సులువుగా, వేగంగా, నాణ్యంగా... కాంక్రీట్‌ మిల్లర్‌తో విత్తన గుళికల తయారీ! | Sagubadi: Production of seed pellets using a concrete mixer | Sakshi
Sakshi News home page

సులువుగా, వేగంగా, నాణ్యంగా... కాంక్రీట్‌ మిల్లర్‌తో విత్తన గుళికల తయారీ!

Aug 11 2026 6:26 AM | Updated on Aug 11 2026 6:26 AM

Sagubadi: Production of seed pellets using a concrete mixer

ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికల (సీడ్‌ పెల్లెట్ల) తయారీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే, సాధారణంగా గోనె సంచిని ఉపయోగించి ముగ్గురు వ్యక్తులు ఎటువంటి యంత్రం వాడకుండా విత్తన గుళికలు తయారు చేస్తుంటారు. ఈ పద్ధతిలో సమయం, శ్రమ ఎక్కువగా ఖర్చవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా భవన నిర్మాణ పనుల్లో ఉపయోగించే కాంక్రీట్‌ మిల్లర్‌ (స్లాబ్‌ మిక్సర్‌) ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విత్తన గుళికలను తయారుచేసే విధానాన్ని తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బొర్రా తాతారావు కొత్తగా ఆలోచించి ప్రారంభించారు.

50–60 కిలోలు
కాంక్రీట్‌ మిల్లర్‌ బక్కెట్‌లో ఒకేసారి సుమారు 50 నుంచి 60 కేజీల విత్తనాలను విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. ముందుగా బీజామృతంతో శుద్ధి చేసిన  విత్తనాలను ఇందుకు ఉపయోగించాలి.  మిల్లర్‌ తిరుగుతున్నప్పుడు క్రమంగా మట్టి పొడిని విత్తనంపై చల్లుతూ ఉండాలి. 

మట్టి పొడి విత్తనాల చుట్టూ సరిగ్గా అంటుకోవడానికి తడి అవసరం. బ్యాటరీ స్ప్రేయర్‌తో  నీటిని తగుమాత్రంగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత ఘనజీవామృతం పొడిని చల్లాలి. గుళికలు తయారయ్యాక, చివరగా బూడిద లేదా బొగ్గు పొడిని చల్లితే చాలు.. విత్తన గుళికలు సిద్ధమైనట్లే. అరగంటలో విత్తన గుళికలు సిద్ధమవుతాయి.

వెద వరి, పత్తి, మినుము, కందులు వంటి ఏకపంట విత్తనాలకే కాక, ప్రీ–మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ (పీఎండీఎస్‌) పద్ధతిలో వాడే 30 రకాల విత్తనాలతో గుళికల తయారీకి కూడా ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుందని తాతారావు తెలిపారు.  చాలా ఎకరాల్లో విత్తన గుళికలు చల్లుకునే రైతాంగానికి కాంక్రీట్‌ మిల్లర్‌ విధానం ఎంతో సమయాన్ని, ఖర్చును ఆదా చేసే ఉత్తమ పద్ధతని తాతారావు తెలిపారు.  

కిలోకు ఖర్చు రూ.7–8 మాత్రమే
కాంక్రీట్‌ మిల్లర్‌ ద్వారా కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మనుషులతో రోజుకు (7–8 గంటల్లో) సుమారు 1 టన్ను నుంచి 1.2 టన్నుల (1200 కేజీల) విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. మెషిన్‌ అద్దె, డీజిల్, కూలీలు, బంక మట్టి పొడి, ఘనజీవామృతం.. తదితర ఖర్చులన్నింటినీ కలిపితే కేజీ తయారీకి సుమారు రూ. 7 నుంచి 8 మాత్రమే ఖర్చవుతుంది.  

కిలో విత్తనంతో కిలోన్నర గుళికలు
ఒక కిలో విత్తనాలను విత్తన గుళికలుగా తయారు చెయ్యటానికి అవసరమయ్యే పదార్థాలు, ఏయే మోతాదుల్లో కావాలంటే.. 1 కేజీ (మినుము, కందులు లేదా ఏవైనా ఇతర పంటల విత్తనాల) గుళికల తయారీకి ముందు విత్తనాన్ని తేమ చేసి శుద్ధి చేయటానికి 50–100 మి.లీ. బీజామృతం, సుమారు 250–300 గ్రాముల పుట్టమట్టి/మట్టి పొడి, 250–300 గ్రాముల ఘనజీవామృతం పొడి, 100–150 గ్రాముల బూడిద లేదా బొగ్గు పొడితో పాటు స్ప్రేయర్‌ ద్వారా చిలకరించడానికి కొద్దిగా నీరు అవసరం అవుతాయి. 1 కేజీ విత్తనాలతో తయారు చేసిన విత్తన గుళికల బరువు 1.5 కిలోల నుంచి 1.7 కేజీల వరకు ఉంటుంది. 
విత్తన గుళికలను విత్తిన తర్వాత వర్షం ఆలస్యమైనా విత్తనం వృథా కాదు. తేమ ఎక్కువ రోజులు ఉంటుుంది. నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకొని మొక్క దృఢంగా పెరుగుతుంది.

ఏ పంటల కోసమైనా విత్తన గుళికలు చెయ్యొచ్చు
కాంక్రీట్‌ మిల్లర్‌తో విత్తన గుళికలు తయారు చేసుకోవటం చాలా సులభం. గోనె సంచులతో విత్తన గుళికలు చేసుకోవటం పెద్ద రైతులకు ఇబ్బందికరంగా ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలో కాంక్రీట్‌ మిల్లర్‌తో తయారు చెయ్యటం గత ఏడాదే మొదలుపెట్టాం. మొలక శాతం చాలా బాగుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 900 ఎకరాల్లో పీఎండీఎస్‌ పచ్చిరొట్ట పంటలు సాగు చేశాం. ఆ గడ్డిని కోసిన తర్వాత ఊడ్పులు కూడా పూర్తయ్యాయి. ఎల్‌నినో నేపథ్యంలో ప్రధాన పంట విత్తనాలను ఇప్పుడు కూడా కాంక్రీట్‌ మిల్లర్‌తో విత్తన గుళికలు తయారు చేస్తున్నాం. వెద వరి/ నారుమళ్లు పోసే వరి విత్తనాలు, కంది, మినుము, సజ్జతో పాటు కొర్ర వంటి అన్ని రకాల పంటల విత్తనాలను కూడా దీనితో చేస్తున్నాం. మొలక శాతం కూడా బాగుంది. ఈ పద్ధతి రైతులకు చాలా ఉపయోగంగా ఉంది.
– బొర్రా తాతారావు (94404 97033), 
జిల్లా ప్రాజెక్టు మేనేజర్, తూ.గో. జిల్లా

నిర్వహణ: పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్‌ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement