టెల్ అవీవ్: ఇజ్రాయెల్ త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పాలస్తీనా నుంచి బందీలైన ఖైదీలను జైలు నుంచి పారిపోకుండా జైలు చూట్టుూ మెుసళ్లను పెంచుతూ అత్యంత కఠిన వలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ నిర్ణయం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
ఇటీవలే ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రి ఇడిత్ సిల్మాన్ మొసళ్లను "అడవి జంతువుల" జాబితా నుండి "బంధించి పెంచే వన్యప్రాణుల" జాబితాలోకి మార్చారు. ఈ మార్పు వల్ల భద్రతా కారణాల కోసం, ముఖ్యంగా జైలు పరారీలను అడ్డుకోవడానికి మొసళ్లను ఉపయోగించేందుకు అవకాశం లభించింది.
ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ గతేడాది డిసెంబర్లో పాలస్తీనా ఖైదీలు ఉన్న జైలు చుట్టూ మొసళ్లను ఉంచాలని ప్రతిపాదించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న "అలిగేటర్ అల్కాట్రాజ్" ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ తరహాలో దీనిని ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. అయితే తొలుత ఈ నిర్ణయాన్ని అక్కడి నాయకులు వ్యతిరేకించారు. తాజాగా ఈ నిర్ణయంతో ఆయన ఆలోచనకు మార్గం సుగమమైంది.
కొత్త చట్టం ఏమి చెబుతోంది?
ఈ కొత్త నిబంధన ప్రకారం, నైలు నది మొసళ్లనుభద్రతా సంస్థల పర్యవేక్షణలో పెంచడానికి అనుమతిస్తారు. అయితే ఇవి అడవుల్లోకి తప్పించుకోకుండా ప్రకృతి ,పార్కుల అథారిటీ డైరెక్టర్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం కఠినమైన భద్రత మధ్య ఉంచాలి. అలాగే వీటిని కలిగి ఉండటం దేశ భద్రతకు అవసరమని పర్యావరణ పరిరక్షణ మంత్రి ధృవీకరించాల్సి ఉంటుంది.
ఎక్కడ వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, దక్షిణ ఇజ్రాయెల్లోని 'కెట్జియాట్' జైలు చుట్టూ ఈ మొసళ్లను మోహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జైలులో ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి తర్వాత పట్టుబడిన అనేక మంది హమాస్ ఉగ్రవాదులను బంధించారు. తాజాగా ఆ జైలు చుట్టూనే ఈ మెుసళ్ల వలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.


