ఢిల్లీ: భారత విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుభవార్త చెప్పారు. భారతీయ విద్యార్థుల కోసం వీసా, అడ్మిషన్ ప్రక్రియను సరళీకరిస్తామని అన్నారు. అలాగే, 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను ఏడాదికి 30,000కు పెంచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
భారత్ పర్యటనలో భాగంగా బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి విద్య, శాస్త్రీయ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి, 'ఇండో-ఫ్రెంచ్ క్యాంపస్ ఆన్ ఏఐ ఇన్ గ్లోబల్ హెల్త్'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) క్యాంపస్లో మాక్రాన్ మాట్లాడుతూ..‘రానున్న రోజుల్లో మా దేశానికి ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను స్వాగతించాలనుకుంటున్నాం. అదేవిధంగా, అలాగే ఫ్రెంచ్ విద్యార్థులు కూడా భారత్కు రావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి భారత్ నుంచి ఫ్రాన్స్ వచ్చే విద్యార్థుల సంఖ్య 10వేలుగా ఉంది. ఆ సంఖ్యను 2030 నాటికి 30,000లకు పెంచాలని ప్రధాని మోదీతో చర్చించాను.
ఫ్రాన్స్ వైపు నుంచి మేము అడ్మిషన్ల ప్రక్రియను, వీసా విధానాన్ని సరళీకరిస్తాం. విద్యార్థుల అంచనాలకు అనుగుణంగా ఈ ప్రక్రియలను మరింత ఆచరణాత్మకంగా మారుస్తాం అని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఫ్రాన్స్లో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించే కోర్సులను పెంచుతామని మాక్రాన్ ప్రకటించారు. ‘మా వద్ద ఉత్తమ బోధన సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థులకు ఆంగ్లంలో కూడా విభిన్న కోర్సులు అందిస్తాం. ఉన్నత విద్యలో వారికి అవసరమైన అన్ని విధాల సహాయ, సహకారాలను అందిస్తాం’ అని హామీ ఇచ్చారు.
#WATCH | Delhi: French President Emmanuel Macron says, "...It's very important for us to welcome more Indian students and to have more French students coming here. We speak about 10,000 per year, more or less, depending on the season. We decided with Prime Minister Modi to have… https://t.co/pj8bOckFdM pic.twitter.com/RPNLq4a7co
— ANI (@ANI) February 18, 2026
ఇదే సమయంలో రక్షణ రంగంలో సాంకేతిక బదిలీపై కూడా మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జలాంతర్గాములు, రాఫెల్ యుద్ధ విమానాలు, ఐదో తరం విమానాల ఇంజన్లు ఇలా అనేక రంగాలలో ఫ్రాన్స్ భారత్తో కలిసి పని చేస్తోందని తెలిపారు. ఈ రంగంలో సాంకేతిక బదిలీని తాము కూడా విశ్వసిస్తామని చెప్పారు. అయితే, ఈ అంశాన్ని తాము కూడా ప్రతిపాదించినట్లు మాక్రాన్ చెప్పుకొచ్చారు. దీంతో పాటు అంతరిక్ష రంగం వంటి అనేక ఇతర విషయాల్లోనూ ఇరు దేశాల మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా అద్భుతంగా కొనసాగుతున్నాయని అన్నారు. అందుకే జూలైలో తాము ఫ్రాన్స్లో నిర్వహించబోయే అంతరిక్ష రంగ సదస్సుకు భారత్ను ఆహ్వానించామని ఆయన స్పష్టం చేశారు.


