వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ, రితికా నాయక్
‘‘కొరియన్ కనకరాజు’ సినిమాకి గురువారం సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. సినిమాలోని ప్రతి ఎపిసోడ్ను వారు ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాకు (వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి) బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది’’ అని హీరో వరుణ్ తేజ్ తెలిపారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్లో మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘నాకు కావాల్సిన హిట్ ‘కొరియన్ కనకరాజు’గా వచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా’ సినిమాల తర్వాత ప్రేక్షకులు థియేటర్లలో ఇంతగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం మళ్లీ ఈ చిత్రంతో చూడడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.
‘‘మేమంతా నమ్మి చేసిన ఒక మంచి ఎంటర్టైనర్ను ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు రితికా నాయక్. ‘‘గమ్యం’ సినిమా సమయంలో థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు చూసిన ఆనందం ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’తో మళ్లీ కనిపిస్తోంది’’ అని నిర్మాత రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘వరుణ్ తేజ్ విజయంలో మేం భాగం కావడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత శిరీష్ తెలిపారు.


