ఢిల్లీ: ఫోమో, గోట్, వైబ్, బెట్..ఇవి జెన్జీలు తరచుగా వినియోగించే పదాలు. కానీ వాటికి బదులుగా ‘మై లార్డ్, విత్ డ్యూ రస్పెక్ట్, లెర్న్డ్ కౌన్సిల్, జ్యూరిస్డిక్షన్’ అనే పదాలతో ఓ 19 ఏళ్ల యువకుడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో తన కేసును తానే వాదించాడు. ‘Need ten minutes’ అంటూ కేసులో విజయం సాధించాడు. న్యాయశాస్త్రంలో అనుభవజ్ఞులైన న్యాయవాదులు సైతం కొన్నిసార్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయడానికి వెనుకాడుతారు. అలాంటి పిటిషన్ను తానే స్వయంగా దాఖలు చేసి, తన వాదనలతో న్యాయమూర్తులను ఒప్పించాడు.
సుప్రీంకోర్టు హాలు న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్లు, అసోసియేట్ లాయర్లు, జూనియర్ లాయర్లు, వాదులు, ప్రతివాదులతో కిక్కిరిసిపోతున్న సమయంలో, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఎదుట టెన్ మినిట్స్ మోర్ అనే గొంతు వినిపించింది. ఆ గొంతు నిష్ణాతులైన న్యాయమూర్తి గొంతు అని అనుకుంటే పొరబడినట్లే.. 12వ తరగతి పూర్తి చేసి డాక్టర్ కావాలని కలలు కంటున్న 19 ఏళ్ల అథర్వ్ చతుర్వేది గొంతు. సరిగ్గా పది నిమిషాల తర్వాత అతనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 కింద తన ప్రత్యేక అధికారాలను వినియోగించి, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అథర్వ్తో పాటు అర్హులైన Economically Weaker Section (EWS) అభ్యర్థులకు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ జబల్పూర్కి చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ్, నీట్ పరీక్షలో ఒకసారి కాదు రెండు సార్లు ఉత్తీర్ణత సాధించాడు. 530 మార్కులు సాధించినప్పటికీ ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందలేకపోయాడు. కారణం ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం. అదే సమయంలో ఇతర కోటాలో అర్హులైన అభ్యర్థులు అడ్మిషన్ పొందినట్లు అతను గమనించాడు.

ఈ నేపథ్యంలో, జనవరి 6న సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఎస్ఎల్పీ దాఖలు చేశాడు. విచారణలో కోర్టు, విధానపరమైన లోపాల కారణంగా అథర్వ్ లాంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని గుర్తించింది. వాదన సమయంలో తగిన సమయం లేదని భావించిన అథర్వ్ పది నిమిషాలు అదనంగా కావాలి’ అని చీఫ్ జస్టిస్ను కోరాడు. ఆ పది నిమిషాల తర్వాతే అతనికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో 2025-26 సెషన్లో అతనికి ఎంబీబీఎస్ సీటు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తన కేసును తానే వాదించి విజయం సాధించిన అథర్వ్, ఇప్పుడు వైద్య విద్యను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు.
ఇదే అంశంపై జబల్పూర్ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనలు వినిపించాడు. అథర్వ్ వాదనలతో ముగ్ధులైన జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తి సైతం అతనిపై ప్రశంసలు కురిపించారు. నువ్వు డాక్టర్ కాదు, న్యాయవాదిగా రాణించాలి. నువ్వు ఎంచుకున్న రంగం తప్పేమో అంటూ ప్రోత్సహించారు’ అని పలు జాతీయా మీడియా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.


