ఇరాన్పై వరుసగా ఏడవ రాత్రి కూడా అమెరికా దాడులు నిర్వహించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలహీనపరిచేలా ఈ దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చి వేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టాన్ని కలిగించామని ఇరాన్ గురువారం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియా (సాయుధ ముఠాల) సంకీర్ణ కూటమి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు 96.28 కోట్ల రూపాయలు) బహుమతిని ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన రగులుతున్న ఇప్పటికే యుద్ధ జ్వాలలకు మరింత ఆజ్యం పోసింది.
డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి లేదా ఆ ఆపరేషన్కు నిధులు సమకూర్చిన వారికి, సహాయం చేసిన వారికి ఈ బహుమతి అందుతుందని 'ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్' (IRI) తెలిపింది. ఈ 10 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తమ సభ్యులు, మద్దతుదారుల నుండి సేకరించిన విరాళాల ద్వారా సమకూర్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదు.
ఇటీవల వైట్ హౌస్లో ఇరాక్ ప్రధాన మంత్రి అలీ అల్-జైదీతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ... 2020లో ఇరాన్ అగ్ర సైనిక కమాండర్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ, ఇరాకీ మిలీషియా నాయకుడు అబూ మహదీ అల్-ముహందిస్లను చంపడంలో తన పాత్రను బహిరంగంగా ప్రస్తావించారు. దీనికి ప్రతిచర్యగా ఐఆర్ఐ ఈ ప్రకటన చేసింది.
ఇరాక్, సిరియా , గల్ఫ్ ప్రాంతంలోని ఇతర చోట్ల ఉన్న అమెరికా దళాలు, దౌత్య కార్యాలయాలు మరియు మిత్రదేశాలపై వందలాది డ్రోన్, రాకెట్, క్షిపణి దాడులకు ఈ గ్రూపులే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుత అమెరికా-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ సరిహద్దుల వెలుపల తన సైనిక ఒత్తిడిని కొనసాగించడానికి టెహ్రాన్కు ఈ మిలీషియాలు ప్రధాన ఆయుధాలుగా మారాయి.


