పొలంలోకి దిగి వ్యవసాయ పనులు చేయడాన్ని చూసి ఆమెను ఎగతాళి చేశారు. కానీ ఆ మాటలకు సమాధానం చెప్పడానికి ఆమె మాటలను ఎంచుకోలేదు.. పనినే ఎంచుకుంది. అలా అర ఎకరంతో మొదలు పెట్టి 40 ఎకరాల వ్యవసాయ సామ్రాజ్యాన్ని నిర్మించింది పంజాబ్లోని మోగా ప్రాంతానికి చెందిన మణ్దీప్ కౌర్ ఖైరా. వ్యవసాయంలోకి అడుగుపెట్టినపుడు ఆమెకున్నది కేవలం అరెకరం పొలం మాత్రమే. కానీ ఆమెకు అది అడ్డంకిగా అనిపించలేదు. భూమిని లీజుకు తీసుకుని కూడా వ్యవసాయం చేయవచ్చునని ఆలోచించింది.
ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చివరకు 40 ఎకరాల్లో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించే స్థాయికి చేరుకుంది. ఇందులో ఎక్కువ భూమి లీజుకు తీసుకున్నదే. అలా పొలంలో పనిచేయడం నుంచి పదిమందితో పెద్ద ఎత్తున వ్యవసాయం చేయించే స్థాయికి చేరుకుంది మణ్దీప్. అయితే 40 ఎకరాల స్థాయిలో వ్యవసాయం చేయాలంటే కేవలం భూమి ఉంటే సరిపోదు. యంత్రాలు, పరికరాలు, పెట్టుబడి, నిర్వహణ సామర్థ్యం కూడా అవసరం.
ఇందుకోసం మణ్దీప్ కౌర్ మూడు ట్రాక్టర్లు, ఏడు ట్రాలీలు, ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సొంతంగా కొనుగోలు చేసింది. అలా ఈ మహిళా రైతు ఏడాదికి వ్యవసాయం ద్వారా 80 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సమాజంలో ఎక్కువ భూమి ఉన్నవారినే పెద్ద రైతులుగా భావించే పరిస్థితి ఉంది. కానీ మణ్దీప్ కౌర్ కథ ఈ ఆలోచనకు భిన్నమైనది. సొంత భూమి లేదని ఆగిపోకుండా.. తనకున్న ఆలోచనతో ముందుకు సాగి అందరి మన్ననలు పొందుతోంది.
(చదవండి: ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్ బ్రాండ్ వ్యాపారం!)


