వారి త్యాగాలకు ఇదా విలువ? | Sakshi Guest Column On Indian Army Disability Pension Tax Issue | Sakshi
Sakshi News home page

వారి త్యాగాలకు ఇదా విలువ?

Feb 18 2026 12:28 AM | Updated on Feb 18 2026 12:28 AM

Sakshi Guest Column On Indian Army Disability Pension Tax Issue

సాయుధ దళాలకు ఇస్తున్న అంగవైకల్య పింఛను మొత్తాలు 1922 నుంచి పన్ను మినహాయింపు పొందు తున్నాయి. ఈ మినహాయింపును పరిమితం చేసే విధంగా ఆదాయ పన్ను చట్టాలకు సవరణ చేస్తున్నట్లు 2026 ఫైనాన్స్‌ బిల్‌ పేర్కొనడం సైనిక వీరులకు అగౌరవం!

సందర్భం

ఏ వ్యవస్థను ఎక్కువ విశ్వసిస్తారని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే... సాయుధ దళాలు అగ్ర భాగాన నిలుస్తాయి. వరద జలాలలో వంతెనలు నిర్మించడం, మైనస్‌ ఉష్ణోగ్రతలలో సరిహద్దులను కాపలా కాయడం నుంచి కార్గిల్‌ యుద్ధం, ఆపరేషన్‌ సిందూర్‌ వరకు సైన్యం అందించే సేవలు వెల కట్టలేనివి. వారు విధి నిర్వహణలో రక్తాన్ని, చెమటను, కన్నీటిని చిందించవలసి ఉంటుంది. మనం మన సైనికుల గౌరవాన్ని ఎంతగానో కాపాడు తున్నట్లు చెప్పుకుంటాం. నిజంగా వారిని అంత నెత్తిన పెట్టుకుంటున్నామా? అదే నిజమైతే, 2026 బడ్జెట్‌ ప్రతిపాదనలలో కొన్నింటిపై మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సర్వీసు కాలం పూర్తయ్యేంత వరకు సేవలందించిన, అవయవాలను కోల్పోయిన సైనికులకు ఇచ్చే పెన్షన్‌పై పన్ను విధించే ప్రతిపాదన సబబేనా? 

సైనిక వికలాంగులపై పన్నా?
సాయుధ దళాలకు ఇస్తున్న అంగవైకల్య పింఛను మొత్తాలు 1922 నుంచి పన్ను మినహాయింపు పొందుతున్నాయి. ఈ మినహా యింపును పరిమితం చేసే విధంగా ఆదాయ పన్ను చట్టాలకు సవరణ తీసుకురానున్నట్లు 2026 ఫైనాన్స్‌ బిల్లు పేర్కొంది. అవయవాలు కోల్పోయిన కారణంగా విధుల నుంచి పూర్తిగా వైదొలగవలసి వచ్చిన సైనికులకు మాత్రమే ఆ మినహాయింపును వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శరీరంలో ఏ అవయ వాన్ని అయినా కోల్పోయినా, విధులలో కొనసాగగల శక్తి సామర్థ్యా లున్నాయని మెడికల్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ తెచ్చుకుని సర్వీసులో కొనసాగి రిటైరైనవారికి ఇచ్చే పెన్షనుకు ఆ మినహాయింపు వర్తించదు. 

వారు ఒక చెయ్యి లేదా కన్ను లేదా కాలు కోల్పోయినా పన్ను పడుతుంది. సర్వీసులో కొనసాగగల అర్హత లేనంతగా గాయపడిన వారు మాత్రం మినహాయింపు పొందగలుగుతారు. క్షతగాత్రులైన సైనికులను దయాదాక్షిణ్యాలపైన బతుకుతున్న వారిగా చూడకూడదు. వారు కూడా ఇంచుమించుగా అనన్య సామాన్యమైన శౌర్యవంతులే. తమకు కలిగిన గాయానికి భయపడ కుండా, దాని నుంచి మరింత శక్తిని, స్ఫూర్తిని కూడదీసుకుని తమకు అప్పగించిన విధులకు అంకితమవడం నిజానికి ప్రశంసించవలసిన విషయం.

ముగ్గురు వీరుల ముచ్చట
ఫీల్డ్‌ మార్షల్‌ సామ్‌ మానెక్‌ షా 1971 యుద్ధంలో మనకు విజయాన్ని అందించారు. పాకిస్తాన్‌ సైన్యం లొంగుబాటు బాట పట్టేటట్లు చేసి, బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి తోడ్పడ్డారు. ఇంతవరకు మనకున్న ఇద్దరు ఫీల్డ్‌ మార్షళ్ళలో ఆయనొకరు. వృత్తి జీవితం ఆరంభంలోనే గాయపడిన చరిత్ర సామ్‌కు ఉంది. 1942 సిట్టాంగ్‌ యుద్ధంలో తన పటాలాన్ని జపాన్‌ సేనలకు వ్యతిరేకంగా నడిపిస్తూ బులెట్ల బారినపడ్డారు. ఆయన కడుపు, పేగులలోకి తొమ్మిది బుల్లెట్లు దూసుకుపోయాయి. ఎంత తీవ్రంగా గాయపడ్డారంటే, శస్త్ర చికిత్స చేసేందుకు సర్జన్‌ కూడా సంశయించారు. పైగా ‘ఒక కంచర గాడిద తన్నింది’ అంటూ సామ్‌ దాని గురించి హాస్యస్ఫోరకంగా చెప్పుకున్నారు. 

మేజర్‌ జనరల్‌ ఇయాన్‌ కార్డొజో అనుభవం కూడా తక్కువ దేమీ కాదు. సామ్‌ నేతృత్వం వహించిన 1971 యుద్ధంలో కార్డొజో కూడా పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌ అధికారి అయిన కార్డొజో అప్పటి తూర్పు పాకిస్తాన్‌లో భాగమైన సిల్హెట్‌లో మందుపాతర పేలుడులో తన కుడి కాలును కోల్పోయారు. ఆయన ఆ సంఘటనను ఎలా ఎదుర్కొన్నారో రోమాంచితమైన రీతిలో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎముకలు కనిపించే విధంగా మాంసం ముక్కలు కాలు నుంచి కిందపడితే ఆయన తన పిడిబాకును బయటకు తీయించి ఛిద్రమైన ఆ  భాగాన్ని తెగ్గొట్టవలసిందిగా కింది సిబ్బందిని ఆదేశించారు. ఆ అసాధారణ సైనికుడు మొదట ఒక బెటాలియన్‌కి, ఆ తర్వాత బ్రిగేడ్‌కి నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఒక అవయవాన్ని కోల్పోయిన అధికారి ఆ స్థాయిని అందుకోవడం అదే మొదటిసారి. ఒక కాలు లేకపోయినా, మంచులో నడుస్తూ కొండలపైకి ఎక్క గలననీ, చెప్పిన పనులు చేయగలననీ ఆయన పై అధికారులను ఒప్పించి చేసి చూపించగలిగారు. గాయం వల్ల డెస్కు పనులకే పరిమితమయ్యేందుకు  తిరస్కరించారు. 

చివరగా, లెఫ్టినెంట్‌ జనరల్‌ విజయ్‌ ఒబెరాయ్‌ గురించి చెప్పు కుందాం. దేశంలో అత్యధిక పతకాలను అందుకున్న అధికారులలో ఆయనొకరు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో ఆయన కూడా కుడి కాలు కోల్పోయారు. అయినా, మరో నాలుగు దశాబ్దాలపాటు సైన్యానికి సేవలందించగలిగారు. కృత్రిమ కాలుతో మారథాన్‌లలో కూడా పాల్గొన్నారు. అవయవాలు కోల్పోయిన సైనికులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టే విధంగా ‘వార్‌ ఊండెడ్‌ ఫౌండేషన్‌’ను నెలకొల్పారు. ఆయన భారత సైన్య ఉప ప్రధానాధికారి స్థాయి వరకు ఎదిగారు. 

జీవన సంధ్యలో ఏదీ భరోసా?
ఆదర్శంగా తీసుకోవలసిన జాతీయ హీరోల గాథలవి. అలాంటివారు చాలామంది ఉన్నారు. అటువంటి వీరుల డిజెబిలిటీ పెన్షన్‌పై పన్ను విధించడం సమంజసమా? అదీ వారి జీవన సంధ్యలో, ఆర్థిక భద్రత అత్యంత అవసరమైన కాలంలో పన్ను ప్రతిపాదన తీసుకురావడం ఎంతవరకు సముచితం? ధైర్య సాహసాలకుగానూ ఇటీవల వాయు సేనా మెడల్‌ అందుకున్న కార్పొరల్‌ వరుణ్‌ కుమార్‌ను దేశం కొనియాడింది. ఆపరేషన్‌ సిందూర్‌లో శత్రు క్షిపణి దాడిలో ఆయన తన కుడి చేతిని కోల్పోయారు.  ఆయన చెరగని చిరునవ్వుతో తన ఎడమ చేయితోనే వైమానిక దళ ప్రధానాధికారికి శాల్యూట్‌ చేసిన ఫొటో ఎవరి హృదయాలనైనా కదిలిస్తుంది.

నౌకా, వైమానిక, సైనిక దళాలకు చెందిన 10,000–12,000 మంది డిజెబిలిటీ పెన్షన్లు అందుకుంటున్నారని డేటా సూచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై పడిపోయే ఖర్చు కూడా పెద్దగా ఏమీ లేదు. జనరల్‌ మాలిక్‌ చెప్పినట్లుగా పెద్ద మొత్తాల ఖర్చులను గాలి కొదిలేసి, చిన్న మొత్తాల ఖర్చులను లెక్కలోకి తీసుకోవడం వివేకం అనిపించుకోదు. అసలిది ఖర్చుల కోణం నుంచి చూడవలసిన అంశం కాదు. ఒక సైనికుడి గౌరవ పరిరక్షణకు సంబంధించినది. దీని కోసం చర్చలు జరుపవలసిన లేదా పోరాడవలసిన అవసం ఏ సైనికుడికీ రాకూడదు. ఈ పన్ను ప్రతిపాదనను కేంద్రం పునః పరిశీలించి తీరాలి. 

బర్ఖా దత్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement