IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్‌కు ఐసీసీ ప్రశ్న | T20 WC 2026: Pakistan Letter to ICC on India boycott Get Strong response | Sakshi
Sakshi News home page

IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్‌కు ఐసీసీ ప్రశ్న

Feb 7 2026 10:02 PM | Updated on Feb 7 2026 10:06 PM

T20 WC 2026: Pakistan Letter to ICC on India boycott Get Strong response

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడి.. కేవలం భారత్‌తో మాత్రమే ఆడకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. మిగతా మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు ఈ మ్యాచ్‌కే ఎందుకనే విమర్శలూ వస్తున్నాయి.

బంగ్లాదేశ్‌కు మద్దతుగా
ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) సైతం పీసీబీకి ఇదే ప్రశ్నను సంధించింది. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ మ్యాచ్‌ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిస్కరిస్తామంటూ పాక్‌ కొత్త రాగం ఎత్తుకుంది.

కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాము కూడా లంకలోనే ఆడతామని బంగ్లా కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భద్రత పరంగా భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తమ బృందం తేల్చినందున పునరాలోచించుకోవాలని సమాధానం ఇచ్చింది.

ఒకవేళ రద్దయితే
కానీ బంగ్లాదేశ్‌ మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ.. పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామని ప్రకటించింది. పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ఈ ప్రకటన చేశాడు.

కాగా శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. భారీ క్రేజ్‌ ఉన్న ఈ మ్యాచ్‌ ఒకవేళ రద్దయితే పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇతర బోర్డులు సైతం పాక్‌ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

తెలివి ప్రదర్శించిన పీసీబీ
అయితే, తమపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పాక్‌ తెలివిగా.. ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ (Force Majeure Clause)ను తెరపైకి తెచ్చింది. అనూహ్య, నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఈ నిబంధన ద్వారా లభిస్తుంది.

సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి  అత్యవసర పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన వాదనను సమర్థించుకునే అవకాశం ఉంటుంది. తమ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించనందున ఈ నిబంధన తమకు వర్తింపజేయాలని పీసీబీ ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.

గట్టిగానే బదులిచ్చిన ఐసీసీ
అయితే, ఇందుకు ఐసీసీ గట్టిగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ప్రభుత్వ అనుమతితో టోర్నీలో కొనసాగుతున్నారు.. కానీ.. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తారా? ఇదెలా సాధ్యం? దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి’’ అని పీసీబీని ఆదేశించినట్లు వార్త సంస్థ PTI వెల్లడించింది. 

కాగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తొలుత టోర్నీనే బహిష్కరిస్తామన్న పాక్‌.. ఆ తర్వాత మాట మార్చి భారత్‌తో మాత్రమే ఆడమంటూ డ్రామాకు తెరలేపింది.

చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్‌ బోర్డు? యూటర్న్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement