విశ్లేషణ
దావోస్లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో చర్చించిన ప్రాథమికాంశాలలో ‘కృత్రిమ మేధ (ఏఐ)– దాని ప్రభావం’ కూడా ఉంది. ఏఐని ఆశ్రయించక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అనుసరించడంలో మందగమనంతో సాగవచ్చు నేమోకానీ, ఏదో ఒకనాడు దాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. ఏఐని ఆశ్రయించడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి; అదే సమయంలో... అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలలో కొన్ని ఆందో ళనలున్నాయి.
‘ఫోరమ్’ సర్వే ఏం చెబుతోంది?
ఆర్థికవేత్తలలో ఫోరమ్ ఈ అంశంపై నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొన్నింటి స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని దాదాపు 54 శాతం మంది అంగీకరించారు. కంపెనీలు ఏఐని ఎక్కువ వినియోగించు కుంటే లాభాల మార్జిన్లు పెరుగుతాయని సుమారు 45 శాతం మంది నమ్ముతున్నారు. అంటే, కంపెనీల సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. జనాభాలోని కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఇది వివక్షకు దారితీయవచ్చని 21 శాతం మంది భయాలు వ్యక్త పరిచారు.
వివిధ రంగాల పరిశ్రమల సామర్థ్యం ఏఐతో మెరుగుపడుతుందని మన దేశంలోనూ దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐని ఎక్కువ వినియోగించుకోవడం వల్ల అన్ని కంపెనీల్లో కస్టమర్ సర్వీస్ విభాగం సేవలు మెరుగుపడతాయి. ఆ విభాగం చాట్ బాట్స్ను సృష్టించుకోవడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సామర్థ్యాన్ని పెంచుకునేందుకు దాదాపు అన్ని సేవా రంగాల పరిశ్రమలూ అటువంటి సాధనాలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు రిటైల్ కస్టమర్లతో ప్రమేయమున్న అన్ని వ్యాపార సంస్థలూ ఏఐని ఆశ్రయించక తప్పదు.
కీలక రంగాల్లో ఏఐ వినియోగం
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగంలో రుణ యోగ్యతను మదింపు చేసేందుకు ఏఐని వినియోగిస్తున్నారు. రుణం కోరుతున్న కంపెనీకి చెందిన మొత్తం సమాచారాన్ని ఏఐ సమీకరించి, తిరిగి చెల్లించగల సామర్థ్యంపై అంచనాలు అందివ్వగలదు. కలన గణితాలను ఆధారం చేసుకుని, ఏ మేరకు రుణం మంజూరు చేయవచ్చునో, ఎంత వడ్డీ వసూలు చేయవచ్చునో తెలుపుతుంది. ముందే నిర్ణయించిన సూచికలను ఆధారం చేసుకుని ఆ కంపెనీ ఎగవేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని కూడా చెప్పగలుగు తుంది. ఏఐ వినియోగం వల్ల మోసాన్ని కనిపెట్టడం తేలిక. ఫలితంగా, ఆ రంగానికి ఎంతో మేలు చేసినదవుతుంది.
ఐటీ రంగంలో ఇప్పటికే పెక్కు మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం కోడింగ్ ప్రాసెస్, ప్రోగ్రామింగ్ పనిని ఏఐకి అప్ప గిస్తున్నారు. ఈ కంపెనీలు సూచిస్తున్న పరిష్కారాలు క్లయింట్లకు ఉపయోగపడుతున్నాయి. ఆ క్లయింట్లు ఏఐ వినియోగంతో హెచ్చు సామర్థ్య స్థాయులతో తమ ప్రాజెక్టులను వేగవంతం చేసుకుంటు న్నారు. రిటైల్ రంగంలో, కస్టమర్ సంబంధ మాడ్యూల్ మొత్తాన్ని ఏఐ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అది ఉత్పత్తులను సమర్థంగా డెలివరీ చేసేందుకు ఉపయోగపడుతోంది. స్టోరుకు వెళ్ళే వినియోగ దారుల ఇష్టాలు, అభిరుచుల సమాచారం మొత్తాన్ని ఏఐ క్రోడీక రిస్తోంది. వాటికి తగ్గట్లుగా ఆ యా ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం తేలికవుతోంది. ఆరోగ్య రక్షణ రంగంలో సప్లై చెయిన్ నిర్వహణను ఏఐ సమకూరుస్తోంది. ఏ వ్యాపార రంగానికైనా ఏఐ వినియోగం అనివార్యంగా మారుతోందనీ, దాన్ని ఉపయోగించు కోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయనీ వీటివల్ల స్పష్ట మవుతోంది.
కంపెనీలు భవిష్యత్తుకు తగ్గట్లుగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకునేందుకు కూడా క్రమేపీ ఏఐని ఆసరా చేసుకుంటు న్నాయి. ఏఐ సాధనాలు అందించిన ఇన్పుట్ల ఆధారంగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడే ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురుకాగల పోటీని అంచనా వేసుకోగలుగు తున్నాయి. కాకపోతే, ఏఐని ఒక టెక్నాలజీగా వినియోగించుకోవడం చౌక కాదు. విద్యుచ్ఛక్తి ఎక్కువ అవసరమవుతుంది. గ్లోబల్ డేటా సెంటర్ విద్యుత్ వినియోగం 2035 నాటికి 1,200 టెరావాట్–గంట లను మించిపోవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అంటే, 2024 స్థాయులకన్నా దాదాపు మూడింతలు ఎక్కువ. ఏఐ వృద్ధికి సమాంతరంగా విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచు కోవాలి. అయితే, మున్ముందు ఈ వ్యయాలు తగ్గుతాయనీ, లాభాలు పెంచుకునే వీలుంటుందనీ కంపెనీలు భావిస్తున్నాయి. ఖర్చుల మాట అట్టేపెట్టినా, మన దేశంలో పరిస్థితులు ఎలా మార తాయన్నది చూసుకోవాలి.
దేశ కార్మికశక్తికి సవాల్
మనది మిగులు కార్మిక ఆర్థిక వ్యవస్థ. ఉద్యోగాల అవసరం ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిపుణులైనవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. నైపుణ్యం పెద్దగా అవసరం లేని లాజిస్టిక్స్, నిర్మాణ రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం ఒక సవాల్.
ఏఐ వినియోగాన్ని పెంచుకుంటున్న కంపెనీలు ఇపుడున్న సిబ్బందిని తిరిగి నిపుణులుగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలి. లేదంటే వారిని గాలికి వదిలేసినట్లు అవుతుంది. అయితే, కొత్తగా నైపుణ్యాలను నేర్పించడానికి వయసు ఒక ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. కనుక, ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగి తీరుతుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో ఏఐని అంతర్భాగం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే మాట కూడా నిజం. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి మాత్రం కోతల బెడద తప్పకపోవచ్చు.
సర్వేలో వెల్లడైన రెండవ పెద్ద అంశం– అసమానత. పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టి, ఏఐ నిచ్చెనమెట్లు ఎక్కేస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉంటుంది కనుక, అది వాటికి సాధ్యం కాని పని. ఇది ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మరింత పెంచుతుంది. కొన్ని సంస్థలు పోటీ పడలేక రంగం నుంచి వైదొలగక తప్పని స్థితి ఏర్పడవచ్చు.
ఈ అసమానత సమస్య సిబ్బందికి కూడా వర్తిస్తుంది. అవస రమైన నైపుణ్యం ఉన్నవారికి వెంటనే ఉద్యోగాలొస్తాయి. మామూలు ఉద్యోగాలలో కంటే ఎక్కువ జీతభత్యాలు లభిస్తాయి. మిగిలిన రంగాలవారి కన్నా ఐటీ రంగం ఎక్కువ జీతభత్యాలు ఇవ్వజూప గలగడం ఇప్పటికే చూస్తున్నాం. ఏఐ విషయంలోనూ అదే జరుగు తుంది. వస్తూత్పత్తి నుంచి కస్టమర్ సర్వీస్ వరకు వివిధ సంస్థలు తమ కార్యకలాపాలకు అవసరమైన చట్రాలను డిజైన్ చేయగలిగిన ఏఐ నిపుణులకి ఎక్కువ జీతాలు ఇవ్వజూపుతాయి.
మదన్ సబ్నవీస్
వ్యాసకర్త ఆర్థికవేత్త, రచయిత


