మహారాష్ట్ర ప్రభుత్వం పాత వాహనాలను రద్దు చేసి.. కొత్తవి కొనుగోలు చేసే వాహనదారులకు పన్ను ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. ఈ సమయంలో.. కొన్ని పాత ప్రైవేట్ వాహనాలపై పర్యావరణ పన్నును పెంచాలని కూడా యోచిస్తోంది. 2026–27 రాష్ట్ర బడ్జెట్ సమయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రోడ్డుపై పాత లేదా కాలుష్య కారక వాహనాల సంఖ్యను తగ్గించడం & రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యతను మెరుగుపరచడం ఈ చర్యల లక్ష్యం అని అన్నారు.
కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఇప్పటికే ఉన్న వాహనాన్ని స్క్రాప్ చేసి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే కొనుగోలుదారులకు మోటారు వాహన పన్నులో రాయితీ లభిస్తుంది. BS-4 లేదా కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలను స్క్రాప్ చేసేవారికి 16 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. BS-3 లేదా పాత ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలను స్క్రాప్ చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 30 శాతం అధిక రాయితీ లభిస్తుంది.
బీఎస్-4 & అంతకు ముందు ఉద్గార ప్రమాణాలు కలిగిన నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని ఫడ్నవీస్ అన్నారు. దీనిని పరిష్కరించడానికి.. పన్నును రెట్టింపు చేయాలని ప్రతిపాదించడం జరిగిందని పేర్కొన్నారు.


