మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం
ఐదు ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్ నేత
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో రైతులకు మోదీ సర్కారు తీవ్ర ద్రోహం తలపెడుతోందని ఆదివారం ఆరోపించారు. ఈ విషయమై ప్రధాని మోదీకి ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
‘‘ఇంపోర్ట్ డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్ (డీడీజీ) అంటే ఏమిటి? అమెరికాలో మద్యం తయారీ తర్వాత మిగిలే జన్యుపరివర్తిత (జీఎం) మొక్కజొన్న వ్యర్థాలను మన పశువులకు దాణాగా వేస్తారని దాని అర్థమా? అదే జరిగితే మన పాల ఉత్పత్తులు పూర్తిగా అమెరికా వ్యవసాయ రంగంపై ఆధారపడవా? జీఎం సోయా నూనె దిగుమతులకు అనుమతిస్తే ఆ ప్రభావం మన సోయా రైతులపై పడదా? సోయా ఉత్పత్తుల ధరలు మరింతగా తగ్గితే వారు తట్టుకోగలరా? ఒప్పందంలో అదనపు ఉత్పత్తులనే ప్రస్తావన ఉంది.
మున్ముందు పప్పు ధాన్యాలు, ఇతర పంటలను కూడా దిగుమతి చేసుకోవాలని అమెరికా మనపై ఒత్తిడి పెంచుతుందని దీనర్థమా? వాణిజ్య అవరోధాలను తొలగించడమంటే ఏమిటి? జీఎం పంటలు, పంటల సేకరణను తగ్గించడం, కనీస మద్దతు ధర, బోనస్లు వంటివాటిని తగ్గించడమా? అమెరికా వ్యవసాయోత్పత్తులకు ఒక్కసారిగా తలుపులు తెరిస్తే, ఏటికేడు మరింతగా ఒత్తిడులు పెరుగుతాయి. వాటిని అడ్డుకుంటామా, లేక లొంగిపోతామా? మన సాగు రంగంపై విదేశీ పెత్తనానికి అనుమతిస్తున్నామా?’’ అని రాహుల్ ప్రశ్నించారు.


