మెట్ట భూమిలో ఏదైనా ఒక ఆరుతడి పంటను సాగు చేస్తే ఏమవుతుంది? పంట దిగుబడి వస్తుంది, తద్వారా రైతుకు ఆదాయం వస్తుంది. అది సరే. కానీ, భూమికి, భూగర్భ జలాలకు ఏమవుతుంది? సాధారణంగా భూమిలో సారం తగ్గటంతోపాటు భూగర్భంలో నీరూ కొంత తగ్గుతుంది. అందుకే, ఈ నష్టం పూడ్చటానికి, పంట దిగుబడి బాగా రావటానికి ఎరువులు తెచ్చి వేస్తూ ఉంటాం. బోర్లు లేదా బావులు తవ్వి నీటి సదుపాయం కల్పించుకుంటాం.
కానీ, వట్టివేరు పంట విషయంలో అలా కాదు. ఈ పంటను నాటితే అద్భుతమైన, విలువైన సుగంధ తైలం లభిస్తుంది. అంతేకాదు, ఆ నేల సుసంపన్నమవుతుంది. పొలంలో నుంచి మట్టి వానకు కొట్టుకుపోదు. ఎందుకంటే, వాన నీరు చాలా వరకు భూమిలోకి అద్భుతంగా సహజంగా ఇంకుతుంది. ఈ శక్తి వట్టివేరు పంటకు ఎలా వచ్చిందంటే.. దాని విశిష్టమైన, లోతైన, పటిష్టమైన కుచ్చు వంటి వేరు వ్యవస్థ ద్వారానే చేకూరింది, ప్రకృతిసిద్ధంగా!
ఫౌండేషన్ విశేష కృషి... మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రతి ఏటా మన దేశంలో సుమారు 53 లక్షల టన్నుల భూమి పైపొర మట్టి కొట్టుకుపోతోందని అంచనా. ఈ నష్టాన్ని అరికట్టే ఒక ఉపాయం వట్టివేరు సాగు. వర్షాధారిత ప్రాంతాల రైతులకు ఇది అత్యంత లాభదాయకమైన మార్గంగా నిలుస్తోందని అనుభవాలు చెబుతున్నాయి. వట్టివేరు పంట సాగును రైతాంగంలోకి విస్తృతంగా వ్యాప్తి చెయ్యటంలో తమిళనాడు రాష్ట్రంలో విశేష కృషి జరుగుతోంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇండియా వెటివర్ ఫౌండేషన్’ ఈ కృషిలో ఎంతో ముందంజలో ఉంది. తీవ్రమైన నేల కోతను నివారించి, నీటి కొరతను అధిగమించేందుకు ‘వట్టివేరు సాంకేతికత’ రైతులకు స్పష్టమైన ఫలితాలను అందిస్తోంది.
ఎకరానికి 12–15 కిలోల సుగంధ నూనె ఉత్పత్తి
భూమి లోపలికి లోతుగా విస్తరించే వేర్లను గనక జాగ్రత్తగా తీసి, అందులో నుంచి నూనెను సంగ్రహిస్తే ఎకరానికి 12–15 కిలోల సుగంధ నూనె లభిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో నూనె ధర రూ. 20,000–35,000 వరకు ఉంటుంది. ప్రతీ కోతకు ఎకరానికి 3–5 టన్నుల లేత పశుగ్రాసం లభిస్తుంది. ఎండిన గడ్డితో మహిళా సంఘాలు నెలకు రూ. 5,000 నుండి రూ. 8,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. తక్కువ ఖర్చుతో 90% వరకు వర్షాధార భూముల్లో మట్టి కొట్టుకుపోకుండా నివారించి, వాణిజ్యపరంగా అదనపు ఆదాయాన్ని అందించే దిశగా వెటివర్ ఫౌండేషన్ రైతులకు మార్గదర్శకత్వం వహిస్తోంది. వర్షాధారిత ప్రాంతాల రైతులకు ఇది అత్యంత లాభదాయకమైన మార్గం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయంలో వట్టివేరు పంటను విస్తృతంగా ్రపోత్సహించేందుకు నిర్మాణాత్మక కృషి చేస్తే అన్ని విధాలా మేలు జరుగుతుంది.
వట్టివేరుపై సమగ్ర శిక్షణ ఇస్తాం
అనేక ఔషధ, సుగంధ పంటలతో పాటు వట్టివేరు పంట సాగు పద్ధతులు, అనువైన నేలలు, ప్రాసెసింగ్ పద్ధతులు, వాణిజ్య అవకాశాలు తదితర అంశాలపై రైతులకు హైదరాబాద్ బోడుప్పల్లోని మా కార్యాలయంలో అప్పుడప్పుడూ శాస్త్రీయంగా సమగ్ర శిక్షణ ఇస్తున్నాం. నాణ్యమైన వట్టివేరు పిలకలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఆసక్తి గల రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు.
– డాక్టర్ జీడీ కిరణ్ బాబు, సైంటిస్ట్ ఇన్చార్జ్, కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్ – సీమాప్), బోడుప్పల్, హైదరాబాద్
+914027201131, 27200272,Email: crchyd@cimap.res.in 
రైతులకు ఉచిత ప్రాక్టికల్ శిక్షణ
వట్టివేరు వేర్లు నేల కోతను 90% వరకు తగ్గిస్తాయి. వాన నీరు 60% వరకు భూమిలోకి ఇంకుతుంది. రైతుల్లో అవగాహన పెంచేందుకు వెటివర్ ఫౌండేషన్ వేలాది మంది రైతులకు క్షేత్రస్థాయిలో ఉచిత ప్రాక్టికల్ శిక్షణ ఇస్తోంది. ఒక ఎకరం పొలంలో గట్ల వెంట నాటేందుకు సుమారు 2,000 – 3,000 వ్యాధి రహిత పిలకలు అవసరమవుతాయి. నాణ్యమైన వట్టివేరు పిలకలను కూడా ఫౌండేషన్ రైతులకు పంపిణీ చేస్తోంది.


