
ఈ రోజు కష్టాలున్నాయని కుంగిపోకూడదు. చీకటి వెనుకే వెలుగు ఉంటుంది. ఈ ఆశావహదృక్పథమే మనిషిని నడిస్తుంది. భవిష్యత్పై ఆశను పెంచుతుంది. ఆత్మవిశ్వానికి మనో ధైర్యాన్ని జోడించి ముందుకు అడుగేయాలి. అప్పుడే మన పట్టుదలకు, కష్టానికి విజయం దాసోహమంటుంది. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ సక్సెస్ గురించి తెలుసుకుంటే.. ఈ మాటలు అక్షర సత్యాల నిపించక మానవు. 9వ తరగతిలో న చదువు మానేసి, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోగా రాణిస్తూ, ప్రధానిమోదీ చేతులు మీదుగా సత్కారాన్ని అందుకున్న మహిళ గురించి తెలుసుకుందా రండి!
రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాకి చెందిన రుక్మిణి కటారా 13 ఏళ్ల వయసులో వివాహం చేశారు పెద్దలు. అప్పటికి మద్వా ఖపర్దా అనే చిన్న గ్రామంలో ఆమె తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. పెళ్లి తరువాత చదువుకు బ్రేక్ పడింది. కుటుంబం గడవడం కోసం దినసరి కూలీగా పనిచేసింది. NREGA ద్వారా వచ్చే జీతమే వారికి ఆధారం. కానీ రాజస్థాన్ గ్రామీణ ఆజీవిక వికాస్ పరిషత్ (రాజీవిక) పథకం ఆమె జీవితంలో మార్పునకు నాంది పలికింది. ఈ పథకం కింద స్వయం సహాయక బృందంలో చేరి, ఆమె సౌర దీపాలు , ప్లేట్లను(Solar lamps and Plates) ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంది. శ్రద్ధ పెట్టి, ఈ పనిలో నైపుణ్యం సాధించింది. ఆ తరువాత దుర్గా ఎనర్జీ (దుంగార్పూర్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్)కంపెనీని స్థాపించింది. ఒక గిరిజన మహిళగా తాను సాధికారత సాధించడమే కాదు, తనలాంటి ఎందరో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించింది.
కంపెనీ ఐదేళ్ల కాలంలో రూ. 3.5 కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది. కంపెనీ సీఈవోగా రుక్మిణి మరో 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తనలాంటి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ కృషికి గాను ఆమెకు జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2016లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో రుక్మిణిని సత్కరించారు.
ఇదీ చదవండి: ఫ్యాషన్లో తండ్రికి తగ్గట్టే : రూ 1.4 కోట్ల వాచ్తో మెరిసిన బ్యూటీ
తక్కువ చదువుకుంటే ఏంటి?
"మహిళలు పెద్దగా చదువుకోలేదని, విద్య తక్కువ అని ఎప్పుడూ తమను తాము తక్కువగా అనుకోకూడదు. తక్కువ విద్యతో కూడా ఎదగవచ్చు. నేను తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. కానీ నేడు నేను ఒక కంపెనీ యజమానిని. నాలాగే ఇతర మహిళలు ఇలా ఎందుకు చేయకూడదు?” అంటుందామె సగర్వంగా. ఇతరులకు స్ఫూర్తినివ్వాలనే ఆమె ఆత్మవిశ్వాసం, సంకల్పం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఇపుడు భర్త కమలేష్తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు: రాకేష్, ఆశా, ప్రవీణ్ ,యువరాజ్. అందర్నీ ఉన్నత చదువులను చదివిస్తోంది.
చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి