ఇరాన్ యుద్ధం తీవ్రరూపం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక | US Trump orders more strikes after US soldier killed in Iraq | Sakshi
Sakshi News home page

ఇరాన్ యుద్ధం తీవ్రరూపం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక

Jul 20 2026 7:23 AM | Updated on Jul 20 2026 8:30 AM

US Trump orders more strikes after US soldier killed in Iraq

మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్న వేళ, ఇరాక్‌లో జరిగిన ఓ ఆపరేషన్‌లో అమెరికా సైనికుడు మరణించగా, మరో సైనికుడు గాయపడ్డాడు. దీంతో, ఇరాన్‌పై దాడుల మరింత పెంచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో ఇరాన్‌కు ప్రయాణాలను నివారించాలని, ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశం విడిచి రావడాన్ని పరిశీలించాలని భారత్ సూచించింది.

అమెరికా సైనికుడు మృతి
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఉత్తర ఇరాక్‌లో కూలిపోయిన ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్‌లోని పేలని ఆయుధ భాగాలను నిర్వీర్యం చేసే సమయంలో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో సైనికుడు స్వల్పంగా గాయపడ్డాడు. జూలై 18న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సైనికుల వివరాలను వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చిన తర్వాత వెల్లడిస్తామని CENTCOM తెలిపింది. ఈ తాజా మరణంతో గత దాదాపు ఐదు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరింది.

ఇరాన్‌పై వరుస దాడులు
ఉద్రికత్తల నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు ప్రారంభించింది. ఇది వరుసగా తొమ్మిదో రాత్రి దాడులుగా CENTCOM పేర్కొంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నావికులపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. అయితే తాజా దాడుల్లో ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారో, ఎంత నష్టం జరిగిందో అమెరికా అధికారులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా తెలిపింది.

ఇరాన్ ప్రయాణంపై భారత్ కీలక సూచన
పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం భారత పౌరులకు ప్రయాణ సూచన జారీ చేసింది. ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్ కోరింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా దేశం విడిచి వెళ్లే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, తాజా భద్రతా పరిస్థితులను గమనించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.

బహ్రెయిన్‌లో అమెరికా పౌరులకు హెచ్చరిక
ఇదే సమయంలో బహ్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ నుంచి ముప్పు ఉందని సమాచారం అందినట్లు పేర్కొంది. అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement