న్యూఢిల్లీ: లాఠీచార్జ్తో విద్యార్థులను పోలీసులు చితకబాదారన్న వార్తల నడుమ మరో దారుణోదంతం వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ సమీపంలో జూన్ 20వ తేదీన జరిగిన చలో సంసద్ ర్యాలో పోలీసులు చట్టవిరద్ధంగా పెల్లెట్ గన్లను ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. తాము వాటిని ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నప్పటికీ పెల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో శస్త్రచికిత్సచేయించుకున్న పలువురి మెడికల్ రిపోర్ట్లు బహిర్గతంకావడంతో ఈ ఖాకీ దుస్తుల కర్కోటక వైఖరి తేటతెల్లమైంది. నిరాయుధులైన ఉద్యమకారులు శాంతియుతంగా చేసే ర్యాలీల్లో పెల్లెట్లు ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమతి మానవహక్కుల విభాగం గతంలోనే ఎన్నోసార్లు మొత్తుకున్నా ఢిల్లీ పోలీసులు మొద్దనిద్రపోతూ ఇప్పుడు సీజేపీ కార్యకర్తలపై పెల్లెట్ల వర్షం కురిపించారని సామాజికమాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక కంట్లో చూపు కోల్పోయిన టీనేజర్
ర్యాలీలో పాల్గొన్న 19 ఏళ్ల సాహిల్ లోకాబ్ కుడి కంట్లోకి పెల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ముఖమంతా రక్తసిక్తమైన అతడిని వెంటనే సమీప లేడీ హార్డింగ్ వైద్యకళాశాలకు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి, అక్కడా సరైన పరిష్కారం లభించకపోవడంతో చివరకు ఎయిమ్స్ ట్రామా విభాగానికి 21వ తేదీన తరలించారు. వివరాలను అతని మేనమామ అజయ్ దుగ్గల్ ఏడుస్తూ చెప్పారు.
ఇప్పుడెలా ఉందిరా అని లోకాబ్ను అడిగితే అతను చెప్పిన సమాధానంతో నోట మాట రాలేదు. మసగ్గా కాదుకదా కనీసం వెలుగు కూడా కన్పించట్లేదు. అంతా చీకటే’’అని సమాధానమిచ్చారు. ‘‘పెల్లెట్ ధాటికి అతని కుడి కంటి కారి్నయాకు రంధ్రం పడింది. కారి్నయల్ పెర్ఫోరేషన్ కారణంగా కుడి కంటితో చూడగలిగే అవకాశాలు కేవలం ఒక శాతం’’అని వైద్యులు చెప్పారు. మెడ, ఛాతి, భుజం, చేతిలోకీ పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఒకటి కుడి కంట్లో ఉండిపోయింది. ఢిల్లీ వర్సిటీ దూరవిద్యా కోర్సులో సాహిల్ డిగ్రీ చేస్తున్నాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు సిద్దమవుతున్నాడు. ఇప్పుడు ఇతని భవిష్యత్ ఏంటి? అని అతని కుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది.
సాహిల్లాగా మరెంతో మంది పెల్లెట్ల బారిన పడ్డారని మీడియాలో సాక్ష్యాధారాలతో సహా కథనాలు వెలువడుతున్నాయి. పలువురి ముఖం, ఛాతీ, మెడ, భుజాల్లోకి పెల్లెట్లు దూసుకెళ్లాయి. ఔట్లుక్ రిపోర్టర్, 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరీ సైతం పెల్లెట్ల బారినపడి శస్త్రచిక్సిత చేయించుకోవాల్సి వచ్చింది. వివరాలను మన్సూరీ వెల్లడించారు. ‘‘ఆరోజు మధ్యాహ్నం మూడున్నరకు ఉద్యమకారులతోపాటు వెళ్తుంటే కన్నాట్ ప్లేస్లోని పాలికా బజార్ వద్ద సీఆర్పీఎఫ్లోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు గాల్లోకి బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. తర్వాత నేరుగా ఏదో ఆయుధం గురిపెట్టారు.
కొన్ని సెకన్ల తేడాతో ఏదో వచ్చి నా ఎడమ కనుబొమ్మకు గుచ్చుకుంది. తర్వాత ఇంకొన్ని ఇనుపముక్కల్లాంటి నుదురు, ముక్కు, గదమ వద్ద గుచ్చుకున్నాయి. మెడలోకీ దూసుకెళ్లాయి. బాధ తాళలేక వెంటనే ఆస్పత్రికి వెళ్లా. వైద్యులు వాటిని పెల్లెట్లుగా నిర్ధారించారు. మూడు పెల్లెట్లను వెంటనే తొలగించకపోతే ప్రమాదమని చెప్పారు. ఒకటి మెడలో ప్రధాన నరం, రక్తనాళం సమీపంలో ఇరుక్కుంది. ఇంకోటి ఎడమ కంటి కదలికలను నియంత్రించే కండరం వద్ద చిక్కుకుంది. ఇంకోటి ముక్కు సమీపంలో ముఖంలోకి వెళ్లింది. వీటిని తీయకపోతే ప్రమాదమని చెప్పారు. సర్జన్ అందుబాటులో లేకపోవడంతో తర్వాతి రోజు శస్త్రచికిత్స చేసి తొలగించారు’’అని మన్సూరీ వెల్లడించారు.
ఏమిటీ పెల్లెట్లు?
పెల్లెట్ గన్ను పంప్–యాక్షన్ గన్ లేదా షాట్గన్ అని కూడా పిలుస్తారు. వీటిని పేలిస్తే చాలా చిన్నగా ఉండే ఇనుపముక్కల్లాంటివి జల్లెడలా చుట్టూతా వేగంగా దూసుకెళ్తాయి. ఇవి సెకన్కు 1,000 అడుగుల వేగంతో దూసుకెళ్తాయి. వీటిని ఏదైనా ఖనిజంతో లేదా రబ్బర్తో తయారుచేస్తారు. గన్లోని ఒక్కో క్యాట్రిడ్జ్లో 600 వరకు పెల్లెట్లు ఉంటాయి. ది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇతర నిబంధనల ప్రకారం ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ)ను పాటిస్తూ తొలుత పోలీసులు మైక్లో ఆందోళనకారులను శాంతించాలని హెచ్చరించాలి. తర్వాత జలఫిరంగులతో అడ్డుకోవాలి. బాష్పవాయుగోళాలు ప్రయోగించాలి. తప్పదనుకుంటే లాఠీచార్జ్ చేయాలి. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే పెల్లెట్లు ప్రయోగించాలి. అవి కూడా నడుం కిందకు గురిపెట్టి కాల్చాలి. కానీ ప్రభుత్వ సాయుధబలగాలు ఉద్యమకారులను తరమికొట్టేందుకు నేరుగా ముఖం, ఛాతికి గురిపెడుతున్నాయని చాన్నాళ్ల నుంచి ఆరోపణలున్నాయి.


