సుప్రీంకోర్టుకు స్పష్టంచేసిన కేంద్రం
న్యూఢిల్లీ: సామాజికంగా వెనకబడిన, అణగారిన వర్గాల్లో ఆర్థికంగా ఉన్నతి సాధించిన కులాలు, వర్గాలకు రిజర్వేషన్లలో అమలుచేస్తున్న క్రీమీలేయర్ విధానం ఎస్సీ, ఎస్టీలకు వర్తించదని సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్రం గురువారం కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ను వర్తింపజేయాలని, ప్రభుత్వ ఉపాధిలో రిజర్వేషన్ అమలు ప్రక్రియలో ఈ మేరకు సవరణలు చేయాలని కోరుతూ రామశంకర్ ప్రజాపతి, తదితరులు, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఎదుట ప్రభుత్వం తన వాదనల్ని విన్పించింది.
ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ను వర్తింపజేయనంత మాత్రాన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఏ రకంగా భంగం వాటిల్లుతుందో ఈ వ్యాజ్యాలు నిరూపించలేకపోయాయని ప్రభుత్వం గుర్తుచేసింది. అశోకకుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ఈ విషయాన్ని గతంలోనే ప్రభుత్వం తేటతెల్లంచేసింది. ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే క్రీమీలేయర్ వర్తిస్తుందని సాధారణంగా ప్రభుత్వం చెప్పింది.
ఈ భావనలో ఎస్సీ, ఎస్టీలు కలిపి లేరు. రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే లబ్ధిదారుల సామాజిక–ఆర్థిక గణాంకాలను లెక్కలోకి తీసుకుని సమగ్ర విశ్లేషణ తర్వాత ఎలాంటి అతిక్రమణలు లేని సమీక్ష అనంతరం ఆదాయం ఆధారిత ప్రాధాన్యాలను గణిస్తూ గతంలో రిజర్వేషన్ పాలసీని తీసుకొచ్చారు. 1992లో మండల్ కేసు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు తొలిసారిగా క్రీమీలేయర్ భావనను తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వర్తింపజేయకపోతే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందో కొత్త వ్యాజ్యాలు నిరూపించలేకపోయాయి. అందుకే ఈ పిల్స్ను పసలేని వాటిగా భావించి కొట్టేయాలి’’అని ధర్మాసనాన్ని కేంద్రప్రభుత్వం కోరింది.
చదవండి: యూపీఐ చెల్లింపులపై చార్జీలు


