ఇరాన్‌ దెబ్బ.. అమెరికా ఫైటర్‌ జెట్లకు చిల్లు! | Several US Fighter Jets Damaged in Iranian Strike on Jordan Airbase | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ దెబ్బ.. అమెరికా ఫైటర్‌ జెట్లకు చిల్లు!

Sep 10 2026 11:10 AM | Updated on Sep 10 2026 11:18 AM

Several US Fighter Jets Damaged in Iranian Strike on Jordan Airbase

ఇరాన్‌ మరోసారి అమెరికాపై విరుచుకుపడింది. జోర్డాన్‌లోని కీలక అమెరికా వైమానిక స్థావరంపై రాత్రికి రాత్రే భారీ క్షిపణి దాడులు జరిపింది. క్షిపణుల వర్షం కురిపించడంతో  పలు యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఒక ఏ-10 థండర్‌బోల్ట్‌ విమానం నాశనం కాగా.. మరో ఎనిమిది ఎఫ్‌-15 యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం.

జోర్డాన్‌లోని మువాఫాక్‌ సాల్టీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ ఈ దాడులు జరిపినట్లు సీబీఎస్‌ న్యూస్‌ ఏజెన్సీ ఓ కథనం ఇచ్చింది. ఇరాన్‌పై అమెరికా సైనిక కార్యకలాపాలకు ఈ స్థావరం కీలక కేంద్రంగా ఉండడం గమనార్హం. ఇక దాడులను అడ్డుకునేందుకు అమెరికా బలగాలు 30కి పైగా పేట్రియాట్‌ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. 

దెబ్బతిన్న విమానాలపై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఒక ఏ-10 థండర్‌బోల్ట్‌ తీవ్రంగా దెబ్బతిని, దాని ఒక రెక్క పూర్తిగా కనిపించకుండా పోయినట్లు వెల్లడించింది. సుమారు ఎనిమిది ఎఫ్‌-15లకు స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ.. వాటిని తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొంది.

అందుకు ప్రతీకారంగానే..
ఇటీవల అమెరికా ఐదు ఇరాన్‌ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మరింత ముదిరింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్‌ అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై వరుస దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) తమ దాడుల్లో జోర్డాన్‌లోని అల్‌ అజ్రాక్‌ అమెరికా స్థావరాన్ని భారీ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. అలాగే హర్ముజ్‌ జలసంధి వైపు వెళ్తున్న పలు నౌకలపైనా దాడులు చేసినట్లు వెల్లడించింది.

అయితే ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల్లో 20 జోర్డాన్‌ గగనతలంలోకి వచ్చినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. వీటిలో 18 క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని, మిగిలిన రెండు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది.

యుద్ధానికి ముగింపు పలుకుతాం.. కానీ ఇవే షరతులు
మరోవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ సంకేతాలు ఇచ్చింది. అయితే అమెరికా తమ కొన్ని షరతులకు అంగీకరించాలని స్పష్టం చేసింది. లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం, యెమెన్‌పై దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన 24 బిలియన్‌ డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, తమ అణు, క్షిపణి సామర్థ్యాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి డిమాండ్లను ముందుపెట్టింది.

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి త్వరలో ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగిసిపోతుందని బుధవారం ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌ ఇక ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు.

అయితే ట్రంప్‌ వ్యాఖ్యలకు భిన్నంగా అమెరికా ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తెలిపింది. యుద్ధం ట్రంప్‌ పదవీకాలంలో మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయనకు సన్నిహితంగా ఉన్న ఉన్నతాధికారులు ప్రైవేటుగా హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇరాన్‌–అమెరికా ఘర్షణకు తక్షణమే తెరపడుతుందా? మరింత కాలం కొనసాగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: ట్రంప్‌ ఎండ్‌ గేమ్‌ ప్లాన్‌ ఇదేనంట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement