వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలను చంపేసింది | Mother Who Gave Rat Poison To Children In Punjab | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలను చంపేసింది

Feb 14 2026 9:15 PM | Updated on Feb 14 2026 9:15 PM

Mother Who Gave Rat Poison To Children In Punjab

బటిండా: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డల్ని చంపేసింది ఓ కర్కశ తల్లి. ఈ ఘటన పంజాబ్‌లోని  బటిండాలో జరిగింది. జస్సీ కౌర్ అనే మహిళకు సుఖ్‌ప్రీత్ కౌర్ (8) కూతురు, ఫతేవీర్ (6) కుమారుడు ఉన్నారు. జస్సీ కౌర్‌కు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కారణంగా.. పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించింది. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ చేసింది.

అక్రమ సంబంధం మత్తులో ఉన్న జస్సీ కౌర్ తన పిల్లలను హత్య చేయడానికి కుట్ర పన్నింది. రెండు వారాల క్రితం కుమార్తె సుఖ్‌ప్రీత్ కౌర్‌కు ఆహారంలో ఎలుకల మందు కలిపి తినిపించింది. దీంతో ఆ చిన్నారి.. తన తల్లి ఇచ్చిన ఆహారం తిని మృతిచెందింది. ఆ పాప అనారోగ్యం కారణంగానే చనిపోయిందని, చుట్టుపక్కల వారిని, బంధువుల్ని నమ్మించింది. ఆ తర్వాత రెండు వారాల తర్వాత ఆరేళ్ల కొడుకు ఫతేవీర్‌ కౌర్‌కు కూడా ఎలుకల మందు కలిపిన ఆహారం పెట్టింది.

శనివారం ఆ బాలుడు కూడా మరణించాడు. ఈ విషాదకర ఘటన రెండు వారాల వ్యవధిలో జరిగింది. 15 రోజుల క్రితం ఎనిమిదేళ్ల బాలిక సుఖ్‌ప్రీత్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మరణించగా, శుక్రవారం రాత్రి ఆమె ఆరేళ్ల తమ్ముడు ఫతేవీర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వరుస మరణాలతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఫూల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. కన్నతల్లే హత్య చేసినట్లు తేల్చారు. నిందితురాలు జస్సీ కౌర్ తన నేరాన్ని అంగీకరించిందని పోలీస్ అధికారి మనోజ్ కుమార్ తెలిపారు.

"మొదట 8 ఏళ్ల సుఖ్‌ప్రీత్ కౌర్ మరణించింది. నిన్న 6 ఏళ్ల ఫతేవీర్ చనిపోయాడు. ఒక పథకం ప్రకారం జస్సీ కౌర్ తన పిల్లలిద్దరినీ చంపేసింది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి చంపినట్లు ఆమె ఒప్పుకుందని పోలీస్ అధికారి మనోజ్‌ కుమార్ పేర్కొన్నారు. జస్సీ కౌర్‌కు సహకరించిన ఆమె సోదరి మోటో కౌర్‌తో పాటు, లాఖీ సింగ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement