నల్ల సముద్రంలో గల్లంతైన భారత నావికుల ఆచూకీపై కేంద్రం వెల్లడి
బాధిత కుటుంబాలకు బీమా సాయం అందించాలని సుప్రీం ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సమీపంలోని నల్ల సముద్రంలో డ్రోన్ దాడి కారణంగా సరుకు నౌక నుంచి గల్లంతైన ఇద్దరు భారతీయ నావికుల ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. రొమేనియా, ఉక్రెయిన్లకు చెందిన అన్వేషక బృందాలు తీవ్ర గాలింపు చేపట్టినా ఫలితం దక్కలేదని తెలిపింది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనానికి ఒక నివేదికను అందజేశారు.
ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో జూలై 25న నల్ల సముద్రంలో ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ అనే సరుకు నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఘటనలో భారతీయ నావికులు దీపక్ కుమార్ గుప్తా, రామచంద్ర సముద్రంలో గల్లంతయ్యారు. దీపక్ సోదరుడు సందీప్ కుమార్ వేసిన పిటిషన్ను విచారించింది. ఆగస్ట్ 5 నాటికి అందిన సమాచారం మేరకు నావికుల ఆచూకీ లభించలేదని, కచ్చితమైన తాజా సమాచారం అందితే తప్ప గాలింపు సాధ్యం కాదని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు.
సంబంధిత ఏజెన్సీలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. స్పందించిన ధర్మాసనం నావికుల ఉపాధి ఒప్పందాల్లో బీమా సదుపాయం ఉంటుందని, బాధిత కుటుంబాలకు తక్షణం బీమా సాయం అందేలా చూడాలని సూచించారు. ఈ వ్యవహారంలో మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన నౌక ఫస్ట్ ఆఫీసర్ (ప్రత్యక్ష సాక్షి)ను విచారించి ప్రమాదం జరిగిన ప్రదేశం ఇతర వివరాలు తెలుసుకోవాలని పిటిషనర్ కోరగా కేంద్రం ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్ను ముందుగా చదవాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ, ఈలోగా తీసుకున్న చర్యలపై తాజా నివేదిక సమరి్పంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.


