- దేశాధినేతల నుంచి ఏఐ సీఈఓల దాకా పాల్గొననున్న అతిరథ మహారథులు
- సదస్సును ప్రారంభించి ప్రసంగించనున్న మోదీ
- తర్వాత మాక్రాన్, గుటెరస్ తదితరుల ప్రసంగాలు
- దేశాధినేతలు, సీఈఓలతో ప్రధాని వరుస భేటీలు
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ కీలక సదస్సు గురువారం ఢిల్లీలో జరగనుంది. రంగాలవారీగా ఏఐ ప్రభావం, దాని సమర్థ వినియోగం, ప్రతికూల ప్రభావాల కట్టడి తదితరాలపై పలువురు దేశాధినేతలు, దిగ్గజ ఏఐ కంపెనీల సారథులు, విద్యావేత్తలు, పరిశోధకులు సదస్సు వేదికగా లోతుగా మేధోమథనం జరపనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు గ్లోబల్ సౌత్లో జరగనుండటం ఇదే తొలిసారి.
గురువారం ఉదయం ఢిల్లీలోని భారత్ మండపంలో సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అనంతరం అందులో పాల్గొంటున్న పలువురు దేశాధినేతలు, ప్రముఖులతో విడిగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. తర్వాత సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా సదస్సులో మాట్లాడతారు.
పలు ఏఐ దిగ్గజ సంస్థల సీఈఓలు, పారిశ్రామిక ప్రముఖులు తదితరులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’నినాదంతో సదస్సు జరగనుంది. ప్రధానంగా ఏడు వర్కింగ్ గ్రూప్లు ఏర్పాటు చేసి వాటిపై కూలంకషంగా చర్చించనున్నారు.
అవి ఆర్థిక ప్రగతి, సామాజిక హితానికి ఏఐ; ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ; సామాజిక సాధికారతకు చోటు; సురక్షిత, విశ్వసనీయ ఏఐ; మానవ వనరుల పెట్టుబడి; సైన్స్; పుంజుకునే సత్తా, ఇన్నొవేషన్, సామర్థ్యం. ఈ చర్చలన్నీ ‘ప్రజలు, భూమి, ప్రగతి’ప్ర«దానాంశాలుగా సాగుతాయి. పలువురు దేశాధినేతలతో పాటు 500 మందికి పైగా అంతర్జాతీయ స్థాయి ఏఐ సారథులు, 100 మందికి పైగా సీఈఓలు, 150 మంది విద్యావేత్తలు, పరిశోధకులు, 400 మంది సీటీఓలు, ఉపాధ్యక్షులు, దాతలు సదస్సులో భాగస్వాములు కానున్నారు. ఏఐ రంగంలో భారత్ను సారథ్య స్థానంలో నిలిపే లక్ష్యసాధనలో భాగంగా ఈ సదస్సును కేంద్రం నిర్వహిస్తోంది.
బిజీ బిజీగా మోదీ
సదస్సును ప్రారంభించి అనంతరం పలువురు దేశాధినేతలు, సీఈఓలు, ప్రముఖులతో కలిసి ఏఐ ఇండియా ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను మోదీ సందర్శిస్తారు. సోమవారం భారత్ మండపంలో ప్రారంభమైన ఎక్స్పోకు విశేష ఆదరణ లభిస్తుండటం తెలిసిందే. మధ్యాహ్నం నుంచి అదే వేదిక వద్ద లీడర్ల సదస్సులో ప్రధాని పాల్గొంటారు. దేశాధినేతలు, పలు దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు తదితరులు ఇందులో భాగస్వాములు కానున్నారు. పాలన, మౌలిక సదుపాయాలు, సహకారంతో పాటు పలు అంశాలకు సంబంధించి ఏఐలో జాతీయ, అంతర్జాతీయ ప్రాథమ్యాలపై వారంతా మేధోమథనం జరుపుతారు. సాయంత్రం 5:30 నుంచి జాతీయ, అంతర్జాతీయ ఏఐ దిగ్గజ కంపెనీల సారథులు, సీఈఓలతో రౌండ్టేబుల్ సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఏఐ, సంబంధిత వ్యవస్థల్లో పెట్టుబడులు, పరిశోధనలు, కొలాబరేషన్, సరఫరా వ్యవస్థలు తదితరాలపై వారితో చర్చిస్తారు.
ఎల్లుండి దాకా ఎక్స్పో
ఏఐ సదస్సుకు దేశాధినేతలు, సీఈఓలు, వీఐపీల రాక నేపథ్యంలో ఏఐ ఇండియా ఎక్స్పోను గురువారం మూసేయనున్నారు. అయితే ఎక్స్ పోకు లభిస్తు న్న విశేష ఆదరణ నేపథ్యంలో దాన్ని శనివారం దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం ఎక్స్పో శుక్రవారం ముగియాల్సి ఉంది.
అధినేతలకు మోదీ స్వాగతం
న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పలువురు దేశాధినేతలు, ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని భారత్ మండపం వద్ద స్వయంగా స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిత్సోతకిస్, ఫిన్లండ్ ప్రధాని పెటెరీ ఓప్రో, భూటాన్ ప్రధాని షెరింగ్ గోబ్గే, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్ గులాం, క్రొయేషియా ప్రధాని ఆంద్రెజ్ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వుకిక్, సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిళ్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, గయానా ఉపాధ్యక్షుడు భారత్ జగ్దేవ్ తదితరులు వీరిలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియెవా తదితరులను కూడా ప్రధాని ఆప్యాయంగా స్వాగతించారు. ఆహూతులందరికీ ఈ సందర్భంగా మేళతాళాలు, పూలు, అక్షింతలతో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం లభించింది.


