చర్మ సంరక్షణ అనేది నేడు ఒక నిరంతర ప్రక్రియగా మారింది. అయితే, ప్రతిసారీ బ్యూటీ క్లినిక్లకు వెళ్లే సమయం, ఓపిక లేని వారి కోసం సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అదే ‘సోలావేవ్ వ్యాండ్’. చర్మానికి ఎలాంటి హాని చేయకుండా ముఖ వర్చస్సును పెంపొందించే ఈ రీచార్జబుల్ పరికరం ఇప్పుడు ట్రెండ్గా మారింది. ఈ సోలావేవ్ వాండ్ డివైజ్ చర్మానికి అవసరమైన నాలుగు విభిన్న చికిత్సలను అందిస్తుంది. మొదటిది రెడ్లైట్ థెరపీ. ఇది చర్మాన్ని పునరుజ్జీవింపజేసి, వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి తోడ్పడుతుంది. రెండోది మైక్రోకరెంట్ టెక్నాలజీ. ఇది ముఖ కండరాలను ఉత్తేజపరచి, చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది.
మూడోది మసాజ్. దీనిద్వారా ముఖంలో రక్తప్రసరణ పెరిగి అలసట దూరమవుతుంది. నాలుగోది థెరప్యూటిక్ వార్మింగ్. ఇది చర్మానికి అవసరమైన వెచ్చదనాన్ని అందిస్తూ, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ను చర్మంలోకి త్వరగా ఇంకేలా చేస్తుంది. ఈ నాలుగు ఫంక్షన్లను ఉపయోగించి నుదురు, బుగ్గలు, దవడ భాగం, పై పెదవి, మెడ, కళ్ల క్రింది భాగాలను సులువుగా మసాజ్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ తల భాగాన్ని అవసరాన్ని బట్టి తిప్పుకునేలా డిజైన్ చేయడం వల్ల వినియోగదారులకు ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇది చాలా కాంపాక్ట్గా ఉండటం వల్ల ఆఫీసులకు, ప్రయాణాలకు కూడా సులభంగా తీసుకెళ్లవచ్చు.
పాదాలనూ పట్టించుకోండి!
చాలామంది ముఖ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యం పాదాల సంరక్షణకు ఇవ్వరు. కానీ పాదాలనూ పట్టించుకోవడం కూడా ముఖ్యం. పాదాలపై పేరుకుపోయే మృతకణాలు పాదాల అందాన్ని దెబ్బతీస్తాయి. వారానికి ఒకసారి ప్యూమిస్ స్టోన్ లేదా మంచి ఫుట్ స్క్రబ్ సహాయంతో పాదాలను సున్నితంగా రుద్ది మృతకణాలను తొలగించాలి. అలాగే స్నానం చేసిన వెంటనే పాదాలు మృదువుగా అనిపించినప్పటికీ, ప్రతిరోజూ మాయిశ్చరైజర్ రాయడం అలవాటు చేసుకోవాలి.
రోజంతా హై హీల్స్, టైట్ షూస్ వేసుకుని పాదాలను ఇబ్బంది పెట్టకుండా, ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఖాళీ పాదాలతో నడవడానికి ప్రయత్నించండి. గడ్డి మీదనో, లేదంటే ఇసుకలోనో నడవడం వల్ల పాదాల్లో రక్తప్రసరణ మెరుగవుతుంది. అలాగే మడమ నుంచి వేళ్ల వరకు వృత్తాకారంలో మసాజ్ చేయడం వల్ల పాదాల కండరాలు రిలాక్స్ అవుతాయి. వారానికి ఒకట్రెండు సార్లు గోరువెచ్చని నీటిలో సుమారు పావుగంట సేపు పాదాలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాదాల అలసట దూరమవడమే కాకుండా, చర్మం మృదువుగా మారుతుంది.
తలనెరపు నివారణకు గాడిద కాలేయం!
ప్రాచీన ఈజిప్షియన్లు సౌందర్య పోషణ కోసం రకరకాల ప్రయోగాలు చేసేవారు. తలనెరపు నివారణ కోసం గాడిద కాలేయాన్ని ఉపయోగించేవారు. గాడిద కాలేయాన్ని ఒక పాత్రలో కుళ్లిపోయేంత వరకు నిల్వ ఉంచి, దానిని నీళ్లలో ఉడికించి జంతువుల కొవ్వుతో కలిపి తలకు పట్టించుకునేవారు.
గాడిద వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా ఉంటాయి కాబట్టి, గాడిద కాలేయం వాడితే తమ జుట్టు కూడా నల్లబడుతుందని నమ్మేవారు. అయితే, ఈ చికిత్స వల్ల ఎలాంటి ఫలితమూ ఉండదని ఆధునిక వైద్య పరిశోధనలు తేల్చాయి.
(చదవండి: అందానికి ఆక్సిజన్...)


