ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఘటన
ఘటనాస్థలిని సందర్శించిన క్లూస్ టీమ్, డీసీపీ, ఏసీపీ, సీఐ
మెదక్, పటాన్చెరు: ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు చెట్ల పొదల్లో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. సదాశివపేటకు చెందిన మంజుల(45) 15 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో బతుకుదెరువు కోసం ఇద్దరు కొడుకులను తీసుకుని జీ.పీ డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ కాలనీకి వచ్చి ఉంటూ, స్థానికంగా మేస్త్రీ కింద కూలిపని చేస్తుంది. ఇద్దరు కుమారులు కూడా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం అంబేడ్కర్ కాలనీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కాగా గురువారం ఉదయం పటాన్చెరు శివారులో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో పక్కన మహిళ హత్యకు గురైందని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మంజుల తలకు, కంటికి తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అక్కడికి తీసుకువచ్చి తలపై బలంగా దాడి చేసి హత్య చేసి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
మృతురాలు ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందం, డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వినాయక్ రెడ్డి, సిబ్బందితో కలసి పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.


