‘వర్షం కురిసిన ఉదయం’.. వందకి రూ. 400 ఇస్తామన్నా.. | Cab Crisis in Gurugram 8 KM Ride for Rs 400 Fails Due to Rain | Sakshi
Sakshi News home page

‘వర్షం కురిసిన ఉదయం’.. వందకి రూ. 400 ఇస్తామన్నా..

Aug 8 2026 9:05 AM | Updated on Aug 8 2026 9:09 AM

Cab Crisis in Gurugram 8 KM Ride for Rs 400 Fails Due to Rain

గురుగ్రామ్ : వర్షం కురిస్తే చాలు.. డిల్లీకి సమీపంలోని హర్యానాలో గల గురుగ్రామ్ పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఓ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపారు. ఆఫీసుకు వెళ్లేందుకు కేవలం 8 కిలోమీటర్ల దూరానికి రూ. 400 చెల్లించేందుకు సిద్ధపడి, గంటపాటు ప్రయత్నించినా ఆమెకు క్యాబ్ బుక్ కాకపోవడం గమనార్హం.

గురుగ్రామ్‌లో కురిసిన వర్షాలకు మరోసారి నగరంలోని ట్రాఫిక్ వ్యవస్థ, నీరు నిలిచిపోవడం లాంటి సమస్యలు బహిర్గతమయ్యాయి. హేన్సీ సోనీ అనే స్థానికురాలు సోషల్ మీడియాలో పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉదయం పూట వర్షం ఆహ్లాదకరంగా అనిపించినా, ఆఫీసుకు బయలుదేరే సమయానికి అదే పెద్ద సమస్యగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. గంటపాటు శ్రమించినా క్యాబ్ దొరకలేదని, కేవలం 8 కి.మీ. ప్రయాణానికి రూ. 400 ఛార్జీ చెల్లించేందుకు సిద్ధపడినప్పటికీ డ్రైవర్లు ముందుకు రాలేదని ఆమె తెలిపారు. సొంత కారులో వెళితే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తుందని, క్యాబ్‌ను ఆశ్రయిస్తే భారీగా డబ్బులు ఖర్చవుతాయని వాపోయారు.

ఈ పరిస్థితుల్లో సాధారణ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ‘ఇలాంటి సమయంలో ఏం చేయాలి?’ అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ, కొద్దిపాటి వర్షానికే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయంటూ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. కాగా సాధారణంగా 8 కిలోమీటర్ల దూరానికి క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే రూ.100 నుంచి రూ. 180 వరకూ ఖర్చవుతుంది.


ఇది కూడా చదవండి: అసాద్ నుంచి ఆబాన్ వరకు.. మృత్యుపాశంలో అతీక్ కుటుంబం!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement