బాలీవుడ్ లెజెండరీ నటుడు, ‘డిస్కో కింగ్’, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి అనారోగ్యంతో కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని పలు అంశాలు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం అద్భుతంగా సాగినా, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అనేక వివాదాలు, విషాదాలు, నాటకీయ పరిణామాలతో నిండిపోయింది. పరిశ్రమలోని పలువురు ప్రముఖ నటీమణులతో ఆయన సాగించిన ప్రేమాయణాలు, రహస్య వివాహాలు నాడు సంచలనం సృష్టించాయి.
కమల్ హాసన్ మాజీ భార్యతో..
1970లలో మిథున్ చక్రవర్తి వరుస హిట్లతో సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో ‘హమారా సంసార్’ చిత్రంలో కమల్ హాసన్ మాజీ భార్య సారికతో ఆయన కలిసి నటించారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. అయితే కొద్ది నెలలకే ఈ బంధం అర్ధాంతరంగా ముగిసిపోయిందంటారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సారికనే స్వయంగా మిథున్కు దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
మోడల్,నటి హెలెనా లూక్తో వివాహం
సారికతో బ్రేకప్ తర్వాత మానసికంగా కుంగిపోయిన మిథున్, మోడల్ కమ్ నటి హెలెనా లూక్కు దగ్గరయ్యారు. జావేద్ ఖాన్తో ఐదేళ్ల రిలేషన్షిప్ ముగిసిన హెలెనా కూడా ఆ సమయంలో ఒంటరిగానే ఉన్నారు. ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉండటంతో 1979లో వారు వివాహం చేసుకున్నారు. కానీ ఈ బంధం కేవలం నాలుగు నెలలు మాత్రమే నిలిచింది. మిథున్ ప్రవర్తన కారణంగా హెలెనా విడాకులు తీసుకున్నారని అంటారు.
హెలెనా బయటపెట్టిన మిథున్ టాక్సిక్ నేచర్
విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హెలెనా లూక్, మిథున్తో తన అనుభవాన్ని ఒక పీడకలగా అభివర్ణించారు. మిథున్ తనను మానసికంగా ఎంతో వేధించారని, తన మాజీ ప్రియుడితో సంబంధం ఉందని నిత్యం అనుమానించే వారని ఆమె వెల్లడించారు. మిథున్కు అప్పట్లోనే వేరే మహిళలతో సంబంధాలు ఉండటం వల్లే, తనపై లేనిపోని అభూతకల్పనలు ఆపాదించేవారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. విడాకుల అనంతరం హెలెనా బాలీవుడ్కు పూర్తిగా దూరమై న్యూయార్క్లో స్థిరపడ్డారు.
కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలితో పెళ్లి
హెలెనాతో విడాకుల అనంతరం మిథున్ జీవితంలోకి సింగర్ కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలి ప్రవేశించారు. కిశోర్ కుమార్కు విడాకులు ఇచ్చిన తర్వాత, యోగితా 1979లో మిథున్ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ను పూర్తిగా పక్కన పెట్టి, సంసారమే సర్వస్వంగా బతుకుతానని ఆమె ప్రకటించారు. ఈ దంపతులకు మహాక్షయ్ (మిమోహ్), ఉష్మే, నామాషి అనే ముగ్గురు కుమారులు జన్మించడంతో పాటు దిశాని అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
శ్రీదేవి ఎంట్రీతో వైవాహిక జీవితంలో తుఫాన్
అంతా సజావుగా సాగుతున్న సమయంలో 1985లో మిథున్ జీవితంలోకి దివంగత నటి శ్రీదేవి అడుగుపెట్టారు. ‘జాగ్ ఉతా ఇన్సాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. అప్పటికే పెళ్లయినప్పటికీ మిథున్.. శ్రీదేవితో ప్రేమలో పడిపోయారు. మీడియా కథనాల ప్రకారం, వీరిద్దరూ 1985లో అత్యంత రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. ఈ సీక్రెట్ మ్యారేజ్ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.
భార్య యోగితా బాలి ఆత్మహత్యాయత్నం
మిథున్, శ్రీదేవిల రహస్య వివాహం, వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న యోగితా బాలి తీవ్రంగా కుంగిపోయారు. భర్త మోసాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తరువాత ఆమె, తన పిల్లలతో కలిసి మిథున్ నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామం మిథున్, నిర్మాత బోనీ కపూర్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని కూడా శాశ్వతంగా దెబ్బతీసింది.
శ్రీదేవితో పెళ్లి రద్దు.. యోగితా బాలితో తిరిగి..
మిథున్ తన మొదటి భార్య యోగితాకు విడాకులు ఇవ్వలేడని, ఆమెను పూర్తిగా వదిలించుకోలేడని గ్రహించిన శ్రీదేవి కీలక నిర్ణయం తీసుకున్నారు. 1988లో మిథున్తో జరిగిన వివాహాన్ని ఆమె చట్టబద్ధంగా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి బోనీ కపూర్ను వివాహం చేసుకోగా, మిథున్ తిరిగి తన మొదటి భార్య యోగితా బాలి వద్దకు చేరారు. యోగితను ఒప్పించి ఆమెను ఇంటికి రప్పించుకున్న మిథున్, ఆ తర్వాత తమ మూడో సంతానాన్ని స్వాగతించారు. ఎన్నో వివాదాలు, కష్టాలను ఎదుర్కొన్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం తన భార్య యోగితా బాలి, పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి కుమారులు మిమోహ్, ఉష్మే, నామాషి, కూతురు దిశాని కూడా సినీరంగంలో రాణిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు!


