దుబాయ్: టి20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ తిరస్కరించిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత సులువుగా వదిలిపెట్టేలా లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. భారత్తో మ్యాచ్ ఆడే అంశం తమ చేతుల్లో లేదని, తమ ప్రభుత్వ ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవచ్చని ఐసీసీ నిబంధన (ఫోర్స్ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది.
అయితే ఐసీసీ దీనికి సరైన రీతిలో స్పందించింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలులాంటి అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడే ఈ నిబంధనన వర్తిస్తుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటంలో కానీ, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలో గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా స్పష్టం చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో ఇరకాటంలో పడ్డ పీసీబీ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించే అవకాశాలూ కనిపిస్తున్నాయి!


