జీవితంలో ఎదురయ్యే తిరస్కరణలు ప్రయాణానికి ముగింపు కాదని, అవి మహోన్నత విజయానికి బాటలు వేసే గుణపాఠాలని నిరూపించారు చెన్నైకి చెందిన 32 ఏళ్ల టెక్ వ్యవస్థాపకుడు, పర్ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్ శ్రీనివాస్. నేడు ప్రపంచ కృత్రిమ మేధ రంగాన్ని శాసిస్తున్న పర్ప్లెక్సిటీ వెనుక ఉన్న ఆయన ప్రయాణం.. వరుస వైఫల్యాలను దాటుకుని శిఖరాగ్రానికి చేరుకున్న ఒక అసాధారణ పోరాటం.
ఐఐటీ నుంచి ఎంఐటీ వరకు.. వరుస నిరాశలే!
చిన్నప్పటి నుంచీ కంప్యూటర్ సైన్స్పై మక్కువ ఉన్న అరవింద్కు ఐఐటీ మద్రాస్లో సీఎస్ సీటు లభించలేదు. దీంతో ఆయన డ్యూయల్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో చేరాల్సి వచ్చింది. మొదటి సంవత్సరం ప్రతిభ ఆధారంగా బ్రాంచ్ మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 0.01 సీజీపీఏ (CGPA) స్వల్ప తేడాతో ఆ అవకాశం చేజారింది. ఆపై ఎలక్ట్రికల్ విద్యార్థిననే కారణంతో మెషిన్ లెర్నింగ్ కోర్సులో చేరేందుకు కూడా మొదట్లో ప్రొఫెసర్ల నుంచి నిరాకరణ ఎదురైంది. ఐఐటీ పూర్తయ్యాక పీహెచ్డీ కోసం ప్రపంచ ప్రఖ్యాత మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి దరఖాస్తు చేయగా అక్కడా తిరస్కరణే లభించింది.
వైఫల్యమే విజయ సూత్రమై..
ఈ తిరస్కరణలకు కుంగిపోకుండా యూసీ బార్కిలీలో పీహెచ్డీ పూర్తి చేసిన అరవింద్.. ఓపెన్ ఏఐ, గూగుల్, డీప్మైండ్లలో పరిశోధకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం సొంతంగా ప్రారంభించిన తొలి స్టార్టప్ (ఎక్స్ ఆధారిత సెర్చ్ టూల్) ప్లాట్ఫామ్ ఏపీఐ మార్పుల వల్ల విఫలమైంది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా 2022 మధ్యలో డెనిస్ యారట్స్, జానీ హో, ఆండీ కాన్విన్స్కీలతో కలిసి పర్ప్లెక్సిటీ ఏఐకి శ్రీకారం చుట్టారు.
ప్రపంచ స్థాయిలో సంచలనం
సాంప్రదాయ సెర్చ్ ఇంజిన్లకు భిన్నంగా యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు వెతికి ఇచ్చే ఆన్సరింగ్ టూల్గా పర్ప్లెక్సిటీ ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల పెట్టుబడులతో కోట్లాది డాలర్ల మూలధనాన్ని సమకూర్చుకున్న ఈ సంస్థ బిలియన్ డాలర్ల వాల్యుయేషన్కు చేరుకుంది. ఈ ఘనతతో అరవింద్ శ్రీనివాస్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో చోటు దక్కించుకుని భారత్లోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు.
ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు


