హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించాడు. రోడ్డుపై వెళుతున్న డీసీఎం కింద తోసినా చనిపోకపోవడంతో ఫ్లై ఓవర్ పిల్లర్కేసి బాదాడు. అదృష్టవశాత్తు స్థానికులు అడ్డుకోవడంతో బాలుడు మృత్యువాత నుంచి తప్పించుకున్నాడు.
ఈ సంఘటన బుధవారం గుడిమల్కాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ ఫతేదర్వాజాకు చెందిన సల్మాన్ (25) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇతడికి ముగ్గురు పిల్లలు. కొంతకాలంగా మద్యానికి బానిసగా మారిన సల్మాన్ భార్యతో నిత్యం గొడవపడుతూ ఉండేవాడు. మంగళవారం రాత్రి కూడా తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సల్మాన్ తన కుమారుడు అర్మాన్(4)ను గోల్కొండ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెంబర్ 104 వద్దకు తెచ్చాడు.
మద్యం మత్తులో కుమారుడిని డీసీఎం ముందుకు తోశాడు. అదృష్టవశాత్తు డీసీఎం వాహనం బాలుడిపై వెళ్లలేదు. అయితే కుమారుడు చనిపోలేదన్న కోపంతో కసాయి తండ్రి చిన్నారి జుట్టును పట్టుకుని పిల్లర్కు కొట్టడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు సల్మాన్ను అడ్డుకొని బాలుడిని కాపాడారు. పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.


