బెంగళూరు: సమయానికి సక్రమంగా వంట వండకుండా ఇంట్లో రీల్స్తో కాలం గడుపుతున్న భార్యను హత్య చేసినట్లు పోలీసుల ముందు భర్త నోరువిప్పాడు. కుంబళగోడు పోలీస్స్టేషన్ పరిధిలో 12 రోజుల క్రితం బెడ్షీట్లో మహిళ శవం చుట్టిన కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు హత్యకు కారణాలను పోలీసులు సేకరించారు. బిహార్కు చెందిన ధీరజ్ కుమార్(24), రీమా కుమారి(20) ప్రేమించుకున్నారు.
ఇంట్లో వారికి తెలియకుండా బిహార్ నుంచి 10 నెలల క్రితం బెంగళూరుకు చేరుకుని ఇద్దరూ వివాహం చేసుకున్నారు. దంపతులు గేరుపాళ్యలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ సమీపంలోని పరిశ్రమలో పనికి వెళ్లేవారు. రీమా రీల్స్ చేయడానికి అలవాటు పడి ఇంట్లో సక్రమంగా వంట చేసేది కాదు. దీంతో కోపోద్రిక్తుడైన ధీరజ్కుమార్ భార్యతో గొడవ పడేవాడు. ప్రతినిత్యం ఇద్దరూ ఘర్షణ పడేవారు. రీమా ఇటీవల తాను బిహార్కు వెళ్లిపోతానని పట్టుబట్టింది. ఈక్రమంలో గత నెల 27న రాత్రి ధీరజ్కుమార్ విధులు ముగించుకుని ఇంటికి రాగా ఇంట్లో వంట వండలేదు.
ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి తీవ్ర స్థాయికి చేరడంతో చేతికి దొరికిన కర్రతో ధీరజ్కుమార్ రీమాపై దాడి చేశాడు. అనంతరం చున్నీతో రీమా గొంతు బిగించి చంపి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి బిహార్కు పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుంబళగోడు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి బిహార్లో ఉన్న ధీరజ్కుమార్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


