వైరల్ వీడియో వెనుక అసలు నిజం
వధువు అడుగు పెడుతుంటే అక్షతలు చల్లడం ఆచారం.. కానీ అక్కడ ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిసింది. డ్యాన్స్ ఫ్లోర్ అడుగు కనిపించనంతగా కరెన్సీ తివాచీ పరచుకుంది. ఫిబ్రవరి 14న పంజాబ్లోని తార్న్ తరణ్లో జరిగిన ఒక వివాహం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ పెళ్లిలో ఏకంగా రూ.10 కోట్లను వానలా కురిపించారన్న వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే..
వైరల్ అవుతున్న వీడియోలో వరుడు సంచుల్లోంచి నోట్ల కట్టలను తీసి గాలిలోకి విసురుతుంటే, అతిథులు కూడా అతనితో జత కలిసారు. చూస్తుండగానే ఆ ప్రాంగణమంతా కరెన్సీ మయమైపోయింది. ఆ్రస్టేలియాలో ట్రక్కుల వ్యాపారం చేసే వరుడి కుటుంబం కావడంతో, ఆ ఆడంబరం చూసి నెటిజన్లు ఆ మొత్తం రూ.8.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు కట్టేశారు. ఇది పంజాబీ సంప్రదాయంలో భాగమే అయినా, ఈ స్థాయి ధన ప్రదర్శన అందరినీ విస్మయానికి గురిచేసింది.
అవి పది రూపాయల నోట్లే!
అయితే, ఈ ‘కోట్ల’కథనంపై వరుడి కుటుంబం, ఈవెంట్ మేనేజర్లు తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం వ్యూస్ కోసం జరిగిన అతిశయోక్తి అని వారు కొట్టిపారేశారు. ‘మేము సంబరాల్లో భాగంగా డబ్బులు విసిరిన మాట వాస్తవమే, కానీ అది రూ.2 లక్షలు మాత్రమే. సోషల్ మీడియా దీనిని కోట్లకు పెంచేసింది’.. అని వరుడి సోదరుడు స్పష్టం చేశారు. ఆ నోట్లలో ఎక్కువ భాగం పది రూపాయల నోట్లేనని, వాటితో పాటు కొన్ని డాలర్లు కూడా ఉన్నాయని డీజే యజమాని వివరించారు. మొత్తం విలువ రూ.2.5 లక్షల నుండి రూ.4 లక్షల లోపే ఉంటుందని తేలి్చచెప్పారు.
సోషల్ మీడియా కనికట్టే!
వ్యూస్, లైకుల కోసం సోషల్ మీడియా ఎంతటి కలి్పత గాథలనైనా అల్లుతుందని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. కళ్లముందు నోట్ల తివాచీ కనిపించినా, ఆ మెరుపు వెనుక ఉన్నది కోట్ల సంపద కాదు.. కేవలం ప్రచారపు ఆర్భాటమే. నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పడానికి ఈ ‘క్యాష్ పారీ్ట’ఒక ఉదాహరణ.
– సాక్షి, నేషనల్ డెస్క్


