breaking news
Y.V. Subba Reddy
-
మెగా డీఎస్సీలో అక్రమాలపై పార్లమెంటులో చర్చించాలి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అంతులేని అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి సన్నద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న దాదాపు 16వేల టీచర్ల నియామకానికి సంబంధించిన మెగా డీఎస్సీ–2025లో భారీ స్థాయి అక్రమాలపై పార్లమెంట్ ఉభయసభలలో చర్చ జరగాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉభయ సభల్లో వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్సభలో ఎంపీ ఎం.గురుమూర్తి వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. ‘నీట్’ సమస్యంత తీవ్రమైనదే.. ‘మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలు దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టాయి. ప్రస్తుతం 22.79 లక్షల మంది ‘నీట్’ అభ్యర్థుల సమస్యపై పార్లమెంటులో చర్చించినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును అంధకారం చేస్తున్న మెగా డీఎస్సీ అక్రమాలపైనా చర్చ జరగాలి. అంతేకాదు ఇది నిరుద్యోగ యువత భవిష్యత్తు. ప్రభుత్వ సంస్థల విశ్వసనీయత, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు సంబంధించిన అంశం. అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన పోటీపరీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం, పరీక్ష నిర్వహణను ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం, తుది ఫలితాలకు సంబంధించి మెరిట్, రోస్టర్ జాబితాలను బహిర్గతం చేయకపోవడం, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత కూడా జాబితాల నుంచి అభ్యర్థుల పేర్లను తారుమారు చేయడం, స్పోర్ట్స్ కోటా నిబంధనల్లో మార్పులు చేయడం, రిజర్వేషన్లు పాటించకపోవడం, ప్రశ్నపత్రాల లీకేజీ, డబ్బులకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తడం, పరీక్షా పనులతో సంబంధం ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా మొదటి ర్యాంకు రావడం, దీనిపై విమర్శలు రావడంతో తర్వాత అతని పేరును తుది జాబితా నుంచి తొలగించడం వంటి పలు అవకతవకలు టీచర్ అభ్యర్థుల విశ్వాసాన్ని దెబ్బ తీశాయి. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. డిజిటల్ «ఆధారాలను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలి, అర్హులైన టీచర్ అభ్యర్థులకు న్యాయం చేయాలి’అని వాయిదా తీర్మానాల్లో ఎంపీలు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షపాతం, విశ్వసనీయతను కాపాడేలా సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. వీటన్నింటిపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించాల్సి ఉందని ఉద్ఘాటించారు. మామిడి మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి లోక్సభ ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి మామిడి కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని, ఈ దిశలో కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ అంశాన్ని లోక్సభ జీరో అవర్లో ఆయన ప్రస్తావించారు. ‘ఆంధ్రప్రదేశ్లో రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలోకు రూ.25 వరకు ధర పలికిన తోతాపూరి మామిడిని ప్రస్తుతం కిలోకు కేవలం రూ.2 నుంచి రూ.7 మధ్య మాత్రమే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాసెసింగ్ యూనిట్లు కిలోకు నాలుగైదు రూపాయలు మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులకు సాగు ఖర్చులు కూడా రావట్లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ, దానికి చట్టబద్ధ హామీ లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కూడా ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు కొనుగోలు అవుతోంది. చెల్లింపుల్లోనూ జాప్యమవుతోంది’ అని ఎంపీ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతులను బలోపేతం చేసి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అభ్యరి్థంచారు. -
ప్యాన్ హవా ఖాయం
వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోకు అపూర్వ ఆదరణ ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారె డ్డి వెల్లడి వల్లూరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జిల్లాలోని లోక్సభతోపాటు, అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల సమ ప్రాధాన్యత ఉందన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని జిల్లాకు వచ్చారు. ఒంగోలు మార్గంలోని వల్లూరమ్మ, అయ్యప్ప ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో పార్టీ చీఫ్విప్ బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పార్టీ వ్యవహారాలపై కొద్దిసేపు మాట్లాడారు. ఆ తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం నివాసానికి చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ... తాను 17వ తేదీన ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానన్నారు.పార్టీ ఎన్నికల అజెండాపై అన్ని సామాజిక వర్గాల నుంచి అపూర్వ ఆదరణ లభించిందన్నారు. పార్టీ అధినేత జగన్ ఆశయాల సాధనకు ప్రతీ ఓటరు నిబద్ధతతో పనిచేసేందుకు సిద్ధమ య్యారని వివరించారు. పేద , మధ్యతరగతి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన జగన్ రానున్న ఐదేళ్లలో అజెండాలోని అంశాలను ఆచరణలోకి తెస్తారనే నమ్మకం ప్రజలకు కలిగిందని చెప్పారు.దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, అదే నమ్మకం జగన్పై కలుగుతుందన్నారు. సీట్ల కేటాయింపునకు సంబంధించి జిల్లాలో ఎక్కడా అసంతృప్తికి తావేలేదని స్పష్టం చేశారు. అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్కు దక్కుతుందన్నారు.మహానేత ఆశయాల సాధనే లక్ష్యం వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి టంగుటూరుమహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకెళతామని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వల్లూరులోని వల్లూరమ్మ దేవాలయంలో సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. సుబ్బారెడ్డి రాక సందర్భంగా జిల్లాలోని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే వల్లూరమ్మ దేవస్థానానికి చేరుకున్నారు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం బయలు దేరిన సుబ్బారెడ్డి నేరుగా వల్లూరు వచ్చారు. సుబ్బారెడ్డికి స్వాగతం పలికిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, కొండపి, కనిగిరి అసెంబ్లీ అభ్యర్థులు జూపూడి ప్రభాకరరావు, బుర్రా మధుసూదన్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు బొట్లా రామారావు, పార్టీ నాయకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, యువజన నాయకులు కేవీ రమణారెడ్డి, వై. వెంకటేశ్వరరావు, ఢాకా పిచ్చిరెడ్డి, మండల నాయకులు కుందం హనుమారెడ్డి, సూరం రమణారెడ్డి, సోమిరెడ్డి ఉన్నారు. -
రైతు శంఖారావం వాయిదా : వై.వి.సుబ్బారెడ్డి
త్వరలోనే విజయవాడలో భారీ సభ: వై.వి.సుబ్బారెడ్డి సాక్షి, విజయవాడ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4న విజయవాడలో జరుప తలపెట్టిన సమైక్య రైతు శం ఖారావం సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. సమైక్య రైతు శంఖారావం సభను విజయవంతం చేసేందుకు జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యేం దుకు ఆయన సోమవారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ నియోజకవర్గాల కన్వీనర్లతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్య రైతుశంఖారావం సభకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హాజరుకావాల్సి ఉందని.. అయితే సీబీఐ కోర్టు అనుమతి రాకపోవటంతో ప్రస్తుతానికి సభ వాయిదా వేస్తున్నామని, కోర్టు అనుమతి రాగానే కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులతో కలిపి పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్లో అక్టోబర్ 15 నుంచి 20 మధ్యలో పెద్ద ఎత్తున సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నారని దాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 1 వరకు పార్టీ నిర్ణయించిన వివిధ కార్యక్రమాలను నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని.. ఉద్యమంలో వైఎస్సార్ సీపీ ముందుండాలని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే కృష్ణా, గుంటూరు జిల్లా రైతులతో విజయవాడలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తామని పార్టీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగే సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, కుక్కల నాగేశ్వరరావు, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్ఖాన్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, కృష్ణా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సమావేశం వాయిదా
విజయవాడ, న్యూస్లైన్ : విజయవాడలో ఆదివారం జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి అత్యవసర సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నిర్వహించాలని భావించి పార్టీ జిల్లా క్యాడర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేశామని, ఈ మార్పును పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించి సహకరించాలని కోరారు. విజయవాడ సీతారామపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ఈ అత్యవసర సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, అన్ని మండలాల కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు విధిగా హాజరుకావాలని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వచ్చే నెలాఖరు వరకు పార్టీ తరఫున చేపట్టాల్సిన కొన్ని కార్యక్రమాలపై విధివిధానాలు రూపొందించినట్లు తెలిపారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ వారివారి నియోజకవర్గాల్లో నిరవధిక నిరాహార దీక్షలు చేయాల్సి ఉందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి కోర్టు అనుమతి ఇస్తే అక్టోబర్ నాలుగున గుంటూరులో జరపతలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.


