అగ్రస్థానాల్లో అమెరికా, సింగపూర్
వరల్డ్ ఎకనమిక్ ఫోరం తాజా నివేదిక
2035 నాటికి భారత జీడీపీకి ఏఐ ఊతం
జీడీపీలోకి రానున్న రూ.50 లక్షల కోట్లు
పీడబ్ల్యూసీ ఇండియా అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఇటీవల దావోస్లో.. ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.
అమెరికా, చైనా దూకుడు
2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం.
మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లు
భారత్లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.
ఆర్థిక వ్యవస్థకూ ఊతం
భారత్ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటివరకు మొత్తంగా రూ.55 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘భారీ డేటా సెంటర్ల’ సంఖ్య 1,136 కాగా 2030 నాటికి ఇది 2,000 దాటొచ్చని అంచనా.

ఆధారం: వరల్డ్ ఎకనమిక్ ఫోరం శ్వేతపత్రం


