డాలర్‌కు చెక్‌.. చైనా చెల్లింపుల వ్యవస్థలోకి లిబియా! | Libya Joins Chinas CIPS Payment System To Reduce Reliance On US Dollar, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

డాలర్‌కు చెక్‌.. చైనా చెల్లింపుల వ్యవస్థలోకి లిబియా!

Jul 19 2026 12:53 PM | Updated on Jul 19 2026 3:37 PM

Libya Joins Chinas CIPS Payment System to Reduce Reliance on US Dollar

ట్రిపోలి: లిబియా తన వాణిజ్య బ్యాంకులను చైనాకు చెందిన ‘క్రాస్-బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్’ (సీఐపీఎస్‌)తో అనుసంధానించనుంది. దీనివల్ల చైనా కరెన్సీ యువాన్ ఆధారిత లావాదేవీలకు మార్గం సుగమం కావడంతో పాటు, అమెరికన్ డాలర్‌పై ఆధారపడటం తగ్గుతుంది. ఈ నిర్ణయం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం, సరిహద్దు దాటిన చెల్లింపులను సరళతరం చేయడం, లిబియా-చైనా ఆర్థిక సహకారాన్ని మరింత లోతుగా మార్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒక కీలక పరిణామంలో చైనా చెల్లింపు, సెటిల్‌మెంట్ వ్యవస్థకు తమ వాణిజ్య బ్యాంకులను అనుసంధానించాలని లిబియా నిర్ణయించుకుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ లిబియా గవర్నర్ నాజీ మహమ్మద్ ఇస్సా, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ పాన్ గాంగ్‌షెంగ్ శనివారం (జులై 19) ఈ విషయాన్ని ప్రకటించారు. ఇస్సా బీజింగ్‌లో పర్యటించిన సందర్భంగా శుక్రవారం గాంగ్‌షెంగ్‌తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ బదిలీలను చైనీస్ యువాన్ ద్వారా సులభతరం చేయడానికి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 2015లో సీఐపీఎస్‌ను ప్రారంభించింది. లిబియా బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని సమీక్షించడంతో పాటు, దానిని బలోపేతం చేయడానికి, వృద్ధి రేటును పెంచడానికి గల మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాయి.

‘రెండు సెంట్రల్ బ్యాంకుల మధ్య నూతన వ్యూహాత్మక భాగస్వామ్య దశను ప్రారంభించడంపై ప్రాముఖ్యతను చర్చించాం. ఆర్థిక బదిలీలను సరళతరం చేయడానికి, వాటిని సులభంగా నిర్వహించడానికి లిబియా వాణిజ్య బ్యాంకులను చైనాకు చెందిన క్రాస్-బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్‌తో అనుసంధానించాలని నిర్ణయించాం’ అని ఇస్సా పేర్కొన్నారు. అమెరికా పేరును ప్రస్తావించకుండానే, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని మరింత పెంచే విధంగా అడ్డంకులను తొలగించి, వాణిజ్య ప్రక్రియలను సులభతరం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ఒక ప్రకటనలో తెలిపారు.

నివేదికల ప్రకారం సీఐపీఎస్‌ అనేది మధ్యవర్తి బ్యాంకుల ద్వారా లావాదేవీలను ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా, నేరుగా యువాన్ ఆధారిత చెల్లింపులను పంపడానికి, స్వీకరించడానికి బ్యాంకులకు వీలు కల్పిస్తుంది. చైనీస్ బ్యాంకుల ద్వారా నేరుగా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ) జారీ చేయడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నేతృత్వంలో లిబియా బ్యాంకింగ్ ప్రతినిధుల బృందం త్వరలో బీజింగ్‌లో పర్యటించేలా ఏర్పాట్లు చేయాలని కూడా వారు నిర్ణయించారు. ఈ పర్యటన ఇరు దేశాల వాణిజ్య బ్యాంకుల మధ్య సహకారాన్ని నెలకొల్పడానికి,  ఆర్థిక బదిలీల విషయంలో చైనా సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి దోహదపడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement