లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) ట్రామా సెంటర్లో వైద్యులు ఒక అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 23 ఏళ్ల యువకుడి ప్రాణాలను కాపాడారు. ఫరూఖాబాద్కు చెందిన ఉమేష్ జూలై 13న నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడిపోగా, నాలుగు ఇనుప రాడ్లు అతని శరీరం గుండా దూసుకెళ్లాయి.
ప్రమాదస్థలంలో ఉన్నవారు రాడ్లను తొలగించడానికి ప్రయత్నించకుండా, వాటిని కత్తిరించి బాధితుడిని ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఆస్పత్రికి వచ్చేసరికి బాధితుడి మూత్రాశయం, చిన్న ప్రేగు, జీర్ణాశయం, ప్లీహం, డయాఫ్రమ్, ఎడమ ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్లిష్ట స్థితిలో డాక్టర్ సమీర్ మిశ్రా నేతృత్వంలోని వైద్య బృందం సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు శ్రమించి రాడ్లను తొలగించి, దెబ్బతిన్న అవయవాలకు చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, బాధితుల శరీరంలోకి దిగిన వస్తువులను ఆసుపత్రికి వెళ్లే వరకు బలవంతంగా తొలగించకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు.. ఇకపై డాక్టర్ బాబు!


