నేటి నుంచే ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు | India AI Impact Expo 2026, inaugurated by PM Narendra Modi in New Delhi | Sakshi
Sakshi News home page

నేటి నుంచే ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు

Feb 16 2026 5:36 AM | Updated on Feb 16 2026 7:00 AM

India AI Impact Expo 2026, inaugurated by PM Narendra Modi in New Delhi

న్యూఢిల్లీ: విద్యుత్‌ ఆవిష్కరణ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులకు కారణమవుతున్న కృత్రిమ మేధ సాంకేతికతపై కూలంకషమైన చర్చకు దేశ రాజధానిలోని భారత్‌ మండపం సిద్ధమైంది. సోమవారం నుంచి 20వ తేదీ దాకా ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు జరగనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లుచేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాయంత్రం ఐదింటికి సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనేందుకు 45 దేశాలకు చెందిన మంత్రుల  బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు సైతం సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఐదు రోజుల్లో 700కుపైగా సెషన్స్‌ నిర్వహించనున్నారు. 20 దేశాల అధినేతలు సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు.

 మోదీ ఆహా్వనం మేరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా తదితరులు రానున్నారు. సురక్షిత కృత్రిమ మేధ, ఏఐ నిర్వహణ, నైతిక విలువలతో కూడిన ఏఐ, డేటా భద్రత, ఏఐలో భారత్‌ స్వయంసమృద్ధి, దేశీయంగా వ్యూహాత్మక రంగాలకు కొత్త ఏఐ మోడళ్ల తయారీ వంటి అంశాలపై నిపుణులు, విధాన కర్తలు చర్చించనున్నారు. 

కీలక సంస్థ సీఈఓల ప్రసంగాలు 
దక్షిణార్థ గోళంలో జరుగుతున్న తొలి ఏఐ సదస్సు కావడంతో దీనిపై అందరి దృష్టీ నెలకొంది. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్, ఓపెన్‌ఏఐ సీఈఓ శ్యామ్‌ ఆల్ట్‌మన్, డీప్‌మైండ్‌ టెక్నాలజీస్‌ సీఈఓ డెమిస్‌ హస్సాబీస్, ఆంత్రోపిక్‌ సీఈఓ డేరియో ఆమోడెయి, మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు బ్రాడ్‌ స్మిత్, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ వంటి దిగ్గజాలు సైతం సదస్సులో ప్రసంగించనున్నారు. 

సదస్సుతోపాటు ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో–2026ను కూడా నిర్వహిస్తున్నారు. ఎక్స్‌పోను సందర్శించాక ప్రధాని మోదీ దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యే అవకాశముంది.భారత్‌లోని ఏఐ అంకుర సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను సదస్సు వేదికగా ప్రకటించే ఆస్కారముంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, ఆర్థిక, విద్య, కార్పొరేట్‌ రంగాల్లో రాబోతున్న మార్పులకు ఏఐ ఏవిధంగా ఇతోధికంగా దోహదపడుతుందో వక్తలు వివరించనున్నారు. 

2025లో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో, 2024లో దక్షిణకొరియాలోని సియోల్‌లో, 2023లో బ్రిటన్‌లోని బ్లెచ్లీ పార్క్‌లో ఏఐ సదస్సులు జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద డిజటల్‌ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థల్లో భారత్‌ ఒకటి కావడంతో ఈసారి ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ‘‘ఈ రంగంలో ఎంతటి మార్పులొచ్చినా మానవీయ, సమ్మిళిత కోణంలోనే అవి జరగాలనే సందేశం  విని్పస్తున్నాం. 

ఏఐ వనరులు ప్రజాస్వామ్యయుతంగా అందరికీ అందుబాటులో ఉండాలి’’ కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ చెప్పారు. ఏఐ రంగంలో భారత్‌ తన సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఇక్కడి యువతలో ఏఐ పట్ల మక్కువ పెంచే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా మోదీ సర్కార్‌ ఈ సదస్సును నిర్వహిస్తోంది. పలు దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఏఐ రంగ సంస్థలు, పరిశోధకులు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పౌరులు ఇందులో పాల్గొననున్నారు.

 ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువకారి్మకశక్తి భారత్‌లోనే ఉంది. ఇక్కడ జనాభాలో 65 శాతం మంది వయసు 35 ఏళ్లలోపే. ఈ యువతరంలో ఏఐపై అనురక్తిని పెంచి ఏఐ బాటలు పయనించేలా చేస్తే ఈ రంగంలో భారత్‌ ఎన్నెన్నో అద్భుతాలు చేయగలదని, ఇక్కడ ఏఐ ఆధారిత పరిశ్రమలు పెరిగి, ఆవిష్కరణలు ఎక్కువై, డిజిటల్‌ సేవలు విస్తరించి, ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో పెరుగుతాయి’’ అని ఏఐరంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సదస్సులో ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ తమ కొత్త ఏఐ ఉత్పత్తులపై సదస్సు వేదికగా ప్రకటనలు చేయొచ్చని చెబుతున్నారు.

భారతీయ ఏఐపైనే దృష్టి 
ఏఐ సదస్సులో ప్రధానంగా భారతీయ ఏఐపైనే అందరి దృష్టీ నెలకొననుంది. ఫౌండేషన్‌ మోడల్‌ పిల్లర్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతో ఇప్పటికే 12 భారతీయ అంకురసంస్థలు భేటీ అయ్యాయి. ఇండియన్‌ లాంగ్వేజ్‌ ఫౌండేషన్‌ మోడల్, మల్టీ లింగ్వల్‌ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం), స్పీచ్‌–టు–టెక్ట్స్, టెక్ట్స్,్ట–టు–ఆడియో, టెక్ట్స్,–టు–వీడియో, ఇ–కామర్స్‌ కోసం జనరేటివ్‌ ఏఐతో త్రిమితీయ సమాచారం, మార్కెటింగ్, వ్యక్తిగత సమాచార సృష్టి, ఇంజనీరింగ్‌ సిములేషన్, మెటీరియల్‌ రీసెర్చ్, అధునాతన అనలైటిక్స్, ఆరోగ్యరంగంలో వ్యాధుల నిర్ధారణ, వైద్య పరిశోధన ఇలా పలు రంగాల్లో అంకుర సంస్థలు తమ కొత్త పరిశోధనలను ఇంపాక్ట్‌ ఎక్స్‌పో2026లో ప్రదర్శించే ఆస్కారముంది. 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎక్స్‌పోలో 600కుపైగా కీలక స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఇస్తోనియా, తజకిస్తాన్, ఆఫ్రికా పెవీలియన్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.  

డేటా కేంద్రంగా మార్చండి
‘‘ఇన్నాళ్లూ అప్లికేషన్లు, ప్లాట్‌ఫా మ్‌లు, డివైజ్‌ల రంగంలో అభివృద్ధి పైనే దృష్టిపెట్టాం. అంతకంటే ముఖ్యంగా మరో ప్రాథమిక రంగంలోనూ ఆధిపత్యం కనబర్చాల్సి ఉంది. అదే డేటా సెంటర్ల ఏర్పాటు. ఇకనైనా డిజిటల్‌ మౌలికవసతులు, కృత్రిమ మేధారంగంలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా మార్చుకుందాం. ఈ మేరకు ప్రపంచ సమాచార స్టోరేజీకి భారత్‌ను కేంద్రంగా మార్చండి. దీంతో సాంకేతిక విప్లవంతో మరో సంస్కరణల తరంగాలను సృష్టించండి. ఈ రంగంలో పెట్టుబడులను పెంచేందుకే తాజా బడ్జెట్‌లో పన్ను రాయితీలను ప్రకటించాం. సదుపాయాల కల్పన ఖర్చులను తగ్గించాం. తద్వారా డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారత్‌ను అంతర్జాతీయ ప్రధాన పోటీదారుగా మార్చండి’’ అని మోదీ అన్నారు.

సరైన వేదిక భారత్‌: గుటెరస్‌ 
‘‘అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్‌ విజయపథంలో దూసుకుపోతోంది. ఇలాంటి భారత్‌ ఈ సదస్సుకు సరైన వేదిక. సూపర్‌పవర్‌ లాంటి రెండు శక్తివంతమైన దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఏఐ ఫలాలు దక్కొద్దు. యావత్‌ ప్రపంచదేశాలూ ఏఐ ప్రయోజనాలను పొందాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్న భారత్‌కు అభినందనలు. ఏఐ స్వతహాగా వృద్ధిచెందితే అది అందరి ఉపయోగకరమే’’ అని  ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement