రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం | Parliament Monsoon Session 2026 Day 5 LIVE Updates | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

Jul 24 2026 11:12 AM | Updated on Jul 24 2026 2:27 PM

Parliament Monsoon Session 2026 Day 5 LIVE Updates

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఐదో రోజు అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. నీట్‌పై చర్చకు సిద్ధమని కేంద్రం చెబుతున్నా.. ముందు మంత్రి రాజీనామా చేశాకే చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో.. ఓసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభను స్పీకర్‌ ఓంబిర్లా సోమవారానికి వాయిదా వేశారు. 

అంతకు ముందు.. కార్గిల్‌ అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను సభను ప్రారంభించారు. అయితే ఆ కాసేపటికే విపక్షాల నినాదాలతో సభ మారుమోగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాతే నీట్‌ లీక్‌ వ్యవహారంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమైందని.. ఈ తరుణంలో సభ కార్యాకలాపాలకు ఆటంకం సరికాదని కేంద్రం తరఫున ప్రకటన వెలువడింది. ఈ తరుణంలో విపక్షాల శాంతిచకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12గం. దాకా వాయిదా వేశారు. 

అయితే తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. లోక్‌సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.. నీట్‌ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. విపక్ష నేత కే.సీ. వేణుగోపాల్‌తో మరోసారి చర్చించానని చెప్పారు. ప్రధాని మోదీ కూడా దేశానికి హామీ ఇచ్చారని, సోనమ్‌ వాంగ్‌చుక్‌ సైతం నిరాహార దీక్ష విరమించి చర్చ జరపాలని కోరారని రిజిజు పేర్కొన్నారు. నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వకపోతే అది దేశానికి సరైన సంకేతం ఇవ్వదని అన్నారు. అయినా విపక్షాలు శాంతించకపోవడంతో.. స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు. 

ఇక.. రాజ్యసభలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. సభ కాసేపు సాగినట్లే కనిపించినా.. ఆ వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేయడం, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 

రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లు
స్వాతంత్ర్య సమర కాలం నుంచి జాతీయ భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ‘వందేమాతరం’ గీతానికి మరింత గుర్తింపు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. వందేమాతర గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.

అంతకు ముందు.. పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ఎందుకని?.. ప్రకటన చేయాలనుకుంటే సభలో చేయాలని.. పార్లమెంట్‌లో మాట్లాడితే తాము సంతోషిస్తామని.. ఆ చర్చలో తాము పాల్గొంటామని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. నీట్‌ లీకును తీవ్ర నేరంగా చూస్తున్నామని.. నిందితులను వదిలే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. పేపర్‌లీక్‌లపై ఉక్కుపాదం మోపుతామని.. ఇందుకోసం కఠిన చట్టాలు తెస్తామని.. సోమవారం ఆ బిల్లును ప్రవేశపెడతామని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు మాత్రం మంత్రి రాజీనామా తర్వాత ఏదైనా అని పట్టుబడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement