షాబాద్‌ హత్యల కేసులో కీలక పరిణామం | Shabad Six Murders Case, Police Register Case Over Accused Rajkumar’s Death, Probe Continues Into Suicide Angle | Sakshi
Sakshi News home page

షాబాద్‌ హత్యల కేసులో కీలక పరిణామం

Jul 17 2026 12:09 PM | Updated on Jul 17 2026 12:23 PM

Another Twist in Shabad Daivalaguda Case

సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన షాబాద్‌ ఆరు హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు బిడ్డలతో పాటు మైనర్‌ బాలిక, ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్‌ మృతిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియో, అతడి మొబైల్‌ ఫోన్‌లో లభించిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అతడి మరణం ఆత్మహత్యేనా? లేదంటే ఇతర కోణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జులై 10 తేదీ అర్ధరాత్రి సమయంలో రాజ్‌కుమార్‌ దైవాలగూడలో నరమేధం సృష్టించాడు. రెండు రోజుల తర్వాత.. కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో రాజ్‌కుమార్‌ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. మృతదేహం పక్కనే పురుగుమందు డబ్బా ఉండటంతో అతడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

సెల్ఫీ వీడియోలో ఏముంది?
రాజ్‌కుమార్‌ మొబైల్‌ ఫోన్‌లో పోలీసులు గుర్తించిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. అందులో తనపై నమోదైన పోక్సో కేసు, తన జీవితంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. బాధితులను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు కొన్ని గంటల ముందే ఈ వీడియోను రికార్డు చేసినట్లు గుర్తించారు.

అలాగే రాజ్‌కుమార్‌ రాసినట్లుగా భావిస్తున్న నాలుగు పేజీల లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన చర్యలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ లేఖ, సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు.

మృతిపై కూడా కేసు నమోదు
రాజ్‌కుమార్‌ మృతికి సంబంధించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. సెల్ఫీ వీడియో, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్‌ ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీడియోలో పేర్కొన్న వ్యక్తులను పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తోంది. చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే మృతిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఏం జరిగింది?
పోక్సో కేసు నమోదుపై కక్ష పెంచుకున్న రాజ్‌కుమార్‌.. గత శుక్రవారం రాత్రి బాలిక, ఆమె తల్లి, నానమ్మలను హత్య చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా కిరాతకంగా చంపేశాడు. కేవలం అరగంట వ్యవధిలోనే.. మొత్తం ఆరు హత్యలు చేశాడు. అనంతరం తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పి.. తాను చనిపోతున్నానంటూ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పరారయ్యాడు.

రెండు రోజుల వేట తర్వాత..
ఆరు హత్యల అనంతరం పరారైన రాజ్‌కుమార్‌ కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు, లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పెంజర్ల సమీపంలో అతడి మృతదేహం లభించడంతో గాలింపు ముగిసింది.

కుటుంబం నిరాకరించడంతో..
రాజ్‌కుమార్‌ మృతదేహాన్ని స్వీకరించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసుల ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement