కర్ణాటక: ఉడుపి జిల్లా మల్పె పోలీసు స్టేషన్ పరిధిలోని కల్మాడిలో మాడల్ శృతి బంగేర(27) తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. మాడలింగ్ చేస్తున్న శృతి కడియాళలోని ఒక హోటల్లో ఉద్యోగం చేస్తోంది. ఐదు నెలలుగా పనికి పోకుండా తల్లీ, సోదరితో కలిసి ఉంటోంది. మానసిక ఒత్తిడికి గురైన శృతి గురువారం మధ్యాహ్నం తల్లి రత్నను ఇంటిలోంచి బయటకు పంపి గడియ వేసుకుని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుంది. శృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మల్పె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సెబర్ వంచనకు గురైన విశ్రాంత అధికారిణి
మైసూరు: మైసూరులో ఒక దుండగుడు ముంబై పోలీసుల పేరుతో విశ్రాంత మహిళా అధికారిణిని బెదిరించి రూ. 31 లక్షలు తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. నగరంలోని అలనహళ్లిలో విశ్రాంత మహిళా అధికారిణి నివాసం ఉంటున్నారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ముంబై పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మీరు మనీలాండరింగ్ కేసులో ఉన్నారని చెప్పాడు. మేము చెప్పినట్లు చేస్తే మిమ్మల్ని కాపాడగలమని నమ్మబలికాడు. ఆ తర్వాత వారు చెప్పినట్లుగా డిపాజిట్ డబ్బును, సేవింగ్స్ ఖాతాలోని డబ్బు మొత్తం రూ. 31,10,200 వివిధ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత మోసగాడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. దీంతో తాను సైబర్ మోసానికి గురయ్యానని ఆమె గ్రహించి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.


