ఢాకా: బంగ్లాదేశ్లో మీజిల్స్ (తట్టు) మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ వైరల్ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అనుమానిత కేసుల సంఖ్య 1.66 లక్షలు దాటినట్లు ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డీజీహెచ్ఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అనుమానిత మీజిల్స్ కారణంగా నమోదైన మరణాల సంఖ్య 1,000కు చేరువలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ పరిస్థితిని జాతీయ స్థాయిలో అధిక ప్రమాద సంక్షోభంగా వర్గీకరించింది.
దేశంలోని మొత్తం 64 జిల్లాల్లోనూ వ్యాధి వ్యాప్తి నమోదైంది. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా రాజధాని ఢాకాలోని నివాస ప్రాంతాలు, మురికివాడలు ప్రధాన కేంద్రాలుగా మారాయి. మొత్తం కేసుల్లో ఐదేళ్లలోపు పిల్లల వాటా సుమారు 80 శాతంగా ఉంది. తొమ్మిది నెలల్లోపు శిశువుల్లోనే దాదాపు మూడో వంతు ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. పోషకాహార లోపం కారణంగా న్యూమోనియా, మెదడువాపు వంటి తీవ్ర సమస్యల ముప్పు మరింత పెరిగింది.
జనాభాలో వ్యాధి నిరోధక శక్తి లోపించడమే ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణమని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. టీకాల కొరత కారణంగా భారీ సంఖ్యలో పిల్లలు ఈ వ్యాధికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. వ్యాప్తిని అరికట్టేందుకు రెండు డోసుల టీకాతో కనీసం 95 శాతం కవరేజీ అవసరమని ప్రపంచ ప్రమాణాలు చెబుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో బంగ్లాదేశ్ ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు.
మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, గావి వ్యాక్సిన్ అలయన్స్తో కలిసి అత్యవసర జాతీయ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సుమారు 1.8 కోట్ల మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని తాత్కాలిక కమ్యూనిటీ కేంద్రాలు, పాఠశాలలు, ఇంటింటి ప్రచారం ద్వారా ఆరోగ్య సిబ్బంది టీకాలు అందిస్తున్నారు. అయినప్పటికీ తీవ్రంగా ప్రభావిత జిల్లాల్లోని వైద్య సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. పిల్లలకు పూర్తి స్థాయిలో టీకాలు వేయించాలని, మీజిల్స్పై సాధారణ టీకాలే సమర్థవంతమైన రక్షణ మార్గమని అధికారులు కుటుంబాలకు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gujarat: అర్థరాత్రి కూలిన భవనం.. శిథిలాల్లో కార్మికులు


