సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత నాగార్జున యాదవ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు (శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై లైవ్ డిబేట్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. అడ్వకేట్ కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 10న హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్స్టేషన్లో నాగార్జున యాదవ్, ఇతరులపై కేసు నమోదు చేశారు.
లైవ్ చర్చలో నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 192, 352, 353(1), 353(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా ఈ అరెస్టుపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష్య సాధింపులో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కక్ష గట్టిన చంద్రబాబు సర్కార్.. రెండేళ్ల కిందటి నాటి వ్యాఖ్యలను ఇప్పుడు బయటకు తీసి కేసు నమోదు చేయించారని, చట్టపరమైన నిబంధనలను పాటించకుండా అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇందుకు వినియోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు.


