‘‘అన్నా.. హాస్టల్లో భోజనం సరిగ్గా ఉండదు.. అన్నంలో పురుగులు వస్తున్నాయ్’’ అంటూ పిల్లలు చెప్పిన మాటలకు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చలించిపోయారు. చెన్నైలోని సైదాపేటలో ఉన్న ఎంసీ రాజా సోషల్ జస్టిస్ స్టూడెంట్స్ హాస్టల్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హాస్టల్కు చేరుకున్న విజయ్.. అక్కడి వసతులు, నిర్వహణ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత లోపాలు, నీటి సమస్యలు, సిబ్బంది కొరత వంటి అంశాలను వివరించారు.
ఫిర్యాదు చేస్తే కొద్దిరోజులే..
హాస్టల్లో అందించే భోజనం నాణ్యతపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆహారంలో పురుగులు కనిపిస్తున్నాయని, భోజనం విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని వారు సీఎంకు తెలిపారు. గతంలో విద్యార్థుల ఆందోళనల తర్వాత కొంతకాలం ఆహారం నాణ్యత మెరుగుపడిందని, కానీ కొద్దిరోజులకే మళ్లీ పాత పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగదిలో పరిశుభ్రత పాటించడం లేదని, సిబ్బంది గ్లౌజులు, క్యాప్స్ వంటి రక్షణ పరికరాలు ఉపయోగించడం లేదని చెప్పారు.
హాస్టల్స్ లో దయనీయ స్థితి..
సీఎం విజయ్ వద్ద తమ గోడు వినిపించిన విద్యార్థులు
అభివృద్ధిలో టాప్ 5 స్థానాల్లో ఉన్న తమిళనాడులో వాస్తవ పరిస్థితులు ఇవి..#CMVijay pic.twitter.com/JTgr31HMGW— UttarandhraNow (@UttarandhraNow) July 17, 2026
వసతులపై విద్యార్థుల ఫిర్యాదులు
హాస్టల్లో నీటి సరఫరా సమస్యలు, మరుగుదొడ్ల నిర్వహణ లోపాలు, సిబ్బంది కొరత, భద్రతా లోపాలపై కూడా విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, హాస్టల్లో భద్రతపై ఆందోళన ఉందని తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.
రాత్రి ఆలస్యంగా కోచింగ్ తరగతులు లేదా పనుల నుంచి వచ్చే విద్యార్థులకు గేట్లు మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు విద్యార్థులు చెప్పారు. స్పోర్ట్స్ సదుపాయాలు, ఆధునిక జిమ్, లైబ్రరీలో మరిన్ని పుస్తకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం స్పందన.. అధికారులకు ఆదేశాలు
విద్యార్థుల సమస్యలను ఓపికగా విన్న సీఎం విజయ్.. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భోజనం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. హాస్టల్లోని వంటగది, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించిన విజయ్.. సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. తదుపరి తనిఖీ నాటికి అన్ని లోపాలు సరిచేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
రూ.44.50 కోట్లతో నిర్మించిన హైటెక్ హాస్టల్
సైదాపేటలోని ఈ 10 అంతస్తుల హాస్టల్ను గత డీఎంకే ప్రభుత్వ హయాంలో సుమారు రూ.44.50 కోట్లతో నిర్మించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. లిఫ్ట్లు సహా పలు ఆధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. నిర్వహణ లోపాలపై విద్యార్థుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో సీఎం స్వయంగా తనిఖీ చేపట్టినట్లు సమాచారం.

వరుసగా రెండో ఆకస్మిక తనిఖీ
ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల చెన్నైలోని ఎగ్మోర్ చిన్నారుల ఆసుపత్రిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాజాగా విద్యార్థుల హాస్టల్ను సందర్శించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. “సమస్యలు చెప్పేందుకు ప్రజలు సీఎం వద్దకు వెళ్లడం కాదు.. సీఎం స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లడం” అనే విధంగా ఆయన తనిఖీలపై చర్చ జరుగుతోంది.


