ఆ ఒక్క మహిళ..ఆ గ్రామం రూపు రేఖల్నే మార్చేసింది..! | Yogeshwari Chaudhary: One Woman Sarpanch Rebuilt a Maharashtra Village | Sakshi
Sakshi News home page

ఆమె మొక్కవోని లక్ష్యమే వృక్షాలై.. ! ఏకంగా ఆ గ్రామాన్ని ..

Jan 20 2026 6:01 PM | Updated on Jan 20 2026 6:10 PM

Yogeshwari Chaudhary: One Woman Sarpanch Rebuilt a Maharashtra Village

అందరి లాగే తను కూడా ఆ గ్రామానికి కోడలిగా వచ్చింది. తన భర్తతో, కుటుంబంతో సంతోషంగా బతకాలనుకుంది. అంతలోనే భర్తను కోల్పోవడంతో తన బిడ్డతో ఒంటరిగా మిగిలిపోయింది. కానీ ఆ విషాదంలోనే ఉండిపోకుండా తన ఊరికి ఏౖదైనా సహాయం చేయాలనుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని గ్రామ సర్పంచ్‌గా గెలిచింది. పర్యావరణ హితమైన ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. ఊరిని ప్రగతి మార్గంలో నడిపించింది. అదే నేడు తనను, తన ఊరిని గొప్పస్థానంలో నిలబెట్టింది. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డును అందుకోవడంతోపాటు,రూ. 1 కోటి నగదు బహుమతిని సైతం సొంతం చేసుకునేలా చేసింది. ఆమే .. యోగేశ్వరి శత్రుగన్‌ చౌదరి.

మహారాష్ట్రలోని గోండియా జిల్లా, సడక్‌ అర్జుని తాలూకాకు చెందిన దవ్వా గ్రామం సరికొత్త చరిత్ర సృష్టించింది. పర్యావరణ హిత కార్యక్రమాలలో ముందుండే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే క్లైమేట్‌ యాక్షన్‌ స్పెషల్‌ పంచాయతీ అవార్డు పొందిన గ్రామంగా నిలిచింది దవ్వా. ఇదంతా ఆ ఊరి సర్పంచ్‌ యోగేశ్వరి శత్రుగన్‌చౌదరి వల్లే సాధ్యమైందని ఆ గ్రామ ప్రజలు  చెబుతున్నారు.

అనుకోని విషాదం
ఇంటర్‌ పూర్తి చేసిన యోగేశ్వరి 2003లో దవ్వా గ్రామానికి కోడలిగా వచ్చింది. అనంతరం భర్త సహకారంతో బీఏ., బీఈడీ, డీఈడీ చేసి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. అంతలోనే భర్త మరణించడంతో.. యోగేశ్వరి జీవితంలో అంధకారం అలుముకుంది. అయితే ఈ విషాదంలోనే ఉండిపోకుండా అభివృద్ధిలో అట్టడుగున ఉన్న తన ఊరికోసం ఏమైనా చేయాలనుకుంది. ఆ ఆలోచనతోనే ఊరి ప్రజల సహకారంతో సర్పంచ్‌గా గెలిచింది.

లక్షాపదహారు వేల మొక్కలు నాటింది 
యోగేశ్వరి పర్యావరణ హితమైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. గ్రామంలోని నిస్సారమైన నేలలో నీటిని పారించి పంటలు పండించింది. గ్రామపరిధిలోని ఖాళీ స్థలాలలో సుమారు 1,16,000 మొక్కలను నాటి ఆ తాన్ని పచ్చదనంతో నింపేశారు. గ్రామంలోని 400 ఇళ్లకు పైగా సోలార్‌గ్రిడ్లను ఏర్పాటు చేశారు. 

గ్రామంలోని తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించడం ద్వారా జీరో వేస్ట్‌ లక్ష్యాన్ని చేరుకున్నారు. రైతుల కోసం ప్రత్యేక ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి, రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. గ్రామం కోసం చేపట్టిన పనులన్నీ పారదర్శకంగా ఉండటం కోసం భువన్‌ యాప్‌ ద్వారా జియో–ట్యాగింగ్‌ చేశారు. 

(చదవండి: ప్రభుత్వ పాఠశాల విద్యానేపథ్యం..కానీ ఇవాళ మహీంద్రా ఆటోమోటీవ్‌ టీమ్‌ హెడ్‌)

Advertisement
 
Advertisement
Advertisement