ఉభయ సభల్లో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
రాజ్యసభలో ప్రవేశపెట్టిన వైవీ సుబ్బారెడ్డి
లోక్సభలో వాయిదా తీర్మానం కోరిన మద్దిల గురుమూర్తి
లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును బాబు ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టిందని ఆవేదన
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అంతులేని అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి సన్నద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న దాదాపు 16వేల టీచర్ల నియామకానికి సంబంధించిన మెగా డీఎస్సీ–2025లో భారీ స్థాయి అక్రమాలపై పార్లమెంట్ ఉభయసభలలో చర్చ జరగాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉభయ సభల్లో వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్సభలో ఎంపీ ఎం.గురుమూర్తి వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు.
‘నీట్’ సమస్యంత తీవ్రమైనదే..
‘మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలు దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టాయి. ప్రస్తుతం 22.79 లక్షల మంది ‘నీట్’ అభ్యర్థుల సమస్యపై పార్లమెంటులో చర్చించినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును అంధకారం చేస్తున్న మెగా డీఎస్సీ అక్రమాలపైనా చర్చ జరగాలి. అంతేకాదు ఇది నిరుద్యోగ యువత భవిష్యత్తు.
ప్రభుత్వ సంస్థల విశ్వసనీయత, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు సంబంధించిన అంశం. అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన పోటీపరీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం, పరీక్ష నిర్వహణను ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం, తుది ఫలితాలకు సంబంధించి మెరిట్, రోస్టర్ జాబితాలను బహిర్గతం చేయకపోవడం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత కూడా జాబితాల నుంచి అభ్యర్థుల పేర్లను తారుమారు చేయడం, స్పోర్ట్స్ కోటా నిబంధనల్లో మార్పులు చేయడం, రిజర్వేషన్లు పాటించకపోవడం, ప్రశ్నపత్రాల లీకేజీ, డబ్బులకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తడం, పరీక్షా పనులతో సంబంధం ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా మొదటి ర్యాంకు రావడం, దీనిపై విమర్శలు రావడంతో తర్వాత అతని పేరును తుది జాబితా నుంచి తొలగించడం వంటి పలు అవకతవకలు టీచర్ అభ్యర్థుల విశ్వాసాన్ని దెబ్బ తీశాయి.
దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. డిజిటల్ «ఆధారాలను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలి, అర్హులైన టీచర్ అభ్యర్థులకు న్యాయం చేయాలి’అని వాయిదా తీర్మానాల్లో ఎంపీలు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షపాతం, విశ్వసనీయతను కాపాడేలా సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. వీటన్నింటిపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించాల్సి ఉందని ఉద్ఘాటించారు.
మామిడి మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి
లోక్సభ ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి
మామిడి కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని, ఈ దిశలో కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ అంశాన్ని లోక్సభ జీరో అవర్లో ఆయన ప్రస్తావించారు. ‘ఆంధ్రప్రదేశ్లో రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలోకు రూ.25 వరకు ధర పలికిన తోతాపూరి మామిడిని ప్రస్తుతం కిలోకు కేవలం రూ.2 నుంచి రూ.7 మధ్య మాత్రమే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రాసెసింగ్ యూనిట్లు కిలోకు నాలుగైదు రూపాయలు మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులకు సాగు ఖర్చులు కూడా రావట్లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ, దానికి చట్టబద్ధ హామీ లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కూడా ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు కొనుగోలు అవుతోంది. చెల్లింపుల్లోనూ జాప్యమవుతోంది’ అని ఎంపీ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతులను బలోపేతం చేసి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అభ్యరి్థంచారు.


