న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీల ఉదంతంలో నమోదైన కేసుల సత్వర విచారణకు ఉద్దేశించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టును జడ్జి అను గ్రోవర్ బాలిగా సారథ్యంలో నడపనున్నట్లు ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రకటించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుల ప్రాంగణంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మహిళా జడ్జి అను గ్రోవర్ ప్రస్తుతం ఢిల్లీలోని సౌత్–ఈస్ట్ జిల్లాలో జిల్లా జడ్జి(కమర్షియల్–4)గా సేవలందిస్తున్నారు. పేపర్ లీకేజీ నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తానని ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ బాధ్యతల్లోకి జడ్జిని నియమించడం గమనార్హం.
ఉన్నత విద్య కార్యదర్శి బదిలీ..
కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని మోదీ సర్కార్ గురువారం ఆకస్మికంగా పంచాయతీరాజ్ శాఖకు బదిలీచేసింది. ఈయన స్థానంలో ఉన్నత విద్య కార్యదర్శిగా నరేశ్ కుమార్ గంగ్వార్ను నియమించారు. పాఠశాల విద్య కార్యదర్శిగానూ ఇన్నాళ్లూ వినీత్ జోషినే కొనసాగారు. ఇప్పుడు ఆయనను తప్పించడంతో పాఠశాల విద్యా కార్యదర్శిగా నూతనంగా టీకే అనిల్ కుమార్ను గురువారం నియమించారు.


