అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు వరుసగా ఏడో రాత్రికి చేరుకోగా హర్మూజ్ జలసంధి చుట్టూ సైనిక కదలికలు, నౌకా రవాణా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. దక్షిణ ఇరాన్లోని హర్మూజ్గాన్ ప్రావిన్స్పై అమెరికా దాడుల్లో ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాత్రం ఈ దాడుల లక్ష్యం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమేనని పేర్కొంది.
ఆధిపత్య పోరు..
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఘర్షణకు కేంద్రంగా మారింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) రెండు చమురు ట్యాంకర్లు మైన్ల కారణంగా పేలిపోయాయని, కొన్ని నౌకల రాకపోకలను అడ్డుకున్నామని ప్రకటించింది. అయితే అమెరికా ఈ వాదనలను ఖండించింది. అమెరికా, ఇరాన్ రెండూ ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమ ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని నౌకలు మాత్రం పరిమిత స్థాయిలో రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం.
ఇరాన్ హెచ్చరిక..
అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ సైనిక అధికారులు హెచ్చరించారు. తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సీనియర్ సైనిక సలహాదారు మేజర్ జనరల్ మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. ఇరాన్ ఇక సమాన స్థాయి ప్రతీకార చర్యలకే పరిమితం కాదు.. ఎలాంటి రాజకీయ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదు అని ఆయన హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఇరాన్ ప్రధానంగా అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై ప్రతీకార చర్యలకు దిగుతామని ప్రకటించగా, తాజా హెచ్చరికతో దాడుల పరిధి విస్తరించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన దాడులను కేవలం అమెరికా సైనిక లక్ష్యాలకే పరిమితం చేయకపోవచ్చని సంకేతాలు ఇస్తోంది.గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు, సైనిక స్థావరాలు మరింత అప్రమత్తంగా మారే అవకాశం ఉంది.
గల్ఫ్ దేశాలకు టెన్షన్..
ఇరు దేశాల మధ్య యుద్ధ ఘర్షణ ఇప్పుడు సరిహద్దులను దాటి గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తోంది. తాజాగా కువైట్లో కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ ప్రాంతాల్లోనూ క్షిపణులు, డ్రోన్ దాడుల ఆరోపణలు వచ్చాయి. కొన్ని దాడులు అమెరికా మిత్రదేశాలపై జరిగాయని ఇరాన్ ప్రకటించగా, వాటిలో కొన్ని వాదనలను ఆయా దేశాలు ఖండించాయి. దీంతో, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాలు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తున్నాయి.
కువైట్పై ప్రభావం
ఇరాన్ దాడుల్లో కువైట్లోని కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలపై ప్రభావం పడటంతో ప్రజలను ఇంధనం, విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఖతార్లో అప్రమత్తత
గల్ఫ్లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉన్న ఖతార్పై కూడా ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రయత్నాలను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఖతార్ తెలిపింది.
బహ్రెయిన్కు ప్రత్యేక సవాల్
బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన కీలక స్థావరం ఉంది. దీంతో ఈ చిన్న దేశం వ్యూహాత్మకంగా అత్యంత సున్నిత ప్రాంతంగా మారింది. గల్ఫ్ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
సౌదీ అరేబియా, యూఏఈ పరిస్థితి
గల్ఫ్లో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, యూఏఈలు తమ చమురు మౌలిక సదుపాయాల రక్షణపై దృష్టి పెట్టాయి. గతంలో చమురు కేంద్రాలపై జరిగిన దాడుల అనుభవంతో, ఇప్పుడు డ్రోన్లు, క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నాయి.
ఒమన్కు పెరుగుతున్న ప్రాధాన్యం
హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఒమన్ ఈ సంక్షోభంలో కీలక పాత్రలో ఉంది. నౌకా రవాణా భద్రత, సముద్ర మార్గాల రక్షణపై దృష్టి పెట్టింది.


