అది సమాజం మొత్తానికీ ఉమ్మడిగా సమ్మతమైన మోరల్ కోడ్, సోషల్ కోడ్! ఇది వ్యక్తిగత అభిరుచులు, నమ్మకాలు, హక్కులకు అతీతంగా సామూహిక ప్రయోజనాల మీద నిలబడి ఉండాలి. లేనప్పుడు– వ్యక్తిగత హక్కులు, సామూహిక నిబంధనలకు లోనై– ఒక ఘర్షణ పూరితమైన, ఒక తిరోగమన సమాజానికి దారి తీస్తుంది. ఈ కోడ్ – సమానత్వం, సౌభ్రాతృత్వంతో సమ్మిళితమైన స్వేచ్ఛ కలిగి ఉండాలి. స్వేచ్ఛ పరిమాణం ఎంత అన్నది మరో ప్రశ్న. తిరిగి అది ‘ర్యాడికల్ ఇండివిడ్యువలిజం’ను ప్రేరేపిస్తే అది మరో తిరోగమన రూపాన్ని తీసుకుంటుంది. ఈ బ్యాలన్స్ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇప్పటికీ ఎవాల్వ్ అవుతూ ఉంది. అయితే – ఎంతో విపరీతమైన ఘర్షణ రూపంలో కొన్ని తిరోగమన సమాజాలలో ఎంతో రక్తపాతం తర్వాత వస్తుంది. అందుకే వీటన్నిటికీ కావాల్సిన సత్తా ఉండే సోషల్, మోరల్ ఫ్యాబ్రిక్– ఒక మతమే! మతం అంటే ‘కల్ట్’లా ఉండటం కాదు. రోజుకు ఎన్ని సార్లు పూజించాలి, ఏం బట్టలు కట్టాలి, మీసాలు ఎలా పెంచాలి... ఇలాంటి ‘రూల్స్’ మతాన్ని పోషించడం మొదలు పెడితే అది ‘కల్ట్’ అవుతుంది. ఆ ‘కల్ట్’ ఒక మూస పోసిన విధానంలో మను షులను సామాజిక సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు అతీతంగా తయారు చేస్తుంది. అటు నుండి ఒక పిడివాదం మొదలవుతుంది. అది ఒక ఫండమెంట లిజానికి దారి తీస్తుంది. దైవ విశ్వాసాలకు, సోషల్ లాజిక్కు సరిగ్గా కుట్లు వేసి అందంగా తీర్చగలిగేదే ఆదరించదగ్గ మతం అవుతుంది. దేవుడు ఒక సామాజిక అవసరం.ఒక మతానికి కావాల్సిన లిట్మస్ టెస్ట్ అంబేడ్కర్ చెప్తాడు: ‘మతం అన్నది ముఖ్యంగా నియమ సూత్రాలకు సంబంధించినది అయి ఉండాలి. ఎప్పుడైతే అది నిబంధనల చుట్టూ తిరుగుతుందో మతానికి ఉండాల్సిన సారమైన (సామాజిక) బాధ్యతను చంపేస్తుంది’ (‘కుల నిర్మూలన’ నుండి). మత ప్రాతిపదిక మీదనే–అంబే డ్కర్ ప్రగతి వాద కోణంలో మాట్లాడితే– దేవుడు ఈ ‘లిట్మస్ టెస్ట్’కు నిలబడలేని మనిషి/ ఆత్మ/ శక్తి అయితే ఆ దేవుడు నీతిమంతుడు కాలేడు. సమాజంలో ఒకరి అభిప్రాయాలకు, నమ్మకాలలో ఎన్ని తేడా, తారతమ్యాలు ఉన్నా... కలిసి ఒక సామూహిక ప్రయోజనాన్ని పండించడం కోసం ప్రజలు నడవడం ఈ రోజు సమాజానికి కావాల్సిన అత్యవసరమైన అంశం. యేసు క్రీస్తు యోహాను సువార్త గ్రంథంలో ఇలా అంటాడు: ‘నేను మీకు ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు కూడ ఒకరిని మరొకరు ప్రేమించవలెను.’ అదే రకంగా మార్కు సువార్త గ్రంథంలో ‘నీవు నీ పొరుగువానిని నీలాగునే ప్రేమింపవలెను’ అంటాడు. ఇది సింపుల్గా కనిపించవచ్చు. కానీ చాలా డెప్త్ ఉన్న స్టేట్మెంట్. ఇక్కడ పొరుగు క్రైస్తవుడిని ప్రేమించ మని యేసు క్రీస్తు చెప్పలేదు. లేదా నాస్తికుడిని ప్రేమించవద్దు అని చెప్పలేదు. హంతకుడు, దొంగ ఎవరైనా సరే వాళ్ళను ప్రేమించవద్దు అని చెప్పలేదు. పది మంది కుష్టువాళ్ళను బాగు చేస్తే అందులో ఒక కుష్టువాడు మాత్రమే జీసస్ను ఫాలో అవుతాడు. ఆయన ‘ముందుగా నన్ను ఫాలో అయితేనే నిను బాగుపరుస్తా’ అనే కండి షన్ పెట్టి బాగుపరచలేదు. జీసస్ విధానం పూర్తిగా పక్షపాత రహితం, రాజకీయ స్వార్థాల నుండి దూరం, అందరినీ చేరదీసే స్వభావం, విశ్వమానవతా దృష్టి కలిగినది. ఆ అర్థంలో ఆయన ఆచరణలో ‘లౌకికత’ ఉంటుంది. ముగింపుగా – క్రిస్టియానిటీ ఎదగడానికి ప్రభుత్వ చట్టాలు అవసరం లేదు. క్రిస్టియానిటీ యుద్ధాలు చేసి ఎదగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే– క్రిస్టియానిటీకి మూలం సెక్యులరిజం!– పి. విక్టర్ విజయ్ కుమార్ ‘ రచయిత, విమర్శకుడు(క్రిస్మస్ ఆగమన కాలం సందర్భంగా) -
ఓపెన్ చెరసాల కాదు... అది ఉత్తమ కళాశాల!
నేను 1983లో నాగార్జున సాగర్లోని ఏపీ గురుకుల జూనియర్ కళాశాలలో సీటు దొరికిందని తెలిసి ఎంతో సంతోషించాను. రాష్ట్రంలో అప్పటికి అదొక్కటే ఆ తరహా కళాశాల. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎప్పుడూ నెంబర్ వన్. అందువల్ల ఒక వైపు ఆనందం. ఇంకోవైపు కించిత్ గర్వం. అలా ఆ మూల ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లె సాలూరు నుండి పల్నాడు చివర నాగార్జునసాగర్కి పయనం సాగింది. అంతవరకూ తాడికొండ గురుకుల పాఠశాలలో గడిపిన మూడేళ్ల రోజుల్ని ‘సెంట్రల్ జైలు’గా భావించిన నేను, ‘ఇంతకు మించి ఏముంటుంది లే, బహుశా ఓపెన్ జైలులా ఉండొచ్చ’ని అనుకుంటూ కాలేజీలో అడుగుపెట్టాను.అయితే వారంలోనే అది ఓపెన్ చెరసాల కాదు, ఉత్తమ భవి ష్యత్ తయారీశాల అని అర్థమై గొప్ప ఊరట కలిగింది. ఆదివారంతో బాటు, పండగ సెలవొస్తే చాలు... విజయపురి సౌత్లో రామ కృష్ణ థియేటర్, అందులోంచి ఆట మొదలవ్వడానికి ముందు విని పించే ‘నమో వేంకటేశా ’పాట తెచ్చిన ఉత్సాహం, భాను వీడియో అంటూ బస్టాండ్ దగ్గర ఉన్న వీడియో థియేటర్, డ్యామ్కి అటు చివర మూడు కిలోమీటర్ల దూరంలోని హిల్ కాలనీ వరకూ క్రమం తప్పని పాదయాత్ర... అన్నీ నిన్నమొన్నటి విషయాల్లాగానే ఉన్నాయి. ఇక, మా సీనియర్లు ఎవ్వరూ ర్యాగింగ్ చెయ్యలేదు... కాకపోతే అందరినీ ‘సర్’ అని పిలవాలి. మా బోటనీ సర్ ఎప్పుడూ ‘ఇలాగే చదువు, నువ్వు డాక్టర్ అయిపోయినట్టే’ అంటూ ప్రోత్సహించే వారు. అభిమానం కనబడేది. రెండుసార్లూ టీచర్స్ డేకి నేను బోటనీ క్లాస్ తీసుకున్నాను (పిల్లలతో ఆ రోజు చెప్పించేవారు). క్లాస్ లాస్ట్లో ఆయన్ని అనుకరిస్తూ గొంతు మార్చి కామెడీ చేస్తే ఒక్కడు కూడా నవ్వలేదు. ఏమిటా అని చూస్తే ఆయన ఎప్పుడు వచ్చి కూర్చున్నారో తెలియదు కానీ లాస్ట్ బెంచ్ నుండి లేచి వచ్చారు. బిక్కచచ్చిన నన్ను ‘వెరీ గుడ్’ అంటూ కదిలిపోయారు. ఇంకోసారి ఇంగ్లీష్ సర్ దివాకర్ గారు బోర్డు వైపు తిరిగి క్లాస్ చెప్తుంటే ఏదో చిన్నతనపు అల్లరి చేశాం. ఆయన చూడలేదనుకున్నాం. కానీ ముద్దా యిలందరినీ లేపారు. నన్నులేపి ‘చేసిందంతా చేసి, ఎంత అమాయ కపు మొహం పెట్టావు రా నాయనా’ అని నవ్వేశారు. చాలా చిక్కని స్నేహాలు. అరమరికలు లేనివి. ఇంట్లోంచి తెచ్చు కున్న ఊరగాయలు, జంతికలు ఉమ్మడి ఆస్తి. కలిసి పోటీగా చదువు కోవడం, ఒకరి డౌట్లు ఒకరు తీర్చుకోవడం మాత్రమే కాదు... ఆట లైనా, పాటలైనా, షికార్లయినా, జట్లుగానే! రష్యా, ఉక్రెయిన్ స్థాయిలో గొడవపడినా రెండో రోజుకి సంధి కుదిరిపోవాల్సిందే. ఒక సారి సెలవులు ఇచ్చిన టైమ్కి వరదలు. ట్రైన్లు లేక బస్సుల్లో బయ లుదేరాం. అవి కూడా డైరెక్ట్గా లేవు. ఉత్తరాంధ్ర వాళ్ళం నలుగురం కలిసి రాజమండ్రి చేరుకున్నాం. ఎవరి దగ్గరా డబ్బులు మిగల్లేదు. అయినా భయం లేదు. అందులో రవిది వైజాగ్. ధైర్యం చెప్పాడు. ‘నా చేతికి వాచీ ఉందిరా, ఏం ఫరవాలేదు’ అని. బస్టాండ్లో ఒకా యన్ని పరిచయం చేసుకుని, పరిస్థితి చెప్పి మా నలుగురికీ టికెట్స్ తీయమని చెప్పాడు. తన వాచీ ఉంచుకుంటే, తర్వాత రోజు కలిసి డబ్బులిచ్చి రిటర్న్ తీసుకుంటానన్నాడు. ఆయన ‘అదేమీ వద్దులే ’ అని చెప్పి మాకు టికెట్స్ తీసి ఇచ్చాడు. మేం వైజాగ్లో రవి ఇంటికి చేరిపోయి, వారి ఆతిథ్యం పొంది, మరుసటిరోజు మా ఇళ్లకు చేరాం.ఇలా చెప్తూ పోతే బోలెడు. నా పేరు అచ్చులో చూసుకోవడం మొదటిసారి అక్కడే. ‘ఆశాజీవులు’ అని కవిత రాస్తే ఆ సంవత్సరం మేగజైన్లో అచ్చయింది. చదువుతో బాటు అందమైన అనుభవాలు, స్నేహాలు, జీవిత పాఠాలు మిగిల్చిన మా ‘ఏపీ గురుకుల జూనియర్ కళాశాల’ మా అందరికీ ఉన్నతి కలుగ జేసిన మేధా తయారీ శాల.– డా‘‘ డి.వి.జి. శంకరరావు ‘ పార్వతీపురం మాజీ ఎంపీ(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాల ఆరంభమై రేపటికి 50 ఏళ్ళు) -
‘ఆత్మనిర్భరత’కు రష్యాయే ఆలంబన
భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు – విక్రేతకు మధ్య ఉండే వాటి కన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్వేర్ సమీకరించు కున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞా నాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఉక్రెయిన్పై యుద్ధం 2022లో మొద లెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల న్యూఢిల్లీకి రెండు రోజుల పర్యటనపై వచ్చి వెళ్ళడం ఇదే మొదటి సారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆతిథేయిగా వ్యవహరించిన ఈ శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య చెక్కు చెదరకుండా నిలిచిన వ్యూహాత్మక భాగ స్వామ్యం ప్రాధాన్యాన్ని తెలియజేసింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో శ్రీకారం చుట్టుకున్న సహకారాన్ని ఉభయ దేశాలు కొన్ని దశాబ్దాలుగా పెంపొందించుకుంటూ వస్తున్నాయి.ఉక్రెయిన్పై యుద్ధానికిగాను రష్యా అధ్యక్షుడిని ఏకాకిని చేయా లని అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు కోరు కోవడంతో ఈ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన ఆసక్తి వ్యక్తమైంది. ఉక్రెయిన్పై యుద్ధ నేరాలకు సంబంధించి అంత ర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్కు అరెస్టు వారంట్లు జారీ చేసింది. అయినా ఘనంగా, సంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పల కాలన్న భారత్ నిర్ణయంలో స్వీయ వ్యూహాత్మక ప్రాధాన్యముంది.రష్యా నుంచి చమురు దిగుమతులను, రక్షణ సామగ్రి కొను గోళ్ళను తగ్గించుకోవాలని అమెరికా నుంచి మనపై ఒత్తిడి పెరుగు తున్న నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. తమ సంబంధాలు ‘బాహ్య ఒత్తిడులకు లోబడేవి కావు’ అని రెండు పక్షాలూ పునరు ద్ఘాటించాయి. ఉభయ సేనల మధ్య సాంకేతిక సహకారం ఒక ముఖ్య అంశంగా కొనసాగుతోందని సంయుక్త ప్రకటనలో నామ మాత్రంగా ప్రస్తావించి వదిలేశారు. రష్యా నుంచి వచ్చిన ఆయు ధాలు, ఇతర రక్షణ సామగ్రి నిర్వహణకు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య క్రమం కింద టెక్నాలజీ బదలీ ద్వారా భారతదేశంలోనే స్పేర్ పార్టులు, పరికరాలు, చిన్నాచితక వస్తువులు, ఇతర ఉత్పత్తులను సంయుక్తంగా తయారు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. భారత సాయుధ దళాల అవసరాలు తీర్చేందుకు సంయుక్త సంస్థలను నెలకొల్పాలని నిర్ణయించారు.భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు–విక్రేతకు మధ్య ఉండే వాటికన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్ వేర్ (మొదటి మిగ్ పోరాట విమానం, పెత్య/కమోర్త తరగతి నౌకలు, ట్యాంకులను) సమీకరించుకున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞానాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఆ విధంగా సోవియట్/రష్యా మూలాలున్న పరికరాలలో చాలా భాగం భారతదేశంలో ‘తయారైనట్లు’ పైకి కనిపించినప్పటికీ, అది చాలా వరకు దిగుమతి చేసుకున్న కిట్లు/కాంపొనెంట్ల కూర్పు నకు మాత్రమే పరిమితమైంది. ఆయుధాల ఫ్యాక్టరీలలో, లేదా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్.ఎ.ఎల్)లో సాగింది ప్రాథమికంగా విడి భాగాల అసెంబ్లింగ్ కలాపం మాత్రమే. రివర్స్–ఇంజనీరింగ్ లేదా దేశీయ డిజైన్ చేపట్టేందుకు జరిగిన కృషి అతి స్వల్పం లేదా అసలు ఏమీ లేదనే చెప్పాలి.చైనాతో పోల్చుకుంటే, డిజైన్ డొమైన్లోకి దిగడంలో అశక్తత /విముఖత కనిపిస్తుంది. సోవియట్ హయాం నాటి సైనిక సామగ్రిని చైనా ఎంతో విజయవంతంగా రివర్స్–ఇంజనీరింగ్ చేసి విజయం సాధించింది. సుఖోయ్ ఎస్ యు–27 ఫ్లాంకర్ ను ఆధారం చేసుకుని అది షెన్యాంగ్ జె–11యుద్ధ జెట్ విమానాన్ని అభివృద్ధి చేసింది. లైసెన్సు పొందిన ఉత్పత్తి ఒప్పందం కింద పీపుల్స్ లిబ రేషన్ ఆర్మీ 1990లలో రష్యా నుంచి సు–27 ఎస్కే యుద్ధ విమా నాలను సమీకరించింది. తర్వాత, రష్యా సరఫరా చేసిన కిట్లను ఉపయోగించుకుని, 2000ల మధ్య నాటికి ఆ విమాన రివర్స్–ఇంజ నీరింగ్లో సఫలమై జె–11ఎ విమానాలుగా తయారు చేసింది.సు–27 సోవియట్ యూనియన్లో 1970లలో డిజైన్ అయి, 1985లో సర్వీసులో ప్రవేశించింది. ఈ సోవియట్ టెక్నాలజీని మక్కికి మక్కి కాపీ కొట్టి చైనా జె–11 తయారు చేసుకుంది. డిజైన్లో సాధించిన ఈ పురోగతితో చైనా దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించుకుంది. స్వయం సమృద్ధిని సమీకరించుకుంది. తర్వాత, ఇదే యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ (అదే పెద్ద కొనుగోలు దారు)కు విక్రయించింది.భారత్ మొదటి సుఖోయ్ సు–30ని 1997లో సమీకరించుకుంది. కానీ, దేశంలో అప్పట్లో ఉన్న పరిస్థితుల రీత్యా, దిగుమతు లపై ఆధారపడడం కొనసాగింది. యుద్ధ విమాన (రఫేల్) ప్రత్యా మ్నాయ సరఫరాదారుగా ఫ్రాన్స్ ముందుకొచ్చింది. పుతిన్ పర్యట నతో ఐదవ తరం సు–57 యుద్ధ విమానాలపై మళ్ళీ ఆసక్తి రేగుతోంది. భారత్ సోర్స్ కోడ్ యాక్సెస్ను, స్టెల్త్ ఉన్నతీకరణలను కోరుతోంది. దీన్ని సమీకరించుకోవడం వల్ల దేశీయ ‘తేజస్’కు ఏమైనా ఊతం చేకురుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కొన్ని నవీన రంగాలలో అమూల్యమైన సాంకేతిక పరిజ్ఞాన సహాయాన్ని మాస్కో (సోవి యట్ యూనియన్గా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా) భారతదేశానికి సమకూర్చిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. క్షిపణులు, అణుశక్తి చోదిత జలాంతర్గత ప్రొపల్షన్ (ఐ.ఎన్.ఎస్. అరిహంత్) అందుకు నిదర్శనం. ఇక సంయుక్త రంగ బ్రహ్మోస్ది దిగ్విజయ మైన గాథ. తేలిక రకం బ్రహ్మోస్ను తయారు చేయడం ప్రస్తుత సమావేశ చర్చనీయాంశాలలో చేరింది. ప్రధాన సైనిక సామగ్రి డిజైన్, తయారీ పరిజ్ఞానం ఒక దేశాని కుండే వజ్ర వైడూర్యాల లాంటివి. ఇది అలమారాలో పెట్టి అమ్మే పరిజ్ఞానం కాదు. అందు కనే, భారత–రష్యాల మధ్య సైనిక సరఫరాలలో ఎంత పటిష్ఠమైన బంధం ఉన్నా డిజైన్ పరిజ్ఞానాన్ని పంచుకోవడమన్నది లేదు.ఆత్మనిర్భరతను వీలైనంత త్వరగా, పటిష్ఠంగా ముందుకు తీసుకెళ్ళే దృఢ నిశ్చయాన్ని భారత్ కనబరిస్తే పుతిన్ పర్యటన తద నంతర ఫలాలపై ఆశ పెట్టుకోవచ్చు. నిజంగానే, రెండు దేశాలు రక్షణ రంగ పరిశోధన–అభివృద్ధిలో, వస్తూత్పత్తిలో సహకారముంటే మరింత ప్రగతిని సాధించవచ్చు. కానీ, ఈ విషయంలో భారత్ తొలగించుకోవలసిన సాలెగూళ్ళు చాలానే ఉంటాయి.మాస్కోకి కూడా ఢిల్లీతో గాఢమైన సైనిక సహకారం విషయంలో కొన్ని లక్ష్మణ రేఖలున్నాయి. అది బీజింగ్ సందేహాలను కూడా తీర్చవలసి ఉంటుంది. అదే మాదిరిగా, భారత్ కూడా రష్యాతో కలసి అడుగులేయడంలో అమెరికా పెడుతున్న తంపులను గుర్తెరిగి ప్రవర్తించవలసి ఉంటుంది. పుతిన్ పర్యటన ద్వైపాక్షిక స్నేహ సంబంధానికి మెరుగులు దిద్దింది. కానీ, రెండు దేశాలకూ కొత్త సవాళ్ళు కూడా ముందుకొచ్చి నిలుస్తున్నాయి. సి. ఉదయ భాస్కర్,వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ -
సంక్షోభంలో నేపాల్ పార్టీలు
జెన్–జీ అనూహ్యమైన తిరుగుబాటు ఉధృతితో నేపాల్ రాజకీయ పార్టీలు అన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయంటే అతిశ యోక్తి కాదు. పార్టీల నాయకత్వం, సిద్ధాంతాలు, జెన్–జీ రేకెత్తించిన ప్రశ్నలు, వారంటే ఇంకా కొనసాగుతున్న భయం – ఇట్లా అనేక విషయాలు ఒక్కుమ్మడిగా తుఫాను వలె కమ్ముకు రావటంతో పార్టీ అగ్రస్థాయి నాయకత్వాలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఏమి చేయాలనే స్పష్టత లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జెన్–జీ ఆందోళన సెప్టెంబర్ ఆరంభంలో జరిగి, మార్చిలో పార్లమెంటు ఎన్నికలకు మరో మూడు నెలలే మిగిలి ఉండగా ఇదీ పరిస్థితి.ఒక్కో పార్టీ... ఒక్కో సమస్యఅన్నింటికన్న పెద్దది అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా తొలగిపోవాలంటూ జాతీయ కౌన్సిల్ సభ్యు లలో 54 శాతం మంది నోటీసు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి గగన్ థాపా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తూ, దేవుబా తప్పుకోనట్లయితే పార్టీని చీల్చగలమని హెచ్చరించారు. రెండవ పెద్దది అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ ఎంఎల్) అధ్యక్షుడు, ఉద్యమ కారణంగా పదవీభ్రష్టుడైన ప్రధానమంత్రి కె.పి. ఓలీ రాజీ నామా చేయాలని పట్టుబడుతున్న అసమ్మతి వర్గం, పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తీరాలని ఒత్తిడి చేసి ఒప్పించింది. మూడవ పెద్దది అయిన మావోయిస్ట్ సెంటర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ ఉరఫ్ ప్రచండ, తనంతట తానే రాజీనామా చేసి, పార్టీని సైతం రద్దుపరచి, కొన్ని ఇతర వామ పక్షాలతో ఐక్యమై, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ను ప్రారంభించారు. దానికి ఆయన సమన్వయకర్త మాత్రమే! ఆ తర్వాతది అయిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్య క్షుడు, ప్రచండ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండిన రాబీ లమీ ఛానే, ఒక కుంభకోణం కేసులో కోర్టు ఆదేశాలపై అరెస్టయి ఇటీవలే జైలుకు వెళ్లారు. తన పార్టీ స్తబ్ధతలో ఉంది. ప్రచండ తర్వాతి స్థానంలో ఉండి ప్రధానిగా కూడా పనిచేసి, తర్వాత నయాశక్తి పార్టీ ప్రారంభించిన జెఎన్యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి, రాచరికం పతనం తర్వాత ప్రజాస్వామిక రాజ్యాంగ రచనకు ఆధ్వర్యం వహించిన డా‘‘ బాబూరాం భట్టరాయ్, తమ పార్టీని రద్దు చేసి, మరికొందరితో కలిసి ప్రగతిశీల్ లోక్ తాంత్రిక్ పార్టీని నెలకొల్పారు. దానికి ఆయన ‘పార్టీ పేట్రన్’ మాత్రమే! రాచరికం తిరిగి రావాలి, లేదా కానిస్టిట్యూషనల్ మోనార్కీ కావాలనే హిందూవాద రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీ (ఆర్పీపీ)లో నాయకత్వ సమస్యలైతే తలెత్తలేదుగానీ, జెన్–జీ ఉద్యమ కారణంగా తెలిసీ తెలియని సవాళ్లు ఏవి ఎదురు కాగలవోనన్న అయోమయం వారిని ఆవరించింది.జెన్–జీ నేర్పిన పాఠాలేమిటి?ఇదంతా నాయకత్వాలు, పార్టీ నిర్మాణాల పరిస్థితి కాగా, ఎన్నికల సమయానికి మరిన్ని పార్టీలు, లేదా ఇప్పటికే గల పార్టీలలో మరిన్ని చీలికలు, పునరేకీకరణలు, ఐక్య సంఘటనల ఆవిర్భావం జరిగినా ఆశ్చర్యపడనక్కర లేదు. వాస్తవానికి ఎన్నికలలో పోటీ చేయదలచుకునే పార్టీల రిజిస్ట్రేషన్ తొలి గడువు ముగిసినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఆ గడువును పొడిగిస్తున్నది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన విషయం, జెన్–జీ గ్రూపులు కొన్నికొన్ని కలిసి ఇప్పటికే మూడు పార్టీలను ప్రారంభించాయి. మరి రెండింటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెన్–జీలంతా కలిసి ఒకే పార్టీగా ఏర్పడక పోవటం పట్ల ప్రజలలో తగినంత నిరాశ కనిపిస్తున్నది.ఆందోళన నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు అన్నింటికన్న ముఖ్య మైన విషయాలు కొన్నున్నాయి. యువతరం ఆగ్రహం, ఆందోళన రాజకీయ పార్టీలకు ఇచ్చిన షాక్ ఎంత తీవ్రమైనది? దానినిబట్టి వారు తమ సిద్ధాంతాలు, విధానాలు, వ్యక్తిగత వ్యవహరణలలోని లోపాలను చిత్తశుద్ధితో గుర్తించి సమీక్షించుకున్నారా? లేక కొంత కాలానికి అంతా సమసిపోయి పాత పద్ధతులలో వ్యవహారాలు సాగించవచ్చుననుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు తటస్థులైన పరిశీలకులకు తోచటం అట్లుంచి, నేపాల్ సామాజికుల నుంచి కూడా విన్న నేను, వివిధ పార్టీల నాయకులను కలిసినపుడు, ప్రశ్నలు వేసి వారి ఆలోచనలను గ్రహించేందుకు ప్రయత్నించాను.వారి సమాధానాలను బట్టి, మిశ్రమాభిప్రాయాలు కలిగాయి. వాస్తవానికి యువతరం లేవనెత్తిన విషయాల తీవ్రత, రెండు రోజుల పాటు అగ్నిపర్వతం వలె బద్దలైన నిరసనల తీవ్రతలను బట్టి పార్టీ లలో మిశ్రమాభిప్రాయాలకు ఆస్కారం ఉండకూడదు. కానీ, కనిపించిందేమిటి? కొందరు నిజంగానే తమ వైఫల్యాలను గుర్తించారు. మావోయిస్టుల సాయుధ ఉద్యమం ఫలితంగా రాచరిక వ్యవస్థ 2008లో రద్దయి, పూర్తి స్థాయిలో ఆధునిక పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థ, కొత్త రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 17 సంవత్సరాలుగా పరిపాలనలు సవ్యంగా సాగి ఉంటే, ఈ రోజున జెన్–జీకి గానీ, ప్రజలకు గానీ ఇంతటి అసంతృప్తికి అవ కాశం ఉండేది కాదని ఈ వర్గం అరమరికలు లేకుండా అంగీకరించింది. అవినీతి పోవటం, సమర్థమైన పారదర్శక పాలన, సామాజిక న్యాయంతో కూడిన వేగవంతమైన అభివృద్ధి అనే మూడు తప్పని సరి అనీ, అది జరగాలన్నదే జెన్–జీ తమకు నేర్పిన పాఠమనీ ఈ వర్గం అభిప్రాయపడుతున్నది. వేర్వేరు పార్టీలకు చెందిన వేర్వేరు నాయకుల మాటలు వేరైనా, వారి నుంచి సారాంశం ఇదే!అదే మొండి ధోరణిఇందుకు భిన్నమైన పరిస్థితి కూడా మరొకవైపు గమనించాను. వారు, 2008 నుంచి అభివృద్ధి తగినంత చేశామని లెక్కలు చెప్తు న్నారు. ఆ లెక్కలు నిజమే అయినా సమస్య ఏమంటే, 2008 తర్వాత ప్రజల ఆకాంక్షలకు, చదువులూ, నైపుణ్యాలూ గణనీయంగా పెరుగు తున్న యువతరం అవసరాలకు, నిజాయితీగా పరిపాలిస్తే సాధించ గలిగిన వాటికి పొంతన కుదరటం లేదు. ఇది చాలదన్నట్లు మావోయిస్టులు, ఇతర కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీల విచ్చలవిడి అవి నీతి! ఈ రెండవ వర్గం ప్రచారం, జెన్–జీ ఆందోళన వెనుక విదేశీ ఎన్జీఓలు ఉన్నాయని! తమకు గల పార్టీ యంత్రాంగం, డబ్బు బలంతో తిరిగి అధికారానికి రాగలమన్నది వీరి నమ్మకం. ఆందోళ నల వల్ల అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని ఓలీ ఈ ధోరణికి ప్రతినిధి కావటం విశేషం. ఆయన నేర రికార్డు గల వ్యక్తి ఆధ్వర్యాన ప్రైవేట్ సైన్యం ఒకటి తయారు చేసి పెట్టుకున్నారు. ప్రజల వైపు నుంచి చూసినపుడు, ఇటీవల జరిగిన ఒక ఒపీనియన్ పోల్లో ఏ ఒక్క నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. మార్చి ఎన్నికలలో ఏమయేదీ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. 2008 నుంచి 17 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారిన తీవ్ర అస్థిరతల రికార్డు ఇప్పటికే ఉండగా, రాగల కాలంలో ఏమి జరగవచ్చునో ఊహించటం కూడా కష్టమే.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దిక్కుతోచని ఉక్రెయిన్
నెలలు గడుస్తున్నా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసహనం కట్టలు తెంచుకున్నట్టు కనబడుతోంది. మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్తోపాటు, దానికి దన్నుగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తూర్పార బడుతున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతున్నదనీ, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణదశకు చేరుకున్నాయనీ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వైరి పక్షాలు ఎటూ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించే దేశం ఓపిగ్గా వాస్తవ పరిస్థితులను అర్థం చేయించి ఏదోమేరకు తగ్గేలా చేయటం అవసరం. కానీ అలా చేయాలంటే మధ్యవర్తిత్వం వహించే దేశానికి విశ్వసనీయత, ప్రతిష్ఠ ఉండాలి. ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాకు ఆ రెండూ తగ్గాయి. ఏ విషయంలోనూ ఆయన నిలకడగా లేకపోవటం, ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ అయోమయాన్ని సృష్టించటం కారణం. జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు ఉక్రెయిన్ను రష్యాపైకి ఉసిగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులయి యూరప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడుపడటం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయటం ఇకపై ఉండబోదనీ, యూరప్ స్వీయరక్షణ బాధ్యత చూసుకోవాలనీ ఆ పత్రం స్పష్టం చేసింది. ప్రపంచాధిపత్యం కోసం పోటీపడటం పర్యవసానంగా అమెరికా బలహీనపడిందనీ, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరనీ తేల్చింది. ఇప్పటికి ఎనిమిది యుద్ధాలు ఆపానని తరచు చెప్పే ట్రంప్ జాబితాలో నిజానికి ఇప్పటికైతే ఉక్రెయిన్ లేదు. కానీ ఆయన అధికార పగ్గాలు చేపట్టిననాడే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని శపథం చేశారు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి ఉక్రెయిన్ మర్చిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ భూభాగాన్ని వదులుకోవటానికి ససేమిరా అంటున్నారు. నిజానికి 2022లో ఉక్రెయిన్కూ, ఆయనకు మద్దతునిస్తున్న యూరప్ దేశాలకూ బంగారం లాంటి అవకాశం వచ్చింది. టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా తనకు తానే రాజీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటాననీ, నాటోలో చేరబోననీ హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలగుతామని రష్యా ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. యూరప్ నుంచి కూడా దీనిపై హామీ కావాలని కోరింది. అప్పటికి రష్యా పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి కొన్ని నెలలు మాత్రమే అయింది. కానీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటీన ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి రాజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని నచ్చజెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాతోనే జాన్సన్ ఈ సైంధవపాత్ర పోషించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండికేస్తున్నారు. ఆయనకు శాంతియుత పరిష్కారం ఆలోచనే లేదు. ఆధిపత్య స్థాపనే లక్ష్యం. భారత్ వచ్చేముందు ఈ సంగతి నిర్మొహమాటంగా చెప్పారు. ‘ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వైదొలగితే సరే... లేదా దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు. వైరిపక్షాలు చర్చలంటూ మొదలుపెడితే వాటి వైఖరులు ఏదోమేరకు చల్లారుతాయి. కానీ ఆ చర్చలు ఫలించాలంటే తొలుత కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, ఉక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడటం లేదు. యుద్ధ వాతావరణంలో చర్చలు ప్రశాంతంగా సాగబోవన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి రష్యా ప్రతిపాదనలకు అంగీకరించమంటూ ఉక్రెయిన్పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అమెరికాతో నేరుగా మాట్లాడే ధైర్యంలేని యూరప్ దేశాలు... ట్రంప్ను ఖాతరు చేయొద్దని ఉక్రెయిన్కు నూరిపోస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నుకుంటే, అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారితే ఏమవుతుందో ఉక్రెయిన్ ఈ దశలోనైనా గుర్తెరగాలి. దీన్నుంచి బయటపడాలంటే సొంత గొంతు వినిపించటం ప్రారంభించాలి. -
ముంబై కల… అమరావతి గిమ్మిక్
అమరావతిలో 15 బ్యాంకులు, రెండు బీమా సంస్థల కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్లు కేంద్రం తమకు సహకరిస్తోందని చంకలు గుద్దుకుంటున్నారు. పైగా ఈ చిన్న విషయంతోనే అమరావతి ముంబై అయిపోతుందన్నంత బిల్డప్ కూడా ఇచ్చేశారు. నిన్నమొన్నటివరకూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అన్నవాళ్లు కాస్తా ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా రోజుకో మాట మారిస్తే నమ్మేదెలా?.. ఇంతకి ఏమిటి వీరి బలహీనత?.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే, ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కొత్తగా వస్తువన్నవి అని నమ్ముతూంటే అవి విశాఖలో పెరిగేలా చేస్తే ఏపీకి సత్వర ప్రయోజనం కలిగేది కదా! అని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికి, ధరలు పెరిగాయన్న కృత్రిమ భావన కల్పించడానికి తంటాలు పడుతున్న ప్రభుత్వ పెద్దలు దీనిని ఒక గిమ్మిక్కుగా మార్చారన్న అనుమానం కలుగుతుంది. తాజా ప్రచారం ప్రకారం మరికొన్ని సంస్థలను కూడా విశాఖ అమరావతికి తరలిస్తున్నారట. స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ఆఫీస్ను గతంలో విశాఖలో ఏర్పాటు చేయాలని తలపెట్టగా ఇప్పుడు అమరావతికి మార్చే యోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫీస్ను వైజాగ్లో ప్రతిపాదిస్తే అమరావతికి మార్చారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బిట్స్ పిలాని క్యాంపస్, ఏఐ, స్కిల్ యూనివర్శిటీలరె కూడా అమరావతికి మారుస్తారట. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్, కర్నూలు నుంచి లా యూనివర్శిటీ తిరుపతి నుంచి హెచ్సీఎల్లను తరలించారు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ నుంచి ఒక కార్యాలయం ఇక్కడకు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు,విద్వేషాలు పెరగవా అని కొంతమంది విజ్ఞులు బాదపడుతున్నారు. కొత్త ప్రభుత్వ సంస్థలను అమరావతిలో స్థాపించవచ్చు.గతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అమరావతికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని అన్నారు.అలా జరిగితే అందరికి ప్రయోజనంగా ఉంటుంది. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు. దాని ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి దక్కాలి.అలాకాకుండా అప్పులు భారం అందరిపై పడి, ఆర్థిక లాభం మాత్రం అమరావతి ప్రాంతంలోని కొందరికే లభిస్తే అది సమస్యలకు దారి తీయవచ్చు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమరావతిలో పెడుతున్న బ్యాంకు ఆఫీసులు అన్ని విజయవాడలో ఇప్పటికే పనిచేస్తున్నాయట. వాటినే అమరావతికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నమాట. కాకపోతే దానికి ఫైనాన్షియల్ స్ట్రీట్ అని ఒక పేరు తగిలిస్తారన్నమాట. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఆయా చోట్ల వివిధ బ్యాంకులకు రీజినల్ ఆఫీసులు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు ఓకే చోట ఉండడం వల్ల కలిసివచ్చేది ఏమీ ఉండదు. వికేంద్రీకరిస్తే అందరికి సమన్యాయం జరుగుతున్నట్లు అవుతుంది.అందుకు భిన్నంగా ఇతర చోట్ల నుంచి తీసుకు వచ్చి వాటిని అమరావతిలో పెడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.కాకపోతే ప్రభుత్వ సొమ్ము కాబట్టి కోట్ల రూపాయలకు వారికి భూమిని కేటాయించామని చెప్పుకోవచ్చేమో!. విశాఖలో ప్రైవేటు సంస్థలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పందారం కావిస్తూ, అమరావతిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అమరావతిలో ఐటీ మొదలు అనేక సంస్థలు వస్తున్నాయని ఊదరగొట్టారు.నవ నగరాల పేరుతో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అందుబాటులో ఉన్న ఏభైవేల ఎకరాలు సరిపోదని, అలా అయితే మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కొత్తగా మరో నలభైవేల ఎకరాల భూముల సమీకరణకు సిద్దం అవుతున్నారు. నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలన్నీ తెలుసో ,లేదో కాని ఆమె ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో కూరగాయలు బాగా పండుతాయని, వాటికి ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఎగుమతికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు నెలకొల్పడం వంటివి చేయాలని సూచించారు. కాని ఇప్పటికే రాజధాని పేరుతో భూములన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం దున్నివేయించింది. వేలాది ఎకరాలలో పంటలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారినట్టు పలు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె గమనించి సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది. బ్యాంకులు వారు రైతులకు సహకరించాలని చెబుతూనే కమర్షియల్ గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎవరికి ఎలాంటి రాయితీలు ఇవ్వవలసిన అవసరం లేదని తేల్చేశారన్నమాట. పోనీ అమరావతికి ఏమైనా కొత్తగా నిధులు ఇస్తున్నారా అంటే అదేమి చెప్పలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్రం రూ.15 వేల కోట్ల ఇచ్చి సహకరిస్తోందని అన్నారు. కాని అది రుణమా?లేక గ్రాంటా అన్నది చెప్పినట్లు కనిపించలేదు. నిజంగానే అది గ్రాంట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రస్తావించకుండా ఉంటారా?.. బడ్జెట్ లో ఏపీకి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారని ఆమె తెలిపారు. కాని అది ఏ రూపంలో ఇంతవరకు ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఏపీకి ఆర్థిక భారం అవుతుంది. అలాంటప్పుడు అది సాయం ఎలా అవుతుంది?. కేంద్రం నుంచి సుమారు రూ.36 వేల కోట్ల సాయం వస్తుందని ఏపీ బడ్జెట్లో పెడితే ఇప్పటికి కేవలం ఐదువేల కోట్ల లోపే అందిందట. దీని గురించి ఆమె ఏమైనా హామీ ఇస్తే బాగుండేది కదా!. రాష్ట్రం సుమారు రూ.45 వేల కోట్ల భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అది తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సాయపడి ఉంటే అందరు అభినందించేవారు. అవేవి చేయకపోయినా చంద్రబాబు, తదితరులు మెచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలోని వారికి ఇబ్బంది లేదనుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబుకు లేని క్రెడిట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన పనులు చెప్పి పొగిడితే తప్పు లేదు. కాని హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం అయనే చేసినట్లు నిర్మలా వ్యాఖ్యానించడం అందరిని విస్తుపరచింది. హైదరాబాద్లో ఈ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ది అంతా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా తానే నిర్మించానన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఈ మధ్య ఆయన ఒక స్పీచ్ ఇస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే వేసినట్లు చెప్పుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానికింద ఒక అధికారి గతంలో ఈ రింగ్ రోడ్డును వైఎస్సార్ ఎలా అభివృద్ది చేసింది వివరిస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందని తెలిపే వీడియో కూడా వచ్చింది. అయినా చంద్రబాబు ఎందుకో అసత్యాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ కూడా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ను చంద్రబాబుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన అభివృద్దిని కూడా తన ఖాతాలో వేసుకుని ఏపీలో ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన ఉద్దేశం అన్నది కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్ను అంతగా అభివృద్ది చేసి ఉంటే మరి ఏపీలో విశాఖ,విజయవాడ,తిరుపతి వంటి నగరాలను ఎందుకు వృద్ది చేయలేకపోయారు?.. ఇకపై ముంబై ఆర్ధిక నగరం కాదట.అమరావతి అట. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.ఈ రకంగా మాట్లాడడం నవ్వులపాలయ్యే అంశమా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముంబై ఎక్కడ?అమరావతి ఎక్కడ? అర్థం ఉండాలి కదా మాట్లాడడానికి!. విమానాశ్రయం పేరుతో, స్పోర్ట్స్ సిటీ పేరుతో రకరకాలుగా వేల ఎకరాల అదనపు భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్న తీరు అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. వారిని మభ్య పెడుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తే ఏమి ఉపయోగం?.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అంతుచిక్కని అగ్నిశిఖల ముప్పు
దీర్ఘకాలంగా సుప్తావస్థలో ఉన్న ఇథియోపియా ఉత్తర ప్రాంతంలోని హేలీ గబ్బి అగ్నిపర్వతం అసాధారణ రీతిలో బద్దలైన ఘటన అనూహ్యంగా ఆందోళనలోకి నెట్టింది. పేలుడుతో అత్యంత భారీగా రేగిన ధూళి మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమన్, ఒమన్ సహా చివరకు పాకిస్తాన్ ఉత్తర ప్రాంతం నుంచి భారతదేశం వైపు కమ్ముకొస్తూ ఉండడం మన ఆందోళనకు కారణం. ఎదుట ఉన్నదేదీ కనిపించనివ్వని ఆ భారీ దుమ్ము ధూళి ఏకంగా కొన్ని వందల కిలో మీటర్లు ప్రయాణించి వివిధ ఖండాలకు విస్తరించింది. ఇప్పటికే భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక దేశాల విమాన ప్రయాణ సర్వీసులకు చిక్కులు తెచ్చింది.ఏం జరిగింది?ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు ఈశాన్యాన 800 కి.మీల దూరంలో అఫార్ ప్రాంతంలో ఉందీ హేలీ గబ్బి అగ్నిపర్వతం. ముఖ్యంగా భూ ఉపరితలంపై కదిలే పెద్ద శిలల పొరల మీద ఉంది. తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ జోన్ కిందకొచ్చే ఆ ప్రాంతంలో అటు ఆఫ్రికన్, ఇటు అరేబియన్ భూ ఫలకాలు ఘర్షించుకుంటూ, ఏటా 0.4 నుంచి 0.6 అంగుళాల మేర పరస్పర వ్యతిరేక దిశలో కదులుతుంటాయి. 12 వేల ఏళ్ళుగా గమ్మునున్నట్టు తోచిన సదరు వాల్కనో ఈ నవంబర్ 23న విస్ఫోటనం చెంది, అనేక గంటలు నిప్పులు విరజిమ్మింది. ఆ ఘటనలో ఎవరూ మరణించలేదు కానీ, ఆ ప్రాంత ప్రజలు, జీవజాలంపై సుదీర్ఘ ప్రభావం ఉండనుంది. ముందస్తు హెచ్చరికలు లేవా?ఇథియోపియాలో దాదాపు 50 అగ్నిపర్వతాలున్నాయి. వాటిలో అనేకం కొన్ని వేల ఏళ్ళుగా నిద్రాణంగా ఉన్నాయి. నిజానికి, ఈ జూలైలోనే దగ్గరలోని ఎర్తా ఆలె అగ్నిపర్వతం బద్దలైంది. భూగర్భంలో 30 కిలోమీటర్ల కింద అంతశ్శిలాద్రవం చొచ్చుకుపో యింది. భూగర్భ కదలికలతో హేలీ గబ్బి సైతం విస్ఫోటనం చెందే ప్రమాదం ఉందని సూచనలు అందాయి. గత ఆదివారం అదే జరిగింది. భారీ శబ్దంతో అగ్నిపర్వతం పేలినప్పుడు 14 కి.మీ.ల మేర ఆకాశంలోకి ధూళి మేఘాలు విస్తరించాయి. పర్వతాలంత ఎత్తున గగన భాగాన్ని కప్పేసిన ఆ బూడిద పర్యాటక ప్రాంతాలైన చుట్టుపక్కలి పర్వతప్రాంత గ్రామాలను చుట్టేసింది. దట్టమైన పొగ, గాఢాంధకారంతో గాలి పీల్చడానికైనా లేదు. తాజా ఘటనను బట్టి ఆ అగ్ని పర్వత ప్రాంతం గురించి లోతైన అధ్యయనం జర గనే లేదనీ, ఆ లోటు పూరించాల్సి ఉందనీ తేలింది.ఎంత కష్టం... ఎంత నష్టం...అగ్నిపర్వత భస్మ మేఘాల్లో కరకైన కణాలుంటాయి. లక్షల టన్నుల ఆ కణాలు లోపలికి చొచ్చుకుపోయి విమానాల ఇంజన్లను చెడగొడతాయి. విమానయానం ప్రమాదకరమవుతుంది. 1982లో బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం ఇలానే భస్మ మేఘం గుండా వెళ్ళి 4 ఇంజన్లూ ఆగిపోయాయి. కష్టపడి పావుగంటలో పైలట్లు 3 ఇంజన్లను పునరుద్ధరించేసరికి జనం బతికిపోయారు. మునుపు 2010లో ఐస్ల్యాండ్లో ఓ అగ్నిపర్వతం కొద్ది నెలలు నిరంతరం విస్ఫోటనం చెంది, 11 కి.మీ.ల మేర బూడిదను విరజిమ్మింది. బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను ఈ భస్మ మేఘాలు తాకాయి. బ్రిటన్ 6 రోజులు వైమానిక మార్గాన్ని మూసేయాల్సి వచ్చింది. 95 వేల విమా నాలు రద్దయ్యాయి. యూరప్లో అనేక దేశాలు గగన తలాన్ని మూసేశాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద వైమానిక షట్డౌన్ అదే! రోజూ 12 లక్షల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. బ్రిటన్ 145 కోట్ల డాలర్లు నష్టపోయింది.గతిని మార్చేసిన గతం...అగ్నిపర్వత విస్ఫోటనాలంటే ఆషామాషీ కాదు. అవి మానవాళి చరిత్రనే మార్చేసిన ఘట్టాలున్నాయి. 1783 నాటి లకీ విస్ఫోటనంతో యూరప్లో వాన రాకడే మారింది. ఫ్రాన్స్లో ఆకలి మంటలు రేగి, ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసింది. ఆ తర్వాత మూడు దశాబ్దాలకు ఇండొనేసియాలోని తంబోరాలో విస్ఫో టనం యూరప్లో ఎడతెగని వానలు సహా కొన్నేళ్ళు ప్రపంచ పర్యావరణాన్నే మార్చేసింది. వర్షంతో చిత్తడిగా మారిన నేల వల్లే వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓటమి పాలయ్యారట. ఏమైనా, ఇప్పుడు హేలీ గబ్బి దెబ్బకు ఆఫ్రికాలోని అతి పెద్ద వైమానిక కేంద్రాల్లో ఒకటైన ఇథియో పియా సహా అనేక ఖండాల్లో విమాన సర్వీసులు ఇరుకున పడ్డాయి. 4 వేల కి.మీ.ల దూరంలో ఉన్న రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, పంజాబ్లకు ఈ ధూమం విస్తరించింది. విమాన సర్వీసులు అనేకం రద్దయ్యాయి. కొద్ది రోజుల్లో ఈ ధూళి తగ్గినా, ఆ మేఘాల్లోని హానికారక వాయువులతో జాగ్రత్త పడక తప్పదు. -
‘పరిష్కారం’ దారులు తెరవాలి!
ఏది సమస్య? ఏది పరిష్కారం? మధ్య భారతంలో ముఖ్యంగా అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగుతున్న వామపక్ష ఉద్యమాలు–తీవ్రవాదం, హింస –ప్రతిహింస విషయంలో ఇటీవలి పరిణా మాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. హింస ఆగటం లేదు, శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. మౌలిక సమస్యను పరిష్కరించకుండా జరిపే ప్రక్రియ అర్థంలేని గమ్యం వైపు సాగుతోందన్నది ఈ ఆందోళనకు కారణం. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన ‘హిడ్మా’ మరణానంతరం చర్చ తీవ్రస్థాయికి చేరింది.వచ్చే (2026) మార్చి మాసాంతానికి నక్సలైట్లను సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. హింస ఏదైనా హింసే! చావులు ఎటువైపున జరిగినా క్షోభ తప్ప దనేది జనాభిప్రాయం! కూంబింగ్ ఆపితే ఆయుధాలు వీడుతామనే కొత్త మాట మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి తాజాగా మొదలైంది. మధ్య భారతంలోని మూడు (ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర) రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు లేఖలు రాసినట్టు వార్తలొస్తున్నాయి.ఇదే అదనుగా, ఆయుధాల అంశం బెట్టు చేయ కుండా కేంద్రం చొరవ తీసుకోవాలి. చర్చలతో శాంతి సాధనకు యత్నిస్తూనే, నక్సలైట్ల ఎజెండా అంశాల్ని పరిష్కరించాలి. నక్సలైట్లు లేవనెత్తే సమస్యల్ని ‘సామాజికార్థికాంశం’గా చూడకుండా, ‘నక్స లైట్ల’నే శాంతిభద్రతల సమస్యగా ప్రభుత్వాలు పరిగణించడం వల్ల పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. ‘హిడ్మా’ ఎందుకు హీరో అయ్యాడు?వరుస ప్రభుత్వాల వైఫల్యం దృష్ట్యా సమస్యల పరిష్కారానికి ఆయన నిలబడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులను, సాయుధ బలగా లను, రాజ్యాన్ని ఎదిరించాడు. ఉద్యమం వల్ల లభించిన పుష్కల అవకాశాలతో ఇంటికో, తల్లికో, తనకో, తన వారికో ఏదీ చేసుకో కుండా ఆదివాసీల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన త్యాగానికి మరణానంతరమూ విశేష ఆదరణ లభించింది. ఇపుడు హిడ్మాను హతమార్చారు. రేపు మిగతా నక్సలైట్లను లొంగదీసు కోవడమో, చంపడమో చేస్తారు.అది, కొంత మేరకే సమాధానం. మౌలికమైన ప్రజల సమస్యకు పరిష్కారం కాదు. నక్షత్రాల స్థానాలు –కదలికల ఆధారంగా రూపొందించే పంచాంగాలను బట్టి ముహూ ర్తాలు, శకునాలు చెబుతారు. ఆవేశంతో ఎవరో పంచాంగాలు చింపేయడమో, కాల్చేయడమో చేసినంత మాత్రాన అంతా అయి పోతుందా? నక్షత్రాలుంటాయి కదా. అవి కదా మూలం! ఉద్యమకారుల్ని చంపేయడం, ఉద్యమాల్ని అణచివేయడం కాకుండా, ఉద్యమాలు తలెత్తడానికి కారణమవుతున్న మౌలికాంశాల్ని సరిదిద్దడం ద్వారా ఉద్రిక్తతల్ని, అశాంతిని నిర్మూలించాలి. ఇదే విషయాన్ని అత్యున్నత నిపుణుల కమిటీ 2008లోనే చెప్పింది.అజిత్ దోవల్ సభ్యుడే!మధ్య భారతంలోని ఛత్తీస్గఢ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు కలిసిన అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో వామపక్ష హింసను రూపుమాపి, అభివృద్ధికి దోహద పడాలంటే ఏం చేయాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం జరిపించింది. అశాంతి స్థానే శాంతి వెల్లివిరియాలంటే కేంద్రం, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనీ, నక్సలైట్ల నిర్మూలన మాత్రమే ఇందుకు పరిష్కారం కాదనీ ఈ నిపుణుల కమిటీ 2008లోనే నివేదించింది.నక్సలైట్ల హింసకు విరుగుడుగా స్థానిక ఆదివాసీ యువకులతో ‘ఎదురుదాడుల’ కోసం ప్రభుత్వ బలగాలు ఏర్పాటు చేసిన సాయుధ ‘సాల్వాజుడుం’ను 2011లో సుప్రీంకోర్టు నిషేధించడానికి మూడేళ్లు ముందరే, ‘ఆ వ్యూహం, అటువంటి ఆచరణ తప్పు’ అని ఈ కమిటీ నిర్ద్వంద్వంగా చెప్పింది. నివేదికను రూపొందించిన డ్రాఫ్టింగ్ సబ్ కమిటీలో తెలుగు వాడైన దివంగత హక్కుల కార్యకర్త, న్యాయవాది కె. బాలగోపాల్ కీలకపాత్ర పోషించారు.కేంద్ర ప్రణాళికా సంఘం 2006లో, డి. బంధోపాధ్యాయ (కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్) అధ్యక్షతన 16 మంది సభ్యులతో ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ‘అసంతృప్తి, అశాంతి, తీవ్రవాదం– అభివృద్ధికి అవరోధం’ అంశంపై అధ్య యనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. ‘నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి సవాళ్లు’ పేరిట ఇచ్చిన సుమారు 90 పేజీల నివేదిక ఇది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ప్రతిపాదనలతో, 20 పేజీల మేర ఇందులో ‘నిర్దిష్ట సిఫారసులు’న్నాయి. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ ‘జాతీయ భద్రతా సలహాదారు’ అజిత్ దోవల్ (మాజీ కేంద్ర నిఘా సంస్థ) ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ (పౌర స్పందన వేదిక కన్వీనర్), ఐపీఎస్లు సహా పలు ఇతర రంగాల వారు సభ్యులుగా ఉన్నారు.ఉద్యమాలకు తావీయొద్దు!అటవీ, అదివాసీ ప్రాంతాల్లో, బడుగు–బలహీనవర్గాల్లో ప్రజా సమస్యల్ని ప్రభుత్వమే పరిష్కరిస్తూ, జన బాహుళ్యంలోకి నక్సలైట్లు చొరబడే, వారి మద్దతు కూడగట్టే ఆస్కారం లేకుండా చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సూచించింది. దేశంలో వామపక్ష తీవ్ర వాదం ఒక దశలో, ‘ముఖాముఖి యుద్ధ’ పరిస్థితికి వెళ్లింది. యుద్ధంలో వలెనే, ఎవరికి వారు వ్యూహ–ప్రతివ్యూహాలతో ఎదుటి వారి బలహీనతల్ని సొమ్ముచేసుకునే ఎత్తుగడలూ పన్నారు. పాలనా వైఫల్యాలు, సంక్షేమాభివృద్ధి లేమి, హక్కుల హననం, సహజ వనరుల దోపిడీ వంటి పరిస్థితుల్ని సానుకూలంగా మలచుకొని నక్స లైట్లు ప్రజల మద్దతు కూడగట్టారు.కొన్నిచోట్ల ప్రభుత్వ సాయుధ బలగాలను మించి బలోపేతమయ్యారు. నక్సలైట్లలో గ్రూపులు, అనైక్యత, సిద్ధాంత క్షీణత, స్వార్థ–లంపెన్ శక్తుల ప్రవేశం... వంటి పరిస్థితుల్ని పోలీసు, మిలిటరీ, ప్యారా మిలిటరీ బలగాలు తమకు అనుకూలంగా మలచుకొని ఆధిపత్యం సాధించాయి. ఈ ఆధిపత్య పోరులో హింస పెరిగి, అశాంతి తీవ్రంగా ప్రబలింది. దీనిపై అధ్యయనం తర్వాత నిపుణుల కమిటీ అయిదు ఛాప్టర్లుగా నివేదిక ఇచ్చింది. ‘పెసా’, భూగరిష్ఠ పరిమితి వంటి ప్రస్తుత చట్టాల పకడ్బందీ అమలు, జీవనోపాధుల కల్పన, సాంఘిక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల లోపరహిత అమలు.. ‘సాల్వా జుడుం’ వంటి రాజ్యాంగేతర సాయుధ దళాలు కాకుండా రాజ్యం తన బాధ్యతను రాజ్యాంగ పరిధిలో నిర్వహించడం, మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుల్ని సత్వరం పరిష్కరించడం, పాలనను మానవీకరించి ఆదివాసీల సమస్యలు, ఫిర్యాదుల్ని ఎప్పటి కప్పుడు పరిష్కరించడం వంటి చర్యల్ని చేపట్టాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రజలకు దన్నుగా నక్సల్స్ చేస్తున్న పనుల్ని ప్రభు త్వమే ముందు చేసి వారికి జనహృదయాల్లో తావు లేకుండా చేయా లని కమిటీ సూచించింది. ఇవన్నీ చిత్తశుద్ధితో చేపడితే, అసమాన తలు కొంతైనా తొలగి ఉద్యమాలకు తావులేని వాతావరణం ఉంటుందని ప్రభుత్వాలు గ్రహించాలి.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్ -
చంద్రన్న దిగిపోవాలి.. జగనన్న రావాలి
వ్యవసాయం వద్దంటారు.. సేద్యం ముద్దంటారు. యూరియా వేస్తె క్యాన్సర్.. వరి వేస్తె షుగర్. ఓటుకు ముందోమాట.. గెలిచాక ఇంకోమాట.. ప్రపంచంలో మొత్తం. ఊసరవెల్లులు ఎన్ని రంగులు మారుస్తాయో చెప్పలేం కానీ రాజకీయ ఊసరవెల్లి చంద్రబాబు మాత్రం పూటకోమాట మారుస్తారు. రైతులతో అవసరం ఉంటే ఒకమాట.. గెలిచేందుకు వారి సాయం కావాలంటే ఒకమాట.. గెలిచాక ఇంకో మాట.. సేద్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేస్తున్న తరుణంలో ఇంకోమాట.. పంటలు గిట్టుబాటు ధర ఇవ్వలేనప్పుడు .. ప్రజలకు మొహం చూపలేని పరిస్థితుల్లో ఇంకోమాట.. రైతుల పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో వారికి సమాధానం ఇవ్వలేని తరుణంలో ఇంకోమాట.. ఇలా గంటగంటకూ మాటలు మారుస్తూ మాయలు చేసే చంద్రబాబు పాలనలో రైతులు నిలువునా మునిగిపోయారు. చేలకు పురుగుపడితే ఏదో మందు కొట్టి ఆపొచ్చు.. కానీ ప్రభుత్వమే పురుగులా మరి వ్యవసాయాన్ని తొలిచేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. .. కాపుగాయాల్సినవాళ్ళే కాల్చేస్తుంటే రైతు ఎవరికీ చెప్పుకుంటాడు.. యేమని చెప్పుకుంటాడు. వ్యవసాయం.. పంటలసాగుపై చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు..ప్రాజెక్టులు కడితే డబ్బులు దండగ.. ఐటీని ప్రమోట్ చేయాలి..వ్యవసాయం దండగ..వరి పండిచొద్దు.. బియ్యం తింటే డయాబెటిస్ వస్తుంది..ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి..యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది..ఎరువుల వినియోగం తగ్గించాలి.. దీని వల్ల భూసారం తగ్గుతోంది.. చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు, ఉండబోదు( మాట తడబాటు )..వ్యవసాయంలో ఉపాధి లేదు.. సేవా రంగమే భేష్వ్యవసాయం వల్ల ఆదాయం అంతంత మాత్రమే..1995-2004 (మొదటి ముఖ్యమంత్రి కాలం) వ్యవసాయం "భారం" (దండగ/శిక్ష) అని పేర్కొన్నారు. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. తన పాలనలో రైతులను ప్రాధాన్యత ఇవ్వలేదని తర్వాత (2012) అంగీకరించారు. రైతులకు 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లు కూడా చేయలేదు. 1999లో రైతుల ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వడం వల్ల మరిన్ని ఆత్మహత్యలు పెరుగుతాయని చంద్రబాబు కామెంట్ చేసారు. తన పుస్తకం మనసులో మాటలో (Manasulo Maata) ఈ వ్యాఖ్య ఉంది. 1995-2004 మధ్య 25,000 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శలున్నాయి. 2012, జనవరి 21 నెల్లూరు, కందుకూరులో TDP సభలో మాట్లాడిన చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో రైతులను "విస్మరించాను, తప్పు చేశాను" అని క్షమాపణ చెప్పారు..తిరిగి.. 2014, డిసెంబర్ 24న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు కేవలం కరువు కారణంగా కాదు, "ప్రేమ విషాదం, రుణాలు, కుటుంబ సమస్యలు" కారణం అన్నారు.. ఇది తీవ్ర విమర్శలకు కారణమైంది. 2025, సెప్టెంబర్ 15-16 న కేబినెట్ సమావేశంలో యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమయంలో యూరియా లభించక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో తన చేతగాని తనాన్ని తప్పించుకోవడానికి ఇలా మాట్లాడారు. 2025, నవంబర్ 12-13న "నీళ్లు ఉన్నందుకే వరి పండిస్తే, ఎవరూ మీ వరిని తినరు" అని చంద్రబాబు చెప్పారు. వరి పంటలకు బదులు ఇతర పంటలు పండించాలని సూచించారు.పైవన్నీ చంద్రబాబు నోటినుంచి వెలువడిన ముత్యాల మాటాలు కొన్ని మచ్చుకు. ఇక ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గెలిచాక మొక్కజొన్న, మామిడి.. అరటి.. పొగాకు.. మిర్చి రైతులు నిట్టనిలువునా మునిగిపోయారు. పండిద్దాం అంటే ఎరువులు దొరకవు.. పంటలు పండించాక అమ్ముదాం అంటే ధర దక్కదు.. ఆనాడు మామిడి రైతులు కిలో ఐదారు రూపాయలకు సైతం అమ్ముకోలేక వీధుల్లో పళ్ళను పారబోశారు.. నేడు అరటి రైతులు గెలలను పశువులకు వేస్తున్నారు.. అవి కూడా సయించక తినకపోవడంతో కొందరు రైతులు ఏకంగా అరటి తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం సాగదు .. రైతు ఏడ్చిన రాష్టం ముందుకు నడవదు అనే సామెత ఏపీలో అక్షరాలా నిజమవుతోంది. నేడు కిలో అరటి కాయలు అర్ధరూపాయికి అమ్మాలంటే కన్నీళ్లొస్తున్నాయంటూ రైతులు పొలం గట్టున కూర్చుని ఏడుస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కూడా అకాల వర్షాలకు అరటి పంటను నష్టపోయిన దాదాపు 670 మంది రైతులకు వైయస్ జగన్ హెక్టారుకు రూ. 20 వేలు చొప్పున సొంత డబ్బులు అందించి వారిని నిలబెట్టారు.. నాయకుడికి నయవంచకుడికి ఉన్న తేడాను వైఎస్ జగన్ తన మంచి మనసుతో చాటుకున్నారు.. ప్రజలకు కష్టం వస్తే జగనన్న.. ఆపద వస్తే జగనన్న.. కన్నీరొస్తే తుడవడానికి జగనన్న ఉండాలి.. ఆయనే రావాలి.. అదీ ప్రజల ప్రస్తుత పరిస్థితి..:::సిమ్మాదిరప్పన్న -
‘శ్రమదోపిడీ లేని భారత్’ కావాలి!
2026 మార్చ్ 31 నాటికి, ‘నక్సలిజం లేని భారత్ని ఏర్పాటు చేస్తాము’– అని, దేశ ప్రధానీ, హోమ్ మంత్రీ కూడా పదే పదే ప్రకటిస్తున్నారు. నక్సలైట్లు ‘లొంగే వరకూ, లేదా పట్టుబడేవరకూ, లేదా నిర్మూలనం అయ్యేవరకూ, తమ ప్రభుత్వం నిద్రపోదు’ అని కూడా ప్రక టించారు. అందుకోసం అనేక రకాల పేర్లతో, పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఆ పేర్లలో ఒకటి ‘కోబ్రా’ (నాగు బాము) దళం, ఇంకోటి ‘గ్రే హౌండ్స్’ (వేట కుక్కల) దళం. ‘గ్రే హౌండ్స్’ అనేవి ఒక జాతి కుక్కలు. ప్రాచీన ఈజిప్టులో, వేటల కెళ్ళినప్పుడు, జంతువుల్ని పట్టెయ్యడానికి, ఆ కుక్కల్ని ఉపయోగించేవారట!ఇప్పుడు, నక్సలైట్లని పట్టుకోవడానికి, పోలీసు దళాల్ని అదే పేరుతో ఏర్పాటు చేసి ఉపయోగిస్తున్నారు! నిన్న గాక మొన్న, ఈ పేరుగలిగిన పోలీసు దళం వాళ్ళే, ఆదివాసీల తరఫున పోరాడు తున్న నక్సలైట్ల నాయకుల్ని చాలా మందిని చంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చదివాక, నాకు వచ్చిన ఆలోచనలు కొన్ని ఇవి:పరస్పర శత్రుత్వం వెనక...(1) నేను తెలుగులో, 1978లో, పరిచయం చేసిన ‘అంకుల్ టామ్స్ కేబిన్’ (‘టామ్ మామ ఇల్లు’) అనే ఒక ఇంగ్లీషు నవలలో చదివిన ఒక ‘వ్యాపార ప్రకటన’ ఈ సందర్భంలోనే కాదు, ఎప్పుడూ గుర్తే వస్తుంది. అమెరికాలో, నీగ్రోల బానిసత్వం కొనసాగుతున్న కాలంలో, బానిసలుగా ఉండటం ఇష్టం లేని శ్రామికులు పారిపోతే, వారిని వెతికి పట్టుకోవడానికి, వారి యజమానులు నిజం వేట కుక్కల్ని వాడేవారు. వాటికి సంబంధించినదే ఆ వ్యాపార ప్రకటన! దాని హెడ్డింగు: ‘నీగ్రో కుక్కలు!’ ఆ ప్రకటనలో ఇలా వుంది:‘‘నగర వాసులందరికీ, ఈ క్రింద సంతకం చేసిన వ్యక్తి విన్నవించుకొనేదే మనగా– ‘నేను మన్రో రోడ్డులో తూర్పున రెండున్నరమైళ్ళ దూరాన నివసిస్తున్నాను. నా దగ్గిర, నీగ్రోల్ని పట్టుకోడానికి చాలా మంచి కుక్కలు ఉన్నాయి! పారిపోయిన నీగ్రోల్ని పట్టుకోవాలని కోరే వ్యక్తులు నాకు ఒక్క పిలుపు ఇస్తే చాలు. నేను వేటకెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాలలో నా నివాసంలోనే ఉంటాను. నేను లేక పోయినా, నా నివాసం దగ్గర నా సమాచారం మీకు అందుతుంది. నీగ్రోని పట్టుకున్న కుక్క కోసం– 25 డాలర్లు. నీగ్రోని పట్టుకోక పోతే 5 డాలర్లు మాత్రమే’. – ఇట్లు, గాఫ్. ఫిబ్రవరి 17, 1852.’’ – ఇదీ ఆ ప్రకటన!ఎంత ఆశ్చర్యం! అక్కడ, ఆ నాడు, 170 ఏళ్ళనాడు, స్వేచ్ఛ కోసం పారిపోయిన బానిసల్ని పట్టుకోవడానికి, ఆ నాటి బానిస యజమానులు వేటకుక్కల్ని ఉపయోగించారు. ఈనాడు, ఉద్యమ కారులు తప్పించుకుంటూ, ఉద్యమాన్ని నిలబెట్టుకోవడానికి, భద్రమైన స్థలాలకు వెళ్తూ వుంటే, ఈ ప్రభుత్వ పాలకులు, వేట కుక్కల పేరుతో వున్న పోలీసుల దళాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఆ పోలీసుల గురించి, కవి చెరబండరాజు, ఒక పాటలో ఇలా చెప్పాడు: ‘‘మాలోని మనిషివే! మా మనిషివే నీవు!/ పొట్ట కూటికి నీవు పోలీసువైనావు!’’ నిజానికి పోలీసులంటే ఎవరు? వారూ మానవులే! శ్రామిక కుటుంబాలనించీ వచ్చిన వారే! సైనికుల లాగే, యజమానులు ఆజ్ఞాపించే ‘బలప్రయోగం’ అనే శ్రమ చేస్తూ, వచ్చిన జీతాలతో బతుకుతారు.ఈ పోలీసుల గురించి, మార్క్స్ మాటల్లో చెప్పాలంటే, ‘‘తప్పుడు సామాజిక సంబంధాల కారణంగా దోపిడీ సమాజానికి అవసరమైన అనుత్పాదక శ్రామి కులు.’’ అంటే, ‘శ్రమ దోపిడీ’ అనే తప్పుడు సామాజిక సంబంధాల వల్లే, సమాజంలో వర్గాలూ, వర్గాల మధ్య ఘర్షణలూ తలెత్తు తాయి! వాటిని నివారించడానికీ, శ్రమ దోపిడీని సాఫీగా సాగ నివ్వడానికీ నిరంకుశ ప్రభుత్వాలు, సాయుధ భటులతో అణిచి వేయడం అన్నది బానిస యజమానుల కాలం నించీ వస్తున్నదే! ఆనాటి సాయుధ భటులకు బదులుగా ఈ నాడున్నది ‘పోలీసులు’! పత్రికల్లో, ఈ వార్తలు చదివే పాఠకులు గ్రహించ వలిసింది ఏమిటంటే: ఆ నాడైనా, ఈ నాడైనా, పాలకులు, ప్రజల్లోనే వున్న రెండు భాగాలను, (వృత్తి ధర్మం పేరుతో, ఇటు పోలీసులనూ; శాంతి భద్రతల పేరుతో, అటు శ్రమ దోపిడీని అడ్డుకునే నక్సలైటు ఉద్యమకారులనూ) శత్రువులుగా నిలబెట్టి, పరస్పరం సంఘర్షించు కునేలా చేస్తారు!ఆ సంఘర్షణలో, ప్రాణాలు పోగొట్టుకునేది ఇటు పోలీసులూ, అటు ఉద్యమకారులూనూ. ఇరు పక్షాల కుటుంబాలూ ఎంతో క్షోభని అనుభవిస్తాయి! బిరుదులతోనూ, ఎవార్డులతోనూ, రివార్డులతోనూ, ఆ క్షోభని తగ్గించలేరు! అందుచేత, సమాజం బాగుపడాలని కోరుకునే ఎవ్వరైనా అనుకోవలిసింది: ‘నక్సలిజం లేని భారత్ కాదు, శ్రమ దోపిడీ లేని భారత్’ కావాలి!– అని.విమర్శకు అతీతులా?(2) ‘మరి నక్సలైట్లు అనుసరించే రాజకీయ పంథాని విమర్శించవద్దా’ అని ఎవరైనా అడగవచ్చును. తప్పులున్నప్పుడు, తప్పకుండా విమర్శించవలిసిందే! ‘మావోయిస్టులూ! మీ అంతిమ లక్ష్యం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, మంచిదే! కానీ ఎన్నెన్నో పోరా టాల తర్వాత, తప్పనిసరిగా చెయ్యవలిసి వచ్చే ‘ఆయుధాల’ పోరా టాన్ని, ప్రారంభంలోనే మొదలు పెడితే, మీది ‘వామపక్ష బాలా రిష్టమే’ అవుతుంది – అని విమర్శించవలిసిందే! దీన్ని బట్టి రాజ కీయంగా, నక్సలైట్లు ఇంకా శైశవ దశలోనే వున్నారనుకోవాలి. ఒక హిందీ కవి శిశువుల గురించి ఇలా చెపుతాడు: ‘శిశువు పడుతూ, పడుతూ, నడవడం నేర్చుకున్నాడు! శిశువు ఏడుస్తూ, ఏడుస్తూ, నవ్వడం నేర్చుకున్నాడు!’ (‘శిశూ నే గిర్ గిర్ కర్, చల్నా సీఖా! రో రోకర్, హస్నా సీఖా!). భవిష్యత్తులో ఈ ఉద్యమకారులు కూడా శిశువుల లాగే నేర్చుకుంటారని ఆశించాలి.ఏం మారిందని?(3) ఇంకో వార్త! లొంగిపోకుండా తప్పించుకు తిరిగే ఉద్యమ కారులకు, వారి తలకి కొంత వెలకట్టి, వారిని పట్టిచ్చిన వారికి కొన్ని లక్షల బహుమతీ, ఒక ఉద్యోగమూ ఇస్తామని ప్రభుత్వ ప్రక టనలు కూడా వున్నాయి. (‘ది ఎకనామిక్ టైమ్స్’, 16–4–2024). ఇలాంటి ప్రకటనలు, అమెరికాలో బానిసత్వం వున్న రోజుల్లో (1619–1865), కూడా వున్నట్టు, ‘అంకుల్ టామ్స్ కేబిన్’ నవల చెపుతుంది. ఆ ప్రకటన హెడ్డింగు: ‘25 డాలర్ల బహుమానం!’ ప్రకటన ఇలా వుంది: ‘‘అక్టోబర్ 17న బానిస ఒకడు పారిపోయాడు.పేరు యాలెన్. వయస్సు 23 సం.లు. ఎత్తు 6 అడుగులు. రంగు ములాటో. కుక్క పీకిన మచ్చలుంటాయి. లావెల్ పాంటూ, కాటన్ షర్టూ ఒంటి మీద ఉన్నాయి. బాగా చదవలేడు. చిన్న చిన్న పదాలు రాస్తాడు. చిన్న చిన్న లెక్కలు చేస్తాడు. మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఉంటాడు. తొందరగా మాట్లాడుతాడు. జైల్లో పెట్టి, నాకు తెల్పండి. ఇట్లు – చీతం, నవంబరు 6, 1852.’’ అంటే, యజమానుల కోసం పనిచేసే ప్రభుత్వాల చర్యల్లో అప్పటికీ, ఇప్పటికీ ఏదైనా తేడా వుందా? ఎప్పుడో, 175 ఏళ్ళ నాడే, ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’లో చెప్పినట్టు, ‘‘ప్రభుత్వం అనేది, పెట్టు బడిదారీ వర్గపు ఉమ్మడి వ్యవహారాలను నిర్వహించే కమిటీ మాత్రమే!’’రంగనాయకమ్మ వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి -
ఓట్ల పర్యాటకాన్ని ఆపేయాలి!
బిహార్లో పేరు నమోదు చేయించుకుని అక్కడ ఓటు వేసేందుకు ఢిల్లీ, హరియాణా లాంటి రాష్ట్రాల నుంచి వేలాది ఓటర్లు తరలివెళ్లినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఢిల్లీ జాబితా నుంచి తన పేరు కొట్టేయించుకుని, బిహార్లో నమోదు చేసుకున్నారంటూ ఇందుకు ఉదాహరణగా మార్మోగింది. ఇది నిజ మైతే, ఇది చట్టవిరుద్ధమైన ఆచారం.మీ ‘సాధారణ నివాస స్థలం’ ఏదో అక్కడే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలి. భారత ఎన్నికల చట్టాలు ఈ విష యాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయి. మీ ఇల్లు, సొంతూరి మీద మీ ప్రేమ... ఇవేవీ ఓటు హక్కు పొందడానికి అర్హతలు కావు. మీరు వాస్తవంగా నివసిస్తున్న చోటు మాత్రమే మీ సాధారణ నివాసం అవుతుంది.సాధారణ నివాసమే ప్రాతిపదికప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 19 ప్రకారం, ఒక వ్యక్తికి తను ‘సాధారణ నివాసి’గా ఉన్న నియోజక వర్గంలో మాత్రమే ఓటరుగా నమోదు చేయించుకోవడానికి అర్హత ఉంటుంది. 17, 18 సెక్షన్లు మరో రెండు నిబంధనలను జత చేశాయి. మీరు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నమోదు కాలేరు. ఒకే నియోజకవర్గంలోనూ ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదు అయ్యే వీల్లేదు. ఈ రెండు నిబంధనలూ మార్చడానికి వీల్లేనివి (నాన్–నెగోషియబుల్). ‘సాధారణ నివాసి’ అంటే ఏమిటో సెక్షన్ 20 వివరిస్తుంది. సొంత ఆస్తి ఉన్నంత మాత్రాన ఒక ప్రదేశంలో సాధారణ నివాసి కాలేరని ఇది స్పష్టం చేస్తోంది. సాధారణ నివాసం అనేది వాస్తవ ఆధారితంగా ఉంటుంది. నిరంతరం అక్కడే ఉంటున్నారా, లేదా అన్నది ప్రధానం అంటే, మీరు స్వతహాగా అక్కడ ఉంటారు, మున్ముందు కూడా అక్కడే ఉండాలనుకుంటారు. తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నా నివాస హోదా మారదు. చివరిగా, మార్పులు చేర్పులకు సంబంధించి ఏవి తప్పుడు ప్రకటనలు అవుతాయో సెక్షన్ 31 చెబుతోంది.కొత్త ప్రాంతంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వేరే చోట అప్పటికే తన పేరు నమోదై ఉన్నదనే వాస్తవం దాచిపెట్టడం క్రిమినల్ నేరం. దీనికి ఏడాది వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే వీలుంది. పని నిమిత్తమో, పర్యటనల నిమిత్తమో వేరే ప్రదేశానికి వెళ్లి తాత్కాలికంగా చిరునామాలో లేనంత మాత్రాన అక్కడి ఓటు హక్కు పోదు. అది కొన్ని వారాలు లేనందున పోయేదీ కాదు, పోలింగ్ ముందు అక్కడకు రాగానే వచ్చేదీ కాదు! ఆరు నెలల వ్యవధిని సాధారణ నివాసం కింద భారత ఎన్నికల సంఘం పరిగణిస్తుంది.వ్యూహాత్మక తరలింపులను ఆపాలి!ఓటర్లను బస్సుల్లో తరలించి వలస వెళ్లిన వారంటూ వారి పేర్లను జాబితాల్లో నమోదు చేయడం, తర్వాత ఢిల్లీ లేదా హరి యాణాలో మళ్లీ నమోదు చేయించాలని ప్లాన్ చేయడం ప్రజా ప్రాతి నిధ్యాన్ని పక్కదారి పట్టించడమే! ఆ ప్రాంతంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, నీటి సరఫరా, రోడ్లు, పోలీసు వ్యవస్థలను వినియో గించుకునే సాధారణ నివాసుల అభిమతం నియోజకవర్గ ప్రాతి నిధ్యంలో ప్రతిబింబిస్తుందని రాజ్యాంగం తలుస్తోంది. జరుగుతున్న ఈ తరలింపుల ప్రహసనం అందుకు భిన్నం.వాస్తవంగా వలస వెళ్లిన కార్మికుల, విద్యార్థుల ఓట్ల నమోదును కష్టతరం చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు చేయ వలసిందల్లా నిజమైన వలసల నుంచి వ్యూహాత్మక తరలింపులను వేరు చేయాలి. ఈ దిశగా అనుసరించదగిన అయిదు మార్గాలు: (1) నోటీసు ఇచ్చి విచారణ జరిపిన తర్వాత ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో సాధారణ నివాసం ఉండటం లేదని తేలితే ఆ వ్యక్తి పేరు జాబితా నుంచి తొలగించడానికి చట్టం ఇప్పటికే వీలు కల్పిస్తోంది. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇరుగు పొరుగువారి ప్రకటనలను తప్పనిసరిగా రికార్డ్ చేయాలి. ఇంట్లో ఉంటున్నదీ లేనిదీ ధ్రువీకరించాలి. సంతకం చేసి నివేదికలు సమ ర్పించాలి. ఈఆర్ఓలు ప్రతి కేసుపై దృష్టి సారించాలి.(2) క్రాస్–స్టేట్ డూప్లికేషన్ నివారణ: వేరొక రాష్ట్ర ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్న వ్యక్తుల నుంచి వచ్చే ఫారం6 దరఖాస్తులను ఆటోమేటిక్గా గుర్తించేట్లు ఈఆర్ఓ–నెట్లో తగు ఏర్పాట్లు ఉండాలి. అటువంటి అభ్యర్థనల్ని ఆమోదించే ముందు గట్టి రుజువులు (ఇటీవలి అద్దె ఒప్పందాలు, ఉపాధి/విద్య సర్టిఫి కెట్లు, యుటిలిటీ బిల్లులు) తీసుకోవాలి.(3) నేర నిరోధకత: తెలిసీ తప్పుడు ప్రకటన (‘‘నేను మరె క్కడా నమోదు కాలేదు’’) చేస్తూ ఫారమ్ 6ను దాఖలు చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం నేరం. వేళ్ల సంఖ్యలో కేసులు ఎంపిక చేసి కఠిన శిక్షలు పడేట్లు చేస్తే, అవే వేలాది హెచ్చ రికలుగా పని చేస్తాయి. లక్ష్యం సామూహిక శిక్ష కాదు, ఉద్దేశ పూర్వకంగా తప్పుదారి పట్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజెప్పడం!(4) ఎన్నికల అనంతరం ఆడిటింగ్: పోలింగ్ అనంతరం మూడు నెలలు గడిచాక, సున్నిత ప్రాంతాలలో ‘కొత్త ఓటర్ల‘శాంపిల్ తీసుకుని విశ్లేషించాలి. వారిలో చాలా మంది సంబంధిత ప్రాంతంలో ఎప్పుడూ లేరని తేలితే అది చర్య తీసుకోదగిన సాక్ష్యం అవుతుంది. (5) నిజమైన వలసదారుకు రక్షణ: పేదలు, నిజంగా నివా సాలు మారేవారు, వేరే ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉండేవారు తమకు అందుబాటులో ఉండే పత్రాల ద్వారా తమ ఓటు నమోదు చేయించుకోవడాన్ని సులభతరం చేయాలి. బీఎల్ఓ నిర్ధారించిన స్వీయ ధ్రువీకరణ నివాస పత్రం, యజమాని లేదా సంస్థ ఇచ్చే ధ్రువీకరణ పత్రం వంటి వాటిని అంగీకరించాలి. చివరి మాటవిస్తృత చర్చకు దారితీసిన ప్రొఫెసర్ మాటేమిటి? అతడు నిజంగా ఢిల్లీలో సాధారణ నివాసం ఉండకుండా బిహార్కు వెళ్లి అక్కడే వాస్తవంగా నివసిస్తూ ఉంటే, బిహార్లో అతడి ఓటు హక్కు నమోదు చట్టబద్ధమైనదే. అయితే, అది ఢిల్లీలో తొలగించబడి ఉండాలి. నివాసం మార్చకుండా, ఢిల్లీ జాబితాలో పేరు కొట్టేయించుకుని, బిహార్లో ఓటు వేయడానికి అక్కడ నమోదు చేసుకుని ఉంటే, తర్వాత ఢిల్లీ ఓటరుగా మళ్లీ నమోదు చేయించుకోవాలని ప్లాన్ చేస్తే తీవ్ర చర్యలు తీసుకోవాలి. రూల్ ఒక చిన్న వాక్యంగా చెప్పగలిగినంత సరళమైనది.మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు వేయండి. మీ తాత ముత్తాతల ఇల్లు తాళం పడిన చోట కాదు! మీ పార్టీ మిమ్మల్ని ఒక వారం పాటు ఉండమని కోరుకున్న చోట కాదు!! పోలింగ్ రోజున సుఖప్రదంగా ఉండే చోట కాదు!! సాధారణ నివాసం అనేది ఆఖరికి విద్యార్థులు, సీజనల్ కార్మికులు, నిరాశ్రయులకు కూడా ఓటరుగా నమోదు చేసుకునే వీలు కల్పిస్తుంది. ఎన్నికల ‘పర్యాటకం’ ఎప్పటికీ మంచి ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి పర్యాటకానికి ద్వారాలు మూసేయాలి.ఎస్.వై. ఖురేషి వ్యాసకర్త కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ -
ఎన్కౌంటర్ లేవనెత్తుతున్న ప్రశ్నలు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరొక నలుగురు సహచరులతో సహా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జి మామిడి వలస దగ్గర అడవుల్లో నవంబర్ 18న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారని పోలీ సులు ప్రకటించారు. ఉద్యమ జీవితంలో హిడ్మా కార్యకలాపాలపై చర్చ జరుగు తున్నది. హిడ్మా అంతంతో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కొన్ని సామా జిక పరిణామాలకు అంతం ఉండదు. ఒక రూపంలో అంతమైనదను కున్నది మరొక రూపంలో ప్రారంభమవుతుంది. ఒక అంతం అనేక ప్రశ్నలను లేవనెత్తి కొత్త ప్రారంభాలకు దారి తీస్తుంది. ఉద్దేశపూర్వక హత్యమొట్టమొదటి ప్రశ్న. అది నిజమైన ఎన్కౌంటరేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో 1969లో మొదలైన ఎన్కౌంటర్ కథనాల్లో నూటికి తొంభైæ అబద్ధాలని ఇప్పటికే సమాజానికి తేటతెల్లమ యింది. ఎన్కౌంటర్ అంటే అనుకోకుండా ఎదురుపడటం అనే భాషాపరమైన అర్థాన్ని తలకిందులు చేసి, పట్టుకొని ఉద్దేశపూర్వ కంగా చంపడం అనే అర్థాన్ని పోలీసులు స్థిరపరిచారు. ‘ఎన్కౌంటర్ చేస్తాం’ అని పోలీసులే అనడం, కొన్ని సందర్భాలలో బాధితులు కూడా ‘నేరస్థులను’ ఎన్కౌంటర్ చేయమని కోరడం చూస్తే ఆ మాట సంతరించుకున్న కొత్త అర్థం స్పష్టమవుతుంది.ఛత్తీస్గఢ్లో 2024 జనవరి 1న మొదలై వరుసగా కొనసాగు తున్న మావోయిస్టు నిర్మూలనా కార్యక్రమం నుంచి తప్పించుకోవ డానికి, లేదా ఆరోగ్య కారణాల కోసం కొందరు మావోయిస్టులు ఇతర చోట్ల తలదాచుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో విజయ వాడతో సహా కొన్ని పట్టణాలలో పెద్ద ఎత్తున మావోయిస్టుల అరెస్టులు జరిగాయి. అందులో భాగంగానే హిడ్మానూ, ఇతరులనూ పట్టుకుని, వారిని రెండు విడతలుగా కాల్చి చంపారని బలమైన అనుమానాలున్నాయి.‘హిడ్మా లొంగిపోయినా వదలం, చంపుతాం’ అని ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు గతంలో అన్నారు. కేంద్ర, రాష్ట్ర హోమ్ మంత్రులు, పోలీసు అధికారులు హిడ్మా పేరు పెట్టి మరీ హెచ్చ రికలు జారీ చేశారు. ఎన్నో హింసాత్మక ఘటనలు స్వయంగా హిడ్మా తన చేతులతో జరిపినట్టు కథనాలు ప్రచారంలో పెట్టారు. వ్యవస్థ మార్పునకు సాయుధ పోరాటం అనివార్యమనే విశ్వాసంతో, దీర్ఘ కాలిక ప్రజాయుద్ధం జరుపుతున్న, సమష్టి నిర్ణయాలతో నడిచే ఒక పార్టీ నాయకత్వంలో జరిగిన ఘటనలను అలా ఒక వ్యక్తికి కుదించడం, ఆ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడానికి, ఎప్పుడైనా భవి ష్యత్తులో ఆయనను చంపితే సమర్థన సమకూర్చుకోవడానికి మాత్రమే! అందువల్ల హిడ్మాది నిజమైన ఎన్కౌంటర్ కన్నా ఎక్కు వగా ఉద్దేశపూర్వక హత్య కావడానికే అవకాశం ఉంది. దేశ ప్రజల సమస్యరెండో ప్రశ్న. మరి అలా పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా? ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే, ప్రత్యేకించి అందులోని అధికరణం 21 పేర్కొన్న జీవించే స్వేచ్ఛ పట్ల గౌరవం ఉంటే ఆ అధికారం ఉండదు. చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరొక రకంగా మనిషి ప్రాణాలు తీసే హక్కు రాజ్యానికి లేదని, పౌరులందరికీ జీవించే హక్కు ఉందని చెప్పే ఆ అధికరణాన్ని ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఉల్లంఘి స్తూనే ఉన్నాయి. చట్టం నిర్దేశించిన పద్ధతి అంటే సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో విచారణ జరిపి, సహేతుకమైన సందేహాలకు తావులేని రీతిలో శిక్ష విధించడం. ఇక్కడ సాక్ష్యాధారాలు లేవు, విచా రణ లేదు, సహేతుకమైన సందేహాలు లెక్కలేనన్ని ఉన్నాయి. శిక్ష, అదీ తిరిగి మార్చడానికి వీలులేని మరణశిక్ష మాత్రం అమలైంది.మూడో ప్రశ్న. హిడ్మా మీద ప్రత్యేకంగా, ఆదివాసుల మీద మొత్తంగా ఈ దాడి ఎందుకు? సుక్మా జిల్లా మారుమూల గ్రామం పువ్వర్తిలో పుట్టి పెరిగిన ఆదివాసి యువకుడు హిడ్మా మీద ఎక్కు పెట్టిన ఈ దాడి, గతం నుంచీ ఆదివాసుల మీద మొత్తంగా సాగు తున్న దాడులలో భాగమే. దండకారణ్య ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న అపార ఖనిజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే పథకంలో భాగంగా, పాలకులు ఆదివాసులను భయోత్పాతంలో ముంచి, వారి ఆవాసాల నుంచి బేదఖలు చేయదలచు కున్నారు. ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులను నిర్మూలించి, అడవిలో, కొండల్లో ఉన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహం రెండు మూడు దశాబ్దాలుగా సాగుతున్నది. దానికి అడ్డుగా ఉన్నారనే హిడ్మాను, జల్ జంగల్ జమీన్ ఆకాంక్షను, విప్లవోద్య మాన్ని నిర్మూలించదలచారు. అంటే ఇది ఆదివాసుల సమస్యో, మావోయిస్టుల సమస్యో కాదు, ఈ దేశ ప్రజల సమస్య, ఈ దేశ భవిష్యత్తు సమస్య. పోరాట ధార ఆగేదా?నాలుగో ప్రశ్న. హిడ్మా విషయంలో ప్రభుత్వ ప్రచారం గెలి చిందా, ఓడిందా? హిడ్మాను ఎంత భయంకరుడిగా చూపడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వచ్చినా, ఆయన హత్య తర్వాత వెల్లు వెత్తుతున్న నిరసన, పువ్వర్తిలో ఆయన అంత్యక్రియలకు వేలాది మంది హాజరై ఘన నివాళి అర్పించడం ఆయన ఆదివాసుల హృద యాల్లో ఎటువంటి స్థానం సంపాదించాడో చూపుతున్నది. ఆదివా సుల గూడాలు తగుల బెడుతూ, విచ్చలవిడిగా హత్యలు, అత్యాచా రాలు చేసిన సాల్వా జుడుమ్ దుర్మార్గాన్ని క్రియాశీలంగా ఎదు ర్కొన్న నాయకులలో ఒకరుగా ఆదివాసులలో ఆయనకు చెరగని స్థానం ఉంది. దాదాపుగా అన్ని ఆదివాసీ సమూహాల భాషలూ ధారాళంగా మాట్లాడుతూ వారికి తలలో నాలుక అయ్యాడు గనుక ఆయన పట్ల అపార గౌరవం ఉంది.ఐదో ప్రశ్న. హిడ్మా అంతంతో ఉద్యమం అంతమవుతుందా? ఆదివాసులకు నవంబర్ 18 వరకూ సజీవంగా నాయకత్వం వహించిన మాడ్వి హిడ్మా, ఆనాటి నుంచీ వందలాది ఆదివాసీ అమర పోరాట యోధుల చారిత్రక జాబితాలో చేరాడు. కానూ, సిద్ధూ, వీరనారాయణ సింగ్, బిర్సా ముండా, తిలక్ మాంఝీ, రాంజీ గోండు, గుండాధుర్, కొమురం భీమ్ వంటి ఉత్తేజకర, స్ఫూర్తి దాయక జాబితా అది. వాళ్లకు, వాళ్ల స్ఫూర్తికి మరణం లేదు. మొదట బ్రిటిష్ వలసవాదుల మీద, మైదాన ప్రాంతాల దోపిడీదారుల మీద, భూస్వాముల మీద, ఆ తర్వాత ‘అభివృద్ధి’ పేరుతో జల్ జంగల్ జమీన్ కొల్లగొట్టి తమను నిర్వాసితులను చేసిన ప్రభుత్వాల మీద ఆదివాసుల పోరాటాలు మూడు శతాబ్దాలుగా జరుగుతున్నాయి. దోపిడీ, పీడనలు ఉన్నంతవరకూ ఆ పోరాట ధారకు అంతం ఉండదు. ఎన్. వేణుగోపాల్వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు – ‘వీక్షణం’ ఎడిటర్ -
నితీశ్ కుమార్ (బిహార్ సీఎం) రాయని డైరీ
ఈ ప్రాణబంధం ఏమిటో అర్థం కాకుండా ఉంది. 74 ఏళ్ల వయసులో 10వ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా, నా 26వ ఏట తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన రోజు నాలో ఉన్నప్పటి ఆ కొత్త లోతైన ఆనందపు అనుభూతే నేటికీ పరవళ్లు తొక్కుతూ ఉంది! ఆ మాటే విజయ్ చౌధరీతో అన్నాను.‘‘పరవళ్లు తొక్కటం మంచి విషయం నితీశ్జీ. అయితే, ఆ పరవళ్లు పక్కనున్న వాళ్ల కాళ్లను తొక్కేస్తున్నాయేమో కాస్త గమనించుకుంటూ ఉండాలి’’ అన్నారాయన, నవ్వుతూ. ‘‘అయ్యో, సారీ విజయ్! మీ కాలును తొక్కేశానా?’’ అన్నాను నవ్వుతూ.‘‘లేదు నితీశ్జీ, మీరు నా కాలును తొక్కలేదు. గాంధీ మైదాన్ వేదిక పైన మీ పక్కనున్న మోదీజీ కాలును తొక్కినంత పని చేశారు! మీకై మీరు మీ చేత్తో ఆయన చేతిని గాల్లోకి లేపకుండా, ఆయనకై ఆయనే ఆయన చేత్తో మీ చేతిని గాల్లోకి లేపేవరకు మీరు ఆగవలసింది’’ అన్నారు విజయ్.మోదీజీ చేతిని పట్టుకుని బలవంతంగా పైకెత్తటం అంటే మోదీజీ కాలును చూసు కోకుండా తొక్కేయటమేనని ఆయన బలంగా విశ్వసిస్తున్నట్లు నాకు అర్థమైంది.వయసులో ఏడేళ్లు చిన్నవాడే అయినా, సూక్ష్మాన్ని పట్టుకోవటంలో నా కంటే పెద్దవాడు విజయ్ కుమార్ చౌధరీ. పార్టీలో విజయ్ నా సన్నిహితుడు, మంత్రి వర్గ సహచరుడు. విజయ్లాగే రామచంద్ర ప్రసాద్ సింగ్ అనే మరొక సన్నిహితుడు కూడా ఉండేవారు. ఆయన నా ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా! ఇప్పుడు లేరు.విజయ్ నాకు లెఫ్ట్లో ఉంటే, రామచంద్ర నాకు రైట్లో ఉండేవారు. రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రి పదవి కోసం రామచంద్ర రైటిస్టుగా మారి, బీజేపీలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి కూడా వెళ్లిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ సొంత పార్టీని కూడా తీసుకెళ్లి ప్రశాంత్ కిశోర్ పార్టీలో కలిపేసుకున్నారు. చివరికి ఆయన ఏమయ్యారో తెలీదు! లెఫ్ట్–వింగ్లోని వాళ్లు రైట్–వింగ్లోకి వెళ్లటంలో తప్పేమీ లేదు. కానీ, రైట్ టైమ్లో వెళ్లాలి. రైట్ టైమ్లో వెనక్కి వచ్చేయాలి. అది తెలుసుకున్నట్లు లేరు రామచంద్ర. తొలిసారి నేను 2000లో ఎన్డీయేతో కలిశాను. మాటా మాటా వచ్చి, ఏడు రోజుల తర్వాత ఎన్డీయేలోంచి వచ్చేశాను. రెండోసారి 2005లో ఎన్డీయేలోకి వెళ్లాను. 2013లో ఎన్డీయే నుంచి బయటికి వచ్చాను. 2017లో మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లాను. తిరిగి 2022లో ఎన్డీయేలోంచి వచ్చేశాను. 2024లో మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లాను.అవసరమైతే ఇప్పటికిప్పుడైనా, ఎన్డీయేలోంచి బయటికి వచ్చేయగలను నేను. ప్రజల కోసం ఎన్నిసార్లైనా వెళ్లి, ఎన్నిసార్లైనా వెనక్కు వచ్చేయాల్సిందే. ఎంత మందితో ఎన్ని మాటలైనా అనిపించుకోవలసిందే!శరద్ యాదవ్ నన్ను ‘ఫాల్తూ’ మనిషి అనేవారు. లాలూజీ నన్ను ‘పల్టూ రామ్’ అని అంటుంటారు. మీడియా నన్ను ‘సుశాసన్ బాబు’ అంటుంది. ఈ పేర్లేవీ నన్ను పైనుంచి పడేసేవీ, రథమెక్కించి ఊరేగించేవీ కాదు. ప్రజా జీవితం ఒక పేరుతో ముగిసిపోయేదీ, ఒక టెర్మ్తో తీరిపోయేదీ కాదు.‘నితీశ్జీ... కేబినెట్లో ఉప ముఖ్యమంత్రులు ఇద్దరే ఎందుకు ఉండాలి? నలుగురు ఉండొచ్చు కదా అని మనవాళ్లు అడుగు తున్నారు’’ అన్నారు విజయ్. ఇప్పుడున్న ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్లు. జేడీయు నుంచి కూడా ఇద్దరు ఉండాలని పట్టుబడితే... ‘మొత్తం నలుగురూ మీవాళ్లనే ఉప ముఖ్యమంత్రులుగా ఉండ నివ్వండి. సీఎం పోస్టు ఒక్కటీ మాకు ఇవ్వండి’ అని మోదీజీ అనొచ్చు. బీజేపీకి వచ్చినవి 89. జేడీయూకు వచ్చినవి 85.ఇరవై ఏళ్లుగా బిహార్లో బీజేపీ పవర్లో లేదు. ఇరవై ఏళ్లుగా బిహార్లో బీజేపీ లేకుండా పవరూ లేదు! ‘‘ఇప్పుడు కాదులే విజయ్’’ అన్నాను.‘మరెప్పుడు?’ అన్నట్లేం చూడలేదు విజయ్.-మాధవ్ శింగరాజు -
అడవిలోకి రానురానంటూ మొరాయింపు
ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారని అంటారు. బిర్యానీ రుచిమరిగాక ముక్క లేకపోతె ముద్ద దిగనివాళ్లుంటారు. రోజూ పెగ్గు లేకుంటే నిద్రపట్టని బాబులు ఎందరో! చాకోలెట్లకు అలవాటు పడి .. అది ఇస్తే తప్ప బడికి వెళ్ళను అని మొరాయించిన స్కూలు పిల్లలు కోకొల్లలు.. చెరువుగట్టున కుప్పలుగా దొరికే చేపలకు అలవాటు పడి ఇంకోచోటుకు కదలని కొంగలు కూడా కుప్పలు తెప్పలు.. ఇదంతా ఒకెత్తు. అడవిలో ఠీవీగా నడుస్తూ అమాయకంగా కదిలే జింకలు, లేడి పిల్లలను ఒక్క జంపింగుతో పట్టుకుని తుప్పల్లోకి ఈడ్చుకెళ్లే చిరుతలు ఇప్పుడు బద్ధకిష్టులుగా మారిపోయాయి. ఒళ్ళు విరుచుకుని ‘‘అబ్బా మటన్ వద్దమ్మా.. నాకు నచ్చడం లేదు’’ అని వెక్కి రిస్తున్నాయి. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుగా మారాయి. మాంసం వద్దు.. తియ్యని చెరుకు గడలు ముద్దు అంటూ చేరుకుతోటల్లో అల్లరి చేస్తున్నాయి. ఎలా వచ్చాయో.. ఎక్కణ్ణుంచి వచ్చాయో కానీ అడవుల్లోంచి దారితప్పిన కొన్ని చిరుతలు(డజనుకు పైనే ఉన్నాయి) పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఊళ్లలోకి వచ్చేసాయి. అక్కడి చెరకు తోటల్లో తిష్టవేసి మెల్లగా చెరకు తీపి రుచిమరిగాయి. రోజూ చెరుకుగడలు తింటూ అదే తోటల్లో నివాసం ఉంటూ. ఇక అడవుల్లోకి పోవడం ఎందుకు.. ఇక్కడే ఉందాం.. చెరుకు తిందాం అనే స్థితికి వచ్చేశాయి. కొన్నాళ్లుగా వేటను సైతం మర్చిపోయిన ఈ చిరుతలు ఇంకా చెంతకు తోటల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వీటిని మళ్ళీ అడవుల్లోకి పంపడానికి ఫారెస్ట్ అధికారులు తిప్పలు పడుతూ.. ఏదోలా పట్టుకుని ఇక ఇవి అడవికి పనికిరావని నిర్ధారించుకుని జూ పార్కులకు తరలిస్తున్నారు. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుటైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, బీజ్నోర్ నుంచి హరిద్వార్ వరకూ ఉన్న చెరుకు పొలాలు చిరుతల శాశ్వత ఆశ్రయాలుగా మారిపోయాయి. గత నాలుగేళ్లలో బీజ్నోర్లో పట్టుబడ్డ వాటిల్లో 40 చిరుతలను తిరిగి అడవుల్లోకి పంపలేక అక్కడే వదిలేశారు. ఉత్తరాఖండ్లో 2021 తర్వాత 96 చిరుతలను రక్షించారు. వాస్తవానికి ఈ చిరుతలు ఫారెస్ట్ అధికారులు ఏదోలా పట్టుకుని రికార్డు ఉంది. రాజాజీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచినా, రేడియో కాలర్లు పెట్టిన చిరుతలు మళ్లీ 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి అదే చెరుకు పొలాలకు తిరిగి చేరుతున్నాయి.ఒకప్పుడు అడవుల్లో.. చిత్తడి నేలల్లో కనిపించే చిరుతల పాదముద్రలు ఇప్పుడు పొలాల్లో కనిపిస్తున్నాయి. ఏళ్ళ తరబడి చెరకు తినడం.. వేటను మర్చిపోవడంతో ఇప్పుడు చిరుతలు ఒబేసిటీతో ఉన్నాయని అధికారులు అంటున్నారు. చిరుతల నడుము వెడల్పైపోవడం, వేట చేయకపోవడంతో గోళ్లు పదును కోల్పోవడం, వాటిలో వేట స్వభావం మందగించడాం వంటివి అధికారులు గుర్తించారు.చిరుతలు తరుముతున్న పులులువాస్తవానికి పులి తానూ తిరుగాడే అటవీ ప్రాంతంలో వేరే క్రూరజీవిని ఉండనివ్వదు. ఇక రాజాజీ, అమంగఢ్ వంటి రిజర్వుల్లో పెరుగుతున్న పులుల జనాభా చిరుతలను అడవుల నుంచి బయటకు గెంటేస్తోంది. అమంగఢ్లో పులుల సంఖ్య పదేళ్లలోనే 12 నుంచి 34కి పెరిగింది. ఈ పెరుగుదల చిరుతలు అక్కణ్ణుంచి వేరేచోటకు వెళ్లిపోవడానికి కారణమైంది.చెరుకుతోటలు ఎందుకు మేలంటే?చిరుతలు తిరుగుతున్నా శబ్దం బయటకు వినిపించదు. అదక్కడ ఉన్నట్లు ఎవరికీ కనిపించదు. జనావాసాలకు దూరంగా పొలాల్లో సురక్షితమైన ఆవాసం దొరికినట్లు చిరుతలు భావించడం.. నిత్యం తినడానికి తియ్యని చెరకు గడలు లభిస్తుండడం వలన చిరుతలు వాటికి అలవాటుపడిపోయి ఇక అక్కణ్ణుంచి కదలడం లేదు. ఇక 2023 జనవరి నుంచి ఇప్పటివరకు, బీజ్నోర్ జిల్లాలో మాత్రమే 35 మంది చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలావరకు ఘటనలు ఊళ్లలో.. చెరకు పొలాల్లో ఈ చిరుత దాడులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 80 గ్రామాలను “అత్యంత ప్రమాదకర ప్రాంతాలు”గా గుర్తించారు. అంతేకాకుండా నిత్యం చెరకు తినడం.. అక్కడే నివాసం ఉండడంతో వాటి బరువు కూడా దాదాపు 85 కిలోలకు చేరుకుందని మాజీ బీజ్నోర్ DFO సలీల్ శుక్లా అన్నారు. .. వాటిని అడవుల్లో వదిలేస్తున్నా.. మళ్ళీ వచ్చేస్తున్నాయని అయన అన్నారు..:::సిమ్మాదిరప్పన్న -
శాస్త్ర స్వతంత్రతకు గొడ్డలిపెట్టు
నూరేళ్ల కింద పి.సి.మహాలనోబిస్ స్థాపించిన ఐఎస్ఐని కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. సంస్థ ప్రెసిడెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది. ఇది వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే.దేశ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో అనూహ్యమైన, విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీజే అబ్దుల్ కలామ్ లాంటి శాస్త్రవేత్తను తమ ‘ఫెలో’గా చేర్చుకునేందుకు నిరాకరించిన జాతీయ సైన్స్ అకాడమీ ఇప్పుడు పారిశ్రా మిక వేత్త ముకేశ్ అంబానీకి ఆ హోదా కల్పించింది. ఇప్పటివరకూ ఈ సభ్యత్వం విద్య, పరిశోధన రంగాల్లో అద్భుత మైన రాణింపు ఉన్న వారికి మాత్రమే దక్కేది.ఢిల్లీలోని ఓ అగ్రశ్రేణి సంస్థ ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేక పోయినా కేవలం అక్కడి ప్రభుత్వ కోరిక తీర్చేందుకు వాయు కాలు ష్యాన్ని తగ్గిస్తామన్న మిషతో కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేసింది. వనరులు లేకపోవడం కారణంగా సైకిల్పై రాకెట్లు మోసు కెళ్లారని దేశ అంతరిక్ష రంగానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ని ఓ కేంద్ర మంత్రి అగౌరవపరిచారు. ఎందుకు? అంత రిక్ష రంగంలో సాధించిన ఘనతలన్నింటికీ 2014 తరువాత మోదీ ప్రభుత్వం అందించిన సహకారమే కారణమన్న వాదనకు బలం చేకూర్చేందుకు! ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివని అనిపించవచ్చు గానీ... శాస్త్ర పరిశోధన సంస్థలు ఒక్కటొక్కటిగా తమ స్వతంత్రతను కోల్పోతున్నాయనేందుకు మచ్చుతునకలు. కొన్నింటిని బలవంతంగా లొంగదీసుకుంటే... మిగిలినవి స్వచ్ఛందంగా చేతులెత్తేశాయి.ప్రధాని మాటనే కాదన్న ఇస్రోప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాన్ని కూడా కాదనే ధైర్యం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కనబరచడం గతకాలపు మాట గానే మిగిలిపోనుంది. 1980లో సోవియట్ యూనియన్ ప్రయోగంలో భారతీయ వ్యోమగామిని భాగం చేయాలని ఇందిర కోరితే, ‘ఇస్రో’ దాన్ని తన బలమైన వాదనతో తిరస్కరించింది. ధిక్కారం కాదది. దేశ ప్రజలకు మరింత ఎక్కువ ఉపయోగపడే ఉపగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నందున మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు వనరులను ఖర్చు చేయలేమని చెప్పడం! ప్రధాని ఇందిర కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఆ దశలోనే ఇందిర భారత వ్యోమ గామిని అంతరిక్షంలో పెట్టే బాధ్యతను భారతీయ వాయుసేనకు అప్పగించింది. దీని ఫలితమే 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లడం! కాగితంపై ‘ఇస్రో’ ఇప్పటికీ స్వతంత్ర సంస్థే. కానీ సంస్థ వ్యవస్థాపకుడిని కేంద్ర మంత్రి ఒకరు అగౌరవపరిచినా సరిదిద్దలేని స్థితికి చేరింది. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) పరిస్థితి కూడా ఇంతే. దశాబ్దాలుగా ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల్లోకి చేరింది మాత్రం ఇటీవలే. జన్యు మార్పిడి ఆహారం వివాదం 2010లో పతాక స్థాయిలో ఉన్నప్పటికీ ఈ సంస్థ రెండు ఇతర సైన్స్ అకాడమీలతో కలిసి ప్రభుత్వ అభి లాషకు భిన్నంగా స్పష్టమైన వైఖరి కనబరిచింది. జన్యుమార్పిడి పంటల భద్రత, మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావాలపై క్షుణ్ణమైన అధ్యయనం జరిగి తీరాల్సిందేనని భీష్మించింది.2018లో కేంద్ర మంత్రి ఒకరు డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఎగతాళి చేసిన సందర్భంలో కూడా ఐఎన్ఎస్ఏ, ఇతర సంస్థలు దాన్ని తీవ్రంగా ఖండించాయి. బోధనాంశాల నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొల గించాలన్న మంత్రిగారి ఆలోచనను తప్పుబట్టాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ఈ సంస్థలు సైద్ధాంతిక వైఖరికి కట్టుబడ్డాయి. తమ స్వతంత్రతపై దాడిని సమర్థంగా ఎదుర్కొన్నాయి.శాస్త్రవేత్తలు కానివారికి సభ్యత్వమా?ప్రస్తుతానికి వస్తే.... శాస్త్రవేత్తలు కాని పారిశ్రామికవేత్తలకు కూడా సభ్యత్వం ఇవ్వడం అవసరమని ఐఎన్ఎస్ఏ ఒక అంచనాకు వచ్చింది. సభ్యత్వం ఇవ్వడం కాకుండా... పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేసేందుకు అనువైన కార్యక్రమాలను రూపొందించి ఉంటే, వేదికలను ఏర్పాటు చేసి ఉంటే మరింత మెరుగ్గా ఉండేది. ప్రపంచంలో ఏ శాస్త్ర పరిశోధన సంస్థ కూడా తమ రంగంలో తగిన అర్హతలు లేనివారికి సభ్యత్వం కట్టబెట్టదు. సత్యేన్ బోస్, మేఘనాథ్ సాహా, హోమీ జహంగీర్ భాభా, శాంతి స్వరూప్ భట్నాగర్ వంటి దిగ్గజ శాస్త్రవేత్తల పక్కన ఇప్పుడు అంబానీకి చోటు కల్పిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా అన్ని సైన్స్ అకాడమీలకు మార్గదర్శకంగా భావించే సంస్థ లండన్లోని ‘ద రాయల్ సొసైటీ’. ఇది కూడా శాస్త్రవేత్తలు కానివారు, అంటే పారిశ్రామిక రంగంలో పరిశోధనలు చేసేవారికి సభ్యత్వం ఇస్తుంది. అయితే, ఆ యా రంగాల్లో జ్ఞానాభివృద్ధికి వారు తగినంత కృషి చేసి ఉండాలి. ఈ నేపథ్యంలోనే కొందరు పారిశ్రామిక వేత్తలకు ఐఎన్ఎస్ఏ సభ్యత్వం ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. కన్ను ఇప్పుడు గణాంక సంస్థపై..కేంద్రం దృష్టి ప్రస్తుతం కోల్కతాలోని ఐఎస్ఐ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్)పై ఉంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ వందేళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యక్ష అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. గణితం, గణాంక శాస్త్రం, అప్లైడ్ సైన్సెస్లో ఎన్నదగ్గ పరిశోధనలు చేసిన సంస్థ ఇది. పరిపాలన వ్యవహారాలన్నీ తనంతట తాను నిర్వహించుకుంటుంది. లాభాపేక్ష లేని సంస్థ. అలాంటి ఐఎస్ఐ సొసైటీని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఒక బోర్డుకు అప్పగించాలని కొత్త బిల్లు ప్రతిపాదిస్తోంది. సంస్థ ప్రెసి డెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది.ఐఎస్ఐకి చెందిన స్థిరచరాస్తులన్నింటినీ కూడా ఈ బోర్డు తన స్వాధీనంలోకి తీసుకుంటుందని బిల్లు స్పష్టం చేస్తూండటం గమనార్హం. ఇది విద్యా సంస్థల స్వతంత్రతపై దాడే! వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే!! సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ఏదో గుప్తమైన ఆలోచన కాదు. బోధనాంశాలపై చర్చలు జరిపి మరింత ప్రభావశీలం చేసేందుకు అవకాశం కల్పించేది. విద్యా ప్రమాణాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.అలాంటి ఈ వ్యవస్థకు బదులుగా ఢిల్లీ బ్యూరోక్రాట్ల అజమాయిషీ పెట్టడం బోధనాంశాల నాణ్యత, స్వతంత్రతకు గొడ్డలిపెట్టు. 1959 నాటి చట్టం పరిధిలో పనిచేసే ఐఎస్ఐ సొంతంగా డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేయగలదు. కొత్త బిల్లులో ఈ అంశం ప్రస్తావన లేదు. ఐఎస్ఐకి బదులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనే పట్టాలిస్తుందన్న అను మానాలు కలుగుతున్నాయి. తద్వారా ఇది దేశంలోని అనేక ఇతర విద్యాసంస్థల్లో ఒకటిగా మాత్రమే మారిపోనుంది. విద్యావేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా స్వేచ్ఛగా ఆలోచించేందుకు అకడమిక్ ఫ్రీడమ్ అన్నది ఎంతో కీలకం.ప్రశ్నించడం, భయం, విమర్శలకు బెదరకుండా భావాలను వ్యక్తం చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. పరిశోధనలు, బోధన తాలూకూ సమగ్రతను కాపాడుతుంది. పొలిటికల్, బ్యూరోక్రటిక్, కార్పొరేట్ సంస్థల ప్రమేయం, ప్రభావాలను తొలగించేందుకు వ్యవస్థాగతమైన స్వాతంత్య్రం అవసరం. ఇది కాదని... పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రమన్నట్టు వ్యవహరిస్తే... శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతర్జాతీయంగా భారత్కు ఉన్న స్థానానికే చేటు కలిగే ప్రమాదం ఉంది.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
నిఠారీ కేసులో బాధితులకే శిక్ష!
ఇరవై ఏళ్ల నాటి నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషి త్వాల తీర్పు భారత నేర దర్యాప్తు వ్యవస్థలోని వైఫల్యాలను బట్టబయలు చేసింది. 16 మంది మహిళలు, పిల్లల హత్య కేసులో నిందితుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 11న చెప్పిన తీర్పుతో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే!యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ నోయిడా(ఉత్తరప్రదేశ్)లోని నిఠారీ గ్రామంలో డ్రైనేజీలో మానవ అవశేషాలు బయటపడి దాదాపు ఇరవై ఏళ్లు గడచిన తర్వాత కూడా, ఏ ఒక్కరూ దోషిగా నిర్ధారణ కాలేదు. 16 మంది మహిళలు, పిల్లల ‘నిఠారీ’ హత్య కేసులో నింది తుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ‘నేర న్యాయ’ వ్యవస్థలోని దారుణ వైఫల్యాలను బట్టబయలు చేసింది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే.కీలక ఆధారాలు లేకపోవడం వల్లే... 2006 చివర్లో నిఠారీ గ్రామ సమీపాన 31వ సెక్టార్లో మురుగు కాల్వల పూడిక తీస్తుంటే దిగ్భ్రాంతికరమైన దారుణాలు వెలుగు చూశాయి. అంతకంటే ముందు, డి–5, డి–6 ఇళ్ల మధ్య ఒక చెయ్యి కనబడింది. క్రికెట్ ఆడుతున్న కుర్రాడు దాన్ని చూశాడు. అదే ఏడాది డిసెంబర్లో ఈ బంగ్లాల వెలుపల ఉన్న డ్రెయిన్లో మట్టి తొలగించడంతో అక్కడ అనేక పుర్రెలు, ఎముకలు, పీలికలైన పిల్లల దుస్తులు, చిన్ని చిన్ని చెప్పులు దొరికాయి.డి–5 ఇంట్లో పనిచేసే సురేంద్ర కోలీ అనే వ్యక్తి, ఇంటి యజమాని, వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంఢేర్ ఈ మారణకాండకు బాధ్యులని పోలీసులు అనుమానించారు. పోలీసుల కథనం ప్రకారం – పిల్లలను, ఆడవారిని కోలీ ప్రలోభపెట్టి ఇంటికి రప్పించే వాడు. తర్వాత వారిని హత్య చేసేవాడు. కొన్నిసార్లు హతుల శరీర భాగాలను తిన్నాడు కూడా! ఈ అకృత్యాల్లో పంఢేర్ భాగస్వామి. భయానకమైన ఈ హత్యల కేసులో స్థానిక పోలీసుల విచారణ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ దర్యాప్తులో భాగంగా ఇంటి మేడ పై భాగంలో నీళ్ల ట్యాంకు కింద దాచిన ఓ కత్తిని పోలీసులు ‘స్వాధీనం’ చేసుకున్నారు.ఇది, ఇంకా అనేక వస్తువులు వారికి దొరికాయి. ఇవే వారి దర్యాప్తులో ‘కీలక ఆధారాలు’. వీటి ఆధారంగా వారు రూపొందించిన కథనాలను కోర్టులు విశ్వసించలేదు. దీంతో 2007 జనవరిలో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు. సీబీఐ సైతం స్థానిక పోలీసులు చేసిన తప్పిదాలనే పునరా వృతం చేసింది. కొన్ని వారాల తరబడి కస్టడీలో ఉంచి రికార్డు చేసిన కోలీ నేరాంగీకార పత్రం మీదే సీబీఐ అధికారులు ఆధారపడ్డారు. వారు రికవర్ చేసిన ఆధారాలు నమ్మదగినవిగా లేవు. కోలీ, పంఢేర్ ప్రమేయాన్ని నిరూపించగల సరైన ఫోరెన్సిక్ లింకులను కూడా సంపాదించలేక పోయారు.స్థానిక పోలీసుల మీద ఆధారపడకుండా మళ్లీ మొదటి నుంచి సొంత దర్వాప్తు చేయడంలో సీబీఐ విఫలమైంది. నేరాంగీకారాలు, రికవరీలు, ఆధారాలను అటూయిటూ చేసి... మోపిన 13 కేసుల్లోనూ వాటినే కోర్టుల ముందుంచారు. కాబట్టే, పై కోర్టులు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి వాటన్నిటినీ కొట్టేశాయి. నేరాంగీకార పత్రాలు, నేరాలకు సంబంధించిన రికవ రీలు అన్నీ అంతకు ముందు కొట్టేసిన ఇతర కేసుల్లో ఉన్నట్లే ఏ మాత్రం తేడా లేకుండా ఈ కేసులోనూ ఉన్నాయని సుప్రీంకోర్టు తాజాగా నవంబర్ 11 నాటి తీర్పులో గుర్తించింది.మరి నేరస్థులు ఎవరు?తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రుల విషయానికి వస్తే, వారి పాత గాయాలు ఈ తీర్పుతో మళ్లీ రేగాయి. 2005లో తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది ఈ బాధితులే! డి–5 ఇంటి ముందు తొలుతగా నిరసన చేసింది వీరే. న్యాయస్థానంలో చివరి దాకా పోరా డింది కూడా వీరే. చివరకు కోర్టు తీర్పుతో తమ పిల్లలను ఎవరూ చంపలేదన్న ‘న్యాయపరమైన వాస్తవం’ వారిని వెక్కిరిస్తోంది. ఏళ్ల తరబడి సుదీర్ఘంగా దర్యాప్తు జరిగినప్పటికీ, నిజమైన ద్రోహులెవరో నిరూపణ కాకపోవడం పట్ల న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసి వారి బాధను గుర్తించింది. నిర్లక్ష్యం వహించి, అసాధారణ జాప్యం చేసి నిజనిర్ధారణ ప్రక్రియ పట్ల విశ్వాసం సన్న గిల్లేలా చేశాయంటూ దర్యాప్తు సంస్థలను తప్పు పట్టింది. అవయ వాలతో వ్యాపారం చేసే ముఠాల ప్రమేయం వంటి కొత్త కోణాల నుంచి దర్యాప్తు చేపట్టలేక పోయాయని నిందించింది.నిఠారీ కేసు నిర్దోషిత్వాల తీర్పులు భారత నేర దర్యాప్తు వ్యవస్థకు సోకిన రోగం లక్షణాలను కళ్లకు కట్టాయి. ప్రతి స్థాయి లోనూ వ్యవస్థ విఫలమైంది. స్థానిక పోలీసులు క్రైమ్ సీన్ను పరిరక్షించలేకపోయారు. సరైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించలేక పోయారు. ఈ లోపాలను చక్కదిద్దడంలో సీబీఐ విఫలమైంది. కొత్త కోణాలను గుర్తించలేక పోయింది. న్యాయ పరీక్షకు నిలబడేలా పకడ్బందీ వాదనలు చేయడంలో ప్రాసిక్యూటర్లు విఫలమయ్యారు. బాధితుల ఘోర విషాదాన్ని వ్యవస్థల ప్రహసనంగా మార్చి, ప్రభుత్వం వారికి తీవ్రమైన నిరాశ కలిగించింది.సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కోలీ జైలు నుంచి బయటకు వచ్చాడు. పంఢేర్ ఇప్పటికే నేర విముక్తుడు. న్యాయస్థానం చట్టాలకు లోబడి వ్యవహరించింది. తిరుగులేని రుజువులు ఉంటే తప్ప కోర్టు శిక్ష విధించలేదు. తమ పిల్లల మసకబారిన పాత ఫొటోలను పట్టు కుని ఆ తల్లిదండ్రులు క్షోభపడుతూ ఉంటే, న్యాయం అమూర్తంగా మారిపోయింది. నిఠారీలో చట్టం తన చివరి మాటను చెప్పేసింది. ఇక మిగిలింది నిశ్శబ్దమే! అది చెవులు పగిలిపోయేంత కఠోరంగా ఉంది.-ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త లీగల్ అంశాల జర్నలిస్ట్(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పంజరం లేని పెంపుడు చిలక
వివిధ రంగాల్లోకి కృత్రిమ మేధ (ఏఐ) చొచ్చుకొస్తున్న వేళ... సురక్షితంగా, బాధ్యతాయుతంగా దాన్ని వినియోగించేందుకు వీలుగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇటీవల ‘భారత ఏఐ గవర్నన్స్ గైడ్లైన్స్’ను ప్రకటించింది. ఇంతకీ ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడున్న చట్టాల పరిధిలోనే ఏఐతో వచ్చే ఇక్కట్లను సైతం ఎదుర్కోవాలని చూస్తున్న ఈ మార్గదర్శకాల వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏఐని మరీ పంజరంలో చిలకగా చేయకూడదన్న మాట నిజమే కానీ, డేటా ప్రైవసీ సహా అనేకఅంశాలపై ఆందోళన తీరేదెలా?ఇప్పుడేం జరిగింది?శరవేగంతో దూసుకొస్తున్న ఏఐ టెక్నాలజీల విష యంలో ప్రపంచ దేశాలన్నీ హడావిడిగా చట్టాలు చేసేస్తుంటే, మన దేశంలో ప్రత్యేకమైన చట్టమంటూ ఇంకా ఏమీ లేదు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలనుకుంటున్న ప్రభుత్వం ఈ పరిస్థి తుల్లో ఆచరణాత్మక దృక్పథంతో ఒక అడుగు వేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ‘ఇండియా ఏఐ గవర్నన్స్ గైడ్లైన్స్’ నివేదికను తయారుచేసి, అందించింది. ఏఐపై నియంత్రణ కన్నా సమన్వయా నికి ప్రాధాన్యమివ్వడం 66 పేజీల ఈ బ్లూ ప్రింట్ ప్రత్యేకత.ఏఐతో ఒనగూడే లాభాలనూ, ఎదురయ్యే కష్టనష్టాలనూ సమతూకం చేస్తూ దేశ పరిస్థితులకు తగ్గట్టు ఇందులో మార్గదర్శకాలను సిద్ధం చేశారు. ఏఐపై అతిగా కట్టుదిట్టాలు పెట్టి, సృజనశీలురనూ, మదుపరులనూ ఇరుకునపెట్టరాదనే భావనతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. నిజానికి, గతంలోనే ఓ సబ్ కమిటీ ఒక ముసాయిదా సిద్ధం చేసింది. అయితే, ఆ తర్వాత సదరు సబ్ కమిటీతో సంబంధం లేకుండా మొన్న జూలైలో మంత్రిత్వ శాఖ వేసిన కమిటీ తాజా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఈ పత్రం ఏం చెబుతోంది?ఇవాళ ప్రపంచంలోనే ఛాట్ జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంలు)ను అమెరికా తర్వాత అత్యధికంగా వాడుతున్న దేశం మనదే. ఏఐలో ప్రపంచ ఆధిపత్యం సంపాదించాలని అమె రికా, చైనాలు తహతహలాడుతుంటే, భారత్ మాత్రం సమూల మార్పు తెచ్చే ఈ టెక్నాలజీలను ప్రజల జీవితాలను మార్చేందుకు ఎలా వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘ఏఐ గవ ర్నెన్స్ గూపు’ను ఏర్పాటు చేయాలన్నది ఈ మార్గ దర్శకాల్లో ఓ సూచన.ఆ గ్రూపునకు అండగా ‘టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ’, అలాగే ‘ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్’ ఉంటాయి. అయితే, ప్రభుత్వ అధికారులు ఏఐ సిస్టమ్స్ను వాడినప్పుడు ఏం చేయాలన్న దానిపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం సంగతి అటుంచితే, ప్రైవేట్ రంగం భారతీయ చట్టాలన్నిటినీ పాటిస్తూ, స్వచ్ఛందంగా నియమాలు పెట్టుకొని, పారదర్శకంగా వ్యవహరించాలనీ, బాధితుల సమస్యను పరిష్కరించే వ్యవ స్థలు ఏర్పాటు చేసుకోవాలనీ మార్గదర్శకాలు సూచించాయి. ఏఐతో చేసిన కంటెంట్ విషయంలో యూట్యూబ్, ఇన్స్టా లాంటివి ఇకపై ఆ మాట స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రూల్స్లో ఇప్పటికే ఈ సవరణ ముసాయిదా తెచ్చారు.రానున్న రోజుల్లో ఏం జరగనుంది?ఏఐ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే వరుసగా ప్రపంచ సదస్సులు జరుగుతున్నాయి. బ్లెట్చెలీ పార్క్ (బ్రిటన్), సియోల్, ప్యారిస్లలో జరిగిన గత సదస్సుల అనంతరం రానున్న నాలుగో సదస్సు వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాల రూపకల్పన కీలకమైంది. ఏఐని నియంత్రించడం కష్టమైపోతోందని ప్రపంచ దేశా లన్నీ కిందా మీదా అవుతున్న పరిస్థితుల్లో మన దేశం ఇలా ఆగి, ఆలోచించే వైఖరిని అవలంబించడం మంచిదే. అర్థం చేసుకోదగినదే. భవిష్యత్తులో అవస రాన్ని బట్టి ఏఐపై నియంత్రణ, లేదా చట్టాన్ని చేస్తా మంటూ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి సైతం చెప్పడాన్ని ఆ కోణం నుంచి చూడాలి.అయితే, ఏఐ సృష్టి వీడి యోలతో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ రాజకీయ నేతల మొదలు రంగుల లోకపు తారల దాకా అందరినీ బాధితుల్ని చేస్తున్న డీప్ ఫేక్ మహ మ్మారిపై చర్యలు తక్షణావసరం. ఈ విషయంలో విధాన నిర్ణేతలపై ఇప్పటికే చాలా ఒత్తిడి వస్తోందని మర్చిపోలేం. ఏఐపై అతిగా రూల్స్ పెట్టిన యూరో పియన్ యూనియన్, మార్కెట్ శక్తులకే అంతా వది లేసి స్వచ్ఛంద నియమాలతో ఈ రంగం పెంపొందా లని భావిస్తున్న అమెరికా... ఈ రెంటితో పోలిస్తే, భారత మధ్యేమార్గ ధోరణి ప్రశంసనీయమే కానీ ఫలితాలిస్తుందా అన్నది చూడాలి. -
బంగ్లా సంక్షోభంలో భారత వైఖరి?
షేక్ హసీనాకు విధించిన మరణదండన తీర్పుపై ఇండియా ఏ వైఖరి అనుసరించినా చిక్కే! భారత్ ఒకవేళ బంగ్లాదేశ్ ఆంతరంగిక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే, నిజంగా చేసుకున్నా లేదా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చినా అక్కడి తాత్కాలిక ప్రభుత్వ ప్రాపగాండాకు గొప్ప వరంలా అందివస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలలో మరింత విషం నింపినట్లు అవుతుంది.బంగ్లాదేశ్ చరిత్ర మరో మలుపు తిరుగు తోంది. ఉద్వాసనకు గురైన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆమె దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ సోమ వారం నాడు మరణ దండన విధించింది. హసీనాపై విచారణ రాజకీయ దురుద్దేశా లతోనే సాగిందని ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆమెకు మరణ దండన విధించడంతో అదొక భద్రతా, దౌత్యపరమైన విస్ఫో టనంగా పరిణమించింది. భారత్తో సహా పాశ్చాత్య దేశాలు ఈ ప్రాంతంలో సుస్థిరతను కోరుకుంటున్నాయి. కానీ ట్రైబ్యునల్ తీర్పుపై ఏ వైఖరి అనుసరించినా చిక్కులు తెచ్చిపెట్టేదిగానే ఉంది.రెండు వర్గాలుగా బంగ్లాదేశీయులుబంగ్లాదేశ్తో వచ్చిన చిక్కేమిటంటే, ప్రజానీకం రెండు శిబిరా లుగా చీలిపోయి ఉంటున్నారు. ఒక వర్గం ఉదారవాద ఇస్లాంకు అనుకూలం. ఉపఖండం స్వాతంత్య్రాన్ని గడించుకోక ముందు నుంచీ ఈ వర్గంవారు దక్షిణాసియాలోని మిగిలిన దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటూ, ప్రజా కృషక్ పార్టీ వంటి పార్టీల వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. వారు 1947 తర్వాత, అవామీ లీగ్, వామపక్షాలకు మద్దతు ఇస్తున్నారు. రెండవ వర్గం ఇస్లామిక్ దేశంగా మారాలని కోరుకుంటోంది.వీరు గతంలో ముస్లిం లీగ్కు మద్దతు ఇచ్చారు. తర్వాత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి, జనరల్ హుస్సేన్ ఎర్షాద్కు చెందిన ‘జాతీయ పార్టీ’ వంటి కొన్ని పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. మూడవ వర్గం కూడా ఒకటుంది. అది షరియాను కోరుతూ, ఇస్లాం మతాచారాలను తు.చ. తప్పకుండా పాటించాలని డిమాండ్ చేస్తోంది. అది జమాత్–ఇస్లామీ బంగ్లాదేశ్ మద్దతుదారు. అయితే, బంగ్లాదేశ్లో అత్యధిక ప్రజానీకం ఈ సైద్ధాంతిక ఘర్షణల్లో తటస్థంగానే ఉంటూ, ప్రభుత్వ మార్పునకు వీలు కల్పిస్తూంటారు.ఇండియాపై తక్షణ ప్రభావంభౌగోళిక అంశాలు, ప్రజా వర్గాల కారణంగా బంగ్లాదేశ్ ప్రభావం మనపై ఉంటుందని మొదట అర్థం చేసుకోవాలి. భారత్– బంగ్లాదేశ్ సరిహద్దు నిడివి ఎక్కువ. బంగ్లా వైపు నుంచి ఉగ్ర వాదులు సులభంగా భారత్లోకి ప్రవేశించడం, ఇక్కడి నేరస్థులకు ఆయుధాలు చేరవేయడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. అలాగే పోరాటాలకు దిగేవారు, శరణార్థులు భారత్ లోనికి ప్రవేశించేందుకు ఢాకాలోని అస్థిర పరిస్థితులు పురికొల్పవచ్చు.రెండు-పాకిస్తాన్తో ముడిపడిన కుట్రదారులు, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న పాత్రధారుల మధ్య జరిగిన సమావేశాలకూ, ఢిల్లీ ఎర్రకోట ఘటన దర్యాప్తులో నిగ్గుదేలుతున్న అంశాలకూ మధ్య నున్న సంబంధం ఒక ఆందోళనకర ధోరణిని సూచిస్తోంది. ఉగ్ర వాదులు, వారిని పోషిస్తున్న వ్యవస్థల సంబంధీకులు బంగ్లాదేశ్ను కేవలం దేశీయ రంగస్థలంగా చూడటం లేదు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగపడే రహస్య స్థావరంగా చూస్తున్నారు. దాంతో ఢాకాలో అస్థిరత న్యూఢిల్లీకి ప్రత్యక్ష జాతీయ భద్రతా సమస్యగా పరిణమిస్తోంది.మూడు– రాజకీయ దృక్కోణం దౌత్యపరమైన ఒత్తిడిని సృష్టి స్తోంది. భారతదేశం ఒకవేళ ఢాకా ఆంతరంగిక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే, నిజంగా జోక్యం చేసుకున్నా లేదా జోక్యం చేసు కున్నట్లు ఆరోపణలు వచ్చినా అక్కడి తాత్కాలిక ప్రభుత్వ ప్రాపగాండాకు గొప్ప వరంలా అందివస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలలో మరింత విషం నింపినట్లు అవుతుంది. సరిహద్దు నిర్వహణ, కౌంటర్ టెర్రరిజంపై సహకారాన్ని బలహీనపరుస్తుంది. నీతి నియమాల సూత్రాలు, వివేకం– రెండింటిలో దేనితో నడుద్దామనుకున్నా భారతదేశానికున్న అవకాశాలు సవాళ్ళతో నిండినవే! ఏం చేయగలం? ప్రాంతీయ పెత్తందారుగా వ్యవహరిస్తోందని ఢాకా భాష్యం చెప్పడానికి వీలున్న చర్యల జోలికి పోకుండానే, తన జాతీయ భద్ర తను, పౌరులను భారత్ పరిరక్షించుకోవాల్సి ఉంది. సరిహద్దులో చొరబాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను భారత్ వేగ వంతం చేయాలి. సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిల్లాలలో మానవతా చర్యలను చేపట్టేందుకు సమాయత్తమవ్వాలి. అత్యవసర మందు లను, గుడారాలను, జన ప్రవాహాన్ని తట్టుకుని చట్టాన్ని అమలు చేయగల విభాగాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. దాతలను రంగంలోకి దింపడానికి సిద్ధమై, ఐరాస సంస్థలతో సమన్వయంతో పని చేయాలి.సైనిక దళాలను మోహరిస్తే, పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉంది. ఆత్మరక్షణ, పౌర రక్షణ ఏర్పాట్లు చేసుకోవ డంలో తప్పు లేదు. అవి అత్యవసరం కూడా! సరిహద్దుకు ఆవల నున్న ఉగ్రవాద తండాల కదలికలపై సాంకేతిక, కార్యనిర్వహణా పరమైన, జ్యుడీషియల్ మార్గాల ద్వారా ఒక కన్ను వేసి ఉంచి, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడాన్ని న్యూఢిల్లీ తీవ్రం చేయాలి. అవి నిక్కచ్చిగా కౌంటర్ టెర్రరిజం చర్యలవుతాయి కానీ, రాజకీయ జోక్యం కిందకు రావు.సుస్థిరతను అందించగల సామర్థ్యమున్న బంగ్లాదేశీ మధ్య వర్తితో ప్రైవేటుగా చర్చలు జరిపేందుకు సిద్ధమై ఉండాలి. అది రాజ కీయంగా అసౌకర్యమైనదే. కానీ, రాజకీయ సంబంధాలు అట్టడు గుకు చేరిన సమయంలో కూడా (సరిహద్దుల నిర్వహణ, కౌంటర్ టెర్రరిజం, విద్యుత్తు, వర్తక వాణిజ్యాల వంటి) అంశాల ఆధారిత చర్చలు కొనసాగాలి. దక్షిణాసియా అస్థిరత సరిహద్దులను దాటి ఎలాంటి పర్యవసానాలకు కారణం కాగలదో అమెరికా, ఐరోపా దేశాలకు, ‘క్వాడ్’ భాగస్వాములకు న్యూఢిల్లీ నివేదించాలి. ఉద్రిక్తత లను సడలింపజేసేందుకు అంతర్జాతీయంగా ఒత్తిడి తేవడం, పౌరుల హక్కులను గౌరవించేలా మాట తీసుకోవడం మంచిది. ఢాకాలో రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు ఎంతో కొంత ప్రయత్నించినా కూడా అది హింసను నిరోధించగల ఉత్తమ కవచంగా పనిచేస్తుంది. గౌరవప్రదమైన ప్రాంతీయ ప్రముఖులు, బహుళ పక్షీయ మధ్యవర్తులతో సమ్మిళిత రాజకీయ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్స హించేందుకు భారత్ ప్రయత్నించవచ్చు. తద్వారా, ఎన్నికల నిర్వహణకు, చట్టబద్ధ పాలనకు అనువైన పరిస్థితులు ఏర్పడేటట్లు చేసినట్లు అవుతుంది. అవి కొరవడితే, అణచివేతలు, తిరుగుబాటు కార్యకలాపాలు పునరావృతమవుతూనే ఉంటాయి.-జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త పీటీఐ తూర్పు ప్రాంత విభాగ మాజీ అధిపతి -
ఎమోషనల్ మగాడే అసలైన వాడు!
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకో ప్రశ్న. మీరెప్పుడైనా మనసారా ఏడ్చారా? మీ భయాలను ఓపెన్ గా చెప్పగలిగారా? మీ బలహీనతలను ఒప్పుకోగలిగారా? చాలామంది నుంచి ‘నో’ అనే సమాధానమే వస్తుందని తెలుసు. ఎందుకంటే మన సమాజంలో మగబిడ్డ పుట్టిన వెంటనే అతని చుట్టూ ఒక మేట్రిక్స్ నిర్మితమవుతుంది. మేట్రిక్స్ అంటే మరేదో అనుకోకండి, ఒక ఫ్రేమ్ వర్క్.‘‘నువ్వు మగపిల్లాడివి ఏడవకూడదు. ధైర్యంగా ఉండాలి. భయపడకూడదు. బాధపడకూడదు, తట్టుకోవాలి’’ అని పుట్టినప్పటినుంచీ చెప్తుంటారు. ఇలాంటి మాటలన్నీ కలిసి అతను ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఒక ఫ్రేమ్ వర్క్ ను నిర్మిస్తాయి. అది కంటికి కనిపించని జైలులా మారుతుంది. దాని లోపల ఉన్నాడని కూడా తెలీదు. కానీ అతని డెసిషన్స్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అన్నింటినీ అది నియంత్రిస్తుంటుంది.కానీ చాలామందికి అది తెలియదు. తెలిసిన వాళ్లు కూడా బయటకు రావడానికి భయపడతారు. కానీ నిజమేమిటంటే... దాన్ని బద్దలు కొట్టినప్పుడే మగాడు నిజమైన మనిషి అవుతాడు.1. BREAKమగాడు, మగతనం అనే మేట్రిక్స్ను బద్దలుకొట్టకపోతే పురుషుడు సంపూర్ణంగా జీవించలేడు. జస్ట్ మగాడిగా తన పాత్రను పోషిస్తుంటాడంతే. ఈ మేట్రిక్స్ మగాడి మనసుకు మూడు పెద్ద నష్టాలు చేస్తుంది:1. ఏమైనా జరిగినప్పుడు ‘ఇది చిన్నవిషయమే’ బాధపడకూడదు అనిపిస్తుంది. ఏడవాలనిపించినా... ‘అలా చేస్తే ఏమనుకుంటారో?’ ‘బలహీనంగా కనిపిస్తానేమో?’ అని ఏడుపును మనసులోనే నొక్కేసుకుంటారు. తమ ఎమోషన్స్ ను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయలేరు. భావాలను చెప్పడం నేరం అనిపిస్తుంది.2. ఒక పురుషుడు ‘I need help’ అని ఓపెన్ గా అడగలేడు. ఎందుకంటే చిన్నప్పటినుంచీ అతనికి నీ పనులు నువ్వే చేసుకోవాలని చెప్పారు. అందుకే సహాయం అడగడానికి సిగ్గనిపిస్తుంది. 3. చుట్టూ జనాలు ఉన్నా, లోపల మాత్రం ఒంటరితనం పెరుగుతుంది. ఇది depression, anger issues, burnout, relationship breakdowns కి నేరుగా దారి తీస్తుంది.ఇది బలం కాదు బ్రో, ఇదో కనిపించని జైలు. ఇదే మగాడు అనే మేట్రిక్స్.2. BUILDఈ మేట్రిక్స్ నుంచి బయటపడినప్పుడు పురుషుడు తనను తానే తిరిగి నిర్మించుకుంటాడు. ఒక పురుషుడు మేట్రిక్స్ను ప్రశ్నించే రోజే అతని అసలు వ్యక్తిత్వం పుట్టే రోజు. అప్పుడే అతను మొదటిసారి తనతో నిజాయితీగా మాట్లాడడం మొదలుపెడతాడు.“నాకు కూడా బాధ ఉంటుంది.”“నాకు కూడా భయం ఉంటుంది.”“నాకు కూడా ప్రేమ, వినేవాళ్లు కావాలి.”అని ఒప్పుకోవడం మొదలుపెడతాడు. ఇది బలహీనత కాదు. ఇది అవగాహనా స్థాయి పెరగటం. దీనివల్ల మగాడిలో కొత్త వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది.1. Emotion Awareness: ఏం ఫీల్ అవుతున్నాను? ఎందుకు? అని ప్రశ్నించుకుంటాడు. ఈ ప్రశ్న ఒక వ్యక్తిని బలంగా మారుస్తుంది, బలహీనంగా కాదు.2. Healthy Expression: బాధను చెప్పగలగడం అనేది మానసిక బలమని, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదని గుర్తిస్తాడు. 3. Boundaries: నేను మగాణ్ని కాబట్టి ప్రతి పని నేనే చేయాలి అనే మేట్రిక్స్ నుండి బయటపడతాడు. 4. Genuine Relationships: జస్ట్ మగాడనే పాత్రను పోషించడం కాకుండా, నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం వల్ల నటించే బంధాలు కాకుండా నిజమన బంధాలు మొదలవుతాయి.3. BEYONDమేట్రిక్స్ బద్దలైనప్పుడు మగాడు లిమిట్స్ దాటి వెళ్తాడు. మగతనం కొత్తరూపు తీసుకుంటుంది. ఈ కొత్త మగాడు Emotionally Intelligent. అతను మాట్లాడతాడు.అతను వింటాడు.అతను పంచుకుంటాడు.ఈ కొత్త పురుషుడు Strong + Softఅతని బలం అరవడం కాదు.అతని సున్నితత్వం బలహీనత కాదు.కొత్త మగాడు Balanced.అతను తనను తాను కోల్పోకుండా కుటుంబం, పని, సంబంధాలను నడపగలడు.కొత్త పురుషుడు Human. ఫీలింగ్స్, ఫియర్స్, నీడ్స్ అన్నీ అతని భాగమే అని అంగీకరిస్తాడు.అతను మగాడనే ఒక మూసలో కాకుండా పూర్తి మనిషిగా జీవిస్తాడు.Break the ‘Man’ Matrix.Build your true self.Go Beyond your limits.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
జుట్టు నెరిసిందా? అయితే అదృష్టవంతులే!!
జుట్టు నేరుస్తోందని.. మిమ్మల్ని ఎవరూ చూడడం లేదని ఫీలవకండి. వయసు పెరుగుతోందని అసలు సిగ్గుపడకండి. పైపెచ్చు జుట్టు తెల్లబడుతున్నందుకు సంతోషించండి అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు . జుట్టు నెరవడం ఏమాత్రం సిగ్గుపడే విషయం కాదని .. అది వారి ఆరోగ్యానికి హేతువని పరిశోధనల్లో తేలింది. ఇకపై తెల్లజుట్టు వచ్చిందని, తమకు వృద్ధాప్యం వచ్చిందని ఏమాత్రం చింతించవలసిన పనిలేదని భరోసా ఇస్తున్నారు. టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా ఒక ఆసక్తికరమైన అంశాన్ని కనుగొన్నారు. నల్లని జుట్టు తెల్లగా మారడం వెనుక ఒక గొప్ప ప్రక్రియ ఉందని.. అది మన ఆరోగ్యానికి భద్రతను.. భరోసాను కలిగిస్తుందని.. ఈ క్రమంలో తెల్లజుట్టును అందరూ ఆహ్వానించాలని అంటున్నారు. మానవుల శరీరంలో మొదలయ్యే కేన్సర్కు దారితీసే ప్రమాదకర కణాలను మన శరీరం నాశనం చేసి మనలను ప్రాణహాని నుంచి కాపాడుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా శరీరంలోని జుట్టు రంగును కోల్పోయి తెల్లగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?మన చర్మానికి, జుట్టుకు కణాలు మెలనోసైట్ స్టెమ్ సెల్స్ కారణంగా ఆ రంగు వస్తుంది. ఈ కణాలు ఎక్కువగా జుట్టు కుదుళ్ళలో ఉంటాయి. ఇవి ఎప్పటికపుడు అంతరించిపోతూ నిరంతరం కొత్త కణాలు పుడుతూ చర్మానికి, జుట్టుకు రంగును అందిస్తుంటాయి. అయితే.. డీఎన్ఏకు క్యాన్సర్ కణాలు ఏర్పడడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైతే ఈ స్టెమ్ సెల్స్ వెంటనే ఉత్తేజితం అయిపోతాయి. సరిహద్దుల్లోని సైనికుల మాదిరి ఎలర్ట్ అయిపోయి శరీరాన్ని రక్షించే బాధ్యత తీసుకుంటాయి. అవి స్వతంత్రంగా.. అంటే ఆటోమాటిగ్గా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయి తమను తాము నిర్మూలించుకుంటాయి. ఈ ఫైటింగ్ ప్రక్రియలో ఆ సెల్స్ ఆత్మార్పణ చేసుకుని మన శరీరాన్ని కాపాడుతాయి అన్నమాట దీంతో నల్లని జుట్టు కాస్తా తెల్లగా మారిపోతుందని పరిశోధనల్లో వెల్లడైంది. అంటే, జుట్టు బూడిదగా మారడం అనేది కేన్సర్కి దారితీసే కణాలను శరీరం త్యజించిన ఫలితమనే అర్థం.అంతిమంగా ఈ పరిశోధన ఏమి చెబుతుందంటే 'బూడిద జుట్టు ఉండటం కేన్సర్కి రక్షణ అనేది నేరుగా చెప్పలేము, కానీ అది శరీరం కణాలను పరిశుభ్రం చేసే సహజ జీవ క్రియను సూచిస్తుంది. తద్వారా శరీరంలోని మృతకణాలు అంతరించి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.' అనేది ఈ పరిశోధన సారాంశం.:::సిమ్మాదిరప్పన్న -
టీడీపీ ఎంపీ చిన్నికి మద్దెల దరువు..
ఏదోలా చంద్రబాబు.. లోకేష్ల ఆశీస్సులతో టిక్కెట్ తెచ్చుకుని ఎంపీగా అయితే గెలిచాడు కానీ గెలిచిన నాటి నుంచి సుఖం లేదు నిద్ర లేదు ప్రశాంతత లేదు అన్నట్లుగా తయారైంది కేశినేని చిన్ని (శివనాథ్) పరిస్థితి. ఎటు చూసినా ఆయన గౌరవం తగ్గించే పరిణామాలు జరుగుతున్నాయి తప్ప ఆయన్ను తన పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా గౌరవంగా చూడడం లేదు. ఇదేలా ఉంటుండగానే తన సొంత అన్న మాజీ ఎంపీ కేసినేని నాని ఏకంగా తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఫిర్యాదు చేయడం చిన్నికి మరింత పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఏకంగా తనపై ధ్వజం ఎత్తడం రూ.ఐదు కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చానని చెప్పడం దీంతోపాటు.. గంజాయి, లిక్కర్, మైనింగ్ వంటి ఇతరత్రా అక్రమ వ్యాపారాలన్నీ తన అనుచరులే చేస్తున్నారని చెప్పడం వంటి పరిణామాలు పార్టీలో కేశినేని చిన్ని పరపతిని గణనీయంగా తగ్గించాయి. అసలు చిన్ని ఎవరు అంటే పేకాట డెన్ నడిపే పెద్ద జూదరి అంటూ పోలికపూడి శ్రీనివాస్ చేసిన కామెంట్ చిన్ని గౌరవాన్ని నేలమట్టం చేసింది.తెలుగుదేశం పార్టీలో లోకేష్, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన విజయవాడ ఎంపీ, కమ్మ సామాజికవర్గానికి చెందిన కేశినేని చిన్నిని పొలిటికల్ గా టచ్ చేయాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. కానీ చిన్నిని పూచికపుల్ల మాదిరి తీసిపారేసిన కొలికపూడి పార్టీలో సంచలనం రేపారు. దీంతో ఇద్దరినీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకావాలి ఆదేశించిన అధిష్టానం మంగళవారం సాయంత్రం ఆ ఇద్దరి నుంచి వివరణలు వాంగ్మూలాలు తీసుకుని బయటకు పంపించింది. అయితే ఆ ఇద్దరు కూడా తాము పార్టీకి విధేయులం అని.. తమకు పార్టీ ఒక దేవాలయం అయితే చంద్రబాబు.. లోకేష్ తమపాలిట దేవుళ్ళు అంటూ ఒకే స్క్రిప్ట్ చదవడంతో క్రమశిక్షణ సంఘం ఇదెక్కడి కోరస్ రా దేవుడా అని తలపట్టుకుంది.ఇదిలా ఉండగా చిన్నిపై సొంత అన్న, మాజీ ఎంపీ నాని తుపాకీ ఎక్కుబెట్టారు. చిన్నికి చెందిన కంపెనీలు పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాయని మనీ తీవ్రమైన ఆర్థిక నేరాలు వెనుక చిన్ని హస్తం ఉందని ఆరోపిస్తూ నాని ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆర్థిక నేరాలన్నింటిపైన విస్తృతంగా దర్యాప్తు చేసి చిన్ని ప్రమేయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని నాని చేసిన ఫిర్యాదు ఇప్పుడు తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తనపై సొంత అన్నయ్య ఇలా ఫిర్యాదు చేయాలని చిన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని ఏమీ చేయలేని పరిస్థితి.. దీంతో అటు కొలికపూడి శ్రీనివాస్ ఇటు సొంత అన్న నాని ఒకేసారి ఎటాక్ చేయడంతో ఎంపీ శివనాథ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?
చేతివాటం అని కొంత మంది ఏదో చులకనగా తేలికపాటి పదాలతో అంటూ ఉంటారు గానీ.. నిజానికి ‘హస్తలాఘవం’ అని గౌరవప్రదంగా అంటే ఆ విద్యలో ఉన్న కళాకౌశలానికి తగిన గుర్తింపు దక్కినట్టు అవుతుంది. అవును మరి.. ‘పిక్ పాకెట్’ లేదా ‘జేబు కత్తిరించుట’ అని చవకబారు భాషలో అనేసినంత మాత్రాన ఆ విద్యలో ఉన్న గొప్పదనం మరుగున పడిపోతుందా?. రెండు వైపులా పదును ఉండి.. పట్టుకున్న చేతినికూడా గాయపరచగల బ్లేడు వంటి చిన్న ఆయుధాన్ని, చాలా ఒడుపుగా రెండువేళ్ల మధ్యలో ఇరికించి పట్టుకుని.. ఎంతో టేలెంట్తో.. రోడ్డు మీద కనిపించిన వారి జేబును డబ్బులు లేదా మనీ పర్సు ఉన్నంత మేర మాత్రమే కత్తిరించడం ఆ విద్యలో మాస్టర్ డిగ్రీ అని చెప్పాల్సిందే. ఆ మాటకొస్తే జేబులు కత్తిరించడం మాత్రమేనా ఏమిటి? దుకాణాల్లో యజమానికి తెలియకుండా సరుకులు కొట్టేయడాలు, సూపర్ మార్కెట్లలో సీసీ కెమెరాల కనుగప్పి సరుకుల్ని మాయచేయడాలూ లాంటి వ్యవహారాలు అనేకం మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని చీప్గా చోరీలు అనకూడదు.. ‘కళాకౌశల ప్రదర్శన’ అని అనాలి. అందుకే మనం పొదుగుతున్న పిట్టకు తెలియకుండా గూట్లో గుడ్డును కొట్టేసే మహామహుల్ని గురించి కథలు తయారుచేసుకుని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి చౌర్యం అనేది ఒక ఆర్టు.. చతుష్షష్ఠి కళలలో ఎన్నదగిన ఆర్టు. ఆ పనిచేసేవాళ్లు సదరు ఆర్టుని పెర్ఫార్మ్ చేస్తున్న కళాకారులు! మనకు అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఎవరో ఇద్దరు ఆడవాళ్లు బంగారం దుకాణానికి వస్తారు. మంచిగా మాటలు చెబుతూ నగల బేరం ప్రారంభిస్తారు. కొత్త కొత్త డిజైన్లు చూపించమని షాప్ కుర్రాడిని పురమాయిస్తారు. అతను వెనుదిరిగి మరో డిజైన్ అందుకుని చూపించేలోగా, ఆ బల్ల మీద ఉన్న వాటిని ఎంతో ఒడుపుగా తమ దుస్తుల మధ్యలోకి చేరవేస్తారు. కొన్ని క్షణాల వ్యవధిలో వీసమెత్తు తేడా రాకుండా ఎంతో పకడ్బందీగా ఈ కళను ప్రదర్శించాలంటే చాలా చాలా టేలెంట్ ఉండాలి. కానీ మనమేమో దానిని దొంగతనం అంటాం. నాలుగు తగిలించి పంపిస్తాం లేదా పోలీసులకు పట్టిస్తాం. Gujaratis are giving India a bad name internationally. Look at this Gujarati woman who stole 3 jeans, 7 tops, and 5 pairs of underwear from a shop in US. She was later caught with all the items, and her phone wallpaper had an image of Modi.pic.twitter.com/InTIuIzdxt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) September 7, 2025తమ కళకు, టేలెంట్కు ఇక్కడ స్వదేశంలో అనుకున్న రీతిలో గౌరవం దక్కడం లేదని బాధపడుతున్నవారు ఏం చేయాలి, సాధారణంగా ఏం చేస్తుంటారు?. ఫరెగ్జాంపుల్ ఇంజినీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్లు తమ ప్రతిభ మరింతగా రాణించాలంటే.. తమ విద్యతో మరింతగా ఆర్జించాలంటే అమెరికాకు వెళుతున్నారు కదా?. అదేమాదిరిగా మనం చోరకళాకారులు కూడా అమెరికాకు వెళుతున్నారు. అక్కడ తమ హస్తలాఘవాన్ని, కళాప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. కానీ తమాషా ఏంటంటే.. వారి ఆర్టుకు అమెరికాలో కూడా గౌరవం దక్కడం లేదు. డిపార్టుమెంటల్ స్టోర్సులో, సూపర్ మార్కెట్లలో ఏదో తమకు తోచిన రీతిలో చేతివాటం ప్రదర్శిస్తే.. పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టేస్తున్నారు. మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ ఇదే పాట ఆమె కూడా పాడింది గానీ.. పోలీసులు కరుణించలేదు. ఆ పప్పులన్నీ ఉడకవని తేల్చేసి కటకటాల వెనక్కు పంపారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఇలాగే చోర కళాప్రదర్శనచేసి దొరికిపోయారు. అమెరికాలో ఈ కళను ‘షాప్ లిఫ్టింగ్’ అని వ్యవహరిస్తారట. అనగా.. స్టోర్సులో వస్తువులు పుచ్చుకుని డబ్బులివ్వకుండా జారుకునే విద్యకు అక్కడి పేరు అది! చదువుకోవడానికి అమెరికా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు న్యూజెర్సీలో ఇదే షాప్ లిఫ్టింగ్ కళను పెర్ఫార్మ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ వీడియో గత ఏడాదంతా మహా వైరల్ అయింది. చూడబోతే మన దేశంలో మాదిరిగానే అమెరికాలో కూడా కళకు సరైన గౌరవం లేదని అనిపిస్తోంది కదా!.గౌరవం లేకపోతే పాయె.. కానీ, ఈ సమస్య అక్కడితో ఆగడం లేదు. భారతదేశానికి చెందిన ఇలాంటి చోరకళాకారులు అడపాదడపా దొరికిపోతుండడం.. అమెరికాకు వెళ్లదలచుకునే వారి వీసాల ప్రక్రియ మీద కూడా ప్రభావం చూపిస్తోందట. చిన్న చిన్న చేతివాటానికి సంబంధించిన కేసులు ఉన్నా సరే.. అలాంటి వారు అమెరికాలో అడుగుపెట్టకుండా వీసాలు నిరాకరించాలని.. భారత్ లోని యూఎస్ ఎంబసీ ఆలోచిస్తున్నదట. వారి జైలుకు పోవడం సరే.. వారి దెబ్బకు మామూలు వాళ్లు కూడా అమెరికాకు వెళ్లాలంటే.. మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ఇంటి దొంగలు ఇంట్లోనే ఉంటే కొంచెం పరువు దక్కుతుంది బజారున పడి దొంగతనాలు చేస్తే పరువు కూడా బజారుకెక్కుతుంది. చోరకళ అందరికీ అబ్బే విద్య కాదని వారు వాదించవచ్చు గానీ. ఈ అమాయక సమాజం దానిని నేరంగా పరిగణిస్తున్నప్పుడు.. వారు ప్రదర్శించకుండా మౌనంగా ఉండడమే మంచిది. ఏమంటారు?. -ఎం.రాజేశ్వరి👉ఇదీ చదవండి: ‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’ -
మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో సినీ జూనియర్ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?.. అయితే ఈ సందర్భంగా రేవంత్ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?.. ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బెనిఫిట్ షోతోపాటు టిక్కెట్ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!. రేవంత్కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి. సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే.. చంద్రబాబుతోపాటు రేవంత్ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా.. గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సూటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఒక స్పష్టమైన తేడా ఉంది. చంద్రబాబు దాదాపు రోజు ఎక్కడో చోట ఉపన్యాసం ఇస్తుంటారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన అలవాటు అది. ఆయన ఏ ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేయగలరు. కాని జగన్ అందుకు పూర్తి భిన్నంగానే ఉంటారు. రోజూ మీడియాలో కనిపించాలన్న తాపత్రయం వైఎస్ జగన్కు ఉండదు. పక్షానికో, నెలకో మీడియాతో మాట్లాడినా లేదంటే ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆ సందర్భంగా ఏమి చెప్పదలిచినా అత్యధిక శాతం ఆధారాలతో సహా తన వాదన వినిపిస్తారు. జగన్ చెప్పే విషయాలను ఖండించలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఏవేవో ఇతర పిచ్చి విమర్శలు చేస్తుంటారు. మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇది గత ఏడాదిన్నరగా సాగుతున్న వ్యవహారమే!. కొద్ది రోజుల క్రితం జగన్ మీడియా సమావేశంపెట్టి కొన్ని అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. ఆ సందర్భంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన గూగుల్ డాటా సెంటర్.. దాని మూలం ఎక్కడ నుంచి వచ్చింది?.. తన హయాంలో వచ్చిన ఆదాని డేటా సెంటర్ కు దీనికి ఉన్న లింక్ ఏమిటి?.. విశాఖకు తన హయాంలో జరిగిన మంచి ఏమిటి?.. తదితర విషయాలపై సాక్ష్యాధారాలు చూపిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గూగుల్ డాటా సెంటర్ ను స్వాగతించిన తీరు ఆసక్తికరంగా ఉంది. దాని వల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందా? రాదా? అనేదానితో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ఆయన స్వాగతించడం విశేషం. అదే సమయంలో.. తాను తీసుకు వచ్చిన అదాని డాటా సెంటర్కు కొనసాగింపే ఈ గూగుల్ డాటా సెంటర్ అని సశాస్త్రీయంగా రుజువు చేశారాయన. అక్టోబర్ మొదటివారంలో గూగుల్ సంస్థ ఎపి ప్రభుత్వ ఐటి కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ అదానీ సంస్థలకు భూములు కేటాయించాలని కోరిన విషయాన్ని జగన్ బహిర్గతం చేశారు. అంతవరకు ఇదేదో గూగుల్ సంస్థ నేరుగా వచ్చి పెట్టుబడులు పెడుతున్నదని భ్రమించినవారికి నిజం ఏమిటో తెలిసినట్లైంది. అదానీ డాటా సెంటర్కు తన హయాంలో జీవో ఇచ్చి శంకుస్థాపన చేసిన వైనం, అలాగే సీ సబ్ కేబుల్ ను సింగపూర్ నుంచి తీసుకు రావడానికి ఆ దేశప్రభుత్వంతో తన హయాంలో జరిగిన సంప్రదింపుల లేఖలుమొదలైన వాటన్నింటిని ప్రజలకు చూపించారు. ఇప్పుడు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నది ఆ అదానీ గ్రూపేనని.. మొత్తం నిర్మాణం పూర్తి అయిన తర్వాత గూగుల్ దానిని లీజుకు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ..చంద్రబాబు మాత్రం అదానీ పట్ల కనీస కృతజ్ఞత చూపలేదని, అదానీ పేరు చెబితే తనకు(జగన్కు) ఎక్కడ పేరు వస్తుందోననే అలా చేశారని వివరించారు. నిజంగానే అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అదానీకి ప్రాదాన్యత ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్తపడడం అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ నేతలు ఈ గూగుల్ డేటా సెంటర్ ను చంద్రబాబు, లోకేష్ లు సాదించారన్న ప్రచారం చేస్తున్న తరుణంలో దానిని జగన్ పటాపంచలు చేసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమి చేశారన్నదానితో సంబంధం లేకుండా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. విశాఖ డేటా సెంటర్ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఎక్కడా చంద్రబాబు, లోకేష్ల పేర్లు ప్రస్తావించకపోవడం గమనించాల్సిన అంశం. ఇది ఆ ఇద్దరికీ నిరాశ కలిగించి ఉండొచ్చు. ఒక వేళ సుందర్ పిచాయ్ వీరికి నేరుగా లేఖ రాసి ఉంటే గనుక.. ఎల్లో మీడియా భూమ్యాకాశాలు దద్దరిల్లేలా హోరెత్తించి ఉండేవేమో!. ఇదే సందర్భంలో.. జగన్ చాలా స్పష్టంగా డాటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని, ఎకో సిస్టమ్ అభివృద్ది అవుతుందని, అందుకే ఆ సమయంలో తాము అదానీని డాటా సెంటర్తో పాటు ఐటీ బిజినెస్ పార్క్, రీక్రియేషన్ సెంటర్ తదితర సంస్థలు ఏర్పాటు చేసి 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న షరతు పెట్టామని చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలను కూడా ఆయన చూపించారు. తన హయాంలో 300 మెగావాట్ల డాటా సెంటర్కు ప్లాన్ చేస్తే.. దాని కొనసాగింపుగా ఇప్పుడు వెయ్యి మెగావాట్ల సెంటర్ ను ప్లాన్ చేశారని వివరించారు. అలా డాటా సెంటర్ క్రెడిట్ను చంద్రబాబు చోరి చేశారని జగన్ ఎత్తిపొడిచారు. అయితే.. ఇప్పటిదాకా దీనికి నేరుగా ప్రభుత్వ పక్షాన ఎవరూ సమాధానం ఇవ్వలేకపోయారు!. జగన్ ఏదో ఈ డాటా సెంటర్కు అడ్డుపడుతున్నారన్న ప్రచారం చేయాలని తలపెట్టిన టీడీపీకి.. ఆ పార్టీ అనుకూల మీడియాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ కూడా. దీనికి తోడు హైదరాబాద్ కు సంబందించి చంద్రబాబు నిత్యం చేసుకునే ప్రచారాన్ని కూడా ఆయన పూర్వపక్షం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం నుంచి హైదరాబాద్ తో చంద్రబాబుకు సంబందం ఎక్కడ ఉందని, ఈ కాలంలో జరిగిన అభివృద్దికి వైఎస్ఆర్, కేసీఆర్ కారణమని స్పష్టం చేశారు. అలాగే తొలుత నేదురుమల్లి జనార్దనరెడ్డి హయాంలో రాజీవవ్ గాంధీ సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేసిన ఫోటోను, తదుపరి ప్రైవేటు సంస్థ ద్వారా ఒక భవనం కట్టించి దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టి,మొత్తం నగరాన్ని తానే కట్టించానని బిల్డప్ ఇస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిలో ఏ ఒక్కదానిని ఖండించలేని నిస్సహాయ స్థితి చంద్రబాబు బృందానిదే అని చెప్పాలి. దానికి కారణం జగన్ ఏమి చెప్పినా సాక్ష్యాధారాలతో సహా మాట్లాడడమే. మరో వైపు మంత్రి లోకేష్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.86 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. జగన్ మాదిరి ఎక్కడా ఆధారాలు ప్రదర్శించలేదు. అందుకే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక వ్యాఖ్య చేశారు. గూగుల్ కంపెనీతో ఆ మేరకు ప్రకటన ఇప్పిస్తే తాము లోకేష్ కు సన్మానం చేస్తామని ప్రకటించారు. లోకేష్ సలహాదారులు ఎవరో కాని, బాగా అబద్దాలు చెప్పించారనిపిస్తుంది. దాని వల్ల ఆయన ప్రతిష్టకు నష్టం అని కూడా వారు భావించినట్లు లేదు. తీరా చూస్తే అసలు గూగుల్కు ప్రపంచం అంతా కలిపి 1.83 వేల మంది ఉద్యోగులు ఉంటే.. ఒక్క విశాఖ పట్నంలోనే అంతమంది ఎలా వస్తారన్న సింపుల్ కొశ్చెన్ కు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు. జగన్ టైంలో అదానీకి ప్రధానంగా భూమి మాత్రమే సమకూర్చితే.. ఇతర రాయితీలు భారీ ఎత్తున ఇవ్వలేదు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 22వేల కోట్ల మేర రాయితీలు, అది కూడా కేవలం 200 ఉద్యోగాల కల్పించబోతున్న సంస్థకు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సందర్భంలో ఎల్లోమీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేసే యత్నం చేసింది. విశాఖపై సాక్షి పత్రిక విషం చిమ్మిందని నీచమైన అసత్యాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళే యత్నం చేసింది. నిజానికి గతంలో జగన్ విశాఖకు ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఆ నగరంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎన్ని దారుణమైన కధనాలు రాసింది పాత పత్రికలు, అప్పటి వీడియోలు చూస్తే తెలుస్తుంది. అసలు అదానీకి మొత్తం కొండ అంతా రాసిచ్చేశారని డాటా సెంటర్ ఏర్పాటు నేపధ్యంలో విషం చిమ్మింది ఎల్లో మీడియా. అంతేకాదు.. ఆ రోజుల్లో విశాఖ వద్ద సముద్ర మట్టం పెరుగుతోందని, చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా ఆ సందర్భంలో అబద్దాలను సృష్టించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. సముద్రం తీరాన భోగాపురం, మూల పేట వరకు రోడ్డు వేయాలని సంకల్పిస్తే.. ఇళ్లకు నష్టం జరుగుతుందని ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు.ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారు. గూగుల్ డాటా సెంటర్ అనండి.. మరొకటనండి.. ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించరు. అలాగని, దానివల్ల వచ్చే సమస్యల గురించి ప్రశ్నించడం తప్పని కూటమి ప్రభుత్వం అంటున్నా.. ఎల్లో మీడియా ఏడుపు లంఖించుకున్నా.. అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కచ్చితంగా ఎలాంటి సందేహాలు ఉన్నా, నివృత్తి చేసి ముందుకు వెళితే మంచిదని చెప్పాలి. నకిలీ మద్యం మాఫియా, ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిన వైనం, పంటలకు గిట్టుబాటు దరలు లేక రైతులు పడుతున్న పాట్ల గురించి కూడా ఇలాగే ఆదారాలతో జగన్ ప్రసంగించారు. జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే పరిస్తితి లేనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏదో విధంగా ఎదురుదాడి చేసి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకుంది. అదానీ డాటా సెంటర్ కు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలకు.. చంద్రబాబు లేదంటే లోకేష్లు నేరుగా పాయింట్ వైజ్ జవాబు ఇచ్చి ఉంటే అర్దవంతంగా ఉండేది. ఆ పని చేయలేకపోతున్నారు కాబట్టే పాలన సామర్ధ్యంలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధవంతం అనిపిస్తాయి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో నకిలీ మద్యం.. ప్రమాదకరం కాదంట!
ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఎల్లోమీడియా వింత పోకడలకు పోతోంది. ల్యాబ్ నివేదికలపై చిత్ర విచిత్రమైన కథనాలు ప్రచురిస్తోంది. మద్యపానం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని ప్రచారం చేయాల్సిన బాధ్యతాయుతమైన మీడియా సంస్థ, కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గత ఎన్నికల సమయంలోనే నాణ్యమైన మద్యమిస్తామని జనాన్ని మభ్యపెట్టిన విషయం ఒకసారి గుర్తుచేసుకోవాలిక్కడ. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా తాము గెలిస్తే రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని నిస్సిగ్గు ప్రచారం కూడా చేసుకుందీ కూటమి. అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచిన మద్యం దుకాణాలను కాస్తా ప్రైవేటకు అప్పగించేసింది. ఈ బాధ్యతారహితమైన నిర్ణయమే నకిలీ మద్యం దందాకు, కుంభకోణానికి దారితీసిందన్నది అంచనా. గత ప్రభుత్వం మాదిరిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా విక్రయాలు జరపకపోవడం, విచ్చలవిడిగా పర్మిట్ రూములను అనుమతించడం, బెల్ట్షాపుల అణచివేతకు చర్యలు తీసుకోకపోవడం వంటి ఇతర కారణాలు కూడా మార్కెట్లో అసలుకు, నకిలీకి మధ్య తేడా తెలియని స్థితికి నెట్టింది. ఇదే ఛాన్సుగా భావించిన కొందరు టీడీపీ నేతలు ఫ్యాక్టరీ పెట్టిమరీ నకిలీ మద్యాన్ని తయారు చేసి పంపిణీ చేయడం మొదలుపెట్టారు. సరుకు నిల్వలకు ప్రత్యేక ఏర్పాట్లు, హైదరాబాద్ నుంచి సరఫరా వంటి అనేకాకనేక అక్రమాలకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు వద్ద నకిలీ ప్లాంట్, ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఒక డంప్ బయటపడ్డాయి. తరువాతి కాలంలో ఎక్సైజ్ పోలీసులు కొందరిని పట్టుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నకిలీ మద్యంతో చాలామంది అనారోగ్యానికి గురై ఉండవచ్చునని, మృత్యువాత పడి ఉండవచ్చునని అనుమానాలు ఉన్నాయి. నకిలీ మద్యం కుంభకోణాన్ని కాస్తా వైసీపీవైపు తిప్పేందుకు అధికార టీడీపీ విఫలయత్నం చేసింది. సొంతపార్టీ నేతలే పలువురు కీలక సూత్ర, పాత్రధారులుగా స్పష్టం కావడంతో రోజుకో కొత్త కథతో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ములకలచెరువుతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లభించిన నకిలీ మద్యం శాంపిళ్లను పరీక్షల కోసం పంపగా.. వచ్చిన ఫలితాలను మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా నకిలీ మద్యం తయారు చేశారని, ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదని లాబ్ అధికారులు నివేదించారని తెలుగుదేశం మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక సమాచారం.. ప్రకారం.. నీళ్లు, స్పిరిట్, రంగు ,రుచి రసాయనాలతో నకిలీ మద్యం తయారైందని గుంటూరు లాబ్ నివేదిక ఇచ్చిందట. వారికి అందిన 45 శాంపిల్స్ నకిలీ మద్యమేనని తేల్చిందట. అండర్ ఫ్రూఫ్, ఓర్ ఫ్రూఫ్లలో భారీ వత్యాసం ఉందని కనుగొన్నారు. లాబ్ రిపోర్టు తీవ్రత తగ్గించి చూపడానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. బార్లు, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ ల ముసుగులో నకిలీ మద్యం దందా సాగుతోందని ఆయన అన్నారు. ఈ 16 నెలల్లో వైన్ షాపుల ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపులు, రూ.99 రూపాయల ధర కలిగిన లిక్కర్ సేల్స్ వివరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం ఆదాయంపై విపరీతంగా ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వం నకిలీమద్యం పేరెత్తితే కేసులు బనాయించేందుకు సిద్ధమవుతోంది. దుగ్గిరాల మండలంలో పెరిగిపోతున్న బెల్ట్ షాపుల గురించి లేఖద్వారా తెలియజేసినందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ చిర్రుబుర్రులాడారట. ఆ కోపంతో ఆయన తన భర్త దాసరి వీరయ్యపై అక్రమంగా హత్యకేసు బనాయించారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ వాపోతున్నారు. పేర్ని నాని మరో సంచలన విషయం చెప్పారు. బార్ల యజమానులకు ప్రభుత్వం నిర్దిశించిన ఫీజ్ కట్టాలంటే విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర నగరాలలో రోజుకు మూడు లక్షల రూపాయల మద్యం అమ్మాల్సి ఉంటుందట. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నెలకు రూ.80 లక్షల విలువైన సరుకు కొనాలట. ఈ బార్లవారు నెలకు ఎంత సరుకు కొంటున్నారో వివరాలు బయటపెట్టగలరా అని పేర్ని నాని సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలంటే ఆ వివరాలు వెల్లడించాలి. బార్లలో అమ్మే మద్యంలో పదిశాతం కూడా ప్రభుత్వం వద్ద కొన్నది కాదని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అయితే సంచలనమే అని చెప్పాలి. 500 బార్ల నుంచి నెలనెలా రూ.5 కోట్లు అడ్వాన్స్ గా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది నకిలీ మద్యం కన్నా భారీ కుంభకోణం అని ఆయన అంటున్నారు. గతంలో ఎల్లో మీడియా.. నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చిన మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయిస్తేనే నాసిరకం మద్యం అని, పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రచారం చేసింది. చంద్రబాబు అయితే ఏకంగా 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మితే దానిపై ఫేక్ ప్రచారం జరుగుతోందని ఎదురుదాడి చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి కేసులు పెడుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాపై పోలీసులతో వెంటాడుతున్నారు. సాక్షిని, సోషల్ మీడియాను అణచివేస్తే నకిలీ మద్యం సమస్యను కప్పిపుచ్చవచ్చని భ్రమ పడుతున్నారు. దానికి ఎల్లో మీడియా నకిలీ మద్యం ప్రమాదకరం కాదంటూ వంతపాడుతూ సమాజానికి ద్రోహం చేస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. భ్రాంతి కాకూడదు!
హైదరాబాద్లో భూమి ధరలు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. ఎకరా భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికిందంటే ఆశ్చర్యమేస్తోంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవన్న వార్తలొస్తున్న వేళ ఒక కంపెనీ ఇంత మొత్తం పెట్టిందంటటే నమ్మశక్యం కాదు. వేలం పాటలో కొన్నమాటైతే వాస్తవం. అయితే కొనుగోలు ధర పూర్తిగా చెల్లించినప్పుడే ఈ విలువ ధృవీకరణ అవుతోంది.తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నది దుష్ప్రచారమేనని వాస్తవం లేదని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో రూ.2800 కోట్ల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే, అది రూ.4804 కోట్లు అని రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇదే ఆధారమని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే జనాభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కాస్త బాగున్న రోజుల్లో బుక్ అయిన ఇళ్లు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుండవచ్చని, ప్రస్తుతం బుకింగ్ ఎంత మేరకన్నది కూడా చూడాలంటున్నారు వారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణతోపాటు దేశాద్యంతం కూడా మందగతిలోనే ఉందని వారు చెబుతున్నారు.కొన్ని రోజుల క్రితం తెలంగాణ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ రాయదుర్గ్లోని 7.67 ఎకరాల భూమిని వేలానికి పెడితే ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1350 కోట్లకు దక్కించుకుంది. పెస్టీజ్ రియాల్టీ ఇంకో 11 ఎకరాలను ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.2913 కోట్ల ఆదాయం దక్కిందన్నమాట. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల రూపంలో ఇంకో రూ.225 కోట్లు కూడా రానున్నాయి. అయితే గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే.. వేలం పాడిన ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేంతవరకూ కొనసాగుతాయా అన్న అనుమానం వస్తుంది. 2023లో కోకాపేటలో ఎకరాకు రూ.100.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అప్పటితో పోలిస్తే ధర సుమారు 76 శాతం పెరిగిందన్నమాట. హైదరాబాద్ సాధిస్తున్న సుస్థిరాభివృద్ధి, గ్లోబల్ బిజినెస్ హబ్గా మారడం, మౌలిక వసతులు తదితరాలు ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ ఎండీ శశాంక అభిప్రాయపడ్డారు. ఇవన్నీ వాస్తవమైతే ఫర్వాలేదు కానీ.. బలవంతంగా మార్కెట్ను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం బెడిసికొడుతుందని రియల్ ఎస్టేట్ రంగం అనుభవజ్ఞులు చెబుతున్నారు.ఎకరా భూమికి రూ.177 కోట్లు, రూ.141.5 కోట్లు పెట్టి కొన్న కంపెనీలు నిర్మాణాలు పూర్తయిన తరువాత ఎంత కాదన్నా అన్ని ఖర్చులు కలుపుకుని చదరపు అడుగు రూ.30 - 40 వేల కు అమ్ముకోవాల్సి వస్తుందని కొందరు బిల్డర్ల అంచనా. అయితే ఆ ప్రాంతంలో ఎఫ్ఎస్ఏ ఎక్కువ కాబట్టి ఏభై, అరవై అంతస్థుల నిర్మాణానికి కూడా అనుమతులు లభిస్తాయని... ఆ రకంగా చదరపు అడుగుకు రూ.10 - 20 వేలకు అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుందని మరికొందరి అంచనా. మరీ ఎక్కువ ధర పెడితే కంపెనీలు కూడా కొనుగోలుకు ఆలోచిస్తాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడిపై ఒక శాతం కూడా గిట్టుబాటు కాదనుకుంటే ఎందరు కొనుగోలు చేస్తారు అని ఒక ప్రముఖ బిల్డర్ ప్రశ్నించారు.కోకాపేటలో పక్కనే 50 - 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో దాని ధర రూ.వంద కోట్లయితే తనదీ అంతే పలుకుతుందన్న అంచనాతో గతంలో ఒక కంపెనీ వేలంలో పాల్గొందని సమాచారం. అయితే ఆ అంచనాలు తారుమారు కావడంతో ఆ కంపెనీ తన డిపాజిట్ను వదులుకుంది మినహా ఎకరాకు రూ.వంద కోట్లు చెల్లించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుత వేలం పాటలలో పాల్గొన్న కంపెనీలలో ఒక రాజకీయ నేత భాగస్వామిగా ఉన్నారు. ఇటీవలే రియల్ ఎస్టేట్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడియన ఆయన కంపెనీనే ఇంత భారీ మొత్తానికి వేలం పాటలో పాల్గొనడం వెనుక మతలబు ఏమిటన్నది ప్రశ్న. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికా ప్రభుత్వ విధానాలు, ప్రత్యేకించి ట్రంప్ సుంకాలు భారత్పై ప్రభావం చూపుతున్నాయి. ఏఐ కారణంగా ఐటీ రంగం అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు గతంలో మాదిరిగా రుణాలపై అపార్టుమెంట్లు కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. పైగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలు, అపార్ట్మెంట్లు కొనుగోలుదారులు, అద్దెదారుల కోసం వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నంతలో హైదరాబాద్ కాస్తో, కూస్తో బెటర్గా ఉండవచ్చేమో కాని, ఈ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేసేంతగా ఉండకపోవచ్చని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఇంకో సంగతి గుర్తు చేసుకోవాలి. హెచ్ఎండీయే ఇటీవలే హైదరాబాద్ శివార్లలో 103 ప్లాట్లను వేలం వేస్తే, మూడు మాత్రమే అమ్ముడుపోయాయి. వేలం ద్వారా రూ.500 కోట్లు వస్తాయని ఆశిస్తే, రూ.38 కోట్లే వచ్చాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఎకరం రూ.177 కోట్లకు కొనేంత మార్పు వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చివరి రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మరింతగా దిగజారిందన్న అపప్రథ ఉంది. దీనిని కప్పిపుచ్చడానికి రేవంత్ ప్రభుత్వం ఏదో మాయాజాలం చేసి ఉండాలని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు ప్రముఖ సంస్థలపై ఒత్తిడి తెచ్చి, ఇతరత్రా మేలు చేస్తామని ఆఫర్ ఇచ్చి ఈ స్థాయిలో ధర పలికేలా చేశారన్నది కొందరి అనుమానం. ఈ రెండు కంపెనీలు గడువులోపు డబ్బును చెల్లిస్తే రేవంత్ ప్రభుత్వ విశ్వసనీయత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అమాంతంగా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఫ్యూచర్ సిటీపై కూడా పడుతుంది. అక్కడ కూడా లావాదేవీలు పుంజుకుంటాయి. రీజినల్ రింగ్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ - విజయవాడ రోడ్లు విస్తరణ, కొత్తగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే వంటివి కూడా కార్యాచరణకు వచ్చినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఇంతకాలం నేచురల్ గా గ్రోత్ ఉండడం వల్ల భూముల ధరలు పెరిగాయి. అయితే ఇవీ మరీ పెరిగిపోతే మధ్య తరగతికి అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబును రక్షించేందుకేనా ‘ఉచిత’ సలహా?
ప్రజాకర్షక పథకాలు, వారసత్వ రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సమయం సందర్భం వెనుక ఉద్దేశం ఏమిటా? అనేదీ చర్చనీయాంశంగా మారింది. ఉచితాల గురించి ఆయన గతంలోనూ కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సంక్షేమ పథకాలను రాజకీయం కోసం వాడుకుంటున్న వారికి మద్దతిచ్చి విమర్శలకు గురయ్యేవారు. అలాంటిది తాజాగా.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘స్వర్ణ భారతి ట్రస్టు’లో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాల వంటివి మహిళలకు కాకుండా దివ్యాంగులకైతే అమలు చేయవచ్చునని, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తారన్న దానిపై స్పష్టత ఉండాలని, అప్పులను ఎలా తీర్చుతారో కూడా ప్రజలకు తెలియ చేయాలని ఆయన సూచించారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ది చేస్తే పేదరికం తగ్గుతుందని, ఉచితాల వల్ల కాదని అన్నారు(Venkaiah Naidu Shocking Comments On CBN Govt). వెంకయ్య నాయుడు వ్యాఖ్యలలో తప్పేమీ లేదు కానీ.. ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏపీ సర్కారును సంక్షోభం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేక చంద్రబాబుతో కాస్త తేడా వచ్చిందా అన్న అనుమానం వస్తుంది. అయితే వెంకయ్య నాయుడు, చంద్రబాబు, లోకేశ్లు ఇటీవలే ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. దీన్నిబట్టి ఊస్తే పొరపచ్చాలు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఇదీ చదవండి: అడ్డగోలు ఉచితాలెందుకు? ఏపీ సర్కార్పై ఘాటు వ్యాఖ్యలుఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అలవిగాని హామీలను అమలు చేయలేక నానా పిల్లిమొగ్గలు వేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్సహా సుమారు 150 వరకూ వాగ్ధానాలిచ్చిన కూటమి నేతలు ఏడాదిపాటు వాటి అమలును ఎగవేసి ఆ తరువాత కూడా అరకొరగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించాయి. అది కూడా ప్రజల నిరసన నుంచి తప్పించుకునేందుకు మాత్రమే. ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి షరతుల్లేకుండా తిరగవచ్చని ఊరించిన చంద్రబాబు అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏసీ బస్సుల్లో ఎక్క కూడదని, సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ అనుమతించమని, పదహారు రకాల బస్సు సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత స్కీము అమలు మొదలుపెట్టారు. అంతేకాకుండా.. బస్సు సర్వీసులను బాగా తగ్గించి నడుపుతూండటంతో ఉచిత స్కీము ఉన్నా లేనట్టుగా మారిపోయింది. మరోవైపు ఈ స్కీము వల్ల ఆటోలు నడుపుకునే వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళనకు దిగడంతో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. ప్రచారం సమయంలో 13 లక్షల మంది ఆటోల వారు ఉన్నారని చెప్పి, మూడు లక్షల మందికే ఈ సాయం ఇచ్చారు. రోజుకు వెయ్యి నుంచి రెండువేల వరకు సంపాదించుకునే తమకు ఇప్పుడు రూ.200 నుంచి రూ.500 రావడమే గగనం అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున ఇస్తే ఏ అవసరం తీరుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవే. కాకపోతే ఎన్నికల మానిఫెస్టో ప్రకటించినప్పుడే ఈ కామెంట్లు చేసి ఉంటే అంతా మెచ్చుకునేవారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ, జనసేనలు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలను ఎలా మోసం చేయబోతున్నారో వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని లెక్కగట్టి మరీ చెప్పారు. అయినా అప్పట్లో వెంకయ్య నాయుడు వంటివారు దానిపై కూటమి నేతలను ప్రశ్నించలేదు. పరోక్షంగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు సర్కారుకు వాటి నుంచి బయటపడడానికి ఒక మార్గం చూపుతున్నారా? అనే సందేహం వస్తుంది. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేశారు. 1996 ఎన్నికల సమయంలో మద్య నిషేధం, కిలో రెండు రూపాయల బియ్యం పథకం వంటి వాటిని అమలు చేస్తామని ప్రచారం చేసిన ఆయన తదుపరి ఆ స్కాముల వల్ల నష్టం జరుగుతోందని, ప్రజాభిప్రాయం సేకరణ తంతును నిర్వహించి వాటన్నిటిని రివర్స్ చేశారు. గత టర్మ్లో రైతులకు పూర్తిగా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు కాని చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం మీడియాను, వెంకయ్య వంటివారితో ముందుగా ప్రచారం చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టామని చెప్పి, స్కీములకు ఎగనామం పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరగుతోందా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే.. టీడీపీ మీడియా కూడా కొన్నాళ్ల క్రితం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చింది. ఇదే మీడియా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అద్భుతం అంటూ ప్రచారం చేసేది. అధికారం వచ్చాక చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా ప్రజలను మాయ చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది. ఆ విన్యాసాలలో వెంకయ్య నాయుడు వంటివారు భాగస్వాములు కారాదని అంతా కోరుకుంటారు. విద్య, వైద్యానికి సంబంధించి జగన్ చేసిన కృషి కళ్లకు కనబడుతున్న విషయమే. అయినా వెంకయ్య నాయుడు ఎన్నడూ మెచ్చుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఎవరిమీదో ప్రేమతో కాకుండా, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడితే మంచి విలువ వస్తుంది. వెంకయ్య ఆ పని చేశారా అన్నది ప్రశ్న. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాని తెలుగుదేశంలోని వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు ఆయన ప్రస్తావించరన్న సంశయం వస్తుంది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న విధానం గురించి తన అబిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది. ఈ పదిహేడు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన రూ.2.10 లక్షల కోట్ల రుణం గురించి కూడా వెంకయ్య కామెంట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు. ఈ మధ్యకాలంలో బీహారు ఎన్నికల నేపథ్యంలో 75 లక్షల మంది మహిళలకు రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. దానికి ప్రదాని మోదీ బటన్ నొక్కారు. 2014లో బీజేపీలో వెంకయ్య నాయుడుకు ముఖ్య భూమికే ఉండేది. అయినా ఆ పార్టీ చేసిన వాగ్ధానాలతో ఎన్ని ప్రజాకర్షక విధానాలు ఉన్నాయో ఆయనకు తెలియవా? అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో.. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకు వచ్చి రూ.15 లక్షల చొప్పున పంచుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసేవారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విషయాలన్ని పలుమార్లు ప్రస్తావించేవారు. ఆ తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు కూడా మంత్రి. పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్య నాయుడు స్పందించారు. కాని ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసిన తీరు కూడా విమర్శలకు గురైంది. ఎన్డీయేకి దూరమైన సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో ఎంత వేగంగా అనర్హత వేటు వేసింది కూడా చర్చనీయాంశమైంది. 2014 టర్మ్లో ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న అంశం గురించి కూడా వెంకయ్య పల్లెత్తు మాట అన్నట్టు లేదు. చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన మాటకు విలువ వచ్చేది. మరో సంగతి కూడా చెప్పాలి. ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా తన పరపతి ఉపయోగించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజీ కుదర్చిన వారిలో ఉన్నారని చెబుతారు. తాజాగా ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్లు, అందులో టీడీపీ నేతల పాత్రపై కూడా వెంకయ్య నాయుడు గట్టిగా మాట్లాడి ఉంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చినవారై ఉండేవారేమో కదా!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణమేమిటో?
ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది. ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్కే రంగులు, ఎస్సెన్స్లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?.. మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలివితక్కువ కథ(నా)లకు కేరాఫ్గా..
మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ, లోక్సభలో వైఎస్సార్ పార్టీ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావడం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థకు చెంపపెట్టే. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా జరిగిన ఈ అక్రమ అరెస్ట్ ప్రత్యేక అధికారుల బృందం (సిట్)తోపాటు, కల్పిత కథలతో మద్యం కేసంటూ శివాలెత్తిన ఎల్లోమీడియాకూ పెద్ద హెచ్చరికగా కూడా చూడొచ్చు. ఎల్లోమీడియా కథనాలు చదివితే అర్థమయ్యేది ఒక్కటే. జర్నలిజానికి, నైతిక విలువలకు ఎప్పుడో పాతరేశారు అని. ఇంతకీ ఏసీబీ కోర్టు ఏమంది? మద్యం కేసులో మిథున్ రెడ్డి పాత్రను, మాస్టర్మైండ్ అనేందుకూ ప్రాథమిక ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. ముడుపుల వసూళ్ల ఆరోపణలకు, నేరపూరిత కుట్రకూ ఆధారాలెక్కడని ప్రశ్నించింది. సహ నిందితుల వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత ఉండదని తేల్చింది. ఒట్టి ఆరోపణల ఆధారంగా పౌరుల బెయిల్ హక్కును నిరాకరించలేమని వ్యాఖ్యానించింది. జర్నలిజానికి విలువిచ్చే ఏ మీడియా సంస్థ అయినా.. మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, బెయిల్ వచ్చిన సందర్భంలోనూ వార్తకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అరెస్ట్ను పతాక శీర్షికలకు చేర్చి బెయిల్ వార్తను అప్రధాన్యంగా మొక్కుబడిగా ఇవ్వడాన్ని బట్టే వీరి నైజం ఏమిటన్నది అర్థమైపోతుంది. ఈ క్రమంలో వారు కోర్టు వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోలేదు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు అటు ఎల్లోమీడియా, ఇటు పోలీసులు అధికారుల వద్ద కూడా సమాధానాలు లేవు. దీన్నిబట్టి చూస్తే జగన్ హయాంలో స్కాముల కోసం ఎల్లోమీడియా భూతద్దం వేసి చూసినా ఏమీ దొరకలేదన్నది స్పష్టమైంది. అందుకే ఒక మద్యం కేసు కట్టుకథ సృష్టించారు. డిస్టిలరీ కంపెనీలు ముడుపులు ఇచ్చాయంటూ చిత్రమైన కథ అల్లారు. ముడుపులు ఇవ్వాల్సి వచ్చిందని, ఇచ్చామని కంపెనీలు కదా ఫిర్యాద చేయాల్సింది? కానీ ఈ కేసులో ఎవరో దారినపోయే దానయ్య ఫిర్యాదు ఇస్తే రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆఘమేఘాల మీద విచారణకు ఆదేశించడం. హుటాహుటిన సిట్ ఏర్పాటు జరిపోయాయి. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం అన్నమాట. పైగా ఇదే కేసులో నిందితుడు అంటూనే సిట్ విజయసాయిరెడ్డి జోలికి అస్సలు వెళ్లకపోవడం అనుమానాలను ధ్రువీకరిస్తుంది. గత ఆగస్టులో సిట్ వేసిన ఛార్జ్షీట్పై న్యాయస్థానం 21 అభ్యంతరాలను లేవనెత్తింది. దారిమళ్లాయని చెబుతున్న రూ.3,500 కోట్ల వివరాలు ఎక్కడ అనడం ఒకటైతే... సిట్ అధికారులు న్యాయస్థానం నుంచి ఏమి అభ్యర్థిస్తున్నారో చెప్పాలని అడగడమే విశేషం. ఛార్జ్షీట్లోని లోపాలను తాము అడిగిన విధంగా కూడా సరిదిద్దలేదని న్యాయస్థానం పోలీసులు ఇచ్చిన జవాబుపై వ్యాఖ్యానించడం గమనార్హం. తర్వాత రోజుల్లో ఈ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. ఛార్జ్షీట్ సక్రమంగా లేకుండా రిమాండును అరవై లేదా తొంభై రోజులకు మించి పొడిగించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. సిట్ కప్పగెంతులు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా ఎల్లో మీడియా మాత్రం ఏదో కొత్త విషయం కనిపెట్టినట్లు కథనాలు వండుతూ ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేసింది. తేదీలతో నిమిత్తం లేకుండా ఈనాడులో వచ్చిన కొన్ని స్టోరీలను చూద్దాం. ‘‘మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు, ‘‘డొల్ల కంపెనీలు, హవాలా ద్వారా రూ.400 కోట్ల తరలింపు’’ - మరికొన్ని మొత్తాలు యూకే, దుబాయి, అమెరికాకు తరలింపు.. ‘‘హవాలా ఏజెంట్ల విచారణలో సిట్కు కీలక అధారాలు లభ్యం’’ ..అని ఒక రోజు రాశారు. మరి ఆ తర్వాత అది ఏమైపోయిందో తెలియదు. అలాంటి అభియోగాలతో వారు చెబుతున్న బిగ్ బాస్ పై కేసు పెట్టలేదే! అంటే తప్పుడు ప్రచారం కోసం అల్లిన కథేనని తెలియడం లేదూ! మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలింపు అని పెద్ద హెడింగ్ పెట్టి ఈడీ సోదాలలో కీలక ఆధారాలు లభ్యం అని కొద్ది రోజుల క్రితం రాశారు. ఆ తర్వాత ఆ కథ ఏమైందో తెలియదు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై స్టోరీ ఇస్తూ డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు అన్నారు. దీన్ని చెవిరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సవాల్ చేశారు. ఆ వార్తను కప్పిపుచ్చారు. మిథున్ రెడ్డి అరెస్టు అయినప్పుడు భారీ కథనం ఇస్తూ బిగ్ బాస్ తరపున దోపిడీకి కుట్ర, అమలులో ప్రధాన పాత్ర, ముడుపుల వసూళ్ల నెట్ వర్క్ రూపొందించింది ఆయనే అని ఈ పత్రిక పేర్కొంది. సిట్ ఆధారాలు సేకరించిందని కూడా రాసేసింది. మరి అది నిజమే అయితే ఆ ఆధారాలేమిటో కోర్టు ముందుకు ఎందుకు ఉంచలేకపోయారో ఇప్పుడు రాయాలి కదా! ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు స్వయంగా తేల్చి చెప్పింది. మద్యం స్కామ్ ఛార్జ్షీట్లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావించారని ఈ పత్రిక తెలిపింది. కల్పిత కథలో ఆయననే టార్గెట్గా పెట్టుకున్నప్పుడు ఆ పేరు రాయకుండా ఎలా ఉంటారు. కాని ఏ చిన్న ఆధారం ఉన్నా ఈ పాటికి అరెస్టు అంటూ హడావుడి చేసేవారు కదా!. గతంలో ఓటుకు నోటు కేసులో ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు 33 సార్లు ప్రస్తావించారు. అయినా ఆయన నిందితుడు కాకుండా ఎలా తప్పించుకున్నారో ఈ మీడియా ఎన్నడూ రాయలేదు. ఆ సన్నివేశం అంతా చూసిన ఓపెన్ కేసే అనే సంగతి తెలిసిందే. ఇప్పుడేమో కల్పిత స్కామ్ పేరుతో కథ నడుపుతున్నారు. మద్యం కేసులో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి అంటూ ఇంకో రోజు ప్రచారం చేశారు. సిట్ కు ఆధారాలు దొరికపోయాయని కూడా సంబరపడ్డారు. ఇప్పటికీ అదేమీ తేలలేదు. పదహారు డిస్టిలరీల ముడుపులే రూ.1677 కోట్లు అని సిట్ వీరికి చెప్పిందట. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ కంపెనీలు బ్రాండ్ ప్రమోషన్ పేరుతో పలు సంస్థల ఖాతాలలోకి మళ్లించి, నగదు విత్ డ్రా చేయించి ఆ మొత్తాన్ని ముడుపులుగా చెల్లించి, తర్వాత వైకాపా ముఠా ఈ డబ్బును స్థిరాస్తి రంగంలోకి, డొల్ల కంపెనీలలోను పెట్టేదట. హవాలా ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరేది అని సిట్ తేల్చిందట. ఇది చదువుతుంటే ఇంత తెలివితక్కువగా కథలు సృష్టిస్తారా అనిపించదా! .. బ్యాంకు ఖాతాల నుంచి ఇంత భారీ మొత్తాలలో విత్ డ్రా చేస్తే పట్టుకోవడం పోలీసులకు చేతకాదా?. మరి ఆ డబ్బు గురించి ఛార్జ్షీట్లో ఏమైనా రాశారా??.. అంటే అదీ ఉన్నట్లు లేదు. ఈనాడుతోపాటు ఆంధ్రజ్యోతి కలిసే ఈ కల్పిత గాథలను సృష్టించాయన్న అభిప్రాయం ఉంది. పోలీసులు వీరికి అండగా నిలుస్తూ వారి పాత్ర వారు పోషించారనుకోవాలి. ఉదాహరణకు.. బాక్సులు బద్దలు-లిక్కర్ స్కామ్ సొమ్ము-రూ.11 కోట్లు సీజ్ అని ఒక రోజు గోలగోల చేశారు. ఇదెలా అని అనుకుంటుండగానే, ఈ కేసులో నిందితుడు అయిన రాజ్ కెసిరెడ్డి ఆ డబ్బు తనది కాదని, ఆ నోట్లపై నంబర్లు రికార్డు చేయండని అనగానే సిట్ అధికారులు జారుకున్నారు. ఆ డబ్బును కోర్టులో జమ చేయలేకపోయారు. పైగా బ్యాంకులో జమ చేసేసినట్లు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఆ డబ్బు విడిగా ఉంచారో, లేదో తెలియదు. అలాగే వెంకటేష్ నాయుడు కథ మరొకటి. గుట్టలు, గుట్టలుగా నోట్ల కట్టలు.. దోచుకున్న సొమ్ముతో దొరికేశారు.. సిట్ కు చిక్కిన వీడియో అని ఈ ఎల్లో మీడియా హడావుడి చేసింది. తీరా చూస్తే తమ వద్ద ఎలాంటి వీడియో లేదని, వెంకటేష్ నాయుడి ఫోన్ను తెరవనే లేదని సిట్ కోర్టుకు చెప్పింది. ఈ వార్తను మాత్రం తమ పాఠకులకు పూర్తిగా తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. పైగా వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ తదితరులతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటపడడంతో తేలుకుట్టిన దొంగల మాదిరి గప్ చుప్ అయిపోయారు. ఈ కేసులో ఏ ప్రముఖుడిని అరెస్టు చేస్తే అతనే కీలకమని సూత్రధారి అని, ముడుపుల వసూళ్లు అతని ద్వారానే జరిగాయని అందరిమీద రాస్తూ వచ్చారు. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి డేటా పోయిందని, అదేదో మూడు లక్షల జీబీలు ఉంటుందని, కోట్ల పేజీలతో సమానం అంటూ ఒక కథను ఈనాడు అల్లింది. అది చూసి జనం నవ్వుకున్నారు. ఆ తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ తమ వద్ద నుంచి ఎలాంటి సమాచారం పోలేదని చెప్పడంతో ఈ మీడియా పరువు మరోసారి పోయింది. ఇలా ఒకటి కాదు..గత ఏడాది కాలంలో ఏదో రకంగా వైసీపీని, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టడం కోసం రకరకాల విన్యాసాలను అటు చంద్రబాబు సర్కార్ పోలీసులు, ఇటు ఎల్లో మీడియా ఎడతెగని పాట్లు పడుతూనే ఉంది. ఎటు తిరిగి మిథున్ రెడ్డి తదితరులను కొన్నాళ్లపాటు జైలులో ఉంచి శునకానందం పొందడడం తప్ప, సాధించింది ఏమీ లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మిథున్ రెడ్డి బెయిల్పై విడుదల అయ్యాక మీడియాతో మాట్లాడుతూ తనను జైలులో టెర్రరిస్టు మాదిరి చూశారని ఆవేదన చెందారు. అయినప్పటికీ ఈ తప్పుడు కేసులకు భయపడేది లేదని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఎపి లిక్కర్ స్కామ్ అన్నది ఒక ఊహాజనిత కథ అని ఎప్పటికప్పుడు అర్థం అవుతూనే ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇదేం కవరింగు బాబూ.. మరీ ఇంత అధ్వానమా?
‘‘విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్.. ప్రజలకు తగ్గనున్న వెయ్యి కోట్ల భారం’’.. ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనం.‘‘సమర్థత, అనుభవం.. ఫలితమే ఛార్జీల తగ్గింపు’’.. ఆంధ్రజ్యోతి ఇచ్చిన వార్త‘‘ఈఆర్సీ సీరియస్.. సర్కార్కు షాక్ - దాదాపు వెయ్యి కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు’’.. సాక్షి దినపత్రిక ఇచ్చిన వార్తపైవాటిల్లో సత్యమేది? అసత్యమేది? అనే సంశయం పాఠకులకు రావచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎలివేషన్ ఇవ్వడానికి నిరంతరం పాటు పడుతుంటాయన్న సంగతి తెలిసిందే. కాకపోతే ప్రభుత్వానికి నెగిటివ్గా ఇవ్వాల్సిన వార్తను అలా ఇవ్వకపోతే మానే.. ప్రజలకు పచ్చి అబద్దపు సమాచారం ఇవ్వడానికి ఎక్కడా సిగ్గు పడకపోవడం ఈ రెండు మీడియా సంస్థల ప్రత్యేకతగా మారిపోయింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ తీరుపై నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసి ఛార్జీలు తగ్గించాలని, ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తే, దానిని వక్రీకరించి అదేదో ప్రభుత్వం ప్రజలపై దయతో తగ్గించినట్లుగా కథనాలు ఇవ్వడం పాఠకులను, ప్రజలను మోసం చేయడమే!. ఈ విషయాన్ని సాక్షి మీడియా బహిర్గతం చేసింది. సోషల్ మీడియాలోనూ సమాచారం విస్తారంగా వచ్చింది. దాంతో ప్రభుత్వం పరువుతోపాటు, టీడీపీకి మద్దతిచ్చి అసత్యాలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల బాగోతం మరోసారి బట్టబయలమైంది. సాక్షి, సోషల్ మీడియా లేకపోతే ప్రజలు టీడీపీ మీడియా వండి వార్చిన అసత్యాలనే నమ్మాల్సి వచ్చేది. అసలు విషయం ఏమిటి! 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15,485 కోట్ల అదనపు బాదుడుకు ఈఆర్సీ అనుమతి కోరడం, ఈఆర్సీ యూనిట్కు రూ.5.27లకు కొనుగోలుకు ఓకే చేస్తే డిస్కంలు రూ.5.84 నుంచి రూ.5.89 వరకు కొన్నది వాస్తవం. ఫలితంగా ప్రభుత్వం ప్రజల నుంచి అదనంగా రూ.2787 కోట్ల విద్యుత్ ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరింది. కాని ఈఆర్సీ రూ.1863 కోట్ల అదనపు వసూలుకు అంగీకరించింది. అయినా ప్రభుత్వం, డిస్కమ్ ఏదైనా అనండి.. ఈఆర్సీ ఆదేశాన్ని కాదని రూ.2787 కోట్లు వసూలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఈఆర్సీ అదనంగా వసూలు చేసిన రూ.923 కోట్లు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం యూనిట్కు పదమూడు పైసలు తగ్గుతుంది. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అదనపు బాదుడు బాదకుండా, విద్యుత్ ఛార్జీలను ఎంతో కొంత తగ్గించి ఉంటే అప్పుడు నిజంగానే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. ఆయన సమర్థుడు అని భుజకీర్తులు తగిలించినా బాగానే ఉండేది. అలాకాకుండా.. ఎప్పటి మాదిరే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలనుకోవడమే ఇందులో మతలబు. అసలు కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారం ఎందుకు మోపింది? ఇప్పుడు ఎందుకు ఈఆర్సీ తగ్గింపు ఆదేశాలు ఇచ్చింది చెప్పకుండా అదేదో తమ చంద్రబాబు నిర్ణయం అన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడమే శోచనీయం. కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సుమారు రూ. 19 వేల కోట్ల భారం వేశారని లెక్కలతో సహా వార్తలు వస్తున్నాయి. ఇది ఏపాటి సమర్ధత అవుతుందో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా వారే చెప్పాలి! పోనీ అదెందుకు! డిస్కంలు మరో రూ.12771 కోట్ల అదనపు వసూలుకు ఈఆర్సీని అనుమతి కోరాయి కదా.. దానిని ఉపసంహరించుకుంటామని చంద్రబాబు కాని, ఆయన తరపున ఎల్లో మీడియా కాని ప్రకటిస్తాయా? అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పొగడరా! పొగడరా! అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని పొగిడాడట వెనుకటి ఒకడు. అలాగే ఈ ఎల్లోమీడియా ఎంతకైనా దిగజారుతున్నాయి. జగన్ టైమ్లో విద్యుత్ రంగాన్ని ఎంత సమర్థంగా నిర్వహించినా, అప్పట్లో ఇంకేముంది ఛార్జీలు పెంచేశారు అంటూ ప్రచారం చేసిన ఈ మీడియా ఇప్పుడు వేల కోట్ల అదనపు భారాలు ప్రజలపై కూటమి మోపుతున్నా ,దానిని కప్పిపుచ్చడానికి యత్నిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్న డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తదుపరి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసింది. ఆ తర్వాత దానిని కూడా తన క్రెడిట్ లో వేసుకోవడానికి ఆయన ఏమి చెప్పారంటే, తాను తెచ్చిన సంస్కరణల వల్లే అది సాధ్యమైందని ప్రచారం చేసుకున్నారు.అలా ఉంటుంది చంద్రబాబు తెలివి. ఈసారి కూడా అదే తరహాలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన చేసిన యత్నం వికటించి ప్రజలకు వాస్తవం తెలిసిపోయిందని అనుకోవాలి.నకిలీ వార్తల వెల్లువ అంటూ ఈనాడు దినపత్రిక(Eenadu Fke News) ఈ మధ్య ఒక సంపాదకీయం రాసింది. అందులో నకిలీ వార్తల గురించి గుండెలు బాదుకుంది. మంచిదే కాని తానేమి చేస్తున్నది మర్చిపోయి ఎదుటి వారిపై నిందించే రీతిలో ఆ సంపాదకీయం రాసుకుని ఆత్మవంచన చేసుకుందని చెప్పాలి. 'ఎన్నికలలో గెలిస్తే ప్రజా సంక్షేమానికి, సమ్మిళిత ప్రగతికి, ఎలాంటి కృషి చేస్తామో చెబుతూ ఓట్లు అడగడం నైతిక నిష్ట కలిగిన నాయకుల పద్దతి. అలాంటివారు అరుదైపోయి అబద్ధాలతో అధికారాన్ని గుప్పిట పడదామనుకునే జగత్ కిలాడీలతో రాజకీయాలు భ్రష్టు పడుతుండడం నేటి భారతం దుర్గతి. దానికి తగ్గట్లే పార్టీల నిర్వహణలోని ప్రధాన స్రవంతి మీడియా సంస్థల్లో కొన్ని బూటకపు వార్తా కథనాలను విచ్చలవిడిగా జనం మీదకు వదులుతున్నాయి. వ్యక్తిత్వ హననాలకు తెగపడుతున్నాయి. ఇలాంటి పెడపోకడలను అడ్డుకోకపోతే నకిలీ వార్తా సంస్థలను జవాబుదారి చేయకపోతే కపట నేతల స్వార్ధ ప్రయోజనాలకు ప్రజాస్వామ్యం బలి పశువు అవుతుంది"అ ని రాశారు. ఇది చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ కూడా ఏ మాత్రం చిత్తశుద్ది లేకుండా ఎడిటోరియల్ రాశారని తెలిసిపోవడం లేదా!. ఒక పక్క తప్పుడు వార్తలనండి, నకిలీ వార్తలనండి వారే ఇష్టానుసారంగా పాఠకులపై రుద్దుతో పార్టీల మీడియా ఏదో చేస్తోందంటూ నిస్సిగ్గుగా రాసిందనిపించదా! విద్యుత్ ఛార్జీల విషయంలో జరిగిందేమిటి.ఎల్లో మీడియా రాసిందేమిటి? దానిని నకిలీ అంటారా? తప్పుడు వార్తలు అంటారా! కూటమి సర్కార్ కరెంటు ఛార్జీలు పెంచిందా? లేదా? అదనపు వసూళ్లకు పాల్పడ్డారా? లేదా? అన్నది చెప్పకుండా కథలు రాయడం టీడీపీ మీడియాది జగత్ కిలాడి తనం అవుతుందా? లేదా అన్నది వారే ఆలోచించుకోవాలి. అలాగే వీరు చెప్పే నీతిసూత్రం ప్రకారం టీడీపీ, జనసేన కూటమి నేతలే జగత్ కిలాడీలు అవ్వాలి కదా! ఆ మాటను ఎందుకు నేరుగా రాయలేకపోయారు!. ఎంతసేపు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఈనాడు మీడియా సుద్దులు చెప్పడం ఆశ్చర్యమే. అబద్దాలతో అధికారం గుప్పిట పెడదామనుకుంటున్నారట. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలో ఎన్ని నెరవేర్చారు? అవి అబద్దపు హామీలా? కాదా? అన్నదానిపై ఎన్నడైనా ఒక్క వార్త ఇచ్చారా? ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అసత్యాలను ప్రచారం చేశారో ఈనాడు వంటి ఎల్లో మీడియాకు గుర్తు లేదేమో కాని, కాస్త రెగ్యులర్ గా ఫాలో అయ్యే పాఠకులందరికి తెలియకుండా ఉంటుందా! ఈనాడు మీడియా ఒక్కసారి తమను తాము అద్దంలో చూసుకుని ,ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకుంటే వారికే తెలుస్తుంది ఎవరు నకిలీ వార్తలు రాస్తున్నారో,ఎవరు తప్పుడు కధనాలు ఇస్తున్నారో!.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ వ్యాఖ్యలతో ఏపీ అన్నపూర్ణ బ్రాండ్ ఇమేజ్కు గట్టి దెబ్బ!
రాష్ట్రం పరువు పోవాలని ఏ ముఖ్యమంత్రైనా కోరుకుంటాడా? రైతుల ప్రతిష్ట దెబ్బతినాలని ఆకాంక్షిస్తాడా? మిగిలిన రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఈ రెండు కాంక్షిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు చిత్ర, విచిత్రమైన ప్రకటనలతో ప్రజలను తరచూ గందరగోళంలోకి నెట్టేసే చంద్రబాబు నాయుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతులు పండించే ధాన్యం తినేందుకు, ఎగుమతి చేసేందుకూ పనికి రాదని తేల్చేశారు. ఇందుకు ఆధారాలున్నాయా? లేదా? అన్నది వేరు సంగతి కానీ.. ఇలా చెబితే రైతులకు అన్యాయం జరగదా? అన్న ఆలోచన కూడా చేయలేకపోయారు ఘనత వహించిన సీఎంగారు. ఎగుమతులకు పనికి రాదని సీఎం స్వయంగా అంటే.. కొనుగోళ్లకు ఏ దేశం ముందుకొస్తుంది?. ఇలా మాట్లాడటం ద్వారా సీఎం ఇక్కడి ధాన్యాన్ని విస్తృతంగా వాడే రాష్ట్ర ప్రజలందరిలో అనుమానాన్ని సృష్టించినట్లు అవ్వదా!. దీంతో ఈ ఆరోపణ కూడా తిరుమల ప్రసాదంలో కల్తీ చందంగా అనుచితమైపోయిందని తేలుతోంది. కోనసీమలో వరి సాగు సమస్యలపై కొన్నేళ్ల క్రితం క్రాప్ హాలిడే ప్రకటిస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి వరి వేయడం మంచిది కాదని చెబుతున్నారు. పైగా అధిక యూరియాతో పండించిన పంటలు తినడం వల్ల కేన్సర్ వస్తుందని అంటున్నారు. ఎంత బాధ్యతారహిత ప్రకటన ఇది!!.ఎరువుల విచ్చలవిడి వాడకం సరికాదనడం వేరు కేన్సర్ వస్తుందనడం వేరు. ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరుంది. దశాబ్దాలుగా వరి సాగు జరుగుతోంది. ఒకపక్క రికార్డు స్థాయి వది దిగుబడులపై పొరుగున ఉన్న తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబరంగా చెప్పుకుంటూంటే... మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేశామని సంబరంగా చెబుతూంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తి నిరుత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలోనూ యూరియా కొరత(Urea Crisis In Telangana) వచ్చింది కానీ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కేంద్ర స్థాయిలో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. అవసరానికి తగినంత రాకపోయి ఉండవచ్చు. అది వేరు సంగతి. అంతమాత్రాన తెలంగాణలో ఎవరూ వరి వేయద్దని అనలేదు. కేన్సర్ బూచిని చూపలేదు. ఏపీలో యూరియా కొరత(AP Urea Crisis) సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన వరదరాజులరెడ్డి స్వయంగా శాసనసభలో యూరియా కొరతపై మాట్లాడారు. ఒకదశలో అసలు యూరియా కొరత లేదని చంద్రబాబు సోషల్ మీడియాపైన, వైసీపీపైనా మండిపడ్డారు. ఆ తర్వాత కలెక్టర్ల సమావేశంలో పంపిణీలో విఫలం అయ్యామని, వచ్చేసారి రైతుల ఇళ్లవద్దకే సరఫరా చేస్తామని, తాజాగా పొలాల వద్దే అందచేస్తామని అంటున్నారు. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పటికీ, అవసరమైన మేర యూరియాను తెప్పించుకోలేకో, వచ్చిన యూరియాను క్రమబద్దంగా పంపిణీ చేయలేకో, బ్లాక్ మార్కెట్ను, టీడీపీ నేతల దందాను అరికట్టలేకో తెలియదు కాని, మొత్తం నెపాన్ని రైతులపై నెట్టే యత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పిఠాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియా లారీలను పోలీసులు పట్టుకున్నారు. అదను దాటిపోతున్నా యూరియా అవసరమైన మేర అందడం లేదని రైతులు వాపోతున్న దృశ్యాలు పలు చోట్ల కనిపిస్తున్నాయి. ఈ దశలో ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన ముఖ్యమంత్రి అసలు మన వరి పంటపైనే తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయం. మనం పండిస్తున్న వరి మద్యం తయారీకి తప్ప దేనికి పనికి రాదని అన్నారు. ఇప్పుడు జనం అంతా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న బియ్యాన్ని వాడుతున్నారా? రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఏపీలో పండిందా? కాదా? నిజంగానే అది తినడానికి యోగ్యమైనది కాకపోతే ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే దృష్టి మరల్చే వ్యూహాలు అమలు చేస్తూంటుంది. దానికి కూడా హద్దు ఉంటుంది. మొత్తం రాష్ట్రం పరువు ,ఇమేజీ పోయే విధంగా ఉండరాదు. యూరియా కొరత ఏర్పడినప్పుడే కేన్సర్ సమస్య గుర్తుకు వచ్చిందా? ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పాలి? ఆ ఎరువు వాడకం తగ్గించాలని సీజన్ కు కనీసం ఆరు నెలల ముందు చెప్పాలి కదా? అంతా వరి వేసేసిన తర్వాత అది వద్దని, అది తినడానికి పనికి రాదని అంటే రైతులు ఏమి చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నుందుకు తమకు తగిన శాస్తి జరిగినట్లు రైతులు భావించరా? కొన్ని జిల్లాలలో మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో వరిని రెండు పంటలుగా వేస్తారు. మిగిలిన చోట్ల రెండో పంటగా అపరాలు వేస్తారు. వరి వద్దని ఉద్యాన పంటలు వేయాలని చెబితే అది ఇప్పటికిప్పుడు అవుతుందా? పైగా ఇప్పుడు ఉద్యాన పంటల వారు ఎన్ని బాధలు పడుతున్నారో చూడడం లేదా? మామిడి, బొప్పాయి తదితర రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎన్ని పాట్లు పడుతున్నారు! పోనీ మెట్ట పంటలు వేద్దామనుకుంటే మిర్చి, పొగాకు వంటి పంటలకు ధర లేక ఎంత ఆందోళన జరిగింది. మాజీ సీఎం జగన్ ఆయా పంటల రైతుల వద్దకు వెళ్లేవరకు ప్రభుత్వంలో చలనం కనిపించిందా?. ఉల్లి, టమోటా రైతులు పడుతున్న పాట్ల మాటేమిటి?. అమరావతికి లక్షల కోట్లు అప్పులు చేసి ఖర్చు చేసే ప్రభుత్వం రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు మూడు, నాలుగువేల కోట్లు వెచ్చించ లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దానికి బదులు ఇవ్వడం లేదు. ఆయా పంటలు ఎంత సాగు అవుతాయన్న దానిపై వ్యవసాయ శాఖకు అంచనాలు, లెక్కలు ఉంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని ,నిజంగానే ఆ పంటల వల్ల రైతులకు లాభం రాదనుకుంటే ప్రత్యామ్నాయాలతో సహా ప్రభుత్వం సాగు సీజన్కు కొన్ని నెలల ముందు సూచనలు చేయాలి కదా!. అవేమీ చేయకుండా, ఇప్పటికిప్పుడు వరికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రైతులకు అన్యాయం చేయడం అవుతుంది.వరి పంట కొనుగోలుకు కూడా సమస్య వస్తుందని ఇప్పుడే చంద్రబాబు చెబుతున్నారంటే, రైతులకు ధాన్యం అమ్మకాలలో మున్ముందు ఎన్ని కష్టాలు వస్తాయో ఊహించుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు వాటిని ఎంతవరకు నెరవేర్చారు. 2014 టరమ్లో రైతుల రుణాలన్నిటిని మాఫీ చేస్తామని ఊదరగొట్టి, తీరా ప్రభుత్వం వచ్చాక ఆరో వంతు రుణాలు కూడా మాఫీ చేయలేదు.ఈసారి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద రైతుకు ఇస్తామని చెప్పి ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది రూ.ఐదువేలు మాత్రం ఇచ్చారు. అయినా రైతులకు ఏదో చాలా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు.రైతులకు ఇవ్వవలసిన ఇన్ పుట్ సబ్సిడీ. బీమా సదుపాయం తదితర అంశాలలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏమి చేసిందో తెలియదు. జగన్ తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే ఎంతో గొప్ప వ్యవసాయదారులు ఉన్న రాష్ట్రంగా పేరొందిన ఏపీ రైతుల ప్రతిష్ట దెబ్బతినేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడే మాట్లాడడం దారుణం అని చెప్పక తప్పదు. ఇది ఒక రకంగా ఏపీ బ్రాండ్ ఇమేజీని తనకుతానే దెబ్బతీయడం అని, వ్యవసాయాన్ని విధ్వంసం చేయడమేనని నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలతో ఏకీభవించకతప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు! -
చంద్రబాబు నీతులు చెబుతుంటే..
చెత్త రాజకీయాలను ఊడ్చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రకటన స్వాగతించదగ్గది. కాకపోతే దీన్ని తన సొంతపార్టీతో మొదలుపెట్టడం అవసరం. క్రిమినల్ కేసులున్న నేతలను పక్కన కూర్చొబెట్టుకుని మరీ నేర చరితులు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పగల సమర్థుడు చంద్రబాబు. అందుకే ఆయన చేసే ప్రకటనలకు ఆ పార్టీలోనే విలువ లేకుండా పోతోంది. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూంటారు. చంద్రబాబు స్వయంగా ఈ మాటలు చెప్పడం ఇంకో విశేషం.... ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల వసూళ్లకు హద్దూ లేకుండా ఉందని వారికి తానే వార్నింగ్ ఇస్తానంటూ సుమారు 35 మంది ని పిలిచి మాట్లాడానని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కొన్నాళ్ల క్రితం వెల్లడించినట్లు ఎల్లో మీడియానే ప్రచారం చేసింది. మరి వీరంతా ఆ చెత్త రాజకీయాలలో భాగమా? కాదా?. రాజకీయ ప్రత్యర్థి వైసీపీ వారిని విమర్శించడానికి ఇలాంటి పడికట్టు పదాలు వాడుతుంటారు. కాని అవి తన పార్టీ వారికే తగులుతున్న విషయాన్ని మర్చిపోతుంటారు. అసలు చెత్త రాజకీయం అంటే ఏమిటి?.. ప్రజలకు మేలు చేయనిది.. సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద వాదంతో వ్యవహరించేదని కదా చెత్త రాజకీయం(Dirty Politics) అంటే!. అవకాశవాద రాజకీయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఎవరుంటారు? ఎదుటి వారిపై కేసులు ఉన్నాయని అంటారు కాని తన మీద ఉన్న కేసుల గురించి చెప్పరు. మాచర్లలో జరిగిన స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ పరిసరాలలో పారిశుధ్యం పనులు చేపట్టడం కద్దు. కానీ మాచర్ల పర్యటనలో అలా జరగలేదు. చివరకు చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు ఊడ్చారట. అధికారుల నిర్లక్ష్యమా? లేక చంద్రబాబు షో ప్రయత్నమా? తెలియదు.చెత్త ఊడ్చడాన్ని తప్పుపట్టనక్కరలేదు కానీ ఆ సందర్భంలోనే నోటికొచ్చిన మాటలు మాట్లాడేశారు(Chandrababu Dirty Politics Comments). మాచర్ల సభలో వేదికపైన ఉన్న కొందరు నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్న విషయం అందరికీ తెలుసు. స్థానిక వైసీపీ నేతలు(YSRCP) పలువురిని అక్రమ కేసుల్లో అరెస్టు చేయించారు కూడా. మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ పెట్టిన కేసుల తీరుపై హైకోర్టు స్వయంగా మండిపడింది కదా!. టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడి హత్యలు చేసుకుంటే ఆ కేసును మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా?. అయినా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని ఎలా అనగలిగారు? రాయలసీమలో ఆయన ముఠాలు లేకుండా చేశారట!!. టీడీపీలోకి ముఠా నాయకులను ఏరికోరి చేర్చుకున్న విషయం పల్నాడు ప్రాంత ప్రజలకు తెలియకపోవచ్చు. కాని ఆ రాయలసీమ వారికి తెలిదా! కర్నూలు జిల్లాలో ఇద్దరు ఫ్యాక్షనిష్టు రాజకీయ నేతలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీ చేసి గొడవలు లేకుండా చూడడానికి ప్రయత్నిస్తే, దానిని చంద్రబాబు ఎంత తీవ్రంగా తప్పుపట్టారో ఇప్పటి తరం వారికి తెలిసి ఉండదు. ఇప్పటికీ టీడీపీలో ఎంతమంది ఫ్యాక్షనిస్టు నేతలు పెత్తనం చేస్తున్నారో, ఎందరు ఎమ్మెల్యేలు అయ్యారో ఆయనకు తెలియదా!. రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు అన్నారు. మంచిదే. కానీ ఆయన చెప్పేది వేరు.. చేసేది వేరు అని ఎప్పటి నుంచో ఉన్న అనుభవం. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో ఒక రౌడీషీటర్ను పార్టీలో చేర్చుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ వెరపు కూడా పోయినట్లు ఉంది. టీడీపీ నేతలు రౌడియిజం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. అంతెందుకు గతంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ను రౌడీ అని, పేకాట క్లబ్లు నడుపుతారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేశ్లు కర్నూలు జిల్లా ఆలూరు వెళ్లి మరీ ఆరోపించి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోతే, చంద్రబాబు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. దీనిని ఏమంటారో?.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు గతంలో ఏమి అన్నారో, అలాగే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ను ఏమని విమర్శించారో వారిద్దరు మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే ఎలా అయ్యారు? కోటంరెడ్డి ఇప్పుడు దౌర్జన్యాలు చేసే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా మారిపోయారా?. హత్య కేసులో ఉన్న ఒక రౌడీషీటర్కు పెరోల్ ఇవ్వాలని కోటంరెడ్డి, మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్లు లేఖ రాయడం గురించి ఏమంటారు??. మాచర్ల ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు ఉన్నాయి???.. చంద్రబాబు తరచు చంద్రయ్య అనే ఒక చిన్న టీడీపీ నేత హత్య గురించి ప్రచారం చేస్తుంటారు. వ్యక్తిగత గొడవలు జరిగితే దానికి రాజకీయం పులిమి చంద్రబాబు హడావుడి చేశారన్నది అప్పట్లో వచ్చిన విమర్శ. చంద్రయ్య కుమారుడికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి చంద్రబాబు మరో చెడ్డ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు తమ సొంత కార్యకర్తలకు ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చని ఈయన చర్య సూచిస్తోంది. దేశం మొత్తం మీద క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలు 45 శాతమైతే.. టీడీపీలో అది 86 శాతం. ఆంధ్రప్రదేశ్లోని 134 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 మందిపై క్రిమినల్ కేసులు, 82 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇది చెత్త కిందకు వస్తుందా? ఆణిముత్యం కిందకు వస్తుందా? అన్నదాని గురించి చంద్రబాబు చెప్పి, తదుపరి ఎదుటి వారిపై విమర్శలు చేస్తే బాగుంటుంది. ఇదే సమావేశంలో ఆయన స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. కాని దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏమిటో ఆయనే ఒక సందర్భంలో తెలిపారు. ఒక నెల రోజులలో 5.4 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, తద్వారా వారికి రూ.200 కోట్లు ఆదా అయ్యాందని తెలిపారు. దాని ప్రకారం ఒక్కో మహిళకు నెలకు 40 రూపాయలు ఆదా అయితే.. అదేదో పెద్ద ఘనతగా చెప్పుకున్నారన్నమాట. అసెంబ్లీలోనేమో అప్పులు చేసి సంక్షేమం అమలు చేయరాదని అంటారు. బయట సభలలో మాత్రం మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఆడబిడ్డ నిధి తదితర అనేక హామీలు పెండింగులో ఉంటే వాటిని ఆయన ప్రస్తావించరు. త్వరలో సంజీవని కార్యక్రమం నిర్వహిస్తామని, ఇళ్ల వద్దకే డాక్టర్లను పంపిస్తామని చంద్రబాబు ప్రకటించడం స్వాగతించదగిందే. కాకపోతే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకే డాక్టర్లను పంపించడం, టెలిమెడిసిన్ వంటి పలు స్కీములను అమలు చేసింది. వాటిని ఈ ఏడాదిన్నర కాలం ఆపడం ఎందుకు? దానికి పేరు మార్చి ఇప్పుడు తామే అమలు చేస్తున్నామన్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఈ ఏడాది కాలంలో వైద్య సేవలు సరిగా అందనట్లే కదా! రూ.300 కోట్లు వ్యయం చేసి ఒక రోజు యోగాంధ్ర నిర్వహించి యోగా గేమ్ ఛేంజర్ అన్నట్లుగా గతంలో చెప్పారు. ఇప్పుడేమో సంజీవని గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పేరుతో ఆరోగ్యశ్రీని నీరుకార్చుతున్నారన్న విమర్శల నేపధ్యంలో సంజీవనిని తెరపైకి తెస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటికరణపై వస్తున్న నిరసనలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరగుతుండవచ్చు. ముందుగా తమ ప్రభుత్వంలో తీసుకు వస్తున్న విధానాలలోని చెత్తను, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న చెత్తను తొలగించాక, ఎదుటి వారి గురించి మాట్లాడితే మంచిదని విశ్లేషకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు చెప్పడం అర్థవంతంగానే ఉంది కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
AP Assembly: ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని..
ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తేందుకు ప్రతిపక్ష నేతకు తగినన్ని అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయాలపై పెద్దగా నమ్మకం లేనివారి మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే.. తమ గొంతు వినిపించేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తామన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలపై వీరు అస్సలు నోరు మెదపడం లేదు. పైగా.. ప్రతిపక్షానికి సమయం ఇవ్వడం వల్ల అధికార పక్షానికీ మేలు జరుగుతుంది. వారి విమర్శలను తిప్పికొట్టేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకూ అవకాశం వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈ అవకాశాలన్నింటినీ తోసిపుచ్చుతున్నారు. 2024 ఎన్నికల తరువాత 11 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ అసెంబ్లీకి హాజరు కాని విషయం ప్రజలందరికీ తెలిసిందే. తమ గొంతులు నొక్కేస్తూ, అవమానిస్తున్న కారణంగా అసెంబ్లీకి రామని ఆ పార్టీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు అధికార పార్టీ స్వోత్కర్షలతో నిస్సారంగా సాగుతున్నాయి. ప్రతిపక్షానికి సంఖ్యాబలం ఆధారంగా కాకుండా... చర్చనీయ అంశం ఆధారంగా తగిన సమయమిస్తామని స్పీకర్ లేదంటే సీఎం భరోసా ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. అప్పుడు బాధ్యత వైసీపీది అయ్యేది. టీడీపీ ఆ పని చేయలేదు. మరోవైపు.. ప్రతిపక్ష హోదాపై వైసీపీ(YSRCP Opposition Status Demand) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన నోటీసుకూ స్పీకర్ ఇప్పటివరకూ స్పందించలేదు. సభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మాట్లాడే అవకాశం ఉంటుందని చెబుతున్న మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గతాన్ని మరచిపోయారు. 1972లో సీపీఐకి కేవలం ఏడుగురే సభ్యులుంటే సీపీఎంకు ఒకే ఒక్క సభ్యుడు ఉండే వారు. అయినా ఆయా పార్టీల నేతలు మాట్లాడేందుకు తగిన సమయం లభించేది. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 మందే సభ్యులతో ప్రతిపక్ష హోదా రాలేదు. కాంగ్రెస్ నేత పీజేఆర్ తదితరులు సమయం కోసం పోరాడాల్సి వచ్చేది. దాంతో వారు కోరినట్లు ఆనాటి స్పీకర్ యనమలకు కొంత టైమ్ కేటాయించక తప్పేది కాదు. 2004లో సీపీఐ (ఎంఎల్) తరఫున గుమ్మడి నరసయ్య ఒక్కరే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయినా ఆయన గౌరవానికి ఏమాత్రం విఘాతం కలగకుండా చర్చల్లో పాల్గొనేందుకు తగినంత సమయం కేటాయించేవారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పూర్తిగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం విమర్శలను భరించే స్థితిలో లేదు. దీంతో వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష హోదా(Opposition Status) ఇవ్వడానికి పదిశాతం సభ్యులు ఉండాలన్నది ఒక సంప్రదాయం మాత్రమే. కాబట్టి వైసీపీకి ఆ హోదా ఇచ్చి ఉంటే హుందాగా ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నా 70 స్థానాలున్న అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మీడియా సమావేశాల ద్వారా జగన్ తన గళాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నప్పటికీ అసెంబ్లీలోనూ తగిన అవకాశాలిస్తామని స్పీకర్ చెప్పలేకపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలలు మరింత స్పష్టమవుతాయో అన్న భయం కాబోలు!. 1994లో అఖండ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు(NT Rama Rao) ప్రభుత్వాన్ని 1995లో ఆయన అల్లుడైన చంద్రబాబు కూల్చివేశారు. ఆ టైమ్లో ఎన్టీఆర్ తన వెంట ఉన్న 35 మంది సభ్యులతో విశ్వాసపరీక్ష కోసం అసెంబ్లీకి వచ్చారు. చంద్రబాబు వెన్నుపోటుపై మాట్లాడేందుకు శతథా ప్రయత్నించారు. కానీ అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడే మాట మాటకూ మైక్ కట్ చేసిన అందరికీ తెలుసు. దాంతో ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే ఎన్టీఆర్ కారణంగానే తనకు స్పీకర్ పదవి దక్కిందన్న విషయమూ యనమల మరచిపోయారు. సొంత మామ, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్తోనే ఇలా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ అవకాశం ఇస్తారన్నది వట్టిమాటే. అందుకే మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి అంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇక సభ్యుల గైర్హాజరి కూడా కొత్తగా జరుగుతున్నది కాదు. 1989-94 మధ్య ఆనాటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు దాదాపు రెండేళ్లు సభలోకి రాలేదు. ఒక సందర్భంలో తనను ఇతర సభ్యులతో కలిసి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019-2024 టర్మ్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరిపై ఎవరో అనుచితంగా మాట్లాడారంటూ లేని ఆరోపణలు చేసి సుమారు రెండేళ్లు సభకు గైర్హాజరయ్యారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు 23 యంది వైసీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు, వారిపై ఫిరాయింపు చట్టం అమలు చేయనందుకు నిరసనగా జగన్ కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి సభను సుమారు రెండేళ్లు బహిష్కరించారు. ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే చంద్రబాబు సభలో వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావించి, వారి ఖర్మ అని అనడం. ఆయన బహిష్కరించిన్పుడు కూడా ఇదే వ్యాఖ్య వర్తిస్తుంది కదా! జీఎస్టీ లాంటి బ్రహ్మాండమైన సంస్కరణలు వస్తుంటే వైసీపీ అసెంబ్లికి రాలేదని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు ఇవి అర్థం కావని అనడం చిత్రం. జగన్ మీడియా సమావేశంలో(Jagan Press Meet) అడిగే ప్రశ్నలకే జవాబు చెప్పలేక నీళ్లు నములుతున్న చంద్రబాబు, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి నిలదీస్తే మాత్రం స్పందిస్తారా? ఏదో రకంగా జగన్ను, వైసీపీని దూషించి అవమానించాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ సభకు రాకపోవడాన్ని తప్పు పట్టే చంద్రబాబు తాను, అంతకుముందు ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు కదా అనే దాని గురించి మాట్లాడరు. అప్పుడు వారిపై ఆనాటి స్పీకర్లు అనర్హత వేటు వేయలేదు. ఇప్పుడు మాత్రం అనర్హత వేటు అంటూ బెదిరించే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీని ఈ సభలో చంద్రబాబు తెగ పొగిడారు. మరి ఇదే సభలో మోడీని గతంలో చంద్రబాబు నానా మాటలు అన్నారు కదా! దాని గురించి ఏమి చెబుతారు? సభలోకి వచ్చి వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తే అది చంద్రబాబుకు, టీడీపీకి ఇరకాటంగా ఉంటుంది. శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున అక్కడ గట్టిగానే నిలదీస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకు మంత్రులు బదులు చెప్పలేక తంటాలు పడుతున్నారు. అదే ప్రకారం ప్రశ్నిస్తారన్న భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండా ఉంటేనే బెటర్ అన్న భావన కూటమిలో ఉందనిపిస్తుంది. సభలోకి వైసీపీ సభ్యులు వెళ్లినా మాట్లాడడానికి తగు అవకాశం ఇవ్వడానికి సిద్దంగా లేరు. ప్రజాస్వామ్య స్పూర్తి లేని చంద్రబాబు నాయకత్వంలో ఇంతకన్నా ఏమి ఆశించగలం!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: హిట్టా.. ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబూ! -
బీహార్లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 2025 అక్టోబర్/నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.బీహార్లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్పుత్లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్ల మద్దతు లభిస్తోంది. 2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. బీహార్లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్గంజ్తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో, వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న సంక్షేమాలు కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. :::ఆర్.దిలీప్ రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ -
నడ్డా.. ఆత్మవంచనకు పరాకాష్ట!
ఎంతటి అవినీతి చేసినప్పటికీ బీజేపీలో చేరితే అన్నీ వాషింగ్ మెషీన్లో వేసినట్టు అన్నీ మాయమైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద వినిపిస్తున్న మాట. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం ఈ మాటలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి!. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్వహించిన ‘సారథ్య యాత్ర’ ముగింపు సభలో నడ్డా మాట్లాడుతూ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని, అసమర్థ, అరాచక పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అభివృద్ధి అడుగంటిందని కూడా వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ మాటలు ఎల్లో మీడియా చెవికి ఇంపుగా తోచాయి. సంబరంగా కథనాలు రాసుకున్నాయి. కానీ.. వీరందరూ గతం మరచిపోయినట్టు ఉన్నారు. 2019కి మొదలు ఇదే జేపీ నడ్డాసహా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఘోరంగా విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ ఏటీఎం మాదిరిగా తమ అక్రమాలకు వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బహిరంగంగానే విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు అయితే మోదీని టెర్రరిస్టులతో పోల్చడం సంచలనం. మోదీ ప్రభుత్వ అవినీతి వల్ల దేశం పరువు పోతోందని, ముస్లింలను బతకనివ్వడం లేదని...ఇలా అనేక ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు నీరు-చెట్టు కింద ఏపీలో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందని, స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తేవారు. అవసరార్థం.. బహుకృత వేషం అన్నట్టు 2024 ఎన్నికల్లో ఎలాగోలా చేతులు కలిపిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు పరస్పర ప్రశంసలతో మురిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. కానీ.. అందుకు తగిన కారణాలు, వాస్తవాలను మాత్రం దాచేశారు. జగన్ ముఖ్యమంత్రిగా(YS Jagan As CM) ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఏ రకమైన ఆరోపణలూ చేయని బీజేపీ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆత్మవంచనకు పరాకాష్ట అని చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఈజ్ ఆఫ్ డూయింగ్లో మొదటి ర్యాంకు ఇచ్చిన విషయం నడ్డాకు గుర్తు రాలేదనుకోవాలి. చంద్రబాబుతో మళ్లీ జతకట్టాక బీజేపీ కొత్త పాటను ఎత్తుకుంటున్నట్లు ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైంది. యూరియా కోసం అల్లాడుతున్న రైతులు ఇందుకు ఒక తార్కాణం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, యూరియా కోసం రైతుల గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి, పొగాకు, టమోటా, ఉల్లి రైతులు ధరలు గిట్టుబాటు కాక ఆందోళనల బాట పట్టడం, నిరాశ, నిస్పృహల్లో తమ ఉత్పత్తిని రోడ్ల పాలు చేయడమూ చూశాం. ఏ సందర్భంలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సకాలంలో చర్య తీసుకున్న పాపాన పోలేదు.జగన్ టైమ్లో సజావుగా నడుస్తున్న విద్యా, వైద్య రంగాలలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయ సంకల్పిస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన వస్తోంది. పాలనను గాడిలో పెట్టడం అంటే ఇదేనా?.. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు, పక్కన పర్మిట్ రూమ్లు, తదుపరి గ్రామాలలో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా?.. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమంటే?. జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్ మీడియాను అణచి వేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే?. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టడమే మంచి పాలన అవుతుందా? సూపర్ సిక్స్ హామీలు అని, భారీ ఎన్నికల ప్రణాళిక అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి, ఇప్పుడు అరకొర చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థతా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగతా?? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇక్కడే తెలుస్తోంది వీరి ద్వంద్వ ప్రమాణాలు. ఎట్టి పరిస్థితిలోను విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని ప్రచారం చేసి, ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను గాడిన పెట్టినట్లు అవుతుందా? లేక నాశనం చేసినట్లు అవుతుందా? తన మొత్తం స్పీచ్లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే కేటాయించినా, ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీతో కూటమిలో ఉండబట్టి మొహమాటానికి పొగిడారా? లేక చిత్తశుద్దితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో రూ.2,000 మేరకు అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవన్ని ఏమయ్యాయో తెలియదు కాని, చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ప్రయోగించారు. తన పార్టీ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించారు. చివరికి 2024 నాటికి బీజేపీని బతిమలాడి పొత్తు పెట్టుకోగలిగారు. మరి అంతకుముందు బీజేపీ, టీడీపీలు చేసుకున్న విమర్శల మాటేమిటి? అనే ప్రశ్న సామాన్యులకు రావొచ్చు. కానీ..రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదపు పొత్తులు కూడా ఉంటాయా? అని అంతా నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో టీఎంసీ సభ్యుడు ఒకరు ప్రసంగిస్తూ చంద్రబాబుపై గతంలో కేంద్రం చేసిన అవినీతి ఆరోపణలు ఆయన తిరిగి బీజేపీతో కలవగానే ఏమైపోయాయని ప్రశ్నించారు. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేసేశారా? అని ఎద్దేవ చేశారు. ఈ సంగతులేవీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కాని ప్రస్తావించవు. పొత్తు తర్వాత మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే, చంద్రబాబు అనుభవజ్ఞుడని, తాను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేనలు కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని నడ్డా చెప్పి ఉండాలి కదా! అవేమీ లేకుండా జనరల్ గా మాట్లాడితే ఏమి ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా? కాదా?అన్నదాని గురించి మాత్రం చెప్పలేదు. అలాగే వారసత్య రాజకీయాలకు వ్యతిరేకం అని ఊదరగొట్టే బిజెపి నేతలు ఎపిలో ఇప్పుడు టిడిపిలో ఉన్నది వారసత్వ రాజకీయమా? కాదా? అప్పట్లో మరి లోకేశ్ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవ చేయగా, ఇప్పుడు ఆయనే పిలిచి మరీ ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు గత పదిహేనేళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కాని, ఏపీ ప్రజలు మర్చిపోతారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇలా ఎలా??
ఆంధ్రప్రదేశ్లో సామాజిక మాధ్యమాల గొంతు నులిమేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల అణచివేతకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. వీరి సిఫారసులు ఎలా ఉంటాయన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వం తీరుతెన్నులను విమర్శిస్తున్న, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను నకిలీలుగా ముద్రవేసే ప్రయత్నం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏది ఫేక్ ఏది కాదన్నది అందరికంటే బాగా తెలిసింది ప్రజలకే. కానీ ప్రభుత్వం, టీడీపీలు రెండూ తాము చెప్పిన విషయాలే సత్యమని నమ్మించేందుకు, ప్రభుత్వంలో జరుగుతున్న రకరకాల అవినీతి కార్యకలాపాలు బయటకు రాకూడదన్నట్టు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన బాబు, పవన్లు వైసీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదని ఇప్పటికీ విమర్శిస్తూండటం విచిత్రం. ప్రతిపక్షంలో ఉండగా అన్ని వర్గాలను ప్రభుత్వంపై ఉసిగొల్పేలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచిన ఈ ద్వయం ఇప్పుడు మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే వారి సంగతి చూస్తామని, కొత్త చట్టాలు తెచ్చి అణచివేస్తామని అధికారికంగానే చెప్పుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్లో యూరియాకు పెద్ద కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాలనే సామాజిక మాధ్యమాలు బాగా హైలైట్ చేశాయి. దీంతో చంద్రబాబు తెగ ఆవేశపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాలే లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరకు ఈ విమర్శ హద్దులు దాటి.. మనుషులా, పశువులా అనే వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రైతుల సమస్యను బహిర్గతం చేస్తున్న సాక్షి మీడియాపై కూడా తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. టీడీపీ అనుబంధ మీడియా సాయంతో సాక్షిలో వచ్చే వార్తలు ఫేక్ అన్న ప్రచారం చేయాలన్నది ఆయన ఉద్దేశం.ప్రతిపక్ష నేత జగన్ కూడా ఏ విమర్శ చేసినా అందులో సహేతుకత ఉండేలా జాగ్రత్తపడతారు. కాగ్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలిచ్చిన సమాచారం ఆధారంగానే టీడీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు, పవన్లు అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాల ఆధారంగా రాజకీయాలు చేయడం వీరికి అలవాటే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వీరు చేసిన అసత్యపు అరోపణలు అన్ని ఇన్నీ కావు. హిందూ మతానికి అపచారం జరిగిపోతోందని పదే పదే చెప్పేవారు. ప్రతి చిన్న విషయాన్నీ జగన్కు ఆపాదిస్తూండే వారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రసాదం లడ్డూలో కల్తీ ఆరోపణలు కూడా జగన్పైకే నెట్టేసే ప్రయత్నం చేసిన విషయం ఇటీవలి పరిణామమే. ఇదే సమయంలో జగన్ మాత్రం హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసే ఆరోపణలు కూడదని బాబు, పవన్కు హితవు చెప్పారు. తిరుమలకు అప్రతిష్ట తీసుకురావద్దని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముప్పైవేల మంది మహిళలు మాయమైనట్టు, అందుకు వలంటీర్లు కారణమైనట్టు తనకు కేంద్ర నిఘా వర్గాల వారు చెప్పారని పవన్ చేసిన ఇంకో ఆరోపణ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయన పూర్తిగా మరచిపోయారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జగన్, ఆయన తల్లి విజయమ్మ తదితరులు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆమె కుమారుడిని ఆపాయ్యంగా దగ్గరకు తీసుకున్న సన్నివేశాన్ని అంతా చూశారు. అయినా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఒక వీడియో కూడా ఎడిట్ చేసి టీడీపీ వారు ప్రచారం సాగించారని వైసీపీ ఆరోపించింది. కేంద్రం సూచనల ప్రకారం జగన్ ముఖ్యమంత్రిగా రీసర్వే చేపడితే జగన్ భూములన్నిటిని లాగేసుకుంటారని చంద్రబాబు, పవన్, లోకేశ్లు నానా యాగీ చేశారు. తీరా చూస్తే ఏమంది? అధికారంలోకి వచ్చిన తరువాత వారు కూడా అదే రీసర్వే పథకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం అప్పుల గురించి కూడా ఇంతే. అప్పులతో ఆంధ్రప్రదేశ్ కాస్తా శ్రీలంక మాదిరిగా అల్లకల్లోలమైపోతుందని ఒకసారి.. అప్పులు రూ.14 లక్షల కోట్లు దాటిపోయాయని ఇంకోసారి రకరకాలుగా వ్యాఖ్యానించిన అప్పటి ప్రతిపక్ష నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట సవరించుకున్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ స్వయంగా రాష్ట్రం అప్పులు రూ.6.5 లక్షల కోట్లని వెల్లడించారు. కానీ చంద్రబాబు ఆ తర్వాత కూడా జగన్ టైమ్లో రూ.పది లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారు. పోనీ అందులో తన 2014 టరమ్ లో చేసిన అప్పు,విభజన నాటి అప్పు కూడా ఉందని చెబుతారా? అంటే అదేమి ఉండదు. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకువచ్చారు. ఈ వార్తను సాక్షి ఇచ్చింది. దానిని ఖండించే పరిస్థితి కూటమి సర్కార్కు లేదు. విశాఖలో జరిగిన సోదాల్లో ఒక కంపెనీలో మాదకద్రవ్యాలు వచ్చాయని, అదంతా వైసీపీ వారికి సంబంధించిందన్నట్టు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎంతగా ప్రచారం చేశాయి? తీరా చూస్తే అవి డ్రగ్స్ కాదని, అక్వా కంపెనీలలో వాడే ఈస్ట్ అని తేలింది. జగన్ టైమ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదంటూ టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సైతం తమ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు తెచ్చినట్లుగా చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. చంద్రబాబు, పవన్, లోకేశ్లు గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలు, చెప్పిన అసత్యాలు, చేసిన ఆచారణ సాధ్యంకాని వాగ్దానాలు మొదలైన వాటన్నిటిని ప్రస్తావిస్తూ నాడు-నేడు కింద సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఇవి వీరిని బాగా చికాకు పెడుతున్నాయి. తమ ఫేక్ ప్రచారమే తమకు చుట్టుకుంటోందన్నది వారి బాధ కావచ్చు. ఎవరు ఫేక్ ప్రచారం చేసినా తప్పే. అంతేకాదు. సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నేతలను, రాజకీయాలతో సంబంధం లేని జగన్ సతీమణి భారతి వంటివారిపై కూడా ఒక వర్గం సోషల్ మీడియా నీచమైన పోస్టులు పెడుతున్నా, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే టీడీపీ వారిపై ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తారు. ఎవరు అలాంటి పోస్టులు పెట్టినా ఒకే రకంగా పోలీసు వ్యవస్థ స్పందిస్తే మంచిది కదా!. చంద్రబాబు,లోకేశ్లు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టులో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు నడుపుతుంటారని, తప్పుడు ప్రచారాలు చేయిస్తుంటారని వైసీపీ తరచుగా ఆరోపిస్తుంటుంది. అయినా ఇతర సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూటమి నేతలు భరించలేకపోతున్నారన్న భావన ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను, సాక్షి మీడియాను తరచు బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. కుట్రపూరితంగా జర్నలిస్టులను జైళ్లకు పంపుతున్నారు. అయినా వారి వైఫల్యాలు, స్కామ్లు బయటకు వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో ఏకంగా కొత్తగా చట్టాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్య తీసుకోవాలని యత్నిస్తే చాలు.. నోటీసులు ఇస్తే చాలు..ఇంకేముంది భావ స్వేచ్ఛను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలో ఉంటే మాత్రం ఎవరికి భావ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉండకూండా చూడాలని యత్నిస్తున్నారు.ఇలా ప్రతి అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే చంద్రబాబు అసలు రాజకీయం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కనుమరుగు కానున్న ఈశాన్య రుతుపవనాలు?!
అనూహ్యం.. అసాధారణం.. ఆశ్చర్యం.. నైరుతి రుతుపవనాలు ‘సంప్రదాయ’ గతి తప్పాయి. వాతావరణ మార్పు, భూతాపం నేపథ్యంలో అవి దారి తప్పి ఆధునిక ‘పోకడ’ పోతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నడక కొద్దిగా మారింది. భవిష్యత్తులో ఇదే నడత కొనసాగితే మన దేశానికి ముప్పు తప్పదు!!. ఈ నెల తొలి వారంలో భారత వాతావరణ విభాగానికి చెందిన ఓ ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం రుతుపవన గమనంపై వాతావరణ నిపుణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల వరకు వెళ్లి.. గోడకు కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన రుతుపవనాలు కొంత కట్టు తప్పి టిబెట్ పీఠభూమి ప్రాంతంలోకి ప్రవేశించాయి. హిమాలయాలకు ఆవల ఉండే టిబెట్ పీఠభూమిలో అవపాతం తక్కువ. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ పొడిగా కనిపిస్తుంది. శీతాకాలంలో హిమపాతం, వసంత రుతువులో పశ్చిమ అలజడుల వల్ల కొద్దిపాటి వర్షపాతం మాత్రమే అక్కడ నమోదవుతాయి. అలాంటి శుష్క టిబెట్ ప్రాంతంలో నైరుతి తేమ గాలులు తాజాగా వానలు కురిపించాయి. నైరుతి రుతుపవనాల తేమగాలులు హిమాలయాల హద్దును దాటేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ మీదుగా టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపుతోందని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన గ్లేసియాలజిస్ట్ మనీష్ మెహతా చెప్పారు. ఇండియాకు ప్రత్యేక వరం.. రుతుపవనాలు! వేసవిలో సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బయలుదేరే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో భారతదేశమంతటా విస్తరించి జూన్-సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిపిస్తాయి. వాటి ప్రయాణం ఉత్తరానికి వచ్చేటప్పటికి ఎదురుగా హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా, పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తాయి. తమలో మిగిలివుండే తేమతో హిమాలయ పర్వత శ్రేణుల నుంచి అవి వెనక్కు మరలుతాయి. తిరుగుపయనంలో ఈశాన్య రుతుపవనాల పేరిట అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షిస్తూ మళ్లీ సముద్రం బాట పడతాయి. ప్రయాణంలో వర్షిస్తూ తేమను కోల్పోతూ ఉంటాయి కనుక... నైరుతితో పోలిస్తే మనకు ఈశాన్య రుతుపవనాల వర్షపాతం తక్కువ. రుతుపవన ప్రక్రియ భారతదేశానికి ప్రత్యేకం. దేశంలో సాగునీరు, తాగునీటికి రుతుపవనాలే ఆధారం. భూతాపం, వాతావరణ మార్పు, పశ్చిమ అలజడులు/కల్లోలాలుగా పిలిచే వాతావరణ ప్రక్రియల వల్ల నైరుతి రుతుపవనాలు టిబెట్ వైపు వెళ్లి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఎత్తు తక్కువ ఉండే దారుల గుండా నైరుతి తేమ గాలులు టిబెట్లోకి ప్రవేశించి ఉండొచ్చని అంటున్నారు. అయితే.. నైరుతి రుతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం ఆరంభిస్తే... హిమనీనదాల (గ్లేసియర్స్)లోని మంచు కరుగుదలలో, నదీ ప్రవాహాల తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. నైరుతి కాస్తా తుర్రుమని టిబెట్ పారిపోతే మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారతదేశంలో వర్షపాతం తగ్గుతుంది. వ్యవసాయం, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. తాగునీటికి కటకట తప్పదు. రుతుపవనాలనే నమ్ముకుని బతుకుతున్న దేశం మనది. ఏదో ఒక సీజన్లో రుతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు రైతన్నలు. నైరుతి రుతుపవనాలు భౌగోళికంగా ‘హిమాలయ కంచె’ దూకి ప్రతి సీజన్లోనూ ఆవలి టిబెట్ వైపునకు పూర్తిగా మరలిపోయేట్టయితే... అవి ఇక తిరిగి వెనక్కు రావు! అప్పుడిక ఈశాన్య రుతుపవనాలు అనేవే ఉండవు!! ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా ఆ తేమలేని, బలహీన పవనాలతో కురిసే వర్షాలు, కలిగే ప్రయోజనం నామమాత్రమే. భయపెట్టాలని కాదు గానీ... ఆ దుస్థితి రాకూడదనే ఆశిద్దాం. వాతావరణ మార్పు ప్రభావంతో ఎన్నో వింతలు చూస్తున్నాం. నిరుడు కురిసిన వర్షాలకు సహారా ఎడారి ఇసుక తిన్నెలు సరస్సులను తలపించిన సంగతి మరచిపోతే ఎలా?!(Source: Zee News)::జమ్ముల శ్రీకాంత్ -
హిట్టా? ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబు!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు విచిత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూండటం, సూపర్ సిక్స్ హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై జగన్ విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అదే రోజు ఇంకో సమావేశంలో చంద్రబాబు యథాప్రకారం జగన్ దూషణకు పరిమితమయ్యారు. జగన్ సంధించిన నిర్దిష్ట ప్రశ్నలు ఒక్కదానికి కూడా నేరుగా చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. కూటమి అట్టర్ ఫ్లాఫ్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలా అన్న జగన్ ప్రశ్న వాస్తవానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే.. సూపర్సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరిపిన హడావుడికి చాలాచోట్ల నుంచి ప్రజలను బలవంతంగా తీసుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. స్కీములు కావాలంటే సభకు రావాల్సిందేనని కొన్ని గ్రామాల్లో చాటింపు వేశారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కొందరు అధికారులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు, ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారు సభకు రాకపోతే రూ.200 జరిమానా పడుతుందని హెచ్చరించారట. ఇక వేల ఆర్టీసీ బస్సులతో జనాన్ని బలవంతంగా తరలించారు. ఈ నేపథ్యంలోనే జగన్ బలవంతపు విజయోత్సవాలు అన్న వ్యాఖ్య అర్ధవంతంగానే ఉందనిపిస్తుంంది. బలవంతపు విజయోత్సవాలు అనేదానికి.. చంద్రబాబు దీనిపై ఎక్కడా స్పందించలేదు. సూపర్ సిక్స్ హిట్ అయినందుకే జనం తరలి వచ్చారన్నట్లుగా బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. సూపర్ సిక్స్ హిట్ అయిందా? లేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించినప్పుడు జనం ననుంచి పెద్దగా స్పందన రాలేదు. చప్పట్లు కొట్టాలని ఒకటి రెండుసార్లు సార్లు ఆయనే అడిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 👉చంద్రబాబు చేసిన మోసాలు ఇవి అంటూ జగన్ కొన్ని అంశాలను ఉదహరించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా చంద్రబాబూ అని ఆయన అడిగారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు. 👉నిరుద్యోగ యువతకు నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి కదా! రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడుతున్నావు కదా? అని జగన్ వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమే లేదు. 👉సూపర్ సిక్స్తోపాటు టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉన్న ఇతర హామీల మాటేమిటి అని అంటూ ఏభై ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారికి నెలకు రూ.నాలుగు వేల ఫించన్ ఇస్తానన్న వాగ్ధానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదన్న జగన్ వ్యాఖ్యకు చంద్రబాబు నుంచి బదులు లేదు. 👉వృద్ధాప్య ఫించన్లో సుమారు 5 లక్షల మందికి కోత పెట్టారని జగన్ చేసిన ఆరోపణపైన చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారు. సూపర్ సిక్స్ కు సంబంధించి ఎన్నికల ముందు టీడీపీ మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లోని అంశాలకు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఇస్తున్న ప్రచార ప్రకటనలలోని తేడాలను చూపించి జగన్ కూటమిని నిలదీశారు. ఆడబిడ్డ నిధి, ఏభై ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను ఇప్పుడు హామీల ప్రచార ప్రకటన నుంచి తొలగించడాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు ఆడతారని అంటూ, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు, ఇప్పుడు చెబుతున్న మాటలతో పోల్చి జగన్ ఆధారసహితంగా విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు ఇచ్చారని, మెహరాజ్ బేగం షేక్ అనే ఆమె కుటుంబానికి 2024 జూన్ నుంచి వివిధ స్కీముల కింద రూ.3.34 లక్షల ఆర్థిక సాయం అందుతుందని చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన బాండ్ ఉందని, ఆ మేరకు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ఇవ్వకపోవడం జనాన్ని మోసం చేయడం కాదా? అని నిలదీశారు. తల్లికి వందనం స్కీమ్ లో కోతలు పెట్టడం, వంట గ్యాస్ సిలిండర్లు గత ఏడాది ఒకటే ఇవ్వడం, ఈ ఏడాది ఇంకా ఇవ్వకపోవడం మొదలైన విషయాలను లేవనెత్తారు. చంద్రబాబు మాత్రం ఈ స్కీములను కొన్నిటిని ప్రస్తావిస్తూ అవన్ని అమలు చేసేసినట్లు, సూపర్ హిట్ అయిపోయినట్లు ప్రజలలో భ్రాంతి కల్పించే యత్నం చేశారు. ఉదాహరణకు అన్నా క్యాంటిన్లలో 5.60 కోట్ల మంది భోజనం చేశారని ఆయన అన్నారు. అవి కాకిలెక్కల్లా కనిపిస్తున్నాయన్నది పలువురి భావన. అయినా అది అమలు చేశారని అనుకున్నా, మిగిలినవాటి సంగతేమిటి? తల్లికి వందనం లో రూ.15 వేలు ఇస్తానని ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది రూ.13 వేలు చొప్పునే ఇచ్చింది వాస్తవమా? కాదా? అందులోను చాలామందికి కోత పడిందా? లేదా? అన్న జగన్ ప్రశ్నకు జవాబు రాలేదు. ఉచిత బస్సు గురించి మీరు ఇచ్చిన హామీ ఏమిటి? ఎక్కడికైనా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ఆర్టిసి బస్ ప్రయాణం చేయవచ్చని చెప్పారా?లేదా? అని అంటూ, అప్పట్లో చంద్రబాబు దానికి సంబందించి చేసిన ప్రసంగం క్లిప్పింగ్ ను కూడా జగన్ చూపించారు. ఆ విషయానికి చంద్రబాబు బదులు ఇవ్వకుండా, ఫ్రీ బస్ హిట్ అయిందని, ఐదు కోట్ల మంది ప్రయాణాలు చేసేశారని సభలో తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు కేవలం కూటమి ప్రభుత్వమే రైతులకు ఇస్తుందని ఎన్నికలకు ముదు హామీ ఇచ్చి ,ఒక ఏడాది ఇవ్వకుండా, ఈ ఏడాది రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చింది నిజం కాదా అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సమాధానం రాలేదు. తొలివిడతలో రూ.ఏడు వేలు ఇచ్చామని సభలో చెప్పారు. మరి హామీ నెరవేర్చినట్లు అవుతుందా? అందువల్ల ఇది హిట్టా? ఫట్టా అని అంటే ఫట్ కాకపోయినా, రైతులను మోసం చేసినట్లే అవుతుందన్న విశ్లేషణ వస్తుంది. ఇక మెడికల్ కాలేజీల గురించి జగన్ మాట్లాడుతూ తమ హయాంలో 17 కాలేజీలు తెచ్చిన వైనం, అందులో కొన్నిటిని పూర్తి చేసిన సంగతి చెప్పారు. సంబంధిత కాలేజీల భవనాలు,క్లాస్ రూమ్ల ఫోటోలను ,వీడియో క్లిప్పింగ్ లను కూడా ఆయన చూపించారు. ఈ అంశంలో చంద్రబాబు ఏకంగా అబద్దం చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీనే ఈ మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పేశారు. కాలేజీలకు భూమి ఇచ్చి శంకుస్థాపన చేస్తే సరిపోతుందా? అని మరోసారి అన్నారు. అయితే సమాచార శాఖ మంత్రి పార్థసారథి క్యాబినెట్ సమావేశం తర్వాత గత ప్రభుత్వం 17 కాలేజీలను కేంద్రం ద్వారా తీసుకు వచ్చిందని వెల్లడించి, అందులో ఏడు పూర్తి అయ్యాయని, పదింటిని పీపీపీ పద్దతిలోకి మార్చుతున్నామని చెప్పారు. ఈ వీడియో క్లిప్పింగ్ను ,చంద్రబాబు అనంత సభలో చెప్పిన అబద్దాన్ని కలిపి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఇలా అసత్యాలు కాకుండా, జగన్ ప్రభుత్వం వీటిని తెచ్చిందని, వాటిని ఎందువల్ల తాము పిపిపి మోడల్ గా మార్చుతున్నామో వివరించి ఉంటే గౌరవంగా ఉండేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం ఏభై సీట్లు ఇస్తే, తమకు వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దుర్మార్గం కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడనే లేదు. యూరియా కొరత లేదని తొలుత కొన్నాళ్లపాటు డబాయించిన చంద్రబాబుఈ సభలో మాత్రం యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పడం గమనించదగ్గ విషయమే. ఏది ఏమైనా జగన్ తనదైన శైలిలో పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే , వాటికి చంద్రబాబు జవాబులు ఇవ్వలేకపోయారు.తమ సూపర్ సిక్స్ హిట్ కాదని కూటమి నేతలకు కూడా తెలుసు. ప్రజలలో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు అనంతపురంలో సూపర్ హిట్ అంటూ సభ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్ను ఆ ఒక్క ప్రశ్న అడిగి ఉండాల్సింది!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ తాజాగా ఒక వ్యాఖ్య చేశారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదట. కావాలనుకుంటే జగన్ను ఎప్పుడో జైలుకు పంపి ఉండేవారట!. జాతీయ టీవీ చానల్ ఏర్పాటు చేసిన సదస్సులో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉందన్నది చర్చనీయాంశం. ఒక్కసారి రెండేళ్లు వెనక్కు వెళదాం.. ..అప్పట్లో లోకేశ్ ప్రతిపక్ష పార్టీ నేత. రాష్ట్రమంతటా యువగళం పేరుతో పడుతూ లేస్తూ ఓ యాత్ర లాంటిది చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని గ్రామాలను చుట్టేసి వచ్చారు కానీ.. తనతోపాటు ఓ ఎర్రటి పుస్తకాన్ని మోసుకెళ్లారాయన. జేబులో ఉంచుకున్నాడా? లేదు.. ఎక్కడికక్కడ సమావేశాల్లో పైకెత్తి అందరికీ చూపించాడు. శత్రువుల జాబితా సిద్ధం చేస్తున్నాని.. వాళ్ల భరతం పడతానని సవాళ్లూ విసిరారు. ఈ క్రమంలో బట్టలిప్పిస్తానని.. అదని ఇదనీ అవాకులు, చెవాకులు చాలానే మాట్లాడారులెండి. ఎన్నికలొచ్చాయి. సూపర్ సిక్స్ను నమ్మారో.. ఈవీఎంల గందరగోళమో తెలియదు కానీ..జాతీయ స్థాయి విశ్లేషకులు, ఎగ్జిట్పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ తెలుగుదేశం, జనసేన బీజేపీల కూటమి అధికారంలోకైతే వచ్చింది. రాష్ట్రంలో అరాచకానికి, అవ్యవస్థకు నాందీ పడింది కూడా అప్పుడే!.. .. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయో లేదో రెడ్బుక్ పేరుతో టీడీపీ రాజ్యాంగం మొదలైంది. ఒకట్రెండు చోట్ల హోర్డింగ్లు పెట్టిమరీ తాము వైసీపీ వారిపై కక్ష తీర్చుకోబోతున్నామని ప్రకటించారు కూడా. అందుకు తగ్గట్టుగానే టీడీసీ కార్యకర్తలు వైసీపీ వారి ఇళ్లపై, ఆస్తులపై విరుచుకుపడ్డారు. దాడులు చేశారు. పల్నాడు ప్రాంతంలో కొంతమంది వైసీపీ నేతలు వీరి ఆగడాలను తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. తప్పుడు కేసుల బనాయింపు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కొత్త కేసు పెట్టడం వంటి కొత్త కొత్త మార్గాలు సృష్టించి మరీ అమలు చేశారు టీడీపీ పెద్దలు. కొందరిని సుదూర ప్రాంతాలలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి నరకయాతన పెట్టారు. వైసీపీ నేతలపై అక్రమ కేసు బనాయించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చిందంటే ఏపీలో కక్ష రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని దూషించిన టీడీపీ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనం. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను వేధించినా కేసులే కట్టరు. ఇతర అరాచకాల సంగతి సరేసరి. నేతల పరిస్థితి ఇలా ఉంటే.. సోషల్ మీడియా వారినైతే దారుణంగా హింసించే విధంగా అక్రమ అరెస్టులు సాగించారు. అదే టీడీపీ, జనసేనలకు చెందిన వారు హింసకు పాల్పడినా, అరాచక పోస్టులు పెట్టినా చూడనట్టు వ్యవహరించడం ఇంకో విచిత్రం. నామ్ కా వాస్తే ఒకటి, అరా కేసులు పెట్టినా అవి తూతూ మంత్రం కేసులే. పోలీసు రాజ్యం ఎలా నడపాలో, కక్షలు ఎలా తీర్చుకోవాలో భవిష్యత్తు ప్రభుత్వాలకు కూటమి సర్కార్ తీరు మార్గదర్శకం అయ్యే ప్రమాదం కనిపిస్తుంది.చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఏ రకంగా దూషించారో అందరికి తెలుసు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి, అధికారుల పేర్లు కూడా రెడ్బుక్ లో రాస్తున్నామని బెదిరిస్తూ లోకేశ్ ప్రచారం చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ఇంత ఘోరంగా లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మీద చంద్రబాబు పట్టు ఏమీ లేదని, మొత్తం కథ లోకేశే నడిపిస్తున్నారని, పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు ఇస్తూ ఎవరెవరిని హింసించాలో సూచిస్తుంటారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అక్కడక్కడా తిరుగుతూ ప్రసంగాలకే పరిమితం అవుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలన్నిటిని లోకేశ్ హాండిల్ చేస్తున్నారని అంటున్నారు. దానికి తగినట్లే లోకేశ్ ప్రధాని హోం మంత్రులను కలిశారు. జాతీయ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభుత్వ విధానాలపైన, అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక పద్దతిగా వ్యవహరించవలసిన లోకేశ్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అసత్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది విమర్శ.. .. రాజ్దీప్ సర్దేశాయి నిర్వహించిన సమావేశలో చంద్రబాబును జగన్ జైలులో పెట్టారు కాబట్టి జగన్ను జైలుకు పంపుతారా అన్న ప్రశ్నకు లోకేశ్ జవాబిస్తూ, 'అది మా ఎజెండా కాదు. చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ది. చట్టాన్ని ఉల్లంఘిస్తే నాతోపాటు ఎవరైనా దాని పర్యవసానం అనుభవించాల్సిందే. నేను తప్పు చేసినా మా నాన్న నన్ను జైలుకు పంపుతారు. మరో ఆలోచన లేదు" అని లోకేష్ చెప్పారట. ఈ వ్యాఖ్యలలో నిజమెంత అన్నది ఆయన ఆత్మకు స్పష్టంగా తెలుసు. కావాలంటే జగన్ను ఎప్పుడో జైలుకు పంపేవాళ్లమన్నది అహంభావంతో కూడిన సమాధానం కాక మరేమిటని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. జగన్పై కక్షతోనే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి పలువురిని జైలుపాలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ కేసులో జగన్ను కూడా జైలుకు పంపించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజూ తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. దీనిని ప్రతీకార రాజకీయం అనరా? రాజ్ దీప్ సర్దేశాయికు ఏపీలో ఏమి జరుగుతున్నదో తెలియకపోవచ్చు. లోకేశ్ జవాబు విన్నవెంటనే మరి రెడ్బుక్ మాటేమిటి అని ప్రశ్నించి ఉండాల్సింది..!! కొద్ది రోజుల క్రితం కడపలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను ఏదీ మర్చిపోలేదని, తన తండ్రిని 53 రోజులు అక్రమంగా నిర్భంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా? తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది అని లోకేశ్ చెప్పారు. నిజానికి లోకేశ్ ప్రస్తుతానికి మంత్రి మాత్రమే. కాకపోతే సకల శాఖల మంత్రిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది ప్రశ్న. మిగిలిన మంత్రులను డమ్మీలుగా మార్చారా?లోకేశ్ చెప్పే దానినే పరిగణనలోకి తీసుకుంటే తండ్రి మీద వచ్చిన కేసులను నీరు కార్చకుండా చట్టం తన పని తాను చేసుకుపోయేలా వ్యవహరించే ధైర్యం ఉందా? అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా ప్రతీకార రాజకీయాలు, రెడ్బుక్ గోల మానుకుని, హుందాగా నడిస్తే మంచిది. లేకుంటే ఆయన ప్రత్యర్థులపై వేస్తున్న ఉచ్చులో తానే పడిపోయే అవకాశం ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది!
‘‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’’ నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు, దివంగత నూతన్ప్రసాద్ ఒకానొక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే కానీ.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఊహూ.. మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కానే కాదు. పాక్తో యుద్ధం.. లేదా అమెరికాతో టారిఫ్ల విషయం అంతకంటే కాదు. దీనికంటే కొంచెం సీరియస్ విషయం. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా. ఏమిటంటారా.. తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది!జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే కానీ.. అన్నివేళలా కాదు. ఎందుకంటే.. సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే.. దేశం ముసలిదైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్తా ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకీ విషయం అర్థమైపోతుంది. ‘‘మా దేశం రండి. ఉచితంగా ఇల్లిస్తాం. ఉద్యోగం వెతుక్కునేంతవరకూ నెలవారీ భృతి కూడా ఇస్తాం’’ అంటూ కొన్ని యూరోపియన్ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం..1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఆరుగురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి.. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు... బోలెడంత మంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే.. దేశ అవసరాల కోసం అనండి.. ఇంకో కారణం చేతనైనా కానివ్వండి ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది. ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారికంటే పుట్టే వారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్కు ఉన్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే.. పద్నాలుగేళ్ల లోపువారు 24 శాతం మంది ఉంటే పనిచేసే స్థితిలో ఉన్న వారు (15 - 64) వారు 68 శాతం మంది ఉన్నారు. మిగిలిన ఏడు శాతం మంది 65 ఏళ్లపైబడ్డ వృద్ధులు!అయితే ఏంటి?2050 నాటికి దేశంలో 65 ఏళ్లపైబడ్డ వారు మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంచనా. అంటే.. సుమారు 19 కోట్ల మంది పని చేసే స్థితిలో ఉండరు. వీరందని పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధివేటలో నగరాలకు మళ్లిపోవడం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. యూరోపియన్ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు (వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటివి)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
రాజా సాబ్.. స్థాయికి తగ్గ మాటలాడండి సార్!
గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి వయసైపోయినట్టు ఉంది. మంచి మాటతీరు, మర్యాదలతో ఒకప్పుడు అన్ని పార్టీల మన్ననలు పొందిన ఆయన.. ఇటీవల చేసిన ఒక ఉపన్యాసాన్ని గమనిస్తే ఈ అనుమానం రాకమానదు. విశాఖపట్నంలోని రిషికొండపై వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన భవంతుల్లో పిచ్చాసుపత్రి పెట్టాలని ఆయన తన గౌరవాన్ని దిగజార్చుకున్నట్లు అయ్యింది. క్షత్రియ సంక్షేమ సమితి సభ్యుల సన్మానం సందర్భంగా ఆయన నాలుగు మంచి ముక్కలు మాట్లాడి వెళ్లకుండా రిషికొండ భవనాల్లో బస చేయమన్నా నిద్రపట్టదట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుందని వ్యాఖ్యానించారు. అక్కడికి రిషికొండపై ఇప్పుడే భవనాలేవో నిర్మించినట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. టూరిజం శాఖ భవనాల స్థానంలో చూడముచ్చటైన నిర్మాణాన్ని చేసినందుకు హర్షించాల్సింది పోయి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. పైగా ఇదో ఉచిత సలహా అంటూ వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగింది మాత్రం కాదు. ఆయనలో రాచరికం వాసనలు ఇంకా పోనట్టు ఉంది. తమ కోటలను మించిన అద్భుతమైన భవనాలు ఇంకెక్కడ ఉండకూడదన్న అక్కసుతో రిషికొండ భవనాలపై ఈ ఆరోపణలు చేశారేమో అనుకోవలి. చిత్రంగా ఎల్లోమీడియా ఇవే వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించి చంకలు గుద్దుకుంది. అయితే..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో పెట్టిన విపరీత ఖర్చులపై ఏనాడూ ఆక్షేపణ చెప్పని అశోక్ గజపతి రాజుకు మూడు వేల మంది కూడా లేని సచివాలయ సిబ్బంది కోసం యాభై అంతస్తుల భవనం నిర్మిస్తున్నప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తున్నా ఆయనకు పాలకుల సైకోతత్వం అవగతం కాలేదు. రిషికొండ భవనాలను ఎలా వాడుకోవాలన్న విషయంపై అధ్యయనం జరుగుతోందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవలే చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే పవన్ అక్కడకు వెళ్లినప్పుడు ఇంకో రకం డ్రామా జరిగింది. ఫాల్స్ సీలింగ్ను ఎవరో కొద్దిగా కోసినట్లు కనిపించింది. ఆ ముక్క గచ్చుమీద కనిపించింది. ఉప ముఖ్యమంత్రి వస్తున్నా.. అక్కడి సిబ్బంది దాన్ని తొలగించలేదు. అంటే నిర్మాణంలో ఏదో లోపం జరిగిందన్న సందేహం ప్రజలలో కలిగించడానికి కుట్ర చేశారని సోషల్ మీడియాలో ఆధారసహితంగా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో అదేదో జగన్ సొంత భవనం అన్నట్లుగా అబద్దపు ప్రచారం చేశారు. అమరావతిలో అనవసరంగా వేల కోట్లు వ్యయం చేస్తూ, విశాఖలో రూ.450 కోట్లతో ఏడు భవనాలు నిర్మించి అందంగా తీర్చిదిద్దితే దానిని వాడుకోవడం చాతకాని ప్రభుత్వంగా మారింది. ఈ తరుణంలో అశోక్ గజపతిరాజు వచ్చి తన వంతు పాత్ర పోషించారనిపిస్తుంది. ఒకప్పుడు అశోక్ కు అంతగా పదవీ వ్యామోహం లేదని భావించే వారు. కాని తన స్థాయికి తగని గోవా గవర్నర్ పదవిని అంగీకరించినప్పుడు ఆయనకు పదవి పిచ్చి పట్టిందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి ఈ పదవి ఇప్పించారో, లేక స్వయంగా పైరవీ చేసుకున్నారో కాని, ఈ చిన్న పదవి తీసుకోవడం ద్వారా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకున్నారని కొంతమంది విమర్శించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది.. రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయనకు అతి చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాకు గవర్నర్ పదవి ఇవ్వడం అంటేనే పరువు తక్కువ అనే అభిప్రాయం పలువురిలో ఉంది. బీజేపీ నేతలు విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కె.హరిబాబు వంటివారు ఇంతకన్నా పెద్ద రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులయ్యారు. కాని వీరందరికన్నా రాజకీయంగా ఎన్నో పదవులు చేసి, సీనియర్ నేతగా ఉన్న అశోక్ కు మొక్కుబడిగా గోవా గవర్నర్ పదవి ఇస్తే పరమానందంగా స్వీకరించారని, దీనిని ఏమంటారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గవర్నర్ పదవిలో హుందాగా ఉండవలసిన ఈయన రాజకీయ విమర్శలు చేయడం, మాజీ సీఎంను సైకో అని అనడం బహుశా వయసు మీద పడడం వల్ల వచ్చిన సమస్య కావచ్చేమో అన్నది కొందరి అనుమానం. విశేషం ఏమిటంటే ఇదే సభలో ఆయన ప్రతి ఒక్కరు అహం నియంత్రించుకోవాలని హితబోధ చేశారు.అయితే ఆయన మాత్రం అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు. అశోక్ గజపతి రాజే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్నిసార్లు అసందర్భ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ మధ్య ఆయన ఒక సభలో మాట్లాడుతూ కనీసం 120 ఏళ్లు జీవించవచ్చని, తాను సంజీవని అనే స్కీమ్ తీసుకు వస్తున్నానని అన్నప్పుడు సభికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బహుశా ఆయన మనసులోని కోరికను ఇలా బయటపెట్టారేమో అని కొందరు వ్యాఖ్యానించారు. ఇదే కాదు.. గతంలో హుద్ హుద్ తుపాను వచ్చిన తర్వాత, సముద్రాన్ని కంట్రోల్ చేశామని అనడం చిత్రం అనిపించింది. అమరావతిలో పది డిగ్రీల వేడి తగ్గించడానికి ఆదేశాలు ఇచ్చానని ఒకసారి, అమరావతిలో ఒలిపింక్స్ నిర్వహిస్తామని ఇంకోసారి ..ఇలా పలురకాలుగా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు తమ వయసును గుర్తు చేస్తున్నారన్నఅభిప్రాయం కలుగుతుంది. ‘‘వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయం ఏమీ రాదని, దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది’’ అన్న గజపతిరాజు వ్యాఖ్యలకు ఒక పౌరుడి స్పందన ఏమిటంటే... ‘‘అవును నిజమే! 15 నెలల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన కారణంగా ఏపీ ప్రజలు చాలామందికి పిచ్చి ఎక్కిన పరిస్థితి ఉంది, నయం చేసుకోవాలంటే విశాఖలోనే కాదు... రాష్ట్రమంతా పిచ్చి ఆస్పత్రులు పెట్టాలి. మొట్టమొదటగా విజయనగరంలో అలాంటి ఆస్పత్రి ఏర్పాటు చేస్తే మేలు’’ అని!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పబ్లిక్ టాక్: ఆ దొంగలే ఎంతో నయం!
మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కని మనిషి కరిస్తే కదా వార్త అని మనం అంతా అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే. దొంగలు దోచుకుంటే అది వార్త కాదు. ఇవాళ్టి రోజుల్లో అయితే దొంగలు దొరికినా కూడా వార్త కాదు. టెక్నాలజీ చాలా మందిని పట్టిచ్చేస్తోంది. కానీ దొంగలు దోచుకున్న సొమ్మును తిరిగి తెచ్చి, దొంగచాటుగా, అప్పగించేసి, లెంపలు వాయించుకుని, క్షమాపణ కోరుతూ ఓ ఉత్తరం కూడా విడిచి వెళ్లారంటే మాత్రం అది వార్తే. ఆ యవ్వారంలో ఏదో కొంత స్ఫూర్తి ఉన్నదని గ్రహించాల్సిందే. ఆ స్ఫూర్తిని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి.. మన రాజకీయ నాయకులందరికీ కానుకలుగా పంపాలని కంకణం కట్టుకోవాల్సిందే. ఇంతకీ ఏమిటీ తమాషా అనుకుంటున్నారా?.. అనగనగా బుక్కరాయసముద్రంలో ముసలమ్మ పుణ్యక్షేత్రం ఉంది. సాధారణంగా గ్రామదేవతలు అత్యంత మహిమాన్వితులుగా స్థానికులు నమ్ముతుంటారు కదా.. అక్కడ కూడా ముసలమ్మ మహిమల్ని అదేవిధంగా నమ్ముతుంటారు. కానీ.. కొన్ని రోజుల కిందట ముసలమ్మ పుణ్యక్షేత్రంలో దొంగలు పడి హుండీ చోరీ చేశారు. ఒకవైపు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈలోగా.. ఆలయ ఆవరణలోనే దోచిన సొమ్మునంతా తెచ్చిపెట్టేసి, దానితో పాటు ఓ ఉత్తరం కూడా పెట్టి.. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు.హుండీ సొమ్ము దొంగిలించిన కాణ్నించీ.. మా యింట్లో పిల్లలకి ఆరోగ్యం బాగా లేదు. ముసలమ్మ సొమ్ము దొంగిలించి తప్పు చేశాం. అందుకే తిరిగి యిచ్చేస్తున్నాం. ఆస్పత్రి ఖర్చులకు అయిన డబ్బు మాత్రం వాడుకున్నాం. క్షమించండి.. అని ఆ ఉత్తరంలో వారు వాక్రుచ్చారు. పోలీసులు తిరగొచ్చిన సొమ్మును లెక్కవేస్తే 1.86 లక్షల రూపాయల దాకా తేలింది. దొంగలెవరో కనిపెట్టాలని వెతుకుతున్నారు.పాపం.. ఆ ముసలమ్మ హుండీ దొంగల పశ్చాత్తామని, పాపభీతిని పక్కన పెడదాం. సొమ్ము తిరిగి ఇవ్వడం ద్వారా వారిలోని స్ఫూర్తిని మాత్రం పట్లించుకుందాం. ఈ వార్త చదివితే.. ఈ దొంగల స్ఫూర్తి మన రాజకీయ నాయకులకు ఉంటే ఎంత బాగుంటుంది కదా.. అని మనకు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారం దక్కింది.. ఉన్న కాడికి దోచెయ్యాలి.. జీవితంలో మళ్లీ అధికారం అనేది మన దాకా వస్తుందో రాదో అన్నట్టుగా దోపిడీ చేస్తున్న కూటమి పార్టీ నాయకుల వ్యవహారం ప్రజలకు కంపరం పుట్టిస్తోంది. పబ్లిక్ టాక్ ఏంటంటే..ఏపీలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోచుకుంటూ ఉంటే.. చేతగాని ప్రేక్షకుడిలాగా చూస్తూ ఊరుకుంటున్న అధినాయకుడు మాత్రం.. అప్పుడప్పుడూ రంకెలు వేస్తూ.. ‘లేస్తే మనిషిని కాదు.. ఖబడ్దార్’ అంటూ ఉంటారు. ఒకవైపు హామీల అమలులో విఫలమై.. ప్రజాసందోహంలో పరువు పోగొట్టుకుంటున్న కూటమి నాయకుల్లో.. మళ్లీ ఎన్నికలంటూ వస్తే మనం ఎటూ గెలవం అనే భయమే వారిని దోపిడీ వైపు ప్రేరేపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి మొబిలిటీ అడ్వాన్సుల ముసుగులో దోచుకున్న వందల వేల కోట్ల రూపాయలు, లిక్కర్ దుకాణాల్ని అయినవారికి కట్టబెట్టి సిండికేట్లుగా దోచుకుంటున్న మొత్తాలు, ఇసుక ఉచితం పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న వాటితో ప్రారంభించి.. అవకాశం ఉన్న ప్రతి వ్యవహారంలోనూ ఆమ్యామ్యాలతో రెచ్చిపోతున్న నాయకుల్లో ఇలాంటి పశ్చాత్తాపం రావాలంటే.. వారికోసం ఎంత పవర్ ఫుల్ దేవుళ్లు... వారికి ఎన్ని ఇక్కట్లు సృష్టించాలో కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నాయకులు దోచుకుంటున్న సొమ్ముల్లో వాడుకున్నది పోగా.. దేవుళ్ల మహిమతో, ముసలమ్మ దొంగల స్ఫూర్తితో మిగిలింది తిరిగి ఇచ్చినా కూడా.. ఒక అమరావతి కాదు కదా.. పది అమరావతిలు, పది పోలవరం డ్యాములు కట్టవచ్చునని ప్రజలు అంటున్నారు.అయినా.. దొంగలకు ఉండే స్ఫూర్తి ఈ నాయకులకు ఎందుకుంటుంది? దొంగలు చాలా గొప్పవాళ్లు కదా? అవసరం కోసం దోచుకునే వారికి ఉండే న్యాయం, బుద్ధి.. అరాచకం కోసం దోచుకునే నాయకుల్లో ఆశించడం కూడా తప్పే కదా.. అని కొందరు పెదవి విరుస్తున్నారు.:::ఎం.రాజేశ్వరి -
ఎద్దు ఈనిందనగానే.. జున్నుపాలు అడిగాడంట!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే అందరు సచివుల కంటె తాను కార్యవాది మంత్రిని అని చాటుకోవడానికి పాపం.. నారా లోకేష్ బాబుకు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్టుంది. టెక్నాలజీని వాడడంలో వేగం మాత్రమే కాదు, కార్యకర్తలు తమ కష్టాల్ని చెప్పుకుంటే వాటికి తక్షణం స్పందించడంలో కూడా తనను మించిన వారు లేరని చాటుకోవాలనే ఉబలాటం చాలానే ఉన్నట్టుంది. ఓ కార్యకర్త నారా లోకేష్ను ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టగానే, 20 నిమిషాల్లోగా మంత్రిగారు దానికి రెస్పాన్స్ ఇచ్చారు. సంబంధిత పోలీసుల్ని పనిమీద పురమాయించేశారు. న్యాయం చేయాలని, తనకు అప్ డేట్ చేయాలని ఎక్స్ లో హుకుం విడిచారు. చూడబోతే.. ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్న పెద్దమనిషి ఆత్రుత గురించి మన పెద్దోఆల్లు సామెతలు తయారుచేశారు. కానీ లోకేష్ వ్యవహార సరళిని గమనిస్తే.. ‘ఎద్దు ఈనిందంటే.. సాయంత్రం ఇంటికి జున్నుపాలు పంపు..’ అని అడిగే చందంగా కనిపిస్తున్నారు. Please look into this issue @appolice100. Kindly follow up @officeofNL and keep me updated. https://t.co/558zUiBWA5— Lokesh Nara (@naralokesh) September 4, 2025ఇంతకూ ఈ కామెడీ ఎపిసోడ్ తాలూకు కథా కమామీషూ ఏంటంటే... ‘‘అన్నా @naralokesh గారు. నా పేరు రోజిబాబు. నా జీవనాధారం అయిన ఇన్నోవా కారును YCPకి చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా లాక్కుని వెళ్తే గత సంవత్సరంగ నాకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరపాలెం పోలీసుల చుట్టూ తిరుగుతున్న స్పందన లేదు .దయచేసి నా కారు నాకు ఇప్పించండి.నాకు అదే జీవనాధారం.’’ అంటూ ఎవరో ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. లోకేష్ వెంటనే పోలీసులను ట్యాగ్ చేసి, ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ సంగతేంటో చూడండి.. ఏ సంగతి ఎప్పటికప్పుడు నాకు చెప్పండి’’ అని ట్వీటు వేసేశారు. ఇదంతా సదరు రోజిబాబు ట్వీటు పెట్టిన 20 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఒక మామూలు వ్యక్తి ట్వీటుకు మాననీయ మంత్రి వర్యులు అంత వేగంగా స్పందిస్తే సంతోషించాలి గానీ.. విమర్శ ఎందుకు? అనిపించవచ్చు. అక్కడే ఉంది తమాషా!. సదరు రోజిబాబు.. ట్విటర్ అకౌంటు పెట్టుకున్నదే ఈ సెప్టెంబరు నెలలో.. అనగా ఇవాళ గత రెండురోజుల్లోనో మాత్రమే. ఆయన ఖాతాలో ఉన్నది ఇదొక్కటే ట్వీటు! ఆయన ఇలా పెట్టడమూ వెంటనే మంత్రి స్పందించడమూ.. ఏదో ముందే స్క్రిప్టు ప్రకారం జరిగిన కామెడీ ఎపిసోడ్ లాగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పోస్టు కింద కామెంట్లలో స్పందిస్తున్న నెటిజన్ల జోరు గమనిస్తే... చినబాబుకు బహుశా జ్ఞాననేత్రం తెరచుకోవాల్సిందే! ఆ రోజిబాబు అకౌంటును గంట ముందే క్రియేట్ చేసుకుని పోస్టు పెడితే.. అప్పుడే స్పందనా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా డీసీఎం పోస్టు నువ్వే తీసుకోరాదా అంటున్నారు. తల్లికి వందనం రాలేదని, ఉద్యోగాలు అడిగినా గానీ స్పందించరు గానీ.. వైసీపీ వాళ్లు కారు లాక్కున్నారనగానే.. ముందూ వెనకా చూసుకోకుండా చర్యలకు పురమాయించడమేనా అని కొందరు అడుగుతున్నారు. మహానాడుకు వచ్చినప్పుడు నా ఫోను పోయింది సార్.. సీకె దిన్నె పోలీసులకు ఫిర్యాదుచేసినా దిక్కులేదు.. తమరు ఇప్పించండి అంటూ దాసరి రామకృష్ణారెడ్డి అనే తెదేపా సీనియర్ కార్యకర్త అంటున్నారు. సుగాలి ప్రీతి తల్లి విలాపం విషయంలో ఈ వేగవంతమైన స్పందన ఎక్కడికెళ్లిందని అంటున్నారు. మొత్తానికి ఒక్క ట్వీటు ద్వారా.. నారా లోకేష్ అభాసు పాలైపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ఒకరు ఒక ఫిర్యాదు చేస్తే అందులో ఉండే న్యాయబద్ధత గురించి తెలుసుకుని స్పందించడం విజ్ఞుల విధానం. అలా కాకుండా.. నింద వైసీపీ వారి మీద ఉన్నది కదా అని.. చర్యలకు ఉపక్రమిస్తూ రెచ్చిపోయి స్పందిస్తే ఇలా అభాసుపాలు కావల్సిందేనని అంతా అనుకుంటున్నారు. పీఆర్ స్టంటులను, స్ట్రాటజీలను తగలెయ్యా అని జనం ఆడిపోసుకుంటున్నారు. నేరుగా మొరపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరని, వినతిపత్రాలు రాసుకుంటే బుట్టదాఖలు అవుతాయని, ట్వీట్ల రూపంలో అయితే సోషల్ మీడియా క్రేజ్ కోసం స్పందిస్తారని.. పాపం ఆ జోజిబాబుకు కూటమి నేతల మీద ఒక నమ్మకం ఉంటే తాను ఖాతా క్రియేట్ చేసుకుని తొలిపోస్టుగానే ఈ నింద పెట్టడం తప్పేమీ కాదు. కొత్త ఖాతా అయినంత మాత్రాన, ఒకటే పోస్టు ఉన్నంత మాత్రాన మంత్రి స్పందించకూడదని కూడా లేదు. కానీ.. ఇలాంటి నిరాధార నిందలు రోజుకు కొన్ని వేలు కూడా వస్తుంటాయి. నిరాధారంగా వేసే నిందల పట్ల కూడా మహా వేగం స్పందించేస్తే అభాసుపాలు కావాల్సిందే. ఒకవేళ జోజిబాబు ఆరోపణ నిజమే అయితే.. వైసీపీకి చెందిన వ్యక్తి కారు లాక్కోవడానికి ఎలాంటి కారణం ఉన్నదో ముందు తెలుసుకోవాలి. సదరు జోజిబాబు పోలీసుల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతున్నా ఎందుకు పని జరగలేదో తెలుసుకోవాలి. ఒకవేళ అదంతా నిజమే అని తేలితే.. ఏడాదిరోజులుగా పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేస్తారా? ట్రాన్స్ఫర్ చేస్తారా? కూడా లోకేష్ తేల్చి చెప్పాలి. అంతే తప్ప.. వైసీపీ అనే పదం కనపడగానే.. బురద చల్లుడుకు వీలుగా ఉన్నదని ఇలా రెచ్చిపోయి స్పందిస్తే నవ్వులపాలవుతారు. ఎద్దు ఈనిందంటే.. జున్నుపాలు తెమ్మన్నంత మేధావిగా కొత్త సామెతలు పుట్టడానికి కారకులవుతారని చినబాబు తెలుసుకోవాలి.:::ఎం. రాజేశ్వరి -
కాళేశ్వరం తలనొప్పి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే కాదు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందా? శాసనసభలో ఒకలా.. హైకోర్టులో ఇంకోలా వాదనలు వినిపించడం ఈ అనుమానానికి తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆదివారం హడావుడిగా శాసనసభ పెట్టి సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయం తరువాత విచారిస్తామని ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు కేసీఆర్, హరీశ్రావులపై తదుపరి చర్యలను నెల పాటు నిలిపివేసింది. ఈ కేసులో ఆడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు, సీబీఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డామ్ సేఫ్టీ అధారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. పైగా ఈ చర్చ జరిగిన తీరు చూస్తే బీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.శాసనభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కాని ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తన వాదనను సమర్థంగా వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అనిపించింది. సీఎంతోపాటు పలువురు మంత్రుల ఆరోపణలకు హరీశ్ ధీటుగా ఆధారసహితంగా జవాబిచ్చారు. ఒక దశలో హరీశ్ ప్రసంగం కొనసాగకుండా చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికిగాను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది సమర్థనీయంగా అనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా? చిత్తశుద్దితో చేసిందా? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి లాభం పొందుదామన్నది కాంగ్రెస్ ప్రయత్నమా? కేంద్రం అనుమతించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కు అని ప్రచారం చేయవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్ఎస్పై ఉండనే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ల పొత్తు అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో సీబీఐ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం ఏమిటన్నది కొందరి ప్రశ్న. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో అస్త్రాలుగా మారాయని గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. అదే సంస్థను రేవంత్ ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. సీబీఐ, ఈడీల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐని విమర్శిస్తూ స్పీచ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్పై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనిద్వారా రేవంత్ తన చేతిలోని ఆయుధాన్ని బీజేపీకి అప్పగించారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.కేంద్రం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడవచ్చు. సీబీఐ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్రావు తదితరులను అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ.. ఈలోగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధినేత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్లకే కాళేశ్వరం స్కామ్ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నుంచి కవితకు పెద్ద మద్దతు అయితే రాలేదు. అందరూ హరీశ్రావు వెంబడే నిలబడ్డారు. అయినా సరే.. కవిత వ్యాఖ్యలతో పార్టీకి కొంత నష్టమైతే జరిగింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కేసీఆర్కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్లకపోవచ్చు.లేదా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలేవీ తెలంగాణ బీజేపీకి అంతగా రుచించినట్లు అనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేశ్ రెడ్డి సీబీఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సీబీఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తును చేపడితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈయన పాత్రను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. కమిషన్ మాత్రం దానిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. పలువురు ఐఎఎస్ అధికారులు కూడా సీబీఐ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ ఐదేళ్లు ఈ వ్యవహారం ఒక రాజకీయ రచ్చగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఘోష్ కమిషన్ ఎక్కువ భాగం సాంకేతిక అంశాలకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగి ఉంటే ఏ రకంగా జరిగిందన్నదానిపై నివేదికలో పెద్దగా పరిశీలన లేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మిడి హెట్టి వద్ద నీరు తగినంత ఉన్నా, దానిని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్చించారన్నది ఘోష్ కమిషన్ వ్యాఖ్య. దానిని హరీశ్ రావు తోసిపుచ్చుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. ఆ రోజుల్లో కేసీఆర్ తన మాటే శాసనంగా ప్రభుత్వాన్ని నడిపారు. సాంకేతికపరమైన అంశాలను కూడా ఆయనే డీల్ చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అదే రీతిలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. ఈ కమిషన్ కొంతమంది అధికారుల జోలికి అసలు వెళ్లకపోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి. రేవంత్ కాని, మంత్రులు కాని ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే యత్నం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించలేదని రిపోర్టులోని అంశాలను హరీశ్ ఎత్తిచూపారు. ఘోష్ కమిషన్ వద్ద ఉన్న ఈ కమిటీ రిపోర్టును హరీశ్ ఉటంకించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ మీదట.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రిపోర్టు మీరే రాయించి ఉంటారని అనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అలాగే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడి హెట్టికి, మేడిగడ్డకు మధ్య గోదావరిలో కలిసే వాగులు, ఏరులు లేవని చేసిన వ్యాఖ్యకు సంబంధించి సమాధానం ఇస్తూ ఎన్ని వాగులు గోదావరిలో కలిసేది ఒక పెద్ద జాబితానే చదివారు. దాంతో జూపల్లి వాదన వీగిపోయింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించడంతో ఆ రోజుల్లో టీఆర్ఎస్లో ఉండి ఆయనేమి మాట్లాడారో, ట్వీట్ చేశారో చూపించారు. జాతీయ డ్యామ్ భద్రత అధారిటీ విచారణ గురించి ఉత్తం చెప్పారు. అసలు ఆ అధారిటీ ని కేంద్రం ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకువచ్చినప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తం దానిని వ్యతిరేకించారని, రాష్ట్రాల హక్కులను హరించడమే అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడితే లక్ష కోట్ల దోపిడీ అంటూ రేవంత్, మంత్రులు మాట్లాడినా, అది ఏరకంగా జరిగిందన్నది వివరంగా చెప్పలేదు. ఏదో సాధారణ రాజకీయ విమర్శగానే చేశారు. దానికి హరీశ్ బదులు ఇస్తూ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే ప్రాజెక్టు కాదని, 15 రిజర్వాయిర్లు, కిలోమీటర్ల కొద్ది టన్నెళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, మొదలైన వాటి జాబితాను వివరించారు. అసలు మొత్తం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు అయితే, లక్ష కోట్ల దోపిడీ అని ఆరోపించడంలో హేతుబద్దత కనిపించదు. అయితే మేడిగడ్డ వద్ద బారేజీ దెబ్బతింటే అసలు నీరు అందుబాటులో ఉండదని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిరర్థకం అవుతుందని ఉత్తం అనడంలో కొంత అర్థం ఉంది.కాని ఆ బ్యారేజీలు పూర్తిగా దెబ్బతిని ఉంటే ఆ సమస్య వస్తుంది కాని, లేకుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటుంంది.దానిని రిపేరు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురి అవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ,మరోవైపు అందుకు విరుద్దంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్టు సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
న్యాయస్థానం ప్రశ్నలకు జవాబేదీ ఎల్లో ఫెలోస్!
ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమర్పించిన ఛార్జ్షీట్పై కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ స్కామ్లో రూ.3500 కోట్లు దారి మళ్లాయన్న ఆరోపణపై తగిన సమాచారం ఇవ్వకపోవడం కోర్టు సందేహాల్లో కీలకమైంది. ఛార్జ్షీట్లన్నింటిలోనూ మొత్తం 21 అభ్యంతరాలను వ్యక్తం చేసిన న్యాయస్థానం వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. వారు ఎలాంటి జవాబిస్తారో తెలియదు కానీ.. ఇప్పటివరకూ ప్రజలకు వచ్చిన సందేహాలే న్యాయస్థానం కూడా వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. కోర్టు అభ్యంతరం చేసిన అంశాలలో సాంకేతికమైనవి కూడా ఉన్నాయి. ‘‘రూ.3500 కోట్లు దారి మళ్లాయని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తం వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోయే విధంగా సమర్పించాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది. సిట్ అధికారులు నిజంగానే ఆ స్థాయిలో స్కామ్ను కనుక్కుని ఉంటే రూ.3500 కోట్ల అవినీతి ఎలా జరిగింది? ఆధారాలు ఏమిటి? డబ్బు ఎలా వక్రమార్గం పట్టింది? వంటి వివరాలు తెలిపి ఉండేవారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో స్కిల్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. ఆ సందర్భంలో సీఐడీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఏమిటి? డబ్బు ఎలా దారి మళ్లింది? ఆయా షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది? చివరికి ఆ స్కామ్ డబ్బు టీడీపీ ఖాతాలోకి ఎంత చేరిందన్నదీ వివరిస్తూ కేసు పెట్టారు. పైగా అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ స్కామ్ను దర్యాప్తు చేసి మనీ లాండరింగ్ను గుర్తించింది. పలువురిని అరెస్టు కూడా చేసింది. స్కిల్ స్కామ్ విచారణ పకడ్బందీగా చేశారన్న కోపంతోనే అప్పటి సీఐడీ ఛీఫ్ సంజయ్ను ఇప్పుడు ఏదో అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆయన మార్గదర్శి కేసును కూడా హాండిల్ చేశారు. ఆ కోపంతో ఈనాడు మీడియా ఆయనపై కుట్రపూరిత కథనాలు ఇస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మద్యం కేసుకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఎవరికైనా మతి పోవల్సిందే. ఒక రోజు రాసిన దానితో నిమిత్తం లేకుండా మరుసటి రోజు పరస్పర విరుద్దంగా ఏవో కొత్త,కొత్త ఊహాగానాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్ను ప్రభుత్వమే సృష్టించి, ఎల్లో మీడియా ద్వారా నిత్యం తప్పుడు స్టోరీలు రాయిస్తూ, వైసీపీ నేతలు, మరికొందరు అధికారులను పోలీసుల చేత అరెస్టు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటుంది. సిట్ కోర్టుకు సమర్పించే ఛార్జ్షీట్లలో కూడా పుక్కిటి పురాణాలు కనిపిస్తున్నాయని కొందరు లాయర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. కోర్టువారు సైతం ఈ అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. పోలీసులు ఏమి కోరుతున్నది కూడా ఛార్జ్షీట్లో స్పష్టంగా రాయాలని కోర్టు సూచించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎల్లో మీడియా ఒక్కోసారి ఒక్కో రకంగా చేసిన ప్రచారం.. సిట్ అధికారుల లీక్లు, ఛార్జ్షీట్ లో ఉన్న అంశాలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.సిట్ అధికారులు జూలై నెలాఖరులో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్హౌస్లో 12 పెట్టెలలో రూ.11 కోట్లు పట్టుకున్నారని అవి మద్యం నోట్ల కట్టలని, నిందితుడైన రాజ్ కెసిరెడ్డి వని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రాశాయి. మధ్యం స్కామ్లో ఇది కీలక పరిణామమని కూడా దబాయించి చెప్పాయి. బాక్సులు బద్దలు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆ రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడమే కాకుండా, ఆ నోట్ల నెంబర్లను రికార్డు చేయాలని, ఆ నోట్లపై తన వేలి ముద్రలు ఉన్నాయోమో పరిశీలించాలని కోరారు. అంతే! అటు సిట్.. ఇటు ఎల్లో మీడియా గప్చుప్! ఆ అంశంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారని వార్తలు వచ్చాయి. అంతకుముందు ఒక రోజు మద్యం స్కామ్ కు సంబంధించిన 3.58 లక్షల జీబీల డేటాను నాశనం చేసిన వైకాపా ముఠా అంటూ ఈనాడు మీడియా ఏదో పెద్ద పరిశోధన చేసి కనిపెట్టినట్లు ప్రచారం చేసింది. అలాంటిదేమీ జరగలేదని బెవరేజ్ కార్పొరేషన్ సమాధానం చెప్పడంతో ఈనాడు మీడియా పరువు పోయింది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా అలాంటి పిచ్చి కథనాలను రాస్తూనే ఉంది. మరో నిందితుడు వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్ లో ఒక వీడియో కనిపించిందని, దాని ప్రకారం ఐదు కోట్ల మొత్తం ఓటర్లకు పంచడానికి ఉన్న డబ్బు కట్టల వద్ద అతను ఫోటో దిగాడని అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అందులో అప్పటికే రద్దు అయిన రెండువేల రూపాయల నోట్లకట్ట ఉన్నట్లు కనిపించడంతో వారి ప్రచారం తుస్సు అయింది. అంతేకాక తామసలు వెంకటేష్ సెల్ ఫోన్ను ఓపెన్ చేయలేదని ఏకంగా సిట్ అధికారులే న్యాయస్థానానికి చెప్పడంతో ఎల్లో మీడియా కల్పిత కథలెలా ఉంటాయో ప్రజలకు తెలిసిపోయింది. వెంకటేష్ నాయుడు ఒక సినీ నటితో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటో, జగన్ను ఎక్కడో కలిసి కరచాలనం చేసిన ఫోటో చూపించి అదిగో మద్యం స్కామ్ లింక్ అని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. ఆ తర్వాత అదే వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లను కలిసి సత్కారం చేస్తున్న దృశ్యాల ఫోటోలు వెలుగులోకి రావడంతో టీడీపీ మీడియా అవాక్కయింది. అంతేకాదు రూ.11 కోట్లు దొరికినట్లు చెబుతున్న ఫామ్ హౌస్ యజమానితో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో కూడా వెలుగు చూసింది. దానికి వివరణ ఇస్తూ అబ్బే అది ఏదో కార్యక్రమంలో తీసుకున్న ఫోటో అని చెప్పే యత్నం చేశారు. మరి జగన్ తో కరచాలనం చేస్తే ఆయనకు లింక్ పెట్టిన ఇదే పత్రిక తనవరకు వచ్చేసరికి అలా తప్పించుకుంటుందన్న మాట. రాధాకృష్ణ గురించి తెలిసిన వారెవ్వరూ ఆ పత్రిక వివరణను నమ్మలేదనుకోండి. వెంకటేష్ సెల్ ఫోన్లో నుంచి సిట్ వీడియోలు రిట్రీవ్ చేసినట్లు కూడా ఎల్లో మీడియా రాస్తే ఆ సిట్ అధికారులేమో దానిని ఖండించారు. సెల్ ఫోన్ లాక్ తీసేందుకు వెంకటేష్ సహకరించలేదని, ఫోన్లో ఏముందో తెలియదని తెలిపారు.దాంతో మరోసారి ఎల్లో మీడియా పరువు పోయింది. అలా అనధికార తప్పుడు సమాచారం ఇచ్చిన మీడియాకు ఆ స్వేచ్ఛ ఉన్నట్లు సిట్ వాదించడం విశేషం. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేస్తే వారే కీలకమైనవారని, సూత్రధారులని సిట్ చెప్పడం, ఆ ప్రకారం వీరు రాసేయడం మామూలై పోయింది. కొద్ది రోజుల క్రితం మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిని సిట్ విచారించింది. ఆయనేమి చెప్పారో కాని, ఎల్లో మీడియా మాత్రం అంతా పైవాళ్లకే తెలుసునని అన్నట్లు భారీ కథనాన్ని ఇచ్చింది.ఆ తర్వాత రోజు నారాయణ స్వామి వాటిని ఖండించి కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ ను సృష్టించారని ఎల్లో మీడియా అభూత కల్పనలు రాస్తోందని, తనకు లేని ల్యాప్టాప్ను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కోర్టు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఎల్లో మీడియా కిక్కురుమనలేదు. సిట్ వేసిన ఛార్జ్షీట్లకు సంబంధించి పలు అభ్యంతరాలను కోర్టువారు లేవనెత్తితే, ఎల్లో మీడియా రాసిన కల్పిత కథనాలపై ఎవరు అభ్యంతరం చెప్పాలి? తాము ఇచ్చే స్టోరీలకు రెండో వర్షన్ లేకుండా ఇష్టారీతిన రాస్తూ ఎల్లో మీడియా జర్నలిజాన్ని నీచమైన స్థాయికి తీసుకువెళ్లడం దురదృష్టకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సుగాలి ప్రీతి కేసు లేదు.. స్టీల్ ప్లాంట్ ఊసులేదు
రాష్ట్రానికి దాదాపు ముప్పైమంది ఎంపీలున్నారు.. మీరంతా ఎందుకున్నట్లు?.. సిగ్గుందా? లజ్జ ఉందా?? మీకసలు పౌరుషం లేదా??? పౌరుషం కావాలంటే కాసింత గొడ్డుకారం తినండి! ఒంటికి రాసుకోండి!!.. అప్పుడైనా మీకు పౌరుషం వస్తుందేమో..!!! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తుంటే ఈ వైఎస్సార్సీపీ వాళ్లెం చేస్తున్నారు? ఇదేనా మీ నైతికత.. ఇదేనా మీ బాధ్యత .. అదే నేను ఉండుంటే ఢిల్లీవాళ్ళు ఇలాగె చెలరేగిపోయేవాల్లా.. ఖచ్చితంగా నేను ఆ ప్రయివేటీకరణంను ఆపేసేవాణ్ని.. ఎన్నికలకు ముందు చిందులు తొక్కిన పవన్.. నేడు ఆ అంశాన్ని మెల్లగా సైడ్ చేసేసారు. విశాఖలో మూడురోజులపాటు పార్టీ నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు అంటూ హడావుడి చేసిన పవన్ తనలోని అసలైన రాజకీయ నాయకున్ని బయటకు తీశారు. ఎప్పట్లానే పదిహేనేళ్ళు మళ్ళా తెలుగుదేశంతో కలిసి సాగుతానని అన్నారు. దానికి కార్యకర్తలు.. నాయకులు తలూపాలని చెప్పేశారు.పదవులు ముఖ్యం కాదని.. సమాజమే ప్రధానమని... దేశోద్ధారణకు పార్టీ ఏర్పాటు చేసానని చెప్పేసారు. తనకు తన అన్న నాగబాబుకు పదవులు వచ్చాయి కాబట్టి అలాగే అంటాడు. కానీ గ్రామ.. మండల స్థాయిల్లో పని చేస్తున్న కార్యకర్తలు.. నాయకుల పరిస్థితి ఏమిటని ? తమను తెలుగుదేశం వాళ్ళు సెకెండ్ గ్రేడ్ పౌరుల్లా చూస్తున్నారని లోలోన జనసైనికులు కుమిలిపోతున్నా ఆ సౌండ్ బయటకు రాకుండా చేతులు అడ్డం పెట్టుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఎమోషన్ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కీలక విభాగాలను ప్రయివేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం వేసిన నోటిఫికేషన్ గురించి పవన్ ఎక్కడా కిక్కురుమనలేదు. అసలు ఆ విషయాన్నీ కూడా జనంలోకి రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. మరోవైపు సుగాలీ ప్రీతి హత్య గురించి ఎన్నికలకు ముందు గంగవెర్రులెత్తిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారని, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ తమకు న్యాయం చేయకపోతే జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే మొదట ఓపెన్ చేసేది సుగాలి ప్రీతి కేసు అని... అప్పట్లో చెప్పిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద కూడా ఎక్కడా ప్రస్తావించకుండా వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూడ్డానికి వెళ్లారు. అందులో సీలింగ్కు వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. అటు వేలకోట్ల విలువైన ఉక్కుపరిశ్రమ గురించి మాట్లాడకుండా ఇలాంటి చిల్లర విషయాలు ప్రస్తావిస్తూ ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేస్తూ ఇలా పూటగడిపేస్తున్నారని విశాఖలోని యువత దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి మూడురోజుల పవన్ ప్రోగ్రాం సొంత డబ్బా కొట్టుకోవడానికి .. చంద్రబాబును కాపాడ్డానికి ఉపయోగపడిందని అంటున్నారు..:::సిమ్మాదిరప్పన్న -
ఎర్రకోట పెడుతున్న పరీక్ష!
ఆగస్టు 15 వచ్చిందంటే చాలు ఢిల్లీలోని ఎర్రకోట పూర్వ వైభవాన్ని సంతరించు కున్నట్లు కనిపిస్తుంది. భారతదేశపు తొలి ప్రధాని నెహ్రూ 1947లో ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగుర వేసినప్పటి నుంచి, భారత ప్రధానులకూ, ఎర్రకోటకూ ఒక అవినాభావ సంబంధం ఏర్పడి పోయింది. ఏటా ఆగస్టు 15న ఎర్రకోట పైనుంచి జాతి నుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఆనవాయితీగా మారింది.ఫ్రాన్స్ ఏటా జూలై 14న జాతీయ దినోత్సవం జరుపుకొంటుంది. ఆ రోజున 1790లో ప్రాన్స్ ప్రజలు బాస్టిల్ జైలును చుట్టుముట్టి దానిలో నిర్బంధించిన ఉద్యమకారులను విడిపించుకున్నారు. ఫ్రాన్స్ జాతీయ జీవనంలో బాస్టిల్కు ఎంత ప్రాధాన్యం ఉందో ఎర్రకోటకీ అంత ప్రాధాన్యం ఉంది. ఎర్ర కోట మన గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి చెబుతుంది.మొఘల్ చక్రవర్తి షాజహాన్ (1592–1666) ఈ కోటను 1639లో ప్రారంభించారు. దానిలోని దీవాన్– ఇ– కాస్ (ప్రత్యేక సభాసదుల హాలు) గోడలపై పర్షియన్లో ‘గర్ ఫిర్దౌస్ బార్ రు–ఏ– జమీన్ అస్త్, హమీన్ అస్తో, హమీన్ అస్తో, హమీన్ అస్త్’ అని రాసి ఉంటుంది. ‘ఈ భూమిపై స్వర్గం ఏదైనా ఉందీ అంటే అది ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది’ అని ఆ మాటలకు అర్థం. అవి ఇండియా గురించిన మాటలుగానే నేను భావిస్తాను. కశ్మీర్ను చూశాక షాజహాన్ మొదటిసారి ఆ మాటలను ఉపయోగించినట్లు చెబుతారు.కానీ, ఎర్రకోట కథ అంత స్వర్గతుల్యమై నది ఏమీ కాదు. పైన చెప్పుకున్న మాటలకు పూర్తి విరుద్ధమైన సంగతులు ఎర్రకోటలో చోటుచేసుకున్నాయి. ‘ఈ భూమిపై నరకం ఏదైనా ఉందీ అంటే, అది ఇదే, అది ఇదే’ అనా లనిపిస్తుంది. మరో మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబు (1618–1701) తన పెద్ద అన్నయ్య దారా షికో (1615–1659) తలను నరికేయడానికి ముందు గొలుసు లతో బంధించి, ఒక మురికి ఏనుగుపై కూర్చోపెట్టి, ఈ కోట నుంచే తీసుకెళ్ళి చాందినీ చౌక్ అంతటా తిప్పారు.నేటి పరి భాషలో చెప్పాలంటే, షికో సెక్యులర్ కావడమే దానికి కారణం. ఎర్రకోట నుంచి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాల మేరకే స్వేచ్ఛా పిపాసి సాధు సరమద్ (1590–1661), సిక్కుల గురువు తేజ్ బహదూర్ (1621–1675) తలలను వారి మొండాల నుంచి వేరు చేశారు. భారతదేశపు సామాజిక పొందికను ఛిద్రం చేస్తూంటే ఎర్రకోట సాక్షీభూతంగా నిలిచింది. దానిలాగానే, దేశాన్ని కూడా అదే పనిగా చీలికలు పీలికలు చేశారుకానీ, దేశం మళ్ళీ ఏకమవుతూ వచ్చింది.ఔరంగజేబు కాలగర్భంలో కలిసి సుమారు 150 ఏళ్ళు అయిన తర్వాత, బహదూర్ షా జాఫర్ (1775–1862) ఎర్ర కోట యజమాని అయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా, సిపాయిలు 1857లో తిరుగుబాటు చేసినపుడు చివరి మొఘల్ పాలకుడైన జాఫర్ అటు హిందువులు, ఇటు ముస్లింలు ఇద్దరికీ ఇరుసుగా మారారు. తర్వాత, దాదాపు 90 ఏళ్ళు గడి చాక, బ్రిటిష్ భారతీయ సైన్యం లోపల ఎగసిన తిరుగుబాటు ఎర్రకోటలోని గోడల లోపల ప్రతిధ్వనించింది. ఆ తర్వాత, 1945–1946 ప్రాంతంలో, కల్నల్ గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ (సిక్కు), కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ (హిందువు), మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం) భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రసిద్ధికెక్కారు.వారు ముగ్గురూ నేతాజీ నేతృత్వంలోని ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి చెందిన వారు. ‘బ్రిటిష్ చక్ర వర్తికి వ్యతిరేకంగా యుద్ధానికి ఎగదోస్తున్నారం’టూ ఆ శౌర్యవంతులను ఎర్రకోటలోనే విచారించారు. ఆ సమయంలో ‘లాల్ ఖిలాసే ఆయీ ఆవాజ్/ ధిల్లాన్, సెహగల్, షానవాజ్’ అంటూ ఎర్రకోట నుంచి ఒక నినాదం మిన్నుముట్టింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్చి కూర్చిన ఉద్దండులైన నెహ్రూ వంటి న్యాయవాదులు వారి తరఫున వాదించారు. ముగ్గురికీ దేశ బహిష్కార శిక్ష విధించారు. స్వాతంత్య్రం లభించాక, కొద్ది రోజుల్లోనే వారిని విడుదల చేశారు.‘హిందూ రాష్ట్ర’ లక్ష్య సాధనకు కృషి చేస్తున్న కొందరు... గాంధీజీ హత్య కేసులో నిందితులయ్యారు. వారిని ఎర్రకోట లోనే ప్రత్యేక కోర్టులో విచారించారు. వీరికి ప్రతిగా మరో వర్గం ఉంది. ఆ వర్గంవారు 2000 డిసెంబర్ 22న ఎర్రకోటలోకి చొచ్చు కువచ్చారు. ఆ రోజు కోటలోకి రాగలిగిన ఇద్దరు లష్కర్–ఏ– తోయెబా ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. భారతదేశంలో మత విభజన తేవడమే ఆ టెర్రరిస్టుల లక్ష్యం. ఇలా ఎర్రకోట చారిత్రక చిహ్నం స్థాయిని మించి ఎరుపెక్కింది.అదే సమయంలో, నైతిక శక్తి వాహికగా కూడా మారింది. కనీసం, 2047 ఆగస్టు 15న ఎర్రకోటపై 100వసారి పతాకావిష్కరణ జరుగుతున్నపుడు, ప్రసంగించే ప్రధాని అయినా, ‘స్వర్గం ఇక్కడే ఉంది! నా తోటి భారతీయులారా! ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. మనం పరస్పరం ద్వేషించుకోం, దేనికీ భయపడం, కలసి మెలసి శాంతియుత జీవనం సాగిస్తున్నాం’ అని ప్రకటించగలుగుతారా’?.వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పక్కనే ఉంటూ పవన్ స్థాయిని తగ్గించే పనిలో!
ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వాళ్ళు అడిగేది ‘జీతాలు’ పెంచమని! ‘లాభాలు’ పంచమని కాదు!
ఒక వారం రోజులుగా, తెలుగు సినిమారంగంలో పనిచేస్తున్న కార్మికులు ‘మా జీతాలు 30 శాతం పెంచాలి’! అనే డిమాండుతో సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్న వేలాదిమంది కార్మికులలో, వేరు వేరు శాఖల్లో, రకరకాల శ్రమలు చేసే వాళ్ళున్నారు. మేధా శ్రమలు చేసేవారూ, శారీరక శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే నైపుణ్యంగల శ్రమలు చేసేవారూ, నైపుణ్యం లేని శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే మురికిని శుభ్రం చేసే శ్రమలు చేసే వారూ... ఇలా! రకరకాల శ్రమలు చేసే వారిని ఏ పేర్లతో పిలుస్తారో, వాళ్ళకి జీతాలు ఎంత తేడాగా ఉంటాయో– అటువంటి వివరాలన్నీ ఇక్కడ అనవసరం. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవలసింది, సమ్మె చేస్తున్న కార్మికులు అడుగుతున్న ‘జీతాల పెంపు’ గురించి! జీతాలు పెంచాలి– అనేవాళ్ళ డిమాండ్ న్యాయమా, కాదా అన్నది తేలాలంటే, ‘జీతం’అంటే ఏమిటో తెలుసుకోవాలి.అసలు ‘జీతం’అనేది ఒక మాయ తెర! దాని వెనక ఒక రహస్యం వుంది. ఈ సంగతి సమ్మె చేస్తున్న కార్మికులకూ తెలియదు, వాళ్ళకి జీతాలు ఇచ్చే యజమానులకూ తెలియదు. ‘జీతం’ అనేది, కార్మికులు చేసే ‘శ్రమ మొత్తానికి’ కాక, వాళ్ళు కేవలం శ్రమ చేసేవారిగా జీవించడానికి సరిపడేది మాత్రమే– అనేదే ఆ రహస్యం! అసలు విషయం, ‘జీతంగా వచ్చేది ఏమిటీ’ అన్నది తెలియాలి! విషయాలు తేలిగ్గా అర్థం కావడానికి ఒక్క కార్మికుణ్ణే తీసుకుందాం.మన ఉదాహరణలో, ‘కాల్షీట్’ అనే పేరుతో నడిచే ‘పనిదినం’ లో, కార్మికుడు 12 గంటలు పని చేసినందుకు, నిర్మాత 1,200 జీతం ఇస్తాడనుకుందాం. కానీ, కార్మికుడు చేసే శ్రమ, యజమానికి ఎంత విలువని ఇస్తుందంటే, ఉదాహరణ తేలిగ్గా వుండడం కోసం 2,400 విలువని ఇస్తుంది. అంటే, కార్మికుడు ఏ రోజు పనిచేసినా ఆ రోజున, యజమానికి 1,200 విలువ గల శ్రమని ‘ఉచితంగా’ ఇస్తున్నాడన్నమాట! జీతాన్ని 30 శాతంగా పెంచినా, అది మొత్తం శ్రమ విలువ అవదు! అదీ తక్కువే! అప్పుడు కూడా, తీసుకునే జీతం కన్నా అదనంగా ఇచ్చే శ్రమ విలువే ‘అదనపు విలువ’. ఇది ‘శ్రమ దోపిడీ’! కానీ, ఈ విషయం, ఇటు కార్మికులకూ తెలియదు; అటు యజమానులకూ తెలియదు! ఇప్పుడు వచ్చిన సమస్య కార్మికుడు యజమానితో అనేది: ‘ఒక రోజుకి నువ్విచ్చే 1,200, మా కుటుంబ పోషణకి చాలడం లేదు. ఇంకో 30 శాతం పెంచు! ఇక నించీ 1,200 కాకుండా, 1,360 ఇవ్వు!’ అని కార్మికుడు అనడం. ‘అలా వీల్లేదు. నాకు అసలే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. (హీరో గారికి కోట్లలో ఇవ్వాలి మరి!)’ అంటాడు నిర్మాత! నిజం చెప్పాలంటే, నిర్మాత కార్మికుడికి జీతం 30 శాతం పెంచి, 1,360 ఇచ్చినా, ఆ కార్మికుడి నించీ 70 శాతం విలువ గల శ్రమని ‘ఉచితంగానే’ లాగుతాడు! ఉచితంగా లాగే ఈ అదనపు విలువను, పెట్టుబడిదారీ యజమానులూ, వారి ఆర్థిక శాస్త్రవేత్తలూ ‘లాభం’ అని ముద్దుగా పిల్చుకుంటారు. కార్మికులు ఇచ్చే అదనపు విలువ నించే, సినిమా తీయడానికి ఖర్చు పెట్టిన డబ్బుకి వడ్డీ, షూటింగు చేసే స్టూడియోకి అద్దే, సినిమాని ప్రదర్శించే సినిమా హాళ్ళకి అద్దే, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులూ, చివరికి తనకి మిగిలే ‘లాభమూ’– అన్నీ... కార్మికుల అదనపు విలువనించీ వచ్చేవే!ఈ సమ్మె సందర్భంగా కొందరు మధ్యవర్తులు, ‘నిర్మాత కూడా బాగుండాలి గదా? అతన్ని ఇబ్బంది పెడితే ఎలా? నిర్మాతలుంటేనే గదా, కార్మికులకి పనులు దొరికేది?’ అంటూ, కార్మికులకు సర్ది చెపుతూ, జీతం మరీ అంతగా పెంచమని ఒత్తిడి చెయ్యవద్దని హితవు పలుకుతున్నారు. మన అమాయక సమ్మెకారులు కూడా, ‘అవును! నిర్మాతలు బాగుంటేనే కదా, మాకు పనులు దొరికేది. కాకపోతే, మా బాగు కూడా కొంచెం ఆలోచించమంటున్నాం’ అని అంటారు. అసలు ఆలోచించవలసింది – నిర్మాతలకి పెట్టుబడికి, ఆ మొదటి డబ్బు ఎక్కడిది?– అని! వాళ్ళ తండ్రులదీ, తాతలదీ అంటారా? ఆ తాతలకి అంత డబ్బు కూడటానికి కారణం – ఈనాటి కార్మికుల తాతల్నించీ ఆనాడు లాగిన అదనపు విలువే! (‘‘అదనపు విలువలో ఒక భాగాన్ని ఆదాయంగా పెట్టుబడిదారుడే తన కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటాడు. ఇంకో భాగాన్ని కొత్త పెట్టుబడిగా ఉపయోగించుకుంటాడు’’ అనే విషయాన్ని, మార్క్స్ తన ‘పెట్టుబడి’ అనే పరిశోధనా గ్రంథంలో – రుజువు చేశాడు.) ఇంతకీ, సమ్మె చేస్తున్న, సినిమా రంగంలోని, మన పిచ్చి కార్మికులు ఏ మడుగుతున్నారు? వాళ్ళు అడిగేది జీతాలు పెంచమని! లాభాలు పంచమని కాదు! ఎంత అల్ప సంతోషులు మన కార్మిక జనాలు!వ్యాసకర్త: ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ -
చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటి. బాబు తీరు మారదా?
నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నాటకీయంగా వ్యవహరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్! ప్రజా వ్యతిరేకత వస్తుందనుకుంటే.. ఆ నిర్ణయానికి తానూ అనుకూలం కాదన్న బిల్డప్ ఇస్తారు. ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తున్నట్లు ప్రచారం కల్పిస్తారు. కొన్ని రోజుల క్రితం టీవీ ఛానళ్లలో చంద్రబాబు పేరుతో వచ్చిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఎక్సైజ్ శాఖ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అన్నట్లు ఛానెళ్ల స్క్రోలింగ్లలో కనిపించింది. ఎందుకబ్బా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనుకుంటూ ఉండగానే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు అనుమతులిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు చంద్రబాబు స్టైల్! ప్రజా ఆరోగ్యం ముఖ్యమని అనుకుంటే పర్మిట్ రూమ్లకు అనుమతులిస్తారా? ఇది ఏపీ ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా మంచిదో చంద్రబాబే చెప్పాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంతంగా మద్యం షాపులను నిర్వహించి బెల్ట్ షాపులు లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం రావడంతోనే మద్యం అమ్మకాలు మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. అదనంగా వెయ్యి దుకాణాలు అనుమతించడంతోపాటు 99 శాతం టీడీపీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలకే దక్కేలా చేసింది. ఇక బెల్ట్ షాపులు సరేసరి. బెల్ట్ షాపు పెడితే తాట తీస్తానని, రూ.ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు కానీ.. ఆచరణలో జరిగింది మాత్రం శూన్యం. అధికార కూటమి స్థానిక ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో వేలాది బెల్ట్ షాపుల నిర్వహణకు వేలం పాటలు కూడా వేశారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు పర్మిట్ రూమ్లు తీసుకు వస్తున్నారు. చంద్రబాబు అంతకుముందు చేసిన ప్రకటనేమిటి? ఇప్పుడు జరిగిందేమిటి? ఆదాయం ముఖ్యం కాదంటూనే వాటిని పెంచుకునేలా మద్యం విధానాన్ని తయారు చేశారన్నది వాస్తవం. పర్మిట్ రూమ్ల ద్వారా సుమారు 180 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా రూ.26 వేల కోట్ల ఆదాయం వస్తుంటే దానిని రూ.35 వేల కోట్లకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంత ఆదాయం పెరుగుతుందన్నది వేరే విషయం. కాని దీనికి ప్రభుత్వం కాని, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కాని ఇచ్చిన వాదన చూడండి. ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమం చేసిన ఈనాడు దినపత్రిక ఇప్పుడు మద్యం వ్యాపారానికి అండగా ఉన్నట్లుగా కథనాలు ఇస్తుండడం విశేషం. రోడ్లపై మద్యం తాగకుండా పర్మిట్ రూమ్లు తెచ్చారట.బహిరంగ ప్రదేశాలలో మద్యపానంతో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయట. ఈ క్రమంలో 2.7 లక్షల కేసులు నమోదు అయ్యాయట. దానిని నియంత్రించేందుకు పర్మిట్ రూమ్లు అనుమతిచ్చేలా నిర్ణయం చేశారట. అంతే తప్ప మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్లు ఇవ్వడం వల్ల మరింతగా మద్యపానం చేస్తారని, కుటుంబాలు నాశనం అవుతాయని వీరు రాయడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పర్మిట్ రూమ్లకు సంబంధించి హెడింగ్ కూడా పెట్టకుండా జాగ్రత్తపడింది.. కొత్త పాలసీలో 840 బార్లు వస్తున్నాయి. ప్రస్తుతం 3736 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఈ పర్మిట్ రూమ్లు వస్తున్నాయి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే బహిరంగంగా మద్యం తాగడం వల్ల కేసులు వస్తున్నాయట. ఒకే. అది నిజమే అనుకుందాం. ఆ రకంగా శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు ఒప్పుకున్నట్లే కదా! పోనీ పర్మిట్ రూమ్లలో తాగిన మందుబాబులు రోడ్లపైకి వచ్చి మళ్లీ అల్లరి చేయరని ఎలా గ్యారంటీ ఇస్తారో తెలియదు. కాగా రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయంలో కూడా విఫలమైంది. బాటిల్పై ఉన్న ధరకన్నా రూ.పది ఇరవై అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కొందరిని పోలీసులు కూడా పట్టుకున్నారు. నాణ్యమైన మద్యం ఇస్తామంటూ చిత్రమైన ప్రచారం చేసిన ఘనత కూడా చంద్రబాబు బృందానిదే. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరమని చెప్పవలసిన ప్రభుత్వం అలా చేయకపోగా, ఇప్పుడేమో ఊరూరికి బార్, వైన్ షాపు, పర్మిట్ రూమ్, బెల్ట్ షాపు అన్న చందంగా వ్యవహరించడం దురదృష్టకరం. మద్యం వల్ల కుటంబాలు నాశనం అవుతాయి. అందులోను మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. తాగిన మైంలోనే మహిళలపై అకృత్యాలు జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మద్యం విషయంలో ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2014-19 మధ్యలోనూ ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నామంటూ ఫైల్ పై సంతకం చేశారు. కాని ఆ తర్వాత మాత్రం వేలాది బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడిచిపోయాయి. అవి సుమారు 40 వేలకు పైగా అప్పట్లో చేరాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటిని దాదాపు లేకుండా చేయడమే కాకుండా, షాపులను తగ్గించి, ఊరికి బయట అవి ఉండేలా చర్యలు తీసుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యథాప్రకారం మద్యాన్ని విస్తారంగా పారిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎన్.టి.రామారావు తన హామీ ప్రకారం మద్యాన్ని నిషేధించారు. ఆ టైమ్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరైనా అక్రమ మద్య వ్యాపారం చేస్తుంటే, వారిపై సైతం కేసులు పెట్టడానికి వెనుకాడవద్దని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆయన ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొలుత తాము మరింత గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఆ తర్వాత అసలు సినిమా చూపించారు. టీడీపీ ఎమ్మల్యేలు ఇష్టం వచ్చినట్లు అక్రమ మద్య వ్యాపారం చేసినా చూసిచూడనట్లు పోయారు. పైగా దీనిపై అసెంబ్లీలో ఒక నివేదిక పెట్టారు. అక్రమ మద్యాన్ని అరికట్టలేక పోతున్నామని ప్రకటించారు.అలా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ తెలిపి కొందరి పేర్లు వెల్లడించడం సంచలనమైంది. తదుపరి మద్య నిషేధం ఉంచాలా ?వద్దా ? అన్నదానిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నిర్వహించారు. ఆ పిమ్మట మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. పైకి తనకు ఇష్టం లేకపోయినా మద్య వ్యాపారాన్ని అనుమతించాల్సి వస్తున్నట్లు పిక్చర్ ఇస్తారన్నమాట. అప్పట్లో మద్యం స్కామ్ లు జరిగాయని విపక్షం ఆరోపించేది. అది వేరే కథ. ఇంకో మాట చెప్పాలి. సంపూర్ణ మద్య నిషేధం చేయాల్సిందే అంటూ ఉద్యమం చేసిన ఈనాడు గ్రూప్ అదినేత రామోజీరావు మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక సంపాదకీయం రాసేసి చేతులు దులుపుకున్నారు. అందులో కూడా చంద్రబాబును పెద్దగా తప్పు పట్టుకపోవడంపై రామోజీని పలువురు విమర్శించేవారు. రామోజీ ఫిలిం సిటీ, డాల్ఫిన్ హోటల్ తదితర వ్యాపారాలు కలిగిన ఈనాడు మీడియా కూడా చంద్రబాబు మాదిరే డబుల్ గేమ్ ఆడిందన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చేవి. అప్పటి మాదిరే ఇప్పుడు కూడా పర్మిట్ రూమ్లు, మద్యం షాపుల దందాను టీడీపీ మీడియా సమర్థిస్తున్న తీరు అసహ్యంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా తనకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డు పెట్టుకుని ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని పారించడం ప్రజల కోణంలో దుర్మార్గమే అవుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు..
ఆంధ్రప్రదేశ్ మంత్రులు లోకేశ్, పి.నారాయణల వ్యాఖ్యలు చూస్తే మతిపోతుంది. ఎవరో ఒకరు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తే సింగపూర్ తమ రాష్ట్రంలో పెట్టుబడులకు తటపటాయిస్తోందని వీరు అంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంకో అడుగు ముందుకేసి ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిఐడీ ద్వారా సింగపూర్లోని ప్రముఖులు కొందరిని బెదిరించిందీ అని! నవ్విపోదురు గాక అన్నట్టుగా లేవూ ఈ వ్యాఖ్యలు? తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంతటికైనా సిద్ధపడతారన్నమాట వీళ్లు! కాకపోతే ఆ క్రమంలో తమ అసమర్థతను తామే బయటపెట్టుకున్న విషయాన్ని వారు మరచిపోతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తటపటాయిస్తోందంటే సింగపూర్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విశ్వసనీయతను సందేహిస్తున్నట్లే అవుతుంది కదా?వాస్తవానికి పెట్టుబడిదారులైనా, ప్రభుత్వాలైనా అజ్ఞాత వ్యక్తుల మెయిళ్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. మెయిళ్లలోని విషయాలను విచారించి నిర్ధారించుకోవచ్చు అంతే. ఫిర్యాదులు ఉన్నా లేకపోయినా కూడా ఇది జరుగుతూంటుంది. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పేదాంట్లో నిజానిజాలెంత? అన్నది బేరీజు వేసుకుంటారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత లాభమొస్తుందనుకుంటే పెట్టుబడి పెడతారు లేదంటే లేదు. అంతే. ప్రభుత్వాల తీరుతెన్నులు, ఆయా ప్రాజెక్టుల ప్రయోజనం, పెట్టుబడులు పెడితే వచ్చే లాభనష్టాలు, ప్రభుత్వాలు కల్పించే రాయితీలు, సదుపాయాలు మొదలైన వాటిపై ఆధారపడి ఆయా సంస్థలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ వంటి వారికి తెలియకుండా ఉంటుందా!జగన్ నిర్వాకం వల్ల సింగపూర్తో సంబంధాలు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్దరించడానికి వెళుతున్నారని చంద్రబాబు టూర్కు ముందే వ్యాఖ్యానించారు. తన పరపతి అంతా ఉపయోగించి అమరావతి ప్రాజెక్టులో సింగపూర్ వారిని మళ్లీ భాగస్వాములను చేస్తామని ప్రచారం చేసుకున్నారు. తీరా అక్కడికెళ్లాక ఏమైంది? అమరావతి ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడం లేదని ఆ దేశ మంత్రి టాన్ సే కుండబద్ధలు కొట్టారు. సాంకేతిక సహకారం మాత్రం అందిస్తామన్నారు. అది కూడా మాట వరసకు అన్నట్లే అనిపిస్తుంది. సింగపూర్ కంపెనీలు కూడా పెద్దగా ఆసక్తి చూపని విషయం ఇప్పటికే స్పష్టమైంది. లేకుంటే టీడీపీ మీడియా ఇప్పటికే ఫలానా కంపెనీ ఇంత పెట్టుబడి పెడుతుంది అంటూ ఊదరగొట్టేది. అది కాకుండా లోకేశ్ చేసిన ఆరోపణలను ప్రముఖంగా ఇచ్చారు. మురళికృష్ణ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వానికి స్థిరత్వం లేదని, ఎప్పుడైనా పడిపోవచ్చని ఫిర్యాదులు చేశారట. ఆ వ్యక్తి రాస్తే సింగపూర్ ప్రభుత్వం ఎలా నమ్ముతుంది! కూటమికి 164 సీట్లు ఉన్న సంగతి ఆ దేశంవారికి తెలియకుండా ఉంటుందా!మరో కోణం చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలపై అభిప్రాయలు చెప్పేందుకు ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఈ అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవచ్చు లేకపోవచ్చు కూడా. భావ ప్రకటన స్వేచ్ఛ అది. దీని గురించి మంత్రి లోకేశ్కు తెలుసో తెలియదో కానీ ఏ మార్గం ద్వారానైనా సరే ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం తప్పు కాదు కానీ.. దుష్ప్రచారం చేయడం తప్పు. అలాంటి తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వాలు కచ్చితంగా చర్య తీసుకుంటాయి. కూటమి నేతలు జగన్ ప్రభుత్వంపై ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారో గుర్తు లేదా? వైసీపీ ప్రభుత్వ అప్పులపై అబద్ధపు ప్రచారం చేయడమే కాకుండా.. రకరకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారే! అయినా ఫలితం లేకపోవడంతో అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి అప్పుల వివరాలు దాచేస్తోందంటూ చిత్రమైన ఆరోపణ కూడా చేశారు. జగన్ ప్రభుత్వం ఈ తాటాకు చప్పుళ్లకు వెరవలేదు సరికదా.. కూటమి నేతల మాదిరిగా బేలగా మాట్లాడనూ లేదు. తాము పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ వారు పుల్లలు పెడుతున్నారన్నట్లుగా లోకేశ్ ఆరోపించారు. మురళీకృష్ణ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీతో సంబంధాలు ఉన్న వాడని ఆరోపించారు. తీరా చూస్తే ఎన్నారై అయిన ఆ వ్యక్తి ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి విజయం కోసం శ్రమించారని, డబ్బు కూడా ఖర్చు చేశాడని తేలింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎదురైనా చేదు అనుభవాలు, లోకేశ్ను కలిసేందుకు కూడా సిబ్బంది ముడుపులు అడగటంతో బాధతో సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్ పెట్టాడని తెలిసింది. లోకేశ్ వీటిల్లో నిజానిజాలు నిర్ధారించుకోకుండానే తండ్రి మాదిరిగానే తన వైఫల్యాలను ఇతరులపై నెట్టేసే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు చిలకలూరిపేట వద్ద ఉన్న తన భవనాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సెటిల్ చేసుకోవడానికి రూ.కోటి డిమాండ్ చేశారని మురళీకృష్ణ వాపోతున్నాడు. ఈ అంశంపైనే చంద్రబాబు, లోకేశ్లను కలవడానికి ప్రయత్నించి విఫలమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీలు తమకు వచ్చిన ఫిర్యాదులను చూపించి చంద్రబాబును ప్రశ్నించారంటూ మీడియాలో మరో కథనం వచ్చింది.ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా లోకేశ్పై అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ వార్త చెబుతోంది. ఇది నిజమా? కాదా? అన్నది పక్కనబెడితే లోకేశ్ హుందా రాజకీయం చేయకుండా, అసత్య ప్రచారాలకు పూనుకుని దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. మురళీ కృష్ణ ఎవరో తెలిసి కూడా అతని గురించి అబద్ధం చెప్పారన్న భావనకు ఆయన అవకాశం ఇచ్చారనిపిస్తుంది. ఇక మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్య అయితే అర్థం పర్థం లేనిది.గత ప్రభుత్వం సీఐడీ వారిని పంపించి ఎంక్వైరీ చేయించిందని, దానివల్ల ఆ దేశ ప్రభుత్వానికి, ఏపీకి సంబంధాలు దెబ్బతిన్నాయాని, వాటిని మళ్లీ పునరుద్దించడానికి చంద్రబాబు ఆధ్వర్యంలో సింగపూర్ వెళ్లామని అన్నారు. ఇన్ని విద్యా సంస్థలు నడిపే వ్యక్తి ఇలా మాట్లాడడం ఎబ్బెట్టుగా ఉంది. ఒక రాష్ట్రం అధికారులు ఇంకో దేశంలోకి వెళ్లి విచారణ చేయడం సాధ్యమా? కేంద్రంతో సంబంధం లేకుండా చేస్తారా? ఆ మాత్రం పరిజ్ఞానం కూడా ఈయనకు లేదా! ఏదో ఒకటి మాట్లాడి బట్ట కాల్చి మీద వేయడం అంటే ఇదేనేమో! నిజానికి సింగపూర్ ప్రభుత్వం గతంలో ఏపీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కేవలం ఆ దేశ కంపెనీలు అవగాహన కుదుర్చుకున్నాయి. వాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి 1700 ఎకరాల భూమి కేటాయించడమే కాకుండా, ఏపీ ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి రోడ్లు తదితర సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. దానిపై అనేక విమర్శలు వచ్చాయి. అయినా ఆ ప్రాజెక్టు లాభసాటి కాదని భావించి ఆ కంపెనీలు వెనక్కి తగ్గాయని చెబుతారు. మరో సంగతి చెప్పాలి. చంద్రబాబుకు సన్నిహితుడుగా భావించే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో జైలుకు వెళ్లింది వాస్తవమా? కాదా? అన్నదాని గురించి చంద్రబాబు, లోకేశ్, నారాయణలు ఎవరూ మాట మాత్రం కూడా ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడ్డారు. ఏది ఏమైనా ఎదుటివారిపైన రాయి వేసే ముందు అది తమకే తగులుతుందేమో అని ఆలోచించుకోవాలి. ఏతావాతా సింగపూర్ నుంచి చంద్రబాబు బృందం రిక్త హస్తాలతోనే తిరిగి వచ్చినట్లేనా? అంటే కూటమి ప్రభుత్వంపై ఆ దేశ ప్రభుత్వానికి, సంస్థలకు నమ్మకం లేనట్లు అనుకోవాలా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
గోడకు కొట్టిన బంతిలా.. తిరగబడ్డ నెల్లూరు!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పి ఉండాలి. వైఎస్సార్సీపీ పార్టీకి కూడా ఇదో అనుభవం అని చెప్పాలి. పోలీసుల వ్యవస్థ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తే ప్రజల్లో వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా తెలియజేసినంది. ఒక నాయకుడి పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు (రోడ్లు) ధ్వంసం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు కూడా. ప్రజాస్వామ్యాన్ని ఇంతగా పరిహాసం చేసిన సందర్భం కూడా ఇంకోటి ఉండదు. వైఎస్ జగన్ తన మీడియా సమావేశంలో వ్యక్తిగత విమర్శలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, తను ఏ సందర్భంలో టూర్కు వచ్చిందీ, పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ కార్యకర్తల విధ్వంస కార్యక్రమాలు వాటి విపరిణామాలపై ఎక్కువ మాట్లాడారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన జమ్మలమడుగు పర్యటనలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. అసలు మినహా మిగిలిన సోదంతా వెళ్లబోసుకున్నారు. 👉జైల్లో ఉన్న మాజీ మంత్రి, కాకాణి గోవర్ధన్రెడ్డిని పరామర్శించేందుకు, మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని టీడీపీ మూకలు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన్ను కూడా పలుకరించే ఉద్దేశంతో జగన్ నెల్లూరులో పర్యటనకు సంకల్పించారు. గత నెల మొదటిలోనే ఈ పర్యటన ఖరారైనా హెలిప్యాడ్ కోసం పోలీసులు ఒక అటవీ ప్రాంతాన్ని చూపించడంతో వాయిదా పడింది. ఆ ప్రదేశంలోనే ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకుని టూర్ తేదీలు నిర్ధారించుకున్నారు. అంతే! ఇక అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఆయన ప్రోగ్రాంను విఫలం చేయడానికి చాలా శ్రమ పడింది. చంద్రబాబు, లోకేశ్లకు వీర విధేయులైన పోలీసు అధికారులను ప్రయోగించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. జగన్ టూర్లో పాల్గొనడానికి వీల్లేదని శాసించే రీతిలో పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు నోటీసులు ఇచ్చారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులే కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు. జగన్ టూర్లో పాల్గొంటే ఏదో జరిగిపోతుందని, కేసులు పెడతారని ప్రచారం చేశారు. టూర్ జరిగే రోజున ప్రజలు, అభిమానులు ఎవరూ రాకుండా ఉండడం కోసం పోలీసులు జేసీబీలతో రోడ్లపై గోతులు తవ్వారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఎక్కడకక్కడ ఇనుప కంచెలు వేయడం, నెల్లూరు సందులలో నుంచి కూడా జనం రాకుండా చేయాలని యత్నించడం వల్ల ప్రజలు నానాపాట్లు పడ్డారు. చివరికి అంత్యక్రియల కోసం రేవుకు వెళ్లడం కూడా కష్టమైందని నెల్లూరు వాసి ఒకరు తెలిపారు. ఇన్ని నిర్బంధాల మధ్య ప్రజలు జగన్ టూర్కు రారేమో అని అందరకూ అనుకున్నారు. కానీ.. వేల మంది జనం పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ రోడ్లపైకి వచ్చి విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఈ అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. 👉ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి పార్టీని అణగదొక్కాలని అనుకుంటే అది అన్నిసార్లు అయ్యే పని కాదని నెల్లూరు ప్రజలు తెల్చి చెప్పారు. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కార్ విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ ఏ పట్టణానికి వెళ్లినా ఇలా జనం తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారో అర్థం కాక కూటమి నేతలు తల పట్టుకుంటున్నారు. ఒక పక్క జనం వస్తున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే ప్రజలు రాలేదని, సాక్షి టీవీలో బంగారు పాళ్యం ప్రోగ్రాం వీడియోలోని సన్నివేశాలు ప్రసారం చేశారని ఒక అసత్య ప్రచారం పెట్టారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి అలా మాట్లాడారంటే జగన్ టూర్పై వారు ఎంతగా కలవరపడుతున్నది అర్థం చేసుకోవచ్చు. బంగారుపాళ్యంలో జనం విశేషంగా వచ్చారని వారే స్వయంగా ఒప్పుకున్నట్ల అయ్యిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. ప్రభుత్వం దీనిని పరాభవంగా భావించి మరింత కక్షకు దిగకుండా ఇకనైనా ప్రజస్వామ్య పద్దతిలో జగన్ టూర్లకు సహకరించడం మంచిది. పోలీసులు ఎవరైనా ముఖ్యనేత వస్తుంటే ఆయనకు భద్రతకు కల్పించడం, జనం అధికంగా వస్తున్నారనుకుంటే దానికి తగ్గట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప, జనం ఆ ప్రోగ్రాంకు రాకుండా అడ్డుకోవడమే విధిగా పెట్టుకోరాదని ఈ ఘటన రుజువు చేసింది. 👉బంతిని ఎంత గట్టిగా కొడితే అది అంతగా పైకి లేస్తుందన్న విషయం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. జగన్, చంద్రబాబుల వ్యాఖ్యలను పరిశీలిద్దాం. పాలనలో విఫలం అయినందునే చంద్రబాబు భయంతో తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు. తన పార్టీ నేతలను కలవడానికి వస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. కాకాణి పై ఉన్న పలు అక్రమ కేసుల గురించి ప్రస్తావించి సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు, మీడియా సమావేశం వీడియోను పోస్టు చేసినందుకు కూడా కేసులు పెట్టారని వివరించారు. నిజంగానే ఇది చాలా శోచనీయం. రాజకీయ నేతలకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించాలి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి అమలుకాని వైనం, రైతుల కష్టాలు, ప్రభుత్వంలో అవినీతి, శాంతిభద్రతల వైఫల్యం రెడ్ బుక్ రాజ్యాంగం, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మొదలైన అంశాలను జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు వేసిన రెడ్ బుక్ విత్తు పెరిగి చెట్టు అవుతుందని, భవిష్యత్తులో అది వారికే ప్రమాదం అని హెచ్చరించారు.తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని,ఆ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని కూడా జగన్ పేర్కొన్నారు. జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు ఎక్కడా నేరుగా బదులు ఇచ్చినట్లు కనిపించలేదు. రాజకీయ ముసుగులో కొందరు అరాచకాలు సృష్టించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో కావాలన్నది ఆయన భావన. తన కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను నానా మాటలు అన్నప్పటికీ, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అన్నప్పుడు కాని అవేవి అరాచకంగా ఆయనకు కనిపించలేదు. స్వయంగా చంద్రబాబే పలుమార్లు పోలీసులను ధిక్కరించి హెచ్చరికలు చేయడం, టూర్లు సాగించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయి జగన్ టూర్ను అరాచకంగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కోసం జనం వస్తే తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం అసందర్భంగా అనిపిస్తుంది. రాజకీయ పాలన చేస్తానని చెప్పడం ద్వారా టీడీపీలో అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. మళ్లీ వస్తా.. అంతు తేలుస్తా అని జగన్ చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు దానిని విశ్వసిస్తుంటే జగన్ టూర్ లకు ఎందుకిన్ని ఆంక్షలు పెట్టడం అన్నదానికి మాత్రం జవాబు ఇవ్వరు. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా తన కుమారుడు, మంత్రి లోకేశ్ అనుభవ రాహిత్యంతో అమలు చేస్తున్న రెడ్ బుక్ వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టడం అవసరం. నెల్లూరు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ప్రభుత్వానికే మంచిది.లేకుంటే ప్రజలలో ఆయన ప్రభుత్వమే మరింత పలచన అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ యాప్తో పోలీసు జులుంకు చెక్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్లో భద్రంగా ఉంటాయి. 2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్సీపీ ఆవేదన. తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం. రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్సీపీ కేడర్ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది. పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం. 2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్సీపీ యాప్లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అయిపాయె.. రెంటికీ చెడ్డ జనసేనాధిపతి!
ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల కష్టం చూస్తే జాలేస్తుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ప్రమోషన్ కోసం వారు చాలా కష్టపడుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే సినిమా చూడాలని ప్రేక్షకులను బతిమలాడుతున్నట్లు ఉంది. కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక షోలు నిర్వహించి జనాన్ని తరలించే యత్నాలు చేయడం, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సినిమా సక్సెస్ చేయాలని కోరడం పవన్ కల్యాణ్కు సహజంగానే అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. సినిమాపై ప్రేక్షకుల ఆదరణ విషయంలో సందేహాలు కలిగాయి. మొత్తం పరిణామ క్రమం అంతా పార్టీని డ్యామేజీ చేశాయనిపిస్తోంది.సినిమా బాగుందా? లేదా? అనేదానితో ఇక్కడ నిమిత్తం లేదు. మొదటి వారం కలెక్షన్లు ఎలా ఉన్నాయా? అనేది చర్చనీయాంశం కాదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఈ సినిమా కోసం అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బాగా బిజీగా ఉండే పంచాయతీ రాజ్ శాఖకు మంత్రి అయినప్పటికీ, ఆ విధులను పక్కనబెట్టి సినిమా షూటింగ్లలో పాల్గొనడాన్ని ప్రజలు గమనించారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ వంటివారు చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఏ రకంగా పవన్ తన పదవిని ఈ సినిమా గురించి వాడుకున్నారో తెలియచేస్తూ వీడియోలు విడుదల చేశారు. పవన్ తాను గతంలో ఎప్పుడూ సినిమా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదని చెప్పారు. కాని హరిహర వీరమల్లు కోసం నాలుగు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ కోసం పవన్తోపాటు పార్టీ నేతలంతా కష్టపడాలని నిర్ణయించుకున్నారు అన్నమాట. అయినా.. సినిమా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫంక్షన్ కోసం విశాఖలో యూనివర్శిటీ హాల్ను వాడుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో సినిమాల్లో నటించవచ్చా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నటించకూడదన్న చట్టం ఏమీ లేదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఒకట్రెండు సినిమాలలో నటించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నటించిన సినిమా ఫెయిల్ అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నటించిన సినిమా సఫలమైంది. ఎన్టీఆర్ సినిమాలలో నటించడంపై ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది. టీడీపీ కూడా ఏదో సమాధానం చెప్పేది. అంతే తప్ప ఏ పార్టీ అదేదో వ్యక్తిగత వివాదంగా తీసుకోలేదు. కానీ.. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే తన సినిమా గొడవలోకి వైఎస్సార్సీపీని లాగి విమర్శలు చేశారో, అప్పుడు ఇది రాజకీయ రగడగా మారింది. సినిమాను బాయ్కాట్ చేసుకోండని ఒకసారి, ఎవరూ దీనిపై గొడవ పడవద్దని ఇంకోసారి, అవసరమైతే దాడి చేయండని మరోసారి ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. తణుకు వంటి కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు రౌడీల మాదిరి అల్లరి చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన వాహనం బాయినెట్ పై ఎక్కి గంతులు వేశారు. వీటిపై అసంతృప్తి చెందిన వైసీపీ అనుకూల సోషల్ మీడియా సీరియస్గా తీసుకున్నారు. కొందరు బాయ్కాట్ అంటూ ప్రచారం చేశారు. అయినా సినిమా బాగుంటే ఇలాంటివి పెద్దగా పనిచేయవని అంతా భావించారు.ఏపీలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ మరీ రెచ్చగొట్టడం విస్మయం కలిగిస్తుంది. బహుశా వైసీపీ వారు ఎటూ చూడరులే అన్న భావనతో జనసేన, టీడీపీ క్యాడర్ను బాగా యాక్టివ్ చేసేందుకు ఈ వ్యూహం అనుసరించారో, ఇంకే కారణమో తెలియదు కాని ఒక రాజకీయ పార్టీ క్యాడర్ను తన సినిమాకు తానే దూరం చేసుకున్నట్లయింది. సినిమా పరంగా తనను అభిమానించే వారు ఇతర పార్టీల్లోనూ ఉంటారన్న సాధారణ స్పృహ లేకుండా ఆయన మాట్లాడారు. ఇప్పుడే కాదు. గతంలో కొన్ని సినిమాల విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ అతడి వర్గీయులు కొందరు సినీ ప్రముఖులు అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేశారు.. ఉదాహరణకు రిపబ్లిక్, మట్కా, లైలా, భైరవం వంటి సినిమా ఫంక్షన్లలో పవన్ కల్యాణ్.. ఆయన మనుషులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాజీ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేశారు. ఆ ప్రభావం సినిమాలపై పడి నిర్మాతలు నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకత్వం ముందుగానే ఈ పరిణామాలను ఊహించి కార్యకర్తలతో సినిమా చూడాలని కోరుతూ ర్యాలీలు తీయించింది. ఇలాంటివి గతంలో జరగలేదనే చెప్పాలి. జనసేన మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టి సినిమాకు జనాన్ని ఎలా తరలించాలో చెప్పడం, సంబంధిత ఆడియో లీక్ అవడంతో పార్టీ పరువు పోవడమే కాకుండా, సినిమాపై కూడా నెగిటివ్ టాక్కు అవకాశం ఏర్పడింది. సినిమా బాగుంటే ఇలా ఎందుకు చేస్తారన్న ప్రశ్న వచ్చింది. దానికి తగినట్లే సినిమా రివ్యూలు కూడా ఆశాజనకంగా రాలేదు. సినిమా మొదటి సగం కాస్త ఫర్వాలేదు కాని, రెండో హాఫ్ ఏవో ఒకటి, రెండు చోట్ల తప్ప, అసలు బాగోలేదని టాక్ వచ్చింది. అంతేకాక ఒకసారి ఇది చరిత్ర అని, మరోసారి ఇది కల్పిత పాత్ర అని ప్రచారం చేశారు. కోహినూర్ వజ్రం పేరుతో సినిమా తీసినా, ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలు పెట్టడంపై పలువురు ఆక్షేపించారు. ఒకవైపు సినిమా కథ అంతంత మాత్రంగా ఉండడం, ప్రేక్షకులకు గ్రాఫిక్స్ నచ్చకపోవడం, రాజకీయ దుమారం సృష్టించుకోవడం వంటి కారణాలతో హరిహర వీరమల్లు సినిమా అంతగా సక్సెస్ కాలేదన్న భావన ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి వైసీపీ అభిమానులలో ఒక స్పష్టత ఉండగా, టీడీపీ అభిమానులు మాత్రం దాగుడుమూతలు అడినట్లు అనిపిస్తుంది. నిజంగా టీడీపీ క్యాడర్ అంతా సినిమా చూసి ఉంటే ఈ సినిమా ఇలా ఫెయిల్ అయ్యేది కాదన్న అభిప్రాయం లేకపోలేదు. పైకి శుభాకాంక్షలు చెబుతూ, లోపల మాత్రం సినిమా ఇలా దెబ్బతినడంపై సంతోషం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. జనసేన ర్యాలీలలో టీడీపీ వారు పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు. పవన్ సినిమా సక్సెస్ కాకపోతేనే ఆయన టీడీపీని ధిక్కరించకుండా ఉంటారని ఆ పార్టీ వారు భావించి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా అటు వైసీపీని దూరం చేసుకుని, ఇటు టీడీపీ నుంచి సరైన ఆదరణ పొందలేకపోవడంతో పాటు స్వయంకృతాపరాధాల కారణంగా ఈ సినిమా నష్టపోయి ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇకనైనా రాజకీయాలు వేరు..సినిమాలు వేరు అనే సూత్రాన్ని వపన్ చిత్తశుద్దితో పాటిస్తే మంచిదేమో!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జగన్ అడుగులే పిడుగులయ్యాయా?
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అడుగుల శబ్దం ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా ? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళ్తున్నాయా?. ఆయన ధిక్కారం.. ఏనుగు ఘీంకారం అనిస్తోందా?. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్ల కంపమీద కూర్చోబెట్టినట్లు ఉంటుందా?. ఆయన కన్నెర్ర చేస్తుంటే చండ్రనిప్పులు కురుస్తున్నట్లు భయమేస్తోందా?. అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్.. ఇన్ని నిబంధనలు విధిస్తోందా?.. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లడాన్ని ప్రభుత్వం అంగీకరించలేకపోతోంది. ఆయన ఏ ఊరు వెళ్లాలన్నా సవాలక్ష ఆంక్షలతో అష్టదిగ్బంధం చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడి పర్యటనల మీద గతంలో ఎన్నడూ లేనన్ని నిబంధనలు విధించడం అంటే ఆయన్ను చూసి ప్రభుత్వం భయపడుతున్నట్లు కాదా?. చుట్టూ కమ్ముకొస్తున్న ప్రభుత్వ వ్యతిరేక మేఘాలను చెదరగొట్టేందుకు.. ప్రజల గొంతుకు ఆయన మరింత మద్దతు తెలపకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెడుతోందా?. వైఎస్ జగన్ను జనంలోకి వెళ్లకుండా ఆపడానికి ఇలా ఆంక్షలు విధిస్తోందా అనే అభిప్రాయాలూ జనంలో వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలను నమ్మించి గెలిచినా ప్రభుత్వం ఆ దిశగా చేసింది ఏమీ లేదన్న అభిప్రాయాలు జనంలో ఉన్నాయి. పెన్షన్ల పెంపు మినహా మరే హామీ అమలు చేయలేదు. రైతులకు.. యువతకు.. విద్యార్థులకు.. మహిళలకు ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవాళ్లను, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్లను సైతం రాత్రికి రాత్రి పోలీసులు తీసుకెళ్లి అరెస్టులు చేస్తున్నారు. చిత్రహింసలు పెట్టి ప్రభుత్వం చెప్పినట్లు చేస్తూ పెద్దలను సంతృప్తి పరుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ తీరును.. పోలీసులు చేస్తున్న అతిని హైకోర్టు కూడా పలుమార్లు అభిశంసించింది.ఇక, అరటి.. మామిడి.. మిర్చి.. పొగాకు.. రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వారి ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయక.. ఇటు వ్యాపారాలు సిండికేట్ అవడంతో ధర ఘోరంగా పడిపోయి రైతులు నష్టపోయారు. ఇటు సామాజిక.. రైతుల అంశాలతోపాటు ప్రభుత్వ వేధింపులతో నష్టపోతున్న కార్యకర్తలను ఓదార్చేందుకు.. నైతిక మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా అయన కార్యక్రమాలకు ప్రభుత్వం ఎన్నడూ లేని అడ్డంకులు కలిగిస్తోంది. మొన్న పల్నాడు వెళ్లాలనుకున్నపుడు కూడా ఇలాగే నిబంధనల సంకెళ్లు విధించింది. నేడు నెల్లూరులో జైల్లో ఉన్న మాజీ మంత్రి గోవర్థన్ రెడ్డిని పరామర్శించేందుకు సైతం జగన్ వెళ్లబోగా రూల్స్ పేరిట కట్టడి చేస్తోంది.గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న లోకేష్.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇష్టానుసారం దూషించలేదా?. నాటి ప్రభుత్వాన్ని.. అధికారులను.. పోలీసులను దునుమాడలేదా?. లోకేష్ అయితే ఏకంగా రాష్ట్రంలో ఆ చివర నుంచి ఈ కొసకు నడుస్తూ అడుగడుక్కీ వైఎస్ జగన్ను తిడుతూనే వెళ్లారు. మరి నాడు ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు పెట్టలేదు కదా. మరి నేడు చంద్రబాబు ప్రభుత్వం జగన్ను చూసి ఇంతగా ఎందుకు కలవరపడుతోంది. తమ ప్రభుత్వ అసమర్థత.. వైఫల్యాల మీద ప్రజలు జగన్ కలుస్తున్నారని భయమా?. గెలిచినా ఓడినా ప్రజల్లో ఆదరణ తగ్గని జగన్ మళ్ళీ సమాజంలో తిరిగితే ప్రభుత్వ బండారం బట్టబయలు అవుతుందని కలవరమా?.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు, బాధ్యత ప్రతిపక్షానికి ఎప్పటికీ ఉంటుంది.. ఆ హక్కును కాలరాయడం అంటే అది నియంతృత్వమే అవుతుంది. ఇక ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా.. నిబంధనలు విధించినా వాటిని తెంచుకుని వెళ్తాము అంటూ వైఎస్ జగన్, ఆయన కార్యకర్తలు అయితే ముందడుగు వేస్తున్నారు.. -సిమ్మాదిరప్పన్న. -
జగన్ ముందే చెప్పాడు!
‘‘పిల్లలకు మనం ఇచ్చే సంపద చదువే.. పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమం బోధిస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తరచూ చేసిన వ్యాఖ్యలు. అవిప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. జాతీయ నాయకులు కొందరు కూడా వీటిని ప్రస్తావిస్తున్నారు. జగన్ వల్లే వీరు ఈ విషయాలు చెబుతున్నారనడం లేదు. కాని వీరందరికన్నా ముందు జగన్ మాట్లాడారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నేతలు, ఇతర పార్టీల వారు కూడా చాలామంది జగన్పై నానా విమర్శలూ చేశారు. ఒక బీజేపీ నేత ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది కాని తరువాత ఏమైందో తెలియదు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పేదలకు ఆంగ్ల మీడియం కొనసాగేందుకు జగన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంగ్ల మీడియం ప్రస్తావన తేవడంతో జగన్ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత వచ్చింది. 'దేశాభివృద్దికి డబ్బు, భూములు ముఖ్యం కాదు. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకి ముందు నేను కూడా భూములే ముఖ్యం అనుకునేవాడిని. కాని ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యమైన అంశమని కులగణన నిపుణుల కమిటీ అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం. అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలను వద్దనడం లేదు. ఈ భాషలతోపాటు ఇంగ్లీష్ నేర్పాల్సిన అవసరముందన్నది చారిత్రక వాస్తవం. మన పురోగతిని నిర్దేశించేది ఆంగ్ల భాషే. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ మీడియం వద్దని అంటారు. కానీ వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, కాలేజీలే అని సమాధానం వస్తుంది. ఆ అవకాశాన్ని దేశంలో బలహీన వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎందుకు బీజేపీ నేతలు దక్కనివ్వరు’’ అని రాహుల్ ఢిల్లీలో జరిగిన ఓ మీటింగ్లో అన్నారు. రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కాని ఆయనకు ఆంగ్ల మాద్యమం ప్రాముఖ్యత ఇప్పటికి తెలియడం చిత్రంమే. అది కూడా తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే నివేదిక వచ్చాక అవగాహన రావడం విశేషం. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించాలంటూ ఆంగ్ల భాషకు వ్యతిరేకంగా మాట్లాడారు. విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించ లేదు. అమిత్ షాకు జవాబు ఇవ్వడం కోసం రాహుల్ ఈ ప్రకటన చేశారు. సుమారు ఏభై ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆంగ్ల మాధ్యమం అవసరాన్ని గుర్తించిందనుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా, అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ తదితర దేశాలలో భారతీయ విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీష్ మాధ్యమం చాలా అవసరం అన్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఆంగ్లం అనేది భాషా వారధిగా ఉంటోందన్న సంగతి విస్మరించకూడదు. తెలంగాణలో జరిగిన సర్వేలో ఆస్తులు ఉన్నా, చదువు సరిగా లేకపోతే ప్రయోజనం లేదని పలువురు అభిప్రాయపడ్డారని సమాచారం. పేదరికం తగ్గాలంటే చదువే ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆంగ్ల భాష విద్య మాధ్యమంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు. కాగా మూడు టర్మ్లు పాలన చేస్తున్న బీజేపీ పనికట్టుకుని హిందీ గాత్రాన్ని తీసుకు రావడం, అది తమిళనాడులో వివాదంగా మారడంతో కొంత వెనక్కి తగ్గడం జరిగింది. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేనలు హిందీకి కోరస్ పలికి విమర్శలకు గురయ్యాయి. కేవలం బీజేపీ ప్రాపకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్లు హిందీని పొగిడారని పలువురు ఎద్దేవ చేశారు. పవన్ హిందీని పెద్దమ్మ భాష అనడంపై నవ్వుకున్నారు. తెలుగు భాషా నిపుణులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఈ కూటమి నేతలు అప్పటి సీఎం జగన్పై కక్షతో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే టైమ్ లో వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోనే ఎందుకు చదువుతున్నారన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేవారు కారు.టీడీపీ భజన చేసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా మురికి వార్తలు రాస్తుండేవి. అదే టైమ్లో వారి కుటుంబాల వారంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకునే వారు. ఈ విషయంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం విమర్శలకు గురయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలోనే సినీ ప్రముఖుడు నారాయణ మూర్తి పేదలు అభివృద్దికి ఇంగ్లీష్ విద్య అవసరమని కుండబద్దలు కొట్టడం అందరిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్, లోకేశ్లు హిందీ భాష రాజ్యభాష అని వ్యాఖ్యానించి దెబ్బతిన్నారు. ప్రముఖ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు దేశంలో రాజ్యభాష ఏదీ లేదన్న సంగతి గుర్తు చేయాల్సి వచ్చింది. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగడానికి అసిధారవృతం చేశారు. చిన్న వయసు నుంచే పిల్లలకు ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం, టోఫెల్ వంటివాటిలో శిక్షణ ఇవ్వడం, స్కూళ్లను బాగు చేయడం, విద్యా దీవెన, గోరు ముద్ద వంటి స్కీములను అమలు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. వీటి ఫలితంగా పలు స్కూళ్లలో పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి మాట్లాడే స్థాయికి చేరుకున్నారు. అమ్మ ఒడి స్కీమ్ తెచ్చి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగేలా జగన్ చేశారు . జాతీయ మీడియా హిందీ భాష లో బోధన గురించి ప్రశ్నిస్తే, చాలా స్పష్టంగా హిందీ నేర్చుకుంటే తప్పు కాదని, కాని ఆంగ్ల మీడియం మాత్రం తప్పనిసరి అని, అదే దేశంలోని విద్యార్ధులకు మేలు చేస్తుందని జగన్ చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రచారార్భాటానికి ఇస్తున్న ప్రాముఖ్యత విద్యా వ్యవస్థ బాగుపై పెట్టడం లేదని, తత్ఫలితంగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్ను సకాలంలో అమలు చేయడం ద్వారా పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్కీమ్ బకాయిలు సుమారు రూ.4200 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా.. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇంగ్లీష్ మీడియం అవసరం అనే విషయం మరోసారి నిర్దారణైంది. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న నేతలందరి కన్నా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ముందుగా గుర్తించి దేశానికి ఒక రకంగా ఆదర్శంగా నిలిచారని చెప్పక తప్పదు. మాతృభాష మన సంస్కతిని కాపాడేదైతే, ఆంగ్ల భాష ప్రపంచంతో పోటీపడేలా చేస్తుందన్న జగన్ కొటేషన్ ను ఎవరైనా అంగీకరించాల్సిందే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అచ్చెన్నాయుడు గుట్టు బయటపెట్టేశాడే!
ఆడబిడ్డ నిధి పేరుతో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యఏపీలో ఐదేళ్ల ఫించన్ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు.. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడునేనేదో చేసేస్తానని ఆశ పడుతున్నారు.. ఖజానా ఖాళీగా ఉంది.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు2024 ఎన్నికల సమయంలో వీరు ఈ మాటలు మాట్లాడి ఉంటే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయి ఉండేది. కానీ అప్పుడేమి బొంకారో గుర్తు చేసుకోండి. చంద్రబాబైతే.. తనకు సంపద సృష్టించడం తెలుసన్నాడు. సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికను అమలు చేసి చూపిస్తామని బల్లగుద్ది మరీ బుకాయించారు. బాబు గారి పుత్రరత్నం లోకేశ్ ఇంకో అడుగు ముందుకేసి.. అన్ని వాగ్దానాల అమలుకు పక్కా ప్లాన్ ఉందని, లెక్కలున్నాయని, తాము చేయలేకపోతే ప్రజలు చొక్కా కాలర్ పట్టుకోవచ్చు.. అని ఛాలెంజ్ కూడా చేశారాయె! ఇక జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మాటలు ఒకసారి గమనించండి.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక అమలుకు తనదీ గ్యారెంటీ అని గొప్పగా భరోసా ఇచ్చారు. అధికారం వచ్చింది.. ఏడాది గడిచింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా తమ మనసులోని మాటలు బయటపెట్టేసుకుంటున్నారు.... ప్రజలను మోసం చేయడానికే హామీలు ఇచ్చామన్నట్టుగా మాట్లాడేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన వాగ్ధానాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చాలా విస్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే.. తామిచ్చిన నవరత్నాల హామీ అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల వరకు అవుతోందని, దానిని భరించడానికే చాలా కష్టపడవలసి వస్తోందని, కూటమి ఇస్తున్న సూపర్ సిక్స్, తదితర హామీల అమలుకు రూ.1.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఎలా తెస్తారు? అని! చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలను మోసం చేస్తున్నారని పదే, పదే చెప్పేవారు. అయినా టీడీపీ, జనసేన నేతలు బుకాయించి, దబాయించి మరీ తమ సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తామని అనేవారు. తమ వద్ద మంత్రదండం ఉందని చంద్రబాబు అనేవారు. ఇప్పుడేమో ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటూ మరికొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందులో పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి గరిష్టంగా రూ.పది లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అవన్ని అయిపు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ వీటిపై గట్టిగా నిలదీస్తుండడం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే, పదే కూటమి నేతల ఎన్నికల ప్రణాళికను గుర్తు చేస్తుండడంతో తప్పనిసరి స్థితిలో సుమారు 150 హామీలలో రెండు, మూడింటిని అరకొరగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో.. హమీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయేసరికి ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దానిని ఎలా అధిగమించాలా?అనే ఆలోచనతో రెడ్ బుక్ పాలన ద్వారా వైసీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్నారు. కేసులు పెట్టి కూటమికి మద్దతు ఇచ్చే మురికి మీడియాలో ఆ కేసుల వార్తలనే ప్రముఖంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. ఏదో గుట్టుగా మోసం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే, ఈయన రహస్యాన్ని బట్టబయలు చేశారని అనుకోవాలి.ఆడబిడ్డ నిధి పధకం కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలని అచ్చెన్న ఓపెన్గానే చెప్పేశారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఎవరైనా విశ్లేషకులు చెబితే వారిమీద మండిపడేవారు. వైఎస్సార్సీపీ వాళ్లు ‘అదెలా సాధ్యం?’ అని అడిగితే విరుచుకుపడే వారు. చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసి చూపిస్తారని ప్రచారం చేసేవారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా అత్యధికశాతం ‘మాట తప్పడమే’ అని జనానికి తెలిసినా, పవన్ కళ్యాణ్ కూడా జత కలవడం, బీజేపీ మద్దతు ఉండడంతో ఏమో ఈసారి ఏమైనా చేస్తారేమోలే అని ఆశ పడ్డవారు గణనీయంగానే ఉన్నారు. సూపర్ సిక్స్ ఎఫెక్ట్తో పాటు ఈవీఎంల మాయాజలం కలిసి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వృద్ధుల ఫించన్ను రూ. వెయ్యి పెంచారు. ఈ అదనపు పింఛన్ మొత్తాన్ని అందచేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ వేసుకువెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ 13 నెలల కాలంలో ఆ వ్యయం కోట్లు దాటిపోతుంది. ఇంకోపక్క ఫించన్దారులకు లక్షల సంఖ్యలో కోత పెడుతున్న వార్తలు వస్తున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్ బండలు ఉచితం అని చెప్పినప్పటికి అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక గ్యాస్ బండ తాలూకూ డబ్బు మాత్రమే కొందరికి అందింది. మిగిలిన హామీలను ఒక ఏడాదిపాటు ఎగవేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. తల్లికి వందనం కింద చదువుకునే విద్యార్ధులకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఒక ఏడాదంతా ఇవ్వలేదు. జగన్ విమర్శల ప్రభావంతో ఆ స్కీములో రూ.రెండు వేలు కోతపెట్టి కొంతవరకు అమలు చేసినా, అది కూడా గందరగోళంగానే జరిగినట్లు చెబుతున్నారు. ఇక.. మిగిలిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో జనం ఆగ్రహం చెందుతున్నారు. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలందరికి నెలకు1500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి సుమారు రూ.35వేల కోట్లు అవుతుందన్నది ఒక అంచనా. ఆ గణాంకాలను కొందరు నిపుణులు చెప్పకపోలేదు.కాని టీడీపీకి భజన చేసే మురికి మీడియా కూడా జనాన్ని మోసం చేయడానికి అదంతా సాధ్యమేనన్నట్లు ప్రచారం చేసింది. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఇంకోమాట మాట్లాడుతున్నారు. అంతేకాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామని వెల్లడించారు. అంటే దీని అర్థం చంద్రబాబు మోసం చేయబోతున్నారని తమకు తెలుసునని చెప్పడమే అవుతుంది కదా!. అయినా పథకాలన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అచ్చెన్న ముక్తాయించారు. అంటే గతంలో మాదిరి ఎన్నికల సంవత్సరం చివరిలో ఏదో చేసేశామని చెప్పి జనాన్ని మాయ చేసే అవకాశం ఉందని అనుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, ఫించన్లు ఇవ్వడానికే సరిపోతోందని కూడా అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. చిత్రం ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలోని ఆడబిడ్డ నిధి స్కీము తప్ప అన్నిటిని అమలు చేసేశామని మంత్రి ప్రకటించడం. ఇది చంద్రబాబు చెబుతున్న తీరుగానే ఉంది. అది నిజమే అయితే ఎన్నికల మానిఫెస్టో చదువుతూ ఏ ఏ అంశాలు ఎలా అమలు చేస్తున్నది వివరించగలగాలి. కాని ఆ పని చేయరు.అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి బీసీలకు ఏభైఏళ్లకే పింఛన్ తదితర హామీల సంగతేమిటో మంత్రి చెప్పాల్సి ఉంటుంది. 2017లో జగన్ నవరత్నాల స్కీములను ప్రకటించినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసేది. అవి సాధ్యం కాదని అనేది. కాని జగన్ సీఎం అయి అమలు చేసి చూపించారు. అప్పుడు ఏపీ శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతోపాటు మురికి మీడియా విషం చిమ్మేది. కాని అదే సమయంలో టీడీపీ, జనసేన ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్సార్సీపీ ఇచ్చే సంక్షేమం కన్నా రెండు, మూడు రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికేవారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కూడా సంక్షేమ స్కీముల గురించి పలుమార్లు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఐదేళ్ల పెన్షన్లకు అయ్యే వ్యయంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని చెబుతున్నారట. దీనిని బట్టి వారి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, మహిళలు ఎవరు కనిపించినా నీకు 15వేలు, నీకు 18 వేలు అంటూ సైకిల్ వేసుకుని వెళ్లి మరీ చెప్పిన నిమ్మల ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు అచ్చం గురువుకు తగ్గ శిష్యులే అనిపించుకుంటున్నారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణ కాంగ్రెస్లో పదేళ్ల లొల్లి!
తెలంగాణకు పదేళ్లు తానే ముఖ్యమంత్రినంటూ ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సహజంగానే కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. చర్చోపచర్చలకు దారితీసింది. అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని కూడా అన్నారు. ఇది కాస్తా తెలంగాణ అధికార పార్టీ రాజకీయాలలో కొత్త వివాదానికి తెరదీసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ '2034 వరకు అంటే.. పదేళ్లపాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడు. కేసీఆర్.. ఈ విషయాన్ని డైరీలోనో.. నీ గుండెలపైనో రాసుకో" అని సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలకు, ఒక ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పడం వరకు ఓకే. వచ్చే తొమ్మిదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పడం తనపై తనకు ఉన్న నమ్మకం కావచ్చు. కానీ కాంగ్రెస్లో అలా బహిరంగంగా చెప్పడానికి పార్టీ అధిష్టానం కాని, ఇతర నేతలు కాని ఇష్టపడరు. రాజగోపాలరెడ్డి అభిప్రాయం కూడా అదే. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సీఎంను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్లో ఈ విధానం ఉన్న మాట నిజమే కాని, కేంద్రంలో అధికారం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా సీఎంల మార్పుపై సంచలన నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా కనబడదు. కర్ణాటక వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చాలని, తనను సీఎంను చేయాలని ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్ కోరుకుంటున్నారు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు ఇందుకు సాహసించడం లేదు. పైగా ఈ ఐదేళ్లు సిద్దరామయ్య కొనసాగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి అక్కడ ఉండే రాజకీయ, సామాజిక అంశాలు కారణాలు కావచ్చు. అయితే.. సిద్దరామయ్య కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అని చెప్పుకోవడం లేదు. కానీ రేవంత్ ధైర్యంగా 2028 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తిరిగి తానే సీఎం అవుతానని చెబుతున్నారు. తన వర్గంలో విశ్వాసం పెంచడానికి ఇది ఉపయోగపడవచ్చు కానీ, పార్టీలోని ఇతర వర్గాలలో ఇది అసహనానికి కారణం అవుతుంది. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అభ్యర్ధులు ఎక్కువే. 2014లో అయితే డజను మంది తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విలీనం కాకుండా అడ్డుపడ్డారు. కేసీఆర్ తనకు సీఎం పదవి ఇస్తే విలీనం చేస్తానని కండిషన్ పెట్టారు. చివరికి ఒంటరిగా పోటీచేసి విజయం సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లు ఆ పరిస్థితి కొనసాగడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికలకు కొద్దికాలం ముందు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. తదుపరి వర్కింగ్ అధ్యక్షుడుగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమి పాలైనా, మల్కాజిగిరి ఎంపీగా గెలవడం ఆయనకు కలిసి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు తొలుత రేవంత్ నాయకత్వానికి సుముఖత చూపలేదు. తప్పని స్థితిలో ఒప్పుకున్నారు. రేవంత్ నియామకంపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటివారు గట్టి విమర్శలే చేసేవారు. ఆయన సోదరుడు రాజగోపాల రెడ్డితో కలిసి తమకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధిస్తామని చెప్పినా అధిష్టానం వారివైపు మొగ్గు చూపలేదు. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్య తీసుకోవడం లేదంటూ రాజగోపాల రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవి కూడా వదలుకున్నారు. తదుపరి ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్లీ 2023 జనరల్ ఎన్నికలు వచ్చేసరికి తిరిగి కాంగ్రెస్లో చేరిపోయి మునుగోడు నుంచే పోటీచసి విజయం సాధించారు. ఈయన సోదరుడు, సీనియర్ నేత వెంకట రెడ్డి నల్గొండ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. రాజగోపాలరెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అధిష్టానం కూడా ఆయనను బుజ్జగించే యత్నం చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారన్న భావనతో ఆయనకే సీఎం పదవి అప్పగించింది. మల్లు భట్టి సీఎం రేసులో నిలిచినా ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకోక తప్పలేదు. అలాగే ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట రెడ్డి తదితర ఆశావహులు కూడా రాజీపడి రేవంత్ కేబినెట్లో మంత్రులుగా చేరిపోయారు. అయినా వీరిలో కొందరు రేవంత్ పై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేసే తప్పులను, వచ్చే ఆరోపణలను తెలియ చేస్తున్నారట. రేవంత్ కూడా అంతకన్నా తెలివిగా అధిష్టానంతో సంబంధాలు కొనసాగిస్తున్నందున ఇప్పటికైతే ఆయనను కదలించే శక్తి ఇతర కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లు కనిపించదు. కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అది వేరే సంగతి. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఉమ్మడి ఏపీలో పూర్తి టర్మ్ పదవి కాలంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కావడం విశేషం. 2004లో ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొందరు ఇతర నేతలు సీఎం పదవి కోసం పోటీ పడకపోలేదు. కానీ అధిష్టానం వైఎస్ నాయకత్వానికి అంగీకరించక తప్పలేదు. అలాగే 2009లో రెండోసారి గెలిచిన పిమ్మట అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తనకు సీఎం పదవి కావాలని ప్రకటన చేశారు. అయినా వైఎస్సార్కే సీఎం సీటు తిరిగి దక్కింది. 1956 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి దాదాపు మూడేళ్ల తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్లారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో నీలం సంజీవరెడ్డి మళ్లీ సీఎం అయ్యారు కాని పూర్తి టర్మ్ ఉండలేదు. 1964లో ముఖ్యమంత్రైన కాసు బ్రహ్మానందరెడ్డి 1967 ఎన్నికల తర్వాత తిరిగి ఆ పదవి చేపట్టినా, పూర్తి కాలం కొనసాగలేకపోయారు. తరువాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆయన 1972లో పదవి వదలు కోవల్సి వచ్చింది. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత సీఎం అయిన జలగం వెంగళరావు 1978 వరకు కొనసాగారు. ఆ తరుణంలో పార్టీలో వచ్చిన చీలికలో 1978లో మర్రి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన సీఎం అయ్యారు. 1978-83 మధ్య చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డిలు సీఎం పదవులు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించినన టీడీపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి 1989లో కాంగ్రెస్ గెలుపొందడంతో 1989-94 మధ్య చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఓటమి పాలైన కాంగ్రెస్ మళ్లీ 2004లో అధికారంలోకి వచ్చాక వై ఎస్ సీఎం అయ్యారు. 2009లో తిరిగి ఆయన ముఖ్యమంత్రయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే వైఎస్సార్ తప్ప ఏ ఒక్క కాంగ్రెస్ సీఎం కూడా పూర్తి టర్మ్ పాలించలేదన్నమాట. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినిపోగా, తెలంగాణలో పదేళ్లపాటు అధికాంలోకి రాలేదు. 2023లో రేవంత్ సీఎం అయిన తర్వాత కొంత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడపడానికి యత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి అవడంతో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు రేవంత్ను ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడుగానే చూస్తుంటారు. ఆయన కూడా అప్పడప్పుడు చంద్రబాబును ప్రశంసించినట్లు మాట్లాడుతుంటారు. నాగర్ కర్నూల్ సభలోనూ చంద్రబాబు ప్రస్తావన తెచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. అప్పుడప్పుడూ వైఎస్ పేరును ప్రస్తావిస్తున్నా, కాంగ్రెస్ వర్గాలకు అంత సంతృప్తి కలిగించే రీతిలో మాట్లాడడం లేదన్న భావన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన వ్యాఖ్యలో నిఖార్సైన కాంగ్రెస్ నేతలు సీఎం చేసిన వ్యాఖ్యలను అంగీకరించరని అన్నారు. సాధారణంగా.. జాతీయ పార్టీలలో హై కమాండ్ దే తుది నిర్ణయం అనే సంగతి తెలిసిందే. అయితే ఇది పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి, ఆయా వ్యక్తుల బలాబలాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. రేవంత్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తనకు ఎక్కువ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అందువల్ల అధిష్టానం కూడా తొందరపడే పరిస్థితి ఉండదు. ఆ ధైర్యంతోనే రేవంత్ భవిష్యత్తులో కూడా తానే సీఎం అని చెప్పుకుని ఉండవచ్చు. రేవంత్ పై అసహనం వ్యక్తం చేయడం మినహా, అసమ్మతి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆంధ్రప్రదేశ్ పోలీసుల రివర్స్ ట్రెండ్!
పోలీసు వ్యవస్థ ఎక్కడైనా నిజాలు రాబట్టేందుకు ప్రయత్నించాలి. కానీ.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం తాము సృష్టించిన అబద్ధాలను నిజాలుగా మార్చేందుకు తంటాలు పడుతోంది. కుట్రలు, కుతంత్రాలకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్బుక్ పేరుతో బహిరంగంగానే ప్రైవేట్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసులు వారి అరాచకాలకు తలూపుతూండటం చూస్తూంటే.. ‘‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. పోలీసు రాజ్యం.. అబద్ధాల రాజ్యం’’ అనే భావన బలపడుతోంది. ఏడాది కాలంగా విపక్ష వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై సాగుతున్న హింసాకాండ, దౌర్జన్యాలు, కేసుల వేధింపులు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అంటే అతిశయోక్తి కాదు. దేశం మొత్తం అత్యవసర పరిస్థితి విధించినా పోలీసులు ఈ స్థాయి అరాచకాలకు పాల్పడలేదు. అందుకే కాబోలు ఎమర్జెన్సీ తరువాత 1977లో కాంగ్రెస్ పార్టీ దేశమంతటా ఘోర పరాజయం చవిచూసినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారీ విజయం నమోదు చేసుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై కూడా కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా, ఎన్నికలపై మాత్రం వాటి ప్రభావం పడలేదు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పెడుతున్న కేసుల తీరు చూస్తే పోలీసులు ఇంత ఘోరంగా కూడా పనిచేస్తారా అన్న ప్రశ్న వస్తుంది. తాజాగా మద్యం స్కామ్ అంటూ ఒక కట్టుకథ సృష్టించి, దాని చుట్టూ రకరకాల పిట్టకథలు చేర్చి తమకు మద్దతిచ్చే మురికి మీడియాలో ప్రముఖంగా రాయిస్తూ వస్తున్నారు. ఆ మురికి మీడియా పత్రికలు, టీవీలు నిస్సిగ్గుగా అసత్యాలను జనంపై రుద్దే యత్నం చేస్తున్నాయి. ఆ క్రమంలో ఆ మురికిని ఆ మీడియా తనకే అంటించుకుంటోంది. మద్యం స్కామ్లో ఆరు నెలలుగా ఈ మురికి మీడియా ఇచ్చిన వార్తలు పరిశీలిస్తే ఒకదానికి మరోదానికి పొంతన కనిపించదు. సిట్ అధికారులతో ఎవరిని అరెస్టు చేయాలని భావిస్తే వారిపై తోచిన పిచ్చి కథనాలు రాస్తారు. ఇదంతా ప్రభుత్వం, మురికి మీడియా కలిసి చేస్తున్న విష ప్రచారమే అని అర్థం అవుతూనే ఉంటుంది. ప్రతిసారి ఎవరు ఈ కేసులో అరెస్టు అయితే అతనే కీలక వ్యక్తి అని పబ్లిసిటీ ఇస్తారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అరెస్టు చేశారు. అంతే సూత్రధారి ఈయనే అంటూ వార్తలు ఇచ్చారు. పోలీసుల స్పష్టమైన ఆధారాలు ఉంటే, ఆ వివరాలను బయటపెట్టవచ్చు కానీ అలాకాకుండా మద్యం ముడుపుల డబ్బుతో బంగారం కొనుగోలు చేశారని ఒకసారి రియల్ ఎస్టేట్లో వెచ్చించారని ఇంకోసారి, సినిమాలు తీశారనో, ఎలక్ట్రికల్ వెహికిల్ కర్మాగారం నెలకొల్పాలని భావించారనో, టాంజానియాలో ఇంకేదో పెట్టాలని ప్లాన్ చేశారని, దుబాయిలో ఇంకేదో చేశారని, ఓటర్లకు పంచడానికి ఈ డబ్బు వాడారని.. రకరకాల కథనాలు ఇచ్చారు. ఇంకోపక్క.. లిక్కర్ కేసులో ఎంత విచారిస్తున్నా సాక్ష్యాధారాలు దొరకలేదని, కోట్ల పేజీల డేటా ధ్వంసం చేశారని, అయినా దానిని తిరిగి తీస్తున్నారని.. ఏవేవో మతిమాలిన స్టోరీలన్నింటిని జనం మీద వదిలారు. చివరికి పోలీసులు ఏదో తప్పనిసరి తంతుగా చార్జీషీట్ వేశామని అనిపించుకున్నారు. నిందితులను అరెస్టు చేసి తొంభై రోజులు దాటితే ఆటోమాటిక్గా డిఫాల్ట్ బెయిల్ వస్తుంది కాబట్టి ,దానిని చెడగొట్టే లక్ష్యంతో ఇలా చేశారన్నది న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. తొలుత అప్పటి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి మద్యం స్కామ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను ధ్వంసం చేయడానికి తీసుకువెళ్లారని, ఆఫీస్ వద్ద ఎవరో దీనిని చూశారని ఒక తప్పుడు కేసు పెట్టారు. తదుపరి ఈ స్కామ్ లో ఆయనను నిందితుడిని చేశారు. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ వేధిస్తున్నారని ఆయన హైకోర్టుకు కూడా వెళ్లారు. కాని తదుపరి ఏమి జరిగిందో కాని, ఆయన నుంచి బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకుని కేసును ముందుకు తీసుకువెళ్లే యత్నం చేశారు. వాసుదెవ రెడ్డితో పాటు సత్యప్రసాద్ అనే మరో ఉద్యోగిని కూడా ఇందుకు వాడుకున్నారు. వాసుదేవ రెడ్డి చివరికి వీరి వేధింపులు తట్టుకోలేక పోలీసులు అడిగిన వాంగ్మూలం ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సర్వీస్కు వెళ్లిపోయారట. ఇప్పుడు మళ్లీ ఆయనను పట్టుకువచ్చి అప్రూవర్గా మార్చాలని యత్నించిన వైనం బయటపడింది. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? అసలు ఏదైనా స్కామ్ జరిగితే దానికి సంబంధించిన నిర్దిష్ట సాక్ష్యాలు మెటీరియల్ రూపంలో కనిపిస్తాయి. ఈ కేసులో అవేమీ ఉన్నట్లు అనిపించవు. ఉదాహరణకు చంద్రబాబుపై గత ప్రభుత్వంలో వచ్చిన స్కిల్ స్కామ్లో కొన్ని ఆధారాలు కనిపించాయి. కేబినెట్తో సంబంధం లేకుండా చంద్రబాబే నిధులు మంజూరు చేయడం, ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పినా, సీఎం కోరుతున్నారు. కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని అప్పటి సీఎస్ కోరడం వంటివి జరిగాయి. అలాగే స్కిల్ స్కామ్ నిధులు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అయింది ఈడీ విచారణలో వెల్లడైంది. చివరికి డబ్బు పార్టీ బ్యాంక్ ఖాతాలోకి చేరిందని కూడా ఆ కేసు దర్యాప్తు చేసిన సీఐడీ ఆధారసహితంగా తెలిపింది. దానిని ఇంతవరకు నేరుగా ఖండించలేకపోయారు. ఈడీనే తొలుత కొందరిని అరెస్టు చేసింది. తదుపరి ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. అలాగే 2019లో టీడీపీ ఓటమి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఏ ఇంటిలో సోదాలు చేసి, సుమారు రూ.రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రకటించింది. కానీ ఆ తరువాతి కాలంలో చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ వల్ల ఆ కేసు ముందుకు సాగలేదని అంటారు. అలాగే చంద్రబాబు పై గత ప్రభుత్వం పెట్టిన మద్యం ప్రివిలేజ్ ఫీజ్ రద్దు చేయడం ద్వారా ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లు అప్పట్లో స్పష్టమైన ఆధారాలతో తెలిపింది. జగన్ ప్రభుత్వ టైమ్లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే కేసులు పెడితే, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం కక్షపూరితంగా ఏదో ఒక కేసు పెట్టి, తమకు విధేయులుగా పనిచేసే కొందరు అధికారుల ద్వారా అరెస్టుల పర్వం ఆరంభించిందన్నది వైఎస్సార్సీపీ విమర్శ. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలలో ఏర్పడిన తీవ్ర అసంతృప్తిని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తున్నారు. అందువల్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులు లొసుగుల మయంగా కనిపిస్తాయి. తాము చెప్పినట్లు వింటే సరి. లేకుంటే అరెస్టు తప్పదని భయపెట్టి కొందరిని లొంగదీసుకుంటున్నారన్న భావన ఉంది. ఉదాహరణకు విజయసాయి రెడ్డి వైఎస్సార్సీపీ సభ్యత్వాన్ని, తన రాజ్యసభ పదవి వదలుకునేలా చేయడం. ఆ తర్వాత మద్యం కేసుకు సంబంధించి ఆయన నుంచి ఒక ప్రకటన తీసుకోవడం, దాని ఆధారంగా కేసు డీల్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. విజయసాయి రెడ్డిని కీలకమైన నిందితులలో ఒకరిగా తొలుత ప్రచారం చేసినా, ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయలేదు. తనపై కేసు ఉండదని అనుకున్నా, పూర్తిగా కేసు పెట్టకపోతే, కథ సజావుగా సాగదని భావించారేమో తెలియదు కాని, ఆయనను కూడా నిందితుడిగానే చూపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయంతో సంబంధం లేని వారిని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక అధికారులుగా ఉన్నవారిని కూడా వదలకుండా వారనుకున్న జాబితా ప్రకారం అరెస్టుల పర్వం సాగించారు. సిట్ అధికారులు రూ.3500 కోట్లు అని కాకి లెక్క తయారు చేశారు. దానికి అయినా ఆధారాలు ఉన్నాయా అంటే అవి లేవు. అసలు డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుంటే వారు కదా ఫిర్యాదు చేయవలసింది. వారెవరూ మాట్లాడకపోతే దారినపోయే దానయ్య ఎవరో కంప్లెయింట్ చేస్తే దానిని రెవెన్యూ సెక్రటరీ ముఖేష్ మీనా ఎంటర్టైన్ చేయడం ఏమిటి? ఆ వెంటనే బెవరేజన్ కార్పొరేషన్లో సమచారం సేకరించినట్లు, దర్యాప్తు చేయడానికి సిట్ వేసినట్లు.. ఇలా ఎంతో కథ నడిపించారు. చంద్రబాబు టైమ్లో ప్రైవేటు రంగంలో మద్యం వ్యాపారం జరిగితే జగన్ హయాంలో ప్రభుత్వమే షాపులను నిర్వహించింది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అదే సమయంలో మద్యం వినియోగం తగ్గింది. అయినా స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును జగన్ మెడకు చుట్టాలని విశ్వయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ అంటూ మురికి పత్రికలు విష ప్రచారం ఆరంభించాయి. 1999-2004 మధ్య ఒక స్కామ్ లో బిగ్బాస్కు మూడు కోట్లు చెల్లించామంటూ రాసిన లేఖ కలకలం రేపింది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అంతకుముందు 1985 ప్రాంతంలో చంద్రబాబుకు, ఒక సారాయి బాట్లింగ్ కంపెనీ యజమానికి ఉన్న సంబంధంపై ఆయన తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకంలో రాశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన యత్నంలో దొరికిపోయిన సంగతి తెలిసిందే అని వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తుంటారు. ఆ చార్జీషీట్లో చంద్రబాబు ప్రస్తావన ముప్పై సార్లకు పైగా ఉంది. అయినా ఆయనను నిందితుడిగా చేర్చలేదు. అప్పుడు చంద్రబాబు బిగ్ బాస్ అని మురికి మీడియా ఒప్పుకుంటుందా? అసలు ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చింది, ఓట్లకు ఎలా డబ్బు ఇవ్వవచ్చన్నది నేర్పింది చంద్రబాబు అని ఆయన ప్రత్యర్థులు ఏకగ్రీవంగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్లో తేలేది ఏమీ ఉండదని, కాని కేసు పేరుతో వైసీపీ నేతలను, కొందరు రిటైర్డ్ అధికారులను వేధించి వికృతానందం పొందడం తప్ప అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థూలంగా చూస్తే ప్రజల దృష్టిలో ఇదంతా ఒక రాజకీయ కక్ష కేసుగా మాత్రమే నమోదు అవుతుంది. చంద్రబాబు, లోకేశ్లు ఇలాగే రెడ్ బుక్ పాలన కొనసాగిస్తే, భవిష్యత్తులో వారితోసహా టీడీపీ నేతలు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
CBN: హద్దుల్లేని స్వోత్కర్ష ఎంత కాలం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్లు పెట్టుబడులకు సంబంధించి చేసే ప్రకటనలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతారో.. ఎవరూ ఊహించ లేరు. తాజాగా చంద్రబాబు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని అన్నారు. దాంతోపాటే ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని అని కూడా వక్కాణించారు. రానున్న నాలుగేళ్లలో ఇంకో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తామని కూడా చెప్పారు. నిజమైతే సంతోషపడవచ్చు కానీ.. రాష్ట్రంలో పరిస్థితులు అలా లేవు. ఇండోసోల్ వ్యవహారమే పైన చెప్పుకున్నదానికి ఒక ఉదాహరణ. ఈ కంపెనీ సౌర విద్యుత్తు పరిశ్రమ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల వ్యయం కూడా చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తీరు పుణ్యమా అని ఇప్పుడు ఆ కంపెనీ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ కూడా సాహసిస్తుందా?. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని బృందం తయారు చేసిన టాస్క్ఫోర్స్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. అయితే ఇది ఆ సమావేశంలో పాల్గొన్న వారికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. చంద్రశేఖరన్ వంటి బిజీ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసేంత తీరిక ఉంటుందా? అన్నది ప్రశ్న. నివేదికకు కాస్త మర్యాద దక్కుతుందని ఆయన పేరు జోడించారేమో తెలియదు! అయినా ఫర్వాలేదు కానీ ఆ నివేదికను పరిశీలించినా, చంద్రబాబు మాటలు చూసినా నేల విడిచి సాము చేసే తీరులోనే ఉన్నట్టు అనిపించక మానదు. 2014-19 మధ్యకాలంలోనూ చంద్రబాబు ఇలాంటి సమావేశాలు బోలెడు పెట్టారు. అదిగో పెట్టుబుడులు.. ఇదిగో అభివృద్ధి అని డాబుసరి కబుర్లు చెప్పేవారు. 2029 నాటికి ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవుతుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్-5లో ఉంటుందని ఏవేవో చెప్పేవారు. అంతేకాదు.ఆయా జిల్లాలలో ఏఏ రంగాలను అభివృద్ది చేస్తారో, ఏ ప్రాజెక్టులు వస్తాయో చెబుతూ అసెంబ్లీలో పెద్ద స్పీచ్ ఇచ్చారు కూడా. అప్పట్లో వైసీపీలో ఉండి.. ఇప్పుడు టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు ప్రకటనలు రియల్ ఎస్టేట్ బ్రోచర్తో పోల్చారు కూడా. చివరకు అయ్యింది కూడా అదే. చంద్రబాబు హామీలేవీ అమలు కాలేదు.2024లో అధికారం దక్కిన తరువాత మరోమారు చంద్రబాబు తన పాత స్టైల్ను భుజాలకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది తాజా ప్రకటన చూస్తే. గత ఏడాది దావోస్ పర్యటనకు ముందు కూడా నానా ఆర్భాటమూ జరిగింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తాయని టీడీపీ మీడియా ఊదరగొట్టింది. తీరా చూస్తే వచ్చింది హళ్లికి హళ్లి! దీని కవరింగ్ కోసం ‘‘ఏపీ గుడ్విల్ పెంచేందుకు వెళ్లాము తప్ప పెట్టుబడుల కోసం కాదు’’ అన్న బుకాయింపులు! దావోస్ పర్యటన వైఫల్యంతో చంద్రబాబు తన రూటు మార్చారు. కొంతకాలం తరువాత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి అని ప్రకటించారు. ఆ తరువాత ఈ అంకెలు ఐదు లక్షల కోట్లకు, మరికొన్ని నెలలకు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకున్నాయి. మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని శాసనమండలిలోనూ ప్రకటించారు. లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్న చందంగా జవాబు ఇవ్వడం వివాదాస్పదమైంది కూడా. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పాట రూ.పది లక్షల కోట్లకు చేరుకుంది!. పారిశ్రామిక దిగ్గజాలుగా పేరొందిన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకే మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కష్టంగా ఉంటే, ఆ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగని ఏపీకి ఏడాదిలోనే రూ.పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చెబితే వెరైనా నమ్ముతారా? సీఐఐ సదస్సుల్లో పాల్గొనే పారిశ్రామికవేత్తలకు ఈ విషయాలు తెలియవా? కనీసం వచ్చిన పెట్టుబడులు ఏ ఏ రంగాలకు చెందినవి, ఏ కంపెనీలు పెడుతున్నాయని చెప్పి ఉంటే కొంతైనా నమ్మకం కలిగేదేమో! అదేమీ చేయరు. తోచిన గణాంకాలు చెప్పడం తప్ప వాటికి ఆధారాలు చూపే అలవాటు లేదు. గతంలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ నోటికి వచ్చిన అంకెను చెబుతుండే వారు. చివరకు ఈ అప్పుల అంకె రూ.14 లక్షల కోట్లకు చేరుకుంది కూడా. కానీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా అప్పులు రూ.ఆరు లక్షల కోట్లేనని ఒప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు వ్యవహార శైలి ఇలా ఉంటుంది!. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్శించాలన్న చిత్తశుద్ధి ఉంటే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రామాయపట్నం వద్ద ఇండోసోల్ రూ.40 వేల కోట్లతో ప్రతిపాదించిన సౌరశక్తి పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చే వారా! ఆ కంపెనీ ఇప్పటికే రూ.1200 కోట్ల వరకూ వ్యయం చేసింది. పంటలు పెద్దగా పండని భూములు ఐదువేల ఎకరాలను ఈ కంపెనీ రూ.500 కోట్లతో సేకరిస్తే... ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకూ సబబు? భూములివ్వమని భీష్మించుకున్న కరెడు ప్రాంతంలో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ కంపెనీ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేయడమే అవుతుంది. పైగా ఇండోసోల్ సేకరించిన భూమిని వస్తుందో, రాదో తెలియని బీపీసీఎల్కు ఇస్తారట. దీనికి వేరేచోట భూమి కేటాయిస్తే నష్టమేమిటి? ఈ విషయాలు.. దాని వెనుక మతలబులు పారిశ్రామిక వర్గాలకు తెలియకుండా ఉంటాయా?.. రానున్న పాతికేళ్లలో 2.4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని కూడా చంద్రబాబు ఆ సమావేశంలో ప్రకటించారు. ఇది కూడా గతంలో చంద్రబాబు చెప్పిన ‘విజన్-2020’ బాపతు వ్యవహారమే. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ తరచి చూస్తే బాబుగారి డొల్లతనం ఏమిటో బయటపడుతుంది. పాతికేళ్ల క్రితం కుటుంబానికో ఐటి ఫ్రొఫెషనల్ నినాదంతో పని చేశామని చంద్రబాబు చెప్పడం ఇంకో విడ్డూరం. బెంగళూరు, చెన్నై, పూణె వంటి నగరాలు ఐటీకి పెట్టింది పేరుగా ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనూ ఐటీ రంగం పురోగమించాలన్న లక్ష్యంతో హైటెక్ సిటీకి శంకుస్థాపన కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత సీఎం పీఠమెక్కిన చంద్రబాబు భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతే. కానీ.. హైదరాబాద్లో ఐటీ రంగాన్ని తానే మొదలుపెట్టానని, హైటెక్ సిటీ మొత్తం తన సృష్టి అని మాట్లాడటం అతిశయోక్తి తప్ప ఇంకోటి కాదు. 2004- 2009 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్రోడ్డు వంటి అద్భుత మౌలిక సదుపాయాలను కల్పించారు. దీంతో నగరం రూపురేఖలు మరింత మారిపోయాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దానిని సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది.2004లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబుకు హైదరాబాద్తో అధికారికంగా సంబంధం లేనట్లే. కానీ.. రెండు దశాబ్దాల తర్వాత కూడా హైదరాబాద్ తనే అభివృద్ది చేశానని చెప్పుకుంటూటారు ఆయన! విభజన తరువాత 2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. ఐటీలో హైదరాబాద్ను తానే వృద్ధి చేశానని చెప్పిన మాటలే నిజమైతే 2014- 19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కు ఆ స్థాయిలో ఎందుకు ఐటీ పరిశ్రమలను తేలేకపోయారన్నది ప్రశ్న. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలను ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు? స్వోత్కర్ష చంద్రబాబుకు బాగా వచ్చు. మిగిలిన వారు సెల్ఫ్ డబ్బా అని విమర్శించినా పట్టించుకోరు. ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో ఎవరో ఒకరిని తీసుకు వస్తారు. మర్యాద కోసం వారు ఆయనను ఉద్దేశించి ఒక మాట పొగిడితే, దానిని తెలుగుదేశం మీడియాతో హోరెత్తేలా ప్రచారం చేయించుకోగలరు. ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడం కూడా అలాంటి వ్యూహంలో ఒక భాగమే!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు, రేవంత్ దాగుడు మూతలు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యులని ప్రతీతి. అప్పుడప్పుడూ ఈ ప్రచారాన్ని రేవంత్ తోసిపుచ్చుతున్నట్లు కనిపించినా.. కొన్ని సందర్భాల్లో అది నిజమే అన్నట్టుగానూ ఉంటుంది. విభజన సమస్యలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్తు బకాయిల వంటి ముఖ్యమైన అంశాలపై కాకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఏదో పెద్ద విపత్తు అయినట్లు ఇరువురూ ఢిల్లీలో సమావేశం కావడం ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, ఆ తరువాత వచ్చిన వార్తలు, నేతలు చేసిన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. రేవంత్ ఏదో మొహమాటానికి ఢిల్లీ వెళితే.. శిష్యుడిని మేనేజ్ చేద్దామనుకున్న చంద్రబాబు భంగపడ్డట్టుగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో బనకచర్ల ప్రస్తావనే రాలేదని రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసినా చంద్రబాబు దీనికి బదులేదీ ఇచ్చినట్టు లేదు. పైగా.. ఏదో కమిటికి ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు చంద్రబాబు తన కేబినెట్ మంత్రి రామానాయుడితో చెప్పించడం రేవంత్ను ఇబ్బందిపెట్టే విషయం అయిపోయింది. బదులుగా రేవంత్ మరోసారి తన వాదన వినిపించి ఆత్మరక్షణలో పడితే.. చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా రాయలసీమలో ఒక నీటి విడుదల కార్యక్రమానికి వెళ్లి కూడా బనకచర్ల ప్రస్తావన చేయకపోవడం ద్వారా డిఫెన్స్లో పడినట్లు విశ్లేషించుకోవాలి. తద్వారా చంద్రబాబు బనకచర్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించే ఆస్కారం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల గురించి చంద్రబాబు కొన్ని నెలలుగా విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నాయి. నిజానికి బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ చాలా కష్టమని అంతా భావిస్తున్నారు. అందులోను పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించడానికి చంద్రబాబు సర్కార్ అంగీకరించిందన్న వార్తల నేపథ్యంలో ఆ సందేహం మరింతగా బలపడుతోంది. దీనివల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బనకచర్ల డ్రామాకు తెరతీయగా, రేవంత్ పరోక్షంగా సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. సీఎంల భేటీలో బనకచర్ల ప్రాజెక్టు అజెండాపై తాము అంగీకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అనుమతే లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని కూడా అభిప్రాయపడింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో బనకచర్ల అజెండాలో ఉంటే రేవంత్ వెళతారా? లేదా? అన్న ప్రశ్న వచ్చింది. ఒకవేళ వెళ్లినా బనచర్ల అజెండా అయితే రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి బృందం బాయ్ కాట్ చేస్తుందని కూడా లీక్ ఇచ్చారు. ఎలాగైతేనేం కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ సమక్షంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పరం సత్కరించుకున్నారు. కేంద్ర మంత్రిని సన్మానించారు. బాగానే ఉంది. కాని బయటకు వచ్చి సమావేశం వివరాలను చెప్పిన తీరు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రస్తావన రాలేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును చేపడతామని ఏపీ చెబితే కదా.. తాము ఆపాలని చెప్పాల్సింది అని ఆయన అన్నారు. పైగా ఇదసలు అనధికార సమావేశమని అనడం ఆసక్తికరంగా ఉంది. కేంద్రం ఇలా అనధికార సమావేశాలు పెడుతుందా? కేంద్ర మంత్రి అంత పని లేకుండా ఉంటారా? ఈ మాత్రం దానికి హైదరాబాద్లోనో, అమరావతిలోనో భేటీ జరుపుకున్నా సరిపోతుంది కదా? అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే రెండు రాష్ట్రాల నీటి సమస్యలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సీఎంలు పరిష్కరించుకోలేని సమస్యలను అధికారులు తీర్చగలుగుతారా! అనే సందేహం వస్తుంది. అది వేరే విషయం. రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. బనకచర్లకు సంబంధించి సాంకేతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని కమిటీ వేయాలని నిర్ణయించినట్లు అన్నారు. అది నిజమా? కాదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేవంత్ చెప్పినదాని ప్రకారం అసలు బనకచర్ల ప్రస్తావనే రాలేదు. కేంద్ర జల్ శక్తి శాఖ పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కూడా బనకచర్ల గురించి ఏమీ తెలపలేదు. దాంతో చంద్రబాబు బృందం ఇన్నాళ్లు చేసిన హడావుడంతా ఒట్టిదేనా అన్న విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్లో రేవంత్ చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉందన్న ప్రశ్నను బీఆర్ఎస్ వేస్తోంది. సీఎంల భేటీ అజెండాలో బనకచర్ల అంశం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అటువంటప్పుడు అజెండాలోని అంశంపై ఎవరూ మాట్లాడలేదా?, తెలుగుదేశం మీడియా ఏపీ ఎడిషన్లలో చంద్రబాబు బనకచర్ల గురించి మాట్లాడారని, తెలంగాణ ఎడిషన్లలో ఆ ఊసే లేదన్నట్లుగా కథనాలు వచ్చాయి. ఒకవేళ చర్చ జరిగి ఉంటే, రేవంత్ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించినట్లవుతుంది. మాట్లాడకుండా ఉండి ఉంటే చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. మరి వీరిద్దరిలో ఎవరు నిజం చెప్పినట్లు? రేవంత్ ప్రకటనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి. అలాగే ఏపీ మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ స్పందించాలి. రేవంత్ రెండో రోజు కూడా దీనిపై కొంత స్పష్టత ఇచ్చినా, చంద్రబాబు నోరు మెదపలేదు. తనకు అనుకూలంగా ఉంటే చంద్రబాబు ఈపాటికి ప్రచారంతో హోరెత్తించే వారు. కాని ఆయన అలా చేయకపోవడం, రాయలసీమ టూర్లో కూడా ప్రస్తావించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాచ్ ఫిక్సింగ్ ఉందన్న అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. దానికి ఇప్పుడు బీజేపీ కూడా తోడైనట్లు అనిపిస్తుంది. కేంద్రమైనా వాస్తవం ఏమిటో వెల్లడిస్తుందా? లేదా? రేవంత్, నిమ్మలతోపాటు కేంద్రం కూడా ఒకే తరహా ప్రకటన చేసి ఉంటే ఈ గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. అలా కాకుండా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు స్టేట్మెంట్లు ఇవ్వడంతో వారికే తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇక ఇద్దరు సీఎంలు కూర్చుని అంగీకరించినట్లు చెబుతున్న టెలిమెట్రీ ఏర్పాటు, హైదరాబాద్లో గోదావరి బోర్డు, విజయవాడలో కృష్ణా బోర్డు ఉండాలన్న నిర్ణయం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులకు ఏపీ అంగీకారం వంటివే ప్రధాన చర్చాంశాలై ఉంటే మాత్రం ఇది కాలక్షేపపు సమావేశమే అవుతుందని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నవే. కాగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లు ఉండాలని, కాని చంద్రబాబు ప్రభుత్వం 41.15 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించిందని అంటున్నారు. ఈ నీటి మట్టానికి పరిమితమైతే బనకచర్ల ప్రాజెక్టుకు నీరు ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. దీనికి కూడా చంద్రబాబు ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కాని అన్నిటికి దబాయించడమే పద్దతిగా పెట్టుకున్న చంద్రబాబు టీమ్ వీటిపై ఎంతవరకు వాస్తవాలు వెల్లడిస్తుందన్నది సందేహమే. ఏతావాతా చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టి మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఆలపించినట్లు టీడీపీ మీడియాలో రాయించుకున్నారా? అన్న భావన కలుగుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కుక్కలకూ ఓ క్రూయిజ్.. వీఐపీ రేంజ్ లగ్జరీ!
ప్రస్తుతం ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలలో క్రూయిజ్ టూరిజం ట్రెండింగ్ నడుస్తోంది. విశాఖపట్నం నుంచి మద్రాస్ అండమాన్ తదితర ప్రాంతాలకు కార్డాలియా అనే లగ్జరీ క్రూయిజ్ నౌక తిరుగుతోంది. దీనికోసం ఇప్పటికే పర్యాటకులు సముద్ర ప్రేమికులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సకల సౌకర్యాలతో కూడిన స్పా, బార్, లగ్జరీ రెస్టారెంట్లు.. రకరకాల రుచులు.. క్యాసినోలు.. వినోదం.. పబ్.. డ్యాన్సులు వంటి కార్యక్రమాలతో అలరించే ఈ కార్డియాలో టికెట్లు కోసం యమగిరాకీ ఉంది. ఒకరోజు ప్రయాణానికి దాదాపు పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సంపన్నులు తమ కుటుంబాలతో.. స్నేహితుల బృందాలు.. లవర్స్ కూడా ఇందులో వెళ్లడానికి ఆ అనుభూతిని పదిలపరచుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.ఇందులో వింత ఏమీ లేదు.. మనుషులు లగ్జరీ క్రూజ్లో వెళ్లడంలో వింత.. విడ్డూరం ఏముంది. అమెరికాలో ఓ నౌకాయన సంస్థ కేవలం శునకాల కోసం ప్రత్యేక ట్రిప్ వేస్తోంది. ఇందులో దాదాపు 250 శునకాలతో పాటు వాటి యజమానులు మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ క్రూజ్లో జాగిలాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు సౌకర్యాలు లగ్జరీ సదుపాయాలు కల్పించారుశునకాల వైభోగం చూతము రారండి..నీలి సముద్రంలో పాల నురుగును తలపించే కెరటాలు అలా అలా వింజామరలు ఊపుతుండగా అత్యాధునికమైన క్రూయిజ్ సముద్రంలో వయ్యారంగా కదులుతూ ముందుకు సాగుతుంది. వెచ్చని సూర్యకిరణాలు ఆ క్రూయిజ్ మీద పడి మెరుస్తుండగా నవంబర్ 2025లో ఫ్లోరిడాలోని పోర్ట్ టాంపా బే నుంచి బయలుదేరే ప్రపంచ తొలి లగ్జరీ డాగ్ క్రూయిజ్ కరేబియన్ సముద్రంలో ముందుకు సాగుతుంది. ఇది కేవలం పెంపుడు జంతువులకు అనుకూలమైన సముద్రయానం మాత్రమే కాకుండా మీ మిత్రులకు అణువణువూ ఆనందాన్ని నింపే ప్రయాణం అవుతుంది. మార్గరిటావిల్లే అట్ సీ, క్రూయిజ్ టేల్స్, ఎక్స్పీడియా క్రూయిజ్ వెస్ట్ ఒర్లాండో కలిసి ఈ 6-రోజుల కరేబియన్ సాహసయాత్రను మీ కుక్క పిల్లల కోసం స్వర్గధామంగా రూపొందించారు. కేవలం 250 అదృష్టవంతులైన కుక్కలు మాత్రమే ఈ యాత్రకు పోయే చాన్స్ దక్కించుకుంటాయి.Say hello to Max, the best boy of the sea and land! 🐕Prince Eric’s loyal pup with his big heart and even bigger enthusiasm, Max is here to spread joy, greet new friends, and maybe even chase a seagull or two. 🐾💨 pic.twitter.com/JwMYb54Eya— Disney Magic Kingdoms (@DisneyMKingdoms) July 17, 2025ప్రత్యేక ఆకర్షణలు:కుక్కలకోసం ప్రత్యేకంగా పర్సనలైజ్డ్ బట్లర్లుప్రైవేట్ బాల్కనీ రిలీఫ్ జోన్లుఆన్బోర్డ్ గ్రూమింగ్, జలక్రీడలు.. మసాజ్ సెంటర్లు.. ప్లే స్టేషన్లుఫ్యాన్సీ డ్రస్ పోటీలుకుక్కల స్పా ట్రీట్మెంట్లు, గేమ్స్, ట్రైనింగ్ ఈవెంట్లుమరి కుక్కపిల్లలతో వచ్చే యజమానులకు ఏం ఉండవా అంటే ఎందుకు ఉండవు.. చాలా ఉంటాయి. వారికోసం 13 లాంజ్లు, 12 రెస్టారెంట్లు.. డైనింగ్ హాళ్లు, మూడు స్విమ్మింగ్ పూల్స్, అలరించే స్పా, క్యాసినో ఇవన్నీ వాటి యజమానులకోసం సిద్ధం చేస్తున్నారు.ఈ టూరుకు వెళ్ళే కుక్కలకు రూల్స్ ఇవీ..ప్రతి కుక్కకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించి ఉండాలివాటి ప్రవర్తన సరిగా ఉందన్న సర్టిఫికెట్ కూడా ఉండాలిప్రీ-రిజిస్ట్రేషన్ ఇప్పటికే మొదలైందిసీట్స్ తక్కువ, డిమాండ్ ఎక్కువ.. ముందుగానే బుక్ చేసుకోండి!మీ కుక్కలతోపాటు మీరు క్రూయిజ్లో విహరించండి.. సముద్రమంత ఆనందాన్ని సొంతం చేసుకోండి.-సిమ్మాదిరప్పన్న -
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదా జగనూ..!
ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని చంద్రబాబుకు సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే,ఇప్పుడు నువ్వు నేర్పించినావు కదా... తండ్రికి మించిన తనయుడువు అయితివి అబ్బా.. ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. అంటూ కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అక్కడే కాసేపు నిలబడి ఆ ఫ్లెక్సీలోని పాయింట్లన్నీ ఆమూలాగ్రం చదివేలా చేస్తోంది.. ఆ తండ్రీకొడుకులిద్దరూ కళ్లు మూసుకుని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా!. నిత్యం నిన్ను అవమానించే వాళ్ళు, నీ ఇమేజ్కు డామేజ్ చేసే వాళ్లు కూడా.. కిక్కురు మనకుండా నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగన్..!! అంటూ అందులో రాసి ఉంది.. .. వాస్తవానికి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్కు పేదలంటే ఇష్టం ఉండదు!. అదొక అసహ్యమనే భావనలో ఉంటారు వాళ్లు. సర్కారు బడుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులు, పథకాలు, సంక్షేమం వగైరా అంటే వారికి అసలు గిట్టదు. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు అని.. ప్రజలతో మమేకం కాకుండా పరిపాలన చేసిన అది నిజమైన ప్రభుత్వం కాదు అని వైఎస్ జగన్ నిరూపించారు. ఐదేళ్ల పరిపాలనలో నిత్యం ఆయన ధ్యాస తపన ఆలోచన ప్రజల చుట్టూనే ఉండేది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేయాల్సిందే అని పట్టుబట్టిన ఆయన వాటి జాబితాను తన కార్యాలయ గోడలకు అతికించి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి అమలుకు ముందడుగు వేస్తూ ఉండేవారు. అయితే.. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా వైయస్ జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు తొలిసారిగా తల్లికి వందనం అంటూ ఓ పథకాన్ని ఇచ్చారు. వాస్తవానికి అది గతంలో జగన్ ‘అమ్మ ఒడి’ పేరిట ఇచ్చిన పథకమే. కానీ దాన్ని తామే కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం. సబ్జెక్ట్ టీచర్లు ఇలా రకరకాల కాన్సెప్ట్లతో ప్రభుత్వ విద్య విధానంలో నాణ్యత పెంచారు. ఇప్పుడు అదే పాఠశాలల్లో చంద్రబాబు లోకేష్ ఫోటోలు దిగి పిల్లలతో ముచ్చట్లు చెబుతూ అదంతా తమ ఘనతగా పత్రికల్లో రాయించుకుంటున్నారు. ఇలా ఎన్నో అంశాలను సదర్ ఫ్లెక్సీలో పేర్కొన్న రహస్య అభిమాని.. ‘‘ఎంత పని చేసావు జగన్’’ అంటూ జగన్ అభినందిస్తూనే చంద్రబాబు పడుతున్న తిప్పలను హాస్యపూరితంగా వివరించారు.నీ ఒత్తిడి భరించలేక పేద పిల్లలకు చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా తల్లికి వందనం ఇచ్చాడు. నువ్వు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పరిశ్రమలు ప్రాజెక్టులు పథకాలనే చంద్రబాబు లోకేష్ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నువ్వు గతంలో ప్రజలతో మమేకం అయినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు కోరికన్నా ముందు నిద్రలేచి టీ స్టాళ్ళు.. చేపల బజార్లు.. సందులు.. గొందుల్లో తిరుగుతూ జనంతో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ఇవన్నీ గతంలో నువ్వు చేసినవి కాక మరేమిటి జగనూ!. .. నీ పర్యటనలకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని ఆపలేక చంద్రబాబు ఆఖరుకు తన కడుపు మంటను మంత్రుల మీదకు వెళ్ళగకుతున్నారు.. ఇది కూడా నువ్వే చేశావు జగనూ!. కూటమిలోని మూడు పార్టీలకు ఒకరంటే ఒకరికి పసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు పట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.. విడిపోతే ముగ్గురూ అస్సామే అనే పరిస్థితి తీసుకొచ్చావు జగనూ!. నువ్వు ఏ ఊరికి పర్యటనక పోతే అక్కడ ముందుగానే పరిస్థితులు చక్కపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అక్కడి సమస్యలపై ఉరుకున పరుగున స్పందించే ప్రయత్నమూ చేస్తున్నారు.. ఎంత పని చేసావు జగనూ!.నువ్వు ఓడిపోయినా.. రాష్ట్రంలో మీ పరిపాలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఈ తండ్రి కొడుకులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావ్.. ఎంత పని చేశావు జగనూ! అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది.::సిమ్మాదిరప్పన్న -
పవన్ @పెద్దమ్మ భాషా పితామహ..
రామాయణాన్ని వాల్మీకి రాశారు.. వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కవిత్రయం అనువదించింది. మను చరిత్రను అల్లసాని పెద్దన రాశారు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.. అవన్నీ అందరికీ తెలుసు కానీ పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు చెప్పండి.. షాక్ అయ్యారా.. లేదు మళ్ళీ చదవండి.. పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు?.అదేంది మాతృభాషను అమ్మ భాష అంటారు అది అందరికీ తెలిసిందే. కానీ ఈ పెద్దమ్మ భాష ఏంది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.. ఈరోజే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపెట్టారు.. ఆయన ఎవరితో పొత్తులో ఉంటే ఆ పాట పాడుతారు ఆ గుమ్మం ముందు ఆ ఆట ఆడతారు. ఆయన ఎవరికి తాబేదారుగా ఉంటే ఆ పార్టీ భజన గీతాలు నేరుస్తారు. గతంలో నన్ను మా అమ్మను ఎన్ని రకాలుగా అవమానించారు అంటూ తెలుగుదేశం మీద చిందులు తొక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఇంకో 20 ఏళ్లు చంద్రబాబుకు పాలేరుగా ఉండడానికి సిద్ధం అని ప్రకటించారు.పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీకి మనం తలవంచుతామా అంటూ అటూ ఇటూ తల ఎగరేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుమ్మం ముందు బిస్కెట్లు ఏరుకుంటున్నారు. ఈ ఢిల్లీ వాళ్లకి అహంకారం ఎక్కువ సౌత్ ఇండియా వాళ్ళు అంటేనే వాళ్లకు లెక్కలేదు.. అలాంటి వారితో మనకు పొత్తా.. చెప్పండి చెప్పండి అంటూ ఊగిపోయిన పవన్ మళ్ళీ బీజేపీ పంచన చేరారు. ఉత్తర భారతదేశ పార్టీలు నాయకులకు దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు.. వాళ్లు తమ భాషను నాగరికతను సంస్కృతిని మనపై రుద్దుతున్నారు అంటూ చిందులు తొక్కిన పవన్ తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి ఆయన సరికొత్త భాష్యం చెబుతున్నారు. మాతృభాష తల్లి అయితే హిందీ పెద్దమ్మ భాష అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు. తమిళులకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చ లేవదీశారు. తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్లో కూడా తమిళంలోనే మాట్లాడతారు. కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు. ఆంధ్రాలో కూడా హిందీకి ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయనకు హిందీ పట్ల ప్రేమ పెరిగిందో తన రాజకీయ అవసరాల కోసం ఇలా నటిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ. దీని పెద్దమ్మ భాష అంటూ నెత్తికెత్తుకున్నారు. వాస్తవానికి ఆయన సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని మోస్తూ ఆ ఎపిసోడ్ గడిపేస్తూ ఉంటారు. ఆమధ్య కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం చేస్తున్న నౌకను చూసి సీజ్ ది షిప్ అన్నారు. ఆ తరువాత ఆ అంశాన్ని వదిలేశారు. ఇప్పుడు యథావిధిగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. తిరుమల ప్రసాదంలో కొవ్వుంది అన్నారు.. నాల్రోజులు కాషాయం బట్టలు వేసుకుని హడావుడి చేశారు.. దాన్ని వదిలేశారు. వారాహి డిక్లరేషన్.. సనాతన ధర్మం అన్నారు.. దాన్ని పక్కనబెట్టారు. ఇప్పుడు తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని అంటున్నారు.. మరి ఈ అంశాన్ని ఎప్పుడు వదిలేస్తారో చూడాలి.. సీజన్లను బట్టి ప్రాధాన్యాలు మార్చుకునే పవన్ కళ్యాణ్ ఊసరవెల్లికి సైతం కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు అని ప్రజలు విస్తుపోతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
జగన్ చరిష్మాను మరింత పెంచుతున్న కూటమి సర్కారు!
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!.. ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది. పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అయ్యవారిని చేయబోతే కోతి అయిందట!.. తేడా కొట్టిన బాబు స్కెచ్!
పెద్ద వీరుడొచ్చాడు.. అలాంటివాడితో పిల్లాడి బొడ్డు కోయిస్తే పెద్దయ్యాక వీడు కూడా వీరుడవుతాడని భావించిన తల్లిదండ్రులు వేలాదిమంది సమక్షంలో బిడ్డకు బొడ్డుకోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారట. ఆ మహావీరుడు జనాన్ని చూసి కత్తిని రకరకాలుగా తిప్పి.. విన్యాసాలు చేసి ఇదిగో చూడండి బొడ్డు కోస్తున్నాను అని చెప్పి ఇంకేదో కోసేశాడట.. దీంతో తల్లిదండ్రులు అయ్యో దేవుడా ఇదేందీ ఇలా జరిగిందని లోలోన కుమిలిపోతున్నారట.వాస్తవానికి వైఎస్ జగన్ పర్యటనలను ఆపడానికి.. జనం నుంచి ఆయన్ను దూరం చేయడానికి కూటమి నాయకులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఆయన పర్యటనలను నిర్వీర్యం చేయడం.. ప్రజల్లో జగనుకు ఆదరణ తగ్గిందని చెప్పడం కోసం ఎన్నో పథకాలు వేస్తున్నారు. అయినా సరే మొన్నటి గుంటూరు పర్యటన.. అంతకుముందు కడప ఇలా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వేలాదిగా తరలివెళ్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని మామిడి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ జగన్ మీద ప్రభుత్వం బోలెడు ఆంక్షలు విధించింది.కేవలం 500 మందికి మించకుండా కార్యకర్తలు ఆయన వెంట ఉండాలని రూల్ తెచ్చింది. అంతేకాకుండా ఆ పర్యటనకు రకరకాలుగా కండీషన్లు పెట్టారు.. కండీషన్లు పెడితే జనానికి ఎక్కడో కాలుతుంది.. సరిగ్గా జగన్ పర్యటన విషయంలో కూడా అదే జరిగింది. బంగారుపాళ్యం పర్యటనను భగ్నం చేసేందుకు మూడు నాలుగు జిల్లాల ఎస్పీలు.. 9 మంది అదనపు ఎస్పీలు అంతకు డబుల్ డీఎస్పీలు.. వందలాదిమంది ఎస్సైలు కానిస్టేబుళ్లు కలిసి మొత్తం ఓ రెండు వేల మంది పోలీసులను జగన్ పర్యటనకు మోహరించారు. అదేంది 500 మందికి మించకుండా జనాన్ని రమ్మన్నారు కదా మరి మీరేందుకు రెండు వేల మంది వచ్చారు అని ప్రజలు అడిగే ప్రశ్నలకు పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి కూడా సమాధానం కరువైంది. ఇక పోలీసుల నిర్బంధం పెరిగిన కొద్దీ ప్రజల్లో కసి పెరిగింది. ఎవరో ఎస్సై వచ్చి మమ్మల్ని నియంత్రించడం ఏందీ.. మేము సినిమాకు వెళ్లాలా.. జాతరకు వెళ్లాలా.. జగన్ పర్యటనకు వెళ్లాలా అనేది మా ఇష్టం. మధ్యలో వీళ్ళ జోకుడు ఏమిటన్న ఫీల్ జనంలో మొదలైంది. ఒక్క చినుకుగా ప్రారంభమైన ఈ ఆత్మాభిమానం ఉప్పెనలా మారింది. గ్రామాలు దండుకట్టాయి.. పల్లెలు పరవశించాయి.. ఇంకేముంది మళ్ళీ వింటేజ్ జగన్ ఆవిష్కృతమయ్యారు.ఎక్కడికక్కడ వందలు వేలల్లో ప్రజలు చెట్టూ పుట్టా వాగు వంక దాటుకుని జగన్ వెంట నడిచారు.. మొత్తానికి నిర్బంధం ఎంత ఎక్కువైతే ప్రతిఘటన అంతకు వందింతలు ఉంటుందని ప్రజలు నిరూపించారు. పల్లెల్లో పోలీసుల రుబాబు పెరిగేసరికి అదే మొత్తంలో జగన్ పట్ల అభిమానం ఆదరణ రెట్టింపు అయ్యింది. దీంతో అయ్యవారి బొమ్మ గీయబోతే కోతి బొమ్మ వచ్చిందన్నట్లుగా జగన్ ప్రోగ్రాములు భగ్నం చేయబోగా అది కాస్తా ఎదురుతన్నింది. అన్నిటికి మించి జనాన్ని జగన్ నుంచి విడదీయడం అంత వీజీ కాదని పోలీసులకు ప్రభుత్వానికి అర్థమైంది. మొత్తానికి పోలీసులతోనే జగన్ పర్యటనలు సక్సెస్ అవుతున్నాయి అని ప్రజలు అర్థం చేసుకున్నారు . -సిమ్మాదిరప్పన్న -
బనకచర్ల.. గురు శిష్యుల డ్రామా?
రాజకీయాల్లో కొందరు గాల్లో కత్తులు తిప్పుతూంటారు. అదే యుద్ధమని జనాన్ని నమ్మించే ప్రయత్నమూ జరుగుతూంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల్లో హడావుడి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి గత ఏడాది అధికారంలోకి వచ్చింది మొదలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సుమారు రూ.85 వేల కోట్లతో గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని ప్రతిపాదించారు. కేంద్రం కూడా నిధుల రూపంలో సాయం చేయాలని కోరారు. అయితే.. పలు లిఫ్ట్లు, రిజర్వాయర్లు, సొరంగాలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టు అంత తేలికగా అయ్యేది కాదన్నది అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వమేమో సాయం సంగతి దేవుడెరుగు... పంపిన ప్రతిపాదననే తిప్పి పంపింది. జలసంఘం ఆమోదం తరువాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని మాట్లాడమని సూచించింది. ఇదంతా ఒక పార్శ్వమైతే.. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఇంకో రకమైన రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఈ అంవాన్ని పెద్ద వివాదంలా మార్చి వాదోపవాదాలు సాగిస్తున్నాయి. రెండు పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూండటం గమనార్హం. కానీ... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను అంగీకరించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేస్తూనే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు. వీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే, దీనికి పోటీగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురు శిష్యులని, అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని హరీష్ అంటున్నారు. చంద్రబాబు, రేవంత్లు హైదరాబాద్లో భేటీ అయినప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చేశారని హరీష్రావు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చంద్రబాబు వద్ద బజ్జీలు తిని మరీ ఈ ప్రాజెక్టుకు ఓకే చేసి వచ్చారని అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నీటి వాటాలలో నష్టం జరిగిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్తో సమావేశమైనప్పుడు ఇందుకు బీజం పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్, జగన్లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక భేటీ జరిగిన మాట నిజమే. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి జూరాలకు తరలించడానికి కేసీఆర్ ప్రతిపాదించగా, దానిని పరిశీలించడానికి జగన్ ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం ఏర్పడడంతో అది ముందుకు సాగలేదు. కేసీఆర్, జగన్లు అయినా, చంద్రబాబు, రేవంత్ అయినా సమావేశమైతే ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తదుపరి చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్లో చేరారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి, పిమ్మట పీసీసీ అధ్యక్షుడై, ఎన్నికలలో గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు.అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా తెలంగాణ టీడీపీ కూడా సహకరించడం బహిరంగ రహస్యమే.చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్తో కూడా స్నేహం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాలలో ఉన్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్లు కలిసి కూర్చుని విభజన సమస్యలను చర్చించి పరిష్కారం కనుక్కుని ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.ఏడువేల కోట్ల విద్యుత్ బకాయిలు రావల్సి ఉంది. హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో వాటా తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించి ఉండాల్సింది. తనను చంద్రబాబు శిష్యుడని చెప్పడాన్ని రేవంత్ అంత ఇష్టపడక పోయినట్లు కనిపిస్తుంటారు. అయినా వారిద్దరి మధ్య సంబంధ, బాంధవ్యాలు బాగానే ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ఉదాసీనంగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గోదావరి జలాలలో 1500 టీఎంసీల నీటిని కేటాయించిన తర్వాత ఏపీ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం వాదనగా ఉంది. అయితే తాము వరద జలాలను మాత్రమే వాడుకోదలిచామని, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ తెలంగాణ అడ్డుపడింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో కూడా తెలంగాణ గట్టిగా అడ్డుపడుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ కోణంలో చూస్తే వారికి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏపీకి ఎంతవరకు సహకరిస్తుందన్నది సందేహమే. ఇక్కడ విశేషం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏమీ లేదని, తెలుగుదేశానికి మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు ప్రత్యేకంగా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. అంతేకాక 18.5 కిలోమీటర్ల వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల తవ్వకాలు రెండున్నర దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయని, అయినా అవి ఒక కొలిక్కి రాలేదని, అలాంటిది ఇప్పుడు ఏకంగా నల్లమల అడవులలో, కొండల్లో 26.5 కీలోమీటర్ల మేర సొరంగం తవ్వకం ఆరంభిస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. తాను ఏమైనా ప్రతిపాదిస్తే, ఎవరూ దాన్ని వ్యతిరేకించరాదని భావిస్తారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే అభివృద్ది వ్యతిరేకులంటూ వారిపై తట్టెడు బురద వేసి ప్రజల మైండ్ ఖరాబు చేస్తుంటారు. ఇందుకు తనకు మద్దతు ఇచ్చే మీడియాను పూర్తిగా వాడుకుంటారు. అందువల్ల ఏపీలో తెలుగుదేశం మినహా ఇతర రాజకీయ పార్టీలేవి ఈ ప్రాజెక్టుపై పెద్దగా స్పందించడం లేదు. ఇదంతా ఏపీలోని కూటమి ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా అని ఆయా రాజకీయ నేతలు భావిస్తున్నారు. సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్ కలిసి ఈ డ్రామా నడుపుతున్నారని, చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు పూర్తిచేసే ఉద్దేశం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కూడా ఇదే తరహా ప్రాజెక్టుకు డీపీఆర్ పంపించింది. ప్రభుత్వం మారడంతో బనకచర్ల ప్రాజెక్టు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం అంత తేలిక కాదన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే ఏకంగా రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుంది. అది అక్కడితో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం దీనికి నిధులు కేటాయించితే పెద్ద విశేషమే. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. అయినా కేసీఆర్ రుణాలు తెచ్చి ఆ ప్రాజెక్టును నిర్మించారు. కాని అందులో ఒక భాగం దెబ్బతినడం కేసీఆర్ ప్రభుత్వానికి ఇరకాటమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వాయిదాలు సరిగా చెల్లించలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచర్లకు రుణాలు వచ్చే అవకాశం ఎంతన్నది చెప్పలేం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినా, తెలంగాణకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. అయినా రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలు సాగిస్తూ సెంటిమెంట్ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయి. మరో వైపు ఏపీ ప్రభుత్వం తామేదో పెద్ద ప్రాజెక్టును చేపడితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం తగ్గించిన అంశాన్ని పక్కన బెట్టి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు భారీ ప్రాజెక్టులపై అంత విశ్వాసం ఉండేది కాదు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తించి, ఇప్పుడు ఆయన కూడా ఆ రాగం ఆలపిస్తున్నారు. అయితే ఆ పాట పాడుతున్నది చిత్తశుద్దితోనా, రాజకీయం కోసమా అన్నదానిపై ఎవరికి కావల్సిన విశ్లేషణ వారు చేసుకోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జన్మ సార్థకత వైఎస్కే చెల్లింది!
‘పుట్టిన రోజు పండగే ప్రతి ఒక్కరికి.. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే’’ పాత సినిమా పాట ఇది. కాకపోతే... దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అతికినట్లు సరిపోతుంది ఇది. వచ్చిన అవకాశాలను ప్రజల కోసం వినియోగించిన తీరు గమనిస్తే పుట్టింది ఎందుకో తెలిసిన వ్యక్తులలో వైఎస్సార్ అగ్రభాగాన ఉంటారు. సంపన్న కుటుంబంలో జన్మించినా సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు. రూపాయి డాక్టర్గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు. రాజకీయాలలోనూ ఆయన తన విధానాలను వదులుకోలేదు. ఎన్నో ఎగుడు దిగుడులు చూశారు. సవాళ్లు ఎదుర్కున్నారు. అయినా ఓటమి ఎరుగని నేతగా రికార్డు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు... విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఈ రికార్డు దక్కింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్కు మాత్రమే. ఎమ్మెల్యేగా పోటీచేసినా, ఎంపీగా ఎన్నికల బరిలో దిగినా ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 1996లో కడప లోక్సభ సీటు నుంచి పోటీచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ గెలవడం ఒక సంచలనం. 1999లోనే ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కాని అప్పట్లో టీడీపీ బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం, కార్గిల్ యుద్ద ప్రభావం, ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా చేశాయి. ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్కు వైఎస్ నాయకత్వం వహించారు. అప్పట్లోనూ చంద్రబాబు నాయుడు తన సహజశైలిలో వైఎస్ వ్యక్తిత్వ హననం నానా ప్రయత్నాలూ చేశారు. బ్యానర్లు కట్టారని, ఎన్నికల నిబంధనలు సరిగా పాటించలేదని, ర్యాలీలు తీశారన్న చిన్న చిన్న కారణాలపై కూడా కేసులు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేసేవారు. వాటిని బూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగేది. ఇందుకు టీడీపీ మీడియా తోడు ఉండనే ఉంది.1999లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా వైఎస్ దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. తదుపరి పాదయాత్రను ప్లాన్ చేసుకుని జనంలోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వ్యతిరేకించాయి. సొంతంగా ఎదగడానికి యత్నిస్తున్నారని, భవిష్యత్తులో సోనియా గాంధీని కూడా ధిక్కరిస్తారని పితూరీలు చెప్పేవారు. అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తూండేది. దాంతో వైఎస్ కొన్నిసార్లు ఇబ్బందులు పడేవారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీని అక్కడకు తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు కాని ఎందువల్లో ఆమె రాలేదు. అయినా వైఎస్ తన పాదయాత్రను వదలి పెట్టలేదు. 2003లో చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ దాడి చేసినప్పుడు వైఎస్ తిరుపతి వెళ్లి పరామర్శ చేసి దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు. కాని వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూశారు. పాదయాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన ఆదరణను నిలబెట్టుకునేందుకు వైఎస్ యత్నించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను సైతం కలుపుకుని వెళ్లడానికి సిద్దపడ్డారు. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను ,గతిని మార్చేశారని చెప్పాలి. 2004లో కాంగ్రెస్ను విజయపథంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు. అయినా ఆయన తొణకలేదు. చివరికి వైఎస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకుని, అధిష్టానం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉచిత విద్యుత్పై తొలి సంతకం మొదలు అనేక హామీల అమలుకు కృషి చేశారు. అంతకుముందు ఒకసారి ఎంపీల సమావేశంలోకాని, ఇతరత్రాకాని నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్ర హీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖరరెడ్డి హెచ్చరించే వారు. వైఎస్కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాని 2004 వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద పూలు పెట్టివచ్చారు. ఆ సంగతులు అన్నిటిని గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు. వైఎస్ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా హంద్రీ నీవా, గాలేరు-నగరి, గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణలో ఎల్లంపల్లి, కల్వకర్తి, బీమా, ప్రాణహిత-చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోస్తాంద్రలో పోలవరం, పులిచింతల, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలైవని ఉన్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు, నిరసనలు ఎదుర్కున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది. అయినా ఆయన ఆగలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కావల్సిన అనుమతులు తేవడంలో వైఎస్ చూపిన శ్రద్ద నిరుపమానం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే ఆ ఘనత ఆయనదే. పులిచింతల నిర్మాణం దశాబ్దాల తరబడి స్తంభించిపోతే వైఎస్సార్ దానిని చేసి చూపించారు. దానిని వ్యతిరేకించే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఒప్పించి మరీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. ఒక నేత ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే, వైఎస్ మాత్రం మనం మొదలుపెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు. ఈ రోజు విభజిత ఆంధ్ర ఈ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పదనమని అంగీకరించక తప్పదు. ఇది మాబోటివాళ్లం ఇప్పుడు చెప్పడం లేదు. 2009 నుంచే చెబుతున్నాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం హైదరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ ప్రచారం లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు ఒక రూపం తెచ్చారు. అదంతా ఒక ఆధునిక నగరంగా మారిందంటే బీపీ ఆచార్య అనే ఐఎఎస్ అధికారిని నియోగించి వైఎస్ చేసిన కృషే అని చాలామందికి తెలియక పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రచారం చేసుకోలేకపోయింది. టీడీపీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మూడువంతులు పూర్తిచేశారు. హైదరాబాద్ దశ, దిశను మార్చిన గొప్ప ప్రాజెక్టు అది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణమే కాకుండా, అక్కడకు వెళ్లడానికి వీలుగా ఎక్స్ప్రెస్ వంతెనను 13 కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న విజన్ను ప్రజలకు తెలియ చేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన నేతగా, విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టి పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్రపుటలలోకి ఎక్కారు. 2009లో ఆయనను ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన టీడీపీ, టీఆర్ఎస్(నేటి బీఆర్ఎస్), సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూటమి కట్టినా 2009లో వైఎస్ను ఓడించలేకపోయాయి. మొత్తం బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా వైఎస్ కారణభూతులయ్యారు. అయినా ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. వైఎస్ జీవించి ఉన్నా, వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ను సీఎంగా చేసినా ఉమ్మడి ఏపీ భవిష్యత్తు మరోలా ఉండేదని చాలామంది నమ్ముతారు. ఏది ఏమైనా వైఎస్ సీఎంగా చేసింది ఐదేళ్ల మూడునెలల కాలమే అయినా, ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకుని గొప్పనేతగా ప్రజల మదిలో నిలిచిపోయారు.వైఎస్ రాజశేఖరరెడ్డికి జయంతి సందర్భంగా ఇదే నివాళి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ మాటల మతలబు ఏమిటి పవన్?
జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లూ మామూలే కానీ.. పవన్ కల్యాణ్తోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ల ఈ మాటల వెనుక ఏదో నిగూఢ అర్థం ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. 2024 నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గెలిచిన తీరుపై ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి. టీడీపీ ఆర్భాటంగా ప్రకటించి అమలు చేయని సూపర్ సిక్స్ వాగ్ధానాల ప్రభావం కొంత ఉంటే ఉండవచ్చునేమో కానీ.. వైఎస్సార్సీపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు ఈవీఎంల మహిమ వల్లేనని సామాన్యులతోపాటు మేధావులూ బహిరంగంగానే ప్రకటించారు. కూటమి నేతల మాటలిప్పుడు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఏడాది కూటమి పాలనలో జరిగిన పరిణామాలు, కూటమి నేతల దాష్టీకాలు, పోలీసులను అడ్డంపెట్టుకుని తమను వేధిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు చాలా ఆగ్రహంతో ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కొన్నేళ్లు ఓపిక పడితే మళ్లీ అధికారం మనదే అని భరోసా కూడా ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే జగన్కు రాష్ట్రం నలుమూలల్లోనూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరకమైన పట్టుదలతో ఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఎక్కడ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడో అన్న భయం పట్టుకుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ మధ్యే ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మళ్లీ గెలిచే పరిస్థితిలోకి వచ్చిందన్న అర్థంతో మాట్లాడారు. అలాగే జగన్ను ఒక భూతంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలూ చేశారు. మంత్రి లోకేశ్ కూడా పలు సందర్భాల్లో జగన్ మళ్లీ వస్తే ఏమిటని పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారని.. చెబతూండటం ప్రస్తావనార్హం. ఈ వ్యాఖ్యలన్నింటి ద్వారా స్పష్టమయ్యే విషయం ఒక్కటే.. ఓటమి ఎదురుదెబ్బ నుంచి జగన్ బాగా పుంజుకున్నట్లే అని! ప్రజాదరణ బాగా పెరిగిందీ అని! దీనికి కారణం ఏమిటో కూడా కూటమి నేతలకు బాగానే తెలుసు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతూండటంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. కూటమి నేతలు మాత్రం ఈ మాట చెప్పకుండా, జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అప్రమత్తంగా ఉంటామని అంటున్రాను. తాజాగా పవన్ కల్యాణ్ కూడా సరిగ్గా ఆ దారిలోనే మార్కాపురం సభలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ వారు మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారో తామూ చూస్తామని అన్నారు. అధికారంలో ఉన్న వారు తాము తిరిగి అధికారంలోకి వచ్చేలా పాలన చేస్తున్నామని, మానిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్నామని చెప్పగలగాలి. ఏడాది సమయంలో ఏమి సాధించారో చెప్పాలి. కాని ఈ ముగ్గురు నేతలు పెద్దగా వాటి జోలికి వెళ్లడం లేదు. పవన్ కూడా జగన్ టైమ్ లో అభివృద్ది జరగలేదని విమర్శించారు. పవన్కు నిజంగా అభివృద్దిపై శ్రద్ద ఉంటే మార్కాపురంలో జగన్ హయాంలో చేపట్టిన వైద్యకళాశాల భవనాలను చూసి ఉండాల్సింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భవనాల నిర్మాణం ఎందుకు ఆగిందో చెప్పి ఉండాలి.అంతేకాదు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాది కాలంగా ఎందుకు పూర్తి చేయలేదు? నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? వీటిపై మాట్లాడకుండా, వైఎస్సార్సీపీ వారు అనని మాటలను వారికి అంటకట్టి సినిమా డైలాగులు చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? పవన్ తరచు సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారట. కొత్త సినిమా ప్రచారం గురించి అప్పడప్పుడు కొన్ని సభలు పెట్టుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కుత్తుకలు కోస్తామని, గూండాగిరి చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పవన్ చెబుతున్నారు. అబద్దాలు చెప్పడంలో టీడీపీ రికార్డును దాటిపోవాలని పవన్ అనుకుంటే ఎవరం ఏమీ చేయలేం. ఈ ఏడాదిలో కూటమికి చెందిన వారు ఎన్ని దాడులు చేశారు? వైఎస్సార్సీపీ వారు ఎంతమంది హత్యలు, దాడులకు గురయ్యారు? తప్పుడు కేసులలో పెట్టి ఎందరిని అరెస్టు చేశారు? అన్నవి పవన్ కు తెలియదా! అయినా.. అధికారంలో ఉన్నప్పుడు అంతా హాపీ అనుకుంటూ పవన్ అనుకోవచ్చు. రాజకీయ విమర్శల వరకు ఓకే. కాని వైఎస్సార్సీపీ వారు అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామని అనడంలోనే అనుమానం కలుగుతుంది. బహుశా గత ఎన్నికలలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ ఈవీఎంలు తమని గట్టెక్కిస్తాయన్న ధీమానా? ఒక రకంగా ఇది పవన్ కల్యాణ్ బెదిరింపుగానే చూడాలి. రఫ్పా, రఫ్పా అనే డైలాగుకు వక్రభాష్యం చెబుతున్న పవన్ కల్యాణ్ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా దౌర్జన్య పూరితంగా మాట్లాడింది.. అభ్యంతరకరంగా మాట్లాడింది గుర్తు లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఇంతవరకు ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ సంవత్సరంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై పవన్ ఎన్నడైనా స్పందించారా? ఏమీ చేయక పోయినా, ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉన్నా గెలవగలమని వారు భావిస్తున్నారంటే ఈవీఎంల మానిప్యులేషన్ తమ చేతిలో ఉందన్న అభిప్రాయమే కారణమా?. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు ఈవీఎంల అక్రమాలు, ఓట్ల పోలింగ్లో జరిగిన అవకతవకలను ఆధార సహితంగా ఎన్నికల కమిషన్కు వివరించి వచ్చారు. వారి లెక్కల ప్రకారం పోలింగ్ శాతంలో తేడా వల్ల 87 శాసనసభ నియోజకవర్గాలలో గెలుపు, ఓటములను నిర్దేశితమయ్యాయి. పోలింగ్ ముగిసే టైమ్ కు ఉన్న ఓట్ల శాతం, తదుపరి నమోదైన ఓట్ల శాతానికి ఉన్న తేడా ఏకంగా 12.54 శాతం ఉన్న సంగతిని వారు తెలియ చేశారు. హిందుపూర్, రాయచోటి వంటి నియోజకవర్గాలలో ఓటింగ్ సరళి వ్యత్యాసాలను వివరించారు. అనూహ్యమైన రీతిలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ మార్పులు, ఎన్నికల అధికారులు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించకుండా దాటవేసి, దగ్దం చేసిన తీరు మొదలైనవి చూసిన వారందరికి ఏదో మోసం జరిగి ఉంటుందన్న భావన ఏర్పడింది. ఎక్స్ అధిపతి ఎలన్ మస్క వంటి వారు కూడా ఈవీఎంలను టాంపర్ చేయవచ్చని చెప్పడం కూడా గమనించాలి. ఎవరో ఎందుకు. టీడీపీ ఓటమి పాలైన ప్రతి సందర్భంలోను చంద్రబాబు నాయుడు ఈవీఎంలను తప్పుపట్టారు. వాటి ద్వారా మోసం చేయవచ్చని గతంలో ఆయన స్వయంగా ప్రదర్శనలు చేయించారు.ఇప్పుడు ఆయన మాట్లాడకపోతుండవచ్చు. అది వేరే సంగతి.ఒంగోలు లో వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని అప్పట్లో వైఎస్సార్సీపీలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు చేసిన ప్రయత్నాలను ఎన్నికల సంఘం, అధికారులు అంగీకరించకుండా డ్రామా నడపడం, వీవీప్యాట్ స్లిప్ లను పది, పదిహేను రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి పలు సందేహాలకు అవకాశం ఇచ్చాయి. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కూడా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించాయి. సీపీఎం నేత వి.శ్రీనివాసరావు కూడా ఏపీలో 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేశ్లతో పాటు, తాజాగా పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ఎలా గెలుస్తుందో తామూ చూస్తామంటూ చేసిన ప్రకటనలపై కూడా సందేహాలు కలుగుతాయి. ఈవీఓంల మహిమను తక్కువ అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే బాలెట్ పత్రాలనే వాడాలని వైఎస్సార్సీపీతో సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ఎన్నికల సంఘం అంగీకరించకపోతే ప్రజలలో ఈవీఎంలపై అనుమానాలు మరింతగా బలపడతాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు.. ఆన్సర్ ఉందా బాబూ?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎవరివల్ల చెడ్డ పేరు వస్తోంది? అధినేతల లోపాల వల్ల ఎమ్మెల్యేలకు డ్యామేజ్ అవుతోందా? లేక ఎమ్మెల్యేల అక్రమాలు, అలసత్వాలు ప్రభుత్వం పరువును దిగజారుస్తున్నాయా? రెండూ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే...ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కీలక మంత్రి లోకేశ్లు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేసిన భ్రమ కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆగ్రహం పెరిగేందుకు కారణమవుతున్నాయి.అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపివ్వడం మంచిదే. ప్రజల్లో తిరిగితే కదా వారి మనోభావాలు, ప్రభుత్వం పనితీరు, రెడ్బుక్ హడావుడి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదా? అన్నది తెలిసేది? విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వేధింపులు, అక్రమ అరెస్ట్, నిర్బంధాలతో సామాన్యులకు ఒరిగిందేమిటని కూడా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో తామోన్నో ఎన్నో విజయాలు సాధించేశామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అన్ని విషయాలు తెలిసినా ఆయన చెప్పినదానికి ఊ కొట్టడం తప్ప మరో గత్యంతరం ఉండదు. ముందుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకుని ఆ తర్వాత తొలి అడుగో, మలి అడుగో వేస్తే అదో పద్దతి కాని, అదేమీ లేకుండా తాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందని, లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఎమ్మెల్యేలవే అన్నట్లుగా మాట్లాడితే ఆశ్చర్యం పోవడం తప్ప వేరే ఏమి ఉంటుంది?. 👉ఏడాది కాలం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైనదే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం ఒక ఏడాదిలోనే నెరవేర్చిన హామీలెన్ని? తెచ్చిన సంస్కరణలు ఏమిటి? ప్రజలకు ఎలా ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలు అందించింది అందరికి తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసి ప్రజలను రోడ్లపైకి తెచ్చిందన్నదీ పలువురు ఎమ్మెల్యేల భావన. ఉదాహరణకు జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని చంద్రబాబు ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తాము ఎవరి పొట్టగొట్టబోమని ఊదరగొట్టారు. కానీ.. 👉.. అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారా? లేదా? రేషన్ సరుకులను ప్రజల ఇళ్లవద్దకే చేర్చే వ్యవస్థ గతంలో ఉంటే, ఇప్పుడు దానిని ఎత్తివేశారా? లేదా? ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని గ్రామ, గ్రామానా, పట్టణాలలో వార్డు, వార్డులో జగన్ ప్రభుత్వం నెలకొల్పితే వాటన్నిటిని నీరు కార్చుతున్నారా? లేదా ?వారికి ఈ వ్యవస్థలపై నమ్మకం లేకపోతే, మంచివి కావని భావిస్తే ఎన్నికల ముందే ఆ విషయం చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా, అవన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రచారం చేసి, తీరా పవర్ లోకి వచ్చాక అన్నిటిని నిర్వీర్యం చేస్తే ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందా? లేక చెడ్డ ప్రభుత్వం అవుతుందా?. హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చారు కదా?. వాటిలో పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మొదటి ఏడాదిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే! గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చి సరిపెట్టారే. తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఏబై ఏళ్లకే బలహీన వర్గాలకు పెన్షన్ మొదలైన వాటన్నిటికి తొలి ఏడాది ఎగనామం పెట్టారా? లేదా? ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారికి ఇచ్చిన బాండ్ల గురించి ,ఆయా వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారందరిని వైఎస్సార్సీపీ వారి కింద జమకట్టి కేసులు పెడతామని బెదిరిస్తారా? ముఖ్యమంత్రే స్వయంగా వైఎస్సార్సీపీ వారు నిలదీయడానికి లేదని, అలా చేస్తే తాట తీస్తామని అనడం దేనికి సంకేతం. రెండో ఏడాదిలో తల్లికి వందనం కొంతవరకు అమలు చేసినా, మొదటి ఏడాది బకాయిల మాటేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలి? తల్లికి వందనం ఈ మాత్రం అయినా అమలు అయిందంటే అది జగన్ ప్రభావం వల్లే అన్న సంగతి అందరికి తెలుసు. జగన్ ఎప్పటికప్పుడు దీని గురించి నిలదీస్తున్న ఫలితంగా ఈ స్కీమ్ ఈ మాత్రం అయినా ఇవ్వక తప్పలేదు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలలో వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తెగ బాదుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమని ఎమ్మెల్యేలు అనగలరా? ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారో, లేక ఆయన కుమారుడు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి గురించి ఎవరైనా అడిగితే జవాబు ఏమని చెబుతారు?. 👉మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తూ కాలం గడపాలని చంద్రబాబు సర్కార్ చేస్తున్న యత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరా? జగన్ టైమ్లో అప్పుల గురించి అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించింది కదా! అప్పట్లో 'దాన్ని తనఖా పెట్టారు.. దీన్ని తనఖా పెట్టార"ని ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా అప్పులు ఇచ్చేవారికి ట్రెజరీనే తాకట్టు పెట్టి ఘన చరిత్ర నెలకొల్పారే. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అంగీకరిస్తారా? లేక వారిని కోప్పడతారా? వైసీపీ వారు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు అవేమిటో వివరించాలి కదా?. 👉నిత్యం విధ్వంసం అంటూ నిందలు వేసే చంద్రబాబు అదేమిటో ఎన్నడైనా చెప్పారా? కేవలం సినిమా డైలాగులు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యోచన కాకుండా వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటారు.అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని ఎమ్మెల్యేలపైకి నెట్టేసి తప్పుకోవాలని చూస్తే వారు గుసగుసలాడు కోకుండా ఉంటారా? 1995 లొ ముఖ్యమంత్రి అయింది మొదలు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేలపై అసంతృప్తి అంటూ లీకులు ఇవ్వడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల వైఫల్యాలు లేవా అంటే చాలానే ఉన్నాయి. అనేక చోట్ల ఇసుక, మద్యం, గనులు, పరిశ్రమలు తదితర లావాదేవీలలో ఎమ్మెల్యేల దందా పై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. వెరసి అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యేలు రెండువైపులా సాగుతున్న దందాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలలోకి వెళ్లాలంటే భయం ఏర్పడిన మాట నిజం. కొనమెరుపు ఏమిటంటే కీలకమైన తొలి అడుగు సన్నాహక సమావేశానికి 56 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ల చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని వారు ఖండించారు. కూటమి పెద్దల భావజాలంలో మార్పు వచ్చి ఉంటే సంతోషించాలి. కాని వారు అన్ని విషయాలలో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. చంద్రబాబు చేసిన ప్రకటనను గమనించండి. హైదరాబాద్ లో ఒక టీవీ చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విద్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు,సమాజం దీనిని ఆమోదించదని అంటూ,ఆ ఛానల్ యాజమాన్యానికి ,సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియచేశారు. 👉చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికి గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికి అయినా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తమకు మద్దతు ఇస్తే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది.👉ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్ కు సంబందించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన తీరు,ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా.. జర్నలిస్టులను అరెస్టు చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందినవారు చేసిన దాడులు,వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్దతి గురించి కూడా కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా!. పైగా అనని మాటలు అన్నట్లుగా, ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరిని ఆశ్చర్యపరచింది. సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు లు చేయలేదు? అలా చేసినవారు దుండగులు కాదా?వారు టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?ప్రజాస్వామ్యంలో బెదిరింపులు ,దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో అదే సూత్రం వర్తించదా?.. దీనికి ఆయన ఏమి జవాబిస్తారు. నిత్యం సాక్షిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతు ఇచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే స్వేచ్చ ఉండాలని చెప్పడం సహేతుకమే అవుతుందా?. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.👉సాక్షి డిబేట్లో ఒక పదం అభ్యంతరకరం అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. దానిపై వివరణ కోరవచ్చు. కాని అసలు ఆ పదం పలకని జర్నలిస్టునే అరెస్టు చేశారే!. విచిత్రం ఏమిటంటే డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే, తెలుగుదేశం మీడియా సంస్థలు వందల సార్లు ప్రచారం చేశాయి. అలాగే లక్షల పత్రికలలో దానిని యధాతధంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దానిని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా?. కాని ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా!, మరి వారిపై కేసులు పెట్టరా?దీనిపై ప్రభుత్వంకాని, పోలీసు కాని, న్యాయ వ్యవస్థకాని ఎందుకు స్పందించలేదంటే ఏమి చెబుతాం. హైదరాబాద్ లో దాడికి గురైన టీవీ చానల్ కొన్ని వీడియాలకు పెట్టిన తంబ్ నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు. ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరం చెప్పం. చట్టప్రకారం పోవాల్సిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే!. సాక్షిపై దాడులు జరుగుతున్నప్పుడు , ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలోప్రభుత్వం.. వాళ్లకు బంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు.. చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు!!.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రం అంతా గంజాయి కేంద్రం అయిపోయిందని చంద్రబాబు,ఇతర కూటమి నేతలుతీవ్ర విమర్శలు చేసేవారు. అంటే అప్పుడు ఏపీలో ఉన్నవారంతా గంజాయి తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నట్లు భావించాలా?. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా?. అంతెందుకు తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినలేదా?. అయినా ఎవరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షిపై దాడి చేయడం ,కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్దం అని వారు భావిస్తున్నట్లా?. సాక్షిని మాత్రమే కట్టడి చేయాలన్నది వారి అభిమతమా?. అంతెందుకు.. సాక్షి టీవీ చానల్ ప్రజలలోకి వెళ్లరాదన్న ఉద్దేశంతో ఆయా నగరాలలో ,పట్టణాలలో కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి సాక్షి ప్రసారం కాకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మీడియా స్వేచ్చ గురించి నీతులు చెబితే ఎవరైనా నమ్ముతారా?.. చంద్రబాబు కు ఇది కొత్తేమి కాదు. 2014 టైమ్లో కూడా కూడా సాక్షితో పాటు మరికొన్ని చానళ్లపై కూడా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నిషేధం పెట్టారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే,ఆ వార్తలు ప్రచారం కాకుండా ఎన్నిరకాల ఆటంకాలు కలిగించారో అందరికి తెలుసు. ఈసారి కూడా సాక్షి టీవీతో మరో రెండు చానళ్లపై కూడా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. ఇదీ చంద్రబాబుకు మీడియా స్వేచ్చపై ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్న సూత్రం బాగా వర్తిస్తుందా?ఇక పవన్, లోకేష్ లు కూడా టీవీ చానల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు భావిస్తున్నారన్నమాట.ఏపీలో జర్నలిస్టులను అరెస్టు చేయించి,అదేదో గొప్పపనిగా ఛాతి విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. దీనినే హిపోక్రసి అంటారు.అలా అని హైదరాబాద్ లో దాడి ఘటనను సమర్ధించడం లేదు.కాని ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు మాత్రం ఇలా రెండుకళ్ల సిద్దాంతంతో సాగుతుండడమే బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


