చండీగఢ్: హరియాణా, పంజాబ్లలో ప్రస్తుతం ‘డేరా’ రాజకీయ చర్చలే వినిపిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను పంజాబ్-హరియాణా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. హరియాణాలో స్థానిక సంస్థల ఎన్నికలు, పంజాబ్లో ముంచుకొస్తున్న అసెంబ్లీ సమరానికి ముందు వెలువడిన ఈ తీర్పు రెండు రాష్ట్రాల్లోని ఓటు బ్యాంకు సమీకరణలను పూర్తిగా మార్చేయబోతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
డేరా సచ్చా సౌధాకు ఉన్న కోట్లాది మంది అనుచరులు కేవలం భక్తులు మాత్రమే కాదు.. వారు ఎన్నికల ఫలితాలను నిర్ణయించగల బలమైన శక్తిగా ఉన్నారు. ముఖ్యంగా సిర్సా, హిసార్, అంబాలా, మాల్వా ప్రాంతాల్లో డేరా ఇచ్చే ఒక్క పిలుపు లక్షలాది ఓట్లను ప్రభావితం చేస్తుంది. గతంలో ఈ ఓట్లు బీజేపీ వైపు మొగ్గు చూపగా, ఇప్పుడు రామ్ రహీమ్ నిర్దోషిగా బయటపడటం ఆ పార్టీకి రాజకీయంగా కలసివచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ తీర్పుతో బాబా అనుచరుల్లో పెరిగిన నూతనోత్సాహాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన పార్టీలు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని సమచారం.
అయితే ఈ పరిణామంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందే రామ్ రహీమ్ పదేపదే పరోల్ పొందడం, ఇప్పుడు హత్య కేసులో నిర్దోషిగా విడుదల కావడం వెనుక అధికార పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్ తదితర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ రహీమ్ మరో కేసులో జైలు గోడల మధ్యే ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ అల్లుకున్న ఈ పరిణామాలు ఓటర్ల నాడిని శాసించే స్థాయికి చేరాయంటున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఆందోళన వద్దు.. నేను చూసుకుంటా’: విజయ్ సంచలన వ్యాఖ్యలు


