సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సక్సెస్ స్కూల్ అంశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని అభిప్రాయపడిన ఎన్హెచ్ఆర్సీ రెండు వారాల్లోగా ఈ ఫిర్యాదు పై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పంపాలని ఆదేశించింది.
ఏం జరిగింది..
సమచారం ప్రకారం సైదాబాద్ సక్సెస్ స్కూల్లో హిందూ మతానికి చెందిన బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. కాగా తరగతి గదిలో పాఠాలు చెప్పే సమయంలో సదరు క్లాస్ టీచర్.. ఆ బాలుడికి ఇస్లామిక్ పవిత్ర సూక్తులైన కల్మా, సూరహ్ ఫాతిహాలను చదవడం నేర్చుకోవాలని హోమ్వర్క్ ఇచ్చింది. అలాగే, స్కూల్ డైరీలో సైతం.. కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలి అని స్పష్టంగా రాసింది. బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు అతని హోమ్వర్క్ పుస్తకాలు, డైరీని పరిశీలించగా ఈ విషయం బయటపడింది. దీంతో ఈ అంశం వివాదానికి దారి తీసింది.
ఈ ఘటనపై గురువారం హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు బీజేపీ నేతలు, హిందు సంఘాలు.. స్కూల్ వద్ద ఆందోళనలు, నిరసనలకు దిగారు. దీంతో, స్కూల్ యాజమాన్యం సదరు టీచర్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ విషయంపై పలువురు NHRCకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. తాజాగా వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది.


