సాక్షి,ఢిల్లీ: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారానికి గురైన నాలుగేళ్ల బాధితురాలికి ట్రీట్మెంట్ చేసేందుకు ఎందుకు నిరాకరించారు. బాధితులు పేదలనే చిన్నచూపా. మీరు ట్రీట్మెంట్ చేయకపోవడం వల్లే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మీ పేరు ముందు డాక్టర్ అనే పదాన్ని వినియోగించుకునేందుకు కూడా మీరు అనర్హులని సూచించింది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో మార్చి 16న దారుణం జరిగింది. చాక్లెట్ కొనిస్తాననే నెపంతో నిందితుడు నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు.ఆపై ప్రాణాలు తీశాడు. అయితే, ఇంటి నుంచి బయటకి వెళ్లిన చిన్నారి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్ని జల్లెడ పట్టారు.
ఈ క్రమంలో చిన్నారి రక్తస్త్రావానికి గురయ్యారు. దీంతో చిన్నారికి అత్యవసర చికిత్స నిమిత్తం రెండు గంటల పాటు ఖజన్ సింగ్ మాన్వి హెల్త్కేర్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అనే రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ, ఆ రెండు ఆసుపత్రులు చిన్నారిని చేర్చుకోవడానికి నిరాకరించాయి. చివరకు ఘాజియాబాద్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలోనే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది.
ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేయకపోగా, బాధితురాలి తల్లిదండ్రులపైనే భౌతిక దాడి చేసి లాకప్లో వేశారు. నోరు మూసుకుని ఉండాలని బెదిరించారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో మార్చి 17న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, పోస్ట్మార్టం నివేదికలో లైంగిక దాడి జరిగినట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ, పోలీసులు ప్రారంభంలో పోక్సో చట్టం లేదా అత్యాచారం (సెక్షన్ 376) సెక్షన్లను చేర్చకుండా, కేవలం హత్య కేసుగానే దర్యాప్తు చేశారు. చార్జ్షీట్ దాఖలు చేయడంలో కూడా తీవ్ర జాప్యం చేశారు
ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన బెంచ్ నేటి (జూలై 17) విచారణలో తీవ్రంగా స్పందించింది. ఆసుపత్రి తరఫు న్యాయవాదిని ఉద్దేశించి కోర్టు తీవ్రంగా హెచ్చరించింది.బాధితురాలు పేద కుటుంబానికి చెందినది కావడం వల్లేనా మీరు నిర్లక్ష్యం చేశారు? మీ ఫీజులు కట్టలేరని వదిలేశారా? అని ప్రశ్నించింది.మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించనప్పుడు మీ పేరు ముందు డాక్టర్ అని రాసుకునే అర్హత లేదు. మీలో కొంచెమైనా మానవత్వం ఉంటే, మీ ఆసుపత్రిలో సదుపాయాలు లేకపోయినా కనీసం మీరే స్వయంగా ఆ చిన్నారిని వేరే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేవారుఅని ధ్వజమెత్తింది.
ఆసుపత్రి, అక్కడ పనిచేసిన ఆయుర్వేద డాక్టర్ ప్రవర్తన అత్యంత కఠినమైన మనసుగా అభివర్ణించింది. ఈ దారుణానికి ప్రాయశ్చిత్తంగా బాధితురాలి కుటుంబానికి ఆయా ఆసుపత్రులు స్వచ్ఛందంగా భారీ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ద్వారా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
కేసులో తీవ్రమైన లోపాలను గుర్తించిన సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు అంతా కోర్టు పర్యవేక్షణలోనే జరుగుతోంది. బాధితురాలి కుటుంబానికి,సాక్షులకు ఎలాంటి బెదిరింపులు రాకుండా పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే వారం జరగనుంది.


