వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్‌గాంధీ | Rahul Gandhi on removal of Sonam Wangchuk from Jantar Mantar | Sakshi
Sakshi News home page

వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్‌గాంధీ

Jul 18 2026 5:19 PM | Updated on Jul 18 2026 5:56 PM

Rahul Gandhi on removal of Sonam Wangchuk from Jantar Mantar

 సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలపై జవాబుదారీతనం కోరుతూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులకు పైగా జరుగుతున్న నిరసనలు, సామాజిక ఉద్యమకారుడు  సోనమ్‌ వాంగ్‌చుక్‌ తరలింపుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు.  ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రధాన విధానాలపై విమర్శలు గుప్పించారు.

గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను నిరసన స్థలం నుండి బలవంతంగా తరలించి, ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది గంటలకే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసత్యం, హింసలే మోదీ ప్రభుత్వ ప్రధాన సూత్రాలు అంటూ ఎక్స్‌ వేదికగా తీవ్రంగా  స్పందించారు.   అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను బలవంతంగా తరలించడం తప్పు అంటూ శనివారం ట్వీట్‌ చేశారు.

 విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ వరుస ట్వీట్లలో స్పందించారు. ఎంతటి బలప్రయోగం చేసినా, ఈ సమస్యలను లేవనెత్తకుండా భారతదేశ విద్యార్థులను గానీ, వారిని ప్రేమించి విశ్వసించే మనల్ని గానీ ఎవరూ ఆపలేరన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో పేపర్ లీక్‌లు, పెరిగిపోతున్న విద్యా ఖర్చులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలపై గళమెత్తే భారతదేశ విద్యార్థులను లేదా వారికి మద్దతుగా నిలిచే వారిని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తద్వారా వాంగ్‌చుక్ నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతును చాటారు.

 

అలాగే తన కుమార్తెను కోల్పోయిన బాధలో రియా తండ్రి రాజేష్ ఎంతో కుంగిపోయారనీ,  ఆయనను చూసిన ప్రతి ఒక్కరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయన్నారు. ఇది కేవలం ఒక కుటుంబం పడుతున్న వేదన మాత్రమే కాదు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటన ఇలాంటి అనేక కుటుంబాల నుండి వారి పిల్లలను దూరం చేసింది. ప్రతీబాధితుడి వెనుక ఒక తల్లి, ఒక తండ్రి ఉంటారు,  కానీ వారికి ఇక రేపు అనే ఆశ లేకుండా పోయింది. ఈ వ్యవస్థను మొదటి నుండి పునర్నిర్మించాల్సి ఉంది.  పిల్లలకు ఒత్తిడి కాకుండా భద్రత లభించాలి, అలాగే తల్లిదండ్రులకు కన్నీళ్లు కాకుండా, వారి త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కాలని రాహుల్‌ తెలిపారు. అంతకు ముందు గురువారం, కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్లకు బహిరంగంగా మద్దతు పలికింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూనే, దీక్షను విరమించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ వాంగ్‌చుక్‌ను కోరారు.

కాగా జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం ఉదయం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల సలహా మేరకు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా  ఆయనను ఆసుపత్రికి మార్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు తమ ఆందోళనను విరమించి, ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జూన్ 28 నుండి వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. గత మూడు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీక్ష ప్రారంభమైనప్పటి నుండి ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారని, బీపీ, బ్లడ్ షుగర్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు శుక్రవారం తెలిపారు.

ఇదీ చదవండి: వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్‌గాంధీ

మరోవైపు వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించిన తర్వాత, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తాను నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.  వాంగ్‌ చుక్‌ను తరలించినప్పటికీ ఈ ఉద్యమం కొనసాగుతుందని  స్పష్టం చేశారు.

 ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్‌ : నిద్రలేమే వరంలా మారింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement